
ఆడలేక మద్దెల ఓడు చందంగా తయారయింది రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. అస్తవ్యస్థ విధానాలతో ప్రజా మద్దతు కోల్పోయిన హస్తం పార్టీ ఎన్నికలంటేనే వణుకుతోంది. ప్రజావ్యతిరేకతను ఎలా ఎదుర్కొవాలో తెలియక ఇప్పటికే స్థానిక ఎన్నికలకు ఎగనామం పెట్టింది. తప్పించుకునే వీల్లేక సహకార సంఘాల ఎన్నికలకు సిద్ధమయినా దాదాగిరితో ఒడ్డున పడాలని తలపోస్తోంది. నిష్పక్షపాతంగా వెళితే ఘోరపరాజయం తప్పదని తెలుసుకున్న అధికార పార్టీ నామినేషన్ల పర్వంనాడే దౌర్జన్యకాండకు తెగబడింది. బెదిరింపులు, అడ్డగింపులు, అపహరణలు, దాడులతో ప్రజాస్వామ్య స్ఫూర్తిని మంటగలిపేందుకు పూనుకుంది.

రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా రైతుల కోసం నిర్వహించే సహకార ఎన్నికలను ఎదుర్కొనేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ భయపడుతోంది. అందుకనే అప్రజాస్వామిక పద్ధతుల్లో గెలుపు దక్కించుకోవాలని పాకులాడుతోంది. ప్రత్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, పోటీదారులను బెదిరించడమే కాకుండా తమకు అడ్డం వచ్చినవారిని అపహరించేందుకు, దాడులు చేసేందుకు సైతం కాంగీయులు వెనుకాడడం లేదు. ఎన్నికలంటే అధికార పార్టీ ఎంత భయపడుతుందో దీన్నిబట్టే అర్థమవుతోంది. నిష్పక్షపాతంగా స్వేచ్ఛ పూరిత వాతావరణంతో ఎన్నికలు జరిగితే పరువు కోల్పోవడం ఖాయమని తెలుసుకున్న కాంగ్రెస్ స్కంధారావాలు దండోపాయంతో గట్టెక్కాలనుకుంటున్నారు. ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎలా ఎదుర్కొవాలో తెలియక విపక్ష టీడీపీతో సైతం జట్టు కట్టేందుకు జంకడం లేదు.
దినదిన ప్రవర్థమానమవుతున్న వైఎస్సార్ పార్టీని అడ్డుకునేందుకు కాంగ్రెస్ అపసోపాలు పడుతోంది. ఉప ఎన్నికల్లో చావుదెబ్బ తిన్నప్పటి నుంచి వైఎస్సార్ సీపీ పేరు చెబితే అధికార పార్టీ ఉలిక్కిపడుతోంది. సహకార ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు, అభ్యర్థులపై దౌర్జన్యానికి దిగడమే ఇందుకు తిరుగులేని నిదర్శనం. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే దౌర్జన్యకాండ తారాస్థాయికి చేరింది. సీఎం ప్రాతినిథ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ మద్దతుదారులు నామినేషన్లు వేయకుండా కాంగీయులు అడ్డుపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో దాఖలైన ఒకే ఒక్క నామినేషన్ను అధికార పలుకుబడితో పక్కనపెట్టింది. ఎవర్ని పోటీ చేయనీయకుండా చేసి గెలుపొందాలన్న కుతంత్రానికి నిసిగ్గుగా అధికార నేతలు తెగబడుతుంటే అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం చేష్టలుడిగి చూస్తుండడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు.
సహకార ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ ఆరంభం నుంచి అడ్డదారులు తొక్కింది. లక్షల సంఖ్యలో ఓటర్లను గంపగుత్తగా చేర్పించడంతోనే అపసవ్య చర్యలకు శ్రీకారం చుట్టింది. దీనిపై గవర్నర్కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసినా ఫలితం సున్నా. తమ ఆటలు చెల్లని చోట ఆఖరి అస్త్రంగా ఎన్నికలను వాయిదా వేస్తోంది. ఇప్పటికే 45 సహకార సంస్థల ఎన్నికల ప్రక్రియను నిలిపేసిన కిరణ్ సర్కారు మరో 100 సంస్థల ఎన్నికలను రద్దుచేసే దురాలోచన చేస్తోంది. ప్రకృతి వైపరీత్యాలు, శాంతిభద్రతలకు ఆటంకం కలిగినప్పుడు, ఓటర్లు వారి హక్కును వినియోగించుకోలేని పరిస్థితుల్లో మాత్రమే సెక్షన్ 22-సి ప్రకారం ఎన్నికల ప్రక్రియ నిలిపేయాల్సి ఉండగా పరిస్థితులు తమకు అనువుగా లేవన్న ఏకైక కారణంతో అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కాంగ్రెస్ కు ప్రజలు బుద్ధి చెప్పే రోజు ఎంతోదూరంలో లేదన్నది కొట్టిపారేయలేని వాస్తవం!