గుంటూరు వెస్ట్: స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా రిజిస్ట్రార్ డి.శైలజ గురువారం పట్టణంలోని పలు ఈ–స్టాంపు సెంటర్లలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నాలుగు రోజుల క్రితం విచారణకు ఆదేశించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా రిజిస్ట్రార్లతోపాటు డీఐజీ స్థాయి అధికారులు కూడా తనిఖీలు నిర్వహించారు. గురువారం శైలజతోపాటు కొందరు సబ్ రిజిస్ట్రార్లు, సిబ్బంది కలిసి కలెక్టరేట్ ఆవరణ, కొరిటెపాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ముందున్న సెంటర్లలో తనిఖీ నిర్వహించారు. ఈ–స్టాంపుల విక్రయాలకు సంబంధించి రికార్డులను పరిశీలించారు. కొనుగోలుదారులతో ఫోన్లో మాట్లాడి స్టాంపులకు ఎంత తీసుకుంటున్నారో విచారించారు. కొందరి రికార్డులు సక్రమంగా ఉండగా.. మరికొందరు వెండార్లు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. మరికొందరు ఈ తనిఖీల విషయం తెలుసుకుని షాపులు మూసేసి పరారయ్యారు. ఈ సందర్భంగా శైలజ మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా నడుచుకుంటే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఈ–స్టాంపింగ్, నాన్ జ్యుడీషియల్ స్టాంపుల విషయంలో అధిక ధరలకు విక్రయించే వెండార్లపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
కమీషన్ ఇవ్వడం లేదు
అయితే కొందరు వెండార్లు ఈ–స్టాంపింగ్ స్టాంపుల విక్రయంలో ప్రభుత్వం నుంచి తమకు కమీషన్ రావడం లేదని తెలిపారు. అందుకే బయట వ్యక్తుల నుంచి స్టాంపునకు రూ.10 నుంచి రూ.20 తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇది నిబంధనలకు విరుద్ధమైనా కమీషన్ ఇవ్వకుండా లైసెన్సులు జారీ చేసినందున ఇలా చేయాల్సి వస్తోందన్నారు. ఎన్నో ఏళ్లుగా తమ న్యాయమైన సమస్యలను ఉన్నతాధికారులకు వివరిస్తున్నా పరిష్కరించడం లేదని వాపోయారు. చాలా కాలం నుంచి నాన్ జ్యుడీషియల్ స్టాంపుల సరఫరా నిలిపేశారని తెలిపారు. దీంతో తాము ప్రత్యామ్నాయంగా ఈ–స్టాంపుల విక్రయాలు చేస్తున్నామని పేర్కొన్నారు. జిల్లా రిజి స్ట్రార్ డి.శైలజ మాత్రం నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని తేల్చి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment