నేటి నుంచి నగదు రూపేణా వసూళ్లు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి నగదు రూపేణా వసూళ్లు

Published Fri, Jun 14 2024 1:14 AM | Last Updated on Fri, Jun 14 2024 1:14 AM

నేటి నుంచి నగదు రూపేణా వసూళ్లు

వరంగల్‌ అర్బన్‌: ఎట్టకేలకు నెల రోజుల తర్వాత గ్రేటర్‌ వరంగల్‌లో పన్నుల వసూళ్లు నగదు రూపంలో చెల్లించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం(నేటి) నుంచి బల్దియాకు చెందిన 9 మీసేవా కేంద్రాల్లో, వార్డు ఆఫీసర్లు బకాయిదారుల నుంచి క్యాష్‌ రూపంలో పన్నులు స్వీకరించనున్నారు. నగదుతోపాటు డిజిటల్‌ వసూళ్లు చేపట్టనున్నారు. కొన్నేళ్లుగా క్షేత్ర స్థాయిలో, మీ సేవ కేంద్రాల్లో ఔట్‌ సోర్సింగ్‌ బిల్‌ కలెక్టర్లు డిజిటల్‌, నగదు రూపంలో ఆస్తి, నీటి, చెత్త, ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజులు వసూలు చేస్తుండడంతో అనేక అవకతవకలు జరిగినట్లు రాష్ట్ర పురపాలక శాఖ గుర్తించింది. నెల రోజుల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీల్లో నగదు రూపంలో వసూళ్లకు బ్రేక్‌ వేసింది. ఈనేపథ్యంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ మినహా డిజిటల్‌ పద్ధతి ద్వారా పన్నుల స్వీకరణ వల్ల అన్ని మున్సిపాలిటీల్లో వసూళ్ల శాతం తగ్గుముఖం పట్టింది. కొన్ని మున్సిపాలిటీల్లో ఔట్‌సోర్సింగ్‌ కార్మికులకు వేతనాలివ్వలేని పరిస్థితులు నెలకొన్నాయి. పురపాలక శాఖ అధికారుల ఆదేశాల మేరకు సెంట్రల్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్సీ(సీజీజీ) సాంకేతిక సహాయంతో మార్పులు చేశారు. అంతేకాకుండా ఔట్‌ సోర్సింగ్‌ బిల్‌ కలెక్టర్లను పన్నుల వసూళ్ల నుంచి పూర్తిగా తప్పించారు. వీరి స్థానంలో శాశ్వత ఉద్యోగులను డివిజన్‌కు ఒకరి చొప్పున వార్డు ఆఫీసర్‌ను నియమించారు. ఇక మీదట 66వ డివిజన్లు, బల్దియాకు చెందిన మీసేవ కేంద్రాలైన వరంగల్‌ హెడ్‌ పోస్టాఫీస్‌, కాశిబుగ్గ సర్కిల్‌, శివనగర్‌, ఉర్సు, పోచమ్మ మైదాన్‌, బల్దియా ప్రధాన కార్యాలయం, హనుమకొండ అశోకా థియేటర్‌ ఎదురుగా, నయీంనగర్‌, నక్కలగుట్ట, సుబేదారి, కాజీపేటలో వార్డు ఆఫీసర్లు, కొంత మంది జూనియర్‌ అసిస్టెంట్లకు పూర్తి స్థాయిలో పన్నుల వసూళ్ల బాధ్యత కట్టబెట్టారు. దీంతో పన్నుల వసూళ్ల శాతం మెరుగుపడుతుందని బల్దియా పన్నుల విభాగం అధికారులు భావిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement