బత్తలపల్లి: నిబంధనలకు విరుద్ధంగా మరమగ్గాలపై చేనేత ఉత్పత్తులను నేస్తున్న జేఆర్ సిల్క్స్ పరిశ్రమ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలంటూ ఏపీ చేనేత కార్మిక పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. డిమాండ్ సాధనలో భాగంగా బత్తలపల్లి మండలం వేల్పుమడుగు క్రాస్ వద్ద ఉన్న జేఆర్ సిల్క్స్ పరిశ్రమ వద్ద కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో చేనేత కార్మికులు గురువారం ధర్నా చేపట్టారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు డి.జగదీష్, జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్, ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పిల్లలమర్రి నాగేశ్వరరావు, మాధవస్వామి, పిల్లలమర్రి బాలకృష్ణ, శివదుర్గారావు, జాతీయ చేనేత ఐక్య వేదిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీలూరి రుషింగప్ప తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జేఆర్ పరిశ్రమ నిర్వాహకుల అక్రమాలపై నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మిక సంఘాలు ఏకమయ్యాయన్నారు. దాదాపు 200 జెట్ స్పీడ్ మగ్గాలు ఏర్పాటు చేసి చేనేత ఉత్పత్తులను మరమగ్గాలపై నేస్తూ చేనేత వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. చేనేత ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయాన్ని ధర్మవరంలో ఏర్పాటు చేసేలా జిల్లా మంత్రులు చొరవ తీసుకోవాలని డిమాండ్చేశారు. అనంతరం ఫ్యాక్టరీలోకి బలవంతంగా ప్రవేశించేందుకు ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకుని స్టేషన్కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లి పెద్దన్న, జిల్లా కార్యదర్శి మారుతి, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి మధు, సీపీఎం పట్టణ కార్యదర్శి మారుతి, ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పోలా లక్ష్మీనారాయణ, వెంకటనారాయణ, వెంకటస్వామి, గంగాధర్, ఏఐటీయూసీ నాయకులు రమణ, సీఐటీయూ జిల్లా కార్యదర్శి జేవీ రమణ, ఎస్హెచ్ బాషా, ఆదినారాయణ, హరి, వెంకటస్వామి, రాజగోపాల్, నారాయణస్వామి, సీపీఐ పట్టణ కార్యదర్శి రవి, వ్యకాసం జిల్లా కార్యదర్శి కుళ్లాయప్ప, బత్తలపల్లి మండల కార్యదర్శి వెంకటేష్, యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు రాజా, పోతులయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment