అర్వపల్లి: ఉపాధి హామీ పథకం పనులకు కూలీలను తీసుకెళ్తున్న ఆటో బోల్తాపడి 20 మంది వరకు కూలీలకు గాయాలయ్యాయి. ఈ సంఘటన జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కూలీలు సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎస్సారెస్పీ కాలువలను ఉపాధిహామీ పథకం పనుల్లో భాగంగా శుభ్రం చేయడానికి శుక్రవారం ఆటోలో బయలుదేరారు. ఈ క్రమంలో కాలువ కట్టపై గుంత వద్ద ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన ఉపాధి కూలీలు కోడెబోయిన భాగ్యమ్మ, కోడెబోయిన రామనర్సమ్మ, గుడిపల్లి అరుణ, వేములకొండ రామనర్సమ్మ, ఎరగాని వెంకటమ్మ, వేములకొండ నాగమ్మ, పేరెల్లి లక్ష్మీనర్సమ్మ, అంబటి యాదమ్మ, ఇందుర్తి కమలమ్మ, చామకూరి పద్మ, చామకూరి లింగమ్మ, బొల్లం రాంబాయమ్మ, మద్ది ప్రమీల, ఇందుర్తి రంగనాయకమ్మ, జానమ్మ, కవిత, సైదమ్మతో పాటు మరికొందరు గాయపడ్డారు. వారిని వెంటనే అంబులెన్స్, మరో వాహనంలో సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. వారికి డాక్టర్లు వైద్యచికిత్స చేయగా సాయంత్రం ఇళ్లకు చేరుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment