
ఉపాధ్యాయ నియామకాలలో అవకతవకలకు పాల్పడిన హర్యానా మాజీ ముఖ్యమంత్రి, ఇండియన్ నేషనల్ లోక్దళ్ (ఐఎన్ఎల్డి) అధ్యక్షుడు ఓం ప్రకాష్ చౌతాలా, ఆయన కుమారుడు అజయ్ చౌతాలాకు ఢిల్లీలోని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఓం ప్రకాష్ చౌతాలా అయిదుసార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు. ప్రస్తుతం శాసనసభ్యులుగా ఉన్న ఈ తండ్రికొడుకులు ఇద్దరూ ఎన్నికలలో పోటీ చేయడానికి ఆరేళ్ల పాటు అనర్హులుగా కూడా న్యాయస్థానం ప్రకటించింది. వారితోపాటు మరో 53 మందికి న్యాయస్థానం శిక్షలు ఖరారు చేసింది. చట్టం తనపని తాను చేసింది.
ఓంప్రకాష్ చౌతాలా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉపాధ్యాయ నియామకంలో జరిగిన అవకతవకలను సిబిఐ వెలుగులోకి తెచ్చింది. 2008లో కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది. హర్యానాలో 1999-2000లో 3206 మంది జూనియర్ బేసిక్ టీచర్లను నియమించారు. ఈ నియామకంలో వీరితోపాటు మొత్తం 55 మంది అక్రమాలకు పాల్పడినట్లు స్పెషల్ సిబిఐ న్యాయమూర్తి వినోద్ కుమార్ ఈ నెల 16న నిర్ధారించారు. ఈ రోజు శిక్షలను ఖరారు చేస్తూ తీర్పు చెప్పారు. ఓంప్రకాష్ చౌతాలా, అతని కుమారుడు అజయ్ చౌతాలా, అప్పటి ప్రాథమిక విద్య డైరెక్టర్ సంజీవ్ కుమార్, చౌతాలా దగ్గర ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా పనిచేసిన విద్యాధర్, రాజకీయ సలహాదారు షేర్సింగ్ బద్షమి, దుర్గాదత్ ప్రధాన్, బాని సింగ్, దయా సైనీ,మదన్ లాల్ కల్రాలకు కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కుంభకోణంలో మొత్తం 55 మందిని కోర్టు దోషులుగా ప్రకటించింది. మిగిలిన దోషుల్లో ఒకరికి ఐదేళ్లు, 45 మందికి నాలుగేళ్లు జైలు శిక్ష విధించింది. శిక్ష పడినవారిలో 16 మంది మహిళలు కూడా ఉన్నారు. అనారోగ్య కారణాల రీత్యా ఓం ప్రకాష్ చౌతాలాకు శిక్ష తగ్గించాలని దోషుల తరపు న్యాయవాది కోరినా న్యాయమూర్తి పట్టించుకోలేదు. కుంభకోణానికి పాలప్పడటమేకాకుండా రాజ్యాంగ హక్కులను కూడా ఉల్లంఘించడంతో దోషులు చేసిన తప్పుల తీవ్రత పెరిగిందని న్యాయమూర్తి పేర్కొన్నారు. తీర్పు వెలువడే సమయంలో ఒక్క ఓం ప్రకాష్ చౌతాలా తప్ప మిగిలిన దోషులందరూ కోర్టులోనే ఉన్నారు. అనారోగ్య కారణాల రీత్యా ఓం ప్రకాష్ చౌతాలా ఆస్పత్రిలో ఉన్నారు.
ఐపిసి సెక్షన్120బి (నేరపూరితమైన కుట్ర), 418 (మోసం), 468 (దొంగ సంతకం), 471 (నకిలీ పత్రాలను ఉపయోగించడం), అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13 (1) (డి), 13 (2)ల కింద వారికి శిక్షలు విధించారు. ఈ కేసులో మొత్తం 62 మంది ఆరోపణలు ఎదుర్కొన్నారు. వారిలో విచారణ సమయంలో ఆరుగురు చనిపోయారు. ఒకరిని కోర్టు నిర్ధోషిగా ప్రకటించింది.
సీబీఐ కోర్టు తీర్పును ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేస్తామని ఓంప్రకాష్ చౌతాలా న్యాయవాదులు ప్రకటించారు. కోర్టు తీర్పును పూర్తిగా పరిశీలించి తాము హైకోర్టుకు వెళతామని ఓం ప్రకాష్ చౌతాలా చిన్న కొడుకు అభయ్ చౌతాలా చెప్పారు.