
ఈ బుధవారం నాడు -జనవరి 23న- తన ఆధ్వర్యంలోని త్రిసభ్య కమిటీ నివేదికను సమర్పిస్తూ ‘నిజమయిన మార్పు ఇప్పుడే మొదలవుతోంది. ఇది త్వరలోనే వేగం పుంజుకుంటుందనడంలో నాకే సందేహం లే’దన్నారు జస్టిస్ జేయెస్ వర్మ. నెలరోజుల కిందట- డిసెంబర్ 16న, జ్యోతి సింగ్ పాండే (నిర్భయ)ని, దేశరాజధాని నడివీథుల్లో గ్యాంగ్ రేప్ చేసి, కుళ్లబొడిచిన అమానుష అత్యాచారం సంఘటన యువతలో ఆగ్రహోద్రేకాలు కలిగించింది. రాష్ట్రపతి, సోనియా గాంధీ, ప్రధాన మంత్రి మొదలుకుని అధికారపీఠాలను ఆక్రమించుకుని కూర్చున్న పెద్దలు ఈ ఆగ్రహావేశాలకు గజగజ వణికారు. దిక్కుతోచని స్థితిలో కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే జస్టిస్ వర్మ కమిటీని నియమించారు. సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ వర్మ ప్రపంచ ప్రసిద్ధ న్యాయశాస్త్ర నిపుణుడు కూడా. ఆయనతో పాటుగా హిమాచల్ ప్రదేశ్ మాజీ ప్రధాన నాయయమూర్తి లైలా సేఠ్, మాజీ సొలిసిటర్ జెనరల్ గోపాల్ సుబ్రమణియం కూడా ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.
రేప్ నిరోధానికి సంబంధించిన భారత చట్టాల్లో చేయవలసిన సంస్కరణలను సూచించాల్సిందిగా ఈ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. రేప్ లాంటి నేరాల విషయంలో ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాల తీరు తెన్నులను సమీక్షించడమే జస్టిస్ వర్మ కమిటీకి అప్పగించిన ప్రాథమిక లక్ష్యం. స్త్రీలపై అత్యాచారాలనూ తదితర నేరాలనూ నివారించడానికి తగినరీతిలో మన చట్టాలను పటిష్ఠపరచడానికి సంబంధించి సూచనలు చెయ్యమని కూడా కమిటీని హోం మంత్రి కోరారు. ఈ క్రమంలో పౌరులూ, ఎన్జీవోలూ, హక్కుల సంఘాలూ, సామాజిక కార్యకర్తలూ, పోలీసుల నుంచి అభిప్రాయాలు సేకరించాల్సిందిగా జస్టిస్ వర్మ కమిటీకి సూచించారు. నెల రోజుల్లోనే ఈ కమిటీ నివేదిక సమర్పించడం విశేషం. నివేదిక రూపొందించే సందర్భంగా తమకు అద్భుతమయిన స్పందన లభించిందని జస్టిస్ వర్మ ప్రత్యేకించి పేర్కొన్నారు. ‘ఉవ్వెత్తున ఎగసిపడిన ఈ ఉద్రేకపు కెరటాన్ని ఉద్యమం అనలేమేమో. యువతరం ఏళ్ల తరబడి అణిచిపెట్టుకున్న ఆగ్రహం అలా బయటపడిం’దని ఆయన అన్నారు.
తమ కమిటీకి 80 వేల స్పందనలు ఎదురయ్యాయని చెప్తూ, దేశదేశాల అనుభవాలనూ అధ్యయనం చేసిన తర్వాతే, తమ నివేదికను రూపొందించామని ఆయన తెలిపారు. అయితే, పోలీసులనుంచి తమకు పెద్దగా స్పందన లభించలేదని జస్టిస్ వర్మ ప్రత్యేకించి పేర్కొనడం గమనార్హం. ఈ విషయంలో జస్టిస్ వర్మ కమిటీ తన అసంతృప్తిని దాచుకునే ప్రయత్నం చెయ్యకపోవడం విశేషమే. ‘మా ప్రశ్నలకు స్పందించని డీజీపీలు కూడా ఉన్నారు. పోలీసుల అసమర్థత పాలన సామర్థ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తోం’దని జస్టిస్ వర్మ చేసిన వ్యాఖ్య వాస్తవానికి జనహృదయానికి ప్రతిస్పందన మాత్రమే!
స్త్రీలపై అత్యాచారాలను నిరోధించే విషయంలో పోలీసుల వైఫల్యాలను జస్టిస్ వర్మ తీవ్రంగా విమర్శించారు. దేశవ్యాప్తంగా పోలీసు సిబ్బందిలో జెండర్ చైతన్యం పెంపొందింపచెయ్యాలని జస్టిస్ వర్మ తన నివేదికలో సిఫార్సు చెయ్యడం గమనార్హం. స్త్రీలపై జరిగే అత్యాచారాలకు సంబంధించిన కేసులను నిర్దిష్ట కాలపరిమితిలోపే విచారించి న్యాయం కల్పించాలన్నది ఈ కమిటగీ నివేదికలోని మరో సిఫార్సు. స్త్రీలను వెంటాడి వేధించడాన్నీ, అత్యాచారానికి తెగబడడాన్నీకూడా క్రిమినల్ చట్టాల పరిధిలోకి తీసుకురావాలన్నది మరో సిఫారసు. అత్యాచార నేరానికి మరణ శిక్ష, రసాయనిక వృషణచ్ఛేదం -కెమికల్ క్యాస్ట్రేషన్- లాంటి శిక్షలు విధించాలన్న వాదనను జస్టిస్ వర్మ కమిటీ నివేదిక సమర్ధించలేదు.
‘స్త్రీలపై అత్యాచారాలు నివారించడానికి ముఖ్యంగా అవసరమయింది మన ఆలోచనల్లో మార్పు. మనం మారి, మన చుట్టూ ఉన్న వారిని మారిస్తే తప్ప మన ఆడపడుచులకు రక్షణ ఉండ’దని జస్టిస్ వర్మ కమిటీ నివేదిక చెప్పిన మాట అక్షర సత్యం!