మదనపల్లె : మదనపల్లె పరిధిలోని ఇళ్లలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఇళ్లలో చొరబడి అందిన కాడికి దోచుకెళ్లారు. ఒకే రోజున రూ. లక్షల విలువగల నగదు, నగలు అపహరించుకుపోయారు. బాధితుల వివరాల మేరకు.. మదనపల్లె పట్టణంలోని రామిరెడ్డి లే అవుట్లో నివాసముంటున్న చంద్రశేఖర్ తన కుటుంబసభ్యులతో రాజానగర్లో బంధువుల ఇంటికి వెళ్లారు. ఇంటి తాళం వేసి ఉండడాన్ని గమనించిన దొంగలు తలుపులు పగలగొట్టి ఇంట్లోకి చొరబడి దొరికిన కాడికి దోచుకెళ్లారు. చంద్రశేఖర్ తిరిగి వచ్చి చూడగా తలుపులు బద్దలు కొట్టి ఉండడ, బీరువా తెరచి ఉండడంతో వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ.25 లక్షల విలువగల భార్యకు సంబంధించిన అరకిలో బంగారు నగలు, రెండు కిలోల వెండి ఆభరణాలు, రూ.1.5 లక్షల నగదు చోరీకి గురైనట్లు చంద్రశేఖర్ పేర్కొన్నారు. అదే విధంగా పట్టణంలోని నీరుగట్టువారిపల్లె కోళ్లబైలు రోడ్డులోని నివాసముంటున్న రైతు ఓబుల్రెడ్డి తన బంధువుల ఆహ్వానం మేరకు ఆదివారం ఉదయం పెద్దమండ్యంలోని జాతరకు వెళ్లాడు. అతడి భార్య శాంతమ్మ మామడి గుంపులపల్లె వద్ద ఉన్న పొలానికి వెళ్లారు. అనంతరం ఓబుళ్రెడ్డి ఇంటికి తిరిగి వచ్చి చూడగా తలుపులు తెరచి ఉండడం, బీరువా తలుపులు తెరచి ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లో సుమారు 50 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.పది వేల నగదు చోరీకి గురైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. వన్టౌన్ సీఐ వల్లిబసు, సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్టీం, డాగ్ స్క్వాడ్తో తనిఖీలు నిర్వహించి ఆధారాలు సేకరించారు. ఒకే రోజున రెండు భారీ చోరీలు జరగడంతో మదనపల్లె ప్రజలు ఆందోళనకు గురయ్యారు. పోలీసులు కేసులు దర్యాప్తు చేస్తున్నారు.
రూ.30 లక్షల విలువగల నగలు,
నగదు అపహరణ
క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్తో తనిఖీలు
Comments
Please login to add a commentAdd a comment