కృష్ణానదికి ఈసారి పెద్దఎత్తున వరద పోటెత్తడంతో జూలై చివరి నాటికి శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యానికి చేరుకుంది. రోజుకు సుమారు 2 లక్షలకు పైగా క్యూసెక్కుల వరదతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కడంతో ఈసారి పది రోజుల వ్యవధిలో ప్రాజెక్ట్ నిండిపోయింది. ఇరు తెలుగు రాష్ట్రాలు నిరాటంకంగా కొనసాగిస్తున్న విద్యుదుత్పత్తి ఫలితంగా మళ్లీ పది రోజుల్లోనే ప్రాజెక్ట్ 40 టీఎంసీల మేరకు ఖాళీ అయింది. ఈనెల 12న శ్రీశైలం ప్రాజెక్ట్లో 210.03 టీఎంసీల నీరు ఉండగా, గురువారం నాటికి ప్రాజెక్ట్లో 170 టీఎంసీల నీరు మాత్రమే మిగిలింది. ఏపీ పవర్హౌస్ ద్వారా విద్యుదుత్పత్తి చేపడుతూ రోజుకు సుమారు 15 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుండగా, తెలంగాణ పవర్హౌస్ ద్వారా నిత్యం 16 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు. ఇందుకోసం నిత్యం 30 వేల క్యూసెక్కుల చొప్పున ఇరు రాష్ట్రాలు నీటిని వినియోగిస్తున్నాయి. అలాగే ఏపీకి చెందిన పోతిరెడ్డిపాడు పథకం కింద నిత్యం సుమారు 28 వేల క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నారు. హంద్రీనీవా, సుజలా స్రవంతి, ముచ్చుమర్రి, మల్యాల పథకాల ద్వారా నిత్యం సుమారు 1,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో ప్రాజెక్ట్లోని జలాలు వేగంగా తగ్గిపోతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment