జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): చాకలి ఐలమ్మ నేటి తరానికి స్ఫూర్తిప్రదాత అని కలెక్టర్ విజయేందిర పేర్కొన్నారు. గురువారం పద్మావతి కాలనీలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి కలెక్టర్ విజయేందిర, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచానికి తెలంగాణ తెగువను, పోరాట పటిమను పరిచయం చేసిన చాకలి ఐలమ్మను ఈ సందర్భంగా స్మరించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఎమ్మెల్యే యెన్నం మాట్లాడుతూ ఐలమ్మ బాటలో నడుస్తూ తెలంగాణ మహిళలను శక్తిమంతులుగా చేయడానికి ప్రజా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని పేర్కొన్నారు. మహిళల గౌరవాన్ని పెంచేందుకు మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు పెట్టడం గొప్ప చారిత్రక నిర్ణయమన్నారు. చాకలి ఐలమ్మ ఆశయాలను కొనసాగిస్తామని, భావితరాలకు ఆమె చరిత్రను అందించేందుకు పాఠ్యపుస్తకాలలో పొందుపరుస్తామన్నారు. కార్యక్రమంలో మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, బీసీ వెల్ఫేర్ అధికారి ఇందిర, మార్కెట్ చైర్మన్ బెక్కరి అనిత, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment