నేరాల నియంత్రణే లక్ష్యం
కర్నూలు: జిల్లాలో నేరాల నియంత్రణే లక్ష్యంగా పని చేయాలని సబ్డివిజన్ పోలీసు అధికారులకు ఎస్పీ ఆకె రవికృష్ణ ఆదేశించారు. అడిషనల్ ఎస్పీ టి.చంద్రశేఖర్రెడ్డితో కలిసి క్యాంపు కార్యాలయంలోని తన చాంబర్లో గురువారం ఆయన జిల్లాలోని డీఎస్పీ స్థాయి అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ రాబోయే గణేష్ ఉత్సవాలకు ఎలాంటి అవాంతరాలు ఎదురవకుండా శాంతి కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. న్యాయం కోసం పోలీసు స్టేషన్లను ఆశ్రయించే బాధితుల పట్ల మర్యాద పూర్వకంగా మెలగాలన్నారు. ముఖ్యమైన కేసులు.. ఎస్సీ, ఎస్టీ కేసుల దర్యాప్తులో పురోగతిపై ఆరా తీశారు.
మట్కారహిత జిల్లాగా కర్నూలును ఆవిష్కరిద్దామని పిలుపునిచ్చారు. పెండింగ్లోని నాన్బెయిలబుల్ వారెంట్లు, విచారణలోని కేసులు గ్రేవ్, నాన్గ్రేవ్ కేసుల పురోగతిని సబ్డివిజన్ల వారీగా సమీక్షించారు. హిజ్రాలకు ఓటరు కార్డులు, రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు ఇప్పించేందుకు సబ్డివిజన్ల స్థాయిలో పోలీసు అధికారులు సహాయ సహకారాలు అందించాలని సూచించారు. విజిబుల్ పోలిసింగ్కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, తద్వారా ప్రజల్లో భద్రతాభావం ఏర్పడుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా కళాశాలల్లో ర్యాగింగ్ నిరోధంపై అవగాహన సదస్సులు, నిరోధక కమిటీల ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. జైలు నుంచి విడుదలయ్యే పాతనేరస్తులపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. సమావేశంలో ఆళ్లగడ్డ ఏఎస్పీ శశికుమార్, డీఎస్పీలు ఏజీ కృష్ణమూర్తి, జె.బాబుప్రసాద్, బీఆర్ శ్రీనివాసులు, డీవీ రమణమూర్తి, పీఎన్ బాబు, వీరరాఘవరెడ్డి, మురళీధర్, వినోద్కుమార్, వీవీ నాయుడు, దేవదానం, హుసేన్పీరా, రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.
డీఎస్పీలకు ప్రశంసా పత్రాలు
గోదావరి మహాపుష్కరాల సందర్భం గా ఉత్తమ సేవలందించిన జిల్లా పో లీసు శాఖకు రాష్ట్ర ప్రభుత్వం ప్రశంసా పత్రాలను జారీ చేసింది. వీటిని జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ డీఎస్పీలకు అందజేశారు. జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో పనిచేస్తున్న డీఎస్పీ రాజశేఖర్రాజు, ట్రాఫిక్ డీఎస్పీ రామచంద్ర, సీసీఎస్ డీఎస్పీ హుసేన్పీరాలకు గురువారం ఎస్పీ తన క్యాంపు కార్యాలయంలో ప్రశంసా ప్రతాలను ప్రదానం చేశారు.