
గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా.. ‘ప్రత్యేక ప్యాకేజీయా? ప్రత్యేక రాష్ట్రమా?’ అనే చర్చ ప్రధానంగా నలుగుతోంది. తెలంగాణ అంశం రాష్ట్రంలో వేడిని రాజేసింది. ఏ ఇద్దరు కలిసినా..ఇదే చర్చ తప్ప మరో ప్రస్తావనే ఉండటం లేదు. అంతేకాక తమకు తోచిన లాజిక్కులతో, గాలివార్తలతో చాలా మంది కాలాన్ని గడిపేస్తున్నారు. అయితే వీటన్నిటిని పక్కన పెడితే.. ఎప్పుడూ బిజీగా కనిపించే రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన విభాగం సచివాలయం గతకొద్ది రోజులుగా బోసిపోతూ కనిపిస్తోంది.
అందుకు కారణం ప్రత్యేక తెలంగాణ, సమైక్యాంధ్ర వాదనలతో కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు హస్తిన బాట పట్టటంతో.. రాష్ట్ర సచివాలయం ఖాళీగా కనిపిస్తోంది. గత రెండు రోజులుగా అయితే సందర్శకులు లేక మరీ బోసిపోయింది. ఐఏఎస్ అధికారులు కూడా శాఖల వారీ సమావేశాల పేరుతో కొంతమంది ఢిల్లీ పర్యటనకు వెళ్లినట్టు తెలుస్తోంది. ఇక సీమాంధ్ర మంత్రులు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరడానికి, తెలంగాణ మంత్రులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ప్రకటించాలని కోరుతూ ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. సచివాలయంలో మంత్రులు, అధికారులు లేకపోవటంతో.. పనులపై వచ్చే ఎమ్మెల్యేల సంఖ్య కూడా తగ్గిపోయింది. సందర్శకులు లేకపోవటంతో సీఎం ఉండే సి బ్లాకు కూడా బోసిపోయింది.
ముఖ్యంగా గత రెండు రోజులుగా ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి కూడా ప్రశాంత వాతావరణంలో కాలం గడుపుతున్నట్టు సమాచారం. సోమ, మంగళవారాల్లో ఉదయాన్నే సచివాలయానికి ముఖ్యమంత్రి కిరణ్ వచ్చినా మంత్రులు, ఎమ్మెల్యే, అధికారులెవరూ కనిపించకపోవడంతో మధ్యాహ్నానికే తిరిగి వెళ్లిపోయారట. మెదక్ పర్యటన నేపథ్యంలో బుధవారం ఆయన సచివాలయానికి రాకపోవడంతో ఇక సచివాలయానికి అనధికారికంగా సెలవు ప్రకటించినట్టు కనిపించింది. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు నియోజకవర్గాల పనుల మీద సచివాలయానికి వచ్చినా... కానీ మంత్రులు, అధికారులు ఎవరూ లేకపోవటంతో వెంబడే తిరుగుటపా కడుతున్నారట!
ఇప్పటికే ప్రత్యేక తెలంగాణ, సమక్యాంధ్ర ఉద్యమాల ప్రభావంతో ఎలాంటి పనుల్లో కూడా పురోగతి లేకుండా రాష్ట్రం అతులాకుతలమవుతున్న సంగతి తెలిసిందే. జనవరి 28 తేదిన తెలంగాణపై ప్రకటన చేస్తామని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే ఏ ముహుర్తాన ప్రకటించారో ఎమో.. అప్పటి నుంచి ప్రజా సమస్యల్ని మన నేతలు గాలి కొదిలి.. టెలివిజన్ చానెల్లలో చర్చలు, మీడియా గొట్టాల ముందు ఊక దంపుడు ఉపన్యాసాలు.. ప్రజల్ని అయోమయానికి గురిచేసే అస్పష్టత కలిగిన వ్యాఖ్యలు..పొలిటికల్ గాసిప్స్, వివాదస్పద వ్యాఖ్యలతో మరింత వేడిని రగిలించడంలో నేతలు తలమునకలయ్యారు. తెలంగాణపై తేల్చేయాలంటూ ఒక వర్గం.. విభజన వద్దంటూ మరో వర్గం అధిష్టానంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు మంత్రులు, నేతలు ఢిల్లీ పర్యటన చేపట్టారు. అయితే మంత్రులు, అధికారులు పర్యటనలు అధికారికంగా మారడం ఇక్కడ గమనార్హం. మంత్రుల, అధికారుల ప్రయాణ చార్జీల నుంచి ఢిల్లీలో బస వరకూ అన్నీ ప్రభుత్వ ఖర్చులతోనే సాగడం కొసమెరుపు. ప్రజా సమస్యలపై దృష్టి సారించడానికి ఇష్టపడని నేతలు..ప్రజలు సొమ్మును భారీగానే స్వప్రయోజనాలకు ఉపయోగించడం అన్ని వర్గాల నుంచి నిరసన వ్యక్తమవుతోంది.