
రైతులు, నేతన్నల పరిస్థితి దారుణం: విజయమ్మ
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లాలో తుపాను, భారీ వర్షాలు, వరదలకు నష్టపోయిన బాధితులైన రైతులు, మత్స్యకారులు, నేతన్నలను చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ చలించిపోయారు. విజయమ్మ ఈరోజు ఉదయం వరద ముంపు ప్రాంతాలౌన జగ్గంపేట నుంచి తన పర్యటన ప్రారంభించారు. కాట్రామలపల్లి, దుగ్గుదూరు, బిక్కవోలు, కాకినాడలలో పర్యటించారు. నీటమునిగిన వరి చేలను పరిశీలించారు. రైతులు, మత్స్యకారులు, చేనేత కార్మికుల బాధలు స్వయంగా విన్నారు. ధైర్యంగా ఉండాలని వారికి సూచించారు.
అనంతరం ఆమె ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ అకాల వర్షాలతో ప్రజలు ముంపు బారినపడినా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పందించలేదన్నారు. ఇప్పటి వరకు ముంపు బాధితులకు ప్రభుత్వం బియ్యం, కిరోసిన్ పంపిణీ చేయలేదని చెప్పారు. అకాల వర్షాల కారణంగా చేనేత కుటుంబాలు ఆకలిబాధతో అలమటిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా చోట్ల మగ్గాలు నీటిలో మునిగి తడిపోయినట్లు తెలిపారు. పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం త్వరగా అందేలా ప్రభుత్వం తమ పార్టీ ఒత్తిడి తెస్తుందని చెప్పారు. వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి వస్తే రైతులకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పారు. జగన్ అధికారంలోకి రాగానే మత్స్యకార, చేనేత కుటుంబాల సమస్యలు పరిష్కరిస్తారని చెప్పారు.
తుపాను వచ్చిపోయి ఆరు రోజులు అవుతున్నా ఒక్క అధికారి కూడా బాధితుల దగ్గరకు వచ్చి వివరాలు అడగలేదని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులే కాదు, మత్స్యకారులు, నేతన్నల పరిస్థితి దారుణంగా ఉందని చెప్పారు. తూర్పు గోదావరి జిల్లాలో రెండున్నర లక్షల ఎకరాలు వరి చేలు, 50 వేల ఎకరాల్లో వాణిజ్య పంటలు నష్టపోయాయని తెలిపారు. ఈ జిల్లాలో వెయ్యి ఇళ్లు పూర్తిగా, 2 వేల ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయన్నారు. నీలం తుపాన్ తరువాత జిల్లాకు 167 కోట్ల రూపాయలు ఇస్తే, ఇప్పుడు ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వలేదని చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఏలూరు కాలువ ఆధునీకరణ పనులు పూర్తి చేస్తారని హామీ ఇచ్చారు.