సిరిసిల్ల: జిల్లా కేంద్రంలోని ఏకై క మైదానం.. జూనియర్ కళాశాల గ్రౌండ్. ఇక్కడ నిత్యం పిల్లలు ఆటలు ఆడుకుంటారు. పట్టణవాసులు వాకింగ్ చేస్తుంటారు. సిరిసిల్ల నడిబొడ్డున ఉన్న ఈ మైదానం ఏళ్లుగా అందరికీ ఆటలకు, వాకింగ్కు ఉపయోగపడుతుంది. ఈ మైదానాన్ని మరింత అభివృద్ధి చేయాలని, వాకింగ్ ట్రాక్ వేసి, ఒపెన్ జిమ్లను నిర్మించి, గ్యాలరీలతో, క్రీడా ప్రాంగణంగా తీర్చిదిద్దే లక్ష్యంతో 2022లో అప్పటి రాష్ట్ర మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ రూ.2 కోట్లు మంజూరు చేశారు. ఆ నిధులతో చేపట్టిన పనులు ఏడాదిన్నరగా ఎక్కడికక్కడే ఉండడంతో మైదానం మరింత అధ్వానంగా మారింది. ‘ఆ రూ.2 కోట్ల పనులు చేయక ముందే ఈ కాలేజీ గ్రౌండ్ బాగుండే’ అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. మున్సిపల్ ఇంజినీర్ల పట్టింపులేని తనానికి, కాంట్రాక్టర్, పాలకవర్గం నిర్లక్ష్యానికి ఈ మైదానం నిదర్శనంగా నిలుస్తుంది.
మట్టిపోసి చెడగొట్టారు
కాలేజీ గ్రౌండ్ చుట్టూ ప్రహరీ ఉంది. ఎప్పుడు వర్షం పడినా మైదానంలో వరద చేరుతోంది. నీరు వెళ్లిపోయే మార్గం లేక గ్రౌండ్ చెరువులా మారేది. ఈ ఒక్క సమస్య తప్ప పెద్దగా ఏ సమస్య అప్పట్లో లేకుండే. ఈ గ్రౌండ్లో వాకింగ్ ట్రాక్, మురికి కాల్వ, ఆటల భవనం, మరుగుదొడ్లు, గ్యాలరీ, స్వా గత తోరణ ఆర్చీ, గేట్ల నిర్మాణం వంటి పనులకు రూ.2 కోట్లు కేటాయించారు. ఆ నిధులతో టెండర్లు పిలువగా రూ.1.60 కోట్లతో పనులు ప్రారంభించారు. గ్రౌండ్లో మట్టిపోసి మైదానాన్ని చెడగొట్టారు. వర్షం పడితే చాలు.. గ్రౌండ్ అంతా బురదమయంగా మారుతుంది. అడుగు వేయలేం.. పరుగుతీయలేని దుస్థితి నెలకొంది. ఆటల భవనం నిర్మించి, గ్యాలరీ కట్టి వదిలేశారు. 70 శాతం మేరకు పనులు పూర్తయినా ఇంకా 30 శాతం ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. చేసిన పనులకు రూ.45 లక్షల మేర బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. వాటి కోసం కాంట్రాక్టర్ మితతా పనులను వదిలేశారు.
పట్టణ వాసుల అసహనం..
సిరిసిల్ల పట్టణం అభివృద్ధిలో ముందుండగా కాలేజీ మైదానం మాత్రం వెనకబడింది. నిత్యం వాకింగ్ చేసే వారు, ఆడుకునే పిల్లలు మైదానంలో అసంపూర్తి పనులతో ఇబ్బందులు పడుతూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా మున్సిపల్ పాలకవర్గం, అధికారులు మైదానంలో పెండింగ్ పనులు పూర్తి చేసి, వాకింగ్ ట్రాక్, ఒపెన్ జిమ్ను అందుబాటులోకి తెస్తే పట్టణ వాసులకు ఆరోగ్యం, ఆహ్లాదాన్ని పంచినట్లు అవుతుంది. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
చినుకు రాలితే చిత్తడే వాకింగ్ ట్రాక్ లేదు.. ఒపెన్ జిమ్ లేదు అభివృద్ధికి రూ.1.60 కోట్లు.. పనులు జరగక పాట్లు ఇది సిరిసిల్ల కాలేజీ మైదానం దుస్థితి
ఇది సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలోని పైకా భవనం ఎదుట దుస్థితి. పైకా భవనం బోరు నీరు వెళ్లిపోయేందుకు కాల్వ వసతి లేదు. కనీసం ఇంకుడు గుంతైనా లేదు. ఫలితంగా బోరు పెట్టినప్పుడల్లా వృథాగా పోయే నీరు ఇలా మైదానంలో పారుతోంది. బురదమయంగా మారి గ్రౌండ్కు వచ్చేవారికి ఇబ్బందిగా మారుతోంది.
సిరిసిల్ల కాలేజీ మైదానంలో స్నానాల గదులు లేక.. ఇక్కడ ఆటలకోసం వివిధ జిల్లాల క్రీడాకారులు వస్తే ఇలా ఆరు బయటే బోరు వద్ద స్నానాలు చేయాల్సి వస్తుంది. నిజానికి మైదానాన్ని ఆధునీకరిస్తూ స్నానాల గదులు నిర్మించారు. కానీ, వాటిని వినియోగించడం లేదు. ఫలితంగా పొరుగు జిల్లాల ఆటగాళ్లు ఉసూరుమంటూ కాలేజీ గ్రౌండ్లో ఇలా స్నానాలు చేసి జిల్లా కేంద్రం గొప్పదనాన్ని రాష్ట్ర మంతాట చాటిచెబుతున్నారు.
ఇది కూడా కాలేజీ మైదానంలోని ఓ భాగం. చిన్నపాటి వర్షం పడితే చాలు గ్రౌండ్ అంతా చిత్తడిగా మారి ఎందుకూ పనికిరాకుండా పోతోంది. మొన్న స్వాతంత్య్ర దినోత్సవానికి పోలీస్ పరేడ్ నిర్వహించేందుకు తాత్కాలికంగా రాతిడస్ట్ పోసి చదును చేశారు. కానీ మైదానమంతా చేయకపోవడంతో వర్షం పడితే ఇలా బురదమయంగా మారుతుంది. వాకింగ్కు కాదుకదా అడుగుపెట్టేందుకు కూడా ఇబ్బందిగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment