రామక్షేత్రంలో.. శివారాధన
సాక్షి ప్రతినిధి, విజయనగరం:
వైష్ణవ దేవాలయంలో శివారాధన అత్యంత అరుదు. అలాంటి అద్భుతం ఏటా ‘రామతీర్థం’ ఆలయంలో ఆవిష్కృతమవుతోంది!. ఉత్తరాంధ్రలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన నెల్లిమర్ల మండలం రామతీర్థం గ్రామంలో కొలువైన రామాలయంలో ఏటా శివరాత్రి జాతర అంగరంగ వైభవంగా జరగడం విశేషం. శివరాత్రికి రెండు రోజుల పాటు జరిగే ఉత్సవాలకు విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల నుంచే కాకుండా పొరుగున ఒడిశా రాష్ట్రం నుంచి వేలాదిగా భక్తులు ఈ క్షేత్రానికి తరలివస్తుంటారు. రామతీర్థం ఉత్తర రాజగోపురానికి ఎదురుగా నిలువుటద్దంలా కనిపించే బోడికొండ ఒక దశాబ్దాల అద్భుతంగా అలరారుతోంది. మరో వైపు బౌద్ధులు నడయాడిన గురుభక్తుల కొండ.. ఎదురుగా పచ్చని నీటితో కనిపించే రామకోనేరు.. ఇలా ఆ ప్రాంత మంతా అత్యంత సుందర నిలయమై భక్తులకు, పర్యాటకులకు కనువిందు చేస్తోంది.
● రామతీర్థ మహత్యం..
ద్వాపర యుగంలో పాండవులు అరణ్యవాసానికి వెళుతూ శ్రీకృష్ణపరమాత్మను కూడా తోడు రమ్మని అడిగారు. అందుకు కృష్ణ పరమాత్మ వారితో.. తాను రామావతార సమయంలో దండకారణ్య ప్రాంతంలో సీతాలక్ష్మణ సమేతుడనై సంచరించానని, ఆనాటి రామావతారాన్ని భక్తి శ్రద్ధలతో పూజిస్తే వనవాస కాలంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని పాండవులకు చెప్పాడు. సీతారామలక్ష్మణ స్వామి విగ్రహాలను స్కృష్టించి పాండవులకు అందించాడు. శ్రీకృష్ణుడు ఉపదేశించిన విధంగా పాండవులు రామతీర్థం ప్రాంతంలో రాముడి దేవాలయాన్ని నిర్మించారని, స్వామివారిని సేవించి వనవాసాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేశారని ప్రతీత. తర్వాత పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్తూ నిర్మించిన దేవాలయాన్ని పరమ నిష్టాగరిష్టుడైన వేదగర్భుడు అనే వైష్ణవుడికి అప్పగించి వెళ్లిపోయాడు. ఆ వేదగర్భుడు, వారి పుత్ర పౌత్రాదులు స్వామివారిని సేవిస్తూ ఉండేవారు. కొంతకాలం తరువాత బౌద్ధ భిక్షువులు ఆ ప్రాంతాన్నే కేంద్రంగా చేసుకొని వారి మత ప్రచారాన్ని చేసుకుంటూ కాల క్రమేపి రామతీర్థం ప్రాంతాన్ని ఆక్రమించారు. వాళ్ల మత సిద్ధాంతాలకు భయపడిన వేదగర్భుని వంశీయులు సీతా రామలక్ష్మణ విగ్రహాలను భూగర్భంలో దాచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్లి పోయారు.
శివరాత్రి జాగరణ...
ఏటా రామస్వామివారి కల్యాణోత్సవాలు, రథయాత్ర, మహాశివరాత్రి, శ్రీరామనవమి ఉత్సవాలు, జ్యేష్టాభిషేకాలు, విఖసన జయంతి, పవిత్రోత్సవాలు, శ్రీవారి బ్రహ్మోత్సవాలు, తెప్పోత్సవం, గోపురోత్సవం, అధ్యయనోత్సవాలు, వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతుంటాయి. ఏటా ముక్కోటి ఏకాదశి పర్వదినాన అశేష జనావళి నడుమ గిరి ప్రదక్షణం జరుగుతుంది. వైష్ణవాలయంలో శివరాత్రి ఉత్సవాలు జరపడమనేది ఇక్కడి ప్రత్యే కత. ఆ ఉత్సవాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు ముందురోజే క్షేత్రానికి చేరుకుని కోనేటిలో స్నానమాచరించి నిష్టాగరిష్టులై శివరాత్రి జాగరణ చేసి తరిస్తుంటారు.
నీటి మడుగులో విగ్రహాలు
విజయనగరం పూసపాటి వంశీయులు 1650వ సంవత్సరంలో కుంభిళాపురం (నేడు కుమిలి గ్రామం)ను రాజధానిగా చేసుకొని పాలిస్తుండేవారు. ఆ గ్రామానికి చెందిన ఏకుల వంశానికి చెందిన ఓ ముసలావిడ కట్టెల కోసం వెళ్లి అరణ్యంలో చిక్కుకుంది. ఆమె నిస్సహాయ స్థితిని చూసి స్వామివారు ప్రకాశవంతమైన తేజస్సుతో దర్శనమిచ్చి కాపాడారు. మేము ఇక్కడ కొలువై ఉన్నామని, మాకు దేవాలయం నిర్మించమని రాజుతో చెప్పమని సాక్షాత్తూ స్వామివారే ఆమెకు చెప్పారట. మరుసటి రోజు తెల్లవారు జామున రాజు కలలో కూడా సాక్షాత్కరించి ముదు సలి చెప్పి నట్లు చేయమని ఆజ్ఞాపించారు. ఉదయం ముదుసలి చెప్పినట్లుగా పుణ్యస్థలానికి చేరుకొని వెతికితే నీటిమడుగులో సీతారామ లక్ష్మణుల ప్రతిమలు కనిపించాయి. దేవాలయ నిర్మాణానికి ఆ రాజు 1200 ఎకరాల పంట భూమిని రాసిచ్చి భీష్మ ఏకాదశి రోజున స్వామివారి విగ్రహాలను ప్రతిష్టించారు. అప్పటి నుంచి నేటికీ శ్రీరామచంద్రమూర్తి భక్తుల నుంచి విశేష పూజలందుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment