నంద్యాల(అర్బన్): ఉపాధి హామీ పథకం కింద నిర్దేశించిన పనులను గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి.. ఎంపీడీఓలు, ఏపీడీలు, క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్లో ఉపాధి హామీ పథకం కింద నిర్దేశించిన లేబర్ బడ్జెట్, వంద రోజుల పనిదినాల కల్పన, హార్టికల్చర్, అవెన్యూ ప్లాంటేషన్ పనులు, సంస్థాగత ప్లాంటేషన్, బ్లాక్ ప్లాంటేషన్, ఫారం పాండ్స్, రూఫ్ టాప్ వాటర్ హార్వెస్టింగ్, పశుసంపద షెడ్లు, ట్రెంచ్ పనుల ప్రగతి లక్ష్యాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా క్లస్టర్ల వారీగా సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 55 ఫారంపాండ్లలో 42 పూర్తి చేశారని, పెండింగ్లో ఉన్న కొత్తపల్లి, బనగానపల్లె, ఉయ్యాలవాడ, మిడుతూరు మండలాల్లో లక్ష్యాన్ని త్వరగా పూర్తి చేయాలని సూచించారు. 427 పశుసంపద షెడ్లకు గాను 32 షెడ్లు పూర్తి చేశారని, పాములపాడు, బనగానపల్లె, గడివేముల మండలాల్లో పెండింగ్లో ఉన్న షెడ్లను వేగంగా పూర్తి చేయాలన్నారు. లేబర్ బడ్జెట్ మొబలైజేషన్లో కొత్తపల్లి, ప్యాపిలి, డోన్, రుద్రవరం, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, అవుకు, కోవెలకుంట్ల, గోస్పాడు, మిడుతూరు తదితర మండలాలు లక్ష్యసాధనలో వెనుకబడి ఉన్నాయని, ప్రగతి సాధించేందుకు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. ప్లాంటేషన్కు సంబంధించి వెలుగోడు, ప్యాపిలి, డోన్, బేతంచర్ల, సంజామల కొలిమిగుండ్ల, శిరివెళ్ల మండలాల్లో లక్ష్యాన్ని చేరుకోలేదని ఈ వారంలోగా ప్రగతి సాధించేందుకు కృషి చేయాలని చెప్పారు. ఉపాధి ఏపీడీలు ప్రతిరోజు తనిఖీలు నిర్వహిస్తూ పనుల వేగవంతానికి కృషి చేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment