బేల: ఎక్కడైనా నకిలీ విత్తనాలు అమ్మితే సమాచారం ఇవ్వాలని జైనథ్ సీఐ సాయినాథ్ అన్నారు. మండల కేంద్రంలోని విత్తన విక్రయ కేంద్రాల్లో టాస్క్ఫోర్స్ బృందం ఆధ్వర్యంలో శనివారం తనిఖీలు చేపట్టారు. విత్తన ప్యాకెట్లు, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. జిల్లా కేంద్రంలో ఇటీవల గుర్తించిన నకిలీ విత్తనాలకు సంబంధించి ఆయా కంపెనీల ప్యాకెట్లు అమ్మవద్దన్నారు. పలు కంపెనీల శాంపిల్స్ సేకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహారాష్ట్ర రైతులకు ఇక్కడి విత్తనాలు విక్రయించవద్దని డీలర్లను ఆదేశించారు. అతిక్రమిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో భాగంగా మహారాష్ట్ర రైతులకు పత్తి విత్తనాలు విక్రయించిన 24మంది డీలర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు ఇన్చార్జి ఏవో విశ్వామిత్ర తెలిపారు. ఇందులో ఎస్సై రాధిక, ఏఎస్సై జీవన్, వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment