ధారూరు: బీఆర్ఎస్ హయాంలో అధికార బలంతో భూ కుంభకోణాలకు పాల్పడమే కాకుండా.. అమాయకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించిన ఘనుడు మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనందేనని కాంగ్రెస్ నాయకులు ధ్వజమెత్తారు. ధారూరులోని శుభం ఫంక్షన్ హాలులో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మాన్సింగ్, ఏఎంసీ చైర్మన్ విజయభాస్కర్రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రాములు తదితరులు మాట్లాడారు. మర్పల్లిలో జరిగిన చిన్న విషయాన్ని పెద్దదిగా చేశారని ఆరోపించారు. మచ్చలేని నాయకుడైన స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్పై చవకబారు విమర్శలు చేయడం ఆనంద్ దిగజారుడు తనానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఆయన స్వగ్రామంలోని 70 ఎకరాల అసైన్డ్ భూములను 40 మంది రైతులు సాగు చేసుకుంటుండగా.. కేవలం తన తల్లి పేరున మూడెకరాలకు పట్టా పొంది, ఇతర రైతులకు మొండిచేయి చూపాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వందేళ్లుగా నిజాం వారసురాలి భూములను సాగు చేసుకుంటున్న గిరిజనులకు పట్టాలు ఇప్పించాల్సింది పోయి 73 ఎకరాల భూమిని ఓ కంపెనీకి కట్టబెట్టారని మండిపడ్డారు. బూర్గుగడ్డలో 36 ఎకరాల భూమిని ఇతరులకు అమ్మించారని ఆరోపించారు. బినామీ పేర్లతో వందల ఎకరాలు అన్యాక్రాంతం చేసిన వ్యక్తి ఆనంద్ అని విమర్శించారు. సర్పన్పల్లి ప్రాజెక్టు విషయంలో తహసీల్దార్ను బెదిరించడం, జెడ్పీ మాజీ చైర్పర్సన్ సునీతారెడ్డి వాహనంపై దాడి వంటి దుశ్చర్యలకు పాల్పడింది నీవు కాదా అని ప్రశ్నించారు. పదవి పోయిన విషయాన్ని విస్మరించి.. ఇప్పటికీ తానే ఎమ్మెల్యేలా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ ఎల్.అశోక్ ముదిరాజ్, కాంగ్రెస్ నాయకులు పాండునాయక్, బుజ్జయ్యగౌడ్, రాంరెడ్డి, హన్మయ్య, మల్లారెడ్డి, బసప్ప, వాణి, రాజేందర్, రమేశ్కృష్ణ, లాల్ అహ్మద్, టి.మల్లేశం, అమరేశ్వర్రావు, కృష్ణారెడ్డి, ముజాఫర్ తదితరులు పాల్గొన్నారు.
దాడులతోపాటు అక్రమ కేసులు పెట్టించిందీ ఆయనే
మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్పై కాంగ్రెస్ నేతల మండిపాటు
Comments
Please login to add a commentAdd a comment