పార్లమెంట్ పరిశీలకుడిగా మాజీ ఎంపీ నందిగం సురేష్
సాక్షి ప్రతినిధి, బాపట్ల: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మాజీ మంత్రి మేరుగ నాగార్జున నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షులు వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు కేంద్ర కార్యాలయం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మేరుగ నాగార్జున దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్. రాజశేఖరరెడ్డి అనుచరుడిగా రాజకీయ జీవితం ప్రారంభించారు. వైఎస్సార్ ప్రభుత్వ హయాంలో ఎస్సీ కమిషన్ చైర్మన్గా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించారు. 2019లో వేమూరు నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా గెలుపొందారు. అంతకు ముందు రెండు సార్లు పోటీచేసి ఓడినా.. పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆశీస్సులతో శాసనసభకు ఎన్నికయ్యారు. మంత్రి వర్గంలో సాంఘిక సంక్షేమశాఖామంత్రిగా పని చేశారు. ఉన్నత చదువులు చదివిన నాగార్జున రాజకీయాల్లో చురుగ్గా ఉంటారన్న పేరుంది. సామాజిక అంశాలపై అవగాహన ఉన్న ఆయన ఆయా వర్గాలతో పాటు పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తున్నారు. భట్టిప్రోలు మండలం వెల్లటూరు గ్రామానికి చెందిన నాగార్జున 1994–2007లో ఆంధ్రా యూనివర్సిటీ ప్రొఫెసర్గా పని చేశారు. ఎన్ఎస్యూఐ, యువజన, కాంగ్రెస్ పార్టీల్లో వివిధ పదువుల్లో చురుగ్గా వ్యవహరించారు. రాష్ట్ర ఎస్సీసెల్ అధ్యక్షుడిగా పని చేశారు. విజయవాడలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహ ప్రతిష్టాపన చైర్మన్గా ఉన్నారు. పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా తనకు అవకాశమిచ్చిన అధ్యక్షులు వైఎస్.జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పారు. తనపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయనని నాగార్జున తెలిపారు. అందరినీ సమన్వయం చేసుకొని జిల్లాలో పార్టీని తిరుగులేని శక్తిగా నిలిపేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. మాజీ మంత్రి మేరుగ నాగార్జునను జిల్లా అధ్యక్షుడిగా నియమించడంతో వైఎస్సార్సీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. బాపట్ల జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన మేరుగ నాగార్జునను ఎమ్మెల్సీ, పార్టీ కేంద్ర కార్యాలయ ఇన్చార్జి ఎల్. అప్పిరెడ్డి అభినందించారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు మందపాటి శేషగిరిరావు పాల్గొన్నారు.
పార్టీ పార్లమెంట్ పరిశీలకుడిగా బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ను నియమించారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఉత్తర్వులిచ్చింది. నందిగం సురేష్ను పరిశీలకుడిగా నియమించడంపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment