-
జూలో ఆఫ్రికన్ కోతులు
ఆరిలోవ: ఇందిరాగాంధీ జూ పార్కులో అరుదైన కోతి జాతులున్నాయి. ఇటీవల శ్రీకాకుళం జిల్లా అటవీ శాఖ అధికారులు వీటిని విశాఖ జూ పార్కుకు అప్పగించారు. అప్పటి నుంచి ఆ కోతులు జూలో సందర్శకులను అలరిస్తున్నాయి. కొందరు ఒడిశా రాష్ట్రం మీదుగా వేరే చోటకు అనధికారికంగా ఆఫ్రికన్ జాతికి చెందిన రెండు కోతులను తరలిస్తుండగా శ్రీకాకుళం జిల్లా అటవీ శాఖ అధికారులకు పట్టుబట్టారు. వీటిని జూకు అప్పగించినట్టు జూ క్యూరేటర్ నందనీ సలారియా తెలిపారు. వీటిని జూలో కోతుల జోన్లో ప్రత్యేక ఎన్క్లోజర్లో సందర్శకుల కోసం అందుబాటులో ఉంచామన్నారు. ఈ జాతి కోతులను ‘లోయిస్ట్ మంకీస్’ అని పిలుస్తారన్నారు. ఈ జాతి ఆఫ్రికా ఖండం కాంగో ప్రాంతంలో సంచరిస్తాయన్నారు. ఈ జాతి కోతులు మన దేశంలో ఎక్కడా కనిపించవని తెలిపారు. ఇవి అరుదైన జాతికి చెందినవని తెలిపారు. -
కొండెక్కిన చికెన్ ధర
సాక్షి, విశాఖపట్నం : కొన్నాళ్ల నుంచి ఒకింత అందుబాటు ధరలో ఉన్న చికెన్ ఇప్పుడు చిక్కడం లేదు. రెండు నెలల పాటు కిలో చికెన్ రూ.230–260 మధ్య ఉండేది. మూడు వారాల నుంచి స్వల్పంగా పెరుగుతూ తాజాగా రూ.300కి చేరుకుంది. ఈ ఏడాది మార్చి మూడో వారం నుంచే ఎండలు, వడగాడ్పులు తీవ్రంగా ప్రభావం చూపాయి. ఏప్రిల్ నాటికి అవి తీవ్ర రూపం దాల్చాయి. దీంతో ఫారాల్లో పెరుగుతున్న కోళ్లు వడగాడ్పుల ధాటికి పెద్ద సంఖ్యలో చనిపోయాయి. రోజురోజుకూ తీవ్ర వడగాడ్పులు అధికమవుతుండడంతో పౌల్ట్రీ రైతులు కోడి పూర్తిగా ఎదగక పోయినా మార్కెట్కు తరలించే వారు. ఫలితంగా చికెన్ రేటు దిగి వచ్చింది. ఇలా కిలో చికెన్ మార్చి ఏప్రిల్ నెలల్లో రూ.230–260కి మించలేదు. మరోవైపు ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పౌల్ట్రీ రైతులు ఫారాల్లో కోళ్ల పెంపకాన్ని గణనీయంగా తగ్గించారు. కోళ్లను ఫారాల్లో బ్యాచ్ల వారీగా పెంచుతారు. కోడి పిల్ల చికెన్కు వీలుగా తయారవ్వాలంటే ఏడు నుంచి తొమ్మిది వారాల సమయం పడుతుంది. ఏప్రిల్లోనే ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో మే నెలలో మరింతగా విజృంభించి కోళ్లు మృత్యువాత పడతాయన్న భయంతో పౌల్ట్రీ రైతులు బ్యాచ్లను కుదించారు. దీంతో ఇప్పుడు కోళ్లకు కొరత ఏర్పడింది. డిమాండ్కు తగినన్ని బ్రాయిలర్ కోళ్ల లభ్యత లేకపోవడంతో చికెన్ ధరలకు రెక్కలొచ్చాయి. ఫలితంగా ఈనెల ఆరంభంలో కిలో స్కిన్ లెస్ బ్రాయిలర్ చికెన్ రూ.260 ఉండగా ఇప్పుడది రూ.300కి ఎగబాకింది. అంటే 20 రోజుల్లో కిలోపై రూ.40 పెరిగిందన్న మాట! ఫారాల్లో కొత్తగా వేసిన బ్యాచ్లు అందుబాటులోకి రావాలంటే మరో మూడు నుంచి నాలుగు వారాల సమయం పట్టే అవకాశం ఉంది. అందువల్ల కనీసం మరో మూడు వారాల పాటు చికెన్ ధర ప్రియంగానే ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న ధరకంటే ఇంకాస్త పెరిగే అవకాశాలూ ఉన్నాయని అంటున్నారు. చికెన్ ప్రియులకు ఈ ధర భారంగానే ఉండనుంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో రోజుకు మూడు లక్షలు, ఆదివారాల్లో ఆరు లక్షల కిలోల చికెన్ అమ్ముడవుతుందని అంచనా. బ్రాయిలర్ చికెన్ రేటు కొండెక్కి కూర్చున్న నేపథ్యంలో ఆదివారం ఆ ప్రభావం అమ్మకంపై పడిందని సీతమ్మధారలోని ఓ చికెన్ సెంటర్ నిర్వాహకుడు రామునాయుడు ‘సాక్షి’కి చెప్పాడు. కిలో రూ.300కి చేరిక ధర మరింత పెరిగే అవకాశం వేసవిలో తగ్గిన కోళ్ల పెంపకం -
నీటి నాణ్యత.. ఆహార కల్తీ కనిపెట్టేస్తారు
● సమర్థంగా సేవలందిస్తున్న ప్రాంతీయ ప్రజారోగ్య ప్రయోగశాల ● నిత్యం పదుల సంఖ్యలో నీటి నమూనాల పరీక్ష ఏయూక్యాంపస్ : నీటి నాణ్యతను పరీక్షిస్తారు.. ఆహార పదార్థాల కల్తీని కనిపెట్టేస్తారు. ప్రజల ఆరోగ్యం పరిరక్షణ ధ్యేయంగా సేవలు అందిస్తోంది ప్రాంతీయ ప్రజారోగ్య ప్రయోగశాల. పెదవాల్తేరులో ఉన్న ఈ కేంద్రంలో నిత్యం ప్రజలు నీటి, ఆహార పరీక్షలు చేయించుకుంటున్నారు. రాజమండ్రి నుంచి శ్రీకాకుళం వరకు ఉన్న ప్రాంతంలో ఈ కేంద్రం సేవలు అందిస్తుంది. నీటిని రెండు విభాగాలుగా పరీక్షిస్తారు. కెమికల్ అనాలసిస్, బాక్టీరియా అనాలసిస్ చేస్తారు. కెమికల్ అనాలసిస్లో భాగంగా రంగు, వాసన, పి.హెచ్, కాఠిన్యత, క్లోరైడులు, మెత్తం కలిగి ఉన్న లవణాలు, ఐరన్, రెసిడ్యుల్ ఫ్రీ క్లోరిన్, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫేటు, నైట్రేటు, ఫ్లోరైడు, మొత్తం కరిగి ఉన్న లవణాలు (టీడీఎస్) వంటివి పరీక్షిస్తారు. నీరు కలుషితం కావడం, బాక్టీరియా చేయడం వంటివి సైతం ఇక్కడపరీక్షిస్తారు. నిత్యం పదుల సంఖ్యలో నీటి నమూనాలు ఇక్కడ పరీక్షకు తీసుకురావడం జరుగుతోంది. ఈ కేంద్రంలో ఉండే ప్రత్యేకమైన శ్యాంపిల్ టేకర్స్ ప్రత్యేకంగా నీటి నమూనాలను సేకరించి పరీక్షిస్తారు. డయేరియా వంటి వ్యాధులు ప్రబలినపుడు డీఎంహెచ్ఓ అధికారులు పంపే నీటి నమూనాలు పరీక్షించి ఫలితాలను అందిస్తుంటారు. కెమికల్ అనాలసిస్కు రూ.230, బాక్టీరియా అనాలసిస్కి రూ.150 రుసుముగా చెల్లించాలి. నీటి నమూనా ఫలితాలను వారం రోజుల్లో అందిస్తారు. ఆహార పదార్థాల్లో.. ఆహార పదార్థాలలో కల్తీని రసాయన పరీక్షలు జరిపి గుర్తిస్తారు. ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రమాణాలకు అనుగుణంగా లేని ఉత్పత్తులను గుర్తించే పరీక్షలు ఇక్కడ నిర్వహిస్తారు. సాధారణంగా హోటళ్లలో వండే ఆహార పదార్థాలలో, చికెన్లో నిషేధిత రంగులు ఉపయోగిస్తే పరీక్షించే అవకాశం, వసతులు ఇక్కడ ఉన్నాయి. ఆహార పదార్థాల్లో జరిగే కల్తీని, ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా అనే విషయం గుర్తిస్తారు. మరింత లోతైన సమాచారం, విశ్లేషణ కోసం నమూనాలను హైదరాబాద్ పంపిస్తారు. సమకూరిన వాహనం ఇటీవల ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ వాహనం సమకూరింది. దీనిలో 60కి పైగా పరీక్షలు చేసే సదుపాయాలు ఉన్నాయి. నీరు, పాలు, ఆహార పదార్థాలను పరీక్షించే అవకాశం ఉంది. త్వరలో ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. ప్రజల్లో అవగాహన కల్పించడం, చైతన్యం పెంచడం, పరీక్షించడం, శిక్షణ అందించడానికి ఈ కేంద్రం ఎంతో ఉపయుక్తంగా ఈ మైబెల్ వాహనం నిలుస్తుంది. నీటి పరీక్షలకు అధికంగా వస్తారు నీటి నమూనాల పరీక్షకు నిత్యం నమూనాలు వస్తాయి. వీటిని శాసీ్త్రయంగా ల్యాబ్లో పరీక్షించి, కచ్చితమైన వివరాలను అందిస్తాం. శాసీ్త్రయ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నదీ, లేనిదీ తెలియజేస్తాం. తద్వారా సురక్షితమైన నీటిని ప్రజలు వినియోగించడానికి సాధ్యపడుతుంది. – వై.శివరామకృష్ణ, సీనియర్ వాటర్ ఎనలిస్ట్, డీడీవో అవగాహన కల్పించాలి ఆహార ఉత్పత్తుల తయారీ, విక్రయం చేసే సంస్థలకు లైసెన్సులు మంజూరు చేసే సమయంలో అవసరమైన అవగాహన కల్పించాలి. ఆహారాలు తయారీలో వినియోగించకూడని పదార్థాలపై అవగాహన కల్పించాలి. వాటిని వినియోగిస్తే జరిగే దుష్ఫరిణామాలు తెలియజేయాలి. విక్రేతలకు, వినియోగదారులకు వీటిపై అవగాహన ఉండటం ఎంతో అవసరం. –ఆర్.శ్రీనివాసులు, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ -
సిటీలో సూపర్ సండే..
సాగరి నగరిలో అణువణువూ అద్భుతమే. అందాల తీరంలో అలలతో ఆటలాడాలన్నా.. హొయలొలికే బీచ్రోడ్డులో బ్యూటిఫుల్ డ్రైవ్ చెయ్యాలన్నా.. కై లాసగిరిపై నుంచి సుందర ప్రపంచాన్ని చూడాలన్నా.. ప్రతి ఒక్కరూ ఉవ్విళ్లూరుతుంటారు. అలాంటిది. అసలే ఆదివారం.. ఆపై అందాల నగరిలో అద్భుతమైన వాతావరణం.. స్టీల్ సిటీ కాస్తా.. బ్లూ సిటీగా మార్చేలా అటు ఆకాశం.. ఇటు సాగరం నీలివర్ణాన్ని అద్దుకుంటూ అందరికీ ఆహ్వానం పలికాయి. చిన్నా, పెద్దల కేరింతలతో సండే సందడి నెలకుంది. – ఫొటోగ్రాఫర్ : పీఎల్ మోహన్రావు -
కమనీయం.. శ్రీనివాసుని కల్యాణం
మురళీనగర్: కప్పరాడ ఎన్జీజీవోస్ కాలనీలో వెలసిన వైభవ వేంకటేశ్వరస్వామి ఆలయంలో 22వ వార్షికోత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీనివాసుని తిరు కల్యాణోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి బండారు ప్రసాద్ పర్యవేక్షణలో ఉదయం నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం 5 గంటలకు వైభవుడికి సుప్రభాత సేవ, ప్రాతఃకాలార్చన, బాలబోగం, మంగళశాసనం, విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, ఋత్విక్గ్వరుణ, రక్షాసూత్రబంధన, మృత్సంగ్రహణం, అంకురార్పణ, పతాక ప్రతిష్ఠ, విశేష హోమాలు, మహానివేదన నిర్వహించారు. సాయంత్రం 5గంటలకు ఎదరు సన్నాహ ఉత్సవం అనంతరం ఉత్తర ద్వారం రహదారిపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కల్యాణవేదిక మీదకు శ్రీదేవీ భూదేవి సహిత వైభవ వేంకటేశ్వరరుడి ఉత్సవ విగ్రహాలను తోడ్కొని వచ్చి 6గంటలకు కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఆలయ అర్చకులు వాసు, శేషు స్వాముల ఆధ్వర్యంలో కల్యాణం సంప్రదాయ సిద్ధంగా నిర్వహించారు. వేదికపై 30మంది కల్యాణదాతలైన దంపతులు ఆశీనులు కాగా స్వామి కల్యాణం వైభవంగా జరిగింది. సోమవారం ఉదయాస్తమాన సేవలతోపాటు 9గంటలకు వైభవుడికి లక్ష మల్లెలతో అర్చన నిర్వహిస్తారు. -
సైలెంట్ మోడ్లో సీబీఐ.!
సాక్షి, విశాఖపట్నం: ప్రత్యేక విమానంలో విశాఖ వచ్చి.. భారీగా డ్రగ్స్ పట్టుకున్న సీబీఐ దాని వెనుక ఉన్న పాత్రధారులు, సూత్రధారులను కనిపెట్టే విషయంలో మాత్రం నిర్లిప్తత వహిస్తోంది. మూలాలు శోధించేందుకు బ్రెజిల్ వెళ్లిన బృందాలు కొండని తవ్వి కనీసం ఎలుక జాడ కూడా కనిపెట్టలేకపోయాయి. ప్రధాన పాత్రధారులుగా ఉన్న సంధ్యా ఆక్వా ప్రతినిధులు కళ్లెదుటే ఉన్నా కనీసం సమగ్రంగా విచారించకుండా వదిలేయడంపైనా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డ్రగ్స్ తీసుకొచ్చిన సంస్థపై చర్యలు తీసుకోకుండా గాలికొదిలేయడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మార్చి 19న విశాఖపట్నం కంటైనర్ టెర్మినల్ (వీసీటీపీఎల్)లో 25 వేల కిలోల డ్రైఈస్ట్తో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ దిగుమతి రాకెట్ని సీబీఐ బట్టబయలు చేసింది. బ్రెజిల్లోని శాంటోస్ పోర్టు నుంచి బయలుదేరిన షిప్లోని కంటైనర్లో డ్రైఈస్ట్ని తీసుకొచ్చిన సంధ్యా ఆక్వా సంస్థ.. అందులో డ్రగ్స్ ఎలా వచ్చాయో తమకు తెలీదంటూ బుకాయిస్తోంది. డ్రగ్స్ దొరికిన తొలి రోజున సంస్థ ప్రతినిధులను రెండు గంటల సేపు మాత్రమే సీబీఐ అధికారులు విచారించారు. తమకేమీ తెలీదని చెప్పడంతో వదిలేశారు. తర్వాత ఇంత వరకూ సంధ్యా ఆక్వా ప్రతినిధుల జోలికి సీబీఐ వెళ్లకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ప్రాథమికంగా సంధ్య ఆక్వా ప్రతినిధుల నుంచి కీలక సమాచారం రాబట్టే అవకాశాలున్నా కనీసం ఆ దిశగా సీబీఐ విచారించకపోవడం గమనార్హం. మొత్తం కంటైనర్లో వచ్చిన వెయ్యి బ్యాగుల్లో 70 శాతం బ్యాగ్స్లో ఉన్న డ్రైఈస్ట్లో కొకై న్, హెరాయిన్, ఓపియం, కొడైన్, మెథలాక్విన్ తదితర డ్రగ్స్ అవశేషాలున్నాయి. ఈ పరిణామాలు చూస్తుంటే 30 శాతం బ్యాగుల్లో పూర్తిస్థాయిలో డ్రైఈస్ట్ లోడ్ చేసి ఒకవేళ పరీక్షలు నిర్వహించినా దొరకవనే ఉద్దేశంతో పక్కా ప్రణాళికలతోనే డ్రగ్స్ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. అయితే సీబీఐకి ఇంటర్పోల్ నుంచి సమాచారం రావడంతో ఈ రాకెట్ గుట్టురట్లు అయింది. పక్కాగా డ్రగ్స్ అక్రమంగా రవాణా చేసినట్లు ఆధారాలున్నా సంధ్యా ఆక్వాపై ఇంతవరకూ సీబీఐ ఎలాంటి చర్యలకు ఉపక్రమించకపోవడం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. రిపోర్టులూ మరింత ఆలస్యం.? తమ దగ్గర ఉన్న కిట్స్ సాయంతో నిర్వహించిన ప్రాథమిక పరీక్షల్లో డ్రగ్స్ అవశేషాలున్నట్లు సీబీఐ గుర్తించింది. అయితే ఒక్కో బ్యాగ్లో ఎంత మొత్తం డ్రగ్స్ ఉన్నాయి.. ఏఏ డ్రగ్స్ ఎంత మేర ఉన్నాయన్న అంశంపై సమగ్ర నివేదిక కోసం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్)కి పంపించారు. అయితే ఇంతవరకూ దీనికి సంబంధించిన రిపోర్టులు రాలేదని సీబీఐ చెబుతోంది. సాధారణంగా ఎఫ్ఎస్ఎల్ నుంచి 10 నుంచి 15 రోజుల్లో నివేదిక వస్తుందని సంధ్యా డ్రగ్స్కు సంబంధించిన రిపోర్టు దాదాపు రెండు నెలలు కావస్తున్నా బయటికి రాకపోవడంపైనా సీబీఐ తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి. బ్రెజిల్ వెళ్లి ఏం చేశారు..? మరోవైపు డ్రగ్స్ మూలాలు ఎక్కడ ఉన్నాయనే కోణంలో దర్యాప్తు చేస్తామంటూ సీబీఐకి చెందిన బృందం బ్రెజిల్ పయనమయ్యాయి. శాంటోస్ పోర్టుకు డ్రైఈస్ట్ తరలించిన ఓషన్ నెట్వర్క్ ఎక్స్ప్రెస్ సంస్థతో పాటు కార్గో షిప్ వచ్చిన మార్గంతో పాటు షిప్ ఆగిన పోర్టుల్లో సీసీటీవీ పుటేజ్ సేకరించాలని సీబీఐ బృందం బ్రెజిల్ వెళ్లినట్లు తెలిసింది. అయితే దాదాపు 2 నెలలు కావస్తున్నా ఇంతవరకూ ఎలాంటి ఆధారాలు సేకరించకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అయితే బ్రెజిల్ నుంచి సీబీఐ బృందం తిరిగి వచ్చేసినట్లు తెలుస్తోంది. కానీ అసలు దర్యాప్తు ఎంతవరకూ వచ్చిందో కూడా సీబీఐ వెల్లడించకపోవడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఎక్కడ కంటైనర్ అక్కడే.. రూ.వేల కోట్ల విలువైన డ్రగ్స్ విషయంలోనూ సీబీఐ నిర్లక్ష్యం వహిస్తోంది. ఎక్కడైతే తనిఖీలు నిర్వహించారో ఆ ప్రాంతమైన వీసీటీపీఎల్లోనే డ్రగ్స్ దొరికిన కంటైనర్ని సీబీఐ సీజ్ చేసి విడిచి పెట్టేసింది. కంటైనర్ టెర్మినల్లో కస్టమ్స్ తనిఖీల్లో పట్టుబడిన కంటైనర్లతో పాటు ఈ డ్రగ్స్ కంటైనర్ కూడా విడిచిపెట్టేశారు. ఎర్రచందనం, నిషేధిత వస్తువులతో వచ్చిన కంటైనర్లను వీసీటీపీఎల్లోని ఓ ప్రాంతంలో ఉంచేస్తారు. దాదాపు 10 నుంచి 15 ఏళ్లుగా ఈ కంటైనర్లు ఇక్కడే ఉన్నాయి. వాటితో పాటుగా.. డ్రగ్స్ కంటైనర్ని కూడా సీబీఐ విడిచి పెట్టేసింది. కస్టమ్స్, వీసీటీపీఎల్ ప్రతినిధుల్ని ఆ కంటైనర్ భద్రపరచాలని సీబీఐ సూచించిందే తప్ప.. తమ తరఫున ఒక భద్రతా సిబ్బందిని కూడా కంటైనర్ వద్ద ఉంచకుండా నిర్లిప్తంగా వ్యవహరిస్తోంది. వీలైనంత త్వరగా డ్రగ్స్ దోషులను బయటకి లాగాలని దర్యాప్తును సీబీఐ త్వరగా పూర్తి చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. నత్తనడకన డ్రగ్స్ కేసు దర్యాప్తు మౌనం వహిస్తున్న దర్యాప్తు బృందం భారీగా లభ్యమైనా కనిపించని పురోగతి సంధ్యా ఆక్వా ప్రతినిధులను తూతూ మంత్రంగా విచారించిన వైనం డ్రగ్స్ తీసుకొచ్చిన సంస్థను గాలికొదిలేసిన సీబీఐ ఆధారాలేవీ సేకరించకుండా బ్రెజిల్కి ఇలా వెళ్లి అలా వచ్చేసిన బృందం -
No Headline
నిరంతరం శ్రమిస్తూ ఏడాదిలో సగకాలానికిపైగా సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు ప్రస్తుతం సెలవులో ఉన్నారు. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు 61 రోజులు సముద్ర జలాల్లో చేపల వేట నిషేధం అమల్లో ఉండడంతో వారంతా బోట్ల మరమ్మతులు, కొత్త బోట్ల తయారీ పనుల్లో నిమగ్నమయ్యారు. మరికొందరు వలలు సిద్ధం చేసుకుంటున్నారు. జూన్ 15న వేటకు వెళ్లే సమయానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. రోజూ మత్స్యకారులంతా బృందాలుగా పనుల్లో నిమగ్నమవుతున్నారు. –ఫొటోలు : సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
21 నుంచి ఐఐపీఈలో సదస్సు
ఏయూక్యాంపస్ : ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీ, స్టోనీ బ్రూక్స్ యూనివర్సిటీ(న్యూయార్క్)తో సంయుక్తంగా ఈనెల 21 నుంచి 23వ తేదీ వరకు హైడ్రోజన్, గ్లోబల్ డీకార్బనైజేషన్ ఇండో–యూఎస్ వర్క్షాప్ నిర్వహించనుందని ఐఐపీఈ సంచాలకులు ఆచార్య శాలివాహన ఒక ప్రకటనలో తెలిపారు. గ్లోబల్ డీకార్బనైజేషన్ ప్రయత్నాలలో కీలకమైన అంశంగా నిలిచే హైడ్రోజన్పై చర్చించే వేదికగా ఇంధన రంగంలోని పరిశ్రమల ఎగ్జిక్యూటివ్ల కోసం ప్రత్యేకంగా ఫోరం రూపొందించామన్నారు. మూడు రోజుల వర్క్షాప్లో భాగంగా హైడ్రోజన్పై ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తూ, కార్బన్ తక్కువగా ఉండే ప్రత్యామ్నాయాలు, వాతావరణ మార్పు, శిలాజ ఇంధనాలపై సమగ్ర సెషన్లు ఉంటాయన్నారు. విద్య, పరిశోధన కేంద్రాలు, విధాన రూపకర్తలు, నిపుణులు పాల్గొంటారన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్టీపీసీ మాజీ డైరెక్టర్(ప్రాజెక్ట్స్) ఉజ్వల్ కాంతి భట్టాచార్య హాజరవుతారు. విశిష్ట అతిథిగా సింహాద్రి ఎన్టీపీసీ ప్రాజెక్ట్ హెడ్ ఎస్.కె.సిన్హా పాల్గొంటారు. -
బెంగళూరులో విశాఖ వాసి అరెస్టు
● అక్రమంగా సిమ్కార్డుల రవాణా బనశంకరి (బెంగళూరు): భారత సిమ్కార్డును వినియోగించి విదేశాల్లో నుంచి సైబర్ మోసాలకు పాల్పడుతున్న ముఠా సమాచారాన్ని బెంగళూరు ఈశాన్య విభాగం సైబర్క్రైం పోలీసులు ఛేదించారు. వంచక ముఠాకు సిమ్ కార్డులను సరఫరా చేస్తున్న విశాఖపట్టణానికి చెందిన వ్యక్తిని అరెస్టు చేశారు. ముఠా నేరగాళ్లు నకిలీ ఆధారాలను అందించి ఏజెంట్ల ద్వారా వివిధ కంపెనీల సిమ్కార్డులను కొనుగోలు చేశారు. బెంగళూరు, చైన్నె, విశాఖపట్టణంతో పాటు దేశంలోని వివిధ మహా నగరాల నుంచి సిమ్కార్డులను కొని, యాక్టివేట్ చేసి వియత్నాం, కాంబోడియాకు కొరియర్ ద్వారా పంపించేవారని పోలీసులు తెలిపారు. నిందితుడు విశాఖపట్టణం నుంచి బెంగళూరుకు వచ్చి ఇక్కడి నుంచి కాంబోడియాకు సిమ్కార్డులు పంపించేవాడు. అతనిని అరెస్టు చేసి విచారణ చేపట్టారు. -
ఇన్వెస్టిగేషన్ వదిలి.. ఇంగ్లిష్ కోచింగ్ వైపు
తెలుగు వాళ్లకు ఉద్యోగాలే లక్ష్యంగా.. ఢిల్లీలో విధుల్లో చేరినప్పుడు.. అక్కడ ఉన్న తోటి ఉద్యోగులతో మాట్లాడుతుండగా.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో తెలుగువారు చాలా తక్కువగా ఉన్నారని గ్రహించారు. దీనికి కారణమేంటని శోధిస్తే.. ఇంగ్లిష్ భాష అని తెలుసుకున్న శివ.. ఈ గ్యాప్ని తగ్గించి.. తెలుగువారు ఎందులోనూ తక్కువ కాకూడదని అనుకున్నారు. అందుకే సీబీఐ ఉద్యోగానికి రాజీనామా చేసి నేరుగా విశాఖ చేరుకున్నారు. తక్కువ ఖర్చుతో విద్యార్థులకు ఇంగ్లిష్తో పాటు పోటీ పరీక్షలకు తర్ఫీదునిచ్చేందుకు త్రినేత్ర పేరుతో అకాడమీని స్థాపించారు. ఇంగ్లిష్ భాషలో ప్రతి తెలుగు విద్యార్థి ప్రావీణ్యం పొందేలా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని శివ చెబుతున్నారు. అందుకే లక్షల రూపాయల జీతం ఇచ్చే ఉద్యోగాాన్ని వదులుకున్నా తనకేమీ బాధగా లేదని.. భార్య అంజలి కూడా ప్రోత్సహించడం మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందంటున్నారు. విద్య విజ్ఞానాన్ని, ఆలోచన శక్తిని, సృజనాత్మకతను పెంపొందిస్తుందని, అది పది మందికి పంచితే సమాజం మరింత మెరుగవుతుందన్న లక్ష్యంతోనే అకాడమీ స్థాపించానని శివ చెబుతున్నారు. శివ చేసిన ఈ ప్రయోగానికి సీబీఐ అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. సాక్షి, విశాఖపట్నం : సమాజంలో యువత రెండు రకాలు. ఏదైనా సమస్యను చూస్తారు.. వదిలేస్తారు. మరికొంతమంది ఆ సమస్యకు పరిష్కారం దొరికేవరకూ అన్వేషిస్తారు. అవసరమైతే మరికొంతమందితో చర్చిస్తారు. విభిన్న ఆలోచనల్ని, పరిష్కార మార్గాల్ని సేకరిస్తారు. ఆ కోవకు చెందిన వారే నాగవల్లి శివ. మారుమూల పల్లెలో పుట్టి కేంద్ర దర్యాప్తు సంస్థలో ఉద్యోగాన్ని సాధించారు. పశ్చిమగోదావరి జిల్లాలోని గుడ్డిగూడెం గ్రామానికి చెందిన శివ పేదింట్లో పుట్టారు. చిన్నప్పుడు ట్యూషన్లు చెప్పుకుంటూ తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టకుండా తన చదువుకు అవసరమైన డబ్బును సమకూర్చుకునేవారు. ఎంఏ ఇంగ్లిష్ని డిస్టింక్షన్లో పాసైన శివ.. 2012లో డీఎస్సీ రాసి ఇంగ్లిష్ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. అనంతరం 2014లో ఒకేసారి రెండు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. గ్రూప్–4లో కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లోనూ, గ్రూప్–3లో ట్రాన్స్పోర్టు డిపార్ట్మెంట్లో కొలువులు సాధించారు. అయినా ఏదో వెలితి శివని వెంటాడింది. పాతికేళ్ల ప్రాయంలోనే రచయితగా.. ఓవైపు సామాజిక సేవా కార్యక్రమాలు, మరోవైపు ఉద్యోగాలే టార్గెట్గా నిర్దేశించుకున్న శివ పాతికేళ్ల వయసులోనే రచయితగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇంగ్లిష్ భాషపై తాను సాధించిన పట్టు.. ప్రతి ఒక్కరికీ అందించాలన్న లక్ష్యంతో ఇంగ్లిష్ వ్యాకరణం అనే పేరుతో.. ప్రతి ఒక్క తెలుగు విద్యార్థి సులువుగా గ్రామర్ నేర్చుకునేలా పుస్తకాన్ని 2011లో రాశారు. వెంటనే వెర్బ్స్ అండ్ ఇట్స్ కాంజుగేషన్, స్పోకెన్ ఇంగ్లిష్ పుస్తకాల్ని రచించగా దీన్ని వీజేఎస్ సంస్థ అచ్చేసేందుకు ముందుకొచ్చింది. ఈ పుస్తకాలు 2015లో మద్రాస్లోని కన్నెమర సెంట్రల్ లైబ్రరీలో చోటు దక్కించుకుంటూ జాతీయ స్థాయి గుర్తింపు పొందాయి. ఒకే టికెట్పై 15 సినిమాల పేరుతో రాసిన పుస్తకం సంచలనంగా మారింది. శివ పుస్తకాలు అమెజాన్లోనూ బెస్ట్ సెల్లర్ బుక్స్గా చోటు దక్కించుకున్నాయి. శివ రచనలకు జాతీయ స్థాయిలో సత్కారాలు వరించాయి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో సత్తా.. ఏదైనా నిజాయితీగా పనిచేస్తూ.. దేశానికి సేవ చెయ్యాలన్నదే శివ లక్ష్యం. అందుకే స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) రాయాలని నిర్ణయించుకున్నారు. 2015లో ఎస్ఎస్సీ సీబీఐ ఎస్ఐ రాతపరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. రాష్ట్రం నుంచి ఎంపికై న నలుగురిలో శివ ఒకరిగా నిలిచారు. ఘజియాబాద్లోని సీబీఐ అకాడమీలో ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తర్వాత 2017లో సీబీఐ ఎస్ఐగా విధుల్లో చేరారు. వైజాగ్ బ్రాంచ్లో ఎస్ఐగా విధుల్లో చేరిన శివ.. అనేక కీలకమైన కేసుల్లో పురోగతి వచ్చేలా ప్రతిభ కనబరిచారు. అందుకే ఐదేళ్లలోనే సీఐగా పదోన్నతి పొందారు. వైజాగ్లో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో సీబీఐ బ్రాంచ్ను అద్భుతంగా తీర్చిదిద్దారు కూడా. పదోన్నతి పొందిన తర్వాత 6 నెలల క్రితం సీబీఐ హెడ్క్వార్టర్స్కు శివ బదిలీ అయ్యారు. ఇదే సమయంలో శివకు కొత్త ఆలోచన వచ్చింది. ప్రతిభకు పదునుపెడితే సరికొత్త ప్రపంచాన్ని సృష్టించే యువతరానికుంది. పుస్తకాలతో కుస్తీలు, ర్యాంకులు, ఆపై ఐదంకెల జీతంతో ఉద్యోగం.. ఇదీ యువత ఒకప్పటి ఆలోచన. నూతన ఒరవడిలో దూసుకుపోవాలనే కాంక్ష.. తాము నేర్చుకున్న విద్యను పది మందికి పంచితే.. వారికి కూడా అద్భుత భవిష్యత్తును అందించొచ్చు అనే ఆలోచన కొందర్ని కొత్త దారిలోకి తీసుకెళ్తోంది. యువతరమంటే అంచనా వేసేందుకు కాదు.. అన్వేషించడానికి. నిర్ణయించడానికి కాదు.. అమలు చేయడానికి., స్థిరమైన పనులు చేసేందుకు కాదు.. సాటివారి తలరాతలు మార్చడానికి అన్న మాటల్ని అక్షర సత్యం చేస్తున్నారు ఆ సీబీఐ అధికారి. దర్యాప్తు అధికారిగా లక్షల జీతం ఇస్తున్న ఉద్యోగానికి స్వస్తి చెప్పి కొత్త మార్గం వైపు పయనిస్తున్నారు. పేద విద్యార్థులకు తక్కువ ఖర్చుతో శిక్షణ సీబీఐ సీఐగా పనిచేస్తూ ఉద్యోగానికి రాజీనామా చేసిన నాగవల్లి శివ విశాఖ, ఢిల్లీ బ్రాంచ్లలో విధులు నిర్వర్తించిన శివ విశాఖలో పేద విద్యార్థులకు ప్రత్యేక కోచింగ్ అకాడమీ ఏర్పాటు ఇంగ్లిష్ ఈజీగా నేర్చుకునేలా శివ రచనలు -
ఐఎన్ఎస్ జలశ్వను సందర్శించిన సీ క్యాడెట్ కార్ప్స్ క్యాడెట్లు
సింథియా: భారత నౌకాదళం కార్యకలాపాలు, సముద్ర వారసత్వం, లైఫ్ ఆన్బోర్డ్ షిప్లపై సమగ్ర అవగాహనే లక్ష్యంగా సుమారు 100 మంది సీ క్యాడెట్ కార్ప్స్ క్యాడెట్లు తూర్పు నావికాదళానికి చెందిన ఐఎన్ఎస్ జలశ్వ ఓడను సందర్శించారు. సందర్శన సమయంలో సీ క్యాడెట్ కార్ప్స్ క్యాడెట్లకు భారతనౌకాదళానికి చెందిన వివిధ డొమైన్లపై సమగ్ర వివరణను ఓడ సిబ్బంది అందించారు. దేశ ప్రయోజనాలను కాపాడటంలోనూ, సముద్ర భద్రతను పోత్రహించడంలోనూ, మానవతా సహాయం, విపత్తు సహాయక చర్యల్లో పాల్గొనడం వంటి నౌకాదళ సిబ్బంది పాత్రపై వివరించారు. అదే విధంగా క్యాడెట్లకు నావికుల దినచర్యలు, విధులు, బాధ్యతలతో పాటు పనిలో వారి సంస్కృతి, ఆన్బోర్డ్ షిప్లలో వారి జీవితం, నేవీలో సేవ చేయడానికి అవసరమైన త్యాగాలు, అంకితభావం గురించి అవగాహన కలిగించారు. యువతకు దేశభక్తిపై జాతీయ గర్వాన్ని అవలంబించే దిశగా సందర్శన ముగిసిందని నేవీ వర్గాలు తెలిపారు. -
ప్రగతి పథంలో హార్బర్
మహారాణిపేట: ఉత్తరాంధ్రలో ఎంతోమందికి ఉపాధి కల్పి స్తున్న విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లో ఆధునికీకరణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఏటా కోట్లాది రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని తెస్తున్న హార్బర్ అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు మంజూరు చేశాయి. దీంతో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా హార్బర్కు అదనపు హంగులు సమకూర్చుతున్నారు. ఈ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. వివిధ దశల్లో ఉన్న పనులు ఇలా.. మొత్తం అన్ని పనులను ఏడు దశల్లో చేపట్టాలని నిర్ణయించి ప్రారంభించారు. మొదటి దశలో ప్యాకేజీ యూనిట్/కోల్డ్ చాంబర్, పార్కింగ్ ఏరియా, రోడ్లను రూ.37.26 కోట్లతో చేపడుతున్నారు. రెండో దశలో విద్యుత్ పనులు, మూడో దశలో రెండు ఆక్షన్ హాళ్లు, రిటైనింగ్ వాల్, నాల్గో దశలో ట్రీట్మెంటు ప్లాంట్, ఐదో దశలో ఫ్లోటింగ్ జెట్టీ, ఆరో దశలో డ్రెడ్జింగ్ పనులు, ఏడో దశలో టైర్ ఫెండర్లు ఏర్పాటు చేయడానికి టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టారు. ఈ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిలో మరి కొన్ని పనులు చేయాలని మత్స్యకారులు ప్రతిపాదనలు సమర్పించారు. ఫ్లోటింగ్ జెట్టీ స్థానంలో శాశ్వత జెట్టి, మూడో ఆక్షన్ హాలు నిర్మించాలని, బీచింగ్ ఏర్పాటు చేయాలని కోరారు. కలెక్టర్ డాక్టర్ మల్లికార్జునతో భేటీలో ఈ విషయాన్ని మత్స్యకారులు ప్రస్తావించారు. ఈ పనులకు అధికారులు ఎస్టేట్మెంటు వేయించారు. ముందు అనుకున్న దాని కన్నా అదనంగా నిధులు ఖర్చవుతాయి. హార్బర్ ఆధునికీకరణ కోసం ముందు రూ.151.81 కోట్లు నిధులు అవసరమవుతాయని భావించారు. ఇప్పుడు అదనంగా రూ.178.51 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. శరవేగంగా హార్బర్ ఆధునికీకరణ పనులు -
ఉక్కు పరిరక్షణకు పోరాటాలే శరణ్యం
ఉక్కునగరం : స్టీల్ప్లాంట్ పరిరక్షణకు పోరాటాలే శరణ్యమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. ఆదివారం ఆయన సతీమణి కె.సుజాతతో కలిసి స్టీల్ప్లాంట్లోని కోక్ ఓవెన్స్, బ్లాస్ట్ఫర్నేస్, ఎస్.ఎం.ఎస్.తో పాటు రోలింగ్ మిల్స్ విభాగాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 32 మంది ప్రాణత్యాగంతో సాధించుకున్న కర్మాగారాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ కానివ్వమన్నారు. కేంద్రంపై ఒత్తిడి చేయకపోవడం వల్లే ప్రధాని మోదీ ఆటలు సాగుతున్నాయన్నారు. ఉక్కు కర్మాగారం ప్రజల సంపద అని, దానిని అమ్మే హక్కు కేంద్రానికి లేదన్నారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం జాతీయ స్థాయిలో ఇండియా కూటమి నేతృత్వంలో ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్టీల్ ఏఐటీయూసీ నాయకులు జె. రామకృష్ణ, జి.ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. -
మోదమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తజనం
సాక్షి,పాడేరు: గిరిజనుల ఇలవేల్పు,ఉత్తరాంఽఽధ్ర భక్తుల ఆరాధ్యదైవం పాడేరులోని మోదకొండమ్మతల్లి దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. అమ్మవారి ఉత్సవాల నేపథ్యంలో విగ్రహాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. వెండి, బంగారు ఆభరణాలు, పుష్పాలతో అమ్మవారిని అలంకరించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. క్యూలైన్లో బారులు తీరారు. అమ్మవారికి ఘటాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి ఇంటి పండగలతో సందడి నెలకొంది. ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కొట్టగుళ్లి సింహాచలంనాయుడు, ఉత్సవ కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కొట్టగుళ్లి రామారావు, ప్రసాదనాయుడు, వెంకటరమణ, శ్రీను తదితరులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పర్యవేక్షించారు. ఉచిత ప్రసాదాలను పంపిణీ చేశారు. నూకాంబిక ఆలయానికి భక్తుల తాకిడి అనకాపల్లి: ఉత్తరాంధ్ర ఇలవేల్పు గవరపాలెం నూకాంబిక అమ్మవారి బాలాలయంలో అమ్మవారి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చి, పిల్లాపాపలతో అమ్మవారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. కొంతమంది భక్తులు తమ గృహాల వద్ద శనివారం రాత్రంతా అమ్మవారి పాట నిర్వహించి, కాలినడకన ఆలయానికి చేరుకున్నారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన చలువ పందిళ్లలో వంటలు చేసుకుని, అమ్మవారికి నైవేద్యం సమర్పించి, మొక్కు చెల్లించుకున్నారు. క్యూ కాంప్లెక్స్లన్నీ నిండిపోవడంతో ఆలయ రహదారిపై భక్తులు బారులుతీరారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని వృద్ధులు, గర్భిణుల కోసం ప్రత్యేక దర్శన కౌంటర్ ఏర్పాటు చేశారు. ఆలయ ఈవో బండారు ప్రసాద్ భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పట్టణ ఎస్ఐ సత్యనారాయణ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ట్రాఫిక్ సీఐ పైడపునాయుడు ఆధ్వర్యంలో బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇంటి పండగలతో సందడి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో ఘటాల సమర్పణ -
అండమాన్కు ‘నైరుతి’.. రానున్న మూడ్రోజులూ వానలే
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ముందుగా అంచనా వేసిన విధంగానే నైరుతి రుతుపవనాలు ఆదివారం దక్షిణ అండమాన్ సముద్రంలోకి ప్రవేశించాయి. వాతావరణం అనుకూలంగా ఉండడంతో ఇవి చురుగ్గా కదులుతూ దక్షిణ బంగాళాఖాతం, నికోబార్ దీవులు, మాల్దీవులు, కొమరిన్లోని కొన్ని ప్రాంతాల్లోకి విస్తరించాయి. రానున్న రెండ్రోజుల్లో ఇవి మరిన్ని ప్రాంతాలకు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ వెల్లడించింది. ఇక ఈ రుతు పవనాలు మే 31న కేరళను తాకనున్నట్లు భారత వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. ఇంకా ముందు రావడానికి కూడా అవకాశం ఉంది. ఆ తర్వాత ఏపీలోకి 2–3 తేదీల్లో ప్రవేశిస్తాయి. లా నినా పరిస్థితులు భారత్కు అనుకూలంగా ఉండటంతో ఈ ఏడాది సాధారణంగా కంటే ఎక్కువగానే వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నట్లు ఐఎండీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. బలహీనపడ్డ ద్రోణి.. మూడ్రోజులు వర్షాలు..మరోవైపు.. దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు తెలంగాణ, రాయలసీమల మీదుగా సముద్ర మట్టానికి 3.1 కి.మీల ఎత్తులో ఉన్న ద్రోణి బలహీనపడింది. ప్రస్తుతం రాష్ట్రంపైకి ఆగ్నేయ, నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రానున్న మూడ్రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అలాగే, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతిలలో సోమవారం.. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతిలలో మంగళవారం.. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, విశాఖపట్నం, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో బుధవారం వర్షాలకు ఆస్కారం ఉందని వివరించింది. అదే సమయంలో ఉరుములు, మెరుపులు, పిడుగులు సంభవిస్తాయని, వీటితో పాటు గంటకు 30–40 కి.మీల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ తెలిపారు.పెదకూరపాడులో 55 మిల్లీమీటర్ల వర్షంఆదివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. పల్నాడు జిల్లా పెదకూరపాడులో 55.5 మిల్లీమీటర్లు, ఎన్టీఆర్ జిల్లా వత్సవాయిలో 40 మిల్లీ మీటర్లు, జగ్గయ్యపేట 39.5, అల్లూరి జిల్లా అడ్డతీగల 38, చింతపల్లి 36, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి 35.2, అనకాపల్లి రావికమతం 35.2, అల్లూరి జిల్లా రాజవొమ్మంగి 35, తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు 31.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాదాపు 47 ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిశాయి. తుపానుగా మారనున్న అల్పపీడనం..మరోవైపు.. ఈనెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది మరింతగా బలపడి 24 నాటికి వాయుగుండంగా మారనుంది. అనంతరం తుపానుగా బలపడే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. -
రెండో విడత చందనం అరగదీత ప్రారంభం
సింహాచలం : సింహగిరిపై శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో శనివారం నుంచి రెండో విడత చందనం అరగదీత ఘనంగా ప్రారంభమైంది. ఈనెల 23న వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకుని ఆరోజు తెల్లవారుజామున స్వామికి సమర్పించనున్న మూడు మణుగుల పచ్చిచందనం (120 కిలోలు) సమకూర్చేందుకు అరగదీత కార్యక్రమం చేపట్టారు. ఉదయం 7 గంటలకు చందనం చెక్కలకు పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ భాండాగారం వద్ద బేడామడంపంలో 20 మంది సిబ్బంది అరగదీతని శాస్త్రోక్తంగా ప్రాంభించారు. తొలిరోజు 40 కిలోల చందనాన్ని అరగదీశారు. ఈ చందనాన్ని అర్చకులు తూకంవేసి భద్రపరిచారు. ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ఏఈవో ఆనంద్కుమార్ పర్యవేక్షించారు. కాగా ఏడాదిలో నాలుగుసార్లు మూడు మణుగుల చొప్పున పచ్చి చందనాన్ని సమర్పిస్తారు. చందనోత్సవం రోజు రాత్రి, వైశాఖ పౌర్ణమి, జ్యేష్ట పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి రోజు చందనం సమర్పణ జరుగుతుంది. ఈనెల 10న జరిగిన చందనోత్సవం రోజు తొలివిడత చందన సమర్పణ చేశారు. రెండో విడతగా ఈనెల 23న వైశాఖ పౌర్ణమి రోజు చందనాన్ని సమర్పించనున్నారు. -
రేపు తాగునీటి సరఫరాకు అంతరాయం
డాబాగార్డెన్స్ : జీవీఎంసీ జోన్–2 పరిధి పలు ప్రాంతాల్లో సోమవారం తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన తాగునీటి సరఫరా చేసే విషయమై బోని గ్రామం వద్ద ఉన్న గోస్తనీ హెడ్ వాటర్ వర్క్స్ నుంచి తగరపువలస వరకు నూతనంగా 400 ఎంఎం మందం గల పైపులైన్ వేస్తున్నందున ఆ రోజు జోన్–2 పరిధి పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని చెప్పారు. బోయపాలెం హౌసింగ్ కాలనీ, పరదేశిపాలెం, ఈడబ్ల్యూఎస్ కాలనీ, పరదేశిపాలెం విలేజ్, బోరవానిపాలెం విలేజ్, మారికవలస విలేజ్, పీపీ–2 హౌసింగ్ కాలనీ, సాయిరాం కాలనీ ఫేస్ 2 అండ్ 3, జీసీసీ లే అవుట్, భగవాన్దాస్ కాలనీ, రేవళ్లపాలెం, ఎంఎస్ఆర్ లే అవుట్, సంపత్నగర్, సాయిప్రియ లే అవుట్, గాయత్రీనగర్ హౌసింగ్ కాలనీ, పీఎం పాలెం మొదటి బస్టాప్ ఏరియా, స్టేడియం వెనుక ప్రాంతంతో పాటు పలు ప్రాంతాల్లో తాగునీటికి అంతరాయం ఏర్పడనుందని, ప్రత్యామ్నాయంగా ట్యాంకర్ల ద్వారా ఆయా ప్రాంతాల ప్రజలకు నీటి సరఫరా చేయనున్నట్టు చెప్పారు. -
స్ట్రాంగ్ రూంల వద్ద పటిష్ట భద్రత
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనామహారాణిపేట: ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా పేర్కొన్నారు. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్త వహించాలని జిల్లా అధికారులకు సూచించారు. ఏయూ ఇంజినీరింగ్ కళాశాల పరిధిలో ఏర్పాటు చేసిన ఈవీఎంల స్ట్రాంగ్ రూమలను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున, పోలీసు కమిషనర్ డాక్టర్ రవిశంకర్తో కలిసి శనివారం ఆయన పరిశీలించారు. విశాఖ పార్లమెంటుతో పాటు, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన స్ట్రాంగ్ రూమలను తనిఖీ చేశారు. అక్కడ పరిస్థితులను గమనించారు. తలుపులకు వేసిన తాళాలను, వాటికున్న సీళ్లను పరిశీలించారు. అన్ని చోట్లా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారా లేదా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. తనిఖీ అనంతరం లాగ్ బుక్లో మీనా సంతకం చేశారు. మూడెంచల భద్రతను పాటించాలని, ఇక్కడి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్కు సూచించారు. అనధికార వ్యక్తులను స్ట్రాంగ్ రూమ్లు ఉన్న ప్రాంతంలోకి ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించకూడని ఆదేశించారు. ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం జాగ్రత్తలు వహించాలన్నారు. పర్యటనలో భాగంగా అక్కడి పరిస్థితులను, జిల్లా యంత్రాంగం తరఫున చేపట్టిన చర్యలను సీఈవోకు కలెక్టర్, పోలీసు కమిషనర్ వివరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్, ఆయా నియోజకవర్గాల ఆర్వోలు డి.హూస్సెన్ సాహెబ్, సీతారామ్ముర్తి, శేష శైలజ, అఖిల పాల్గొన్నారు. -
వసూళ్లపై విజిలెన్స్ ఆరా!
సాక్షి, విశాఖపట్నం : విద్యుత్ కనెక్షన్ల మంజూరులో వసూళ్ల పర్వానికి పాల్పడుతున్న వైనంపై విజిలెన్స్ అఽధికారులు ఆరా తీస్తున్నారు. గతేడాది కాలంగా ఎక్కడెక్కడ ఎన్ని వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేశారో.. దానికి సంబంధించిన వివరాలను విజిలెన్స్ సేకరిస్తోంది. ఉమ్మడి విశాఖలో తరచుగా జరుగుతున్న విద్యుత్ ప్రమాదాలపై ‘సమన్వయ లోపంతో షాక్’ శీర్షికన శనివారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన విషయం విదితమే. దీనిపై విజిలెన్స్ దృష్టిసారించింది. మరోవైపు కథనంపై ఈపీడీసీఎల్ సర్కిల్ అధికారులు స్పందిస్తూ విద్యుత్ భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించే విషయంలో బాధ్యతగా వ్యవహరిస్తున్నామని స్పష్టం చేశారు. అదేవిధంగా సబ్బవరం, ఇతర మండలాల్లో రైతులకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చే విషయంలో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న సిబ్బందిపై దృష్టిసారిస్తున్నామని, బాధ్యులపై చర్యలకు ఉపక్రమిస్తామని ఎస్ఈ మహేంద్రనాథ్ అన్నారు. రెండు నెలల కాలంలో జరిగిన ప్రమాదాల్లో మృతి చెందిన హెల్పర్స్.. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మరమ్మతులు చేపట్టేందుకు వెళ్లడం వల్ల దురదృష్టకరమైన ఘటనలు చోటుచేసుకున్నాయన్నారు. ఈ విషయంలో మిగిలిన వారందరికీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు ఎస్ఈ తెలిపారు. అదేవిధంగా కశింకోట డివిజన్ పరిధిలో ప్రతి చోటా వినియోగదారులకు అవగాహన కల్పించేందుకు కరపత్రాలు పంపిణీ చేస్తున్నామని డివిజన్ ఈఈ రామకృష్ణ తెలిపారు. విద్యుత్ అంతరాయాలు తలెత్తకుండా నాణ్యమైన విద్యుత్ అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని వివరించారు. భద్రతపై బాధ్యతగా వ్యవహరిస్తున్నాం.. వసూళ్లపై దృష్టిసారిస్తూ బాధ్యులపై చర్యలు తీసుకుంటాం ఈపీడీసీఎల్ విశాఖ సర్కిల్ అధికారులు -
సంపత్ వినాయగర్ హుండీ ఆదాయం రూ.15.31 లక్షలు
సీతమ్మధార : ఆశీలమెట్టలో గల సంపత్ వినాయగర్ ఆలయంలో హుండీ ఆదాయాన్ని శనివారం లెక్కించారు. 23 రోజులకు రూ.15,31,839 లక్షలు, వెండి 171 గ్రాములు, యూఎస్ఏ డాలర్లు 90, సింగపూర్ డాలర్లు 10, ఎస్బీఐ చెక్కు రూ.111 వచ్చినట్లు ఆలయ ఉప కమిషనర్ అండ్ కార్యనిర్వహణాధికారిని ఎన్.సుజాత తెలిపారు. దేవాదాయ శాఖ తనిఖీదారులు, డిప్యూటీ కమిషనర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కె.యు.డి.ఎన్ ప్రసాద్, బి.వసంత కుమార్, ఆలయ ఫౌండర్, ఫ్యామిలీ మెంబర్ టి,చోళన్, వెంకటేశ్వర సేవా సంఘం సభ్యులు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిబ్బంది పాల్గొన్నారు. -
ఫుడ్ ట్రెండ్
కొత్త రుచులు కోరుతున్న జనం వారంలో ఒకసారి బయటి భోజనానికి ప్రాధాన్యం ఇంటికొచ్చే బందువులకూ హోటల్ వంటలతోనే విందు వైరెటీ రుచులతో హోటళ్ల ఆహ్వానం ప్రత్యేక ఆఫర్లతో ఊరిస్తున్న ఫుడ్ డెలివరీ యాప్స్ డాబాగార్డెన్స్ : నగర వాసులు కొత్త రుచులను కోరుకుంటున్నారు. వారిని ఆకర్షించేలా వైరెటీ రుచులతో హోటళ్లు ఆహ్వానం పలుకుతున్నాయి. సాంకేతికత పెరగడం, పలు రకాల ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ అందుబాటులోకి రావడంతో వంట చేసుకునే వారి సంఖ్య నానాటికీ తగ్గుతోంది. ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువులతో క్షణం తీరిక లేకుండా ఉండే వారికి ఫుడ్ డెలివరీ యాప్స్ ఓ వరంలా మారాయి. ఈ యాప్స్ ప్రత్యేక ఆఫర్లను కూడా ఇస్తున్నాయి. భార్యాభర్తలు ఇద్దరిలో ఒకరు మాంసాహారం, మరొకరు శాకాహార ప్రియులైనా.. ఒకరు సౌత్ ఇండియన్.. ఇంకొకరు నార్త్ ఇండియన్ అయినా సరే.. ఏక కాలంలో వారి సంప్రదాయాలు, సంస్కృతులకు చెందిన ఆహార పదార్థాలు ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే క్షణాల్లో వచ్చేస్తున్నాయి. కిరణ్, సంధ్య కొత్తగా పెళ్లయిన జంట. ఇద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు. వర్క్లో ఇద్దరూ బిజీ. ఇద్దరి షిఫ్ట్లు వేరు. ల్యాప్టాప్లో లాగినైతే క్షణం తీరిక ఉండదు. వంట చేయాలంటే కుదిరే పని కాదు. వర్క్ చేస్తూనే తమ అభిరుచులకు తగినట్టు స్మార్ట్ ఫోన్లో ఫుడ్ డెలివరీ యాప్స్లో ఫుడ్ ఆర్డర్ చేయడం నిమిషాల వ్యవధిలో వచ్చే ఫుడ్ ఐటమ్స్ తింటూనే విధులు నిర్వహించడం వారికి అలవాటుగా మారింది. -
ప్రాణం తీసిన ఈత సరదా
పెందుర్తి : మేహాద్రిగెడ్డ రిజర్వాయర్కు స్నేహితులతో కలిసి వెళ్లిన ఓ యువకుడు నీట మునిగి మృతి చెందాడు. పెందుర్తి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని సీతంపేటకు చెందిన సుర పవన్(22) స్నేహితులతో కలిసి శనివారం ఉదయం ఈతకు వచ్చాడు. మేహాద్రిలో దిగిన తరువాత పవన్ ఆకస్మాత్తుగా నీట ముగినిపోయాడు. సాయంత్రం పవన్ మృతదేహాన్ని వెలికి తీశారు. ఘటనపై సమాచారం అందుకున్న పెందుర్తి పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించారు. సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు జరుగుతుంది. -
గ్రూప్స్–2 మెయిన్స్కు ఉచిత శిక్షణ
ఎంవీపీకాలనీ : ఎంవీపీ కాలనీలోని సర్దార్ గౌతు లచ్చన్న ఏపీ బీసీ స్టడీ సర్కిల్ ద్వారా గ్రూప్–2 మెయిన్స్కు ఉచిత శిక్షణ అందించనున్నారు. మెయిన్స్కు అర్హత సాధించిన బీసీ, ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులు శిక్షణకు అర్హులని స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఎస్.శ్రీదేవి ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఈ నెల 22వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. రెండు నెలల పాటు సాగే శిక్షణకు 60 మందిని ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. శిక్షణకు ఎంపికై న అభ్యర్థులకు స్టైఫండ్తో పాటు స్టడీ మెటీరియల్ అందించనున్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తులను ఎంవీపీ కాలనీలోని సర్దార్ గౌతు లచ్చన్న ఏపీ బీసీ స్టడీ సర్కిల్లో అందజేయాలన్నారు. వివరాలకు 9492569177 నంబర్లో సంప్రదించాలన్నారు. -
సీబీఎస్ఈపై ముగిసిన శిక్షణ
కశింకోట: సీబీఎస్ఈపై ఇచ్చిన శిక్షణను సద్వినియోగం చేసుకుని, విద్యార్థులకు సక్రమంగా పాఠాలు బోధించాలని విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు(ఆర్జేడీ) విజయభాస్కర్ తెలిపారు. విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోని 60 ప్రభుత్వ పాఠశాలల్లో 9,10 తరగతులకు విద్యార్థులకు గణితం, భౌతిక, రసాయనిక శాస్త్రం బోధించే ఉపాధ్యాయులకు రెండు రోజులపాటు శిక్షణ ఇచ్చారు. మండలంలోని తేగాడ ప్రభుత్వ ఆదర్శ పాఠశాల (మోడల్ స్కూలు)లో ఇచ్చిన ఈ శిక్షణ శనివారం ముగిసింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిక్షణలో నేర్చుకున్న అంశాలను ఉపాధ్యాయులు ఆకళింపు చేసుకుని విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించడానికి కృషి చేయాలన్నారు. సాంఘిక, జీవ శాస్త్రాలు బోధించే ఉపాధ్యాయులకు కూడా ఇదే తరహాలో సోమవారం నుంచి శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్టు తెలిపారు. జిల్లా విద్యా శాఖ అఽధికారి వెంకటలక్ష్మమ్మ పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో జిల్లా ఉప విద్యా శాఖ అధికారి అప్పారావు, రాష్ట్ర పరిశీలకురాలు శ్రీలత, జిల్లా సీబీఎస్ఈ విద్యా సమన్వయకర్త విజయలక్ష్మి, ఎంఈవో కె.చిట్టిబాబు, కెఎస్ఎన్ మూర్తి, ప్రిన్సిపాల్ ఐ.మార్తా తిలకం పాల్గొన్నారు. -
సింహగిరికి ఎలక్ట్రిక్ బస్సు సర్వీసు
సింహాచలం : సింహగిరి ఘాట్రోడ్డులో ఎలక్ట్రిక్ బస్సు సర్వీసును శనివారం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం ప్రారంభించింది. దేవస్థానానికి చెందిన శ్రీకృష్ణాపురంలోని గోశాలలో బస్సుకు అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్గజపతిరాజు పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి ఆయనతో పాటు దేవస్థానం ఈవో ఎస్.శ్రీనివాసమూర్తి, పలువురు ఉద్యోగులు, మీడియా ప్రతినిధులు రెండో టోల్గేట్ ద్వారా సింహగిరికి బస్సులో తరిలివెళ్లారు. ఈసందర్భంగా అశోక్గజపతిరాజు మాట్లాడుతూ భక్తులే భగవంతునికి నిజమైన ప్రతినిధులని, భగవంతుడికి ఇచ్చిన విరాళాలు వృథా చేయకూడదని, భక్తుల సౌకర్యాల కోసం ఖర్చు చేస్తే హర్షిస్తాడన్నారు. భగవంతుడు ఇచ్చిన సృష్టిని భావితరాలకు అందించాలన్నారు. పర్యావరణ పరిక్షణలో భాగంగా దేవస్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేయడం జరిగిందన్నారు. దేవస్థానం ఈవో ఎస్.శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ సింహగిరి ఘాట్రోడ్డులో రెండు ఎలక్ట్రిక్ బస్సులు నడపాలని నిర్ణయించామని. తొలుత రూ.1.65 కోట్లతో కొనుగోలు చేసిన బస్సును ప్రారంభించామన్నారు. మొత్తం 42 సిట్టింగ్ కెపాసిటీ, స్టాండింగ్ కెపాసిటీ 30 ఉంటుందన్నారు. రెండున్నర గంటలు చార్జ్చేస్తే 225 కిలోమీటర్లు ప్రయాణించవచ్చన్నారు. టికెట్టు రూ.15గా నిర్ణయించామన్నారు. రెండో బస్సు కొనుగోలుకు కూడా ఇప్పటికే 50శాతం నగదును చెల్లించినట్టు చెప్పారు. అతిత్వరలోనే ఆ బస్సు కూడా దేవస్థానానికి రానుందన్నారు. రూ.18 లక్షలతో 18కేవీ కెపాసిటీతో శ్రీకృష్ణాపురం గోశాలలోనే చార్జింగ్ పాయింట్ ఏర్పాటు చేయనున్నట్టు ఆయన తెలిపారు. ప్రస్తుతం కంపెనీ సమకూర్చిన అనుభవజ్ఞులైన డ్రైవర్లతో బస్సును నడుపుతున్నామని చెప్పారు. దేవస్థానం డ్రైవర్లకు శిక్షణ ఇస్తున్నామని, శిక్షణ అనంతరం వారే ఎలక్ట్రికల్ బస్సులు నడుపుతారని తెలిపారు. కార్యక్రమంలో దేవస్థానం ఈఈ రాంబాబు, డీఈ హరిరాజు, ఏఈ గోవర్దన్, సూపరింటెండెంట్లు యనమండ్ర అప్పారావు, సునీల్, సింహాచలం ఆర్టీసీ డిపో మేనేజర్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ప్రారంభించిన దేవస్థానం చైర్మన్ అశోక్ గజపతిరాజు రూ.1.65 లక్షలతో కొనుగోలు 18 లక్షలతో చార్జింగ్ పాయింట్ ఏర్పాటు పనులు త్వరలో రానున్న మరో బస్సు
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పశుపోషకులకు బాసటగా..
జీపీ కార్మికులకు వేతనాలేవి?
సొంత జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు కేటాయించాలి
తడిసిన ధాన్యం కొనాల్సిందే
గో హత్య నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి
అలకాపురికాలనీలో ఆక్రమణ
23న ప్రతిభా పురస్కారాల ప్రదానం
అజీంప్రేమ్జీ యూనివర్సిటీకి ఎంపిక
పని దొరికిందని వెళితే.. ప్రాణం పోయింది
ఖరీఫ్లో ఎరువుల సరఫరాకు కార్యాచరణ
తప్పక చదవండి
- నా భార్య హింసిస్తోంది.. రక్షణ కల్పించండి
- పర్యాటకులకు వేసవి విడిది ప్రాంతాలు
- పశుపోషకులకు బాసటగా..
- నేటి నుంచే టెట్.. రోజుకు రెండు షిప్టులుగా నిర్వహణ
- టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన వ్యక్తి మృతి
- మార్చినచోటే మారణకాండ
- గాల్లో తేలిపోతూ..కార్లో ఎగిరిపోతూ..
- అధికారం చేపట్టగానే అగ్నివీర్ రద్దు.. రాహుల్ కీలక వ్యాఖ్యలు
- కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
- పెట్టుబడుల సునామీ.. టాటా మోటార్స్ కీలక నిర్ణయం
Advertisement