మచిలీపట్నంటౌన్: చీపురు పట్టి.. నగర వీధులను శుభ్రం చేశారు బందరు మునిసిపల్ కమిషనర్ బాపిరాజు. స్వచ్ఛతాహీ సేవలో భాగంగా గురువారం 17వ డివిజన్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బందరు నగర కమిషనర్ సీహెచ్వీవీఎస్ బాపిరాజు డివిజన్లో రోడ్లు ఊడ్చారు. నగరపాలక సంస్థ కార్యాలయాన్ని కమిషనర్, ఉద్యోగులు, ఇతర సిబ్బంది శుభ్ర పర్చారు.
బొండాడ గ్రూప్స్ రూ.25 లక్షల విరాళం
అవనిగడ్డ: వరద బాధితులకు సాయం చేయడానికి కృష్ణా జిల్లా దివిసీమకు చెందిన బొండాడ గ్రూప్స్ చైర్మన్ బొండాడ రాఘ వేంద్రరావు గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన నివాసంలో రూ.25 లక్షల చెక్ అందించారు. ఈ సందర్భంగా బొండాడను సీఎం అభినందించారు. కార్య క్రమంలో ఆ గ్రూప్స్ డైరెక్టర్ సత్యనారాయణ పాల్గొన్నారు.
ముగ్గురు ఆర్డీఓల బదిలీ
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో ముగ్గురు ఆర్డీఓలను బదిలీ చేస్తూ గురువారం రాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. బందరు ఆర్డీఓగా చేస్తున్న ఎం.వాణిని నూజివీడు ఆర్డీఓగా బదిలీ చేశారు. ఈ స్థానంలో ప్రొబెషనరీ డెప్యూటీ కలెక్టర్గా ఉన్న కె.స్వాతిని నియమించారు. ఉయ్యూరు ఆర్డీఓ పని చేస్తున్న దాసి రాజును నరసాపురం ఆర్డీఓగా బదిలీ చేశారు. ఈ స్థానంలో రేపల్లె ఆర్డోఓగా పని చేస్తున్న బి.సంపత్హేల షరణ్ను నియమించారు. గుడివాడ ఆర్డీఓగా పని చేస్తున్న పి.పద్మావతిని రాష్ట్ర సచివాలయంలోని సాధారణ పరిపాలన శాఖకు రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ స్థానంలో గుడివాడ మునిసిపల్ కమిషనర్గా పని చేస్తున్న జి.బాలసుబ్రహ్మణ్యంను నియమించారు.
అభివృద్ధి పనుల పరిశీలన
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థాన ఘాట్లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను టెక్నికల్ బృందం గురువారం పరిశీలించింది. దుర్గగుడిపై అక్టోబర్ 3వ తేదీ నుంచి ప్రారంభమయ్యే దసరా ఉత్సవాల నేపథ్యంలో ఘాట్రోడ్డులో పనులు జరుగుతున్నాయి. మొదటి మలుపు వద్ద జారిపడిన రిటైనింగ్ వాల్, చైనా వాల్ వద్ద జరుగుతున్న రాక్ మిటిగెషన్ పనులు, సమాచార కేంద్రం వద్ద జారి పడిన కొండ చరియల ప్రాంతాన్ని నిపుణుల బృందం పరిశీలించింది. టెక్నికల్ టీం సభ్యులు కొండలరావు పర్యవేక్షణలో పలువురు నిపుణులు పనుల పురోగతిపై సంతృప్తిని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో కె.ఎస్.రామరావు, దుర్గగుడి ఈఈలు కేవీఎస్. కోటేశ్వరరావు, లింగం రమాదేవి, ఇతర ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
కొనకళ్లకు
మంత్రి కొల్లు సత్కారం
మచిలీపట్నంటౌన్: ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్గా నియమితులైన బందరు మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావుకు గురువారం రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర శుభాకాంక్షలు తెలిపారు. కొనకళ్ల నివాసానికి విచ్చేసిన ఆయన నారాయణరావుకు గజమాలను వేసి, శాలువా కప్పారు. ఈ సందర్భంగా కొనకళ్ల మాట్లాడుతూ బందరు బస్టాండ్ ముంపు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకుడు కొనకళ్ల బుల్లయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, హసీంబేగ్, కుంచే నాని, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment