-
సహకరించండి ప్లీజ్..
– రాజకీయ పార్టీలకు, అభ్యర్థులకు కలెక్టర్ విజ్ఞప్తి కాకినాడ సిటీ: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పటిష్ట ఏర్పాట్లు చేపట్టామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, వారి ఏజెంట్లు సహకరించాలని కోరారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థులతో కలెక్టరేట్ కోర్టు హాలులో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే నెల 4న కాకినాడ జేఎన్టీయూలో జరిగే కౌంటింగ్ సందర్భంగా అభ్యర్థులు, ఏజెంట్లు పాటించాల్సిన మార్గదర్శకాలను వివరించారు. ఓట్ల లెక్కింపునకు సంబంధించి కౌంటింగ్ సూపర్వైజర్లకు, కౌంటింగ్ అసిస్టెంట్లకు, సూక్ష్మ పరిశీలకులకు శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. అభ్యర్థులు తమ కౌంటింగ్ ఏజెంట్ల వివరాలు, ఫొటోలను ఈ నెల 31లోగా అందజేయాలన్నారు. కౌంటింగ్ ఆ రోజు ఉదయం 8 గంటలకు చేపడతామన్నారు. ప్రతి కౌంటింగ్ కేంద్రంలో అసెంబ్లీ నియోజకవర్గానికి 14, పార్లమెంటు నియోజకవర్గానికి 14 చొప్పున, పోస్టల్ బ్యాలెట్ లెక్కింపునకు ప్రత్యేక టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ప్రతి రౌండ్ పూర్తి కాగానే ఫలితాలు వెల్లడిస్తామన్నారు. అభ్యర్థులు, ఏజెంట్లు, లెక్కింపు సిబ్బంది కౌంటింగ్ కేంద్రాలకు సకాలంలో చేరుకునేందుకు వీలుగా కాకినాడ నగరంలో ట్రాఫిక్ను నియంత్రిస్తున్నామని తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద చుట్టూ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామమని కలెక్టర్ నివాస్ చెప్పారు. ఈ సమావేశంలో డీఆర్ఓ డి.తిప్పేనాయక్ తదితరులు పాల్గొన్నారు. -
బుల్లెబ్బాయిరెడ్డి మృతికి పలువురి సంతాపం
కొత్తపల్లి: సంపర మాజీ ఎమ్మెల్యే అనిశెట్టి బుల్లెబ్బాయిరెడ్డి (72) మృతికి పలువురు సంతాపం తెలిపారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న బుల్లబ్బాయిరెడ్డి యు.కొత్తపల్లి మండలం నాగులాపల్లిలోని తన నివాసంలో మంగళవారం మృతి చెందారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని సంపర నియోజకవర్గం నుంచి ఆయన రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. ఆర్టీసీ చైర్మన్గా పలు గ్రామాలకు ఆర్టీసీ సేవలను అందించారు. కొత్తపల్లిలో వీవీఎస్ విద్యా సంస్థలు స్థాపించారు. బుల్లెబ్బాయిరెడ్డి భౌతిక కాయాన్ని వైఎస్సార్ సీపీ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత సందర్శించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపి, ఓదార్చారు. పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు పంపన రామకృష్ణ, వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు వర్ధినీడి సుజాత, పార్టీ మండల అధ్యక్షుడు ఆనాల సుదర్శన్, పలువురు నాయకులు, వ్యాపారులు బుల్లెబ్బాయిరెడ్డి భౌతిక కాయాన్ని సందర్శించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతం బాలాజీచెరువు (కాకినాడ సిటీ): పదో తరగతి, ఇంటర్మీయెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మూడో రోజైన మంగళవారం జిల్లాలో ప్రశాంతంగా జరిగాయి. పదో తరగతి గణితం పరీక్షకు 2,462 మంది హాజరవగా 1,655 మంది గైర్హాజరయ్యారు. ఇంటర్మీయెట్ మ్యాథ్స్, జువాలజీ, హిస్టరీ పరీక్షలకు 10,276 హాజరు కాగా 406 మంది రాయలేదు. మధ్యాహ్నం నిర్వహించిన సెకండియర్ పరీక్షలకు 2,108 మంది హాజరవగా 112 మంది గైర్హాజరయ్యారని జిల్లా ఇంటర్మీడియెట్ అధికారి జీజీకే నూకరాజు తెలిపారు. -
ఓట్ల లెక్కింపుపై సంపూర్ణ అవగాహన
కాకినాడ సిటీ: ఓట్ల లెక్కింపు సజావుగా జరిగేందుకు అధికారులు ప్రతి అంశంపై సంపూర్ణ అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జె.నివాస్ ఆదేశించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియపై రిటర్నింగ్ అధికారులు (ఆర్ఓ), సహాయ రిటర్నింగ్ అధికారులు (ఏఆర్ఓ), ఇతర ఎన్నికల అధికారులకు కలెక్టరేట్లో మంగళవారం శిక్షణ నిర్వహించారు. కౌంటింగ్కు సంబంధించిన వివిధ అంశాలపై కలెక్టర్ నివాస్, జాయింట్ కలెక్టర్, పిఠాపురం ఆర్ఓ ఎస్.రామ్సుందర్రెడ్డి అవగాహన కల్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ, కాకినాడ జేఎన్టీయూలో వచ్చే నెల 4న జరిగే ఓట్ల లెక్కింపు సమర్థంగా నిర్వహించాలన్నారు. ఎటువంటి సందేహం వచ్చినా వెంటనే ఉన్నతాధికారులను సంప్రదించాలని సూచించారు. ఓట్ల లెక్కింపునకు 14 టేబుళ్లు ఏర్పాటు చేస్తామన్నారు. కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లను సమన్వయం చేసుకుంటూ ఆర్ఓలు, ఏఆర్ఓలు పని చేయాలని చెప్పారు. తొలుత ఉదయం 8 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. పార్లమెంట్ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రత్యేకంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ నెల 31వ తేదీ నాటికి కౌంటింగ్ ఏజెంట్ల వివరాలు అందిన వారికి గుర్తింపు కార్డులు జారీ చేయాలని ఆదేశించారు. రౌండ్ల వారీగా ఫలితాలను ఖరారు చేయడంలో ఆర్ఓలు అప్రమత్తంగా ఉండాలని, ఏజెంట్ల సంతకాలు తీసుకోవాలని సూచించారు. మాక్ పోల్ డేటా వివరాలు సరి చూసుకోవాలన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో తరచుగా ఎదురయ్యే వివిధ సమస్యలను ఏవిధంగా పరిష్కరించాలో జేసీ రామ్సుందర్రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి డి.తిప్పేనాయక్ తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ నివాస్ ఆదేశం ఫ ఆర్ఓ, ఏఆర్ఓలకు శిక్షణ -
కౌంటింగ్కు కౌంట్ డౌన్
కాకినాడ సిటీ: ఓట్ల లెక్కింపునకు కౌంట్ డౌన్ మొదలైంది. మరో వారం రోజులు మాత్రమే గడువు ఉండటంతో సంబంధిత ఏర్పాట్లలో అధికారులు తలమునకలవుతున్నారు. ఈ ప్రక్రియలో పాల్గొనే సిబ్బందిని సిద్ధం చేసుకొనే పనిలో ఉన్నారు. వచ్చే నెల 4వ తేదీ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. కాకినాడ లోక్సభతో పాటు జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు కాకినాడ జేఎన్టీయూలో ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ హాళ్లను అధికారులు ఇప్పటికే పరిశీలించారు. సిబ్బంది నియామకం ఇలా.. ఓట్ల లెక్కింపునకు వివిధ హోదాల్లో ఉన్న 997 మంది సిబ్బందిని నియమించారు. ప్రతి టేబుల్ వద్ద సూక్ష్మ పరిశీలకులు, కౌంటింగ్ సూపర్వైజర్లు, ఇద్దరు సహాయకులను నియమిస్తారు. నాలుగో తరగతి ఉద్యోగులు, బ్లాక్ బోర్డు వద్ద వివరాలను నమోదు చేయడానికి.. ఇలా ప్రతిచోటా వివిధ కేడర్లలో సిబ్బందిని నియమించారు. వీరు కాకుండా పోలీసు సిబ్బంది కూడా కౌంటింగ్ భద్రతా విధుల్లో ఉంటారు. దీనికోసం 110 పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. సిబ్బంది ర్యాండమైజేషన్ రెండు విడతలుగా చేపట్టారు. ఇప్పటికే ఒక విడత పూర్తి చేశారు. మరో విడత ర్యాండమైజేషన్ త్వరలో చేపట్టనున్నారు. కౌంటింగ్ విధులకు కేటాయించిన సిబ్బంది వివరాలను కలెక్టరేట్ నుంచి ఇప్పటికే పంపించారు. కౌంటింగ్కు కొద్ది గంటల ముందే వారు ఎక్కడ విధులు నిర్వహించాలనేది తెలుస్తుందని అధికారులు చెబుతున్నారు. ఓట్ల లెక్కింపు విధుల్లో పాల్గొనే సిబ్బందికి రెండు విడతలుగా శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే ఒక విడత పూర్తి కాగా, వచ్చే నెల 3న మలి విడత శిక్షణ ఇస్తారని అంటున్నారు. భారీగా బందోబస్తు ఫ కౌంటింగ్ సందర్భంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గట్టి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. ఫ స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ ప్రక్రియకు మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. సాధారణ తనిఖీల్లో భాగంగా స్ట్రాంగ్ రూములను, కౌంటింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జె.నివాస్, ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ నిత్యం తనిఖీ చేస్తున్నారు. ఫ ఎస్పీ ప్రతి రోజూ రెండు పోలీస్ స్టేషన్లను తనిఖీ చేస్తున్నారు. ఎన్నికలకు ముందు, అనంతరం జిల్లాలో పరిస్థితులపై పోలీసు అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. సమస్యాత్మక గ్రామాలపై దృష్టి సారించాలని ఆదేశించారు. ఫ ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల సమీపాన ఎక్కడా వాహనాలు నిలపడానికి అనుమతి లేదు. ఫ కౌంటింగ్ సందర్భంగా కాకినాడ నగరంలో కూడా జిల్లాలోని వివిధ సబ్ డివిజన్లకు చెందిన పోలీసు అధికారులు, సిబ్బందితో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసేందుకు ఎస్పీ సతీష్ కుమార్ సన్నాహాలు చేస్తున్నారు. ఫ హోటళ్లు, లాడ్జీలు అధికంగా ఉండే ప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేయనున్నారు. ఫ నగరంలోకి వచ్చే వాహనాలను నియంత్రిస్తారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటారు. ఫ పోలీసు వాహనాలతో పాటు నిరంతర గస్తీ ఏర్పాటు చేస్తారు. ఫ ఊరేగింపులకు, విజయోత్సవాలకు అనుమతి లేదు. ఫ ఓట్ల లెక్కింపునకు సన్నాహాలు ఫ కౌంటింగ్ కేంద్రాల్లో విస్తృత ఏర్పాట్లు ఫ 997 మంది సిబ్బంది నియామకం ఫ పటిష్టంగా భద్రతా చర్యలు రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా పాత నేరస్తులు, రౌడీ షీటర్లపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. పోలీస్ స్టేషన్ల వద్ద ముందస్తుగా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. వారిలో ఎవరైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే పీడీ యాక్ట్ కింద చర్యలు తీసుకోవడంతో పాటు జిల్లా నుంచి బహిష్కరిస్తామని ఎస్పీ సతీష్ కుమార్ ఇప్పటికే హెచ్చరించారు. 2014, 2019 సార్వత్రిక ఎన్నికలు, 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో నేరాలకు, తగాదాలకు పాల్పడిన వారిపై నిఘా ఉంచారు. అభ్యర్థుల గెలుపు, ఓటములపై బెట్టింగ్లు నిర్వహించేవారు, పాల్గొనే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. 14 నుంచి 19 టేబుళ్ల ఏర్పాటు ఫ ఓట్ల లెక్కింపునకు అభ్యర్థుల సంఖ్య, పోలింగ్ కేంద్రాలు, పోలైన ఓట్లు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని 14 నుంచి 19 టేబుళ్లు ఏర్పాటు చేయనున్నారు. రిటర్నింగ్ అధికారికి ఒక టేబుల్ ఉంటుంది. ఫ లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలైన పోస్టల్ బ్యాలెట్, సర్వీసు ఓట్లు, ఈవీఎం ఓట్ల లెక్కింపు ఒకేసారి ప్రారంభిస్తారు. ఈవీఎం ఓట్ల లెక్కింపునకు వేరుగా, పోస్టల్ బ్యాలెట్, సర్వీసు ఓట్ల లెక్కింపునకు వేరుగా టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే మాక్ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు నిర్వహించారు. ఫ కౌంటింగ్ సందర్భంగా ర్యాండమ్గా కొన్ని వీవీ ప్యాట్లలోని స్లిప్పులు తీసి లెక్కిస్తారు. వాటిని ఈవీఎంలో పోలయిన ఓట్లతో సరి చూస్తారు. ఈ రెండింటి లెక్క సరిపోవాలి. అప్పుడే ఫలితాన్ని అధికారికంగా ప్రకటిస్తారు. ఏవైనా ఇబ్బందులు ఎదురైతే మరింత సమయం పట్టే అవకాశం ఉంది. దీనివలన కొన్ని నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు కొంత ఆలస్యం కావచ్చని అధికారులు అంటున్నారు. ఫ ఎప్పటికప్పుడు ఫలితాలను ప్రజలకు తెలియజేయడానికి అన్ని ఏర్పాట్లూ చేశారు. మధ్యాహ్నం ఒంటి గంటకు అభ్యర్థులు, పార్టీల ట్రెండ్ తేలిపోతుందని చెబుతున్నారు. ఫ ఓట్ల లెక్కింపు ప్రక్రియను మొత్తం వీడియో తీయిస్తారు. ఎక్కడా పొరపాట్లు జరగకుండా అన్ని రకాల జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. -
రీసెర్చ్ గ్రాంట్లకు అధ్యాపకులను ప్రోత్సహించాలి
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): యూనివర్సిటీలకు రీసెర్చ్ గ్రాంట్లు ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిదని, దీనిని దృష్టిలో ఉంచుకుని రీసెర్చ్ గ్రాంట్లకు దరఖాస్తు చేసేలా అధ్యాపకులను ప్రోత్సహించాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ కె.రామ్మోహనరావు అన్నారు. ఉప కులపతి (వీసీ) డాక్టర్ జీవీఆర్ ప్రసాదరాజు అమెరికా పర్యటనలో ఉన్న నేపథ్యంలో ఇన్చార్జ్ వీసీగా రామ్మోహనరావు వర్సిటీ డైరక్టర్లతో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఉన్నత విద్యామండలి సహకారంతో ప్రతి యూనివర్సిటీ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం నిర్వహించాలని సూచించారు. ఈ విద్యా సంవత్సరం 6 వేల మందికి శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. ఎడెక్స్ సంస్థ, ఉన్నత విద్యా మండలి సంయుక్తంగా కొత్త సాంకేతికతలు, బోధన పద్ధతులు అభివృద్ధి చేశాయని తెలిపారు. ఎడెక్స్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఏడాది కాలంలో 5 లక్షల సర్టిఫికెట్లు జారీ చేయగా, రాష్ట్రంలో ఒక నెలలోనే ప్రపంచంలోని అగ్రశేణి వర్సిటీల ద్వారా 2 లక్షల సర్టిఫికెట్లు పొందడం గర్వకారణమని అన్నారు. అనంతరం వర్సిటీలోని ఏపీ ఈఏపీ సెట్ కార్యాలయాన్ని ప్రొఫెసర్ రామ్మోహనరావు సందర్శించి, పరీక్షలు సజావుగా నిర్వహించిన కన్వీనర్ వెంకటరెడ్డిని అభినందించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ సుమలత, ఓఎస్డీ కోటేశ్వరరావు, డైరెక్టర్లు సాయిబాబు, రవీంద్ర, మురళీకృష్ణ, శ్రీనివాసులు పాల్గొన్నారు. -
కౌంటింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్
కాకినాడ సిటీ: వచ్చే నెల 4న జరిగే సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సంబంధించి సిబ్బంది తొలి దశ ర్యాండమైజేషన్ ప్రక్రియను కలెక్టరేట్ ఎన్ఐసీలో కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె.నివాస్ సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓట్ల లెక్కింపునకు అవసరమైన సూపర్వైజర్లు, అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లకు సంబంధించి తొలి దశ ర్యాండమైజేషన్ నిర్వహించామని వివరించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో సుమారు 997 మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారని తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్, పిఠాపురం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ) ఎస్.రామ్సుందర్రెడ్డి, వివిధ నియోజకవర్గాల ఆర్ఓలు పాల్గొన్నారు. అనంతరం, కౌంటింగ్ ఏర్పాట్లపై ఢిల్లీ నుంచి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్కుమార్, కమిషనర్లు జ్ఞానేశ్కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టరేట్ నుంచి కలెక్టర్ నివాస్, జేసీ రామ్సుందర్రెడ్డి, ఇతర నియోజకవర్గాల ఆర్ఓలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ హెచ్ఎస్ భావన, డీఆర్ఓ డి.తిప్పేనాయక్, తుని, ప్రత్తిపాడు, కాకినాడ రూరల్, పెద్దాపురం, కాకినాడ సిటీ, జగ్గంపేట ఆర్ఓలు కేవీ రామలక్ష్మి, ఎ.శ్రీనివాసరావు, ఇట్ల కిషోర్, జె.సీతారామరావు, జె.వెంకటరావు, ఎం.శ్రీనివాసరావు, సీపీఓ పి.త్రినాథ్, జిల్లా ఉపాధి శిక్షణ అధికారి జి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
ఆశాజనకంగా..
● వర్జీనియా పొగాకు కిలో సగటు ధర రూ.295 ● గరిష్ట ధర రూ.332 ● 20.15 మిలియన్ల కిలోల విక్రయందేవరపల్లి: వర్జీనియా పొగాకు మార్కెట్ రైతులకు సంతృప్తినిస్తోంది. మార్కెట్లో ధరలు ఆశాజనకంగా ఉండడంతో కొనుగోళ్లు వేగం పుంజుకున్నాయి. మార్చి, ఏప్రిల్ నెలల్లో దాదాపు 40 రోజుల పాటు కొనుగోళ్లు మందకొడిగా జరిగినప్పటికీ మే నెలలో ఊపందుకున్నాయి. మార్కెట్లో మంచి ధర పలకడంతో రైతులు వేలం కేంద్రాలకు తీసుకువచ్చే పొగాకు బేళ్ల సంఖ్యను పెంచారు. ప్రస్తుతం వేలం కేంద్రాల్లో మీడియం, బ్రైట్ గ్రేడ్ పొగాకు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. లో గ్రేడ్ పొగాకు కొనుగోళ్లు మందగించాయి. దాదాపు నెల రోజుల నుంచి ట్రేడర్లు లో గ్రేడ్ పొగాకు కొనుగోలు చేయడం లేదు. దీంతో రైతులు బ్రైట్, మీడియం గ్రేడ్ పొగాకును వేలం కేంద్రాలకు తీసుకువచ్చి గిట్టుబాటు ధరకు అమ్ముకుంటున్నారు. కిలో గరిష్ట ధరతో పాటు సగటు ధర రైతులకు సంతృప్తికరంగా ఉంది. కిలో గరిష్ట ధర రూ.332, సగటు ధర రూ.295 చొప్పున లభిస్తున్నాయి. కొనుగోలు సంస్థలు కూడా మార్కెట్లో దూకుడు పెంచడంతో ధర ఆశాజనకంగా ఉందని అధికారులు అంటున్నారు. పొగాకు కొనుగోలుకు 30 సంస్థలు ఉండగా సుమారు 20 సంస్థలు వేలంలో పాల్గొంటున్నాయి. అంతర్జాతీయంగా వర్జీనియా పొగాకుకు డిమాండ్ ఏర్పడడం, ఎగుమతి ఆర్డర్లు రావడంతో మార్కెట్ ఆశాజనకంగా ఉందని అధికారులు చెబుతున్నారు. భవిష్యత్తులో ఈ ధర మరింత పెరుగుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కిలో రూ.350 వరకూ అమ్ముడుపోయే అవకాశాలున్నాయని అంటున్నారు. రెండు రోజులుగా వేలం కేంద్రాల్లో లో గ్రేడ్ పొగాకు కూడా కొనుగోలు చేస్తున్నారని రైతులు తెలిపారు. లో గ్రేడ్ పొగాకు కొనుగోళ్లు మరింతగా పెంచాలని కోరుతున్నారు. పొగాకు బోర్డ్ రాజమహేంద్రవరం రీజినల్ కార్యాలయం పరిధిలోని ఐదు వేలం కేంద్రాల్లో సోమవారం నాటికి 20.15 మిలియన్ల కిలోల పొగాకు విక్రయాలు జరిగాయి. బోర్డు అధికారుల అంచనా మేరకు మరో 45 మిలియన్ల కిలోల పొగాకు కొనుగోలు జరగాల్సి ఉంది. ఇప్పటి వరకూ 1,65,137 బేళ్లు కొనుగోలు చేశారు. పెరిగిన కౌలు, బ్యారన్ అద్దె పొగాకు ధరలు ఆశాజనకంగా ఉండటంతో 2024–25 పంట కాలానికి రైతులు ఇప్పటి నుంచే భూములు, బ్యారన్లను కౌలుకు, లీజుకు తీసుకుంటున్నారు. దీంతో వీటి ధరలకు రెక్కలొచ్చాయి. గత ఏడాది ఎకరం భూమి కౌలు రూ.40 వేల నుంచి రూ.42 వేలు ఉండగా, వచ్చే ఏడాదికి రూ.60 వేల నుంచి రూ.72 వేల వరకూ పలుకుతోంది. బ్యారన్ లీజు గత ఏడాది రూ.80 వేలు ఉండగా రూ.లక్ష నుంచి రూ.1.80 లక్షలు పలుకుతుందని రైతు లు అంటున్నారు. అయినప్పటికీ రైతులు పోటీపడి మరీ భూములను కౌలుకు, బ్యారన్లను లీజుకు తీసుకుంటున్నారు. దీంతో బ్యారన్ ఖరీదు రూ.7 లక్షల నుంచి రూ.8 లక్షల వరకూ పలుకుతోంది. రెండేళ్ల క్రితం ఇది రూ.2.50 లక్షలు మాత్రమే.వేలం కేంద్రాల వారీగా విక్రయాలు, సగటు, గరిష్ట ధర వేలం కేంద్రం గరిష్ట ధర సగటు ధర విక్రయాలు (కిలో రూ.) (కిలో రూ.) (కిలోల్లో..) దేవరపల్లి 332 305.00 31,22,557 గోపాలపురం 332 300.35 40,49,132 జంగారెడ్డిగూడెం–1 331 290.48 44,73,551 జంగారెడ్డిగూడెం–2 331 293.86 44,42,571 కొయ్యలగూడెం 331 292.97 40,68,559 -
ఎక్కడి బోట్లు అక్కడే..
● జిల్లాలో పక్కాగా వేట నిషేధం ● తీరిక చిక్కడంతో వలలు, బోట్లకు మత్స్యకారుల మరమ్మతులు ● మత్స్యకార భరోసాకు 24,147 మంది మత్స్యకారుల గుర్తింపు ● 15 నుంచి సముద్రంలో చేపల వేటకు అనుమతి కాకినాడ రూరల్: వలలు సిద్ధం చేసుకుని.. అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటి నుంచి బయలుదేరి సాగర తీరానికి చేరుకోవడం.. ఉవ్వెత్తున ఎగసిపడే కెరటాలను చీల్చుకుంటూ.. బోట్లపై నడి సంద్రంలోకి వేటకు బయలుదేరడం.. ఇదంతా కడలి పుత్రుల జీవితాల్లో నిత్యకృత్యం. కానీ, కొద్ది రోజులుగా జిల్లాలోని తీర ప్రాంతంలో సముద్ర అలల హోరు మినహా.. మత్స్యకారుల సందడి కనిపించడం లేదు. సముద్రంలో చేపల వేటపై ప్రభుత్వం నిషేధం అమలు చేస్తూండటంతో గంగపుత్రులు ఇళ్లకే పరిమితమయ్యారు. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. తమకు జీవనోపాధిని అందించే బోట్లకు మరమ్మతులు చేసుకుంటున్నారు. వలలు అల్లుకుంటూ మరో రెండు వారాల అనంతరం పునఃప్రారంభమయ్యే వేటకు సిద్ధమవుతున్నారు. బంగాళాఖాతంలో చేపల వేటపై నిషేధం ఏప్రిల్ 14వ తేదీ అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. మొత్తం 61 రోజుల పాటు విధించిన ఈ నిషేధం వచ్చే నెల 14వ తేదీ అర్ధరాత్రితో ముగియనుంది. ఆ మరుసటి రోజు నుంచి సముద్రంలో చేపల వేటకు అనుమతి ఇవ్వనున్నారు. వేట నిషేధం ఎందుకంటే.. చేపల పునరుత్పత్తి కోసం కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో సముద్రంలో ఏటా రెండు నెలల పాటు వేట నిషేధాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. మత్స్యశాఖ అధికారులు పర్యవేక్షణలో పోలీసుల సహకారంతో జిల్లాలో పక్కాగా వేట నిషేధం అమలు చేస్తున్నారు. జిల్లాలోని తొండంగి నుంచి తాళ్లరేవు వరకూ సుమారు 94 కిలోమీటర్ల మేర సముద్ర తీరం విస్తరించి ఉంది. ఈ తీరంలో మొత్తం 58 మత్స్యకార ఆవాసాలున్నాయి. వీటిల్లో 1,95,184 మంది మత్స్యకారులు నివసిస్తున్నారు. వీరిలో సముద్రంలో చేపల వేట ద్వారా 36,101 మంది ఉపాధి పొందుతున్నారు. వీరి కోసం మొత్తం 23 చోట్ల ఫిష్ ల్యాండింగ్ సదుపాయాలు ఉండగా కాకినాడలో కమ్యూనికేషన్ స్టేషన్ అందుబాటులో ఉంది. ఈ మత్స్యకారులు 410 మెకనైజ్డ్, 3,732 మోటారైజ్డ్ బోట్లతో పాటు 287 సంప్రదాయ పడవల ద్వారా సముద్రంలో చేపల వేట సాగిస్తున్నారు. జిల్లాలో చేపల వేటకు ప్రధానంగా కాకినాడ కుంభాభిషేకం, కాకినాడ షిషింగ్ హార్బర్, ఉప్పాడ రేవులు ప్రసిద్ధి చెందాయి. వేట నిషేధం అమలుతో కొద్ది రోజులుగా ఎక్కడి బోట్లు అక్కడే నిలిచిపోయాయి. ఆదుకుంటున్న ప్రభుత్వం చేపల వేటే జీవనాధారంగా గడుపుతున్న గంగపుత్రులను వేట నిషేధ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటోంది. వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం ద్వారా ఒక్కో మత్స్యకార కుటుంబానికి రూ.10 వేల చొప్పున వేట నిషేధ భృతి అందిస్తోంది. లబ్ధిదారులైన మత్స్యకారుల బ్యాంకు ఖాతాల్లో నాలుగేళ్లుగా ఈ భృతిని నేరుగా జమ చేస్తోంది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ఈ భృతి అందించేందుకు ఆటంకం ఏర్పడింది. వచ్చే నెలలో కోడ్ ముగిసిన అనంతరం మత్స్యకారులకు వేట నిషేధ భృతి అందజేయనున్నారు. దీనికి అర్హులైన వారి గుర్తింపును మత్స్యశాఖ అధికారులు ఏప్రిల్ నెలలోనే పూర్తి చేశారు. జిల్లాలో 4,645 బోట్లకు గాను 24,147 మంది లబ్ధిదారులను మత్స్యకార భరోసా పథకం కింద ఎంపిక చేశారు.ఇంటి వద్దనే కాలక్షేపం సముద్రంలో చేపల వేట నిషేధంతో ఇంటి వద్దనే కాలక్షేపం చేస్తున్నాం. వలలు అల్లుకోవడంతో పాటు బోట్లకు చిన్నచిన్న మరమ్మతులు చేసుకుంటున్నాం. వేట నిషేధ సమయంలో భృతి అందజేసి మత్స్యకారులను ప్రభుత్వం ఆదుకుంటోంది. – పేర్ల సత్యం, మత్స్యకారుడు, సూర్యారావుపేట, కాకినాడ రూరల్ లబ్ధిదారుల గుర్తింపు సముద్రంలో చేపల వేట నిషేధానికి మత్స్యకారులు సహకరిస్తున్నారు. రెండు నెలల పాటు జీవనోపాధి లేకుండా ఇంటికే పరిమితమవుతున్న వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం మత్స్యకార భరోసా పథకం కింద ఏటా ఒక్కో కుటుంబానికి రూ.10 వేల చొప్పున అందిస్తోంది. వేట నిషేధ భృతి అందించేందుకు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేశాం. – కొమ్ము కరుణాకరరావు, జిల్లా మత్స్యశాఖ అధికారి, కాకినాడ -
మాజీ ఎమ్మెల్యే అనిశెట్టి బుల్లబ్బాయి రెడ్డి కన్నుమూత
కాకినాడ, సాక్షి: జిల్లా రాజకీయాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. సంపర(పూర్వపు తూర్పుగోదావరి) మాజీ ఎమ్మెల్యే అనిశెట్టి బుల్లబ్బాయి రెడ్డి ఇక లేరు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ ఉదయం కన్నుమూశారు. కాంగ్రెస్ తరఫున రెండు సార్లు సంపర ఎమ్మెల్యే గా గెలిచారాయన. బుల్లబ్బాయి మృతికి పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.కొత్తపల్లి మండలం నాగులపల్లిలో జన్మించిన అనిశెట్టి బుల్లబ్బాయి రెడ్డి.. తొలుత వ్యాపార రంగం, అక్కడి నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. విద్యాసంస్థల ద్వారా కూడా ఆయన గుర్తింపు పొందారు. ఎమ్మెల్యేగానే కాకుండా ఏపీఎస్సార్టీసీకి రీజనల్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్గానూ అనిశెట్టి పని చేశారు. ఆయనకు భార్య రత్నం, ఒక కొడుకు ఉన్నారు. -
ఉప్పాడలో ‘అల’జడి
కొత్తపల్లి : రెమాల్ తుపాను తీరం దాటినప్పటికీ దాని ప్రభావంతో కాకినాడ జిల్లా ఉప్పాడ వద్ద కడలి కల్లోలంగా మారింది. అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. తీరం కోతకు గురవుతోంది.కెరటాల తాకిడికి యు.కొత్తపల్లి మండలంలోని ఉప్పాడ, కోనపాపపేట గ్రామాల్లో పదుల సంఖ్యలో ఇళ్లు కడలిలో కలిసిపోతుండడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. అలల తాకిడికి జియోట్యూబ్ రక్షణ గోడ రాళ్లు సైతం గ్రామంలోకి వచ్చి పడ్డాయి. ఉప్పాడ–కాకినాడ బీచ్ రోడ్డు కోతకు గురైంది. -
కిక్కిరిసిన రత్నగిరి
అన్నవరం: వేలాదిగా వచ్చిన భక్తులతో రత్నగిరి ఆదివారం పోటెత్తింది. వాతావరణం చల్లగా ఉండటం, విద్యా సంస్థలకు సెలవులు తదితర కారణాలతో భక్తులు భారీ సంఖ్యలో సత్యదేవుని దర్శనానికి తరలి రావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. సుమారు 40 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించి, పూజలు చేశారు. స్వామివారి ఉచిత దర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పట్టింది. ఆలయ ప్రాంగణం, వ్రత మండపాలు, క్యూ లైన్లు అన్నీ భక్తులతో నిండిపోయాయి. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేశారు. స్వామివారి వ్రతాలు 2,200 జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. మూడు రోజుల కిందటి వరకూ 40 డిగ్రీల సెల్సియస్కు పైబడిన ఎండలతో ఆలయ ప్రాంగణంలో నిలబడటానికి, నడవడానికి అవస్థలు పడిన భక్తులు.. ఇప్పుడు చల్లని వాతావరణంతో సేద తీరుతున్నారు. పలువురు ఆలయ ప్రాంగణంలో తిరుగుతూ ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటున్నారు. విశ్రాంతి మండపాల్లో సేద తీరుతున్నారు. -
తాళ్లూరు కుర్రాడికి సీఎంఏలో 36వ ర్యాంకు
తుని రూరల్: జాతీయ స్థాయిలో నిర్వహించిన కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ (సీఎంఏ) లెవెల్–2లో తుని మండలం తాళ్లూరు గ్రామానికి చెందిన లెక్కల శ్రీరామ్మూర్తి జాతీయ స్థాయిలో 36వ ర్యాంకు సాధించాడు. కోల్కతా సైన్స్ సిటీ ఆడిటోరియంలో ఐసీఎంఏఐ ఆధ్వర్యాన శనివారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో శ్రీరామ్మూర్తిని కౌన్సిల్ సభ్యులు ఘనంగా సత్కరించి, సర్టిఫికెట్ అందజేశారు. లెవెల్–3తో సీఎంఏ పూర్తవుతుందని శ్రీరామ్మూర్తి ఈ సందర్భంగా తెలిపాడు. అతడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని మహాత్మా జ్యోతిరావ్ ఫూలే పాఠశాలలో పదో తరగతి వరకు, నాగార్జున్ సాగర్ ఏపీఆర్జేసీలో ఇంటర్మీడియెట్ చదువుకున్నాడు. తర్వాత ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ ద్వారా సీఎంఏ లెవెల్–1, 2 పూర్తి చేశాడు. సీఎంఏ పూర్తి చేస్తే ప్రభుత్వ, ప్రైవేటు పరిశ్రమల స్థాపనలో ముఖ్యపాత్ర పోసించే అవకాశం దక్కనుంది. శ్రీరామ్మూర్తి తండ్రి లెక్కల కృష్ణ స్థానికంగా తాపీ మేస్త్రిగా పని చేస్తూ కొడుకును ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నారు. లోవలో భక్తుల రద్దీ తుని రూరల్: వాతావరణం చల్లగా ఉండటంతో తలుపులమ్మ అమ్మవారిని దర్శించేందుకు వచ్చిన భక్తులతో లోవ దేవస్థానంలో ఆదివారం రద్దీ నెలకొంది. వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక వాహనాల్లో వచ్చిన 8 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.2,06,415, పూజా టికెట్లకు రూ.93,390, కేశఖండన శాలకు రూ.25,580, వాహన పూజలకు రూ.2,150, వసతి గదులు, కాటేజీలు, పొంగలి షెడ్ల అద్దెలు రూ.81,556, విరాళాలు రూ.26,179 కలిపి మొత్తం రూ.4,35,450 ఆదాయం సమకూరిందని వివరించారు. అయినవిల్లికి పోటెత్తిన భక్తులు అయినవిల్లి: విఘ్నేశ్వరస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. స్వామిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధానార్చకుడు అయినవిల్లి సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో వివిధ పూజలు నిర్వహించారు. స్వామిని వివిధ పుష్పాలతో సర్వాంగ సందరంగా అలంకరించారు. స్వామివారి లఘున్యాస అభిషేకాలు, లక్ష్మీగణపతి హోమంలో 89 మంది భక్త దంపతులు పాల్గొన్నారు. పంచామృతాభిషేకాల్లో ఐదుగురు, లక్ష్మీగణపతి హోమంలో 46 మంది పాల్గొని పూజలు నిర్వహించారు. 29 వాహన పూజలు, 16 మంది చిన్నారులకు నామకరణలు, అక్షరాభ్యాలు జరిగాయి. స్వామివారి అన్నదాన పథకంలో 2,350 మంది అన్నప్రసాదం స్వీకరించారు. స్వామి వారికి వివిధ పూజలు, అన్నదానం విరాళాలుగా రూ.3,05,886 లభించిందని ఆలయ చైర్మన్ గుత్తుల నాగబాబు, ఆలయ కార్యనిర్వాహణాధికారి ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. వీరభద్రస్వామి ఆలయ నిర్మాణానికి రూ.లక్ష విరాళం అమలాపురం రూరల్: మండలంలోని ఇమ్మిడివరప్పాడు నిర్మిస్తున్న వీరభద్రస్వామి ఆలయం నిర్మాణానికి దివంగత సోరపల్లి మల్లికార్జునరావు, సూర్యకాంతం పేరుపై వారి కుమారుడు రామ్మోహనరావు, కోడలు సుబ్బలక్ష్మి ఆదివారం రూ.లక్ష విరాళం ఇచ్చారు. ఈ మేరకు స్వామివారి ఆలయ కమిటీ బ్యాంకు ఖాతాకు చెక్కును అందించారు. -
లారీ ఢీకొని యువకుడి మృతి
రాజానగరం: లారీ ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. రాజమహేంద్రవరం – కేశవరం రోడ్డులోని జి.యర్రంపాలెం వద్ద ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. రాజమహేంద్రవరంలోని శాటిలైట్ సిటీకి చెందిన అంగారపు సురేష్ (37) చెక్క మంచాలు చేసి, గ్రామాలలో విక్రయిస్తూ జీవనం సాగిస్తుంటాడు. అతడికి రెండు నెలల క్రితమే వివాహమైంది. ఈ క్రమంలో జి.యర్రంపాలెంలో మంచాలకు సంబంధించిన సొమ్ములు వసూలు చేసుకునేందుకుగాను మోటారు సైకిల్పై బయలుదేరాడు. జి.యర్రంపాలెం వెళ్తున్న అతడిని మట్టి లోడుతో వస్తున్న లారీ వేగంగా ఢీకొంది. ఆ మలుపులో ఎగువ నుంచి వెళ్లాల్సిన లారీ దిగువకు రావడంతో ఈ ప్రమాదం జరిగింది. సురేష్పై నుంచి లారీ చక్రాలు వెళ్లిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రాజానగరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారును ఢీకొన్న ఓల్వో బస్ ఇద్దరు మృతి, ఒకరు రిటైర్డు జడ్జి మోహన్రావుగా గుర్తింపు జగ్గంపేట: జగ్గంపేట మండలం రామవరం వద్ద రాజమహేంద్రవరం వైపు వెళుతున్న ఓల్వో బస్ ఒక కారును ఢీ కొంది. ఆదివారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. వారిలో ఒకరు తెలంగాణ హైకోర్టు పరిధిలోని జిల్లా రిటైర్డు జడ్జి వి.మోహన్కుమార్గా పోలీసులు గుర్తించారు. మరో వ్యక్తి డ్రైవర్ అని తెలిపారు. ఇతన్ని ఆసుపత్రికి తరలించగా మార్గం మధ్యలో చనిపోయినట్లు జగ్గంపేట పోలీసులు తెలిపారు. మృత దేహాలను పెద్దాపురం మార్చురీకి తరలించినట్టు పోలీసులు తెలిపారు. -
ఆహా ఏమి రుచి..
ఆరోగ్యానికి మేలు దాదాపు 20 గ్రాముల తాండ్రలో 67 కేలరీలు, 0.3 గ్రాముల ప్రొటీన్, 0.1 గ్రాముల కొవ్వు, 17.5 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇందులో ఉన్న విటమిన్–ఎ శరీర ఆరోగ్యంతో పాటు, కంటి చూపునకు ఎంతో మేలు చేస్తుందని చెబుతారు. అలాగే, తాండ్రలో విటమిన్–సి రోగ నిరోధక శక్తిని పెంచేందుకు, వ్యాధుల నుంచి రక్షణకు దోహదపడుతుంది. తాండ్రలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర కణాలకు మేలు చేయడమే కాకుండా, పెద్ద పేగు క్యాన్సర్, గుండె జబ్బుల వంటి వాటి ప్రమాదాన్ని తగ్గిస్తాయి. తాండ్రలో ఉండే పీచు పదార్థం పేగు కదలికలను క్రమబద్ధీకరించడంతో పాటు జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. జర్నల్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం తాండ్రలో ఉపయోగించే మామిడి గుజ్జులో జీర్ణ ప్రక్రియకు దోహదపడే ఎంజైమ్లు ఉన్నాయి. ఇవి కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వు పదార్థాలను విచ్ఛిన్నం చేయడం ద్వారా జీర్ణక్రియను మెరుగు పరచడంలో సహాయపడతాయి. ఇందులో శరీర ఆరోగ్యానికి ఉపయోగపడే ఐరన్, కాల్షియం వంటి ఖనిజాలు కూడా ఉంటాయి. అలాగే, చర్మం, జుట్టు ఆరోగ్యానికి కూడా తోడ్పడుతుంది. త్వరగా వచ్చే వృద్ధాప్య లక్షణాలను నిరోధిస్తుంది. మితమే హితం సమతుల ఆహారంలో భాగంగా తాండ్రను తగిన పాళ్లలో తీసుకోవడమే ఉత్తమమని చెబుతారు. ఇందులో చక్కెర, కేలరీలు ఎక్కువగా ఉన్నందున అధికంగా తినరాదు. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు కాస్త జాగ్రత్తలు పాటించాలి. అధికంగా తింటే దంత క్షయం, ఊబకాయం వంటి సమస్యలు రావచ్చు. ఫ పల్లెల్లో జోరుగా మామిడి తాండ్ర తయారీ ఫ వేసవిలో కూలీలకు ఉపాధి ఫ కాకినాడ జిల్లాలో 17 పరిశ్రమలు ఫ ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు కాకినాడ రూరల్: చలికాలం మళ్లి వేసవి వస్తోందంటే చాలు.. ఎక్కడ చూసినా మామిడి హడావిడే. పిందెలుగా, చిన్నచిన్న కాయలుగా ఉన్నప్పుడు ముక్కలు కోసి, ఉప్పు, కారం అద్దుకుని లొట్టలు వేసుకుని తింటూంటారు. కాయ కాస్త ఎదిగి, టెంక కట్టిన తర్వాత రకరకాల ఊరగాయలు పెట్టుకుని, చూస్తేనే నోరూరే ఆ సరికొత్త రుచులను చవి చూస్తారు. ఇక పండ్ల సీజన్ వస్తే చాలు.. ఏ మార్కెట్ చూసినా.. ఏ ఇంట్లో చూసినా మామిడి ఘుమఘుమలే. ఎవ్వరూ చూడకుండా మామిడి పండ్లను దాచేయడం ఎవ్వరికీ సాధ్యం కాదు. అవి వెదజల్లే సువాసనలే వాటి జాడను పట్టిచ్చేస్తాయి. ఆ మధుర ఫలాన్ని పిన్నల నుంచి పెద్దల వరకూ ఆనందంగా ఆస్వాదిస్తారు. మళ్లీ అందులోనూ కొత్తపల్లి కొబ్బరి, పండూరు మామిడి, బంగినపల్లి, రసాలు, పంచదార కల్తీ, ఇమాం పసందు.. ఇలా రకానికో రుచిని అందించడం మామిడికే ప్రత్యేకం. సీజన్ అయిపోయాక కూడా మామిడి పండ్ల గుజ్జుతో తయారు చేసే తాండ్రను కూడా ప్రతి ఒక్కరూ ఆనందంగా తింటూంటారు. కుటీర పరిశ్రమగా.. పండ్ల గుజ్జు, రసాల్లో చక్కెర కలిపి, పొరలుపొరలుగా పోసి, తగినంతగా ఎండబెట్టి, ముక్కలుముక్కలుగా కోసి, తాండ్ర తయారు చేస్తారు. దీని తయారీకి ఏ పండు రసమైనా వాడవచ్చు కానీ ఎక్కువగా మామిడి పండ్ల గుజ్జుతోనే తాండ్ర తయారు చేస్తారు. కొన్నిచోట్ల తాటి పండ్ల గుజ్జుతో కూడా తయారు చేస్తూంటారు. మామిడి పండ్ల గుజ్జుతో తాండ్ర తయారు చేయడంలో కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాలకు ప్రత్యేక స్థానం ఉంది. కాకినాడ రూరల్, గొల్లప్రోలు, పిఠాపురం, జగ్గంపేట, ప్రత్తిపాడు, తుని, తూర్పు గోదావరి జిల్లాలోని మెట్ట గ్రామాలు, కోనసీమ జిల్లాలో ఆత్రేయపురం వంటి ప్రాంతాల్లో తాండ్ర తయారీ కుటీర పరిశ్రమగా వర్ధిల్లుతోంది. కాకినాడ జిల్లాలో ముఖ్యంగా కాకినాడ రూరల్ మండలం పండూరు, సర్పవరం, తమ్మవరం గ్రామాలు తాండ్ర తయారీకి ప్రసిద్ధి. సర్పవరంలో సుమారు 80 ఏళ్ల క్రితం ప్రారంభమైన తాండ్ర తయారీ నేడు చేబ్రోలు, చిన్నయ్యపాలెం, ధర్మవరం, జగ్గంపేట మండలం రాజపూడి, మల్లిసాల తదితర గ్రామాలకు విస్తరించింది. తుని తదితర ప్రాంతాల్లో కూడా తాండ్ర పెద్ద ఎత్తున తయారు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా సుమారు 17 చోట్ల సీజనల్గా తాండ్ర తయారీ జరుగుతోంది. కాకినాడ రూరల్లోనే మూడు గ్రామాల పరిధిలో 12 కుటీర పరిశ్రమల ద్వారా తాండ్ర తయారు చేస్తున్నారు. ఈ తాండ్ర తయారీకి ఈ ప్రాంతంలో పండే వాటితో పాటు కృష్ణా జిల్లా నూజివీడు, ఖమ్మం, చిత్తూరు, విశాఖపట్నం, విజయనగరం, పశ్చిమ గోదావరి తదితర జిల్లాల నుంచి పక్వానికి వచ్చిన మామిడి కాయలను లారీల్లో భారీగా దిగుమతి చేసుకుంటున్నారు. జిల్లాకు ఏటా 80 వేల టన్నులు పైబడి మామిడి దిగుమతి అవుతుందని అంచనా. ఎక్కువగా కలెక్టర్ రకం మామిడి కాయలనే నాణ్యమైన తాండ్ర తయారీ వినియోగిస్తారు. వీటిని టన్ను రూ.20 వేల చొప్పున కొనుగోలు చేస్తున్నారు. కొంతమంది ఇతర రకాలు కూడా ఉపయోగిస్తారు. తయారీ ఇలా.. పక్వానికి వచ్చిన మామిడి పండ్లను ప్రత్యేకంగా రూపొందించిన యంత్రంలో వేసి, గుజ్జు లేదా రసాన్ని సేకరిస్తారు. దీనిలో తగినంత చక్కెర కలుపుతారు. అనంతరం ఆ రసాన్ని వడకట్టి, తక్కువ ఎత్తులో ఏర్పాటు చేసిన పందిళ్లపై తాటాకు చాపలు వేసి, వాటిపై పలుచని పొరలా పోసి, ఎండబెడతారు. అది కాస్త గట్టి పడిన తరువాత దానిపై మరో పొరగా మామిడి రసం పోసి ఎండబెడతారు. ఇలా కావలసినంత మందం వచ్చేంత వరకూ పొరలు పోస్తూనే ఉంటారు. ఎండ తీవ్రతను బట్టి ఈ మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి రెండు నుంచి నాలుగు వారాల వరకూ పడుతుంది. బాగా ఎండిన తర్వాత దానిని కావలసిన సైజులో ముక్కలు ముక్కలుగా కోసి విక్రయిస్తారు. ఏడాది పొడవునా.. కేవలం వేసవిలోనే తాండ్ర తయారీతో సరిపెట్టుకోకుండా కొంత మంది ఏడాదికి అవసరమైన మామిడి రసాన్ని తయారు చేసుకుని నిల్వ చేసుకుంటున్నారు. తద్వారా డిమాండ్కు అనుగుణంగా ఏడాది పొడవునా తాండ్ర తయారు చేస్తున్నారు. దీనిపై ఆధారపడి వేసవి సీజన్లో ఏటా 2 వేల మందికి పైగా ఉపాధి పొందుతున్నారు. అన్ సీజన్లో వెయ్యి మందికి పైగా ఉపాధి లభిస్తోంది. ఇక్కడ తయారయ్యే తాండ్రను మహారాష్ట్ర మధ్యప్రదేశ్, ఢిల్లీ, బిహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలకు పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తున్నారు. కాకినాడ జిల్లా నుంచి ఏటా సుమారు 50 వేల నుంచి 70 వేల టన్నుల వరకూ తాండ్ర ఎగుమతి అవుతోందని వ్యాపారులు చెబుతున్నారు. కోనసీమ జిల్లాలోని ఆత్రేయపురం తదితర ప్రాంతాల నుంచి ఇతర దేశాలకు కూడా మామిడి తాండ్రను ఎగుమతి చేస్తున్నారు. అలవాటైన వ్యాపారం తాండ్ర పరిశ్రమ మాకు అలవాటైన వ్యాపారంగా మారింది. ఏటా సీజన్లో లభ్యమయ్యే మామిడి కాయలను స్థానికంగాను, కృష్ణా, విజయనగరం, విశాఖతో పాటు తెలంగాణ ప్రాంతం నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. మామిడికాయలు సీజనల్గానే లభ్యమవడంతో తాండ్ర తయారీకి అవసమయ్యే జ్యూస్ను ఏడాదికి సరిపడేలా నిల్వ ఉంచుకుంటున్నాం. ఒక్కో పరిశ్రమలో వంద మందికి పైగా ఉపాధి పొందుతున్నారు. మగవారికి రూ.800 నుంచి రూ.900 వరకూ, ఆడవారికి రూ.600 వరకూ కూలి ఇస్తున్నాం. తాండ్ర ధర ప్రస్తుతం కేజీ రూ.100 వరకూ ఉంది. తాండ్ర తయారీ ద్వారా కూలీలకు ఉపాధి కల్పిస్తున్నామనే సంతృప్తి ఉంది. – వలవల వెంకటేశ్వరరావు, తాండ్ర తయారీదారు, పండూరు, కాకినాడ రూరల్ -
ఫైనాన్స్ వ్యాపారి అదృశ్యం
రాయవరం: మండలంలోని పసలపూడికి చెందిన ఫైనాన్స్ వ్యాపారి నల్లమిల్లి సత్యరామ్మోహన్రెడ్డి అదృశ్యంపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై జి.నరేష్ ఆదివారం విలేకరులకు తెలిపారు. ఒడిశాలోని రాయఘడ్లో సత్యరామ్మోహన్రెడ్డి ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపారం ముగించుకుని ఏప్రిల్ 21న మధ్యాహ్నం మూడు గంటల సమయంలో రాయఘడ్ నుంచి పసలపూడి బయలుదేరాడు. అనంతరం విశాఖపట్నం చేరుకున్నట్లుగా భార్య మౌనికకు సమాచారం ఇచ్చాడు. ఆ తర్వాత అతడి ఫోన్ స్విచ్చాఫ్ అయ్యింది. దీంతో భార్య మౌనిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఘనంగా సత్యదేవుని రథోత్సవ సేవ
అన్నవరం: రత్నగిరిపై కొలువైన సత్యనారాయణస్వామి, అనంతలక్ష్మి, సత్యవతీదేవి అమ్మవార్ల రథోత్సవ సేవను ఆదివారం ఉదయం ఆలయ ప్రాకారంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం పది గంటలకు రథాన్ని తూర్పురాజ గోపురం ముందుకు తీసుకువచ్చారు. దానిపై స్వామి, అమ్మవార్లను ఆశీనులు చేసి పూజలు జరిపారు. అనంతరం భక్తులు కొబ్బరికాయ కొట్టి రథోత్సవాన్ని ప్రారంభించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ పెద్దసంఖ్యలో తరలి వచ్చిన భక్తులతో కలిసి ఆలయ ప్రాకారంలో మూడుసార్లు రథంతో ప్రదక్షిణ నిర్వహించారు. రథోత్సవం అనంతరం పూజలు నిర్వహించి, స్వామి, అమ్మవార్లను మేళతాళాల మధ్య ఆలయానికి తీసుకువెళ్లారు. కార్యక్రమంలో వేద పండితులు గొల్లపల్లి ఘనాపాఠీ, ముష్టి పురుషోత్తం, చిట్టి శివ ఘనాపాఠీ, యనమండ్ర శర్మ, అర్చకులు చిట్టెం గోపి, పరిచారకులు ముత్య వెంకట్రావు, యడవిల్లి ప్రసాద్, ఆలయ ఏఈఏ డీవీఎస్ కృష్ణారావు పాల్గొన్నారు. -
సొంత నిర్ణయాలు వద్దు
ఫ నిబంధనలు పాటించడం తప్పనిసరి ఫ ఓట్ల లెక్కింపు సిబ్బందికి ఎన్నికల సంఘం మార్గదర్శకాలు కాకినాడ సిటీ: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు విధుల్లో పాల్గొంటున్న సిబ్బందికి ఎన్నికల కమిషన్ (ఈసీ) మార్గదర్శకాలు జారీ చేసింది. రిటర్నింగ్ అధికారులు (ఆర్ఓ), సహాయ రిటర్నింగ్ అధికారులు (ఏఆర్ఓ), ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్లు, కౌంటింగ్ సిబ్బంది విధులను స్పష్టంగా నిర్దేశించింది. పోస్టల్ బ్యాలెట్, స్ట్రాంగ్ రూము నోడల్ అధికారులు, సీలింగ్ అధికారులు, రో ఇన్చార్జిలు అనుసరించాల్సిన విధి విధానాలను ప్రత్యేకంగా సూచించింది. ఈ మార్గదర్శకాల ప్రకారం స్ట్రాంగ్ రూము లే అవుట్పై ఇన్చార్జి అధికారి పూర్తి అవగాహన కలిగి ఉండాలి. నోడల్ అధికారులు వారికి అప్పగించిన పనులు సక్రమంగా నిర్వర్తించాలి. సందేహాలు వస్తే ఆర్ఓల దృష్టికి తీసుకుని రావాలి. దీనికి భిన్నంగా సొంత నిర్ణయాలు తీసుకుంటే వారిపై చర్యలు తప్పవు. పోస్టల్ బ్యాలెట్, ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ (ఈటీపీబీఎస్) ఓట్లు (సర్వీస్ ఓట్లు) ఏవిధంగా లెక్కించాలి, వాలిడ్, ఇన్వాలీడ్ ఓట్లను ఎలా గుర్తించాలనే అంశాలపై సిబ్బందికి త్వరలో శిక్షణ ఇవ్వనున్నారు. ఫ ఓట్ల లెక్కింపు రోజున అధికారులు వారికి కేటాయించిన విధులకు సంబంధిత చెక్లిస్ట్ ప్రకారం ఏర్పాట్లు చేసుకోవాలి. ఫ ఏయే అంశాలకు, ఏయే వస్తువులు ఉండాలి, లెక్కింపు కేంద్రంలో ఎటువంటి ఏర్పాట్లు చేయాలనే అంశంపై అవగాహన కలిగి ఉండాలి. జూన్ 3వ తేదీ సాయంత్రానికి కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలి. ఫ కౌంటింగ్లో తలెత్తే సమస్యల పరిష్కారానికి ఓట్ల లెక్కింపు ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ఫ ఓట్ల లెక్కింపు రోజున కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూములు తెరవాలి. స్ట్రాంగ్ రూముకు ఒక నోడల్ అధికారి ఉంటారు. కౌంటింగ్కు ఈవీఎంలను ఆయన సిద్ధం చేస్తూంటారు. ఈవీఎంలకు సంబంధించిన ట్యాగ్ సరిగ్గా ఉందో లేదో పరిశీలిస్తారు. ఫ రౌండ్ల వారీగా ఫలితాల నమోదు, ప్రకటించే క్రమంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి. అంకెల్లో పొరపాటు జరగకూడదు. ఫ ఆర్ఓ, ఏఆర్ఓ ఆధ్వర్యాన ఆయా నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు నిర్వహించాలి. ఫ పోస్టల్ బ్యాలెట్, సర్వీసు ఓట్లలో సమస్యలు ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకోవాలి. ఫ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించేందుకు ఒక ఏఆర్ఓ, కంప్యూటర్ అసిస్టెంట్, కంప్యూటర్ సూపర్వైజర్, మైక్రో అబ్జర్వర్ ఉంటారు. ఫ కౌంటింగ్ ప్రక్రియను, ఫలితాల తయారీ, డిక్లరేషన్ను కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులు దగ్గరుండి పరిశీలిస్తారు. ఫ కౌంటింగ్ పూర్తయి తుది ఫలితాలు ప్రకటించగానే గెలుపొందిన అభ్యర్థికి ఫామ్ 21–ఇ అందజేయాలి. ఫ ఆర్ఓలు, ఏఆర్ఓలు, కౌంటింగ్ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలి. ఫలితాల ప్రకటన పూర్తయ్యేంత వరకూ కౌంటింగ్ సిబ్బంది ఆయా కేంద్రాల వద్దనే ఉండాలి. -
గోమాత యాతన
యానాం: కొత్త డ్రైనేజీలను నిర్మించిన తర్వాత రెండు వైపులా ఖాళీలను పూడ్చకపోవడంతో మూగజీవాలు ప్రమాదాల బారిన పడుతున్నాయి. గోపాల్ నగర్ దారిలోని మూడు తూముల జంక్షన్కు వెళ్లే ప్రదేశం వద్ద మేత మేస్తున్న గర్భంతో ఉన్న ఆవు పక్కనే ఉన్న ఆరడుగుల లోతైన గొయ్యిలో పడిపోయింది. అటుగా వెళుతున్నవారు గమనించి ఆ ఆవును బయటకు తీసేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. స్థానికంగా నివసిస్తున్న డాక్టర్ డయానా తదితరులు స్పందించి ప్రొక్లెయిన్ రప్పించారు. గొయ్యిలోంచి బయటకు రావడానికి వీలుగా దారి చేయడంతో ఆవు సురక్షితంగా బయటకు వచ్చింది. -
ఆదుకున్న మానవత్వం
రాయవరం: ఒక రోడ్డు ప్రమాదం ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. ప్రమాద స్థలంలో తండ్రి మృతి చెందగా, కుమార్తె చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచింది. తల్లి, చిన్న కుమార్తె అనాథలుగా మిగలారు. ఆ కుటుంబ సభ్యులను శ్రీ ముసలమ్మ తల్లి కేర్ క్లబ్ మానవత్వంతో ఆదుకుంది. వివరాల్లోకి వెళితే.. రాయవరం మండలం సోమేశ్వరం గ్రామానికి చెందిన దాసరి శ్రీను (35), పెద్ద కుమార్తె లలిత ఈ నెల 17న కొత్తపేట మండలం వాడపాలెం వెళ్లారు. అమ్మమ్మ గారి ఇంటి నుంచి తిరిగి సోమేశ్వరం వస్తున్న సమయంలో మండపేట మండలం వీరభద్రపురం వద్ద వీరి మోటారు సైకిల్ను ఆటో ఢీకొంది. అక్కడికక్కడే శ్రీను మృతి చెందగా, లలిత కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 21న మృతి చెందింది. దీంతో శ్రీను భార్య మణి, చిన్న కుమార్తె సత్యశ్రీ అనాథలుగా మిగిలారు. భర్తను, పెద్ద కుమార్తెను కోల్పోయిన మణి జీవచ్ఛవంగా మిగిలింది. కేర్ తీసుకున్న క్లబ్ సభ్యులు రహదారి ప్రమాదంలో శ్రీను మృతి చెందడం, చిన్న కుమార్తె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయాన్ని తెలుసుకున్న సోమేశ్వరం శెట్టిబలిజ వీధికి చెందిన శ్రీ ముసలమ్మ తల్లి కేర్ క్లబ్ మానవత్వాన్ని చాటుకుంది. క్లబ్ నిర్వాహకుడు గుత్తుల శివ తన మిత్రులతో కలిసి బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు ఫండ్ డొనేషన్ ప్రోగ్రామ్ ప్రారంభించారు. తొలుత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న లలిత వైద్యం నిమిత్తం విరాళాలు సేకరించారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా విషయాన్ని తెలియజేసి దాతల నుంచి విరాళాలు సేకరించారు. అయితే ఈ లోపు లలిత ఆరోగ్యం విషమించి అందని లోకాలకు చేరుకుంది. అప్పటికే విరాళాల రూపంలో సేకరించిన సొమ్ము రూ.2,02,464ను క్లబ్ సభ్యులు.. శ్రీను రెండో కుమార్తె సత్యశ్రీ పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఆ పత్రాలను ఆదివారం కుటుంబ సభ్యులకు అందజేశారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు శ్రీముసలమ్మ తల్లి కేర్ క్లబ్ చేస్తున్న కార్యకలాపాలను గ్రామస్తులు అభినందించారు. ఇప్పటి వరకు క్లబ్ ద్వారా పలువురిని ఆదుకున్నామని, భవిష్యత్తులో కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు మరింత కృషి చేస్తామని క్లబ్ నిర్వాహకుడు శివ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి చికిత్స పొందుతూ చిన్నారి కన్నుమూత బాధిత కుటుంబానికి స్వచ్ఛంద సంస్థ ఆర్థిక సాయం -
చనిపోయిన చేపల తరలింపు
యానాం: నల్ల చెరువు ఆవరణలోని ఒక చెరువులో మృత్యువాత పడిన చేపలను ఆదివారం ట్రాక్టర్పై తరలించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు పెసల వెంకటేష్, కాదా పవన్, హరి ప్రసాద్ మాట్లాడుతూ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ శాఖ పరిధిలోని రక్షిత మంచినీటి చెరువుల నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. చేపలు చనిపోయిన ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మంచినీటి చెరువుల నిర్వహణ, ఆధునీకరణ, రక్షణ తదితర అంశాలను ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. పీడబ్ల్యూడీ శాఖకు ఏటా కోట్లాది రూపాయలను బడ్జెట్లో ప్రభుత్వం కేటాయిస్తోందన్నారు. కొందరు పీడబ్ల్యూడి అధికారులు తమ రాజకీయ పలుకుబడితో ఏళ్ల తరబడి ఇక్కడే ఉండిపోయారని ఆరోపించారు. -
ఆనాటి స్నేహం.. అద్భుత జ్ఞాపకం..
సింగపూర్ నుంచి వచ్చా స్నేహితులందరినీ చూడాలనే ఆతృతతో సింగపూర్ నుంచి వచ్చాను. ఇక్కడ వీరందరినీ చూశాక ఎంతో ఆనందంగా ఉంది. తిరిగి మరోసారి కలిసేంత వరకు ఈ జ్ఞాపకాలను పదిలంగా ఉంచుకుంటాను. – శనగల పార్వతి, అడ్మిన్, సింగపూర్ అంబాజీపేట: చదువులమ్మ చెట్టు నీడలో విద్యాబుద్ధులు నేర్చుకున్న స్నేహితులందరూ తిరిగి అదే చెట్టు నీడన జ్ఞాపకాలతో సేదతీరారు. దీనికి అంబాజీపేట జెడ్పీ హైస్కూల్ ప్రాంగణం వేదికై ంది. స్థానిక ఉన్నత పాఠశాలలో 1998 – 99 బ్యాచ్ టెన్త్ విద్యార్థులు 25 ఏళ్ల అనంతరం ఆదివారం అదే పాఠశాలలో కలుసుకున్నారు. తొలుత సభా వేదిక పైకి వెళ్లి ఒక్కొక్కరిగా పరిచయం చేసుకున్నారు. ఆనాటి తీపి జ్ఞాపకాలు, ఆటలు, అల్లర్లు, నిక్నేమ్లు గుర్తుకు తెచ్చుకుంటూ ఒకరినొకరు పిలుచుకుంటూ చిన్న పిల్లల్లా మారిపోయి ఉత్సాహంగా గడిపారు. ఆత్మీయ పలకరింపులతో యోగ క్షేమాలు తెలుసుకుంటూ ఆనందంగా సందడి చేశారు. వివిధ వృత్తులు, ఉద్యోగ, వ్యాపారాల్లో స్థిరపడి పలు ప్రాంతాల్లో ఉన్న వారంతా తరలివచ్చారు. పాఠశాల అభివృద్ధికి కృషి చేద్దామని, తోటి విద్యార్థులకు సాయపడదామని తీర్మానాలు చేసుకున్నారు. విద్యార్థులందరూ వినోద కార్యక్రమాల్లో పాల్గొని, పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉత్సాహంగా గడిపారు. తాము చదువుకున్న పాఠశాలకు బీరువాను బహూకరించారు. తోటి విద్యార్థి, అంబాజీపేటకు చెందిన కొవ్వూరి వెంకటేశ్వరరావు ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడటంతో అతనికి ఆర్థిక సాయం చేశారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన 15 మంది గురువులను ఘనంగా సత్కరించారు. ఆత్మీయ కలయికకు కృషి చేసిన స్నేహితులను, తోటి విద్యార్ధులు అభినందించారు. కార్యక్రమంలో రావూరి రాంబాబు, యర్రంశెట్టి సూరిబాబు, పొట్టుపోతు నాయుడు, క్రాంతి, బేగం, చందన తదితరులు పాల్గొన్నారు. అంబాజీపేట హైస్కూల్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం తరలివచ్చిన స్నేహితులు -
సాగులో యంత్రసాయం
ఆ గడ్డినే వినియోగిస్తున్నాం గతంలో వరి కోత యంత్రాలతో మాసూలు చేసిన గడ్డిని వృథాగా వదిలేసేవాళ్లం. అది పశువులకు దాణాగా ఉపయోగపడదని భావించేవాళ్లం. పశుసంవర్థకశాఖ అధికారుల సలహాతో ఆ గడ్డినే పశువులకు వేస్తున్నాం. యంత్రంతో కట్టలు కట్టించి, గడ్డివామిగా వేసి, అనంతరం పశువులకు ఉపయోగిస్తున్నాం. – చేవా సత్యనారాయణ, రైతు, లొల్ల, రాయవరం మండలం అవగాహన పెరిగింది గడ్డిని కట్టలుగా చుట్టే యంత్రాలు రాని సమయంలో ఎండు గడ్డి వృథా అయ్యేది. గడ్డిని బెయిలింగ్ చేసే యంత్రాలు రావడం చాలా ఉపయోగంగా ఉంది. పశువులకు గడ్డి కొరత తీరింది. చాలామంది రైతులు అవగాహన పెంచుకున్నారు. పశువులకు మేత కొరత లేకుండా చూసుకుంటున్నారు. – డాక్టర్ కర్నీడి మూర్తి, డిప్యూటీ డైరెక్టర్, పశుసంవర్థక శాఖ, అమలాపురం రాయవరం: ఇటీవల వరి సాగులో యంత్రాల ప్రాధాన్యం పెరిగింది. దాదాపు 95 శాతానికి పైగా పంటను యంత్రాలతోనే కోయిస్తున్నారు. భూమిని దమ్ము చేయడం దగ్గరి నుంచి నాట్లు వేయడం, పురుగు మందుల పిచికారీ, పంట మాసూళ్ల వరకు యంత్రాలనే ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు వరి చేనును కోత యంత్రాలతో కోసి, పొలాల్లో వదిలేసిన గడ్డిని కట్టలు కట్టడానికి సైతం యంత్రాలనే వినియోగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పెద్ద మొత్తంలో సబ్సిడీపై యంత్రాలకు రుణాలు అందజేయడంతో గ్రామాల్లోని రైతులు కమిటీలుగా ఏర్పడి వివిధ రకాలు యంత్రాలను కొనుగోలు చేస్తున్నారు. సులువైన పనివ్యవసాయంలో యంత్రాలను ఉపయోగించడం వల్ల సాగు పనులు రైతులకు చాలా సులువుగా మారాయి. ముఖ్యంగా వరి కోతల సమయంలో కూలీల కొరతతో గతంలో ఇబ్బందులు పడేవారు. కోత యంత్రాలు రావడంతో పని సులువైంది. ఖర్చు తగ్గింది. అయితే మెషీన్తో కోయగా వచ్చిన గడ్డి పశువులకు దాణాగా ఉపయోగపడదని రైతులు భావించేవారు. దాన్ని అలాగే చేలల్లో వదిలేసేవారు. కానీ అది కేవలం అపోహ అని, ఆ గడ్డిలోనూ పోషకాలు ఉంటాయని, పైగా చిన్న ముక్కలుగా తెగిన గడ్డి పశువులకు త్వరగా జీర్ణమవుతుందని పశుసంవర్థకశాఖ అధికారులు అవగాహన కల్పించారు. దీంతో రైతులు ప్రత్యేక యంత్రాల సాయంలో ఆ గడ్డిని కట్టలు కట్టించి, పశువులకు దాణాగా ఉపయోగిస్తున్నారు. యంత్రాలు అన్ని పనుల్లో రైతులకు చేదోడుగా మారాయి. యంత్రాల వినియోగం కోనసీమ జిల్లాలో ప్రధానంగా దాళ్వా సీజన్లో పంట మాసులుకు యంత్రాలను ఉపయోగించడం పరిపాటిగా మారింది. యంత్రంతో పంట మాసూళ్లు చేయడం వల్ల వరి గడ్డి ముక్కలు ముక్కలుగా తెగిపోతుంది. ఈ ముక్కలుగా తెగిన గడ్డిని పశువులకు మేతగా వేస్తే పెద్దగా ప్రయోజనం ఉండదని భావించి చేలల్లోనే తగలబెట్టేవారు. దీంతో పశువులకు ఎండుగడ్డి ఏర్పడేది. కొన్ని సమయాల్లో ఇతర జిల్లాల నుంచి గడ్డిని కొనుగోలు చేసేవారు. ఎకరం గడ్డి సుమారు రూ.6 వేలు నుంచి రూ.8 వేలు పలికేది. దీంతో పశువుల పెంపకం చాలా కష్టంగా మారింది. వృథా కాదు.. పోషకాహారం వరి కోత యంత్రాలతో మాసూలు చేసిన గడ్డి కూడా పశువులకు ఉపయోగపడుతుందని రైతులకు పశుసంవర్థకశాఖ అధికారులు అవగాహన కల్పించారు. ముక్కలైన గడ్డిని తినడం వల్ల పశువులకు త్వరగా జీర్ణం అవుతుందని తెలిపారు. దీంతో రైతులు యంత్రాల ద్వారా మాసూలు చేయగా వచ్చిన గడ్డిని పశువులకు మేతగా ఉపయోగించడాన్ని అలవాటు చేసుకున్నారు. వ్యవసాయంలో పెరిగిన యంత్రాలు అన్ని పనులలో రైతులకు చేదోడు ఎండుగడ్డి కట్టలకూ అవే వినియోగంజిల్లాలో 2.29 లక్షల పశువులు జిల్లాలో దాదాపు 2.29 లక్షల పశువులు ఉన్నాయి. వీటిలో 75,460 ఆవులు, 1,53,542 గేదెలు ఉన్నాయి. వరికోత యంత్రాల ద్వారా మాసూలు చేసిన గడ్డిని పశువులు కూడా బాగా తింటున్నాయి. దీంతో ఆ గడ్డిని కట్టలు కట్టడానికి యంత్రాలను ఉపయోగిస్తున్నారు. గుంటూరు ప్రాంతం ఉంచి గడ్డిని కట్టలు కట్టే యంత్రాలు మన ప్రాంతానికి వస్తున్నాయి. వీటి ద్వారా కట్టలు కట్టించి ట్రాక్టర్లతో గట్టుకు చేర్చి గడ్డివాములుగా వేస్తున్నారు. ఇలా చేయడానికి ఒక్కో కట్టకు రూ.35 వసూలు చేస్తున్నారు. దీనికి రవాణా, కూలి ఖర్చులు అదనంగా ఉంటాయి. ఎకరం గడ్డిని కట్టలుగా కట్టించడానికి సుమారు రూ.2 వేల వరకూ ఖర్చవుతుంది. -
బుల్లి చేపలతో భలే మేలు!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: గోదారోళ్లు తిండి పెట్టి చంపేస్తారురా బాబూ అంటుంటారు. గోదావరి తీరంలో లభించే రుచికరమైన చేపలు అటువంటివి మరి. ఒకప్పుడు ముక్క లేనిదే ముద్ద దిగదనే నానుడి గోదావరి జిల్లాలకే ప్రత్యేకం. ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈబాపతు జనం పెరిగిపోయారు. అందులోనూ చేపలు దొరకాలే కానీ ఎంతటి వారైనా ఇట్టే లొట్టలేసుకుని లాగించేస్తున్నారు. గోదావరిలో దొరికే పండుగప్ప, కొయ్యింగ, కొరమేను, సీజనల్గా ఆగస్టులో లభించే పులస వంటిì పది రకాల చేపలంటే మాంసాహార ప్రియులు పడిచస్తారు. ఇంతకాలం పెద్ద చేపలనే ఇష్టపడేవారు ఇప్పుడు చిన్న చేపలపైనా మక్కువ చూపిస్తున్నారు. చిన్న చేపలు రుచికి రుచి.. బలవర్ధకమైన మాంసాహారం, సంపూర్ణ ఆరోగ్యాన్నిస్తాయి. సముద్రపు చేపలకు గిరాకీ సముద్రపు ఉప్పు నీటిలో లభించే చేపలంటే మాంసాహార ప్రియులు ఇష్టపడతారు. పీతలు, రొయ్యలు, ట్యూనా, వంజరం, కోనం, చందువ తదితర రకాల చేపలకు మార్కెట్లో భలే గిరాకీ. ఇటువంటి చేపలు కాకినాడ రేవు నుంచి దక్షిణాదిన తమిళనాడు, కేరళతో పాటు ఒడిశా, మహారాష్ట్రలకు ఎగుమతి చేస్తున్నారు. పెద్ద చేపలతో పాటు చిన్నచిన్న చేపలకు కూడా ఇప్పుడిప్పుడే డిమాండ్ పెరుగుతోందని మత్స్యకారులు చెబుతున్నారు. చూడటానికి అరంగుళం, అంగుళం, ఒకటిన్నర అంగుళాల సైజులో ఉండే ఈ చిన్న చేపలు కొన్ని రకాల జబ్బులకు దివ్యౌషధమని వైద్యులు నిర్ధారిస్తున్నారు.ఈ జాబితాలో నెత్తళ్లు, కవళ్లు, కట్టచేపలు, పరిగెలు, కానగంత తదితర చేపలు ఉన్నాయి. పెద్ద చేపల కంటే చిన్న చేపలు మంచివని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. చిన్న చేపల్లో తక్కువ స్థాయిలో మెర్క్యురీ, అధిక స్థాయిలో మినరల్స్ ఉండటంతో ఆరోగ్యానికి మంచిదంటున్నారు. చిన్న చేపల్లో ఒమేగా–3 యాసిడ్స్ ఎక్కువగా ఉండటంతో మెదడు చురుగ్గా పని చేసేందుకు దోహదపడుతుంది. చిన్న చేపల్లో కలుíÙతాల స్థాయి కూడా తక్కువ మోతాదులో ఉంటుంది. పెద్ద చేపల కంటే చిన్న చేపల ధర కూడా తక్కువే. పండుగప్ప, వంజరం, ట్యూనా, కొరమేను వంటి కేజీ, కేజీన్నర ఉండే ఒక పెద్ద చేప కొనాలంటే కనీసం రూ.వెయ్యి వెచి్చంచాలి.అదే కేజీ చిన్న చేపలు కావాలంటే రూ.100 నుంచి రూ.200 పెడితే దొరికేస్తాయి. వివిధ రకాల పండ్లు, కూరగాయల నుంచి అదనంగా లభించే ఐరన్, జింక్ చిన్న చేపల ద్వారా పెరుగుతాయని వైద్యులు చెబుతున్నారు. చిన్న చేపలను ఆహారంగా తీసుకునే మహిళల్లో రక్తహీనత తగ్గి శక్తిమంతులవుతారు. ప్రధానంగా గర్భిణులు, ప్రసవం అయిన మహిళలకు నెత్తళ్లు రకం చిన్న చేపలు ఎంతో బలవర్ధకమైన ఆహారంగా గ్రామీణ మహిళలు భావిస్తారు. అల్పాదాయ దేశాల్లో మధ్యతరగతి, పేద వర్గాలు చిన్న చేపలనే ఎక్కువగా ఆహారంగా తీసుకుంటారు.వారంతా ఆరోగ్యవంతులుగా, బలవంతులుగా ఉంటారని వరల్డ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ తాజా అధ్యయనంలో పేర్కొంది. మహిళా సాధికారత కోసం ఒడిశా రాష్ట్రం మిషన్ శక్తి చొరవతో రెండేళ్ల క్రితం పైలట్ ప్రాజెక్టు చేపట్టింది. దీని ద్వారా 7 మిలియన్లకు పైగా చిన్న చేప పిల్లలను ఉత్పత్తి చేసిందని అధ్యయనం చెబుతోంది. వీటిని మహిళా స్వయం సహాయక బృందాలకు పంపిణీ చేసి, గ్రామీణ మహిళల్లో శక్తిసామర్థ్యాల పెంపునకు ఇతోధికంగా తోడ్పాటు అందించారు. స్విట్జర్లాండ్, కాంబోడియా వంటి దేశాల్లో స్వదేశీ చిన్న చేపలను కూరగాయల ఉత్పత్తితో పాటు మిళితం చేయడం గమనార్హం.కవళ్లతో గుండె జబ్బుల నివారణ చిన్న చేపల్లో ప్రధానంగా కవళ్లు ఆహారంగా తీసుకుంటే కాల్షియం, మినరల్స్, విటమిన్–డి వంటి పోషకాలు లభిస్తాయని వైద్యులు చెబుతున్నారు. వీటిని ఆహారంగా తీసుకునే వారిలో గుండె జబ్బులకు ఆస్కారం ఉండదంటున్నారు. ఈ చేపలు చూసేందుకు చాలా చిన్నగా ఉంటాయి. వ్యావహారికంగా వీటిని ఆయిల్ సర్డిన్స్గా, శాస్త్రీయంగా సర్డెనెళ్ల లొంగిచెప్స్గా పిలుస్తారు. ఈ చేపల్లో పాలి అన్శాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండటం వలన గుండె జబ్బులను తగ్గిస్తాయి.నెత్తళ్లతో కీళ్ల నొప్పులు మాయం సిల్వర్ కలర్లో కనిపించే నెత్తళ్ల చేపలు చాలా చిన్నగా ఉంటాయి. ఆంకూవీస్ అని వ్యవహారికంగా పిలిచే ఈ చేపల శాస్త్రీయ నామం స్టోల్ ఫోరస్ ఇండికస్. నెత్తళ్లలో కాల్షియం ఎక్కువగా ఉండడంతో కీళ్ల నొప్పుల నివారణకు పనికొస్తాయి. గర్భిణులు, వృద్ధులకు ఎంతో బలవర్ధకమైన ఆహారంగా భావిస్తారు. నెత్తళ్లు 100 గ్రాములు ఆహారంగా తీసుకుంటే 200 కిలో క్యాలరీల శక్తి, 45 గ్రాముల ప్రొటీన్లు, 3.3 గ్రాముల కొవ్వు పదార్థాలు, 1,400 మిల్లీగ్రాముల కాల్షియం, 2 గ్రాములు మిగిలిన ఖనిజాలు, 67 మిల్లీ గ్రాముల కొలెస్ట్రాల్ లభిస్తాయని కాకినాడ ఎస్ఐఎఫ్టీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.చిన్న చేపల్లో కాల్షియం ఎక్కువ చిన్న చేపల్లో కాల్షియం, విటమిన్–ఎ పుష్కలంగా ఉంటాయి. ఈ చేపలను ఆహారంగా తీసుకుంటే ఎముకలకు, కళ్లకు మేలు జరుగుతుంది. సహజంగా పెద్ద చేపలు ఇష్టంగా తీసుకుంటారు. పెద్ద చేపల కంటే చిన్న చేపలు బలవర్ధకం. గర్భిణులకు, ప్రసవానంతరం బలవర్ధకమైన ఆహారంగా నెత్తళ్లు పెట్టడం పల్లెల్లో ఆనవాయితీగా వస్తున్నదే. – టి.సుమలత, ప్రిన్సిపాల్, ఎస్ఐఎఫ్టీ, కాకినాడ చిన్న చేపలను ముళ్లతో తింటే మేలు చిన్న చేపల్లో ముళ్లు లేతగా ఉంటాయి. అందులో కాల్షియం, ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. గొంతులో గుచ్చుకుంటాయనే అనుమానం లేకుంటే చిన్న చేపలను ముళ్లతో తినడమే మేలు. ప్రకృతిలో దేని ద్వారానూ లభించనంత కాల్షియం చిన్న చేపల్లో లభ్యమవుతుంది. ఈ కాల్షియం ఎముకలు గుల్లబారడాన్ని నివారించి, ఆస్టియోపొరాసిస్ వంటి సమస్యలను దూరం చేస్తుంది. చిన్న చేపల నుంచి లభ్యమయ్యే ప్రొటీన్ వల్ల కండ పుష్టి ఏర్పడి, శరీర నిర్మాణానికి దోహదపడుతుంది. – డాక్టర్ తొమూర్తి గౌరీశేఖర్, ఎముకల వైద్య నిపుణుడు, కాకినాడ -
తునిలో మరోసారి సైకిల్కు పంక్చర్..!
ఒకప్పుడు ఆ నియోజకవర్గాన్ని టీడీపీ కంచుకోటగా పిలిచేవారు. కాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డాక అక్కడ ఫ్యాన్ గాలి బలంగా వీస్తోంది. దీంతో సైకిల్ అడ్రస్ గల్లంతైంది. రెండుసార్లు గెలిచిన ఫ్యాన్ మూడోసారి కూడా ఘన విజయం దిశగా దూసుకుపోవడం ఖాయం అనే టాక్ నడుస్తోంది. పోలింగ్ జరిగిన తీరు, ప్రజల స్పందన ఆధారంగా ఫ్యాన్ హ్యాట్రిక్ ఖాయం అని ప్రజలే చెబుతున్నారు. ఇంతకీ ఆ నియోజకవర్గం ఎక్కడుందో చూద్దాం.తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు తర్వాత సెకండ్ లీడర్గా చెప్పుకునే యనమల రామకృష్ణుడు కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం నుంచి వరుసగా ఆరుసార్లు విజయం సాధించారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆయన గెలుపును ఎవరూ అడ్డుకోలేకపోవడంతో తుని టీడీపీ కంచుకోట అని చెప్పేవారు.2009 ఎన్నికల నుంచి తునిలో యనమల ప్రాభవం తగ్గిపోయింది. అప్పటినుంచి వరుసగా సైకిల్కు పంక్చర్లు పడుతూనే ఉన్నాయి. 2009లో ఓడిన వెంటనే యనమల ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంటున్నారు. గత రెండు ఎన్నికల్లో ఆయన సోదరుడు యనమల కృష్ణుడు పోటీ చేసినా టీడీపీకి విజయం దక్కలేదు.గత రెండు ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి అభ్యర్ధి దాడిశెట్టి రాజా భారీ మెజార్టీతో గెలిచి ..తునిలో వైఎస్ఆర్ సిపి జెండాను రెప రెపలాడించారు. తాజా ఎన్నికల్లో మరోసారి తునిలో వైఎస్ఆర్ సిపి జెండాను రెప రెపలాడించేందుకు రాజా రెడీ అంటున్నారు. గత రెండు ఎన్నికల్లో ఓటమి చెందిన తన తమ్ముడు కృష్ణుడికి ఇప్పటి ఎన్నికల్లో వెన్నుపోటు పొడిచారు అన్న యనమల. ఈసారి కృష్ణుడిని కాకుండా తన కుమార్తె దివ్యను దింపారు.దీంతో అన్నదమ్ముల మధ్య రాజకీయ వైరం మొదలైంది. మరోవైపు చిన్నాన్న కృష్ణుడు..అతని వర్గాన్ని దూరం పెట్టి అవమానించారు యనమల కుమార్తె దివ్య. దీంతో మనస్ధాపం చెందిన కృష్ణుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ సిపిలో చేరారు. దాదాపు 40 ఏళ్ల నుంచి తునిలో అన్నకు అండగా అన్ని తానై చూసిన కృష్ణుడు ఊహించని వెన్నుపోటును సహించలేకపోయారు. తునిలో వైఎస్ఆర్ సిపి గెలుపు కోసం కృష్ణుడు కసిగా పని చేశారు. తమ సామాజిక వర్గం ఓట్లు వైఎస్ఆర్ సిపికి పడేలా రాజకీయం నడిపారు.గత ఎన్నికల్లో తునిలో 82.28% శాతం పోలింగ్ నమోదు కాగా..ఈ ఎన్నికల్లో ఒక శాతం అదనంగా నమోదు అయ్యింది. ఇక గడిచిన ఐదేళ్ళ కాలంలో తునిలో దాదాపు రూ.1900 కోట్లు సంక్షేమం, అభివృద్ధి కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం ఖర్చు చేసింది. అలాగే నాడు నేడు క్రింద పాఠశాలల అభివృద్ధి.. గ్రామాల్లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, త్రాగు నీటి ప్రాజెక్టులను నిర్మించారు. ఇక తునిలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా మంత్రి రాజా అందుబాటులో ఉండి ఆ సమస్యను పరిష్కరిస్తారని ప్రజల్లో నమ్మకం ఉంది.యనమల విషయానికి వస్తే..ఆయన ఎక్కువగా గడిపేది హైదరాబాదు, విజయవాడ లేదా కాకినాడ రూరల్ తిమ్మాపురంలోని గెస్ట్ హౌజ్లో అనే విషయం తుని ప్రజలకు తెలుసు. అంతేకాదు...యనమల కుమార్తె దివ్య కూడా హైదరాబాదులో ఉండడం వల్ల ఆమెపై తుని నియోజకవర్గ ప్రజలకు అంతగా నమ్మకం లేదు.పైగా టీడీపీ అభ్యర్థిగా ఉన్న దివ్య కూడా ఎన్నికల ప్రచారంలో అంతగా కనిపించలేదు. మరోవైపు మంత్రి దాడిశెట్టి రాజా తరపున ఆయన సతీమణీ లక్ష్మీ చైతన్య, కుమారుడు శంకర్ మల్లిక్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోయారు.పోలింగ్ జరిగిన తీరు, టీడీపీ కేడర్లో ఎక్కువ భాగం యనమల కృష్ణుడివైపు రావడం, కృష్ణుడు వైఎస్ఆర్సీపీ కోసం కష్టపడి పనిచేయడం వంటి అనేక కారణాలతో మరోసారి తునిలో సైకిల్కి పంక్చర్ కావడం ఖాయం అనే టాక్ నడుస్తోంది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దాడిశెట్టి రాజా గెలుపు నల్లేరు మీద నడకేనని..ఆయన హ్యాట్రిక్ ఎమ్మెల్యే కాబోతున్నారని ప్రజాభిప్రాయం చెబుతోంది. -
రత్నగిరి.. భక్తజన ఝురి
అన్నవరం: వేలాదిగా తరలి వచ్చిన భక్తులతో రత్నగిరి శనివారం కిక్కిరిసింది. సుమారు 40 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించారని అధికారులు తెలిపారు. వ్రతాలు రెండు వేలు నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. సత్యదేవుని నిత్యాన్నదాన పథకంలో సుమారు 4 వేల మంది భక్తులకు భోజనం పెట్టారు. వార్షిక కల్యాణ మహోత్సవాలు ముగియడంతో శనివారం నుంచి సత్యదేవుని నిత్యకల్యాణాన్ని పునఃప్రారంభించారు. 44 మంది ప్రత్యక్షంగా, 11 మంది ఆన్లైన్ ద్వారా స్వామివారి కల్యాణంలో పాల్గొన్నారు. శృంగార వల్లభునికి రూ.3.35 లక్షల ఆదాయం పెద్దాపురం: తొలి తిరుపతి గ్రామంలో స్వయంభువుగా వెలసిన శంగార వల్లభ స్వామి వారికి వివిధ సేవలు, విరాళాల రూపంలో శనివారం రూ.3,35,155 ఆదాయం సమకూరింది. స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. స్వామివారికి ముడుపులు, మొక్కులు చెల్లించారు. స్వామివారిని సుగంధభరిత పుష్పమాలికలతో ప్రత్యేకంగా అలంకరించారు. సుమారు 15 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని ఈఓ వడ్డి శ్రీనివాస్ తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఆలయ చైర్మన్ కర్రి వెంకట జగదీశ్వరరావు, ఈఓ ఆధ్వర్యాన ఏర్పాట్లు చేశారు. భక్తులకు ప్రసాద వితరణతో పాటు అన్నదానం ఏర్పాటు చేశారు.
Pagination
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
కౌంటింగ్కు సర్వం సిద్ధం
373 మంది గైర్హాజరు
●భారీగా తగ్గిన దిగుబడులు
డిమాండ్ ఉండే సమయానికి కాయలు రాలేదు
జిల్లా వ్యాప్తంగా నాయకులకు బహిష్కరణ నోటీసులు
ఖరీఫ్ కార్యాచరణ అమలుకు సమాయత్తం కావాలి
ఏసీఏ జూనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ నియామకం
ఓట్ల లెక్కింపునకు పక్కా ఏర్పాట్లు
ఎల్ అండ్ టి ఫైనాన్స్ లిమిటెడ్ హైదరాబాద్లో పూర్తి గృహ రుణాన్ని ప్రారంభించింది
రామ్కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్డేట్లు
తప్పక చదవండి
- విజయ్ సరసన హీరోయిన్గా ఛాన్స్.. చేయనని ఏడ్చేసిన బాలీవుడ్ బ్యూటీ
- Khammam Car Accident: అల్లుడు హైడ్రామా..!
- విజయవాడ హైవేపై హృదయ విదారక ఘటన
- ‘బోట్ నెట్’పై ఎఫ్బీఐ గురి.. చైనా పౌరుడు అరెస్ట్
- Aditi Dugar: జీరో టు.. మ.. మ.. మాస్క్ వరకు!
- ప్రపంచ క్రికెట్లో ఇద్దరే ఇద్దరు..!
- ప్రియుడి వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య
- వెండే బంగారమాయెగా..
- Lok Sabha Election 2024: బీజేపీకి 295 –305 సీట్లు, కాంగ్రెస్కు 55–65 సీట్లు
- ‘స్కూటీ’అంటే పాప.. ‘బైక్’అంటే బాబు
Advertisement