నెల్లూరు(క్రైమ్): జూన్ నాలుగున ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నామని ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ముందస్తు భద్రత చర్యలు చేపట్టామని వివరించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పెట్రోల్, డీజల్ లూజు విక్రయాలు నిషేధమని, ఈ మేరకు జిల్లాలోని పెట్రోల్ బంకు యజమానులకు నోటీసులను జారీ చేశామని వివరించారు. ఆదేశాలను ఉల్లంఘించి ఉదయగిరిలో లూజు విక్రయాలకు పాల్పడిన పెట్రోల్ బంకు యజమాని, కొనుగోలు చేసిన బండగానిపల్లికి చెందిన వ్యక్తులపై కేసులు నమోదు చేశామని తెలిపారు. ఎన్నికల నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలని, ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
కమనీయం ప్రసన్న
విశ్వేశ్వరుడి కల్యాణం
ఇందుకూరుపేట: మైపాడులో కొలువైన అన్నపూర్ణాంబ సమేత ప్రసన్న విశ్వేశ్వరుడి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని కల్యాణోత్సవాన్ని కనులపండువగా గురువారం నిర్వహించారు. ఆలయ అర్చకుడు బండారు ప్రభాకర్శర్మ ఆధ్వర్యంలో వేడుకను జరిపారు. ఉభయకర్తలుగా గంపల రామసుబ్బయ్య, వారి కుమారులు వ్యవహరించారు. అనంతరం గజవాహనసేవ వేడుకగా సాగింది. ఆలయ చైర్మన్ కనుపూరు సురేంద్రబాబు పాల్గొన్నారు.
స్ట్రాంగ్ రూమ్లో పరిశీలన
నెల్లూరు (దర్గామిట్ట): కనుపర్తిపాడులోని ప్రియదర్శిని కళాశాలలో ఈవీఎంలను భద్రపర్చిన స్ట్రాంగ్ రూమ్లను కలెక్టర్ హరినారాయణన్, ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ గురువారం పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్లను సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ చేస్తున్న కంట్రోల్ రూమ్ను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.
కనులపండువగా రథోత్సవం
నెల్లూరు సిటీ: నరసింహకొండపై వెలసిన వేదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని రథోత్సవాన్ని వేడుకగా గురువారం నిర్వహించారు. ప్రధానార్చకుడు భాస్కరాచార్యులు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలను జరిపారు. ఉభయకర్తలుగా భారతిరెడ్డి, శ్రీకళ, మాధవీలత వ్యవహరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. దేవదాయ శాఖ జిల్లా అధికారి శ్రీనివాసరావు, ఈఓలు గిరికృష్ణ, కృష్ణప్రసాద్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో చండీహోమం
నెల్లూరు(బృందావనం): వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకొని మూలాపేటలోని శంకరమఠంలో చండీహోమాన్ని కంచికామకోటి పీఠానికి చెందిన వేదపండితుడు సోమేశ్వరశర్మ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఉభయకర్తలుగా సోమేశ్వర దీక్షిత్ దంపతులు వ్యవహరించారు. మఠం నిర్వాహకులు కొర్రపాటి నందకిషోర్, ఉషాకుమారి దంపతులు పర్యవేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment