జిల్లాలో ఇలా..
పెద్ద హోటళ్లు తదితరమైనవి : 1000
కర్రీ పాయింట్లు తదితరాలు : 200
ఇతరత్రా చిన్న చిన్న టిఫిన్,
ఫాస్ట్ ఫుడ్ దుకాణాలు : 450
ఏటా 20 శాతం కూడా తనిఖీలు
జరగడం లేదు
2023–24లో ఫుడ్సేఫ్టీ అధికారులు
సేకరించిన శాంపిళ్లు : 300
కల్తీ జరిగినట్టు నిర్ధారణ జరిగితే..
రూ.5 లక్షలు జరిమానా
యలమంచిలి రూరల్ : జిల్లాలోని చిన్న హోటళ్ల నుంచి పెద్ద రెస్టారెంట్ల వరకు ఎక్కడా నిబంధనలు పాటించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. కంపుకొట్టే వంట గదుల్లో వండే కల్తీ వంటకాలను ఇంపు గా వడ్డిస్తూ జనం ఆరోగ్యంతో ఆటలాడుతున్నారు. రోజుల పాటు నిల్వ చేసిన పదార్థాలు, గడువు మీరిన, కల్తీ నూనెలతో చేసిన వంటకాలతో హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు కస్టమర్లను దోచుకుంటున్నా ఫుడ్సేఫ్టీ అధికారులు, కార్పొరేషన్, మున్సిపల్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడ డం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏదో ఫిర్యాదు అందితే తూతూమంత్రంగా తనిఖీలు, శాంపిళ్ల సేకరణతో హడావుడి చేయడం తప్ప ఫుడ్సేఫ్టీ అధికారులు గట్టి చర్యలు తీసుకున్న దాఖలా లు లేవు. దీంతో హోటళ్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్ల నిర్వాహకుల ఆగడాలకు అడ్డుకట్ట పడడం లేదు.
కిచెన్ వైపు చూస్తే ముద్ద దిగదు...
చాలా హోటళ్లు, రెస్టారెంట్లలో కిచెన్లను శుభ్రంగా ఉంచడం లేదు. వంట పాత్రలు శుభ్రం చేయడానికి ప్రత్యేక చాంబర్లు ఉండవు. ఒకవేళ ఉన్నా అరకొర నీటితో ౖపైపెనే శుభ్రం చేసి వాటిని తిరిగి వినియోగిస్తుంటారు. టేబుళ్లను క్లీన్ చేసే సమయంలో ఉదయం నుంచి రాత్రి వరకూ ప్లేట్లు, గ్లాసులను రెండు బకెట్ల నీళ్లలో ముంచేసి పని కానిచ్చేస్తున్నారు. వంట మాస్టర్లు, సర్వర్లు ఆఫ్రాన్లు, క్యాపులు, గ్లౌస్లు ధరించడం లేదు.
పాచి వంటలకు మసాలా తాళింపు...
ఇక వంటకాలకు సంబంధించి కుళ్లిన ఆహార పదార్థాలను వంటల్లో వినియోగిస్తున్నారు. మసాలా దినుసులు సైతం సరైన నిల్వ పద్ధతులు పాటించకపోవడంతో అందులో పురుగులు, బొద్దింకలు, బల్లులు, ఎలుకలు సంచరిస్తున్నాయి. అలాగే నిల్వ ఉంచిన చికెన్, మటన్ను పసుపులో ఉడికించి వంటకాల్లో వాడుతున్నారు. మిగిలితే మళ్లీ వాటిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తున్నారు. వాటిని మరుసటి రోజు వినియోగిస్తున్నారు. వంటలు ఘుమఘుమ లాడేందుకు అందులో టేస్టింగ్ పౌడర్ వేస్తున్నారు.
కాగిన నూనె మళ్లీ మళ్లీ...
ఒకసారి వినియోగించిన నూనెను వంటకాల్లో పదే పదే వినియోగిస్తుండడంతో ప్రజలు క్యాన్సర్, ఇతర రోగాల బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. పదే పదే మరిగించిన నూనెతో తయారు చేసిన పదార్థాల వల్ల గుండెలో చెడు కొలెస్ట్రాల్ పెరిగి ఇబ్బందులు వస్తాయి. రోడ్డు పక్కన తోపుడు బళ్లు, బేకరీలు, కర్రీ పాయింట్లు, రెస్టారెంట్లలో సైతం ఇదే జరుగుతోంది. ఈ కారణంగానే ఇటీవల గ్రామీణ ప్రాంతాల్లో సైతం గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నారు.
కల్తీ ఆహారంతో జబ్బులు
కాలం చెల్లిన మసాలాల వినియోగం, కల్తీ ఆహారంతో జీర్ణ కోశ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. నాణ్యత లేని ఆహారం తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషక పదార్థాలు అందక శరీరం బలహీనమవుతుంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్తో డయేరియా, విరేచనాలు, కడుపునొప్పి, ఎసిడిటీ వంటివి వస్తాయి. కలరింగ్ ఏజెంట్ల వల్ల పేగు, ప్యాంక్రియాటిక్ కేన్సర్ల ముప్పు ఉంది.
– డాక్టర్ ఆర్.నిహారిక, సివిల్ అసిస్టెంట్ సర్జన్, యలమంచిలి సీహెచ్సీ
ఫిర్యాదు చేస్తే చర్యలు
ఫుడ్సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ ప్రకారం అన్ని ఆహార విక్రయ కేంద్రాలు, ఉత్పత్తి కేంద్రాలు లైసెన్సు పొందాలి. నాణ్యత పాటించాలి. లేనిపక్షంలో తనిఖీలు చేసి చర్యలు తీసుకుంటాం. ప్రజలెవరైనా ఆహార భద్రతకు సంబంధించిన ఫిర్యాదులను ఫుడ్సేఫ్టీ కనెక్ట్ యాప్ ద్వారా చేయడానికి వీలుంది. ఎక్కడైనా ప్రజలు హోటళ్లు, స్వీట్స్, బేకరీలు, ఇతర తినుబండారాల దుకాణా లపై ఫిర్యాదు చేస్తే తగు చర్యలు తీసుకుంటాం. భారీ జరిమానాలతో పాటు లైసెన్సులు రద్దు చేయడం, క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుంది.
– కె.సతీష్కుమార్, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్,
అనకాపల్లి
రుచి...శుచి లేని హోటల్ ఫుడ్
జిల్లాలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న హోటళ్లు, రెస్టారెంట్లు
అపరిశుభ్ర పరిసరాల్లో వంటల తయారీ
నిల్వ వంటకాలు, నాసిరకం సరుకులు
నాణ్యతా ప్రమాణాలు పాటించని
నిర్వాహకులు
అనారోగ్యం కొని తెచ్చుకుంటున్న జనం
అధికారుల తనిఖీలు తూతూ మంత్రం
Comments
Please login to add a commentAdd a comment