సర్వే విధులకు గైర్హాజరైతే చర్యలు
విజయవాడ : ప్రజాసాధికారిత సర్వే విధులకు హాజరుకాని సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ బాబు.ఎ హెచ్చరించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజాసాధికారిత సర్వే కోసం ఎంపిక చేసిన వివిధ శాఖల సిబ్బందికి శుక్రవారం ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాసాధికారిత సర్వేను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. ఇప్పటి వరకు కోటీ 17 లక్షల 74 వేల కుటుంబాలకు చెందిన మూడు కోట్ల 70 లక్షల 50 వేల మంది వివరాలను నమోదు చేశామని తెలిపారు. జిల్లాలో ఇంకా 19 లక్షలమంది వివరాలను సేకరించాల్సి ఉందన్నారు. పట్టణ ప్రాంతాల్లో 11 లక్షల మంది వివరాలు నమోదుచేయాల్సి ఉందన్నారు. ఇందుకోసం అన్ని శాఖల పరిధిలో సిబ్బందిని సర్వే విధుల్లో నియమించగా, కొన్ని శాఖల అధికారులు సిబ్బందిని రిలీవ్ చేయడం లేదని తమ దృష్టికి వచ్చిందన్నారు. వెంటనే అధికారులు సంబంధిత మున్సిపల్ శాఖ నోడల్ అధికారికి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. రాబోయే 10 రోజుల్లో సర్వేను పూర్తిచేసేలా సర్వే చేపట్టాలని సూచించారు. విజయవాడ మున్సిపల్ కమిషనర్ జి.వీరపాండియన్ మాట్లాడుతూ నగరంలో 8 నుంచి 9 లక్షల వ్యక్తుల వివరాలను సేకరించాల్సి ఉందన్నారు. కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న 480 మంది సర్వే సిబ్బందికి అదనంగా 484 మందిని కలెక్టర్ నియమించారని తెలిపారు. కృష్ణాపుష్కరాలు, దసరా మహోత్సవాల కారణంగా సర్వేలో వెనుకబడ్డామన్నారు. జిల్లా నోడల్ అధికారి, జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, సబ్కలెక్టర్ లక్ష్మీశ, కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు.