
డబ్బులు తీసుకోం.. బంగారమే ఇవ్వాలి
రాయపర్తి: డబ్బులు తీసుకోం.. మేం కుదువపెట్టిన బంగారం మాత్రమే ఇవ్వాలి.. బ్యాంకు అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని ఖాతా దారులు మండిపడ్డారు. ఈ మేరకు మండల కేంద్రంలోని ఎస్బీఐ ఎదుట వారు శుక్రవారం ఆందోళన నిర్వహించారు. బ్యాంకు అధికారులను బయటకు పంపించి గేటుకు రెండు తాళాలు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఖాతాదారులు మాట్లాడుతూ 2024 నవంబర్ 19న ఎస్బీఐ నుంచి 19 కిలోల బంగారాన్ని దొంగులు దోచుకెళ్లారని తెలిపారు. నెల క్రితం బ్యాంకుకు వస్తే న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇచ్చారని గుర్తుచేశారు. శుక్రవారం ఉన్నతాధికారులు వచ్చారని తెలియడంతో బ్యాంకుకు వచ్చామని పేర్కొన్నారు. అధికారులు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో ఆగ్రహంతో బ్యాంకు గేటుకు తాళాలు వేసి ఆందోళన చేసినట్లు ఖాతాదారులు వివరించారు. ఇక్కడ న్యాయం జరగకపోతే మెయిన్ బ్రాంచ్కు వెళ్లి తాళాలు వేస్తామని హెచ్చరించారు. మేం కుదువపెట్టిన బంగారం మాత్రమే ఇవ్వాలని, తులం బంగారానికి రూ.77,710 ఇస్తామని అధికారులు బ్యాంకు చుట్టూ తిప్పించుకుంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యంతోనే బంగారం చోరీకి గురైందని చెప్పారు. పోలీసులు సర్దిచెప్పడంతో ఖాతాదారులు ఇళ్లకు వెళ్లిపోయారు.
రాయపర్తిలో ఎస్బీఐ
ఖాతాదారుల డిమాండ్
బ్యాంకు గేటుకు తాళాలు వేసి ఆందోళన
90 తులాల బంగారం పోయింది..
12 సంవత్సరాలు కష్టపడి సంపాదించిన సుమారు 90 తులాల బంగారం పోవడంతో ఒక్కసారిగా ప్రాణం పోయినంత పనైంది. హైదరాబాద్లో ఉంటూ అక్కడే కుదువపెట్టుకోకుండా మా గ్రామం పక్కనే ఉన్న ఎస్బీఐలో రూ.24 లక్షలకు బ్యాంకులో కుదువపెట్టుకున్నం. బ్యాంకు అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధాకరం. ఇప్పటికై నా మా బంగారం మాకే ఇవ్వాలి. డబ్బులు కట్టిస్తామంటే ఊరుకునేదిలేదు.
–శిరీష, మైలారం గ్రామం
బంగారం ఇస్తామన్నారు..
నేను బ్యాంకులో 13 తులాల బంగారం తాకట్టు పెట్టిన. బంగారం పోయి ఐదు నెలలు కావొస్తున్నా బ్యాంకు అధికారులు మాత్రం పట్టింపులేకుండా వ్యవహరిస్తున్నారు. గురిజంత బంగారం కూడా పోదు. బంగారం ఇస్తామని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికై నా మా బంగారాన్ని ఇప్పించాలి.
– గిర్క సాయిరెడ్డి,
మహబూబ్నగర్ గ్రామం

డబ్బులు తీసుకోం.. బంగారమే ఇవ్వాలి

డబ్బులు తీసుకోం.. బంగారమే ఇవ్వాలి