బిజినేపల్లి: రైతులు సేంద్రియ పద్ధతలో ఆరోగ్యకరమైన ఆహార పంటలు పండించాల్సిన అవసరం ఉందని పాలెం వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ మల్లారెడ్డి అన్నారు. నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఆడిటోరియంలో శుక్రవారం విత్తన మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీఆర్ మాట్లాడుతూ రైతులు వాణిజ్య పంటలతోపాటు సేంద్రియ పద్ధతిలో ఆహార పంటలను సాగు చేయాలని.. తద్వారా భవిష్యత్ తరాలకు వ్యవసాయం ఒక అలవాటుగా మారుతుందన్నారు. పంటల సాగులో సరైన విత్తనాలను ఎంపిక చేసుకోవడం, తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించేలా సాగు ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. ముఖ్యంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారుల సూచనలు, సలహాలు విధిగా పాటించాలన్నారు. రైతులు సాగుచేసే ప్రధాన పంటలైన వరి, వేరుశనగ, తెల్లజొన్న, పచ్చజొన్న, కంది, ఆముదం, మినుము, పెసర, ఉలువలు ఇతర చిరుధాన్యాలు రాగులు, సజ్జ, కొర్ర, విత్తనాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. వచ్చే నెలలో నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని.. నేల చలవకు వచ్చిన తర్వాతే విత్తనాలు నాటాలన్నారు. వాణిజ్య పంటలను సాగు చేసినప్పుడు అంతర పంటలపై కూడా దృష్టి పెట్టాలన్నారు. అతివృష్టి, అనావృష్టి వల్ల ఒక పంటకు నష్టం జరిగితే మరో పంట అయినా రైతు చేతికి వస్తుందని.. తద్వారా నష్టాన్ని నివారించుకోవచ్చన్నారు. పత్తి పంటలో దీర్ఘకాలిక రకాల కంటే స్వల్పకాలిక రకాలతోపాటు గింజ పొడవుగా ఉండే రకాలను ఎంచుకోవాలన్నారు. పత్తిలో కంది, నువ్వులు వంటివి అంతర పంటగా ఎంచుకోవాలని సూచించారు.
విత్తన ఎంపిక కీలకం..
ఉమ్మడి జిల్లాలో రైతులు అధికంగా పత్తి, మొక్కజొన్న, వరి పంటలను సాగుచేస్తారని, ప్రైవేట్లో కొనుగోలు చేసే విత్తనాలకు తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త ప్రభాకర్రెడ్డి అన్నారు. పంట దిగుబడిలో ఏమైనా లోపాలు ఉంటే ఆ రసీదు ఆధారంగా అధికారులకు ఫిర్యాదు చేసి, నష్టాన్ని నివారించుకోవచ్చన్నారు. తెలిసిన వ్యక్తుల వద్ద విత్తనాలు తక్కువ ధరకు వస్తున్నాయని కొనుగోలు చేయరాదన్నారు. పంటలలో కలుపు నివారణ కోసం చేసే ముందస్తు పిచికారీలపై శాస్త్రవేత్తల సూచనలు పాటించాలని చెప్పారు.
ఆహారంలో నూనె గింజల ఆవశ్యకత..
మానవ ఆహారంలో నూనె గింజల ఆవశ్యకత ఎంతో ఉందని.. రైతులు నువ్వులు, వేరుశనగ, ఆముదం, పొద్దుతిరుగుడు వంటి పంటలపై దృష్టిసారించాలని ఆర్ఏఆర్ఎస్ శాస్త్రవేత్త నళిని సూచించారు. మారె్క్ట్లో డిమాండ్ మేరకు చిరుధాన్యాలతోపాటు నూనె గింజల సాగు విస్తీర్ణం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. రైతులు పంట సాగుతోపాటు నూనె ప్రాసెసింగ్ యూనిట్లు కూడా ఏర్పాటు చేసుకుంటే అదనపు ఆదాయం వస్తుందన్నారు.
సేంద్రియ సాగు, స్వల్పకాలిక పంటలకు ప్రాధాన్యం
పాలెం వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ మల్లారెడ్డి
విత్తనాల కొనుగోలు మోసాలపై గళమెత్తిన అన్నదాతలు
విత్తన మేళాకు తరలివచ్చిన ఉమ్మడి జిల్లా రైతులు
పాలెం విత్తనానికి పేరుంది..
పాలెం వ్యవసాయ పరిశోధనా స్థానంలో విక్రయించే విత్తనానికి పేరుందని, అందుకే ఇక్కడి విత్తనం కొనుగోలు చేయడానికి వచ్చాను. నా పొలంలో వరి పంట సాగు చేస్తా. ఇందుకోసం శాస్త్రవేత్తల సూచనలు తెలుసుకున్నాను. పాలెం ఆర్ఏఆర్ఎస్ నుంచి కొనుగోలు చేసిన విత్తనాల నుంచి మంచి దిగుబడులు వచ్చాయి. నాతోపాటు మా ఊరి నుంచి మరికొంత మంది రైతులం వచ్చాం. – లింగయ్య రైతు, కొడ్గల్, జడ్చర్ల
క్లుప్తంగా సమాచారం..
పాలెం ఆర్ఏఆర్ఎస్ నుంచి శాస్త్రవేత్తలు ఆయా పంటల సాగుపై ఇచ్చే సమాచారం చాలా క్లుప్తంగా ఉంటుంది. ఈసారి నా పొలంలో వరితోపాటు పత్తి పంట సాగు చేస్తా. పత్తిలో అధిక సాంధ్రతలో వ్యవసాయంపై శాస్త్రవేత్తలు ఇచ్చిన సమాచారం బాగా ఉపయోగపడింది. వ్యవసాయంలో లోతు దుక్కులు, కలుపు నివారణ, యంత్రాల వినియోగం, పంటల్లో చీడపీడల నివారణపై అవగాహన వచ్చింది. – శివకాంత్రెడ్డి,
రైతు, వెల్గొండ, బిజినేపల్లి
Comments
Please login to add a commentAdd a comment