Telugu Sports News, Today Latest Sports News in Telugu, Cricket News Telugu
Sakshi News home page

Sports Top Stories

ప్రధాన వార్తలు

Asian Legends League 2025: Indian Royals Beat Sri Lanka Lions By 46 Runs1
శ్రీలంకను చిత్తు చేసిన శిఖర​ ధవన్‌ సేన

ఆసియా లెజెండ్స్‌ లీగ్‌ ఆరంభ ఎడిషన్‌లో (2025) శిఖర్‌ ధవన్‌ నేతృత్వంలోని ఇండియన్‌ రాయల్స్‌ బోణీ కొట్టింది. నిన్న (మార్చి 11) శ్రీలంక లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 46 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 19.5 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌటైంది. వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఫయాజ్‌ ఫజల్‌ (52) మెరుపు అర్ద సెంచరీ సాధించి భారత్‌కు గౌరవప్రదమైన స్కోర్‌ అందించాడు. భారత ఇన్నింగ్స్‌లో శిఖర్‌ ధవన్‌ 16, రాహుల్‌ యాదవ్‌ 21, మనోజ్‌ తివారి 3, యోగేశ్‌ నగర్‌ 0, మన్‌ప్రీత్‌ గోని 28, జకాతి 23, అనురీత్‌ సింగ్‌ 2 పరుగులు చేయగా.. రోహన్‌ రతి, మునాఫ్‌ పటేల్‌ డకౌట్లయ్యారు. లంక బౌలర్లలో సంజయ 4 వికెట్లు పడగొట్టి టీమిండియాను ఇ‍బ్బంది పెట్టాడు. తిలకరత్నే దిల్షన్‌ 2, అరుల్‌ ప్రగాసమ్‌, ఉపుల్‌ ఇంద్రసిరి, తుషారా, కెప్టెన్‌ తిసారి పెరీరా తలో వికెట్‌ పడగొట్టారు.అనంతరం శ్రీలంక భారత బౌలర్ల ధాటికి 19.2 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో జకాతి 3 వికెట్లు పడగొట్టగా.. మనోజ్‌ తివారి, అనురీత్‌ సింగ్‌, మన్‌ప్రీత్‌ గోని తలో 2 వికెట్లు తీశారు. లంక ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్‌ చేయలేదు. 35 పరుగులు చేసిన లసిత్‌ లక్షన్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. మెవన్‌ ఫెర్నాండో (20 నాటౌట్‌), రవీన్‌ సాయర్‌ (18), తిసారి పెరీరా (10) రెండంకెల స్కోర్లు చేశారు. స్టార్‌ బ్యాటర్‌ తిలకరత్నే దిల్షన్‌ ఒక్క పరుగుకే ఔటయ్యాడు. ఈ టోర్నీలో భారత్‌ మొన్న (మార్చి 10) జరగాల్సిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ టైగర్స్‌తో తలపడాల్సి ఉండింది. అయితే ఈ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైంది. బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్తాన్‌ మధ్య నిన్న జరగాల్సిన మరో మ్యాచ్‌ కూడా వర్షం కారణంగా రద్దైంది. ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ పఠాన్స్‌పై ఆసియా స్టార్స్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.కాగా, ఆసియా లెజెండ్స్‌ లీగ్‌ తొలి ఎడిషన్‌ (2025) మార్చి 10న ఘనంగా ప్రారంభమైంది. ఈ టోర్నీలో మొత్తం ఐదు జట్లు (ఏషియన్‌ లయన్స్‌, శ్రీలంక లయన్స్‌, ఆఫ్ఘనిస్తాన్‌ పఠాన్స్‌, ఇండియన్‌ రాయల్స్‌, బంగ్లాదేశ్‌ టైగర్స్‌) పాల్గొంటున్నాయి. ఏషియా ప్రాంతానికి చెందిన మాజీ స్టార్‌ క్రికెటర్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. ఇండియన్‌ రాయల్స్‌ తరఫున టీమిండియా స్టార్లు శిఖర్‌ ధవన్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌, యూసఫ్‌ పఠాన్‌, అంబటి రాయుడు, మనోజ్‌ తివారి, మునాఫ్‌ పటేల్‌ తదితర స్టార్లు ఆడుతున్నారు.

Simmons And Rampaul Lead West Indies Masters To IML 2025 Semi Final With 2 Run Victory Over South Africa Masters2
లేటు వయసులోనూ రెచ్చిపోతున్న దిగ్గజాలు.. మాస్టర్స్‌ లీగ్‌లో మరో సెంచరీ

క్రికెట్‌ దిగ్గజాలు లేటు వయసులోనూ రెచ్చిపోతున్నారు. యువ ఆటగాళ్లకు తామేమీ తీసిపోమని పరుగుల వరద పారిస్తున్నారు. దిగ్గజాల కోసం తొలిసారి నిర్వహించిన ఇంటర్నేషనల్‌ మాస్టర్స్‌ లీగ్‌లో మాజీ క్రికెటర్లు సెంచరీల మోత మోగిస్తున్నారు. ఈ టోర్నీలో ఇప్పటివరకు 14 మ్యాచ్‌లు జరగ్గా ఏకంగా ఏడు సెంచరీలు నమోదయ్యాయి. ఇందులో ఆసీస్‌ దిగ్గజం షేన్‌ వాట్సన్‌ ఒక్కడే 3 సెంచరీలు బాదాడు. ఇంగ్లండ్‌ మాజీ ఆటగాడు బెన్‌ డంక్‌, శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర, శ్రీలంక మాజీ బ్యాటర్‌ ఉపుల్‌ తరంగ, తాజాగా విండీస్‌ మాజీ ప్లేయర్‌ లెండిల్‌ సిమన్స్‌ తలోసారి శతక్కొట్టారు. ఈ టోర్నీలో భారత్‌ తరఫున ఒక్క సెంచరీ కూడా నమోదు కానప్పటికీ.. దిగ్గజ బ్యాటర్‌ సచిన్‌ టెండూల్కర్‌, అంబటి రాయుడు, యూసఫ్‌ పఠాన్‌, గురుకీరత్‌ సింగ్‌, సౌరభ్‌ తివారి తలో హాఫ్‌ సెంచరీ చేశారు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీ చేసిన సచిన్‌ పూర్వపు రోజుల గుర్తు చేశాడు.నిన్నటి మ్యాచ్‌ విషయానికొస్తే.. సౌతాఫ్రికా మాస్టర్స్‌పై విండీస్‌ మాస్టర్స్‌ 29 పరుగుల తేడాతో విజయం సాధించారు. ఈ మ్యాచ్‌లో విండీస్‌ బ్యాటర్‌ లెండిల్‌ సిమన్స్‌ చెలరేగిపోయాడు. కేవలం 54 బంతుల్లోనే శతకొట్టాడు. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తంగా 59 బంతుల ఎదుర్కొన్న సిమన్స్‌ 13 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 108 పరుగులు చేశాడు. విండీస్‌ ఇన్నింగ్స్‌ చివర్లో చాడ్విక్‌ వాల్టన్‌ (12 బంతుల్లో 38 నాటౌట్‌; 6 సిక్సర్లు) సిక్సర్ల సునామీ సృష్టించడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన విండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. డ్వేన్‌ స్మిత్‌, పెర్కిన్స్‌ తలో 5 పరుగులు చేయగా.. దిగ్గజ ఆటగాడు బ్రియాన్‌ లారా 29, ఆష్లే నర్స్‌ డకౌటయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో క్రూగర్‌, ఎన్తిని తలో 2 వికెట్లు తీయగా.. మెక్‌ లారెన్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు.అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. రవి రాంపాల్‌ 5 వికెట్లతో విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 171 పరుగులు మాత్రమే చేయగలిగింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో రిచర్డ్‌ లెవి 44, జాక్‌ కల్లిస్‌ 45, జాక్‌ రుడాల్ఫ్‌ 39 పరుగులు చేశారు. హషిమ్‌ ఆమ్లా (3), అల్విరో పీటర్సన్‌ (7) లాంటి స్టార్లు విఫలమయ్యారు. ఈ టోర్నీలో శ్రీలంక, భారత్‌, వెస్టిండీస్‌, ఆస్ట్రేలియా ఇదివరకే సెమీస్‌కు అర్హత సాధించగా.. సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌ నిష్క్రమించాయి. శ్రీలంక, భారత్‌ తలో 5 మ్యాచ్‌ల్లో 4 మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి.

WPL 2025: Delhi Capitals Enters Into Finals Third Time In A Row3
ఢిల్లీ క్యాపిటల్స్‌ హ్యాట్రిక్‌

మహిళల ఐపీఎల్‌లో (WPL) ఢిల్లీ క్యాపిటల్స్‌ హ్యాట్రిక్‌ సాధించింది. వరుసగా మూడో సీజన్‌లో ఫైనల్‌కు చేరింది. డబ్ల్యూపీఎల్‌-2025లో టేబుల్‌ టాపర్‌గా నిలువడం ద్వారా ఈ ఘనత సాధించింది. గత రెండు సీజన్లలో ఫైనల్‌కు చేరినా ఢిల్లీకి టైటిల్‌ అందని ద్రాక్షాలానే ఉంది. మెగ్‌ లాన్నింగ్‌ సేన ఈసారైనా టైటిల్‌ నెగ్గుతుందో లేదో చూడాలి. డబ్ల్యూపీల్‌ ప్రారంభం (2023) నాటి నుంచి అద్భుత విజయాలు సాధిస్తూ వస్తున్న ఢిల్లీ.. ఫైనల్లో మాత్రం ప్రత్యర్ధులకు తలోగ్గుతుంది. 2023 సీజన్‌ ఫైనల్లో ముంబై ఇండియన్స్‌ చేతిలో ఓడిన ఢిల్లీ.. గత సీజన్‌ ఫైనల్లో ఆర్సీబీ చేతిలో చిత్తైంది. ఈసారి ఫైనల్లో ఢిల్లీ ప్రత్యర్థి ఎవరో తేలాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాలి. ముంబై ఇండియన్స్‌, గుజరాత్‌ జెయింట్స్‌ మధ్య రేపు (మార్చి 13) జరుగబోయే ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో విజేతతో ఢిల్లీ ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటుంది.కాగా, ప్రస్తుత సీజన్‌లో మెగ్‌ లాన్నింగ్‌ నేతృత్వంలోని ఢిల్లీ జట్టు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించి టేబుల్‌ టాపర్‌గా నిలిచి దర్జాగా ఫైనల్‌కు చేరింది. టేబుల్‌ టాపర్‌ అయ్యే అవకాశాన్ని ముంబై ఇండియన్స్‌ తృటిలో కోల్పోయింది. నిన్న (మార్చి 11) జరిగిన చివరి గ్రూప్‌ మ్యాచ్‌లో ముంబై ఆర్సీబీ చేతిలో ఓడి రెండో స్థానంతో సరిపెట్టుకుంది. ముంబై సైతం 8 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించినప్పటికీ.. ఆ జట్టు రన్‌రేట్‌ ఢిల్లీ కంటే కాస్త తక్కువగా ఉంది. ఢిల్లీ 0.396 రన్‌రేట్‌ కలిగి ఉండగా.. ముంబై 0.192 రన్‌రేట్‌తో గ్రూప్‌ దశ ముగించింది. నిన్నటి మ్యాచ్‌లో ముంబై ఆర్సీబీ చేతిలో ఓడినప్పటికీ రన్‌రేట్‌ ఇంకాస్త పెంచుకుని ఉంటే ఫైనల్‌కు చేరేది. అక్కడికి మెరుగైన రన్‌రేట్‌ సాధించేందుకు ముంబై తీవ్రంగా పోరాడింది.తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ 199 పరుగులు చేయగా.. ముంబై పరుగుల వేట 188 పరుగుల వద్దే ఆగిపోయింది. ఈ ఎడిషన్‌లో ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అయిన మరో జట్టు గుజరాత్‌ జెయింట్స్‌. గత రెండు సీజన్లలో అట్టడుగు స్థానంలో నిలిచిన గుజరాత్‌.. ఈ సీజన్‌లో అనూహ్య విజయాలు సాధించి ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ దక్కించుకుంది. ఈ సీజన్‌లో గుజరాత్‌ 8లో 4 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది.ఇక డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఆర్సీబీ.. ఆదిలో అదిరిపోయే విజయాలు సాధించినప్పటికీ ఆతర్వాత వరుసగా ఐదు ఓటములు ఎదుర్కొని ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది. నిన్న ముంబైతో జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లో మంచి స్కోర్‌ చేసి గెలవడంతో ఆర్సీబీ నాలుగో స్థానాన్నైనా దక్కించుకోగలిగింది. ఈ మ్యాచ్‌లో ఓడినా లేక నామమాత్రంగా గెలిచినా ఈ సీజన్‌లో ఆర్సీబీ ఆఖరి స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చేది. ఈ సీజన్‌లో ఆ జట్టు ఎనిమిదింట మూడు విజయాలు సాధించింది. యూపీ వారియర్జ్‌ విషయానికొస్తే.. ఈ జట్టు గత రెండు సీజన్ల లాగే ఈ సీజన్‌లోనూ నామమాత్రపు ప్రదర్శనలు చేసి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది. యూపీ ఈ సీజన్‌లో ఆర్సీబీ లాగే 8 మ్యచ్‌ల్లో 3 గెలిచి చివరి స్థానంలో నిలిచింది. యూపీతో పోలిస్తే ఆర్సీబీ రన్‌రేట్‌ కాస్త మెరుగ్గా ఉంది. మార్చి 15న ముంబైలోని బ్రబోర్న్‌ స్టేడియంలో జరిగే ఫైనల్లో ఢిల్లీ.. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో విజేతతో తలపడుతుంది.

Young Grandmaster Pranav Venkatesh wins World Junior Chess Championship title4
ప్రణామ్‌ ప్రణవ్‌

ఆరేళ్ల వయసులో ఎత్తులు వేయడం నేర్చుకున్న ఆ చిన్నారి... పదహారేళ్లు వచ్చేసరికి గ్రాండ్‌మాస్టర్‌ హోదా దక్కించుకున్నాడు. మ్యాచ్‌కు ముందు పావులతో ప్రాక్టీస్‌ చేయడం పక్కనపెట్టి క్రికెట్, టేబుల్‌ టెన్నిస్, బ్యాడ్మింటన్‌ ఇలా వేర్వేరు ఆటల్లో నిమగ్నమయ్యే అలవాటున్న ఆ కుర్రాడు... తాజాగా మరో ఘనత తన పేరిట లిఖించుకున్నాడు. విశ్వ చదరంగ వేదికపై భారత జోరు సాగుతున్న క్రమంలో... ఆ కుర్రాడు ప్రపంచ చాంపియన్‌గా అవతరించాడు. ఇటీవల మోంటెనిగ్రోలో జరిగిన ప్రపంచ జూనియర్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ అండర్‌–20 ఓపెన్‌ విభాగంలో విజేతగా నిలిచిన ఆ కుర్రాడే... ప్రణవ్‌ వెంకటేశ్‌! రెండేళ్ల క్రితమే గ్రాండ్‌మాస్టర్‌ హోదా దక్కించుకున్న ఈ తమిళనాడు యువ సంచలనం... భవిష్యత్తులో నిలకడగా విజయాలు సాధించడమే తన లక్ష్యమని అంటున్నాడు. చదరంగానికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన చెన్నైకి చెందిన ఈ కుర్రాడి ప్రస్థానాన్ని ఓసారి పరిశీలిస్తే... – సాక్షి క్రీడావిభాగం జూనియర్‌ ప్రపంచ చెస్‌ చాంపియన్‌షిప్‌ ప్రారంభానికి సరిగ్గా ఏడాది క్రితం... ప్రణవ్‌ ప్రయాణం క్రికెట్‌ మైదానంలో మొదలైంది. అదేంటి అప్పటికే గ్రాండ్‌మాస్టర్‌ హోదా దక్కించుకున్న ప్రణవ్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ నుంచి ప్రాక్టీస్‌ ప్రారంభించడం ఏంటి అని సందేహిస్తున్నారా? ప్లేయర్లు ఆటవిడుపు కోసం అప్పుడప్పుడు వేరే క్రీడలు ఆడటం పరిపాటే! అలాగే చెన్నైలోని పెరంబూరు సమీపంలోని చెస్‌ అకాడమీలో సీనియర్‌ గ్రాండ్‌మాస్టర్‌ శ్యామ్‌సుందర్‌ నిర్వహిస్తున్న కోచింగ్‌కు వరుణ్‌ హాజరయ్యాడు. ఆటగాళ్లను శారీరకంగా చురుకుగా ఉంచడంతో పాటు వారిలో ఉత్సాహం నింపేందుకు నిర్వహిస్తున్న క్యాంప్‌లో ప్రణవ్‌ క్రికెట్‌ పాఠాలు నేర్చుకున్నాడు. అప్పటి వరకు శ్యామ్‌సుందర్‌ వద్ద శిక్షణ తీసుకోని వరుణ్‌... ఆ తర్వాత అతడితో అనుబంధం పెంచుకున్నాడు. గతంలో ఇతర కోచ్‌ల వద్ద ట్రైనింగ్‌ తీసుకున్న అతడు... శ్యామ్‌లో ఓ సోదరుడిని చూసుకున్నాడు. తన ఆలోచనలకు దగ్గరగా ఉన్న శ్యామ్‌తో ప్రయాణం తనకు లాభసాటి అని భావించి తండ్రి వెంకటేశ్‌ అనుమతితో అతడి దగ్గర శిష్యరికం ప్రారంభించాడు. క్లాసికల్‌ కష్టమైనా... బ్లిట్జ్‌ గేమ్‌లో చక్కటి ప్రదర్శన కనబర్చిన ప్రణవ్‌ ఇప్పటికే ఆన్‌లైన్‌ మ్యాచ్‌ల్లో మాగ్నస్‌ కార్ల్‌సన్‌ వంటి ప్రపంచ చాంపియన్‌లపై విజయాలు సాధించాడు. ప్రారంభంలో బ్లిట్జ్‌ నుంచి క్లాసికల్‌కు మారేందుకు కాస్త సమయం తీసుకున్న ప్రణవ్‌... ఆ తర్వాత ఫార్మాట్‌తో సంబంధం లేకుండా మెరుగైన ఆటతీరు కనబర్చడం ప్రారంభించాడు. శ్యామ్‌ వద్ద శిక్షణ ప్రారంభించిన రెండు నెలలకే స్పెయిన్‌ వేదికగా జరిగిన టోర్నీల్లో పాల్గొనేందుకు వరుణ్‌ విరామం తీసుకున్నాడు. ఆ సమయంలో సరైన ఫలితాలు రాకపోవడంతో... మరింత సమయం తీసుకున్న శ్యామ్‌... వరుణ్‌ ఆటతీరుకు తగ్గట్లు ప్రణాళికలు రూపొందించడం ప్రాంరభించాడు. ఆ దిశగా కసరత్తు చేయడంతో... దుబాయ్‌ చాంపియన్‌షిప్, షార్జా మాస్టర్స్‌లో అతడు విజేతగా నిలిచాడు. గతేడాది డిసెంబర్‌లో చెన్నై చాలెంజర్స్‌ ఇన్విటేషనల్‌ టోర్నీలో విజేతగా నిలవడం ద్వారా ప్రణవ్‌ ప్రతిష్టాత్మక చెన్నై మాస్టర్స్‌ టోర్నీకి అర్హత సాధించాడు. బాటిల్‌ మూతలతో క్రికెట్‌... మ్యాచ్‌కు ముందు ఆటవిడుపుగా క్రికెట్, టేబుల్‌ టెన్నిస్, షటిల్‌ ఆడటం ప్రణవ్‌కు అలవాటు. దీంతో హోటల్‌ రూమ్‌లో బాటిల్‌ మూతలను బాల్‌గా భావించి మంచి నీళ్ల సీసాలతోనే కోచ్‌ శ్యామ్‌తో కలిసి క్రికెట్‌ ఆడేవాడు. దీంతోనే ఇతర ఆలోచనలు దరిచేరనివ్వకుండా మనసును లగ్నం చేసుకునే వాడు. సామాజిక మాధ్యమాలకు కూడా దూరంగా ఉండేవాడు. ప్రపంచ జానియర్‌ చెస్‌ చాంపియన్‌సిప్‌ ప్రారంభానికి ముందు కొన్ని ఆన్‌లైన్‌ సెషన్‌లలో పాల్గొన్న ప్రణవ్‌... ప్రత్యర్థిపై కాస్త ఆధిక్యం దక్కినా... దాన్ని కొనసాగిస్తూ మరిన్ని అవకాశాలు సృష్టించుకోవడాన్ని అలవాటుగా చేసుకున్నాడు. శిక్షణ సమయంలో విభిన్న ప్రత్యామ్నాయాలను ప్రయత్నించే ప్రణవ్‌... ఒక్కసారి మ్యాచ్‌ ప్రారంభమైతే... ప్రత్యర్థి ఆటతీరును బట్టి ప్రణాళికలు మార్చుకోవడంలో ఆరితేరాడు. దాని ఫలితమే... విశ్వనాథన్‌ ఆనంద్‌ (1987), పెంటేల హరికృష్ణ (2004), అభిజిత్‌ గుప్తా (2008) తర్వాత... ప్రపంచ జూనియర్‌ చెస్‌ చాంపియన్‌గా నిలిచిన నాలుగో భారత ప్లేయర్‌గా ప్రణవ్‌ గుర్తింపు పొందాడు. అజేయంగా... తాజా ప్రపంచ జూనియర్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ అండర్‌–20 ఓపెన్‌ విభాగంలో మొత్తం 11 రౌండ్ల పాటు పోటీలు జరగగా... ప్రణవ్‌ 9 పాయింట్లతో అగ్ర స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో 7 గేమ్‌లు గెలిచిన ప్రణవ్‌... మిగిలిన 4 గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని అజేయంగా వరల్డ్‌ చాంపియన్‌ టైటిల్‌ కైవసం చేసుకున్నాడు. ‘ఆటలో క్లిష్ట పరిస్థితులు ఎదురైనా... ఏమాత్రం వెనక్కి తగ్గని ప్రణవ్‌... ఏ క్షణంలోనూ ఆత్మవిశ్వాసం కోల్పోడు. ఇద్దరం తమిళనాడుకు చెందిన వాళ్లమే కావడంతో... తమిళంలోనే మాట్లాడుకుంటాం. దీంతో ఒకరి భావాలు మరొకరం సులభంగా అర్థం చేసుకుంటాం. కామెడీ సినిమాలను ఎక్కువ ఇష్టపడే ప్రణవ్‌... ఆట తప్ప వేరే ఆలోచనలను దరిచేరనివ్వడు. ఆ క్రమశిక్షణే అతడిని ఈ స్థాయికి తెచ్చింది. చదరంగ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ తరహాలో నిలకడ కొనసాగించడమే ప్రణవ్‌ లక్ష్యం’ అని 32 ఏళ్ల శ్యామ్‌ వివరించాడు. క్రికెట్‌కు వీరాభిమాని... క్రికెట్‌ను విపరీతంగా అభిమానించే ప్రణవ్‌ కు... నేటి తరం ప్రేక్షకుల్లాగే టెస్టుల కన్నా... వన్డే, టి20 ఫార్మాట్‌లంటేనే ఎక్కువ ఇష్టం. చదరంగంలో క్లాసికల్‌ గేమ్‌ టెస్టుల మాదిరి కాగా... వన్డే, టి20ల వంటి ర్యాపిడ్, బ్లిట్జ్‌లో ప్రణవ్‌ వేగం శ్యామ్‌సుందర్‌ను ఆకట్టుకుంది. కాస్త సానబెడితే అద్భుతాలు సాధించగల సత్తా అతడిలో ఉందని గుర్తించిన శ్యామ్‌ ఆ దిశగా ప్రయాణం ప్రారంభించాడు. ఏడాది శిక్షణలో అతడికిష్టమైన ర్యాపిడ్‌ బ్లిట్జ్‌లో మరింత మెరుగు పరుస్తూనే... సంపద్రాయ క్లాసికల్‌పై కూడా ఆసక్తి పెరిగేలా చేశాడు. ‘గత సంవత్సరం జనవరి నుంచి అధికారికంగా మేమిద్దరం కలిసి పనిచేస్తున్నాం. అప్పటికే గ్రాండ్‌మాస్టర్‌ అయిన ప్రణవ్‌ను మరింత మెరుగు పర్చేందుకు తగిన ప్రణాళికలు రూపొందించాను. టి20 క్రికెట్‌లో దూకుడుగా ఆడేందుకు వీలుంటుంది. అదే టెస్టు క్రికెట్‌లో ఓపిక ముఖ్యం. ప్రణవ్‌ కూడా క్విక్‌ ఫార్మాట్‌లో చక్కటి ప్రదర్శన చేస్తున్నాడు. కానీ సుదీర్ఘ ఫార్మాట్‌ వంటి క్లాసికల్‌లో మరింత ప్రావీణ్యం పొందే విధంగా తర్ఫీదునిచ్చాను’ అని శ్యామ్‌ సుందర్‌ విరించాడు.

RCB defeated Mumbai Indians by 11 runs in the last league match5
బెంగళూరు గెలిచింది

ముంబై: ఉమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో నిలిచి నేరుగా ఫైనల్‌ చేరాలనుకున్న ముంబై ఆశలపై డిఫెండింగ్‌ చాంప్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) నీళ్లు చల్లింది. డబ్ల్యూపీఎల్‌ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 11 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. దీంతో రెండో స్థానంతోనే సరిపెట్టుకున్న హర్మన్‌ప్రీత్‌ సేన ఫైనల్‌కు అర్హత సాధించేందుకు రేపు గుజరాత్‌ జెయింట్స్‌తో ‘ప్లేఆఫ్‌’ మ్యాచ్‌ ఆడనుంది. వరుసగా ఐదు ఓటముల తర్వాత ఆర్‌సీబీ విజయం సాధించడం విశేషం. తాజా ఫలితంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ వరుసగా మూడో సీజన్‌లోనూ ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఢిల్లీ, ముంబై చెరో 10 పాయింట్లతో సమంగా నిలిచినా ... రన్‌రేట్‌తో క్యాపిటల్స్‌ ముందంజ వేసింది. 2023, 2024లలో కూడా ఢిల్లీ ఫైనల్‌ చేరినా... రన్నరప్‌గానే సరిపెట్టుకుంది. మంగళవారం జరిగిన పోరులో టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ స్మృతి మంధాన (37 బంతుల్లో 53; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఎలీస్‌ పెరీ (38 బంతుల్లో 49 నాటౌట్‌; 5 ఫోర్లు, 1 సిక్స్‌) చెలరేగారు. అనంతరం కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసి పోరాడి ఓడింది. నాట్‌ సివర్‌ బ్రంట్‌ (35 బంతుల్లో 69; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిపించింది. బెంగళూరు బౌలర్లలో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ స్నేహ్‌ రాణా (3/26) మూడు... కిమ్‌ గార్త్, పెరీ చెరో రెండు వికెట్లు తీశారు. అందరూ ధాటిగా... బెంగళూరు జట్టులో క్రీజులోకి దిగినవారంతా ధాటిగా పరుగులు సాధించారు. సబ్బినేని మేఘన (13 బంతుల్లో 26; 4 ఫోర్లు, 1 సిక్స్‌), కెప్టెన్‌స్మృతి ఓపెనింగ్‌ వికెట్‌కు 22 బంతుల్లో 41 పరుగులు జోడించారు. తర్వాత కెప్టెన్‌ మంధానకు జతయిన ఎలీస్‌ పెరీ కూడా వేగంగా ఆడటంతో బెంగళూరు స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. వీళ్లిద్దరు రెండో వికెట్‌కు 59 పరుగులు జోడించారు. స్మృతి నిష్క్రమణతో క్రీజులోకి వచ్చిన రిచా ఘోష్‌ (22 బంతుల్లో 36; 5 ఫోర్లు, 1 సిక్స్‌) తనదైన శైలిలో దూకుడు కనబరిచింది. రిచా, పెరీలిద్దరూ జట్టు స్కోరును 150 పరుగులు దాటించారు. అనంతరం రిచా జోరుకు హేలీ అడ్డుకట్ట వేసింది. అయితే జార్జియా వేర్‌హామ్‌ (10 బంతుల్లో 31 నాటౌట్‌; 5 ఫోర్లు, 1 సిక్స్‌) డెత్‌ ఓవర్లలో చెలరేగడంతో ప్రత్యర్థి ముందు 200 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రాణించిన నాట్‌ సివర్‌ ముంబై ఆరంభంలోనే తడబడింది. ఓపెనర్లు హేలీ మాథ్యూస్‌ (19), అమెలియా కెర్‌ (9) భారీ లక్ష్యానికి అనువైన శుభారంభాన్ని ఇవ్వలేకపోయారు. నాట్‌ సివర్‌ బ్రంట్‌ చక్కగా పోరాడినప్పటికీ తర్వాత వచ్చిన బ్యాటర్లు వికెట్లు పారేసుకోవడంతో ముంబై జట్టు లక్ష్యానికి దూరమైంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ (20; 2 ఫోర్లు), అమన్‌జోత్‌ (17) ప్రభావం చూపలేకపోగా... ఆఖరి ఓవర్లో సజీవన్‌ సజన (12 బంతుల్లో 23; 1 ఫోర్, 2 సిక్స్‌లు) భారీ షాట్లతో వణికించింది. 3 బంతుల్లో 12 పరుగులు చేయాల్సిన దశలో ఆమె కూడా అవుట్‌ కావడంతో ముంబైకి ఓటమి ఖాయమైంది. స్కోరు వివరాలు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: మేఘన (సి) పారుణిక (బి) హేలీ మాథ్యూస్‌ 26; స్మృతి (సి) షబి్నమ్‌ (బి) అమెలియా 53; ఎలీస్‌ పెరీ నాటౌట్‌ 49; రిచా ఘోష్‌ (సి) నాట్‌ సివర్‌ (బి) హేలీ మాథ్యూస్‌ 36; జార్జియా నాటౌట్‌ 31; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 199. వికెట్ల పతనం: 1–41, 2–100, 3–153. బౌలింగ్‌: షబ్నిమ్‌ ఇస్మాయిల్‌ 4–0–41–0, నాట్‌ సివర్‌ 2–0–16–0, హేలీ మాథ్యూస్‌ 4–0–37–2, అమన్‌జోత్‌ 4–0–27–0, అమెలియా కెర్‌ 3–0–47–1, సంస్కృతి గుప్తా 1–0–6–0, పారుణిక సిసోడియా 2–0–24–0. ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: హేలీ మాథ్యూస్‌ (సి) గ్రాహమ్‌ (బి) స్నేహ్‌ రాణా 19; అమెలియా (సి) మంధాన (బి) స్నేహ్‌ రాణా 9; నాట్‌ సీవర్‌ (సి అండ్‌ బి) పెరీ 69; హర్మన్‌ప్రీత్‌ (సి) రిచా ఘోష్‌ (బి) కిమ్‌ గార్త్‌ 20; అమన్‌జోత్‌ (బి) గ్రాహమ్‌ 17; యస్తిక భాటియా (సి అండ్‌ బి) స్నేహ్‌ రాణా 4; సజన (సి) మేఘన (బి) పెరీ 23; కమలిని (సి) పెరీ (బి) జార్జియా 6; సంస్కృతి (సి) జోషిత (బి) కిమ్‌ గార్త్‌ 10; షబ్నిమ్‌ నాటౌట్‌ 4; పారుణిక నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 188. వికెట్ల పతనం: 1–27, 2–38, 3–78, 4–129, 5–134, 6–140, 7–152, 8–167, 9–188. బౌలింగ్‌: కిమ్‌ గార్త్‌ 4–0–33–2, ఎలీస్‌ పెరీ 4–0–53–2, స్నేహ్‌ రాణా 4–0–26–3, హిథెర్‌ గ్రాహమ్‌ 4–0–47–1, జార్జియా వేర్‌హామ్‌ 4–0–29–1.

Sports Ministry lifts suspension on Wrestling Federation of India6
భారత రెజ్లర్లకు ఊరట

న్యూఢిల్లీ: భారత రెజ్లర్లకు మేలు చేసే కీలక నిర్ణయాన్ని కేంద్ర క్రీడాశాఖ తీసుకుంది. భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ)పై విధించిన సస్పెన్షన్‌ను క్రీడా శాఖ ఎత్తేసింది. డబ్ల్యూఎఫ్‌ఐ మాజీ చీఫ్‌ బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై స్టార్‌ రెజ్లర్ల లైంగిక ఆరోపణలు దరిమిలా చుట్టుముట్టిన వివాదాలు, కోర్టు కేసుల అనంతరం 15 నెలల క్రితం కొత్త కార్యవర్గం కొలువు దీరింది. కానీ రోజుల వ్యవధిలోనే కేంద్ర క్రీడా శాఖ ఆగ్రహానికి గురైంది. దీంతో పలు అంతర్జాతీయ ఈవెంట్లలో భారత రెజ్లర్లు పాల్గొనేందుకు ఇబ్బందులెదురవుతున్నాయి. రెజ్లర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు నిషేధాన్ని ఎత్తేసింది. కేంద్ర క్రీడా శాఖ మార్గదర్శకాలను డబ్ల్యూఎఫ్‌ఐ పాటించడంతో పాటు రెజ్లర్ల విస్తృత ప్రయోజనాలను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ శాఖ అధికారులు వెల్లడించారు. క్రీడాపాలసీ ప్రకారం డబ్ల్యూఎఫ్‌ఐ నడచుకోవాలని, వివాదాస్పద, కళంకిత అధికారులు, పాత కార్యవర్గ సభ్యులకు దూరంగా ఉండాలని, లేదంటే కఠిన చర్యలకు వెనుకాడమని క్రీడా శాఖ హెచ్చరించినట్లు తెలిసింది. డబ్ల్యూఎఫ్‌ఐ కార్యకలాపాలు మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ ఇంటినుంచే నిర్వహిస్తున్నారనే విమర్శలపై క్రీడాశాఖ పర్యవేక్షక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ప్రత్యక్ష పరిశీలన అనంతరం ఇచి్చన నివేదికను బట్టే తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దీంతో వచ్చే ఏషియాడ్‌ (2026), లాస్‌ ఏంజెలెస్‌ (2028) ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలనుకునే రెజ్లర్లకు కొండంత ఆత్మవిశ్వాసం లభించినట్లయ్యింది. క్రీడాశాఖ నిర్ణయంపై డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు సంజయ్‌ సింగ్‌ హర్షం వ్యక్తం చేశారు. ‘ప్రభుత్వానికి కృతజ్ఞతలు. సస్పెన్షన్‌ తొలగిపోవడంతో ఇక మా కార్యకలాపాలు సజావుగా జరిగేందుకు అవకాశం లభించింది. రెజ్లింగ్‌ క్రీడ అభ్యున్నతికి ఇలాంటి నిర్ణయం ఎంతో అవసరం కూడా! ఇప్పటికే ప్రతిభావంతులైన రెజ్లర్లు పలు అంతర్జాతీయ ఈవెంట్లకు దూరమయ్యారు. ఇకనుంచి వారంతా పతకాల కోసం పోటీపడొచ్చు’ అని అన్నారు. క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయ మాట్లాడుతూ సస్పెన్షన్‌ను ఇంకా కొనసాగిస్తే రెజ్లర్లకు అన్యాయం చేసిన వారమవుతామని చెప్పారు. రెజ్లర్లు అంతర్జాతీయ క్రీడావేదికలపై రాణించాలనే సదుద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. డబ్ల్యూఎఫ్‌ఐ మాజీ చీఫ్‌ బ్రిజ్‌భూషణ్‌ మాట్లాడుతూ తనపై చేసిన తప్పుడు ఆరోపణలేవీ నిలబడలేదని చెప్పుకొచ్చారు.

Mixed results for India at All England Badminton Championship7
లక్ష్యసేన్‌ శుభారంభం

బర్మింగ్‌హమ్‌: ప్రతిష్టాత్మక ఆల్‌ ఇంగ్లండ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ తొలి రోజు భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. తొలి రౌండ్‌లో లక్ష్యసేన్, మాళవిక బన్సోద్‌ విజయాలు సాధించి ముందంజ వేయగా... హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ పరాజయంతో ఇంటిబాట పట్టాడు. బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–1000 టోర్నీ పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో మంగళవారం ప్రపంచ 15వ ర్యాంకర్‌ లక్ష్యసేన్‌ 13–21, 21–17, 21–15తో ప్రపంచ 37వ ర్యాంకర్‌ లి యాంగ్‌ సు (చైనీస్‌ తైపీ)పై విజయం సాధించాడు. గంటా 15 నిమిషాల పాటు సాగిన పోరు తొలి గేమ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన లక్ష్య... హోరాహోరీగా సాగిన రెండో గేమ్‌ 17–17తో సమంగా ఉన్న సమయంలో చైనీస్‌ తైపీ షట్లర్‌ తప్పిదాలతో వరుస పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు. నిర్ణయాత్మక మూడో గేమ్‌ ఆరంభం నుంచే దూకుడు కనబర్చిన లక్ష్యసేన్‌... నెట్‌ గేమ్‌తో ప్రత్యర్థిని ఉక్కిరి బిక్కిరి చేసి 11–9తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అయితే పట్టువదలని చైనీస్‌ తైపీ షట్లర్‌ 15–15తో స్కోరు సమం చేశాడు. అక్కడి నుంచి విజృంభించిన లక్ష్యసేన్‌... బలమైన రిటర్న్‌లతో చెలరేగి వరుసగా ఆరు పాయింట్లు సాధించి ప్రిక్వార్టర్స్‌కు చేరాడు. ఈ మ్యాచ్‌లో మూడో సీడ్‌ జొనాథన్‌ క్రిస్టి (ఇండోనేసియా)తో లక్ష్యసేన్‌ తలపడతాడు. 2024 పారిస్‌ ఒలింపిక్స్‌ కాంస్య పతక పోరులో క్రిస్టి చేతిలో ఓడిన లక్ష్యసేన్‌... ఆ పరాజయానికి బదులు తీర్చుకునేందుకు ఇది చక్కటి అవకాశం. మరో మ్యాచ్‌లో ప్రపంచ 29వ ర్యాంకర్‌ ప్రణయ్‌ 19–21, 16–21తో ప్రపంచ 17వ ర్యాంకర్‌ టోమా జూనియర్‌ పొపోవ్‌ (ఫ్రాన్స్‌) చేతిలో పరాజయం పాలయ్యాడు. 53 నిమిషాల పాటు సాగిన పోరులో ప్రణయ్‌ వరుస గేమ్‌ల్లో ఓడాడు. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో రైజింగ్‌ స్టార్‌ మాళవిక బన్సోద్‌ 21–13, 10–21, 21–17తో జియా మిన్‌ యో (సింగపూర్‌)పై విజయం సాధించింది. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో ద్వయం 20–22, 18–21తో చెన్‌ చెంగ్‌–సెయి పెయి షాన్‌ జంట చేతిలో ఓడింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సతీశ్‌ కుమార్‌ కరుణాకరన్‌–ఆద్య జంట 6–21, 15–21తో జిన్‌ వా–చెన్‌ ఫెంగ్‌ హుయి (చైనా) ద్వయం చేతిలో ఓడింది. భారత స్టార్‌ షట్లర్లు పీవీ సింధు, సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి బుధవారం బరిలోకి దిగనున్నారు. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో యున్‌ కిమ్‌ (దక్షిణ కొరియా)తో సింధు తలపడుతుంది. పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో డానియల్‌ లిండ్‌గార్డ్‌–మాడ్స్‌ వెస్టర్‌గాడ్‌ (డెన్మార్క్‌) జంటతో సాత్విక్‌–చిరాగ్‌ జోడీ ఆడుతుంది.

Indian womens kabaddi team gets huge cash prize8
భారత మహిళల కబడ్డీ జట్టుకు రూ. 67.50 లక్షల నగదు బహుమతి

ఆసియా కబడ్డీ చాంపియన్‌షిప్‌లో ఐదోసారి విజేతగా నిలిచిన భారత మహిళల జట్టుకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ రూ. 67.50 లక్షల నగదు బహుమతి అందించింది. ఇటీవల ఇరాన్‌ వేదికగా జరిగిన టోర్నీలో అజేయంగా నిలిచిన భారత మహిళల కబడ్డీ జట్టు... ఫైనల్లో 32–25 పాయింట్ల తేడాతో ఆతిథ్య ఇరాన్‌ జట్టును ఓడించింది. డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత జట్టు ఐదో సారి ఈ టోర్నీలో విజేతగా నిలిచింది.మంగళవారం స్వదేశానికి తిరిగి వచ్చిన భారత మహిళల కబడ్డీ జట్టును కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయ అభినందించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ... ‘మహిళా అథ్లెట్లను మరింత ప్రోత్సహించేందుకు ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాం. మహిళా కబడ్డీ ప్లేయర్లకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేకంగా కబడ్డీ లీగ్‌ను కూడా ప్రారంభించాలనుకుంటున్నాం’ అని అన్నారు.

AB de Villiers Turns Back The Clock, Slams 15 Sixes, Completes Century In 28 Balls9
ఏబీ డివిలియ‌ర్స్ విధ్వంసం.. 28 బంతుల్లో సెంచ‌రీ

ద‌క్షిణాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియ‌ర్స్‌ త‌న ప్రొఫెషనల్ క్రికెట్ రీ ఎంట్రీ మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించాడు. ఐపీఎల్‌-2021 తర్వాత ప్రొఫెషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన డివిలియర్స్‌.. తిరిగి సీఎస్‌ఎ లీగ్‌తో పునరాగమనం చేశాడు. ఈ లీగ్‌లో టైటాన్ లెజెండ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న డివిలియర్స్‌.. బుల్స్ లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు.ఏబీడీ ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. క్రీజులోకి వచ్చినప్పటినుంచే బౌండరీల వర్షం కుర్పించాడు. ఈ క్రమంలో డివిలియర్స్ కేవలం 28 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 15 సిక్స్‌లతో 101 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.అతడి తుపాన్ ఇన్నింగ్స్ ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన టైటాన్ లెజెండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 278 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం లక్ష్య చేధనలో బుల్స్ లెజెండ్స్ 14 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. ఆ తర్వాత వరుణుడు ఎంట్రీ ఇవ్వడంతో టైటాన్ లెజెండ్స్‌ను విజేతగా ప్రకటించారు.డివిలియర్స్ ద‌క్షిణాఫ్రికా త‌రుపున 114 టెస్టులు, 228 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. మే 2018లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి త‌ప్పుకుని అంద‌రికి ఏబీడీ షాకిచ్చాడు. ఆ త‌ర్వాత 2019 వన్డే ప్రపంచ కప్‌లో ఆడాల‌ని డివిలియ‌ర్స్ భావించాడు. కానీ అత‌డి అభ్య‌ర్థ‌న‌ను క్రికెట్ దక్షిణాఫ్రికా తిరస్కరించింది. డివిలియ‌ర్స్‌కు అంత‌ర్జాతీయ క్రికెట్‌లో 20,014 ప‌రుగులు ఉన్నాయి. అదేవిధంగా 47 ఇంట‌ర్ననేష‌న‌ల్ సెంచ‌రీలు అత‌డి పేరిట ఉన్నాయి.డివిలియ‌ర్స్‌కు ఐపీఎల్‌లో కూడా మంచి రికార్డు ఉంది. 2011-2021 వరకు 11 ఏళ్లపాటు రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు (Royal Challengers Bengaluru) తరఫున ఆడాడు. అంత‌కుముందు కొన్ని సీజన్ల పాటు ఢిల్లీ డెర్‌డేవిల్స్‌కు ప్రాతినిథ్యం వ‌హించాడు. ఐపీఎల్‌లో మొత్తం 184 మ్యాచ్‌ల్లో 39.71 సగటు, 151.69 స్ట్రైక్‌రేట్‌తో 5,162 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 40 అర్ధ సెంచరీలున్నాయి.చదవండి: #R Ashwin: ఛాంపియ‌న్స్ ట్రోఫీ బెస్ట్ టీమ్‌.. రోహిత్ శ‌ర్మ‌కు షాక్‌

Shahid Afridi questions Shadab Khans inclusion in squad for NZ tour10
పాకిస్తాన్ క్రికెట్ ఐసీయూలో ఉంది.. అన్నీ మారుతాయి: అఫ్రిది

పాకిస్తాన్ క్రికెట్ జట్టు గత 18 నెలలగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. వన్డే ప్రపంచకప్‌-2023, టీ20 ప్రపంచకప్‌-2024లో లీగ్ స్టేజీలోనే ఇంటిముఖం పట్టిన పాకిస్తాన్‌... ఇప్పుడు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లోనూ అదే తీరును కనబరిచింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసిన పాక్ జట్టు.. గ్రూపు స్టేజిలోనే తమ ప్రయాణాన్ని ముగించింది. దీంతో పాకిస్తాన్ జట్టుపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి.ఈ క్రమంలో టీ20 జట్టు నుంచి కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్‌, స్టార్ ప్లేయర్లు బాబర్ ఆజం, షాహీన్ షా అఫ్రిదిలను పీసీబీ సెలక్షన్ కమిటీ తప్పించింది. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే గత ఏడాదిగా జట్టుగా దూరంగా ఉంటున్న ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్‌ను తీసుకొచ్చి ఏకంగా వైస్ కెప్టెన్సీ సెలక్టర్లు కట్టబెట్టారు. సెలక్టర్లు తీసుకున్న ఈ నిర్ణయాన్ని పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది తప్పుబట్టాడు."పాక్ జట్టులోకి ఎప్పుడు ఎవరు తిరిగి వస్తారో తెలియదు. దేశవాళీ క్రికెట్‌లో షాదాబ్ ఖాన్‌​ దారుణంగా విఫలమయ్యాడు. అతడిని తీసుకొచ్చి వైస్ కెప్టెన్‌గా చేశారు. మెరిట్ ఆధారంగా నిర్ణయాలు తీసుకోనప్పుడు జట్టు పరిస్థితి ఇలానే ఉంటుంది. ప్రస్తుతం టీ20 సెటాప్‌లో లేని వారిని కూడా తిరిగి ఎంపిక చేస్తున్నారు.పాకిస్తాన్ క్రికెట్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఈవెంట్‌కు పీసీబీ ప్రతినిధిని ఎందుకు ఆహ్వానించలేదనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. పాక్ క్రికెట్ ప్రస్తుతం ఐసీయూలో ఉంది. మేము బాగుచేయడానికి ముందుకు వస్తాము. కొత్త చైర్మన్ వచ్చిన వెంటనే, ప్రతిదీ మారుతుంది.ప్ర‌స్తుత క్రికెట్ బోర్డు ప్యాన‌ల్ మంచి జ‌ట్టును తయారు చేయడానికి సమయం కేటాయించడం లేదు. కెప్టెన్లు, కోచ్‌లను మార్చ‌డంలో బీజీగా ఉంది. ప్ర‌తీఒక్క‌రికి కొంతస‌మ‌య‌మివ్వాలి. కోచ్‌లు తమ ఉద్యోగాలను కాపాడుకోవడానికి ఆటగాళ్లపై నిందిస్తారు. కాబ‌ట్టి అన్ని ఆలోచించాక ఏ నిర్ణ‌య‌మైనా తీసుకోవాల‌ని" అఫ్రిది పేర్కొన్నాడు.చదవండి: #R Ashwin: ఛాంపియ‌న్స్ ట్రోఫీ బెస్ట్ టీమ్‌.. రోహిత్ శ‌ర్మ‌కు షాక్‌

Advertisement
Advertisement

క్రీడలు

 
Advertisement