
పువ్వులు విరిసె.. సీతాపతి మురిసె
ఒంటిమిట్ట: ఏకశిలానగరి కోదండ రామయ్య సన్నిధిలో మంగళవారం సాయంత్రం పుష్పయాగం కనుల పండువగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలు ముగిసిన తరువాత పుష్పయాగం, ఏకాంతసేవ నిర్వహించడం సంప్రదాయం. ఇందులో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి తెప్పించిన నయనమనోహరమైన పుష్పాలతో దాశరథిని అర్చించారు. ఈ కమనీయ ఘట్టాన్ని భక్తులు కనులారా తిలకించి తన్మయత్వం పొందారు. అంతకుముందు ఉదయం సుప్రభాత సేవ జరిగింది. ఆలయశుద్ధి, ఆరాధన చేపట్టారు. అనంతరం భక్తులకు సర్వదర్శనం భాగ్యం కల్పించారు. సాయంత్రం 5:30 గంటలకు ఆలయ సూపరింటెండెంట్ హనుమంతయ్య, ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో పుష్పప్రదర్శన చేశారు. బెంగళూరు, నాగర్కోయిల్, శ్రీరంగం, చైన్నె, తిరుపతి, కడప నగరాల నుంచి 2.5 టన్నుల 14 రకాల పూలు, 6 రకాల పత్రాలు తెప్పించారు. గులాబి, చామంతి, నూరువరహాలు, సంపంగి, మల్లె, గన్నేరు, మొగలిరేకులు, కనకాంబరాలు, తామర పూలు తీసుకువచ్చారు. తులసిదళాలు, దవనం, పన్నీరు, మరవం పత్రాలతో సీతారామలక్ష్మణ మూర్తులకు పుష్ప నీరాజనం చేశారు. ఈ యాగం నిర్వహించడంతో సమస్త దోషాలు తొలగిపోతాయని వేదపండితులు రాజేష్ భట్టార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గార్డెన్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు, ప్రముఖులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
శ్రీ కోదండ రామాలయంలో
నయనానందకరంగా పుష్పయాగం

పువ్వులు విరిసె.. సీతాపతి మురిసె