-
సరిపడా విత్తనాలు అందుబాటులో ఉన్నాయి
● అకాల వర్షాలతో ఆశపడొద్దు.. ● డీఏఓ విజయనిర్మలవైరా/రఘునాథపాలెం : జిల్లాలో రైతులకు సరిపడా పచ్చిరొట్ట, పత్తి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా వ్యవసాఽయాధికారి ఎం.విజయనిర్మల అన్నారు. వైరా పీఏసీఎస్ కార్యాలయంలో బుధవారం ఆమె పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం రఘునాథపాలెంలో విలేకరులతో మాట్లాడారు. రైతులు అడపాదడపా వచ్చే వర్షాలకు కాకుండా అదను వచ్చినప్పుడే విత్తనాలు వేస్తేనే మొలకలు బాగా వస్తాయని సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు 3.25 లక్షల ప్యాకెట్ల పత్తి విత్తనాలను లైసెన్స్డ్ డీలర్ల వద్ద అందుబాటులో ఉంచామని తెలిపారు. అన్ని రకాల విత్తనాలూ సమాన దిగుబడులనే ఇస్తాయని, రైతులు ఒకే రకంపై దృష్టి పెట్టడంతో వ్యాపారులు వాటికి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని చెప్పారు. ఇక 14,187 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు సొసైటీలలో సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. మరో 10 వేల క్వింటాళ్ల విత్తనాల కోసం ప్రతిపాదనలు పంపామని తెలిపారు. ఇప్పటికే 7,358 క్వింటాళ్ల విత్తనాలు రైతులకు 60 శాతం సబ్సిడీపై అందించినట్లు వివరించారు. ఎర్ర రేగడి భూముల్లో 60 మి.మీ., నల్ల నేలల్లో 60 నుంచి 80 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైన తర్వాతే విత్తనాలు వేస్తేనే మంచిగా మొలకెత్తుతాయని సూచించారు. లైసెన్స్ ఉన్న డీలర్ల వద్ద మాత్రమే పత్తి విత్తనాలు కొనుగోలు చేయాలని, విత్తన రకం, లాట్ నంబర్ వంటి వివరాలతో కూడిన రసీదు తీసుకోవాలని చెప్పారు. పంటకాలం పూర్తయ్యే వరకు విత్తన ప్యాకెట్లు, రశీదు జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచించారు. నిషేధిత బీటీ–3, హెటీ కాటన్ రకం విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు ఆయిల్పామ్ సాగుపై దృష్టి పెట్టాలని, ఒకసారి నాటితే 40 ఏళ్ల పాటు దిగుబడి వస్తుందని, ప్రభుత్వం కూడా ఈ సాగును ప్రోత్సహిస్తోందని వివరించారు. ఆయా కార్యక్రమాల్లో వైరా ఏడీఏ కరుణశ్రీ, ఏఓ పవన్కుమార్, సొసైటీ సీఈఓ రామకృష్ణ, రఘునాథపాలెం విత్తన గోదాం ఆర్ఎం భిక్షం, ఖమ్మం డివిజన్ సహాయ వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, ఏఓ ఇంటూరి భాస్కర్రావు, టెక్నికల్ ఏఓ చాయాదేవి, సొసైటీ చైర్మన్ తాతా రఘురాం, సీఈఓ మద్దినేని వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య
ఖమ్మంరూరల్: మండలంలోని పెద్దతండా పంచాయతీ ఇందిరమ్మకాలనీకి చెందిన మాళోత్ నందిని (19) వివాహిత ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం గార్ల మండలం పుల్లూరుకు చెందిన నందినికి ఇందిరమ్మకాలనీకి చెందిన దుస్సా సుమన్తో ఏడాది కిందట వివాహమైంది. కొంతకాలం నుంచి అదనపు కట్నం తెమ్మని అత్త కల్యాణి, భర్త సుమన్ వేధింపులకు గురి చేస్తున్నారు. దీంతో నందిని ఇంట్లో దూలానికి చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు అత్త, భర్తపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రామారావు తెలిపారు. నాటుసారా స్థావరాలపై దాడులు దుమ్ముగూడెం: మండలంలోని ములకనాపల్లి, సుజ్ఞానపురం, చింతగుప్ప గ్రామాల్లోని అటవీ ప్రాంతంలో అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కరమ్చంద్ ఆధ్వర్యంలో బుధవారం నాటుసారా స్థావరాలపై దాడులు చేపట్టారు. గుడుంబా తయారీకి ఉపయోగించే 4,200 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. భద్రాచలం ఎకై ్సజ్ సీఐ రహీమున్నీషాబేగం, ఖమ్మం ఎన్ఫోర్స్మెంట్ సీఐ శ్రీనివాస్, గౌతమ్, కిశోర్ తదితరలు పాల్గొన్నారు.గంజాయి పట్టివేత వేంసూరు: మండల కేంద్రం అంబేడ్కర్కాలనీ సమీపంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన బైక్ను ఆపి పరిశీలించారు. అందులో 400 గ్రాముల గంజాయి పట్టుపడినట్లు ఎస్ఐ వీరప్రసాద్ తెలిపారు. గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులతో పాటు బైక్, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని, కేసు నమోదు చేశామని, మరో ఇద్దరు పరారీలో ఉన్నారని ఎస్ఐ వివరించారు. జేసీబీ, ట్రాక్టర్ల పట్టివేత బూర్గంపాడు: కృష్ణసాగర్ అటవీ ప్రాంతంలో మట్టి తవ్వకాలు జరుపుతున్న జేసీబీ, రెండు ట్రాక్టర్లను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. అటవీ ప్రాంతంలో మట్టి తవ్వుతున్నారనే సమాచారంతో అధికారులు దాడులు నిర్వహించారు. ఒక జేసీబీని, రెండు ట్రాక్టర్లను పట్టుకుని సందెళ్లపాడు నర్సరీకి తరలించారు. మట్టి తవ్వకాలపై విచారణ చేసి కేసు నమోదు చేస్తామని అటవీశాఖ అధికారులు తెలిపారు. -
భానుడి భగభగ
● జిల్లాలో భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలు ● 40–44.3 డిగ్రీల మేర నమోదుఖమ్మంవ్యవసాయం: కొద్ది రోజులుగా తగ్గిన ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. బుధవారం భానుడి ప్రతాపంతో జిల్లా వ్యాప్తంగా ఎండ తీవ్రత 40 నుంచి 44.3 డిగ్రీల మధ్య నమోదైంది. ఈ ఏడాది మే ఆరంభానికి ముందే ఎండ తీవ్రత గరిష్ట స్థాయికి చేరింది. మే 1న గరిష్టంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మే మొదటి వారం నుంచి వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఉపరితల ఆవర్తనం, ద్రోణి కారణంగా అకాల వర్షాలు కురిశాయి. దీంతో వాతావరణం చల్లబడింది. అకాల వర్షాలకు రైతులు పంటల సాగుకు దుక్కులు కూడా చేసుకుంటున్నారు. మరో వర్షం కురిస్తే విత్తనాలు వేసేందుకు సమాయత్తం అవుతున్నారు. 47 డిగ్రీల మేర నమోదైన ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా 38 డిగ్రీల లోపునకు పడిపోయాయి. దీంతో ప్రజలు కొంత ఉపశమనం పొందారు. ఈనెల 25న రోహిణి కార్తె రోజున వాతావరణం పూర్తిగా చల్లబడినప్పటికీ.. ఆ తర్వాత ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. జిల్లాలోని పలు ప్రాంతాలు బుధవారం ఆరెంజ్ అలెర్ట్లోకి చేరాయి. రోహిణి కార్తె తన ప్రభావం చూపిస్తోంది. జూన్ 7 వరకు ఈ కార్తె కొనసాగనుంది. కాగా, నైరుతి రుతుపవనాలు జూన్ మొదటి వారంలో రాష్ట్రానికి వచ్చే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. రుతుపవనాలు వస్తే వాతావరణంలో మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. రెండు, మూడు రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ ముందుగానే ప్రకటించింది. అదే విధంగా మంగళవారం నుంచి ఎండ తీవ్రత ఉండగా, బుధవారానికి ఉష్ణోగ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలతో పాటు వడగాడ్పులు కూడా వీస్తున్నాయి. దీనికి తోడు ఉక్కపోతలు పెరిగి ప్రజలు సమతమతవుతున్నారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా పగటి వేళల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావటం లేదు. ఇక పగటి పూట రహదార్లు కర్ఫ్యూను తలపిస్తున్నాయి. బుధవారం నమోదైన ఉష్ణోగ్రతలిలా.. ముదిగొండ మండలం పమ్మిలో అత్యధికంగా 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెంలో 44.2, ఖమ్మం నగరంలోని ప్రకాష్నగర్లో 44.1, ఖమ్మం నగరంలోని ఖానాపురం, ముదిగొండ మండలం బాణాపురంలో 44, మధిరలో 43.9, ముదిగొండ, వైరాలో 43.8, చింతకానిలో 43.7, కొణిజర్ల మండలం పెదగోపతిలో 43.6, కొణిజర్లలో 43.4, తిరుమలాయపాలెం మండలం బచ్చోడు, కాకరవాయి, నేలకొండపల్లి, ఏన్కూరుల్లో 43.3, ఎర్రుపాలెంలో 43, ఖమ్మం నగరంలోని ఎన్ఎస్పీ గెస్ట్హౌస్ వద్ద 42.9, తల్లాడ, కారేపల్లిలో 42.8, కూసుమంచిలో 42.7, వేంసూరు 42.6, తిరుమలాయపాలెం, సతుపల్లిలో 42.5, పెనుబల్లిలో 42.4, ఏన్కూరు మండలం తిమ్మారావుపేటలో 42.1, బోనకల్ మండలం రావినూతలలో 41.9, కామేపల్లి మండలం లింగాలలో 41.8, కల్లూరులో 41.7, రఘునాథపాలెంలో 41.3, తల్లాడ మండలం కుర్నవల్లిలో 40.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
షరతులు వర్తిస్తాయి..
విత్తన విక్రయాల్లో వ్యాపారుల మాయాజాలం ● డిమాండ్ ఉన్నవి బ్లాక్.. ఆపై రెట్టింపు ధర ● ఇంకొన్ని రకాలు కొంటేనే ఇస్తామని కొర్రీలు ● గత ఏడాది దిగుబడి ఆధారంగా కొన్ని విత్తనాలపైనే రైతుల ఆసక్తి ● స్థానికంగా లభ్యత లేక ఇతర ప్రాంతాలకు పరుగులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు.. రైతులు కొన్ని కంపెనీల విత్తనాలపైనే ఆసక్తి చూపిస్తున్నారు. ప్రభుత్వం అనుమతించిన కంపెనీల విత్తనాలన్నీ ఉత్తమ దిగుబడులు ఇస్తాయి. అలా కాకుండా కొన్ని కంపెనీలవే కావాలనుకుంటున్నారు. పొరుగు రాష్ట్రాల్లో కొనుగోలు చేసిన విత్తనాలతో నష్టం ఎదురైతే చర్యలు మా పరిధిలో ఉండవు. జిల్లాలో సమృద్ధిగా విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. వ్యాపారులెవరైనా ధరలు పెంచినట్టు తెలిస్తే చర్య తీసుకుంటాం. – ఎం.విజయనిర్మల, జిల్లా వ్యవసాయాధికారిఖమ్మంవ్యవసాయం: వానాకాలం పంటల సాగుకు రైతులు దుక్కులు సిద్ధం చేసుకుంటున్నారు. రానున్న సీజన్లో జిల్లా వ్యాప్తంగా అన్ని పంటలు కలిపి 7,03,676 ఎకరాల్లో సాగవుతాయని అధికారులు అంచనా వేశారు. ఇందులో 2,01,834 ఎకరాల్లో పత్తి సాగవుతుందని భావిస్తున్నారు. ఇందుకోసం వివిధ కంపెనీల నుంచి 5.50 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లను అందుబాటులో తీసుకురావాలనే కసరత్తు జరుగుతోంది. ఈ నేపథ్యాన రైతుల డిమాండ్ను ఆసరాగా చేసుకుంటున్న కొందరు వ్యాపారులు మాయాజాలానికి తెరలేపారు డిమాండ్ ఉన్న పత్తి విత్తనాలు బ్లాక్.. రాష్ట్రంలో పత్తి అధికంగా సాగు చేసే జిల్లాల్లో ఖమ్మం ఒకటి. దీంతో ఏటా పత్తి విత్తన విక్రయాల్లో వ్యాపారులు దందా కొనసాగిస్తూనే ఉన్నారు. రైతుల నుంచి డిమాండ్ ఉన్న విత్తనాలను బ్లాక్ చేసి అధిక ధరలకు విక్రయించడం ఆనవాయితీగా వస్తోంది. అనేక రకాల విత్తనాలకు ప్రభుత్వ అనుమతి ఉన్నా ఒకటి, రెండు రకాలకు డిమాండ్ ఎక్కువ. గతేడాది 10 నుంచి 15 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చిన రకాలకు రైతులు ఈ ఏడాది ప్రాధాన్యత ఇస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకున్న వ్యాపారులు ఆయా రకాల విత్తనాలను బ్లాక్ చేస్తున్నారు. ధర రెట్టింపు.. రైతులు డిమాండ్ చేసే పత్తి విత్తనాలను వ్యాపారులు దాదాపుగా రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నారు. ఈ ఏడాది 475 గ్రాముల పత్తి విత్తన ప్యాకెట్ ధరను ప్రభుత్వం రూ.864గా నిర్ణయించింది. కానీ కొందరు వ్యాపారులు ఏకంగా రూ.1,500 వరకు విక్రయిస్తూ బిల్లు మాత్రం ప్రభుత్వ ధరకే ఇస్తుండడం గమనార్హం. అలాగే, కొందరు వ్యాపారులు ఇప్పుడు స్టాక్ లేదని.. రైతుల నుంచి డబ్బు తీసుకుని రెండు, మూడు రోజుల తర్వాత విత్తనాలు ఇస్తున్నారని సమాచారం. అంతేకాకుండా సమాజంలో పలుకుబడి, పరపతి ఉన్న వారికే విత్తనాల అమ్మకంలో ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అవి కూడా కొనండి.. డిమాండ్ ఉన్న పత్తి విత్తనాలను అధిక ధరలకు విక్రయించడమే కాక ఇంకొన్ని విత్తనాలు సైతం కొనా లని వ్యాపారులు ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలిసింది. ఇవికూడా వ్యాపారులకు ఎక్కువ లాభం వచ్చేవిగా ఉంటున్నాయని సమాచారం. మూడు, నాలుగు ప్యాకెట్లు రైతులు కోరినవి ఇస్తూ.. ఇంకొకటి వ్యాపారి అంటగడుతున్నట్లు తెలుస్తోంది. గుంటూరుకు పరుగులు కొందరు రైతులు పత్తి విత్తనాల కోసం ఏపీలోని గుంటూరు తదితర ప్రాంతాలకు వెళ్తున్నట్లు సమాచారం. అక్కడ విత్తనాల ధర ఎక్కువగానే ఉన్నా ఇక్కడితో పోలిస్తే కొరత లేకపోవడం.. జిల్లాకు ఏపీ సరిహద్దుగా ఉండడంతో ఉదయం వెళ్లి సాయంత్రం వరకు తెచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని కూసుమంచి, మధిర, వైరా, ఖమ్మం వ్యవసాయ డివిజన్ల పరిధిలోని మండలాల రైతులు పెద్ద సంఖ్యలో ఇప్పటికే గుంటూరుకు తరలివెళ్లి విత్తనాలను కొనుగోలు చేశారని సమాచారం. -
విద్యార్థి మృతిపై కేసు నమోదు
భద్రాచలంటౌన్: భద్రాచలం పట్టణం కూనవరం రోడ్డులోని మారుతి పారా మెడికల్ కళాశాల విద్యార్థి అనుమానాస్పద మృతిపై కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన్నట్లు పట్టణ సీఐ సంజీవరావు బుధవారం తెలిపారు. విద్యార్థి మృతికి గల ఆధారాల సేకరణ, సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలన, సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకుని సాక్షులను విచారిస్తామని, ఘటనకు సంబంధించి ప్రజల వద్ద ఎలాంటి ఆధారాలు ఉన్నా పోలీసులకు ఇచ్చి సహకరించాలని కోరారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి నర్సింగ్ విద్యార్థిని పగిడిపల్లి కారుణ్య మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టి, మారుతి పారామెడికల్ కళాశాల గుర్తింపును రద్దు చేయాలని కోరుతూ ఆదివాసీ సంఘాల జేఏసీ, హ్యూమన్ రైట్స్ సంఘాల ఆధ్వర్యంలో బుధవారం భద్రాచలం ఐటీడీఏ ఎదుట నిరసన చేపట్టి పీఓ ప్రతీక్ జైన్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆదివాసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. అణగారిన వర్గాలకు చెందిన ఆడబిడ్డ అనుమానాస్పదంగా మరణిస్తే ప్రభుత్వ యంత్రాంగం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించడం శోచనీయమన్నారు. అగ్రవర్ణాలకు ఏదైనా అన్యాయం జరిగితే నిందితులను ఎన్కౌంటర్ చేస్తారని, కానీ, కారుణ్య మృతిపై ఎందుకు సరైన విచారణ జరిపించడం లేదని ప్రశ్నించారు. -
అనుమానాలెన్నో..?
● పథకం ప్రకారం జరిగిన హత్యా? నిజంగానే ప్రమాదం జరిగిందా? ● పోలీసుల పర్యవేక్షణలో తల్లీ, కూతుర్ల అంత్యక్రియలు రఘునాథపాలెం: మండలంలోని హరియాతండా సమీపంలో మంచుకొండ – పంగడి ప్రధాన రహదారి పక్కన చెట్టును ఢీకొన్న కారు ప్రమాదంలో తల్లీ, ఇద్దరు కుమార్తెలు మృతిచెందిన విషయం విదితమే. కానీ, ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది పథకం ప్రచారం జరిగిన హత్యా? లేక నిజంగానే ప్రమాదం జరిగిందా? అనే అంశంపై పలువురు పలు రకాల వాదనలు వినిపిస్తున్నారు. మంగళవారం రాత్రి కారు ప్రమాదంలో దుర్మరణం చెందిన తల్లీకూతుర్ల అంత్యక్రియలు బుధవారం మండలంలోని బావోజీతండాలో పోలీసుల సమక్షంలో నిర్వహించారు. ఆది నుంచి అనుమానం వ్యక్తం చేస్తున్న మృతురాలి తండ్రి, హరిసింగ్, తల్లి పద్మ, సోదరుడు, సోదరితో పాటు కుటంబ సభ్యులు ఖమ్మం ప్రభుత్వాస్పత్రి వద్ద బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆందోళన చేశారు. మృతురాలి భర్త, ఫిజియోథెరపిస్ట్ అయిన బోడా ప్రవీణ్ కారణమని, ఆయన్ను తీసుకొచ్చిన తర్వాతనే మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించాలని భీష్మించారు. మరో యువతితో వివాహేతర సంబంధం నెరుపుతున్న ప్రవీణ్ను భార్య కుమారి ప్రశ్నిస్తున్న నేపథ్యంలోనే తల్లీ కూతుర్లను హతమార్చి యాక్సిడెంట్గా చిత్రీకరిస్తున్నాడని వందలాది మంది ఆస్పత్రికి చేరుకుని నిరసన తెలిపారు. ప్రవీణ్పై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రఘునాథపాలెం సీఐ శ్రీహరి, ఎస్ఐలు, పోలీసులు జోక్యం చేసుకొని పోస్టుమార్టం నివేదిక అనంతరం విచారణ చేపట్టి చర్యలు చేపడుతామని మృతుల కుంటుంబ సభ్యులకు నచ్చజెప్పి పోస్టుమార్టం పూర్తి చేయించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీ ప్రాంతంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రవీణ్ తరఫు బంధువులు సైతం అక్కడికి వచ్చేందుకు భయపడ్డారు. సాయంత్రం 4 గంటల తర్వాత మూడు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి, బావోజీతండాకు తరలించేందుకు వాహ నం ఎక్కించారు. కాగా, పోస్టుమార్టంలో ఏం తేలిందనే విషయం డాక్టర్లు చెప్పకుండానే ఎలా వెళ్లారని, ఈ విషయం తేలేవరకు మృతదేహాలను తీసుకెళ్లమంటూ మళ్లీ అందోళన చేశారు. మృతదేహాలను దించి శవాల గదిలోకి తరలించారు. మళ్లీ పోలీసులు కలగజేసుకుని, సర్దిచెప్పి మృతదేహాలను పోలీసు బందోబస్తు నడుమ బావోజీతండాకు తరలించి ఇద్దరు చిన్నారులను పూడ్చిపెట్టారు. కుమారి మృతదేహాన్ని దహనం చేశారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు, బంధువులు విలపించిన తీరు చూసి అక్కడివారంతా కన్నీటిపర్యంతమయ్యారు. ముఖ్యంగా చిన్నారుల మృతదేహాలను చూసిన గ్రామస్తులంతా గుండెలవిసేలా రోదించారు. ఏం జరిగి ఉంటుంది? కారు ప్రమాదంలో డాక్టర్ ప్రవీణ్ గాయాలతో బయటపడటం, భార్య, ఇద్దరు కుమార్తెలు మృతి చెందడంపై కుమారి తల్లితండ్రులు అనుమానిస్తున్నారు. కొన్నేళ్లుగా అల్లుడు తమ కుమార్తెను సరిగా చూసుకోవడం లేదని, వివాహేతర సంబంధం పెట్టుకుని వేధిస్తున్నాడని ఆరోపిస్తున్నారు. కారుకు ప్రమాదం జరిగినప్పుడు తల్లీకూతుర్లు వెనుక సీట్లో చనిపోయి ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత సమీపంలోని హరియాతండావాసులు అక్కడికి చేరుకునే సరికి ప్రవీణ్ ముందు సీట్లో, కుమారి, ఇద్దరు చిన్నారులు వెనుక సీట్లు మృతి చెంది ఉన్నారని గుర్తించారు. కారు ముందు భాగం చెట్టును ఢీకొడితే వెనుక ఉన్న వాళ్లు ఎలా మృతిచెందారనే చర్చ సాగుతోంది. పోస్టుమార్టం నివేదిక వస్తేనే అసలు విషయం తెలుస్తుందని, కారులో ఎవరు ఎక్కడ కూర్చున్నారో ఎవరూ స్పష్టంగా చెప్పడం లేదని పోలీసులు చెబుతున్నారు. కాగా, కారు ప్రమాదంలో గాయపడిన బోడా ప్రవీణ్ నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
గోదావరిలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
బూర్గంపాడు: ఇరవెండి సమీపంలోని పంప్ హౌస్ వద్ద నుంచి మంగళవారం గోదావరి దాటుతూ గల్లంతైన వ్యక్తి మృతదేహం బుధవారం లభ్యమైంది. పోలీసుల కథనం ప్రకారం.. దుమ్ముగూడెం మండలం తూరుబాక గ్రామ పంచాయతీలోని రామకృష్ణాపురం గ్రామానికి చెందిన ఎర్రబోలు కోటిరెడ్డి(30) శనివారం రామచంద్రాపురంలోని సోదరి ఇంటికి వచ్చి మంగళవారం ఉదయం గోదావరి అవతల ఒడ్డున ఉన్న స్వగ్రామం వెళ్లేందుకు ఈదుకుంటూ నదిలోకి వెళ్లి గల్లంతయ్యాడు. గమనించిన స్థానికులు కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. వారు ఘటనాప్రాంతంలో నాటు పడవలతో గాలించినా అతని ఆచూకీ దొరకలేదు. కోటిరెడ్డి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ సుమన్ అక్కడకు చేరుకుని పరిశీలించారు. బుధవారం గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని బూర్గంపాడు సివిల్ ఆస్పత్రికి తరలించి పోస్ట్మార్టం నిర్వహించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కేసు దర్యాప్తులో ఉంది. -
పాఠశాలల్లో పనులు పూర్తి చేయండి
ఖమ్మం సహకారనగర్/రఘునాథపాలెం/ఖమ్మం రూరల్ : పాఠశాలల పునఃప్రారంభంలోగా అమ్మ ఆదర్శ పాఠశాలల పనులన్నీ పూర్తి చేయాలని కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. బుధవారం ఆయన ఖమ్మం నగరంలోని రాపర్తినగర్ ప్రాథమిక పాఠశాల, బుర్హాన్పురంలోని విద్యానగర్ కాలనీ ప్రాథమిక పాఠశాల, రఘునాథపాలెం మండలం వేపకుంట్లలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఖమ్మం రూరల్ మండలం కొత్తూరు (వై), చిన్నతండా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల్లో పనుల పురోగతిని పరిశీలించారు. అమ్మ ఆదర్శ పాఠశాల పనుల కింద మంజూరైన నిధులు, చేపట్టిన, పూర్తి చేయాల్సిన పనులపై ఆరా తీశారు. అనంతరం మాట్లాడుతూ నూతన మరుగుదొడ్లు, ప్రస్తుతం ఉన్న వాటికి మరమ్మతులు, తరగతి గదుల్లో మైనర్ రిపేర్ల వంటివి సకాలంలో పూర్తి చేయాలన్నారు. తాగునీరు, విద్యుత్ పనులు, తరగతి గదుల్లో ఫ్యాన్లు, లైట్లు, పెయింటింగ్ తదితర పనులు త్వరగా చేపట్టాలని ఆదేశించారు. గ్రామాల్లోని మహిళా సంఘాల సభ్యులతో అమ్మ ఆదర్శ కమిటీలు ఏర్పాటుచేసి, వారికి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన పనులు అప్పగించినట్లు తెలిపారు. బడి బాట కార్యక్రమాన్ని గొప్పగా చేపట్టి, అడ్మిషన్లు పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులతో నాణ్యమైన బోధన జరుగుతుందని, ఉచిత విద్య, పాఠ్యపుస్తకాలు, భోజనం, యూనిఫామ్ అందిస్తున్నామని తెలిపారు. వీటిని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. తొలుత వేపకుంట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన మహిళా శక్తి కుట్టు కేంద్రాన్ని సందర్శించి, విద్యార్థుల యూనిఫామ్ తయారీ గురించి కలెక్టర్ గౌతమ్ అడిగి తెలుసుకున్నారు. కౌంటింగ్కు సన్నద్ధం కండి.. ఖమ్మం సహకారనగర్ : జూన్ 4న జరగనున్న పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు అధికారులు సన్నద్ధం కావాలని కలెక్టర్ గౌతమ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో కౌంటింగ్ నిర్వహణపై సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 4వ తేదీ ఉదయం 8 గంటలకు ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో ఖమ్మం, పాలేరు, వైరా, మధిర, సత్తుపల్లి, అశ్వారావుపేట, కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు. ముందుగా పోస్టల్ బ్యాలె ట్ లెక్కింపు ఉంటుందని, కౌంటింగ్ సమయంలో అధికారులు, సిబ్బంది నిబంధనలు పాటించాలని అన్నారు. కౌంటింగ్ కేంద్రంలోకి ఎవరికి సెల్ ఫోన్ అనుమతి లేదని, పటిష్ట తనిఖీలు నిర్వహించేలా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 14టేబుళ్లు, ఖమ్మం అసెంబ్లీకి 18టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపా రు. ఆయా కార్యక్రమాల్లో ఏఆర్ఓలు ఆదర్శ్ సురభి, బి.సత్యప్రసాద్, జి. గణేష్, జెడ్పీ సీఈఓ వినోద్, డీఆర్డీఓ సన్యాసయ్య, డీఈఓ సోమశేఖర శర్మ, నోడల్ అధికారి కె. శ్రీరామ్, ఎన్నికల విభాగం తహశీల్దార్ రాంబాబు, మదన్ గోపాల్, మున్సిపల్ ఈఈ కృష్ణలాల్ పాల్గొన్నారు.అధికారులకు కలెక్టర్ గౌతమ్ ఆదేశం -
విత్తనాల కొరత లేదు
ఖమ్మం సహకారనగర్: జిల్లాలో పచ్చిరొట్ట, పత్తి విత్తనాలకు ఎలాంటి కొరత లేదని కలెక్టర్ వి.పి. గౌతమ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకు 21,276 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు కేటాయించగా ఇప్పటివరకు 14,067 క్వింటాళ్ల విత్తనాలు చేరుకున్నాయని తెలిపారు. ఇందులో 8,908 క్వింటాళ్ల విత్తనాలు విక్రయించామని, 5,159 క్వింటాళ్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు. జిల్లాలో ఈ వర్షాకాలంలో 2,01,834 ఎకరాల్లో పత్తి సాగవుతుందని అంచనా వేశామని, ఎకరాకు 2 ప్యాకెట్ల చొప్పున విత్తనాలు అవసరం అవుతాయని తెలిపారు. జిల్లాలో ఇప్పటికే 4,49,347 ప్యాకెట్ల పత్తి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, బుధవారం నాటికి 34 వేల ప్యాకెట్లు మాత్రమే విక్రయించామని వివరించారు. అందరికీ సరిపడా విత్తనాలు సమకూరుస్తామని, రైతులు ఎవరూ ఆందోళన చెందొద్దని సూచించారు. జూన్ 4న కార్గో పార్శిళ్ల వేలం ఖమ్మంమయూరిసెంటర్ : ఖమ్మం బస్టాండ్లోని కార్గో అండ్ పార్శిల్ సర్వీస్ నుంచి వినియోగదారులు తీసుకెళ్లని పాత పార్శిళ్లను వచ్చే నెల 4వ తేదీన వేలం వేయనున్నట్లు ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల ఏటీఎం పవన్కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. లాజిస్టిక్ ఆఫీస్ పరిధిలో పెండింగ్ పార్శిళ్ల క్లియరెన్స్ కోసం వేలం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు వేలంలో పాల్గొనవచ్చని తెలిపారు. విద్యుత్ అంతరాయాలపై సీఎండీ సమీక్షఖమ్మంవ్యవసాయం: విద్యుత్ అంతరాయాలపై టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి బుధవారం రాత్రి అధికారులతో వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. వరంగల్ ఎన్పీడీసీఎల్ పరిధిలోని 16 జిల్లాల్లో ప్రస్తుత సీజన్లో విద్యుత్ అంతరాయాలు, అధిగమించే చర్యలపై చర్చించారు. జూన్ చివరి నాటికి ప్రీ మాన్సూన్ పనులు పూర్తి చేసి నిరంతర విద్యుత్ సరఫరాకు సమగ్ర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వ్యవసాయ విద్యుత్కు రైతులు చేసుకున్న దరఖాస్తులు, వాటి ప్రగతి గురించి అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు అధిక ప్రాధాన్యం ఇచ్చి వానాకాలం సీజన్ నాటికి పూర్తి చేయాలన్నారు. నిబంధనల మేరకు బకాయిలు వసూలు చేయాలని సూచించారు. వీసీలో ఖమ్మం ఎన్పీడీసీఎల్ సర్కిల్ ఆపరేషన్స్ ఎస్ఈ ఎ. సురేందర్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగ నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానంభద్రాచలంటౌన్: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ సర్వీసెస్ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న 1962, 102 వాహనాల పైలట్(డ్రైవర్) ఉద్యోగాల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ నాగేందర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ సర్టిఫికెట్లతో ఈనెల 31న భద్రాచలం ఏరియా ఆస్పత్రిలోని 108 ఆఫీస్లో నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరు కావాలని సూచించా రు. అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణులై బ్యాడ్జ్ లైసెన్స్ కలిగి ఉండాలని, 22–35 సంవత్సరాల వయసు గలవారు అర్హులని పేర్కొన్నారు. -
కనెక్షన్ కావాలి...
వ్యవసాయ విద్యుత్ కోసం రైతుల ఎదురుచూపులు ● గతేడాది జలాశయాల్లో నీరు లేక ఎండిన పంటలు ● ఈ ఏడాది బోర్లు, బావుల ద్వారా సాగుకు ప్రణాళిక ● విద్యుత్శాఖ వద్ద 1,849 మంది దరఖాస్తులు పెండింగ్ సాక్షిప్రతినిధి, ఖమ్మం: వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. గతేడాది వర్షాభావ పరిస్థితులు, జలాశయాల్లో నీటి లభ్యత లేక చాలా ప్రాంతాల్లో పంటలు ఎండిపోగా.. కొందరు అసలు సాగే చేపట్టలేదు. ఈ ఏడాది అలాంటి ఇబ్బందులు రాకుండా రైతులు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటివరకు 1,849 దరఖాస్తులు విద్యుత్ శాఖ వద్ద పెండింగ్లో ఉన్నాయి. అయితే వానాకాలం సీజన్ సమీపిస్తుండడంతో రైతులు విద్యుత్ కనెక్షన్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. వర్షాభావ పరిస్థితులతో.. గతేడాది వర్షాభావ పరిస్థితులతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. జిల్లాలో నాగార్జున సాగర్ ప్రాజెక్టుపై ఆధారపడి అధిక విస్తీర్ణం సాగవుతోంది. సాగర్ అడుగంటడంతో నీరు విడుదల చేయక పాలేరు జలాశయం ఒట్టిపోయింది. వర్షాలు కురవక చెరువులు, కుంటలు కూడా నిండలేదు. ఈ పరిస్థితుల్లో పంటలు నిలువునా ఎండిపోయాయి. కొందరు రైతులు నీటి విడుదల కోసం ఆందోళన చేపట్టినా ఫలితం లేదు. దీంతో ఈ ఏడాది ఎలాంటి పరిస్థితుల్లోనైనా సాగు చేయాలని సంకల్పించిన రైతులు విద్యుత్ మోటార్లు ఏర్పాటు చేస్తున్నారు. మోటార్లు, ట్రాన్స్ఫార్మర్ల కోసం విద్యుత్ శాఖ వద్ద దరఖాస్తులు ఇస్తున్నారు. పెరిగిన డిమాండ్.. ఖమ్మం టీజీఎన్పీడీసీఎల్ సర్కిల్ పరిధిలో ఇప్పటి వరకు 1,15,632 వ్యవసాయ విద్యుత్ సర్వీసులున్నాయి. గతేడాది నుంచి విద్యుత్ కనెక్షన్లకు మరింత డిమాండ్ పెరిగింది. గత వానాకాలంలో పదివేల కనెక్షన్లు తీసుకున్నారు. నీరు లేని పరిస్థితుల్లో పంటల సాగు కోసం బోర్లు, బావుల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇచ్చారు. బోర్లు వేసిన అనంతరం విద్యుత్ కనెక్షన్లకు రైతులు దరఖాస్తు చేస్తున్నారు. ప్రధానంగా సత్తుపల్లి, ఖమ్మంరూరల్, మధిర, బోనకల్, తల్లాడ, పెనుబల్లి, వైరా ప్రాంతాల్లో సాగర్ ఆయకట్టుకు చివరన ఉన్న భూముల రైతులు విద్యుత్ మోటార్ల ఏర్పాటుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. వ్యవసాయ సీజన్ ప్రారంభం అవుతుండడంతో కనెక్షన్లు ఇచ్చేందుకు విద్యుత్ శాఖ కూడా సిద్ధమవుతోంది. తప్పని ఎదురుచూపులు.. ఈ వానాకాలంలో కూడా వర్షాలు పడతాయో లేదో ననే అనుమానంతో చాలామంది రైతులు వ్యవసా య విద్యుత్ కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఒకవైపు వ్యవసాయ సీజన్ ముంచుకొస్తున్నా కొందరికి ఇంకా కనెక్షన్లు ఇవ్వలేదు. దీంతో ఆయా రైతులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. విద్యుత్ శాఖ అధికారులు మాత్రం ప్రాధాన్యతా క్రమంలో కనెక్షన్లు ఇస్తున్నామని అంటున్నారు. జిల్లాలో ఇంకా 1,849 విద్యుత్ కనెక్షన్లు పెండింగ్లో ఉన్నాయి. రైతులు కొంతమేర మాత్రమే నగదు చెల్లిస్తే మూడు స్తంభాలు, వైర్లు, కాసారం, ఇతర పరికరాలను ప్రభుత్వం సబ్సిడీపై అందజేస్తోంది. అయితే కనెక్షన్లు ఆలస్యం అవుతుండడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. త్వరగా విద్యుత్ కనెక్షన్ కావాలనుకుంటే అదనంగా రూ.15వేల నుంచి రూ.20వేల వరకు ఖర్చు పెట్టాల్సి వస్తోందని కొందరు రైతులు వాపోతున్నారు. దరఖాస్తు చేయడమెలా.. వర్షాలు లేకపోవడం, ఉచిత విద్యుత్ను దృష్టిలో పెట్టుకుని బోర్లు, బావుల కింద పంటల సాగుకు రైతులు కరెంట్ కనెక్షన్లు తీసుకుంటున్నారు. 5 హెచ్పీ, 10 హెచ్పీ మోటార్లకు విద్యుత్ శాఖ కనెక్షన్లు ఇస్తోంది. 5 హెచ్పీ కనెక్షన్కు రైతు రూ.5,350 మీ సేవలో చెల్లించాలి. రేషన్కార్డు, ఆధార్కార్డు, పాస్బుక్ జిరాక్స్, సర్వే, సెల్ నంబర్లతో దరఖాస్తు చేసుకోవాలి. రెవెన్యూ శాఖ నుంచి ధ్రువీకరణపత్రం కావాలి. దరఖాస్తు చేసుకున్న తర్వాత ఒరిజినల్ పేపర్లను విద్యుత్ శాఖ సెక్షన్ ఆఫీస్లో ఇవ్వాలి. దరఖాస్తు తీసుకున్న అనంతరం ఏఈ.. లైన్ ఇన్స్పెక్టర్ ద్వారా సర్వే చేయిస్తారు. ఎల్ఐ ఇచ్చిన నివేదిక ఆధారంగా అంచనా తయారు చేసిన అనంతరం మంజూరుకు అనుమతి లభిస్తుంది. నెలరోజుల వ్యవధిలో ఈ ప్రక్రియ పూర్తి చేసి రైతులకు కనెక్షన్ ఇవ్వాలి. ఈ విద్యుత్ కనెక్షన్లకు ప్రభుత్వం రైతులకు రూ.70 వేలు సబ్సిడీ ఇస్తోంది.ట్రాన్స్ఫార్మర్ కోసం ఎదురుచూస్తున్నాం.. నీటి లభ్యత లేక మూడెకరాల వరి సాగు కోసం మోటారు ఏర్పాటు చేసుకున్నాం. దీనికి విద్యుత్ సరఫరా కోసం ట్రాన్స్ఫార్మర్ కావాలని విద్యుత్ శాఖకు దరఖాస్తు చేసుకున్నా. ఈ ఏడాది ఫిబ్రవరిలో డీడీ తీశా. మరికొంతమంది రైతులు కూడా ట్రాన్స్ఫార్మర్ కోసం డీడీలు తీశారు. విద్యుత్శాఖ అధికారులు స్పందించి ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తే సాగు పనులు ప్రారంభించాలని చూస్తున్నాం. –పేరాల అనిల్, కొత్తూరు, నేలకొండపల్లి మండలంవ్యవసాయ కనెక్షన్లకు ప్రాధాన్యత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న రైతులకు ప్రాధాన్యత ఇస్తున్నాం. విద్యుత్ సరఫరాకు అనుకూలంగా ఉన్న కనెక్షన్లను వేగంగా పూర్తి చేస్తున్నాం. వానాకాలం పంటల సాగును దృష్టిలో పెట్టుకుని సాధ్యమైన మేరకు సర్వీసులు ఇస్తున్నాం. పెండింగ్లో ఉన్న కనెక్షన్లను త్వరగా పూర్తి చేసేలా దృష్టి సారిస్తున్నాం. – ఎ.సురేందర్, విద్యుత్ శాఖ ఎస్ఈ డివిజన్ల వారీగా ఇచ్చిన కనెక్షన్లు, పెండింగ్లో ఉన్నవి డివిజన్ ఇచ్చినవి ఇవ్వాల్సినవి ఖమ్మం 27,093 751 ఖమ్మంరూరల్ 38,605 374 సత్తుపల్లి 34,629 406 వైరా 15,375 318 -
వ్యక్తి అనుమానాస్పద మృతి!
కరకగూడెం: మండల కేంద్రానికి చెందిన బాదే చిట్టిబాబు (55) బుధవారం నిద్రలోనే ప్రాణాలు విడిచాడు. స్థానికుల కథనం ప్రకారం.. చిట్టిబాబు ఇంటి వద్ద ఉదయం 8 గంటలకు పడుకొని మధ్యాహ్నం వరకూ నిద్ర లేవకపోవడంతో గమనించిన చట్టుపక్కలవారు వచ్చి చూసి చనిపోయినట్లు నిర్ధారించారు. మృతుడి పెద్దకుమారుడు అనారోగ్యంతో భద్రాలచంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఆమె తల్లి సహాయంగా అక్కడే ఉంది. గతేడాది చిట్టిబాబు చిన్నకుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా, ప్రస్తుతం చిట్టిబాబు మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుమున్నాయి. కాగా, స్థానిక పీహెచ్సీ వైద్యుడిని వివరణ కోరగా వారం రోజుల నుంచి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలోనే ఉన్నాయని, ఎండ తీవ్రతకు మరణించే అవకాశం లేదని చెప్పారు. ఐదుగురిపై కేసు బూర్గంపాడు: బూర్గంపాడు ఏఎస్ఐ సత్యంపై దాడికి పాల్పడిన ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏఎస్ఐ సత్యం ఫిర్యాదు మేరకు ఎస్ఐ సుమన్ కేసు నమోదు చేశారు. బుధవారం మధ్యాహ్నం బూర్గంపాడు పోలీస్స్టేషన్ ఎదురుగా రెండు వర్గాలు గొడవపడుతుండగా ఏఎస్ఐ సత్యం అక్కడకు చేరుకుని, వారిని వారించేందుకు యత్నించారు. అందులో ఒకరిద్దరు ఏఎస్ఐపై దాడికి పాల్పడ్డారు. పోలీసులు అప్రమత్తమయ్యే సరికి దాడికి పాల్పడినవారు అక్కడి నుంచి పారిపోయారు. ఏఎస్సై సత్యం ఫిర్యాదు మేరకు నిమ్మల హరీశ్, ప్రసాద్, వెంకటేశ్, సారథిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. వడదెబ్బతో కూలీ మృతి ఇల్లెందు: అడ్డా మీద కూలీ పనికి వెళ్తున్న స్టేషన్బస్తీకి చెందిన రజబెల్లి (55) వడదెబ్బతో మంగళవారం మృతి చెందినట్లు ఇఫ్టూ జిల్లా అధ్యక్షుడు యాకుబ్షావలి బుధవారం తెలిపారు. 30 ఏళ్లుగా బొగ్గు కాటా వద్ద పనిచేస్తున్న రజబెల్లి ఏడాది కాలంగా బొగ్గు లేకపోవటం వల్ల కుటుంబాన్ని పోషించుకునేందుకు అడ్డా మీద కూలీకి వెళ్తున్నాడని, ప్రభుత్వం రజబెల్లి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. రజబెల్లి మృతదేహాన్ని కోల్ ట్రాన్స్పోర్ట్ అధ్యక్షులు వరద రామచంద్రయ్య, లారీ అసోసియేషన్ అధ్యక్షులు మౌలానా, నల్ల శ్రీను, ఆళ్ల నాగేశ్వరరావు, కొండపల్లి శ్రీను సందర్శించి నివాళులర్పించారు. -
జవాన్కు షోకాజ్ నోటీస్ జారీ
ఖమ్మంమయూరిసెంటర్: వైకుంఠధామంలో పేకాట ఆడడం, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడడంపై ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఆగ్రహం వ్యక్తచేశారు. వైకుంఠధామం నిర్వహణ చూసే జవాన్కు షోకాజ్ నోటీస్ జారీ చేశారు. బుధవారం సాక్షి దినపత్రికలో ‘ఇక్కడైతేనే సేఫ్’ కథనానికి స్పందించిన కేఎంసీ అధికారులు జవాన్తో పాటు అక్కడ సిబ్బందిని కేఎంసీ కార్యాలయానికి పిలిపించి, విచారణ చేశారు. వైకుంఠధామంలో పేకాట ఆడడంపై వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసు జారీ చేశారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే కఠిన చర్యలు తీసుకుంటామని సిబ్బందిని హెచ్చరించినట్లు తెలిసింది. ఓఅండ్ఎం పనులకు రూ.78 లక్షలు మంజూరు ఖమ్మంఅర్బన్: జలవనరులశాఖ పరిధిలో వివిధ ప్రాంతాల్లో సాగునీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా మరమ్మతులు చేసేందుకు ఓఅండ్ఎం (ఆపరేషన్ మెయింట్నెన్స్)కు రూ.53.78 లక్షలు మంజూరయ్యాయి. మంగళవారం హైదరాబాద్లో జరిగిన ఉన్నతస్థాయి నీటి పారుదలశాఖ అధికారుల సమావేశంలో ఈ పనులు చేపట్టేందుకు గతంలో జిల్లా ఇంజనీర్లు పంపించిన ప్రతిపాదనలకు అనుకూలంగా అమోదముద్ర వేసినట్లు తెలిసింది. రెండు కార్లు ఢీ చింతకాని: మండలంలోని నాగులవంచ ఎన్నెస్పీ కాలువ సమీపంలో బుధవారం ఎదురెదురుగా రెండు కార్లు ఢీకొన్నాయి. పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం వైపు నుంచి బోనకల్ వైపు వెళ్తున్న కారు, బోనకల్ వైపు నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగనప్పటికీ కారుడ్రైవర్ కందుల మల్లేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మరో కారుడ్రైవర్ చౌదరిబాబుపై ఎస్ఐ నాగుల్మీరా కేసు నమోదు చేశారు. ఇద్దరిపై కేసు చింతకాని: మండలంలోని మత్కేపల్లి గ్రామానికి చెందిన రెడ్డిబోయిన కొండల్రావు, బల్లి వెంకటలక్ష్మిపై స్థానిక పోలీస్స్టేషన్లో బుధవారం కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. కూలీ డబ్బుల విషయంలో భార్య రెడ్డిబోయిన రమాదేవిపై భర్త కొండల్రావు, ఆడపడచు బల్లి వెంకటలక్ష్మి కర్రతో దాడి చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్ఐ నాగుల్మీరా ఇరువురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. వివాహిత ఆత్మహత్యాయత్నం నేలకొండపల్లి: కుటుంబ కలహాల కారణంగా వివాహిత ఆత్మహత్యాయత్నం చేసింది. స్థానికుల కథనం ప్రకారం.. ఖమ్మం నగరానికి చెందిన కొత్తపల్లి త్రివేణి (28) కుటుంబ కలహాల కారణంగా తన పుట్టినిల్లు అయిన మండలంలోని ఆరెగూడెంనకు వచ్చింది. బుధవారం నిద్రమాత్రలు మింగింది. కుటుంబ సభ్యులు గమనించి నేలకొండపల్లి ప్రభుత్వ వైద్యశాలకు, అక్కడి నుంచి ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాలతో వృద్ధుడు... కామేపల్లి: కుటుంబ కలహాల నేపథ్యాన ఓ వృద్ధుడు పురుగులమందు తాగాడు. మండలంలోని కెప్టెన్బంజర గ్రామానికి చెందిన సమ్మయ్య కొద్ది రోజులుగా ఇంట్లో భార్యతో పాటు కుటుంబీకులతో గొడవ పడుతున్నాడు. దీంతో బుధవారం సమ్మయ్యను భార్య మందలించడంతో ఇంట్లో దాచిన పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబీకులు 108 వాహనంలో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లారీ ఢీకొని వ్యక్తి మృతి తల్లాడ: మండలంలోని అంజనాపురం సమీపంలో బుధవారం రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి.. లారీ ఢీకొట్టడంతో మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. అంజనాపురం గ్రామానికి చెందిన అనుమోలు రాజా (54) ఉదయం ఆవును తోలుకొని మిట్టపల్లి వెళ్తుండగా శంకర్ దాబా వద్ద వెనుకు నుంచి అతి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో రాజా అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుమారుడు హరికృష్ణ ఫిర్యాదు మేరకు తల్లాడ హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు తల్లాడ: మండలంలోని మల్సూర్తండా వద్ద బుధవారం మోటార్ సైకిల్ అదుపుతప్పి కింద పడటంతో ఓ వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకు చెందిన వంట మేసీ్త్ర కె.నాగేశ్వరరావు తల్లాడ మండలం గొల్లగూడెంలో వంట చేసి తిరిగి వెళ్తుండగా మల్సూర్తండా జాతీయ రహదారిపై ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడ్డాడు. తీవ్ర గాయాలైన నాగేశ్వరరావును 108లో తిరువూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
ప్రాణం తీసిన సినిమా పాట!
● విద్యుదాఘాతంతో యువకుడు మృతి అశ్వారావుపేటరూరల్: వివాహ వేడుకలో తనకు ఇష్టమైన సినిమా పాట పెట్టేందుకు వెళ్లిన ఓ వ్యక్తి విద్యుదాఘాతంతో మృతిచెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని కంట్లం గ్రామానికి చెందిన మడకం కామరాజు (33) మంగళవారం రాత్రి గ్రామంలో జరిగిన ఓ వివాహ వేడుకకు వెళ్లాడు. అక్కడ ఏర్పాటు చేసిన డీజే వద్ద కొద్దిసేపు డ్యాన్స్ చేసి, తనకు ఇష్టమైన పాట పెట్టేందుకు డీజే సిస్టం (పరికరాలు) దగ్గరకు వెళ్లి పాటలు మార్చే క్రమంలో ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే కింద పడిపోయాడు. గమనించిన స్థానికులు హుటాహుటిన అశ్వారావుపేట ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మృతుడి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు మృతదేహానికి పోస్టుమార్టం జరిపించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. వడదెబ్బతో వ్యక్తి మృతి మణుగూరుటౌన్: మున్సిపాలిటీ పరిధిలోని పీకే–1 ఇంక్లయిన్కు చెందిన వ్యక్తి వడదెబ్బతో మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. రొండ వెంకటేశ్వర్లు (60) బుధవారం కూలీ పనులకు వెళ్లాడు. ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో చెట్టు కిందకు వెళ్లి అక్కడే మృతిచెందాడు. స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. -
చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్ట్
కొత్తగూడెంటౌన్: వరుస దొంగతనాలకు పాల్పడుతున్న జుంజునూరి శ్రీనును మంగళవారం కొత్తగూడెం వన్టౌన్ సీఐ కరుణాకర్ అరెస్టు చేశారు. కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని ప్రశ్నించగా పారిపోయేందుకు యత్నించారు. పోలీసులు వెంటబడి పట్టుకోగా.. ములకలపల్లి చాటివారిగూడెంకు చెందిన జుంజునూరి శ్రీను అని తేలింది. కొత్తగూడెంలో పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడగా రెండు తులాల బంగారం స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు సీఐ కరుణాకర్ తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో బస్డ్రైవర్ మృతి
మధిర: రోడ్డు ప్రమాదంలో ప్రైవేట్ బస్ డ్రైవర్ మృతి చెందాడు. ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు గ్రామానికి చెందిన రాజశేఖర్రెడ్డి (35) కొంతకాలంగా మధిర ఆర్టీసీ డిపోలో హైర్ బస్డ్రైవర్గా పనిచేస్తున్నాడు. మద్యం మత్తులో డ్యూటీకి వెళ్లేందుకు ప్రయత్నించగా ఆర్టీసీ అధికారులు పక్కనపెట్టారు. నందిగామకు చెందిన ప్రైవేట్ బస్సుల ఓనర్ సూచనల మేరకు ప్రైవేట్ బస్సులపై సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. అంబేడ్కర్ సెంటర్ సమీపంలో ఉన్న తన ఇంటికి వెళ్లేందుకు బుధవారం స్కూటీపై రైల్వే ఓవర్ బ్రిడ్జి మీదుగా వెళ్తున్నాడు. ఎదురుగా వచ్చిన సుబాబుల్ లారీ ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన్ను ఫౌండేషన్ నిర్వాహకులు రామకృష్ణ తన అంబులెన్స్లో మధిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. మధిర టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అగ్ని ప్రమాదంలో సుబాబుల్ తోట దగ్ధం మధిరరూరల్: మండలంలోని ఖమ్మంపాడు, దెందుకూరు గ్రామాల సమీపంలో బుధవారం జరిగిన అగ్ని ప్రమాదంలో పలువురు రైతులకు చెందిన సుబాబుల్ తోట దగ్ధమైంది. విద్యుత్ స్తంభాల నుంచి వచ్చిన నిప్పురవ్వలతో సుబాబుల్ పొలాలకు నిప్పు అంటుకుందా లేక ఎవరైనా నిప్పు అంటించారా అని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రైతుల సమాచారంతో ఫైర్ ఇంజన్ ఘటనా స్థలానికి చేరుకోగా.. సిబ్బంది మంటలను ఆర్పి వేశారు. సుమారు రూ.10 లక్షల విలువ చేసే సుబాబుల్ పైరు దగ్ధమైందని ఆయా గ్రామాల రైతులు వాపోతున్నారు. -
తినక తప్పదంట..
నాణ్యత లేని వంట.. ఖమ్మంమయూరిసెంటర్: దుమ్ము, ధూళితో పాటు ఈగలు, పురుగులతో కూడిన అపరిశుభ్ర వాతావరణంలో వంటశాల.. ఇడ్లీ పిండిలో చనిపోయిన ఈగలు.. వండిన ఆహార పదార్థాల్లో భవనాల స్లాబ్ పెచ్చులు, బూజు, మట్టి.. ఫంగస్, పురుగులతో దుర్వాసన వస్తున్న ఐస్క్రీమ్.. బిర్యానీలో కేన్సర్ కారకాలైన కృత్రిమ హానికరమైన రంగులు.. ఇవన్నీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని హోటళ్లు, రెస్టారెంట్లలో మెనూ! ఇటీవల అధికారులు చేపట్టిన తనిఖీల్లో ఈ అంశాలు బయటపడగా.. కుటుంబసభ్యులతో ఓ పూట సరదాగా బయట భోజనం చేద్దామని భావిస్తున్న వారు ఆందోళనకు గురవుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఖమ్మం, భద్రాచలంలో పలు హోటళ్లు, రెస్టారెంట్లలో అధికారులు చేసిన తనిఖీల్లో ఈ బాగోతాలు బయటపడగా అధికారులే విస్తుపోవడం గమనార్హం. అంతటా ఇదే తీరు.. గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాలనే తేడా లేకుండా ఏ టిఫిన్ సెంటర్, ఏ హోటల్, ఏ రెస్టారెంట్లో చూసినా కనీస నిబంధనలు పాటించకుండా ఆహారాన్ని తయారు చేసి విక్రయిస్తున్న వారే ఎక్కువ. ఆహారం మిగిలితే రోజుల తరబడి ఫ్రిడ్జ్ల్లో నిల్వ చేసి కస్టమర్లకు వడ్డిస్తున్నారు. హోటళ్లను అందంగా.. కుర్చీలను పరిశుభ్రంగా ఉంచుతూ ఒక్కసారి అక్కడికి వచ్చిన వారు మళ్లీ మళ్లీ రావాలనే అభిప్రాయాన్ని కల్పిస్తున్న యాజమాన్యాలు.. ఆహారం నాణ్యత విషయంలో మాత్రం నిబంధనలు పాటించడం లేదు. ఎవరూ చూడరు కదా అనే ధీమాతో వంటశాలలను అసలు పట్టించుకోవడం లేదు. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూ.. ఇంట్లో కంటే బయట భోజనం చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇదే అదనుగా వ్యాపారులు టిఫిన్ సెంటర్లు, హోటళ్లు, రెస్టారెంట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఖమ్మంలో ఒక్కో వీధిలో పదుల సంఖ్యలో రెస్టారెంట్లు తెరిచారు. ఇందులో చాలా వాటికి మున్సిపల్, ఫుడ్ సేఫ్టీ లైసెన్స్లు కూడా లేవని సమాచారం. వారు కనీస నిబంధనలు పాటించకుండా ఆహారాన్ని తయారు చేసి విక్రయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఉమ్మడి జిల్లాలో అనేక టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్లు, భోజనశాలలకు అనుమతులు లేనట్లు తెలుస్తోంది. కొరవడిన పర్యవేక్షణ.. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యతను అధికారులు తీసుకోవాలి. హోటళ్ల నిర్వహణపై నిరంతరం పర్యవేక్షిస్తూ నాణ్యమైన, కల్తీలేని ఆహారం అందేలా తనిఖీలు చేపట్టాలి. ఫుడ్సేఫ్టీ అధికారులతోపాటు మున్సిపల్, కార్పొరేషన్ అధికారులు హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లలో తనిఖీలు చేయాలి. కానీ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏడాదికి ఒకటి, రెండుసార్లు మాత్రమే తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటుండగా.. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులైతే ఆ దిక్కే చూడడం లేదు. ఖమ్మం నగరంలో ఏ హోటల్పై అయినా ఫిర్యాదు వస్తే మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్లు అక్కడికి వెళ్లి యజమానులతో కుమ్మకై ్క మామూళ్లు తెచ్చుకుని చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు. దీంతో రెస్టారెంట్ల నిర్వాహకులు చేసిందే వంట.. పెట్టిందే ఆహారంగా మారింది. దీనిపై ఫుడ్సేఫ్టీ అధికారుల వివరణ కోరగా.. కమిషనర్ ఆదేశాలతో ఉమ్మడి జిల్లాలో ఆరు హోటళ్లలో తనిఖీలు చేశామని, వంటశాలలు సక్రమంగా లేవని, నిర్వాహకులపై 4ఏ కేసు బుక్ చేసేందుకు ఫైళ్లు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. హోటల్ నిర్వాహకులు నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉమ్మడి జిల్లాలో హోటళ్లు, రెస్టారెంట్ల వివరాలు.. కుళ్లిన మాంసం.. బూజు పట్టిన ఐస్క్రీమ్ వంటశాలల్లో డ్రెయినేజీ నీరు.. చెత్త, ఈగలు అదనం పైకి మాత్రం ఆకర్షణీయంగా అలంకరణ అధికారుల తనిఖీల్లో బయటపడిన రెస్టారెంట్లు, హోటళ్ల బాగోతం ఇదే కస్టమర్ల ఆహారం.. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉమ్మడి జిల్లాలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీ చేయగా.. అక్కడి వాతావరణంతో అధికారులే విస్తుపోయారు. ఖమ్మంలోని ఓ హోటల్ను సందర్శించగా అపరిశుభ్రంగా ఉన్న రిఫ్రిజిరేటర్లోనే కుళ్లిన మాంసాన్ని నిల్వ చేయడం, గడువు ముగిసిన ఆహార పదార్థాలను వినియోగించడం, ఐస్క్రీమ్కు ఫంగస్ వచ్చి దుర్వాసన వస్తుండటం గమనించారు. మరికొన్ని హోటళ్లలో ప్లాస్టిక్ కవర్లలోనే ఆహార పదార్థాలను నిల్వ చేస్తున్నారు. కస్టమర్లకు వడ్డించే ఆహారంలో తీగలు, వెంట్రుకలు, బస్తాల దారాలు వంటివి దర్శనమిస్తున్నాయి. వీటిపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదులు కూడా అందాయి. వారు తనిఖీలు చేసినా హోటల్ నిర్వాహకులు మాత్రం తీరు మార్చుకోవడం లేదు. -
‘నిఘా’ నివేదిక బహిర్గతం?
● మైనింగ్పై నివేదికలు అక్రమార్కుల చేతుల్లోకి... ● తమ సహకారం ఉందని పొందుపర్చడంపై కాంగ్రెస్ నేతల మండిపాటు ● అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ మంత్రి తుమ్మలకు విజ్ఞప్తి ● సత్తుపల్లిలో చర్చనీయాంశమైన వ్యవహారంసత్తుపల్లి: సత్తుపల్లిలో మట్టి మాఫియాకు పాల్పడుతున్న వారు అధికార పార్టీ నేతల అండదండలతో చెలరేగిపోతున్నారని.. అక్రమ మట్టి తోలకాలపై రాజకీయ జోక్యం మితిమీరడంతో అధికారులు చర్యలు తీసుకునేందుకు వెనుకాడుతున్నారని నిఘా వర్గాలు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక కలకలం రేపుతోంది. అయితే, తమ ప్రతిష్టను మసకబార్చేలా నివేదిక ఇవ్వడంపై అధికార పార్టీ నాయకులు గుర్రుగా ఉన్నారు. అక్రమ తవ్వకాలు ఈ ప్రభుత్వం వచ్చాకే జరిగినట్లు.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి అక్రమాలు జరగలేదని నివేదిక ఇచ్చిన నిఘా అధికారులపై చర్యలు తీసుకోవాలని, నిజాయితీగా రాజకీయాలు చేస్తున్న తమపై బురదచల్లేలా జరుగుతున్న దుష్ప్రచారాన్ని అడ్డుకోవాలని కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ మంగళవారం సత్తుపల్లికి వచ్చిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావును బహిరంగంగానే కోరడం చర్చనీయాంశమైంది. ఇసుక, మట్టి, బెట్టింగ్, కోడి పందేలు నిర్వహించే వారిని ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించబోమని, అలాంటి వారికి పార్టీలో స్థానం ఉండదని దయానంద్ ఈ సందర్భంగా పేర్కొననడం గమనార్హం. దీనిపై మంత్రి తుమ్మల స్పందిస్తూ ‘రాజకీయాల్లో విమర్శలు, అభాండాలు తప్పవు.. మన నడవడిక, జీవన విధానమే సమాధానం అవుతుంది’ అని సర్ది చెప్పాల్సి వచ్చింది. నివేదికలో ఏముందంటే... కొందరు అక్రమార్కులు సత్తుపల్లిలో అనుమతి లేకుండా మట్టి తవ్వకాలు సాగిస్తూ రూ.లక్షల్లో సంపాదిస్తున్నారనే ఆరోపణలు ఏళ్లుగా ఉన్నాయి. మూడు, నాలుగేళ్లుగా ఈ దందా జరుగుతున్నా స్థానిక అధికారులు నామమాత్రపు తనిఖీలు, జరిమానాలతో సరిపుచ్చుతున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారాక అక్రమార్కుల మధ్య ఆధిపత్య పోరుతో పలుమార్లు పోలీస్, రెవెన్యూ, మైనింగ్ శాఖకు ఫిర్యాదు చేసుకోగా నిఘా విభాగం విచారణ చేపట్టినట్లు సమాచారం. ఈ సందర్భంగా కొందరు తమకు అనుమతి ఉందని పెద్దపెద్ద గోతులు తీసి గ్రావెల్ అమ్ముకుంటున్నారని, టిప్పర్ మట్టి రూ.3,500 నుంచి రూ.4,500 వరకు, ట్రాక్టర్ రూ.950 నుంచి రూ.1,100కు విక్రయిస్తున్నారని గుర్తించినట్లు తెలిసింది. అంతేకాక వాహనాలకు సరైన పత్రాలు ఉండకపోగా, డ్రైవర్లకు అనుభవం, లైసెన్సు లేకపోవడంతో మితిమీరిన వేగంతో వెళ్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారని తేల్చినట్లు సమాచారం. ఇదంతా పక్కన పెడితే అక్రమార్కుల్లో కొందరికి అధికార పార్టీ నేతల అండ ఉందని నివేదికలో పేర్కొన్నారు. అలాగే, కొందరు పాత్రికేయులు వత్తాసు పలుకుతుండగా, ఇంకొందరు అక్రమ రవాణా అంశాన్ని బయటకు తెచ్చారని నివేదికలో పొందుపర్చారు. మాఫియా చేతికి నివేదిక సత్తుపల్లి శివారులో మట్టి తవ్వకాలపై ఫిబ్రవరిలో పత్రికల్లో వరుస కథనాలు రాగా.. విచారణ చేపట్టిన నిఘా విభాగం నాలుగుపేజీల నివేదికను ప్రభుత్వానికి పంపించింది. అక్కడి నుంచి నివేదిక మైనింగ్ విభాగానికి చేరింది. అయితే, మట్టి అక్రమ రవాణా చేసే కొందరు తమ వాహనాలను విడిపించుకునేందుకు ఖమ్మంలోని మైనింగ్ శాఖ కార్యాలయానికి వెళ్లినప్పుడు ‘సత్తుపల్లి మట్టిదందా మాకు తలనొప్పిలా మారింది.. మీరు చేసే పనితో మాకు ఇబ్బంది అవుతుంది..’ అంటూ నివేదికను చూపించడంతో అందులోని మూడు, నాలుగో పేజీలను ఫొటో తీయగా అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ అంశంతో మైనింగ్ శాఖలోని ఓ ఉద్యోగికి అక్రమార్కులతో ఉన్న సంబంధం బయటపడగా,వ్యవహారం అధికార, ప్రతిపక్ష పార్టీలకు ఆయుధంగా మారింది. వరుస దాడులతో.. ఇటీవల కాలంలో విజిలెన్స్, టాస్క్ఫోర్స్, మైనింగ్ శాఖల అధికారులు ఆకస్మిక తనిఖీలు చేస్తూ మట్టి, ఇసుక తరలిస్తున్న వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తుండడం కలకలం రేపుతోంది. రాజకీయ ఒత్తిళ్లతో స్థానిక అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలకు బలం చేకూర్చేలా జిల్లా స్థాయి అధికారులే నేరుగా రంగంలోకి దిగారన్న చర్చ జరుగుతోంది. ఇకపోతే మట్టి మాఫియాను అరికట్టాల్సిన అధికారులపై చర్యలకు సిఫారసు చేయకుండా, నిఘావర్గాలు ఇచ్చిన నివేదికపైనా విస్మయం వ్యక్తమవుతోంది. కొన్నేళ్లుగా మాఫియా ఆగడాలు పేట్రేగిపోతున్నా ఇప్పుడు నివేదిక ఇవ్వడం.. దీన్ని బహిర్గతం చేసిన మైనింగ్శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వస్తోంది. -
ఉద్యోగాల పేరిట రూ.4కోట్లకు టోకరా
●రాష్ట్రంలో 60మందికి పైగానే బాధితులు ●పోలీసుల అదుపులో నలుగురుచుంచుపల్లి : నిరుద్యోగుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని గ్రూప్ – 2, సింగరేణి, ఇతర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రూ.4 కోట్ల మేర వసూలు చేసిన నిందితులను చుంచుపల్లి పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి వివరాలను సీఐ రాయల వెంకటేశ్వర్లు, ఎస్సై గడ్డం ప్రవీణ్కుమార్ వెల్లడించారు. వరంగల్ రంగశాయిపేటకు చెందిన దాసు హరికిషన్ హైదరాబాద్ ఎర్రమంజిల్లో ఆర్ అండ్ బీ శాఖలో డీఈగా పనిచేస్తున్నానని పలువురిని నమ్మించాడు. ఈయన తన కుటుంబ సభ్యులు కలిసి గతంలో రైస్ పుల్లింగ్ ముఠాతో తిరిగినప్పుడు రుహత్ బేగ్, భీమవరం శ్రీనివాస్తో పరిచయం ఏర్పడింది. వీరికి తోడు వరంగల్ రంగశాయిపేటకే చెందిన దాసు హర్ష, చిరుమర్తి సంజయ్, కొత్తగూడెంలోని రామాంజనేయ కాలనీకి చెందిన గుండా వినోద్కుమార్ ముఠాగా ఏర్పడ్డారు. వీరంతా కలిసి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 60 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి సుమారు రూ.4 కోట్ల వరకు వసూలు చేశారు. అయితే, డబ్బులు ఇచ్చిన వారికి ఉద్యోగాలు రాకపోవడం, నిందితుల నుండి సమాధానం లేకపోవడంతో బాధితులు పలువురు చుంచుపల్లి పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు రామాంజనేయ కాలనీలోని వినోద్కుమార్ ఇంట్లో ఉన్నారనే సమాచారంతో హరికిషన్, హర్ష, సంజయ్, వినోద్కుమార్ను మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు రుహత్ బేగ్, భీమవరం శ్రీనివాస్ పరారీలో ఉండగా.. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి ముఠాకు సహకరించిన మిగతా వారిని సైతం గుర్తించి కేసు నమోదు చేస్తామని సీఐ తెలిపారు. ఎవరైనా బాధితులు ఉంటే పోలీసులను సంప్రదించాలని సూచించారు. కాగా, ప్రభుత్వ ఉద్యోగాల పేరిట మాయమాటలు చెప్పే వ్యక్తులను నమ్మి మోసపోవద్దని ఆయన తెలిపారు. -
ఇంకొన్ని రోజులు ఆగండి..
● ఖమ్మం ఆర్టీఓలో ఆర్సీ కార్డుల కొరత ● రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయినా అందని కార్డులు ● సుమారు 3వేల మంది ఎదురుచూపులు ఖమ్మంక్రైం: ఖమ్మం జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో జారీ చేసే వాహనాల రిజిస్ట్రేషన్(ఆర్సీ) కార్డుల కొరత ఏర్పడింది. సుమారు రెండు నెలలుగాకు పైగానే కార్డుల పంపిణీ నిలిచిపోయింది. దీంతో వాహనాల రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు కార్డులు ఎప్పుడు అందుతాయో తెలియక అటు పోస్టాఫీస్లు, ఇటు రిజిస్ట్రేషన్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వాహనాల తనిఖీల్లో ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడితే చలానా కట్టాల్సి వస్తుందనే ఆవేదన వారిని వెంటాడుతున్నా కార్డులు అందక ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఇక లైసెన్స్ తీసుకున్న వారికి కార్డులు జారీ చేస్తున్నా అవి కూడా తక్కువగా ఉన్నందున త్వరలోనే అయిపోవచ్చని తెలుస్తోంది. రోజుకు వంద వాహనాలు ఖమ్మం జిల్లా కేంద్రంలోని రవాణా శాఖ కార్యాలయంలో ప్రతిరోజు 50నుంచి 100వరకు వాహనాల రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఇందులో ద్విచక్రవాహనాలు మొదలు లారీల వరకు అన్ని వాహనాలు ఉంటాయి. ఇదేసంఖ్యలో వాహనాల లైసెన్సులు కూడా జారీ చేస్తున్నారు. వీరికి పూర్తి వివరాలతో కూడిన కార్డులను రవాణా శాఖ అధికారులే పోస్ట్ ద్వారా పంపిస్తారు. కొద్దిరోజుల క్రితం టీఎస్గా ఉన్న రిజిస్ట్రేషన్ సిరీస్ను టీజీగా మార్చిన విషయం విదితమే. అయితే, అంతకు ముందు నుంచే అంటే సుమారు రెండు నెలల నుంచి రిజిస్ట్రేషన్ కార్డుల పంపిణీ నిలిచిపోవడంతో వాహనదారులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. పైనుంచే రావట్లేదు... హైదరాబాద్లోనే రాష్ట్రంలోని అన్ని జిల్లాల రవాణా శాఖ కార్యాలయాలకు సంబంధించి ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్ కార్డుల ప్రింటింగ్ చేయిస్తారు. ఇందులో పైన వివరాలు అంటే రిజిస్ట్రేషన్ కార్డు లేదా లైసెన్స్ కార్డు అని ముద్రించి మిగతా భాగాన్ని వదిలేసి జిల్లాలకు సరఫరా చేస్తారు. ఆపై జిల్లాల్లోని రవాణా శాఖ కార్యాలయాల్లో వాహనం రిజిస్ట్రేషన్ చేయించుకున్న, లైసెన్స్ తీసుకున్న వారి ఫొటోలు, ఇతర వివరాలు ముద్రించి వాహనదారులకు పోస్ట్ ద్వారా పంపిస్తారు. అయితే, రెండు నెలలుగా హైదరాబాద్లోని కేంద్రంలో ప్రింటింగ్ నిలిచిపోవడంతో కార్డులు పంపించడం లేదని తెలుస్తోంది.3వేల కార్డుల పెండింగ్ ఖమ్మం రవాణా శాఖా కార్యాలయంలో వాహనాల రిజిస్ట్రేషన్ చేయించుకున్న 3వేల మందికి కార్డులు పంపిణీ చేయాల్సి ఉన్నట్లు సమాచారం. కాగా, జిల్లాలోని వైరా, సత్తుపల్లిలో రిజిస్ట్రేషన్, లైసెన్స్ కార్డులు ఉన్నప్పటికీ, అవి కూడా రేపో, మాపో అయిపోనున్నట్లు సమాచారం. ఆలోగా కార్డులు రాకపోతే ఇక్కడ కూడా కార్డుల జారీ నిలిచిపోనుంది. ఈ విషయమై రవాణా శాఖ అధికారులను ఆరా తీయగా... విషయాన్ని ప్రధాన కార్యాలయానికి తెలియజేశామని, కార్డులు రాగానే వాహనదారులకు పంపిణీ చేస్తామని తెలిపారు. -
ఘనంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు
ఖమ్మంమయూరిసెంటర్: తెలంగాణ రాష్ట్రావతణ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాత మధు తెలిపారు. ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ తమ పార్టీ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు ఉత్సవాల ముగింపు వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. కాగా, పాలకులు రాష్ట్ర చిహ్నం, ఇతర అంశాలను మారుస్తామని చెబుతున్నా.. తెలంగాణలో కేసీఆర్ పేరు మాత్రం సుస్థిరంగా ఉంటుందని చెప్పారు. ఇక తాజాగా జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్రెడ్డి విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్ సరళిని పరిశీలించగా.. పట్టభద్రులు ఎక్కువ మంది రాకేష్రెడ్డి వైపే మొగ్గు చూపినట్లు తేలిందన్నారు. ఎమ్మెల్సీ తాత మధుసూదన్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి తరఫున ప్రచారంలో పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా ఈ సమావేశంలో నాయకులు శీలంశెట్టి వీరభద్రం, ఉప్పల వెంకటరమణ, బెల్లం వేణు, తాజుద్దీన్, పగడాల నరేందర్, డోకుపర్తి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాత మధు -
ఏ ఓటు ఎవరికో!?
వరుసగా జరుగుతున్న ఎన్నికలతో గెలుపోటములపై ఉత్కంఠగా చర్చ సాగుతోంది. మొన్నటి వరకు అందరి దృష్టీ లోక్సభ ఎన్నికలపై ఉండగా.. ఇప్పుడు వరంగల్ – ఖమ్మం – నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో గెలుపు ఎవరిదనే అంశంపైకి చర్చ మళ్లింది. మూడు ఉమ్మడి జిల్లాల్లో పోలింగ్ సరళి, శాతాన్ని పరిశీలిస్తున్న రాజకీయ పార్టీలు పరిస్థితిపై అంచనాకు రాలేకపోతున్నాయి. మొదటి ప్రాధాన్యత ఓట్లు ఎక్కువగా ఎవరికి పోలయ్యాయి.. క్రాస్ ఓటింగ్ జరిగిందా.. మొదటి ప్రాధాన్యత ఓటుతో ఫలితం తేలకపోతే రెండో ప్రాధాన్యత ఓట్లు ఎవరికి ఎక్కువ పోల్ అయ్యాయనే అంశంపై లెక్కల్లో నిమగ్నమయ్యారు. మరోపక్క గత ఎన్నికలతో పోలిస్తే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పోలింగ్ శాతం తగ్గిన నేపథ్యాన గెలుపోటములపై విశ్లేషణ జరుగుతోంది. – సాక్షి ప్రతినిధి, ఖమ్మంఆరా తీస్తున్న అభ్యర్థులు సోమవారం సాయంత్రం పోలింగ్ ముగిసినప్పటి నుంచే ఓటింగ్ సరళిపై అభ్యర్థులు ఆరా తీయడంలో నిమగ్నమయ్యారు. అభ్యర్థులతోపాటు రాజ కీయ పార్టీల నాయకులు మూడు ఉమ్మడి జిల్లాల్లోని తమకు తెలిసిన వారికి ఫోన్ చేసి పోలింగ్ తీరుతెన్నులు తెలుసుకోవడంతో పాటు ఎవరికి ఎక్కువగా ఓట్లు పోల్ అయ్యాయని ఆరా తీశారు. ఈ అంశాలన్నీ బేరీజు వేసుకుంటూ ఫలితంపై అంచనాకు వస్తున్నారు. ఫలితం తేలకపోతే.. మొదటి ప్రాధాన్యత ఓటుతో ఫలితం తేలని పక్షంలో రెండో ప్రాధాన్యత ఓటు కీలకం కానుంది. అప్పుడు గెలుపోటములు ఊహించడం కూడా కష్టమవుతుంది. ఒక్కో జిల్లాలో ఒక్కో అభ్యర్థికి పడే ఓట్లలో తేడా ఉంటే మొదటి ప్రాధాన్యత ఓటుతో ఫలితం తేలడం కష్టమేననే చర్చ జరుగుతోంది. ఈ తరుణాన రెండో ప్రాధాన్యత ఓటు ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. ఈనేపథ్యాన మొదటి ప్రాధాన్యత ఓటు వేసిన పట్టభద్రులు రెండో ప్రాధాన్యత ఓటు ఎవరికి వేశారనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఖమ్మం, వరంగల్, నల్లగొండ ఉమ్మడి జిల్లాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజీపీ అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్కు ఎక్కువ ఓట్లు పోలయ్యాయనే ప్రచారం జరుగుతోంది. ఆయనకు నిరుద్యోగులు, విద్యార్థులు ఓటు వేసినట్లు చర్చ సాగుతోంది. దీంతో అశోక్ ఎవరి ఓట్లను చీల్చాడనేది కీలకంగా మారింది. అలాగే బీజేపీకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసిన వారిలో చాలా మంది రెండో ప్రాధాన్యత ఓటు బీఆర్ఎస్ అభ్యర్థికి వేశారన్న ప్రచారం సైతం మొదలైంది. ఇదే సమయాన కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తే రెండోది ఎవరికి వేసి ఉంటారనే అంశంపైనే ఫలితం ఆధారపడి ఉంటుంది. తగ్గిన పోలింగ్ ఎవరికి లాభం? వరంగల్ – ఖమ్మం – నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అభ్యర్థులతో పాటు పార్టీల నాయకులు విస్తృతంగా ప్రచారం చేశారు. పట్టభద్రులంతా తప్పక ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరినప్పటికీ పోలింగ్ శాతం మాత్రం తగ్గడం గమనార్హం. ఖమ్మం జిల్లాలో 2021 ఎన్నికల్లో 74.36 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈసారి కేవలం 67.63 శాతానికి పరిమితమైంది. ఇక భద్రాద్రి జిల్లాలో గత ఎన్నికల్లో 73.30 శాతం పోలింగ్ జరగగా, ఈసారి 70.01 శాతమే నమోదైంది. ఇక ఇప్పుడు భద్రాద్రి జిల్లా కన్నా ఖమ్మంలోనే తక్కువ శాతం పోలింగ్ జరగడం గమనార్హం. ఖమ్మం జిల్లాలో 83,879 మందికి 56,730 మంది, భద్రాద్రి జిల్లాలో 40,106 మందికి 26,077 మంది ఓటు వేశారు. దీంతో ప్రాధాన్యత వారీగా పడిన ఓట్లపైనే గెలుపోటములు ఆధారపడి ఉంటాయనే అంచనాతో అభ్యర్థులు, నాయకులు లెక్కల్లో మునిగి తేలుతున్నారు. ఇందులో ఎవరి అంచనా నిజమవుతుందో తేలాలంటే వచ్చేనెల 5వ తేదీ వరకు ఆగాల్సిందే. ఎమ్మెల్సీ పోలింగ్పై అంచనాల్లో అభ్యర్థులు, నేతలు మొదటి ప్రాధాన్యత ఓటుతో ఫలితం తేలుతుందా అన్న అంశంపై చర్చ రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించాల్సి వస్తుందేమోనని ఉత్కంఠ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా తగ్గిన పోలింగ్ మొదటి ప్రాధాన్యతే కీలకం ఈ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటుతోనే ఫలితం తేలుతుందా, లేదా అన్న అంశంపై ఆసక్తి నెలకొంది. ప్రచారం సందర్భంగా అభ్యర్థులు, నాయకులు తమకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. అయితే పోలింగ్ శాతాన్ని పరిశీలిస్తూ ఈ ఓట్లతో ఫలితం తేలుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ మొదటి ప్రాధాన్యత ఓట్లు తమకే ఎక్కువగా పోల్ అయ్యాయని నమ్మకంగా ఉన్న అభ్యర్థులు.. ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను లెక్కించాల్సిన అవసరం ఉండదని ఎవరికి వారే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
నేత్రపర్వంగా రామయ్య నిత్య కల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక మంగళవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కాగా, మంగళవారాన్ని పురస్కరించుకుని అభయాంజనేయస్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. -
పకడ్బందీగా కౌంటింగ్ చేపట్టాలి
ఖమ్మం సహకారనగర్: వచ్చేనెల 4న జరగనున్న లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు పకడ్బందీగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ సూచించారు. హైదరాబాద్ నుంచి మంగళవారం ఆయన వీసీ ద్వారా కౌంటింగ్ ఏర్పాట్లపై సూచనలు చేశారు. ఈ సందర్భంగా వికాస్రాజ్ మాట్లాడుతూ కౌంటింగ్ సమయాన ప్రతీ అంశాన్ని రికార్డు చేస్తూ, ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలన్నారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, ఫలితాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. ఫలితాల వివరాలు వెల్ల డించేందుకు ప్రత్యేకంగా మీడియా సెంటర్ ఏర్పాటు చేయాలని వికాస్రాజ్ సూచించారు. ఈ వీసీలో ఖమ్మం నుంచి ఖమ్మం లోక్సభ ఆర్ఓ, కలెక్టర్ వీ.పీ.గౌతమ్, సీపీ సునీల్దత్, కేఎంసీ కమిషనర్ ఆదర్శ్సురభి, ఖమ్మం, భద్రాద్రి అదనపు కలెక్టర్లు సత్యప్రసాద్, వేణుగోపాల్, వివిధ శాఖల అధికారులు వినోద్, సన్యాసయ్య, శ్యాంప్రసాద్, ఎం.రాజేశ్వరి, శ్రీలత, గణేష్, రాజేందర్ గౌడ్, మధు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ -
గ్రూప్–1 ప్రిలిమినరీకి పకడ్బందీ ఏర్పాట్లు
ఖమ్మం సహకారనగర్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యాన వచ్చే నెల 9న జరగనున్న గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ బి.సత్యప్రసాద్ సూచించారు. కలెక్టరేట్లో మంగళవారం ఆయన ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, డిపార్ట్మెంటల్ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లతో సమావేశమయ్యారు. జిల్లాలో 52 కేంద్రాలు ఏర్పాటు చేయగా 18,403 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారని తెలిపారు. డిపార్ట్మెంట్ అధికారులు ముందుగానే కేంద్రాలను పరిశీలించి సౌకర్యాలపై నివేదిక సమర్పించాలన్నారు. మహిళా అభ్యర్థులను తనిఖీలు చేయడానికి మహిళా సిబ్బందిని నియమించడంతో పాటు ప్రతీ పరీక్ష హాల్లో వెబ్ కెమెరాలు బిగించాలని సూచించారు. కాగా, కాగా, అభ్యర్థులు జూన్ 1 నుండి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. కేంద్రానికి ఉదయం 9గంటలకే చేరుకోవాలని తెలిపారు. హాల్ టికెట్తో పాటు ప్రభుత్వ గుర్తింపు కార్డు, హాల్ టికెట్పై ఫొటో సరిగా లేకపోతే గెజిటెడ్ అధికారి అటెస్టేషన్, సొంత డిక్లరేషన్తో మూడు పాస్ఫొటోలు తీసుకురావాలని సూచించారు. ఈసమావేశంలో అదనపు డీసీపీ ప్రసాదరావు, డీఆర్వో ఎం.రాజేశ్వరి, వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు. ఎస్సెస్సీ ఫెయిల్ అయిన విద్యార్ధులకు ప్రత్యేక శిబిరం భద్రాచలం: ఐటీడీఏ పరిధిలోని పాఠశాలల్లో చదివి పదో తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధులకు ప్రత్యేక శిక్షణ శిబిరంలో శిక్షణ ఇస్తున్నట్లు భద్రాచలం ఐటీడీఏ పీఓ ప్రతీక్జైన్ తెలిపారు. ఈ శిక్షణ శిబిరానికి విద్యార్థులు హాజరయ్యేలా గిరిజన సంక్షేమ శాఖ అధికారులు చొరవ తీసుకోవాలని సూచించారు. అలాగే, గత మూడేళ్ల నుంచి పదో తరగతి లేదా ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులకు ఐటీడీఏ ద్వారా కంప్యూటర్, సెల్ఫోన్ రిపేరింగ్, ఎలక్ట్రీషియన్, ఫొటోగ్రఫీ, డ్రైవింగ్, బ్యూటీషియన్, హోటల్ మేనేజ్మెంట్ తదితర ఉపాధి రంగాల్లో శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ఆసక్తి గల గిరిజన విద్యార్థులు భద్రాచలం ఐటీడీఏలోని భవిత సెల్లో దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు 81438 40906, 63026 08905 నంబర్లలో సంప్రదించాలని పీఓ సూచించారు. డీలర్ల వద్దే విత్తనాలు కొనుగోలు చేయాలి కల్లూరురూరల్: ప్రభుత్వం లైసెన్సు కలిగిన డీలర్ల వద్దే రైతులు విత్తనాలు కొనుగోలు చేయాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయనిర్మల సూచించారు. కల్లూరు మండలంలోని కొర్లగూడెం రైతు వేదికలో రాయితీపై పచ్చిరొట్ట విత్తనాల పంపిణీని మంగళవారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. ఏ పంట విత్తనాలైనా డీలర్లే వద్ద కొనుగోలు చేయడంతో పాటు రశీదు భద్రపర్చుకోవాలన్నారు. గ్రామాలకు వచ్చి అమ్మే వారి వద్ద విత్తనాలు కొనుగోలు చేసి మోసపోవద్దని తెలిపారు. అలాగే, కానుకల ఎర చూపే వారిని నమ్మొద్దని సూచించారు. ఆతర్వాత రైతునేస్తం పేరిట నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో వివిధ పంటల సాగు మెళకువలను శాస్త్రవేత్తలు వివరించగా రైతులతో కలిసి డీఏఓ పాల్గొన్నారు. సత్తుపల్లి ఏడీఏ యు.నర్సింహారావు, ఏఓ రూప, సొసైటీ సీఈఓ బాలకృష్ణతో పాటు అంకిరెడ్డి సత్యనారాయణరెడ్డి,పలువురు రైతులు పాల్గొన్నారు. ఆర్టీఓ కార్యాలయంలో అలజడి ఖమ్మంక్రైం: జిల్లాకేంద్రంలోని రవాణా శాఖ కార్యాలయంలో మంగళవారం ఒక్కసారిగా అలజడి రేకెత్తింది. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటలోని చెక్పోస్ట్ పాటు రాష్ట్రంలోని పలు రవాణా శాఖ కార్యాలయంలో మంగళవారం ఏకకాలంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సమాచారం అందగానే ఖమ్మంతోపాటు వైరా, సత్తుపల్లి రవాణాశాఖ కేంద్రాల్లో ఉద్యోగులు హడలిపోయారు. ఖమ్మంలో కార్యాలయంలో ఉన్న ఏజెంట్లను బయటకు పంపించివేశారు. అంతేకాక సేవలు పూర్తయిన వాహనదారులు కార్యాలయంలోనే ఉండకుండా వెళ్లిపోవాలని సూచించారు. అయితే జిల్లాలోని రవాణా శాఖ కార్యాలయాలపై కూడా ఏసీబీ నిఘా ఉన్నందున ఏ రోజైనా దాడులు జరిగే అవకాశముందన్న ప్రచారం జరుగుతోంది. -
ముగ్గురిని బలి తీసుకున్న ప్రమాదం
హరియాతండా వద్ద చెట్టును ఢీకొట్టిన కారు ● తల్లి, ఇద్దరు కుమార్తెల మృతి.. గాయాలతో బయటపడిన భర్త ● అల్లుడే చంపేశాడని మృతురాలి తల్లిదండ్రుల ఆరోపణరఘునాథపాలెం: రఘునాథపాలెం మండలం మంచుకొండ – పంగిడి రోడ్డులో హరియాతండా సమీపాన చెట్టును ఢీకొట్టిన ఘటనలో తల్లీ, ఇద్దరు కుమార్తెలు కన్నుమూశారు. ఈ ఘటనలో కారు నడుపుతున్న భర్త తీవ్రగాయాలతో బయటపడ్డాడు. మంగళవారం రాత్రి ఈ ప్రమాదం జరగగా.. తమ అల్లుడే ముగ్గురిని హత్య చేసినట్లు మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించడం గమనార్హం. స్థానికుల కథనం ప్రకారం ప్రమాదానికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి. మండలంలోని బావోజీ తండాకు చెందిన బోడా ప్రవీణ్ హైదరాబాద్లో ఫిజియోథెరపీ డాక్టర్గా పని చేస్తున్నాడు. ఆయనకు ఏన్కూరు మండలం రంగాపురం తండాకు చెందిన కుమారి(26)తో ఐదేళ్ల క్రితం వివాహం జరగగా, నాలుగు, మూడేళ్ల కుమార్తెలు కృషిక, తనిష్క ఉన్నారు. వీరంతా హైదరాబాద్లో నివసిస్తున్నారు. అయితే, ప్రవీణ్ తల్లికి అనారోగ్యంగా ఉండడంతో పది రోజుల పాటు సెలవు పెట్టిన ప్రవీణ్ భార్యాపిల్లలతో సహా బావోజీ తండాకు వచ్చాడు. ఆధార్ కార్డులో మార్పుల కోసం.. ప్రవీణ్ – కుమారి దంపతుల చిన్నకుమార్తె ఆధార్ కార్డులో మార్పులు చేయించేందుకు మంగళవారం నలుగురు కలిసి కారులో మంచుకొండ వెళ్లారు. అక్కడి నుంచి వస్తుండగా హరియాతండా సమీపాన మూల మలుపు వద్ద చెట్టును కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కుమారి, ఇద్దరు కుమార్తెలు కృషిక, తనిష్క అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో ప్రవీణ్ తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. అయితే, కారు వేగంగా వెళ్లి చెట్టును ఢీకొనగా.. ఆ మార్గంలో ఎవరూ రాకపోవడంతో గంటకు పైగా అలాగే ఉన్నట్లు తెలుస్తోంది. అనంతరం అటువైపుగా వెళ్తున్న వారు రోడ్డు పక్కగా దూసుకెళ్లిన కారులో లైట్లు వెలుగుతుండడంతో చూసి బయటకు తీసేసరికే కుమారి, ఆమె పిల్లలు మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన ప్రవీణ్ను ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు సమాచారం అందుకున్న ఖమ్మం నగర ఏసీపీ రమణమూర్తి, రఘునాథపాలెం సీఐ శ్రీహరి ఘటనాస్థలికి వెళ్లి అన్నం సేవా ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సహకారంతో మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Pagination
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
కౌంటింగ్కు సర్వం సిద్ధం
373 మంది గైర్హాజరు
●భారీగా తగ్గిన దిగుబడులు
డిమాండ్ ఉండే సమయానికి కాయలు రాలేదు
జిల్లా వ్యాప్తంగా నాయకులకు బహిష్కరణ నోటీసులు
ఖరీఫ్ కార్యాచరణ అమలుకు సమాయత్తం కావాలి
ఏసీఏ జూనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ నియామకం
ఓట్ల లెక్కింపునకు పక్కా ఏర్పాట్లు
ఎల్ అండ్ టి ఫైనాన్స్ లిమిటెడ్ హైదరాబాద్లో పూర్తి గృహ రుణాన్ని ప్రారంభించింది
రామ్కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్డేట్లు
తప్పక చదవండి
- విజయ్ సరసన హీరోయిన్గా ఛాన్స్.. చేయనని ఏడ్చేసిన బాలీవుడ్ బ్యూటీ
- Khammam Car Accident: అల్లుడు హైడ్రామా..!
- విజయవాడ హైవేపై హృదయ విదారక ఘటన
- ‘బోట్ నెట్’పై ఎఫ్బీఐ గురి.. చైనా పౌరుడు అరెస్ట్
- Aditi Dugar: జీరో టు.. మ.. మ.. మాస్క్ వరకు!
- ప్రపంచ క్రికెట్లో ఇద్దరే ఇద్దరు..!
- ప్రియుడి వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య
- వెండే బంగారమాయెగా..
- Lok Sabha Election 2024: బీజేపీకి 295 –305 సీట్లు, కాంగ్రెస్కు 55–65 సీట్లు
- ‘స్కూటీ’అంటే పాప.. ‘బైక్’అంటే బాబు
Advertisement