చిత్తూరు కలెక్టరేట్ : పర్యాటకరంగం దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా మారిందని జిల్లా పర్యాటక, సాంస్కృతిక శాఖ అధికారి మల్లికార్జున అన్నారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గాంధీ విగ్రహం నుంచి 2 కే రన్ నిర్వహించారు. అనంతరం మెసానికల్ మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లాలో పర్యాటక స్థలాల ప్రాముఖ్యతపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. యువతలో పర్యాటక రంగం పట్ల అవగాహన పెంచడం వల్ల మరింత అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, యువ పర్యాటక క్లబ్ కో–ఆర్డినేటర్ గోపినాయక్ మాట్లాడుతూ వివిధ పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తే విభిన్న సంస్కృతులను, సంప్రదాయాలను తెలుసుకోవచ్చన్నారు. పర్యటక రంగం యువతకు కొత్త అవకాశాలను అందిస్తుందన్నారు. పర్యాటక రంగంలోకి యువత ఎక్కువగా రావాలని చెప్పారు. చిత్తూరు జిల్లాలో పర్యాటక ప్రాముఖ్యత పెంచడంలో విద్యార్థుల పాత్ర ఎంతో ముఖ్యమైనదని తెలిపారు. అనంతరం 2కే రన్ విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో పీవీకేఎన్ యువ పర్యాటక క్లబ్ ఉపాధ్యక్షులు రెడ్డి బాషా, అధ్యాపకులు చిట్టిబాబు, వెంకటేష్, శారద, గౌరీశంకర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment