● ఖిల్లాపై రోప్వే నిర్మాణం.. పాలేరు, వైరాలో బోటింగ్ ● పర్యాటక అభివృద్ధిపై సమీక్షలో మంత్రి తుమ్మల
ఖమ్మంవన్టౌన్: ఉమ్మడి ఖమ్మం జిల్లాను పర్యాటకంగా తీర్చిదిద్ది, ఖమ్మం ఖిల్లాకు పూర్వవైభవం తీసుకొచ్చేలా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. హైదరాబాద్ సచివాలయంలో గురువారం ఆయన ఖిల్లాపై రోప్వే ఏర్పాటు తదితర పనులపై టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్రెడ్డి, ఎండీ ప్రకాష్రెడ్డితో సమీక్షించారు. ఖమ్మం ఖిల్లాపై రోప్వే పనులను శరవేగంగా పూర్తిచేయాలని, నిధులు సమకూర్చే బాధ్యత తాను తీసుకుంటానని చెప్పారు. లోయర్ పాయింట్ నిర్మాణానికి లకారం చెరువు పరిసర ప్రాంతం అనువుగా ఉంటుందని తెలిపారు. రోప్వే నిర్మాణం పూర్తయ్యాక పార్క్లు, హోటళ్లు, హాళ్ల నిర్మాణం రెండో దశలో చేపట్టాలన్నారు. ఇక దక్షిణ ఆయోధ్యగా పిలిచే భద్రాద్రిలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసేలా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కిన్నెరసాని ప్రాజెక్టు అభివృద్ధి, వసతుల కల్పనకు కృషిచేస్తామన్నారు. అంతేకాక నేలకొండపల్లి బౌద్ధస్తూపం, భక్తరామదాసు ధ్యాన మందిరం, కూసుమంచి శివాల యం అభివృద్ధి, పాలేరు, వైరా రిజర్వాయర్లలో బోటింగ్ ఏర్పాటుకు సిద్ధం కావాలని మంత్రి సూచించారు. ఈమేరకు టూరిజం శాఖ ఎండీ ప్రకాశ్రెడ్డి మాట్లాడుతూ రోప్వే పనులకు సంబంఽధించి ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేయగా, నిర్మాణ సంస్థలను సంప్రదిస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment