-
రాజన్న కోడెలకు పశుగ్రాసం
ముస్తాబాద్/కోనరావుపేట: వేములవాడ రాజన్న గోశాలకు ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామస్తులు ఆదివారం నాలుగు ట్రాక్టర్లలో పశుగ్రాసాన్ని తరలించారు. పోతుగల్కు చెందిన చెక్కపల్లి రాజు, రేపాక బాల్నర్స్, బొబ్బిలి హనుమంతు, అక్కరాజు పర్శరాములు పశుగ్రాసాన్ని తీసుకెళ్లారు. గత ఐదేళ్లుగా రాజన్న కోడెలకు పశుగ్రాసాన్ని తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. ఏటా పశుగ్రాసం అందజేస్తున్న నలుగురిని బీఆర్ఎస్ నాయకుడు తన్నీరు గౌతంరావు అభినందించారు. కార్యక్రమంలో మామిండ్ల నరేశ్, కంచం మల్లయ్య, నర్సయ్య, అశోక్, శ్రీకాంత్, ఈర్ల నరేశ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామానికి చెందిన ఈర్ల పర్శరాములు తనవంతు సాయంగా ట్రాక్టర్ గడ్డిని అధికారులకు అందజేశారు. ఎగ్గె మహేందర్, నందగిరి నాగరాజు, లంబ తిరుపతి తదితరులు పాల్గొన్నారు. -
‘ప్రభుత్వ భూమి కబ్జాపై పట్టింపేది’?
సిరిసిల్లటౌన్: జిల్లా కేంద్రంలోని కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమిపై అధికారులు పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారని సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి గుంటి వేణు అన్నారు. ఆదివారం సిరిసిల్లలోని కార్మిక భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. స్థానిక శాంతినగర్ శివారులోని విశ్వనాథ స్వామి ఆలయం, వ్యవసాయ కాల్వ భూమి విలువ దాదాపు రూ.25కోట్లు ఉంటుందని, సదరు భూమిని ఓ బడా నేత ఆక్రమించుకుని ప్లాటింగ్ చేసి విక్రయాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. ఈవిషయమై చాలా రోజులుగా వివాదం నెలకొనగా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. మున్సిపల్, రెవెన్యూ అధికారులు చొరవ చూపి ప్రభుత్వ భూమిని కాపాడాలని, లేకుంటే అక్రమంగా సాగుతున్న భూకబ్జాకు అధికారులే సహకరిస్తున్నట్లుగా ప్రజలు నమ్మాల్సి వస్తుందన్నారు. చిన్నపాటి ఘటనల్లో సామాన్యులపై విరుచుకుపడే అధికారం యంత్రాంగం ఈవిషయంలో ఎందుకు కినుక వహిస్తుందో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రభుత్వ భూమిని కాపాడాలని, లేకుంటే పెద్దెత్తున పోరాటాలు చేపడుతామని హెచ్చరించారు. సమావేశంలో మీస లక్ష్మణ్, సోమ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
అర్బన్బ్యాంకు ఎన్నికల్లో విజయం సాధిస్తాం
సిరిసిల్లటౌన్: రాబోయే సిరిసిల్ల సహకార అర్బన్బ్యాంకు ఎన్నికల్లో బీజేపీ కచ్చితంగా జయకేతనం ఎగురవేస్తుందని ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ అన్నారు. ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఎన్నికల సమాయత్త సమావేశంలో మాట్లాడారు. అర్బన్బ్యాంకు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటామన్నారు. నాయకులు, కార్యకర్తలు ఈవిషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. రాబోయే రోజుల్లో ప్రణాళిక బద్ధంగా కార్యాచరణ చేపడుతున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడెపు రవీందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి, పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్, కౌన్సిలర్లు బొల్గం నాగరాజుగౌడ్, గూడూరి భాస్కర్, గజభీంకార్ చందు, దుమాల శ్రీకాంత్, బర్కం నవీన్యాదవ్, ఎర్రం విజయ్, ఎనగంటి నరేశ్, గాజుల సదానందం తదితరులు పాల్గొన్నారు. ● బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ -
ఎలక్ట్రానిక్ కాంటాలతో ధాన్యం కొనుగోళ్లు
ముస్తాబాద్(సిరిసిల్ల): జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ కాంటాలతోనే ధాన్యం కొనుగోళ్లు చేపడుతామని జిల్లా పౌరసరఫరాల అధికారి జితేందర్రెడ్డి అన్నారు. ఇటీవల ‘సాక్షి’లో ‘మాన్యువల్ దోపిడీ’ శీర్షికన ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ముస్తాబాద్ ఇతర గ్రామాల్లో మాన్యువల్గా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. దీనిపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినట్లు కాంగ్రెస్ కరీంనగర్ ఎన్నికల కో కన్వీనర్ కనమేని చక్రధర్రెడ్డి తెలిపారు. రైతుల నుంచి ఎలక్ట్రానిక్ కాంటాల ద్వారా ధాన్యం తీసుకోవాలని కోరామన్నారు. దీనికి స్పందించిన డీఎస్వో, డీసీవోలు ప్యాక్స్ అధికారులకు స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. రైతుల నుంచి అదనంగా ధాన్యం తీసుకోవద్దని, ఎలక్ట్రానిక్ మిషన్ల ద్వారానే కొనుగోళ్లు చేయాలని ఆదేశించారు. పర్యవేక్షకుల నియామకం వేములవాడ: రాజన్న ఆలయంలో పలు విభాగాల్లో పర్యవేక్షకులు లేక పనులన్నీ నిలిచిపోతుండటం, ఆలస్యంగా జరగడంపై ఈనెల 4న ‘సాక్షి’లో ‘పర్యవేక్షకులు లేక పరేషాన్’ శీర్షికన కథనం ప్రచురితమైంది. స్పందించిన ఆలయ ఈవో కృష్ణప్రసాద్ ఇద్దరు పర్యవేక్షకులను నియమించారు. ప్రసాదాల తయారీ గోదాంకు నర్సింహమూర్తి, నాగుల మహేశ్, కిందిస్థాయి ఉద్యోగులైన ఎల్.రాజేందర్ను గోశాలకు, పంపరి అంజయ్యను బద్దిపోచమ్మగుడికి బదిలీ చేస్తూ ఈవో ఆదివారం ఉత్తర్వులు వెలువరించారు. -
సుందరయ్య స్ఫూర్తితో ప్రజాపోరాటం
సిరిసిల్లటౌన్: కమ్యూనిస్టు అగ్రనేత, బడుగు వర్గాల ఆశాజ్యోతి పుచ్చలపల్లి సుందరయ్య స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు చేపడుతామని సీపీఎం జిల్లా కార్యదర్శి మూశం రమేశ్ అన్నారు. ఆదివారం సిరిసిల్లలోని బీవైనగర్ పార్టీ ఆఫీసులో నిర్వహించిన పుచ్చలపల్లి వద్ధంతిలో ఆయన మాట్లాడారు. మనదేశంలో కమ్యూనిస్టు ఉద్యమాలకు ఊపిరి ఊదినవారిలో సుందరయ్య ఒకరన్నారు. సామాజిక అణచివేతకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో తొలుత తన కుటుంబంలోనే సాంఘీక సంస్కరణ ఉద్యమాన్ని ప్రారంభించిన మహనీయుడని, పార్లమెంటుకు సైకిల్పై వెళ్లిన నిరాడంబర జీవిగా పేర్కొన్నారు. బూర్జువా పార్టీల పాలనలో ప్రజా సమస్యలు పూర్తిగా పట్టించుకోవడం లేదన్నారు. దేశానికి ప్రస్తుతం సుందరయ్య లాంటి ఆదర్శ నేతలు అవసరమని అన్నారు. అనంతరం పుచ్చలపల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. కార్యక్రమంలో నాయకులు సూరం పద్మ, అన్నల్దాస్ గణేశ్, నక్క దేవదాసు, ఎలిగేటి రాజశేఖర్, వడ్నాల వీరేశం, బింగి సంపత్, స్వర్గం శేఖర్, సందుపట్ల పోచమల్లు తదితరులు పాల్గొన్నారు. -
లక్షణంగా వరి సేద్యం
● జిల్లాలో 2.35 లక్షల ఎకరాల్లో పంటల సాగు ● ఒక్క వరి పంట సాగు 1,83,080 ఎకరాల్లో.. ● తగ్గుతున్న పత్తి సాగు విస్తీర్ణం ● ఇది వానాకాలం పంటల సాగు ప్రణాళిక ● ఐదు రోజుల్లో రోహిణి కార్తె ప్రవేశంసిరిసిల్ల: జిల్లాలో వరి కోతలు ముగిశాయి. ధాన్యం కొనుగోళ్లు ముగింపు దశకు చేరాయి. మరో పది రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు ముగుస్తాయి. జిల్లాలో వానాకాలం (ఖరీఫ్) పంటల సాగు ప్రణాళికను వ్యవసాయశాఖ ఖరారు చేసింది. జిల్లావ్యాప్తంగా వానాకాలంలో 2,35,866 ఎకరాల్లో పంటలు సాగు అవుతాయని అంచనా వేశారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయనే అంచనాలతో రైతులు వానాకాలంలో వరి సాగుకు ప్రాధాన్యతనిస్తున్నారు. మరోవైపు పత్తి పంట సాగు విస్తీర్ణం 49,215 ఎకరాలకు పరిమితం చేశారు. ఫలితంగా జిల్లాలో వరి జోరుగా ఉండగా.. మిగతా పంటలు అంతంత మాత్రంగానే సాగవుతున్నాయి. జిల్లా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తే వ్యవసాయ సాగు విస్తీర్ణం పదిలంగా ఉంది. జిల్లా వ్యవసాయ శాఖ సాగు ప్రణాళికపై కథనం. రోహిణితో వానాకాలం ప్రవేశం రోహిణి కార్తె ఈనెల 25న శనివారం ప్రవేశిస్తుంది. వానాకాలం సీజన్ రోహిణీ కార్తెతో మొదలవుతోంది. రుతుపవనాల చల్లని కబురు అప్పుడే దరి చేరుతోంది. తొలకరి జల్లులు పలకరించగానే పుడమి తల్లి పులకిస్తుంది. మట్టివాసనల మకరందం అన్నదాతల్లో ఆశలను నింపుతుంది. జిల్లాలో సాగు విస్తీర్ణం స్థిరంగా ఉంది. రైతాంగానికి అవసరమైన ఎరువులు, విత్తనాల అవసరాలను ముందే గుర్తించి వ్యవసాయశాఖ సిద్ధం చేస్తుంది. సకాలంలో వర్షాలు కురిస్తే జిల్లా రైతాంగం పసిడి పంటలను పండిస్తారు. ఈ వానాకాలంలో రైతులు తమకు నచ్చిన పంటను వేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. రైతులు లక్షణంగా ఆంక్షలు లేని సేద్యానికి శ్రీకారం చుట్టనున్నారు. వరి, పత్తిపైనే ఆశలు జిల్లాలో రైతాంగం వరి, పత్తి పంటలపైనే ఆశలు పెట్టుకున్నారు. తేలిక పాటి నేలలు, నల్లరేగడి భూములు ఎక్కువగా ఉండడంతో వరి, పత్తి సాగుకు అనువైన పరిస్థితులు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా వరి 1,83,080 ఎకరాలు, పత్తి 49,215 ఎకరాల్లో సాగు అవుతుంది. ఈ రెండు పంటలే అత్యధికంగా 2,32,295 ఎకరాల్లో సాగవుతుండగా.. మిగతా అన్ని పంటలు కలిపి కేవలం 3,571 ఎకరాల్లో మాత్రమే సాగవుతాయని వ్యవసాయ శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పుడు యాసంగి సీజన్ వడ్ల కొనుగోళ్లు ముగింపు దశకు చేరింది. రైతులు పేడను పొలాలకు తరలించడం, సేంద్రియ ఎరువులు చల్లుకోవడం, వేసవి దుక్కులు దున్నకాలు మొదలయ్యాయి. ఈ సారి తొలకరి జల్లులు ముందుగానే పడుతాయని అంచనా వేస్తున్నారు. తొలకరి పలకరించగానే వాకాకాలం సీజన్ మొదలవుతుంది.అవసరమయ్యే ఎరువులు (మెట్రిక్ టన్నుల్లో) యూరియా 22,484 డీఏపీ 4,328 ఎంపీవో 5,936 కాంప్లెక్స్ 14,839 రైతులు వరిపైనే ఆసక్తిచూపుతున్నారు వ్యవసాయశాఖ ముందుగానే ప్రణాళిక సిద్ధం చేస్తుంది. జిల్లావ్యాప్తంగా రైతులు వరి సాగుపైనే ఆసక్తి చూపుతున్నారు. సమృద్ధిగా వర్షాలు పడుతాయనే అంచనాల మధ్య భూగర్భ జలాలు అందుబాటులో ఉండడంతో వానాకాలంలో వరి సాగు విస్తీర్ణం పెరుగుతుంది. పత్తితో పాటు ఇతర పంటల సాగు విస్తీర్ణం తగ్గుతుంది. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా ముందస్తు ప్రణాళికను సిద్ధం చేశాం. వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తాం. – భాస్కర్, జిల్లా వ్యవసాయాధికారి -
నాంపల్లి నర్సన్న బ్రహ్మోత్సవాలు
వేములవాడఅర్బన్: వేములవాడ రాజన్న అనుబంధ నాంపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం నుంచి గురువారం వరకు బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. బుధవారం శ్రీభూనీల సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. తేనెటీగల పెంపకంపై అవగాహనబోయినపల్లి(చొప్పదండి): మండలంలోని నీలోజిపల్లి ఆర్అండ్ఆర్ కాలనీలో ఆదివారం వేములవాడ డీఎస్పీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో జాతీయ సంస్థ అఫ్ అగ్రికల్చరర్ మేనేజ్మెంట్ వారు మిడ్మానేరు ముంపు గ్రామ నిర్వాసితులకు సైంటిఫిక్గా తేనెటీగల పెంపకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వీఎస్ఎన్ రెడ్డి ఎడ్యూకేషనల్ సొసైటీ సభ్యులు మాట్లాడుతూ, మిడ్మానేరు ముంపు గ్రామాల్లో తేనెటీగల పెంపకంపై ఆసక్తి ఉన్నవారికి హైదరాబాద్లో ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. తేనెటీగల పెంపకంతో మంచి ఉపాధి పొందవచ్చని, కేంద్ర ప్రభుత్వం రాయితీ ఇవ్వడం జరుగుతుందని వివరించారు. ఆసక్తి ఉన్నవారు తమను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్సై ఫృథ్వీదర్గౌడ్, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ జిల్లా అధ్యక్షుడిగా ధర్మేందర్ముస్తాబాద్(సిరిసిల్ల): ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎన్ఆర్ఐ సెల్ జిల్లా అధ్యక్షుడిగా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామానికి చెందిన తోట ధర్మేందర్ నియామకం అయ్యారు. ఈమేరకు హైదరాబాద్ గాంధీభవన్లో పీసీసీ ఎన్ఆర్ఐ సెల్ గల్ఫ్ డివిజన్ చైర్మన్ డాక్టర్ వినోద్కుమార్ చేతుల మీదుగా నియామక పత్రం స్వీకరించారు. ఈసందర్భంగా ధర్మేందర్ మాట్లాడుతూ, గల్ఫ్ దేశాల్లో అనేక సంవత్సరాలు పనిచేశానని, అక్కడున్న తెలంగాణ కార్మికుల పక్షాన ఉద్యమాలు చేశామన్నారు. తెలంగాణ కార్మికుల హక్కుల కోసం, వేతనాల కోసం చేసిన పనులకు గుర్తింపు ఇస్తు కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి బాధ్యతలు అప్పగించిందన్నారు. గల్ఫ్ కార్మికుల కోసం, గల్ఫ్ పాలసీ అమలుకు పనిచేస్తానని పేర్కొన్నారు. తన నియామకానికి సహకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్, విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి, భీంరెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీపీసీసీ అంతర్జాతీయ కన్వీనర్ భీంరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు నరేశ్రెడ్డి, మహిపాల్, జంగ రాజు, సంతోష్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. రైల్వే రిజర్వేషన్ కౌంటర్ ఏర్పాటు చేయండివేములవాడ: వేములవాడలో రైల్వే రిజర్వేషన్ కౌంటర్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు సంగ స్వామియాదవ్ అధికారులను కోరాడు. ఆదివారం వేములవాడకు వచ్చిన దక్షిణ మధ్య రైల్వే డివిజనల్ మేనేజర్(కమర్షియల్) బస్వరాజుకు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా స్వామి మాట్లాడుతూ, రాజన్న సన్నిధికి నిత్యం లక్షలాది మంది భక్తులు తరలివస్తారని, వీరితో పాటు వేములవాడ పరిసర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు వారణాసి, తిరుపతి, షిర్డీ వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్తారని, ప్రయాణికుల సౌకర్యార్థం కరీంనగర్లో ఉన్న మాదిరిగానే వేములవాడలోనూ రైల్వే రిజర్వేషన్ కౌంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. రిజర్వేషన్ సదుపాయం అందుబాటులో లేక, టిక్కెట్లు దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కొన్ని సందర్భాల్లో ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారని, రిజర్వేషన్ సదుపాయం కల్పిస్తే ఇక్కడి ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. -
జిల్లాలో సాగు విస్తీర్ణం
విస్తీర్ణం (ఎకరాల్లో)అవసరమైన విత్తనాలు (క్వింటాళ్లలో)పంటవరి 1,83,080 45,770.00 పత్తి 49,215 665.00 మొక్కజొన్న 1,510 120.80 కందులు 1,533 45.06 పెసర 348 27.84 మిర్చి 180 0.18 -
అచ్చిరాని వైద్యం.. ప్రాణసంకటం
ముస్తాబాద్(సిరిసిల్ల): అవాంఛిత గర్భస్రావాలు ఆందోళన రేపుతున్నాయి. లింగానిర్ధారణ నెపంతో జరిగే గర్భస్రావాలతో సైతం మహిళలు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇటీవల జిల్లాలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఎలాంటి అర్హత లేని కొంత మంది ప్రాక్టీషనర్లకు అబార్షన్లు కాసులు కురిపించే వ్యాపారంగా మారిపోయిందనే విమర్శలు వస్తున్నాయి. చట్టం ఏం చెబుతోంది ప్రెగ్నెన్సీ యాక్ట్ ప్రకారం 9 వారాల కంటే తక్కువ గర్భం ఉన్నవారు మాత్రమే గైనాకాలజిస్టు పర్యవేక్షణలో అబార్షన్ చేయించుకోవాలి. నాలుగు నుంచి ఐదు నెలల గర్భాన్ని అబార్షన్ చేస్తే 3 ఏళ్ల జైలు లేదా జరిమానా, 17 నుంచి 20 వారాల ప్రెగ్నెన్సీ అబార్షన్ చేస్తే ఏడేళ్ల జైలు లేదా జరిమానా విధించవచ్చు. అర్హత లేని వైద్యులు అబార్షన్లు చేస్తే పదేళ్ల జైలు లేదా జీవితఖైదు విధించవచ్చు. ఎలాంటి సందర్భాల్లో అబార్షన్లు.. గర్భం దాల్చిన మహిళకు ప్రాణపాయం ఉన్నప్పుడు, పిండం ఎదుగుదల సరిగా లేనప్పుడు అబార్షన్లు చేయవచ్చు. శిశువులో జెనటిక్ సమస్యలు, ఫైబ్రాయిడ్స్, గర్భ సంచుల్లో సమస్యలు, మధుమేహంతో బాధపడేవారు, రేడియేషన్ ఎక్స్రేలతో ఇబ్బంది పడినవారు, ఇన్ఫెక్షన్లతో బాధపడేవారు మాత్రమే అబార్షన్లు చేసుకునే వీలుంది. అవాంఛిత గర్భం రాకుండా టీ కాపర్ వేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. జిల్లా అధికారుల విచారణ జిల్లాలో అబార్షన్లపై కలెక్టర్ అనురాగ్ జయంతి సీరియస్గా ఉన్నారు. ఇటీవల కలెక్టర్ దృష్టికి నాలుగు కేసులు రావడంతో విచారణకు కమిటీని నియమించారు. ప్రస్తుతం కమిటీ విచారణ చేపడుతోంది. స్కానింగ్ సెంటర్లు, అర్హత లేని డాక్టర్ల వైద్యం, మెడికల్ దుకాణాల్లో అబార్షన్లకు మాత్రలు ఇవ్వడం వంటి చర్యలపై విచారణ కొనసాగుతోంది. కాగా కొంత మంది మహిళలు ఇతర జిల్లాలకు వెళ్లి అబార్షన్లు చేయించుకుంటున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. జిల్లాలోని కొన్ని ఆసుపత్రులు అబార్షన్లకు నిలయంగా మారాయనే ఆరోపణలు ఉండగా, ఫిర్యాదు చేసేందుకు ఎవరూ ముందుకురాకపోవడంతో అధికారులు చర్యలు తీసుకోలేకపోతున్నారని తెలిసింది. ఆందోళన కలిగిస్తున్న గర్భవిచ్ఛిత్తి అర్హత లేని వైద్యుల వ్యాపార ధోరణి చట్టాలపై అవగాహన కరువు‘గంభీరావుపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళా రెండు నెలల గర్భాన్ని తొలగించుకోవాలనుకుంది. అప్పటికే ఆమెకు ఇద్దరు పిల్లలు. గర్భ విచ్ఛిత్తికి మాత్రలు వేసుకుంది. దీంతో ఆమెకు తీవ్ర రక్తస్రావం అయ్యింది. పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. తీవ్ర రక్తస్రావమై ప్రాణపాయ స్థితిలో ఉండగా 5 బాటిళ్ల రక్తాన్ని ఎక్కించారు. ఆక్సిజన్ పెట్టి సర్జరీ చేయడంతో ప్రస్తుతం ఆమె కోలుకుంటోంది. ఇలాంటి మహిళలు, యువతులు ఎంతో మంది జిల్లాలో మాత్రలు వేసుకుని అబార్షన్లకు ప్రయత్నిస్తున్నారు’. ‘ముస్తాబాద్ మండలంలోని ఓ మహిళ గర్భస్రావం కోసం మాత్రలు వేసుకుని ప్రాణాల మీదికి తెచ్చుకోగా, వైద్యులు ఆమెను రక్షించారు. ఇక కొన్ని ఆసుపత్రుల్లో నాలుగు, ఐదు నెలల గర్భాలను కూడా తీసివేస్తున్నారనే ఆరోపణలున్నాయి. గ్రామాల్లో ఎలాంటి శిక్షణ లేని ప్రాక్టీషనర్లు మాత్రలు ఇచ్చి అబార్షన్లు చేయడం మహిళలకు ప్రాణసంకటంగా మారింది. వివాహేతర సంబంధాలు, ప్రేమ పేరుతో మోసాలు, ఇద్దరు ఆడపిల్లలు ఉన్న తల్లులు, తదితర కారణాలు అవాంఛిత గర్భాలకు దారితీస్తున్నాయి. ఇలాంటి వారు గోప్యంగా అబార్షన్లకు పాల్పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు’. -
‘ట్రినిటి’ అద్భుత ఫలితాలు
సప్తగిరికాలనీ(కరీంనగర్): ఈఏపీసెట్ 2024 ఫలితాల్లో ట్రినిటి జూనియర్ కళాశాలల విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారని కళాశాలల ఫౌండర్ చైర్మన్, పెద్దపల్లి మాజీ శాసన సభ్యుడు దాసరి మనోహర్రెడ్డి తెలిపారు. కళాశాలకు చెందిన జె.హనికర్ అత్యుత్తమంగా 44వ ర్యాంక్ సాధించి సత్తా చాటినట్లు పేర్కొన్నారు. పి.ప్రణయ్ 773, వై.ఆశ్లేష 1254, వి.శ్రీతేజ 1255, వై.అశ్విత 1551, సీహెచ్ విఘ్నేశ్ 1624, అయేషా 1627, ఫిల్జా అతీక్ 1748, ఎస్.శ్రీలక్ష్మీ 2159, ఎం.హర్షవర్ధన్ 2280, ఎన్.గంగశ్రీ 2372, పి.శ్రీదీప 2682, సీహెచ్ రంజిత 2815, మదిహా ఫాతిమా 2913, ఎం.ఆశీష్ 2954, కె.రాణి 2998 ర్యాంకులను కై వసం చేసుకున్నట్లు తెలిపారు. 10వేల లోపు ర్యాంకులను చాలామంది విద్యార్థులు కై వసం చేసుకున్నారన్నారు. అత్యుత్తమ ర్యాంకులను సాధించిన విద్యార్థులను శనివారం ఆయన అభినందించారు. విద్యార్థులను కళాశాలల చైర్మన్ దాసరి ప్రశాంత్రెడ్డితోపాటు ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, తల్లిదండ్రులు తదితరులు అభినందించారు. -
‘ఎస్ఆర్’ విజయకేతనం
తిమ్మాపూర్: రాష్ట్రంలో ఇంజినీరింగ్ అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఈఏపీసెట్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో కరీంనగర్ జిల్లా ఎస్ఆర్ కళాశాల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించినట్లు కరీంనగర్ ఎస్సార్ కళాశాల జోనల్ ఇన్చార్జి నేదూరి తిరుపతి తెలిపారు. తమ కళాశాలలో ఇంటర్ ఎంపీసీ చదివిన తుమ్మ తేజస్వి 161 ర్యాంకు, ముంకల గణేశ్ 199, కటంకూరి శ్రీనివాసరెడ్డి 291, రావుల దీపాన్షురెడ్డి 412, గడ్డం రాజీవ్ 552, సాయిచంద్ర 565తోపాటు మరో 12 మంది వెయ్యి లోపు ర్యాంకులు, మరో 20 మంది 5వేల లోపు ర్యాంకులు సాధించారని వివరించారు. అగ్రికల్చర్లో మధులికరెడ్డి, లక్ష్మీప్రసన్న, అశ్విత రాష్ట్రస్థాయిలో ఉత్తమ ర్యాంకులను సాధించారని తెలిపారు. విద్యార్థులను విద్యాసంస్థల చైర్మన్ వరదారెడ్డి, డైరెక్టర్ మధూకర్రెడ్డి, సంతోష్రెడ్డి, జోనల్ ఇన్చార్జి తిరుపతి, అకాడమిక్ డీన్ రవీందర్రెడ్డి, ప్రిన్సిపాళ్లు నాగార్జునరెడ్డి, ప్రవీణ్రెడ్డి, మారుతి, శ్రీనివాసరెడ్డి అభినందించారు. -
ఠాణాలో ఆత్మహత్యాయత్నం
● అడ్డుకోవడంతో తప్పిన ప్రాణాపాయం ● చందుర్తి పోలీస్ స్టేషన్లో ఘటన ● పోలీసులు వేధిస్తున్నారని ఆరోపణ ● చందుర్తి సీఐ హామీతో వెనుదిరిగిన బాధితుడి కుటుంబం చందుర్తి(వేములవాడ): పోలీసులు ఆరు నెలలుగా వేధిస్తున్నారంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి పోలీస్ స్టేషన్లో ఎన్గల్ గ్రామానికి చెందిన మ్యాకల జలంధర్ శనివారం పురుగుల మందు తాగేందుకు యత్నించాడు. అక్కడే ఉన్న పోలీస్ సిబ్బంది ఒకరు అడ్డుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. బాధితుడు జలంధర్ వివరాల ప్రకారం.. ఎన్గల్కు చెందిన మ్యాకల జలంధర్కు అదే గ్రామానికి చెందిన గుంటి మల్లేశంల మధ్య ఇళ్ల స్థలాల సరిహద్దు వివాదం 8 నెలలుగా కొనసాగుతోంది. అప్పుడే పోలీసులను ఆశ్రయించగా.. గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ చేసుకోవాలని సూచించారు. పంచాయితీ పెద్దల తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ గుంటి మల్లేశం నవంబర్లో పోలీసులను ఆశ్రయించారు. ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించనా వినిపించుకోలేదు. పంచాయితీ పెద్దల తీర్మానానికి కట్టుబడి ఉంటానని మ్యాకల జలంధర్ పోలీసులకు చెప్పగా.. పంచాయితీ చెప్పిన పెద్ద మనుషులపైనే కేసు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. దీంతో ఈ ఏడాది జనవరి 10న జిల్లా ఎస్పీ అఖిల్మహాజన్కు ఠాణాదివస్లో ఫిర్యాదు చేయడంతో కొద్ది రోజులు వివాదం సద్దుమణిగింది. తిరిగి నెల రోజులుగా తనను పోలీస్ స్టేషన్కు పిలిపిస్తూ కేసు నమోదు చేస్తామంటూ పోలీసులు వేధిస్తున్నారంటూ ఏప్రిల్ 8న మళ్లీ జిల్లా ఎస్పీని కలిసిన జలంధర్ తన గోడు వెల్లబోసుకున్నాడు. ఎస్పీ ఆదేశాలతో చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు గ్రామంలో విచారణ చేపట్టి, ఎవరి హద్దుల్లో వారు ఉండాలని ఆదేశించారు. అయితే ఇటీవల జలంధర్ను ఎస్సై ఠాణాకు పిలిపించి సాయంత్రం వరకు ఉంచుకొని వదిలేశాడని, అదేరోజు గుంటి మల్లేశం ఆ స్థలంలో రాళ్లతో హద్దు వేశాడన్నారు. దీనిపై ఏప్రిల్ 25న తిరిగి ఎస్పీకి ఫిర్యాదు చేశానని తెలిపారు. ఈ స్థలం విషయంలో ఎస్సై వేధిస్తున్నాడని జలంధర్ ఆరోపించారు. మల్లేశం ఫిర్యాదు చేయడంతో ఠాణాకు పిలిపిస్తూ ఇబ్బందులు పెడుతున్నాడని, తాము ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయాడు. శనివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో తమను పోలీస్ స్టేషన్కు పిలుపించుకోగా.. మల్లేశం నిర్మాణ పనులు చేయించేందుకు ఇసుక పోయించాడని తెలిపారు. తాము ఇంటికి వెళ్లగానే ఇసుక కనిపించడంతో తల్లి ఎల్లవ్వ, చెల్లె పావనితో కలిసి పురుగుల మందు డబ్బాతో ఠాణాకు వచ్చినట్లు వివరించాడు. కోనరావుపేట ఎస్సైకి విచారణ బాధ్యతలు చందుర్తి ఎస్సై శ్రీకాంత్పై తమకు నమ్మకం లేదని, గ్రామానికి వచ్చినప్పుడల్లా మల్లేశంను వెంటేసుకొని తిరుగుతున్నాడని చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు ఎదుట బాధితుడు జలంధర్ ఆరోపించాడు. దీంతో విచారణ బాధ్యతలను కోనరావుపేట ఎస్సై ఆంజనేయులుకు అప్పగించినట్లు సీఐ తెలిపారు. న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో ఇంటికి వెళ్లారు. -
ఉమ్మడి జిల్లా.. పర్యాటక ఖిల్లా
ఎన్నో చారిత్రక ప్రదేశాలు, దేవాలయాలు.. ● భక్తులు, పర్యాటకులను ఆకర్షిస్తున్న వైనం ● చూసొద్దాం.. రండి కొండల మధ్య రాముని గుండాలు రామగుండం నుంచి 2 కిలోమీటర్ల దూరంలో కొండల మధ్య ముచ్చగొలిపే చారిత్రక ప్రాంతం రాముని గుండాలు. కొండపైకి ఎక్కి చూస్తే కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలను కలిపే గోదావరినది, బొగ్గు గనులు, విద్యుత్ కేంద్రం కనువిందు చేస్తాయి. కరీంనగర్: ఒకప్పుడు కల్లోల ప్రాంతాలతో ఉన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేడు పర్యాటకంగా అభివృద్ధి చెందుతోంది. దేశంలోనే పేరెన్నిక గన్న సిల్వర్ ఫిలిగ్రీతోపాటు నాణ్యమైన నల్ల బంగారు గనులకు ప్రసిద్ధి పొందింది. ఎన్నో చారిత్రక స్థలాలు, కట్టడాలు, ఆధ్యాత్మికతను పరిమళింపజేసే ఆలయాలు ఆకర్షిస్తున్నాయి. దర్శించుకోవాలంటూ పర్యాటకులు, భక్తులకు స్వాగతం పలుకుతున్నాయి. వాటిపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. నాలుగు నూర్ల దేవాలయాలు.. నగునూరు కరీంనగర్ జిల్లా కేంద్రానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న నగునూరులో పూర్వం చాళుక్యులు, కాకతీయుల సామంతరాజులు 4 గుట్టలను కలుపుతూ కోటను నిర్మించి, పరిపాలన సాగించారు. బౌద్ధుల కాలం నాటి శాసనాలు, విగ్రహాలు, స్మారక చిహ్నాలు ఉన్నాయి. గంగాధరుడు నిర్మించిన త్రికూటాలయం నాటి శిల్పకళా ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తోంది. ఒకప్పుడు 400 దేవాలయాలు ఉండేవని, నాలుగు నూర్ల దేవాలయాలు ఉన్న ఊరు కాస్త నగునూరుగా స్థిరపడిందని చరిత్ర చెబుతోంది. గ్రామం వెలుపల అతిసుందరమైన పెద్ద నాగశిల్పం ఉంది. హైదరాబాద్కు చెందిన కాసుగంటి నారాయణరావు ట్రస్టు ఆధ్వర్యంలో రూ.3 కోట్లతో పురాతన ఆలయాల పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. దక్షిణకాశీ.. వేములవాడ కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం ఆదాయంలో తిరుపతి తర్వాత రెండోది. దక్షిణకాశీగా కీర్తిగాంచిన ఈ ఆలయాన్ని కళ్యాణి చాళుక్య వంశీయుడైన ఆరో విక్రమాదిత్యుడు వెయ్యేళ్ల క్రితం నిర్మించాడని శాసనాలు చెబుతున్నాయి. కోడె మొక్కు ఆచారం ఇక్కడ తప్ప రాష్ట్రంలో మరెక్కడా లేదు. మతసామరస్యానికి ప్రతీకగా దర్గాతోపాటు జైన దేవాలయాలు ఇక్కడ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సైఫన్.. నాగులపేట కోరుట్లకు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగులపేట సైఫన్ ఆసియా ఖండంలోనే అరుదైన నిర్మాణంగా కీర్తిగాంచింది. భూగర్భంలోకి కాలువలోని నీరు మాయమై, వాగు దాటాక తిరిగి ప్రత్యక్షమవుతుంది. కింద కాలువ, పైన వాగు ఉండటం ఈ సైఫన్ ప్రత్యేకత. కోర్కెలు తీర్చే అంజన్న.. కొండగట్టు మల్యాల మండలంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు. కరీంనగర్కు 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. 300 ఏళ్ల కింద ఈ ఆలయం నిర్మించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. ఇప్పుడున్న గుడి మాత్రం 160 ఏళ్ల కింద కృష్ణారావు దేశ్ముఖ్ నిర్మించారు. భక్తుల కోర్కెలు తీర్చే దేవునిగా ఆంజనేయస్వామి పేరు పొందారు. కొండల రాయుని కోట, గుహలు, బొజ్జ పోతన, సీతమ్మవారి కన్నీటి గుంటలు చూడదగినవి. వందేళ్ల నాటి ఎలగందుల ఖిల్లా కాకతీయులు, బహమనీలు, కుతుబ్షాహీలు, మొగలులు, అసఫ్జాహీలకు రాజధానిగా విలసిల్లిన ఎలగందుల కరీంనగర్కు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి కోట కొండపై మసీదు ఉంది. దాని మీనార్ ఒకటి కదిపితే కదులుతుందని అంటారు. లోపల బంగారు రంగు చిత్రాలు చూపరులను ఆకర్షిస్తాయి. బౌద్ధ స్తూపం.. ధూళికట్ట ఎలిగేడు మండలంలోని ధూళికట్ట గ్రామం కరీంనగర్కు 28 కిలోమీటర్ల దూరంలో ఉంది. 1975 నుంచి 77 వరకు జరిపిన తవ్వకాల్లో నాటి కోట, బౌద్ధ స్తూపం బయటపడ్డాయి. కోట ముఖద్వారం వద్ద రాగి నాణేలు, మట్టి బొమ్మలు దొరికాయి. శాతవాహనుల రాజధాని.. కోటిలింగాల శాతవాహనుల రాజధాని కోటిలింగాల. వెల్గటూర్ మండలానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామంలో ఎక్కడచూసినా శివలింగాలు, శిల్పకళా ఖండాలు, ఖండాల ఖండికలు కనిపిస్తుంటాయి. పురవాస్తు శాఖవారు జరిపిన తవ్వకాల్లో శాతవాహనుల హయాంలోని నాణేలు, ఇతర స్మారక చిహ్నలు వెలుగుచూశాయి. ఇక్కడి గోదావరినది నడి ఒడ్డున శ్రీకోటేశ్వరస్వామి ఆలయం ఉంది. త్రివేణి సంగమ క్షేత్రం.. కాళేశ్వరం కరీంనగర్కు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాళేశ్వరం.. శ్రీశైలం, ద్రాక్షారామం అంతటి విశిష్టమైంది. గోదావరి, ప్రాణ హిత, సరస్వతీ నదులు సంగమించే చోటిది. ప్రధాన ఆలయంలో కాళేశ్వర, ముక్తీశ్వర స్వామి లింగాలు ఒకే పానపట్టంపై ఉండటం విశేషం. ఇక్కడి లింగంపైన గల నాసికలో ద్రవం పోస్తే త్రివేణి సంగమంలో కలుస్తుందని ప్రతీతి. ప్రధాన ఆలయానికి కిలోమీటర్ దూరంలో ముక్తీశ్వరాలయం ఉంది. దీని చుట్టూ ఉన్న చిన్నచిన్న రాళ్లలో నుంచి విభూది రాలడం ఆశ్చర్యం కలిగిస్తుంది. నృసింహుని క్షేత్రం.. ధర్మపురి కరీంనగర్కు ఉత్తరాన 70 కిలోమీటర్ల దూరంలో ధర్మపురి నృసింహుని క్షేత్రం ఉంది. అర్ధాయుష్కు డైన కుమారుడి కోసం బలివర్మ మహారాజు దేవతాయాగం చేసి, విజయం సాధించడం, ప్రజలు ధర్మబద్ధంగా జీవించడం కారణంగా ధర్మపురిగా వాసికెక్కింది. పద్మాసనంలో లక్ష్మీ సమేతుడై వెలసిన నరసింహస్వామితోపాటు, రామలింగేశ్వరాలయం పక్కపక్కనే ఉండి శైవ, వైష్ణవ సమ్మేళనానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. వీరభద్రస్వామి.. కొత్తకొండ భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ మీసాల వీరభద్రస్వామి దేవస్థానం అతి పురాతనమైంది. కాకతీయ రుద్రేశ్వరుని కాలం క్రీ.శ. 1410లో మల్లికార్జున పండితుని మనవడైన కేదారిచే ఆలయ నిర్మాణం జరిగింది. ఏటా సంక్రాంతికి జరిగే జాతరకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. రాజ భవనాలు.. రామగిరి ఖిల్లా పెద్దపల్లికి 20 కిలోమీటర్ల దూరంలో గోదావరినదీ తీరాన శత్రుదుర్భేద్యమైన రామగిరి ఖిల్లా ఉంది. ఇక్కడి కోటలో సీతారామలక్ష్మణలు కొంతకాలం నివసించి చాతుర్మస్య వ్రతం ఆచరించినట్లు స్థానికులు చెప్పుకుంటారు. కోట లోపల గల అనేక రాజ భవనాలు ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నాయి. ఇక్కడి ప్రకతి సౌందర్యానికి ఆకర్షితుడైన ఔరంగజేబు దీన్ని ఆరామ్ గిరి అని పిలిచారంటారు. మరికొన్ని ఆలయాలు.. సారంగాపూర్ మండలంలోని పెంబట్ల గ్రామంలో దుబ్బ రాజేశ్వరస్వామి, ఓదెల మల్లికార్జునస్వామి, ఇల్లంతకుంట మండలంలోని జంగంపల్లి శ్రీరామలింగేశ్వర స్వామి, గంగాధర మండలంలోని నందగిరి లక్ష్మీనర్సింహస్వామి, రాయికల్లోని కేశవనాథ పంచముఖ లింగేశ్వర త్రికూట ఆలయాలు, కోరుట్ల మండలంలోని నాగులపేట సైఫన్, మొలంగూరు ఖిల్లా సందర్శించదగినవి. సైనిక స్థావరం.. జగిత్యాల ఖిల్లా కరీంనగర్కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న జగిత్యాల ఖిల్లాను జాఫరుద్దౌలా హయాంలో ఫ్రెంచ్ ఇంజినీర్లు నిర్మించారు. 20 ఎకరాల విస్తర్ణంలో పూర్తిగా రాతితో నిర్మించిన ఈ ఖిల్లా నాడు సైనిక స్థావరంగా ఉండేది. ఇప్పటికీ చెక్కు చెదరకుండా చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తోంది. పురావస్తు ప్రదర్శన శాల కరీంనగర్ బస్టాండ్కు ఎదురుగా ఉన్న పురావస్తు ప్రదర్శన శా లను 1964లో నెలకొల్పి, 1984లో ఆధునీకరించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తవ్వకాల్లో వెలుగుచూసిన శాతవాహనులు, కాకతీయులు, అసఫ్జాహీల చిహ్నాలు, నాణేలు, స్టాంపులు, యుద్ధ సామగ్రి, పుణ్యక్షేత్రాల అవశేషాలను ఇక్కడ ఉంచారు. మంత్రపురి.. మంథని అనాదిగా వైదిక సంస్కృతి వైభవాన్ని పరిరక్షిస్తున్న మంత్రపురి ప్రస్తుతం మంథనిగా పిలువబడుతోంది. కరీంనగర్కు 70 కిలోమీటర్ల దూరంలో గోదా వరి నదీతీరాన వెలసిన గౌతమేశ్వరాలయంలోని బ్రాహ్మణోత్తములు వేదాధ్యయనంలో మేటిగా నిలిచారు. అప్పట్లో మంథనికి వాస్తు అక్కరలేకుండా నాలుగు దిక్కులా 4 శివలింగాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ప్రాంతం వాటిని దాటి, విస్తరించింది. రామాలయం.. ఇల్లందకుంట హుజూరాబాద్ డివిజన్ పరిధిలోని ఇల్లందకుంట మండల కేంద్రంలో శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం ఉంది. దండకారణ్యంలో వవవాసం చేస్తున్న సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రుడు ఈ ప్రాంతానికి చేరుకున్నారని, దశరథుని మరణవార్త తెలిసి ఇల్లంద గింజలతో తర్పణం వదిలారని ప్రతీతి. నల్ల గొండ జిల్లాకు చెందిన రాఘవరెడ్డి ఈ దేవాలయాన్ని నిర్మించారని చరిత్ర చెబుతోంది. -
బొలెరో ఢీకొని వ్యక్తి దుర్మరణం
హుజూరాబాద్రూరల్/జమ్మికుంట(హుజూరాబాద్): రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. హుజూరాబాద్ మండలం చెల్పూర్ గ్రామానికి చెందిన మండల సమ్మయ్య(60) శనివారం పని నిమిత్తం సైకిల్పై శాలపల్లి ఇందిరానగర్ వెళ్లాడు. తిరిగి వస్తుండగా జమ్మికుంట నుంచి హుజూరాబాద్ వస్తున్న బొలెరో వాహనం ఢీకొట్టింది. సమ్మయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. వాహన యజమాని ఇంటి ఎదుట ధర్నా సమ్మయ్యను ఢీకొన్న వాహనం జమ్మికుంట పట్టణంలోని ఓ ఐరన్ షాపు యాజమానికి చెందినది. దీంతో మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్తులు మృతదేహంతో అతని ఇంటి ఎదుట ధర్నాకు దిగారు. కానీ, యజమాని అప్పటికే తన కుటుంబసభ్యులతో కలిసి తిరుపతి వెళ్లాడు. ప్రమాద విషయం తెలిశాక బాధితులతో ఫోన్లో మాట్లాడాడు. పరిహారం ఇచ్చేందుకు ఒప్పందం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. మృతుడికి భార్య యాదక్క, నలుగురు కుమారులు ఉన్నారు. కాగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హుజూరాబాద్ టౌన్ సీఐ రమేశ్, జమ్మికుంట ఎస్సై రాజేశ్, ఇల్లందకుంట ఎస్సై రాజ్కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. -
ప్రేమ పేరిట యువతి మోసం
తిమ్మాపూర్(మానకొండూర్): ప్రేమ పేరిట ఓ యువతి తిమ్మాపూర్కు చెందిన యువకుడిని మోసం చేసింది. రూ.16 లక్షలు తీసుకొని, పరారైంది. బాధితుడి తండ్రి, పోలీసుల వివరాల ప్రకారం.. తిమ్మాపూర్ మండల కేంద్రానికి చెందిన మాదన నాగరాజు యోగా నిమిత్తం ఈశా ఫౌండేషన్కు వెళ్లాడు. అక్కడే విశాఖపట్టణానికి చెందిన కమలసంధ్య ప్రియాంకతో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల నాగరాజు ఆమెను ఇంటికి తీసుకువచ్చాడు. దీనికి అతని తండ్రి మల్లయ్య నిరాకరించాడు. దీంతో గ్రామంలోని ఓ ఇంట్లో కొన్ని రోజులు అద్దెకు ఉన్నారు. ఈ క్రమంలో నాగరాజు ఓ ఆస్పత్రిలో తన భాగస్వామ్యాన్ని రద్దు చేసుకోవడంతో రూ.16 లక్షలు వచ్చాయి. ప్రియాంక తెలివిగా ఆ మొత్తాన్ని తన బంధువుల ఖాతాలోకి పంపించుకుంది. తర్వాత ఆస్ట్రేలియాకు పరారైంది. మళ్లీ రూ.3 లక్షలు కావాలని అతన్ని కోరింది. అంతేకాకుండా, నీ తండ్రి పేరిట ఉన్న భూమిని నీ పేరిట రిజిస్ట్రేషన్ చేసుకుంటే వచ్చి, పెళ్లి చేసుకుంటానని చెప్పింది. దీంతో డబ్బులు, భూ రిజిస్ట్రేషన్ కోసం అతను తండ్రిపై ఒత్తిడి తీసుకువచ్చాడు. భరించలేకపోయిన మల్లయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రియురాలి మోసం, తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మనస్తాపానికి గురైన నాగరాజు ఇటీవల ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించి, చికిత్స అనంతరం ఇంటికి తీసుకువచ్చారు. శనివారం తండ్రీకొడుకు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు ప్రియాంకపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై చేరాలు తెలిపారు. యువకుడిని నమ్మించి రూ.16లక్షలు కాజేసిన వైనం తర్వాత ఆస్ట్రేలియాకు పరార్.. కేసు నమోదు -
డీజిల్ కుంభకోణంపై రీజినల్ డైరెక్టర్ విచారణ
వేములవాడ: వేములవాడ మున్సిపాలిటీలో 2022లో డీజిల్ కుంభకోణానికి పాల్పడిన అప్పటి శానిటరీ ఇన్స్పెక్టర్ నగేశ్పై మున్సిపల్ శాఖ రీజినల్ డైరెక్టర్ షాహిద్ మసూద్ శనివారం విచారణ చేపట్టారు. డీజిల్ కుంభకోణానికి పాల్పడిన నగేశ్ను ఆ సమయంలో కలెక్టర్ సస్పెండ్ చేశారు. అయితే శాఖాపరమైన చర్యల్లో భాగంగా రీజినల్ డైరెక్టర్ విచారణకు వచ్చారు. శతాధిక వృద్ధుడి మృతి కోనరావుపేట(వేములవాడ): మండలం మల్కపేటకు చెందిన గెంటె రామయ్య(103) వృద్ధాప్య కారణాలతో శనివారం మృతిచెందాడు. ఆయనకు నాలుగు తరాల కుటుంబసభ్యులు ఉన్నారు. రామయ్య భార్య గత కొన్నేళ్ల క్రితమే చనిపోయింది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు సంతానం. 8 నుంచి జిల్లాస్థాయి శిక్షణ తరగతులు వేములవాడ: సీపీఎం జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు వేములవాడలో జూన్ 8 నుంచి 10 వరకు నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ముష్కం రమేశ్ తెలిపారు. వేములవాడలోని పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జిల్లా నలుమూలల నుంచి ఎంపిక చేసిన 100 మంది ముఖ్య నాయకులకు రాష్ట్ర పార్టీ నాయకులు శిక్షణనిస్తున్నట్లు చెప్పారు. సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఎరవెల్లి నాగరాజు, ఎగమంటి ఎల్లారెడ్డి, జవ్వాజి విమల, మల్లారపు ప్రశాంత్, గురిజాల శ్రీధర్, నాయకులు గణేష్, అశోక్, వేణు తదితరులు పాల్గొన్నారు. -
ఈఏపీసెట్ ఫలితాల్లో ‘అల్ఫోర్స్’కు అత్యున్నత ర్యాంకులు
కొత్తపల్లి(కరీంనగర్): ఇంజినీరింగ్, అగ్రికల్చరల్, ఫార్మసీ(ఈఏపీసెట్)–2024 ఫలితాల్లో కరీంనగర్లోని అల్ఫోర్స్ విద్యాసంస్థల విద్యార్థులు అత్యున్నత ప్రతిభ కనబరిచి అద్భుత ర్యాంకులతో అగ్రస్థానంలో నిలిచినట్లు ఆ విద్యాసంస్థల చైర్మన్ డా.వి.నరేందర్రెడ్డి తెలిపారు. కరీంనగర్లోని అల్ఫోర్స్ టైనీటాట్స్లో శనివారం ఏర్పాటు చేసిన అభినందన సమావేశంలో ఈఏపీసెట్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులను బొకేలతో ఆయన సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా వీఎన్ఆర్ మాట్లాడుతూ.. అల్ఫోర్స్కు చెందిన విద్యార్థులు వి.హాసిని 114వ ర్యాంకు, ఎన్.హేమంత్ 157, జి.శ్రీహాస్ 166, కె.సుప్రియ 296, ఎన్.జ్ఞానద 480, వి.శ్రీముఖి 568, ఎం.వర్షీత్ 575, జి.సాయిమంజునాథ్రెడ్డి 610, పి.జ్యోతిర్మయిరెడ్డి 863, శ్రీవెన్నెల 876, తేజస్విని 942, ఎ.శివవరుణ్ 973, సీహెచ్ అనూహ్య 950, పి.శ్రీనాథ్ 986, మలిహాఫాతిమా 992వ ర్యాంకు సాధించారన్నారు. 16 మంది విద్యార్థులు వెయ్యి లోపు ర్యాంకులు, 39 మంది 2వేల లోపు ర్యాంకులు, 63 మంది 3వేల లోపు ర్యాంకులు, 116 మంది 5వేల లోపు ర్యాంకులు సాధించి అల్ఫోర్ కీర్తిప్రతిష్టలను దశదిశలా చాటడం గర్వంగా ఉందన్నారు. తక్కువ మంది విద్యార్థులతో అత్యధిక ర్యాంకులు సాధించడం అల్ఫోర్స్కు మాత్రమే సాధ్యమని ఈ ఫలితాలు తెలియజేస్తున్నాయని తెలిపారు. ఇటీవల ప్రకటించబడిన ఐఐటీ మెయిన్స్ ఫలితాల్లో అల్ఫోర్స్ చారిత్రాత్మక విజయం సాధించిందని, 450 మంది విద్యార్థులు ఐఐటీ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని చెప్పారు. పటిష్ట ప్రణాళికతో విద్యాబోధన, నిరంతర పర్యవేక్షణ, విద్యార్థుల కృషి ఫలితంగా అల్ఫోర్స్ ఘనవిజయాలు సాధిస్తోందని పేర్కొన్నారు. రాబోయే ఐఐటీ అడ్వాన్స్, నీట్ ఫలితాల్లో మహోన్నత ర్యాంకులతో ముందంజలో ఉంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. వివిధ కళాశాలల ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
పిడుగుపాటుకు గురైన వ్యక్తిని ముట్టుకుంటే షాక్ రాదు
పిడుగుపాటుకు గురైన వ్యక్తిని ముట్టుకుంటే షాక్ వస్తుందని చాలా మంది భావిస్తున్నారు. అలా ఏం రాదు. వెంటనే బాధితుడికి ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తరలించాలి. పిడుగుల సమయంలో విద్యుత్ పరికరాల కనెక్షన్ తీసివేయడం మంచిది. – సత్యనారాయణ, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ, జగిత్యాలసూర్యుని కన్నా ఎక్కువ వేడి సూర్యుని ఉపరితలంపై 5 వేల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటే, పిడుగు పడినప్పుడు 29 వేల డిగ్రీలు ఉత్పత్తి అవుతుంది. పిడుగుకు సూర్యుని ప్రభావం కంటే 5 రెట్లు ఎక్కువ వేడి ఉంటుంది. మేఘాల్లో ఎలక్ట్రికల్ చార్జ్ జరగడంతో పిడుగు పడుతుంది. – డాక్టర్ శ్రీలక్ష్మి, వాతావరణ శాస్త్రవేత్త, పొలాస పరిశోధన స్థానం -
● వానకు తడుస్తూ.. ఎండకు ఎండుతున్న వడ్ల కుప్పలు ● లారీలు రాక.. తూకం వేయక ● కొనుగోళ్లలో తీవ్ర జాప్యం ● ఆందోళనలో రైతులు
సిరిసిల్ల: రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే రోజుల తరబడి ఎదురుచూస్తున్నారు. పంటను కోసి, తేమ వచ్చి రెండు, మూడు వారాలు గడుస్తున్నా తూకం వేయడం లేదు. లారీలు రాకపోవడంతో ఎక్కడికక్కడే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏప్రిల్ మొదటి వారంలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించినా నాలుగో వారంలో తూకం వేయం మొదలుపెట్టారు. ఫలితంగా జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి. కేంద్రాల్లోనే ఆరబోస్తున్న రైతులు జిల్లాలో 259 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. అయితే అకాల వర్షాలు అన్నదాతలను ఆగమాఘం చేస్తున్నాయి. మే నెలలో ఇప్పటికి మూడు సార్లు వర్షాలు పడడంతో ఎండిన వడ్లు తడిసిపోయాయి. రైతులు మళ్లీ కేంద్రాల్లోనే ఆరబోస్తున్నారు. లారీల కొరతతో తూకం వేసి బస్తాలు సైతం కేంద్రాల్లోనే ఉంటున్నాయి. ప్రైవేటు కొనుగోళ్ల జోరు ప్రభుత్వం వడ్లకు మద్ధతు ధర క్వింటాలుకు రూ.2,203 నిర్ణయించగా.. ప్రైవేటు వ్యాపారులు నేరుగా పచ్చి రూ.1800 నుంచి రూ.1900లకు క్వింటాలు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో 17 తేమ శాతం, వడ్లను శుద్ధి చేయాలనే నిబంధనలు ఉండడంతో చాలా మంది రైతులు నేరుగా వ్యాపారులకు తక్కువ ధరకే విక్రయిస్తున్నా రు. కొందరు రైతులు శుద్ధిచేసి కొనుగోలు కేంద్రాల్లో ఉంచితే.. ఇలా అకాల వర్షాలతో ఇబ్బందులు తప్ప డం లేదు. ఇప్పటికై నా జిల్లా అధికారులు ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని కోరుతున్నారు.కొనుగోలు కేంద్రాలు: 259కొనుగోళ్లు ప్రారంభించినవి : 249కొనుగోళ్లు పూర్తయిన కేంద్రాలు : 61ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యం : 2,03,225.280 మెట్రిక్ టన్నులు అమ్మిన రైతులు : 30,564ధాన్యం విలువ : రూ.447.71 కోట్లు వరి సాగు విస్తీర్ణం : 1.73 లక్షల ఎకరాలు ధాన్యం దిగుబడి అంచనా: 3.81 లక్షల మెట్రిక్ టన్నులు ఇప్పటి వరకు డబ్బులు పొందిన రైతులు : 26,574రైతులు పొందిన డబ్బులు : రూ.331.30 కోట్లుఇతను కోనరావుపేటకు చెందిన కస్తూరి సంజీవరెడ్డి. ఇతనికి ఐదెకరాల పొలం ఉంది. 45 రోజుల కిందట వరి కోసి, కొనుగోలు కేంద్రంలో పోశాడు. 300 బస్తాల వడ్లు అయితయి. లారీలు రాకపోవడంతో తూకం వేయడం లేదు. ఫలితంగా సంజీవరెడ్డి వడ్లు ఎప్పుడు జోకుతారోనని నిరీక్షిస్తున్నాడు... ఇలా ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా వందలాది మంది రైతులు వడ్లను అమ్మేందుకు కొనుగోలు కేంద్రాల్లోనే పడిగాపులు కాస్తున్నారు.వడ్లకుప్ప వద్ద ఉన్న ఇతను రుద్రంగి మండల కేంద్రానికి చెందిన గాజ భూమయ్య. ఇతనికి ఎకరం భూమి ఉంది. నెల రోజుల కిందటే పంట కోసి వడ్లను కొనుగోలు కేంద్రంలో కుప్పపోశాడు. 20 రోజుల కిందటే తేమశాతం వచ్చినా లారీలు లేక, గన్నీ సంచుల కొరతతో తూకం వేయలేదు. వడ్లు తడిసిపోకుండా కవర్లు కప్పి కాపాడుకుంటున్నాడు. నెల రోజులు అయితంది పంట కోసి నెల రోజులు అయితంది. అనుపురం కొనుగోలు కేంద్రంలో వడ్లు పోసినం. కాంటా పెట్టి 10 రోజులు గడుస్తుంది. లారీలు రాకపోవడంతో బస్తాలను తీసుకుపోవడం లేదు. వర్షాలకు వడ్లు తడుస్తున్నాయి. వడ్లు లాకలు వస్తే మళ్లీ కోత పెడుతరు. వెంటనే లారీల్లో ధాన్యం తరలించాలి. – ఊషయ్య, నాంపల్లి కాంటా పెట్టిండ్రు అనుపురం కొనుగోలు కేంద్రంలో వడ్లుపోసినం. నెల రోజులుగా వడ్లు పోతలేవు. లారీల కొరత అంటున్నారు. కాంటా వేసి కేంద్రాల్లోనే బస్తాలు పెట్టిండ్రు. నావి 800 బస్తాల వడ్లు అట్లనే ఉన్నయి. అకాల వర్షాలకు బస్తాలు తడుస్తున్నాయి. అధికారులు స్పందించి లారీలను పంపించాలే. – నాగరాజు, సంకెపల్లి -
రోడ్డెక్కిన రైతులు
వేములవాడఅర్బన్: ధాన్యం కాంటా పెట్టి పది రోజులు గడుస్తున్నా తరలించడం లేదంటూ వేములవాడ మండలం అనుపురంలో రైతులు రోడ్డుపై బైఠాయించారు. వారు మాట్లాడుతూ వరిధాన్యం కోసి కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి నెల రోజులు దాటుతున్నా తూకం వేయడం లేదన్నారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసి మొలకెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వడ్ల బస్తాలను వెంటనే తరలించాలని డిమాండ్ చేశారు. వేములవాడటౌన్ సీఐ వీరప్రసాద్ రైతులతో మాట్లాడారు. పోలీసుశాఖపై అవగాహన సిరిసిల్లక్రైం: పోలీస్శాఖపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు శుక్రవారం సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. సర్ధాపూర్పూర్లోని 17వ బెటాలియన్లో పోలీస్శాఖకు సంబంధించిన శిక్షణ, సాంకేతిక పరిజ్ఞానం, ఆయుధాలపై అవగాహన కల్పించారు. వైద్యశిబిరాలు సద్వినియోగం చేసుకోవాలి కోనరావుపేట(వేములవాడ): గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్యాధికారి సుమన్మోహన్రావు కోరారు. మండలంలోని ధర్మారం, సుద్దాల, కొలనూర్, మామిడిపల్లి, నిజామాబాద్, వట్టిమల్ల గ్రామాల్లో చెవి, ముక్కు, గొంతు, దంతవైద్యశిబిరాలు నిర్వహించారు. వైద్యాధికారులు వేణుమాధవ్, శ్రీనివాస్, సుష్మా, శివరామకృష్ణ, ప్రీతి, అఖిల్, వెంకటేశ్, సూపర్వైజర్లు శ్రీదేవి, రషీద్ పాల్గొన్నారు. బిల్లుల కోసం జీపీ కార్యాలయానికి తాళం గంభీరావుపేట(సిరిసిల్ల): మండలంలోని కోళ్లమద్దిలో మాజీ సర్పంచ్ ఏనుగు కేశవరావు బిల్లుల కోసం శుక్రవారం గ్రామపంచాయతీ కార్యాలయానికి తాళం వేశారు. ఈజీఎస్ నిధులు రూ.20 లక్షలతో చేపట్టిన నూతన జీపీ భవనానికి సంబంధించిన బిల్లులు, గ్రామాభివృద్ధికి వెచ్చించిన రూ.8లక్షలు రావాల్సి ఉందన్నారు. సర్పంచులకు ప్రభుత్వం అందించే రూ.6వేల గౌరవ వేతనం మూడేళ్లుగా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి బిల్లులు అందించాలని కోరారు. చెక్డ్యామ్ పనులు పరిశీలన వేములవాడరూరల్: రెండు రోజుల్లో చెక్డ్యాం పనులు ప్రారంభించాలని, లేకుంటే కేసులు న మోదు చేస్తామని ఇరిగేషన్ అధికారులు కాంట్రాక్టర్ను హెచ్చరించారు. వేములవాడరూరల్ మండలం మూలవాగుపై నిర్మిస్తున్న చెక్డ్యాం పనులను శుక్రవారం పరిశీలించారు. బొల్లారం, జయవరం గామాల్లోని మూలవా గుపై నిర్మిస్తున్న చెక్డ్యాం పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈఈ అమరేందర్రెడ్డి, ఏఈ రాజు, కాంట్రాక్టర్ వంశీ ఉన్నారు. ఆ సమయంలో అక్కడికి చేరుకున్న రైతులు అధికారులను నిలదీసినట్లు తెలిసింది. గత వర్షాకాలంలో చెక్డ్యామ్ తెగి పంటలు నష్టపోయామని, ఈసారి పనులు వర్షాకాలానికి ముందే పూర్తి చేయాలని కోరినట్లు సమాచారం. -
కేంద్రాల్లోనే ధాన్యం
వడ్ల బస్తాల ముందు నిల్చున్న ఈమె మైలారం పద్మ. కోనరావుపేట మండలం ధర్మారం. పద్మకు రెండెకరాల పొలం ఉంది. 45 రోజుల కిందట వరి కోసి వడ్లను ఆరబోశారు. తేమ శాతం వచ్చింది. రెండుసార్లు వడ్లను భర్త శంకర్తో కలిసి బోర్లించారు. 130 బస్తాల వరకు వడ్లు అయ్యాయి. తూకం వేసిన బస్తాలను తీసుకుపోయేందుకు లారీలు రాకపోవడంతో ఇలా వర్షానికి తడిసిపోయాయి. సిరిసిల్ల శివారులోని చంద్రంపేటకు చెందిన మహిళా రైతు చెవుల గౌరవ్వకు చెందిన వడ్లు. పది రోజుల కిందట నాలుగు ఎకరాల్లోని పంట కోసి బైపాస్రోడ్డులో ఆరబోశారు. తేమశాతం 17 వచ్చింది. వడ్లను కాంటా పెట్టాల్సి ఉండగా.. గురువారం మధ్యాహ్నం కురిసిన వర్షంతో తడిసినయి. ఇక చేసేదేమీ లేక గౌరవ్వ, మల్లేశం కుటుంబ సభ్యులు ఇలా శుక్రవారం వడ్లను ఆరబోశారు. ధాన్యం కొనుగోళ్ల స్వరూపం -
స్కూళ్లు తెరిచే నాటికి వసతులు
● జూన్ 10లోగా పనులు పూర్తి చేయండి ● రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిసిరిసిల్ల: స్కూళ్లు తెరిచే నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా చేపట్టిన పనులు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. హైదరాబాద్ నుంచి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన మౌలిక వసతుల పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు. ప్రతీ పాఠశాలలో విద్యార్థుల కు టాయిలెట్లు ఉండాలని, అంగన్వాడీ కేంద్రాలకు పెయింటింగ్ వేయాలని సూచించారు. స్కూల్ యూనిఫామ్స్ బట్ట జిల్లాలకు చేరుతుందని, అనుభవం గల స్వశక్తి సంఘాలకు కుట్టే ఆర్డర్లు ఇవ్వాలన్నారు. ధరణి దరఖాస్తులు పరిష్కరించాలి ధరణి పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని సీఎస్ సూచించారు. మార్చి 15 నుంచి ప్రత్యేక డ్రైవ్ చేపట్టి 1.15లక్షల దరఖాస్తులను పరిష్కరించామని, లోక్సభ ఎన్నికలు ముగిసినందున మరోసారి ధరణి దరఖాస్తులను పరిశీలించి మే చివరి నాటికి పూర్తిస్థాయిలో పరిష్కరించాలని సూచించారు. ప్రజావాణి మళ్లీ ప్రారంభించాలని, ధాన్యం కొనుగోళ్లను వేగంగా పూర్తిచేయాలని తెలిపారు. కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్లు పి.గౌతమి, ఎన్.ఖీమ్యానాయక్, ఆర్డీవోలు రమేశ్, రాజేశ్వర్, డీఎస్వో జితేందర్రెడ్డి, పౌర సరఫరాలశాఖ మేనేజర్ జితేంద్రప్రసాద్, మార్కెటింగ్ శాఖ జిల్లా మేనేజర్ ప్రవీణ్రెడ్డి, డీఈవో రమేశ్కుమార్, అడిషనల్ డీఆర్డీవో శ్రీనివాస్, కలెక్టరేట్ పర్యవేక్షకులు శ్రీకాంత్ పాల్గొన్నారు. -
పిడుగులు పడుతున్నయ్.. జాగ్రత్త
● మేఘాల్లోని పాజిటివ్, నెగెటివ్ కణాల వల్లే.. ● వర్షం పడుతుంటే చెట్ల కిందకు, ట్రాన్స్ఫార్మర్ల వద్దకు వెళ్లొద్దు ● మెరుపులను చూసేందుకు ప్రయత్నించొద్దు జగిత్యాల అగ్రికల్చర్: ఇటీవల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఆకాశం మేఘావృతమై, బలమైన ఈదురుగాలులతో వాన పడేటప్పుడు ఆకాశంలో మెరుపులు వచ్చి, పెద్ద శబ్ధాలతో పడిగులు పడతాయి. వీటికి బలమైన అయస్కాంత శక్తితో కూడిన విద్యుత్ శక్తి ఉంటుంది. అందుకే మనుషులతోపాటు జంతువులు చనిపోతాయి. పిడుగుల ప్రభావానికి పచ్చని చెట్లు సైతం కాలిపోతుంటాయి. ఎక్కువగా వ్యవసాయ పనులకు వెళ్లే రైతులే ఇలా మృతిచెందుతున్నారు. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో కురిసిన అకాల వర్షానికి పిడుగులు పడి, తంగళ్లపల్లి మండలంలోని ఇందిరానగర్కు చెందిన రుద్రారపు చంద్రయ్య, వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని శాత్రాజుపల్లెకు చెందిన కంబోళ్ల శ్రీనివాస్ అనే రైతులు, మూడు పశువులు మృతిచెందగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పిడుగు అంటే.. ఎలా పడుతుంది? మేఘాల్లో ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉండటం వల్ల వర్షపు నీరు చిన్న చిన్న మంచు కణాలుగా విడిపోతుంది. అయితే, విపరీతమైన గాలులు వచ్చినప్పుడు వాటి మధ్య రాపిడి జరిగి, ఒక ఎలక్ట్రికల్ చార్జ్ విడుదలవుతుంది. ఇందులోని పాజిటివ్ కణాలు తేలికగా ఉండటం వల్ల మేఘాల పైకి వెళ్తుంటే, నెగటివ్ కణాలు బరువుగా ఉండి మేఘం కిందికి వెళ్తుంటాయి. అయస్కాంతంలో ఉత్తర, దక్షిణ ధృవాలు ఆకర్షించుకున్నట్లుగానే రెండు మేఘాలు దగ్గరగా వచ్చినప్పుడు పాజిటివ్, నెగెటివ్ కణాలు ఆకర్షించుకొని, ఆకాశంలో మెరుపులు వస్తాయి. ఈ సమయంలో మేఘంలోని నెగెటివ్ కణాలు, భూమిలోని పాజిటివ్ కణాలను ఆకర్షిస్తుంటాయి. అప్పుడు భూమిపై ఎత్తుగా ఉండే చెట్లు, గుట్టలు, మనుషుల ద్వారా ఈ బాండింగ్ జరిగి, మెరుపుతో కూడిన పిడుగు పడుతుంది. అప్రమత్తంగా ఉండాలి.. వర్షాలు పడే సమయంలో బయటకు వెళ్లకపోవడమే ఉత్తమం. ముఖ్యంగా వ్యవసాయ పనులకు వెళ్లిన రైతులు, రైతు కూలీలు అప్రమత్తంగా ఉండాలి. ఆకాశంలో ఉరుములు, మెరుపులు వస్తుంటే చెట్ల కిందకు, విద్యుత్ టవర్లు, ట్రాన్స్ఫార్మర్ల సమీపంలోకి వెళ్లొద్దు. పిడుగు పడే సమయంలో ఆకాశంలోని మెరుపులు అత్యధిక శక్తిని కలిగి ఉంటాయి. కాబట్టి, ఆ వెలుతురును చూసేందుకు ప్రయత్నించొవద్దు. పిడుగుకు కొన్ని మిలియన్ మెగావాట్ల శక్తి ఉంటుందనే విషయాన్ని ప్రతీ ఒక్కరు గుర్తుంచుకోవాలి. రైతులు సమయస్ఫూర్తితో వ్యవహరించాలి వ్యవసాయ పనులు చేసేటప్పుడు ఉరుములు, మెరుపులు వస్తుంటే పిడుగులు పడతాయని భావించి, రైతులు మరింత జాగ్రత్తగా ఉండాలి. వెంటనే సురక్షిత ప్రాంతానికి చేరుకోవాలి. ఒకవేళ వీలు కాకపోతే సమయస్ఫూర్తితో వ్యవహరించి, మోకాళ్లపై చేతులు, తలపెట్టి, దగ్గరగా ముడుచుకొని కూర్చోవాలి. దీనివల్ల, సమీపంలో పిడుగు పడినా అందులోని విద్యుత్ ప్రభావం తక్కువగా ఉండి, బతికేందుకు అవకాశాలు ఉంటాయి. పిడుగు పడుతుందని అనిపించినప్పుడు రబ్బర్ చెప్పులు వేసుకోవడం మంచిది. ఒకవేళ వేసుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు కాలును భూమి మీద పూర్తిగా ఆనించొద్దు. కాలి వేళ్ల మీద ఉండేందుకు ప్రయత్నించాలి. విద్యుత్ పరికరాలకు నష్టం.. పిడుగు పడినప్పుడు విద్యుత్ పరికరాలకు ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఉరుములు, మెరుపులు వస్తుంటే విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లకు దూరంగా ఉండాలి. ఇంట్లోని ఎలక్ట్రానిక్ పరికరాలైన టీవీ, రిఫ్రిజిరేటర్, సెల్ఫోన్ వంటి వాటిని వినియోగించకపోవడం ఉత్తమం. అలాగే, మెరుపులు వస్తున్నప్పుడు ఆరుబయట స్నానం చేయడం, వంట పాత్రలు కడగడం చేయవద్దు. లోహపు వస్తువుల ద్వారా విద్యుత్ ప్రవహించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. -
రైతు సమస్యలపై బీజేపీ రణభేరి
● నేడు ధాన్యం కల్లాల సందర్శన ● 20న తహసీల్దార్, కలెక్టర్లకు వినతిపత్రాలు ● 21న అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో దీక్షలు ● బీజేపీ నేతలతో బండి సంజయ్ టెలీకాన్ఫరెన్స్కరీంనగర్టౌన్: కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రైతు సమస్యలపై బీజేపీ రణభేరి మోగించింది. ఇందులో భాగంగా బీజేపీ నేతలు తమ ప్రాంతాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులకు అండగా నిలవాలని నిర్ణయించింది. ఈమేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్కుమార్ శుక్రవారం రాత్రి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గపరిధిలోని మండల కమిటీలు, ఆ పైస్థాయి నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతుల వివరాలు సేకరించేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు సందర్శించాలని కోరారు. రైతులకు ఇచ్చిన హామీలతో పాటు ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీన వైఖరి అవలంభిస్తోందన్నారు. ఈక్రమంలోనే ‘స్థానిక సంస్థల’ ఎన్నికలను తెరపైకి తీసుకొస్తోందన్నారు. రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న కాంగ్రెస్ తీరుకు నిరసనగా శ నివారం బీజేపీ నేతలు కొనుగోలు కేంద్రాలు సందర్శించాలని సూచించారు. 19న అన్ని మండల, ని యోజకవర్గకేంద్రాల్లో మీడియా సమావేశాలు నిర్వహించి రైతులు పడుతున్న బాధలు వివరించాలన్నారు. 20న తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్లకు వినతిపత్రం అందజేయాలని, 21న అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో రైతుదీక్షలు చేపట్టాలని కోరారు. -
గాలివాన బీభత్సం
సిరిసిల్ల/వేములవాడ/వేములవాడఅర్బన్/ రుద్రంగి/ముస్తాబాద్: జిల్లా వ్యాప్తంగా శుక్రవారం అకాల వర్షాలు పడ్డాయి. అత్యధికంగా సిరిసిల్ల లో 37.3 మిల్లీమీటర్ల వర్షం కురవగా.. రుద్రంగిలో 2.8, చందుర్తిలో 9.8, వేములవాడలో 23.2, వేములవాడరూరల్లో 4.8, బోయినపల్లిలో 17.7, కోనరావుపేటలో 7.9, వీర్నపల్లిలో 6.4, ఎల్లారెడ్డిపేటలో 4.6, గంభీరావుపేటలో 4.8, ముస్తాబాద్లో 26.6, తంగళ్లపల్లిలో 12.8, ఇల్లంతకుంటలో 2.5 మిల్లీమీటర్ల వర్షం పడిందని సీపీవో పీబీ శ్రీనివాస్ తెలిపారు. తడిసిన ధాన్యం రుద్రంగి, ముస్తాబాద్, వేములవాడఅర్బన్ మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసి ముద్దయ్యింది. బస్తాల్లో నింపిన ధాన్యాన్ని రైతులు ఆరబోస్తూ కనిపించారు. తడిసిన ధాన్యాన్ని ఎలాంటి కొర్రీలు లేకుండా కొనుగోలు చేయాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. ముస్తాబాద్ మండలం మద్దికుంట, ముస్తాబాద్, పోతుగల్, నామాపూర్, చీకోడు గ్రామాల్లో టార్పాలిన్లు లేక రైతులు ఇబ్బంది పడ్డారు. వేములవాడ మండలం ఆరెపల్లి శివారులోని సిరిసిల్ల–కరీంనగర్ ప్రధాన రహదారి పక్కన ఉన్న తుమ్మచెట్టు గాలివానకు రోడ్డుపై పడింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో పోలీసులు, గ్రామస్తులు కలిసి విరిగిన చెట్టును పక్కకు తొలగించారు. అత్యధికంగా సిరిసిల్లలో 37.3 మిల్లీమీటర్లు అత్యల్పంగా ఇల్లంతకుంటలో 2.5 మిల్లీమీటర్లు రుద్రంగి, ముస్తాబాద్లలో తడిసిన ధాన్యం
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పశుపోషకులకు బాసటగా..
జీపీ కార్మికులకు వేతనాలేవి?
సొంత జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు కేటాయించాలి
తడిసిన ధాన్యం కొనాల్సిందే
గో హత్య నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి
అలకాపురికాలనీలో ఆక్రమణ
23న ప్రతిభా పురస్కారాల ప్రదానం
అజీంప్రేమ్జీ యూనివర్సిటీకి ఎంపిక
పని దొరికిందని వెళితే.. ప్రాణం పోయింది
ఖరీఫ్లో ఎరువుల సరఫరాకు కార్యాచరణ
తప్పక చదవండి
- పర్యాటకులకు వేసవి విడిది ప్రాంతాలు
- పశుపోషకులకు బాసటగా..
- ఖరీఫ్లో ఎరువుల సరఫరాకు కార్యాచరణ
- నేటి నుంచే టెట్.. రోజుకు రెండు షిప్టులుగా నిర్వహణ
- అధికారం చేపట్టగానే అగ్నివీర్ రద్దు.. రాహుల్ కీలక వ్యాఖ్యలు
- కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
- పెట్టుబడుల సునామీ.. టాటా మోటార్స్ కీలక నిర్ణయం
- హీరామండి హీరోయిన్.. వేలకోట్ల అధిపతిని పెళ్లాడిన భామ!
- సభలో గందరగోళం.. మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్, అఖిలేష్
- T20 WC Trophy: ఈ పొట్టోడిని గెలవడమే అందరి టార్గెట్
Advertisement