పచ్చని సంసారాల్లో నాటు సారా చిచ్చు పెడుతోంది. ఈ రక్కసి బారిన పడిన కుటుంబాలు అల్లకల్లోమవుతున్నాయి. సారా నిష మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. సారా మత్తుకు బానిసలయి జీవితాన్ని నరకం చేసుకుంటున్నవారెందరో. సారాకు దాసోహమయి కన్న తల్లిదండ్రులను, కట్టుకున్న భార్యను, కడుపున పుట్టిన పిల్లలను కాల్చుకుతింటున్న మందుబాబులకు కొదవలేదు. కల్లు, సారా, బ్రాందీ, విస్కీ, రమ్ము, బీరు పేరేదైనా ఫలితం మత్తే. జీవితం చిత్తే.
తాగుడుకు అలవాటుపడి ఎంతో మంది తమ జీవితాలను కష్టాలపాల్జేసుకుంటున్నారు. సంపాదనంత తాగుడుకు తగలేసి కుటుంబ సభ్యులను పీక్కుతింటున్నవారు కోకొల్లలు. పీకలదాకా తాగి తగాదాలకు దిగడం, కుటుంబ సభ్యులను చావగొట్టడం సహజంగా జరుగుతుంటుంది. కుటుంబ భారాన్ని మోయాల్సినవాడే మద్యానికి బానిసయితే ఆ సంసారంలో అశాంతికి అంతుండదు. కలహాలు, కలతలు, కన్నీళ్లు నిత్యకృత్యంగా మారాతాయి. ఒక్కోసారి తీవ్ర పరిణామాలకు దారితీస్తాయి.

మహబూబ్నగర్ జిల్లా ఖిల్లాఘనపురంలో సారా మహమ్మారి తాజాగా తల్లీకొడుకుల ప్రాణాలు బలితీసుకుంది. తాగుబోతు తండ్రి పెట్టే చిత్రహింసలు భరించలేక త ల్లితో కలిసి కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఘనపురం గ్రామానికి చెందిన గొండ్ల నారాయణ సారా తాగుడుకు బానిసై ప్రతిరోజూ పీకలదాకా తాగి భార్యాకొడుకును తరుచూ కొట్టడం, తిట్టడం వంటివి చేసేవాడు. శనివారం రాత్రి-జనవరి 26న- మరోమారు సారాతాగి భార్య శాంతమ్మను కొట్టాడు. అడ్డొచ్చిన కొడుకు హరికష్ణను తీవ్రంగా చితకబాది, తెల్లవార్లు చిత్రహింసలకు గురిచేశాడు. దీంతో తీవ్రమనస్తాపం చెందిన తల్లీకొడుకులు గ్రామం వెలుపల ఉన్న ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
‘సారాయి తాగి మా నాయిన మా అమ్మను, నన్ను రోజూ కొడుతుండు. నెలరోజులుగా తెల్లార్లు కొడుతుండు. వారి గొడవతో నాకు నిద్రపట్టడం లేదు. ఈ బాధను తట్టుకోలేక నేను మా అమ్మ చచ్చిపోతున్నం. దయచేసి ఇకనుంచి ఊరిలో ఎవ్వరినీ సారాయి అమ్మనీయొద్దు.’ అని ఆత్మహత్యకు ముందు హరికృష్ణ తన ఆవేదనను గోడపై బొగ్గుతో రాశాడు. సారా మహమ్మారి అకృత్యాలకు ఇది ఒక నిదర్శనం మాత్రమే. ఇలాంటి సంఘటనలు రోజూ రాష్ట్రంలో ఏదో మూల జరుగుతూనే ఉన్నా పాలకులకు పట్టడం లేదు. సారా అమ్మకాలను నియంత్రించి, ప్రజలను మత్తుకు బానిస కాకుండా చూడాల్సిన ఏలికలు కళ్లు మూసుకోవడంతోనే ఈ దౌర్భగ్యస్థితి దాపురించింది. సంసారాల్లో చిచ్చు పెడుతూ కల్లోలాలకు కారణమవుతున్న సారా అమ్మకాలను నియంత్రించాలని మహిళా లోకం కోరుతోంది.