Visakhapatnam
-
ఉక్కు కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె చర్చలు అసంపూర్ణం
ఉక్కునగరం: స్టీల్ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపుపై రీజనల్ లేబర్ కమిషనర్(ఆర్ఎల్సీ) మొహంతి సమక్షంలో జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె నోటీసుపై ఆర్ఎల్సీ మంగళవారం ఉక్కు యాజమాన్యం, కాంట్రాక్టర్ల అసోసియేషన్, కార్మిక సంఘాల ప్రతినిధులతో సమావేశమైంది. కార్మికుల తొలగింపుపై కమిటీ వేస్తామని యాజమాన్యం ప్రతినిధులు తెలపగా పోరాటం కొనసాగిస్తామని కార్మిక సంఘాలు తేల్చి చెప్పాయి. కార్మిక నాయకులు అందించిన వివరాలు.. తొలగింపు అంశాన్ని కార్మిక సంఘాలు ప్రస్తావించగా, కంపెనీ పరిస్థితుల దృష్ట్యా సిబ్బంది తగ్గింపు చేపట్టామని యాజమాన్యం తెలిపింది. సుదీర్ఘంగా జరిగిన చర్చల్లో ఇటీవల బయోమెట్రిక్ నుంచి తొలగించిన 248 కాంట్రాక్ట్ కార్మికులను పునరుద్దరించాలని యాజమాన్యానికి ఆర్ఎల్సీ సూచించారు. పర్మినెంట్ కార్మికుల వలే కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు నచ్చినట్లు చేయకూడదన్నారు. దీనిపై కమిటీ ఏర్పాటు చేస్తామని యాజమాన్యం ప్రతినిధులు తెలిపారు. కార్మికుల తొలగింపు పూర్తి నిలుపుదలపై యాజమాన్యం హామీ ఇవ్వకపోవడంతో తమ పోరాటం కొనసాగుతుందని కార్మిక సంఘాల నాయకులు ఆర్ఎల్సీకు రాతపూర్వకంగా తెలిపారు. సమావేశంలో యాజమాన్యం తరపున జీఎం ఎం.మధుసూదనరావు, ఖర్, వైహెచ్ శంకర్, వివిధ కార్మిక సంఘాల నాయకులు కె.ఎం.శ్రీనివాస్, జి.శ్రీనివాసరావు, నమ్మి రమణ, మంత్రి రవి, కె.వంశీకృష్ణ, జి.సత్యారావు, టి.గుర్నాథ్, జి.అప్పన్న, యు.అప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
డిగ్రీ ప్రవేషాలు
● అఫిలియేషన్ గ్రీన్ సిగ్నల్రాకముందే అడ్మిషన్ల వేట ● ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో తనిఖీలు శూన్యం ● ఇతర రాష్ట్రాల బోర్డు సర్టిఫికెట్లకు జెన్యూనిటీ ఎంత? ● కాలేజీల నిర్వహణపై దృష్టి పెట్టని ఏయూ విశాఖ విద్య: ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేట్ డిగ్రీ కళాశాలల నిర్వాహకులు అప్పుడే అడ్మిషన్ల వేట మొదలుపెట్టారు. ‘మా కళాశాలలో చేరితే ఫీజు రాయితీ, ప్లేస్మెంట్ గ్యారెంటీ’ అంటూ ఆకర్షణీయమైన బ్రోచర్లను చేతుల్లో పెట్టి విద్యార్థులకు వల వేస్తున్నారు. విశాఖ నగరంలోని ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద ఎక్కడ చూసినా ఈ హడావిడి కనిపిస్తోంది. ఉన్నత విద్యా మండలి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకముందే 2025–26 విద్యా సంవత్సరానికి ముందస్తు అడ్మిషన్లు చేస్తుండటం గమనార్హం. దీని వెనుక కూటమి ప్రభుత్వంలోని పెద్దలతో అంటకాగే ఆంధ్ర యూనివర్సిటీలోని కొంతమంది అధికారుల ప్రమేయం ఉందనే ప్రచారం సాగుతోంది. వర్సిటీ నుంచి అఫిలియేషన్ వచ్చేలా తాము చూసుకుంటామని భరోసా ఇస్తుండటంతోనే ప్రైవేట్ కళాశాలల నిర్వాహకులు అడ్డదారులు తొక్కుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఏటా 25 వేల మందికి పైగానే డిగ్రీలో చేరిక ఆంధ్ర యూనివర్సిటీ అఫిలియేషన్తో ఉమ్మడి విశాఖ జిల్లాలో 196 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. 38 కళాశాలల్లో డిగ్రీ, పీజీ కోర్సులు కలిపి ఒకే ప్రాంగణంలో నిర్వహిస్తున్నారు. వీటిలో ఏటా డిగ్రీ మొదటి సంవత్సరంలో 25 వేల మందికి పైగానే విద్యార్థులు చేరుతుంటారు. ఈ కళాశాలల నిర్వహణకు ఏటా ఆంధ్ర యూనివర్సిటీ అఫిలియేషన్ (గుర్తింపు) ఇవ్వాల్సి ఉంటుంది. ఉన్నత విద్యా మండలి ఆన్లైన్ ప్రవేశాల వెబ్సైట్లో వర్సిటీ అఫిలియేషన్ పొందిన కళాశాలల జాబితానే పెడతారు. ఇతర రాష్ట్రాల బోర్డు సర్టిఫికెట్లపై పరిశీలన నిల్ ఉద్యోగ, ఉపాధి, వ్యాపార పరమైన వ్యవహారాలతో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు నగరంలో స్థిరపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇంటర్మీడియట్ స్థాయిలో ఇతర రాష్ట్రాలకు చెందిన బోర్డులు జారీ చేసే సర్టిఫికెట్లతో ఇక్కడ డిగ్రీలో ప్రవేశాలు పొందుతున్నారు. అయితే వీటిలో జెన్యూనిటీ ఎంత అనేది పరిశీలన లేకపోవడంతో కొన్ని కళాశాలల్లో నకిలీ సర్టిఫికెట్లతో డిగ్రీ అడ్మిషన్లు పొందుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ద్వారకానగర్లోని ఓ డిగ్రీ కళాశాలలో ఇలాంటివి వెలుగులోకి వచ్చినప్పటికీ కళాశాల యాజమాన్యం వీటిని తొక్కిపెట్టినట్లు తెలుస్తోంది. యూనివర్సిటీ అధికారులు ఇలాంటి వాటితో తమకు సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తుండటంతో కొంతమంది ఏజెంట్లు ఇతర రాష్ట్రాల బోర్డుల్లో ఓపెన్ విధానంలో చదివినట్లు విద్యార్థులకు నకిలీ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అఫిలియేషన్ ఇవ్వడమే మా పని ప్రైవేట్ కాలేజీల నిర్వహణకు అఫిలియేషన్ ఇవ్వడమే యూనివర్సిటీ పని. మిగతా వ్యవహారాలన్నీ ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో జరుగుతుంది. డిగ్రీలో చేరే విద్యార్థులు సమర్పించే సర్టిఫికెట్లు జెన్యూనిటీ పరిశీలన కూడా కాలేజీల వారే చూసుకోవాలి. – ఆచార్య టి.వి.కృష్ణ, ఆంధ్రా యూనివర్సిటీ సీడీసీ డీన్ ప్రైవేట్ కళాశాలలపై తనిఖీలేవీ.? ప్రైవేట్ కళాశాలల నిర్వహణకు అనువైన భవనాలు, తరగతి గదులు, అర్హత గల అధ్యాపకులు, ఆటస్థలం, లైబ్రరీ, సైన్స్ ప్రయోగశాలలు, పార్కింగ్ ప్రదేశం ఉండాలి. పోలీసు, జీవీఎంసీ, అగ్నిమాపక శాఖల నుంచి పొందిన ధ్రువీకరణ పత్రాలు అప్లోడ్ చేయాలి. ఇవన్నీ క్షేత్రస్థాయిలో సవ్యంగా ఉన్నాయా లేదా అనేది వర్సిటీ నుంచి వెళ్లే బృందం తనిఖీ చేసి నిజనిర్ధారణ నివేదిక ఇచ్చిన తర్వాతనే అఫిలియేషన్ జారీ అవుతుంది. ఈ ప్రక్రియ మొత్తాన్ని వర్సిటీలోని కాలేజీ డెవలప్మెంట్ కమిటీ (సీడీసీ) పర్యవేక్షిస్తుంది. అయితే కళాశాలల తనిఖీలు సవ్యంగా జరగడం లేదు. దీంతో నగరంలోని కొన్ని కళాశాలల్లో కనీస వసతులు, అర్హత గల అధ్యాపకులు లేకుండానే చదువులు సాగుతున్నాయి. -
విద్యారంగంపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం
విశాఖ విద్య: విద్యారంగంపై కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం స్టేట్ అడ్వైజర్ బోరుగడ్డ మోహన్బాబు, రాష్ట్ర కార్యదర్శి తెడబారిక సురేష్కుమార్, విశాఖ జిల్లా అధ్యక్షుడు పులగం కొండారెడ్డి అన్నా రు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ బుధవారం చేపట్టనున్న ‘యువత పోరు’ను విజయవంతం చేయాలని మంగళవారం ఆంధ్ర యూనివర్సిటీ ప్రధాన గేటు ముందు పోస్టర్లు ఆవిష్కరించారు. విద్యారంగాన్ని పట్టించుకోని కూటమి ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ నాయకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో అమలులో విఫలమైందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాలు ఇవ్వకపోవడంతో పేద విద్యార్థులకు చదువులు భారమవుతున్నాయన్నారు. నిరుపేద విద్యార్థులను చదువులకు దూరం చేసి, తద్వారా ప్రైవేట్ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని మండిపడ్డారు. నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేలు ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు కావస్తున్నా ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. విద్యార్థులు, యువతను నిలువునా మోసం చేసిన కూటమి ప్రభుత్వంపై అందరూ పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో బుధవారం నగరంలోని కలెక్టరేట్ వద్ద చేపట్టే ధర్నాకు విద్యార్థులు, నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో శెట్టి సుబ్రహ్మణ్యం, సాగర్, అజయ్ కుమార్, రోహిత్, ఖాసీం, పిల్లి సాగర్ తదితరులు పాల్గొన్నారు. తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి నేటి ‘యువత పోరు’ విజయవంతానికి వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం పిలుపు -
యువత పోరు
భవిత కోసం సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోంది. ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల చెల్లింపులపై మీనమేషాలు లెక్కిస్తూ వారి భవిష్యత్తును అంధకారంలోకి నెడుతోంది. కొన్ని త్రైమాసికాలుగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో యాజమాన్యాలు కళాశాలల నుంచి విద్యార్థులను వెల్లగొట్టడం, పరీక్షల సమయాల్లో హాల్టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేయడం చేస్తున్నాయి. దీంతో పేదింటి తల్లిదండ్రులు ఇళ్లు, పొలాలు, పుస్తెలు తాకట్టు పెట్టి మరీ అప్పులు తెచ్చి ఫీజులు చెల్లిస్తున్న పరిస్థితి ఏర్పడింది. అదే విధంగా యువత కూడా కూటమి ప్రభుత్వం చేతిలో మరోసారి మోసపోయింది. ఏటా జాబ్ క్యాలెండర్ ఇచ్చి మొత్తం 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఇప్పుడు ఆ ఊసే ఎత్తడంలేదు. మెగా డీఎస్సీ దగా అయిపోయింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల సహా ప్రభుత్వ నంస్థలను ప్రైవేటుబాట పట్టిస్తోంది. సచివాలయ ఉద్యోగులను అనిశ్చితి పరిస్థితుల్లోకి నెట్టేసింది. రూ.5వేలు కాదు రూ.10 వేలు ఇస్తామని వలంటీర్లలో ఆశలు కల్పించి తీరా అధికారంలోకి వచ్చాక వారిని రోడ్డున పడేసింది. ఇక నిరుద్యోగ భృతి హామీ కూడా టీడీపీ 2014–19 పాలనలో మాదిరిగానే ఎగనామం పెట్టేసింది. ఈ హామీలను అమలుచేయాలని కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు మంగళవారం వైఎస్సార్ సీపీ ‘యువత పోరు’ బాట పడుతోంది. జిల్లాలో నిరుద్యోగుల సంఖ్య 4.5 లక్షలు కొత్తగా వచ్చిన పరిశ్రమలు 0 రీయింబర్స్మెంట్ కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు 42 వేలు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.35 కోట్లు ● 2023–24 విద్యా సంవత్సరంలో అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 38,017 మంది బీసీ, ఈబీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు రూ.29.87 కోట్లు విడుదల చేసింది. ● 2023–24 విద్యా సంవత్సరంలో 3,929 ఎస్సీ విద్యార్థులకు రూ.4.74 కోట్లు మంజూరు చేసింది. ● జిల్లాలో 2024–25 విద్యా సంవత్సరంలో 42 వేల మందికిపైగా బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్, పీజీ తదితర కోర్సులు చదువుతున్నారు. వీరికి ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు. మొత్తం రూ.35 కోట్లు బకాయిలు ఉన్నాయి. భృతి భూటకమేనా..! జిల్లాలో 6,39,699 కుటుంబాల్లో దాదాపుగా 4.5 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్లు అధికారుల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. సగటున ప్రతీ నెలా నిరుద్యోగ భృతి కింద ప్రభుత్వం రూ.135 కోట్లు చెల్లించాల్సింది. 9 నెలల కూటమి పాలనలో రూ.1215 కోట్లు నిరుద్యోగులకు బకాయిపడింది. ప్రైవేట్ కళాశాలలు వేధింపులు విశాఖలో పలు ప్రైవేట్ ఇంజినీరింగ్, పీజీ కళాశాలలు విద్యార్థులను ఫీజు చెల్లించాలని వేధింపులకు పాల్పడుతున్నాయి. తరగతి గది నుంచి బయటకు పంపించేయడం, పరీక్షల సమయంలో హాల్ టికెట్లు ఇవ్వకపోవడం వంటి ఘటన చోటుచేసుకున్నాయి. విశాఖలో కూటమి ఎంపీకి చెందిన ఓ కళాశాలలో ఫీజులు చెల్లించకపోతే హాల్ టికెట్లు ఇవ్వబోమని బెదిరించగా విద్యార్థులు ఎదురుతిరిగారు. కూటమి ప్రభుత్వం ప్రజాప్రతినిధులే ఈ విధంగా ప్రవర్తించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. -
చంద్రబాబును నమ్మి మరోసారి దగాపడ్డ యువత
వైఎస్సార్సీపీ హయాంలో ఉద్యోగాల కల్పన వైఎస్సార్సీపీ ప్రభుత్వం జిల్లాలోని సచివాలయాల్లో 4,700 శాశ్వత ఉద్యోగాలు, 9,800 వలంటీర్లను నియమించింది. వైద్యారోగ్య శాఖలో వైద్యులు, పారామెడికల్, ఇతర ఉద్యోగాలు 8,500కుపైగా భర్తీ చేసింది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ద్వారా 43,074 మందికి ఉద్యోగాలు కల్పించింది. 2019–20లో 4,001 యూనిట్లు ఏర్పాటు చేసి 8,091 ఉద్యోగాలు, 2020–2021లో 4,450 యూనిట్లు ఏర్పాటు 15,100 మందికి ఉద్యోగాలు, 2022–23లో 4276 యూనిట్లు ఏర్పాటుచేసి 16,145 మందికి ఉద్యోగాలు, 2023–24లో 2414యూనిట్లను ఏర్పాటుచేసి 13,173 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించింది. మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం ప్రజారోగ్య రంగాన్ని బలోపేతం చేయాలని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 17 మెడికల్ కళాశాలలు మంజూరు చేశారు. వీటిలో ఇప్పటికే 5 కళాశాలల్లో తరగతులు ప్రారంభమయ్యాయి. మిగిలిన మెడికల్ కళాశాలలు సగానికి పైగా నిర్మాణపనులు పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటుపరం చేయడానికి యత్నిస్తోంది. ఉమ్మడి విశాఖ జిల్లాకు రెండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను వైఎస్ జగన్మోహన్రెడ్డి అందించారు. వీటిలో పాడేరు మెడికల్ కశాశాల వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే పూర్తి కాగా.. అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం భీమబోయినపాలెంలో సగానికిపైగా నిర్మాణం జరిగింది. ఈ దశలో వచ్చిన కూటమి ప్రభుత్వం రూ.500 కోట్లతో నిర్మిస్తున్న కళాశాలను ప్రైవేట్ చేతులకు అప్పగించే కుట్రలకు పాల్పడుతోంది. ఇది అందుబాటులోకి వస్తే ఏటా 150 ఎంబీబీఎస్ సీట్లలో విద్యార్థులకు ప్రవేశం లభించేది. తర్వాత పీజీ వైద్య కోర్సులు వచ్చేవి. బోధన కోసం 500 పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి అందుబాటులోకి వచ్చేది. కానీ ఇప్పుడది కలగా మిగిలింది. -
రేవిడి జట్లమ్మకు అరిసెలతో అలంకరణ
తగరపువలస: పద్మనాభం మండలం రేవిడి జట్లమ్మ అమ్మవారిని మంగళవారం అక్కడి ఆలయ కమిటీ ప్రతినిధులు అరిసెలు, సున్నిపాకుండలు, పువ్వులతో ప్రత్యేకంగా అలంకరించారు. మరగడ నాగ, కుమారి, ఇషితరెడ్డి ఈ అలంకరణకు సహాయ సహకారాలు అందించారు. అలాగే భీమిలి మండలం మజ్జివలస గ్రామదేవత రాస పోలమాంబ అమ్మవారిని ఆలయ కమిటీ ప్రతినిధులు కొబ్బరికాయలు, పువ్వులతో అలంకరించారు. గ్రామానికి చెందిన నీలాపు సూర్యనారాయణ, అనసూయ దంపతులు ఈ అలంకరణకు సహాయ సహకారాలు అందించగా.. తుపాకుల అప్పల రాసయ్య, రాసమ్మ దంపతులు భక్తులకు ప్రసాదాలు అందించారు. -
జూలో వన్యప్రాణులకు బర్డ్ ఫ్లూ దెబ్బ
ఆరిలోవ: బర్డ్ఫ్లూ వ్యాధి ప్రభావం జూలో వన్యప్రాణులపై పడింది. రోజూ చికెన్ తినే జంతువులు, పాములకు సుమారు నెల రోజులకు పైగా ఆహారం మారిపోయింది. చికెన్ రుచి తగలకపోవడంతో పాపం వన్యప్రాణులు వేరే రుచికి అలవాటుపడేందుకు ఇబ్బంది పడుతున్నాయి. ఇక్కడ పులులు, సింహాలు, హైనాలు, చిరుతలు తదితర వాటికి బీఫ్తో పాటు చికెన్ కూడా రోజూ ఆహారంగా వేస్తారు. పాములకు కోడి పిల్లల్ని అందిస్తారు. బర్డ్ ఫ్లూ వల్ల సీజెడ్ఏ అధికారుల ఆదేశాలతో వన్యప్రాణుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ ఆహారం అందిస్తున్నట్లు జూ క్యూరేటర్ జి.మంగమ్మ తెలిపారు. ఆయా జంతువులకు చికెన్కు బదులుగా ప్రస్తుతం పంది మాంసం(ఫోర్క్), పాములకు కోడి పిల్లలకు బదులుగా కుందేళ్ల పిల్లలు(చిన్నవి) ఆహారంగా అందిస్తున్నట్లు పేర్కొన్నారు. -
16 నుంచి హోలీ స్పెషల్ రైళ్లు
తాటిచెట్లపాలెం: హోలీ సందర్బంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విశాఖ–పాట్నా–విశాఖ మధ్య స్పెషల్ రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.సందీప్ మంగళవారం ప్రకటనలో తెలిపారు. ● విశాఖపట్నం–పాట్నా(08537) హోలీ స్పెషల్ ఈ నెల 16, 23, 30 తేదీ(ఆదివారా)ల్లో విశాఖలో రాత్రి 7.30కు బయల్దేరి మరుసటి రోజు(సోమవారా)ల్లో రాత్రి 9 గంటలకు పాట్నా చేరుకుంటాయి. తిరుగు ప్రయాణంలో పాట్నా–విశాఖపట్నం(08538) హోలీ స్పెషల్ 17, 24, 31 తేదీ(సోమవారా)ల్లో రాత్రి 10.30కు పాట్నాలో బయల్దేరి బుధవారం తెల్లవారుజాము 3.50కు విశాఖ చేరుకుంటాయి. ఈ స్పెషల్ రైళ్లు 3 సెకండ్ ఏసీ, 4 థర్డ్ ఏసీ ఎకానమీ, 7 స్లీపర్ క్లాస్, 4 జనరల్ సెకండ్ క్లాస్, 1 సెకండ్ క్లాస్ కం లగేజి కం దివ్యాంగ కోచ్, 1 జనరేటర్ మోటార్ కార్ కోచ్లతో నడుస్తాయి. -
ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం..
విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు తక్షణమే చెల్లించాలని, ఎన్నికల ముందు చెప్పిన విధంగా నెలకు రూ.3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి చెల్లించాలని, జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. కొత్త మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేస్తూ పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయడాన్ని నిరసిస్తున్నాం. కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఈ ‘యువత పోరు’ నిర్వహిస్తున్నాం. జిల్లాలోని విద్యార్థుల తల్లిదండ్రులు, నిరుద్యోగులు, వైఎస్సార్ సీపీ శ్రేణులు, అభిమానులు హాజరై ఈ పోరుబాటను విజయవంతం చేయాలి. – గుడివాడ అమర్నాథ్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు -
దైన్యం.. జూలో మూగ జీవాల వైద్యం
● ఇటీవల పుట్టిన రెండు సింహం పిల్లలు మృతి ● వారాల తరబడి పోటీ పడి మరీ సెలవుల్లో వైద్యులు ఆరిలోవ: ఇందిరాగాంధీ జూ పార్కులో మూగ జీవాలకు వైద్యం ప్రశ్నార్థకంగా మారింది. వైద్యులు వారాల తరబడి పోటాపోటీగా సెలవులు పెట్టడం, విధులకు హాజరైన రోజుల్లో కూడా సరిగా వైద్య సేవలు అందించకపోవడంతో మూగ జీవాల ఆరోగ్యం అగమ్యగోచరంలో పడింది. ఇటీవల ఇక్కడ శివంగి(ఆడ సింహం)కి పుట్టిన రెండు పిల్లలు మృత్యువాత పడ్డాయి. జూ పార్కుల్లో సింహాలకు పిల్లలు పుట్టడం దేశంలో ఇదే మొదటిసారి. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన జూ వైద్యులు నిర్లక్ష్యం కారణంగా.. పుట్టిన రెండు సింహం పిల్లల్లో ఒకటి రెండు రోజుల వయసులో, మరొకటి 12 రోజుల వయసులో ప్రాణాలు కోల్పోయాయి. ఏడాదిన్నర క్రితం ఇక్కడ జిరాఫీ పిల్ల తల్లి కడుపులోనే మరణించిన విషయం తెలిసిందే. ఇతర దేశాల నుంచి ఇక్కడకు తీసుకువచ్చిన పలు అరుదైన వన్యప్రాణులు సైతం సరైన వైద్యం అందకపోవంతో మృత్యువాత పడుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. లాంగ్ లీవ్లో డాక్టర్ శ్రీనివాస్ జూ పార్కు ఏర్పాటైనప్పటి నుంచి పశు సంవర్ధక శాఖకు చెందిన డాక్టర్ శ్రీనివాస్ ఇక్కడి మూగజీవాలకు వైద్య సేవలు అందిస్తున్నారు. ఆయన వ్యక్తిగత కారణాలతో రెండేళ్ల క్రితం లాంగ్(ఐదేళ్ల) లీవ్ పెట్టారు. అప్పటి నుంచి పరిస్థితులు దిగజారాయి. ప్రస్తుతం ఇక్కడ ముగ్గురు వైద్యులున్నారు. వారిలో నెల క్రితం నియమించిన పశు సంవర్ధక శాఖకు చెందిన ప్రభుత్వ వైద్యుడున్నారు. మిగిలిన ఇద్దరు అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారు. వారిలో ఒక యువ వైద్యుడు ఐదేళ్లుగా పనిచేస్తున్నారు. ఆయనకు హైదరాబాద్లో సొంతంగా వెటర్నరీ మందుల సంస్థ ఉంది. ఆ సంస్థ నుంచే గతంలో అవసరానికి మించి మందులు కొనుగోలు చేయించేవారని సమాచారం. సదరు వైద్యుడు నెలలో సగం రోజులు సిక్ లీవ్ల పేరిట జూ డ్యూటీకి ఎగనామం పెడుతున్నారు. మరో మహిళా వైద్యురాలు నాలుగు నెలల క్రితం జూలో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో చేరారు. ఆమె గతంలో కొన్నాళ్లు ఇక్కడ వైద్యురాలిగా పనిచేశారు. ఇక్కడ మానేసిన తర్వాత జీవీఎంసీ మొబైల్ వెటర్నరీ క్లినిక్లో చేరారు. ప్రస్తుతం ఆమె రెండు ఉద్యోగాలు చేస్తున్నట్లు జూ సిబ్బంది చెప్తున్నారు. అక్కడో వారం.. ఇక్కడో వారం అన్నట్లుగా ఆమె సేవలందిస్తున్నట్లు తెలిసింది. వీరిద్దరు డ్యూటీకి వెళ్లిన రోజుల్లో కూడా వన్యప్రాణులను సరిగా పరిశీలించట్లేదని యానిమల్ కీపర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరి నిర్లక్ష్యం కారణంగానే గర్భం దాల్చిన సింహానికి సరైన వైద్యం, అవసరమైన మందులు అందక నీరసించిన పిల్లలు పుట్టాయన్న ఆరోపణలున్నాయి. వీరిద్దరు ఇటీవల నియమించిన ప్రభుత్వ వెటర్నరీ వైద్యుడికి కూడా సహకరించకుండా సెలవుల్లో గడుపుతున్నారని సమాచారం. ఇంత జరుగుతున్నా అటవీశాఖ సీఎఫ్, జూ ఉన్నతాధికారులు సర్దుబాటు చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. -
ఇద్దరిపై కూలిన విద్యుత్ స్తంభం
● విశాఖ డెయిరీ జంక్షన్ వద్ద వేచి ఉండగా ఘటన ● ఒకరి పరిస్థితి విషమం అక్కిరెడ్డిపాలెం: ప్రమాదం ఎప్పుడు, ఎలా వస్తుందో చెప్పలేం. కొన్నిసార్లు మన ప్రమేయం లేకున్నా ఆ ప్రమాదానికి బాధితులం అవుతాం. మంగళవారం విశాఖ డెయిరీ జంక్షన్లో వేచి ఉన్న ఇద్దరిపై విద్యుత్ స్తంభం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ గాయపడగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. తుప్పు పట్టిన విద్యుత్ స్తంభాలను మార్చడంలో అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షులు, గాజువాక ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాలివి.. జాతీయ రహదారిపై తుప్పు పట్టిన విద్యుత్ స్తంభాలు కూలుతున్నా.. జీవీఎంసీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రెండు రోజుల కిందట విశాఖ డెయిరీ జంక్షన్లో విద్యుత్ స్తంభం కూలిపోగా, అక్కడే విధుల్లో ఉన్న కమ్యూనిటీ గార్డు ఈ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. తాజాగా మరో స్తంభం కూలి ఇద్దరిపై పడిపోయింది. మంగళవారం మధ్యాహ్నం ఆటోనగర్ నుంచి షీలానగర్ వైపు ఆర్టీసీ బస్సు వస్తోంది. విశాఖ డెయిరీ ఎదురుగా జంక్షన్ వద్దకు వచ్చేసరికి జీవీఎంసీ విద్యుత్ స్తంభం నుంచి వెళ్తున్న తీగ బస్సు టాప్కు తగలడంతో ఇరుక్కుపోగా, బస్సు లాక్కొని పోయింది. దీంతో తుప్పు పట్టిన విద్యుత్ స్తంభం విరిగి నేలకొరిగింది. అదే సమయంలో భెల్ ప్రవేశ గేటు వైపు నుంచి విశాఖ డెయిరీ వైపు రోడ్డు దాటడానికి బైక్పై వేచి ఉన్న బొత్స కామేశ్వరరావు, పక్కనే నిల్చొని ఉన్న దొడ్డి సత్యవతిపై ఆ విద్యుత్ స్తంభం పడింది. తీవ్ర గాయాల పాలైన కామేశ్వరరావు పరిస్థితి విషమంగా ఉండటంతో అంబులెన్స్లో కేజీహెచ్కు తరలించారు. సత్యవతికి తలకు తీవ్ర గాయం కావడంతో షీలానగర్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. కె.కోటపాడు, వారాడ సంతపాలేనికి చెందిన కామేశ్వరరావుకు విశాఖ డెయిరీలో పని కుదిరింది. మొదటి రోజు పనికి వెళ్లేందుకు వచ్చి ఇలా ప్రమాదానికి గురికావడం పలువురిని తీవ్రంగా కలచివేసింది. తల్లితో కలిసి అతను నివసిస్తున్నట్లు బంధువులు తెలిపారు. 69వ వార్డు నాతయ్యపాలేనికి చెందిన సత్యవతి అనకాపల్లిలో ఉంటున్న తన కుమార్తెను చూడటానికి వెళ్లేందుకు పళ్లు కొనుగోలు చేసింది. అనంతరం విశాఖ డెయిరీ వైపు రోడ్డు దాటడానికి వేచి ఉండగా ప్రమాదానికి గురైంది. కాగా.. జరిగిన ప్రమాదం ట్రాఫిక్ పరిధిలోకి వస్తుందా లేదా లా అండ్ ఆర్డర్ పరిధిలోకి వస్తుందా అనే సందిగ్ధతతో పోలీసులు సాయంత్రం వరకు కేసు నమోదు చేయలేదు. -
● వీఎంఆర్డీఏ పార్కుకు నూతన శోభ
చాపల్లో గంజాయి రవాణా తాటిచెట్లపాలెం: గంజాయి రవాణాకు నిందితులు కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. తాజాగా చాపల్లో చుట్టి గంజాయిని రవాణా చేస్తుండగా విశాఖపట్నం రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలివి.. ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ కె.రామకృష్ణ తన సిబ్బందితో కలిసి మంగళవారం విశాఖపట్నం రైల్వే స్టేషన్లో తనిఖీలు చేపట్టారు. 8వ నంబర్ ప్లాట్ఫాంపై పశ్చిమ బెంగాల్కు చెందిన మాన్సింగ్ ఘోష్, కృష్ణపాల్లను తనిఖీ చేయగా.. వారి వద్ద గంజాయి లభించింది. వారు ఎవరికీ అనుమానం రాకుండా ప్లాస్టిక్ చాపల్లో గంజాయిని కట్టలుగా కట్టి తీసుకువెళ్తున్నారు. ఒడిశాలోని పాడువా నుంచి ఉత్తరప్రదేశ్లోని నోయిడాకు గంజాయిని రవాణా చేస్తుండగా దొరికిపోయారు. వారి వద్ద నుంచి రూ.89,500 విలువైన 17.9 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని.. ఇద్దరినీ జీఆర్పీ ఎస్ఐ అబ్దుల్ మారూఫ్కు అప్పగించారు. పోలీసులు నిందితులను రిమాండ్కు తరలించారు. విశాఖ–బెంగళూరు స్పెషల్కు జోలర్పేట్లో హాల్ట్ తాటిచెట్లపాలెం: విశాఖపట్నం–ఎస్ఎంవీ బెంగళూరు–విశాఖపట్నం మధ్య నడుస్తున్న వీక్లీ స్పెషల్ రైలుకు జోలర్పేట్లో అదనపు హాల్ట్ కల్పిస్తున్నట్లు సందీప్ తెలిపారు. ● విశాఖపట్నం–ఎస్ఎంవీ బెంగళూరు(08549) స్పెషల్ ఎక్స్ప్రెస్కు ఈ నెల 16 నుంచి, తిరుగు ప్రయాణంలో బయల్దేరే ఎస్ఎంవీ బెంగళూరు–విశాఖపట్నం(08550) స్పెషల్ ఎక్స్ప్రెస్కు 17 నుంచి జోలర్పేట్లో హాల్ట్ కల్పించారు. విశాఖ రైల్వే స్టేషన్లో నిందితుల అరెస్ట్ జీవీఎంసీ అధికారులతోస్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ -
సరికొత్త హంగులతో వైఎస్సార్ స్టేడియం
విశాఖ స్పోర్ట్స్: ఐపీఎల్ ప్రస్తుత సీజన్కు విశాఖలోని వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియం సిద్ధమవుతోంది. మరో సారి ఢిల్లీ క్యాపిటల్స్ సెకండ్ హోం గ్రౌండ్గా విశాఖ స్టేడియాన్ని ఎంచుకోవడమే కాకుండా తొలి మ్యాచ్ను ఇక్కడే ఆడి సీజన్కు శ్రీకారం చుట్టనుంది. 27,251 మంది అభిమానులు ప్రత్యక్షంగా మ్యాచ్ను వీక్షించే అవకాశం ఉన్న వైఎస్సార్ స్టేడియంలో డీసీ తొలి మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్తో 24వ తేదీ రాత్రి ఏడున్నర గంటలకు ఆడనుంది. అలాగే ఈ నెల 30వ తేదీ ఆదివారం సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం మూడున్నరకే ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ల నిర్వహణకు వీలుగా స్టేడియంలో ఆధునిక హంగులు సమకూరుస్తున్నారు. ఆటగాళ్ల గ్రీన్రూమ్స్తో సహా డగౌట్స్ను ఆధునికీకరించారు. మ్యాచ్ల్లో డ్రెస్సింగ్ రూమ్కి చాలా ప్రాధాన్యం ఉన్నా.. టీ–20లో ఆటగాళ్లు కూర్చునేందుకు మైదానానికి ఇరువైపులా ఉండే డగౌట్స్ ప్రత్యేకతను సంతరించుకుంటాయి. డీసీ మేనేజ్మెంట్ సూచనల మేరకు ఏసీఏ ప్రత్యేక దృష్టి పెట్టి సాధారణ ప్రేక్షకులతో పాటు కార్పొరేట్కు పెద్దపీట వేసింది. అందుకు అనువుగా 34 వీఐపీ కార్పొరేట్ బాక్స్లతో పాటు రెండు టీమ్ బాక్స్లను ఆధునికీకరించింది. ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్తో సహా నాలుగు లిఫ్ట్ల్లో ఒకేసారి 64 మంది వెళ్లే విధంగా తీర్చిదిద్దింది. దాదాపు రూ.40 కోట్ల వరకు వెచ్చించి స్టేడియంలో సౌకర్యవంతమైన సీటింగ్ ఏర్పాట్లతో పాటు అభిమానులకు బాత్రూమ్లను సైతం మూడింతలు పెంచి సౌకర్యాలు కల్పించింది. స్టేడియంలో ఫ్లడ్లైట్లు ఏర్పాటు చేసి 14 ఏళ్లు దాటిపోవడంతో.. వాటి స్థానంలో రూ.9.5 కోట్లు వెచ్చించి ఆధునిక టెక్నాలజీతో పూర్తి నైట్ మ్యాచ్కు అనువుగా ఆధునికీకరించింది. పెవిలియన్ ఎండ్ సౌత్ బ్లాక్లో ఆటగాళ్ల రూమ్, డగౌట్కు పైన 1,640 మంది కూర్చునే కార్పొరేట్ బాక్స్లు అన్ని హంగులతో సిద్ధమయ్యాయి. ఆటగాళ్లకు దగ్గరగా ఉండే అప్పర్ వెస్ట్, జి, ఐ స్టాండ్స్లోనూ సిట్టింగ్ ఏర్పాట్లను మెరుగుపరిచారు. స్టేడియంలో మొత్తంగా కార్పొరేట్ బాక్స్లతో సహా 22 స్టాండ్స్ ఉన్నాయి. ఈ రెండు మ్యాచ్లకు టికెట్లను త్వరలో ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్లో విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
హోం మంత్రి ఇలాకాలో.. అశ్లీల నృత్యాలు!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరావుపేట నియోజకవర్గంలో అశీల్ల నృత్యాలు అంబరాన్నంటాయి. టీటీడీ ఆధ్వర్యంలో జరుగుతున్న పవిత్రమైన ఉపమాక వెంకన్న కల్యాణ్సోతవం కార్యక్రమంలో వెగటు పుట్టించే పాటలతో అమ్మాయిల డ్యాన్స్లతో అపచారానికి ఒడిగట్టారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా డీజే పేరుతో రికార్డింగ్ డ్యాన్సులను యథేచ్ఛగా నిర్వహించారు. సాక్షాత్తూ హోం మంత్రి నియోజకవర్గంలోనే ఈ కార్యక్రమం జరుగుతుండడంతో.. టీటీడీ అధికారులు గానీ, పోలీసులు గానీ ఈ రికార్డింగ్ డ్యాన్సులకు అడ్డుచెప్పే ధైర్యం చేయలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. టీడీపీ పెత్తనంతో.. నక్కపల్లి మండలం ఉపమాపకలో ఆరో శతాబ్ధానికి చెందిన వెంకన్న ఆలయానికి ఘన చరిత్ర ఉంది. 2017 సంవత్సరం వరకు దేవదాయ శాఖ ఆధీనంలో ఉండే ఈ ఆలయాన్ని తెలుగుదేశం ప్రభుత్వమే టీటీడీకి అప్పగించింది. అప్పటి నుంచి ప్రతి ఏటా నిర్వహించే బ్రహ్మోత్సవాలు, ధనుర్మాసోత్సవాలు, కల్యాణోత్సవాలు తిరుపతిలో మాదిరిగానే నిర్వహిస్తున్నారు. ఈ ప్రత్యేక పర్వదినాల్లో కేవలం ఆధ్యాత్మికమైన సాంస్కృతిక కార్యక్రమాలు మాత్రమే ఇప్పటి వరకు టీటీడీ అధికారులు నిర్వహిస్తూ వచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచి్చన తరువాత జరుగుతున్న ఈ ఉపమాక వెంకన్న కల్యాణోత్సవంలో టీడీపీ నేతల పెత్తనం పెచ్చుమీరింది. హోం మంత్రిగా అనిత బాధ్యతలు చేపట్టిన తరువాత ఉపమాక దేవస్థానంలో తెలుగుదేశం నేతల జోక్యం ఎక్కువైందన్న ఆరోపణలున్నాయి. టీటీడీ సంప్రదాయానికి తూట్లు.. వెంకన్న కల్యాణోత్సవ కార్యక్రమాన్ని అపవిత్రం చేసేలా టీడీపీ నేతలు రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహించడంపై భక్తులు మండిపడుతున్నారు. కల్యాణోత్సవం సందర్భంగా సోమవారం రాత్రి డీజే పేరుతో రికార్డింగ్ డ్యాన్స్ను ఏర్పాటు చేశారు. ఒకవైపు స్వామి వారి కల్యాణోత్సవం జరుగుతుండగా మరోవైపు ఆలయానికి ఆనుకుని వెనుక ప్రాంతంలో డీజే స్టేజ్ ఏర్పాటు చేసి అమ్మాయిలు, అబ్బాయిలతో అశ్లీల నృత్యాలు చేయించడం గమనార్హం. పైగా ఈ డ్యాన్స్ ప్రోగ్రాం కారణంగానే రాత్రి 9 గంటలకు పూర్తి కావాల్సిన ఎదురు సన్నాహక మహోత్సవంతో పాటు రథోత్సవం అర్థరాత్రి 12 వరకు ప్రారంభం కాలేదు. ఇక స్వామి వారి కల్యాణం అర్థరాత్రి 2 గంటల తర్వాత హోం మంత్రి అనిత వచ్చాక ప్రారంభించారు. ఇటువంటి రికార్డింగ్ డ్యాన్సుల కార్యక్రమానికి టీటీడీ అధికారులు ఇప్పటి వరకు అనుమతి ఇవ్వలేదు. కానీ ఈసారి మాత్రం కల్యాణోత్సవం సందర్భంగా హోం మంత్రి అనిత సోమవారం ఉదయం నుంచి అర్థరాత్రి వరకు ఉపమాకలోనే తిష్టవేశారు. కల్యాణం సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలు, కల్పించిన సదుపాయాలు, ఇలా అన్నింటినీ ఆమె స్వయంగా పర్యవేక్షించారు. హోం మంత్రిగా అనిత బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా ప్రాచీన పుణ్య క్షేత్రంలో రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహించడంపై భక్తులు దుమ్మెత్తి పోస్తున్నారు. -
విశాఖ స్టీల్ప్లాంట్ కార్మికుల ఆందోళన
సాక్షి, విశాఖపట్నం: కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపును నిరసిస్తూ విశాఖ స్టీల్ప్లాంట్ కార్మికులు ఆందోళన చేపట్టారు. ఇప్పటికే వెయ్యి మంది కాంట్రాక్ట్ కార్మికులను యాజమాన్యం తొలగించగా.. మరికొందరిని తొలగించే యోచనలో ఉంది. నేటితో యాజమాన్యం కోరిన గడువు ముగియనుంది. నేడు రిజనల్ లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో మరోసారి చర్చలు జరపనున్నారు. స్పష్టత ఇవ్వకపోతే రేపటి నుంచి సమ్మెలోకి వెళ్లే అవకాశం ఉంది.కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపుపై సమావేశం కొనసాగుతోంది. యూనియన్ నేతలతో స్టీల్ ప్లాంట్ యాజమాన్యం సమావేశమైంది. కాంట్రాక్టు కార్మికుల తొలగింపుపై చర్చలు కొలిక్కి రాలేదు. యాజమాన్యం తీరుపై కార్మిక సంఘాల నేతలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఇప్పటివరకు వెయ్యి మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారని... తొలగించిన వాటిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని.. లేదంటే నిరవధిక సమ్మెకు దిగుతామని యూనియన్ నేతలు హెచ్చరించారు. కాంట్రాక్ట్ కార్మికులను తొలగించమనే హామీ ఇప్పటివరకు యాజమాన్యం నుంచి రాలేదని.. యాజమాన్యం చెబుతోంది ఒకటి, చేస్తోంది ఒకటని కార్మికులు మండిపడుతున్నారు.స్టీల్ప్లాంట్లో కాంట్రాక్టు కార్మికులను అక్రమంగా తొలగిస్తున్నారని అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు ధ్వజమెత్తారు. అక్రమ తొలగింపులను ఆపకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. స్టీల్ప్లాంట్లో కాంట్రాక్టు కార్మికులను తొలగింపును నిరసిస్తూ అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పాతగాజువాకలో ఆదివారం మహాధర్నా నిర్వహించిన సంగతి తెలిసిందే.స్టీల్ప్లాంట్ను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు మోదీ ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నాలను ముమ్మరం చేసిందని అందులో భాగంగా ప్రైవేట్ పెట్టుబడిదారులు కోరినట్టుగా ఇక్కడి కార్మికుల సంఖ్యను తగ్గిస్తోందన్నారు. దీన్ని ప్రశ్నిస్తున్న నాయకులకు యాజమాన్యం షోకాజ్ నోటీసులను జారీ చేయడం దుర్మార్గమని సీపీఎం నేతలు ధ్వజమెత్తారు. -
రోజా కేసులో రోజుకో ట్విస్ట్
సాక్షి, విశాఖపట్నం: ఎన్ఆర్ఐ మహిళ రోజా అనుమానాస్పద మృతి క్రైం థ్రిల్లర్ను తలపిస్తోంది. కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. నగర పోలీసు కమిషనర్ ఆదేశాలతో ఎట్టకేలకు మృతురాలి స్నేహితుడు, నిందితుడిగా భావిస్తున్న డాక్టర్ శ్రీధర్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఎన్ఆర్ఐ మహిళ రోజాకు.. డాక్టర్ శ్రీధర్కు మధ్య ఉన్న సంబంధం ఏంటి?.. రోజా హోటల్కు వచ్చిన రెండు గంటల్లో అనుమానాస్పదంగా మృతి చెందడం వెనుక ఏం జరిగిందో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ నెల 6వ తేదీ మధ్యాహ్నం 1.40 గంటలకు శ్రీధర్ను కలిసేందుకు మేఘాలయ హోటల్లోని రూం నంబర్ 229కి రోజా వెళ్లింది. 3.35 గంటల తరువాత ఆమె బాత్రూమ్లో అపస్మారక స్థితిలో ఉందని శ్రీధర్ హోటల్ సిబ్బందికి చెప్పాడు. హత్యా? ఆత్మహత్యా? రెండు గంటల వ్యవధిలో రోజా అనుమానాస్పదంగా మృతి చెందడంపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. రెండు గంటలు ఇద్దరూ ఒకే గదిలో ఉన్నారు. ఈ సమయంలో రోజా–శ్రీధర్కు మధ్య గొడవ జరిగిందా?.. ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాడా? అందుకే ఆమె ఆత్మహత్య చేసుకున్నా ఆపకుండా చూస్తూ ఉండిపోయాడా?.. మృతి చెందిందని నిర్ధారించుకున్న తరువాతే హోటల్ సిబ్బందికి సమాచారం ఇచ్చాడని ప్రచారం జరుగుతోంది. నిజానికి రోజాను ఆత్మహత్య చేసుకునేలా అమెరికాలో ఉన్నప్పటి నుంచే శ్రీధర్ ప్రేరేపిస్తున్నాడని పోలీసులు విచారణలో తెలినట్లు తెలిసింది. ఒకవేళ రోజాది ఆత్మహత్య కాకపోతే అదే రూమ్లో ఉన్న శ్రీధర్ ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రోజా పోస్టుమార్టం నివేదిక వస్తే తప్ప నిజనిజాలు బయట పడే అవకాశం లేదు. ఎఫ్ఐఆర్లో శ్రీధర్ పేరు చేర్చలేదెందుకు? ఈ కేసులో మొదటి నుంచి పోలీసులు నిర్లక్ష్యం కనిపిస్తూనే ఉంది. డాక్టర్ శ్రీధర్ను కేసు నుంచి తప్పించేయత్నం జరుగుతోందని విస్తృతంగా ప్రచారం జరిగింది. కేసు తేలిపోయేవిధంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఒకే గదిలో రోజా–శ్రీధర్ ఉన్న సమయంలో.. రోజా అనుమానాస్పదంగా మృతి చెందితే ఎఫ్ఐఆర్లో శ్రీధర్ పేరు చేర్చకపోవడం చర్చనీయాంశమైంది. కేసును నీరుగార్చేందుకు పోలీసులు ఎందుకు ప్రయత్నించారు? డాక్టర్ శ్రీధర్ వెనుక ఎవరున్నారు? పోలీసులపై ఎవరి ఒత్తిడైనా ఉందా? అన్న ప్రశ్నలకు వారే సమాధానం చెప్పాలి. ఈ కేసు విషయంలో విమర్శలు రావడంతో ఎట్టకేలకు మూడో పట్టణ పోలీసులు శ్రీధర్ను అరెస్టు చేసినట్లు ఆదివారం ఆర్ధరాత్రి ప్రకటించారు. అన్ని వేళ్లూ పోలీసులవైపే.. ఎన్ఆర్ఐ మహిళా అనుమానాస్పద మృతిపై పోలీసులు చర్యలు విమర్శలకు తావిచ్చింది. సంఘటన జరిగిన వెంటనే శ్రీధర్ను అదుపులోకి తీసుకొని విచారిస్తే నిజనిజాలు బయటపడేవి. అయితే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు నుంచి విచారణ వరకు అన్ని వేళ్లు వారివైపే చూపించేలా వ్యవహరించారు. 6వ తేదీన రోజా మృతి చెందినప్పటికీ 8వ తేదీ వరకు అటువంటి ఘటన జరగలేదు అన్నట్లు వ్యవహరించారు. పలుకుబడి ఉన్న కుటుంబాలకు చెందిన వ్యక్తులు తప్పు చేస్తే వెనకేసుకువచ్చే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు. పేద, మధ్యతరగతికి చెందిన ఎవరైనా తప్పు చేస్తే మీడియా సమావేశాలు పెట్టి మరీ ప్రచారం చేసుకునే పోలీసులు ఈ కేసు విషయంలో పాటిస్తున్న గోప్యత అనుమానాలకు తావిస్తోంది. -
దివ్యాంగుల స్కూల్కు నాట్స్ ఆర్థికసాయం
ఎంవీపీ కాలనీ: జీవీఎంసీ 17వ వార్డులోని సన్ఫ్లవర్ దివ్యాంగుల స్కూల్కు నార్త్ అమెరికా తెలుగు సంఘం(నాట్స్) రూ.20 లక్షలు ఆర్థిక సాయం అందజేసింది. నాట్స్ ప్రతినిధులు సోమవారం స్కూల్ యాజమాన్యానికి సంబంధిత చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా నాట్స్ సమన్వయకర్త వెంకన్న చౌదరి, నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, ప్రెసిడెంట్ మదన్ పాములపాటిలు మాట్లాడుతూ భాషే రమ్యం– సేవే మార్గం నినాదంతో నాట్స్ మాతృభూమి రుణం తీర్చుకోవడానికి విస్తృత సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. ఇందులో భాగంగా సన్ప్లవర్ దివ్యాంగుల స్కూల్ విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించేందుకు రూ.10 లక్షలు, నాట్స్ పూర్వ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, ఎవోలైటెజ్ వ్యవస్థాపకుడు(విశాఖ) శ్రీనివాస్ అరసాడ మరో రూ.10 లక్షలు ఆర్థికసాయం అందించారు. కార్యక్రమంలో నాట్స్ కన్వెన్షన్ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందడి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ శ్రీనివాస్ పిడికిటి తదితరులు పాల్గొన్నారు. -
‘యువత పోరు’తో నిలదీద్దాం..
సాక్షి, విశాఖపట్నం: ఎన్నికల ముందు అబద్దపు హామీలిచ్చి అఽధికారం చేపట్టిన తర్వాత యువతను, విద్యార్థులను, నిరుద్యోగులను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్మెంట్, మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ఉపసంహరణ అంశాలపై వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 12న ‘యువత పోరు’ పేరిట నిరసన చేపట్టనున్నట్లు తెలిపారు. మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో ‘యువత పోరు’ పోస్టర్ను సోమవారం ఆవిష్క రించారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడు తూ గతంలో వైఎస్సార్సీపీ చేపట్టిన రైతు పోరు బాట, విద్యుత్ చార్జీలపై నిరసన కార్యక్రమాలు విజయవంతమయ్యాయని, అదే తరహాలో యువత పోరును మరింత విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ శ్రేణులకు, యువతకు పిలుపునిచ్చారు. పేద విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించాలనే ఆకాంక్షతో మహానేత, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారని, దాన్ని ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో మరింత సమర్థవంతంగా అమలుచేసినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.4 వేల కోట్లు ఫీజు బకాయి పెట్టిందన్నారు. నిరుద్యోగులకు ప్రతి నెలా రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మోసం చేసిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో 17 మెడికల్ కాలేజీలు మంజూరై, వాటిలో సగానికి పైగా పూర్తయ్యామని, మిగిలినవి నిర్మాణంలో ఉన్నాయని, వాటి ప్రైవేటీకరణకు కూటమి ప్రభుత్వం పాల్పడుతుండటం శోచనీయమన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ జె.సుభద్ర, ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయకుమార్, చింతలపూడి వెంకట్రామయ్య, గాజువాక సమన్వయకర్త తిప్పల దేవన్రెడ్డి, రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు జాన్వెస్లీ, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు పేడాడ రమణికుమారి, దొడ్డి కిరణ్, పులగమ కొండారెడ్డి, సనపల రవీంద్ర భరత్, కోఆప్షన్ సభ్యుడు ఎండీ షరీఫ్, పార్టీ ముఖ్య నాయకులు నాగేంద్ర, మువ్వల సంతోష్కుమార్, ఇల్లపు శ్రీనివాస్, కార్తీక్, నిఖిల్ వర్ధన్ తదితరులు పాల్గొన్నారు. నిరసనకు తరలిరండి ఈ నెల 12న ఉదయం 10 గంటలకు జెడ్పీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకూ ర్యాలీగా వెళ్లి కలెక్టర్కు వినతిపత్రం అందజేస్తామన్నారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున జిల్లా యువత, తల్లిదండ్రులు, వైఎస్సార్ సీపీ శ్రేణులు పాల్గొంటాయని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రూ.4 వేల కోట్ల ఫీజు బకాయిలు నిరుద్యోగులకు రూ.3 వేలు భృతిగా ఇస్తామని చెప్పి మాట తప్పారు 12న వైఎస్సార్ సీపీ యువత పోరు పోస్టర్ను ఆవిష్కరించిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ -
తాజాగా వియత్నాం సర్వీసు
తాజాగా వియత్నాం సర్వీసు కూడా వెళ్లిపోయింది. గతేడాది సెప్టెంబర్లో వైజాగ్లో జరిగిన వియత్నాం టూరిజం కాంక్లేవ్లో ఆ దేశ రాయబారి ఇక్కడి నుంచి వియత్నాంలోని ప్రధాన నగరం హొచిమిన్ సిటీకి 2025లో సర్వీసు ప్రారంభిస్తామని ప్రకటించారు. ఎయిర్ట్రావెల్స్ అసోసియేషన్ ప్రతినిధుల కృషితో కొత్త సర్వీసు రాబోతోందని అంతా భావించారు. అయితే మరోసారి వియట్జెట్ ఎయిర్లైన్స్ ప్రతినిధులతో సంప్రదింపులు జరపాలని కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు, వైజాగ్ ఎయిర్పోర్టు అధికారుల్ని అసోసియేషన్ కోరింది. అయినా స్పందించకపోవడంతో వియట్జెట్ హైదరాబాద్ ఎయిర్పోర్టుతో సంప్రదింపులు జరిపింది. దీంతో వియర్జెట్ సర్వీసుతో పాటు.. వియత్నాం గవర్న్మెంట్ ఎయిర్లైన్స్ సర్వీసు కూడా హైదరాబాద్కు తరలిపోయింది. ఫలితంగా రెండు నెలల కాలంలో రెండు విదేశీ సర్వీసులు వైజాగ్కు రాకుండా పోయాయి. దీనంతటికీ కేంద్ర మంత్రి నిర్లక్ష్యం, కూటమి సర్కారు వివక్షే కారణమని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
మండు టెండలో.. చంటి బిడ్డలతో..
పేదలు గూడు కోసం ఎంత పరితపిస్తున్నారో ఈ చిత్రమే సాక్ష్యం. ఇల్లు లేని పేదలతో కలిసి సీపీఐ ఆధ్వర్యంలో రూరల్ తహసీల్దార్ కార్యాలయాన్ని సోమవారం ముట్టడించారు. ఈ సందర్భంగా దరఖాస్తులతో బాధితులంతా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. మండుటెండలో చంటి బిడ్డలతో తరలివచ్చారు. ఎండ అధికంగా ఉండడంతో ఓ తల్లి తన చంటిబిడ్డను కుమారుడి చేతిలో పెట్టి దరఖాస్తు అందజేయడానికి కార్యాలయం లోపలకు వెళ్లింది. ఆ ప్రాంగణంలో నీడ లేకపోవడంతో కార్యాలయం గోడ పక్కన.. కాలువ గట్ట్టుపై ఉన్న నీడలో చిన్నారిని ఆడిస్తూ కనిపించాడు. – ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
తప్పుల తడకగా సీనియారిటీ జాబితా
● అప్పీళ్లకు ముగిసిన గడువు ● సవరణల కోసం 250 మంది దరఖాస్తు విశాఖ విద్య: ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా లు ప్రకటించేందుకు విద్యాశాఖాధికారులు ఆపసోపాలు పడుతున్నారు. టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(టీఐఎస్)లో సమగ్ర వివరాలు నమోదు సమ యంలో ఉపాధ్యాయుల అలసత్వం, డీడీవోల నిర్లక్ష్యంతో జాబితాలు తప్పులతడకగా మారాయి. వీటి ఆధారంగానే త్వరలోనే ప్రమోషన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించటంతో ఉపాధ్యాయుల్లో కలవరం మొదలైంది. దీంతో సీనియారిటీ జాబితా లోపాలను సవరించి, తమకు న్యాయం చేయాలని కోరుతూ ఉమ్మడి విశాఖ జిల్లాకు సర్వీసు విషయాల్లో నోడల్ అధికారిగా వ్యవహరిస్తున్న విశాఖ జిల్లా డీఈవోకు తమ మొర విన్నవించుకునేందుకు ఉపాధ్యాయులు క్యూ కట్టారు. అప్పీళ్లకు సోమ వారం చివరి రోజు కావటంతో ఉమ్మడి జిల్లాలో పనిచేస్తున్న 250 మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నారు. అప్పీళ్ల పరిశీలనకు ప్రత్యేక కమిటీ వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించే నిమిత్తం 12 మంది సీనియర్ ప్రధానోపాధ్యాయులు, ఇద్దరు ఎంఈవోలతో జిల్లా స్థాయిలో కమిటీ ఏర్పాటు చేశారు. వచ్చిన ప్రతీ దరఖాస్తును వారు పూర్తి స్థాయిలో పరిశీలించిన తరువాతనే టీఐఎస్ లాగిన్లో వాటిని సరిచేశారు. ఇలా 210 దరఖాస్తులను సోమవారం నాటికి ఒక కొలిక్కి తీసుకొచ్చి, ఉపాధ్యాయులు లేవనెత్తిన అంశాలను సరిచేశారు. మరో 40 వరకు దరఖాస్తులు అభ్యంతరాలతో కూడినవి కావటంతో.. మరోసారి క్షేత్రస్థాయి నుంచి నివేదికలను తెప్పించుకున్న తరువాతనే వాటిని సీనియారిటీ జాబితాలో చోటు కల్పించేలా చర్యలు చేపట్టారు. జాబితాలపై ఉన్నత స్థాయి సమీక్ష ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాలు, సవరణల కోరుతూ వచ్చిన అప్పీళ్ల విషయమై సోమవారం విద్యాశాఖ కమిషనరేట్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి డీఈవో ప్రేమ్కుమార్, సర్వీసు వ్యవహరాలు చూసే అసిస్టెంట్ డైరెక్టర్ అరుణ జ్యోతి, సంబంధిత సెక్షన్ అధికారులు, ఉద్యోగులు పాల్గొని, ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వివరాలను తెలియజేశారు. ఆందోళన వద్దు సీనియారిటీ జాబితాల్లో తప్పిదాలపై ఉపాధ్యాయులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఉమ్మడి జిల్లాలో అన్ని క్యాడర్ల వారీగా పూర్తి స్థాయిలో సమగ్ర పరిశీలన చేసిన తరువాతనే తుది జాబితాలను వెల్లడిస్తాం. జాబితాల్లో ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా.. ఉపాధ్యాయులు నేరుగా మా దృష్టికి తీసుకురావచ్చు. – ఎన్.ప్రేమ్కుమార్, నోడల్ అధికారి, ఉమ్మడి విశాఖ జిల్లా -
మరో విదేశీ విమానం పాయె
● ఇటీవల దుబాయ్ విమానం విజయవాడకు.. ● తాజాగా వియత్నాం విమానం హైదరాబాద్కు తరలింపు ● పట్టించుకోని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడు ● వైజాగ్ నుంచి సర్వీసులకు ఆసక్తి చూపిస్తున్న ఆకాశా ఎయిర్లైన్స్ ● స్పందించని కేంద్ర మంత్రి, ఎయిర్పోర్టు అధికారులు సాక్షి, విశాఖపట్నం : అంతర్జాతీయ విమాన సర్వీసులు విరివిగా నడిపేందుకు అన్ని అర్హతలున్నా.. కూటమి సర్కారు నిర్లక్ష్యం విశాఖ ఎయిర్పోర్టు పాలిట శాపంగా మారుతోంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి ఉత్తరాంధ్రకు చెందిన వారే అయినా.. వస్తున్న విమాన సర్వీసులు కూడా ల్యాండ్ అవ్వకుండా టేకాఫ్ అయిపోతున్నాయి. ఇటీవల దుబాయ్ విమానాన్ని విశాఖ రానీయకుండా కూటమి సర్కారు అడ్డుకొని విజయవాడకు తరలించేసింది. ఇప్పుడు కింజరాపు రామ్మోహన్నాయుడు నిర్లక్ష్యంతో వియత్నాం విమాన సర్వీసు హైదరాబాద్లో ల్యాండ్ అయిపోయింది. డొమెస్టిక్ సర్వీసుల విషయంలోనూ అదే నిర్లిప్తంగా ఎయిర్పోర్టు వర్గాలు వ్యవహరిస్తున్నారు. విశాఖ నుంచి చక్కర్లు కొట్టేందుకు ఆకాశా ఎయిర్లైన్స్ సిద్ధంగా ఉన్నా.. అధికారుల నుంచి ‘సిగ్నల్’ అందకపోవడంతో అది గాల్లోనే నిలిచిపోయింది. మేం వస్తామన్నా.. పట్టించుకోరా.? విదేశీ సర్వీసుల పరిస్థితి ఇలా ఉంటే.. డొమెస్టిక్ సర్వీసుల పెంపుపైనా అదే వైఖరి కనిపిస్తోంది. ప్రముఖ ఎయిర్లైన్స్ ఆకాశా సంస్థ.. వైజాగ్ నుంచి హైదరాబాద్తో పాటు దేశంలోని వివిధ నగరాలకు సర్వీసులు నడిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ఈ విషయంపై కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో పాటు వైజాగ్ ఎయిర్పోర్టు అధికారులకు నెల రోజుల క్రితమే సమాచారం పంపించింది. అయినా ఎవరూ స్పందించకపోవడంతో ఆకాశా ఎయిర్లైన్స్ ప్రతినిధులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
మొన్న దుబాయ్ విమానం
విశాఖపై రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న వివక్ష, స్లాట్లపై నౌకాదళ ఆంక్షలు.. మొదలైన కారణాలన్నీ ఎయిర్పోర్టుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రయాణికుల రాకపోకలతో పాటు కార్గో విభాగాలలో అపారమైన వృద్ధి సామర్థ్యం విశాఖకు ఉన్నా.. ప్రభుత్వం మాత్రం ఆ దిశగా చర్యలు చేపట్టడం మానేసింది. దీంతో కొత్త సర్వీసులు గగనమైపోతున్నాయి. మిడిల్ ఈస్ట్ దేశాలకు సర్వీసులు నడిపించేందుకు వైజాగ్ బెస్ట్ డెస్టినేషన్గా విమానయాన సంస్థలు భావిస్తుంటాయి. ఇటీవల మిడిల్ ఈస్ట్ దేశాల్లో ప్రముఖ ఎయిర్లైన్స్ సంస్థ ఎమిరేట్స్.. ఏపీ నుంచి దుబాయ్కు విమాన సర్వీసు నిర్వహించేందుకు సిద్ధమైన తరుణంలో.. రాష్ట్ర ప్రభుత్వం ఆ సర్వీసుని విజయవాడ నుంచి నడపాలని ఒత్తిడి తీసుకొచ్చింది. దీని వెనుక మంత్రి రామ్మోహన్నాయుడు చక్రం తిప్పడంతో.. ఇష్టం లేకపోయినా ఎమిరేట్స్ సంస్థ.. దుబాయ్ సర్వీసును విజయవాడ నుంచి ప్రారంభించేసింది. -
కమిషనర్ను నియమించకపోవడం కూటమి వైఫల్యమే..
డాబాగార్డెన్స్ : రాష్ట్రంలోనే విశాఖ కీలక నగరం..జీవీఎంసీ ఆయువుపట్టు..అలాంటి సంస్థకు కమిషనర్ను నియమించకపోవడం దారుణమని సీపీఎం, సీపీఐ జీవీఎంసీ ఫ్లోర్ లీడర్లు డాక్టర్ బి గంగారావు, ఏజే స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభు త్వం ఏర్పడిన తరువాత జీవీఎంసీ కమిషనర్గా సంపత్కుమార్ను నియమించారు. ఐదు నెలలు తిరగకముందే ఆఘమేఘాలపై ఆయనను చంద్రబాబు ప్రభుత్వం బదిలీ చేయడం వెనుక ఆంతర్యమేంటో అర్థం కావడం లేదన్నారు. తక్షణం జీవీఎంసీకి పూర్తిస్థాయి కమిషనర్ను నియమించాలని డిమాండ్ చేస్తూ సంస్థ ప్రధాన కార్యాలయ ద్వారం వద్ద సోమవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఎం ఫ్లోర్ లీడర్ గంగారావు మాట్లాడుతూ ఐదు నెలల కాలంలోనే డాక్టర్ సంపత్కుమార్ కమిషనర్గా సమర్థవంతంగా పని చేశారన్నారు. అటువంటి కమిషనర్ను ఐదు నెలలు తిరగకముందు కూటమి నేతల స్వార్థం కోసం ఆయనను అమరావతికి బదిలీ చేశారని ఆరోపించారు. కమిషనర్ బదిలీఅయి రెండు నెలలు కావస్తున్నా..జీవీఎంసీకి కమిషనర్ను నియమించాలని ఆలోచన చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. కూటమికి అనుకూలంగా ఉన్న వ్యక్తిని కమిషనర్గా నియమించేందుకు మీలో గలాటా జరుగుతుందని తెలిసింది. ఇది సరైనది కాదన్నారు. సీపీఐ ఫ్లోర్ లీడర్ ఏజే స్టాలిన్ మాట్లాడుతూ కమిషనర్ను నియమించకపోవడం దారుణమన్నారు. కూటమికి అనుకూల వ్యక్తి కోసమే ఆలస్యం సీపీఎం, సీపీఐ నేతల ఆందోళన -
ఏయూలో టెక్నో కల్చరల్ ఫెస్ట్
విశాఖ విద్య: ఆంధ్ర యూనివర్సిటీ మహిళా ఇంజినీరింగ్ కళాశాల కంప్యూటర్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో ‘రీబూట్–2కే25’పేరిట రెండు రోజుల పాటు నిర్వహించనున్న టెక్నో కల్చరల్ ఫెస్ట్ సోమవారం ప్రారంభమైంది. ఇంజినీరింగ్ విద్యార్థులు శసాంకేతిక అంశాల్లో నైపుణ్యత సాధించేలా సదస్సు నిర్వహిస్తున్నట్లు కాలేజీ ఫ్రిన్సిపాల్ ఆచార్య ఆర్.పద్మశ్రీ తెలిపారు. ముఖ్య అతిఽథిగా హాజరైన మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ జి.మల్లేశ్వరి విద్యార్ధినులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. సైబర్ క్రైమ్, డిజిటల్ అరెస్ట్, లైంగిక హింసలను ఎలా ఎదుర్కోవాలి, పోలీసుల సహాయం ఎలా తీసుకోవాలో వివరించారు. సీఎస్సీ అండ్ ఐటీ హెచ్వోడీ ఆచార్య బి.ప్రజ్ఙ, కో–ఆర్డినేటర్స్ డాక్టర్ బి.ఎస్తేర్ సునంద, ఎం.కుమారి, డాక్టర్ ఎస్.అరుణ, జి.శిరీష తదితరులు పాల్గొన్నారు. తొలిరోజు నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. -
మధురవాడలో ఆలయాల నిర్మాణానికి శంకుస్థాపన
మధురవాడ: మధురవాడ వైఎస్సార్ కాలనీలోని శ్రీ వాసవి మాత ఆలయ ఆవరణలో శివుడు, వేంకటేశ్వర స్వామి ఆలయాలతోపాటు వారాహి మాత ఆలయాలు నిర్మాణానికి సోమవారం కమిటీ ప్రతినిధులు, పలువురు ఆర్య వైశ్య ప్రముఖులు, అధికార పార్టీ నాయకులు శంకుస్థాపన చేశారు. గరివిడి శ్రీ విద్యా సౌరశక్తి పీఠానికి చెందిన ఆగమశాస్త్ర పండితులు సూర్యసదనంచే ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం సేవా సంఘం ప్రతినిధులు, నిర్మాణ కమిటీ ప్రతినిధి, వేంకటేశ్వర విద్యాసంస్థల అధినేత యేటూరి వేంకటేశ్వర్లు, పైడా విద్యాసంస్థల అధినేత పైడా కృష్ణప్రసాద్, కంకటాల మల్లికార్జునరావు, వైభవ్ జ్యూయలర్స్ గ్రంధి మల్లికా మనోజ్, మేఘాలయ గ్రంధి సురేష్, శ్రీకన్య, సినీపోలీస్ ఎన్వీఎస్ గురుమూర్తి, ఏఎస్ స్టీల్ ట్రేడర్స్ ఎ.నగేష్, వీ కన్వెన్షన్స్ పీవీ నరసింహారావు, జేకే లాజిస్టిక్స పి.శోభన్ ప్రకాష్, శ్రీకన్య ఫార్ూచ్యన్ కె. గురుమూర్తి, ఏయా ఆచార్యులు మద్దుల రామ్జీ, తిరుమల స్టీల్స్ గ్రంధి రాంజీ, లివింగ్ లైన్స్ శ్రీనివారావు, కార్పొరేటర్లు మొల్లి హేమలత, పిళ్ల మంగమ్మ, జెడ్సీ కనకమహాలక్ష్మి, నిర్మాణ కమిటీ ప్రతినిధులు పి.జగదీశ్, లక్ష్మీనారాయణ, కొల్లి వాసు పాల్గొన్నారు. -
● అంబరం.. తొలేళ్ల సంబరం
పైడిమాంబ ప్రతిమలతో భారీ ఊరేగింపు కంచరపాలెం : కంచరపాలెం పరిధి రామ్మూర్తిపంతులుపేట ఆరాధ్య దైవం పైడిమాంబ అమ్మవారి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొలేళ్ల సంబరం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ మహిళా కళాశాల ప్రాంగణం నుంచి అమ్మవారి ప్రతిమలను ఊరేగింపుగా తీసుకొచ్చారు. గౌరీ సేవా సంఘం గ్రామ అధ్యక్ష, కార్యదర్శులు కొణతాల గోవిందరాజు, బొడ్డేటి నర్సింగరావు నేతృత్వంలో సాయంత్రం 4 గంటల సమయంలో వందలాది అమ్మవారి ప్రతిమలను రామ్మూర్తి పంతులుపేట నుంచి జ్ఞానాపురం, డాబాగార్డెన్స్, జగదాంబ కూడలి, కాన్వెంట్ కూడలి మీదుగా తిరిగి అమ్మవారి మూలవిరాట్, ఆర్పీపేట రైల్వే గేటు వద్దకు తీసుకొచ్చారు. అమ్మవారి ప్రధాన విగ్రహాన్ని ఎమ్మెల్యే గణబాబు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త మళ్ల విజయప్రసాద్ దంపతులు, గ్రామ కమిటీ సభ్యులు తోడ్కొని వచ్చి తొలేళ్ల సంబరాన్ని ప్రారంభించారు. పలు వేషధారణలు, నేలవేషాలు ఆకట్టుకున్నాయి. సుమారు 385 అమ్మవారి ప్రతిమలు ఊరేగింపుగా తీసుకొచ్చారు. వేలాది మంది భక్తులు తరలివచ్చారు. మంగళవారం ప్రధాన ఉత్సవం జరగనుందని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. -
కమనీయం.. అనంతుని కల్యాణం
పద్మనాభం: పద్మనాభంలోని కుంతీ మాధవ స్వామి ఆలయంలో సోమవారం రాత్రి అనంత పద్మనాభ స్వామి కల్యాణం కనుల పండువగా జరిగింది. ముందుగా కుంతీ మాధవ స్వామి ఆలయం వద్ద ధ్వజారోహనం నిర్వహించారు. తదుపరి అనంత పద్మనాభ స్వామిని హనుమంతు వాహనంపైన, శ్రీదేవిని హంస వాహనంపై, భూదేవిని గజ వాహనంపై రాజవీధుల్లోఇ తీసుకు వెళ్లి ఎదురు సన్నాహ మహోత్సవం నిర్వహించారు. అనంత పద్మనాభ స్వామిని తూర్పు వైపున, శ్రీదేవి, భూదేవి విగ్రహాలను పడమర వైపున ఉంచి ఈ ఎదురు సన్నాహ మహోత్సవం జరిపారు. వేదపండితుల వేద మంత్రోచ్ఛరణలు, నాద మునీశ్వరుల స్వరాల నడుమ అనంత పద్మనాభ స్వామి కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. పరిసర ప్రాంతాలైన మద్ది, కృష్ణాపురం, రెడ్డిపల్లి, విలాస్కాన్పాలెంల నుంచే కాకుండా దూర ప్రాంతాలైన విజయనగరం, తగరపువలసల నుంచి తరలి వచ్చిన భక్తులు అనంతుని కల్యాణాన్ని కనులారా వీక్షించారు. ఈవో నానాజీబాబు పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ కంటుబోతు రాంబాబు, వైఎస్సార్ సీపీ మండల శాఖ అధ్యక్షుడు కోరాడ లక్ష్మణరావు, పద్మనాభం సర్పంచ్ తాలాడ పాప, భక్త బృందం సభ్యులు తాలాడ పద్మనాభం, కాళ్ల నగేష్ కుమార్, కంటుబోతు ఎర్నాయుడు, సుంకర నారాయణరావు,తాలాడ పైడిరాజు పాల్గొన్నారు. -
పోలీస్ శాఖలో బదిలీలు
విశాఖ సిటీ: విశాఖ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏఎస్ఐల నుంచి కానిస్టేబుళ్ల వరకు 34 మందికి స్థానచలనాలు కలిగాయి. ఈ మేరకు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఉత్తర్వులు జారీ చేశారు. ఎంవీపీ లాండ్ ఆర్డర్ ఏఎస్ఐగా ఉన్న పి.నరసింగరావును త్రీటౌన్కు, మల్కాపురం క్రైమ్ ఏఎస్ఐ జియా రుక్సానాను మహారాణిపేట లా అండ్ ఆర్డర్కు, అక్కడ విధులు నిర్వర్తిస్తున్న కె.సుబేదాబేగంను కంచరపాలెం లా అండ్ ఆర్డర్కు బదిలీ చేశారు. వీరితో పాటు 20 మంది హెడ్కానిస్టేబుళ్లు, 11 మంది కానిస్టేబుళ్లకు బదిలీ అయ్యాయి. -
ఇళ్ల స్థలాల కోసం తహసీల్దార్ కార్యాలయం ముట్టడి
ఆరిలోవ: కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం రూరల్ తహసీల్దారు కార్యాలయాన్ని ముట్టడించింది. ఆరిలోవ, మధురవాడ, ఎండాడ, రుషికొండ తదితర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ఇళ్లులేని పేదలు తహసీల్దారు కార్యాలయం సమీపానికి చేరుకొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, జిల్లా నాయకులు, పేదలతో కలిసి జాతీయరహదారిపై విశాఖ వ్యాలీ స్కూల్ కూడలి నుంచి తహసీల్దారు కార్యాలయం వరకు ఎర్ర జెండాలు పట్టుకొని ర్యాలీ చేశారు. అనంతరం తహసీల్దారు కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం పేదలు నుంచి ఇళ్ల స్థలాలు కోసం దరఖాస్తులు సేకరించి తహసీల్దారు పాల్కిరణ్కు అందజేశారు. అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ కూటమి నాయకులు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఏర్పడి తర్వాత అమలు చేయలేదన్నారు. ఇళ్ల స్థలాలు మంజూరు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు గడిచినా ఇంతవరకు సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేదన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా నాయకులు పైడిరాజు, తదితరులు పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో ఆందోళన -
అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదుల వెల్లువ
డాబాగార్డెన్స్: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జీవీఎంసీలో నిర్వహించారు. పట్టణ ప్రణాళికా విభాగానికి సంబంధించి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వివిధ జోన్లలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు అధికంగా వచ్చాయి. జీవీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో జీవీఎంసీ అదనపు కమిషనర్ డీవీ రమణమూర్తితో కలిసి నగర మేయర్ గొలగాని హరి వెంకటకుమారి పీజీఆర్ఎస్ను నిర్వహించారు. మొత్తం 90 వినతులు రాగా..అత్యధికంగా పట్టణ ప్రణాళికా విభాగానికి 50 ఫిర్యాదులు అందాయి. నిర్ణీత సమయంలో వీటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను మేయర్ ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ సోమన్నారాయణ, ప్రధాన ఇంజినీరు శివప్రసాద్, చీఫ్ సిటీ ప్లానర్ ప్రభాకరరావు, ప్రధాన వైద్యాధికారి నరేష్కుమార్ పలువురు అధికారులు పాల్గొన్నారు. జీవీఎంసీ పీజీఆర్ఎస్కు 90 వినతులు -
సామాజిక విప్లవకారిణి సావిత్రిబాయి పూలే
సాక్షి, విశాఖపట్నం : మహిళల సమానత్వం కోసం, వారి అభ్యున్నతి కోసం ఉద్యమం చేసిన సామాజిక విప్లవకారిణి సావిత్రిబాయి పూలే అని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అన్నారు. సోమవారం మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో విశాఖ జిల్లా బీసీ విభాగం అధ్యక్షుడు సనపల రవీంద్ర భరత్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన గుడివాడ అమర్నాథ్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ జె.సుభద్ర, ఎమ్మెల్సీ కుంబా రవిబాబు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర, జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. -
అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలి
మహారాణిపేట: ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో వచ్చిన అర్జీలను 24 గంటలలోపు ఓపెన్ చేసి, పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి, పునరావృతం కాని విధంగా సంతృప్తి కరమైన పరిష్కారం చూపాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక‘ కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్ నిర్వహించారు. వివిధ ప్రాంతాల ప్రజల నుంచి అర్జీలను కలెక్టర్తో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి భవానీ శంకర్, జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ వర్మ స్వీకరించారు. అధికారులతో సమీక్ష : ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రారంభానికి ముందుగా అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర జిల్లాలో రీ–ఓపెన్ అర్జీలు తరచుగా రావడంపై అధికారులపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీపం పథకం అమలు, లబ్ధిదారుల ఖాతాలకు సబ్సిడీ అందుతున్నది లేనిది గమనించాలని సివిల్ సప్లై అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ఇసుక లభ్యత, వినియోగంపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో పీ4 సర్వేపై అధికారులకు కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు మొత్తం 332 వినతులు అందాయి. వాటిలో రెవెన్యూ శాఖకు చెందినవి 131 ఉండగా, పోలీసు శాఖకు సంబంధించినవి 24, జీవీఎంసీ సంబంధించి 111 ఉన్నాయి. అలాగే ఇతర విభాగాలకు సంబంధించి 66 వినతులు వచ్చాయి. పీజీఆర్ఎస్లో వినతులు స్వీకరించిన కలెక్టర్ హరేందిర ప్రసాద్ -
ఘనంగా సీఐఎస్ఎఫ్ రైజింగ్ డే
కంచరపాలెం: విశాఖ పోర్ట్ అథారిటీ 56వ సీఐఎస్ఎఫ్ రైజింగ్డే సాలిగ్రామపురం సీఐఎస్ఎఫ్ పరేడ్ గ్రౌండ్లో సోమవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పోర్ట్ చైర్మన్ డాక్టర్ ఎం.అంగముత్తు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమల రక్షణలో సీఐఎస్ఎఫ్ సిబ్బంది సేవలు అభినందనీయమన్నారు. సీఐఎస్ఎఫ్ యూనిట్ తన సత్తా, నైపుణ్యాలను ప్రదర్శిస్తూ డాగ్ షో, మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శన, పిరమిడ్ ఫార్మేషన్, ఫైర్ డ్రిల్ నిర్వహించారు. సీఐఎస్ఎఫ్ యూనిట్ సీనియర్ కమాండెంట్ సతీష్కుమార్ బాజ్పాయ్, పీఎస్ఎల్ స్వామి, టి.వేణుగోపాల్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు
విశాఖ సిటీ : నగరంలోని హోటళ్లు, లాడ్జీల్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జోన్–1, జోన్–2 పరిధిలో 78 బృందాలతో 96 హోటళ్లు, లాడ్జీల్లో ఏకకాలంగా బాడీ వార్న్, మొబైల్ కెమెరాలను వినియోగిస్తూ సోదాలు చేపట్టారు. అతిథుల జాబితాలో పరారీ నిందితులు, ఎన్బీడబ్ల్యూలు ఉన్న వారు, వీసా, పాస్పోర్ట్ లేని, వీసా అనుమతికి మించి ఉన్న వారి కోసం తనిఖీ చేశారు. అసాంఘిక కార్యక్రమాలపైనే కాకుండా ఫైర్ ఎన్వోసీ, ట్రేడ్ లైసెన్స్, జీఎస్టీ, ఫుడ్ లైసెన్స్, మద్యం అమ్మకాలు, సీసీ టీవీల పనితీరు ఇలా అన్ని అంశాలను పరిశీలించారు. అనుమతులు లేకుండానే వ్యాపారాలు : పోలీసుల తనిఖీల్లో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఫైర్ ఎన్వోసీ, జీఎస్టీ, ట్రేడ్ లైసెన్సులు లేకుండానే హోటళ్లు, లాడ్జీలు నిర్వహిస్తున్నట్లు మరోసారి వెల్లడైంది. ఇప్పటికే పలుమార్లు పోలీసుల తనిఖీల్లో ఈ విషయం నిర్ధారణ అయినప్పటికీ.. సంబంధిత శాఖ అధికారులు ఇప్పటికీ వాటిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. పోలీసుల తాజాగా తనిఖీల్లో కూడా పదుల సంఖ్యలో హోటళ్లు, లాడ్జీలు అనుమతులు లేకుండా వ్యాపారాలు చేస్తున్నట్లు స్పష్టమైంది. 42 హోటళ్లు, లాడ్జీలలకు అగ్నిమాపక ఎన్వోసీలు లేనట్లు గుర్తించారు. అలాగే 12 సముదాయాలకు ట్రేడ్ లైసెన్సులు, మరో 12 హోటళ్లకు ఫుడ్ లైసెన్సులు, 17 వ్యాపారాలకు జీఎస్టీ సర్టిఫికెట్లు లేనట్లు నిర్ధారణైంది. అదే విధంగా రెండు హోటళ్లలో సందర్శకుల రికార్డులు నిర్వహించడం లేదని, 14 హోటళు, లాడ్జీలలో విజిటర్స్ మోనిటరింగ్ సిస్టమ్లో సందర్శకుల సమాచారాన్ని అప్డేట్ చేయ డం లేదని, 2 హోటళ్లలో సీసీటీవీలను పర్యవేక్షించడం లేదని వెల్లడైంది. వ్యాపారులు తప్పనిసరిగా నిబంధనలు అనుసరించాలని, పాటించని వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి నిర్వాహకులను హెచ్చరించారు. 78 పోలీస్ బృందాలతో 96 హోటళ్లు, లాడ్జీల్లో సోదాలు ఫైర్ ఎన్వోసీలు లేకుండా 42 హోటళ్లు, లాడ్జీల నిర్వహణ -
హైకోర్టు న్యాయమూర్తి దృష్టికి జిల్లా కోర్టు సమస్యలు
విశాఖ–లీగల్ : విశాఖ జిల్లా కోర్టు ప్రాంగణంలో పలు సమస్యలు పరిష్కరించే దిశగా రాష్ట్ర హైకో ర్టు తమ వంతు చేయూతనిస్తుందని విశాఖ జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు బెవర సత్యనారాయణ తెలిపారు. సోమవారం రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. పది నెలలుగా మూతపడ్డ విశాఖ న్యాయవాద సంఘం క్యాంటీన్ తిరిగి ప్రారంభించడానికి హైకోర్టు న్యాయమూర్తి సుముఖంగా ఉన్నారని తెలిపారు. అలాగే న్యాయవాదుల సంఘం ప్రాంగణంలో ఏసీలను అమర్చేందుకు సానుకూలంగా ఉన్నట్లు చెప్పారు. న్యాయవాదులు సమర్పించిన వినతి పత్రాలపై ప్రివిలేజ్ కమిటీలో పెడతామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వివరించారు. గత నెల 23న న్యాయవాద సంఘాలు తీర్మానం చేసిన హైకోర్టు బెంచ్ క్యాట్ ట్రిబ్యునల్ వంటివి సంబంధించి హైకోర్టు న్యాయమూర్తుల సంఘంతో చర్చిస్తామని హామీ ఇచ్చారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసిన వారిలో న్యాయవాదుల సంఘం కార్యదర్శి దంతి నరేష్, ఉపాధ్యక్షుడు శ్రీనివాసరావు, సభ్యులు ఉన్నారు. -
నిర్ణీత గడువులోగా వినతులు పరిష్కరించాలి
విశాఖ సిటీ: ప్రజాదర్బార్ కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్గోపాల్, కమిషనర్ కె.ఎస్.విశ్వనాథన్ అధికారులను ఆదేశించారు. సోమవారం వీఎంఆర్డీఏ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమానికి మొత్తం 16 ఫిర్యాదులు వచ్చాయి. ప్రైవేట్ లేఅవుట్లకు సంబంధించి ప్లాట్ల విషయంలో ఎక్కువగా ఫిర్యాదులు రాగా.. వాటిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించా రు. ప్రజాదర్బార్కు వచ్చిన ఫిర్యాదులు పునరావృతం కాకుండా చూడాలని సూచించారు. అలాగే మాస్టర్ ప్లాన్కు సంబంధించి పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వాటిని త్వరలో పరిశీలిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో జేసీ కె.రమేష్, ప్రధాన అర్బన్ ప్లానర్ శిల్ప, ప్రధాన ఇంజనీర్ వినయ్ కుమార్, కార్యదర్శి మురళీకృష్ణ పాల్గొన్నారు. -
ఎన్ఆర్ఐ మహిళ మృతి కేసులో బిగ్ ట్విస్ట్
విశాఖ: ఇటీవల నగరంలో ఓ స్టార్ హోటల్ లో ఓ ఎన్ఆర్ఐ మహిళ మృతికి సంబంధించిన కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులు, అనుమానితులు ఎవరూ లేరని తొలుత ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న పోలీసులు.. చివరకు ఆమె వెంటే ఉన్న డాక్టర్ శ్రీధర్ ను అదుపులోకి తీసుకున్నారు.ఈ కేసుకు సంబంధించి అనుమానాలు ఎక్కువ కావడంతో పాటు ‘సాక్షి’ వరుస కథనాలతో పోలీసు యంత్రాంగం కదిలింది. ఆ ఎన్ఆర్ఐ మహిళ ఆత్మహత్య చేసుకునేలా డాక్టర్ పిల్లా శ్రీధర్ ప్రేరేపించాడని అభియోగాలు నమోదు చేసిన పోలీసులు.. డాక్టర్ శ్రీధర్ ను అరెస్ట్ చేశారుఈ నెల 8వ తేదీన ఓ స్టార్ హెటల్ లో ఎన్నారై మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆ హోటల్ వాష్ రూమ్ లో ఎన్నారై మహిళ ఉరివేసుకుని ఉంది. అయితే ఆ సమయంలోనే కూడా ఉన్న డాక్టర్ పై అనుమానాలు రేకెత్తాయి. చివరకు డాక్టర్ శ్రీధర్ ను అరెస్ట్ చేయడంతో ఈ కేసు మరో అడుగు ముందుకు కదిలింది. బీఎన్ఎస్ 108 ప్రకారం కేసు నమోదు చేసి.. నిందితుడిని రిమాండ్ కు తరలించారు. అయితే ఎన్నారై మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆత్మహత్య చేసుకునేలా చేశాడా?, లేక హత్య చేశాడా అనేది విచారణలో తెలియాల్సి ఉంది. ఇక డాక్టర్ పిల్లా శ్రీధర్ ను పోలీసులు కస్టడీకి కోరతారా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. -
పాపాహోం నుంచి శాటిలైట్ సెంటర్కు..
సీతమ్మధార: తల్లిదండ్రులు విడిపోయారు. దీంతో ఆ బాలిక భవిష్యత్ అంధకారంలో పడిపోతుందనుకున్నారు. అమ్మమ్మ అన్నీ అయి చదివించారు. సీతమ్మధార పాపాహోంలో(Seethammadhara) ఉంటూ చదువుకున్న ఆమె ప్రస్తుతం ఉన్నతోద్యోగం చేయడం విశేషం. దీంతో త్వరలోనే పాపాహోం ఆవరణలో ఆమెకి ఘనంగా సత్కారం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ యువతి విజయగాథ మనమూ తెలుసుకుందాం. గూడూరుకు చెందిన భట్టిపాటి ప్రియాంక (21)(Bhattipati Priyanka) విశాఖ జిల్లా తగరపువలసలో మేనమామ వద్ద ఉంటూ చదువుకునేది. 9వ తరగతి చదివే సమయంలో 2017లో పాపాహోంలో చేరింది. సీతమ్మధారలోని డాల్ఫిన్ స్కూల్లో 9, పది చదివింది. ఈమెకి తల్లి లేరు. తండ్రి రెండో వివాహం చేసుకున్నారు. ప్రియాంక డిప్లమో ఇన్ కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ (డీసీసీ) పూర్తి చేసింది. తర్వాత నెల్లూరు జిల్లాలో డీకేడబ్ల్యూ కళాశాలలో బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ బ్రాంచ్లో (సీఏ)లో చేరింది. భీమునిపట్నం పాలిటెక్నిక్ కళాశాలలో పాపాహోం ఆర్థిక సాయంతోనే డిప్లమో చదివింది. ఈ కళాశాల నుంచి విద్యార్థుల వివరాలు పంపడంతో శ్రీహరికోటలోని స్పేస్ సెంటర్లో ఏడాది పాటు అప్రెంటిస్ శిక్షణకు ఎంపికై శిక్షణ తీసుకుంది. గత ఏడాది అక్టోబర్లో ఈ శిక్షణ పూర్తి అయింది. ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా బెంగళూరులోని కేంద్ర ప్రభుత్వానికి చెందిన యూఆర్ రావు శాటిలైట్ సెంటర్లో అకౌంట్స్లో సీహెచ్ఎస్ఎస్ పోస్టులో కాంట్రాక్ట్ విధానంలో పని చేస్తోంది. ప్రస్తుతం ఆమెకి రూ.22 వేల వేతనం అందుతోంది. రాకెట్ లాంచింగ్ ఉద్యోగమే లక్ష్యం.. నేను 2003లో గూడూరులో పుట్టాను. 2008లో నా తల్లిదండ్రులు విడిపోయారు. గూడూరులోని అమ్మమ్మ వద్దే పెరిగాను. విశాఖలోని పాపాహోంలో ఉంటూ డాల్ఫిన్ స్కూల్లో 9వ తరగతిలో చేరాను. అక్కడే పదో తరగతి పూర్తి చేశాను. భీమిలిలో డిప్లమో చేశాను. 2018లో తల్లి ఇంట్లోంచి వెళ్లిపోయారు. ఎక్కడున్నారో తెలియదు. రాకెట్ లాంచింగ్ సెంటర్లో ఉద్యోగమే ధ్యేయంగా పని చేస్తున్నాను. గూడురులో అమ్మమ్మ బాగోగులు నేనే చూస్తున్నాను. – ప్రియాంక, బెంగళూరు. -
బాలికపై అత్యాచారం?
సాక్షి, విశాఖపట్నం: సంగివలస అనిల్ నీరుకొండ ఆస్ప త్రిలో చికిత్సకు వచ్చిన మానసిక వికలాంగురాలైన బాలికపై శనివారం రాత్రి అత్యాచారం జరిగిన ఘటనతో ఈ ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది. బాధితురాలితో పాటు అత్యాచార ఘటనకు పాల్పడిన నిందితుడు(35) ఒడిశాలోని మల్కన్గిరి ప్రాంతం కావడం గమనార్హం. సంఘటన శనివారం రాత్రి 9 నుంచి 10 గంటల మధ్య జరిగినా ఆస్పత్రి సిబ్బంది ఆదివారం వరకు భీమిలి పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. సంఘటన జరిగిన తర్వాత నిందితుడిని ఆస్పత్రి ప్రధాన ద్వారం వద్ద సెక్యూరిటీ గదిలో ఉంచారు. అత్యాచారానికి గురైన బాలిక ఆదివారం ఉదయం వరకు రక్తస్రావంతో బాధపడుతున్నట్టు తెలిసింది. అత్యాచార సమాచారం అందుకున్న మీడియా ఆస్పత్రి వద్ద ఆరా తీయడంతో భీమిలి పోలీసులు రంగప్రవేశం చేశారు. పోలీసులు ఆస్పత్రిలోకి రాక ముందే బాధితురాలి కుటుంబ సభ్యులతో ఆస్పత్రి యాజమాన్యం చర్చలు జరిపి రాజీకి వచ్చినట్టు తెలిసింది. తరువాత మధురవాడ జోన్ ఏసీపీ అప్పలరాజు ఆస్పత్రి వద్దకు చేరుకుని విచారణ ప్రారంభించారు. ఇదిలా ఉండగా మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఆస్పత్రి సిబ్బంది మీడియాను ఏమార్చి నిందితుడిని ఆటోలో జాతీయరహదారి వరకు తరలించి అక్కడ నుంచి ఒడిశాకు పంపించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాలికపై అత్యాచారం జరిగినట్టు ఆధారాలు లేదా వారి కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు ఉంటే తప్ప ఏమీ చేయలేమని పోలీసులు చేతులెత్తేశారు. ఇదిలా ఉండగా నిందితుడు బాధితురాలిని మూడో ఫ్లోర్ నుంచి ఆరో ఫ్లోర్కు తీసుకువెళ్లినట్టు తెలిసింది. సంఘటన జరిగినా పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.సంగివలస అనిల్ నీరుకొండ ఆస్పత్రి యాజమాన్యం తరచూ విశాఖ, విజయనగరం, ఒడిశాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి మెరుగైన వైద్యం కోసం ఇక్కడకు తీసుకొస్తుంటారు. ప్రస్తుతం అత్యాచార బాధితురాలు, నిందితుడు ఇదే విధంగా చికిత్స కోసం మల్కన్గిరి నుంచి వచ్చారు. అత్యాచారయత్నమే జరిగింది.. ఆస్పత్రి సిబ్బంది మీడియాతో మాట్లాడుతూ మల్కన్గిరి నుంచి వచ్చిన 25 మందికి చికిత్స తరువాత శనివారం డిశ్చార్జ్ చేశామన్నారు. చీకటి పడటంతో ఆదివారం పంపించడానికి గానూ వారిని ఆరో ఫ్లోర్లో ఉంచామన్నారు. బాధితురాలు వాష్ రూమ్లోకి వెళ్లగా నిందితుడు ఆమె వెంట వెనకే వెళ్లాడన్నారు. ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో మిగిలిన వారు అతనికి దేహశుద్ధి చేసి తమకు అప్పగించారన్నారు. -
రూమ్ నంబరు 229లో ఏమి జరిగింది?
సాక్షి, విశాఖపట్నం: ఎన్ఆర్ఐ మహిళ రోజా అనుమానాస్పద మృతిపై మూడో పట్టణ పోలీసులు విచారణ ప్రారంభించారు. హోటల్ సిబ్బందిని ఆదివారం పిలిపించి ఈ సంఘటన జరిగిన 6వ తేదీన మేఘాలయ హోటల్ రూమ్ నంబరు 229లో ఏమి జరిగిందోనని వివరాలు సేకరించారు. రోజా ఆమె స్నేహితుడు పిల్లా శ్రీధర్ ఎప్పుడు హోటల్కు వచ్చారు? వారికోసం ఎవరైనా వచ్చారా? హోటల్ సిబ్బందితో ఎలా ప్రవర్తించేవారు? తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రాథమికంగా ఆత్మహత్యగా పోలీసులు నిర్ధారిస్తున్నప్పటికీ.. పోస్టుమార్టం రిపోర్టు వస్తే కాని ఏమి చెప్పలేని పరిస్థితి నెలకొంది. కేసు నీరుగార్చే ప్రయత్నం? ఈ కేసును మొదటి నుంచి కప్పిపుచ్చేందుకు పోలీసులు ప్రయతి్నస్తున్నారు. సంఘటన జరిగిన రోజు సాయంత్రం మేఘాలయ హోటల్ మేనేజర్ ఫిర్యాదు చేస్తే కనీసం ఏమి జరగనట్లు మూడో పట్టణ పోలీసులు వ్యవహరించారు. చివరికి మీడియా ప్రతినిధులు పోలీసులను సంప్రదించినా అటువంటది ఏమి లేదని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. అయితే మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు రావడంతో పోలీసులు విచారణ షురూ చేశారు. కానీ ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన అంశాలను పరిశీలిస్తే కేసును నీరుగార్చే విధంగా ఉంది. కేసులో నిందితులు ఎవరు లేరు? మూడో పట్టణ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో అసలు నిందితులు ఎవరు లేరని పేర్కొన్నారు. హోటల్ మేనేజర్ తన ఫిర్యాదులో రోజా మృతి పట్ల అనుమానంగా ఉందని తెలిపారు. తొలుత డాక్టర్ శ్రీధర్ అనే వ్యక్తి హోటల్ రూమ్ నుంచి బయటకి వచ్చి రూమ్ డోర్ అనుకోకుండా లాక్ అయిందని చెప్పారని, రూమ్ దగ్గరకి వెళ్లేసరికే తన స్నేహితురాలు అపస్మారక స్థితిలో ఉందని చెప్పారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయినా సరే శ్రీధర్ను నిందితుడిగా చేర్చకుండా పొలీసులు విచారణ చేయడంపై పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఫిర్యాదులోనూ లొసుగులు? నిజానికి మేఘాలయ హోటల్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదులో కూడా చాలా లొసుగులు ఉన్నాయి. డాక్టర్ శ్రీధర్ 6వ తేదీ మధ్యాహ్నం 1.15 గంటలకు హోటల్కు వచ్చినట్లు.. 1.40 గంటలకు రోజా నేరుగా హోటల్ రూమ్ నంబర్ 229కి వెళ్లినట్లు పేర్కొన్నారు. 3.35 గంటలకు శ్రీధర్ రూమ్ నుంచి బయటకి వచ్చి హోటల్ సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. రెండు గంటల పాటు రోజా, శ్రీధర్ మాత్రమే రూమ్లో ఉన్నట్లు తెలుస్తుంది. రూమ్లో శ్రీధర్ ఉండగా రోజా బాత్రూమ్లో ఆత్మహత్య చేసుకుందా..? అసలు హుక్ గానీ, కిటీకీ గాని లేని బాత్రూమ్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉంటుందా..? హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారా? ఇలా అనేక సందేహాలు ఈ కేసు చుట్టూ తిరుగుతున్నాయి. -
విశాఖ స్టీల్ప్లాంట్ కార్మికుల ఆందోళన
సాక్షి, విశాఖపట్నం: గాజువాకలో స్టీల్ ప్లాంట్ కార్మికులు ధర్నాకు దిగారు. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపునకు నిరసనగా అఖిలపక్ష కార్మిక సంఘాలు ఉద్యమానికి నడుం బిగించాయి. నేడు గాజువాకలో భారీ ఆందోళనకు పిలుపునిచ్చింది. నిన్న 900 మంది కాంట్రాక్ట్ కార్మికులను యాజమాన్యం తొలగించింది. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. భారీగా కార్మికులు హాజరయ్యారు. -
విశాఖకు ఎన్నారై మహిళ ఎందుకొచ్చింది?.. ఆ రూమ్లో ఏం జరిగింది?
విశాఖ సిటీ: విశాఖలో ఖాకీ క్రైమ్ కథా చిత్రం.. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. ఒక ఎన్ఆర్ఐ మహిళ, ఒక వైద్యుడు మధ్య ఏం జరిగిందన్న అంశం హాట్ టాపిక్గా మారింది. విశాఖకు చెందిన ఒక వైద్యుడు రెండు వారాలకు పైగా హోటల్లోనే ఎందుకు బస చేశాడు? అమెరికా పౌరసత్వం కలిగిన మహిళ విశాఖకు ఎందుకు వచ్చింది? ఆమె ఆ వైద్యుడు ఉన్న రూమ్ నెంబర్ 229లో ఎందుకు ఉంది? వారి మధ్య గొడవ జరగడానికి గల కారణమేంటి? కొద్ది నిమిషాల్లోనే ఆమె బాత్రూమ్లో నగ్నంగా విగతజీవిగా ఎలా మారింది?పోలీసులకు ఎవరు సమాచారమిచ్చారు? కిటికీ గానీ, హుక్గానీ లేని బాత్రూమ్లో ఆమె ఎలా ఉరి వేసుకుంది? ఆ సమయంలో వైద్యుడు అక్కడే ఉన్నాడా? రెండు రోజుల పాటు ఈ ఘటన బయటకు రాకుండా పోలీసులు ఎందుకు గోప్యంగా ఉంచారు? ఎఫ్ఐఆర్లో వైద్యుడి పేరును చేర్చారా? లేదా? అతడి సెల్ఫోన్లో ఎవరి ప్రైవేట్ వీడియోలు ఉన్నాయి? హోటల్ గదిలో పోలీసులు ఎటువంటి సామగ్రి గుర్తించారు? ఇంటెలిజెన్స్ అధికారులకు కూడా ఈ కేసు సమాచారం ఇవ్వకపోవడం వెనుక మర్మమేంటి? ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. అనేక ఊహకందని ప్రశ్నలు థ్రిల్లర్ సినిమాకు మించి సస్పెన్స్ను క్రియేట్ చేస్తున్నాయి. అయితే విశాఖ పోలీసులు మాత్రం ఆ ప్రశ్నలన్నింటినీ పక్కనపెట్టి.. సింపుల్గా అనుమానాస్పద మృతి అని తేల్చేశారు. ఈ కేసు విషయంలో పోలీసుల వ్యవహార శైలి తీవ్ర వివాదాస్పదమవుతోంది. గురువారం మధ్యాహ్నం ఘటన జరిగితే.. అదే రోజు సాయంత్రం ఎఫ్ఐఆర్ నమోదు చేసి కూడా శనివారం వరకు బయటకు రాకుండా ఉంచడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇందుకోసం రూ.కోటి వరకు ఒప్పందం జరిగిందన్న ఊహాగానాలు చెలరేగుతున్నాయి. పోలీసుల తీరే ఈ ఆరోపణలు చెలరేగడానికి తావిస్తోంది. వైద్యుడు ఫ్యామిలీ ఫ్రెండ్? విశాఖకు చెందిన వైద్యుడు పిల్లా శ్రీధర్ రెండు వారాలకు పైగా హోటల్ మేఘాలయలో బస చేస్తున్నారు. సీతమ్మధార ప్రాంతానికి చెందిన కాకర్లపూడి రోజా ప్రస్తుతం వివాహం చేసుకొని యూఎస్లో స్థిరపడ్డారు. రోజా కుటుంబానికి శ్రీధర్ ఫ్యామిలీ ఫ్రెండ్గా తెలుస్తోంది. నాలుగు రోజుల క్రితం రోజా విశాఖకు వచ్చి శ్రీధర్ ఉన్న గదిలోనే ఉంటోంది. అయితే గత గురువారం వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు సమాచారం. కొద్ది నిమిషాల్లోనే ఆమె బూత్రూమ్లో అనుమానాస్పదంగా మృతి చెందింది. పోలీసులకు సమాచారం ఇచ్చింది ఎవరు? ఆమె మృతి చెందిన విషయాన్ని పోలీసులకు ఎవరు సమాచారం ఇచ్చారన్న విషయం సస్పెన్స్గా మారింది. అయితే మహిళ బాత్రూమ్లో ఉరి వేసుకొని చనిపోయిందని హోటల్ మేనేజర్ ఫిర్యాదు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. రూమ్లో శ్రీధర్ మాత్రమే ఉంటే.. హోటల్ మేనేజర్కు ఆమె చనిపోయిందన్న విషయం ఎలా తెలిసింది? ఆత్మహత్య చేసుకోవాలనుకునే రోజా ఎందుకు నగ్నంగా ఉంది. ఫ్యాన్ హుక్, కిటీకీ గానీ లేని బాత్రూమ్లో ఆమె ఎలా ఉరి వేసుకుంది? ఇలా అనేక ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి ఉంది. పోలీసులు వచ్చిన సమయంలో శ్రీధర్ రూమ్లోనే ఉన్నారా? పోలీసులు అతడి పేరును ఎఫ్ఐఆర్లో నమోదు చేశారా? లేదా అన్న విషయం తేలాల్సి ఉంది. ఎందుకంత గోప్యం.. గురువారం మధ్యాహ్నం ఘటన జరిగితే అదే రోజు సాయంత్రం 5.30కి ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం రాత్రి విషయం బయటకు పొక్కడంతో మీడియా త్రీటౌన్ సీఐ రమణయ్యను సంప్రదించారు. అసలు అటువంటి ఘటనే జరగలేదని, తప్పుడు సమాచారమని చెప్పి తప్పించుకున్నారు. శనివారం ఉదయం ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళితే.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికీ కూడా ఈ కేసు పూర్తి వివరాలను పోలీసులు బయటకు వెల్లడించకపోవడం గమనార్హం.చదవండి: భర్త మటన్ కట్టింగ్.. ప్రియుడు కిరాణం షాపు.. చివరికి..కేసు మాఫీకి ప్రయత్నాలు? ఈ కేసును మాఫీ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఎన్ఆర్ఐ మహిళది హత్యా? ఆత్మహత్య? అన్నది తేలాల్సి ఉంది. ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆ వార్తలకు పోలీసుల వ్యవహార శైలే బలాన్ని చేకూరిస్తున్నాయి. ఈ ఘటన బయటకు రాకుండా ఉండేందుకు భారీ స్థాయిలో ఒప్పందాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందులో ఒక ఉన్నతాధికారి పాత్ర కూడా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే శనివారం మహిళ మృతదేహానికి కేజీహెచ్లో పోస్టుమార్టం నిర్వహించారు. ఆ నివేదిక ఆధారంగా కేసులో చర్యలు తీసుకుంటామని నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి చెబుతున్నారు. -
మహిళల భద్రతకు ప్రాధాన్యం
● జిల్లా ఇన్చార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ● ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం బీచ్రోడ్డు: రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తోందని, అందులో భాగంగానే ‘శక్తి’ యాప్ను ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. సిరిపురంలోని వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో శనివారం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఇన్చార్జి మంత్రి మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో విజయాలు సాధించిన మహిళలను గుర్తించి, వారిని గౌరవించాలన్నారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. మహిళల హక్కులు, సమానత్వం, సాధికారత గురించి చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. విద్య, ఉద్యోగ రంగాల్లో మహిళలు పురుషులతో సమానంగా ఉన్నత విజయాలు సాధిస్తున్నారని కొనియాడారు. ప్రభుత్వం ఇళ్ల పట్టాలను మహిళల పేరునే మంజూరు చేస్తుందని తెలిపారు. మహిళల పై దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబన చేకూర్చుకునేందుకు షియో ఆటోలు, ద్విచక్ర వాహనాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని స్వయం సహాయక బృందాలు తయారుచేసిన ఉత్పత్తులను ఆన్లైన్లో అమ్మకాల ద్వారా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ చోటు దక్కించుకోనున్నాయని వెల్లడించారు. కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత స్థితికి చేరేందుకు ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తోందన్నారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ద్వారా ప్రతీ మహిళ ఆర్థికంగా స్థిరపడాలన్నారు. జిల్లాలో ర్యాపిడో ద్వారా 200 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నట్లు చెప్పారు. అనంతరం కళాకారులు, చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. తర్వాత మహిళా సంఘాలకు చెక్కులు పంపిణీ చేశారు. వ్యాసరచన, క్రీడలు, తదితర పోటీల్లో విజేతలకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు ప్రదానం చేశారు. వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహిళలను ఘనంగా సన్మానించారు. మహిళా సంఘాల లబ్ధిదారులకు ర్యాపిడో స్కూటీలు, ఆటోలను మంత్రి పంపిణీ చేశారు. కార్యక్రమ ప్రాంగణంలో మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రి పరిశీలించారు. పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణ బాబు, విష్ణుకుమార్ రాజు, మహిళా శిశు సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ జి చిన్నయిదేవి, విశాఖ జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు వై.గంగాభవానీ, జిల్లా సమైక్య కార్యదర్శి సూరమ్మ తదితరులు పాల్గొన్నారు. పీఎం అజయ్ పథకం చెక్కు అందజేత ఎంవీపీకాలనీ: జిల్లాలోని ఎస్హెచ్జీ మహిళలకు పీఎం అజయ్ ఉన్నతి పథకంలో భాగంగా రూ.35 లక్షల చెక్కును అందజేశారు. ఈ పథకం ద్వారా రూ.50 వేల రాయితీ రుణం కోసం జిల్లాలోని 25 మంది లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సత్యపద్మ తెలిపారు. ఈ నిధుల చెక్కును మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి సమక్షంలో లబ్ధిదారులకు అందజేసినట్లు వివరించారు. -
కేజీహెచ్లో పిల్లల కోసం అత్యాధునిక వైద్యం
మహారాణిపేట: కేజీహెచ్లోని పీడియాట్రిక్ వార్డులో అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ నూతన సౌకర్యాలు పిల్లల్లో వ్యాధులను క్షణాల్లో గుర్తించడంతో పాటు, మెరుగైన చికిత్సను అందించడానికి దోహదపడతాయని పిల్లల వార్డు విభాగాధిపతి డాక్టర్ చక్రవర్తి తెలిపారు. పాయింట్–ఆఫ్–కేర్ అల్ట్రాసౌండ్ (పీవోసీయూఎస్), 2డీ, ఈకో ప్రోబ్, న్యూరో సోనోగ్రఫీ వంటి అత్యాధునిక పరికరాలను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. ఈ పరికరాల ఏర్పాటులో రేడియాలజీ విభాగాధిపతి డాక్టర్ బుజ్జిబాబు అందించిన సహకారం వెలకట్టలేనిదని డాక్టర్ చక్రవర్తి అన్నారు. డాక్టర్ బుజ్జిబాబు సత్వర స్పందన, సహాయ సహకారాలు, సాంకేతిక మార్గదర్శకత్వం ఎంతో విలువైనవని కొనియాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్, సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇవీ ప్రయోజనాలు : నూతన పరికరాలు పలు పరీక్షలను వేగంగా నిర్వహించి, వ్యాధులను నిర్ధారించడంలో సహాయపడతాయి. తద్వారా అత్యవసర సమయాల్లో రోగులకు సత్వర చికిత్సను అందించవచ్చు. రక్తనాళాల స్థితిని అంచనా వేయడానికి, కష్టతరమైన ఇంట్రావీనస్ (ఐవీ) యాక్సెస్, ఇన్ఫీరియర్ వెనా కావా (ఐవీసీ) స్థితిని అంచనా వేయడానికి ఈ పరికరాలు ఉపయోగపడతాయి. గుండె సంబంధిత పరీక్షలు, హృదయ స్పందనల అంచనా, పెరికార్డియల్ ఎఫ్యూషన్, హీమోడైనమిక్ అస్థిరత్వాలను గుర్తించడానికి తక్షణ ఎకో కార్డియోగ్రఫీ సేవలు అందుబాటులో ఉంటాయి. నవజాత శిశువుల్లో మెదడు సంబంధిత వ్యాధులను గుర్తించడంలో న్యూరోసోనోగ్రఫీ పరికరం సహాయపడుతుంది. ఆకస్మిక కడుపు నొప్పి, అసిటీస్, కాలేయ సంబంధిత సమస్యలు, ప్రేగు వ్యాధులను బెడ్సైడ్ వద్దే పరీక్షించడానికి వీలుంటుందని డాక్టర్ చక్రవర్తి వివరించారు. గేమ్ చేంజర్గా నూతన పరికరాలు ఈ అత్యాధునిక పరికరాలు పీడియాట్రిక్ వార్డులో గేమ్ చేంజర్గా మారనున్నాయని డాక్టర్ చక్రవర్తి అభిప్రాయపడ్డారు. రేడియాలజీ విభాగంపై ఆధారపడటాన్ని తగ్గిస్తాయి. అలాగే అత్యవసర పరిస్థితుల్లో రోగులను తరలించాల్సిన అవసరాన్ని కూడా తగ్గిస్తాయి. క్షణాల్లో వ్యాధి నిర్ధారణ జరగడం వల్ల, ప్రాణాపాయ స్థితిలో ఉన్న పిల్లలను కాపాడే అవకాశాలు మెరుగుపడతాయని ఆయన వెల్లడించారు. నూతన పరికరాలతో మెరుగైన సేవలు -
రూ.2.5 లక్షలు!
● మామూళ్లు.. గమ్మత్తుగా! ఒక్కో దుకాణానికి ● మద్యం షాపుల నుంచి నెలవారీ వసూళ్లు షురూ ● బెల్టు షాపులకు రూ.10 అధిక ధరకు అమ్మకం ● సమావేశం పెట్టి మరీ టార్గెట్ విధింపు ● వచ్చే ఏడాది నుంచి రూ.3 లక్షలు ఇవ్వాలని ఆదేశాలు ● బెంగళూరు నుంచి వచ్చిన నేత ద్వారా కలెక్షన్లు బెంగళూరుకు చెందిన వ్యక్తి ద్వారా..! వాస్తవానికి సదరు నేతకు ఏళ్లుగా నమ్మినబంటుగా ఉన్న వ్యక్తి ద్వారా అన్ని వ్యవహారాలు నడిపేవారు. అయితే సదరు వ్యక్తిపై సొంత పార్టీ నేతలే ఫిర్యాదు చేయడంతో పక్కన పెట్టినట్టు వార్తలు వచ్చాయి. ఆ స్థానంలో తనకు నమ్మిన బంటుగా ఉన్న మరో వ్యక్తిని బెంగళూరు నుంచి ప్రత్యేకంగా పిలిపించినట్టు ఆ పార్టీ నేతలే బహిరంగంగా చర్చించుకుంటున్నారు. మద్యం సిండికేట్ల ద్వారా వసూలు చేసే మొత్తం కూడా సదరు బెంగళూరు వ్యక్తి చేతికి చేరుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు కొద్దిరోజుల క్రితం సెజ్లోని ఒక కంపెనీలో సీసీ కెమెరాలను బిగించే పని ఇప్పించడం కోసం కూడా రూ.3 లక్షల మేర వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఈ తతంగమంతా కూడా బెంగళూరు వ్యక్తి ద్వారానే నడిచినట్టు సమాచారం. మొత్తంగా పీఏలు మారుతున్నారు తప్ప వసూళ్ల కార్యక్రమం మాత్రం తమకు తప్పడం లేదని సొంత పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. బెంగళూరు వ్యక్తిపై కూడా ఫిర్యాదు చేసేందుకు ఆ పార్టీ నేతలే సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఇప్పటికే ప్రైవేటు పీఏ వ్యవహారంలో విమర్శలు ఎదుర్కొంటున్న కూటమి నేత ఒకరు... ఇప్పుడు కలెక్షన్ల కోసం ఏకంగా బెంగళూరు నుంచి ఓ వ్యక్తిని తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. ముందుగా నియోజకవర్గంలోని మొత్తం మద్యం షాపుల నుంచి మామూళ్లు వసూలు చేయాలని భావించారు. ఇందుకు అనుగుణంగా మద్యం షాపు సిండికేట్లతో గత నెలలో సమావేశం ఏర్పాటు చేసి మరీ టార్గెట్లు ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ప్రతి మద్యం షాపు యజమాని ప్రతి నెలా రూ.2.5 లక్షల చొప్పున చెల్లించాలని ఆదేశాలు జారీ అయినట్టు సమాచారం. ఇందుకు ప్రతిఫలంగా సదరు ప్రైవేటు మద్యం దుకాణదారుడు బెల్టు షాపులకు ఎమ్మార్పీ మీద రూ.10 అధికంగా విక్రయించుకునేలా ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా ఆయా దుకాణాల పరిధిలో బెల్టు షాపులకు మద్యం సరఫరా బాధ్యత కేవలం వారికే దక్కేలా నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఆయా మద్యం షాపులతో పాటు బెల్టు షాపుల జోలికి ఎకై ్స జ్శాఖ అధికారులు వెళ్లకుండా కూడా ఆదేశాలు జారీ కావడం విశేషం. వచ్చే ఏడాది నుంచి ప్రతి నెలా వసూళ్ల మొత్తం రూ.3 లక్షలకు పెంచనున్నట్టు కూడా ముందుగానే ప్రకటించినట్టు సమాచారం. మొత్తంగా ఒక ప్రైవేటు పీఏ వ్యవహారంలో విమర్శల నేపథ్యంలో దూరంగా పెట్టిన సదరు నేత.. ఇప్పుడు బెంగళూరు నుంచి వచ్చిన మరో వ్యక్తి ద్వారా వసూళ్లకు దిగడం చర్చనీయాంశమవుతోంది. విచ్చలవిడిగా బెల్టు షాపులు! ఇప్పటికే పేకాట, కోడి పందేల వ్యవహారంలో వార్తలకెక్కిన సదరు నేత.. ఇప్పుడు విచ్చలవిడిగా మద్యం బెల్టు దుకాణాలకు కూడా గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. అంతేకాకుండా పేకాట డెన్ల నిర్వహణలో కొంత మొత్తం వసూలు చేసేందుకు మరీ అనుమతి ఇచ్చారు. వాటి జోలికి వెళ్లకుండా కూడా కొద్దిరోజుల పాటు నియంత్రించగలిగారు. అయితే అంతర్గత విభేదాల కారణంగా ఈ వ్యవహారం కాస్తా బయటకు వచ్చింది. దీంతో తాత్కాలికంగా పేకాట శిబిరాలు మూతపడ్డాయి. ఇక కోడి పందేల శిబిరాలు ఏ నియోజకవర్గంలో లేని విధంగా ఏకంగా మూడు ప్రాంతాల్లో ఏర్పాట్లు చేశారు. అధికారికంగా సదరు నేత పాల్గొనకపోయినా వారి అండతోనే ఈ వ్యవహారం నడిచింది. దీంతో అటువైపు పోలీసులు కన్నెత్తి చూడలేదు. పైగా కోడి పందేల శిబిరాల ప్రాంతంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు కూడా జరిగాయి. బహిరంగంగానే మద్యాన్ని విక్రయించారు. వీటి ఏర్పాట్లకు కూడా వేలం పాట నిర్వహించి మరీ వసూళ్లకు తెగబడ్డారు. మరోవైపు ఇప్పటికే సదరు నేత నియోజకవర్గంలో భారీగా బెల్టు షాపులు వెలిశాయి. బెల్టు షాపుల కోసం వేలం పాట నిర్వహించిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి. అయినా సదరు నేత అండదండలతో చర్యలు తీసుకోలేదని విమర్శలున్నాయి. కేవలం ఈ నియోజకవర్గంలోనే ఏకంగా వందకుపైగా బెల్టు షాపులు ఏర్పాటైనట్టు సమాచారం. మద్యం దుకాణదారులు ఆయా బెల్టు షాపులకు ఎమ్మార్పీకి రూ.10కి అధికంగా మద్యం విక్రయించుకుంటున్నారు. ఇందులో వచ్చే సగం ఆదాయాన్ని సదరు నేతకు ముట్టచెబుతున్నట్టు తెలుస్తోంది. -
గ్రీన్పార్క్లో సంప్రదాయ వస్త్రాల ప్రదర్శన
డాబాగార్డెన్స్: ఉగాది పండగ పురస్కరించుకుని నగరంలో ప్రత్యేక వస్త్ర ప్రదర్శన ప్రారంభమైంది. వాల్తేర్ మెయిన్రోడ్డులోని హోటల్ గ్రీన్ పార్క్లో ఏర్పాటు చేసిన ఈ ఎక్స్పో ఈ నెల 12వ తేదీ వరకు కొనసాగుతుంది. సంప్రదాయ దుస్తులకు ప్రాధాన్యమిచ్చే వారికి ఇది ఒక చక్కటి వేదిక. సరికొత్త ఫ్యాషన్ వస్త్రాలతో పాటు అన్ని రకాల సంప్రదాయ దుస్తులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఈ ప్రదర్శనలో మహిళలను ఆకట్టుకునేలా వివిధ రకాల దుస్తులు కొలువుదీరాయి. పట్టు చీరలు, కాటన్ వస్త్రాలు, సల్వార్లు, టాప్స్ వంటి వా టితో పాటు అనేక రకాల ఉపకరణాలు, డిజైనర్ దుస్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రత్యేకంగా పోచంపల్లి, కలంకారి చీరలు, కోల్కత్తా, భాగల్పురి ప్రింట్లు, లక్నో చికాన్ వర్క్ చీరలు, బెనారస్ పట్టు చీరలు వంటివి ఇక్కడ లభిస్తున్నాయి. అంతేకాకుండా మగ్గాలపై నేసిన, రంగులు వేసిన, ముద్రించిన, ఎంబ్రాయిడరీ వస్త్రాలు ఒకే చోట అందుబాటులో ఉన్నాయి. మట్కా సిల్క్ చీరలు, మధ్యప్రదేశ్, పాట్లీ పల్లు, మల్బరీ సిల్క్, చందేరి చీరలు కూడా సరసమైన ధరలకే విక్రయిస్తున్నారు. ప్రతి రోజూ ఉదయం 11 నుంచి రాత్రి 8.30 గంటల వరకు ప్రదర్శన, విక్రయాలు ఉంటాయని, నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. -
బైక్ రేసర్లపై పోలీసుల ఉక్కుపాదం
బీచ్రోడ్డు: నగరంలో అర్ధరాత్రి బైక్ రేసులు నిర్వహిస్తున్న యువకులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. వారం రోజుల కిందట 38 మంది యువకులను అరెస్ట్ చేసి వారి బైక్లను సీజ్ చేసిన పోలీసులు.. తాజాగా మరో 16 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మూడో పట్టణ పోలీస్స్టేషన్లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ట్రాఫిక్ విభాగం అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రవీణ్ కుమార్ ఈ వివరాలు వెల్లడించారు. అర్ధరాత్రి నగరంలో రోడ్లపై హల్చల్ చేస్తూ పాదచారులు, వాహన చోదకులను బైక్ రేసర్లు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీనిపై అందిన ఫిర్యాదుల మేరకు జోన్–1 ట్రాఫిక్ ఏసీపీ వాసుదేవరావు పర్యవేక్షణలో త్రీటౌన్, ద్వారకా, నార్త్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 16 మంది బైక్ రేసర్లను అరెస్ట్ చేసి, 16 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికి విధించే శిక్షల్లో సమూల మార్పులు చేసినట్లు వెల్లడించారు. కఠిన చర్యలతో పాటు భారీ జరిమానాలు కూడా విధిస్తామని హెచ్చరించారు. సమావేశంలో ట్రాఫిక్ సీఐ అమ్మినాయుడు తదితరులు పాల్గొన్నారు. 16 మంది అరెస్ట్, బైక్ల సీజ్ -
కుటుంబంలో మహిళ పాత్ర కీలకం
సీపీ సతీమణి సువశ్రీ బాగ్చిమహారాణిపేట: కేజీహెచ్ ఆంకాలజీ విభాగంలో శనివారం మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నగర పోలీస్ కమిషనర్ సతీమణి సువశ్రీ బాగ్చి మాట్లాడుతూ ప్రతి ఇల్లు ఆనందమయంగా, ఆరోగ్యంగా ఉండాలంటే మహిళ పాత్ర కీలకమని.. ఝాన్సీ లక్ష్మీబాయిని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. మహిళలు క్యాన్సర్ పట్ల అప్రమత్తంగా ఉంటూ ముందస్తు జాగ్రత్తలు పాటించాలని, విధిగా ఏడాదికి ఒకసారి వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు. కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద్ మాట్లాడుతూ క్యాన్సర్కు సంబంధించిన అంశాలపై కేజీహెచ్లో ఉచిత వైద్య సేవలందించే దిశగా అన్ని చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా క్యాన్సర్ వార్డులో చికిత్స పొందుతున్న రోగులు, వారి పిల్లలను కలిశారు. పిల్లలకు అతిథులు బొమ్మలను బహుమతులుగా అందించారు. క్యాన్సర్ రోగులకు మెరుగైన వైద్యం అందిస్తున్న మెడికల్ ఆంకాలజీ విభాగాధిపతి డాక్టర్ కె.శిల్ప సేవలను ప్రశంసించారు. అనంతరం సూపరింటెండెంట్ డాక్టర్ పి.శివానంద్ ముఖ్య అతిథి సువశ్రీ బాగ్చితోపాటు ఏఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యాదేవి, డాక్టర్ కె.శిల్పలను ఘనంగా సత్కరించారు. డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ జి.వాసవీలత, డీసీహెచ్ఎస్ ఆర్ఎంవో డాక్టర్ మెహర్ కుమార్, గ్రేడ్ వన్ నర్సింగ్ సూపరింటెండెంట్ పద్మావతి, ఆయా విభాగాలకు చెందిన నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు. -
సమర్థంగా పీ4 సర్వే
మహారాణిపేట: పీ4 సర్వేపై ప్రజలకు అవగాహన కల్పించి, సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి కలెక్టర్ను ఆదేశించారు. పోర్టు గెస్ట్ హౌస్లో కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్, నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి శనివారం మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా పీ4 సర్వే నిర్వహించాలన్నారు. ప్రజాభిప్రాయాలకు అనుగుణంగా సిటిజెన్ సర్వీసెస్ అమలు చేసి.. జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని కలెక్టర్ను ఆదేశించారు. జిల్లాలో శాంతిభద్రతలపై సీపీతో చర్చించి.. మెరుగైన సేవలందించాలన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా ప్రజలకు అధికార యంత్రాంగం ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని మంత్రి స్పష్టం చేశారు. కలెక్టర్కు జిల్లా ఇన్చార్జి మంత్రి ఆదేశం -
జగన్ హయాంలోనే మహిళా సాధికారత
● మాజీ మంత్రి గుడివాడ్ అమర్నాథ్ ● వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సాక్షి, విశాఖపట్నం: వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనే మహిళా సాధికారత, స్వావలంబన లక్ష్యంగా పాలన సాగిందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్, మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, మాజీ ఎంపీ గొడ్డేటి మాధవి, మాజీ ఎమ్మెల్యేలు కె.భాగ్య లక్ష్మి, శోభా హైమావతి అన్నారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి ఆధ్వర్యంలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అమర్నాథ్ కేక్ కట్ చేసి.. రమణికుమారికి తినిపించారు. మహిళలంతా స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. అనంతరం వైఎస్సార్ సీపీలో కీలకంగా పనిచేస్తున్న మహిళలను సత్కరించారు. తర్వాత అమర్నాథ్ మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ ఐదేళ్ల పాల నలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నవరత్నాల పథకాలకు సంబంధించిన డబ్బు లు నేరుగా మహిళల ఖాతాల్లో జమ చేశారని గుర్తు చేశారు. నామినేటెడ్ పదవుల్లో 50 శాతంకుపైగా మహిళలకే కేటాయించారని, చట్టసభల్లో, మంత్రి పదవుల్లో, రాజకీయ పదవుల్లో అన్నింటా మహిళలకే పెద్దపీట వేశారన్నారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు ఇస్తామని మహిళలను మోసం చేసిందని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వానికి మహిళలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. మేయర్ హరివెంకటకుమారి, మాజీ ఎంపీ మాధవి, మాజీ ఎమ్మెల్యేలు శోభా హైమావతి, భాగ్యలక్ష్మి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మోసపూరిత హామీలతో గద్దెనెక్కిందని ఆరోపించారు. మహిళలకు ఉచిత బస్సు, తల్లికి వందనం, ఆసరా వంటి పథకాలు ఇస్తామని చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు. పేడాడ రమణికుమారి మాట్లాడుతూ వైఎస్జగన్ దిశ చట్టం ద్వారా మహిళా భద్రతకు అత్యంత ప్రాధాన్యం కల్పించారన్నారు. అనంతరం అతిథులను ఆమె ఘనంగా సత్కరించారు. అలాగే ఫ్యాషన్ డిజైనింగ్ విభాగంలో బండి ప్రియను, అధునాతన కాస్మో టాలజీ అండ్ ట్రైకాలజీ క్లినిక్ విభాగంలో రాజ్యలక్ష్మి, బొటిక్ షాపు యాజమాని కోశెట్టి రాజ్యలక్ష్మి, పార్టీ కార్యాలయంలో పని చేసే మీసాల సంధ్యను సన్మానించారు. పార్టీ సమన్వయకర్తలు కేకే రాజు, తిప్పల శ్రీనివాస్ దేవన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్, తిప్పల గురుమూర్తి రెడ్డి, చింతలపూడి వెంకటరామయ్య, డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్, కార్పొరేటర్లు తోట పద్మావతి, ముర్రువాణి, సాడి పద్మారెడ్డి, మహిళా నేతలు బి.పద్మావతి, శ్రీదేవీవర్మ, పిల్లి సుజాత, సత్యాల సాగరిక, పల్లా చిన్న తల్లి, అడ్డాల కృపా జ్యోతి, బయవరపు రాధా, డా.మంచా నాగ మల్లీశ్వరి, సలాది భాను, రాజేశ్వరి, జోష్ణ, బంగారమ్మ, రత్నం, కాకి పద్మ, రోజారాణి, మళ్ల ధనలత, రజనీ, రామలక్ష్మి, పి.వి.లక్ష్మి, సంషాద్ భేగం, నీలాపు లక్ష్మి, అమ్మాజీ, రేణుక, నాగమణి, పద్మ, రాజీ, సునీత, కుమారి, పద్మ, జోత్స్న, చందక రత్నం, శిరీష, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. -
విశాఖ స్టీల్ప్లాంట్లో భారీగా కార్మికుల తొలగింపు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్లో కార్మికులను భారీగా తొలగించారు. 900 మంది కాంట్రాక్ట్ కార్మికులను యాజమాన్యం తొలగించింది. ఏ క్షణమైనా సమ్మెకు కాంట్రాక్ట్ కార్మికులు దిగనున్నారు. రేపు భారీ ఆందోళనకు అఖిలపక్ష కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఇప్పటికే సమ్మె నోటీసు గడువు ముగిసింది. స్థానిక ప్రజా ప్రతినిధులపై కార్మికులు మండిపడుతున్నారు.కాగా, స్టీల్ సీఐటీయూ గౌరవాధ్యక్షుడు జె.అయోధ్యరామ్కు ఇచ్చిన షోకాజ్ నోటీసును తక్షణం ఉపసంహరించుకోవాలని జిల్లా అధ్యక్షుడు ఎన్.రామారావు యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. అయోధ్యరామ్కు షోకాజ్ నోటీసు జారీ చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం ఉక్కు అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఉక్కు పరిపాలన భవనం వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉక్కు పరిరక్షణ ఉద్యమాన్ని ప్రభావితం చేసే విధంగా కార్మిక సంఘాల ప్రతినిధులపై ఉక్కు యాజమాన్యం కుట్రలు చేస్తోందన్నారు. కర్మాగారంలో నేటి వరకు ఉన్న ప్రతి ప్రయోజనం పోరాటాల ద్వారానే సాధించుకున్నట్లు ఆయన గుర్తు చేశారు. పోరాటంలో అనైక్యతను సృష్టించడం కోసం ప్రభుత్వం, యాజమాన్యాలు ఎంత ప్రయత్నించినా.. స్టీల్ కార్మికులు మరింత ఐక్యంగా ముందుకు సాగుతారన్నారు. గుర్తింపు యూనియన్ ప్రధాన కార్యదర్శి డి.ఆదినారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీ ద్వారా స్టీల్ పరిశ్రమలో సమస్యలు పరిష్కారం కావని ఆయన వివరించారు. సస్పెన్షన్లు, షోకాజ్ నోటీసులతో కార్మి ఉద్యమాన్ని అణచలేరన్నారు. వెంటనే యాజమాన్యం నోటీసును ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
విశాఖలో ఎన్నారై మహిళ అనుమానాస్పద మృతి!
విశాఖ: నగరంలోని ఓ స్టార్ హెటల్ లో ఎన్నారై మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆ హోటల్ వాష్ రూమ్ లో ఎన్నారై మహిళ ఉరివేసున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. అయితే ఈ కేసును అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకున్నట్లు సీపీ తెలిపారు. దీనికి సంబంధించి ఆమె వెంట ఉన్న ఎన్ఆర్ఐ డాక్టర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళ మృతదేహానికి పోస్టు మార్టం పూర్తయ్యిందని, అనుమానాస్పద మృతి కేసుగా దర్యాప్తు చేస్తున్నట్లు సీపీ పేర్కొన్నారు. ఆమె ఆత్మహత్య చేసుకుందా? లేక ఎవరైనా చంపేసి ఆమె మెడకు ఉరితాడు బిగించి వాష్ రూమ్ లో పెట్టారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆ మహిళ ఎవరు.. ఎక్కడ నుంచి వచ్చారు.. ఆమె కూడా ఉన్న డా క్టర్ ఎవరు అనే విషయాలు తెలియాల్సి ఉంది. -
‘నా చావుకు ధనలక్ష్మియే కారణం..’
విశాఖపట్నం: అచ్చియ్యమ్మపేటలో ఒక మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అప్పు తీసుకున్న ఇంట్లోనే ఆమె శవమై కనిపించడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారా లేదా హత్యకు గురయ్యారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇది ఆత్మహత్య కాదని హత్యేనని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ టూటౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు.టూటౌన్ సీఐ బి.తిరుమలరావు తెలిపిన వివరాలివి.. అంగడిదిబ్బ ప్రాంతానికి చెందిన బొడ్డు సుగుణ(34), తన భర్త అప్పన్న, ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తున్నారు. సుగుణ అచ్చియ్యమ్మపేటకు చెందిన ధనలక్ష్మి వద్ద లక్ష రూపాయలు అప్పుగా తీసుకున్నారు. ఆ సమయంలో ధనలక్ష్మి డబ్బులు ఇచ్చినందుకు వీడియో కూడా తీసింది. రూ.లక్షకు వారానికి రూ.20 వేలు అసలు, వడ్డీ చెల్లించేలా ఒప్పందం కుదిరింది. అయితే, సుగుణ సకాలంలో వడ్డీ చెల్లించలేకపోవడంతో, ధనలక్ష్మి, ఆమె కుమారుడు భరత్ గురువారం సుగుణ ఇంటికి వెళ్లి గొడవపడ్డారు. వెంటనే డబ్బులు చెల్లించాలని, లేకపోతే వీడియోను అప్పన్నకు పంపిస్తానని బెదిరించారు. దీంతో మనస్తాపం చెందిన సుగుణ గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో రూ.40 వేలు పట్టుకుని ధనలక్ష్మి ఇంటికి బయలుదేరింది. డబ్బులు ఇచ్చేందుకు ఆమె ఇంట్లోకి వెళ్లగా.. ధనలక్ష్మి లేరు. ఇంట్లో ఆమె చిన్న కుమారుడు ఒక్కడే ఉన్నాడు. కాగా.. రాత్రి 7 గంటలకు ఇంటికి తిరిగి వచ్చిన ధనలక్ష్మి.. గదిలో ఫ్యానుకు వేలాడుతున్న సుగుణ మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించింది. వారు ఘటనా స్థలానికి చేరుకుని తలుపులు బద్దల గొట్టి మృతదేహాన్ని కిందకు దించారు. విషయం తెలుసుకున్న సుగుణ భర్త అప్పన్న, తన భార్యను ధనలక్ష్మి కుటుంబ సభ్యులే హత్య చేశారని, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు.పోలీసులు కూడా వారితో కుమ్మక్కయ్యారని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం అప్పన్న, అతని ఇద్దరు కుమారులు, మృతురాలి బంధువులు టూటౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలని, ధనలక్ష్మి, ఆమె కుటుంబ సభ్యులపై హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు ధనలక్ష్మిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అప్పన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. సుగుణ చనిపోయే ముందు బయట నుంచి స్టూలు పట్టుకుని ధనలక్ష్మి ఇంట్లోకి వెళ్లినట్లు సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయి ఉందని పోలీసులు వెల్లడించారు.‘నా చావుకు ధనలక్ష్మియే కారణం..’మరణించే ముందు సుగుణ తన భర్త అప్పన్నకు వాయిస్ మెసేజ్ పంపింది. ‘నా చావుకు ధనలక్ష్మి, ఆమె కుమారుడు భరత్ కారణం. నా కోసం బాధపడవద్దు. నేను అప్పులు మాత్రమే చేశాను. నా వల్ల నువ్వు, పిల్లలు సుఖపడలేరు. ధనలక్ష్మి నన్ను టార్చర్ పెడుతోంది. ఈ టార్చర్ నాతోనే పోవాలి. నా వల్ల మీరు బాధపడకూడదు. పిల్లలను హాస్టల్లో చేర్పించి బాగా చదివించు. నువ్వు నా కోసం బాధపడవద్దు’అని సుగుణ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వాయిస్ మెసేజ్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
అతివల ఆర్థిక స్వేచ్ఛకు అడుగులు
సాక్షి, విశాఖపట్నం : ఆర్థిక వనరుల నిర్వహణ అబలలకు కొత్తేమీ కాదు. ఇంట్లో మగవారిపై ఆధారపడకుండా స్వయంగా డబ్బు సంపాదించినప్పుడు కలిగే ఆత్మ విశ్వాసం దాని ద్వారా వచ్చే ఆర్థిక స్వేచ్ఛ ముందు ఏదీ సాటిరాదు. అందుకే ఆర్థిక వ్యవహారాల్లో మహిళలను మించిన ఆర్తికవేత్తలు మరొకరు ఉండరని చెబుతుంటారు. అంతటి శక్తి ఉన్న మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ కల్పించాలనే సంకల్పంతో ప్రారంభమైంది ది విశాఖ మహిళా మ్యూచువల్లీ ఎయిడెడ్ కో ఆ పరేటివ్ సొసైటీ. పాతికేళ్ల ప్రస్థానంలో... నగరానికి చెందిన బి. ప్రసూనాంబ సాధారణ గృహిణి. రైతుబజారుకు వెళ్లిన సమయంలో అక్కడ మహిళా వ్యాపారులు డైలీకలెక్షన్, కాల్మనీ వ్యాపారుల నుంచి డబ్బులు అప్పులు తీసుకుంటూ ఇబ్బందులు పడుతున్న వైనాన్ని చూశారు. మహిళలు అప్పుల కోసం ఎందుకు ఇబ్బంది పడాలి.. వారి డబ్బుల్ని వారే పొదుపు చేసి వాడుకునేలా వ్యవస్థను ఏర్పాటు చెయ్యాలని సంకల్పించారు. ఆ ఆలోచన నుంచి పుట్టిందే ది విశాఖ మహిళా మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆ పరేటివ్ సొసైటీ. సీతమ్మధారలో 10 మంది సభ్యులతో 2020 ఆగస్టులో ప్రారంభమైంది. పాతికేళ్ల ప్రస్థానంలో ఇప్పుడు ఉత్తరాంధ్రలో 16 శాఖలుగా విస్తరించింది. 816 మంది సభ్యులుండగా.. 10 వేల మంది వరకూ పొదుపు చేసుకునే మహిళలున్నారు. ఇప్పటి వరకూ 2 వేల మంది మహిళలకు రుణాలు మంజూరు చేసి.. వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దిందీ సొసైటీ. ఈ మహిళల సొసైటీలో పనిచేసే వారు కూడా మహిళలే కావడం విశేషం. మొత్తం 50 మంది ఉద్యోగులున్నారు. జీవితంలో ఆర్థికంగా, కుటుంబ పరంగా చితికిపోయిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోందీ సొసైటీ. ఉపాధి అవసరమైన వారిని ఎంపిక చేసి వారికి ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తున్నామని చైర్పర్సన్ వైబీ ప్రసూనాంబ చెబుతున్నారు. సొసైటీ తరఫున సామాజిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ.. బాలికలకు, మహిళలకూ చేయూతగా నిలుస్తున్నారు. -
రైలు ప్రయాణంలో తోడు.. మేరీ సహేలీ
రైతుబజార్ స్టాల్లో శబరి సాక్షి, విశాఖపట్నం: రైల్లో ఒంటరిగా ప్రయాణించే మహిళల భద్రతే ప్రధాన లక్ష్యంగా భారతీయ రైల్వే.. వినూత్న విధానాలను అవలంబిస్తోంది. ఎవరి తోడు లేకుండా ప్రయాణిస్తున్న వారిపై ప్రత్యేక దృష్టి సారించి వారికి అన్ని విధాలుగా అండగా నిలిచేందుకు అనుసరిస్తున్న సరికొత్త ఆలోచనే ‘మేరీ సహేలి’. అంటే.. నా స్నేహితురాలు అని అర్థం. ట్రైన్ ఎక్కినప్పటి నుంచి గమ్యస్థానానికి చేరుకునేంత వరకూ ఆర్పీఎఫ్ ఏర్పాటు చేసిన మేరీ సహేలి బృంద సభ్యులు వారి స్నేహితులుగా తోడుంటారు. అంతేకాదు.. అసౌకర్యాలకు గురవుతున్న మహిళా ప్రయాణికులకు సహాయం చేయడంతో పాటు భద్రతను పెంచే లక్ష్యంతో విశాఖపట్నం రైల్వే స్టేషన్ పరిధిలో ‘సుభద్ర వాహిని’ పేరుతో ప్రత్యేక మహిళా రైల్వే సిబ్బంది బృందం సేవలందిస్తోంది. మేరీ సహేలి, సుభద్ర వాహినిలో మొత్తం 16 మంది మహిళా ఆర్పీఎఫ్ సిబ్బంది సేవలందిస్తున్నారు. మేరీ సహేలీ..: వాల్తేరు డివిజన్ పరిధిలోని విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి నిత్యం రైళ్ల రాకపోకలతో రద్దీగా ఉంటుంది. రైలు ప్రయాణికుల్లో ఒంటరిగా వెళ్తున్న మహిళలుంటారు. వీరి వివరాల్ని ఆర్పీఎఫ్ సేకరిస్తుంది. ఇందుకోసం రైలు ప్రయాణికుల రిజర్వేషన్ల ఆధారంగా ఇలాంటి మహిళల వివరాల్ని గుర్తించేందుకు రైల్వే శాఖ సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (క్రిస్) యాప్ను వినియోగిస్తోంది. మేరీ సహేలీ బృంద సభ్యులు తమ ట్యాబ్ల ద్వారా వివరాలు సేకరించి.. వారి వద్దకు వెళ్లి వారికి అవగాహన కల్పిస్తారు. ఏదైనా అవసరం ఉంటే సమాచారం అందించాలంటూ ఫోన్ నంబర్ కూడా ఇస్తారు. రైలుదిగేంత వరకూ వారితో టచ్లో ఉంటారు. మహిళల బోగీల్లో పురుషులు చొరబడినా వారిపై కేసులు నమోదు చేస్తుంటారు. ఇలా మహిళల భద్రతకు సంబంధించి విశాఖ స్టేషన్ పరిధిలో గత ఏడాది 1,151 మందిపై కేసులు నమోదు చేయగా.. ఈ ఏడాది ఇప్పటి వరకూ 89 కేసులు నమోదు చేసినట్లు ఆర్పీఎఫ్ సీఐ కిమిడి రామకృష్ణ తెలిపారు. సుభద్ర వాహిని : సుభద్ర వాహిని మహిళా ప్రయాణికులను అప్రమత్తం చేయడం, ప్లాట్ఫామ్లపై, రైళ్లలో మహిళలపై నేర కార్యకలాపాలను నిరోధించడమే లక్ష్యంగా పనిచేస్తోంది. తక్షణ సహాయం కోరుకునేవారు ఎవరైనా ఉంటే సులభంగా గుర్తించడానికి సుభద్ర వాహిని సభ్యులకు ప్రత్యేకమైన డ్రెస్ కోడ్ ఉంటుంది. విశాఖపట్నం, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రైల్వే స్టేషన్లలో ఈ బృందం విడతల వారీగా ప్రయాణిస్తూ మహిళలకు రక్షణ కవచంలా నిలుస్తున్నారు. హెల్ప్లైన్ నంబర్కు వచ్చిన ఫిర్యాదులపైనా స్పందించి.. వాటిని పరిష్కరించడంలో సుభద్రవాహిని బృందం దూకుడుగా వ్యవహరిస్తోంది. ప్రతి ఏటా దాదాపు 3500 మంది మహిళలకు రక్షణ కవచంలా సుభద్ర వాహిని బృందాలు వ్యవహరిస్తున్నాయని ఆర్పీఎఫ్ సీఐ రామకృష్ణ వివరించారు. మహిళలకు రైల్లో ఏ సమస్య తలెత్తినా కంట్రోల్ రూమ్ 8978080777 నంబర్కు గానీ.. రైల్వే టోల్ఫ్రీ నంబర్ 139లో సంప్రదించాలని ఆయన మహిళలకు సూచించారు. మహిళా ప్రయాణికులకు రక్షణగా ప్రత్యేక బృందంసుభద్ర వాహిని పేరుతో మరో రక్షణ బృందంమేరీ సహేలీ ద్వారా ప్రతిరోజు 10 మంది మహిళలకు రక్షణ -
షోకాజ్ నోటీసులతో ఉద్యమాన్ని అణచలేరు
ఉక్కునగరం: స్టీల్ సీఐటీయూ గౌరవాధ్యక్షుడు జె.అయోధ్యరామ్కు ఇచ్చిన షోకాజ్ నోటీసును తక్షణం ఉపసంహరించుకోవాలని సిటు జిల్లా అధ్యక్షుడు ఎన్.రామారావు యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. అయోధ్యరామ్కు షోకాజ్ నోటీసు జారీ చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం ఉక్కు అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఉక్కు పరిపాలన భవనం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉక్కు పరిరక్షణ ఉద్యమాన్ని ప్రభావితం చేసే విధంగా కార్మిక సంఘాల ప్రతినిధులపై ఉక్కు యాజమాన్యం కుట్రలు చేస్తోందన్నారు. కర్మాగారంలో నేటి వరకు ఉన్న ప్రతి ప్రయోజనం పోరాటాల ద్వారానే సాధించుకున్నట్లు ఆయన గుర్తు చేశారు. పోరాటంలో అనైక్యతను సృష్టించడం కోసం ప్రభుత్వం, యాజమాన్యాలు ఎంత ప్రయత్నించినా.. స్టీల్ కార్మికులు మరింత ఐక్యంగా ముందుకు సాగుతారన్నారు. గుర్తింపు యూనియన్ ప్రధాన కార్యదర్శి డి.ఆదినారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీ ద్వారా స్టీల్ పరిశ్రమలో సమస్యలు పరిష్కారం కావని ఆయన వివరించారు. దీన్ని సమర్ధవంతగా నడపడం కోసం సమర్థవంతమైన నాయకత్వం కావాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారని ఆయన గుర్తు చేశారు. సస్పెన్షన్లు, షోకాజ్ నోటీసులతో కార్మిక ఉద్యమాన్ని అణచలేరన్నారు. వెంటనే యాజమాన్యం నోటీసును ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. స్టీల్ సిటు గౌరవాధ్యక్షుడు జె. అయోధ్యరామ్, అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు వై.టి.దాస్, యు.రామస్వామి, అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు కె.ఎస్.ఎన్.రావు, రమణమూర్తి, డి.వి.రమణారెడ్డి, దొమ్మేటి అప్పారావు, డి. సురేష్బాబు, రామ్కుమార్, రామ్మోహన్కుమార్, పరంధామయ్య, డేవిడ్ తదితరులు యాజమాన్యం వైఖరిని నిరసించారు. వెంటనే ఉపసంహరించుకోవాలి ఉక్కు అఖిలపక్ష కార్మిక సంఘాల డిమాండ్ -
No Headline
సీతమ్మధార : ఆమె వయసు 94. ఇంట్లో హాయిగా మనమలు, మనవరాళ్లతో కాలక్షేపం చేసే వయసు. వృద్ధాప్యాన్ని పక్కన పెట్టి..ఓపిక ఉన్నంతవరకు కష్టపడతానంటోంది. సీతమ్మధార రైతు బజార్లో ఓ స్టాల్లో గ్రీన్పీస్, క్యారెట్ అమ్మూతూ జీవనం సాగిస్తోంది. భీమిలి మండలం చేపలుప్పాడకు చెందిన వృద్ధ రైతు పేరు నారాయణమ్మ. అందరూ శబరి అని పిలుస్తారు. ఇప్పటికీ ఎంతో హుషారుగా రైతు బజార్కు వచ్చి వెళుతుంటుంది. 20 ఏళ్లుగా సీతమ్మధార రైతు బజార్లో గ్రీన్పీస్, క్యారెట్ విక్రయాలు జరుపుతూ అందరికీ పెద్ద దిక్కుగా వ్యవహరిస్తోంది. భర్త మృతి చెందగా..ఐదుగురు సంతానం. ఇంట్లో ఖాళీగా ఉండడం నచ్చదు..అందుకే ఇప్పటికీ రైతు బజార్లో విక్రయాలు జరుపుతున్నానని శబరి చెప్పింది. రైతు బజార్కు వచ్చినవాళ్లంతా ఆమెను చూసి వహ్వా..అవ్వా అంటూ శబరి వద్ద కొనుగోలు చేస్తున్నారు. -
నేటి నుంచి పీ–4 సర్వే
గేట్ల దగ్గర నుంచి గెట్ అవుట్● మరోసారి స్టీల్ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపుమహారాణిపేట: పేదరిక నిర్మూలన లక్ష్యంగా పీ–4 సర్వేను శనివారం నుంచి ఈనెల 18వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ తెలిపారు. గ్రామ,వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఈ సర్వే జరుగుతుందని శుక్రవారం పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర సాధనలో భాగంగా పది సూత్రాల్లో ప్రథమంగా పేదరిక నిర్మూలన,పేదరికం లేని సమాజ నిర్మాణం లక్ష్యంగా ప్రజల భాగస్వామ్యంతో పీ–4 సర్వేకు రూపకల్పన చేశామన్నారు. 27 ప్రశ్నలతో కూడిన హౌస్ హోల్డ్ సర్వేను గ్రామ సభల్లో కూడ ప్రవేశ పెడతారని, లబ్ధిదారుల ఎంపిక కూడా గ్రామ సభల ద్వారా జరుగుతుందన్నారు. పీ4 సర్వేకు సంబంధించి ప్రజల అభిప్రాయాలు, సూచనలను, నిర్దేశిత క్యూర్ కోడ్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలని కలెక్టర్ కోరారు. పారదర్శకంగా సర్వే నిర్వహించాలి తగరపువలస: రైతులకు ఇబ్బంది లేకుండా పారదర్శకంగా రైతులు రీ సర్వే నిర్వహించాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిరప్రసాద్ సూచించారు. శుక్రవారం ఆయన ఆనందపురం మండలం గొట్టిపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా రీ సర్వే జరుగుతున్న ప్రదేశాన్ని పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. డ్రోన్, రోవర్ ద్వారా రీ సర్వే జరుగుతున్న తీరును పరిశీలించారు. రీ సర్వే పంట ప్రక్రియలను పరిశీలించారు. సర్వే పూర్తయిన తరువాత గ్రామసభ నిర్వహించి రైతులకు పూర్తి వివరాలు తెలియజేయాలన్నారు. గొట్టిపల్లి గ్రామ సచివాలయంతో పాటు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ఆయన వెంట సర్వే విభాగం ఏడీ సూర్యారావు, తహశీల్దార్ శ్యాంప్రసాద్, ఎంపీడీవో జానకి తదితరులు పాల్గొన్నారు. సాక్షి, విశాఖపట్నం: స్టీల్ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు ప్రక్రియ మళ్లీ మొదలైందని కాంట్రాక్ట్ కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. శుక్రవారం విధులకు వెళ్లిన కాంట్రాక్ట్ కార్మికులు ఆయా ప్రవేశ గేట్ల వద్ద బయోమెట్రిక్ అటెండెన్స్ కోసం ప్రయత్నించినప్పటికి వీలు కాలేదు. సుమారు 250 మంది కార్మికులకు బయోమెట్రిక్ అటెండెన్స్ నమోదు కాకపోవడంతో సాంకేతిక సమస్య అనుకున్నారు. తీరా కార్మిక సంఘాల నాయకులు వాకబు చేయగా వారిని బయోమెట్రిక్ నుంచి తొలగించినట్టు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఈ ప్రక్రియ కొనసాగుతున్నట్టు తెలియవచ్చింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 30 శాతం మేరకు తొలగింపు ఆదేశాల మేరకు ఈ ప్రక్రియ జరుగుతున్నట్టు సమాచారం. ఈ అంశంపై విభాగంలోని అధికారులను వివిధ సంఘాల నాయకులు ప్రశ్నించగా తమకు ఏం తెలియదంటూ దాట వేశారని ఆరోపించారు. ఈ అంశంపై పోరాటానికి సన్నద్ధమవుతున్నామని కార్మిక నాయకులు తెలిపారు. 28న విశాఖ న్యాయవాదుల సంఘం ఎన్నికలు విశాఖ లీగల్ : ప్రతిష్టాత్మకమైన విశాఖ న్యాయవాదుల సంఘం నూతన వార్షిక ఎన్నికలు ఈనెల 28వ తేదీన జరుగుతాయని సంఘం అధ్యక్షుడు బెవర సత్యనారాయణ శుక్రవారం తెలిపారు. ఎన్నికల అధికారిగా ప్రముఖ న్యాయవాది జి.ఎం. రెడ్డి నియమితులయ్యారు. 15 రోజులు ముందు నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఇప్పటికే వివిధ పదవులకు పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. న్యాయవాదులందరూ ఓటు హక్కు పొందడానికి తక్షణమే తమ సభ్యత్వ రుసుము చెల్లించాలని సంఘం కార్యదర్శి డి.నరేష్ కోరారు. ప్రధానంగా అధ్యక్ష, ఉపాధ్యక్ష,కార్యదర్శి పదవులకు గట్టి పోటీ ఉంది. 12 లేదా 13 తేదీల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తారు. -
రాష్ట్రంలో ఎల్ఎల్డీ చేసిన తొలి వ్యక్తి ఆచార్య సీతామాణిక్యం
ఏయూక్యాంపస్: చదువుకు ఎక్కువగా ప్రాధాన్యత లేని రోజుల్లో 17 ఏళ్ల వయసులో పెళ్లిపీటలపై కూర్చున్నారు. పెళ్లిచూపుల సమయంలో పెళ్లికొడుకు చదువుకుంటావా అని అడిగిన ప్రశ్న ఆమెలో కొత్త ఆశలను చిగురించేలా చేసింది. అలా భర్త సహకారంతో తన చదువును కొనసాగించారు. నేడు దేశంలో ప్రతిష్టాత్మకమైన ఆంధ్రవిశ్వవిద్యాలయం న్యాయ కళాశాలకు ప్రిన్సిపాల్గా బాధ్యతలను నిర్వహించే స్థాయికి ఎదిగారు ఆచార్య కె.సీతామాణిక్యం. ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక సీ్త్ర ఉంటుందంటారు. కానీ ఆచార్య సీతామాణిక్యం విజయం వెనుక ఆమె భర్త తమ్మిరెడ్డి ఉన్నారు. చిన్న వయసులో పెళ్లి చేసుకున్నా విద్యపై ఉన్న ఆసక్తితో ఆమెను ప్రోత్సహించారు. ప్రైవేటుగా డిగ్రీ పూర్తిచేసి అనంతరం ఎం.ఏ హిస్టరీ, బ్యాచ్లర్ ఆఫ్ లా, ఎం.ఏ ఇగ్లీషు, ఆంధ్రవిశ్వవిద్యాలయం నుంచి మాస్టర్ ఆఫ్లా(ఎల్ఎల్ఎం) పూర్తిచేశారు. ఒకవైపు కుటుంబం, పిల్లల బాధ్యతలను నిర్వహిస్తూ ఒడిశాలోని బ్రహ్మపుర విశ్వవిద్యాలయం నుంచి 2000 సంవత్సరంలో సైబర్ నేరాలపై పరిశోధన చేసి డాక్టరేట్ సాధించారు. 2014లో పోస్ట్ డాక్టోరల్ ఇన్ లా(ఎల్ఎల్డీ)ని అందుకున్నారు. రాష్ట్రం నుంచి ఈ డిగ్రీ సాధించిన తొలి వ్యక్తి ఆచార్య సీతామాణిక్యం కావడం విశేషం. వివాహం, కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తూనే తన ఆకాంక్షలను సాకారం చేసుకోవచ్చు అనడానికి ఆచార్య సీతామాణిక్యం జీవితం ఒక ఉదాహరణ మాత్రమే. అనంతరం ఆంధ్రవిశ్వవిద్యాలయంలో ఏయూలో 2006లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరారు. 2021లో ప్రొఫెసర్గా బాధ్యతలు చేపట్టారు. 24 జూన్ 2024 నుంచి న్యాయ కళాశాల ప్రిన్సిపాల్గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. 2023లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి బెస్ట్ టీచర్ అవార్డును అందుకున్నారు. -
24 ఏళ్లుగా నవ్విస్తూ...
సీతంపేట: ఆమె స్టేజి ఎక్కితే కడుపుచెక్కలుకావాల్సిందే..ఆమె టైమింగ్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. హాస్య నటిగా శివజ్యోతి సుపరిచితురాలు. 2000 సంవత్సరంలో రావి కొండలరావు స్థాపించిన హ్యూమర్ క్లబ్లో ఆమె సభ్యురాలు..నాటి నుంచి నేటి వరకు నవ్వులు పంచుతున్నారు. కష్టాలు..కన్నీళ్లు..బాధలు..వీటినన్నింటినీ చిటికెలో మాయం చేసేది హాస్యం. నా స్కిట్లకు ప్రేక్షకులు నవ్వుతుంటే ఆ ఆనందం వేరు అంటున్నారు జ్యోతి. ప్రస్తుతం ఫ్రెండ్స్ కామెడీక్లబ్తో పాటు మరో రెండు కామెడీక్లబ్స్లో ప్రతి ఆదివారం ద్వారకానగర్ పౌరగ్రంథాలయంలో స్కిట్స్ చేసి ప్రేక్షకులను నవ్విస్తున్నా... దాదాపు 24 ఏళ్లుగా నవ్విస్తుంటం నా అదృష్టంగా భావిస్తున్నా. 1978 నుంచి కూచిపూడి డ్యాన్సర్గా, 1989 నుంచి రంగస్థల కళాకారిణిగా వందలాది స్టేజి ప్రదర్శనలు ఇచ్చా. జేవీ సోమయాజులతో కలిసి బుచ్చమ్మ పాత్ర (కన్యాశుల్కం)ధారిగా 500లకు పైగా ప్రదర్శనలు ఇచ్చా..కందుకూరి, నంది అవార్డు, కళాభినేత్రి, హాస్య నటి శిరోమణి, నాట్య మయూరిగా ఎన్నో అవార్డులు అందుకున్నా. -
వైద్య వృత్తి.. సేవా కీర్తి
విశాఖ విద్య: విశాఖ నగరంలోని మర్రిపాలెం వుడా లే అవుట్ కాలనీకి చెందిన కంచిపాటి శిరీష దంతవైద్యురాలు. భర్త శ్రీనివాసరావు కూడా వైద్యుడే. ఎంచక్కా ఏ ప్రైవేటు ఆస్పత్రో పెట్టుకొని ప్రాక్టీస్పై దృష్టి పెడితే, బోలెడంత వెనుకేసుకోవచ్చు. తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి పాస్తులు, కుటుంబ పరంగా ఉన్న అండదండలతో లగ్జరీ లైఫ్ గడిపేయవచ్చు. డాక్టర్ శిరీష ఆలోచనలు వేరు..తల్లిదండ్రులు పీవీఎస్రావు, విజయలక్ష్మి నేర్పి న విలువలతో ఆమె స్ఫూర్తివంతమైన జీవ నం గడుపుతున్నారు. మర్రిపాలెం వుడా లే అవుట్ కాలనీ అంటే నగరంలోని ప్రముఖుల నివాస స్థావరంగా గుర్తింపు ఉంది. ఇలాంటి చోట, కాలనీ అసోసియేషన్లో డాక్టర్ శిరీష కీలకంగా వ్యవహరిస్తున్నారు. సన్నిహితుల ట్రస్ట్ ద్వారా విస్తృతంగా సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పారి శ్రామిక ప్రాంతాలతో పాటు, నగర శివారు కాలనీలో వైద్య శిబిరాలను ఏర్పా టు చేసి ఉచితంగా రోగులకు మందులను అందజేస్తున్నారు. అంతేకాకుండా కళలు, సాహిత్య రంగాల్లో కూడా పేరుతెచ్చుకున్నారు. మహిళ పాత్ర ఎంతో కీలకం మహిళ అంటే భార్యగా, తల్లిగా సక్సెస్ అయితేనే సరిపోదు. నేటి రోజుల్లో మహిళ పాత్ర కీలకంగా మారింది. మహిళ బాగుంటే ఫ్యామిలీ బాగుంటుంది. ఆడపిల్ల అనే చిన్నచూపు చూసే రోజులు పోయాయి. దేన్నైనా సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తి గల మహిళలు ఎంతో మంది ఉన్నారు. –డాక్టర్ కంచిపాటి శిరీష -
నైవేద్యం హోటల్ ప్రారంభం
సింహాచలం: హనుమంతవాక నుంచి అడవివరం వెళ్లే బీఆర్టీఎస్ రోడ్డు.. సింహాచలం కొండపైకి వెళ్లే రెండో ఘాట్రోడ్డు టోల్గేట్కు సమీపంలో కొత్తగా ఏర్పాటు చేసిన నైవేద్యం అల్పాహార హోటల్ను త్రిదండి చినజీయర్స్వామి ప్రారంభించారు. ఈసందర్భంగా చినజీయర్స్వామి మాట్లాడుతూ పల్లెటూరి వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ పెంకుటింట్లో సంప్రదాయ రుచులతో నైవేద్యం హోటల్ను ఏర్పాటు చేయడం ఎంతో బాగుందన్నారు. ఈ సందర్భంగా హోటల్ యజమాని వాకాడ రాజశేఖర్రెడ్డి, ఆయన సోదరుడు వాకాడ శరత్కుమార్రెడ్డిలకు ఆశీసులు అందజేశారు. ఈనెల 14 నుంచి హోటల్ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. హోటల్లో ఏర్పాటు చేసిన కిచెన్ను సైకాలజిస్ట్ కర్రి భాగ్యార్కసిన్హా ప్రారంభించారు. కర్రి పాపారాయుడు, సీఐ డాక్టర్ బెండి వెంకట్రావు, వర్మ, నారాయణరెడ్డి పాల్గొన్నారు. -
ఆ రోజుల్లో.. అండగా.!
సాక్షి, విశాఖపట్నం : మహిళలు రుతుక్రమంలో శుభ్రంగా ఉండటం ఎంతో అవసరం. అందుకు కావాల్సిన ఉత్పత్తులు ఆ సమయానికి అందుబాటులో లేకపోతే.? పనిలో ఉన్నా.. కార్యాలయంలో ఉన్నా.. సినిమా హాల్లో ఉన్నా.. అకస్మాత్తుగా పీరియడ్స్ వస్తే..? ఏం చేయాలి. ఎక్కడికి వెళ్లాలి.? ఎలా శానిటరీ ప్యాడ్స్ కొనుగోలు చేయాలి.? దీనిపై ఇప్పటికీ మహిళలకు ఎన్నో సందేహాలున్నాయి. గతంలో ఎదురైన అనుభవాలు ఆమెకు పాఠాలు నేర్పాయి. భవిష్యత్తులో ఆ రోజుల్లో మహిళలు సులువుగా ప్యాడ్స్ పొందేందుకు శానిటరీ న్యాప్కిన్స్ వెండింగ్ మెషీన్లు తయారు చేయాలన్న ఆలోచన అంకురించి.. మార్కెట్లోకి తీసుకొచ్చారు బొడ్డేటి ఝాన్సీ రాణి. మహిళల అవసరాలకు అనుగుణంగా వెండింగ్ మెషీన్ల తయారీ సంస్థ ఎన్సీకోడ్ వెండింగ్ సిస్టమ్స్ కో ఫౌండర్గా వ్యవహరిస్తున్న ఝాన్సీ రాణి.. 2021 నుంచి మహిళలకు అవసరమైన మెషీన్ల తయారు చేస్తూ మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. అధునాతన శానిటరీ న్యాప్కిన్ వెండింగ్ మెషీన్లు అందుబాటులోకి తీసుకొచ్చి.. మహిళల్లో రుతుస్రావ సమయంలో అభయమిచ్చేలా రూపొందిస్తున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ స్టార్టప్ హబ్ (ఆ హబ్లో)లో ఈ సంస్థను ఏర్పాటు చేశారు. బహిరంగ ప్రదేశాలు, విద్యా సంస్థలు, కార్యాలయాలు, ఇతర ప్రాంతాల్లో ఉత్తమ నాణ్యత గల శానిటరీ న్యాప్కిన్లను సులభంగా అందించే ఏర్పాటు చేశారు. నాణెం లేదా టోకెన్లు వేస్తే న్యాప్కిన్స్ అందుబాటులోకి వచ్చేస్తాయి. ఏవైనా సంస్థలు తమ మహిళా ఉద్యోగులకు అండగా నిలిచేలా ఉచితంగా ప్యాడ్స్ పంపిణీ చేయాలంటే.. మెషీన్లో ఏర్పాటు చేసిన వ్యవస్థలో ఫోన్ నంబర్ ఎంటర్ చేస్తే.. ఓటీపీ వస్తుంది. ఓటీపీ కొడితే.. ప్యాడ్ పొందేలా మెషీన్ని రూపొందించామని ఝాన్సీరాణి తెలిపారు. ఈ తరహా మెషీన్లు విద్యా సంస్థల్లోనూ, కార్యాలయాల్లో అందుబాటులో ఉంటే.. ఆ రోజుల్లో సెలవులు పెట్టే అవసరం ఉండబోదని ధీమాగా చెబుతున్నారు. ఇది మహిళా ఉద్యోగులు, విద్యార్థుల్లో మనోబలాన్ని పెంచుతుందని ఝాన్సీరాణి స్పష్టం చేస్తున్నారు. మహిళలకు శానిటరీ న్యాప్కిన్స్ వెండింగ్ మెషీన్లు ప్రధాన కంపెనీల్లో ప్రత్యేకంగా ఏర్పాటు -
‘వరుణ్ హాస్పిటాలిటీ’పై ఏపీసీజెడ్ఎంఏ సీరియస్
విశాఖ సిటీ: బీచ్ రోడ్డులో వరుణ్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చేపట్టిన స్టార్ హోటల్ నిర్మాణంపై ఆంధ్రప్రదేశ్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ(ఏపీసీజెడ్ఎంఏ) స్పందించింది. సీఆర్జెడ్ పరిధిలో బోర్లు తవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. వెంటనే దీనిపై స్వయంగా విచారించి తీసుకున్న చర్యల నివేదికను సమర్పించాలని కలెక్టర్ హరేందిర ప్రసాద్ను ఆదేశించింది. గేట్ వే హోటల్ స్థలంలో వరుణ్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ ఒక ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణం చేపడుతోంది. ఇందుకోసం సదరు సంస్థ తీర ప్రాంతానికి 150 మీటర్ల లోపే బోర్లు తీస్తోంది. దీనిపై జనసేన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ ఏపీసీజెడ్ఎంఏకు ఫిర్యాదు చేశారు. సీఆర్జెడ్ నోటిఫికేషన్ 2011 ప్రకారం తీర ప్రాంతానికి 150 మీటర్ల లోపు బోర్లు వేయడమే కాకుండా హైకోర్టు ఆదేశాల ప్రకారం తీర ప్రాంతానికి సమీపంలో భూగర్భం నుంచి నీటిని తోడడం నిషేధమని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై ఏపీసీజెడ్ఎంఏ స్పందిస్తూ. కలెక్టర్కు లేఖ రాసింది. వెంటనే జీవీఎంసీ కమిషనర్, గ్రౌండ్ వాటర్ అండ్ వాటర్ ఆడిట్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్లు నేరుగా నిర్మాణం జరుగుతున్న ప్రాంతాన్ని తనిఖీ చేయాలని ఆ లేఖలో పేర్కొంది. అలాగే దానిపై తీసుకున్న చర్యలను నివేదిక రూపంలో సమర్పించాలని ఏపీసీజెడ్ఎంఏ మెంబర్ సెక్రటరీ ఎస్.శ్రీ శరవణన్ ఆదేశించారు. -
వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా కార్యకర్త అరెస్ట్, విడుదల
డాబాగార్డెన్స్: గుడివాడ నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్త శ్యాంసుందర్ను విశాఖ వన్టౌన్ పోలీసులు తప్పుడు కేసులు బనాయించి అరెస్టు చేశారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్కుమార్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయన్నారు. రాష్ట్రాభివృద్ధిపై దృష్టి పెట్టకుండా వైఎస్సార్సీపీ కేడర్ని టార్గెట్ చేస్తూ, వేధించడం సరికాదన్నారు. శ్యామ్సుందర్ కుటుంబ సభ్యుల పరిస్థితి తెలుసుకుని వారికి యువకుడికి ష్యూరిటీ ఇప్పించి 41 నోటీసు ద్వారా విడిపించి, తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. అప్రమత్తమైన వైఎస్సార్సీపీ కేడర్ : వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్త శ్యాంసుందర్ను వన్టౌన్ పోలీసులు అరెస్టు చేయడాన్ని తెలుసుకున్న వాసుపల్లి, స్థానిక నాయకుల్ని అప్రమత్తం చేశారు. తక్షణమే పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సిందిగా సూచించారు. పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు సనపల రవీంద్రభరత్, పలు వార్డుల నాయకులు పీతల వాసు, ముత్తాబత్తుల రమేష్, యువజన విభాగం అధ్యక్షుడు, తాడి రవితేజ, సోషల్ మీడియా ప్రెసిడెంట్ బెవర మహేష్, కంటుముచ్చు సాగర్, సూర్యనాయుడు, గోపిరాజు వన్టౌన్ పోలీస్ స్టేషన్కు వెళ్లి సీఐతో మాట్లాడారు. ష్యూరిటీ ఇప్పించి, 41 నోటీస్ ద్వారా శ్యామ్ సుందర్ను విడిపించారు. అనంతరం శ్యామ్సుందర్ మాట్లాడుతూ వాసుపల్లి గణేష్కుమార్కు, నియోజకవర్గ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. -
మహిళలకిచ్చిన హామీలేమయ్యాయి?
సీతమ్మధార: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా దినోత్సవం స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నాయని ఏపీ మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు అత్తిలి విమల విమర్శించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని మహిళా సమాఖ్య జిల్లా సమితి ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ‘గౌరవప్రదమైన జీవితం దాతృత్వం కాదు.. అది మన హక్కు’ అనే నినాదంతో శుక్రవారం ధర్నా జరిగింది. ఈ సందర్భంగా విమల మాట్లాడుతూ పాలకుల మాటల్లోనే మహిళా సాధికారత ఉందని, చేతల్లో లేదని విమర్శించారు. శ్రామిక మహిళల పోరాట స్ఫూర్తి క్రమంగా కనుమరుగు అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా దినోత్సవం ఓటు బ్యాంకు రాజకీయాలకు వేదికగా మారిపోతోందని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో మహిళల ఓట్ల కోసం కురిపించిన హామీలు ఒక్కటి కూడా అమలు కావడం లేదని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం హామీలే ఇందుకు నిదర్శనమన్నారు. రాజ్యాంగం అందించిన సమానత్వం 75 ఏళ్లు అయినా సాధ్యం కాలేదని, నిత్యం మహిళా సమాజంపై దాడులు పెరుగుతున్నా పాలకులకు పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ పాలనలో మహిళా సమాజం మరో వంద ఏళ్లు వెనక్కి వెళ్లిపోతోందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మహిళా దినోత్సవం అందించిన పోరాట స్ఫూర్తితో మహిళలు మరింత చైతన్యవంతంగా ఉద్యమాల వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. జిల్లా కార్యదర్శి ఎం.ఎ.బేగం, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు కె.వనజాక్షి, నాయకులు ఎ.దేవుడమ్మ, అరుణ, అన్నపూర్ణ, జి.జయ, బి.పుష్పలత, పావని పాల్గొన్నారు. ఉచిత బస్సు ప్రయాణం,తల్లికి వందనం అమలు ఎప్పుడు? మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు విమల -
షోకాజ్ నోటీసులతో ఉద్యమాన్ని అణచలేరు
ఉక్కునగరం: స్టీల్ సీఐటీయూ గౌరవాధ్యక్షుడు జె.అయోధ్యరామ్కు ఇచ్చిన షోకాజ్ నోటీసును తక్షణం ఉపసంహరించుకోవాలని సిటు జిల్లా అధ్యక్షుడు ఎన్.రామారావు యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. అయోధ్యరామ్కు షోకాజ్ నోటీసు జారీ చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం ఉక్కు అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఉక్కు పరిపాలన భవనం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉక్కు పరిరక్షణ ఉద్యమాన్ని ప్రభావితం చేసే విధంగా కార్మిక సంఘాల ప్రతినిధులపై ఉక్కు యాజమాన్యం కుట్రలు చేస్తోందన్నారు. కర్మాగారంలో నేటి వరకు ఉన్న ప్రతి ప్రయోజనం పోరాటాల ద్వారానే సాధించుకున్నట్లు ఆయన గుర్తు చేశారు. పోరాటంలో అనైక్యతను సృష్టించడం కోసం ప్రభుత్వం, యాజమాన్యాలు ఎంత ప్రయత్నించినా.. స్టీల్ కార్మికులు మరింత ఐక్యంగా ముందుకు సాగుతారన్నారు. గుర్తింపు యూనియన్ ప్రధాన కార్యదర్శి డి.ఆదినారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీ ద్వారా స్టీల్ పరిశ్రమలో సమస్యలు పరిష్కారం కావని ఆయన వివరించారు. దీన్ని సమర్ధవంతగా నడపడం కోసం సమర్థవంతమైన నాయకత్వం కావాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారని ఆయన గుర్తు చేశారు. సస్పెన్షన్లు, షోకాజ్ నోటీసులతో కార్మిక ఉద్యమాన్ని అణచలేరన్నారు. వెంటనే యాజమాన్యం నోటీసును ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. స్టీల్ సిటు గౌరవాధ్యక్షుడు జె. అయోధ్యరామ్, అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు వై.టి.దాస్, యు.రామస్వామి, అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు కె.ఎస్.ఎన్.రావు, రమణమూర్తి, డి.వి.రమణారెడ్డి, దొమ్మేటి అప్పారావు, డి. సురేష్బాబు, రామ్కుమార్, రామ్మోహన్కుమార్, పరంధామయ్య, డేవిడ్ తదితరులు యాజమాన్యం వైఖరిని నిరసించారు. వెంటనే ఉపసంహరించుకోవాలి ఉక్కు అఖిలపక్ష కార్మిక సంఘాల డిమాండ్ -
విజయోస్తు సీ్త్రరస్తు...!
శనివారం శ్రీ 8 శ్రీ మార్చి శ్రీ 2025విజయోస్తు సీ్త్రరస్తు..! ఆటోతో జీవన ప్రయాణం ఆటో నడుపుతూ వాణికుమారి డాబాగార్డెన్స్: ఆటో డ్రైవర్ అనగానే మనకు పురుషులే గుర్తుకొస్తారు. డ్రైవింగ్ ఫీల్డ్ కష్టంతో కూడుకున్నది కావడంతో.. మహిళలు ఈ రంగంవైపు పెద్దగా ఆసక్తి చూపరు. డ్రైవింగ్ ఫీల్డులోకి వచ్చిన మహిళల్లోనూ ఎక్కువ మంది కొన్నేళ్లు మాత్రమే ఈ రంగంలో ఉంటారు. దీనికి రకరకాల కారణాలు ఉండొచ్చు. కానీ మీరు ఇప్పుడు చూస్తున్న మహిళ మాత్రం 23 ఏళ్లుగా.. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆరిలోవకుచెందిన వాసంశెట్టి వాణికుమారికి భర్త లేడు..కుమార్తెతో కలిసి జీవిస్తోంది. డ్రైవింగ్ నేర్చుకుంది. దీంతో ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తోంది. కుమార్తెను డిగ్రీ వరకు చదివించింది. ఆరిలోవ..జగదాంబ జంక్షన్, తిరిగి జగదాంబ జంక్షన్–ఆరిలోవ వరకు టికెట్ సర్వీస్ చేస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇలా టికెట్ సర్వీస్ చేస్తూ ఆదాయం పొందుతోంది. తనకు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉందని, రుణం తీసుకుని సొంతంగా ఆటో కొనుగోలు చేశానని వాణి కుమారి చెప్పారు. -
నేటి నుంచి పీ–4 సర్వే
గేట్ల దగ్గర నుంచి గెట్ అవుట్● మరోసారి స్టీల్ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపుమహారాణిపేట: పేదరిక నిర్మూలన లక్ష్యంగా పీ–4 సర్వేను శనివారం నుంచి ఈనెల 18వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ తెలిపారు. గ్రామ,వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఈ సర్వే జరుగుతుందని శుక్రవారం పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర సాధనలో భాగంగా పది సూత్రాల్లో ప్రథమంగా పేదరిక నిర్మూలన,పేదరికం లేని సమాజ నిర్మాణం లక్ష్యంగా ప్రజల భాగస్వామ్యంతో పీ–4 సర్వేకు రూపకల్పన చేశామన్నారు. 27 ప్రశ్నలతో కూడిన హౌస్ హోల్డ్ సర్వేను గ్రామ సభల్లో కూడ ప్రవేశ పెడతారని, లబ్ధిదారుల ఎంపిక కూడా గ్రామ సభల ద్వారా జరుగుతుందన్నారు. పీ4 సర్వేకు సంబంధించి ప్రజల అభిప్రాయాలు, సూచనలను, నిర్దేశిత క్యూర్ కోడ్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలని కలెక్టర్ కోరారు. పారదర్శకంగా సర్వే నిర్వహించాలి తగరపువలస: రైతులకు ఇబ్బంది లేకుండా పారదర్శకంగా రైతులు రీ సర్వే నిర్వహించాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిరప్రసాద్ సూచించారు. శుక్రవారం ఆయన ఆనందపురం మండలం గొట్టిపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా రీ సర్వే జరుగుతున్న ప్రదేశాన్ని పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. డ్రోన్, రోవర్ ద్వారా రీ సర్వే జరుగుతున్న తీరును పరిశీలించారు. రీ సర్వే పంట ప్రక్రియలను పరిశీలించారు. సర్వే పూర్తయిన తరువాత గ్రామసభ నిర్వహించి రైతులకు పూర్తి వివరాలు తెలియజేయాలన్నారు. గొట్టిపల్లి గ్రామ సచివాలయంతో పాటు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ఆయన వెంట సర్వే విభాగం ఏడీ సూర్యారావు, తహశీల్దార్ శ్యాంప్రసాద్, ఎంపీడీవో జానకి తదితరులు పాల్గొన్నారు. సాక్షి, విశాఖపట్నం: స్టీల్ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు ప్రక్రియ మళ్లీ మొదలైందని కాంట్రాక్ట్ కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. శుక్రవారం విధులకు వెళ్లిన కాంట్రాక్ట్ కార్మికులు ఆయా ప్రవేశ గేట్ల వద్ద బయోమెట్రిక్ అటెండెన్స్ కోసం ప్రయత్నించినప్పటికి వీలు కాలేదు. సుమారు 250 మంది కార్మికులకు బయోమెట్రిక్ అటెండెన్స్ నమోదు కాకపోవడంతో సాంకేతిక సమస్య అనుకున్నారు. తీరా కార్మిక సంఘాల నాయకులు వాకబు చేయగా వారిని బయోమెట్రిక్ నుంచి తొలగించినట్టు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఈ ప్రక్రియ కొనసాగుతున్నట్టు తెలియవచ్చింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 30 శాతం మేరకు తొలగింపు ఆదేశాల మేరకు ఈ ప్రక్రియ జరుగుతున్నట్టు సమాచారం. ఈ అంశంపై విభాగంలోని అధికారులను వివిధ సంఘాల నాయకులు ప్రశ్నించగా తమకు ఏం తెలియదంటూ దాట వేశారని ఆరోపించారు. ఈ అంశంపై పోరాటానికి సన్నద్ధమవుతున్నామని కార్మిక నాయకులు తెలిపారు. 28న విశాఖ న్యాయవాదుల సంఘం ఎన్నికలు విశాఖ లీగల్ : ప్రతిష్టాత్మకమైన విశాఖ న్యాయవాదుల సంఘం నూతన వార్షిక ఎన్నికలు ఈనెల 28వ తేదీన జరుగుతాయని సంఘం అధ్యక్షుడు బెవర సత్యనారాయణ శుక్రవారం తెలిపారు. ఎన్నికల అధికారిగా ప్రముఖ న్యాయవాది జి.ఎం. రెడ్డి నియమితులయ్యారు. 15 రోజులు ముందు నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఇప్పటికే వివిధ పదవులకు పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. న్యాయవాదులందరూ ఓటు హక్కు పొందడానికి తక్షణమే తమ సభ్యత్వ రుసుము చెల్లించాలని సంఘం కార్యదర్శి డి.నరేష్ కోరారు. ప్రధానంగా అధ్యక్ష, ఉపాధ్యక్ష,కార్యదర్శి పదవులకు గట్టి పోటీ ఉంది. 12 లేదా 13 తేదీల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తారు. -
No Headline
సీతమ్మధార : ఆమె వయసు 94. ఇంట్లో హాయిగా మనమలు, మనవరాళ్లతో కాలక్షేపం చేసే వయసు. వృద్ధాప్యాన్ని పక్కన పెట్టి..ఓపిక ఉన్నంతవరకు కష్టపడతానంటోంది. సీతమ్మధార రైతు బజార్లో ఓ స్టాల్లో గ్రీన్పీస్, క్యారెట్ అమ్మూతూ జీవనం సాగిస్తోంది. భీమిలి మండలం చేపలుప్పాడకు చెందిన వృద్ధ రైతు పేరు నారాయణమ్మ. అందరూ శబరి అని పిలుస్తారు. ఇప్పటికీ ఎంతో హుషారుగా రైతు బజార్కు వచ్చి వెళుతుంటుంది. 20 ఏళ్లుగా సీతమ్మధార రైతు బజార్లో గ్రీన్పీస్, క్యారెట్ విక్రయాలు జరుపుతూ అందరికీ పెద్ద దిక్కుగా వ్యవహరిస్తోంది. భర్త మృతి చెందగా..ఐదుగురు సంతానం. ఇంట్లో ఖాళీగా ఉండడం నచ్చదు..అందుకే ఇప్పటికీ రైతు బజార్లో విక్రయాలు జరుపుతున్నానని శబరి చెప్పింది. రైతు బజార్కు వచ్చినవాళ్లంతా ఆమెను చూసి వహ్వా..అవ్వా అంటూ శబరి వద్ద కొనుగోలు చేస్తున్నారు. -
సైబర్ నేరాల కట్టడికి 12 మంది నియామకం
విశాఖ సిటీ: నగరంలో సైబర్ నేరాలను కట్టడి చేసేందుకు కంప్యూటర్ నైపుణ్యం ఉన్న 12 మందిని బీ కేటగిరీ హోంగార్డులుగా నియమించారు. వీరికి శుక్రవారం పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి నియామక పత్రాలు అందజేశారు. మరో ఇద్దరిపై పీడీ యాక్ట్ అల్లిపురం: శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న ఎయిర్పోర్టు పోలీస్స్టేషన్ పరిధి అంబేడ్కర్ కాలనీకి చెందిన రావాడ ఉదయ్ భాస్కర్, ఈతలపాక రాజ్కుమార్లపై పీడీ యాక్ట్ అమలు చేస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే వీరిద్దరూ పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఏడాది కాలం పాటు వీరికి నగర బహిష్కరణ విధిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. -
హెల్త్సిటీలో రక్త రుగ్మతల కేంద్రం ప్రారంభం
ఆరిలోవ: హెల్త్సిటీ యునిక్ ఆస్పత్రిలో మహాత్మా గాంధీ క్యాన్సర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో రక్త రుగ్మతుల కేంద్రం అందుబాటులోకి వచ్చింది. ఈ కేంద్రాన్ని ప్రముఖ వైద్యుడు డాక్టర్ మామ్మెన్ చాందీ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో సికిల్ సెల్, తలసేమియాతో బాధపడుతున్న వారు ఎక్కువగా ఉన్నారన్నారు. అలాంటి వారికి ఈ కేంద్రం ఉపయోగపడుతుందన్నారు. పేదలకు వైద్యం అందుబాటులో ఉండే విధంగా ఈ కేంద్రాన్ని నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ కేంద్రం విశాఖలో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ క్యాన్సర్ ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఊన్న మురళీకృష్ణను అభినందించారు. నిమ్స్ మెడికల్ ఆంకాలజీ విభాగాధిపతి డాక్టర్ సదాశివుడు మాట్లాడుతూ విశాఖలో రక్త రుగ్మతుల కేంద్రం ఏర్పాటు చేయడం వల్ల ఆరోగ్య సంరక్షణలో కీలక ముందుడుగు పడిందన్నారు. దీర్ఘకాలిక వ్యాధులు ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయన్నారు. అలాంటి సమస్యల నివారణకు ఈ కేంద్రం అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. మేనేజింగ్ డైరెక్టర్ మురళీకృష్ణ మాట్లాడుతూ ఏపీతోపాటు ఒడిశా, చత్తీస్గఢ్లలో ఎక్కడా రక్త వ్యాధులను సమగ్రంగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా హెమటాలజీ కేంద్రం లేదన్నారు. ఈ లోటును భర్తీ చేయడానికి ఇక్కడ సమగ్ర రక్త రుగ్మతల కేంద్రం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పలువురు ఆంకాలజీ విభాగం వైద్యులు పాల్గొన్నారు. -
‘హోలీ’కి ప్రత్యేక రైళ్లు
తాటిచెట్లపాలెం: హోలీ సందర్భంగా ఆయా మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం కె.సందీప్ ఓ ప్రకటనలో తెలిపారు. ● భువనేశ్వర్–చర్లపల్లి(08479) స్పెషల్ ఈ నెల 10, 17, 24వ తేదీల్లో భువనేశ్వర్లో మధ్యాహ్నం 12.10 గంటలకు బయల్దేరి సాయంత్రం 6.30 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడి నుంచి 6.32 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.50 గంటలకు చర్లపల్లి వెళ్తుంది. చర్లపల్లి–భువనేశ్వర్(08480) హోలీ స్పెషల్ ఈ నెల 11, 18, 25వ తేదీల్లో ఉదయం 9.50గంటలకు చర్లపల్లిలో బయల్దేరి అదే రోజు రాత్రి 9.30 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 9.32 గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 6.10గంటలకు భువనేశ్వర్ వెళ్తుంది. ● విశాఖపట్నం–ఎస్ఎంవీ బెంగళూరు(08549) స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ నెల 9, 16, 23వ తేదీల్లో మధ్యాహ్నం 3.30 గంటలకు బయల్దేరి, మరుసటిరోజు మధ్యాహ్నం 12.45 గంటలకు ఎస్ఎంవీ బెంగళూరు చేరుకుంటుంది. ఎస్ఎంవీ బెంగళూరు–విశాఖపట్నం(08550) స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ నెల 10, 17, 24వ తేదీల్లో మధ్యాహ్నం 3.50 గంటలకు ఎస్ఎంవీ బెంగళూరులో బయల్దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ● బనారస్–విశాఖపట్నం(05042) వన్ వే స్పెషల్ ఈ నెల 8వ తేదీ రాత్రి 10.50 గంటలకు బనారస్లో బయల్దేరి 10వ తేదీ మధ్యాహ్నం 12.15 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ● ఆజంఘడ్–విశాఖపట్నం (05040) వన్ వే స్పెషల్ ఈ నెల 8న రాత్రి 11.55 గంటలకు ఆజంఘడ్లో బయల్దేరి 10వ తేదీ సాయంత్రం 4.15 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. జిల్లా టూరిజం ఇన్చార్జ్ అధికారిగా సుధాసాగర్ సాక్షి, విశాఖపట్నం: రుషికొండ బ్లూఫ్లాగ్ బీచ్ సర్టిఫికేషన్ కోల్పోయిన తర్వాత దిద్దుబాటు చర్యలు చేపట్టిన పర్యాటక శాఖ.. ఏం చెయ్యాలనే దానిపై తర్జనభర్జనలు పడుతోంది. ఇన్చార్జ్ ఆర్డీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రమణ ప్రసాద్ ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో.. బ్లూఫ్లాగ్ బీచ్ ఆనవాళ్లు కోల్పోయి.. గుర్తింపు కూడా రద్దైన విషయం తెలిసిందే. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన.. హడావిడిగా ప్రభుత్వం అధికారుల బదిలీల ప్రక్రియ చేపట్టింది. ఈ ప్రక్రియ నిర్వహించిన నాలుగు రోజులకే మళ్లీ ఆర్డర్లు మార్చేశారు. ముందుగా జిల్లా టూరిజం అధికారిగా ప్రస్తుతం అల్లూరి జిల్లా డీటీవోగా వ్యవహరిస్తున్న గరికిన దాసుని నియమిస్తూ పర్యాటక శాఖ ఈ నెల 3న ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన బాధ్యతలు చేపట్టేలోపే.. మరొకరికి బాధ్యతలు అప్పగిస్తూ మరో సర్క్యులర్ జారీ చేసింది. వాస్తవానికి దాసు శుక్రవారం డీటీవోగా బాధ్యతలు చేపట్టనున్నట్లు కలెక్టర్కు తెలిపారు. ఈలోగా.. గురవారం అర్ధరాత్రి డీటీవోగా డిప్యూటీ కలెక్టర్ సుధాసాగర్కు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు పర్యాటకశాఖ అధికారులు సర్క్యులర్ జారీ చేశారు. ప్రస్తుతం సుధాసాగర్ హెచ్పీసీఎల్ ల్యాండ్ ఎక్విజిషన్ అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అనకాపల్లిలో బీబీఎస్ వీక్లీ ఎక్స్ప్రెస్కు హాల్ట్ ఎంవీపీకాలనీ: రామేశ్వరం–భువనేశ్వర్ మధ్య ప్రయాణించే బీబీఎస్ వీక్లీ ఎక్స్ప్రెస్(20895/96) అనకాపల్లి స్టేషన్లో ఆగనుంది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ బి.సునీత శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఆరు నెలల పాటు ప్రయోగాత్మకంగా ఈ రైలు అనకాపల్లిలో హాల్ట్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. -
24 ఏళ్లుగా నవ్విస్తూ...
సీతంపేట: ఆమె స్టేజి ఎక్కితే కడుపుచెక్కలుకావాల్సిందే..ఆమె టైమింగ్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. హాస్య నటిగా శివజ్యోతి సుపరిచితురాలు. 2000 సంవత్సరంలో రావి కొండలరావు స్థాపించిన హ్యూమర్ క్లబ్లో ఆమె సభ్యురాలు..నాటి నుంచి నేటి వరకు నవ్వులు పంచుతున్నారు. కష్టాలు..కన్నీళ్లు..బాధలు..వీటినన్నింటినీ చిటికెలో మాయం చేసేది హాస్యం. నా స్కిట్లకు ప్రేక్షకులు నవ్వుతుంటే ఆ ఆనందం వేరు అంటున్నారు జ్యోతి. ప్రస్తుతం ఫ్రెండ్స్ కామెడీక్లబ్తో పాటు మరో రెండు కామెడీక్లబ్స్లో ప్రతి ఆదివారం ద్వారకానగర్ పౌరగ్రంథాలయంలో స్కిట్స్ చేసి ప్రేక్షకులను నవ్విస్తున్నా... దాదాపు 24 ఏళ్లుగా నవ్విస్తుంటం నా అదృష్టంగా భావిస్తున్నా. 1978 నుంచి కూచిపూడి డ్యాన్సర్గా, 1989 నుంచి రంగస్థల కళాకారిణిగా వందలాది స్టేజి ప్రదర్శనలు ఇచ్చా. జేవీ సోమయాజులతో కలిసి బుచ్చమ్మ పాత్ర (కన్యాశుల్కం)ధారిగా 500లకు పైగా ప్రదర్శనలు ఇచ్చా..కందుకూరి, నంది అవార్డు, కళాభినేత్రి, హాస్య నటి శిరోమణి, నాట్య మయూరిగా ఎన్నో అవార్డులు అందుకున్నా. -
విశాఖ కైలాసగిరిపై భారీ అగ్నిప్రమాదం
సాక్షి, విశాఖపట్నం: విశాఖలోని కైలాసగిరిపై భారీ అగ్నిప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో మంటలు భారీ ఎత్తున ఎగిసిపడుతున్నాయి. దీంతో, కైలాసగిరిపై ఉన్న పర్యాటకులు భయభ్రాంతులకు గురయ్యారు. భయంతో పరుగులు తీశారు.వివరాల ప్రకారం.. విశాఖలోని కైలాసగిరిపై శుక్రవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు, దట్టమైన పొగ కమ్ముకోవడంతో పర్యాటకులు భయంతో పరుగులు తీశారు. అయితే, కైలాసగిరిపై వ్యాపారస్తులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నట్టు పర్యాటకులు చెబుతున్నారు. శుక్రవారం పాత టైర్లను తగలబెట్టడంతోనే మంటలు అంటుకున్నట్టు పలువురు తెలిపారు. ఈ క్రమంలోనే అధికారుల పర్యవేక్షణ లోపించిందని ఆరోపిస్తున్నారు. భద్రతను గాలికి వదిలేసినట్టు తెలిపారు. -
స్కూటీ అదుపు తప్పి.. మహిళా పోలీస్ దుర్మరణం
అనకాపల్లి: స్కూటీ (Scooty)అదుపు తప్పిన ఘటనలో మహిళా పోలీసు(Female police officer) చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి మల్కాపురం ఎస్ఐ శ్యామలరావు తెలిపిన వివరాలివి. అంగనపూడి ప్రాంతానికి చెందిన మీను భూషణ్(46) కూర్మన్నపాలెం సచివాలయంలో మహిళా పోలీసుగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె భర్త స్టీల్ప్లాంట్లో అసిస్టెంట్ మేనేజర్గా పని చేస్తున్నారు. బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో మీను భూషణ్ తన కుమార్తెతో కలిసి స్కూటీపై షీలానగర్ నుంచి పోర్టు ఫ్లైఓవర్ బ్రిడ్జి మీదుగా నగరం వైపు వెళ్తున్నారు. బ్రిడ్జి ఎక్కుతుండగా, ఆమె వెళ్తున్న మార్గంలో ఇద్దరు వ్యక్తులు గడ్డి పట్టుకుని రోడ్డు దాటుతున్నారు. వారిని గుర్తించిన మీను భూషణ్ వెంటనే తన స్కూటీకి అకస్మాత్తుగా బ్రేక్ వేశారు. దీంతో వాహనం అదుపు తప్పి పక్కనున్న డివైడర్ను ఆమె ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో మీను భూషణ్కు తలకు, ఆమె కుమార్తెకు శరీరంపై గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన ఇద్దరినీ చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మీను భూషణ్ గురువారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కాళ్లు పట్టుకుని బతిమిలాడాను.. -
కల్లుగీత కులాలకు వైన్షాపుల కేటాయింపు
విశాఖ సిటీ: కల్లుగీత కులాలకు వైన్షాప్ల లాటరీ ప్రక్రియ గురువారం ప్రశాంతంగా ముగిసింది. వీఎంఆర్డీఏ సమావేశ మందిరంలో సాయంత్రం 4 గంటలకు జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ చేతుల మీదుగా లాటరీ తీసి షాపులను కేటాయించారు. జిల్లాలో మొత్తం 14 షాపులకు గాను 316 దరఖాస్తులు వచ్చాయి. జీవీఎంసీ పరిధిలో ఉన్న 11 షాపుల్లో గౌడ, యాత కులాలకు ఒక్కోటి, శెట్టిబలిజకు తొమ్మిది, ఆనందపురంలో ఒకటి గౌడకు, భీమిలి, పద్మనాభం మండలాల్లో ఒక్కోటి శెట్టిబలిజకు కేటాయించారు. వీరిలో కొందరు రెండు, మూడు దరఖాస్తులు చేశారు. మొత్తంగా 121 మంది 14 షాపుల కోసం తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. జీవీఎంసీ పరిధిలో ఒక షాపు కోసం మొత్తం 35 దరఖాస్తులు రావడం గమనార్హం. దరఖాస్తుల రూపంలోనే ప్రభుత్వానికి రూ.6.32 కోట్లు ఆదాయం సమకూరింది. దరఖాస్తుదారుల సమక్షంలో జాయింట్ కలెక్టర్ లాటరీ తీసి షాపులు పొందిన వారి పేర్లను ప్రకటించారు. షాపులు దక్కించుకున్న 14 మంది తొలి వాయిదా కింద మొత్తంగా రూ.94,16,750 చెల్లించారు. వీరికి ప్రొవిజినల్ లైసెన్సులు మంజూరు చేశారు. ఈ లాటరీ ప్రక్రియలో ప్రొహిబిషనల్ అండ్ ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ రామచంద్రమూర్తి, సూపరింటెండెంట్ ప్రసాద్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
జనతాబజార్లో జెడ్సీ పేరుతో దందా
అడ్డంగా బుకై ్కన అసోసియేషన్ నాయకులు జగదాంబ: జనతా బజార్లో జోనల్ కమిషనర్ పేరుతో జరుగుతున్న వసూళ్ల దందా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జీవీఎంసీ జోన్–4 పరిధిలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఎదురుగా ఉన్న జనతా బజార్లో అసోసియేషన్ నాయకులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఇరువర్గాల తగాదాలో బయటపడింది. 72 దుకాణాలు కలిగిన ఈ బజారు సముదాయం నుంచి జీవీఎంసీకి రూ.9కోట్లకు పైగా అద్దె బకాయిలు పేరుకుపోయాయి. బకాయిల వసూలుకు జెడ్సీ ఎం.మల్లయ్యనాయుడు బుధవారం సిబ్బందితో బజార్కు వచ్చారు. బకాయిలు వెంటనే చెల్లించాలని, లేదంటే దుకాణాలు ఖాళీ చేయాల్సి వస్తుందని వ్యాపారులను హెచ్చరించి వెళ్లారు. ఇది జనతా బజార్ వ్యాపారులకు, అసోసియేషన్ నాయకులకు మధ్య చిచ్చు రేపింది. ‘అద్దె చెల్లింపులకు జోనల్ కమిషనర్ నుంచి సమయం తీసుకువస్తామని నమ్మించి, నెల నెలా జెడ్సీ పేరుతో డబ్బులు వసూలు చేశారు. ఇప్పుడు జెడ్సీ ఎందుకు వచ్చారు.’ అని వ్యాపారులు అసోసియేషన్ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నెలలో ఒక్కో దుకాణం నుంచి రూ.10వేల చొప్పున రూ.3లక్షల వరకు బలవంతంగా వసూలు చేశారని వ్యాపారులు ఆరోపించారు. వసూలు చేసిన డబ్బుల లెక్కలు తేల్చాలని నిలదీయడంతో తోపులాట జరిగింది. ఈ ఘర్షణతో అసోసియేషన్ నాయకుల గుట్టు రట్టయింది. దీనిపై కమిషనర్ మాట్లాడుతూ తన పేరుతో డబ్బులు వసూలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. జనతా బజార్లో వేలం పాటలు లేకుండా అక్రమంగా దుకాణాలను అద్దెలకు ఇస్తున్న వారిపై కూడా చర్యలు తప్పవన్నారు. కార్పొరేషన్ ఆస్తిని అక్రమంగా అనుభవిస్తూ.. పైగా జోనల్ కమిషనర్ పేరును ఉపయోగించుకుని మోసం చేసిన వారిని వదిలి పెట్టేదిలేదన్నారు. -
వీఎంఆర్డీఏ తహసీల్దార్పై ఫిర్యాదులు
విశాఖ సిటీ: వీఎంఆర్డీఏలో తహసీల్దార్(భూసేకరణ)గా విధులు నిర్వర్తిస్తున్న కోరాడ వేణుగోపాల్పై వరుస ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఆయన ఎస్.రాయవరం మండలం తహసీల్దార్గా పనిచేసిన సమయంలో చేసిన అవినీతి, అక్రమాలపై విచారణ చేయా లని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఆయనపై చట్టపరంగానే కాకుండా సర్వీస్ నిబంధనల ప్రకారం చర్య లు తీసుకోవాలని సీఎం, డిప్యూటీ సీఎం, హెచ్ఆర్డీ మంత్రి, డీజీపీ, సీసీఎల్ఏ, ఇతర అధికారులతో పాటు వీఎంఆర్డీఏ చైర్మన్కు కూడా రాతపూర్వకంగా ఫిర్యాదులు చేశారు. గతంలో తప్పుడు ధృవపత్రాలు సమర్పించి ఎంపీటీసీ, ఎంపీపీలుగా గెలిచినట్లు నిర్ధారణ అయినప్పటికీ.. ఎన్నికల్లో వారిని అనర్హులుగా ప్రకటించకపోవడంపై వేణుగోపాల్పై విచారణ చేసి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో కోరారు. ఆయన ఎస్.రాయవరంలో తహసీల్దార్గా పనిచేసిన సమయంలో అనేక అవకతవకలకు పాల్పడి భూ అక్రమాలకు అండగా నిలిచారని.. దీనిపై కూడా విచారించాలని విజ్ఞప్తి చేశారు. ఇటువంటి అవినీతి ఆరోపణలు ఉన్న వేణుగోపాల్ను హోం మంత్రి వంగలపూడి అనిత పీఎస్గా నియమించాలని ప్రయత్నిస్తుండడం సరైన నిర్ణయం కాదని వారు లేఖలో పేర్కొన్నారు. -
విద్యా సంస్థలతో పరిశ్రమల సమావేశం నేడు
మద్దిలపాలెం: స్థానిక డాక్టర్ వీఎస్ కృష్ణా కళాశాలలో విద్యా సంస్థలతో పారిశ్రామిక వ్యవస్థల అనుసంధానంపై శుక్రవారం సదస్సు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఐ.విజయబాబు తెలిపారు. ఈమేరకు గురువారం కార్యక్రమ పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. వివిధ రంగాలకు చెందిన సుమారు 50 పరిశ్రమలు భాగస్వామ్యం కానున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చుకునేందుకు, ఇంటర్న్షిప్లు, పరిశోధన అవకాశాలకు సదస్సు దోహదపడుతుందన్నారు. పారిశ్రామిక సంస్థలు ఏ అంశాల్లో విద్యార్థుల నైపుణ్యతను ఆశిస్తున్నాయో తెలుసుకునే వీలుంటుందన్నారు. దానికి అనుగుణంగా విద్యార్థులకు విద్యా సంస్థల్లో శిక్షణ అందించి, ఉద్యోగులుగా తీర్చిదిద్దే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. -
కల్లుగీత కులాలకు వైన్షాపుల కేటాయింపు
విశాఖ సిటీ: కల్లుగీత కులాలకు వైన్షాప్ల లాటరీ ప్రక్రియ గురువారం ప్రశాంతంగా ముగిసింది. వీఎంఆర్డీఏ సమావేశ మందిరంలో సాయంత్రం 4 గంటలకు జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ చేతుల మీదుగా లాటరీ తీసి షాపులను కేటాయించారు. జిల్లాలో మొత్తం 14 షాపులకు గాను 316 దరఖాస్తులు వచ్చాయి. జీవీఎంసీ పరిధిలో ఉన్న 11 షాపుల్లో గౌడ, యాత కులాలకు ఒక్కోటి, శెట్టిబలిజకు తొమ్మిది, ఆనందపురంలో ఒకటి గౌడకు, భీమిలి, పద్మనాభం మండలాల్లో ఒక్కోటి శెట్టిబలిజకు కేటాయించారు. వీరిలో కొందరు రెండు, మూడు దరఖాస్తులు చేశారు. మొత్తంగా 121 మంది 14 షాపుల కోసం తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. జీవీఎంసీ పరిధిలో ఒక షాపు కోసం మొత్తం 35 దరఖాస్తులు రావడం గమనార్హం. దరఖాస్తుల రూపంలోనే ప్రభుత్వానికి రూ.6.32 కోట్లు ఆదాయం సమకూరింది. దరఖాస్తుదారుల సమక్షంలో జాయింట్ కలెక్టర్ లాటరీ తీసి షాపులు పొందిన వారి పేర్లను ప్రకటించారు. షాపులు దక్కించుకున్న 14 మంది తొలి వాయిదా కింద మొత్తంగా రూ.94,16,750 చెల్లించారు. వీరికి ప్రొవిజినల్ లైసెన్సులు మంజూరు చేశారు. ఈ లాటరీ ప్రక్రియలో ప్రొహిబిషనల్ అండ్ ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ రామచంద్రమూర్తి, సూపరింటెండెంట్ ప్రసాద్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఉక్కును కాపాడుకోవడమే నా విధానం : అయోధ్యరామ్
స్టీల్ప్లాంట్ నోటీసులపై స్టీల్ సీఐటీయూ గౌరవాధ్యక్షుడు అయోధ్యరామ్ గట్టిగానే స్పందించారు. నోటీసులతో గొంతు నొక్కాలని ప్రయత్నిస్తే.. వేల గొంతులు ఒక్కటై పిక్కటిల్లేలా ఉద్యమిస్తామని హెచ్చరించారు. నోటీసుకు ప్రతిస్పందనగా యాజమాన్యానికి లేఖ రాశారు. కార్మికులు, ఉద్యోగుల హక్కుల గురించి పోరాడటమే తన విధానమనీ.. స్టీల్ప్లాంట్ని కాపాడుకునేంత వరకూ రోడ్డెక్కి ఉద్యమిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. సీఐటీయూ నాయకునిగా కార్మికుల సమస్యలపై పోరాడటం తమ బాధ్యత అన్నారు. నోటీసులో పేర్కొన్న సమస్యలపై తమ పోరాటం కొనసాగిస్తామే తప్ప భయపడేది లేదని తెగేసి చెప్పారు. -
రేపు జాతీయ లోక్ అదాలత్
విశాఖ లీగల్ : విశాఖ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 8వ తేదీన జిల్లాలో అన్ని న్యాయస్థానాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులు, సివిల్, చెక్ బౌన్స్, బ్యాంకింగ్, మోటారు ప్రమాదాల నష్టపరిహారాల కేసులు, సెక్షన్ 138 నెగోషియబుల్, బ్యాంకు, మనీ రికవరి కేసులు, ల్యాండ్ అక్విజిషన్ కేసులు, కార్మిక, కుటుంబ తగదాలు(విడాకులు కేసులు కాకుండా), పారిశ్రామిక వివాదాలు, రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు పరిష్కరించుకోవచ్చని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. -
చందనోత్సవ ఏర్పాట్లపై ముందస్తు సమీక్ష
● త్వరలో కలెక్టర్ ఆధ్వర్యంలో సమావేశం ● సింహాచలం దేవస్థానం ఇన్చార్జి ఈవో కె.సుబ్బారావు సింహాచలం: వచ్చే నెల 8న జరిగే శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక కల్యాణోత్సవం, 30న జరిగే చందనోత్సవంలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహిస్తామని సింహాచలం దేవస్థానం ఇన్చార్జి ఈవో కె.సుబ్బారావు తెలిపారు. ఈ వేడుకల నిర్వహణపై దేవస్థానం విభాగాధిపతులతో గురువారం ముందస్తు సమీక్ష నిర్వహించారు. గత చందనోత్సవాల్లో చోటుచేసుకున్న లోటుపాట్లపై చర్చించారు. వాటిని పునరావృతం కానీయరాదన్నారు. వారం రోజులపాటు జరిగే వార్షిక కల్యాణోత్సవాల్లో వైదిక కార్యక్రమాలు, చందనోత్సవం రోజు జరిగే వైదిక కార్యక్రమాలపై ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసచార్యులతో చర్చించారు. ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తించాలని సూచించారు. క్యూల ఏర్పాటు, శానిటేషన్, ఇంజినీరింగ్ పనులు, అన్నదానం తదితర పనులపై కూలంకషంగా చర్చించారు. త్వరలోనే జిల్లా కలెక్టర్తో సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో దేవస్థానం డిప్యూటీ ఈవో రాధ, ఈఈలు శ్రీనివాసరాజు, రాంబాబు, డీఈ హరి, ఏఈవో శ్రీనివాసరావు, సూపరింటెండెంట్లు నరసింగరావు, రాజ్యలక్ష్మి, త్రిమూర్తులు, సత్యవాణి తదితరులు పాల్గొన్నారు. -
షోకాజ్!
ఉక్కు ఉద్యమంపై● నినదించే గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్న స్టీల్ప్లాంట్ యాజమాన్యం ● స్టీల్ సీఐటీయూ గౌరవాధ్యక్షుడు అయోధ్యరామ్కు షోకాజ్ నోటీసు ● యాజమాన్య వైఖరికి నిరసనగా నేడు స్టీల్ సీఐటీయూ ధర్నా సాక్షి, విశాఖపట్నం : విశాఖ స్టీల్ ప్లాంట్ని ఎలా గాడిలో పెట్టాలన్నదానిపై ఆలోచనలు చేయకుండా.. ఉక్కు భవిష్యత్తు కోసం పోరాడుతున్న వారిపై జులుం ప్రదర్శించడంలో స్టీల్ప్లాంట్ యాజమాన్యం అత్యుత్సాహం చూపిస్తోంది. వైజాగ్ స్టీల్ప్లాంట్ని ఎలాగైనా కాపాడుకోవాలన్న ఉక్కు సంకల్పంతో పోరాటం చేస్తున్న ఉద్యమ నాయకుల్ని భయపెట్టేందుకు యాజమాన్యం షోకాజ్లు జారీ చేస్తోంది. ఆది నుంచి పోరుబాటలో ముందున్న స్టీల్ప్లాంట్ సీఐటీయూ గౌరవాధ్యక్షుడు అయోధ్యరామ్ గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తూ షోకాజ్ నోటీసు జారీ చేయడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిరంతర పోరాటాల వల్లే.. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం నోట నుంచి వచ్చినప్పటి నుంచి ఉద్యమ జ్వాల ఎగసిపడింది. అప్పటి నుంచి విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు అన్ని సంఘాలు అలుపెరగని పోరాటం చేస్తున్నాయి. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడం, నిరంతరం రోడ్లపై ఉద్యోగ కార్మిక సంఘాలు పోరాటం చేయడం వల్ల.. నాలుగేళ్లుగా విశాఖ స్టీల్ప్లాంట్ జోలికి కేంద్రం రాలేకపోయింది. తాజాగా దిద్దుబాటు చర్యలు చేపడుతున్నట్లుగా రూ.11 వేల కోట్లు ప్యాకేజీని ప్రకటించింది. తాత్కాలిక ఉపశమనం కల్పించినా.. ఆర్ఐఎన్ఎల్కు ప్రైవేటీకరణ ముప్పు మాత్రం ఇంకా పొంచి ఉండటంతో ఉద్యమ నాయకులు పోరాటం ఆపలేదు. అయితే స్టీల్ప్లాంట్ గురించి ఎక్కడా మాట్లాడకూడదు.. వీఆర్ఎస్, హెచ్ఆర్ఏ, ఉద్యోగులు, కార్మికుల జీతాల కోసం ఎక్కడా నోరు మెదపకూడదంటూ యాజమాన్యం ఆంక్షలు విధించింది. అయినా.. కార్మిక, ఉద్యోగ సంఘాల నేతలు ఎక్కడా వెనకడుగు వేయకుండా హెచ్ఆర్ఏ, విద్యుత్ చార్జీలు, వీఆర్ఎస్, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై నిరంతరం రోడ్డెక్కి పోరాడుతున్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్టీల్ప్లాంట్ సీఐటీయూ గౌరవ అధ్యక్షుడు జె.అయోధ్యరామ్కు యాజమాన్యం గురువారం షోకాజ్ నోటీసు జారీ చేసింది. కంపెనీ నిబంధనలకు విరుద్ధంగా సీఐటీయూ గౌరవాధ్యక్షునిగా ప్రచారం చేశారంటూ మండిపడుతూ.. ఈ చర్యలపై ఏడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఎంఎంఎస్ఎం డిపార్ట్మెంట్ డిసిప్లినరీ అథారిటీ డీజీఎం(ఎలక్ట్రికల్) ఉమాకాంత్ గుప్తా నోటీసులో పేర్కొన్నారు. యాజమాన్యం వైఖరిని నిరసిస్తూ.. స్టీల్ యాజమాన్యం అయోధ్యరామ్కు షోకాజ్ నోటీస్ ఇవ్వడంపై సీఐటీయూ శ్రేణులు మండిపడుతున్నాయి. అధికారుల చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 8 నుంచి స్టీల్ప్లాంట్ ప్రధాన పరిపాలన భవనం వద్ద ధర్నా చేస్తామని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి రామస్వామి తెలిపారు. నోటీసులు వెనక్కు తీసుకునేంత వరకూ ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. -
దారి తప్పిన ‘మహా ప్రస్థానం’
మహారాణిపేట: ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మరణించిన నిరుపేద రోగుల మృతదేహాలను ఉచితంగా వారి స్వగ్రామాలకు తరలించేందుకు ప్రభుత్వం మహా ప్రస్థానం వాహనాలను ప్రవేశపెట్టింది. అయితే అవి నేడు కొందరి అత్యాశకు దారి తప్పుతున్నాయి. ఉచితంగా అందించాల్సిన సేవలకు సైతం కొందరు డ్రైవర్లు డబ్బులు వసూలు చేస్తూ పేద ప్రజలను మరింత బాధిస్తున్నారు. ఒక్కో మృతదేహాన్ని తరలించేందుకు రూ. 2వేల నుంచి రూ. 3 వేల వరకు దౌర్జన్యంగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2017లో పేద ప్రజలకు మృతదేహాల తరలింపు భారం కాకూడదని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ప్రైవేట్ వాహనాలు అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్న నేపథ్యంలో మహాప్రస్థానం వాహనాల ద్వారా ఉచితంగా మృతదేహాలను తరలించే సౌకర్యాన్ని కల్పించింది. కేజీహెచ్లో ప్రారంభంలో ఆరు వాహనాలను ఏర్పాటు చేయగా.. ప్రస్తుతం వాటి సంఖ్యను తొమ్మిదికి పెంచారు. రోజుకు 25 నుంచి 30 మృతదేహాలను ఈ వాహనాల ద్వారా తరలిస్తున్నారు. అయితే కొందరు డ్రైవర్లు మాత్రం నిబంధనలను తుంగలో తొక్కి, ఉచితంగా అందించాల్సిన సేవలకు డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆస్పత్రుల్లో, రోడ్డు ప్రమాదాల్లో, ఎంఎల్సీ కేసుల్లో మరణించిన వారి బంధువుల నుంచి బలవంతంగా డబ్బులు గుంజుతున్నారని సమాచారం. డబ్బులు ఇవ్వకపోతే మృతదేహాలను మధ్యలోనే వదిలి వెళ్లిపోతామని బెదిరింపులకు దిగుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న బాధిత కుటుంబ సభ్యులు డ్రైవర్లు అడిగినంత డబ్బులు ఇవ్వాల్సి వస్తోంది. వాస్తవానికి కేజీహెచ్ నుంచి అనకాపల్లి, విజయనగరం వరకు మహాప్రస్థానం వాహనాల ద్వారా ఉచితంగా మృతదేహాలను తరలించేందుకు అనుమతి ఉంది. అంతేకాకుండా మృతుల బంధువుల అభ్యర్థన మేరకు, సంబంధిత అధికారుల అనుమతితో అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లా, శ్రీకాకుళం జిల్లాలకు కూడా ఈ వాహనాల ద్వారా మృతదేహాలను తరలిస్తున్నారు. వాహనాల డ్రైవర్ల జీతాలు, ఇంధన ఖర్చులు, ఇతర నిర్వహణ ఖర్చులను ఇంటిగ్రేటెడ్ హెల్త్ గ్రూప్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ద్వారా ప్రభుత్వం చెల్లిస్తోంది. పేద ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తుంటారు. వీరు ఆర్థికంగా చితికిపోయి ఉంటారు. ఇటీవల ఓ తండ్రి తన కుమారుడి మృతదేహాన్ని ద్విచక్ర వాహనంపై పాడేరుకు తీసుకువెళ్లిన సంఘటన పేదల కష్టాలను కళ్లకు కట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో.. మహాప్రస్థానం వాహనాల డ్రైవర్లు డబ్బులు డిమాండ్ చేయడం దారుణమని పలువురు విమర్శిస్తున్నారు. ఈ విషయంపై ఎన్ని ఫిర్యాదులు వెళ్లినా అధికారులు పట్టించుకోవడం లేదని రోగుల బంధువులు వాపోతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి, పేదలను దోచుకుంటున్న డ్రైవర్లపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. మృతదేహాల తరలింపునకు రూ.2 వేలు వసూలు చేస్తున్న వాహన డ్రైవర్లు వాస్తవానికి ఈ తరలింపు పూర్తి ఉచితం వాహనాల నిర్వహణ బాధ్యత కేజీహెచ్దే.. కానీ మరణించిన వారి కుటుంబ సభ్యుల నుంచి దౌర్జన్యంగా డబ్బుల వసూళ్లు -
ఉక్కు పరిరక్షణకు 14న నిరసన
డాబాగార్డెన్స్: విశాఖ స్టీల్ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని, సొంత గనులు కేటాయించి సెయిల్లో విలీనం చేయాలన్న డిమాండ్లతో ఈ నెల 14న అఖిల పక్ష కార్మిక ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు చేపట్టాలని విజయవాడలో జరిగిన రాష్ట్ర జేఏసీ సమావేశం నిర్ణయించింది. ఈ మేరకు విశాఖ జిల్లాలో నిరసన ప్రదర్శనలు జయప్రదం చేసేందుకు కార్యాచరణపై సిటూ కార్యాలయంలో అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ గురువారం సమావేశమైంది. సమావేశంలో జేఏసీ చైర్మన్ మరడాన జగ్గునాయుడు మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం స్టీల్ప్లాంట్ను ప్రైవేటీకరణ చేస్తామని ప్రకటించిన నుంచి ఇప్పటి వరకు జేఏసీ ఆధ్వర్యంలో పోరాడుతున్నామన్నారు. కార్మికుల సమస్యలపై మాట్లాడినందుకు యూనియన్ గౌరవ అధ్యక్షుడు అయోధ్యరామ్కి షోకాజ్ నోటీసులు ఇవ్వడాన్ని జేఏసీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఈ నెల 14న జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి నిర్వహించనున్న నిరసన ప్రదర్శనలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సిటూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వీ కుమార్, ఏపీఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి దేవా, సీఎఫ్టీయూఐ జిల్లా కార్యదర్శి లక్ష్మి, ప్రభుత్వ రంగ పరిశ్రమల పరిరక్షణ కమిటీ కో కన్వీనర్ కుమార మంగళం, శ్రామిక మహిళా కన్వీనర్ పి.మణి, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఐజే నాయుడు, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కె.సంతోష్, మత్స్యకార సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
భారతీయ మహిళలు ధైర్యవంతులు
విశాఖ విద్య: భారతీయ మహిళలు ఎంతో ధైర్యవంతులని జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు ఎస్.విజయభారతి అన్నారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలోని వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో దుర్గాబాయి దేశముఖ్ సెంటర్ ఫర్ ఉమెన్ స్టడీస్, ఏబీఆర్ఎస్ఎం–లేడీ టీచర్స్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం–2025 వర్క్షాప్ ఆక్సెలరేట్ యాక్షన్ను గురువారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీ్త్ర విద్యతో సమాజాభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. సంస్కారవంతమైన యువతకు తల్లిదండ్రులే కీలకమని చెప్పారు. సమాజం కోసం, దేశం కోసం అనే భావనతో యువత ముందుకెళ్లాలని సూచించారు. వివేకానందుడు కలలుగన్న విధంగా యువతరం ఉజ్వల తారలుగా మారి, తమ ఆశయాలను సాకారం చేసుకోవాలన్నారు. భారత స్వాతంత్ర ఉద్యమంలో మహిళల విజయగాథలను వివరించారు. కార్యక్రమంలో ఆచార్య ఎ.పల్లవి ఆంధ్రప్రదేశ్ కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం ఆచార్యులు డాక్టర్ పి.శ్రీదేవి, ఐఏఎస్ఈ ప్రిన్సిపాల్ ఆచార్య డి.నగరాజకుమారి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఎన్హెచ్ఆర్సీ సభ్యురాలు విజయభారతిని వైస్ఛాన్సలర్ ఆచార్య రాజశేఖర్, రిజిస్ట్రార్ ధనుంజయరావు జ్ఞాపిక అందించి, సత్కరించారు. జాతీయ హక్కుల కమిషన్ సభ్యురాలు విజయభారతి -
సమానత్వంతోనే సమాజాభివృద్ధి
సీతమ్మధార : సమానత్వంతోనే సమాజాభివృద్ధి జరుగుతుందని, మహిళా హక్కులను పోరాడి సాధించుకోవాలని సీఐటీయూ,ఐద్వా, డీవైఎఫ్ఐ ప్రతినిధులు పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి ఆశీలుమెట్ట, లలితా జ్యుయలర్స్, ఆర్టీసీ కాంప్లెక్స్, గురజాడ సెంటర్, సెంట్రల్ పార్కు మీదుగా గాంధీపార్కు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మహిళలకు అవకాశాలు ఇస్తే అన్ని రంగాల్లో ముందుకువెళతారన్నారు. నేటికీ చట్టసభల్లో మహిళలకు సముచిత స్థానం కల్పించడం లేదన్నారు. రాష్ట్రంలో మహిళలపై రోజురోజుకూ దాడులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యాన్ని అరికట్టాల్సిన ప్రభుత్వం దానిని ఆదాయ వనరుగా చూడటం, అదనంగా మద్యం షాపులకు లైసెన్సులు ఇవ్వడం దుర్మార్గం అన్నారు. అంగన్వాడీ, ఆశా, ఆర్పీ, హాస్పిటల్, షాప్స్లో పనిచేస్తున్న మహిళా కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ ప్రధాన కార్యదర్శి కుమార్, సీతాలక్ష్మి, వెంకటరెడ్డి, అప్పలరాజు, ఐద్వా అధ్యక్ష, కార్యదర్శులు బి.పద్మ, వై.సత్యవతి, సంతోష్, వరలక్ష్మి, కె.మణి, వి.ప్రభావతి, లీలావతి, బొట్టా ఈశ్వరమ్మ, కె. కుమారి తదితరులు పాల్గొన్నారు. -
నలుగురు నేరస్తుల నగర బహిష్కరణ
అల్లిపురం: నగరంలో ప్రజా జీవనానికి, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ పలు తీవ్రమైన నేరాలకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులకు నగర బహిష్కరణ విధిస్తూ చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పీఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధి ఆర్.హెచ్.కాలనీకి చెందిన కొలగాని పవన్ రాజ్ కుమార్ అలియాస్ పవన్, దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధి వడ్లపూడికి చెందిన కాండ్రేగుల లోకనాథ్ వీర సాయి శ్రీనివాస్ అలియాస్ లోకేష్, ఎయిర్ పోర్టు పోలీస్ స్టేషన్ పరిధి ఆర్ అండ్ బీ ప్రాంతానికి చెందిన రావాడ జగదీష్, ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధి చినగదిలి ప్రాంతానికి చెందిన నక్కా లోకేష్ అలియాస్ కిట్టులపై ఈ చర్యలు చేపట్టారు. వీరు అక్రమ రవాణా, దోపి డీలు, మాదకద్రవ్యాల వ్యాపారం, గూండాయిజం, అనైతిక కార్యకలాపాలు, భూ కబ్జాలు వంటి అనేక నేరాలకు పాల్పడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. వీరంతా అనేక నేరాల్లో శిక్షలు అనుభవించినప్పటికీ, వారి ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సెక్షన్–3(1) అండ్ (2) రెడ్ విత్ సెక్షన్ 2(ఎఫ్) అండ్ 2(జీ) కింద అక్రమ రవాణాదా రులు, దోపిడీదారులు, మాదక ద్రవ్యాల నేరస్తులు, గూండాలు, అనైతిక రవాణా నేరస్తులు, భూ కబ్జాదారుల చట్టం, 1986(చట్టం నం.1) కింద వీరిని ఏడాది పాటు నగరం నుంచి బహిష్కరిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది -
బెయిల్పై సీపీఐ నేత జేవీఎస్మూర్తి విడుదల
ఆరిలోవ: ఎల్జీ పాలిమర్స్ కేసులో వారం క్రితం అరెస్టయి జైల్కు వెళ్లిన సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ మూర్తికి బెయిల్ మంజూరైంది. దీంతో ఆయన గురువారం విడుదలయ్యారు. విష యం తెలుసుకొన్న సీపీఐ జిల్లా నాయకులు విశాఖ కేంద్ర కారాగారానికి చేరుకుని ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జేవీ మాట్లాతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్న వారిని అరెస్టులు చేసి రిమాండ్కు తరలించడం కక్ష సాధింపు చర్యలకు పాల్పడడమేనని తెలిపారు. కోర్టుకు హాజరైన సమయంలో న్యాయమూర్తి అందుబాటులో లేకపోవడంతో రీకాల్ చేసుకుంటానని చెప్పినా వినకుండా గోపాలపట్నం పోలీసులు విచక్షణారహితంగా వ్యవ హరించారన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి పైడిరాజు మాట్లాడుతూదొంగలు, ఇసుక మాఫియా, భూకబ్జాలు, లిక్కర్ మాఫియా చేసేవారు బయట విచ్చలవిడిగా తిరుగుతున్నారన్నారు. అలాంటి వారిని పోలీసులు విడిచిపెడుతున్నారన్నారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు విమల, సత్యనారాయణ, శ్రీనివాస్, రెహమాన్, తదితరులు పాల్గొన్నారు. -
భారతదేశం సనాతన ధర్మానికి పుట్టినిల్లు
బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ విజేత విశాఖ ఉక్కు ఉక్కునగరం: జాతీయ స్థాయి ఇంటర్ స్టీల్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ను విశాఖ స్టీల్ప్లాంట్ జట్టు కై వసం చేసుకుంది. స్టీల్ప్లాంట్స్ స్పోర్ట్స్ బోర్డు (ఎస్పీఎస్బీ) ఆధ్వర్యంలో దుర్గాపూర్లో మార్చి 3 నుంచి 5 వరకు ఇంటర్ స్టీల్ బ్యాడ్మింటర్ చాంపియన్షిప్ 2024–25 పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విశాఖ స్టీల్ప్లాంట్, దుర్గాపూర్, బిలాయ్, భద్రావతి, బొకారో, సేలం, రూర్కెలా, ఐఎస్పీ బర్న్పూర్ తదితర 9 జట్లు పాల్గొన్నాయి. బుధవారం దుర్గాపూర్తో జరిగిన ఫైనల్స్ పోటీల్లో విశాఖ స్టీల్ప్లాంట్ జట్టు చాంపియన్షిప్ గెలుపొందింది. అనంతరం జరిగిన కార్యక్రమంలో దుర్గాపూర్ స్టీల్ప్లాంట్ ఈడీ పి.మురుగేషన్ విశాఖ స్టీల్ప్లాంట్ జట్టుకు బంగారు పతకం, ట్రోపీ అందజేశారు. ఈ సందర్భంగా స్టీల్ప్లాంట్ ఇన్చార్జ్ సీఎండీ ఎ.కె.సక్సేనా విజేతలను అభినందించారు. -
పిల్లల చెంతకు తల్లి
సీతమ్మధార: విశాఖపట్నం రైల్వేస్టేషన్లో దిక్కుతోచని స్థితిలో కనిపించిన అమ్ము అనే మహిళకు ఏయూటీడీ సిబ్బంది పునర్జన్మనిచ్చారు. తూర్పు గోదావరి జిల్లా మూలస్థానం గ్రామానికి చెందిన అమ్ము భర్త తాగుబోతు. ఆయన చిత్రహింసలు భరించలేక మానసిక వేదనకు గురైన ఆమె కొన్నేళ్ల కిందట ఇల్లు వదిలి వెళ్లిపోయింది. స్నేహాలయ సంస్థ సహకారంతో కో లుకుని మేనమామ సంరక్షణలో ఉన్న పిల్లల వద్దకు చేరినా, మందులు మానేయడంతో మూడేళ్ల కిందట మళ్లీ రోడ్డున పడింది. అలా విశాఖ చేరిన ఆమెను ఏయూటీడీ సంస్థ చేరదీసింది. ఆమెను ద్వారకానగర్లోని జీవీఎంసీ–ఏయూటీడీ వసతి గృహానికి తరలించి శ్రద్ధా ఫౌండేషన్ ద్వారా వైద్య సహాయం అందించారు. కోలుకున్న అమ్మును గురువారం డిప్లమో చదివిన కుమారుడు, ఇంటర్ చదువుతున్న కుమార్తెకు, వారి మేనమామ సమక్షంలో అప్పగించారు. తమ తల్లి తిరిగి రావడంతో పిల్లలు ఆనందంతో కన్నీరు పెట్టుకున్నారు. ఏయూటీడీ, శ్రద్ధా ఫౌండేషన్ సంస్థలకు వారు కృతజ్ఞతలు తెలిపారు. -
ఆత్మహత్యాయత్నంనకు పాల్పడిన తండ్రి మృతి
ఆరిలోవ: ఆత్మహత్యాయత్నం చేసిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి ఎస్ఐ కృష్ణ తెలిపిన వివరాలివి.. జీవీఎంసీ 13వ వార్డు పరిధి దుర్గాబజార్లో నివాసముంటున్న బి.మణికంఠ(45) 10వ తరగతి చదువుతున్న తన కుమార్తెను ఫోన్ చూడవద్దంటూ హెచ్చరించారు. దీంతో కుమార్తె నిరాకరించడంతో మనస్తాపంతో ఆయన గత నెల 24న పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు అప్పటికే కొన ఊపిరితో ఉన్న మణికంఠను కేజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఆయన మృతి చెందారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఆరిలోవ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పినగాడిలో తన్నుకున్న ‘తమ్ముళ్లు’
పెందుర్తి: ెపందుర్తి మండలం పినగాడిలో అధికార తెలుగుదేశం పార్టీలోని వర్గపోరు మరోసారి రోడ్డెక్కింది. గ్రామం నడిబొడ్డున టీడీపీలోని రెండు వర్గాల నాయకులు, కార్యకర్తలు తన్నుకున్నారు. గ్రామంలోని శివాలయం వార్షికోత్సవం సందర్భంగా బుధవారం రాత్రి జరిగిన ఊరేగింపులో ఈ ఘటన చోటుచేసుకుంది. పల్లకీ మోయడం విషయంలో తలెత్తిన వివాదంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు, టీడీపీ ఇన్చార్జి గండి బాబ్జీ వర్గీయులు బాహాబాహికి దిగారు. ఈ వివాదంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కొట్లాట అనంతరం ఇరు వర్గాల నాయకులు పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. అయితే కేసు నమోదు కాకుండా రాజీ కుదిర్చేందుకు ఇరు వర్గాల ముఖ్య నేతలు పోలీసు అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఇదీ వివాదం.. : పినగాడిలోని బుధవారం శివాలయం వార్షికోత్సవం జరిగింది. రాత్రి 7 గంటల సమయంలో ఆలయం నుంచి శివుని ఉత్సవ మూర్తుల ఊరేగింపు ప్రారంభించారు. రాత్రి 9 దాటాక గ్రామంలోకి ఊరేగింపు ప్రవేశించింది. ఈ క్రమంలో పల్లకీని టీడీపీకి చెందిన ఒకే వర్గం(ఎమ్మెల్యే పంచకర్ల వర్గీయులు) పట్టుకోవడంపై మరో వర్గం (గండి బాబ్జీ వర్గం) అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. అరుపులు, తోపులాటలతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. ‘మీ అంతు చూస్తాం’ ‘మీ సంగతి తెలుస్తాం’అంటూ ఇరు పక్షాలు సవాళ్లు విసురుకుంటూ పోలీస్ స్టేషన్కు వెళ్లిపోయారు. అయితే అధికార పార్టీ నాయకుల కొట్లాట కావడంతో వెనువెంటనే చర్యలు తీసుకునేందుకు పోలీసులు వెనుకంజ వేశారు. ఈ నేపథ్యంలో కేసులు లేకుండా ఇరు వర్గాలు రాజీ చేసుకునే విధంగా ఆయా వర్గాల పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. కాగా.. గ్రామంలో ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో టీడీపీ నాయకులు వీధి రౌడీల్లా కొట్టుకోవడం చూసి గ్రామస్తులు తీవ్ర భయాందోళకు గురయ్యారు. ఆధిపత్యం కోసం ఇరువర్గాలు ఇంతలా దిగజారాలా అని దుమ్మెత్తిపోస్తున్నారు. ‘శివుని’ఊరేగింపులో చెలరేగిన వివాదం కొట్టుకున్న టీడీపీ రెండు వర్గాలనాయకులు పోలీస్ స్టేషన్కు చేరిన పంచాయితీ రాజీకి ముఖ్యనేతల మంతనాలు -
కాంట్రాక్ట్ కార్మికునికి గాయాలు
ఉక్కునగరం : స్టీల్ప్లాంట్ యుటిలిటీస్ విభాగంలో జరిగిన ప్రమాదంలో కాంట్రాక్ట్ కార్మికునికి గాయాలయ్యాయి. స్టీల్ప్లాంట్ పోలీసులు అందించిన వివరాలివి.. విభాగంలో స్కిల్డ్ కార్మికునిగా విధులు నిర్వహిస్తున్న సిహెచ్.ఆనందరెడ్డి (40) గురువారం విభాగంలోని ఏఎస్యూ–1 సెక్షన్లో పనిచేస్తున్నారు. విధి నిర్వహణలో ఆక్సిజన్ పంప్ బరస్ట్ అయింది. దీంతో అక్కడ మంటలు చెలరేగాయి. ఈ సంఘటనలో ఆనందరెడ్డికి గాయాలయ్యాయి. వెంటనే అతన్ని ఉక్కు జనరల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి గాజువాకలోని ప్రైవేటు ఆస్పపత్రికి తీసుకెళ్లారు. అతనికి సుమారు 40 శాతం గాయాలయ్యాయి. స్టీల్ప్లాంట్ యాజమాన్యం భద్రతపై దృష్టి సారించాలని స్టీల్ ఐఎన్టీయూసీ చీఫ్ పేట్రన్ నీరుకొండ రామచంద్రరావు డిమాండ్ చేశారు. -
ప్రణాళికా విభాగం పనితీరు మెరుగుపడాలి
విశాఖ సిటీ: ప్రణాళిక విభాగం పనితీరును మెరుగుపర్చుకోవాలని వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్గోపాల్ సంబంధిత అధికారులకు సూచించారు. గురువారం ఆయన తన చాంబర్లో అధికారులతో సమీక్షించారు. సంస్థ చేపడుతున్న పలు అభివృద్ధి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. క్షేత్ర స్థాయిలో పనులను వేగవంతం చేయాలని, స్థానిక ఎమ్మెల్యేల సహకారం, సమన్వయంతో ముందుకు సాగా లని సూచించారు. పూర్తయిన పనులను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. అదే విధంగా ప్రతి వారం నిర్వహిస్తున్న ప్రజాదర్బార్కు వచ్చే వినతులను సకాలంలో పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. జాయింట్ కమిషనర్ రమేష్, కార్యదర్శి మురళీకష్ణ, ప్రధాన ఇంజినీర్ వినయ్ కుమార్, ప్రధాన అర్బన్ ప్లానర్ శిల్ప, ఎస్టేట్ అధికారి దయానిధి, ప్రధాన గణంకాధికారి హరిప్రసాద్, డివిజనల్ అటవీ అధికారి శివానీ తదితరులు పాల్గొన్నారు. -
మహిళలపై అణచివేతకు వ్యతిరేకంగా పోరాటం
● మహిళా చేతన ప్రధాన కార్యదర్శి పద్మ సీతమ్మధార: మహిళలపై జరుగుతున్న అణచివేత, హింస, దాడులకు వ్యతిరేకంగా మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాలని మహిళా చేతన ప్రధాన కార్యదర్శి కె.పద్మ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని గురువారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మహిళా చేతన ఆధ్వర్యంలో ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో ఇంటా బయటా మహిళలపై అత్యాచారాలు, వేధింపులు, దాడులు అధికమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల హక్కుల కోసం రాజ్యాంగం రూపొందించిన చట్టాలను పాలకులు నీరుగారుస్తున్నారని విమర్శించారు. మణిపూర్లో జరిగిన సంఘటనే ఇందుకు నిదర్శనమన్నారు. తల్లి, కుమార్తైపె పోలీసులు రోజులు తరబడి అత్యాచారం చేసిన ఘటన, ప్రేమించినందుకు ఓ యువతిని అడవిలోకి తీసుకెళ్లి తండ్రి హత్య చేసిన ఉదంతం వంటి దారుణాలు ఇటీవల జరిగాయని ఆమె గుర్తు చేశారు. కుల రాజకీయాలు, మతతత్వ దాడుల్లో మహిళలు బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు పోరాడి సాధించుకున్న గృహ హింస, వరకట్న వేధింపుల చట్టాలను కూడా బలహీనపరుస్తున్నారని ఆందోళన చెందారు. ప్రగతి శీల కార్మిక సమాఖ్య నాయకులు అన్నపూర్ణ మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న మహిళా హక్కులను నేడు తిరిగి కాపాడుకోవాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. ప్రభుత్వాలు చిత్తశుద్ధితో చట్టాలను అమలు చేస్తేనే ఇటువంటి ఘటనలు నియంత్రణలోకి వస్తాయని ఆమె స్పష్టం చేశారు. హెచ్ఆర్ఎఫ్ ప్రతినిధి కె.అనురాధ, షాంశాద్ బేగం, లావణ్య, భారత నాస్తిక సమాజం జిల్లా కార్యదర్శి వై. నూకరాజు, రాం ప్రభు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. -
అడ్డగోలు అడ్మిషన్లకు తెరతీసిన ‘ప్రైవేట్’
విశాఖ విద్య: విద్యా రంగంపై కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో వెనుకబడిన, నిరుపేద వర్గాలకు చదువులు భారమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ప్రైవేట్ స్కూళ్లు, జూనియర్ కాలేజీలు ఉన్న విశాఖ జిల్లాలో ప్రస్తుతం ఇలాంటి పరిణామాలే చోటుచేసుకుంటున్నాయి. కూటమిలో కొంత మంది పెద్దల సహకారంతో కార్పొరేట్ శక్తులు నగరంలో విద్యా వ్యాపారానికి స్కెచ్ వేస్తున్నాయి. సర్కారు బడుల్లో ఇంగ్లిష్ చదువులు సవ్యంగా సాగకపోవడంతో.. తమ పిల్లల భవిష్యత్ దృష్ట్యా చాలా మంది తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూళ్ల వైపు మోజు చూపిస్తున్నారు. ఇదిగో సాక్ష్యం జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలో 1,387 పాఠశాలలు ఉన్నాయి. జిల్లా విద్యాశాఖ లెక్కల ప్రకారం 2024–25 విద్యా సంవత్సరంలో 3,81,262 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వ స్కూళ్లు 610 ఉండగా వీటిలో 79,166 మంది చదువుతున్నారు. ప్రైవేట్ స్కూళ్లు 777 ఉండగా, వీటిలో 3,02,096 మంది చదువుతున్నారు. 2023–24లో (వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు) ప్రైవేటు స్కూళ్లలో 2,98,330 మంది ఉండగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2024–25లో గతం కంటే 3,766 మంది ఎక్కువగా చేరారు. ప్రభుత్వ స్కూళ్లు నుంచి విద్యార్థులు ప్రైవేటుకు వెళ్లిపోతున్నారనడానికి ఈ అంకెలే నిదర్శనం. కార్పొరేట్కు మేలు చేసేలా స్కూళ్ల రేషనలైజేషన్ కూటమి ప్రభుత్వం 117 జీవో రద్దు పేరిట చేపట్టిన రేషనలైజేషన్తో జిల్లాలోని 31 ప్రాథమికోన్నత స్కూళ్లలో 20కు పైగానే ప్రైమరీ స్కూళ్లుగా మారబోతున్నాయి. దీంతో ఇప్పటి వరకు అక్కడ 6,7,8 తరగతులు చదివే విద్యార్థులను ఎగరేసుకుపోయేందుకు సమీపంలోని ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్ల నిర్వాహకులు వారి తల్లిదండ్రులతో మంతనాలు మొదలుపెట్టారు. అలాగే మోడల్ స్కూల్ పేరిట, ప్రైమరీ స్కూళ్లలో 3, 4, 5 తరగతులు తీసేస్తుండటంతో.. బస్సులు పెడతాం మా స్కూళ్లకు పంపించండి అంటూ ప్రైవేటు యాజమన్యాలు ముందస్తు అడ్మిషన్లు చేస్తున్నాయి. ఇలాంటి పరిణామాలతో 2025–26 విద్యా సంవత్సరంలో జిల్లాలో మరింత మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్లలో చేరిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. సర్కారు చదువులపై సన్నగిల్లుతున్న ఆశలు ఇంగ్లిష్ మీడియం చదువులకు మంగళం కార్పొరేట్కు కొమ్ముకాస్తున్న కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలకు క్యూ కడుతున్న విద్యార్థులు ఇదే అదునుగా ఫీజులు పెంచేస్తున్న యాజమాన్యాలు -
స్కూటీ అదుపు తప్పి.. మహిళా పోలీస్ దుర్మరణం
మల్కాపురం: స్కూటీ అదుపు తప్పిన ఘటనలో మహిళా పోలీసు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి మల్కాపురం ఎస్ఐ శ్యామలరావు తెలిపిన వివరాలివి. అంగనపూడి ప్రాంతానికి చెందిన మీను భూషణ్(46) కూర్మన్నపాలెం సచివాలయంలో మహిళా పోలీసుగా విధులు నిర్వర్తి స్తున్నారు. ఆమె భర్త స్టీల్ప్లాంట్లో అసిస్టెంట్ మేనేజర్గా పని చేస్తున్నారు. బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో మీను భూషణ్ తన కుమార్తెతో కలిసి స్కూటీపై షీలానగర్ నుంచి పోర్టు ఫ్లైఓవర్ బ్రిడ్జి మీదుగా నగరం వైపు వెళ్తున్నారు. బ్రిడ్జి ఎక్కుతుండగా, ఆమె వెళ్తున్న మార్గంలో ఇద్దరు వ్యక్తులు గడ్డి పట్టుకుని రోడ్డు దాటుతున్నారు. వారిని గుర్తించిన మీను భూషణ్ వెంటనే తన స్కూటీకి అకస్మాత్తుగా బ్రేక్ వేశారు. దీంతో వాహనం అదుపు తప్పి పక్కనున్న డివైడర్ను ఆమె ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో మీను భూషణ్కు తలకు, ఆమె కుమార్తెకు శరీరంపై గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన ఇద్దరినీ చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మీను భూషణ్ గురువారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. -
సంతృప్తికర సమాధానాలిస్తేనే.. పోలవరానికి నిధులు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అడిగిన సాంకేతిక ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం సంతృప్తికర సమాధానాలు ఇస్తేనే పోలవరం ప్రాజెక్ట్కు నిధులు కేటాయిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఆమె గురువారం సాయంత్రం విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ విభజన సమయంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని, సాంకేతిక సమస్యల వల్లే నిర్మాణం ఆలస్యమవుతోందని తెలిపారు. విశాఖపట్నం మెట్రో ప్రాజెక్ట్ డీపీఆర్ కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని, దానికి ఆమోదం తెలిపిన తర్వాతే నిధుల మంజూరు సాధ్యమవుతుందని చెప్పారు. విశాఖ స్టీల్ ఫ్లాంట్ అభివృద్ధికి రూ.11వేల కోట్ల ఆర్థిక సహకారం అందిస్తున్నామని పేర్కొన్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందుతుందన్నారు. కేంద్రం, రాష్ట్రం కలిసి చేస్తున్న అన్ని ప్రాజెక్టులకు లోటు లేకుండా కేటాయింపులు చేస్తున్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. రూ.12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఇచ్చామని, సేవా రంగంలో నిర్దిష్టమైన ఆదాయం వస్తుందని చెప్పారు. నూతన పద్ధతుల ద్వారా ఆదాయ పన్ను చెల్లింపు విధానాన్ని సులభతరం చేశామని తెలిపారు. తొమ్మిది కోట్ల మంది రిటర్న్స్ ఫైల్ చేస్తే, మూడు కోట్ల మంది మాత్రమే పన్ను చెల్లిస్తున్నారని, కొత్తగా పన్ను వెసులుబాటు ద్వారా ఈ సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే ఆదాయ వనరులు పెంచుకోవాలన్నారు. సుంకాలపై అమెరికా ప్రభావం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో సుంకాలు పెరిగే అవకాశం ఉందని నిర్మలా సీతారామన్ చెప్పారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలో ప్రత్యేక బృందం అమెరికా వెళ్లి సుంకాల పెంపుపై అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. అమెరికా సుంకాల పెంపు ప్రభావం మన దేశ ఆర్థిక వ్యవస్థపై పడుతుందని వ్యాఖ్యానించారు. తాను పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో నివసించానని, అక్కడ నీటి కష్టాలు అనుభవించానని ఆమె తెలిపారు. జల్ జీవన్ మిషన్ ద్వారా నేరుగా ఇంటికే మంచినీరు ఇచ్చే బృహత్తర ప్రాజెక్టును చేపడుతున్నామని చెప్పారు. ఆత్మ నిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా లాంటి కార్యక్రమాలు చేపట్టకపోతే వినాయక చవితికి విగ్రహం తయారుచేసే మట్టిని కూడా ఇతర దేశాల నుంచి తెచ్చుకోవాల్సిన దారుణ పరిస్థితులు దాపురించేవని ఆమె వ్యాఖ్యానించారు. విశాఖ సమీపంలో ఫార్మా రంగం అభివృద్ధికి బల్క్ డ్రగ్ పరిశ్రమలను విస్తృతం చేసినట్లు తెలిపారు. పోస్ట్ బడ్జెట్ సమావేశంలో ఆర్థిక మంత్రి వివిధ వ్యాపార వర్గాలు, పారిశ్రామిక, ఐటీ సంఘాల ప్రతినిధులతో గురువారం సాయంత్రం విశాఖలోని ఓ హోటల్లో నిర్వహించిన పోస్ట్ బడ్జెట్ ముఖాముఖి కార్యక్రమంలో ఆర్థిక మంత్రి సీతారామన్తోపాటు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పాల్గొన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్ఎంఈ)ల కోసం ‘కొత్త క్రెడిట్ అసెస్మెంట్ మోడల్’ను నిర్మలా సీతారామన్ ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత దేశవ్యాప్తంగా చర్చలు నిర్వహిస్తున్నామని చెప్పారు. తొలుత ముంబయిలో జరిగిందని, రెండో చర్చ విశాఖలో నిర్వహిస్తున్నామని తెలిపారు. కొత్త క్రెడిట్ అసెస్మెంట్ మోడల్ ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకులు... ఎంఎస్ఎంఈలకు రుణాలు మంజూరు చేసేందుకు థర్డ్ పార్టీ మదింపులపై ఆధారపడకుండా, అంతర్గత మదింపు సామర్థ్యాన్ని పెంచుకుంటాయన్నారు. అధికారిక అకౌంటింగ్ వ్యవస్థ లేని ఎంఎస్ఎంఈలకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు. విశాఖలో వివిధ వర్గాల ప్రజలను కలసి బడ్జెట్పై వారి సలహాలు, సూచనలు తీసుకున్నామని నిర్మలా సీతారామన్ చెప్పారు. -
ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలపై స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కక్ష సాధింపు
సాక్షి, విశాఖ : ఉక్కు పోరాట కమిటీ నేతలపై స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కక్ష సాధింపు చర్యలకు దిగింది. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారికి షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ప్లాంట్ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని పోరాట కమిటీ నేత అయోధ్యరామ్కు నోటీసులు అందించింది. వారంలోగా వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొంది. -
రక్షణ పరిశోధనల్లో భారత్ దూకుడు
సాక్షి, విశాఖపట్నం: రక్షణ పరిశోధన సాంకేతిక రంగంలో భారత్ దూకుడుగా వ్యవహరిస్తూ అగ్ర దేశాలతో పోటీ పడుతోందని డీఆర్డీవో మాజీ చీఫ్, రక్షణ మంత్రిత్వ శాఖ శాస్త్రీయ సలహాదారు డా.అవినాష్ చందర్ అన్నారు. డిఫెన్స్ ఉత్పత్తుల ఎగుమతుల్లో దూసుకుపోతున్నామని, అయితే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విషయంలో భారత్ మరింత పురోభివృద్ధి సాధించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. కొత్త విద్యా విధానం పరిశోధనలకు ఊతమిచ్చేలా అద్భుతంగా ఉందని కొనియాడారు. ఎన్ఎస్టీఎల్లో బుధవారం నిర్వహించిన జాతీయ సైన్స్ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన విశాఖపట్నం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో పలు అంశాలపై మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..బ్రిటీష్ విద్యా విధానం నుంచి బయటపడ్డాం ఏళ్ల తరబడి బ్రిటీష్ విద్యా విధానాన్ని దేశంలో అమలు చేస్తున్నాం. ఈ విధానం విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించేలా రూపొందించారు. కొత్తగా అమలు చేస్తున్న విధానం.. విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకొస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ విధానం.. ఉపాధి అవకాశాలు మాత్రమే కాదు.. 10 మందికి ఉపాధి కల్పించేలా విద్యార్థుల్ని తీర్చిదిద్దుతుంది. శాస్త్రీయ పద్ధతుల్లో బోధన, పరిశోధనల వైపు భారతీయ విద్యార్థుల్ని నడిపిస్తుండటం నూతన అధ్యాయం. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్పై ఇంకా ఎదగాల్సిన అవసరం ఉంది. చైనాలో 85కు పైగా డిఫెన్స్ రీసెర్చ్ పార్క్లు ఉంటే.. మన దేశంలో నాలుగైదు మాత్రమే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి.. ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తుండటం శుభ పరిణామం. ఎందుకంటే దేశంలో పరిశోధనలకు అపారమైన అవకాశాలున్నాయి. రక్షణ రంగంలో విజయవంతంగా ప్రయోగాలుడీఆర్డీవో నిర్వహిస్తున్న అనేక ప్రయోగాలు విజయవంతమవుతున్నాయి. ఇది భారత రక్షణ వ్యవస్థని మరింత బలోపేతం చేస్తోంది. నేవల్ బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్(బీఎండీ) సామర్థ్యంలో అగ్రదేశాల సరసన నిలుస్తూ.. ఎలైట్ క్లబ్ ఆఫ్ నేషన్స్లో చేరాం. యుద్ధనౌక, భూమి నుంచి శత్రు బాలిస్టిక్ క్షిపణులను నిలువరించే సామర్థ్యాల్ని భారత్ అభివృద్ధి చేసింది. అంతకు ముందే భూ ఆధారిత క్షిపణి ప్రయోగం కూడా విజయవంతంగా నిర్వహించాం. ఈ విజయాలతో సుదూర అణు క్షిపణులు, హైపర్ సోనిక్ మిసైల్స్, గ్లైడర్స్, శత్రు విమానాల్ని అడ్డుకోగల సామర్థ్యం భారత్ సొంతం చేసుకుంది. రక్షణ రంగంలో ఫుల్ ఫ్లెడ్జ్ వెపన్ సిస్టమ్స్ అభివృద్ధి చేసేలా ఎల్ అండ్ టీ, టాటా.. ఇలా ఎన్నో ఇండస్ట్రీలు వస్తున్నాయి. ఈ కారణంగా.. మన ఆయుధ సంపత్తిని అవసరాలకు అనుగుణంగా పెంచుకునేంత సామర్థ్యాన్ని సా«ధించాం.భారత రక్షణ రంగం.. నిరంతరం కొత్త ఆలోచనలు, ఆవిష్కరణల్ని అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా.. హైపర్ సోనిక్ లైట్ వెహికల్స్, హైపర్ సోనిక్ మిసైల్స్ని తయారు చేస్తున్నాం. శత్రు దేశాల రహస్య స్థావరాలపై దాడి చేసేలా మిసైల్స్లో సాంకేతికతని రూపొందించడం భవిష్యత్తులో మన ముందున్న లక్ష్యం. ప్రస్తుతం మనం తయారు చేస్తున్న మిసైల్స్ అన్నీ వేగం, గమనంపై ఆధారపడి దూసుకుపోతున్నాయి. ఇప్పుడు ఎలక్ట్రానిక్ కౌంటర్ మెజర్స్తో అనుసంధానం చేస్తూ పరిశోధనలు సాగుతున్నాయి. ఎగుమతుల విషయంలోనూ భారత్ అగ్ర దేశాలతో పోటీ పడుతోంది. ఆకాష్, బ్రహ్మోస్, అస్త్ర, ఇనాకా.. ఇలా భారత రక్షణ రంగానికి చెందిన ఉత్పత్తుల్ని కొనుగోలు చేసేందుకు వివిధ దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి.స్టార్టప్స్.. ఎంఎస్ఎంఈలకు అపార అవకాశాలురక్షణ శాఖ సహకారంతో డీఆర్డీవో నిరంతర పరిశోధనలపై భారత్ దృష్టి సారిస్తోంది. రక్షణ రంగంలో ఎంఎస్ఎంఈలు, స్టార్టప్స్ని డీఆర్డీవో ప్రోత్సహిస్తోంది. ఈ సెక్టార్లో ఎదురవుతున్న సవాళ్లను అధిగవిుంచే ప్రాజెక్టులతో ముందుకొస్తున్న అంకుర సంస్థలకు చేయూత అందిస్తోంది. ఇందుకోసం టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ని కూడా ప్రభుత్వం సమకూర్చుతోంది. డిఫెన్స్ సిస్టమ్, టెక్నాలజీపై డీఆర్డీవోతో 1000కి పైగా ఎంఎస్ఎంఈలు పని చేస్తున్నాయి.ఇంతకు ముందు చాలా అభివృద్ధి చెందిన ప్రయోగశాల్లో మాత్రమే పరిశోధనలు నిర్వహించి.. పరిశ్రమలకు బదిలీ చేసేవాళ్లం. కానీ.. ఇప్పుడు రూట్ మార్చుతున్నాం. సాంకేతిక రంగాల్లో పరిశ్రమలతో అనుబంధంగా పని చేస్తున్నాం. డీఆర్డీవో మెంటార్షిప్తో డ్రోన్లు, రాడార్లు, మినియేచర్ రాడార్లు, మినియేచర్ సెన్సార్లు, లైట్ వెయిట్ రాడార్లపై స్టార్టప్లు పని చేస్తుండటం శుభ పరిణామం.ఎన్ఎస్టీఎల్ వంటి సంస్థతో రక్షణ రంగానికి సంబంధించి విశాఖపట్నం బ్రాండ్గా ఎదుగుతోంది. వెపన్ సిస్టమ్ డిజైన్ చెయ్యడంలో, అండర్ వాటర్ టెక్నాలజీ విషయంలో ఎన్ఎస్టీలో కీలక పాత్ర పోషిస్తోంది. నౌకా దళ ఆయుధ సంపత్తి బలోపేతమవుతోంది. విశాఖపట్నంలో నేవల్ ఎకో సిస్టమ్ అభివృద్ధి చెందుతోంది. -
బ్లూ ఫ్లాగ్ పునరుద్ధరణకు చర్యలు
కొమ్మాది: బ్లూఫ్లాగ్ పునరుద్ధరణ జరిగేలా రుషికొండ బీచ్లో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఆదేశించారు. రుషికొండ బీచ్ను బుధవారం ఆయన సందర్శించారు. సమష్టి కృషి చేసి బీచ్కు పూర్వ వైభవం తీసుకుని రావాలని, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునేలా ప్రణాళికలతో పనులు చేయాలని సూచించారు. వాహనాల పార్కింగ్, కూర్చొని సేద తీరే ప్రాంతాలు, దుకాణ సముదాయాలు, పారిశుధ్య నిర్వహణ, గ్రీనరీ తదితర అంశాలను పరిశీలించిన ఆయన.. అధికారులకు పలు మార్గదర్శకాలు జారీ చేశారు. అలాగే పర్యాటకుల భద్రత ప్రమాణాలు పాటించాలని పోలీసు అధికారులకు సూచించారు. దుకాణ సముదాయాల నిర్వహణ, ఆహార పదార్థాల తయారీ, ధరల నియంత్రణ, తదితర అంశాలపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు. టూరిజం శాఖ ఇన్చార్జి ఆర్డీ జగదీశ్, టూరిజం అధికారి గరికిన దాసు, వీఎంఆర్డీఏ, టూరిజం, పోలీసు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ హరేందిర ప్రసాద్ ఆదేశం -
అర్ధరాత్రి ఘోరం..
చెట్టును బైక్తో ఢీకొని ఇద్దరు యువకుల దుర్మరణం సీతమ్మధార: రైల్వే న్యూ కాలనీ రోడ్డులో మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళితే.. కంచరపాలెం పరిధిలోని ధర్మానగర్, వాడపేటలో మంగళవారం స్థానిక అమ్మవారి పండగ జరిగింది. తిక్కవానిపాలేనికి చెందిన గోపి(20), అచ్చిరాజు(20) బైక్లో బయలుదేరి.. సాయంత్రం అక్కడ జరిగిన పరసలో పాల్గొన్నారు. అప్పటికే వారు మద్యం మత్తులో ఉన్నారు. తిరిగి అర్ధరాత్రి దాటాక రైల్వే న్యూ కాలనీ నుంచి కంచరపాలెం వైపు వెళుతున్నారు. అతివేగంతో వెళ్తూ రైల్వే న్యూ కాలనీ సాయిబాబా గుడి ఎదురుగా చెట్టుకు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ మార్చురీకి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ట్రాఫిక్ పోలీసులు అంటున్నారు. పండగలో సరదాగా గడిపిన యువకులు మృత్యువాత పడడంతో కుటుంబ సభ్యుల కన్నీటిపర్యంతమయ్యారు. యువకుల మృతితో తిక్కవానిపాలెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ట్రాఫిక్ సీఐ దాశరధి నేతృత్వంలో కంచరపాలెం ట్రాఫిక్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మెడపై కత్తి
ఉక్కు కాంట్రాక్ట్ కార్మికులవిశాఖపట్నం : స్టీల్ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మి కుల తగ్గింపు ప్రక్రియ మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ అంశంపై కాంట్రాక్టర్లకు యాజమాన్యం సమాచారం అందజేసింది. స్టీల్ప్లాంట్ ఆర్థిక పున రుద్ధరణ, పొదుపు చర్యల్లో భాగంగా ఉద్యోగులకు వీఆర్ఎస్, ఇతర స్టీల్ప్లాంట్లకు డిప్యూటేషన్, కాంట్రాక్ట్ కార్మికుల తగ్గింపు వంటి చర్యలకు సిఫా ర్సు చేశారు. ఈ చర్యల్లో భాగంగా గతంలో ఒకేసారి సుమారు 4 వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల ఆన్లైన్ గేటు పాసులను నిలిపి వేశారు. ఈ వివాదం పెద్దది కావడంతో కొన్ని గేటు పాసులను పునరుద్ధరించారు. వివిధ కారణాల వల్ల సుమారు 600 మంది కాంట్రాక్ట్ కార్మికుల పాస్లు పునరుద్ధరించలేదు. దీంతోపాటు ఎస్ఎంఏ, ఏఎస్ఎంఏ నిలిపివేత తదితర అంశాలపై ఈ నెల 7న సమ్మె చేస్తామని కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు యాజమాన్యానికి నోటీసు అందజేశాయి. ఈ అంశంపై ఈ నెల 11న సమావేశం ఏర్పాటు చేస్తామని రీజనల్ లేబర్ కమిషనర్ హామీ ఇవ్వడంతో సమ్మె వాయిదా వేశారు. కాంట్రాక్ట్ కార్మికుల తగ్గింపుపై చర్చ మంగళవారం కేంద్ర ఉక్కు కార్యదర్శి స్టీల్ప్లాంట్కు వచ్చారు. ఉన్నత యాజమాన్యంతో జరిపిన సమావేశంలో కాంట్రాక్ట్ కార్మికుల తగ్గింపుపై చర్చ జరిగినట్టు తెలుస్తుంది. దీంతో యాజమాన్యం సక్రమంగా విధులు నిర్వహించని, క్రమశిక్షణారాహిత్యం కలిగిన కార్మికుల వివరాలు ఇవ్వాలని కాంట్రాక్టర్లను ఆదేశించింది. దీంతో కాంట్రాక్ట్ కార్మిక సంఘాల నాయకులు రీజనల్ లేబర్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై యాజమాన్యంతో తేల్చుకోవడానికి కార్మిక సంఘాల నాయకులు సమాయత్తమవుతున్నారు. మళ్లీ తెరపైకి కార్మికుల తగ్గింపు ప్రక్రియ కాంట్రాక్టర్లకు సమాచారం ఆర్ఎల్సీకు ఫిర్యాదు -
భారతీయ సంప్రదాయమే సైన్స్ భాండాగారం
గోపాలపట్నం: భారతీయ సంప్రదాయమే సైన్స్ భాండాగారమని డీఆర్డీవో మాజీ చైర్మన్ డాక్టర్ అవినాష్ చందర్ అన్నారు. ఎన్ఎస్టీఎల్ మానసి ఆడిటోరియంలో బుధవారం జాతీయ సైన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన అంబేడ్కర్ విగ్రహం వద్ద, వేదికపై సర్ సి.వి.రామన్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అవినాష్ చందర్ మాట్లాడుతూ మన పూర్వీకుల్లో భాస్కరాచార్య, చక్ర, సుశ్రుత, వరాహమిహిర, ఆర్యభట్ట వంటి ఎందరో మహానుభావులు అనేక కొత్త విషయాలను ఆవిష్కరించారన్నారు. భారతదేశం సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉత్తమ ప్రతిభ చూపుతోందని, యువకులు నూతన ఆలోచనలతో ఆవిష్కరణలు చేస్తున్నారని పేర్కొన్నారు. శాసీ్త్రయత శిక్షణ కలిగి ఉండేలా విద్యా విధానంలో మార్పు రావడం స్వాగతించదగినదన్నా రు. పదేళ్ల కిందట 471 స్టార్టప్స్ ఉండగా.. నేడు 1.40 లక్షలకు అవి పెరగడంతో ఉద్యోగాలు కూడా పెరిగాయని చెప్పారు. విజేతలకు బహుమతుల ప్రదానం సైన్స్ డే సందర్భంగా ఎన్ఎస్టీఎల్లో చేపట్టిన కార్యక్రమాలను డైరెక్టర్ డాక్టర్ అబ్రహం వర్గీస్ వివరించారు. సైంటిస్ట్ డి.ఉదయానంద్కు సిలికాన్ మెడల్, సర్టిఫికెట్ను బహూకరించారు. పలు పాఠశాలల విద్యార్థులకు నిర్వహించిన క్విజ్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. నరవ హైస్కూల్ విద్యార్థులు మొదటి బహుమతి, ఎన్ఎస్టీఎల్ రామ్ నాథ్ సెకండరీ స్కూల్ విద్యార్థులు ద్వితీయ బహుమతి సాధించారు. ఉత్సవ కమిటీ చైర్మన్ సైంటిస్ట్ బోని రమేష్బాబు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. డీఆర్డీవో మాజీ చైర్మన్ డాక్టర్ అవినాష్ చందర్ ఎన్ఎస్టీఎల్లో ఘనంగా జాతీయ సైన్స్ డే వేడుకలు -
విశాఖలో హైకోర్టు బెంచ్ కోసం త్వరలో అఖిలపక్ష సమావేశం
విశాఖ లీగల్ : విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కోరుతూ త్వరలో ఆరు జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిధులు ఇతర నాయకులతో కలిసి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు విశాఖపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బెవర సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే ఏడు జిల్లాల(శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ) న్యాయవాదులతో ఒక సదస్సును ఏర్పాటు చేసి.. మద్దతు కూడగట్టామని పేర్కొన్నారు. భవిష్యత్ కార్యాచరణపై అఖిలపక్ష సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రజా ప్రతినిధులు, ఇతర నేతల సహకారంతో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి ఈ ఆరు జిల్లాల ప్రజాభిష్టాన్ని వివరించనున్నట్లు తెలిపారు. హైకోర్టు బెంచ్ కోసం తాము చేస్తున్న కార్యక్రమాలకు అన్ని వర్గాలు సహకారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. -
సింహగిరి మాస్టర్ప్లాన్ సవరణకు పరిశీలన
సింహాచలం: సింహగిరి మాస్టర్ప్లాన్ మార్పులు–చేర్పులపై దేవదాయశాఖ టెక్నికల్ అడ్వైజర్ కొండలరావు బుధవారం పరిశీలన జరిపారు. 2000 నుంచి సింహగిరి దివ్యక్షేత్రం అభివృద్ధి పనులు ప్రారంభమవగా, ఆరేళ్ల క్రితం వరకు జరిగిన అభివృద్ధి పనులతో మాస్టర్ ప్లాన్ రూపొందించారు. ఆ తర్వాత సింహగిరిపై కొన్ని అభివృద్ధి పనుల్లో మార్పులు చేర్పులతోపాటు, ఏడాదిన్నర కిందట ప్రసాద్ పథకం పనులు ప్రారంభమయ్యాయి. దీంతో మాస్టర్ ప్లాన్లో మార్పులు చేర్పులు అనివార్యమయ్యాయి. ప్రస్తుతం జరుగుతున్న ప్రసాద్ పథకం పనులతో పాటు ఇంకా దేవస్థానం తరఫున చేయాల్సిన అభివృద్ధి పనుల వివరాలను చేర్చి మాస్టర్ ప్లాన్ని పక్కాగా తయారుచేయాలని దేవదాయశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఆ శాఖ టెక్నికల్ అడ్వైజర్ తన బృందంతో వచ్చి ప్రసా ద్ పథకం పనులను పరిశీలించారు. అధికారులు, వైదికులతో చర్చించి పక్కాగా మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు నివేదికలను కమిషనర్కు పంపిస్తామన్నారు. -
విశాఖ చేరుకున్న కేంద్ర ఆర్థిక మంత్రి
గోపాలపట్నం: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఢిల్లీ నుంచి బుధవారం రాత్రి విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఆమెకు రాష్ట్ర మంత్రులు అనిత, పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, కలెక్టర్ హరేందిర ప్రసాద్, సీపీ శంఖబ్రత బాగ్చి, బీజేపీ మహిళా నాయకులు ఘన స్వాగతం పలికారు. ఎయిర్పోర్టు నుంచి రోడ్డు మార్గంలో నోవాటెల్ హోటల్కి చేరుకున్నారు. గురువారం గీతంలో జరిగే పుస్తక ఆవిష్కరణలో పాల్గొంటారు. మధ్యాహ్నం బడ్జెట్ అంశంపై నోవాటెల్ హోటల్లో నిర్వహించే సదస్సులో అధికారులు, పారిశ్రామికవేత్తలు, నిపుణులతో భేటీ అవుతారు. అనంతరం అక్కడ మీడియాతో మాట్లాడతారు. -
సీఎం, కేంద్ర మంత్రి పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు
మహారాణిపేట : జిల్లాలో గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో కలెక్టర్ పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గురువారం గీతం యూనివర్సిటీలో జరిగే పుస్తక ఆవిష్కరణలో పాల్గొంటారని.. శాంతి భద్రతలు, సెక్యూరిటీ పరమైన అంశాల్లో పోలీసు శాఖ తగిన చర్యలు తీసుకోవాల న్నారు. పరిశుభ్రత చర్యలు చేపట్టాలని, వారు ప్రయాణించే మార్గంలోని రోడ్లపై బ్యానర్లు, విద్యుత్ తీగలు, పోస్టర్లు తొలగించాలని జీవీఎంసీ, విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. విశాఖ ఎయిర్పోర్టు వద్ద స్వాగతం, వీడ్కోలుకు సంబంధించిన ఏర్పాట్లు చూసుకోవాలని ఆర్డీవోకు సూచించారు. డీసీపీ అజిత, డీఆర్వో బీహెచ్ భవానీ శంకర్, ఆర్డీవో పి.శ్రీలేఖ, డిప్యూటీ కలెక్టర్ సత్తిబాబు పాల్గొన్నారు. ముందుగా గీతంలో పర్యటన ఏర్పాట్లను ఎంపీ ఎం.శ్రీభరత్, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఇతర అధికారులతో కలిసి కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ స్వయంగా పరిశీలించారు. సీఎం పర్యటన ఇలా..: సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ భవన్ నుంచి గీతం వర్సిటీకి గురువారం ఉదయం 10.30 గంటలకు చేరుకుంటారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు అక్కడ జరిగే పుస్తక ఆవిష్కరణలో భాగస్వామ్యమవుతారు. అనంతరం అక్కడ నుంచి విశాఖ విమానాశ్రయానికి చేరుకొని ఢిల్లీ బయలుదేరుతారు. సమన్వయ కమిటీ సమావేశంలో కలెక్టర్ హరేందిర ప్రసాద్ -
నర్సింగ్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం
ముగ్గురు విద్యార్థినులపై చర్యలు జగదాంబ: డీడీఆర్ నర్సింగ్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేగింది. ఇందుకు కారణమైన విద్యార్థినులపై ప్రిన్సిపాల్ దయాకర్రెడ్డి చర్యలు తీసుకున్నారు. వన్టౌన్ షాదీఖానా వెనుక ఈ కళాశాల ఉంది. ఈ కళాశాలలో మూడేళ్ల కోర్సుకు సంబంధించి 80 మంది విద్యార్థినులు నగరంతో పాటు చత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా తదితర ప్రాంతాల నుంచి వచ్చి అభ్యసిస్తున్నారు. ఈ ఏడాది చేరిన 18 మంది విద్యార్థినులను చివరి సంవత్సరం చదువుతున్న ముగ్గురు విద్యార్థినులు ర్యాగింగ్ చేశారు. దీంతో వారందరూ కళాశాల ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేయగా.. ర్యాగింగ్కు పాల్పడిన ముగ్గురు విద్యార్థినులను ప్రిన్సిపాల్ పిలిచి మందిలించారు. ‘మీరు హాస్టల్లో ఉండకూడదు. ఇంటి వద్ద నుంచే డేస్కాలర్గా కళాశాలకు రావాలి’అని చెప్పడంతో ఆ విద్యార్థినులు హాస్టల్ నుంచి వెళ్లిపోయారు. ఈ విషయంపై కళాశాల ప్రిన్సిపాల్ దయాకర్రెడ్డిని వివరణ కోరగా.. ‘విద్యార్థినులు ర్యాగింగ్ చేయడంతో మందలించి ఇంటికి పంపించిన మాట వాస్తవమే’ అని అన్నారు. వారు స్థానికులు కావడంతో హాస్టల్లో ఉండకూడదని హెచ్చరించామని, దీనిపై వస్తున్న వదంతులు అవాస్తమని చెప్పారు. ఈ విషయం వన్టౌన్ పోలీసు స్టేషన్కు తెలియజేసినట్లు వెల్లడించారు. -
సెంట్రల్ జైలులో ఓపెన్ ఇంటర్ పరీక్షలు
ఆరిలోవ: విశాఖ కేంద్ర కారాగారంలో ఓపెన్ ఇంటర్(సార్వత్రిక విద్య) పరీక్షలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం రెగ్యులర్ విద్యార్థులతో పాటు ఓపెన్ ఇంటర్ పరీక్షలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కేంద్ర కారాగారంలో ఖైదీలకు ప్రత్యేకంగా ఓ సెంటర్ ఏర్పాటు చేశారు. బుధవారం తెలుగు పరీక్ష జరిగింది. 15 మంది ముద్దాయిలు ఓపెన్ ఇంటర్లో చేరినట్లు జైలు సూపరింటెండెంట్ ఎం. మహేష్బాబు తె లిపారు. ఇందులో నలుగురిని ఇటీవల రాజమండ్రి కేంద్ర కారాగారానికి బదిలీ చేయగా.. బుధవారం 11 మంది పరీక్ష రాసినట్లు వివరించారు. -
‘లే అవుట్’ నిబంధనలు సరళతరం
విశాఖ సిటీ: పురపాలక మంత్రిత్వ శాఖ జారీ చేసిన కొత్త జీవోల ప్రకారం భవన నిర్మాణాలు, లేఅవుట్ల అభివృద్ధి విషయంలో నిబంధనలు పాటించాలని డీటీసీపీవో పి.నాయుడు సూచించారు. వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్ థియేటర్లో ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవోలు 3, 4, 5, 20లపై ఎల్టీపీలు, ఇంజినీర్లు, ప్లానింగ్ సెక్రటరీలకు బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త జీవోల్లో కొన్ని వెసులుబాట్లు కల్పించినట్లు తెలిపారు. లేఅవుట్లకు 21 రోజుల్లో అనుమతి ఇవ్వాలని నిర్దేశించినట్లు చెప్పారు. యుటిలిటీస్, ఎమినిటీస్ బ్లాక్లకు నిర్ధిష్టమైన నిబంధనలు పెట్టారని వెల్లడించారు. ఐదు ఎకరాలలోపు లే అవుట్లలో 40 అడుగుల రహదారి ఒకటి, అంతకు మించిన లేఅవుట్లలో రెండు రహదారులు ఉండాలని వివరించారు. జాతీయ రహదారి, రాష్ట్ర హైవేలకు ఆనుకుని ఉన్న లేఅవుట్ల విషయంలో సంబంధిత అధికారుల నుంచి ఎన్వోసీ ఉండాలని స్పష్టం చేశారు. లే అవుట్లలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నారు. నదులకు సమీపంలో అభివృద్ధి చేసే లేఅవుట్ల విషయంలో బఫర్ జోన్ 100 మీటర్ల నుంచి 50 మీటర్లకు తగ్గించారని తెలిపారు. వీఎంఆర్డీఏ చీఫ్ అర్బన్ ప్లానర్ శిల్ప, ప్లానింగ్ ఆఫీసర్ వెంకటేశ్వర రావు, డీసీపీలు హరిదాసు, రామ్మోహన్, పీవో మౌనిక, డీటీసీపీ ఆర్డీ పి.నాయుడు, పీసీపీఐఆర్ పీవో చైతన్య పాల్గొన్నారు. -
నేడు మద్యం దుకాణాల లాటరీ
● జిల్లాలో గీత కులాలకు 14 మద్యం దుకాణాల కేటాయింపు ● 121 మంది నుంచి 316 దరఖాస్తులు రాక విశాఖ సిటీ: కల్లు గీత కులాల మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో దరఖాస్తుదారుల సమక్షంలో కలెక్టర్ హరేందిర ప్రసాద్ చేతుల మీదుగా లాటరీ ద్వారా షాపులను కేటాయించనున్నారు. విశాఖ జిల్లాలో 14 మద్యం దుకాణాలను గీత కులాలకు కేటాయించారు. జీవీఎంసీ పరిధిలో 11, భీమిలి, ఆనందపురం, పద్మనాభం మండలాల్లో మూడు దుకాణాలు ఏర్పాటు కానున్నాయి. కల్లు గీత కులాలకు జనాభా దామాషా పద్ధతిలో రెండు నెలల క్రితం లాటరీ ప్రక్రియ ద్వారా 14 మద్యం దుకాణాలను కేటాయించారు. ఇందులో జీవీఎంసీ పరిధిలో గౌడ, యాత కులాలకు ఒక్కోటి, మిగిలిన తొమ్మిది దుకాణాలు శెట్టిబలిజ కులానికి దక్కాయి. అలాగే ఆనందపురంలో ఒకటి గౌడకు, భీమిలి, పద్మనాభం మండలాల్లో ఒక్కోటి శెట్టిబలిజకు లాటరీ ద్వారా అవకాశం లభించింది. వాస్తవానికి గత నెల 7వ తేదీన లాటరీ నిర్వహించాల్సి ఉన్నప్పటికీ మహాకుంభమేళా, బసంత్ పంచమీ, రాధా సప్తమీ వంటి ఆధ్యాత్మిక యాత్రలు ఉండడంతో దరఖాస్తుల స్వీకరణకు గడువు పొడిగించారు. తరువాత ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో లాటరీ ప్రక్రియ వాయిదా పడింది. తాజాగా ఎన్నికల నియమావళి తొలగిపోవడంతో గురువారం లాటరీ నిర్వహించనున్నారు. 14 దుకాణాలకు 316 దరఖాస్తులు గీత కార్మికులకు కేటాయించిన 14 మద్యం దుకాణాలకు 316 దరఖాస్తులు వచ్చాయి. కొందరు రెండు, మూడు దరఖాస్తులు సమర్పించడంతో 121 మంది ఈ లాటరీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దరఖాస్తుదారులందరూ లాటరీ సమయానికి గంట ముందుగా మధ్యాహ్నం 2 గంటలకే వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాకు రావాల్సి ఉంటుంది. 3 గంటలకు కలెక్టర్ హరేందిర ప్రసాద్ లాటరీ ప్రక్రియను ప్రారంభి షాపులు కేటాయించనున్నారు. -
ఎమ్మెల్సీ ఎన్నికలో ప్రభుత్వానికి బుద్ధి చెప్పారు
విశాఖ విద్య: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఫలితాలు కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టు అని యూటీఎఫ్ విశాఖ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దాసరి నాగేశ్వరరావు, టీఆర్ అంబేడ్కర్లు అన్నారు. యూటీఎఫ్ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై మంగళవారం సంఘం ముఖ్యనాయకులతో సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి బహిరంగంగా మద్దతు పలికిన అభ్యర్థి ఓటమి చెందడం, వారు విద్యారంగంలో అనుసరిస్తున్న విధానాలు ఎంత దారుణంగా ఉన్నాయో స్పష్టం చేస్తోందన్నారు. ఎన్నికల ఫలితాల సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు యూటీఎఫ్ సంఘానికి వైఎస్సార్సీపీ ముసుగువేస్తూ చేసిన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఎన్నికల్లో పీడీఎఫ్ స్వతంత్రంగా పోటీ చేసిందని దానికి యూటీఎఫ్, ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాలు, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయన్నారు. ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడే యూటీఎఫ్కు రాజకీయాలు అంటగట్టడం సరికాదన్నారు. ప్రతిదీ రాజకీయ కోణంలో చూసే కూటమి పార్టీల వారు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలను కూడా రాజకీయం చేయటం ద్వారా ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్నారన్నారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నాగేశ్వరరావు, అంబేడ్కర్ -
‘టీసీపీసీ’ భూముల పరిశీలన
మధురవాడ/ఏయూక్యాంపస్: బక్కన్నపాలెంలోని రాష్ట్ర ప్రభుత్వ వయోవృద్ధులు, వికలాంగుల సహాయ సంస్థ శిక్షణ, ఉత్పత్తి కేంద్రం(టీసీపీసీ)కి చెందిన భూములు, దాని పరిసర ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములను మంగళవారం కేంద్ర సామాజిక న్యాయ శాఖ డైరెక్టర్ వినీత్ సింఘాల్, ఏఎస్వో రాహుల్ కుమార్, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ డైరెక్టర్ రవి ప్రకాష్ రెడ్డి, జాయంట్ కలెక్టర్ మయూర్ అశోక్ పరిశీలించారు. ఇక్కడ దివ్యాంగుల క్రీడా స్టేడియం నిర్మాణ ప్రతిపాదనలు ఉన్న నేపథ్యంలో సర్వే నంబర్ 92లో సుమారు 22 ఎకరాలు, దానికి ఆనుకుని నవోదయ వెనుక, ప్రభుత్వ జూనియర్ కళాశాల, కొమ్మాది ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు పరిశీలించారు. ఇక్కడ ఎంత భూమి అందుబాటులో ఉంది? ఇందులో స్టేడియం నిర్మాణానికి ఎంత అవసరం? అందుకు అనువుగా ఉందా లేదా అన్న విషయాలపై ఆరా తీశారు. కార్యక్రమంలో విభిన్న ప్రతిభా వంతుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు మాధవి, తహసీల్దార్ కిరణ్, ప్రిన్సిపాల్ భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం అధికారులు ప్రభుత్వ అంధ బాలికల పాఠశాల(ఎండాడ), పెందుర్తిలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ బాలుర వసతి గృహాన్ని సందర్శించారు. బక్కన్నపాలెంలో పారా స్టేడియం ప్రతిపాదన -
నేషనల్ యూత్ పార్లమెంట్కు 9 వరకు గడువు
ఏయూక్యాంపస్: నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ 2025కి విద్యార్థులు తమ వివరాలు నమోదు చేసుకోవడానికి ఈ నెల 9వ తేదీ వరకు గడువు ఉంది. mybharat.gov.inను సందర్శించి ‘వికసిత్ భారత్ అంటే ఏమిటి’ అనే అంశంపై ఒక నిమిషం వీడియోను అప్లోడ్ చేయాలి. అదే పోర్టల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిచేసుకోవాలి. ఈ కార్యక్రమానికి నెహ్రూ యువ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ మహేశ్వర రావు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్.వి.జి రెడ్డి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ షేక్ షంషుద్దీన్ పర్యవేక్షిస్తారు. -
ఈపీడీసీఎల్ లైన్మన్కు జాతీయ అవార్డు
విశాఖ సిటీ: చింతూరు లైన్ ఇన్స్పెక్టర్ కె.గణేష్ జాతీయస్థాయిలో ఉత్తమ లైన్మన్ అవార్డు సాధించారని ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి ఒక ప్రకటనలో తెలిపారు. ఢిల్లీలో మంగళవారం జరిగిన లైన్మెన్ దివస్ కార్యక్రమంలో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ చైర్మన్ ఘనశ్యామ్ చేతుల మీదుగా ఉత్తమ లైన్మన్ అవార్డును గణేష్ అందుకున్నారని పేర్కొన్నారు. గణేష్తో పాటు ఉత్తమ లైన్మన్గా ప్రశంసలు పొందిన అనకాపల్లి సర్కిల్కు చెందిన బి.మాణిక్యాలరావు, పార్వతీపురం సర్కిల్ పి.సింహాచలంకు సీఎండీతో పాటు సంస్థ డైరెక్టర్లు డి.చంద్రం, వి.విజయలలిత, బి.రామచంద్రప్రసాద్ అభినందనలు తెలిపారు. -
భద్రతకు అత్యంత ప్రాధాన్యం
ఉక్కునగరం: స్టీల్ప్లాంట్లో విధులు నిర్వహించే ప్రతి ఒక్కరూ భద్రతకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని స్టీల్ప్లాంట్ ఇన్చార్జి సీఎండీ ఎ.కె.సక్సేనా పిలుపునిచ్చారు. ఉక్కు మల్టీపర్పస్ హాలులో మంగళవారం రాష్ట్ర జాయింట్ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ జె.శివశంకరరెడ్డి, సంస్థ డైరెక్టర్లతో కలిసి జాతీయ భద్రతా దినోత్సవ కార్యక్రమాలు ప్రారంభించారు. ముందుగా సక్సేనా భద్రత ప్రతిజ్ఞ చేసి, అనంతరం మాట్లాడారు. పారిశ్రామిక కార్యకలాపాల్గో భద్రత ప్రాముఖ్యాన్ని చాటి చెప్పారు. భద్రత అనేది కేవలం ఒక తంతు కాదని.. ఉద్యోగుల క్షేమం, సంస్థ భవిష్యత్కు చాలా ముఖ్యమైనదన్నారు. ప్రమాదాలు జరిగిన తర్వాత స్పందించే సంస్కృతి నుంచి.. ప్రమాదాలు జరగకుండా నివారించే సంస్కృతికి మారాలని ఉద్యోగులకు సూచించారు. శివశంకరరెడ్డి మాట్లాడుతూ దేశ ఆర్థికాభివృద్ధిలో భద్రత కీలక పాత్ర పోషిస్తుందన్నారు. సురక్షితమైన పద్ధతులను పాటించడం వల్ల నష్టాలను తగ్గించవచ్చన్నారు. ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించవచ్చని వివరించారు. పరిశ్రమల్లో, రోడ్డుపై, ఇంట్లో భద్రతా నియమాలను పాటిస్తూ తమ ప్రవర్తనను మార్చుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో భాగంగా సృష్టి వరల్డ్ పాఠశాల విద్యార్థులు భోపాల్ గ్యాస్ దుర్ఘటనపై ప్రదర్శించిన నాటిక అందరినీ ఆలోచింపజేసింది. అనంతరం వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. డైరెక్టర్లు ఎ.కె.బాగ్చి, ఎస్.సి.పాండే, గణేష్, జి.వి.ఎన్.ప్రసాద్, ఉన్నతాధికారులు, వివిధ అసోసియేషన్ల ప్రతినిధులు పాల్గొన్నారు. స్టీల్ప్లాంట్ ఇన్చార్జి సీఎండీ సక్సేనా -
● చల్లని కర్బూజా... రుచి ఎంతో మజా
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఉచిత శిక్షణ తుమ్మపాల : ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆర్ఏఎంపీ పథకం ద్వారా ఉచిత శిక్షణ నిర్వహిస్తామని అనకాపల్లి జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజరు జి. నాగరాజారావు మంగళవారం తెలిపారు. జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల నిరుద్యోగ యువతీ యువకులకు పారిశ్రామికవేత్తలుగా అభివృద్ధి చెందుటకు ఆర్ఏఎంపీ పథకం ద్వారా వ్యవస్థాపకత, నైపుణ్య అభివృద్ధిపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఎంఎస్ఎంఈ ద్వారా గుర్తింపు పొందిన శిక్షణ సంస్థ ట్రెండ్జ్ ఐటీ వారితో నెల రోజుల పాటు నిర్వహించే ఈ శిక్షణ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకుకోవాలన్నారు. అనకాపల్లి పట్టణంలోని ట్రెండ్జ్ ఐటీ, 12–46 మాక్స్ షాపింగ్ మాల్ పైన, 3 వ ఫ్లోర్, ఉషా ప్రైమ్ పక్కన, కాంప్లెక్స్ దగ్గర, అలాగే చోడవరం ట్రెండ్జ్ ఐటి, 5–20, లక్ష్మిపురం రోడ్, వేంకటేశ్వరస్వామి గుడి ఎదురుగా గల కేంద్రాల్లో ఈ నెల 8 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయని చెప్పారు. అనకాపల్లిలో అయితే 95021 66626, 99485 19782, చోడవరంలో 73860 84548, 77998 83952లో సంప్రదించాలన్నారు.. అభ్యర్థులు 18 నుంచి 58 సంవత్సరాలు వయసు కలిగి, ఆధార్ కార్డ్, పాస్ పోర్ట్ సైజు ఫొటోలు, కులధ్రువీకరణ పత్రం, రేషన్ కార్డుతో ఈ నెల 5 నుంచి సంప్రదించాలని సూచించారు. ● జాతరకు అమ్మవారి ప్రతిమలు సిద్ధం కంచరపాలెం రామ్మూర్తిపంతులుపేటలో కొలువైన పైడితల్లి అమ్మవారి జాతర కోసం సర్వం సిద్ధమవుతోంది. ఈ నెల 10న కంచరపాలెం వీధుల్లో అమ్మవారి విగ్రహాల ఊరేగింపు కనులపండువగా జరగనుంది. ఇందుకోసం ప్రత్యేకంగా 300పైగా అమ్మవారి ప్రతిమలను తయారు చేయిస్తున్నారు. ఆకర్షణీయంగా సిద్ధమవుతున్న ఈ విగ్రహాలు జాతర శోభను మరింత పెంచనున్నాయి. – ఫొటో: సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
మరణించినా.. మరొకరికి కంటి వెలుగై...
గోపాలపట్నం: మరణించినా మరొకరికి కంటి వెలుగయ్యాడు ఓ యువకుడు. శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం కప్పరాం గ్రామానికి చెందిన గోకా శివకృష్ణ(34).. జీవీఎంసీ 91వ వార్డు లక్ష్మీనగర్ ఈ–బ్లాక్లో తల్లిదండ్రులు సోమేష్, దమయంతితో కలిసి ఉంటున్నాడు. క్షణికావేశంలో సోమవారం ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తీరని దుఃఖంలో ఉన్నప్పటికీ, శివకృష్ణ తల్లిదండ్రులు సోమేష్, దమయంతి మానవత్వం చాటుకున్నారు. తమ కుమారుడు మరణించినా, మరొకరికి కంటి వెలుగు నింపాలని నిర్ణయించుకున్నారు. మోసిన్ ఐ బ్యాంక్ నిపుణులు శివకృష్ణ నేత్రాలను సేకరించి, కుటుంబ సభ్యులకు అంగీకార పత్రాన్ని అందజేశారు. యువకుడి కుటుంబ సభ్యులకు డాక్టర్ వాణి కృతజ్ఞతలు తెలిపారు. -
దళితులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు
● ఐపీఎస్ అధికారి సునీల్ సస్పెన్షన్ను ఎత్తివేయాలి ● వైఎస్సార్ సీపీ దళిత విభాగం నేతల డిమాండ్ సాక్షి, విశాఖపట్నం: దళితులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు బోని శివరామకృష్ణ, జిల్లా అధికార ప్రతినిధి మంచా మల్లేశ్వరి మండిపడ్డారు. మాజీ ఎంపీ నందిగం సురేష్, ఐపీఎస్ అధికారి సునీల్కుమార్పై అక్రమంగా కేసులు పెట్టి వేధించిందని, ఇదే కొనసాగితే రాష్ట్రంలోని దళితులంతా ఏకమై కూటమి ప్రభుత్వాన్ని గద్దె దించడానికి వెనుకాడబోమని హెచ్చరించారు. ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్పై సస్పెన్షన్ను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో బోని శివరామకృష్ణ మాట్లాడారు. రాష్ట్రంలో లోకేష్ రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతోందని ఆరోపించారు. అధికారం చేపట్టినప్పటి నుంచి ఎవరిపై కేసులు పెట్టి వేధింపులకు గురి చేయాలనే ఆలోచన తప్ప.. ఇచ్చిన హామీలను అమలు చేయాలనే తపన లేదన్నారు. రాష్ట్రంలో దళితులపై దాడులకు పాల్పడుతూ వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. ఐదేళ్ల కిందటనాటి ఎయిర్పోర్టు కేసు అని చెప్పి తనకు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారని గుర్తు చేశారు. తన లాగే రాష్ట్రంలో అనేక మంది దళితులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, ఇదే కొనసాగితే ఈ ప్రభుత్వం భూస్థాపితం కావడం తథ్యమని హెచ్చరించారు. మంచా మల్లేశ్వరి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ఒక ప్రజాప్రతినిధిని సంతృప్తి చేసేందుకు సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముగ్గురూ దళిత ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ను సస్పెండ్ చేయడమే కాకుండా ఆయనపై కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. సునీల్కుమార్ ఎప్పుడో తన సొంత ఖర్చుల మీద విదేశాలకు వెళ్తే కూటమి నేతలకు వచ్చిన ఇబ్బందేంటని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వంలో దళి త మహిళలకు రక్షణే లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో తాను ఒక పోస్టు పెట్టినా, వీడియో పోస్టు చేసినా.. అసభ్యకరంగా కామెంట్లు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారని.. ఇవేమి కూటమి ప్రభుత్వానికి కనిపించవా అని ఆమె ప్రశ్నించారు. -
మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించాలి
మహారాణిపేట: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గురజాడ కళాక్షేత్రం వేదికగా ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రీడా అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వివిధ శాఖల మహిళలకు క్రీడా పోటీలు, జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో వ్యాసరచన, వక్తృత్వ, పెయింటింగ్ పోటీలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో మహిళా సంఘాలు, ఎన్జీవోలను భాగస్వామ్యం చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న ఎంఎస్ఎంఈ రుణాల మంజూరుపై బ్యాంకర్లు దృష్టి సారించాలన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ, సాంఘిక సంక్షేమ, గ్రామీణాభివృద్ధి, వైద్య ఆరోగ్య, పోలీస్, గ్రామీణ పేదరిక నిర్మూలన, విద్యాశాఖ తదితర శాఖలు సమన్వయం చేసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు. -
నకిలీ పోలీస్ అరెస్ట్
ఎంవీపీకాలనీ: పోలీసు అధికారినని చెప్పి నగరంలో పలు మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని ఎంవీపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎంవీపీకాలనీ పోలీస్స్టేషన్లో మంగళవారం ద్వారకా ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి ఈ కేసు వివరాలు వెల్లడించారు. నగరంలోని బాజీ జంక్షన్కు చెందిన చెల్లుబోయిన లోచన్కుమార్ పోలీసు అధికారినని చెప్పుకుంటూ.. ఫేక్ ఐడీ కార్డులు, పలువురు పోలీసు ఉన్నతాధికారులు, రైఫిల్స్, వాకీటాకీలతో దిగిన ఫొటోలు చూపిస్తూ చాలా కాలంగా మోసాలకు పాల్పడుతున్నాడు. ఆయా మోసాలకు సంబంధించి ఇప్పటికే అతనిపై పలు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. గతంలో ఎయిర్పోర్టు పోలీస్స్టేషన్లో ఓ చీటింగ్ కేసు, గోపాలపట్నం పోలీసు స్టేషన్లో కొట్లాట కేసు నమోదైంది. తాజాగా నగరంలోని పలు పోలీసు స్టేషన్లలో సీజ్ చేసిన వాహనాలకు వేలం పాట జరుగుతుందని.. తక్కువ ధరకే వాటిని ఇప్పిస్తానని చెప్పి పలువురు దగ్గర నుంచి వసూళ్లకు పాల్పడ్డాడు. ఉద్యోగాలు ఇప్పిస్తానని మరికొందరిని మోసం చేశాడు. ఎంవీపీ కాలనీ సెక్టార్–3కి చెందిన బలివాడ రామ్సాయి గోపాల్ అనే వ్యక్తి నుంచి రూ.61,900 వసూలు చేశాడు. గోపాలపట్నం పోలీసు స్టేషన్ పరిధిలో గతంలో ఓ వ్యక్తి నుంచి ఇదే తరహాలో రూ.26 వేలు వసూలు చేశాడు. అయితే వాహనాలు ఇప్పించాలని రామ్సాయి గోపాల్ ఒత్తిడి చేయడంతో అతని ఫోన్, మేసేజ్లకు సమాధానం ఇవ్వకుండా కొంతకాలంగా తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో అనుమానం వచ్చిన రామ్సాయి గోపాల్ ఇటీవల నగర పోలీసు కమిషనర్ను కలిసి ఫిర్యాదు చేశాడు. సీపీ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ఎంవీపీ పోలీసులు లోచన్కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. 318(4), 319(2) బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు ఏసీపీ మూర్తి వెల్లడించారు. లోచన్ కుమార్ 2018 నుంచి మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించామన్నారు. ఈ సమావేశంలో ఎంవీపీ సీఐ మురళీ, ఎస్ఐ ధనుంజయ్ నాయుడు పాల్గొన్నారు. -
పోక్సో కోర్టు పీపీగా రాజశేఖర్
విశాఖ లీగల్ : నగరంలోని పోక్సో కోర్టు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా బి.రాజశేఖర్ నియమితులయ్యారు. ఈ మేరకు న్యాయ శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుమార్ విశ్వతేజ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నగరంలో సీనియర్ న్యాయవాదిగా ఉన్న రాజశేఖర్ పలు క్రిమినల్, సివిల్ కేసుల్లో మంచి ప్రతిభ చూపించారు. రాజశేఖర్ 2001లో నగరంలో ఎన్బీఎం లా కాలేజీ నుంచి న్యాయవిద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత బార్ కౌన్సిల్ ద్వారా న్యాయవాదిగా నమోదయ్యారు. పలు పబ్లిక్, ప్రైవేటు రంగ సంస్థలకు న్యాయవాదిగా వ్యవహరించారు. 2018 నుంచి మూడేళ్ల పాటు జిల్లా పరిషత్ న్యాయ సలహాదారుడిగా వ్యవహరించారు. రాజశేఖర్ నియామకం పట్ల విశాఖ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు బెవర సత్యనారాయణ, రాష్ట్ర బార్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు ఎస్.కృష్ణమోహన్, బార్ కౌన్సిల్ సభ్యుడు పి.నర్సింగరావు, కె.రామజోగేశ్వరరావు, బైపా అరుణ్ కుమార్, సీనియర్ న్యాయవాదులు అభినందనలు తెలిపారు. -
మహిళా పోలీస్స్టేషన్ ఏసీపీపై చర్యలు?
● గతంలో మహిళా సీఐ ఫిర్యాదు ● తాజాగా మహిళా ఏఎస్ఐ కూడా పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు ● ఉన్నతాధికారుల దృష్టికి ఏసీపీ వ్యవహారం విశాఖ సిటీ : మహిళలపై వేధింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకునే పోలీస్స్టేషన్ మహిళా సిబ్బందే.. తమ పై అధికారి వేధింపులు భరించలేకపోతున్నామని వరుస ఫిర్యాదులు చేస్తుండడం విశాఖ పోలీస్ శాఖలో హాట్ టాపిక్గా మారింది. గతంలో ఒక మహిళా సీఐ, తాజాగా ఒక మహిళా ఏఎస్ఐ సంబంధిత ఏసీపీపైనే ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమవుతోంది. మహిళా పోలీస్స్టేషన్ ఏసీపీ పెంటారావు పరుషంగా మాట్లాడడంతో పాటు ఇష్టానుసారంగా విధులు కేటాయిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని సిబ్బంది వాపోతున్నారు. దీనిపై ఏఎస్ఐ నేరుగా నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చికి ఫిర్యాదు చేశారు. గతంలో ఒక మహిళా సీఐ కూడా ఏసీపీ వ్యవహార శైలి, మాటతీరుపై సీపీకి ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో కూడా సీపీ అతనిపై క్రమశిక్షణ చర్యలకు సిఫార్సు చేశారు. తాజా ఫిర్యాదుపై కూడా విచారణ చేయించి నివేదికను డీజీ కార్యాలయానికి పంపించినట్లు తెలిసింది. వరుస ఫిర్యాదుల నేపథ్యంలో ఉన్నతాధికారులు కూడా ఏసీపీ వ్యవహారంపై సీరియస్గా ఉన్నట్లు పోలీస్ శాఖలో టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఏసీపీపై చర్యలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. -
సర్వేలు వేగవంతం
కలెక్టర్ హరేందిర ప్రసాద్ ఆదేశం మహారాణిపేట: సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందించేందుకు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా నిర్వహిస్తున్న వివిధ రకాల సర్వేలను వేగవంతం చేయాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం గ్రామ, వార్డు సచివాలయాల కీలక కార్యక్రమాలపై సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా మిస్సింగ్ హౌస్ హోల్డ్ డేటా, ఎంఎస్ఎంఈ సర్వే, వర్క్ ఫ్రం హోమ్, హౌస్ ఇమేజ్, జియో కో–ఆర్డినేట్లు, తోలు కళాకారుల సర్వేలపై కలెక్టర్ సమీక్ష చేశారు. ఆధార్ లేని పిల్లలను గుర్తించాలని, పెండింగ్లో ఉన్న సర్వే ప్రక్రియలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు క్షేత్రస్థాయిలో సర్వేను ధ్రువీకరించాలని ఆదేశించారు. సమావేశానికి డీఎల్డీవో ఉషారాణి, జోనల్ కమిషనర్లు హాజరయ్యారు. వర్చువల్గా ఎంపీడీవోలు పాల్గొన్నారు. -
ఎన్నికల కోడ్ ఎత్తివేత
మహారాణిపేట: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో ఎన్నికల కోడ్ ఎత్తి వేశారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఇక మీదట అన్ని కార్యక్రమాలు యథావిధిగా జరుగుతాయన్నారు. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో గత నెల 3న ఎన్నికల నోటిఫికేషన్ జారీ నుంచి కోడ్ అమల్లోకి వచ్చింది. 27న పోలింగ్, ఈ నెల 3న ఓట్ల లెక్కింపు పూర్తయింది. పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులునాయుడు గెలుపొందిన విషయం తెలిసిందే. -
హోలీకి ప్రత్యేక రైళ్లు
తాటిచెట్లపాలెం: హోలీ పండగ సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం పలు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం సందీప్ తెలిపారు. ● చర్లపల్లి–షాలిమర్(07703) హోలీ స్పెషల్ చర్లపల్లిలో ఈ నెల 9, 16వ తేదీల్లో (ఆదివారం) రాత్రి 7.45 గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 9 గంటలకు దువ్వాడకు చేరుకుంటుంది. అక్కడ నుంచి 9.02 గంటలకు బయల్దేరి మరుసటిరోజు (మంగళవారం) తెల్లవారు 2 గంటలకు షాలిమర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో షాలిమర్–చర్లపల్లి(07704) హోలీ స్పెషల్ ఈ నెల 11, 18వ తేదీల్లో (మంగళవారంలో) ఉదయం 5 గంటలకు షాలిమర్లో బయల్దేరి అదేరోజు రాత్రి 7.50 గంటలకు దువ్వాడకు చేరుకుంటుంది. అక్కడ నుంచి 7.52 గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 8.10 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. ● చర్లపల్లి –సంత్రగచ్చి(07705) హోలీ స్పెషల్ ఈ నెల 7, 21వ తేదీల్లో(శుక్రవారం) ఉదయం 7.15 గంటలకు చర్లపల్లిలో బయల్దేరి అదేరోజు రాత్రి 7.45గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 7.47 గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 10.30 గంటలకు సంత్రగచ్చి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో సంత్రగచ్చి–చర్లపల్లి(07706) హోలీ స్పెషల్ సంత్రగచ్చిలో ఈ నెల 8, 22వ తేదీల్లో (శనివారం) మధ్యాహ్నం 12.35 గంటలకు బయల్దేరి మరుసటిరోజు తెల్లవారు 3.50 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 3.52 గంటలకు బయల్దేరి అదేరోజు సాయంత్రం 4.40 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. -
ఐపీఎల్కు సరికొత్తగా వైఎస్సార్ స్టేడియం
విశాఖ స్పోర్ట్స్: ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆడే తొలి రెండు మ్యాచ్లకు విశాఖలోని వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ స్టేడియం కొత్తరూపు సంత రించుకుంటోంది. ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణకు సంబంధించి మంగళవారం జిల్లా యంత్రాగం సమావేశమైంది. ముందుగా ఆంధ్ర క్రికెట్ సంఘం అపెక్స్ కౌన్సిల్తో పాటు కలెక్టర్ హరేందిర ప్రసాద్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, మ్యాచ్ నిర్వాహక కమిటీ స్టేడియంను సందర్శించింది. స్టేడియంలో ఆధునికీకరణ పనులు పర్యవేక్షించిన అనంతరం.. ఫ్లడ్లైట్ల పనితీరును పరిశీలించింది. ప్రేక్షకులకు ఇబ్బంది కలగకుండా స్టేడియం, స్టేడియం బయట ఎలాంటి ఏర్పా ట్లు చేయాలి? ప్రవేశ మార్గాల ఏర్పాటు తదితర అంశాలపై చర్చించింది. ఈ సందర్భంగా కలెక్టర్, సీపీ కాసేపు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. కాగా.. ఈ నెల 24న రాత్రి 7గంటలకు లక్నో సూపర్జెయింట్తో, 30న మధ్యాహ్నం 3 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది.రూ.40 కోట్లతో స్టేడియం ఆధునికీకరణ సాంకేతికతను అనుసంధానిస్తూ విశాఖలోని వైఎస్సార్ స్టేడియంను ఆధునికీకరిస్తున్నట్లు ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ తెలిపారు. సీపీ, ఏసీఏ కార్యదర్శి సానా సతీష్బాబుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ క్యాపిటల్స్ సూచనల మేరకు స్టేడియంలో బాత్రూమ్లను పెంచి అభిమానులకు అందుబాటులోకి తెచ్చామన్నారు. దాదాపు 40 కోట్ల వరకు వెచ్చించామన్నారు. ఫ్లడ్లైట్ల కోసం రూ.9.5 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. 34 వీఐపీ కార్పొరేట్ బాక్స్లతో పాటు రెండు టీమ్ బాక్స్లను సరికొత్తగా తీర్చిదిద్దినట్లు చెప్పారు. దీంతో బీసీసీఐ సైతం ఈ ఏడాది మరిన్ని మ్యాచ్లను విశాఖ వేదికగా నిర్వహించేందుకు మాటిచ్చిందన్నారు. ప్రతి జిల్లాలో క్రికెట్ గ్రౌండ్ ఏర్పాటుతో పాటు మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు వివరించారు. సీపీ మాట్లాడుతూ మరోసారి విశాఖ వేదికగా ఐపీఎల్ జరగడం శుభపరిణామన్నారు. ఆటగాళ్ల నుంచి అభిమానుల భద్రత వరకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ట్రాఫిక్ నియంత్రణకు ఏర్పాట్లు చేస్తామన్నారు. -
● కూటమి దుష్టపాలనకు టీచర్లు గట్టిగా బుద్ధి చెప్పారు ● గాదె శ్రీనివాసులునాయుడు గెలవడంతో ప్లేటు ఫిరాయించారు ● ఎవరికో పుట్టిన బిడ్డకు మీరు పేరు పెట్టుకోవద్దు ● మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలనకు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం చెంపపెట్టులాంటిదని వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. మద్దిలపాలెంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఉత్తరాంధ్రపై చూపుతున్న వివక్షకు నిరసనగా టీచర్లు గట్టి షాకిచ్చారని పేర్కొన్నారు. కూటమి అభ్యర్థి రఘువర్మ ఘోర పరాజయం తర్వాత ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ నాయకులు మాట మార్చారని మండిపడ్డారు. గెలిచిన గాదె శ్రీనివాసులునాయుడు తమ అభ్యర్థే అంటూ మంత్రి అచ్చెన్నాయుడు చేస్తున్న ప్రకటనలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. రఘువర్మను గెలిపించాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ సమావేశాలు నిర్వహించారని, తన ఎక్స్ ఖాతాలో రఘువర్మకు టీడీపీ శ్రేణులు ఓటెయ్యాలని పిలుపునిచ్చారని గుర్తు చేశారు. ఆయనతోపాటు కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడు, హోంమంత్రి వంగలపూడి అనిత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజులాంటి సీనియర్ నాయకులు బహిరంగంగానే పిలుపునిచ్చారని పేర్కొన్నారు. వీటితో పాటు రఘువర్మను గెలిపించాలని టీడీపీ నాయకుల పేరుతో పత్రికా ప్రకటనలు కూడా వచ్చాయన్నారు. జనసేన పార్టీ సైతం తన అధికారిక ఖాతాలో టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా రఘువర్మను ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. గాదె శ్రీనివాసులునాయుడుకి మద్దతు ఇచ్చినట్టు కూటమి నాయకులు ఒక్క ఆధారమైనా చూపించగలరా? అని ప్రశ్నించారు. ఎవరికో పుట్టిన బిడ్డకు మీ పేరు పెట్టుకోవద్దంటూ ఎద్దేవా చేశారు. ఇది ఉద్యోగుల వ్యతిరేక ప్రభుత్వం 9 నెలల్లోనే కూటమి ప్రభుత్వంపై ఉద్యోగుల్లో వచ్చిన వ్యతిరేకతకి ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. ఉద్యోగుల్లో దాదాపు 35 శాతంగా ఉన్న టీచర్లు ఇచ్చిన తీర్పుతో ప్రభుత్వ వైఫల్యం బయటపడిందన్నారు. విద్యాశాఖను నిర్వహిస్తున్న మంత్రి నారా లోకేష్ టీచర్ల సమస్యలు తీర్చడంలో విఫలం కావడంతోనే వారు ప్రభుత్వానికి గట్టిగా షాకిచ్చారని తెలిపారు. పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేయలేదు.. ఐఆర్ ఇవ్వలేదు.. మూడు డీఏ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి, ఉద్యోగుల పింఛన్ విధానంపై ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదని విమర్శించారు. ఉద్యోగులకు ఈ ప్రభుత్వం రూ.26 వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. స్వయాన సీఎం చంద్రబాబు కుమారుడు లోకేష్ ప్రాతినిథ్యం వహిస్తున్న విద్యాశాఖలోనే ఓటమి అంటే.. లోకేష్ అసమర్థ పాలనగానే చెప్పుకోవచ్చన్నారు. కూటమి పాలనలో ఉత్తరాంధ్రపై వివక్ష కూటమి ప్రభుత్వం ఉత్తరాంధ్ర అభివృద్ధిపై వివక్ష చూపుతోందని, అమరావతి అభివృద్ధి కోసం బడ్జెట్లో రూ.6 వేల కోట్లు కేటాయించి, విశాఖకు రూపాయి కూడా కేటాయించలేదన్నారు. రుషికొండ బీచ్కి తమ హయాంలో 2020లో బ్లూఫ్లాగ్ హోదా వస్తే, కూటమి ప్రభుత్వంలో నిర్వహణ సరిగా లేక ఆ హోదా పోయిందన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ఉత్తరాంధ్ర అభివృద్ధిలో దూసుకెళ్లిందన్నారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, మూలపేట పోర్టు, నర్సీపట్నం, పాడేరు, విజయనగరంలో మెడికల్ కాలేజీలు, ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్.. ఇవన్నీ తమ హయాంలో జరిగిన అభివృద్ధి పనులేనన్నారు. ఇప్పటికై నా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కనపెట్టి ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై కూటమి ప్రభుత్వం దృష్టిపెట్టాలని హితవు పలికారు. కార్యక్రమంలో గాజువాక సమన్వయకర్త తిప్పల దేవన్రెడ్డి, పార్టీ కార్యాలయ పర్యవేక్షకులు రవిరెడ్డి, ముఖ్యనాయకులు మొల్లి అప్పారావు, గండి రవికుమార్, జిల్లా అనుబంధ విభాగ, అధికార ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
పట్టించుకోని అటవీ శాఖాధికారులు
జనావాసంలోకి కణుజు కొమ్మాది: కంబాల కొండ నుంచి దారి తప్పి ఓ కణుజు జనావాసాల్లోకి వచ్చేసింది. రాత్రి సమయంలో జాతీయ రహదారి దాటుకుని ఎండాడ పోలమాంబ ఆలయ ప్రాంతంలోకి చేరు కుంది. మూడు రోజుల నుంచి ఆహారం, తాగునీరు లేక ఎండ వేడికి తట్టుకోలేక.. జన సంచారానికి భయపడి బిక్కుబిక్కుమంటూ సంచరిస్తోంది. కాగా.. కణుజును తీసుకుని వెళ్లమని అటవీశాఖ అధికారులకు సమాచారం ఇస్తే.. ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
● ఈ నెలలో కూడా ఎగనామం పెట్టిన కూటమి ప్రభుత్వం ● అసహనం వ్యక్తం చేస్తున్న కార్డుదారులు
మహారాణిపేట: కూటమి ప్రభుత్వంలో ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎస్) అస్తవ్యస్థంగా మారింది. ఎండీయూ వాహనాల ద్వారా బియ్యం కార్డుదారులకు అందించే కందిపప్పునకు ఈ నెల కూడా ఎగనామం పెట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పీడీఎస్ ద్వారా పంపిణీ చేసే నిత్యావసర సరకుల సంఖ్య నానాటికీ తగ్గిపోతోంది. కేవలం బియ్యం, పంచదార మినహా మిగిలిన సరుకుల సరఫరా నోచుకోవడం లేదు. కందిపప్పు సరఫరా కూడా రెండు నెలల ముచ్చటగానే ముగిసింది. ఆ తర్వాత నుంచి కందిపప్పు జాడలేదు. ఈ నెల కూడా కంది పప్పును మాత్రం అడగొద్దని అంటున్నారు. కొన్ని నెలలుగా కందిపప్పు పంపిణీ నిలిచిపోగా మార్చిలోనైనా ఇస్తారని కార్డుదారులు ఆశగా ఎదురు చూశారు. కానీ ఈ నెలలో కూడా పంపిణీ చేయలేమని కూటమి ప్రభుత్వం చేతులెత్తేయడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఎన్నికలకు ముందు కూటమి పార్టీల నాయకులు బియ్యం కార్డుదారులకు వరాల జల్లు కురిపించారు. రేషన్ దుకాణాల ద్వారా కందిపప్పు, నూనె, గోధుమ పిండి, రాగి పిండి తదితర సరుకులు అందజేస్తామని హామీలు గుప్పించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత దానిపై కనీసం దృష్టి సారించలేదు. చుక్కలు చూపిస్తున్న కందిపప్పు ధర జిల్లాలో 5,12,619 తెలుపు కార్డుదారులు ఉన్నాయి. వీరి కోసం 625 చౌకధరల డిపోలు ఉన్నాయి. దీని ప్రకారం జిల్లాలోని కార్డుదారుల అవసరాలకు అనుగుణంగా 700 మెట్రిక్ టన్నుల కందిపప్పు అవసరం. అయితే గతేడాదిలో రెండు నెలలు మాత్రమే కందిపప్పులు సరఫరా చేశారు. గతంలో ఎండీయూ వాహనాల ద్వారా కార్డుదారులకు కందిపప్పును రూ.67కు అందించేవారు. కొంత కాలంగా ప్రభుత్వం పంపిణీ చేయకపోవడం, బహిరంగ మార్కెట్లో కేజీ ధర రూ.160 వరకు పలుకుతుండటంతో పేద, మధ్యతరగతి ప్రజలు కందిపప్పు కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో పప్పన్నానికి దూరం అవుతున్నారు. వచ్చే నెలలో అయినా కందిపప్పు అందించేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కార్డుదారులు కోరుతున్నారు. -
నేడు నగరానికి ప్రముఖుల రాక
ఢిల్లీ నుంచి సీఎం చంద్రబాబు మహారాణిపేట: ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం విశాఖ వస్తున్నారు. ఢిల్లీ నుంచి విమానంలో రాత్రి 11.40 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. రాత్రి రాంనగర్లోని ఎన్టీఆర్ భవన్లో బస చేస్తారు. గురువారం గీతంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు విశాఖ విమానాశ్రయం నుంచి తిరిగి ఢిల్లీ వెళ్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం రాత్రి 8.45 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. రాత్రి నోవాటెల్ హోటల్లో బస చేస్తారు. గురువారం గీతం విశ్వ విద్యాలయంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు నోవాటెల్ హోటల్లో బడ్జెట్పై జరిగే సదస్సుకు హాజరవుతారు. 4 గంటలకు అక్కడే ప్రెస్మీట్లో పాల్గొంటారు. సాయంత్రం 6.15 గంటలకు విమానంలో ఢిల్లీ బయలుదేరుతారు. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాత్రి 8.45 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. 6న నగరంలో జరిగే బడ్జెట్పై జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రి 9.25 గంటలకు విమానంలో ఢిల్లీ బయలుదేరుతారు. అలాగే కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి మనోజ్ గోవిల్ రెండు రోజుల పర్యటన నిమిత్తం విశాఖ వస్తున్నారు. 5, 6 తేదీల్లో నగరంలో ఆయన పర్యటిస్తారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు బుధవారం మధ్యాహ్నం 12.15 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి సాగర్నగర్లోని తన ఇంటికి వెళతారు. మధ్యాహ్నం 2.20 గంటలకు రాడిషన్ బ్లూ హోటల్లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. 6న గీతం విశ్వ విద్యాలయంలో జరిగే కార్యక్రమానికి హాజరవుతారు. 7వ తేదీన విశాఖ విమానాశ్రయం నుంచి విమానంలో బెంగళూరు వెళ్తారు. -
కల్లాస్!
ఖజానాఅమరావతికి జీవీఎంసీ నిధులు అకౌంటులో ఉన్నది రూ.50 లక్షలే.. ఎమ్మెల్సీ ఫలితం కూటమికి చెంపపెట్టుకందిపప్పు అడగొద్దు8లోబుధవారం శ్రీ 5 శ్రీ మార్చి శ్రీ 2025కొలంబో చేరుకున్న ఐఎన్ఎస్ కుతార్ సింథియా : హిందూ మహా సముద్రంపై శ్రీలంక, భారత్ల సముద్ర సంబంధాలను బలోపేతం చేసే దిశగా.. తూర్పు నావికాదళానికి చెందిన ఈస్ట్రర్న్ ఫ్లీట్ షిప్ ఐఎన్ఎస్ కుతార్ కొలంబో చేరుకున్నట్లు నేవీ వర్గాలు తెలిపాయి. దీంతో ఓడ కమాండింగ్ ఆఫీసర్ కమాండర్ నితిన్ శర్మ.. శ్రీలంక నేవీ వెస్ట్రన్ నేవల్ ఏరియా కమాండర్ రియర్ అడ్మిరల్ ఎంహెచ్సీజె శిల్వా నుంచి స్వాగతం అందుకున్నారు. అనంతరం ఇరుదేశాల నావికాదళాల మధ్య వృత్తిపరమైన, ఉమ్మడి కార్యాకలాపాలపై కార్యచరణను రూపొందించడంతోపాటు రెండు దేశాల మధ్య దీర్ఘకాల భాగస్వామ్యపంపై చర్చించినట్లు నేవీ అధికారులు తెలిపారు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఒకప్పుడు కాసుల గలగలలతో నిండుగా ఉండే జీవీఎంసీ ఖజానా నిధులు లేక విలవిలలాడుతోంది. ఈ ఖజానాపై కన్నేసిన కూటమి ప్రభుత్వం నేరుగా సెంట్రలైజ్డ్ ఫండ్స్ మేనేజ్మెంట్ సిస్టం (సీఎఫ్ఎంఎస్) ద్వారా అమరావతికి తరలించేస్తోంది. ఈ నిధులను అమరావతిలో వివిధ పనుల కోసం వినియోగించేందుకే జమ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. దీంతో ఇక్కడి కాంట్రాక్టర్లకు తొమ్మిది నెలల నుంచి బిల్లులు చెల్లించేందుకు నిధులు లేకుండా పోయాయి. పైగా కొద్ది రోజుల క్రితం జీవీఎంసీ ఖజానాలో ఉన్న నిధులు రూ.50 లక్షలకు పడిపోయినట్టు తెలుస్తోంది. వాస్తవానికి మొన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఒక్క పైసా కూడా జీవీఎంసీకి కేటాయించలేదు. పైగా ఇప్పుడు జీవీఎంసీ ఖజానాకే కన్నం పెట్టి అమరావతికి నిధులు తరలించుకుపోతుండడంపై ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇక్కడి ప్రజలు కట్టిన పన్నులతో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకుండా రాష్ట్ర ఖజానాకు తరలించుకుపోవడంపై బహిరంగంగానే విమర్శిస్తున్నారు. మరోవైపు ఉన్న కొద్దిపాటి నిధులనూ తమకు పర్సంటేజీలు ఇచ్చిన కాంట్రాక్టర్లకు బిల్లులు చేసేలా కార్పొరేషన్లో అన్నీ తామై వ్యవహరిస్తున్న నలుగురి సభ్యుల కూటమి నేతలు ఒత్తిడి తెస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పేరుకే భారీ బడ్జెట్..! జీవీఎంసీ ఏటా రూ.5 వేల కోట్లకుపైగా అంచనాలతో భారీ బడ్జెట్ను ప్రవేశపెడుతుంది. ఇందులో రూ.1,200 కోట్ల మేర ఇంజనీరింగ్ పనులకే ఖర్చు చేస్తుంది. మంచినీటి సరఫరా కోసం రూ.340 కోట్లు, పబ్లిక్ హెల్త్ కోసం రూ.450 కోట్లు, వివిధ ప్రాజెక్టుల అమలు కోసం రూ.800 కోట్ల మేర వెచ్చిస్తోంది. ఇక అమృత్ పథకం అమలు కోసం రూ. 310 కోట్ల మేర వినియోగిస్తోంది. ఇవి కాకుండా లైటింగ్, యూసీడీ, పార్కులు, విద్య తదితర పద్దుల కోసం మిగిలిన మొత్తాన్ని వెచ్చిస్తోంది. అయితే గత 9 నెలలుగా ఇంజనీరింగ్ పనులతో పాటు వివిధ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం లేదు. ప్రజల నుంచి పన్నుల ద్వారా వస్తున్న ప్రధాన ఆదాయాన్ని ప్రభుత్వం సీఎఫ్ఎంఎస్ ఖాతాల ద్వారా జమ చేసుకుంటోంది. దీంతో జీవీఎంసీ ఖజానాకు కన్నంపడుతోంది. న్యూస్రీల్ జీవీఎంసీ ఆదాయాన్ని మళ్లించుకుంటున్న ప్రభుత్వం సీఎఫ్ఎంఎస్ ద్వారా నేరుగా రాష్ట్ర ఖజానాకు చేరుతున్న వైనం గత 9 నెలలుగా కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు నిల్ బిల్లుల కోసం 10 శాతం పర్సంటేజీ వసూలు కొద్దిపాటి ఖజానాలోనూ దండుకుంటున్న కూటమి నేతలు బిల్లులు.. పర్సంటేజీ రాజాలు..! జీవీఎంసీలో ఇంజనీరింగ్, వాటర్ వర్క్స్, పార్కుల అభివృద్ధి, వివిధ ప్రాజెక్టులు చేపడుతున్న కాంట్రాక్టర్లకు ఎప్పటికప్పుడు జీవీఎంసీ నుంచి బిల్లులు చెల్లించాల్సి ఉంటోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జీవీఎంసీ ఆదాయం కాస్తా సీఎఫ్ఎంఎస్కు చేరుతుండటంతో.. బిల్లుల చెల్లింపులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కూటమి ప్రభుత్వంలోని కొద్ది మంది నేతలు ఇదే అదునుగా బిల్లుల కోసం వసూలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. జీవీఎంసీ ఖజానాలో ఉన్న కొద్ది పాటి మొత్తాన్ని కూడా తాము చెప్పిన వారికి బిల్లులు చెల్లించాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. ఇందుకోసం ఏకంగా 10 శాతం కమీషన్ దండుకుంటున్నట్టు విమర్శలున్నాయి. ప్రధానంగా రాబోయే కాలంలో తమదే అధికారం అని చెప్పుకుంటూ ఇప్పటికే స్టాండింగ్ కమిటీల ద్వారా 10 శాతం వసూలు చేస్తున్న నలుగురు సభ్యుల కూటమి నేతలు.. ఇప్పుడు బిల్లులకూ వసూలు మొదలుపెట్టారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే కొద్ది మంది కాంట్రాక్టర్లు కూటమి నేతలకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. నేరుగా రాష్ట్ర ఖజానాలోకే...! జీవీఎంసీకి ప్రధానంగా ప్రజల నుంచి వసూలు చేసే పన్నులతో పాటు వీఎల్టీ, టౌన్ ప్లానింగ్ ద్వారా వచ్చే ఆదాయ వనరులు ప్రధానమైనవి. వివిధ వాణిజ్య సంస్థలు, విశాఖ పోర్టు, స్టీల్ ప్లాంట్, హెచ్పీసీఎల్ వంటి సంస్థల నుంచి వచ్చే ఆదాయం కూడా ఎక్కువే. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హయాంలో ఇలా వచ్చే మొత్తాన్ని జీవీఎంసీ తన సొంత ఖాతాలోకి జమ చేసుకునేది. తద్వారా జీవీఎంసీ ఖజానాలో నిధులు గలగలలాడేవి. దీంతో అప్పటికే భారీగా పేరుకుపోయిన కాంట్రాక్టర్ల బిల్లులను కూడా గత ప్రభుత్వ హయాంలో చెల్లించారు. కరోనా సమయంతో పాటు ఆ తర్వాత కొద్ది నెలలు మాత్రమే ఇబ్బందులు మినహా... మిగిలిన సమయం అంతా కాంట్రాక్టర్లకు బిల్లులను సకాలంలో చెల్లించేవారు. కాంట్రాక్టర్లు పనులు పూర్తి చేయడంతోపాటు బిల్లులను ప్రాసెస్ సమయం కూడా కలుపుకుంటే.. 5 లేదా 6 నెలల్లోనే బిల్లులను చెల్లించేవారు. తద్వారా కాంట్రాక్టర్లు చాలా తక్కువ ధరకే టెండర్లను దాఖలు చేసేవారు. ప్రధానంగా సింహాచలం వద్ద బీఆర్టీఎస్ రోడ్డుతో పాటు నగరంలోని వివిధ రోడ్ల పనులకు ఏకంగా 30 శాతానికి మించి తక్కువ ధరను కోట్ చేసి.. టెండర్లను దక్కించుకునేందుకు కాంట్రాక్టర్లు పోటీ పడేవారు. ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంటోంది. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం లేదు. దీంతో పనులు చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఒకవేళ టెండర్లను దాఖలు చేస్తే.. అధిక ధరకు బిడ్ చేస్తున్నారు. తద్వారా జీవీఎంసీ ఖజానాపై అధిక భారం పడుతోంది. -
ఓటమిని ఒప్పుకోండి.. గెలిచిన వ్యక్తి కూటమి సభ్యుడా?: అమర్నాథ్
సాక్షి, విశాఖ: ఏపీలో ఎమ్మెల్సీ ఫలితాల తర్వాత మాట మార్చడానికి కూటమి నేతలకు సిగ్గులేదా అని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. రాష్ట్రంలో ఉద్యోగుల కడుపు మంటకు నిన్నటి ఎన్నికల ఫలితాలే నిదర్శనమని తెలిపారు. ఓటమిని హుందాగా ఒప్పుకోండి. ఎవరు గెలిస్తే వారే మా అభ్యర్థి అని చెప్పడం ఎంత దారుణం అంటూ ఘాటు విమర్శలు చేశారు.మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తరువాత టీడీపీ మంత్రులు, నేతల ప్రకటనలు చూసి ఆశ్చర్యం వేసింది. రఘు వర్మ ఓటమి తరువాత మాకు సంబంధం లేదని అచ్చెన్నాయుడు చెబుతున్నారు. కూటమి నేతలకు మాట మార్చడానికి సిగ్గు లేదా?. ప్రభుత్వ పని తీరుకు ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితం నిదర్శనం. విద్యాశాఖకు మంత్రిగా సీఎం కుమారుడు లోకేష్ ఉన్నారు. ఉద్యోగులకు పీఆర్సీ ఇస్తామని మోసం చేశారు. ఏనాడు జీతాలు సరిగా ఇవ్వలేదు.ఉద్యోగుల కడుపు మంటకు నిన్నటి ఫలితాలు నిదర్శనం. రిగ్గింగ్కు పాల్పడి పట్టభద్రుల ఎన్నికల్లో విజయం సాధించారు. ఓటమిని హుందాగా ఒప్పుకోండి. ఎవరు గెలిస్తే వారే మా అభ్యర్థి అని చెప్పడం ఎంత దారుణం. కూటమి తరపున మా అభ్యర్థి రఘు వర్మ అని అనేక సార్లు కూటమి నేతలు చెప్పారు. ఎన్నికల్లో ఎప్పుడూ శ్రీనివాసుల నాయుడు తమ అభ్యర్థి అని కూటమి నేతలు ప్రకటించలేదు. శ్రీనివాసుల నాయుడు కూడా కూటమి తనకు మద్దతు ప్రకటించలేదని స్పష్టం చేశారు. బాబాయి ఏమో.. శ్రీనివాసుల నాయుడు అంటున్నారు.. అబ్బాయి ఏమో.. రఘు వర్మ అంటున్నారు. అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు చెప్పిన దాంట్లో ఎవరి మాట నిజం. ఎవరికో పుట్టిన బిడ్డకు మీరు పేరు పెట్టవద్దు.కూటమి పాలనలో రిషికొండ బీచ్కు అన్యాయం జరిగింది. ప్రభుత్వ నిర్వాకం వల్ల బ్లూప్లాగ్ను బీచ్లో నుంచి తొలగించారు. ప్రభుత్వం చేతగాని చర్యలు వలన ఉత్తరాంధ్ర జిల్లాలు నష్టపోతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలకు వైఎస్సార్సీపీ దూరంగా ఉంది అని చెప్పుకొచ్చారు. -
ఇలాగేనా.. గ్రాండ్ టెస్ట్
● పరీక్షకు డుమ్మా కొడుతున్న విద్యార్థులు ● బీఈడీ విద్యార్థులతో పరీక్షలపై పర్యవేక్షణ విశాఖ విద్య: విద్యాశాఖ ఆదేశాల మేరకు టెన్త్ విద్యార్థుల్ని వార్షిక పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో గ్రాండ్ టెస్ట్లు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 13 వరకు వార్షిక పరీక్షల మాదిరే పకడ్బందీగా వీటిని నిర్వహించేలా షెడ్యూల్ ఇచ్చారు. అయితే గ్రాండ్ టెస్ట్లకు విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపటం లేదు. నగరంలోని ఆంధ్ర యూనివర్సిటీ హైస్కూల్(ఎయిడెడ్)లో టెన్త్ విద్యార్థులు 82 మందికి గాను 64 మంది గ్రాండ్ టెస్ట్ రాశారు. విద్యార్థులు ఇళ్ల వద్ద, మరికొంతమంది కోచింగ్లకు వెళ్తున్నందున గ్రాండ్ టెస్ట్కు గైర్హాజరైనట్లు పాఠశాల హెచ్ఎం సలోమి తెలిపారు. ఇక్కడి పరీక్షను బీఈడీ శిక్షణ పొందుతున్న విద్యార్థులతో పర్యవేక్షణ చేయించారు. మూడు గదుల్లో పరీక్షలు నిర్వహించగా, అన్ని చోట్ల బీఈడీ చేస్తున్న విద్యార్థులే ఇద్దరు ముగ్గురు చొప్పున పర్యవేక్షిస్తూ కనిపించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా గ్రాండ్ టెస్ట్లు నిర్వహణ తీరుపై సందేహాలు ముసురుకున్నాయి. హాజరు అంతంత మాత్రమే.. సమ్మెటివ్–1, సమ్మెటివ్–2 పరీక్షల ప్రాతిపదికగా, విద్యార్థులకు గ్రేడింగ్ ఇచ్చి, వారిని వార్షిక పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వీటికి తోడు అట్టహాసంగా గ్రాండ్ టెస్ట్లకు సిద్ధమైంది. ఈ నెల 17 నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభంకానున్న నేపథ్యంలో విద్యార్థులు గ్రాండ్ టెస్ట్లపై ఆసక్తి చూపటం లేదనేది ఏయూ హైస్కూల్ హాజరు తీరునుబట్టి తెలుస్తోంది. ఒక్క స్కూల్లోనే 18 మంది వరకు విద్యార్థులు గైర్హాజరైతే.. జిల్లా వ్యాప్తంగా ఇంకెంత మంది డుమ్మా కొడుతున్నారో..? తేలాల్సి ఉంది. గ్రాండ్ టెస్ట్ల నిర్వహణపై అధికారులకు, ఉపాధ్యాయులకు కూడా పెద్దగా ఆసక్తి లేదన్నది స్పష్టమవుతోంది. -
ప్రశాంతంగా ద్వితీయ ఇంటర్ పరీక్షలు
విశాఖ విద్య: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. సోమవారం నాటి పరీక్షకు మొత్తం 38,478 మంది నమోదు చేసుకోగా, వీరిలో 401 మంది గైర్హాజరయ్యారు. 99 శాతం హాజరు నమోదైనట్లు ఆర్ఐవో పి.మురళీధర్ తెలిపారు. పరీక్షల నిర్వహణపై ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మాస్ కాపీయింగ్కు అవకాశం లేకుండా కేంద్రాలను ప్రత్యేక తనిఖీ బృందాలు పరిశీలించాయి. జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ జైల్రోడ్లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని తనిఖీ చేశారు. పరీక్షలు జరుగుతున్న గదుల్లోకి వెళ్లి, నిర్వహణను స్వయంగా చూశారు. విద్యార్థులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారనేది నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. పరీక్ష కేంద్రంలో సౌకర్యాలు ఎలా ఉన్నాయని కొంతమంది విద్యార్థులనూ అడిగి తెలుసుకున్నారు. -
కేకే లైన్లో ప్రయాణికుల రైళ్ల గమ్యం కుదింపు
తాటిచెట్లపాలెం: కేకే లైన్ మార్గంలో నడిచే పలు రైళ్లు ఆయా తేదీల్లో దంతేవాడ వరకే రాకపోకలు సాగిస్తాయని వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. ● విశాఖపట్నం–కిరండూల్(58501) పాసింజర్ స్పెషల్ ఈ నెల 7 నుంచి 15 మధ్య దంతేవాడ వరకు మాత్రమే నడుస్తుంది. కిరండూల్– విశాఖపట్నం (58502) పాసింజర్ స్పెషల్ ఈ నెల 8 నుంచి 16 వరకు కిరండూల్ నుంచి కాకుండా దంతేవాడ నుంచి బయల్దేరుతుంది. ● విశాఖపట్నం–కిరండూల్(18515) నైట్ ఎక్స్ప్రెస్ ఈ నెల 7 నుంచి 15 మధ్య దంతేవాడ వరకు మాత్రమే నడుస్తుంది. కిరండూల్– విశాఖపట్నం (18516) ఎక్స్ప్రెస్ ఈ నెల 8 నుంచి 16 వరకు కిరండూల్ నుంచి కాకుండా దంతేవాడ నుంచి బయల్దేరుతుంది. ఈ తేదీల్లో దంతేవాడ–కిరండూల్ మధ్య ఈ రైళ్లు రాకపోకలు సాగించవు. ప్రయాణికులు మార్పులను గమనించాలని రైల్వే అధికారులు సూచించారు. -
కేకే లైన్లో ప్రయాణికుల రైళ్ల గమ్యం కుదింపు
తాటిచెట్లపాలెం: కేకే లైన్ మార్గంలో నడిచే పలు రైళ్లు ఆయా తేదీల్లో దంతేవాడ వరకే రాకపోకలు సాగిస్తాయని వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. ● విశాఖపట్నం–కిరండూల్(58501) పాసింజర్ స్పెషల్ ఈ నెల 7 నుంచి 15 మధ్య దంతేవాడ వరకు మాత్రమే నడుస్తుంది. కిరండూల్– విశాఖపట్నం (58502) పాసింజర్ స్పెషల్ ఈ నెల 8 నుంచి 16 వరకు కిరండూల్ నుంచి కాకుండా దంతేవాడ నుంచి బయల్దేరుతుంది. ● విశాఖపట్నం–కిరండూల్(18515) నైట్ ఎక్స్ప్రెస్ ఈ నెల 7 నుంచి 15 మధ్య దంతేవాడ వరకు మాత్రమే నడుస్తుంది. కిరండూల్– విశాఖపట్నం (18516) ఎక్స్ప్రెస్ ఈ నెల 8 నుంచి 16 వరకు కిరండూల్ నుంచి కాకుండా దంతేవాడ నుంచి బయల్దేరుతుంది. ఈ తేదీల్లో దంతేవాడ–కిరండూల్ మధ్య ఈ రైళ్లు రాకపోకలు సాగించవు. ప్రయాణికులు మార్పులను గమనించాలని రైల్వే అధికారులు సూచించారు. -
ప్రశాంతంగా ద్వితీయ ఇంటర్ పరీక్షలు
విశాఖ విద్య: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. సోమవారం నాటి పరీక్షకు మొత్తం 38,478 మంది నమోదు చేసుకోగా, వీరిలో 401 మంది గైర్హాజరయ్యారు. 99 శాతం హాజరు నమోదైనట్లు ఆర్ఐవో పి.మురళీధర్ తెలిపారు. పరీక్షల నిర్వహణపై ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మాస్ కాపీయింగ్కు అవకాశం లేకుండా కేంద్రాలను ప్రత్యేక తనిఖీ బృందాలు పరిశీలించాయి. జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ జైల్రోడ్లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని తనిఖీ చేశారు. పరీక్షలు జరుగుతున్న గదుల్లోకి వెళ్లి, నిర్వహణను స్వయంగా చూశారు. విద్యార్థులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారనేది నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. పరీక్ష కేంద్రంలో సౌకర్యాలు ఎలా ఉన్నాయని కొంతమంది విద్యార్థులనూ అడిగి తెలుసుకున్నారు. -
నాటకీయ పరిణామాలతో ఉద్రిక్తత
సోమవారం రాత్రి ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ రహదారిపై ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయులుగాదె విజయం 9 గంటలకు ఖరారైంది. ఆర్వో కూడా సంతకం చేసి వెళ్లిపోయినా అధికారికంగా ప్రకటించకపోవడం, ధృవీకరణ పత్రం జారీ చేయకపోవడంతో కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతున్నట్లు పీఆర్టీయూ ప్రతినిధులు గ్రహించారు. టీడీపీ నాయకులు గండి బాబ్జీ, సీతంరాజు సుధాకర్ రాత్రి 9.30 గంటల సమయంలో కౌంటింగ్ కేంద్రానికి చేరుకొని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఉపాధ్యాయుల్లో మరింత అనుమానాలు రేకెత్తాయి. గెలువు విషయంలో ప్రభుత్వం అడ్డదారులు తొక్కుతుందేమోనని గ్రహించారు. వెంటనే అధికారికంగా ప్రకటించి.. ధృవీకరణ పత్రం జారీ చెయ్యాలంటూ పట్టుబట్టారు. కానీ.. కలెక్టర్ అక్కడి నుంచి వెళ్లిపోవడంతో గాదె మద్దతుదారులు ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ మెయిన్ ఎంట్రన్స్ రహదారిపై ధర్నాకు దిగారు. వెంటనే ధృవీకరణ పత్రాన్ని మంజూరు చేయాలంటూ నినదించారు. ఉపాధ్యాయులు నిరసన ప్రదర్శన చేపడుతున్నారని గ్రహించిన టీడీపీ నేతలు అక్కడి నుంచి జారుకున్నారు. చివరికి పోలీసులు కౌంటింగ్ కేంద్రంలో ఉన్న గాదె శ్రీనివాసులు నాయుడు మద్దతుదారులతో ఫోన్లో మాట్లాడి.. ఇక్కడ అంతా సవ్యంగానే ఉందని చెప్పడంతో నిరసన ఉపసంహరించుకున్నారు. -
ఇలాగేనా.. గ్రాండ్ టెస్ట్
● పరీక్షకు డుమ్మా కొడుతున్న విద్యార్థులు ● బీఈడీ విద్యార్థులతో పరీక్షలపై పర్యవేక్షణ విశాఖ విద్య: విద్యాశాఖ ఆదేశాల మేరకు టెన్త్ విద్యార్థుల్ని వార్షిక పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో గ్రాండ్ టెస్ట్లు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 13 వరకు వార్షిక పరీక్షల మాదిరే పకడ్బందీగా వీటిని నిర్వహించేలా షెడ్యూల్ ఇచ్చారు. అయితే గ్రాండ్ టెస్ట్లకు విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపటం లేదు. నగరంలోని ఆంధ్ర యూనివర్సిటీ హైస్కూల్(ఎయిడెడ్)లో టెన్త్ విద్యార్థులు 82 మందికి గాను 64 మంది గ్రాండ్ టెస్ట్ రాశారు. విద్యార్థులు ఇళ్ల వద్ద, మరికొంతమంది కోచింగ్లకు వెళ్తున్నందున గ్రాండ్ టెస్ట్కు గైర్హాజరైనట్లు పాఠశాల హెచ్ఎం సలోమి తెలిపారు. ఇక్కడి పరీక్షను బీఈడీ శిక్షణ పొందుతున్న విద్యార్థులతో పర్యవేక్షణ చేయించారు. మూడు గదుల్లో పరీక్షలు నిర్వహించగా, అన్ని చోట్ల బీఈడీ చేస్తున్న విద్యార్థులే ఇద్దరు ముగ్గురు చొప్పున పర్యవేక్షిస్తూ కనిపించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా గ్రాండ్ టెస్ట్లు నిర్వహణ తీరుపై సందేహాలు ముసురుకున్నాయి. హాజరు అంతంత మాత్రమే.. సమ్మెటివ్–1, సమ్మెటివ్–2 పరీక్షల ప్రాతిపదికగా, విద్యార్థులకు గ్రేడింగ్ ఇచ్చి, వారిని వార్షిక పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వీటికి తోడు అట్టహాసంగా గ్రాండ్ టెస్ట్లకు సిద్ధమైంది. ఈ నెల 17 నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభంకానున్న నేపథ్యంలో విద్యార్థులు గ్రాండ్ టెస్ట్లపై ఆసక్తి చూపటం లేదనేది ఏయూ హైస్కూల్ హాజరు తీరునుబట్టి తెలుస్తోంది. ఒక్క స్కూల్లోనే 18 మంది వరకు విద్యార్థులు గైర్హాజరైతే.. జిల్లా వ్యాప్తంగా ఇంకెంత మంది డుమ్మా కొడుతున్నారో..? తేలాల్సి ఉంది. గ్రాండ్ టెస్ట్ల నిర్వహణపై అధికారులకు, ఉపాధ్యాయులకు కూడా పెద్దగా ఆసక్తి లేదన్నది స్పష్టమవుతోంది. -
మద్యానికి డబ్బులు ఇవ్వలేదని యువకుడి ఆత్మహత్య
గోపాలపట్నం: మద్యం కోసం తల్లికి డబ్బులు అడిగితే ఇవ్వలేదని.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఓ యువకుడు ఉరి వేసుకున్నాడు. గోపాలపట్నం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలివి.. జీవీఎంసీ 91వ వార్డు లక్ష్మీనగర్ ఈ బ్లాక్ నాలుగు కుళాయిల వద్ద గోక శివకృష్ణ(32) తల్లిదండ్రులతో నివాసముంటున్నాడు. తండ్రి, తమ్ముడితో కలిసి ఆటోలో ఉల్లిపాయల వ్యాపారం చేస్తుండేవాడు. మద్యానికి బానిస కావడంతో అతని తండ్రి, తమ్ముడు ఈ వ్యాపారం చూసుకుంటున్నారు. కాగా.. శివకృష్ణ సోమవారం ఉదయం ఫూటుగా మద్యం సేవించాడు. మధ్యాహ్న సమయంలో మద్యం కోసం డబ్బులు కావాలని తల్లి దమయంతిని అడగ్గా.. ఆమె లేవని చెప్పింది. సాయంత్రం భర్త, కొడుకు వచ్చే సరికి టీ పెట్టేందుకని ఆమె పాలు ప్యాకెట్ కోసం బయటకు వెళ్లింది. తిరిగి వచ్చే సరికి శివకృష్ణ ఇంట్లో ఫ్యాన్కు చీరతో ఉరి వేసుకుని కనిపించడంతో కేకలు వేసింది. ఇది గమనించిన చుట్టుపక్కల వారు ఆమె భర్త, చిన్న కుమారుడికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చిన తర్వాత శివకృష్ణను కిందకు దించి చూసే సరికి మృతి చెంది ఉన్నాడు. సమాచారం అందుకున్న గోపాలపట్నం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సీఐ గొలగాని అప్పారావు నేతృత్వంలో వివరాలు సేకరించారు. మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించారు. తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అధికారులే బలిపశువులు
ఇద్దరికి బదిలీ ఇన్చార్జి ఆర్డీగా ఉన్న రమణను ఆ బాధ్యతల నుంచి తప్పించారు. అతని స్థానంలో టూరిజం డివిజినల్ మేనేజర్గా ఉన్న వి.బి.జగదీష్ గేదెలను ప్రభుత్వం నియమించింది. అలాగే జిల్లా పర్యాటక శాఖ అధికారిగా ఉన్న జ్ఞానవేణిని మాతృశాఖకు పంపించింది. ఆమె స్థానంలో టూరిజం మేనేజర్గా ఉన్న జి.దాసుకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ● కూటమి ప్రభుత్వ అసమర్థ పాలనతో రుషికొండ బీచ్కు బ్లూఫ్లాగ్ గుర్తింపు రద్దు ● ప్రపంచ స్థాయి ప్రమాణాల కల్పనకు నిధులివ్వని రాష్ట్ర ప్రభుత్వం ● ఇందుకు అధికారులను బాధ్యులను చేస్తూ బదిలీల వేటు ● టూరిజం ఇన్చార్జి ఆర్డీ రమణ, డీటీవో జ్ఞానవేణిలకు స్థానచలనంబ్లూ ఫ్లాగ్ను తొలగించిన దృశ్యంవిశాఖ సిటీ: కూటమి ప్రభుత్వ అసమర్థ పాలనకు అధికారులు బలిపశువులుగా మారారు. రుషికొండ బీచ్కు బ్లూఫ్లాగ్ గుర్తింపు రద్దు విషయంలో అధికారులనే దోషులుగా ప్రభుత్వం తేల్చింది. పర్యాటక శాఖ ఇన్చార్జి రీజినల్ డైరెక్టర్ రమణతో పాటు పర్యాటక శాఖాధికారిణి జ్ఞానవేణిలపై బదిలీ వేటు వేసింది. ఈ కీలక అధికారుల మధ్య సమన్వయ లోపమే ప్రపంచ స్థాయి గుర్తింపు రద్దవడానికి కారణమని తప్పును వారిపై నెట్టేసింది. రుషికొండకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు దిద్దుబాటు చర్యలు దిగినట్లు కలరింగ్ ఇస్తోంది. విశాఖపై సవతి ప్రేమ విశాఖపై కూటమి ప్రభుత్వానికున్న సవతి ప్రేమ ఈ ఉదంతంతో బట్టబయలైంది. గత ప్రభుత్వం విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తున్నట్లు ప్రకటించిన నాటి నుంచి టీడీపీ, జనసేన, బీజేపీలు విశాఖపై విషం చిమ్ముతూనే ఉన్నాయి. విశాఖలో అభివృద్ధి, పర్యాటక ప్రాజెక్టులు, కీలక నిర్మా ణాలకు వ్యతిరేకంగా కోర్టుల్లో కేసులు వేస్తూ వచ్చా యి. అయినప్పటికీ.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా రుషికొండ బీచ్ను రూ.7.35 కోట్లతో అభివృద్ధి చేసింది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు కల్పించింది. దీంతో రుషికొండ బీచ్కు పర్యావరణహిత, ప్రమాద రహిత బీచ్లకు అందించే బ్లూఫ్లాగ్ సర్టిఫికెట్ 2020, అక్టోబర్ 11న దక్కింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి 13 బీచ్లు ఈ సర్టిఫికేషన్ కోసం పోటీపడగా రుషికొండ బీచ్ అందులో ఒకటిగా ఈ గుర్తింపును సొంతం చేసుకుంది. అప్పటి నుంచి వరుసగా నాలుగేళ్ల పాటు ఈ గుర్తింపును నిలబెట్టుకుంటూ వచ్చింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖలో పర్యాటకం పూర్తిగా పడకేసింది. ఇక్కడి బీచ్లో సౌకర్యాలపై కనీసం దృష్టి సారించలేదు. పర్యాటక శాఖకు పైసా కూడా విదిల్చలేదు. దీంతో ఈ బీచ్ కళావిహీనంగా మారిపోయింది. ఫలితంగా బ్లూఫ్లాగ్ గుర్తింపును డెన్మార్క్ సంస్థ ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్(ఎఫ్ఈఈ) రద్దు చేసింది. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో కూటమి ప్రభుత్వం బూటకపు దిద్దుబాటు చర్యలకు దిగింది. ఈ పరిణామాలకు అధికారులనే బాధ్యులను చేసి వారిపై బదిలీ వేటు వేసింది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ‘బ్లూఫ్రాడ్’ ప్రభుత్వ నిర్లక్ష్యం, చేసిన తప్పిదాలు కారణంగా ‘బ్లూ ఫ్లాగ్’కాస్తా ‘బ్లూ ఫ్రాడ్’గా మారిపోయింది. బీచ్ నిర్వహణను గాలికొదిలేసిన అధికారులు కేంద్రం నుంచి వచ్చిన బ్లూఫ్లాగ్ నిధులను మాత్రం మింగేశారన్న ఆరోపణలు ఉన్నాయి. కూటమి నేతలతో చేతులు కలిపి ఈ నిధులను దోచు కున్నారన్న టాక్ ఉంది. ఫలితంగానే పర్యాటకులు సేదతీరేందుకు కూడా కనీస వసతులు లేకుండా పోయాయి. వాస్తవానికి బ్లూఫ్లాగ్ బీచ్కు నోడల్ అధికారిగా జిల్లా పర్యాటక శాఖ అధికారి జ్ఞానవేణి వ్యవహరించాలి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ అధికారాలన్నీ రీజినల్ డైరెక్టర్ చేతిలో పెట్టింది. గత ఆర్డీని బదిలీ చేసిన ప్రభుత్వం టూరిజం ఈఈగా ఉన్న రమణను ఇన్చార్జి ఆర్డీగా నియమించింది. దీని ప్రకారం ఆయనే రుషికొండ బీచ్లో సౌకర్యాలపై దృష్టి పెట్టాల్సి ఉంది. అయితే వీరిద్దరి మధ్య సమన్వయలోపం కారణంగా ప్రతిష్టాత్మక బ్లూఫ్లాగ్ గుర్తింపు రద్దయిందని కూటమి ప్రభుత్వం వారిపై బదిలీ వేటు వేస్తూ.. సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
తొలి నుంచి గాదెకు ఆధిక్యం
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ సోమవారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైంది. ఉదయం 11.30 గంటలకు బ్యాలెట్ బాక్సుల్లో ఓట్లను 20 టేబుల్స్కు సరిపడేలా కట్టలు కట్టారు. మొత్తం 20,971 ఓట్లు పోలవ్వగా 656 ఓట్లు చెల్లనివిగా గుర్తించారు. దీంతో 10,068 ఓట్లను మ్యాజిక్ ఫిగర్గా ప్రకటించారు. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఆది నుంచీ గాదె శ్రీనివాసులనాయుడు ఆధిక్యంలో కొనసాగారు. మొదటి ప్రాధ్యానత ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి గాదె 365 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు. గాదెకు మొదటి ప్రాధ్యాన్యత ఓట్లు 7,210 రాగా, రఘువర్మకి 6,845 ఓట్లు, విజయ గౌరికి 5,804 ఓట్లు వచ్చాయి. మధ్యాహ్నం విరామం అనంతరం ఎలిమినేషన్ రౌండ్ల కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగింది. ప్రతి దశలోనూ గాదె ఆధిక్యం కొనసాగింది. మూడో స్థానంలో ఉన్న విజయ గౌరికి వచ్చిన ఓట్లలో రెండో ప్రాధాన్యత లెక్కింపు చేపట్టారు. 9వ రౌండ్లో గాదె 9,237 ఓట్లతో మొదటి స్థానంలో నిలవగా.. వర్మకు 8,527 ఓట్లు వచ్చాయి. దీంతో తన ఓటమి ఖరారైందని భావించిన వర్మ కౌంటింగ్ కేంద్రం నుంచి నిరాశగా వెనుదిరిగారు. అయితే.. మ్యాజిక్ ఫిగర్ ఓట్లు సాధించేందుకు గాదె ఇంకా 831 ఓట్ల దూరంలో నిలిచారు. 1967 ఓట్ల మెజారిటీతో విజయం అప్పటికే వర్మ బయటికి వెళ్లిపోవడంతో వర్మకి చెందిన ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లని లెక్కించాలా.. గాదె విజయాన్ని ధృవీకరించాలా అనే అంశంపై రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఎం.ఎన్.హరేందిరప్రసాద్, ఎన్నికల అబ్జర్వర్ ఎం.ఎం.నాయక్ ఎలక్షన్ కమిషన్కి అభ్యర్థించారు. మ్యాజిక్ ఫిగర్ వచ్చేంతవరకూ లెక్కించాలని చెప్పడంతో వర్మకి వచ్చిన ఓట్ల లెక్కింపును సాయంత్రం 6.45 గంటలకు ప్రారంభించారు. గాదె మ్యాజిక్ ఫిగర్ 10,068 ఓట్లకు చేరుకోగానే అధికారికంగా గాదె విజయం సాధించారు. మిగిలిన ఓట్ల లెక్కింపును కూడా పూర్తి చేశారు. చివరకు గాదెకు 12,035 ఓట్లు వచ్చాయి. రిటర్నింగ్ అధికారి గాదె విజయం సాధించినట్లు సంతకం చేసి ఎన్నికల కమిషన్ సంతకం కోసం విజయవాడ పంపించారు. -
బెత్తం దెబ్బ
కూటమికిఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వానికి టీచర్లు ఝలక్ పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులునాయుడికే అయ్యవార్లు పట్టం వర్మ ఓట్ల లెక్కింపుతో గాదెకు 12,035 ఓట్లు వచ్చినట్లుగా ప్రకటన ● కూటమి ప్రభుత్వం మద్దతిచ్చిన పాకలపాటి రఘువర్మకు షాక్ ● టీడీపీ, జనసేన నేతలు కాళ్లకు బలపాలు కట్టుకొని తిరిగినా పట్టించుకోని ఉపాధ్యాయులు ● ఫలించని ప్రజాప్రతినిధుల ప్రలోభాల ఎర ● తొమ్మిది నెలల్లో ప్రభుత్వంపై వ్యతిరేకతకు నిదర్శనం ఈ ఫలితం సాక్షి, విశాఖపట్నం/విశాఖ సిటీ : ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కూటమి ప్రభుత్వానికి షాకిచ్చాయి. అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే కూటమి పార్టీలకు ఉపాధ్యాయులు బెత్తం దెబ్బ రుచి చూపించారు. పాకలపాటి రఘువర్మను గెలిపించేందుకు టీడీపీ, జనసేన ప్రజాప్రతినిధులు కాళ్లకు బలపాలు కట్టుకొని ఉత్తరాంధ్ర జిల్లాల్లో కలియతిరిగినా టీచర్లు కనికరించలేదు. ఓటుకు రూ.2 వేలు నుంచి రూ.10 వేలు వరకు ఇచ్చి ప్రలోభాల ఎర వేసినా లొంగలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులునాయుడుకే పట్టం కట్టారు. ఈ ఎన్నికల ఫలితాలు కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టులా పరిణమించాయి. ప్రలోభాల ఎర వేసినా.. ఏజెంట్ల అవతారమెత్తినా.. పాకలపాటి రఘువర్మ విజయానికి కూటమి నేతలు ఎన్ని ప్రలోభాల ఎర వేసినా.. ఎమ్మెల్యేల నుంచి మంత్రుల వరకు ఎలక్షన్ ఏజెంట్ల అవతారమెత్తినా ఉపాధ్యాయులు కనికరించలేదు. వాస్తవానికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా జరుగుతాయి. ఇటువంటి గౌరవప్రదమైన ఎన్నికలకు కూటమి ప్రభుత్వం రాజకీయ రంగు పులిమింది. ఏపీటీఎఫ్ అభ్యర్థిగా బరిలోకి దిగిన పాకలపాటి రఘువర్మకు ముందు టీడీపీ, జనసేనలు మద్దతుగా నిలిచాయి. నామినేషన్ వేసిన దగ్గర నుంచి పోలింగ్ వరకు ఆ పార్టీల నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. రఘువర్మ విజయం నల్లెరుపై నడకే అన్న తరహాలో ప్రచారం చేసుకుంటూ పోయారు. మరోవైపు కూటమి ప్రభుత్వం మద్దతు ఉన్న రఘువర్మను గెలిపిస్తేనే ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారమవుతాయని వాట్సాప్ గ్రూపుల్లో విస్తృత ప్రచారం కల్పించారు. ఉత్తరాంధ్రలో ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వేర్వేరుగా ప్రత్యేక పార్టీలు, విందులు, వినోదాలు ఏర్పాటు చేశారు. ఓటుకు రూ.2 వేలు నుంచి రూ.10 వేలు వరకు ముట్టజెప్పారు. పోలింగ్ రోజున ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కేంద్రాల వద్ద టెంట్లలో ఎన్నికల ఏజెంట్ల తరహాల్లో ఓటర్ స్లిప్పులను సైతం అందించారు. ఇలా ఎన్ని చేసినా ఉపాధ్యాయులు కూటమి ప్రభుత్వాన్ని విశ్వాసంలోకి తీసుకోలేదు. తొమ్మిది నెలలకే ప్రభుత్వంపై వ్యతిరేకత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకపోవడం, రాష్ట్ర ఖజానాను నింపుకోవడం కోసం విద్యుత్, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం, నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరగడంతో ప్రభుత్వంపై అనతికాలంలోనే అన్ని వర్గాలకు ఆశలు సన్నగిల్లాయి. ప్రధానంగా ఉపాధ్యాయులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలపై ఇప్పటివరకు దృష్టి పెట్టకపోవడంతో పాటు పీఆర్సీ కమిటీ ఏర్పాటు, ఐఆర్ వంటి వాటి ప్రస్తావనే చేయకపోవడంపై కూడా ఉద్యోగ వర్గాలు గుర్రుగా ఉన్నాయి. ఈ క్రమంలో జరిగిన ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్లు ప్రభుత్వానికి తమ దెబ్బ రుచి చూపించారు. టీడీపీ, జనసేన మద్దతిచ్చిన పాకలపాటి రఘువర్మను ఓడించి గాదె శ్రీనివాసులునాయుడును గెలిపించారు. అధికారంలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఇంతటి వ్యతిరేకతను మూట్టగట్టుకోవడంతో కూటమి శ్రేణులు డీలా పడ్డాయి. ఎమ్మెల్యేల నుంచి మంత్రుల వరకు రంగంలోకి దిగినప్పటికీ ఓటమి చడిచూడడంతో జీర్ణించుకోలేకపోతున్నాయి. ఈవీఎం కాదు.. బ్యాలెట్ విజయమిది.! గాదె విజయానంతరం పీఆర్టీయూ మద్దతుదారులతో కౌంటింగ్ కేంద్రం వద్ద కోలాహలం ఏర్పడింది. ఇది ఈవీఎం విజయం కాదనీ... బ్యాలెట్ బాక్సుల విజయమని కొందరు ఉపాధ్యాయులు వ్యాఖ్యానించడం గమనార్హం. -
మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో అభ్యర్థులకు వచ్చిన ఓట్లు
అభ్యర్థి వచ్చిన ఓట్లు కె.విజయ గౌరి 5,804 డాక్టర్ కె.రాధాకృష్ణ 30 గాదె శ్రీనివాసులు నాయుడు 7,210 దుర్గారావు 67 ఎన్.సూర్య ప్రకాష్ 85 ఎస్.ఎస్.పద్మావతి 15 పి.రఘువర్మ 6,845 పి.శివప్రసాద్ రావు 15 ఆర్.సత్యనారాయణ 31 డాక్టర్ ఎస్.శ్రీనివాసరావు 33 మొత్తం 20,135