
15లోగా పెద్దమార్కెట్ కూల్చేయండి
శ్రీకాకుళం:
జిల్లా కేంద్రంలోని పొట్టి శ్రీరాములు కూరగాయల మార్కెట్(పెద్ద మార్కెట్)ను ఈ నెల 15 లోగా కూల్చేయాలని కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్నాయుడు, కింజరాపు అచ్చెనాయుడులు ప్రకటించడం వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశమైంది. మరో వారం రోజులు మాత్రమే గడువు ఉండగా వ్యాపారాలను ప్రత్యామ్నాయ స్థలాల్లోకి మార్చాలని ఆదేశించడం ఏకపక్ష నిర్ణయమని పలువురు వ్యాపారాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో దూడ భవానీశంకర్ మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పెద్ద మార్కెట్లో ఆకస్మిక తనిఖీ పేరుతో పర్యటించి కోటి రుపాయలతో అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. దానిని హామీగానే మిగిల్చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో 2004లో మార్కెట్ సమస్యను అప్పటి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అప్పటి సీఎం రాజశేఖరరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా రూ.4 కోట్లతో మార్కెట్ను అభివృద్ధి చేసిన విషయాన్ని వ్యాపార వర్గాలు ఇప్పుడు గుర్తుకు తెచ్చుకుంటున్నాయి. వ్యాపారుల్లో రెండు వర్గాలు కోర్టులను ఆశ్రయించడం, కొందరు కుఠిల రాజకీయాలు చేయడంతో మార్కెట్లోని 40 శాతం దుకాణాలు ఖాళీగా ఉండిపోయాయి. ఈ సమస్యను పరిష్కరించి షాపులన్నీ అందుబాటులోకి తీసుకువస్తే సమస్య ఉండదు. అలాకాదని, అభివృద్ధి చేయడం మంచిదే అయినప్పటీకీ వ్యాపార వర్గాలను సంప్రదించకుండా వారమే గడువిచ్చి షాపులు ఖాళీ చేయించాలని హుకుం జారీ చేయడం పట్ల వ్యాపార వర్గాలు బెంబేలెత్తిపోతున్నాయి. మార్కెట్లో వ్యాపారం చేస్తున్నవారు చాలా మంది నష్టాల బారిన పడి ఐపీ పెట్టి వెళ్లిపోవడం, కొందరు కనిపించకుండా పోవడం వంటి ఎన్నో జరిగాయి. ఇటువంటి వాటిని తలచుకొని పలువురు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కేంద్ర, రాష్ట్ర మంత్రుల ఏకపక్ష నిర్ణయం
మండిపడుతున్న వ్యాపారులు
రాష్ట్రానికి ఆదర్శంగా పొట్టిశ్రీరాములు మార్కెట్
శ్రీకాకుళం: నగరంలోని పొట్టి శ్రీరాములు కూరగాయల మార్కెట్ను రాష్ట్రానికి ఆదర్శంగా తీర్చి దిద్దుతామని కేంద్ర రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్నాయుడు, అచ్చెన్నాయుడు చెప్పారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్, కలెక్టర్ స్వప్నిక్ దినకర్ పుండ్కర్తో కలిసి మార్కెట్ను పరిశీ లించారు. ఈ నెల 15లోగా ప్రత్యామ్నాయ స్థలంలోకి మార్చి యూ ఆకారంలో షాపులు నిర్మించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం మార్కెట్ అస్తవ్యస్తంగా ఉందని, వినియోగదారులు నడిచేందుకు, షాపింగ్ చేసేందుకు అనుకూలంగా లేదన్నారు. వ్యాపారులతో సదస్సు నిర్వహంచి ప్రత్యామ్నాయ స్థలం కేటాయించనున్నట్లు వివరించారు. మున్సిపాల్ కార్యాలయాన్ని ప్రజా భాగస్వామ్యంతో పునర్నిర్మిస్తామని, ఒక అంతస్తులో కార్యాలయం, మిగిన వాటిలో వ్యాపార సముదాయాలు ఉంటాయన్నారు. త్వరలో ఇంటిగ్రేట్డ్ కలెక్టరేట్లోకి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు తరలిపోతాయని చెప్పారు. కార్యక్రమంలో కమిషనర్ ప్రసాదరావు, వర్తక సంఘం అధ్యక్షుడు కోరాడ హరగోపాల్, టీడీపీ పట్టణ అధ్యక్షుడు మాదారపు వెంకటేష్ పాల్గొన్నారు.