ఆ అధికారులపై చర్యలు ఉండేనా?
● స్టేషన్లలో పంచాయితీలకే ప్రాధాన్యం
● డీజీపీకి ఫిర్యాదుల వెల్లువ
● వివాదంగా మారుతున్న కమిషనరేట్ పరిధి
కొందరు అధికారులు తీరు
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న కొంతమంది పోలీస్ అధికారులపై వస్తున్న ఆరోపణలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. అక్రమార్జనే ధ్యేయంగా చేస్తున్న పనులు వివాదాస్పదమవుతున్నాయి. బాధితులకు అండగా ఉండాల్సిన వీరు అక్రమార్కులకు దన్నుగా నిలుస్తున్న సందర్భాలు వెలుగు చూస్తున్నాయి. భూ పంచాయితీల్లో జోక్యంపై ఉన్నతాధికారులు హెచ్చరించినా కొందరిలో మార్పు రావడం లేదు. దీంతో ఏకంగా బాధితులు నేరుగా రాష్ట్ర డీజీపీ జితేందర్ను కలిసి గోడు వెల్లబోసుకుంటున్నారు. తాజాగా మామునూరు స్టేషన్ ఇన్స్పెక్టర్ ఒంటేరు రమేశ్పై డీజీపీకి ఫిర్యాదు అందింది. కొన్ని రోజుల క్రితం ఆత్మకూరు ఇన్స్పెక్టర్ సంతోశ్ తనను పోలీస్స్టేషన్కు రావొద్దని ఇష్టారీతిన దూషించినట్లు పేర్కొంటూ ఓ బాధితుడు డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఓ సీనియర్ ఇన్స్పెక్టర్ భూ కబ్జాకు పాల్పడి, తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ మరో బాధితుడు సీఎం నిర్వహించే ప్రజావాణికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా నిఘా విభాగం అధికారులతో విచారణ చేయిస్తున్నారు.
కొందరు అధికారులకు స్వర్ణయుగం
వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝాకు మిస్టర్ కూల్గా పేరుంది. దీన్ని ఆసరాగా.. అవకాశంగా తీసుకుంటున్న కొంతమంది పోలీస్ అధికారులు భూ పంచాయితీలు చేస్తూ జేబులు నింపుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరి అక్రమాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందినా సకాలంలో చర్యలు ఉండకపోవడం, వారిని కట్టడి చేయకపోవడం వల్ల చివరికి ఫిర్యాదులు డీజీపీ వరకు వెళ్తున్నట్లు ప్రచారం సాగుతోంది. పోస్టింగ్ను అడ్డుపెట్టుకొని అడ్డుగోలుగా సంపాదిస్తున్న అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కమిషనరేట్లో కొంతమందికి ప్రస్తుతం సర్ణయుగం నడుస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సరిహద్దు వివాదం.. కమిషనరేట్కు మచ్చ?
ఈనెల 20న రాత్రి అమ్మవారిపేట, భట్టుపల్లి మధ్య యువవైద్యుడిపై జరిగిన హత్యాయత్నం ఘటనలో మిల్స్కాలనీ, మడికొండ పోలీస్ స్టేషన్ల అధికారులు, కాజీపేట, వరంగల్ ఏసీపీలు సరిహద్దు విషయంలో పడిన గొడవ వరంగల్ పోలీస్ కమిషనరేట్కు మాయని మచ్చగా మారినట్లు ప్రచారం సాగుతోంది. బాధితుడు రక్తపుమడుగులో ఉండగానే ఈ పరిధి తమది కాదంటే తమది కాదని అధికారులు వాగ్వాదానికి దిగడంతోపాటు ఎవరూ సరైన సయయంలో స్పందించలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చివరికి ఓ బెల్ట్షాప్ యజమానిని నువ్వు ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం కోనుగోలు చేస్తావని పోలీసులు తెలుసుకొని సరిహద్దు సమస్యను పరిష్కరించుకోవడం ఆ అధికారుల పనితీరుకు అ ద్దం పడుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
చర్యలు ఎందుకు ఉండట్లేదు?
వరంగల్ పోలీస్ కమిషనరేట్లో పనిచేస్తున్న కొంతమంది అధికారులు నిబంధనల గీతను దాటుతున్నా ఉన్నతాధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఆరోపణలు రావడం సహజమైనప్పటికీ విచారణలో నిజం తెలిసినా వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదో అర్థం కావడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఈ అధికారులు కాస్త ముదురు...
పరకాల సబ్ డివిజన్ పరిధిలో భూ పంచాయితీలకు వేదికై న ఓ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ వాటికే ప్రాధాన్యం ఇచ్చినా.. బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని సమాచారం.
అదే సబ్ డివిజన్ పరిధిలో ఓ ఇన్స్పెక్టర్ తన మద్యం మామూళ్లను పెంచుకుని దుకాణాల యజమానులకు ఫోన్లు చేసి హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. సదరు అధికారి తీరుపై ఇప్పటికే ఫిర్యాదులు అందాయి. దీంతోపాటు ఇటీవల విధుల్లో చేరిన కొత్త కానిస్టేబుళ్లను నోటికి వచ్చినట్లు తిడుతున్నట్లు సమాచారం.
మామునూరు సబ్ డివిజన్ పరిధిలోని ఓ పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న ఓ అధికారి మామూళ్లను పెంచడం, ఇన్స్పెక్టర్కు పంచడం, పంచాయితీల్లో దండుకొని వాటాలు పంచడంలో ఘనాపాటిగా పేరుంది. ఇన్స్పెక్టర్ సైతం భూపంచాయితీల్లో మునిగిపోగా, సదరు సబ్ ఇన్స్పెక్టర్ అందినకాడికి దండుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వరంగల్ సబ్ డివిజన్ పరిధిలోని ఓ పోలీస్ స్టేషన్కు భూ పంచాయితీల్లో పెట్టింది పేరు. నిత్యం వందలాది ఫిర్యాదులు. ఏ ఫిర్యాదును ముట్టుకున్నా భూ వివాదమే. దీంతో ఓ అడుగు ముందుకేసి సదరు ఇన్స్పెక్టర్ వాటి పంచాయితీలకు మొదటి ప్రాధాన్యం.. ఆ తర్వాతే లా అండ్ ఆర్డర్ అన్నట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
హనుమకొండ సబ్ డివిజన్ పరిధిలోని ఓ పోలీస్ స్టేషన్లో సదరు ఇన్స్పెక్టర్ నిబంధనలు ఎలా ఉన్నా భూ పంచాయితీల్లో తనకు నచ్చని వర్గంపై కేసు నమోదు చేయడం, మరో వర్గాన్ని భయబ్రాంతులకు గురిచేయడం అలవాటుగా మార్చుకున్నట్లు సమాచారం.
ప్రభుత్వానికి నివేదికలు
కొంతమంది పోలీస్ అధికారులపై స్థానిక ప్రజాప్రతినిధుల అండదండలు ఉన్నప్పటికి వారు చేస్తున్న దందాలపై నిఘా వర్గాల ద్వారా ప్రభుత్వానికి నివేదికలు అందుతున్నట్లు సమాచారం. అక్రమాలకు పాల్పడే అధికారులపై చర్యలు తీసుకోకపోవడంపై కొంతమంది ఆ శాఖ అధికారులే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. కొంతమంది ఎమ్మెల్యేలు సైతం ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. రాష్ట్ర ఉన్నతాధికారుల సూచనల మేరకు భూ పంచాయితీల్లో తలదూరుస్తున్న అధికారులపై చర్యలు తీసుకుంటారా..లేదా అన్నది వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment