-
గర్భిణుల వివరాలు నమోదు చేయాలి
● ఇన్చార్జి డీఎంహెచ్ఓ డాక్టర్ సురేష్ కుమార్ ఒంగోలు టౌన్: ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాన్పు అయిన మహిళలకు ఆరోగ్య ఆసరా కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.8 వేలు అందజేస్తుందని, కనుక పీహెచ్సీ కాన్పు చేసుకున్న గర్భిణుల వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని ఇన్చార్జి డీఎంహెచ్ఓ డాక్టర్ సురేష్కుమార్ ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో బుధవారం సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లతో ఆరోగ్య ఆసరాపై సమీక్షా సమావేశం నిర్వహంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కాన్పు కోసం వచ్చిన ప్రతి గర్భిణీ వివరాలను తొలుత రిజిస్టర్ పుస్తకంలో నమోదు చేసి కాన్పు తరువాత ఆన్లైన్ చేయాలని సూచించారు. తల్లి ఆధార్ కార్డు నంబర్, బ్యాంకు ఖాతా వివరాలు, ఎంసీపీ కార్డులను ఆన్లైన్లో నమోదు చేసిన 24 రోజుల లోగా ఆరోగ్య ఆసరాకు సంబంధించిన రూ.8 వేలు జమవుతాయని తెలిపారు. -
దాడి కేసులో ఒకరు అరెస్టు
● పాత గొడవలే దాడికి కారణం ● డీఎస్పీ రత్నాకరం రామరాజు కనిగిరి రూరల్: వెలిగండ్ల మండలం జంగంనర్సాయపల్లి ఎస్సీ కాలనీకి చెందిన తీట్ల నారాయణ ఇంటిపై బీరు సీసాలో పెట్రోలు నింపి దాడి చేసిన ఘటనలో ఒకరిని అరెస్టు చేశామని, మరొకరు పరారీలో ఉన్నారని కనిగిరి డీఎస్పీ రత్నాకరం రామరాజు తెలిపారు. స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వివరాలు వెల్లడించారు. కటుకూరి అనంతబాల అలియాస్ దూదేకుల రజాక్కు, అదే గ్రామానికి చెందిన తీట్ల నారాయణకు 2020 కోవిడ్ సమయంలో ఇద్దరి మధ్యలో మనస్పర్థలు ఉన్నాయి. దీంతో అప్పటి నుంచి ఇద్దరి మద్య విభేదాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో నిందితుడు కె.అనంతబాల, మరొకరు కటుకూరి రహీంలు కలిసి ఈనెల 28 అర్ధరాత్రి దాటిన తర్వాత బీరు సీసాలో పెట్రోలు నింపి ఇంటిపైకి విసిరారు. బీరు సీసా గేటుకు తగిలి బయట ఉన్న వాహనానికి తగిలి మంటలురేగాయి. వెంటనే తీట్ల నారాయణ కుటుంబ సభ్యులు మేలుకొని మంటలను అదుపు చేశారు. ఈ మేరకు బాధితుడు తీట్ల నారాయణ తన ఇంటిపైకి గుర్తుతెలియని దుండగులు దాడి చేశారని, తాము మేల్కొని మంటలు అదుపుచేయకుంటే ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఎస్పీ ఆదేశాల మేరకు కనిగిరి డీఎస్పీ ఆధ్వర్యంలో మూడు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో మండలంలోని నాగులవరం జంక్షన్ వద్ద బుధవారం సాయంత్రం 5 గంటలకు అనుమానంగా సంచరిస్తున్న కె.అనంతబాలను పట్టుకొని మధ్యవర్తుల సమక్షంలో విచారించగా నేరం అంగీకరించడంతో అరెస్టు చేసినట్లు తెలిపారు. రెండో నిందితుడు పరారీలో ఉన్నాడని, అతన్ని కూడా త్వరలో అరెస్టు చేస్తామన్నారు. కేసును త్వరితగతిన ఛేదించిన పామూరు సర్కిల్ అధికారులను, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
పోస్టల్ బ్యాలెట్ ఓట్లు గ్రేడింగ్
ఒంగోలు సిటీ: ఒంగోలు అసెంబ్లీ పరిధిలోని పార్లమెంట్ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 4,648, అసెంబ్లీ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 5,335 గ్రేడింగ్ చేసినట్లు ఒంగోలు నియోజకవర్గ ఆర్వో జీవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఒంగోలు ఆర్డీఓ కార్యాలయంలో బుధవారం రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించిన పార్లమెంట్, అసెంబ్లీ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల గ్రేడింగ్ చేసే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఒంగోలు నియోజకవర్గ ఆర్వో సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఒంగోలు అసెంబ్లీ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 5,327, సర్వీస్ 8 కలిపి మొత్తం 5,335 ఓట్లు, పార్లమెంట్ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 4648 ఉన్నాయన్నారు. గ్రేడింగ్ చేసిన పార్లమెంట్, అసెంబ్లీ పోస్టల్ బ్యాలెట్ ఓట్లను జూన్ 3వ తేదీన రైజ్ కాలేజీ లెక్కింపు కేంద్రానికి చేరుస్తారని తెలిపారు. అలాగే జిల్లాలోని మిగిలిన ఏడు నియోజకవర్గాల పోస్టల్ బ్యాలెట్ ఓట్లను పార్లమెంట్, అసెంబ్లీ ఓట్లను గ్రేడ్ చేసి జూన్ 3వ తేదీన రైజ్ కాలేజీకి చేరుస్తామని తెలిపారు. గ్రేడింగ్ చేసిన ఓట్లను విడివిడిగా బాక్సులలో పెట్టి స్ట్రాంగ్ రూంలలో భద్రపరిచినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఒంగోలు, కొత్తపట్నం తహశీల్దార్లు పసుపులేటి హేమంత్, అర్జున్రెడ్డి, ఏఓ చిన్నికృష్ణ, వైఎస్సార్ సీపీ ప్రతినిధి దామరాజు క్రాంతికుమార్, రసూల్, గుర్రం సత్యం, అభ్యర్థులు సుందరం, హుస్సేన్బీ, స్వరూప్, శంకర్రెడ్డి, రవీంద్ర, యోగానంద్, చైతన్యప్రసాద్, అనీల్, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు. -
1న రాష్ట్రస్థాయి ఎడ్ల పందేలు
రాచర్ల: వేమయ్యస్వామి 262వ ఆరాధన మహోత్సవం సందర్భంగా జూన్ 1వ తేదీ శనివారం చోళ్లవీడులో రాష్ట్రస్థాయి ఎడ్లపందేలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అసక్తి ఉన్న ఎడ్ల యజమానులు జూన్ 1వ తేదీ లోగా రూ.500 ఎంట్రీ ఫీజు చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. గెలుపొందిన విజేతలకు మొదటి బహుమతి రూ.40, రెండో బహుమతి రూ.30 వేలు, మూడో బహుమతి రూ.20వేలు, నాల్గవ బహుమతి రూ.15వేలు, ఐదో బహుమతి రూ.10వేలు, ఆరో బహుమతిగా రూ.8వేలు, ఏడో బహుమతిగా రూ.5వేలు, ఎనిమిదవ బహుమతిగా రూ.4 వేలు అందజేస్తామన్నారు. పూర్తి వివరాలకు 9912032442, 9912995159 నంబర్లను సంప్రదించాలని కోరారు. -
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించం
కనిగిరి రూరల్: ఎన్నికల నియమ నిబంధనావళిని ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని.. కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ అన్నారు. స్థానిక పవిత్రా కళ్యాణ మండపంలో కనిగిరి పోలీస్ డివిజన్లోని 9 మండలాలకు చెందిన ఇరు పార్టీల నాయకులతో ఎన్నికల కౌంటింగ్, తదుపరి పరిణామాలపై బుధవారం అవగాహన సదస్సు డీఎస్పీ రత్నాకరం రామారాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్ ముగిసిన తర్వాత కూడా ప్రతి గ్రామంలో ప్రశాంత, శాంతియుత వాతావరణం ఉండాలన్నదే లక్ష్యమని తెలిపారు. బైండోర్ చేసిన తర్వాత కూడా కొందరు దర్శి, వై పాలెం ఏరియాల్లో సుమారు 50 మంది అల్లర్లు, గోడవల్లో పాల్గొన్నారని, వారికి రూ.లక్ష వరకు జరిమానా విధించినట్లు, జరిమానా చెల్లించకుంటే షూరిటీ ఉన్న వారు చెల్లించాల్సి ఉంటుందని, వారు చెల్లించకుంటే జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందని వివరించారు. గ్రామాల్లో ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనిపించినా, బయట వ్యక్తులు వచ్చి గొడవలకు దిగినా పోలీసులకు సమాచారం అందించాలన్నారు. గ్రామంలోని ప్రతి నాయకుడు ఎస్సై, సీఐ, డీఎస్పీల ఫోన్ నంబర్లు దగ్గర ఉంచుకోవాలని సూచించారు. కౌంటింగ్ ఏజెంట్లు ముందుగానే ఐడీ కార్డు తీసుకొని కేంద్రాలకు రావాలన్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఐడీ కార్డు ఇస్తామంటే వినవద్దని, సుమారు 2 కిలోమీటర్ల దూరంలోనే వాహనాలను నిలిపివేస్తామని స్పష్టం చేశారు. కౌంటింగ్ ముగిసిన తరువాత బాణసంచా కాల్చడం, విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడం నిషేధమని స్పష్టం చేశారు. పెట్రోల్, డీజీల్ దుకాణాల్లో విడిగా బాటిళ్లలో పెట్రోల్, డీజిల్ పోయవద్దని సంబంధిత డీలర్లకు నోటీసులిచ్చామని, క్రాకర్స్ దుకాణ, లైసెన్స్ దారులకు కూడా ఇప్పటికే తగిన హెచ్చరికలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. కొంత మంది అసాంఘిక శక్తులు పార్టీలు, కులాలు, మతాలను రెచ్చగొట్టిలా వీడియోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాల్లో షేర్ చేస్తున్నారని, వాటిని స్పందించవద్దని తెలిపారు. కొంత మంది టెక్నాలజీని ఉపయోగించి ఎక్కడో జరిగిన వీడియోలను మన ప్రాంతంలో జరిగినట్లు గ్రూపుల్లో షేర్ చేసి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడతారని, ఇలాంటి విషయాల్లో గ్రూప్ అడ్మిన్లు అప్రమత్తంగా ఉండాలని లేకుంటే వారిని బాధ్యులుగా చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లెక్కింపు తర్వాత కూడా జిల్లాలో సెక్షన్ 144 అమల్లో ఉంటుందన్నారు. ఆర్వో పర్మిషన్ తీసుకున్న తర్వాతే ర్యాలీలకు అనుమతి ఉంటుందన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించారు. కనిగిరి డివిజన్లో సీఎస్పురం, వెలిగండ్లలో చిన్న చిన్న ఘటనలు తప్ప ఎలాంటి గొడవలు లేవన్నారు. ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత అయినా, లెక్కింపు తర్వాత అయినా ఎలాంటి ఘటనలు జరగకుండా అన్ని రాజకీయ పార్టీల నాయకులు సంయమనం పాటించాలన్నారు. ఎక్కడ ఏ చిన్న సమస్య జరుగుతున్నట్లు తెలిసినా, రెచ్చగొట్టే కార్యక్రమాలకు పూనుకుంటున్నా..వెంటనే పోలీస్ శాఖకు సమాచారం అందిస్తే తక్షణం స్పందించి సహకారం అందించి చర్యలు తీసుకుంటామన్నారు. ఇరుపార్టీల రాజకీయ నాయకులు శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలని ఎస్పీ కోరారు. కార్యక్రమంలో పోలీస్ డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. ఎన్నికల నిబంధనావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు చట్టవ్యతిరేక చర్యలు, రెచ్చగొట్టే వీడియోలు పోస్టు చేస్తే సహించం గ్రామాల్లో అనుమానితులు కనిపిస్తే సమాచారం ఇవ్వండి ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ -
పరీక్షలకు 11,797 మంది హాజరు
ఒంగోలు: ఇంటర్, పది పరీక్షలకు 11,797 మంది విద్యార్థులు హాజరయ్యారు. బుధవారం ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు 43 సెంటర్లు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు 28 సెంటర్లు, పదో తరగతి పరీక్షలు 22 సెంటర్లలోను జరిగాయి. ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షకు 8459 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 7709 మంది హాజరయ్యారు. ద్వితీయ సంవత్సరం ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షకు 2810 మందికి గాను 2539 మంది హాజరయ్యారని ఆర్ఐఓ ఎ.సైమన్ విక్టర్ తెలిపారు. పదో తరగతి ఫిజిక్స్ పరీక్షకు సంబంధించి 2538 మంది విద్యార్థులకు గాను 1549మంది మాత్రమే హాజరయ్యారు. పరీక్షలు పూర్తి ప్రశాంత వాతావరణంలో నిర్వహించినట్లు తెలిపారు. ఉపాధి కూలీల సంఖ్య పెంచాలి ● డ్వామా పీడీ అర్జున్రావు చీమకుర్తి: ఉపాధి కూలీల సంఖ్యను పెంచేలా చర్యలు తీసుకోవాలని డ్వామా పీడీ అర్జున్రావు, ఏపీడీ వెంకటస్వామి తెలిపారు. సంతనూతలపాడు మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం సంతనూతలపాడు, మద్దిపాడు, చీమకుర్తి మండలాల పరిధిలో పనిచేసే ఉపాధి సిబ్బందితో సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఉపాధి కూలీలకు జీతం, రోజుల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వేసవిలో పనిచేసే ప్రదేశంలో నీడ ఏర్పాటు చేయాలని, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందించాలని, మెడికల్ కిట్స్ను సిద్ధంగా ఉంచాలని తెలిపారు. ఉపాధి పనుల్లో చెరువులు, కుంటలే కాకుండా రైతులకు ఉపయోగపడే ఫారంపాండ్స్ను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలను పంపిస్తే మంజూరు చేయిస్తామన్నారు. ఉద్యానవన శాఖ కింద రైతులకు పండ్లతోటలను ఏర్పాటు చేసుకునే వెసులుబాటు కల్పించామని పేర్కొన్నారు. అమృత్ సరోవర్ ట్యాంక్లను ఏర్పాటు చేయటంతో పాటు రైతలుకు ఉపయోగపడే పనులను ఉపాధి పనులలో కల్పించేలా ప్రణాళికలను ఏర్పాటు చేయాలన్నారు. ఎంపీడీఓ, ఏపీఓ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఆటో బోల్తా 14 మందికి గాయాలు కొండపి(సింగరాయకొండ): ఆటో బోల్తా పడి 14 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని పెద్దకళ్లగుంట గ్రామంలో బుధవారం ఉదయం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం,..అనకర్లపూడి దళితవాడకు చెందిన కూలీలు మిరప కోతకు జరుగుమల్లి మండలం పీరాపురం గ్రామానికి ఆటోలో బయలుదేరారు. ఆటో పెద్దకళ్లగుంట గ్రామం హైస్కూల్ సమీపంలోకి రాగానే పంది అడ్డు రాగా దాన్ని తప్పించే క్రమంలో ఆటో డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో బోల్తా పడింది. ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న కూలీలకు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను బయటకు తీసి మరో ఆటోలో ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. కూలీలకు స్వల్ప గాయాలు కావడంతో కుటుంబసభ్యులు, బంధువులు ఊపిరి పీల్చుకున్నారు. -
పోస్టల్ బ్యాలెట్లకు రక్షణ కరువు
యర్రగొండపాలెం: యర్రగొండపాలెం ఆర్వో కార్యాలయంలో భద్రపరచిన పోస్టల్ బ్యాలెట్లకు రక్షణ కరువైంది. సెక్యూరిటీగా నియమించిన ఏఆర్ పోలీసులు మద్యం తాగి ఘర్షణకు దిగిన సంఘటన మంగళవారం రాత్రి జరగ్గా ఆలస్యంగా వెలుగుచూసింది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ నెల 4 నుంచి 9వ తేదీ వరకు వృద్ధులతోపాటు ఎన్నికల విధులను నిర్వర్తించే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రక్రియ ఏర్పాటు చేశారు. పోలైన బ్యాలెట్లను ఆర్వో కార్యాలయంలో భద్రపరిచారు. వీటిని జూన్ 4వ తేదీన జరిగే కౌంటింగ్కు ఒక రోజు ముందు ఒంగోలుకు తరలిస్తారు. అప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్ బాక్సులను భద్రపరిచిన ఆర్వో కార్యాలయానికి భద్రతగా ఏఆర్ పోలీసులు, లోకల్ పోలీసులు 3 బ్యాచ్లుగా విధులు నిర్వర్తించాల్సి ఉంది. వీరిలో పోస్టల్ బ్యాలెట్ భద్రపరచిన గదికి సెక్యూరిటీగా ఉన్న ఏఆర్ పోలీసులు మద్యం తాగి అనునిత్యం గొడవకు దిగుతుంటారని ఆ ప్రాంతం వాసులు తెలిపారు. మంగళవారం రాత్రి వారు గొడవపడుతున్న సంఘటనను తెలుసుకున్న ఎస్సై సుదర్శన్ ఆర్వో కార్యాలయానికి వెళ్లారు. అక్కడ వారిని బ్రీత్ ఎనలైజర్తో పరీక్షలు నిర్వహించినట్లు తెలిసింది. వారిద్దరినీ విధుల నుంచి తప్పించి లోకల్ పోలీసులను సెక్యూరిటీగా నియమించారు. ఈ విషయం గురించి ఎస్సైను ప్రశ్నించగా రోజు వారి తనిఖీల్లో భాగంగా పోస్టల్ బ్యాలెట్లు భద్రపరచిన ఆర్వో కార్యాలయం వద్దకు వెళ్లినట్లు ఆయన తెలిపారు. ఆలస్యంగా వచ్చిన సెక్యూరిటీ గార్డులను తొలగించి వారి స్థానంలో ఇతరులను ఏర్పాటు చేశామని, వారు మద్యం తాగి గొడవలకు దిగలేదని, వారిని బ్రీత్ ఎనలైజర్తో పరీక్షలు చేయలేదని ఆయన తెలిపారు. ఏడుగురు సెక్యూరిటీగా విధులు నిర్వర్తిస్తున్న వారిలో ఇద్దరు ఆలస్యంగా డ్యూటీకి వచ్చారని, వారిని విధుల నుంచి తప్పించడంలో మర్మమేమిటో అర్థం కావడంలేదు. మద్యం తాగి ఘర్షణపడిన సెక్యూరిటీ బ్రీత్ ఎనలైజర్తో పరీక్షలు నిర్వహించిన ఎస్సై -
జిల్లాలో బుధవారం నమోదైన
ఉష్ణోగ్రతల వివరాలు గరిష్టం కనిష్టం ఒంగోలు 43 31 మార్కాపురం 42 31 దర్శి 41 31 కనిగిరి 41 31 బేస్తవారిపేట 41 31 యర్రగొండపాలెం 41 31 సింగరాయకొండ 41 31 చీమకుర్తి 41 32 ప్రజలు అప్రమత్తంగా ఉండాలి పెరుగుతున్న ఎండలు, వేడిగాలుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఉపాధి పనులకు వచ్చే ప్రజలకు ఓఆర్ఎస్లు ఇస్తున్నాం. ప్రజలు కూడా ఎండ తీవ్రత పెరగకముందే బయట పనులు చూసుకుని ఇళ్లకు చేరుకోవాలి. తిరిగి సాయంత్రం మాత్రమే బయటకు రావాలి. ఒకవేళ బయటకు రావల్సి వస్తే తగిన జాగ్రత్తలు పాటించి ఎండల నుంచి రక్షణ పొందాలి. ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవడంతో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకుని బయటకు వస్తే వడదెబ్బ, డీహైడ్రేషన్ నుంచి రక్షణ పొందవచ్చు. ప్రభుత్వ యంత్రాంగం నుంచి ఎండ తీవ్రతకు ప్రజలకు రక్షణ కల్పించాల్సిన చర్యలు తీసుకున్నాం. ప్రజలు కూడా అవగాహనతో ముందస్తు జాగ్రత్తలు వహించాలి. దాతలు ముందుకొచ్చి రహదారుల వెంట చలివేంద్రాలు, వడగాల్పుల ఉపశమన కేంద్రాలు ఏర్పాటు చేయాలి. వడదెబ్బలు తగిలినా ప్రజలను రక్షించేందుకు వైద్య ఆరోగ్య శాఖను అప్రమత్తం చేశాం. తగిన ఔషధాలు, ఇతర సౌకర్యాలతో సిద్ధంగా ఉంచాం. – ఏఎస్ దినేష్కుమార్, కలెక్టర్ -
ప్రకాశం
42/317గరిష్టం/కనిష్టంశాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించం ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.నేర్చుకుందాం రండి మార్కాపురం పట్టణంలోని కోడిరామ్మూర్తి నట శిక్షణ సంస్థ విద్యార్థులకు వివిధ క్రీడలు, ఇతర విభాగాల్లో శిక్షణ ఇస్తోంది. విద్యార్థులు కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు.వాతావరణం ఎండ తీవ్రత పెరుగుతుంది. వాతావరణం ఉక్కపోతగా ఉంటుంది. వడగాలులు వీస్తాయి. – 8లో.. గురువారం శ్రీ 30 శ్రీ మే శ్రీ 2024 -
ఘర్షణలు జరగకుండా పటిష్టమైన చర్యలు
● గుంటూరు రేంజి ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి ఒంగోలు టౌన్: జూన్ 4వ తేదీ జరిగే ఓట్ల లెక్కింపు తరువాత ఎలాంటి అవాంఛనీయ ఘటసలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని గుంటూరు రేంజీ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి ఆదేశించారు. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో జిల్లా పోలీసు కార్యాలయంలో ఒంగోలు సబ్ డివిజన్ పోలీసు అధికారులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సబ్ డివిజన్ పరిధిలోని పలు గ్రామాల తాజా పరిస్థితులు, పోలింగ్ రోజున జరిగిన సంఘటనలపై ఆరా తీశారు. ఆయా గ్రామాలను తరచుగా సందర్శించాలని, శాంతి భద్రతలు లోపించకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామాలు, కాలనీల్లో సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాలని చెప్పారు. ఓట్ల లెక్కింపు రోజున సెక్షన్ 144 సీఆర్పీసీ అమలు చేయాలని, గ్రామాల్లో, కాలనీల్లోని ముఖ్య కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు.చెక్ పోస్టుల వద్ద వాహనాలను తనిఖీ చేయాలని, ఎన్నికల కౌంటింగ్కు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. స్ట్రాంగ్ రూంను సందర్శించిన ఐజీ.. రైస్ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలను గుంటూరు రేంజి ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్తో కలిసి సందర్శించారు. అడిషనల్ ఎస్పీ (క్రైం) శ్రీధర్ రావు, అడిషనల్ ఎస్పీ రవి వర్మ (సీఐడీ), డీఎస్పీ యం.కిశోర్ బాబు, సీఐడీ డీఎస్పీలు సీహెచ్ వెంకటేశ్వరరావు, యం.మోహన్రావు, ట్రైనీ డీఎస్పీ షేక్ షహబాజ్ , సీఐలు, ఎస్లు పాల్గొన్నారు. -
మార్కుల జాబితాలో తప్పులుంటే స్పందించాలి
ఒంగోలు: పదో తరగతి మార్కుల జాబితా (2023–24 సంవత్సరం) లో ఏవైనా తప్పులు దొర్లి ఉంటే విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రధానోపాధ్యాయులు తక్షణమే సంప్రదించాలని డీఈవో డి.సుభద్ర బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్, విజయవాడ కార్యాలయంలోని జి.మాణిక్యాంబ సెల్:9949510766 ను సంప్రదించాలన్నారు. ఏకేయూలో పీహెచ్డీ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం ఒంగోలు: ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయంలో యూజీసీ–నెట్/యూజీసీ–సీఎస్ఐఆర్–నెట్/గేట్/సీడ్, ఇటువంటి జాతీయ స్థాయి పరీక్షల్లో స్కాలర్షిప్/ఫెలోషిప్ అర్హత పొందిన విద్యార్థులకు 2024–25 విద్యా సంవత్సరానికి పీహెచ్డీలో ప్రవేశాలకు కేవలం ఇంటర్వ్యూ ద్వారా ప్రవేశం పొందేందుకు జూన్ 4వ తేదీ వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ జి.సోమశేఖర బుధవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఇతర వివరాలకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏకేయూప్రకాశం.ఏసీ.ఇన్ వెబ్సైట్ను సందర్శించాలని, లేదా మొబైల్ నంబర్ 8341935856ను సంప్రదించాలన్నారు. పొగాకు అత్యధిక ధర కేజీ రూ.323 కొండపి (సింగరాయకొండ): కొండపి స్థానిక పొగాకు వేలం కేంద్రంలో బుధవారం నిర్వహించిన వేలంలో పొగాకు అత్యధిక ధర కేజీ రూ.323 పలికిందని వేలం నిర్వహణాధికారి జి.సునీల్ కుమార్ తెలిపారు. వ్యాపారులు అక్కచెరువుపాలెం, గోగినేనివారిపాలెం, పైడిపాడు గ్రామాలకు చెందిన రైతులు 961 బేళ్లు తీసుకురాగా 878 బేళ్లు కొనుగోలయ్యాయి. వ్యాపారులు వివిధ కారణాలతో 83 బేళ్లను తిరస్కరించారు. గరిష్ట ధర రూ.323, కనిష్ట ధర రూ.205, సరాసరి ధర రూ.267.55. వేలంలో 24 మంది వ్యాపారులు పాల్గొన్నారు. ఈ సీజన్లో ఇప్పటి వరకు నిర్వహించిన వేలంలో బుధవారం అత్యధిక ధర రైతులకు దక్కిందన్నారు. భైరవకోన ఆలయ దుకాణాల వేలానికి రూ.20.68 లక్షలు సీఎస్పురం (పామూరు): మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం, పుణ్యక్షేత్రం భైరవకోనలో 4 రకాల దుకాణాల నిర్వహణకు బుధవారం వేలం నిర్వహించగా ఆలయానికి రూ.20.68 లక్షల ఆదాయం వచ్చినట్లు ఈఓ నర్రా నారాయణరెడ్డి, ఆలయ చైర్మన్ సిద్దు రమణారెడ్డి తెలిపారు. స్థానిక కార్యాలయం వద్ద నిర్వహించిన వేలంలో వాహన పార్కింగ్ రుసుము వసూళ్ల హక్కు కోసం రూ.8.10 లక్షలు, కొబ్బరికాయలు, ఇతర పూజా సామగ్రి అమ్ముకునే హక్కు కోసం రూ.9.58 లక్షలు, కూల్డ్రింక్స్, ఐస్క్రీమ్స్ విక్రయించే దుకాణాల హక్కు కోసం రూ.2 లక్షలు, తలనీలాలు పోగుచేసుకునే హక్కు కోసం రూ.లక్ష మొత్తం రూ.20.68 లక్షలు ఆదాయం కాగా గత ఏడాది కంటే రూ.2.70 లక్షలు అదనపు ఆదాయం వచ్చినట్లు తెలిపారు. వేలంలో హక్కు పొందినవారు వచ్చే జూన్ 01వ తేదీ నుంచి 2025 మే నెల 31వ తేదీ దాకా దుకాణాలు నిర్వహించుకునే అవకాశం ఉంటుందన్నారు. మరికొన్ని రకాల వస్తువుల విక్రయ దుకాణాల కోసం త్వరలో వేలం నిర్వహిస్తామని ఈఓ, చైర్మన్లు తెలిపారు. కార్యక్రమంలో బసిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. పీసీపల్లి పీఎస్కు ఎస్పీ ప్రశంస పీసీపల్లి: ఇటీవల జరిగిన ఎన్నికల్లో సమర్ధవంతంగా విధులు నిర్వహించిన పోలీస్ సిబ్బందికి ప్రకాశం జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ నునీల్ బుధవారం ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కనిగిరి పవిత్ర కన్వెన్షన్లో కౌంటింగ్ సిబ్బంది, పొలిటికల్ లీడర్స్తో ఎస్పీ సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం ఎన్నికల విధులు సమర్ధవంతంగా నిర్వహించిన పోలీస్ సిబ్బందికి ప్రశంస పత్రాలు అందజేశారు. అందులో భాగంగా పీసీపల్లి పీఎస్ సిబ్బంది ఎం.రామచంద్రారెడ్డి, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్కు ప్రశంసపత్రాలు అందజేసి ఇదేవిధంగా కౌంటింగ్ విధులు సమర్ధంగా నిర్వహించాలని సూచించారు. -
కౌంటింగ్ ఏర్పాట్లు 30 నాటికి పూర్తి చేయాలి
ఒంగోలు అర్బన్: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జూన్ 4వ తేదీ జరిగే కౌంటింగ్ ప్రక్రియ ఏర్పాట్లు ఈ నెల 30వ తేదీ నాటికి ఎట్టి పరిస్థితిల్లో పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.దినేష్కుమార్ స్పష్టం చేశారు. బుధవారం రైజ్ ఇంజినీరింగ్ కాలేజి ఆడిటోరియంలో అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. దీనిలో కలెక్టర్ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా పకడ్బందీగా నిర్వహించాలన్నారు. కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి టేబుల్స్ ఏర్పాటు, బారికేట్లు, సీసీ టీవీ ఏర్పాట్లు, పబ్లిక్ అడ్రస్ సిస్టం, ఎన్నికల ఫలితాల డేటా నమోదు తదితర ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టాలన్నారు. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు వివరాలను ఎప్పటికప్పుడు జాగ్రత్తగా నమోదు చేయాలని క్రాస్చెక్ చేసే బృందం నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మార్గదర్శకాల మేరకు ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా ఓట్ల లెక్కింపు జరగాలన్నారు. కౌంటింగ్కు వచ్చే అభ్యర్థులు, ఏజెంట్లు, సిబ్బంది వారి నియోజకవర్గాల కౌంటింగ్ కేంద్రాలకు సులభంగా వెళ్లేలా సైన్బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణతో కలిసి కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లను పరిశీలించారు. సమావేశంలో మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్మీనా, డీఆర్ఓ శ్రీలత, ఒంగోలు, కొండపి, దర్శి, కనిగిరి, గిద్దలూరు, వైపాలెం నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు సుబ్బారెడ్డి, కుమార్, లోకేశ్వరరావు, జాన్ ఇర్విన్, నాగజ్యోతి, శ్రీలేఖ, ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ విశ్వేశ్వరరావు, డీటీసీ సుశీల, హౌసింగ్ పీడీ పేరయ్య, ఆర్అండ్బీ ఎస్ఈ దేవానందం ఇతర అధికారులు పాల్గొన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి కలెక్టర్ దినేష్కుమార్ -
ఓట్ల లెక్కింపు ఫలితాలు సాయంత్రం 5 గంటలకు..
● కలెక్టర్,జిల్లా ఎన్నికల అధికారిఏఎస్.దినేష్కుమార్ ఒంగోలు సిటీ: ఓట్ల లెక్కింపు ఫలితాలను సాయంత్రం 5 గంటలకల్లా విడుదల చేసేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఏఎస్.దినేష్కుమార్ చెప్పారు. కౌంటింగ్ నిర్వహణకు తీసుకుంటున్న చర్యలపై బుధవారం ఢిల్లీ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్కుమార్ వ్యాస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కౌంటింగ్ నిర్వహణకు జిల్లా యంత్రాంగం చేస్తున్న ఏర్పాట్లపై కలెక్టర్ దినేష్కుమార్ వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి 14 టేబుల్స్ వేస్తున్నామని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కోసం పార్లమెంట్ నియోజకవర్గానికి 40, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదు చొప్పున టేబుల్స్ వేస్తున్నామని తెలిపారు. సాయంత్రం ఐదు గంటలకల్లా ఫలితాలు వెల్లడించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ మాట్లాడుతూ కౌంటింగ్ కేంద్ర ప్రాంగణానికి మూడంచెల భద్రత కల్పిస్తున్నామని చెప్పారు. ఎన్నికలకు ముందు, పోలింగ్ రోజున హింసాత్మక ఘటనలపై నితీష్కుమార్ ఆరా తీయగా, ఈవీఎంల డ్యామేజీకి కారణమైన వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపించామని తెలిపారు. నియోజకవర్గాల వారీగా కౌంటింగ్కు చేపడుతున్న ఏర్పాట్లపై మార్కాపురం ఆర్వో రాహుల్మీనా, ఒంగోలు ఆర్వో జి.వి.సుబ్బారెడ్డి, డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్కు వివరించారు. జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ, మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్మీనా, ఆర్వోలు పాల్గొన్నారు. -
అయ్య బాబోయ్..
రోహిణి కార్తె ప్రభావం..జిల్లాలో ఎండలు అల్లాడిస్తున్నాయి. ఉదయం ఏడు గంటల నుంచే భానుడు ప్రతాపాన్ని చూపుతున్నాడు. రెండు రోజులుగా జిల్లాలో 45 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. వామ్మో ఇవేం ఎండలంటూ జనం బెంబేలెత్తుతున్నారు. ఒక వైపు వేడిగాలులు.. మరో వైపు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరో వారం రోజులపాటు ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఒంగోలు అర్బన్: జిల్లాలో రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. ఎండవేడి, ఉక్కపోతతో పాటు ఊపిరి ఆడని విధంగా వాతావరణం మారిపోయింది. ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జిల్లాలో 41 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో నిప్పుల కొలిమిలా మారింది. జనం బయటకు రాకపోవడంతో ఉదయం 11 గంటల నుంచే రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. జిల్లా కేంద్రం ఒంగోలులో మంగళవారం 44 డిగ్రీలు, బుధవారం 43 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. అత్యల్ప ఉష్ణోగ్రతలు సైతం 32 డిగ్రీల పైనే ఉండడంతో వాతావరణం వేడిగా మారుతోంది. రాత్రి పది గంటలకు సైతం వేడిగాలులు వీస్తుండడంతో ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. మార్కాపురంలో బుధవారం అత్యధికంగా 42 డిగ్రీలు నమోదు కాగా దర్శి, కనిగిరి, బేస్తవారిపేట, యర్రగొండపాలెం, సింగరాయకొండ, చీమకుర్తిల్లో 41 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం 7 గంటల నుంచే భానుడు ప్రతాపం చూపుతున్నాడు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. పైగా వేడి గాలులు వీస్తుండటంతో వడదెబ్బ తగిలే ప్రమాదం పొంచి ఉంది. అత్యవసర పనులకు సైతం బయటకు తిరగాలంటే ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరో వారం పాటు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పాటు వేడి గాలులు వీస్తాయని సంబంధిత అధికారులు తెలిపారు. పెరిగిన ఎండలు, వేడి గాలుల నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్పా బయటకు రావడం మంచిది కాదని అటు అధికార యంత్రాంగం, వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఉదయం 11 గంటల లోపు పనులు చూసుకుని ఎండ తీవ్రత తగ్గిన తర్వాత సాయంత్రం సమయంలో మాత్రమే బయటకు రావాలని సూచిస్తున్నారు. ఒక వేళ అవసరం రీత్యా బయటకు వచ్చినా తాగునీరు, ఓఆర్ఎస్ వంటివి అందుబాటులో ఉంచుకోవాలని, తలపై టోపీ లేదా గొడుగు వంటివి వినియోగించాలని సూచిస్తున్నారు. డీహైడ్రేషన్, వడదెబ్బ తగలకుండా తాగునీరు, కొబ్బరినీళ్లు, గ్లూకోజ్, ఓఆర్ఎస్, మజ్జిగ, పండ్ల రసాలు వంటివి ఎక్కువగా తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు మరింత జాగ్రత్తలు వహించాలని, వడగాలులు, వేడి వాతావరణానికి దూరంగా ఉంచాలని వైద్యులు అంటున్నారు. ఎండ తీవ్రతకు తల తిరిగినా, నోరు పొడిబారిపోయినా, వడదెబ్బ తగిలినట్లు అనుమానం వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స పొందాలని వైద్యులు సూచిస్తున్నారు. పెరిగిన విద్యుత్ వినియోగం అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో జిల్లాలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. వేడి ఉపశమనంకోసం ఏసీలు, కూలర్లు, ఫ్యానులు వాడకం ఎక్కువైంది. జిల్లాలో సాధారణంగా 9 మిలియన్ యూనిట్లు వినియోగం ఉండగా ప్రస్తుతం 10.50 మిలియన్ యూనిట్లకు పెరిగినట్టు అధికారులు చెబుతున్నారు. మరికొన్ని రోజులు ఎండల తీవ్రత ఇదే ఉంటుందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తుండడంతో కరెంటె వాడకం మరింత పెరిగే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు. నిప్పులు చిమ్ముతున్న సూరీడు రోహిణికార్తె ప్రభావంతో ఠారెత్తిస్తున్న ఎండలు వేడి సెగలు, ఉక్కపోతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి ఉదయం 7 గంటల నుంచే సెగలు జిల్లాలో 41 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు -
కొండపి గడ్డపై వైఎస్సార్ సీపీ జెండా
సింగరాయకొండ: కొండపి గడ్డపై వైఎస్సార్సీపీ జెండా ఎగరటం ఖాయమని జూన్ 4వ తేదీ సంబరాలు జరుపుకోవటమే తరువాయని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ధీమా వ్యక్తం చేశారు. స్థానిక మంత్రి సురేష్ క్యాంపు కార్యాలయంలో బుధవారం సాయంత్రం కౌంటింగ్ ఏజెంట్లతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో అల్లర్లు జరిగాయని, కానీ కొండపి నియోజకవర్గంలో ఎన్నికలు సజావుగా సాగటంలో నాయకులు, కార్యకర్తలు చూపిన సంయమనం మరువలేనిదని కొనియాడారు. రాష్ట్రంతో పాటు కొండపి నియోజకవర్గంలో పోలింగ్ శాతం పెరగటం పార్టీ అభ్యర్థులకు కలిసొచ్చే అంశం అని చెప్పారు. ఈ ఎన్నికల్లో మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఓటింగ్లో పాల్గొన్నారన్నారు. జిల్లా స్థాయిలో కొండపి నియోజకవర్గంలో మరే నియోజకవర్గంలో జరగని విధంగా మధ్యాహ్నం 12 గంటలకు 52 నుంచి 54 శాతం పోలింగ్ శాతం నమోదవటం శుభ పరిణామమన్నారు. అన్ని మండలాల్లో పోలింగ్ శాతం గణనీయంగా పెరిగిందని చెప్పారు. ఓటరు నాడి నాయకులు, కార్యకర్తలకే తెలుస్తుందన్నారు. అయితే ప్రతిపక్షం మాత్రం తాము గెలుస్తామని హడావుడి చేస్తోందని, పార్టీ నాయకులు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. మంచి సుపరిపాలన అందించిన ప్రభుత్వంగా వైఎస్సార్ సీపీ ప్రజల్లో గుర్తింపు సాధించిందని, పార్టీ కేడర్ కూడా అభ్యర్థుల గెలుపునకు చిత్తశుద్ధితో పనిచేశారని ప్రశంసించారు. పోలింగ్ సమయంలో ప్రజల్లో ప్రభుత్వం పై సానుకూల ధోరణి కనబడిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పినట్లు 160 సీట్లు గెలవటం ఖాయమన్నారు. కౌంటింగ్ రోజు గెలుపొందిన జాబితాలో ప్రకటించే మొదటి 50 స్థానాల్లో కొండపి ఒకటని మంత్రి సురేష్ ధీమా వ్యక్తం చేశారు. తాను అనారోగ్య కారణాల వలన కొద్దిరోజులు ప్రజలకు దూరంగా ఉన్నానన్నారు. ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ పూర్తయిందని, ఇక కౌంటింగ్ ప్రక్రియపై దృష్టి సారించాలన్నారు. కౌంటింగ్ సమయంలో ఏజెంట్లు ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా సంయమనం పాటించి అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలన్నారు. పార్టీ వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బత్తుల అశోక్ కుమార్రెడ్డి, పార్టీ ఎన్నికల పరిశీలకుడు రాచగర్ల పిచ్చయ్య యాదవ్, పార్టీ మండల అధ్యక్షుడు, వైస్ ఎంపీపీ సామంతుల రవికుమార్రెడ్డి, బత్తిన మదనమనోహర్రావు, దద్దాల మల్లికార్జునరావు, జేసీఎస్ కన్వీనర్ పిల్లి తిరుపతిరెడ్డి, తాటికొండ రామచంద్రరావు, పార్టీ రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి యన్నాబత్తిన చిన్నా, వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ యనమల మాధవి, ఎంబీసీ కార్పొరేషన్ డైరెక్టర్ పుట్టా వెంకట్రావ్, జెడ్పీటీసీ బెజవాడ వెంకటేశ్వర్లు, మారెడ్డి వెంకటాద్రి, మాచేపల్లి నాగయ్య, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కౌంటింగ్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండి సంయమనం పాటించండి 4వ తేదీ సంబరాలు జరుపుకుందాం రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ -
జగన్ మళ్లీ సీఎం కావాలని పాదయాత్ర
పుల్లలచెరువు: వైస్ జగన్మోహన్రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలంటూ వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా సభ్యులు మంగళవారం పుల్లలచెరువు నుంచి శ్రీశైలంకు పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రను రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఉడుముల శ్రీనివాసరెడ్డి సతీమణి అరుణారెడ్డి జెండాను ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా టీంసభ్యుడు చెన్నయ్య మాట్లాడుతూ స్వామి దయతో జగన్మోహన్రెడ్డి మళ్లీ సీఎం కావాలని, ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, ఎమ్మెల్యేగా తాటిపర్తి చంద్రశేఖర్లను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని శ్రీశైలం వరకు పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఉడుముల శ్రీనివాసరెడ్డి, ఎంపీపీ కందుల వెంకటయ్య, ఉపాధ్యక్షుడు రవణారెడ్డి, సచివాలయ మండల కన్వీనర్ డి. వెంకటేశ్వర్లు, ఎంఎల్ఓ వాసు, పీఏసీఎస్ డైరెకర్ట్ రఘు, నాయకులు రోసిరెడ్డి, కాశయ్య, ఎల్. ప్రసాద్, యోగిరెడ్డి, నాసర్రెడ్డి, వీరారెడ్డి, బంగారురెడ్డి, యలయ్య, మహిళ నాయకురాలు రవణమ్మ, నాగరాజు, టీం సభ్యులు నరసింహారావు, నాగరాజు, నరసయ్య, వెంకటనారాయణ, బ్రహ్మంనాయక్ పాల్గొన్నారు. -
అందిన 1718 సర్వీసు ఓట్లు
ఒంగోలు అర్బన్: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సర్వీసు ఓట్లకు సంబంధించి మంగళవారం నాటికి జిల్లాకు 1718 ఓట్లు రిజిస్టర్ పోస్టు ద్వారా చేరాయి. పోస్టల్ బ్యాలెట్ పార్లమెంట్ ప్రత్యేక అధికారి ఝాన్సీ మంగళవారం పోస్టు ద్వారా వచ్చిన సర్వీసు ఓట్లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో బాక్సులో వేసి భద్రపరిచారు. జిల్లాలో మొత్తం 6693 సర్వీసు ఓట్లు ఉన్నాయి. దీనిలో వైఎస్ఆర్ సీపీ ప్రతినిధి దామరాజు క్రాంతికుమార్, ఇతర పార్టీల ప్రతినిధులు రసూల్, రాజశేఖర్, శ్రీకాంత్, సూర్య తదితరులు పాల్గొన్నారు. క్యాన్సర్పై పూర్తి అవగాహన అవసరం ● వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏడుకొండలు ఒంగోలు టౌన్: జిల్లాలోని వైద్య సిబ్బంది క్యాన్సర్ వ్యాధిపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏడుకొండలు అన్నారు. మెడికల్ కళాశాలలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ గైనకాలజిస్టులు, డెంటిస్టులకు మూడు రోజుల క్యాన్సర్ స్క్రీనింగ్ శిక్షణ మంగళవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఆహారపు అలవాట్లు, వ్యక్తిగత అలవాట్లతో అనేక మంది క్యాన్సర్ బారిన పడుతున్నారని చెప్పారు. క్యాన్సర్ వ్యాధిని కట్టడి చేసే లక్ష్యంతో ప్రభుత్వం శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. ప్రపంచ స్థాయిలో జరుగుతున్న ప్రయోగాలు, వాటి ఫలితాలను వైద్యులు తెలుసుకునే అవకాశం ఉందన్నారు. జిల్లాలోని ప్రభుత్వ వైద్య సిబ్బంది పూర్తిగా శిక్షణ పొందేలా తగిన చర్యలు తీసుకుంటామని, కింది స్థాయి సిబ్బందిని కూడా ఇందులో పాల్గొనేలా చూస్తామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ సురేష్ కుమార్ తెలిపారు. జిల్లాలో క్యాన్సర్కు సంబంధించిన సమాచారం ఇప్పటి వరకు లేదని, ఈ స్క్రీనింగ్తో పూర్తి డేటా లభ్యమౌతుందని చెప్పారు. దీని వల్ల అనేక పరిశోధనలకు ఉపయోగపడుతుందని వైద్య విధాన పరిషత్ కో ఆర్డినేటర్ డాక్టర్ మూర్తి అన్నారు. వైద్యులు క్యాన్సర్ వ్యాధికి సంబందించి ఎప్పటికప్పుడు అధ్యయనం చేయాలని జీజీహెచ్ సూపరెండెంట్ డాక్టర్ దుర్గాదేవి సూచించారు. ఓరల్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, సెర్వికల్ క్యాన్సర్ ఉన్న వారిని ప్రథమ దశలోనే గుర్తించేందుకు ఎంఎల్హెచ్పీ , ఏఎన్ఎంలు కృషి చేయాలన్నారు. సకాలంలో గుర్తించిన రోగులను అంకాలజీ విభాగానికి రెఫర్ చేస్తే తగిన వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య చికిత్స చేయడం ద్వారా బాధితులు ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందన్నారు. నోడల్ ఆఫీసర్ డాక్టర్ భగీరథి, డాక్టర్ తిరుమలరావు, డెంటల్ హెచ్ఓడీ డాక్టర్ కిరణ్, అంకాలజిస్ట్ డాక్టర్ కిషన్ పాల్గొన్నారు. నీటి నిల్వల్లో ఆయిల్బాల్స్ వేయాలి● డీఎంహెచ్ఓ డాక్టర్ సురేష్ కుమార్ఒంగోలు టౌన్: సీజనల్ వ్యాధులతో పాటుగా డెంగీ, మలేరియా, చికెన్గున్యా వ్యాధులు ప్రబలకుండా నీటి నిల్వల్లో ఆయిల్ బాల్స్ వేయాలని డీఎంహెచ్ఓ డాక్టర్ సురేష్ కుమార్ ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో మంగళవారం సబ్ యూనిట్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డెంగీ, మలేరియా కేసులకు ఏఎల్ఓ, ఐఎస్స్ ఫాగింగ్ కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. ఆయా ప్రాంతాలలోని పంచాయతీ కార్యదర్శులను సమన్వయం చేసుకొని పారిశుధ్య పనులు చేపట్టాలన్నారు. ప్రతి శుక్రవారం తప్పనిసరిగా డ్రైడేగా నిర్వహించాలని, ప్రతి సోమ, మంగళవారాలు వెక్టర్ కంట్రోల్ హైజిన్ యాప్లో సమస్యలను తెలియజేయాలన్నారు. ఎన్వీబీడీసీపీ కార్యక్రమం నిర్వహణ సక్రమంగా జరిగేందుకు ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక సూపర్వైజర్ను నోడల్ ఆఫీసర్గా నియమించాలని, సబ్ యూనిట్ పరిధిలోని అన్నీ మంచినీటి ట్యాంకులను 15 రోజులకు ఒకసారి క్లోరినేషన్ చేసేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా మలేరియా అధికారి డాక్టర్ మాధవీలత తదితరులు పాల్గొన్నారు. పొగాకు గరిష్ట ధర రూ.320 కొండపి (సింగరాయకొండ): స్థానిక పొగాకు వేలం కేంద్రంలో మంగళవారం నిర్వహించిన వేలంలో పొగాకు అత్యధిక ధర రూ. 320 పలికిందని వేలం నిర్వహణాధికారి జి.సునీల్ కుమార్ తెలిపారు. కామేపల్లి, పచ్చవ గ్రామాలకు చెందిన రైతులు 1141 బేళ్ళను తీసుకొని రాగా 985 బేళ్ళు కొనుగోలయ్యాయి. వ్యాపారులు వివిధ కారణాలతో 156 బేళ్ళ ను తిరస్కరించారు. గరిష్ట ధర రూ. 320, కనిష్ట ధర రూ. 205, సరాసరి ధర రూ. 251.60 పలకింది. బుధవారం నిర్వహించిన వేలంలో 23 మంది వ్యాపారులు పాల్గొన్నారు. -
పురుగుమందు తాగి వ్యక్తి ఆత్మహత్య
బేస్తవారిపేట: స్థానిక బీసీకాలనీకి చెందిన పూసలపాటి చిన్న శంకరయ్య(43) పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే..చిన్న శంకరయ్య గత రెండు మూడు నెలలుగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నాడు. మంగళగిరి ఎయిమ్స్ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. అయినా కడుపునొప్పి తగ్గకపోవడంతో మంగళవారం ఉదయం బాత్రూంలో పురుగుమందు తాగాడు. కుటుంబసభ్యులు గమనించి కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. శంకరయ్య మృతితో కుటుంబసభ్యులు బోరున విలపించారు. మృతుడికి భార్య వెంకటలక్ష్మి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెండు బైక్లు ఢీకొని ఒకరు మృతి ● మరో ఇద్దరి పరిస్థితి విషమం కనిగిరి రూరల్: రెండు బైక్లు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని చాకిరాల సమీపంలో మంగళవారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే..ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో డ్రైవర్గా పనిచేస్తున్న గంగవరపు అనురూప్(31) వెలిగండ్ల మండలం మొగుళ్లూరు నుంచి కనిగిరికి బైక్పై వస్తున్నాడు. కనిగిరి నుంచి చాకిరాలకు జడ్డు లక్ష్మీ నారాయణ, జడ్డు వెంకటేశ్వర్లులు టీవీఎస్ బైక్పై కనిగిరి నుంచి చాకిరాలకు వెళ్తున్నారు. ఈ రెండు బైక్లు ఎదురెదురుగా చాకిరాల ఎస్సీ కాలనీ సమీపంలోని బ్రిడ్జి వద్ద ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో జి. అనురూప్, జి.వెంకటేశ్వర్లు, జి.లక్ష్మీనారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వైద్యం కోసం తరలిస్తుండగా.. మార్గమధ్యంలో జి.అనురూప్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతునికి భార్య, ఏడాది బాబు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై టి. త్యాగరాజు తెలిపారు. రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి ఖలీల్వాడి: రైలులో నుంచి జారిపడి జిల్లాకు చెందిన యువకుడు నిజామాబాద్ జిల్లాలో మృతి చెందాడు. రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పొదిలి మండలం కంభాలపాడు గ్రామానికి చెందిన రవి(29) నిజామాబాద్లో కూలీ పనులు చేస్తున్నాడు. మంగళవారం ఉదయం రైలులో హైదరాబాద్ వెళ్తుండగా ఇందల్వాయి – సిర్నాపల్లి స్టేషన్ల మధ్యలో ప్రమాదవశాత్తు రైలులో నుంచి జారిపడి మృతి చెందాడు. మృతదేహాన్ని నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత
ఒంగోలు అర్బన్: ఈవీఎంలు భద్రపరిచిన రైజ్ కాలేజిలోనే జిల్లాలోని అన్నీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుందని ఆ ప్రాంతంలో మూడంచెల భద్రత కల్పించి సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంచామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ తెలిపారు. స్పందన భవనంలో మంగళవారం ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఏజెంట్లకు ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్తో కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. దీనిలో కలెక్టర్ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు రోజు ఉదయం 6 గంటలకు తప్పనిసరిగా అభ్యర్థులు, ఏజెంట్లు రైజ్ ఇంజినీరింగ్ కాలేజికి చేరుకోవాలన్నారు. కౌంటింగ్లో పాల్గొనే సిబ్బందికి ఇప్పటికే తగిన శిక్షణ ఇచ్చామన్నారు. కౌంటింగ్ ప్రాంగణంలోకి ప్రవేశించేందుకు సిబ్బందికి, చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లు, అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా బారికేడ్లు ఏర్పాటు చేశామన్నారు. స్ట్రాంగ్ రూము పక్కనే కౌంటింగ్ హాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అందులో ఆయా అభ్యర్థుల ఏజెంట్లకు ప్రత్యేకంగా సీటింగ్ ఏర్పాటు చేశామన్నారు. కౌంటింగ్ హాలులోకి ప్రవేశించేందుకు నియోజకవర్గాల వారీగా అభ్యర్థులకు, ఏజెంట్లకు ప్రత్యేక రంగుల్లో ఉండే గుర్తింపు కార్డులు ఇస్తున్నట్లు తెలిపారు. భద్రతా పరమైన సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ఉదయం 6 గంటలకే అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూములను ఓపెన్ చేస్తారన్నారు. ఏజెంట్లుగా ఉండే వారు జూన్ 1వ తేదీ లోపు దరఖాస్తు చేసుకుంటే గుర్తింపు కార్డులు ఇస్తామన్నారు. ప్రత్యేక టీ, భోజన విరామ సమయం లేకుండా నిరంతరం లెక్కింపు ప్రక్రియ కొనసాగేలా చర్యలు తీసుకున్నామన్నారు. పార్కింగ్, భోజన సదుపాయాల కోసం తీసుకున్న చర్యలను వివరించారు. ఎస్పీ మాట్లాడుతూ ట్రాఫిక్, భద్రతాపరంగా చేపడుతున్న చర్యలను వివరించారు. ఒంగోలు నుంచి నెల్లూరు వైపు వెళ్లే వాహనాలను దారి మళ్లించి జాతీయ రహదారిపై వన్వేలోనే రాకపోకలు సాగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రైజ్ కాలేజికి అర కిలోమీటరు ముందుగానే వాహనాలకు పార్కింగ్ సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు. వెహికల్, ఏజెంట్ పాసులు ఉన్న వారిని మాత్రమే కాలేజిలోకి అనుమతిస్తామన్నారు. తనిఖీలు, బందోబస్తు పరంగా పక్కాగా చర్యలు తీసుకున్నామన్నారు. కౌంటింగ్ కేంద్రం చుట్టుపక్కల ఎటువంటి బాణసంచా కాల్చడం కానీ, డ్రోన్ ఎగరవేయడం కానీ చేయకూడదన్నారు. కౌంటింగ్ ప్రాంగణంలో బ్రీత్ అనలైజర్ పరీక్షలు జరుపుతామన్నారు. అనంతరం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, ఈవీఎం ఓట్లు లెక్కించే విధానాన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. దీనిలో పార్లమెంట్ నియోజకవర్గ అధికారి ఝాన్సీలక్ష్మి, డీఆర్ఓ శ్రీలత, సంతనూతలపాడు రిటర్నింగ్ అధికారి గోపాలకృష్ణ, మార్కాపురం నియోజకవర్గ ఆర్ఓ రాహుల్ మీనా, మార్కాపురం వైఎస్సార్ సీపీ అభ్యర్థి అన్నా రాంబాబు పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. లెక్కింపు రోజు ఉదయం 6 గంటలకు అభ్యర్థులు, ఏజెంట్లు చేరుకోవాలి కలెక్టర్ దినేష్కుమార్ -
ఖరీఫ్కు సన్నద్ధం
నైరుతీ రుతుపవనాలు జూన్ మొదటి వారంలో రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయి..సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని సంకేతాలు రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే వ్యవసాయశాఖ ఖరీఫ్ ప్రణాళికను సిద్ధం చేసింది. 1,54,739 హెక్టార్లలో వివిధ రకాల పంటల సాగుకు లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు అవసరమైన విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచింది. రూ.18,659 కోట్ల రుణాలు సైతం అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఒంగోలు సెంట్రల్: ఈ ఏడాది ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ సిద్ధమైంది. జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో 1,50,082 హెక్టార్లలో 1,66,596 టన్నుల ఉత్పత్తి సాధన లక్ష్యంగా వ్యవసాయశాఖ ప్రణాళికలు రూపొందించింది. యాక్షన్ ప్లాన్ ఈ విధంగా ఉంది. ఆహార ధాన్యాలు 1,13,402 హెక్టార్లలో 1,32,960 టన్నులు పండించాలన్న లక్ష్యం పెట్టుకుంది. అత్యధికంగా కంది 82154 హెక్టార్లలో, పత్తి 33,000 హెక్టార్లలో, వరి 15100 హెక్టార్లలో సాగు చేయాలని నిర్ణయించింది. అలాగే రైతులకు రూ.2.39 కోట్ల విలువైన 8,893 క్వింటాళ్ల విత్తన ధాన్యాన్ని ఇవ్వనుంది. ఖరీఫ్కు మొత్తం 57,647 టన్నుల ఎరువులు అందుబాటులో ఉండగా అందులో 17,168 టన్నులు ఆర్బీకేల ద్వారా పంపిణీ చేయనుంది. 810 సీడ్స్, 750 ఎరువులు, 410 పురుగు మందులు డీలర్స్, అవుట్లెట్స్, తయారీదారుల నుంచి శాంపిల్స్ సేకరించింది. 38,659 మందికి కౌలుదారుల కార్డులు అందించింది. ఖరీఫ్ సీజన్లో రైతులకు, కౌలుదారులకు కలిపి రూ.18,659 కోట్ల మేర రుణాలు అందించాలని జిల్లా బ్యాంకర్స్ కమిటీ (డీఎల్బీసీ) నివేదించినట్లు వ్యవసాయశాఖ జేడీఏ ఎస్ శ్రీనివాసరావు తెలిపారు. వచ్చేనెల మొదటి వారంలో నైరుతీ రుతుపవనాలు ప్రవేశిస్తుండడం, సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని సంకేతాలు రావడంతో ఖరీఫ్లో రైతులకు సహాయ, సహకారాలు అందించాలని డివిజన్ల వారీగా అధికారులు సూచనలు చేసినట్టు చెప్పారు. సాగు ప్రణాళిక ఖరారు మొదటి వారంలో రుతు పవనాలు రాక వాతావరణం అనుకూలిస్తుందన్న సంకేతాలు మరింత సాగుకు రైతన్నకు ప్రోత్సాహం ఎరువులు అందుబాటులో ఇలా... ఖరీఫ్కు మొత్తం 57,647 టన్నుల ఎరువులు అందుబాటులో ఉండగా అందులో 17,168 టన్నులు ఆర్బీకేల ద్వారా పంపిణీ చేయనున్నారు. ఎరువు ఖరీఫ్–24 కేటాయింపు (టన్నుల్లో) యూరియా 16153 డీఏపీ 7352 ఎంఓపీ 951 ఎస్ఎస్పీ 3024 కాంప్లెక్స్ 30167 మొత్తం: 57647 -
విద్యా రంగంపై ప్రత్యేక శ్రద్ధ
ఒంగోలు అర్బన్: ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో ప్రమాణాలు మెరుగుపరిచి ఉత్తమ ఫలితాలు సాధించేలా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఫలితాలనిస్తోందని కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ అన్నారు. మంగళవారం సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హాస్టళ్లలో చదువుతూ పదో తరగతిలో 500 మార్కులపైగా సాధించిన విద్యార్థులను, ఆ దిశగా కృషి చేసి నూరు శాతం ఫలితాలు సాధించిన సంక్షేమ అధికారులను స్పందన భవనంలో కలెక్టర్ సత్కరించి విద్యార్థులకు ప్రతిభ అవార్డులు ప్రదానం చేశారు. దీనిలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు అనుగుణంగా జిల్లాలో విద్యార్థులకు వసతితో పాటు సురక్షితమైన వాతావరణంలో మెరుగైన విద్యా బోధన అందేలా చూస్తున్నామన్నారు. పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు సాధించిన ఫలితాలే అందుకు నిదర్శనమన్నారు. జిల్లాకు ఉన్న మానవ వనరులను వినియోగించుకోవడం వలనే మంచి ఫలితాలు వచ్చాయన్నారు. ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలు, టీచర్లు ఇస్తున్న మార్గాదర్శకాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలు చేరేలా చదువుపై శ్రద్ద వహించాలన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని హాస్టళ్లలో విద్యార్థులు 89.97 శాతం, బీసీ సంక్షేమ శాఖ హాస్టళ్లలో 93.53 శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు. పదో తరగతి పరీక్షలకు 650 మంది బీసీ విద్యార్థులు హాజరు కాగా 108 మంది 500పైగా మార్కులు సాధించారన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ విద్యార్థులు 887 మంది పరీక్షలకు హాజరైతే 76 మంది 500పైగా మార్కులు సాధించారన్నారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ అధికారి లక్ష్మానాయక్, గిరిజన సంక్షేమ అధికారి జగన్నాథరావు, బీసీ సంక్షేమ శాఖ అధికారి అంజల ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ హాస్టళ్ల విద్యార్థులు పదో తరగతిలో మెరుగైన ఉత్తీర్ణత ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రతిభా అవార్డులు అందజేత కలెక్టర్ దినేష్కుమార్ -
ఉపాధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
● డ్వామా పీడీ అర్జునరావు యర్రగొండపాలెం: ఉపాధి పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని డ్వామా పీడీ బి.అర్జునరావు హెచ్చరించారు. మంగళవారం ఆయన మండలంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సిబ్బందికి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతువారి కుంటలు, ఉద్యాన పంటలపై దృష్టి సారించి గతంలో కంటే ఎక్కువ పనులు చేసేలా రైతులను ప్రోత్సహించాలన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయాల వద్ద రూఫ్ వాటర్ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ పని కల్పించాలని, ఒక్కొక్క ఉపాధి కూలీకి రూ.300 తగ్గకుండా వేతనాలు వచ్చేలా కూలీలకు అవగాహన కల్పించి పనులు చేయించాలని అన్నారు. ప్రతి గ్రామంలో ఫారంపాండ్లు, అమృత్ సరోవర్ కుంటలు, ప్లాంటేషన్ పనులు చేపట్టాలని, ఈ పనులు చేపట్టడంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై తక్షణమే చర్యలు తీసుకుంటామని అన్నారు. ముందుగా ఆయన స్థానిక పుల్లలచెరువు రోడ్డులో జరుగుతున్న కందకాల పనులు చేస్తున్న కూలీలతో ఆయన మాట్లాడారు. అనంతరం మండలంలోని మొగుళ్లపల్లిలో ఫారం పాండ్, ఉద్యాన పంటలను ఆయన పరిశీలించారు. ఆయన వెంట ఎంపీడీవో వై.వి.నాగేశ్వరప్రసాద్, ఏపీవోలు ఎం.శైలజ, కె.నాగేశ్వరరావు, ఈసీ లక్ష్మానాయక్, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు. -
విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలి
ఒంగోలు: విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, అందుకు అనుగుణంగా మధ్యాహ్న భోజన పథకం కుక్, హెల్పర్లు కృషి చేయాలని విద్యాశాఖ మధ్యాహ్న భోజన పథకం అసిస్టెంట్ డైరెక్టర్ ఉదయభాస్కర్ అన్నారు. స్థానిక పీవీఆర్ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఒంగోలు మండలానికి సంబంధించి కుక్ కం హెల్పర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 1,85,591 మంది విద్యార్థులు భోజనం చేయాల్సి ఉండగా 1,64,814 మంది భోజనం చేస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో 100 శాతం విద్యార్థులు భోజనం చేయాలంటే రుచికరమైన భోజనం వండాల్సిన బాధ్యత మనపై ఉందని తెలిపారు. భోజన సమయంలో చిన్నారులు పౌష్టికాహారం తీసుకోకుంటే ఏం జరుగుతుందన్న విషయాన్ని ఒక తల్లి లాగా అవగాహన కల్పించాలని సూచించారు. విద్యార్థుల్లో రక్తహీనతను తగ్గించేందుకు ప్రభుత్వం అందిస్తున్న రాగి జావ గురించి ప్రత్యేక సూచనలు చేశారు. కార్యక్రమంలో ఒంగోలు ఎంఈఓ టి.కిషోర్బాబు తదితరులు పాల్గొన్నారు. -
సంతాపం కూడా చెప్పలేరా..?
ఒంగోలు టౌన్: స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవాల నాడు గుర్తుకు వచ్చే స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలు, వారి వారసులు..వారు చనిపోయిన సమయంలో కనీసం సంతాప సందేశాలకు కూడా నోచుకోకపోవడంపై ఒంగోలు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు సేవా సంస్థ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు మనవడు టంగుటూరి గోపాలకృష్ణ హైదరాబాద్లోని ఆయన నివాసంలో సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. అయితే ఆయన మృతికి జిల్లా యంత్రాంగం గానీ, జిల్లా సాంస్కృతిక శాఖ, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖాధికారులు కనీసం సంతాపం కూడా తెలియజేయలేదని సంస్థ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా యంత్రాంగం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను, ఆ కుటుంబాలను అవమానించడమేనని వాపోయారు. దీనికి సంబంధించి కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ను వివరణ కోరగా..హైదరాబాద్లోని గోపాలకృష్ణ నివాసానికి అధికారులను పుష్పగుచ్చం ఇచ్చి పంపించామని తెలిపారు. సంతాపానికి సంబంధించిన వీడియో కూడా సిద్ధం చేశామని, అయితే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఒత్తిడిలో ఉండటంతో..వీడియో విడుదలలో ఆలస్యమైందని పేర్కొన్నారు. టంగుటూరి గోపాలకృష్ణ మృతి చాలా బాధాకరమని పేర్కొన్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. టంగుటూరి ప్రకాశం పంతులు కుటుంబం చేసిన సేవలు ఎంతో విలువైనవని కొనియాడారు. -
కౌంటింగ్ ఏర్పాట్ల పరిశీలన
వన్యప్రాణులను వేటాడిన వ్యక్తులు అరెస్టుఒంగోలు అర్బన్: స్థానిక రైజ్ కాలేజీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్రూంలను, ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం చేస్తున్న ఏర్పాట్లను కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్, ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్లు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కౌంటింగ్ ఏర్పాట్లపై పలు సూచనలు చేసారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పాల్గొనే సిబ్బంది, అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు ఉండేందుకు ప్రత్యేక బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. తాగునీరు, ఇతర సదుపాయాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. కౌంటింగ్ జరిగే సమయంలో భద్రతా చర్యలు పటిష్టంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే కౌంటింగ్ సిబ్బందికి అవసరమైన శిక్షణ పూర్తి చేశామని తెలిపారు. ఓట్ల లెక్కింపునకు పకడ్బందీగా మూడు అంచెల భద్రతా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు అన్ని ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎన్నికల విభాగం అధికారులు ఆపల్గొన్నారు.గిద్దలూరు రూరల్: వన్యప్రాణులను వేటాడి తీసుకెళ్తున్న నలుగురు వ్యక్తులను అటవీశాఖ అధికారులు మంగళవారం నల్లమల ఘాట్ రోడ్డులో అదుపులోకి తీసుకున్నారు. డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ వంశీక్రిష్ణ తెలిపిన వివరాల ప్రకారం..దిగువమెట్టతాండా గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు నల్లమల అభయారణ్యం ప్రాంతంలో మూడు ఉడుములను వేటాడి ఓ సంచిలో వేసుకుని రోడ్డులో ఉన్నారు. వారిని తీసుకువచ్చేందుకు గిద్దలూరు నుంచి కారు వెళ్లింది. అందులో ఎక్కిన నలుగురు గిద్దలూరు వైపుగా వస్తున్న సమయంలో తన సిబ్బంది సహాయంతో వారిని అదుపులోనికి తీసుకున్నారు. అటవీశాఖ అదికారులను గమనించిన నలుగురిలో ఒకరు పారిపోయాడు. దీంతో కారు డ్రైవర్తో పాటుగా ముగ్గురు వేటగాళ్లను వారి వద్ద ఉన్న సెల్ఫోన్లు, కారు, గొడ్డలి, ఉడుములను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ వంశీకృష్ణ తెలిపారు. పారిపోయిన వ్యక్తిని పట్టుకుంటామన్నారు. వన్యప్రాణులను వేటాడే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు.ఉపాధ్యాయుడి ఇంటిపై పెట్రోల్ బాంబుతో దాడివెలిగండ్ల: మండలంలోని జంగంనరసాయపల్లిలో ఉపాధ్యాయుని ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ బాంబుతో దాడికి యత్నించారు. ఈ సంఘటన మంగళవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో జరిగింది. ఎస్సై ఎం శివ తెలిపిన వివరాల ప్రకారం...జంగం నరసాయపల్లికి చెందిన ఉపాధ్యాయుడు తీట్ల నారాయణ ఇంట్లో నిద్రిస్తుండగా మంగళవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు బీరు సీసాల్లో పెట్రోల్ పోసి గుడ్డ చుట్టి నిప్పంటించి ఉపాధ్యాయుని ఇంటిపై విసిరేశారు. పెట్రోల్ నింపిన బీరు బాటిళ్లు ఇంటి గేటుకు తగిలి కిందపడి పేలింది. పెద్ద శబ్ధం రావడంతో నారాయణ బయటకు రాగా..ఆవరణలో పెట్రోల్ నింపిన బీరు బాటిళ్లు పగిలి ఉన్నాయి. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎం శివ తెలిపారు. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ రత్నాకరం రామరాజు, సీఐ రామానాయక్, ఎస్సై ఎం శివ సందర్శించారు. అనంతరం క్లూస్టీంను పిలిపించి తనిఖీలు చేశారు.
Pagination
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
కౌంటింగ్కు సర్వం సిద్ధం
373 మంది గైర్హాజరు
●భారీగా తగ్గిన దిగుబడులు
డిమాండ్ ఉండే సమయానికి కాయలు రాలేదు
జిల్లా వ్యాప్తంగా నాయకులకు బహిష్కరణ నోటీసులు
ఖరీఫ్ కార్యాచరణ అమలుకు సమాయత్తం కావాలి
ఏసీఏ జూనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ నియామకం
ఓట్ల లెక్కింపునకు పక్కా ఏర్పాట్లు
ఎల్ అండ్ టి ఫైనాన్స్ లిమిటెడ్ హైదరాబాద్లో పూర్తి గృహ రుణాన్ని ప్రారంభించింది
రామ్కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్డేట్లు
తప్పక చదవండి
- విజయ్ సరసన హీరోయిన్గా ఛాన్స్.. చేయనని ఏడ్చేసిన బాలీవుడ్ బ్యూటీ
- Khammam Car Accident: అల్లుడు హైడ్రామా..!
- విజయవాడ హైవేపై హృదయ విదారక ఘటన
- ‘బోట్ నెట్’పై ఎఫ్బీఐ గురి.. చైనా పౌరుడు అరెస్ట్
- Aditi Dugar: జీరో టు.. మ.. మ.. మాస్క్ వరకు!
- ప్రపంచ క్రికెట్లో ఇద్దరే ఇద్దరు..!
- ప్రియుడి వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య
- వెండే బంగారమాయెగా..
- Lok Sabha Election 2024: బీజేపీకి 295 –305 సీట్లు, కాంగ్రెస్కు 55–65 సీట్లు
- ‘స్కూటీ’అంటే పాప.. ‘బైక్’అంటే బాబు
Advertisement