పర్యాటకంలో జిల్లాకు మూడోస్థానం | - | Sakshi
Sakshi News home page

పర్యాటకంలో జిల్లాకు మూడోస్థానం

Published Sat, Sep 28 2024 1:26 AM | Last Updated on Sat, Sep 28 2024 1:26 AM

పర్యాటకంలో జిల్లాకు మూడోస్థానం

జగిత్యాల: ప్రపంచ ఆర్థిక ప్రగతిలో కీలక పాత్ర పోషించేది పర్యాటకం. 1980లో ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ప్రారంభించింది. ఏటా సెప్టెంబర్‌ 27న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటాం. సామాజిక, సాంస్కృతిక, విభిన్న జనాభా మధ్య సంస్కృతుల మార్పిడిని ప్రోత్సహించడంలో పర్యాటక పాత్ర ఉంటుంది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం యువ టూరిజం క్లబ్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు 8వ తరగతి నుంచి పీజీ వరకు విద్యార్థులను క్లబ్‌గా ఏర్పాటు చేసి 25 మందికొక కోఆర్డినేటర్‌ను ఏర్పాటు చేశారు. జిల్లాలో 298 క్లబ్‌లు ఏర్పాటు చేసి రాష్ట్రంలోనే మూడోస్థానంలో నిలిచారు. ఈ క్లబ్‌లలో విద్యార్థులకు పర్యాటకం గురించి తెలిసేందుకు కోఆర్డినేటర్‌ తీసుకెళ్లి చూపించాల్సి ఉంటుంది. జిల్లాలో చారిత్రాత్మకమైన ఖిల్లా, ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాలు కొండగట్టు, ధర్మపురి, నేరెళ్ల గుట్ట, కోరుట్ల సైఫాన్‌, భీమేశ్వరాలయం ఇలా ఎన్నో ఉన్నాయి. ప్రభుత్వం ఉత్తమ జిల్లాలను ప్రకటించగా జగిత్యాల మూడోస్థానంలో నిలిచింది. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చేతుల మీదుగా కలెక్టర్‌ సత్యప్రసాద్‌ అవార్డుతో పాటు, రూ.లక్ష నగదు అందుకున్నారు. అవార్డు రావడం జిల్లాకే గర్వకారణమని పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా కలెక్టర్‌ను అడిషనల్‌ కలెక్టర్‌లు రాంబాబు, గౌతమ్‌రెడ్డి, ఎస్‌కేఎన్‌ఆర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ అశోక్‌ అభినందించారు.

అవార్డు అందుకున్న కలెక్టర్‌ సత్యప్రసాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement