Other Sports
-
ప్రణామ్ ప్రణవ్
ఆరేళ్ల వయసులో ఎత్తులు వేయడం నేర్చుకున్న ఆ చిన్నారి... పదహారేళ్లు వచ్చేసరికి గ్రాండ్మాస్టర్ హోదా దక్కించుకున్నాడు. మ్యాచ్కు ముందు పావులతో ప్రాక్టీస్ చేయడం పక్కనపెట్టి క్రికెట్, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ ఇలా వేర్వేరు ఆటల్లో నిమగ్నమయ్యే అలవాటున్న ఆ కుర్రాడు... తాజాగా మరో ఘనత తన పేరిట లిఖించుకున్నాడు. విశ్వ చదరంగ వేదికపై భారత జోరు సాగుతున్న క్రమంలో... ఆ కుర్రాడు ప్రపంచ చాంపియన్గా అవతరించాడు. ఇటీవల మోంటెనిగ్రోలో జరిగిన ప్రపంచ జూనియర్ చెస్ చాంపియన్షిప్ అండర్–20 ఓపెన్ విభాగంలో విజేతగా నిలిచిన ఆ కుర్రాడే... ప్రణవ్ వెంకటేశ్! రెండేళ్ల క్రితమే గ్రాండ్మాస్టర్ హోదా దక్కించుకున్న ఈ తమిళనాడు యువ సంచలనం... భవిష్యత్తులో నిలకడగా విజయాలు సాధించడమే తన లక్ష్యమని అంటున్నాడు. చదరంగానికి కేరాఫ్ అడ్రస్గా మారిన చెన్నైకి చెందిన ఈ కుర్రాడి ప్రస్థానాన్ని ఓసారి పరిశీలిస్తే... – సాక్షి క్రీడావిభాగం జూనియర్ ప్రపంచ చెస్ చాంపియన్షిప్ ప్రారంభానికి సరిగ్గా ఏడాది క్రితం... ప్రణవ్ ప్రయాణం క్రికెట్ మైదానంలో మొదలైంది. అదేంటి అప్పటికే గ్రాండ్మాస్టర్ హోదా దక్కించుకున్న ప్రణవ్ క్రికెట్ గ్రౌండ్ నుంచి ప్రాక్టీస్ ప్రారంభించడం ఏంటి అని సందేహిస్తున్నారా? ప్లేయర్లు ఆటవిడుపు కోసం అప్పుడప్పుడు వేరే క్రీడలు ఆడటం పరిపాటే! అలాగే చెన్నైలోని పెరంబూరు సమీపంలోని చెస్ అకాడమీలో సీనియర్ గ్రాండ్మాస్టర్ శ్యామ్సుందర్ నిర్వహిస్తున్న కోచింగ్కు వరుణ్ హాజరయ్యాడు. ఆటగాళ్లను శారీరకంగా చురుకుగా ఉంచడంతో పాటు వారిలో ఉత్సాహం నింపేందుకు నిర్వహిస్తున్న క్యాంప్లో ప్రణవ్ క్రికెట్ పాఠాలు నేర్చుకున్నాడు. అప్పటి వరకు శ్యామ్సుందర్ వద్ద శిక్షణ తీసుకోని వరుణ్... ఆ తర్వాత అతడితో అనుబంధం పెంచుకున్నాడు. గతంలో ఇతర కోచ్ల వద్ద ట్రైనింగ్ తీసుకున్న అతడు... శ్యామ్లో ఓ సోదరుడిని చూసుకున్నాడు. తన ఆలోచనలకు దగ్గరగా ఉన్న శ్యామ్తో ప్రయాణం తనకు లాభసాటి అని భావించి తండ్రి వెంకటేశ్ అనుమతితో అతడి దగ్గర శిష్యరికం ప్రారంభించాడు. క్లాసికల్ కష్టమైనా... బ్లిట్జ్ గేమ్లో చక్కటి ప్రదర్శన కనబర్చిన ప్రణవ్ ఇప్పటికే ఆన్లైన్ మ్యాచ్ల్లో మాగ్నస్ కార్ల్సన్ వంటి ప్రపంచ చాంపియన్లపై విజయాలు సాధించాడు. ప్రారంభంలో బ్లిట్జ్ నుంచి క్లాసికల్కు మారేందుకు కాస్త సమయం తీసుకున్న ప్రణవ్... ఆ తర్వాత ఫార్మాట్తో సంబంధం లేకుండా మెరుగైన ఆటతీరు కనబర్చడం ప్రారంభించాడు. శ్యామ్ వద్ద శిక్షణ ప్రారంభించిన రెండు నెలలకే స్పెయిన్ వేదికగా జరిగిన టోర్నీల్లో పాల్గొనేందుకు వరుణ్ విరామం తీసుకున్నాడు. ఆ సమయంలో సరైన ఫలితాలు రాకపోవడంతో... మరింత సమయం తీసుకున్న శ్యామ్... వరుణ్ ఆటతీరుకు తగ్గట్లు ప్రణాళికలు రూపొందించడం ప్రాంరభించాడు. ఆ దిశగా కసరత్తు చేయడంతో... దుబాయ్ చాంపియన్షిప్, షార్జా మాస్టర్స్లో అతడు విజేతగా నిలిచాడు. గతేడాది డిసెంబర్లో చెన్నై చాలెంజర్స్ ఇన్విటేషనల్ టోర్నీలో విజేతగా నిలవడం ద్వారా ప్రణవ్ ప్రతిష్టాత్మక చెన్నై మాస్టర్స్ టోర్నీకి అర్హత సాధించాడు. బాటిల్ మూతలతో క్రికెట్... మ్యాచ్కు ముందు ఆటవిడుపుగా క్రికెట్, టేబుల్ టెన్నిస్, షటిల్ ఆడటం ప్రణవ్కు అలవాటు. దీంతో హోటల్ రూమ్లో బాటిల్ మూతలను బాల్గా భావించి మంచి నీళ్ల సీసాలతోనే కోచ్ శ్యామ్తో కలిసి క్రికెట్ ఆడేవాడు. దీంతోనే ఇతర ఆలోచనలు దరిచేరనివ్వకుండా మనసును లగ్నం చేసుకునే వాడు. సామాజిక మాధ్యమాలకు కూడా దూరంగా ఉండేవాడు. ప్రపంచ జానియర్ చెస్ చాంపియన్సిప్ ప్రారంభానికి ముందు కొన్ని ఆన్లైన్ సెషన్లలో పాల్గొన్న ప్రణవ్... ప్రత్యర్థిపై కాస్త ఆధిక్యం దక్కినా... దాన్ని కొనసాగిస్తూ మరిన్ని అవకాశాలు సృష్టించుకోవడాన్ని అలవాటుగా చేసుకున్నాడు. శిక్షణ సమయంలో విభిన్న ప్రత్యామ్నాయాలను ప్రయత్నించే ప్రణవ్... ఒక్కసారి మ్యాచ్ ప్రారంభమైతే... ప్రత్యర్థి ఆటతీరును బట్టి ప్రణాళికలు మార్చుకోవడంలో ఆరితేరాడు. దాని ఫలితమే... విశ్వనాథన్ ఆనంద్ (1987), పెంటేల హరికృష్ణ (2004), అభిజిత్ గుప్తా (2008) తర్వాత... ప్రపంచ జూనియర్ చెస్ చాంపియన్గా నిలిచిన నాలుగో భారత ప్లేయర్గా ప్రణవ్ గుర్తింపు పొందాడు. అజేయంగా... తాజా ప్రపంచ జూనియర్ చెస్ చాంపియన్షిప్ అండర్–20 ఓపెన్ విభాగంలో మొత్తం 11 రౌండ్ల పాటు పోటీలు జరగగా... ప్రణవ్ 9 పాయింట్లతో అగ్ర స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో 7 గేమ్లు గెలిచిన ప్రణవ్... మిగిలిన 4 గేమ్లను ‘డ్రా’ చేసుకొని అజేయంగా వరల్డ్ చాంపియన్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. ‘ఆటలో క్లిష్ట పరిస్థితులు ఎదురైనా... ఏమాత్రం వెనక్కి తగ్గని ప్రణవ్... ఏ క్షణంలోనూ ఆత్మవిశ్వాసం కోల్పోడు. ఇద్దరం తమిళనాడుకు చెందిన వాళ్లమే కావడంతో... తమిళంలోనే మాట్లాడుకుంటాం. దీంతో ఒకరి భావాలు మరొకరం సులభంగా అర్థం చేసుకుంటాం. కామెడీ సినిమాలను ఎక్కువ ఇష్టపడే ప్రణవ్... ఆట తప్ప వేరే ఆలోచనలను దరిచేరనివ్వడు. ఆ క్రమశిక్షణే అతడిని ఈ స్థాయికి తెచ్చింది. చదరంగ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తరహాలో నిలకడ కొనసాగించడమే ప్రణవ్ లక్ష్యం’ అని 32 ఏళ్ల శ్యామ్ వివరించాడు. క్రికెట్కు వీరాభిమాని... క్రికెట్ను విపరీతంగా అభిమానించే ప్రణవ్ కు... నేటి తరం ప్రేక్షకుల్లాగే టెస్టుల కన్నా... వన్డే, టి20 ఫార్మాట్లంటేనే ఎక్కువ ఇష్టం. చదరంగంలో క్లాసికల్ గేమ్ టెస్టుల మాదిరి కాగా... వన్డే, టి20ల వంటి ర్యాపిడ్, బ్లిట్జ్లో ప్రణవ్ వేగం శ్యామ్సుందర్ను ఆకట్టుకుంది. కాస్త సానబెడితే అద్భుతాలు సాధించగల సత్తా అతడిలో ఉందని గుర్తించిన శ్యామ్ ఆ దిశగా ప్రయాణం ప్రారంభించాడు. ఏడాది శిక్షణలో అతడికిష్టమైన ర్యాపిడ్ బ్లిట్జ్లో మరింత మెరుగు పరుస్తూనే... సంపద్రాయ క్లాసికల్పై కూడా ఆసక్తి పెరిగేలా చేశాడు. ‘గత సంవత్సరం జనవరి నుంచి అధికారికంగా మేమిద్దరం కలిసి పనిచేస్తున్నాం. అప్పటికే గ్రాండ్మాస్టర్ అయిన ప్రణవ్ను మరింత మెరుగు పర్చేందుకు తగిన ప్రణాళికలు రూపొందించాను. టి20 క్రికెట్లో దూకుడుగా ఆడేందుకు వీలుంటుంది. అదే టెస్టు క్రికెట్లో ఓపిక ముఖ్యం. ప్రణవ్ కూడా క్విక్ ఫార్మాట్లో చక్కటి ప్రదర్శన చేస్తున్నాడు. కానీ సుదీర్ఘ ఫార్మాట్ వంటి క్లాసికల్లో మరింత ప్రావీణ్యం పొందే విధంగా తర్ఫీదునిచ్చాను’ అని శ్యామ్ సుందర్ విరించాడు. -
భారత రెజ్లర్లకు ఊరట
న్యూఢిల్లీ: భారత రెజ్లర్లకు మేలు చేసే కీలక నిర్ణయాన్ని కేంద్ర క్రీడాశాఖ తీసుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై విధించిన సస్పెన్షన్ను క్రీడా శాఖ ఎత్తేసింది. డబ్ల్యూఎఫ్ఐ మాజీ చీఫ్ బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై స్టార్ రెజ్లర్ల లైంగిక ఆరోపణలు దరిమిలా చుట్టుముట్టిన వివాదాలు, కోర్టు కేసుల అనంతరం 15 నెలల క్రితం కొత్త కార్యవర్గం కొలువు దీరింది. కానీ రోజుల వ్యవధిలోనే కేంద్ర క్రీడా శాఖ ఆగ్రహానికి గురైంది. దీంతో పలు అంతర్జాతీయ ఈవెంట్లలో భారత రెజ్లర్లు పాల్గొనేందుకు ఇబ్బందులెదురవుతున్నాయి. రెజ్లర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు నిషేధాన్ని ఎత్తేసింది. కేంద్ర క్రీడా శాఖ మార్గదర్శకాలను డబ్ల్యూఎఫ్ఐ పాటించడంతో పాటు రెజ్లర్ల విస్తృత ప్రయోజనాలను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ శాఖ అధికారులు వెల్లడించారు. క్రీడాపాలసీ ప్రకారం డబ్ల్యూఎఫ్ఐ నడచుకోవాలని, వివాదాస్పద, కళంకిత అధికారులు, పాత కార్యవర్గ సభ్యులకు దూరంగా ఉండాలని, లేదంటే కఠిన చర్యలకు వెనుకాడమని క్రీడా శాఖ హెచ్చరించినట్లు తెలిసింది. డబ్ల్యూఎఫ్ఐ కార్యకలాపాలు మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ ఇంటినుంచే నిర్వహిస్తున్నారనే విమర్శలపై క్రీడాశాఖ పర్యవేక్షక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ప్రత్యక్ష పరిశీలన అనంతరం ఇచి్చన నివేదికను బట్టే తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దీంతో వచ్చే ఏషియాడ్ (2026), లాస్ ఏంజెలెస్ (2028) ఒలింపిక్స్కు అర్హత సాధించాలనుకునే రెజ్లర్లకు కొండంత ఆత్మవిశ్వాసం లభించినట్లయ్యింది. క్రీడాశాఖ నిర్ణయంపై డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు సంజయ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ‘ప్రభుత్వానికి కృతజ్ఞతలు. సస్పెన్షన్ తొలగిపోవడంతో ఇక మా కార్యకలాపాలు సజావుగా జరిగేందుకు అవకాశం లభించింది. రెజ్లింగ్ క్రీడ అభ్యున్నతికి ఇలాంటి నిర్ణయం ఎంతో అవసరం కూడా! ఇప్పటికే ప్రతిభావంతులైన రెజ్లర్లు పలు అంతర్జాతీయ ఈవెంట్లకు దూరమయ్యారు. ఇకనుంచి వారంతా పతకాల కోసం పోటీపడొచ్చు’ అని అన్నారు. క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ సస్పెన్షన్ను ఇంకా కొనసాగిస్తే రెజ్లర్లకు అన్యాయం చేసిన వారమవుతామని చెప్పారు. రెజ్లర్లు అంతర్జాతీయ క్రీడావేదికలపై రాణించాలనే సదుద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. డబ్ల్యూఎఫ్ఐ మాజీ చీఫ్ బ్రిజ్భూషణ్ మాట్లాడుతూ తనపై చేసిన తప్పుడు ఆరోపణలేవీ నిలబడలేదని చెప్పుకొచ్చారు. -
లక్ష్యసేన్ శుభారంభం
బర్మింగ్హమ్: ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ తొలి రోజు భారత్కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. తొలి రౌండ్లో లక్ష్యసేన్, మాళవిక బన్సోద్ విజయాలు సాధించి ముందంజ వేయగా... హెచ్ఎస్ ప్రణయ్ పరాజయంతో ఇంటిబాట పట్టాడు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీ పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో మంగళవారం ప్రపంచ 15వ ర్యాంకర్ లక్ష్యసేన్ 13–21, 21–17, 21–15తో ప్రపంచ 37వ ర్యాంకర్ లి యాంగ్ సు (చైనీస్ తైపీ)పై విజయం సాధించాడు. గంటా 15 నిమిషాల పాటు సాగిన పోరు తొలి గేమ్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన లక్ష్య... హోరాహోరీగా సాగిన రెండో గేమ్ 17–17తో సమంగా ఉన్న సమయంలో చైనీస్ తైపీ షట్లర్ తప్పిదాలతో వరుస పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు. నిర్ణయాత్మక మూడో గేమ్ ఆరంభం నుంచే దూకుడు కనబర్చిన లక్ష్యసేన్... నెట్ గేమ్తో ప్రత్యర్థిని ఉక్కిరి బిక్కిరి చేసి 11–9తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అయితే పట్టువదలని చైనీస్ తైపీ షట్లర్ 15–15తో స్కోరు సమం చేశాడు. అక్కడి నుంచి విజృంభించిన లక్ష్యసేన్... బలమైన రిటర్న్లతో చెలరేగి వరుసగా ఆరు పాయింట్లు సాధించి ప్రిక్వార్టర్స్కు చేరాడు. ఈ మ్యాచ్లో మూడో సీడ్ జొనాథన్ క్రిస్టి (ఇండోనేసియా)తో లక్ష్యసేన్ తలపడతాడు. 2024 పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక పోరులో క్రిస్టి చేతిలో ఓడిన లక్ష్యసేన్... ఆ పరాజయానికి బదులు తీర్చుకునేందుకు ఇది చక్కటి అవకాశం. మరో మ్యాచ్లో ప్రపంచ 29వ ర్యాంకర్ ప్రణయ్ 19–21, 16–21తో ప్రపంచ 17వ ర్యాంకర్ టోమా జూనియర్ పొపోవ్ (ఫ్రాన్స్) చేతిలో పరాజయం పాలయ్యాడు. 53 నిమిషాల పాటు సాగిన పోరులో ప్రణయ్ వరుస గేమ్ల్లో ఓడాడు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో రైజింగ్ స్టార్ మాళవిక బన్సోద్ 21–13, 10–21, 21–17తో జియా మిన్ యో (సింగపూర్)పై విజయం సాధించింది. మహిళల డబుల్స్లో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో ద్వయం 20–22, 18–21తో చెన్ చెంగ్–సెయి పెయి షాన్ జంట చేతిలో ఓడింది. మిక్స్డ్ డబుల్స్లో సతీశ్ కుమార్ కరుణాకరన్–ఆద్య జంట 6–21, 15–21తో జిన్ వా–చెన్ ఫెంగ్ హుయి (చైనా) ద్వయం చేతిలో ఓడింది. భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి బుధవారం బరిలోకి దిగనున్నారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో యున్ కిమ్ (దక్షిణ కొరియా)తో సింధు తలపడుతుంది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో డానియల్ లిండ్గార్డ్–మాడ్స్ వెస్టర్గాడ్ (డెన్మార్క్) జంటతో సాత్విక్–చిరాగ్ జోడీ ఆడుతుంది. -
భారత మహిళల కబడ్డీ జట్టుకు రూ. 67.50 లక్షల నగదు బహుమతి
ఆసియా కబడ్డీ చాంపియన్షిప్లో ఐదోసారి విజేతగా నిలిచిన భారత మహిళల జట్టుకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ రూ. 67.50 లక్షల నగదు బహుమతి అందించింది. ఇటీవల ఇరాన్ వేదికగా జరిగిన టోర్నీలో అజేయంగా నిలిచిన భారత మహిళల కబడ్డీ జట్టు... ఫైనల్లో 32–25 పాయింట్ల తేడాతో ఆతిథ్య ఇరాన్ జట్టును ఓడించింది. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన భారత జట్టు ఐదో సారి ఈ టోర్నీలో విజేతగా నిలిచింది.మంగళవారం స్వదేశానికి తిరిగి వచ్చిన భారత మహిళల కబడ్డీ జట్టును కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అభినందించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ... ‘మహిళా అథ్లెట్లను మరింత ప్రోత్సహించేందుకు ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాం. మహిళా కబడ్డీ ప్లేయర్లకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేకంగా కబడ్డీ లీగ్ను కూడా ప్రారంభించాలనుకుంటున్నాం’ అని అన్నారు. -
ఈసారైనా ‘ఆల్ ఇంగ్లండ్’ అందేనా!
ప్రతి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కెరీర్లో ఒక్కసారైనా ఆడాలనుకునే టోర్నీ, గెలవాలనుకునే టోర్నీ ఏదైనా ఉందంటే అది ఆల్ ఇంగ్లండ్ చాంపియన్షిప్ మాత్రమే. బ్యాడ్మింటన్ క్రీడలో అతి పురాతన టోర్నీలలో ఒకటిగా, ప్రపంచ చాంపియన్షిప్ స్థాయి ఉన్న టోర్నీగా ఆల్ ఇంగ్లండ్ చాంపియన్షిప్నకు పేరుంది. 126 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ మెగా టోర్నీకి రంగం సిద్ధమైంది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య వరల్డ్ టూర్ టోర్నమెంట్ క్యాలెండర్ను ప్రవేశపెట్టాక... అత్యున్నత శ్రేణి సూపర్–1000 నాలుగు టోర్నీలలో (మలేసియా, ఆల్ ఇంగ్లండ్, ఇండోనేసియా, చైనా ఓపెన్) ఒకటిగా ఆల్ ఇంగ్లండ్ చాంపియన్షిప్ కొనసాగుతోంది. మంగళవారం నుంచి ఆదివారం జరిగే ఈ టోర్నీకి బరి్మంగ్హమ్ ఆతిథ్యమివ్వనుంది. బర్మింగ్హమ్: బ్యాడ్మింటన్ సీజన్లోని మరో మెగా టోర్నీకి భారత క్రీడాకారులు సమాయత్తమయ్యారు. నేటి నుంచి ఆదివారం వరకు జరిగే ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీలో భారత్ నుంచి మొత్తం 17 మంది ప్లేయర్లు బరిలోకి దిగనున్నారు. మహిళల సింగిల్స్లో ప్రపంచ మాజీ చాంపియన్ పీవీ సింధు, రైజింగ్ స్టార్ మాళవిక బన్సోద్... పురుషుల సింగిల్స్లో ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ మాజీ రన్నరప్ లక్ష్య సేన్, ప్రపంచ చాంపియన్షిప్ కాంస్య పతక విజేత హెచ్ఎస్ ప్రణయ్ పోటీపడనున్నారు. పురుషుల డబుల్స్లో ఆసియా క్రీడల చాంపియన్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి... మహిళల డబుల్స్లో గత రెండేళ్లలో సెమీఫైనల్ చేరిన పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ... పారిస్ ఒలింపిక్స్లో పోటీపడ్డ అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో.. శ్రుతి మిశ్రా–ప్రియా కొంజెంగ్బమ్... మిక్స్డ్ డబుల్స్లో గద్దె రుత్విక–రోహన్ కపూర్... తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల... ఆద్యా–సతీశ్ కుమార్ జోడీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. భారత్ నుంచి పురుషుల సింగిల్స్లో మాత్రమే ఇద్దరు చాంపియన్స్గా నిలిచారు. 1980లో ప్రకాశ్ పదుకొనే... 2001లో పుల్లెల గోపీచంద్ ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టైటిల్స్ సాధించారు. ఆ తర్వాత భారత్ నుంచి మరో ప్లేయర్ ఆల్ ఇంగ్లండ్ టైటిల్ అందుకోలేకపోయారు. 2015లో మహిళల సింగిల్స్లో సైనా నెహ్వాల్... 2022లో పురుషుల సింగిల్స్లో లక్ష్య సేన్ ఫైనల్కు చేరినా చివరకు రన్నరప్ ట్రోఫీలతో సరిపెట్టుకున్నారు. ఈసారి స్టార్ ప్లేయర్లు సింధు, లక్ష్య సేన్, ప్రణయ్, సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టిలపై భారత క్రీడాభిమానులు ఆశలు పెట్టుకున్నారు. గతంలో 12 సార్లు ఆల్ ఇంగ్లండ్ ఓపెన్లో ఆడిన సింధు అత్యుత్తమంగా 2018, 2021లలో సెమీఫైనల్ దశకు చేరుకుంది. ఈసారి సింధుకు కాస్త క్లిష్టమైన ‘డ్రా’నే ఎదురైంది. తొలి రౌండ్లో దక్షిణ కొరియా ప్లేయర్ గా యున్ కిమ్తో సింధు ఆడుతుంది. ఈ మ్యాచ్లో నెగ్గితే ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 4వ ర్యాంకర్ హాన్ యువెతో సింధు తలపడే అవకాశముంది. భారత్కే చెందిన మాళవిక నేడు జరిగే తొలి రౌండ్లో జియా మిన్ యో (సింగపూర్)తో తలపడుతుంది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్ల్లో లి యాంగ్ సు (చైనీస్ తైపీ)తో లక్ష్య సేన్...టోమా జూనియర్ పొపోవ్ (ఫ్రాన్స్)తో ప్రణయ్ ఆడతారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో డానియల్ లిండ్గార్డ్–మాడ్స్ వెస్టర్గాడ్ (డెన్మార్క్)లను సాత్విక్–చిరాగ్ ఢీకొంటారు. -
రూ. 12 కోట్లు ఇస్తున్నారు
న్యూఢిల్లీ: హాకీ ఇండియా (హెచ్ఐ) వార్షిక అవార్డుల విజేతలకు ఈసారి భారీగా ప్రైజ్మనీ దక్కనుంది. 2024 సీజన్కు సంబంధించి అంతర్జాతీయ మ్యాచ్ల్లో కనబరిచిన ప్రదర్శన ఆధారంగా 8 కేటగిరీల్లో 32 మంది నామినేట్ అయ్యారు. వీరందరికి కలిపి ఏకంగా రూ. 12 కోట్ల ప్రైజ్మనీ అందజేయనున్నట్లు హెచ్ఐ తెలిపింది. శనివారం న్యూఢిల్లీలో అవార్డుల వేడుక నిర్వహించనున్నారు. » మహిళలు, పురుషుల కేటగిరీలో ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’గా నిలిచిన వారికి బల్బీర్సింగ్ సీనియర్ అవార్డు... వర్ధమాన ప్లేయర్లకు పురుషుల విభాగంలో జుగ్రాజ్ సింగ్ పేరిట... మహిళల్లో అసుంత లాక్రా పేరిట ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డులను అందజేస్తారు. » ‘గోల్కీపర్ ఆఫ్ ద ఇయర్’గా నిలిచిన వారికి బల్జీత్ సింగ్ అవార్డును... ‘డిఫెండర్ ఆఫ్ ద ఇయర్’కు పర్గత్ సింగ్ అవార్డు, ‘మిడ్ ఫీల్డర్ ఆఫ్ ద ఇయర్’కు అజిత్పాల్ సింగ్ అవార్డును... ‘ఫార్వర్డ్ ఆఫ్ ద ఇయర్’కు ధన్రాజ్ పిళ్లై అవార్డును బహూకరిస్తారు. » భారత పురుషుల హాకీ జట్టు ప్రపంచకప్ (1975) టైటిల్ గెలిచి 50 ఏళ్లు పూర్తికావడం, అలాగే అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) గుర్తింపు పొంది 100 ఏళ్లు (1925) పూర్తికావడంతో స్వర్ణోత్సవ వేడుకలు ఈ అవార్డుల కార్యక్రమంలోనే జరుగనుంది. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్లో కాంస్య పతకం గెలిచిన పురుషుల జట్టును, ఆసియా చాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన పురుషులు, మహిళల జట్లను ఘనంగా సన్మానించనున్నారు. సీనియర్ జట్లతో పాటు జూనియర్ ఆసియాకప్ సాధించిన పురుషులు, మహిళల జట్లను సత్కరిస్తారు. » బల్బీర్సింగ్ సీనియర్ అవార్డు రేసులో రిటైరైన పీఆర్ శ్రీజేశ్, కృష్ణన్ బహదూర్ పాఠక్లతో పాటు మహిళా ప్లేయర్లు సవిత, బిచూ దేవి ఖరిబం కూడా ఉన్నారు. » డిఫెండర్ అవార్డు కోసం సంజయ్, అమిత్ రోహిదాస్, హర్మన్ప్రీత్ సింగ్, ఉదిత పోటీపడుతున్నారు. » మిడ్ఫీల్డర్ అవార్డు కోసం జర్మన్ప్రీత్ సింగ్, హార్దిక్ సింగ్, నీలకంఠ శర్మ, సుమిత్ నామినేట్ అయ్యారు. » ఫార్వర్డ్ అవార్డు కోసం లాల్రెమ్సియామి, అభిషేక్, సుఖ్జీత్, నవ్నీత్ కౌర్ బరిలో ఉన్నారు. æ అండర్–21 మహిళలకు ఇచ్చే వర్థమాన ప్లేయర్ అవార్డు రేసులో బ్యూటీ డుంగ్డుంగ్, దీపిక, వైష్ణవి ఫాల్కే, సునెలితా టొప్పొ ఉన్నారు. »అండర్–21 పురుషులకు ప్రదానం చేసే వర్ధమాన ప్లేయర్ పురస్కారం కోసం అర్‡్షదీప్ సింగ్, అమిర్ అలీ, శర్దానంద్ తివారి, అరిజీత్ సింగ్ బరిలో ఉన్నారు. -
IPBL: అదరగొట్టిన భారత బాక్సర్లు
ఇండియన్ ప్రొ బాక్సింగ్ లీగ్(IPBL)లో భాగంగా వరల్డ్ చాంపియన్స్తో పోటీలో భారత బాక్సర్లు అదరగొట్టారు. రానా దగ్గుబాటి బాక్సింగ్ బే- ఆంటొని పెట్టిస్ ఏపీఎఫ్సీల మధ్య జరుగుతున్న బాక్సింగ్ పోటీల్లో అక్షయ్ చహల్- సబరి జయశంకర్ సత్తా చాటారు. హైదరాబాద్ వేదికగా ప్రపంచ చాంపియన్లు అయిన లూయీస్ ఫెలిషియానో, సెర్గియో పెట్టిస్లపై అద్భుత విజయం సాధించి.. ప్రొఫెషనల్ బాక్సింగ్కు భారత్ సిద్ధంగా ఉందనే సంకేతాలు ఇచ్చారు.అక్షయ్-సబరి అద్బుత పోరాటం కారణంగా టీమిండియా- టీమ్ అమెరికా మధ్య సాగిన పోరు 2-2తో డ్రాగా ముగిసింది. ఈ సందర్భంగా మాజీ యూఎఫ్సీ లైట్ వెయిట్ ఛాంపియన్ ఆంటోని పెట్టిస్ మాట్లాడుతూ.. ‘‘IPBL ప్రపంచంలోని అతిపెద్ద బాక్సింగ్ లీగ్లలో ఒకటిగా ఎదుగుతుందనడంలో సందేహం లేదు.అగ్రశ్రేణి బాక్సర్లను ఇక్కడికి తీసుకువచ్చేందుకు నేను కట్టుబడి ఉన్నాను. ఇండియాలో ఈ పోటీలను మరింత విస్తృతం చేయాలనే సంకల్పంతో ఉన్నాం’’ అని తెలిపాడు. ఇక రానా దగ్గుబాటి మాట్లాడుతూ.. ‘‘హైదరాబాద్ అసమాన హోస్ట్ అని మరోసారి నిరూపితమైంది’’అని హర్షం వ్యక్తం చేశాడు. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని.. ఇండియాలోనే బాక్సింగ్ క్యాపిటల్గా హైదరాబాద్ ఎదిగేలా తాము ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించాడు. పెట్టిస్ ఈ ఉద్యమానికి మద్దతుగా నిలిచాడని.. అతడి సహకారం ఇలాగే కొనసాగుతుందని రానా ఆశాభావం వ్యక్తం చేశాడు. -
అజేయంగా... ఆసియా చాంపియన్గా!
టెహ్రాన్: ఆద్యంతం ఆధిపత్యం చలాయించిన భారత మహిళల కబడ్డీ జట్టు తమకు తిరుగులేదని మరోసారి నిరూపించుకుంది. ఇరాన్లో జరిగిన మహిళల ఆసియా కబడ్డీ ఆరో చాంపియన్షిప్లో టీమిండియా టైటిల్ను నిలబెట్టుకుంది. ఎనిమిదేళ్ల విరామం తర్వాత జరిగిన ఈ మెగా ఈవెంట్లో భారత జట్టు లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ గెలిచి సెమీఫైనల్కు చేరింది. సెమీఫైనల్లో, ఆ తర్వాత ఫైనల్లోనూ జైత్రయాత్ర కొనసాగించి ఐదోసారి ఆసియా చాంపియన్గా నిలిచింది. టైటిల్ పోరులో భారత జట్టు 32–25 పాయింట్లతో తేడాతో ఆతిథ్య ఇరాన్ జట్టును ఓడించింది. అంతకుముందు సెమీఫైనల్లో భారత్ 56–18 పాయింట్ల తేడాతో నేపాల్ జట్టుపై ఘనవిజయం అందుకుంది. లీగ్ దశలో తొలి మ్యాచ్లో టీమిండియా 64–23 పాయింట్ల తేడాతో బంగ్లాదేశ్పై, రెండో మ్యాచ్లో 76–21 పాయింట్లతో థాయ్లాండ్ జట్టుపై, మూడో మ్యాచ్లో 73–19 పాయింట్లతో మలేసియా జట్టుపై గెలుపొందాయి. మొత్తం ఏడు జట్లను రెండు గ్రూప్లుగా విభజించారు. గ్రూప్ ‘ఎ’లో భారత్, బంగ్లాదేశ్, మలేసియా, థాయ్లాండ్ జట్లు... గ్రూప్ ‘బి’లో ఇరాన్, ఇరాక్, నేపాల్ జట్లు ఉన్నాయి. గ్రూప్ ‘బి’లోని నాలుగో జట్టు చైనీస్ తైపీ జట్టు చివరి నిమిషంలో ఈ టోర్నీ నుంచి వైదొలిగింది. ఆసియా చాంపియన్షిప్లో రాణించిన భారత జట్టు ఈ ఏడాది చివర్లో భారత్లోనే జరిగే వరల్డ్కప్ టోర్నీలో ఫేవరెట్గా బరిలోకి దిగనుంది. ఆసియా చాంపియన్షిప్ నెగ్గిన భారత జట్టుకు సోనాలి విష్ణు షింగేట్ కెపె్టన్గా, పుష్ప రాణా వైస్ కెప్టెన్గా వ్యవహరించారు. జాతీయ చాంపియన్షిప్లో ఇండియన్ రైల్వేస్ తరఫున ఆడిన సోనాలి గోల్డెన్ రెయిడ్తో తన జట్టును విజేతగా నిలిపింది. పూజా కజిలా, నిధి శర్మ, పూజా నర్వాల్, ఆమ్రపాలి గలాండె, నేహా దక్ష్ , సంజూ దేవి, జ్యోతి ఠాకూర్, సాక్షి శర్మ, భావన దేవి, రీతూ మిగతా సభ్యులుగా ఉన్నారు. 2005లో హైదరాబాద్లో తొలిసారి ఆసియా చాంపియన్షిప్ను నిర్వహించగా... భారత జట్టు విజేతగా అవతరించింది. అనంతరం 2007లో టహ్రాన్ (ఇరాన్)లో జరిగిన రెండో ఆసియా చాంపియన్షిప్లో, 2008లో మదురై (భారత్)లో జరిగిన మూడో ఆసియా చాంపియన్షిప్లో భారత జట్టు టైటిల్ నిలబెట్టుకుంది. 2008 తర్వాత ఎనిమిదేళ్లకు మళ్లీ ఆసియా చాంపియన్షిప్ జరిగింది. 2016లో బుసాన్ (దక్షిణ కొరియా)లో జరిగిన నాలుగో ఆసియా చాంపియన్షిప్లో దక్షిణ కొరియా జట్టు తొలిసారి విజేతగా అవతరించింది. 2017లో గొర్గాన్ (ఇరాన్)లో జరిగిన ఐదో ఆసియా చాంపియన్షిప్లో భారత జట్టు దక్షిణ కొరియాను ఓడించి నాలుగోసారి చాంపియన్గా> నిలిచింది. 2017 తర్వాత మళ్లీ ఎనిమిదేళ్లకు నిర్వహించిన ఈ మెగా ఈవెంట్లో మరోసారి భారత్ తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. -
జొకోవిచ్కు చుక్కెదురు
కాలిఫోర్నియా: సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్కు ఇండియన్ వెల్స్ ఏటీపీ–1000 మాస్టర్స్ టోర్నమెంట్లో చుక్కెదురైంది. 24 గ్రాండ్స్లామ్లు గెలిచిన ప్రపంచ మాజీ నంబర్వన్ జొకోవిచ్... ఈ టోర్నీలో రెండో రౌండ్లోనే ఇంటిబాట పట్టాడు. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో ఆరో సీడ్ జొకోవిచ్ 2–6, 6–3, 1–6తో ‘లక్కీ లూజర్’ బొటిక్ వాన్ డి జాండ్షుల్ఫ్ (నెదర్లాండ్స్) చేతిలో పరాజయం పాలయ్యాడు. వాస్తవానికి జాండ్షుల్ప్ క్వాలిఫయింగ్ దశలోనే ఓడిపోయాడు. అయితే మెయిన్ ‘డ్రా’లో ఒక ప్లేయర్ వైదొలడగంతో క్వాలిఫయింగ్లో ఓడిపోయిన మెరుగైన ర్యాంకర్ జాండ్షుల్ప్కు ‘లక్కీ లూజర్’ హోదాలో మెయిన్ ‘డ్రా’లో ఆడే అవకాశం కల్పించారు. తొలి రౌండ్లో ‘బై’ దక్కించుకున్న జొకోవిచ్... బరిలోకి దిగిన తొలి పోరులోనే నిష్క్రమించాడు. గతంలో ఐదుసార్లు ఈ టోర్నీలో చాంపియన్గా నిలిచిన జొకోవిచ్... ఈసారి అదే జోరు కనబర్చలేకపోయాడు. 37 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. తొలి సెట్లోనే జొకో 14 అనవసర తప్పిదాలకు పాల్పడడంతో తిరిగి కోలుకోలేకపోయాడు.జాండ్షుల్ఫ్ బేస్లైన్తో పాటు నెట్ గేమ్తో అదరగొడితే... జొకో మ్యాచ్ ఆద్యాంతం తడబడ్డాడు. ఓవరాల్గా జాండ్షుల్ఫ్ 4 ఏస్లు సంధించగా... జొకో ఒక్క ఏస్ కూడా కొట్టలేకపోయాడు. నెదర్లాండ్స్ ప్లేయర్ 4 డబుల్ ఫాల్ట్స్ చేయగా... జొకోవిచ్ 3 డబుల్ ఫాల్ట్లకు పాల్పడ్డాడు. ‘గత కొంతకాలంగా పరిస్థితులు భిన్నంగా సాగుతున్నాయి. ఆశించిన స్థాయిలో ఆడేందుకు ఇబ్బంది పడుతున్నా. ఈ పోరాటం సవాలుతో కూడుకున్నది.మధ్యమధ్యలో ఒకటీ రెండు టోర్నీల్లో మంచి ప్రదర్శన కనబర్చగలుగుతున్నా... దాన్ని కొనసాగించడం ముఖ్యం. పేలవ ప్రదర్శనకు సాకులు వెతకాలనుకోవడం లేదు. ఇది నా రోజు కాదు. మరింత మెరుగైన ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తా’ అని జొకోవిచ్ అన్నాడు. ఈ ఏడాది 25వ గ్రాండ్స్లామ్ టైటిల్ ఖాతాలో వేసుకునేలా కనిపించిన జొకోవిచ్... కండరాల నొప్పితో ఆ్రస్టేలియా ఓపెన్ సెమీఫైనల్ నుంచి వైదొలిగాడు. గాయం నుంచి కోలుకొని బరిలోకి దిగిన దోహా టోర్నీ తొలి రౌండ్లోనే జొకో పరాజయం పాలయ్యాడు. మరోవైపు అగ్రశ్రేణి ఆటగాళ్లపై ఆరంభ దశలోనే విజయాలు సాధించడాన్ని అలవాటుగా మార్చుకున్న జాండ్షుల్ఫ్ గతంలో... డేవిస్ కప్లో రాఫెల్ నాదల్ (స్పెయిన్)పై, యూఎస్ ఓపెన్లో అల్కరాజ్ (స్పెయిన్)పై కూడా విజయాలు సాధించాడు. ఇప్పుడు మరో సంచలన నమోదు చేస్తూ జొకోవిచ్పై గెలుపొందాడు. ఓవరాల్గా టాప్–10 ప్రత్యర్థులపై జాండ్షుల్ఫ్కు ఇది 8వ విజయం కావడం విశేషం. కాగా, ఈ టోర్నీలో టాప్సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), నాలుగో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే) కూడా రెండో రౌండ్లోనే పరాజయం పాలయ్యారు. -
క్లాసికల్ అంటేనే ఇష్టం
న్యూఢిల్లీ: చదరంగంలో ఎన్ని ఫార్మాట్లు వచ్చినా... క్లాసికల్కు ఉన్న ప్రాధాన్యత వేరని ప్రపంచ చెస్ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్ అన్నాడు. ఇటీవలి కాలంలో అన్నీ ఫార్మాట్లలో సత్తా చాటుతున్న గుకేశ్... తనకు స్వతహాగా సంప్రదాయ క్లాసికల్ గేమ్ అంటేనే ఎక్కువ ఇష్టమని వెల్లడించాడు. ‘ఏ ఫార్మాట్లో ఆడాలి అనే దాని గురించి పెద్దగా ఆలోచించను. ఫ్రీ స్టయిల్ ఉత్తేజకరమైన ఫార్మాట్... ఆడేటప్పుడు ఎంతో బాగుంటుంది. ఇప్పటి వరకు ఫ్రీస్టయిల్ విభాగంలో రెండు టోర్నీలు మాత్రమే జరిగాయి. ఇప్పుడే దానిపై వ్యాఖ్యానించడం తొందరపాటు అవుతుంది. ఫ్రీస్టయిల్ ఫార్మాట్ మరింత ఆదరణ పొందాలని కోరుకుంటున్నా. అదే సమయంలో క్లాసికల్ విభాగానికి ఉన్న ప్రాధాన్యత వేరు. ఘన చరిత్ర ఉన్న క్లాసికల్ విభాగంలో ప్రపంచ చాంపియన్షిప్ అన్నిటి కంటే అత్యున్నతమైంది. క్లాసికల్, ర్యాపిడ్, బ్లిట్జ్కు ఫ్రీస్టయిల్ అదనం. నేను అన్నింట్లో ఆడాలని అనుకుంటున్నా’ అని గుకేశ్ శనివారం ఓ కాన్క్లేవ్లో అన్నాడు. వచ్చే నెల 7–14 వరకు జరగనున్న పారిస్ అంచె ఫ్రీస్టయిల్ చెస్ గ్రాండ్స్లామ్ టూర్లో పాల్గొననున్నట్లు గుకేశ్ వెల్లడించాడు. ప్రపంచ నంబర్వన్ మాగ్నస్ కార్ల్సన్తో పాటు 12 మంది గ్రాండ్మాస్టర్లు పాల్గొంటున్న ఈ చెస్ గ్రాండ్స్లామ్ తొలి అంచె జర్మనీ పోటీల్లో విన్సెంట్ కెయిమెర్ విజేతగా నిలిచాడు. కెరీర్ తొలి నాళ్లలో ఎదుర్కొన్న ఆరి్థక కష్టాలను గుకేశ్ కాన్ క్లేవ్లో గుర్తుచేసుకున్నాడు. టోర్నమెంట్లలో పాల్గొనేందుకు డబ్బులు లేని సమయంలో తల్లిదండ్రుల స్నేహితులు అండగా నిలిచారని అన్నాడు. ‘ఒకప్పుడు పోటీలకు వెళ్లేందుకు తగినంత డబ్బు లేకపోయేది. కుటుంబ సభ్యులు ఎంతో ప్రయతి్నంచి నిధులు సమకూర్చేవారు. నిస్వార్ధపరమైన కొందరి సాయం వల్లే ఈ స్థాయికి వచ్చా. ఇప్పుడు ఆరి్థక ఇబ్బందులు తొలగిపోయాయి’ అని గుకేశ్ అన్నాడు. కొవిడ్–19 ప్రభావం తర్వాత దేశంలో చెస్కు మరింత ఆదరణ పెరిగిందని గుకేశ్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం ప్రపంచ అత్యుత్తమ 100 మంది చెస్ ప్లేయర్లలో భారత్ నుంచి 13 మంది ఉన్నారని అది చదరంగంలో మన ప్రగతికి చిహ్నమని గుకేశ్ అన్నాడు. వీరందరికీ దారి చూపింది విశ్వనాథన్ ఆనంద్ అని... ఆయన బాటలోనే మరింత మంది గ్రాండ్మాస్టర్లు వచ్చారని పేర్కొన్నాడు. దేశంలో చెస్కు మంచి ఆదరణ లభిస్తోందని... స్పాన్సర్లతో పాటు ప్రభుత్వాలు కూడా అండగా నిలుస్తున్నాయని గుకేశ్ వివరించాడు. -
అరవింద్... కొత్త చాంపియన్
న్యూఢిల్లీ: భారత చదరంగంలో నేటితరం సంచలన విజేతలతో పోల్చుకుంటే అరవింద్ చిదంబరం ఆలస్యంగా వికసించిన చాంపియన్. ఇప్పటికే టీనేజ్లోనే దొమ్మరాజు గుకేశ్, ఆర్.ప్రజ్ఞానంద, అర్జున్ ఇరిగేశి అంతర్జాతీయ చెస్ టోర్నీలు, ఎలో రేటింగ్స్లో సత్తా చాటుకున్నారు. కానీ 64 గడుల బరిలో అరవింద్ 25 ఏళ్ల వయసులో వార్తల్లోకెక్కాడు. ప్రాగ్ మాస్టర్స్ టోర్నీలో విజేతగా నిలువడం ద్వారా భారత్లో కొత్త చదరంగ చక్రవర్తిగా అవతరించాడు. వయసు రీత్యా అతను లేటే కావొచ్చు... కానీ లేటెస్ట్ చాంపియన్గా భారత క్రీడాఖ్యాతిని పెంచాడు. గుకేశ్, ప్రజ్ఞానంద, అర్జున్లతో కలిసి ఇప్పుడు నాలుగో స్తంభమయ్యాడు. విజేతగా మలచిన తల్లి మధురైలో పుట్టిన అరవింద్ పసిప్రాయంలోనే తండ్రిని కోల్పోయాడు. మూడేళ్ల వయసులోనే కన్నతండ్రి లోకాన్ని వీడితే... కన్నతల్లే అన్నీ తానై పెంచింది. జీవితబీమా (ఎల్ఐసీ) ఏజెంట్గా పనిచేస్తూ మదురై నుంచి చెన్నైకి మారి బతుకుబండిని లాగించింది. ఏడేళ్ల వయసులో తాత చెస్లో ఓనమాలు నేర్పితే అందులోనే కెరీర్ను ఎంచుకున్నాడు. విఖ్యాత వేలమ్మాళ్ స్కూల్లో విద్యనభ్యసించిన అరవింద్ చదువుకునే రోజుల్లో ఇప్పటి ప్రపంచ చాంపియన్ గుకేశ్కు సీనియర్. గుకేశ్ కూడా వేలమ్మాళ్ విద్యార్థే! ప్రాగ్ మాస్టర్స్లాంటి మేటి టోర్నీల్లో సాధారణంగా టాప్–20 ర్యాంకింగ్ ప్లేయర్లకు పాల్గొనే అవకాశముంటుంది. అంతకుమించి ర్యాంకుల్లో ఉంటే నిర్వాహకుల నుంచి వైల్డ్కార్డ్లాంటి ఎంట్రీలు ఉండాల్సిందే. అలా వచ్చిన అవకాశాన్ని అరవింద్ చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. 2013లో తొలి జీఎమ్ నార్మ్ భారత విఖ్యాత గ్రాండ్మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ 2013లో మాగ్నస్ కార్ల్సన్కు ప్రపంచ చెస్ చాంపియన్ కిరీటాన్ని కోల్పోయిన ఏడాదే పాఠశాల విద్యనభ్యసిస్తున్న అరవింద్ తొలి గ్రాండ్మాస్టర్ (జీఎమ్) నార్మ్ పొందాడు. అక్కడి నుంచి అతని ఆట మరో దశకు చేరడంతో 2015లో గ్రాండ్మాస్టర్ హోదా లభించింది. అడపాదడపా టోర్నీల్లో గెలుస్తున్నప్పటికీ 2019 అతని కెరీర్ను మలుపుతిప్పింది. భారత ఓపెన్లో క్లాసికల్, ర్యాపిడ్, బ్లిట్జ్ ఇలా మూడు విభాగాల్లోనూ అరవింద్ విజేతగా నిలిచి అరుదైన ఘనత సాధించిన ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. దాంతో పాటే తొలిసారి 2700 ఎలో రేటింగ్లోకి వచ్చేశాడు. ఇప్పుడు ప్రాగ్ టైటిల్తో లైవ్ వరల్డ్ ర్యాంకింగ్స్లో అరవింద్ 14వ స్థానంలో ఉన్నాడు. భారత్ తరఫున నాలుగో ర్యాంకర్గా ఎదిగాడు. -
కిక్స్లో.. నైషా నైపుణ్యం..
సాక్షి, హైదరాబాద్: కిక్ బాక్సింగ్ క్రీడలో జాతీయ అంతర్జాతీయ వేదికలపై మెరిసింది. తెలంగాణ కిక్ బాక్సింగ్ పుస్తకంలో తన కంటూ ఒక పేజీ లిఖించింది నైషా బజాజ్. ‘ఫిట్నెస్ రంగంలో ఉన్న మా అమ్మకి మార్షల్ ఆర్ట్స్ హాబీ. ఆమెతో ఏడేళ్ల వయసులో సరదాగా కలిసి ప్రాక్టీస్ చేశా. అదే ఇప్పుడు నా లైఫ్గా మారింది’ అంటూ చెప్పింది పంజాగుట్టలో నివసించే టీనేజర్ నైషా.విజయాలెన్నో.. నగరం నుంచి వేళ్ల మీద లెక్కబెట్టగలిగే సంఖ్యలో కూడా కనబడని మహిళల కిక్బాక్సింగ్లో 2014లో నైషా పూర్తి స్థాయిలో ప్రవేశించిందని చెప్పొచ్చు. అప్పటి నుంచి రాష్ట్రంలోని అగ్రశ్రేణి మహిళా యోధుల్లో ఒకరిగా రాణిస్తోంది. ఆమె సాధించిన విజయాల్లో ఇండియన్ ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్ (2022, 2024, 2025), నేషనల్ కిక్బాక్సింగ్ ఛాంపియన్షిప్ (2024, గోవా), ఖేలో ఇండియా ఉమెన్స్ కిక్బాక్సింగ్ లీగ్ (2024, హైదరాబాద్) తెలంగాణ స్టేట్ ఛాంపియన్షిప్లలో బంగారు పతకాలు.. సాధించింది. గత అక్టోబర్లో ఫ్రాక్చర్కు శస్త్రచికిత్స చేయించుకుని వెనువెంటనే 2025 ప్రారంభంలోనే తిరిగి బంగారు పతకాలను సాధించడం ఆమె పోరాట పటిమకు నిదర్శనం. కఠినమే కానీ.. అమ్మాయిలు క్రీడల్లో రాణించడం ఇప్పుడు సాధారణమే కావచ్చు కానీ.. కిక్ బాక్సింగ్ క్రీడలో మాత్రం ఇప్పటికీ విశేషమే. ‘చిన్న వయసులోనే నాలో ఉన్న ఆసక్తిని అమ్మ గమనించి మార్షల్ ఆర్ట్స్ వైపు ప్రోత్సహించింది’ అంటూ గుర్తు చేసుకుంది నైషా. తొలుత తైక్వాండోతో తన మార్షల్ ఆర్ట్స్ ప్రయాణాన్ని ప్రారంభించానని, ఆ తర్వాత కిక్ బాక్సింగ్లోకి మారానని వివరించింది. ఇది కఠినమైన క్రీడే అయినప్పటికీ.. ఇలాంటి యుద్ధకళల్లో మహిళలు రాణించాల్సిన సమయం వచి్చందంటోంది నైషా. బయటకు వెళ్లి ఎన్నో రంగాల్లో తమని తాము నిరూపించుకోవాలని తపిస్తున్న మహిళలు.. మార్షల్ ఆర్ట్స్ ద్వారా తమని తాము రక్షించుకోగలుగుతారని అంటోంది. -
Sunil Chhetri: రీఎంట్రీ అవసరమా?: ఫుట్బాల్ దిగ్గజం
భారత ఫుట్బాల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఆటగాడు సునీల్ ఛెత్రి(Sunil Chhetri) అనడంలో సందేహమే లేదు. జాతీయ జట్టు తరఫున 151 మ్యాచ్లు ఆడి 94 గోల్స్ సాధించాడు. గత ఏడాది జూన్లో అతను అంతర్జాతీయ ఫుట్బాల్కు రిటైర్మెంట్ ప్రకటించి తప్పుకున్నాడు. ఇప్పుడు అనూహ్యంగా ఛెత్రి పునరాగమనం చేస్తున్నాడు. 41 ఏళ్ల వయసులో అతను మళ్లీ భారత్కు ప్రాతినిధ్యం వహించేందుకు సిద్ధం కావడం ఫుట్బాల్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది.కోచ్ మనోలో మార్క్వెజ్ విజ్ఞప్తి మేరకు తిరిగి వచ్చాడని చెబుతున్నా... భారత్ ఫుట్బాల్ జట్టు తాజా పరిస్థితిని ఇది సూచిస్తోంది. అతను తిరిగి రావడంపై భిన్న స్పందనలు వస్తున్నాయి. ‘జట్టు కోణంలో చూస్తే ఇది సరైన నిర్ణయమే. 40 ఏళ్లు దాటిన వ్యక్తిని మళ్లీ ఆడిస్తున్నారేంటి అని అడగవచ్చు. అయితే గతంలోనూ ఇలాంటివి జరిగాయి.మంచి స్ట్రయికర్ను సిద్ధం చేసేందుకు భారత్ ఎంత ప్రయత్నిస్తున్నా ఫలితం రావడం లేదు. ఐఎస్ఎల్లో బాగా ఆడుతున్న వారంతా విదేశీయులే. పైగా ఛెత్రి సూపర్ ఫిట్గా ఉన్నాడు’ అని మాజీ ఆటగాడు ఎం.విజయన్ అభిప్రాయపడ్డారు. ఆసియా కప్ 2027 కోసం ప్రకటించిన 26 మంది సభ్యుల జట్టులో ఛెత్రికి అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) చోటు కల్పించింది. ప్రస్తుతం జరుగుతున్న ఐఎస్ఎల్లో మంచి ఫామ్లో ఉన్న ఛెత్రి 12 గోల్స్తో టాప్స్కోరర్గా ఉన్నాడు. వయసుకంటే అతని ఆటను చూడాలని ఏఐఎఫ్ఎఫ్ అధ్యక్షుడు కళ్యాణ్ చౌబే అన్నారు.‘ఛెత్రి నాయకత్వ లక్షణాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతని స్థాయి ప్లేయర్ మొత్తం జట్టులో స్ఫూర్తిని నింపగలడు. అలాంటి స్ట్రయికర్ ఉంటే భారత జట్టుకు మేలు జరుగుతుంది’ అని ఆయన చెప్పారు. ఛెత్రి రిటైర్మెంట్ తర్వాత నాలుగు మ్యాచ్లు ఆడిన భారత్ 3 మ్యాచ్లు ‘డ్రా’ చేసుకొని మరో దాంట్లో చిత్తుగా ఓడింది తప్ప ఒక్క విజయమూ దక్కలేదు. రీఎంట్రీ అవసరమా?అయితే ఛెత్రి పునరాగమనం భారత ఫుట్బాల్ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో చూపిస్తోంది. అతడు తప్పుకున్న తర్వాత కూడా కనీసం ఒక నాణ్యమైన స్ట్రయికర్ను జట్టు తయారు చేసుకోలేకపోతోంది.‘ఇప్పుడు కాకపోతే కొద్ది రోజులకైనా సరే ఛెత్రి తప్పుకోవాల్సిందే. అప్పుడు ఏం చేస్తారు. ఎప్పటి వరకు అతనిపై ఆధారపడతారు. ఏ ఆటలోనైనా, ఎంత గొప్పవారైనా ఆటను ముగించాల్సిందే. తర్వాతి తరాన్ని తీర్చిదిద్దడం, ప్రతిభను ప్రోత్సహించి ఫలితాలు రాబట్టడం ఫెడరేషన్ చేయాల్సిన పని. కానీ మళ్లీ వచ్చి ఆడమని అడగటం ఏ రకంగాను సరైంది కాదు. ఇప్పటికిప్పుడు ఫలితాలు రాకపోయినా... యువ ఆటగాళ్లను భవిష్యత్తు కోసం సిద్ధం చేసుకుంటే బాగుంటుంది’ అని ఫుట్బాల్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఈ నేపథ్యంలో భారత ఫుట్బాల్ దిగ్గజం, మాజీ కెప్టెన్ భాయ్చంగ్ భుటియా కూడా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. హెడ్కోచ్ మనోలో మీద తీవ్రమైన ఒత్తిడి ఉందని తనకు తెలుసునని.. అయితే, ఛెత్రిని తిరిగి తీసుకురావడం వల్ల దీర్ఘకాలంలో ప్రయోజనాలేమీ కలగవని పేర్కొన్నాడు. ఛెత్రి పునరాగమనం అద్భుతంగా అనిపిస్తున్నా.. భారత ఫుట్బాల్ అభివృద్ధికి ఇది ఏమాత్రం దోహదం చేయదని అభిప్రాయపడ్డాడు. నలభై ఏళ్ల ఆటగాడిపై ఆధారపడి జట్టును నడుపుతామని చెప్పడం సరైన సంకేతం కాదని భుటియా పేర్కొన్నాడు. -
‘బంగారం’లాంటి ఆటను వదిలి...
లండన్: జేడ్ జోన్స్... బ్రిటన్ ప్రొఫెషనల్ తైక్వాండో ప్లేయర్. అంతేకాదు! స్వదేశంలో జరిగిన 2012 లండన్ ఒలింపిక్స్ క్రీడల్లో... 2016 రియో ఒలింపిక్స్ క్రీడల్లో... మహిళల తైక్వాండో ఈవెంట్లో స్వర్ణ పతకాలు గెలుచుకుంది. తదనంతరం 2020 టోక్యో, 2024 పారిస్ విశ్వక్రీడల్లోనూ జేడ్ పాల్గొంది. 2010లో యూత్ ఒలింపిక్స్ స్వర్ణం మొదలు, ప్రపంచ జూనియర్ చాంపియన్షిప్, ప్రపంచ చాంపియన్షిప్, యూరోపియన్ గేమ్స్, యూరోపియన్ చాంపియన్షిప్, గ్రాండ్ప్రి ఈవెంట్లలో 36 (19 స్వర్ణాలు, 11 రజతాలు, 6 కాంస్యాలు) పతకాలు గెలుచుకుంది. జేడ్ జోన్స్ పతకాల సంఖ్య ఆమె వయసు (31 ఏళ్లు)ను ఎప్పుడో మించిపోయింది. బహుశా ‘కిక్’ కొడితే పతకాలు రాలుతున్న తైక్వాండో క్రీడాంశం బోర్ కొట్టించిదేమో తెలియదు కానీ ఈ బ్రిటన్ క్రీడాకారిణి ఇప్పుడు కొత్త ‘పంచ్’కు సిద్ధమైంది. బాక్సింగ్ను తెగ ఇష్టపడటం వల్లే 20 ఏళ్ల తర్వాత కొత్త కెరీర్లోకి అడుగుపెడుతున్నట్లు జోన్స్ చెప్పింది. రింగ్లో ఆమె అపుడే లక్ష్యాన్ని కూడా నిర్దేశించుకుంది. ‘ఇప్పటికే తైక్వాండోలో ప్రపంచ చాంపియన్ అయ్యాను. త్వరలో బాక్సింగ్లోనూ ప్రపంచ చాంపియన్ కావాలని ఆశిస్తున్నాను. రెండు వేర్వేరు క్రీడల్లో ఈ ఘనత సాధిస్తే గొప్పగా ఉంటుంది కదూ’ అని చెప్పింది. బ్రిటిష్, కామన్వెల్త్ ఫెదర్వెయిట్ మాజీ చాంపియన్ స్టీఫెన్ స్మిత్ కోచింగ్లో తీవ్రస్థాయిలో కసరత్తులు కూడా చేస్తోంది.అయితే మూడు పదుల వయసు దాటిన తర్వాత పూర్తిగా కొత్త క్రీడలో పతకాలు సాధించడం పెద్ద సవాల్ అని చెప్పొచ్చు. 19 ఏళ్ల టీనేజ్లోనే జోన్స్ లండన్ విశ్వక్రీడల్లో బంగారు పతకం గెలిచింది. మళ్లీ నాలుగేళ్ల తర్వాత ‘రియో’లో నిలబెట్టుకుంది. -
మన ఆటలో వేగం పెరగాలి
న్యూఢిల్లీ: అరంగేట్ర మ్యాచ్లోనే అనూహ్య గోల్తో అదరగొట్టిన భారత మహిళల హాకీ జట్టు యువ ఫార్వర్డ్ సాక్షి రాణా... అంతర్జాతీయ స్థాయిలో నిలకడ కొనసాగించేందుకు ఆటలో వేగం పెంచుకోవడంపై దృష్టి పెట్టింది. ఇటీవల అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్ సందర్భంగా స్పెయిన్తో మ్యాచ్ ద్వారా 17 ఏళ్ల సాక్షి రాణా సీనియర్ స్థాయిలో అరంగేట్రం చేసింది. భువనేశ్వర్ వేదికగా ప్రపంచ ఏడో ర్యాంకర్ స్పెయిన్తో జరిగిన పోరులో సాక్షి తన ఆటతీరుతో ఆకట్టుకుంది. ఆ మ్యాచ్లో భారత్ 3–4 గోల్స్ తేడాతో స్పెయిన్ చేతిలో ఓడినప్పటికీ... సాక్షి మాత్రం చక్కటి ‘ఫీల్డ్ గోల్’తో తనదైన ముద్ర వేసింది. జూనియర్ స్థాయిలో చక్కటి ప్రదర్శనతో సీనియర్ జట్టుకు ఎంపికైన సాక్షి రాణా... మొదటి మ్యాచ్లోనే గోల్ చేయడం చాలా ఆనందంగా ఉందని చెప్పింది. ‘సీనియర్ జట్టు తరఫున అరంగేట్రం చేసేందుకు చాన్నాళ్లుగా ఎదురుచూశా.తొలి మ్యాచ్లో సీనియర్ ప్లేయర్లు ఎంతగానో సహకరించారు. అంతర్జాతీయ స్థాయిలో మొదటి పోరును ఆస్వాదించమని సూచించారు. దీంతో ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడగలిగా’ అని సాక్షి వెల్లడించింది. స్పెయిన్తో మ్యాచ్లో ప్రత్యర్థి ప్లేయర్ల నుంచి సర్కిల్లో బంతి చేజిక్కించుకున్న సాక్షి దానిని గోల్గా మలిచింది. ‘తొలి మ్యాచ్లోనే గోల్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా. దాని కోసం తీవ్రంగా శ్రమించా. మ్యాచ్ సమయంలో నా చేతికి బంతి దొరికినప్పుడు చుట్టుపక్కల ఎవరూ లేరని గమనించా. అదే అదునుగా షాట్ కొట్టా. దీంతో ఒక్కసారిగా అందరూ అరవడం ప్రారంభించారు. అప్పుడుగోల్ కొట్టానని అర్థమైంది’ అని సాక్షి చెప్పింది. ఎఫ్ఐహెచ్ ప్రొ హాకీ లీగ్లో భాగంగా స్పెయిన్, జర్మనీ జట్లపై ఆడిన సాక్షి... విదేశీ ప్లేయర్లతో పోటీపడాలంటే ఆటలో మరింత వేగం పెంపొందించుకోవాలని సాక్షి అభిప్రాయపడింది. ‘అంతర్జాతీయ స్థాయి లో రాణించాలంటే మరింత వేగం, చురుకుదనం పెంచుకోవాలని అర్థమైంది. ఫార్వర్డ్గా అది నాకు మరింత కీలకం. అందుకే ఇప్పుడు దానిపై దృష్టి సారించా. ప్రొ హాకీ లీగ్కు స్టాండ్బై ప్లేయర్గా ఎంపికయ్యా. చీఫ్ కోచ్ హరేంద్ర సింగ్ తొలి మ్యాచ్ ఆడుతున్నావు అని చెప్పినప్పుడు చాలా సంతోషం వేసింది. నిన్ను మాత్రమే జట్టుకు ఎంపిక చేయలేదు... నీ ఆటను కూడా సెలెక్ట్ చేశాం... మైదానంలో విజృంభించు అని కోచ్ వెన్నుతట్టారు.దీంతో ఆత్మవిశ్వాసంతో ఆడగలిగాను’ అని సాక్షి చెప్పింది. గతేడాది జూనియర్ ఆసియా కప్లో పసిడి పతకం గెలిచిన భారత జట్టులో సభ్యురాలైన సాక్షి... ఈ ఏడాది చిలీ వేదికగా జరగనున్న జూనియర్ ప్రపంచకప్లో యువ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించనుంది. -
‘క్రీడాకారులకు ప్రత్యేక ఐడీ’
సాక్షి, హైదరాబాద్: దేశంలో ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా అన్నారు. ఇందు కోసం భిన్నమైన పలు కార్యక్రమాలు చేపట్టిందని ఆయన వెల్లడించారు. మాండవియా అధ్యక్షతన భారత క్రీడా రంగం మెరుగుదల, భవిష్యత్తుకు సంబంధించి శుక్రవారం ప్రత్యేక ‘చింతన్ శిబిర్’ ప్రారంభమైంది. నగర శివార్లలో కన్హా శాంతి వనంలో జరుగుతున్న రెండు రోజుల ఈ శిబిరం శనివారం ముగుస్తుంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన క్రీడా శాఖల మంత్రులు, క్రీడా పరిపాలకులు, సీనియర్ ప్రభుత్వాధికారులతో పాటు కేంద్ర క్రీడాశాఖ సహాయ మంత్రి రక్ష ఖడ్సే కూడా దీనికి హాజరయ్యారు. ప్రపంచ క్రీడల్లో భారత్ స్థాయిని మరింత పెంచే దిశగా పలు ఆలోచనలను పంచుకున్న వీరంతా అందుకు తగిన విధంగా రూట్ మ్యాప్ కోసం తమ వంతు సూచనలు అందించారు. ముఖ్యంగా 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లో భారత్ పెద్ద సంఖ్యలో పతకాలు సాధించే లక్ష్యంతోపాటు 2036 ఒలింపిక్స్కు భారత్ ఆతిథ్యం ఇచ్చే అంశంపై ఈ కార్యక్రమంలో చర్చ జరిగింది. ఒలింపిక్స్ను మన దేశం నిర్వహించాలనే కలకు ఈ చింతన్ శిబిర్ నుంచి తొలి అడుగు పడాలని మాండవియా అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో దేశంలో ఉన్న క్రీడా ప్రతిభ వృథా కాకుండా ఉండేందుకు తాము ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు.‘ప్రతిభాన్వేషణలో ఖేలో ఇండియా వంటి పథకాలు కీలక పాత్ర పోషించాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 937 ఖేలో ఇండియా కేంద్రాలు సమర్థంగా పని చేస్తున్నాయి. 9–14 ఏళ్ల మధ్య వయసు ఉన్న ఆటగాళ్లను గుర్తించి తీర్చిదిద్దితే ఒలింపిక్స్లో మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు సాంకేతికతను వాడుకోవడం కూడా కీలకాంశం. దీని కోసం ప్రభుత్వం ఒక కొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. ఆటగాళ్ల వివరాలను ఒకే చోట నమోదు చేసి ప్రత్యేక ఐడీలు ఇవ్వబోతున్నాం. అలా చేస్తే వారిని తగిన రీతిలో ప్రోత్సహిస్తూ పురోగతిని పరిశీలించేందుకు అవకాశం ఉంటుంది’ అని మాండవియా వెల్లడించారు. ఒలింపిక్ మిషన్ కోసం జాతీయ క్రీడా సమాఖ్యలు మరింత సమర్థంగా పని చేయాల్సి ఉంటుందన్న కేంద్ర మంత్రి... ఆటగాళ్ల సెలక్షన్స్లో పారదర్శకత పాటిస్తే తల్లిదండ్రులు మరింత పెద్ద సంఖ్యలో తమ పిల్లలను క్రీడల వైపు తీసుకొస్తారని విశ్లేషించారు. కార్యక్రమంలో పాల్గొన్నవారంతా క్రీడాభివృద్ధి కోసం తమ సలహాలు అందించారు. దేశవ్యాప్తంగా జిల్లా స్థాయి స్పోర్ట్స్ స్కూల్లను ఏర్పాటు చేయాలని, అందుబాటులో ఉన్న స్టేడియంలు తదితర మౌలిక సౌకర్యాలను సమర్థంగా వాడుకునేలా చూడాలని వారు సూచించారు. -
రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్న టీమిండియా మాజీ కెప్టెన్
భారత ఫుట్బాల్ దిగ్గజం, టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ ఛెత్రీ మళ్లీ నీలం రంగు జెర్సీతో బరిలోకి దిగనున్నాడు. 40 ఏళ్ల ఛెత్రీ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నట్లు ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ ప్రకటించింది. ఛెత్రీ త్వరలో జరుగనున్న ఫిఫా ఇంటర్నేషనల్ విండోలో భారత్ తరఫున బరిలోకి దిగనున్నాడు. ఫిఫా ఇంటర్నేషనల్ విండో కోసం ప్రకటించిన 26 మంది సభ్యుల భారత జట్టులో ఛెత్రీకి చోటు దక్కింది. ఏడాది గడుస్తున్నా భారత జట్టులో తన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేకపోవడంతో రిటైర్మెంట్ విషయంలో ఛెత్రీ మనసు మార్చుకున్నాడు. పదేళ్లకు పైగా భారత జట్టుకు నాయకత్వం వహించిన ఛెత్రీ.. గతేడాది జూన్ 6న రిటైర్మెంట్ ప్రకటించాడు. కోల్కతాలో కువైట్తో జరిగిన ఫిఫా వరల్డ్కప్ క్వాలిఫయింగ్ మ్యాచ్ ఛెత్రీకి చివరిది.2005లో భారత్ తరఫున అరంగ్రేటం చేసిన ఛెత్రీ.. భారత ఆల్టైమ్ లీడింగ్ గోల్ స్కోరర్గా కెరీర్ ముగించాడు. ఛెత్రీ భారత్ తరఫున అత్యధిక మ్యాచ్లు ఆడిన ఆటగాడిగానూ రికార్డు కలిగి ఉన్నాడు. ఛెత్రీ తన కెరీర్లో 94 అంతర్జాతీయ గోల్స్ సాధించాడు. పురుషుల అంతర్జాతీయ ఫుట్బాల్లో నాలుగో అత్యధిక గోల్ స్కోరర్గా ఛెత్రీ కొనసాగుతున్నాడు. అంతర్జాతీయ ఫుట్బాల్లో దిగ్గజాలు క్రిస్టియానో రొనాల్డో, లియోనల్ మెస్సీ, అలీ డై మాత్రమే ఛెత్రీ కంటే ఎక్కువ గోల్స్ చేశారు.ఛెత్రీ అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు పలికినప్పటికీ.. ఇండియన్ సూపర్ లీగ్లో బెంగళూరు ఎఫ్సీకి ప్రాతినిథ్యం వహిస్తూనే ఉన్నాడు. ఈ సీజన్లో ఛెత్రీ 12 మ్యాచ్ల్లో 23 గోల్స్ చేసి ఐఎస్ఎల్లో భారత్ తరఫున అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు.కాగా, భారత ఫుట్బాల్ జట్టు ఏఎఫ్సీ ఆసియా కప్ సౌదీ అరేబియా 2027 క్వాలిఫయర్స్ ఫైనల్ రౌండ్ సన్నాహకాల్లో భాగంగా మార్చి 19న మాల్దీవ్స్తో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనుంది. అనంతరం భారత్ ఏఎఫ్సీ ఆసియా కప్-2027 క్వాలిఫయర్స్లో (మార్చి 25) బంగ్లాదేశ్తో తలపడనుంది. ఈ టోర్నీలో భారత్.. బంగ్లాదేశ్, హాంగ్కాంగ్, సింగపూర్ జట్లతో పోటీపడనుంది. ఈ టోర్నీలో భారత్ మ్యాచ్లు షిల్లాంగ్లోని జవహర్ లాల్ స్టేడియంలో జరుగనున్నాయి.ఫిఫా ఇంటర్నేషనల్ విండో కోసం భారత జట్టు..గోల్ కీపర్స్- అమరిందర్ సింగ్, గుర్మీత్ సింగ్, విశాల్ కైత్డిఫెండర్స్- ఆషికి కురునియన్, ఆయుశ్ దేవ్ ఛెత్రీ, బ్రాండన్ ఫెర్నాండెస్, బ్రైసన్ ఫెర్నాండెస్, జీక్సన్ సింగ్ థౌనౌజమ్, లాలెంగ్మావియా, లిస్టన్ కొలాకో, మహేశ్ సింగ్ నోరెమ్, సురేశ్ సింగ్ వాంగ్జమ్ఫార్వర్డ్స్- సునీల్ ఛెత్రీ, ఫరూక్ ఛౌదరీ, ఇర్ఫాన్ యద్వాద్, లల్లియన్జువాలా ఛంగ్టే, మన్వీర్ సింగ్ -
‘మా ప్రేమ కథకు కొనసాగింపు’.. తల్లిదండ్రులు కాబోతున్న క్రీడా జంట
భారత మాజీ రెజ్లర్ వినేశ్ ఫొగట్(Vinesh Phogat) శుభవార్త చెప్పింది. తాను తల్లి కాబోతున్నట్లు వెల్లడించింది. భర్త సోమ్వీర్ రాఠీ(Somvir Rathee)తో కలిసి తొలి బిడ్డకు స్వాగతం పలుకబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ‘‘మా ప్రేమ కథకు కొనసాగింపు.. సరికొత్త అధ్యాయంతో మొదలు’’ అంటూ చిన్నారి పాదం, లవ్ ఎమోజీలను షేర్ చేస్తూ ఈ క్రీడాకారుల జంట తమ సంతోషాన్ని అభిమానులతో పంచుకుంది.కాగా భారత స్టార్ రెజ్లర్గా పేరొందిన వినేశ్ ఫొగట్ గతేడాది పతాక శీర్షికల్లో నిలిచింది. ప్యారిస్ ఒలింపిక్స్-2024 ఫైనల్కు చేరుకున్న ఈ హర్యానా అథ్లెట్పై అనూహ్య రీతిలో ఆఖరి నిమిషంలో వేటు పడింది. నిర్ణీత బరువు కంటే వంద గ్రాములు అదనంగా ఉన్నందు వల్ల ఆమెను అనర్హురాలిగా తేల్చారు. దీంతో.. రెజ్లింగ్లో భారత్కు తొలి స్వర్ణం వస్తుందన్న ఆశలు ఆవిరి కాగా.. దేశవ్యాప్తంగా యూడబ్ల్యూడబ్ల్యూ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.అనర్హత వేటు ఎదుర్కోవాల్సిందేనన్న స్పోర్ట్స్ కోర్టుభారత ఒలింపిక్ సంఘం(IOA), అధికారుల తీరుపైనా ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఐఓఏ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (సీఏఎస్)లో అప్పీలు చేయగా నిరాశే ఎదురైంది. ‘‘అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే క్రీడాకారులు నిబంధనలను పూర్తిగా తెలుసుకోవాలి’’ అంటూ వినేశ్ అభ్యర్థనను కొట్టిపారేసింది.‘క్రీడాకారులకు నిబంధనలపై పూర్తి అవగాహన ఉండాలి. బరిలోకి దిగే బరువు కేటగిరీ కంటే ఎక్కువ ఉంటే అనుమతించరు. అది అందరికీ వర్తిస్తుంది. ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉండవు. నిర్ణీత బరువు కంటే ఒక్క గ్రాము ఎక్కువ ఉన్న అనర్హత వేటు ఎదుర్కోవాల్సిందే’’ అని సీఏఎస్ స్పష్టం చేసింది.ఈ క్రమంలో తొలి రోజు పోటీల్లో నిర్ణీత బరువుతోనే పోటీపడి విజయాలు సాధించినందుకుగానూ... గుజ్మన్ లోపెజ్తో కలిపి తనకూ రజతం ఇవ్వాలని వినేశ్ న్యాయపోరాటం చేసినా సానుకూల ఫలితం రాలేదు. దీంతో మహిళల 50 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో సంచలన విజయాలు సాధించినా వినేశ్ పతకం లేకుండానే దేశానికి తిరిగి వచ్చింది. రాజకీయాల్లోకికాగా ప్యారిస్ ఒలింపిక్స్లో దిగ్గజ రెజ్లర్ యూ సుసూకీపై వినేశ్ సాధించిన విజయం చిరస్మరణీయంగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. అంతేకాదు.. ఒలింపిక్స్ ఫైనల్కు చేరిన తొలి మహిళా రెజ్లర్గా చరిత్ర పుటల్లో ఆమె పేరు అజరామరంగా ఉంటుంది.అతడే ఆమెకు సర్వస్వంఇక ఈ తీవ్ర నిరాశ అనంతరం.. కుస్తీకి స్వస్తి చెప్పిన వినేశ్ ఫొగట్ రాజకీయాల్లో ప్రవేశించింది. కాంగ్రెస్ పార్టీలో చేరి హర్యానాలోని ఝులన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైంది. కాగా వినేశ్ భర్త సోమ్వీర్ కూడా రెజ్లరే. హర్యానాకు చెందిన అతడు.. జాతీయ స్థాయిలో పతకాలు గెలుచుకున్నాడు. వినేశ్, సోమ్వీర్ రాఠీ రైల్వేలో ఉద్యోగం చేస్తున్న సమయంలో ప్రేమలో పడ్డారు.అయితే, వ్యక్తిగతంగా, కెరీర్ పరంగా అనుకున్న లక్ష్యాలు చేరుకునే క్రమంలో వినేశ్కు సోమ్వీర్ అన్నిరకాలుగా అండగా నిలిచాడు. ఈ క్రమంలో పెళ్లి బంధంతో ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్న ఈ క్రీడా జంట 2018లో వివాహం చేసుకున్నారు. ‘బేటీ బచావో.. బేటీ పడావో.. బేటీ ఖిలావో’ అంటూ సప్తపదికి మరో అడుగును జతచేసి పెళ్లినాడు ఎనిమిది అడుగులు వేశారు.సంబంధిత వార్త : తను లేకుంటే నేను లేను.. వినేశ్కు అతడే కొండంత అండ -
అవకతవకలకు తావులేకుండా...
న్యూఢిల్లీ: క్రీడాకారుల ఎంపిక విషయంలో పారదర్శకత పెంపొందించాలనుకుంటున్న కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ... జాతీయ క్రీడా సమాఖ్యలకు కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. సెలెక్షన్ ప్రక్రియను వీడియో రూపంలో పొందుపరచాలని ఇప్పటికే స్పష్టంచేసిన కేంద్ర మంత్రిత్వ శాఖ... ఎంపిక ప్రక్రియకు ముందు పాటించాల్సిన నింబధనలను తాజాగా వెల్లడించింది. సెలెక్షన్లో అవకతవకలకు తావివ్వకుండా జావాబుదారీతనం పెంపొందించేందుకు ఇవి ఉపయోగపడనున్నాయి. క్రీడాకారులను ఎంపిక చేయడానికి 15 రోజుల ముందే దానికి సంబంధించిన పూర్తి వివరాలను వివిధ జాతీయ క్రీడా సమాఖ్యలు వెల్లడించాలని క్రీడా మంత్రిత్వ శాఖ సూచించింది. దీనివల్ల ట్రయల్స్లో అన్యాయం జరిగిందనే విమర్శలకు అవకాశం ఇవ్వకూడదని భావిస్తోంది. ఇటీవలి కాలంలో రెజ్లింగ్, షూటింగ్తో పాటు సెలెక్షన్స్ అవకతవకలపై పలు ఫిర్యాదులు అందడంతో... కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ జాతీయ క్రీడా సమాఖ్యలకు ప్రత్యేక సూచనలు చేశారు.ఎంపిక ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకు అవకాశం ఇవ్వకూడదని సూచించారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసింది. భారత ఒలింపిక్స్ సంఘం (ఐఓఏ), స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్), జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్ఎస్ఎఫ్)లకు పంపింది. » ఎంపిక ప్రక్రియకు సంబంధించిన నియమ నిబంధనలను ప్రతి సమాఖ్య తమ అధికారిక వెబ్సైట్లో పొందుపరచడం తప్పనిసరి. సెలెక్షన్కు మూడు నెలల సమయం ఉన్నప్పుడు మాత్రమే వాటిలో మార్పు చేర్పులు చేయాలి. » సెలెక్షన్ ప్రక్రియనంతా వీడియోలో నిక్షిప్తం చేయాలి. వీటి రికార్డులను సెలెక్షన్ కమిటీ సంతకం చేసిన అనంతరం విధిగా ‘సాయ్’కు అందజేయాలి. ప్రతి ట్రయల్కు ముందు అవసరమైన ఆర్థిక సహాయానికి సంబంధించిన వివరాలను మంత్రిత్వ శాఖకు తెలియజేయాలి. » ఒలింపిక్స్, పారాలింపిక్స్, ఆసియా గేమ్స్, పారా ఆసియా గేమ్స్, కామన్వెల్త్ క్రీడల వంటి పెద్ద టోర్నీల ఎంపిక ప్రమాణాలను కనీసం రెండు సంవత్సరాల ముందుగానే పొందుపరచాలి. ఈ అంశంలో అథ్లెట్లకు అవగాహన కల్పించాలి. » విదేశీ టోర్నీల్లో పాల్గొనేందుకు వెళ్లే సమయంలో పాటిస్తున్న నిబంధనల విషయంలో పునరాలోచించాలని ప్రముఖ షూటింగ్ కోచ్ జస్పాల్ రాణా గతంలోనే కోరగా... తాజాగా కేంద్ర మంత్రిత్వ శాఖ ఈ అంశంలోనూ కీలక సవరణలు చేసింది. » సెలెక్షన్ కమిటీలోని సభ్యులెవరూ... ఫిర్యాదుల పరిష్కార కమిటీలో భాగం కాకూడదు. ఇది సహజ న్యాయ సూత్రానికి విరుద్ధం. జాతీయ క్రీడా సమాఖ్య వివాద పరిష్కార కమిషన్ను ఏర్పాటు చేసుకోవాలి. » జాతీయ క్రీడా సమాఖ్యల అధ్యక్షులు ఎంపిక ప్రక్రియను దగ్గరుండి పరిశీలించాలి. హై పెర్ఫార్మెన్స్ డైరెక్టర్, చీఫ్ కోచ్, మాజీ క్రీడాకారులు, ఖేల్రత్న, అర్జున అవార్డు గ్రహీతలు ఇలా అందుబాటులో ఉన్న వారిని సెలెక్షన్ కమిటీకి ఎంపిక చేసే అధికారం జాతీయ క్రీడా సమాఖ్యల అధ్యక్షులదే. -
రుత్విక–రోహన్ జోడీ శుభారంభం
పారిస్: ఓర్లియాన్స్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో తెలంగాణ అమ్మాయి గద్దె రుత్విక శివాని శుభారంభం చేసింది. బుధవారం జరిగిన తొలి రౌండ్లో రుత్విక శివాని–రోహన్ కపూర్ (భారత్) ద్వయం 20–22, 24–22, 21–16తో యె హాంగ్ వె–నికోల్ గొంజాలెజ్ చాన్ (చైనీస్ తైపీ) జోడీని ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. తొలి గేమ్ కోల్పోయిన రుత్విక–రోహన్ రెండో గేమ్లో రెండుసార్లు మ్యాచ్ పాయింట్లు కాపాడుకొని గట్టెక్కారు. నిర్ణాయక మూడో గేమ్లో ఆరంభంలోనే 5–1తో ఆధిక్యంలోకి వెళ్లిన రుత్విక–రోహన్ చివరివరకు ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని విజయాన్ని ఖరారు చేసుకున్నారు. పురుషుల సింగిల్స్ విభాగంలో భారత ప్లేయర్లు కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్, ఆయుశ్ షెట్టి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించగా... కిరణ్ జార్జి, ప్రియాన్షు రజావత్, సతీశ్ కుమార్ కరుణాకరన్ తొలి రౌండ్లో ఓడిపోయారు. శ్రీకాంత్ 21–19, 21–14తో కూ తకహాషి (జపాన్)పై, ప్రణయ్ 21–11, 20–22, 21–9తో జు వె వాంగ్ (చైనీస్ తైపీ)పై, ఆయుశ్ 21–17, 21–9తో ప్రపంచ మాజీ చాంపియన్ కీ యె లో (సింగపూర్)పై గెలిచారు. కిరణ్ జార్జి 21–15, 16–21, 10–21తో జియా హెంగ్ జేసన్ (సింగపూర్) చేతిలో, ప్రియాన్షు 17–21, 7–21తో అలెక్స్ లేనియర్ (ఫ్రాన్స్) చేతిలో ఓటమి పాలయ్యారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్ల్లో భారత ప్లేయర్లు ఉన్నతి హుడా 9–21, 15–21తో ప్రపంచ నంబర్వన్ ఆన్ సె యంగ్ (దక్షిణ కొరియా) చేతిలో... ఇషారాణి బారువా 13–21, 13–21తో అసుక తకహాషి (జపాన్) చేతిలో ఓడిపోయారు. -
ట్రాన్స్జెండర్లపై ఐఓసీ ఓ నిర్ణయానికి రావాలి
బెర్లిన్: లింగమార్పిడి చేసుకున్న క్రీడాకారుల్ని విశ్వక్రీడల్లో అనుమతించే విషయమై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని ఐఓసీ ఉపాధ్యక్షుడు యువాన్ ఆంటోని సమరాంచ్ సూచించారు. ‘ఈ విషయంలో యావత్ ప్రపంచం ఐఓసీ నిర్ణయం కోసం ఎదురుచూస్తోంది. మహిళా అథ్లెట్లు నష్టపోకుండా అంతర్జాతీయ క్రీడా సమాఖ్యలకు దిక్సూచిలా వ్యవహరించే నిర్ణయాన్ని ఐఓసీ తీసుకోవాలి. దీనిపై తాత్సారం చేయకుండా శాస్త్రీయమైన కారణాలను పరిశీలించి వెంటనే ఓ నిర్ణయానికి రావాలి’ అని 65 ఏళ్ల సమరాంచ్ పేర్కొన్నారు. లింగమార్పిడితో అమ్మాయిలుగా మారిన ట్రాన్స్జెండర్లతో నిజమైన మహిళా అథ్లెట్ల ప్రయోజనాలకు నష్టం కలుగకుండా ఐఓసీ నిర్ణయం ఉండాలన్నారు. గతేడాది రెండోసారి అమెరికా అధ్యక్ష పీఠానికి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న కఠిన నిర్ణయాల్లో ట్రాన్స్జెండర్లను అనుమతించబోమనే ప్రెసిడెన్షియల్ రూల్ కూడా ఉంది. ఇప్పటికే అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ క్రీడల్లో ట్రాన్స్జెండర్లను మహిళల కేటగిరీలో పోటీపడకుండా నిక్కచ్చిగా అమలు చేసేందుకు అధికార యంత్రాంగం కృషి చేస్తోంది. ఎందుకంటే 2028లో లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ నేపథ్యంలో ట్రంప్ ఆదేశాలు అమలవుతున్నాయి. ఈ నేపథ్యంలో సమరాంచ్ కూడా ఐఓసీ ఉన్నతస్థాయి మండలి తుది నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. స్పెయిన్కు చెందిన ఈ సీనియర్ ఉపాధ్యక్షుడు ప్రస్తుతం అధ్యక్ష రేసులో ఉన్నారు. పదవీకాలం ముగిసిన ప్రస్తుత అధ్యక్షుడు థామస్ బాచ్ వారసుడి ఎన్నిక కోసం మొత్తం ఏడుగురు అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఈ నెల 20న ఐఓసీ ఎన్నికలు జరుగనున్నాయి. సమరాంచ్తో పాటు ప్రపంచ అథ్లెటిక్స్ చీఫ్ సెబాస్టియన్ కో, పలు ఒలింపిక్స్లలో స్విమ్మింగ్ చాంపియన్ క్రిస్టీ కొవెంట్రీ, అంతర్జాతీయ సైక్లింగ్ చీఫ్ డేవిడ్ లాపర్టియెంట్, జోర్డాన్ చక్రవర్తి ఫైజల్ అల్ హుస్సేన్, ప్రపంచ జిమ్నాస్టిక్స్ హెడ్ మోరినరి వతనబె, కొత్తగా ఐఓసీలోకి వచ్చిన మల్టీ మిలియనీర్ జోహన్ ఎలియస్చ్ (ప్రపంచ స్కీయింగ్ చీఫ్)లు ఐఓసీ అధ్యక్ష పీఠంపై కన్నేశారు. 2020 టోక్యో ఒలింపిక్స్లో లింగమార్పిడి చేసుకున్న న్యూజిలాండ్ వెయిట్లిఫ్టర్ లారెల్ హబర్డ్ మహిళల ప్లస్ 87 కేజీ విభాగంలో పోటీపడింది. అయితే ఆమె చివరిదైన 14వ స్థానంతో సరిపెట్టుకుంది. ఈ క్రమంలో ఒలింపిక్స్లో పోటీపడ్డ తొలి ట్రాన్స్జెండర్ అథ్లెట్గా ఆమె గుర్తింపు పొందింది. -
TT Legend: పతకాల వీరుడు.. శరత్ శకం ముగిసే!
కామన్వెల్త్ గేమ్స్లో 7 పసిడి పతకాలు... మరో 3 రజతాలు, 3 కాంస్యాలు...ఆసియా క్రీడల్లో 2 కాంస్య పతకాలు..ఆసియా చాంపియన్షిప్లో 4 కాంస్యాలు...ప్రపంచ ర్యాంకింగ్స్లో అత్యుత్తమంగా 30వ స్థానం...10 సార్లు జాతీయ సీనియర్ చాంపియన్గా ఘనత... ఐదుసార్లు ఒలింపిక్స్ క్రీడల్లో దేశానికి ప్రాతినిధ్యం...అర్జున, ఖేల్రత్నతో పాటు పద్మశ్రీ పురస్కారం కైవసం...2024 పారిస్ ఒలింపిక్స్లో త్రివర్ణ పతాకధారిగా భారత బృందానికి నాయకత్వం వహించడం...ఒక క్రీడాకారుడి కెరీర్లో ఇంతకుమించి ఏం కావాలి! భారత టేబుల్ టెన్నిస్ (టీటీ)కు వన్నెతెచి్చన ఆచంట శరత్ కమల్ ఇవన్నీ సాకారం చేసుకున్నాడు. రెండు దశాబ్దాలుగా భారత టీటీ ముఖచిత్రంగా ఉన్న శరత్ కమల్ ఆట ముగించాలని నిర్ణయం తీసుకున్నాడు. స్వస్థలం చెన్నైలో ఈనెల 25 నుంచి 30వ తేదీ వరకు జరిగే వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) కంటెండర్ టోర్నీలో చివరిసారి బరిలోకి దిగుతానని శరత్ బుధవారం ప్రకటించాడు. 22 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో లెక్కకు మిక్కిలి పతకాలు నెగ్గిన శరత్ ఘనతలను ఒకసారి గుర్తుచేసుకుంటే... సాక్షి క్రీడావిభాగం : భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) దిగ్గజం ఆచంట శరత్ కమల్ కెరీర్కు వీడ్కోలు పలకనున్నాడు. మార్చి 25 నుంచి 30 వరకు చెన్నై వేదికగా జరగనున్న ప్రపంచ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) టోర్నీ అనంతరం ఆట నుంచి రిటైర్మెంట్ తీసుకోనున్నట్లు వెల్లడించాడు. రెండు దశాబ్దాలకు పైగా దేశ అత్యుత్తమ ప్యాడ్లర్గా కొనసాగిన 42 ఏళ్ల శరత్ కమల్... కామన్వెల్త్ క్రీడల్లో 7 స్వర్ణాలు, 3 రజతాలు, 3 కాంస్య పతకాలు కైవసం చేసుకున్నాడు. ఆసియా క్రీడల్లోనూ అదరగొట్టిన శరత్ కమల్... 2018 జకార్తా గేమ్స్లో పురుషుల టీమ్ విభాగంతో పాటు... మిక్స్డ్ డబుల్స్లో కాంస్య పతకం గెలుచుకున్నాడు. ఆసియా చాంపియన్షిప్లో 4 కాంస్య పతకాలు సాధించిన శరత్ కమల్... ఐదుసార్లు ఒలింపిక్స్లో దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. విశ్వక్రీడల్లో శరత్ పతకం సాధించనప్పటికీ అతడి ఘనతలను పతకాలతో కొలవలేం. సుదీర్ఘ కాలంగా అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ... కెరీర్లో అత్యుత్తమంగా ప్రపంచ 30వ ర్యాంక్కు చేరుకున్న శరత్ కమల్... దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘ఖేల్రత్న’తో పాటు నాలుగో అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మశ్రీ’ కూడా దక్కించుకున్నాడు. శరత్ స్ఫూర్తితోనే టేబుల్ టెన్నిస్ వైపు అడుగులు వేసిన మనిక బత్రా, ఆకుల శ్రీజ అంతర్జాతీయ స్థాయిలో చక్కటి ప్రదర్శనతో దూసుకెళ్తున్నారు. ‘ఆట నుంచి పూర్తిగా తప్పుకుంటానని చెప్పడం లేదు కానీ, ఇకపై పెద్ద టోర్నీలు, జనసమూహాల ముందు జరిగే మ్యాచ్ల్లో ఆడను. నా రాకెట్కు కొంత విశ్రాంతి ఇవ్వాలనుకుంటున్నా. టేబుల్ టెన్నిస్ నాకు ఇచ్చిన ఆనందం, అభిమానం వెలకట్టలేనిది. దాన్ని మాటల్లో వర్ణించలేను’ అని శరత్ పేర్కొన్నాడు. ‘1998లో చెన్నై వేదికగానే ఆసియా జూనియర్ చాంపియన్షిప్తో నా అంతర్జాతీయ కెరీర్ ప్రారంభమైంది. 2025లో చెన్నై వేదికగానే డబ్ల్యూటీటీ కంటెండర్ టోర్నీ ద్వారా నా కెరీర్ను ముగించాలని నిర్ణయం తీసుకున్నాను. నా ఆఖరి ఆట తిలకించేందుకు నా కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, చిన్ననాటి స్నేహితులు, శ్రేయోభిలాషులు వస్తారు. అత్యుత్తమ ఆటతీరుతో సగర్వంగా కెరీర్కు ముగింపు పలకాలని భావిస్తున్నాను’ అని శరత్ కమల్ వివరించాడు. » సీనియర్ నేషనల్ చాంపియన్షిప్లో 10 సార్లు విజేతగా నిలిచిన శరత్ కమల్... అంతకుముందు కమలేశ్ మెహతా నెలకొల్పిన రికార్డును (8 సార్లు) బద్దలు కొట్టాడు. ‘గత 20 ఏళ్లలో ఆటలో ఎన్నో మార్పులు సంభవించాయి. అప్పట్లో ఇలాంటి కొత్త తరహా షాట్లు ఏమీ లేవు. కానీ ఎప్పటికప్పుడు నైపుణ్యాన్ని మెరుగు పర్చుకుంటూ కొత్త ఒరవడి సృష్టించుకుంటూ వెళ్లడంతోనే శరత్ ఇంత సుదీర్ఘ కాలం రాణించగలిగాడు’ అని కమలేశ్ పేర్కొన్నాడు. » 2015 ప్రపంచ చాంపియన్షిప్ సమయంలో గాయపడిన శరత్ తిరిగి కోలుకుంటాడని ఎవరూ ఊహించి ఉండరు. కండరాల సమస్య నుంచి పూర్తిగా కోలుకున్న శరత్... ఆ తర్వాత కెరీర్లో ఎన్నో అద్వితీయ విజయాలు సాధించాడు. » టేబుల్ టెన్నిస్లో చైనా, జపాన్, దక్షిణ కొరియా ఆదిపత్యం కొనసాగుతున్న సమయంలో చైనీయులను ఓడించగలమని నిరూపించిన తొలి భారత ప్లేయర్గా శరత్ నిలిచాడు. » 2018 ఆసియా క్రీడల్లో చెన్నైకే చెందిన సత్యన్తో కలిసి శరత్... జపాన్ ద్వయంపై విజయం సాధించి కాంస్యం గెలుచుకోవడం ఎప్పటికీ మరిచిపోలేనిది. » జకార్తా వేదికగా జరిగిన ఆ క్రీడల్లో మనిక బత్రాతో కలిసి శరత్ మిక్స్డ్ డబుల్స్లోనూ కాంస్యం నెగ్గాడు. అప్పటి వరకు ఏమాత్రం అంచనాలు లేకుండానే బరిలోకి దిగిన శరత్ జంట... ఆ తర్వాత విజృంభించింది. » 2022 బర్మింగ్హామ్ కామన్వెల్త్ క్రీడల్లో నాలుగు పదులు వయసు దాటిన తర్వాత కూడా శరత్ చెలరేగిపోయాడు. ఫిట్నెస్ రక్షించుకునేందుకు తీవ్రంగా ప్రయతి్నంచి పోటీల్లో దిగిన శరత్ కమల్... మూడు స్వర్ణాలతో అదరగొట్టాడు. తెలంగాణకు చెందిన ఆకుల శ్రీజతో కలిసి శరత్ కమల్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో విజేతగా నిలిచాడు. » పెద్ద టోర్నమెంట్లో బరిలోకి దిగే ముందు బాగా ప్రాక్టీస్ చేసి కొత్త షాట్లను తన అమ్ములపొదిలో చేర్చుకోవడం శరత్కు అలవాటు. ఈ వయసులో ఇవన్నీ ఎలా సాధ్యం అనే ప్రశ్నకు చిరునవ్వే కమల్ సమాధానం. » అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) అథ్లెట్స్ కమిషన్కు ఎంపికైన తొలి భారత అథ్లెట్గా శరత్ ఘనత సాధించాడు. » ప్రస్తుతం భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)లో సభ్యుడిగా ఉన్న శరత్ కమల్... అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)లోనూ చోటు దక్కించుకోవాలని భావిస్తున్నాడు. » ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ తమిళనాడు (ఎస్డీఏటీ) సహకారంతో మెలకొట్టాయుర్లోని తమిళనాడు ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో శరత్ సొంతంగా హై పెర్ఫార్మెన్స్ సెంటర్ను నెలకొల్పనున్నాడు. -
టాప్ సీడ్పై సహజ సంచలన విజయం
గుర్గ్రామ్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) డబ్ల్యూ35 మహిళల టోర్నీ సింగిల్స్ విభాగంలో తెలంగాణ అమ్మాయి సహజ యామలపల్లి సంచలనం సృష్టించింది. బుధవారం జరిగిన తొలి రౌండ్లో 301వ ర్యాంకర్ సహజ 6–4, 6–2తో టాప్ సీడ్, ప్రపంచ 229వ ర్యాంకర్ కార్లోటా మార్టినెజ్ సిరెజ్ (స్పెయిన్)పై విజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. 1 గంట 49 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సహజ తన సర్వీను నాలుగుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీను ఏడుసార్లు బ్రేక్ చేసింది. ఇతర తొలి రౌండ్ మ్యాచ్ల్లో హైదరాబాద్ ప్లేయర్లు శ్రీవల్లి రష్మిక 3–6, 6–1, 3–6తో దరియా కుదషోవా (రష్యా) చేతిలో, స్మృతి భాసిన్ 1–6, 3–6తో అంటోనియా ష్మిడిట్ (జర్మనీ) చేతిలో ఓడిపోయారు. -
మెయిన్ ‘డ్రా’కు శ్రీకాంత్ అర్హత
పారిస్ (ఫ్రాన్స్): ఓర్లీన్స్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ప్రపంచ మాజీ నంబర్వన్, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్లో శ్రీకాంత్ ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ గెలుపొందాడు. తొలి రౌండ్లో ప్రపంచ 45వ ర్యాంకర్ శ్రీకాంత్ 21–8, 21–14తో మాడ్స్ క్రిస్టోఫర్సన్ (డెన్మార్క్)పై గెలిచాడు. అనంతరం రెండో రౌండ్లో శ్రీకాంత్ 21–11, 14–21, 21–12తో అర్నాడ్ మెర్కెల్ (ఫ్రాన్స్)పై విజయం సాధించాడు. 55 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో శ్రీకాంత్ మూడో గేమ్లో ఒకదశలో వరుసగా తొమ్మిది పాయింట్లు సాధించి తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు. భారత్కే చెందిన మరో ప్లేయర్ శంకర్ ముత్తుస్వామి సుబ్రమణియన్ కూడా మెయిన్ ‘డ్రా’కు చేరుకున్నాడు. క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో శంకర్ 21–19, 19–21, 21–19తో మాగ్నుస్ జొహాన్సెన్ (డెన్మార్క్)పై, రెండో రౌండ్లో 21–18, 21–12తో భారత్కే చెందిన రితి్వక్ సంజీవ్ సతీశ్ కుమార్పై గెలుపొందాడు. హైదరాబాద్కే చెందిన తరుణ్ మన్నేపల్లి మెయిన్ ‘డ్రా’కు చేరుకోవడంలో విఫలమయ్యాడు. క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో తరుణ్ 21–17, 9–21, 16–21తో జువో ఫు లియావో (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. ఉన్నతి, ఇషారాణి కూడా మహిళల సింగిల్స్లో భారత రైజింగ్ స్టార్స్ ఉన్నతి హుడా, ఇషారాణి బారువా కూడా మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించారు. క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో ఉన్నతి 21–12, 21–16తో సియు టాంగ్ టుంగ్ (చైనీస్ తైపీ)పై, రెండో రౌండ్లో 21–13, 21–15తో కిసోనా (మలేసియా)పై గెలిచింది. ఇషారాణి క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో 12–21, 21–10, 21–12తో జుయ్ఫె కి (ఫ్రాన్స్)పై, రెండో రౌండ్లో 25–27, 21–16, 23–21తో అమెలీ షుల్జ్ (డెన్మార్క్)పై విజయం సాధించింది. -
మెస్సీ సారథ్యంలో...
బ్యూనస్ఎయిర్స్: దక్షిణ అమెరికా జోన్ ప్రపంచకప్ ఫుట్బాల్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో 13వ రౌండ్ మ్యాచ్ల కోసం 33 మంది ఆటగాళ్లతో అర్జెంటీనా ప్రాథమిక జాబితాను ప్రకటించింది. స్టార్ ప్లేయర్ లయనెల్ మెస్సీ సారథ్యంలో అర్జెంటీనా బరిలోకి దిగుతుంది. ఈనెల 21న మాంటెవీడియోలో ఉరుగ్వే జట్టుతో... ఈనెల 25న బ్యూనస్ ఎయిర్స్లో బ్రెజిల్ జట్టుతో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ అర్జెంటీనా తలపడుతుంది. 2026 ప్రపంచకప్ టోర్నికి కెనడా, మెక్సికో, అమెరికా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. 2026 జూన్ 11 నుంచి జూలై 19 వరకు జరిగే ఈ మెగా టోర్నిలో తొలిసారి 48 జట్లు పోటీపడుతున్నాయి. దక్షిణ అమెరికా జోన్లో 10 దేశాలు క్వాలిఫయింగ్లో బరిలో ఉన్నాయి. ఇప్పటికే 12 రౌండ్లు ముగిశాయి. నిర్ణిత 18 రౌండ్ల తర్వాత టాప్–6లో నిలిచిన జట్లు నేరుగా ప్రపంచకప్కు అర్హత సాధిస్తాయి. ప్రస్తుతం అర్జెంటీనా, ఉరుగ్వే, ఈక్వెడార్, కొలంబియా, బ్రెజిల్, పరాగ్వే జట్లు టాప్–6లో ఉన్నాయి. ఏడో స్థానంలో నిలిచిన జట్టు ‘ప్లే ఆఫ్’ మ్యాచ్ ఆడుతుంది. ఖతర్ ఆతిథ్యమిచ్చిన 2022 ప్రపంచకప్లో మెస్సీ కెపె్టన్సీలో అర్జెంటీనా జట్టు 1986 తర్వాత మళ్లీ జగజ్జేతగా నిలిచింది. -
కెరీర్ బెస్ట్ ర్యాంక్లో రిత్విక్ చౌదరీ, యూకీ బాంబ్రీ
న్యూఢిల్లీ: అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) డబుల్స్ ర్యాంకింగ్స్లో హైదరాబాద్ ప్లేయర్, భారత డేవిస్కప్ జట్టు సభ్యుడు బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ తన కెరీర్ బెస్ట్ ర్యాంక్ను అందుకున్నాడు. సోమవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో 24 ఏళ్ల రిత్విక్ తొమ్మిది స్థానాలు ఎగబాకి 65వ ర్యాంక్కు చేరుకున్నాడు. సాంటియాగోలో జరిగిన చిలీ ఓపెన్ ఏటీపీ–250 టోర్నిలో కొలంబియాకు చెందిన నికోలస్ బరియెంతోస్తో కలిసి ఆడిన రిత్విక్ డబుల్స్ టైటిల్ గెలిచాడు.దాంతో అతని ర్యాంక్ మెరుగైంది. మరోవైపు భారత్కే చెందిన యూకీ బాంబ్రీ కూడా తన కెరీర్ బెస్ట్ ర్యాంక్ను అందుకున్నాడు. అలెక్సీ పాపిరిన్ (ఆ్రస్టేలియా)తో కలిసి దుబాయ్ ఓపెన్ ఏటీపీ–500 టోర్నీలో యూకీ డబుల్స్ టైటిల్ గెలిచాడు. ఫలితంగా తాజా ర్యాంకింగ్స్లో యూకీ ఐదు స్థానాలు పురోగతి సాధించి 39వ ర్యాంక్లో నిలిచాడు. భారత దిగ్గజం రోహన్ బోపన్న ఒక స్థానం మెరుగుపర్చుకొని 21వ ర్యాంక్లో ఉన్నాడు.మెక్సికోలో జరిగిన అకాపుల్కో ఓపెన్ ఏటీపీ–250 టోర్నిలోసెమీఫైనల్ చేరుకున్న భారత ప్లేయర్ శ్రీరామ్ బాలాజీ మరోసారి కెరీర్ బెస్ట్ 61వ స్థానానికి చేరుకున్నాడు. భారత ఇతర ప్లేయర్లు అర్జున్ ఖడే 87వ స్థానంలో, జీవన్ నెడుంజెళియన్ 93వ స్థానంలో ఉన్నారు. బెంగళూరు ఓపెన్ ఏటీపీ–125 చాలెంజర్ టోర్నిలో డబుల్స్ టైటిల్ సాధించిన హైదరాబాద్ ప్లేయర్ అనిరుధ్ చంద్రశేఖర్ ఏకంగా 30 స్థానాలు మెరుగుపర్చుకొని 109వ ర్యాంక్లో నిలిచాడు. రామ్కుమార్ రామనాథన్ 19 స్థానాలు ఎగబాకి 167వ ర్యాంక్లో, సాకేత్ మైనేని 24 స్థానాలు పురోగతి సాధించి 220వ ర్యాంక్లో నిలిచారు. -
నమస్తే దివ్య..!
ప్రాగ్ (చెక్ రిపబ్లిక్): ఉజ్బెకిస్తాన్ గ్రాండ్మాస్టర్ నొదిర్బెక్ యకుబొయెవ్(Nodirbek Yakubboev) తీరు మార్చుకున్నాడు. ప్రత్యర్థిని గౌరవించి సంస్కారం చూపాడు. ప్రాగ్ చెస్ ఫెస్టివల్లో భాగంగా చాలెంజర్ టోర్నమెంట్లో పాల్గొంటున్న నొదిర్బెక్ తనకు ఎదురైన భారత ప్రత్యర్థి, ప్రపంచ జూనియర్ చాంపియన్ దివ్య దేశ్ముఖ్(Divya Deshmukh)కి రెండు చేతులు జోడించి ‘నమస్తే’ అన్నాడు. దీనికి దివ్య కూడా ప్రతి నమస్కారం చేసింది.కాగా 23 ఏళ్ల యకుబొయెవ్ మూడో రౌండ్కు ముందు దివ్యకు నమస్కరించాడు. ఈ రౌండ్లో ఉజ్బెకిస్తాన్ ఆటగాడు... భారత అమ్మాయిపై విజయం సాధించాడు. మూడు రౌండ్లలో ఒక గేమ్ నెగ్గిన దివ్య రెండు గేముల్లో ఓడింది. ఉజ్బెక్ ప్లేయర్ తాజా వ్యవహారశైలి గతంలో భారత మహిళా గ్రాండ్మాస్టర్ వైశాలి ఉదంతాన్ని మరిచిపోయేలా చేసింది. That moment when Nodirbek Yakubboev greeted Divya Deshmukh with a traditional "Namaste" before the start of their 3rd round game at @PragueChess Festival Challengers 2025! #praguechessfestival pic.twitter.com/07zSR0ymh6— ChessBase India (@ChessbaseIndia) March 1, 2025 అప్పుడేం జరిగిందంటే... జనవరిలో టాటా స్టీల్ చాలెంజర్స్ చెస్ టోర్నీలో (విక్ఆన్జీ, నెదర్లాండ్స్) నొదిర్బెక్... వైశాలి మధ్య మ్యాచ్ మొదలయ్యేందుకు ముందు ఆనవాయితీ ప్రకారం భారత అమ్మాయి కరచాలనం కోసం చేయి చాచగా... అదేం అక్కర్లేదన్నట్లుగా ఉజ్బెక్ ఆటగాడు షేక్హ్యాండ్కు నిరాకరించాడు. ఈ ‘నో షేక్హ్యాండ్’ ఉదంతం సోషల్ మీడియాలో వివాదం రేపింది. నెటిజన్లంతా నొదిర్బెక్ సంస్కారహీనుడంటూ కామెంట్లు పెట్టారు.ఇది కాస్తా వైరల్ కావడంతో వెంటనే ఉజ్బెకిస్తాన్ ఆటగాడు... కావాలని నిరాకరించలేదని, మతపరమైన కట్టుబాట్లతోనే పరాయి అమ్మాయి చేతిని తాకలేదని... ప్రతిభావంతురాలైన వైశాలీ అన్నా... భారతీయులన్నా తనకెంతో గౌరవమని ‘ఎక్స్’లో వివరణ ఇచ్చాడు. కేవలం ట్వీట్తో ఆగకుండా టోర్నీ ఆడేందుకు వచ్చిన అక్కాతమ్ముళ్లు వైశాలి, ప్రజ్ఞానందలతో పాటు తోడుగా వచ్చిన వారి తల్లి నాగలక్ష్మిని వ్యక్తిగతంగా కలిసి పూలు, చాక్లెట్లు ఇచ్చి క్షమాపణలు చెప్పడంతో ఆ వివాదం అక్కడితో ముగిసింది. ఇదీ చదవండి:తెలంగాణ శుభారంభం పంచ్కుల: జాతీయ సీనియర్ మహిళల హాకీ చాంపియన్షిప్లో తెలంగాణ జట్టు శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన ‘బి’ డివిజన్ పూల్ ‘ఎ’ లీగ్ మ్యాచ్లో తెలంగాణ 3–1 గోల్స్ తేడాతో అస్సాంపై ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్లో అస్సాం జట్టే ముందుగా బోణీ కొట్టింది. తొలి క్వార్టర్లోనే అస్సాం కెప్టెన్ మున్మునీ దాస్ 14వ నిమిషంలో చేసిన ఫీల్డ్ గోల్తో జట్టు 1–0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ అస్సాం జోరు ఆ క్వార్టర్కే పరిమితమైంది.రెండో క్వార్టర్లో అనూహ్యంగా పుంజుకున్న తెలంగాణ అమ్మాయిలు ఏకంగా నిమిషాల వ్యవధిలోనే మూడు గోల్స్ చేయడంతో అస్సాం క్రీడాకారిణులు చేష్టలుడిగారు. 23 నిమిషంలో ప్రతివ కిండో, 26వ నిమిషంలో సుమి ముందరి, 28వ నిమిషంలో పూజ రాథోడ్ తలా ఒక గోల్ చేశారు. తర్వాతి క్వార్టర్లలో ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్న తెలంగాణ 3–1తో జయకేతనం ఎగురవేసింది. ఇదే డివిజన్లో జరిగిన పూల్ ‘బి’ పోటీల్లో ఢిల్లీ 1–0తో హిమాచల్ ప్రదేశ్పై గెలుపొందగా... చత్తీస్గఢ్, చండీగఢ్ల మధ్య జరిగిన పోరు 1–1తో ‘డ్రా’గా ముగిసింది. -
రిత్విక్... మళ్లీ సాధించాడు
సాక్షి, హైదరాబాద్: అన్సీడెడ్గా బరిలోకి దిగి... అంచనాలకు మించి రాణించి... హైదరాబాద్ టెన్నిస్ యువతార బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ అద్భుతం చేశాడు. చిలీ దేశ రాజధాని సాంటియాగోలో జరిగిన అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ)–250 టోర్నీలో రిత్విక్ డబుల్స్ టైటిల్ను సొంతం చేసుకున్నాడు. లాటిన్ అమెరికాలో క్లే కోర్టులపై ఏటీపీ టైటిల్ నెగ్గిన తొలి భారతీయ ప్లేయర్గా రిత్విక్ గుర్తింపు పొందాడు. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో రిత్విక్ (భారత్)–నికోలస్ బరియెంతోస్ (కొలంబియా) ద్వయం 6–3, 6–2తో టాప్ సీడ్ మాక్సిమో గొంజాలెజ్–ఆండ్రెస్ మొల్తాని (అర్జెంటీనా) జోడీని బోల్తా కొట్టించి టైటిల్ దక్కించుకుంది. విజేతగా నిలిచిన రిత్విక్–బరియెంతోస్లకు 35,980 డాలర్ల (రూ. 31 లక్షల 47 వేలు) ప్రైజ్మనీతోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. 24 ఏళ్ల రిత్విక్ కెరీర్లో ఇది రెండో ఏటీపీ –250 డబుల్స్ టైటిల్. గత ఏడాది అక్టోబర్లో కజకిస్తాన్లో జరిగిన అల్మాటీ ఓపెన్ ఏటీపీ–250 టోర్నిలో భారత్కే చెందిన అర్జున్ ఖడేతో కలిసి రిత్విక్ తొలి డబుల్స్ టైటిల్ గెలిచాడు. తాజా టైటిల్తో రిత్విక్ సోమవారం విడదలయ్యే ఏటీపీ డబుల్స్ ర్యాంకింగ్స్లో ఎనిమిది స్థానాలు ఎగబాకి కెరీర్ బెస్ట్ 66వ ర్యాంక్ను అందుకోనున్నాడు. 11 ఏస్లతో మెరిసి... 63 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో రిత్విక్–బరియెంతోస్ ద్వయం పూర్తి ఆధిపత్యం చలాయించింది. 11 ఏస్లు సంధించిన ఈ జోడీ కేవలం ఒక డబుల్ ఫాల్ట్ చేసింది. ఫస్ట్ సర్వ్లోని 30 పాయింట్లకుగాను 26 పాయింట్లు... సెకండ్ సర్వ్లో 13 పాయింట్లకుగాను 10 పాయింట్లు ఈ జంట గెలిచింది. మ్యాచ్ మొత్తంలో ఒక్క బ్రేక్ పాయింట్ అవకాశం కూడా ఇవ్వని ఈ ఇండో–కొలంబియన్ జంట ప్రత్యర్థి ద్వయం సర్విస్ను మూడుసార్లు బ్రేక్ చేసింది. ఈ టోర్నిలో అన్సీడెడ్ గా పోటీపడ్డ రిత్విక్–బరియెంతోస్ తొలి రౌండ్లో 7–6 (7/5), 7–6 (9/7)తో ద్రెజెవ్స్కీ–పీటర్ మత్సుజెవ్స్కీ (పోలాండ్)లపై, క్వార్టర్ ఫైనల్లో 3–6, 7–6 (7/2), 10–8తో మార్సెలో డెమోలైనర్–మార్సెలో జొర్మాన్ (బ్రెజిల్)లపై, సెమీఫైనల్లో 4–6, 7–6 (9/7), 10–5తో మూడో సీడ్ గిడో ఆంద్రెజీ (అర్జెంటీనా)–థియో అరిబెజ్ (ఫ్రాన్స్)లపై గెలుపొందారు. -
అనిరుధ్ జోడీకి టైటిల్
బెంగళూరు: హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్ అనిరుధ్ చంద్రశేఖర్... బెంగళూరు ఓపెన్ ఏటీపీ చాలెంజర్–125 టోర్నీలో డబుల్స్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో టాప్ సీడ్ అనిరుధ్ (భారత్)–రే హో (చైనీస్ తైపీ) జంట 6–2, 6–4తో బ్లేక్ బేల్డన్–మాథ్యూ రోమియోస్ (ఆస్ట్రేలియా) జోడీపై విజయం సాధించింది. ఇప్పటి వరకు తొమ్మిదిసార్లు బెంగళూరు ఓపెన్ టెన్నిస్ టోర్నీ నిర్వహించగా... అందులో ఏడుసార్లు భారతీయ ప్లేయర్లు డబుల్స్ చాంపియన్స్గా నిలిచారు. ఏకపక్షంగా సాగిన ఫైనల్లో అనిరుద్–రే హో జంట నెట్ గేమ్తో చెలరేగింది. తొలి సెట్ను సునాయాసంగా చేజిక్కించుకున్న అనిరుధ్ జంట... రెండో సెట్లో ప్రత్యర్థి నుంచి కాస్త ప్రతిఘటన ఎదురైనా వెనక్కి తగ్గకుండా విజయం ఖాతాలో వేసుకుంది. ఈ విజయంతో రూ.8.65 లక్షల నగదు బహుమతితో పాటు... 125 ర్యాంకింగ్ పాయింట్లు అనిరుధ్ జోడీ ఖాతాలో చేరాయి. -
భారత జట్టులో సహజ, శ్రీవల్లి
న్యూఢిల్లీ: మహిళల టెన్నిస్ టీమ్ ఈవెంట్ బిల్లీ జీన్ కింగ్ కప్లో పాల్గొనే భారత జట్టులో తెలుగమ్మాయిలు సహజ యామలపల్లి, భమిడిపాటి శ్రీవల్లి రష్మిక ఎంపికయ్యారు. అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) సెలక్షన్ కమిటీ ఈ టోర్నీ కోసం ఐదుగురు సభ్యుల జట్టును శనివారం ప్రకటించింది. ఇందులో సహజ, శ్రీవల్లిలతో పాటు భారత నంబర్వన్ ర్యాంకర్ అంకిత రైనా, వైదేహి చౌదరి, ప్రార్థన తొంబరే ఉన్నారు. ఇటీవల ముంబైలో జరిగిన డబ్ల్యూటీఏ టోర్నీలో సంచలన ప్రదర్శన కనబరిచిన మాయ రాజేశ్వరన్ను రిజర్వ్ ప్లేయర్గా ఎంపిక చేశారు. ఈ టీమ్కు విశాల్ ఉప్పల్ నాన్ప్లేయింగ్ కెపె్టన్గా వ్యవహరిస్తారు. పురుషుల విభాగంలో జరిగే ప్రతిష్టాత్మక డేవిస్ కప్ టోర్నమెంట్లాగే మహిళల ఈవెంట్లో జరిగే టోర్నీయే ఈ ‘బిల్లీ జీన్ కింగ్ కప్’. ఈ సారి ఈ టోర్నీకి భారత్ ఆతిథ్యమివ్వబోతోంది. పుణేలోని దక్కన్ జింఖానా కాంప్లెక్స్లో ఏప్రిల్ 8 నుంచి బిల్లీ జీన్ కింగ్ కప్ పోటీలు జరుగుతాయి. -
సినెర్ నామినేషన్ ఉపసంహరణ.. కారణం ఇదే
లండన్: ప్రపంచ నంబర్వన్, ఇటలీ టెన్నిస్ స్టార్ యానిక్ సినెర్ ఈ ఏడాది ప్రతిష్టాత్మక ‘లారెస్’ అవార్డుకు దూరమయ్యాడు. ఇటీవల అతనిపై మూడు నెలల నిషేధం విధించడంతో ‘స్పోర్ట్స్ ఆస్కార్’గా ప్రఖ్యాతిగాంచిన ఈ అవార్డు బరిలో లేకుండా పోయాడు. లారెస్ ప్రపంచ క్రీడా అకాడమీ (ఎల్డబ్ల్యూఎస్ఏ) అతని నామినేషన్ను ఉపసంహరించింది. దీంతో సినెర్ రేసులో లేడు. ఈ విషయాన్ని ఎల్డబ్ల్యూఎస్ఏ చైర్మన్ సీన్ ఫిట్జ్ప్యాట్రిక్ ధ్రువీకరించారు.ఇటలీ సూపర్స్టార్ సినెర్పై ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) విధించిన నిషేధం అమలవుతుండటంతో అవార్డు బరి నుంచి అతని పేరును తప్పించినట్లు తెలిపారు. ‘డోపింగ్ ఉదంతం దరిమిలా నిషేధంపై ‘వాడా’తో పాటు టెన్నిస్ వర్గాలతో చర్చించాం. నిషేధంలో ఉన్న ఆటగాడు విశ్వఖ్యాతిగాంచిన అవార్డు బరిలో ఉండటం సమంజసం కాదనే నిర్ణయానికి వచ్చాం. దీంతో సినెర్ నామినేషన్ను ఉపసంహరించాలని నిర్ణయించాం. దీనిపై సినెర్, అతని బృందానికి సమాచారమిచ్చాం’ అని ఫిట్జ్ప్యాట్రిక్ వెల్లడించారు. 23 ఏళ్ల సినెర్ గతేడాది మార్చిలోనే నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలినా... అంతర్జాతీయ టెన్నిస్ ఇంటిగ్రిటీ ఏజెన్సీ (ఐటీఐఏ) మాత్రం చూసీచూడనట్లుగా వ్యవహరించింది.‘కావాలని తీసుకోలేదు. మర్ధన తైలం, లేదంటే ఇతరత్రా మందుల ద్వారా అది తన శరీరంలోకి ప్రవేశించి ఉండొచ్చనే’ యానిక్ స్వీయ వాంగ్మూలాన్ని ఐటీఐఏ పరిగణించి తదుపరి చర్యలు తీసుకోలేదు. దీన్ని యావత్ క్రీడావర్గాలు తప్పుబట్టాయి. ఐటీఐఏ పక్షపాత వైఖరిని గర్హించాయి. సెర్బియా దిగ్గజం జొకోవిచ్ సహా పలువురు టెన్నిస్ స్టార్లు... ఒక్కొక్కరికి ఒక్కోరకంగా ని‘బంధనాలు’ అంటూ బాహాటంగానే దుమ్మెత్తి పోశారు. ‘వాడా’ సైతం అతని రెండు శాంపిల్స్ (నమూనాలు) పాజిటివ్ అని తేలాయి కాబట్టి కనీసం ఏడాదైనా నిషేధం విధించాలని స్పోర్ట్స్ అర్బిట్రేషన్ కోర్టుకు అప్పీల్ చేసింది. చివరకు సినెర్–ఐటీఐఏ–వాడాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఫిబ్రవరి 15న మూడు నెలలు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. తాజా నిషేధం విధించినప్పటికీ ఈ సీజన్లో అతని గ్రాండ్స్లామ్ టైటిళ్ల వేటకి ఏ ఇబ్బంది లేకపోయింది. సీజన్ తొలి గ్రాండ్స్లామ్ టోర్నీ ఆ్రస్టేలియన్ ఓపెన్లో టైటిల్ నిలబెట్టుకున్న సినెర్... నిషేధం ముగిశాక తదుపరి గ్రాండ్స్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్ (మే 25 నుంచి)లో పోటీపడతాడు. ఇవీ చదవండిచెస్ ప్రపంచం సంతాపంఅంతర్జాతీయ చెస్ అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న బోరిస్ స్పాస్కీ (Boris Spassky-88) కన్నుమూశారు. రష్యాకు చెందిన ఈ మాజీ ప్రపంచ చాంపియన్(Former World Champion) మరణించిన విషయాన్ని ‘ఫిడే’ గురువారం ప్రకటించింది. స్పాస్కీ మరణం పట్ల చెస్ ప్రపంచం సంతాపం వ్యక్తం చేసింది. గ్యారీ కాస్పరోవ్, లెవాన్ ఆరోనియాన్, సుసాన్ పోల్గర్, విశ్వనాథన్ ఆనంద్ తదితరులు స్పాస్కీ మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ.. ఆయనకు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఫైనల్లో అనిరుద్ జోడీబెంగళూరు: హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్ అనిరుధ్ చంద్రశేఖర్... బెంగళూరు ఓపెన్ ఏటీపీ చాలెంజర్–125 టోరీ్నలో డబుల్స్ టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో టాప్ సీడ్ అనిరుధ్ (భారత్)–రే హో (చైనీస్ తైపీ) ద్వయం 6–4, 2–6, 10–8తో ‘సూపర్ టైబ్రేక్’లో సాకేత్ మైనేని–రామ్కుమార్ రామనాథన్ (భారత్) జంటపై గెలుపొందింది. 72 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో రెండు జోడీలు చెరో సెట్ సొంతం చేసుకున్నాయి.నిర్ణాయక సూపర్ టైబ్రేక్లో అనిరుధ్–రే హో ద్వయం కీలకదశలో పాయింట్లు గెలిచి విజయాన్ని ఖరారు చేసుకుంది. నేడు జరిగే ఫైనల్లో బ్లేక్ బేల్డన్–మాథ్యూ రోమియోస్ (ఆస్ట్రేలియా) జోడీతో అనిరుద్–రే హో జంట తలపడుతుంది. రెండో సెమీఫైనల్లో బ్లేక్ బేల్డన్–మాథ్యూ రోమియోస్ 6–3, 7–6 (8/6)తో సిద్ధాంత్–పరీక్షిత్ (భారత్)లపై నెగ్గారు. -
చెస్ దిగ్గజం బోరిస్ స్పాస్కీ కన్నుమూత
అంతర్జాతీయ చెస్ అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న బోరిస్ స్పాస్కీ (88) మంగళవారం కన్నుమూశారు. రష్యాకు చెందిన ఈ మాజీ ప్రపంచ చాంపియన్ మరణించిన విషయాన్ని ‘ఫిడే’ ప్రకటించింది. ప్రపంచ చెస్ను సోవియట్ యూనియన్ శాసిస్తున్న కాలంలో వరల్డ్ చాంపియన్గా నిలిచిన వారిలో స్పాస్కీ కూడా ఒకడు.1969–1972 మధ్య అతను పదో వరల్డ్ చాంపియన్గా శిఖరాన నిలిచాడు. అయితే డిఫెండింగ్ చాంపియన్గా స్పాస్కీ బరిలోకి దిగిన 1972 వరల్డ్ చాంపియన్ పోరాటానికి ప్రపంచ చెస్లో ప్రత్యేక స్థానం ఉంది. సోవియట్ యూనియన్, అమెరికా మధ్య తీవ్ర వైరంతో ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతున్న ఆ కాలంలో స్పాస్కీతో అమెరికాకు చెందిన బాబీ ఫిషర్ చాలెంజర్గా తలపడ్డాడు. దాంతో ఈ సమరం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆ సమయంలో దీనికి ‘మ్యాచ్ ఆఫ్ ద సెంచరీ’గా గుర్తింపు వచి్చంది. సోవియట్ యూనియన్ వర్సెస్ అమెరికాగా మారిపోయిన ఈ 21 గేమ్ల పోరులో చివరకు 8.5–12.5 పాయింట్ల తేడాతో ఫిషర్ చేతిలో ఓడి స్పాస్కీ వరల్డ్ టైటిల్ను కోల్పోయాడు. నాలుగేళ్ల తర్వాత ఫ్రాన్స్కు వెళ్లి స్థిరపడిన స్పాస్కీ ఆ తర్వాత 21 ఏళ్ల పాటు ఆ దేశం తరఫున పోటీల్లో పాల్గొన్నా చెప్పుకోదగ్గ ప్రభావం చూపలేకపోయాడు. 2013లో అతను తిరిగి స్వదేశానికి వచ్చేసి చివరి వరకు మాస్కోలోనే ఉండిపోయాడు. స్పాస్కీతో సమరంతో 1972లో జగజ్జేతగా నిలిచిన బాబీ ఫిషర్ 2008లోనే మరణించాడు.చదవండి: Champions Trophy: సెమీస్కు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్.. -
నేటి నుంచి జాతీయ మహిళల హాకీ టోర్నీ
పంచ్కులా: సీనియర్ మహిళల జాతీయ హాకీ చాంపియన్షిప్ను కొత్త ఫార్మాట్లో నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. నేటి నుంచి ఈ నెల 12 వరకు హరియాణాలోని పంచ్కులాలో ఈ మెగా టోర్నీ జరుగనుంది. మొత్తం 28 జట్లు బరిలోకి దిగుతున్నాయి. ఈ సీజన్లో ఈ 28 జట్లు ఎ, బి, సి గ్రూపుల్లో తలపడతాయి. ఈ తాజా ప్రదర్శనే ప్రామాణీకంగా తదుపరి సీజన్ గ్రూపుల్లో జట్లు మారతాయి. అంటే రంజీ క్రికెట్ తరహాలో రాష్ట్ర హాకీ జట్లు మూడు గ్రూపులుగా విభజించి నిర్వహిస్తారు. తద్వారా ఉత్తమ, మధ్యమ, అధమ స్థాయి జట్ల మధ్య పోటీలు జరుగుతాయి. సిలో చిన్న జట్లు మెరుగైన ప్రదర్శన కనబరిస్తే మధ్యమ స్థాయి ‘బి’కి... తర్వాత ఉత్తమ స్థాయి ‘ఎ’కి ఆయా జట్లకు ప్రమోషన్ లభిస్తుంది. తద్వారా బలమైన జట్టుతో బలహీనమైన జట్టు పోటీపడదు. సమఉజ్జీల మధ్యే సమరం జరగడం వల్ల పోటీ వాతావరణం క్రమంగా పెరిగి ఆయా జట్లు పురోగతి సాధిస్తాయని ‘హాకీ ఇండియా’ భావిస్తోంది. ఈసారి తెలుగు రాష్ట్రాల జట్లకు ‘ఎ’ డివిజన్లో పోటీపడే అవకాశం లభించలేదు. తెలంగాణ ‘బి’ డివిజన్లోని పూల్ ‘ఎ’లో ఉన్న ఉత్తరప్రదేశ్, అస్సాం, రాజస్తాన్, బిహార్లతో తలపడుతుంది. ‘సి’ డివిజన్లోని పూల్ ‘బి’లో ఉన్న ఆంధ్రప్రదేశ్... పుదుచ్చేరి, అరుణాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్లతో పోటీ పడుతుంది. ‘ఎ’ డివిజన్లో... పూల్ ‘ఎ’: హరియాణా, ఒడిశా, కర్ణాటక; పూల్ ‘బి’: మహారాష్ట్ర, మణిపూర్, పంజాబ్; పూల్ ‘సి’: జార్ఖండ్, మిజోరం, తమిళనాడు; పూల్ ‘డి’: మధ్యప్రదేశ్, బెంగాల్, ఉత్తరప్రదేశ్. ‘బి’ డివిజన్లో... పూల్ ‘ఎ’: తెలంగాణ, ఉత్తరప్రదేశ్, అస్సాం, రాజస్తాన్, బిహార్; పూల్ ‘బి’: ఢిల్లీ, ఛత్తీస్గఢ్, చండీగఢ్, హిమాచల్ప్రదేశ్. ‘సి’ డివిజన్లో... పూల్ ‘ఎ’: కేరళ, దాద్రా నాగర్ హవేలి, డామన్ అండ్ డియూ, గుజరాత్; పూల్ ‘బి’: ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, అరుణాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్. -
ఆటలకు ఆస్తులతో పనేంటి?
న్యూఢిల్లీ: క్రీడల్లో తమ పిల్లలను ప్రోత్సహించే ముందు మధ్య తరగతి వర్గాల వారు తీవ్రంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని... ఆర్థికపరంగా మంచి స్థాయిలో ఉన్నవారి పిల్లలే ఆటల వైపు రావాలంటూ భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ చేసిన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు గోపీచంద్ మాటలతో ఏకీభవిస్తుండగా, మరికొందరు వాటిని తప్పు పడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ వాలీబాల్ క్రీడాకారుడు, స్టార్ షట్లర్ పీవీ సింధు తండ్రి పీవీ రమణ దీనిపై స్పందించారు. ఆటగాడిగా ఎదిగేందుకు ధనవంతులు కావడం ముఖ్యం కాదని... ప్రతిభ ఉంటే దూసుకుపోవచ్చని అభిప్రాయపడ్డారు. తానూ దిగువ స్థాయి నుంచే వచ్చి ఆటగాడిగా ఎదిగానని... సింధును క్రీడల వైపు మళ్లించినప్పుడు కూడా తన వద్ద పెద్దగా డబ్బేమీ లేదని ఆయన స్వీయానుభవాన్ని పంచుకున్నారు. ‘నాకు మూడేళ్ల వయసు ఉన్నప్పుడు నాన్న చనిపోయారు. 10 మంది సంతానంలో నేను అందరికంటే చిన్నవాడిని. కానీ అన్నలు, అక్కలు నాకు ఎంతో అండగా నిలిచి జాతీయ స్థాయిలో వాలీబాల్ ఆడేందుకు సహకరించారు. ఆట కారణంగానే నాకు రైల్వేస్లో ఉద్యోగం వచ్చింది. మీరు దిగువ మధ్య తరగతి లేదా మధ్య తరగతికి చెందినా... ఆటల్లో మంచి ప్రదర్శన కనబరిస్తే ఎన్నో అవకాశాలు వస్తాయి. చిన్నారులు అన్ని రకాలుగా ఎదిగేందుకు కూడా క్రీడలు ఉపయోగపడతాయి’ అని రమణ వివరించారు. 1986 ఆసియా క్రీడల్లో కాంస్య పతకం గెలిచిన భారత జట్టులో రమణ సభ్యుడిగా ఉన్నారు. తన పెద్ద కూతురు చదువులో చురుగ్గా ఉందని ఆమెను డాక్టర్ అయ్యేలా ప్రోత్సహించానని, సింధుకు బ్యాడ్మింటన్లో ఎంతో ప్రతిభ ఉందనే విషయం ఆరంభంలో గుర్తించామని ఆయన అన్నారు. ‘ప్రతిభ ఎక్కడో ఒక చోట వెలుగులోకి వస్తుంది. దానిని ఎవరూ దాచి ఉంచలేరు. తల్లిదండ్రులు తగిన రీతిలో మార్గనిర్దేశనం చేయాలి. ఒక క్రీడాకారుడు మరొకరిని క్రీడల్లోకి రావద్దంటూ హెచ్చరించడం సరైంది కాదని నా అభిప్రాయం’ అని గోపీచంద్ వ్యాఖ్యలను రమణ వ్యతిరేకించారు. తనకు రైల్వేలో ఉద్యోగం ఉండటం వల్లే సింధు కెరీర్ను ముందుకు తీసుకెళ్లగలిగానని ఆయన గుర్తు చేసుకున్నారు. ‘క్రీడల ద్వారా ఉద్యోగం తెచ్చుకోవడం మధ్యతరగతి వారి దృష్టిలో పెద్ద ఘనత. అలాంటి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. రైల్వేలోనే వేలాది మంది క్రీడాకారులు ఉద్యోగాలు చేస్తున్నారు. స్పోర్ట్స్ కోటాలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో పెద్ద చదువులు చదివే అవకాశం కూడా లభిస్తుంది. కోచ్లు ఈ విషయంలో వారికి సరైన దారి చూపిస్తే చాలు’ అని రమణ పేర్కొన్నారు. ఇటీవల ఒక యువ షట్లర్కు ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగం లభించే విధంగా తాను తగిన విధంగా మార్గనిర్దేశనం చేసినట్లు రమణ వెల్లడించారు. డబ్బున్న వారే ఆటల్లోకి రావాలంటూ సూచించడం సరైంది కాదని ఆయన అన్నారు. సింధు కెరీర్ ఆరంభంలో తాము రైలు ప్రయాణాలు చేస్తే కొందరు విమానాల్లో వచ్చేవారని... ఇప్పుడు సింధు ఏ స్థాయికి చేరుకుందో చూడాలని రమణ వ్యాఖ్యానించారు. -
ఫైనల్లో యూకీ జోడీ
దుబాయ్: భారత టెన్నిస్ డబుల్స్ స్టార్ యూకీ బాంబ్రీ ఈ ఏడాది తొలి టైటిల్ సాధించేందుకు విజయం దూరంలో నిలిచాడు. దుబాయ్ చాంపియన్షిప్ ఏటీపీ–500 టో ర్నీలో అలెక్సీ పాపిరిన్ (ఆ్రస్టేలియా)తో కలిసి యూకీ బాంబ్రీ పురుషుల డబుల్స్లో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో యూకీ–పాపిరిన్ ద్వయం 6–2, 4–6, 10–7తో ‘సూపర్ టైబ్రేక్’లో జేమీ ముర్రే (బ్రిటన్)–జాన్ పీర్స్ (ఆ్రస్టేలియా) జంటపై గెలిచింది. 82 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో ఇండో–ఆసీస్ జోడీ రెండు ఏస్లు సంధించి, ఒక డబుల్ ఫాల్ట్ చేసింది. తమ సర్వీస్ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను రెండుసార్లు బ్రేక్ చేసింది. ఈ గెలుపుతో 32 ఏళ్ల యూకీ తన కెరీర్లో తొలిసారి ఏటీపీ–500 స్థాయి టో ర్నీలో ఫైనల్కు చేరాడు. అసోసియేషన్ ఆఫ్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) టూర్లో యూకీ మూడు డబుల్స్ టైటిల్స్ సాధించి, మరో మూడు టోర్నీలలో రన్నరప్గా నిలిచాడు. -
‘గృహ హింస’ వివాదంలో భారత కబడ్డీ జట్టు మాజీ కెప్టెన్
చండీగఢ్: దేశానికి ప్రాతినిధ్యం వహించిన ఇద్దరు క్రీడాకారుల దాంపత్యంలో పెను వివాదం రేగింది. కుటుంబ కలహాలతో పరిస్థితి పోలీసు కేసు వరకు వెళ్లింది. హరియాణాకు చెందిన మాజీ కబడ్డీ ఆటగాడు దీపక్ హుడా, భారత బాక్సర్ స్వీటీ బూరాకు 2022లో పెళ్లి జరిగింది. 2018 జకార్తా ఆసియా క్రీడల్లో కాంస్యం గెలిచిన భారత జట్టులో సభ్యుడైన హుడా 2019 నుంచి 2022 వరకు భారత జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు. అంతేకాకుండా ప్రొ కబడ్డీ లీగ్లో తెలుగు టైటాన్స్, పుణేరి పల్టన్, పట్నా పైరేట్స్ జట్ల తరఫున బరిలోకి దిగాడు. మరోవైపు స్వీటీ బూరా 2023 ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో 81 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించింది. అయితే ఇప్పుడు హుడా తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని స్వీటీ పోలీసులను ఆశ్రయించింది. గతంలోనే డిమాండ్ ప్రకారం లగ్జరీ కారును ఇచ్చినా... మరింత డబ్బు కావాలంటూ తనను కొడుతున్నాడని స్వీటీ ఫిర్యాదు చేసింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న పోలీసులు భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 85 ప్రకారం హుడాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనికి సంబంధించి 2–3 సార్లు నోటీసులు జారీ చేసినా... అనారోగ్యాన్ని కారణంగా చూపుతూ హుడా ఇప్పటి వరకు పోలీసు విచారణకు హాజరు కాలేదు. త్వరలోనే తాను పోలీసుల ముందుకు వస్తానని, అయితే స్వీటీపై తాను ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయనని అతను స్పష్టం చేశాడు. మరోవైపు కేసుపై మరింత సమాచారం ఇచ్చేందుకు స్వీటీ నిరాకరించింది. 2024 హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో మేహమ్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి హుడా ఓటమి పాలయ్యాడు. -
భారత బాక్సింగ్ను ముందుకు తీసుకెళ్తా!
న్యూఢిల్లీ: దేశంలో బాక్సింగ్కు మరింత వన్నె తెచ్చేందుకు తన వంతు కృషి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ పేర్కొన్నాడు. అందుకోసం అవసరమైతే భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా వెనకాడనని వెల్లడించాడు. భారత్ నుంచి ఒలింపిక్స్లో పతకం నెగ్గిన ఏకైక పురుష బాక్సర్ అయిన విజేందర్ సింగ్... బీఎఫ్ఐ ఎన్నికలను వీలైనంత త్వరగా నిర్వహించాలని ఆకాంక్షించాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్లో కాంస్యం నెగ్గిన విజేందర్ సింగ్... 2015లో ప్రొఫెషనల్ బాక్సర్గా అవతారమెత్తాడు.గత మూడేళ్లుగా ప్రొఫెషనల్ సర్క్యూట్లోనూ యాక్టివ్గా లేని 39 ఏళ్ల విజేందర్ తాజాగా బీఎఫ్ఐ ఎన్నికలపై సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించాడు. ‘ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పోటీ చేయాలనుకుంటున్నా. నా జీవితం మొత్తం పోరాటాలే. ఇది కొత్త తరహాది అనుకుంటా. అయితే ఎన్నికల్లో మద్దతు లభిస్తుందా లేదా అనే అంశాలను పట్టించుకోవడం లేదు. ఆటకు నా వల్ల ప్రయోజనం చేకూరుతుందనుకుంటే తప్పకుండా పోటీలో ఉంటా. మార్పు తెచ్చే అవకాశం ఉంటే దాని కోసం నా వంతు కృషి చేస్తా. ఎన్నికల్లో పోటీ చేసినంత మాత్రాన బాక్సర్గా రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు కాదు. నేనెప్పటికీ అలా చేయను’ అని అన్నాడు. 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి సౌత్ ఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయిన విజేందర్ 2024 లోక్సభ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీలో చేరాడు. విదేశీ శిక్షణ ముఖ్యం భారత యువ బాక్సర్లు విదేశాల్లో శిక్షణ తీసుకుంటే మెరుగైన ఫలితాలు సాధించే అవకాశాలున్నాయని విజేందర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘బాక్సింగ్ సమాఖ్యను మరింత బలోపేతం చేసేందుకు వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలి. ప్రభుత్వం ఏదైనా బాధ్యత అప్పగిస్తే దాన్ని నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నా. మన దేశం క్రీడల్లో వేగంగా వృద్ధి చెందుతోంది. మరో మూడేళ్లలో లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ జరగనున్న నేపథ్యంలో విశ్వక్రీడల్లో మరిన్ని పతకాలు సాధించాలంటే భారత బాక్సర్లు విదేశీ బాక్సర్లతో తరచూ తలపడాలి’ అని విజేందర్ ‘ఎక్స్’లో పేర్కొన్నాడు. ప్రపంచ బాక్సంగ్ చాంపియన్షిప్ (2009)లో పతకం నెగ్గిన తొలి భారత పురుష బాక్సర్గా రికార్డుల్లోకి ఎక్కిన విజేందర్... గతంలో ప్రపంచ నంబర్వన్ ర్యాంకర్గానూ కొనసాగాడు. బాక్సింగ్ సమాఖ్య పరిపాలన సంబంధించిన విధులను ఇటీవల భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అడ్హాక్ కమిటీకి అప్పగించిన నేపథ్యంలో... విజేందర్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఫిబ్రవరి 3తోనే బీఎఫ్ఐ ఆఫీస్ బేరర్ల పదవీ కాలం ముగియగా... ఎన్నికల నిర్వహణలో సమాఖ్య జాప్యం చేస్తుండటంతోనే ఐఓఏ ఈ చర్యకు పూనుకుంది. దీనిపై బీఎఫ్ఐ అధ్యక్షుడు అజయ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐఓఏ ఆదేశాలు చట్టవిరుద్ధమని... దీనిపై ఢిల్లీ హైకోర్టులో సవాలు చేయనున్నట్లు వెల్లడించారు.కాగా... బీఎఫ్ఐ ఆఫీస్ బేరర్లు ఆర్థిక అవకతవకలకు పాల్పడిన నేపథ్యంలోనే ఐఓఏ అడ్హాక్ కమిటీని ఏర్పాటు చేసింది. భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) మాజీ కోశాధికారి మధుకాంత్ పాఠక్ ఈ కమిటీకి నేతృత్వం వహిస్తున్నారు. సమాఖ్యలో గందరగోళం కారణంగా బాక్సర్ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. పారిస్ ఒలింపిక్స్లో రిక్తహస్తాలతో వెనుదిరిగిన మన బాక్సర్లు... ఆ తర్వాత అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడమే గగనమైంది. ఇక మహిళల జాతీయ బాక్సింగ్ చాంపియన్షిప్ వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఇటీవల బల్గేరియాలో జరిగిన ప్రతిష్టాత్మక స్ట్రాంజా మెమోరియల్ టోర్నీలోనూ మన బాక్సర్లు పాల్గొనలేదు. -
సెమీస్లో సాకేత్–రామ్ జోడీ
బెంగళూరు: ఆద్యంతం ఆధిపత్యం చలాయించిన సాకేత్ మైనేని–రామ్కుమార్ రామనాథన్ (భారత్) జోడీ... బెంగళూరు ఓపెన్ ఏటీపీ–125 చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాకేత్–రామ్ జంట 6–3, 6–3తో హైనెక్ బార్టన్ (చెక్ రిపబ్లిక్)–ఎరిక్ వాన్షెల్బోయిమ్ (ఉక్రెయిన్) జోడీపై గెలిచింది. 55 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో సాకేత్–రామ్ తమ ప్రత్యర్థి సర్వీస్ను మూడుసార్లు బ్రేక్ చేసింది. ఇతర క్వార్టర్ ఫైనల్స్లో అనిరుధ్ చంద్రశేఖర్ (భారత్)–రే హో (చైనీస్ తైపీ) 7–6 (7/5), 7–5తో ప్రజ్వల్ దేవ్–ఆర్యన్ షా (భారత్)లపై, సిద్ధాంత్–పరీక్షిత్ సొమాని (భారత్) 7–5, 6–0తో బెర్నాడ్ టామిక్ (ఆ్రస్టేలియా)–నికోలస్ మెజియా (కొలంబియా)లపై, బ్లేక్ బేల్డన్–మాథ్యూ రోమియోస్ (ఆ్రస్టేలియా) 6–2, 6–4తో ఆదిల్ కల్యాణ్పూర్–కరణ్ సింగ్ (భారత్)లపై గెలుపొంది సెమీఫైనల్లోకి ప్రవేశించారు. -
రన్నరప్ హంపి
మోంటెకార్లో (మొనాకో): మహిళల గ్రాండ్ప్రి సిరీస్ మూడో టోర్నమెంట్లో భారత గ్రాండ్మాస్టర్, ఆంధ్రప్రదేశ్ స్టార్ కోనేరు హంపి రన్నరప్గా నిలిచింది. గురువారం మొనాకాలో ముగిసిన ఈ టోర్నీలో నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత హంపి, అలెగ్జాండ్రా గొర్యాక్చినా (రష్యా), బత్కుయాగ్ మున్గున్తుల్ (మంగోలియా) 5.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్ను నిర్ధారించగా... గొర్యాక్చినాకు టైటిల్ ఖరారైంది. హంపి రన్నరప్గా నిలిచింది. మున్గున్తుల్కు మూడో స్థానం లభించింది. చివరిదైన తొమ్మిదో రౌండ్లో హంపి 55 ఎత్తుల్లో బీబీసారా అసాబయెవా (కజకిస్తాన్)పై గెలిచింది. ఇదే టోర్నీలో ఆడిన హైదరాబాద్ గ్రాండ్మాస్టర్ ద్రోణవల్లి హారిక నాలుగు పాయింట్లతో ఎనిమిదో స్థానంలో నిలిచింది. -
సెమీఫైనల్లో యూకీ బాంబ్రీ జోడీ
దుబాయ్ ఓపెన్ టెన్నిస్ చాంపియన్షిప్ ఏటీపీ–500 టోర్నీలో భారత డబుల్స్ స్టార్ యూకీ బాంబ్రీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. దుబాయ్లో గురువారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో యూకీ బాంబ్రీ (భారత్)–అలెక్సీ పాపిరిన్ (ఆస్ట్రేలియా) ద్వయం 5–7, 7–6 (7/5), 10–5తో ‘సూపర్ టైబ్రేక్’లో ప్రపంచ ర్యాంకింగ్స్లో 17వ, 18వ స్థానాల్లో ఉన్న లాయిడ్ గ్లాస్పూల్–జూలియన్ క్యాష్ (బ్రిటన్) జోడీపై గెలిచింది. తొలి రౌండ్లో ప్రపంచ నంబర్వన్, టాప్ సీడ్ మార్సెలో అరెవాలో (ఎల్ సాల్వడోర్)–మాట్ పావిక్ (క్రొయేషియా) జంటను ఓడించిన యూకీ జోడీ క్వార్టర్ ఫైనల్లోనూ కీలకదశల్లో పైచేయి సాధించి విజయాన్ని అందుకుంది. 1 గంట 48 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో ఇండో–ఆసీస్ జోడీ నాలుగు ఏస్లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్లు చేసింది. -
మాజీ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్కు వరకట్న వేధింపులు.. భర్త భారత మాజీ కబడ్డీ ప్లేయర్
మాజీ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్, అర్జున అవార్డు గ్రహీత సవీటి బూరా (Saweety Boora) వరకట్న వేధింపులు ఎదుర్కొంది. ఆమె భర్త, భారత మాజీ కబడ్డీ ప్లేయర్, ఆసియా క్రీడల్లో కాంస్య పతక విజేత, అర్జున అవార్డు గ్రహీత అయిన దీపక్ హూడా (Deepak Hooda), అతని కుటుంబం అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని సవీటి కేసు పెట్టింది. సవీటి ఫిర్యాదు మేరకు హిస్సార్లోని (హర్యానా) ఓ పోలీస్ స్టేషన్లో దీపక్ హుడా, అతని కుటుంబ సభ్యులపై ఎఫ్ఐఆర్ నమోదైంది. దీపక్ హుడా అదనపు కట్నంతో పాటు ఓ ఫార్చూనర్ కార్ డిమాండ్ చేస్తున్నాడని సవీటి తన ఫిర్యాదులో పేర్కొంది. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 85 కింద దీపక్ హుడా, అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దీపక్ హుడాకు రెండు, మూడు సార్లు నోటీసులు ఇచ్చినా ఎలాంటి స్పందన పోలీసులు వెల్లడించారు. దీపక్ హుడాపై అదనపు కట్నం వేధింపులు, హింసించడం మరియు దాడి చేయడం వంటి అభియోగాలు మోపబడ్డాయని పోలీసులు వివరించారు. పోలీసుల వాదనపై హుడాను జాతీయ మీడియా ప్రశ్నించగా.. ఆరోగ్యం బాగాలేదని చెప్పాడు. ఈ కారణంగానే నోటీసులకు వివరణ ఇవ్వలేకపోయానని అన్నాడు. తన అనారోగ్యానికి సంబంధించిన మెడికల్ సర్టిఫికెట్లు పోలీసులకు సమర్పించినట్లు తెలిపాడు. త్వరలో పోలీస్ స్టేషన్కు వెళ్తానని అన్నాడు. ఈ సందర్భంగా హుడా తన భార్య సవీటిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ప్రస్తుతం ఆమెను కలవడానికి నాకు అనుమతి లేదని అన్నాడు.కాగా, సవీటి బూరా-దీపక్ హుడాల వివాహం 2022లో జరిగింది. దీపక్ హుడా 2024 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. రోహ్తక్ జిల్లాలోని మెహమ్ నియోజకవర్గం నుంచి హుడా పోటీ చేశారు. హుడా.. 2016 దక్షిణాసియా క్రీడల్లో బంగారు పతకం, 2014 ఆసియా క్రీడల్లో కాంస్య పతకం గెలుచుకున్న భారత కబడ్డీ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అతను ప్రో కబడ్డీ లీగ్లో కూడా పాల్గొన్నాడు. 32 ఏళ్ల సవీటి 2023లో జరిగిన మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో స్వర్ణం సాధించింది. గతేడాది ఫిబ్రవరిలో ఆమె భర్తతో కలిసి భాజపాలో చేరింది. గత నెలలోనే సవీటి రాష్ట్రపతి చేతుల మీదుగా అర్జున అవార్డు అందుకుంది. -
క్రీడా సమాఖ్యలకు సాయంపై సమీక్ష!
న్యూఢిల్లీ: వేర్వేరు క్రీడాంశాలకు సంబంధించిన జాతీయ సమాఖ్య (ఎన్ఎస్ఎఫ్)లకు కేంద్ర ప్రభుత్వం నుంచి లభిస్తున్న ఆర్థిక సహాయంపై సమీక్ష జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2036 ఒలింపిక్స్ను నిర్వహించేందుకు భారత్ ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో... రాబోయే కొన్నేళ్లలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేలా సమాఖ్య నిబంధనలు ఉండాలని కేంద్రం భావిస్తోంది. ‘మూడేళ్ల క్రితం రూపొందించిన విధానం ప్రకారం జాతీయ క్రీడా సమాఖ్యలకు కేంద్ర ఆర్థిక సహాయం అందిస్తోంది. ఇందులో ఉన్న నిబంధనలను సమీక్షించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందు కోసమే కొత్త కమిటీని ఏర్పాటు చేశాం. వేర్వేరు అంశాలను సమీక్షించి ఈ కమిటీ నివేదిక అందజేస్తుంది’ అని క్రీడా మంత్రిత్వ శాఖ కార్యదర్శి తరుణ్ పరీక్ పేర్కొన్నారు. కొత్తగా ఆరుగురు సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఆయా క్రీడల్లో టోర్నీల నిర్వహణ, విదేశాల్లో జరిగే టోర్నీల్లో ఆటగాళ్లు పాల్గొనడం, క్రీడా సామగ్రి కొనుగోలు, కోచింగ్ క్యాంప్ల నిర్వహణ వంటి కార్యక్రమాల కోసం ఎన్ఎస్ఎఫ్లకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోంది. కోచ్లు, ఇతర సహాయక సిబ్బంది జీతాలు, గుర్తింపు పొందిన ఆటగాళ్ల కోసం ఇతర అదనపు సౌకర్యాలు, ప్రోత్సాహకాలు కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. వీటికి తోడు సమాఖ్యలు తమ స్థాయిని బట్టి బయట స్పాన్సర్ల ద్వారా కూడా కొంత ఆర్థిక సహాయాన్ని పొందుతాయి. గత ఏడాది బడ్జెట్లో ఎన్ఎస్ఎఫ్ల కోసం రూ. 340 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈ సారి దానిని కొంత పెంచి రూ.400 కోట్లు చేసింది. సమాఖ్యల పనితీరులో మరింత పారదర్శకత, జవాబుదారీతనం కోసమే కొత్త కమిటీని ఏర్పాటు చేసి నిబంధనలు మార్పు చేసే విషయంపై చర్చిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ముసాయిదా క్రీడా బిల్లును కూడా త్వరలో పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఎన్ఎస్ఎఫ్లకు గ్రాంట్లు అందజేసే విషయంలో ఒక రెగ్యులేటరీ బోర్డును కూడా ఏర్పాటు చేయాలని ఈ బిల్లులో ప్రతిపాదన ఉంది. 2036లో ఒలింపిక్స్ క్రీడల నిర్వహణ కోసం భారత్ ఇప్పటికే తమ ఆసక్తిని చూపిస్తూ ‘లెటర్ ఆఫ్ ఇంటెంట్’ను ఐఓసీకి పంపించింది. -
క్వార్టర్స్లో సాకేత్–రామ్ జోడీ
బెంగళూరు: వరుస సెట్లలో గెలిచిన భారత జోడీ సాకేత్ మైనేని–రామ్కుమార్ రామనాథన్ బెంగళూరు ఓపెన్ ఏటీపీ–125 చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాకేత్–రామ్ ద్వయం 6–3, 7–6 (7/4)తో జాకోపో బెరెటిని–ఎన్రికో డల్లా వాలె (ఇటలీ) జంటను ఓడించింది. 74 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సాకేత్–రామ్ జోడీ తొమ్మిది ఏస్లు సంధించి, ప్రత్యర్థి సర్వీస్ను రెండుసార్లు బ్రేక్ చేసింది. ఇతర తొలి రౌండ్ మ్యాచ్ల్లో టాప్ సీడ్ అనిరుధ్ చంద్రశేఖర్ (భారత్)–రే హో (చైనీస్ తైపీ) 6–4, 6–4తో గంటా సాయికార్తీక్ రెడ్డి (భారత్)–సుల్తానోవ్ (ఉజ్బెకిస్తాన్)లపై, సిద్ధాంత్–పరీక్షిత్ సొమాని (భారత్) 6–4, 6–3తో నికీ కలియంద పునాచా (భారత్)–జాన్ లాక్ (జింబాబ్వే)లపై, ప్రజ్వల్ దేవ్–ఆర్యన్ షా (భారత్) 4–6, 6–3, 10–6తో ఎంజో కుకాడో (ఫ్రాన్స్)–మైకేల్ గీర్ట్స్ (బెల్జియం)లపై, ఆదిల్ కల్యాణ్పూర్–కరణ్ సింగ్ (భారత్) 1–6, 6–2, 10–4తో నితిన్ కుమార్ సిన్హా–మనీశ్ సురేశ్కుమార్ (భారత్)లపై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. -
పోరాడి ఓడిన మానస్, కరణ్..
బెంగళూరు: ‘వైల్డ్ కార్డు’తో బరిలోకి దిగిన మానస్ ధామ్నె, రామ్కుమార్ రామనాథన్... ‘క్వాలిఫ యర్’ హోదాలో అడుగు పెట్టిన కరణ్ సింగ్... బెంగళూరు ఓపెన్ ఏటీపీ–125 చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో తొలి రౌండ్ను దాటలేకపోయారు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్ మ్యాచ్ల్లో మానస్ ధామ్నె 3–6, 6–3, 6–7 (3/7)తో పీటర్ బార్ బిర్యుకోవ్ (రష్యా) చేతిలో... కరణ్ సింగ్ 4–6, 6–4, 6–7 (3/7)తో జురిజ్ రొడియోనోవ్ (ఆ్రస్టియా) చేతిలో... రామ్కుమార్ రామనాథన్ 6–7 (3/7), 5–7తో షింటారో మొచిజుకి (జపాన్) చేతిలో పోరాడి ఓడిపోయారు.బిర్యుకోవ్తో 1 గంట 51 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో 17 ఏళ్ల మానస్ తన సర్వీస్ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను రెండుసార్లు బ్రేక్ చేశాడు. అయితే టైబ్రేక్లో మానస్ తడబడి మూల్యం చెల్లించుకున్నాడు. రొడియోనోవ్తో 1 గంట 57 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో కరణ్ 11 ఏస్లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్లు చేశాడు. నిర్ణాయక టైబ్రేక్లో కరణ్ ఒత్తిడికి లోనై ఓటమి పాలయ్యాడు. షింటారోతో 1 గంట 48 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో రామ్ 14 ఏస్లు సంధించి, ఏడు డబుల్ ఫాల్ట్లు చేశాడు. -
లక్ష్యసేన్కు ఊరట
న్యూఢిల్లీ: నకిలీ జనన ధ్రువీకరణ పత్రాలు సమర్పించారనే ఆరోపణలకు చెందిన అంశంలో... భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్తో పాటు అతడి కుటుంబ సభ్యులు, కోచ్పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. తప్పుడు సమాచారంతో లక్ష్యసేన్ ఏజ్ గ్రూప్ టోర్నీల్లో పాల్గొన్నాడనే ఫిర్యాదుపై కర్ణాటక హైకోర్టు విచారణకు ఆదేశించగా... ఈ అంశంలో ఎలాంటి చర్యలు తీసుకోవద్దని దేశ అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. జస్టిస్ సుధాన్షు ధులియా, జస్టిస్ కే వినోద్ చంద్రన్తో కూడిన ధర్మాసనం... లక్ష్యసేన్ కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేసిన ఎంజీ నాగరాజ్తో పాటు కర్ణాటక ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. లక్ష్యసేన్ తరఫున న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్లను కర్ణాటక హైకోర్టు ఈ నెల 19న తిరస్కరించింది. దీన్ని సవాలు చేస్తూ లక్ష్యసేన్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దేశ అత్యున్నత న్యాయస్థానం విచారిస్తోంది. అంతకుముందు ఈ కేసు దర్యాప్తునకు అవసరమైన ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని కర్ణాటక హైకోర్టు తీర్పునిచ్చింది. లక్ష్యసేన్ తల్లిదండ్రులు నిర్మల, ధీరేంద్రతో పాటు అతడి సోదరుడు చిరాగ్ సేన్, కోచ్ విమల్ కుమార్... కర్ణాటక బ్యాడ్మింటన్ సంఘం ఉద్యోగితో కలిసి జనన ధ్రువీకరణ రికార్డులను తప్పుగా మార్పించారని పిటిషనర్ ఫిర్యాదు చేశారు. ఈ కేసు పూర్వాపరాలు ఇలా ఉన్నాయి... » ఏజ్ గ్రూప్ టోర్నీల్లో ఆడేందుకు వీలుగా లక్ష్యసేన్తో పాటు అతడి సోదరుడు చిరాగ్ సేన్ వయసును రెండున్నరేళ్లు తక్కువగా నమోదు చేసినట్లు నాగరాజ్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. » లక్ష్యసేన్ కుటుంబ సభ్యులతో పాటు కోచ్ విమల్ కుమార్పై చర్యలు తీసుకోవాల్సిందిగా ఫిర్యాదులో పేర్కొన్నారు. » తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించారంటూ లక్ష్యసేన్ కుటుంబంపై 2022 డిసెంబర్లో నాగరాజ్ కర్ణాటక పోలీసులను ఆశ్రయించగా... వారు క్రిమినల్ కేసు నమోదు చేశారు. » కేసును విచారించిన మెట్రోపాలిటన్ న్యాయస్థానం ఆధారాలు లేవని కొట్టి వేసింది. జస్టిస్ ఉమ పిటిషన్ను కొట్టేస్తున్నట్లు వెల్లడించారు. » దీంతో పిటిషన్ వేసిన నాగరాజ్ సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా వివరాలు సేకరించి వాటిని న్యాయస్థానానికి అందజేశారు. దీంతో పాటు కేంద్ర యువజన సర్వీసుల మంత్రిత్వ శాఖ ఎంక్వైరీ రిపోర్టును కూడా జత చేశారు. అందులో రికార్డుల తారుమారు అంశంలో లక్ష్యసేన తండ్రి ధీరేంద్ర సేన్ తప్పు అంగీకరించిన వివరాలు ఉన్నాయి. » మరోవైపు ఆరోపణలు నిరాధారమని లక్ష్యసేన్ తరఫు న్యాయవాది వాదిస్తున్నారు.2018లో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ఈ అంశాన్ని విచారించి ఎలాంటి అవకతవకలు లేవని ముగించిందని వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న ప్లేయర్ను మానసికంగా ఇబ్బంది పెట్టేందుకే నాగారాజ్ ఈ పిటిషన్ వేసినట్లు పేర్కొన్నారు. » పిటిషన్ వేసిన నాగరాజ్ 2020లో కుమార్తెను ప్రకాశ్ పదుకొనె బ్యాడ్మింటన్ అకాడమీలో చేర్పించాలని ప్రయత్నించగా... ఆ బాలిక ఎంపిక కాలేదు. దీంతో నిరాశలో ఈ పిటిషన్ దాఖలు చేసినట్లు లక్ష్యసేన్ తరఫు న్యాయవాది వాదిస్తున్నారు. » లక్ష్యసేన్ సోదరుడు చిరాగ్ సేన్... గతంలో తప్పుడు జనన ధ్రువీకరణ పత్రాలు అందించినట్లు నిర్ధారణ అయింది. దీంతో 2016లో భారత బ్యాడ్మింటన్ సంఘం అతడిపై నిషేధం కూడా విధించింది. -
నెదర్లాండ్స్కు భారత్ షాక్
భువనేశ్వర్: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్ భారత అంచె పోటీలను భారత మహిళల, పురుషుల జట్లు విజయంతో ముగించాయి. మంగళవారం జరిగిన మ్యాచ్ల్లో సలీమా టెటె సారథ్యంలోని భారత మహిళల జట్టు ‘షూటౌట్’లో 2–1 గోల్స్ తేడాతో ప్రస్తుత ప్రపంచ చాంపియన్, ఒలింపిక్ చాంపియన్, ప్రపంచ నంబర్వన్ నెదర్లాండ్స్ జట్టు ను బోల్తా కొట్టించగా... హర్మన్ప్రీత్ సింగ్ కెప్టెన్సీలోని భారత పురుషుల జట్టు 2–1 గోల్స్ తేడాతో ఇంగ్లండ్ జట్టుపై గెలిచింది. నెదర్లాండ్స్ మహిళల జట్టుతో జరిగిన మ్యాచ్లో రెండు క్వార్టర్లు ముగిసేసరికి భారత జట్టు 0–2తో వెనుకబడింది. ఆ తర్వాత ఎనిమిది నిమిషాల వ్యవధిలో టీమిండియా రెండు గోల్స్ చేసి స్కోరును 2–2తో సమం చేసింది. భారత్ తరఫున దీపిక (35వ నిమిషంలో), బల్జీత్ కౌర్ (43వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. నెదర్లాండ్స్ జట్టుకు పియెన్ సాండర్స్ (17వ నిమిషంలో), వాన్డెర్ ఫే (28వ నిమిషంలో) ఒక్కో గోల్ అందించారు. నిర్ణీత సమయం ముగిశాక రెండు జట్లు సమంగా నిలువడంతో విజేతను నిర్ణయించేందుకు ‘షూటౌట్’ నిర్వహించారు. ‘షూటౌట్’లో భారత గోల్కీపర్ సవితా పూనియా అడ్డుగోడలా నిలబడి నలుగురు నెదర్లాండ్స్ క్రీడాకారిణుల షాట్లను నిలువరించింది. నెదర్లాండ్స్ తరఫున మరీన్ వీన్ మాత్రమే సఫలమైంది. భారత్ తరఫున దీపిక, ముంతాజ్ సఫలమవ్వగా... బ్యూటీ డుంగ్డుంగ్, బల్జీత్ కౌర్ విఫలమయ్యారు. నెదర్లాండ్స్ ఐదో షాట్ తర్వాత భారత విజయం ఖరారు కావడంతో టీమిండియా ఐదో షాట్ను తీసుకోలేదు. ఇంగ్లండ్ తో పోరులో భారత జట్టుకు హర్మన్ప్రీత్ (26వ, 32వ నిమిషంలో) రెండు గోల్స్ అందించాడు. -
మళ్లీ ప్రపంచ నంబర్వన్ జోడీపై యూకీ బాంబ్రీ విజయం
వారం రోజుల వ్యవధిలో భారత డబుల్స్ టెన్నిస్ స్టార్ యూకీ బాంబ్రీ మరోసారి ప్రపంచ నంబర్వన్, టాప్ సీడ్ జోడీని బోల్తా కొట్టించాడు. దుబాయ్ ఓపెన్ చాంపియన్షిప్ ఏటీపీ–500 టోర్నీలో భాగంగా మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో యూకీ బాంబ్రీ (భారత్)–అలెక్సీ పాపిరిన్ (ఆ్రస్టేలియా) ద్వయం 4–6, 7–6 (7/1), 10–3తో ‘సూపర్ టైబ్రేక్’లో ప్రపంచ నంబర్వన్, టాప్ సీడ్ మార్సెలో అరెవాలో (ఎల్ సాల్వడోర్)–మాట్ పావిక్ (క్రొయేషియా) జంటను ఓడించి క్వార్టర్ ఫైనల్కు చేరింది. 86 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో ఇండో–ఆసీస్ జోడీ ఆరు ఏస్లు సంధించింది. తమ సర్వీస్ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను ఒకసారి బ్రేక్ చేసింది. గతవారం దోహా ఓపెన్–500 టోర్నీలో ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా)తో కలిసి ఆడిన యూకీ క్వార్టర్ ఫైనల్లో అరెవాలో–పావిక్ జంటపై గెలిచింది. దుబాయ్ ఓపెన్లోనే ఆడుతున్న మరో భారత జోడీ జీవన్ నెడుంజెళియన్–విజయ్ సుందర్ ప్రశాంత్ తొలి రౌండ్లో 4–6, 6–7 (6/8)తో జేమీ ముర్రే (బ్రిటన్)–జాన్ పీర్స్ (ఆ్రస్టేలియా) ద్వయం చేతిలో ఓడిపోయింది. -
FIH Pro League: భారత హాకీ జట్లకు నిరాశ
అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్లో సోమవారం భారత మహిళల, పురుషుల హాకీ జట్లకు నిరాశ ఎదురైంది. భువనేశ్వర్లో జరుగుతున్న ఈ టోర్నీలో సోమవారం జరిగిన మ్యాచ్ల్లో భారత మహిళల జట్టు 2–4 గోల్స్ తేడాతో నెదర్లాండ్స్ జట్టు చేతిలో... భారత పురుషుల జట్టు 2–3 గోల్స్ తేడాతో ఇంగ్లండ్ జట్టు చేతిలో ఓడిపోయాయి. నెదర్లాండ్స్తో జరిగిన పోరు ద్వారా భారత జట్టు గోల్కీపర్ సవితా పూనియా తన కెరీర్లో 300 మ్యాచ్లు పూర్తి చేసుకుంది. వందన కటారియా తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారతీయ ప్లేయర్గా సవిత గుర్తింపు పొందింది.నెదర్లాండ్స్తో మ్యాచ్లో భారత్ తరఫున ఉదిత (18వ, 42వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేసింది. నెదర్లాండ్స్ తరఫున ఎమ్మా రెజ్నెన్ (7వ నిమిషంలో), ఫే వాన్డెర్ (40వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించగా... ఫెలిస్ అల్బెర్స్ (34వ, 47వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేసింది.ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో భారత పురుషుల జట్టుకు అభిషేక్ (18వ నిమిషంలో), సుఖ్జీత్ సింగ్ (39వ నిమిషంలో) ఒక్కో గోల్ అందించారు. ఇంగ్లండ్ తరఫున జేకబ్ పేటన్ (15వ నిమిషంలో) ఒక గోల్ చేయగా... సామ్ వార్డ్ (19వ, 29వ నిమిషంలో) రెండు గోల్స్ సాధించాడు. -
హెడ్కోచ్గా భారత జట్టు మాజీ కెప్టెన్
ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో రెండోసారి చాంపియన్గా అవతరించేందుకు యు ముంబా జట్టు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తొలి మూడు సీజన్లలో ఫైనల్కు చేరుకోవడంతోపాటు ఒకసారి విజేతగా (2015లో), రెండుసార్లు రన్నరప్గా (2014, 2016) నిలిచిన యు ముంబా జట్టు ఆ తర్వాత వెనుకబడిపోయింది. గత మూడు సీజన్లలో అయితే యు ముంబా జట్టు పూర్తిగా నిరాశపరిచింది. రెండుసార్లు పదో స్థానంలో, ఒకసారి తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకుంది.ఈ నేపథ్యంలో యు ముంబా మళ్లీ టైటిల్ ట్రాక్లో పడాలనే ఉద్దేశంలో ఫ్రాంచైజీ శిక్షణ బృందంలో మార్పులు చేసింది. భారత జట్టు మాజీ కెప్టెన్, మూడు ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత జట్టు సభ్యుడు రాకేశ్ కుమార్ను కొత్త హెడ్ కోచ్గా నియమించింది. మూడో పీకేఎల్ సీజన్లో యు ముంబా జట్టుతో చేరిన రాకేశ్... అంతకుముందు పట్నా పైరేట్స్ తరఫున ఆడాడు. ఆ తర్వాత 2017లో తెలుగు టైటాన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.‘కింగ్ ఆఫ్ కబడ్డీ’గా పేరొందిన రాకేశ్ను తమ జట్టుకు హెడ్ కోచ్గా నియమించినందుకు ఆనందంగా ఉందని యు ముంబా సీఈఓ సుహైల్ చందోక్ తెలిపారు. ‘ఈసారి హెడ్ కోచ్గా యు ముంబా జట్టుతో చేరినందుకు సంతోషంగా ఉంది. వచ్చే సీజన్లో యు ముంబాకు మంచి ఫలితాలు అందించేందుకు నా శక్తివంచన లేకుండా కృషి చేస్తా’ అని 41 ఏళ్ల రాకేశ్ వ్యాఖ్యానించాడు. గతంలో హరియాణా స్టీలర్స్ జట్టుకు, ఇండియన్ రైల్వేస్ జట్టుకు కోచ్గా వ్యవహరించిన రాకేశ్ 2006, 2010, 2014 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు నెగ్గిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. మరిన్ని క్రీడా వార్తలువరల్డ్ కప్ షాట్గన్ టోర్నీకి కైనన్ న్యూఢిల్లీ: హైదరాబాద్ సీనియర్ ట్రాప్ షూటర్ కైనన్ చెనాయ్ ఈ సీజన్ను వరల్డ్ కప్ టోర్నీతో మొదలు పెట్టనున్నాడు. అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ఆధ్వర్యంలో జరిగే సీజన్ మూడో వరల్డ్కప్లో పాల్గొనే 12 మంది సభ్యులతో కూడిన భారత షాట్గన్ జట్టును సోమవారం నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ) ప్రకటించింది. సైప్రస్ రాజధాని నికోసియాలో మే 3 నుంచి 12వ తేదీ వరకు ఈ సీజన్లోని మూడో షాట్గన్ వరల్డ్కప్ టోర్నీ జరుగుతుంది.జాతీయ సెలెక్షన్ పాలసీ ప్రకారం భారత ర్యాంకింగ్స్లో 4 నుంచి 6 స్థానాల మధ్య ఉన్న షూటర్లను మూడో వరల్డ్కప్ టోర్నీకి ఎంపిక చేశారు. 34 ఏళ్ల కైనన్ 2016 రియో ఒలింపిక్స్లో ట్రాప్ ఈవెంట్లో భారత జట్టు తరఫున బరిలోకి దిగాడు. గత 15 ఏళ్లుగా భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న కైనన్ తన కెరీర్లో వరల్డ్ కప్ టోర్నీలలో ఒక స్వర్ణం, ఒక రజతం, ఒక కాంస్యంతో కలిపి 3 పతకాలు... ఆసియా చాంపియన్షిప్లో మూడు రజతాలు, ఒక కాంస్యంతో కలిపి 4 పతకాలు సాధించాడు. అర్జెంటీనా, పెరూలలో రైఫిల్, పిస్టల్, షాట్గన్ ఈవెంట్స్తో కూడిన రెండు వరల్డ్కప్లు జరుగుతాయి. అనంతరం సైప్రస్లో కేవలం షాట్గన్ ఈవెంట్లో మాత్రమే వరల్డ్కప్ జరుగుతుంది.భారత షూటింగ్ జట్టు: పురుషుల ట్రాప్ వ్యక్తిగత విభాగం: కైనన్ చెనాయ్, శార్దుల్ విహాన్, భౌనీశ్ మెండిరట్టాపురుషుల స్కీట్ విభాగం: మేరాజ్ అహ్మద్ ఖాన్, అభయ్ సింగ్ సెఖోన్, రితురాజ్ సింగ్ బుండేలామహిళల ట్రాప్ వ్యక్తిగత విభాగం: సబీరా హారిస్, కీర్తి గుప్తా, రాజేశ్వరి కుమారి. మహిళల స్కీట్ విభాగం: యశస్వి రాథోడ్, మహేశ్వరి చౌహాన్, పరినాజ్ ధలివాల్ట్రాప్ మిక్స్డ్ టీమ్: కైనన్ చెనాయ్, సబీరా హారిస్, శార్దుల్ విహాన్, కీర్తి గుప్తా. భారత మహిళల జట్టుకు తొలి ఓటమి షార్జా: పింక్ లేడీస్ కప్ అంతర్జాతీయ మహిళల ఫుట్బాల్ టోర్నమెంట్లో భారత జట్టుకు తొలి పరాజయం ఎదురైంది. రష్యా జట్టుతో జరిగిన రెండో లీగ్ మ్యాచ్లో భారత జట్టు 0–2 గోల్స్ తేడాతో ఓడిపోయింది. రష్యా తరఫున గ్లాఫిరా జుకోవా (25వ నిమిషంలో), వాలెంటీనా స్మిర్నోవా (90+2వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. ప్రపంచ ర్యాంకింగ్స్లో 27వ స్థానంలో ఉన్న రష్యా జట్టు ఆద్యంతం ఆధిపత్యం చలాయించింది.తొలి మూడు నిమిషాల్లోనే రష్యా గోల్ చేసినంత పని చేసింది. కానీ రష్యా ప్లేయర్లు కొట్టిన షాట్లు గురి తప్పాయి. భారత్ తరఫున మనీషా 31వ నిమిషంలో కొట్టిన షాట్ను రష్యా గోల్కీపర్ కీరా పెతుకోవా నిలువరించింది. రెండో అర్ధభాగంలో భారత జట్టు పక్కా ప్రణాళికతో ఆడి రష్యా జోరుకు అడ్డకట్ట వేసింది. అయితే ఇంజ్యూరీ సమయంలో మరో గోల్ను సమర్పించుకుంది.భారత జట్టుకు ఆడుతున్న తెలంగాణ అమ్మాయి గుగులోత్ సౌమ్య ఈ మ్యాచ్లో 68 నిమిషాలు మైదానంలో ఉంది. ఆ తర్వాత సౌమ్య స్థానంలో మౌసుమి ముర్ము సబ్స్టిట్యూట్గా వచ్చింది. ప్రపంచ ర్యాంకింగ్స్లో 69వ స్థానంలో ఉన్న భారత జట్టు ఈ టోర్నీలోని తొలి మ్యాచ్లో 2–0తో జోర్డాన్ జట్టుపై గెలిచింది. భారత జట్టు తమ చివరి లీగ్ మ్యాచ్ను బుధవారం దక్షిణ కొరియా జట్టుతో ఆడుతుంది. -
Singapore International Challenge Tourney: రన్నరప్గా భారత యువ షట్లర్
న్యూఢిల్లీ: భారత యువ షట్లర్ ఉన్నతి హుడా సింగపూర్ ఇంటర్నేషనల్ చాలెంజ్ టోర్నమెంట్లో రన్నరప్గా నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో నాలుగో సీడ్ ఉన్నతి 17–21, 16–21 పాయింట్ల తేడాతో రుజానా (ఇండోనేసియా) చేతిలో పరాజయం పాలైంది. 42 నిమిషాల్లో ముగిసిన పోరులో ఉన్నతి వరుస గేమ్ల్లో ఓడింది. టోర్నీ ఆసాంతం రాణించిన ఉన్నతి... రెండో రౌండ్లో ఆసియా క్రీడల పతక విజేత సయిన కవాకమి (ఆ్రస్టేలియా)ను ఓడించింది. సెమీఫైనల్కు చేరే క్రమంలో చైనీస్ తైపీకి చెందిన ఇద్దరు షట్లర్లు సైయాంగ్ స్యూన్ లిన్, యీ టింగ్పై కూడా ఉన్నతి విజయాలు సాధించింది. సెమీఫైనల్లో ఉన్నతి 18–21, 21–19, 22–20తో థి ట్రాంగ్ వు (వియత్నాం)ను చిత్తు చేసింది. తొలి గేమ్లో పరాజయం పాలైన తర్వాత తిరిగి పుంజుకున్న ఉన్నతి... హోరాహోరీ పోరులో చక్కటి విజయంతో ఫైనల్ చేరింది. అయితే తుదిపోరులో యువ షట్లర్ అదే జోరు కనబర్చలేక రన్నరప్తో సరిపెట్టుకుంది. ఇదే టోర్నీలో భారత్కు చెందిన మరో యువ షట్లర్ దేవిక సిహాగ్ క్వార్టర్ ఫైనల్లో ఓటమి పాలైంది. -
టైటిల్తో పునరాగమనం.. సిడ్నీ క్లాసిక్ ఓపెన్లో విజేతగా నిలిచిన భారత స్క్వాష్ స్టార్ సౌరవ్
న్యూఢిల్లీ: భారత స్క్వాష్ స్టార్ సౌరవ్ ఘోషాల్ తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. గత ఏడాది ఏప్రిల్లో ఆట నుంచి వీడ్కోలు తీసుకున్న 38 ఏళ్ల సౌరవ్ ఈ ఏడాది జనవరిలో మళ్లీ రాకెట్ పట్టాడు. ఆదివారం ఆ్రస్టేలియాలో ముగిసిన ఆక్టేన్ ఓపెన్ సిడ్నీ క్లాసిక్ స్క్వాష్ చాలెంజర్ టోర్నీలో సౌరవ్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో ప్రపంచ మాజీ పదో ర్యాంకర్ సౌరవ్ 11–2, 11–6, 11–2తో ఈజిప్ట్ దేశానికి చెందిన అబ్దుల్ రెహమాన్ నాసర్పై గెలుపొందాడు. ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్లలో కలిపి మొత్తం 12 పతకాలు సాధించిన సౌరవ్... ఈ టోర్నీలో తన ప్రత్యర్థులకు ఒక్క సెట్ మాత్రమే కోల్పోవడం విశేషం. సెమీఫైనల్లో సౌరవ్ 11–9, 5–11, 11–1, 11–2తో రైస్ డౌలింగ్ (ఆస్ట్రేలియా)పై, క్వార్టర్ ఫైనల్లో 11–6, 11–6, 11–5తో మిన్వూ లీ (దక్షిణ కొరియా)పై, రెండో రౌండ్లో 11–8, 11–2, 11–8తో కిజాన్ (మాల్టా)పై గెలుపొందాడు. రెండో సీడ్గా బరిలోకి దిగిన సౌరవ్కు తొలి రౌండ్లో ‘బై’ లభించింది. 2003లో ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్ (పీఎస్ఏ) టూర్లో అరంగేట్రం చేసిన సౌరవ్ ఇప్పటి వరకు 11 పీఎస్ఏ సింగిల్స్ టైటిల్స్ సాధించాడు. 18 టోరీ్నలలో రన్నరప్గా నిలిచాడు. -
ఆంద్రీవా అదుర్స్
దుబాయ్: మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) చరిత్రలో 1000 సిరీస్ సింగిల్స్ టైటిల్ నెగ్గిన పిన్న వయసు్కరాలిగా రష్యా టీనేజ్ స్టార్ మీరా ఆంద్రీవా రికార్డు నెలకొల్పింది. దుబాయ్ టెన్నిస్ చాంపియన్షిప్ డబ్ల్యూటీఏ–1000 టోర్నీలో విజేతగా నిలువడం ద్వారా 17 ఏళ్ల మీరా ఆంద్రీవా ఈ ఘనత సాధించింది. ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో ప్రపంచ 14వ ర్యాంకర్ ఆంద్రీవా 7–6 (7/1), 6–1తో ప్రపంచ 38వ ర్యాంకర్ క్లారా టౌసన్ (డెన్మార్క్)పై గెలుపొందింది. 1 గంట 46 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో ఆంద్రీవా ఆరు ఏస్లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్లు చేసింది. తన సర్వీస్ను రెండు సార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్వన్ సబలెంకాపై సంచలన విజయం సాధించిన క్లారా టౌసన్ తుది పోరులో తొలి సెట్లో గట్టిపోటీనిచ్చి ఆ తర్వాత తడబడింది. విజేతగా నిలిచిన ఆంద్రీవాకు 5,97,000 డాలర్ల (రూ. 5 కోట్ల 17 లక్షలు) ప్రైజ్మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ క్లారా టౌసన్కు 3,51,801 డాలర్ల (రూ. 3 కోట్ల 4 లక్షలు) ప్రైజ్మనీతోపాటు 650 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. దుబాయ్ ఓపెన్ టైటిల్ విజయంతో సోమవారం విడుదల చేసే డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్లో మీరా ఆంద్రీవా కెరీర్ బెస్ట్9వ ర్యాంక్కు చేరుకుంటుంది. 2007లో నికోల్ వైదిసోవా (చెక్ రిపబ్లిక్) తర్వాత టాప్–10లోకి వచ్చిన పిన్న వయసు్కరాలిగా ఆంద్రీవా గుర్తింపు పొందనుంది. దుబాయ్ ఓపెన్ టోర్నీలో ఆంద్రీవా విశేషంగా రాణించింది.టైటిల్ గెలిచే క్రమంలో ముగ్గురు గ్రాండ్స్లామ్ చాంపియన్స్ మర్కెటా వొంద్రుసోవా (చెక్ రిపబ్లిక్), ఇగా స్వియాటెక్ (పోలాండ్), ఎలానీ రిబాకినా (కజకిస్తాన్)లపై గెలుపొందింది. 2004 డబ్ల్యూటీఏ ఫైనల్స్ టోర్నీలో మరియా షరపోవా (రష్యా) తర్వాత ఒకే టోర్నీలో ముగ్గురు గ్రాండ్స్లామ్ చాంపియన్స్ను ఓడించిన ప్లేయర్గా ఆంద్రీవా గుర్తింపు పొందింది. -
జోరు కొనసాగించాలని...
భువనేశ్వర్: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్లో వరుస విజయాలతో జోరు మీదున్న భారత పురుషుల జట్టు మరో కీలక పోరుకు సిద్ధమైంది. ఐర్లాండ్పై భారీ విజయాలు నమోదు చేసుకున్న హర్మన్ప్రీత్ సింగ్ సారథ్యంలోని టీమిండియా... సోమవారం తమకంటే మెరుగైన ర్యాంకర్ ఇంగ్లండ్తో మ్యాచ్ ఆడనుంది. భారత అంచె పోటీల్లో మంచి ప్రదర్శన కనబరుస్తున్న భారత్... తాజా సీజన్లో 6 మ్యాచ్లాడి 4 విజయాలు, 2 పరాజయాలతో 12 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు 13 పాయింట్లు సాధించిన ఇంగ్లండ్ మూడో ‘ప్లేస్’లో ఉంది. స్పెయిన్, జర్మనీతో మ్యాచ్ల్లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయిన భారత జట్టు... ఐర్లాండ్పై మాత్రం సమష్టిగా సత్తా చాటింది. అదే స్ఫూర్తి ఇంగ్లండ్పై కూడా కొనసాగించాలని టీమ్ మేనేజ్మెంట్ ఆశిస్తోంది. కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్, మన్దీప్ సింగ్, జర్మన్ప్రీత్ సింగ్, సుఖ్జీత్ సింగ్, నీలమ్, అభిషేక్, షంషేర్ సింగ్ కలిసికట్టుగా కదం తొక్కాల్సిన అవసరముంది. డిఫెన్స్లో భారత్ బలంగా కనిపిస్తోంది. తాజా సీజన్లో ఆరు మ్యాచ్లాడిన టీమిండియా ఇప్పటి వరకు ప్రత్యర్థులకు కేవలం 8 గోల్స్ మాత్రమే సమర్పించుకుంది. తొమ్మిది జట్లలో ఇదే అతి తక్కువ కావడం మన రక్షణ శ్రేణి పటుత్వాన్ని చాటుతోంది. అయితే పెనాల్టీ కార్నర్లను సది్వనియోగ పరుచుకోవడంపై మరింత దృష్టి సారిస్తేనే ఇంగ్లండ్పై విజయం సాధ్యమవుతుంది. నెదర్లాండ్స్ను నిలువరించేనా.. మహిళల ప్రొ లీగ్లో పడుతూ లేస్తూ సాగుతున్న భారత జట్టు... సోమవారం డిఫెండింగ్ చాంపియన్ నెదర్లాండ్స్తో తలపడుతుంది. భారత అంచె పొటీలను ఘనవిజయంతో ప్రారంభించిన సలీమా టెటె సారథ్యంలోని భారత జట్టు... ఆసాంతం అదే జోరు కొనసాగించలేకపోయింది. తాజా సీజన్లో 6 మ్యాచ్లాడిన మన అమ్మాయిలు 2 విజయాలు, 3 పరాజయాలు, 1‘డ్రా’తో 7 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో ఏడో స్థానంలో ఉన్నారు.మరోవైపు 15 పాయింట్లు సాధించిన నెదర్లాండ్స్ రెండో ‘ప్లేస్’లో కొనసాగుతోంది. గత మ్యాచ్లో జర్మనీపై సాధించిన స్ఫూర్తితో సమష్టిగా సత్తాచాటాలని భారత జట్టు భావిస్తోంది. మరోవైపు గత రెండు మ్యాచ్ల్లో ఇంగ్లండ్పై 5–1, 6–0తో విజయాలు సాధించిన నెదర్లాండ్స్ జట్టు టీమిండియాపై కూడా అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. ‘ప్రపంచంలోనే అత్యంత పటిష్ట జట్లలో నెదర్లాండ్స్ ఒకటి. వాళ్లతో మ్యాచ్ కఠినమైందని తెలుసు. మా వరకు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడంపైనే దృష్టి పెట్టాం. జర్మనీపై విజయం ప్లేయర్ల ఆత్మవిశ్వాసాన్ని పెంచింది’ అని భారత సారథి సలీమ చెప్పింది. 2013 నుంచి భారత్, నెదర్లాండ్స్ మధ్య 7 మ్యాచ్లు జరగగా... అందులో ఐదింట నెదర్లాండ్స్ విజయం సాధించింది. ఒక మ్యాచ్ టీమిండియా నెగ్గగా... మరొకటి ‘డ్రా’ అయింది. -
క్రీడల మంత్రి... సైకిల్ సవారీ...
న్యూఢిల్లీ: దేశం నుంచి ఊబకాయాన్ని పారద్రోలాలంటే ప్రతి ఒక్కరూ దైనందిన జీవితంలో వ్యాయామాన్ని భాగం చేసుకోవాలని కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పిలుపునిచ్చారు. ఆదివారం న్యూఢిల్లీలో నిర్వహించిన ‘ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమంలో కేంద్ర క్రీడల మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ... ‘ఊబకాయంపై అవగాహన అత్యవసరం. ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్లు రోజువారీ జీవితంలో వ్యాయామం ఎంతో ముఖ్యం. సైక్లింగ్ అతి సులువైన ఎక్స్ర్సైజ్. దీని వల్ల ఆరోగ్యం మెరుగవడంతో పాటు... పర్యావరణానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. ప్రతి రోజూ సైక్లింగ్ చేసే వాళ్లు కాలుష్యాన్ని నివారించడంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోగలరు’ అని అన్నారు. ఈ సందర్భంగా మాండవీయ సైకిల్ తొక్కి ప్రజల్లో ఫిట్నెస్పై అవగాహన పెంచే ప్రయత్నం చేశారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఐసీసీఐ, సీఐఐ ప్రతినిదులు పాల్గొన్నారు. ప్రతి వారం ఒక్కో రంగానికి చెందిన ఔత్సాహికులు ఈ సైకిల్ ర్యాలీలో పాల్గొంటున్నారు. గతంలో ఆర్మీ అధికారులు, పోస్ట్మెన్లు, వెల్నెస్ నిపుణులు ఇలా పలు రంగాలకు చెందిన వాళ్లు ఇందులో పాల్గొన్నారు. ర్యాలీలో పాల్గొన్న ఒలింపియన్ అర్జున్లాల్ జాట్ మాట్లాడుతూ... ‘ఒక అథ్లెట్గా ప్రజల్లో ఆరోగ్యంపై వస్తున్న అవగాహన చూస్తుంటే సంతోషంగా ఉంది. ఆదివారం ఉదయం పెద్ద సంఖ్యలో ప్రజలు వ్యాయామం కోసం సమయాన్ని వెచ్చించడం ఆహ్వానించదగ్గ విషయం. ఫిట్నెస్పై దృష్టి పెట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఆ దిశగా ‘ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమం దేశ ప్రజల్లో స్ఫూర్తి నింపుతోంది’ అని అన్నారు. మరోవైపు గువాహటిలోని భారత క్రీడా ప్రాధికార సంస్థ కేంద్రంలో నిర్వహించిన ర్యాలీలో భారత మెడికల్ అసోసియేషన్కు చెందిన వందలాది మంది వైద్యులు పాల్గొని ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. ఓవరాల్గా దేశంలోని 4,200 కేంద్రాల్లో ‘ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం ఒక్క రోజే దేశంలో 1200 ప్రాంతాల్లో ఈ ర్యాలీలు జరిగినట్లు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రతి నెల చివరి ఆదివారం ప్రధానమంత్రి దేశ ప్రజలతో తన మనసులోని మాటలు పంచుకునే ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో భాగాగా ఆదివారం నరేంద్ర మోదీ ఒబేసిటీ గురించి ప్రస్తావించారు. ఊబకాయాన్ని పారదోలేందుకు వంట నూనెల వినియోగాన్ని 10 శాతం తగ్గించుకోవాలని దేశ ప్రజలకు సూచించారు. -
జాతీయ కబడ్డీ విజేత సర్వీసెస్
కటక్: ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన జాతీయ సీనియర్ కబడ్డీ చాంపియన్షిప్లో సర్వీసెస్ జట్టు విజేతగా అవతరించింది. ఆదివారం జరిగిన తుదిపోరులో సర్వీసెస్ జట్టు టైబ్రేక్లో 6–4 పాయింట్ల తేడాతో రైల్వేస్పై విజయం సాధించింది. నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరు నిర్ణీత సమయంలో 30–30 పాయింట్లతో సమం అయింది. దాంతో విజేతను తేల్చేందుకు టైబ్రేక్ నిర్వహించగా సర్వీసెస్ రెండు పాయింట్లతో పైచేయి సాధించింది.ప్రొ కబడ్డీ లీగ్ స్టార్ నవీన్ కుమార్ సారథ్యంలో బరిలోకి దిగిన సర్వీసెస్ జట్టు టోర్నీ ఆసాంతం కనబర్చిన నిలకడనే ఫైనల్లోనూ కొనసాగించింది. పీకేఎల్ 11వ సీజన్ విజేతలైన జైదీప్ దహియా, రాహుల్ సర్వీసెస్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. అంతకుముందు సెమీఫైనల్లో సర్వీసెస్ 43–35 పాయింట్ల తేడాతో పంజాబ్పై విజయం సాధించగా... మరో సెమీస్లో రైల్వేస్ 42–34 పాయింట్ల తేడాతో ఉత్తరప్రదేశ్పై గెలుపొందింది. -
Cappelle International Chess Championship: తెలంగాణ గ్రాండ్మాస్టర్కు కాంస్యం
న్యూఢిల్లీ: భారత గ్రాండ్మాస్టర్ రాజా రిత్విక్ కాపెల్ ఇంటర్నేషనల్ చెస్ చాంపియన్షిప్లో కాంస్య పతకంతో మెరిశాడు. ఫ్రాన్స్ వేదికగా జరిగిన ఈ చాంపియన్షిప్లో 7 పాయింట్లు సాధించిన తెలంగాణ స్టార్ ప్లేయర్ మూడో స్థానంలో నిలిచాడు. ఫ్రాన్స్ గ్రాండ్మాస్టర్ బోయెర్ మహెల్ పసిడి పతకం సాధించగా... భారత్కే చెందిన గ్రాండ్మాస్టర్ ఇనియాన్ పన్నీర్సెల్వం రజత పతకం దక్కించుకున్నాడు. 26 దేశాలకు చెందిన 533 మంది ప్లేయర్లు పాల్గొన్న ఈ టోర్నీలో రిత్విక్ 9 రౌండ్లలో 7 పాయింట్లు సాధించాడు. ఆరో సీడ్గా బరిలోకి దిగిన తెలంగాణ గ్రాండ్మాస్టర్ 6 గేమ్లు గెలిచి రెండింటిని ‘డ్రా’ చేసుకున్నాడు. ఒక గేమ్లో ఓటమి పాలయ్యాడు. కాపెల్ అంతర్జాతీయ చెస్ చాంపియన్షిప్లో కాంస్యం నెగ్గిన రాజా రిత్విక్ను తెలంగాణ చెస్ సంఘం కార్యదర్శి జయచంద్ర ప్రత్యేకంగా అభినందించారు. -
ఆసియా రికార్డు నమోదు చేసిన గుల్వీర్.. ప్రపంచ అథ్లెటిక్స్కు అర్హత
న్యూఢిల్లీ: భారత యువ అథ్లెట్ గుల్వీర్ సింగ్ 5000 మీటర్ల ఇండోర్ రేసులో ఆసియా రికార్డు నెలకొల్పుతూ... ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్నకు అర్హత సాధించాడు. అమెరికా బోస్టన్లో జరిగిన ఇండోర్ ఈవెంట్లో గుల్వీర్ 12 నిమిషాల 59.77 సెకన్లలో లక్ష్యాన్ని చేరి నాలుగో స్థానంలో నిలిచాడు. తద్వారా 5000 మీటర్ల ఇండోర్ రేసును 13 నిమిషాల లోపు పూర్తిచేసిన తొలి భారతీయుడిగా రికార్డుల్లోకెక్కాడు. ఆసియా క్రీడల్లో కాంస్య పతకం సాధించిన గుల్వీర్... ఈ ఏడాది సెప్టెంబర్లో జరగనున్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ అర్హత మార్క్ (13 నిమిషాల 1 సెకన్)ను దాటాడు. ‘నా ప్రదర్శనతో ఆనందంగా ఉన్నా . ఓవరాల్గా టైమింగ్ మెరుగు పరుచుకోవడంపై దృష్టి పెడుతున్నా. ఈ క్రమంలో ఇండోర్లో ఆసియా రికార్డు టైమింగ్ నమోదు చేయడం గర్వంగా ఉంది. నేరుగా ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్కు అర్హత సాధించడంతో సంతృప్తిగా ఉన్నా’ అని గుల్వీర్ పేర్కొన్నాడు. 5000 మీటర్ల ఔట్డోర్ రేసులోనూ జాతీయ రికార్డు (13 నిమిషాల 11.82 సెకన్లు) గుల్వీర్ సింగ్ పేరిటే ఉంది. -
Maha Open 2025: జీవన్–విజయ్ జోడీకి టైటిల్
పుణే: మహా ఓపెన్ ఏటీపీ చాలెంజర్–100 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో టాప్ సీడ్ జీవన్ నెడుంజెళియన్–విజయ్ సుందర్ ప్రశాంత్ (భారత్) జంట చాంపియన్గా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో జీవన్–విజయ్ జంట 3–6, 6–3, 10–0తో రెండో సీడ్ బ్లేక్ బేల్డన్–మాథ్యూ క్రిస్టోఫర్ (ఆ్రస్టేలియా) ద్వయంపై విజయం సాధించింది. జీవన్–విజయ్ జోడీకి సంయుక్తంగా ఇదే తొలి టైటిల్ కాగా... విజయ్ సుందర్ పుణేలో మూడో సారి విజేతగా నిలిచాడు. తొలి సెట్లో పరాజయం పాలైన భారత జంట ఆ తర్వాత ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా విజృంభించింది. 2 ఏస్లు సంధించిన జీవన్–విజయ్ జోడీ... 3 డబుల్ ఫాల్ట్స్ చేసింది. ఈ విజయంతో రూ. 7 లక్షల నగదు బహుమతితో పాటు 100 ర్యాంకింగ్స్ పాయింట్లు భారత ప్లేయర్ల ఖాతాలో చేరాయి. దీంతో ఏటీపీ ర్యాంకింగ్స్లో జీవన్ 94వ స్థానానికి, విజయ్ 104వ ర్యాంక్కు చేరనున్నారు. -
భళా భారత్
భువనేశ్వర్: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్లో భారత పురుషుల జట్టు విజయ పరంపర కొనసాగుతోంది. శనివారం జరిగిన పోరులో టీమిండియా 4–0 గోల్స్ తేడాతో ఐర్లాండ్ జట్టుపై విజయం సాధించింది. శుక్రవారం 3–1 గోల్స్ తేడాతో ఐర్లాండ్ను ఓడించిన భారత్... వరుసగా రెండో మ్యాచ్లోనూ ఆధిపత్యం కనబర్చింది. భారత్ తరఫున నీలమ్ సంజీప్ (14వ నిమిషంలో), మన్దీప్ సింగ్ (24వ నిమిషంలో), అభిõÙక్ (28వ నిమిషంలో), శంషేర్ సింగ్ (34వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. మ్యాచ్ ఆరంభంలో చక్కటి ఆటతీరు కనబర్చిన ఐర్లాండ్ 9వ నిమిషంలో దక్కిన పెనాల్టీ కార్నర్ అవకాశాన్ని సది్వనియోగం చేసుకోలేకపోయింది. ఇక అక్కడి నుంచి భారత్ జోరు ప్రారంభమైంది. వరుస విరామాల్లో గోల్స్ కొట్టిన భారత్ ఆధిక్యం అంతకంతకూ పెంచుకుంటూ పోయింది. నీలమ్ 14వ నిమిషంలో ఫీల్డ్గోల్తో భారత్ ఖాతా తెరవగా... ఆ తర్వాత మన్దీప్, అభిõÙక్, శంషేర్ తలా ఒక గోల్ కొట్టారు. మ్యాచ్లో భారత్కు మరిన్ని పెనాల్టీ కార్నర్ అవకాశాలు లభించినా... రెగ్యులర్ కెప్టెన్, స్టార్ డ్రాగ్ఫ్లికర్ హర్మన్ప్రీత్ సింగ్ విశ్రాంతి తీసుకోవడంతో మన అధిక్యం మరింత పెరగలేదు. చివరి క్వార్టర్లో ప్రత్యర్థి ప్లేయర్లు మన రక్షణ పంక్తిని దాటి ముందుకు సాగలేకపోయారు. తదుపరి మ్యాచ్లో సోమవారం ఇంగ్లండ్తో భారత్ తలపడుతుంది. దీపిక గోల్తో భారత్ గెలుపు మరో వైపు మహిళల విభాగంలో భారత జట్టు శనివారం 1–0 గోల్స్ తేడాతో జర్మనీపై విజయం సాధించింది. శుక్రవారం తొలి పోరులో 0–4 గోల్స్ తేడాతో జర్మనీ చేతిలో ఓడిన భారత్... రెండో మ్యాచ్లో దానికి బదులు తీర్చుకుంది. భారత్ తరఫున స్టార్ డ్రాగ్ఫ్లికర్ దీపిక (12వ నిమిషంలో) ఏకైక గోల్ చేసింది. పెనాల్టీ కార్నర్ను సమర్థవంతంగా ప్రత్యర్థి గోల్పోస్ట్లోకి పంపి జట్టుకు ఆధిక్యాన్ని అందించింది. ఆ తర్వాత ఇరు జట్లు ఎంత ప్రయత్నించినా మరో గోల్ సాధ్య పడలేదు. ఫలితంగా భారత్ విజయం సాధించింది. తదుపరి మ్యాచ్లో నెదర్లాండ్స్తో భారత అమ్మాయిల జట్టు మ్యాచ్ ఆడుతుంది. -
గోవా ఘన విజయం
న్యూఢిల్లీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో గోవా ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) 12వ విజయం నమోదు చేసుకుంది. శనివారం జరిగిన పోరులో గోవా జట్టు 2–0 గోల్స్ తేడాతో కేరళ బ్లాస్టర్స్పై విజయం సాధించింది. గోవా జట్టు తరఫున ఇకెర్ గుర్రొటెనె (46వ నిమిషంలో), మొహమ్మద్ యాసిర్ (73వ నిమిషంలో) చెరో గోల్ సాధించారు. హోయ్్చలో గోవా జట్టు ప్రత్యర్థి గోల్ పోస్ట్పై 6 షాట్లు ఆడగా... కేరళ బ్లాస్టర్స్ ఒక్కటేసారి గోల్ పోస్ట్పైకి గురిచూసినా అది లక్ష్యాన్ని చేరలేదు. తాజా సీజన్లో ఇప్పటి వరకు 21 మ్యాచ్లు ఆడిన గోవా జట్టు 12 విజయాలు, 3 పరాజయాలు, 6 ‘డ్రా’లతో 42 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో రెండో స్థానానికి చేరింది. మరోవైపు కేరళ బ్లాస్టర్స్ 21 మ్యాచ్ల్లో 7 విజయాలు, 11 పరాజయాలు, 3 ‘డ్రా’లతో 24 పాయింట్లు సాధించి 10వ స్థానంలో ఉంది. శనివారమే జరిగిన మరో మ్యాచ్లో ఈస్ట్ బెంగాల్ జట్టు 3–1 గోల్స్ తేడాతో పంజాబ్ ఫుట్బాల్ క్లబ్పై గెలుపొందింది. ఈస్ట్ బెంగాల్ తరఫున దిమిత్రోస్ (15వ నిమిషంలో), మహేశ్ సింగ్ (47వ నిమిషంలో), లాల్చుంగుంగా (54వ నిమిషంలో) తలా ఒక గోల్ కొట్టారు. పంజాబ్ తరఫున ఇజెక్వెల్ విడాల్ (62వ నిమిషంలో) ఏకైక గోల్ సాధించాడు. ప్రస్తుతం ఈస్ట్ బెంగాల్ జట్టు 24 పాయింట్లతో పట్టిక తొమ్మిదో స్థానంలో ఉండగా... పంజాబ్ అన్నే పాయింట్లతో 11వ స్థానంలో ఉంది. లీగ్లో భాగంగా ఆదివారం జరగనున్న మ్యాచ్లో మోహన్ బగాన్తో ఒడిషా ఫుట్బాల్ క్లబ్ తలపడుతుంది. -
National Kabaddi Championship: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జట్లకు నిరాశ
కటక్: డిఫెండింగ్ చాంపియన్ హరియాణా శుక్రవారం మొదలైన సీనియర్ జాతీయ కబడ్డీ చాంపియన్షిప్లో శుభారంభం చేసింది. తెలుగు రాష్ట్రాల జట్లకు ఓటమి ఎదురవగా... హరియాణాతో పాటు రైల్వేస్, మధ్యప్రదేశ్ జట్లు కూడా భారీ విజయాలతో టోర్నీని ఆరంభించాయి. పూల్ ‘ఎ’లో హరియాణా 50–20 స్కోరుతో తెలంగాణ జట్టును ఓడించింది.పూల్ ‘డి’లో మధ్యప్రదేశ్ 59–35తో ఆంధ్రప్రదేశ్పై ఘనవిజయం సాధించింది. ఇదే పూల్లో జరిగిన మరో మ్యాచ్లో చండీగఢ్ 40–24తో గుజరాత్పై గెలిచింది. పూల్ ‘బి’లో రైల్వేస్ 59–17తో మణిపూర్పై ఏకపక్ష విజయం సాధించగా... పూల్ ‘ఎఫ్’లో ఒడిశా 57–28తో విదర్భపై జయభేరి మోగించింది. పూల్ ‘సి’లో మహారాష్ట్ర 39–35తో కేరళపై పోరాడి గెలిచింది.బరిలో ఉన్న 30 జట్లను ఎనిమిది పూల్స్గా విభజించి ముందుగా ప్రిలిమినరీ మ్యాచ్ల్ని నిర్వహిస్తున్నారు. ఒక్కో పూల్ నుంచి రెండేసి జట్ల చొప్పున నాకౌట్ దశకు అర్హత సాధిస్తాయి. -
‘టాప్స్’ జాబితా నుంచి వినేశ్, బజరంగ్ అవుట్
న్యూఢిల్లీ: మెగా ఈవెంట్స్లో పతక విజేతల్ని తయారు చేయడమే లక్ష్యంగా అమలు చేస్తున్న టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకం (టాప్స్) జాబితాను కేంద్ర క్రీడా శాఖ కుదించింది. గతంలో 179 మందికి ‘టాప్స్’ కింద ఆర్థిక అండదండలు అందించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా 94 మందికే చేయూత ఇవ్వనుంది. ఈ పథకం కింద లబ్ధి పొందిన క్రీడాకారుల ప్రదర్శనను సమీక్షించిన క్రీడాశాఖ దాదాపు సగం మందికి కోత పెట్టింది. ఈ 94 మంది జాబితాలో 42 మంది రెగ్యులర్ అథ్లెట్లు కాగా... 52 మంది పారా అథ్లెట్లున్నారు. పారిస్ పారాలింపిక్స్లో విశేష ప్రతిభ కనబరిచిన పారా అథ్లెట్లు 7 స్వర్ణాలు సహా 29 పతకాలు సాధించారు. దీంతో క్రీడాశాఖ దివ్యాంగ అథ్లెట్లకు ‘టాప్స్’లో పెద్దపీట వేసింది. గతంలో 78 మందితో ఉన్న రెగ్యులర్ అథ్లెట్లలో చాలా మందిని తప్పించింది.గోల్ఫ్, స్విమ్మింగ్, టెన్నిస్లలో ఏ ఒక్కరికి ‘టాప్స్’లో చోటు దక్కలేదు. మేటి రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, బజరంగ్ పూనియాలను ‘టాప్స్’ నుంచి తప్పించారు. రెజ్లింగ్ నుంచి వీడ్కోలు తీసుకున్న వినేశ్ రాజకీయాల్లోకి వచ్చి హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి గెలిచింది. డోప్ టెస్టులకు గైర్హాజరు అయ్యాడనే కారణంగా జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) బజరంగ్పై నాలుగేళ్లు నిషేధం విధించింది. క్రీడాకారుల ప్రదర్శన ఆధారంగా పారదర్శకంగా ఈ జాబితాను రూపొందించామని, కేవలం ప్రతిభే ప్రామాణికంగా తీసుకున్నామని దీనిపై టాప్స్ సీఈఓ ఎన్.ఎస్. జోహల్ వివరణ ఇచ్చారు.అథ్లెటిక్స్లో నిరాశజనక ప్రదర్శన వల్ల 30 మంది కాగా ఇప్పుడు ముగ్గురితో సరిపెట్టుకోవాల్సి వచి్చంది. చాంపియన్ జావెలిన్ త్రోయర్, స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా, స్టీపుల్చేజర్ అవినాశ్ సాబ్లే, లాంగ్ జంపర్ శ్రీశంకర్లకు మాత్రమే ‘టాప్స్’లో చోటు దక్కింది. తెలంగాణ రైజింగ్ స్టార్, ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్, టోక్యో ఒలింపిక్స్ కాంస్య విజేత లవ్లీనా బొర్గొహైన్లు ఇద్దరూ మహిళా బాక్సర్లకే ‘టాప్స్’ లబ్ధి చేకూరనుంది. గతంలో 8 మంది బాక్సర్లుండగా కేవలం ఇద్దరే ఇద్దరికి చోటు దక్కింది. షట్లర్లలో కిడాంబి శ్రీకాంత్కు, డబుల్స్ స్పెషలిస్ట్ అశ్విని పొన్నప్పలను పక్కన బెట్టిన క్రీడాశాఖ... సింధు, ప్రణయ్, లక్ష్యసేన్, డబుల్స్ అగ్రశ్రేణి జోడీ సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టిలను జాబితాలో కొనసాగించింది. -
డోపింగ్లో దొరికిన మారథాన్ విజేత
న్యూఢిల్లీ: రెండు నెలల క్రితం పుణేలో నిర్వహించిన హాఫ్ మారథాన్ పరుగులో విజేతగా నిలిచిన ప్రధాన్ విలాస్ కిరులేకర్ డోపింగ్లో దొరికిపోయాడు. దీంతో అతనిపై తాత్కాలిక నిషేధం విధించారు. డిసెంబర్లో నిర్వహించిన 21.09 కిలోమీటర్ల రేసును ప్రధాన్ విలాస్ అందరికంటే ముందుగా ఒక గంటా 4 నిమిషాల 22 సెకన్లలో పూర్తిచేసి విజేతగా నిలిచాడు. అయితే అతని నుంచి సేకరించిన రక్త, మూత్ర నమూనాల్ని ల్యాబ్లో పరీక్షించగా, నిషిద్ధ ఉ్రత్పేరకం మెల్డొనియమ్ తీసుకున్నట్లు తేలింది. దీంతో ప్రపంచ అథ్లెటిక్స్ (డబ్లూఏ)కు చెందిన స్వతంత్ర ఏజెన్సీ అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ (ఏఐయూ) ప్రధాన్ విలాస్పై చర్యలు చేపట్టింది. గతనెల భారత్కు చెందిన లాంగ్ డిస్టెన్స్ రన్నర్ మాధురి కాల్ డోపింగ్ పరీక్షల్లో పట్టుబడటంతో ఏఐయూ సస్పెన్షన్ వేటు వేసింది. 2016లో రష్యా టెన్నిస్ స్టార్ మరియా షరపొవా కూడా ఈ మెల్డొనియమ్ ఉత్ప్రేరకం తీసుకున్నట్లు తేలడంతో ఆమెపై కూడా సస్పెన్షన్ వేటు వేశారు. సాధారణంగా మెల్డొనియమ్ను డాక్టర్లు హృద్రోగులకు, నరాల జబ్బులున్న రోగులకు శక్తి కోసం సిఫారసు చేస్తారు. -
సెలక్షన్స్పై ‘వీడియో’ కన్ను
న్యూఢిల్లీ: క్రీడాకారులు, జట్ల సెలక్షన్ ట్రయల్స్పై పదేపదే వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు కేంద్ర క్రీడా శాఖ సిద్ధమైంది. దీనికి శాశ్వత పరిష్కారంగా ఇక మీదట జరిగే ఎంపిక ప్రక్రియనంతా వీడియో రూపంలో తీయనుంది. తద్వారా అర్హులైన ప్రతిభావంతులకే బెర్త్లు లభించేలా చూడనుంది. ప్రతి ఒక్కరి సెలక్షన్ ప్రదర్శన వీడియోలో నిక్షిప్తమై ఉంటుంది. కాబట్టి విమర్శలకు తావుండదు. ‘ఇకపై అన్ని సెలక్షన్ ట్రయల్స్పై వీడియో నిఘా పెడతాం.పారదర్శకత, న్యాయబద్ధమైన ఎంపికలకు ఇది ఎంతగానో దోహదం చేస్తుంది. దీనివల్ల క్రీడాకారులకు మేలు జరుగుతుంది. ప్రదర్శనే ఎంపికకు గీటురాయి అవుతుంది. మెరిట్ కనబరిచిన వారే భారత జట్లకు ఎంపికవుతారు. ఇందులో క్రీడా సమాఖ్యలు ఇష్టారీతిన వ్యహరించేందుకు వీలుండదు. క్రీడా శాఖ అధికారులు, భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) అధికారులు పర్యవేక్షకులుగా హాజరవుతారు. ఇకపై ప్రతీ క్రీడాంశంలో దీన్ని అమలు చేస్తాం’ అని క్రీడా శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. షూటింగ్, రెజ్లింగ్లలో జరిగే సెలక్షన్ ట్రయల్స్ ప్రతీసారి విమర్శలపాలవుతోంది. రెజ్లింగ్ సమాఖ్య అయితే పతకాల కంటే కూడా ఈ తరహా వివాదాలు, విమర్శలతోనే వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే! భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) వ్యవహారాల వల్ల అర్హత ఉండి, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనలేకపోతున్నారు. ఈ సీజన్లో తొలి రెండు ర్యాంకింగ్ సిరీస్ టోర్నమెంట్లకు భారత రెజ్లర్లు దూరమయ్యారు. దీనిపై క్రీడాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. అలాగే ఈ శాఖ గుర్తింపు ఉన్న జాతీయ సమాఖ్యలకు ఢిల్లీలోని స్టేడియాల్లో ఆఫీస్ వసతి కల్పించేందుకు చర్యలు చేపట్టారు. దీనివల్ల ఢిల్లీకి వచ్చిన లేదంటే ఢిల్లీ నుంచి అంతర్జాతీయ టోర్నీలకు బయలుదేరే ఆటగాళ్లకు ఆయా సమాఖ్యలు సమన్వయంతో సేవలందించేందుకు వీలవుతుంది. గతంలో ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో క్రీడా సమాఖ్యల కార్యాలయాలు ఉండేవి. కానీ 2010 కామన్వెల్త్ క్రీడల ఆతిథ్యం కోసం ఆ స్టేడియాన్ని నవీకరించడంతో సమాఖ్యల ఆఫీసుల్ని అక్కడి నుంచి తరలించారు. -
భారత్లో మరోసారి కామన్వెల్త్ క్రీడలు!
న్యూఢిల్లీ: భారత్లో రెండోసారి కామన్వెల్త్ క్రీడల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం ఆసక్తి చూపిస్తోంది. 2030లో జరిగే పోటీల కోసం బిడ్ వేయాలని యోచిస్తోందని క్రీడా శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. 2010లో న్యూఢిల్లీలో కామన్వెల్త్ క్రీడలు జరిగాయి. క్రీడలను నిర్వహించడంతో పాటు 2026 కామన్వెల్త్ క్రీడల నుంచి తొలగించిన క్రీడాంశాలను కూడా మళ్లీ చేర్చే ఆలోచనలో భారత్ ఉంది. 2030 క్రీడల నిర్వహణకు ‘ఆసక్తిని ప్రదర్శించే’ ప్రక్రియకు మార్చి 31 చివరి తేదీ కాగా... ఈ దిశగానే ప్రయత్నం మొదలైనట్లు అధికారి చెప్పారు. ‘కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ అధికారులతో చర్చలు జరిగాయి. 2030లో మేం నిర్వహించాలనుకుంటున్నట్లు కూడా చెప్పాం. 2026లో తొలగించిన అన్ని క్రీడాంశాలను 2030లో చేర్చే విధంగా చూడాలని కూడా చెప్పాం’ అని ఆయన పేర్కొన్నారు. 2026లో స్కాట్లాండ్లోని గ్లాస్గోలో ఈ క్రీడలు జరగనున్నాయి. అయితే బడ్జెట్ పరిమితులను దృష్టిలో ఉంచుకొని నిర్వాహక కమిటీ కేవలం 10 క్రీడాంశాలకే పోటీలను పరిమితం చేసింది. ఈ క్రమంలో హాకీ, బ్యాడ్మింటన్, రెజ్లింగ్, షూటింగ్, టేబుల్ టెన్నిస్, స్క్వాష్, ట్రయాథ్లాన్, క్రికెట్లను పోటీల నుంచి తొలగించారు. ఇవే క్రీడాంశాల్లో భారత్కు ఎక్కువ పతకాలు వచ్చే అవకాశం ఉండేది. కమిటీ నిర్ణయం కారణంగా భారత్కు పెద్ద సంఖ్యలో పతకాలు వచ్చే అవకాశం ఉన్న ఆటలన్నీ క్రీడల్లో లేకుండాపోయాయి. గతంలో ఇదే తరహాలో 2022 బర్మింగ్హామ్ క్రీడల నుంచి కూడా ఆర్చరీ, షూటింగ్లను తొలగించిన తర్వాత వాటిని మళ్లీ చేర్చాలంటూ భారత్ విజ్ఞప్తి చేసింది. దీనికి సానుకూల స్పందన వచ్చినా కోవిడ్ కారణంగా మారిన పరిస్థితుల నేపథ్యంలో అది సాధ్యం కాలేదు. అయితే వన్నె తగ్గిన కామన్వెల్త్ క్రీడలను నిర్వహించే విషయంలో ఆర్థికభారం కారణంగా పలు పెద్ద దేశాలు కూడా వెనక్కి తగ్గుతున్న నేపథ్యంలో భారత్ ముందుకు వెళ్లడం ఆశ్చర్యకర పరిణామం! 2026కు ముందుగా ఆ్రస్టేలియాలోని విక్టోరియా వేదిక కాగా... 2023 జూలైలో ఆ దేశం అనూహ్యంగా తప్పుకుంది. నిర్వాహక కమిటీ మలేసియా దేశానికి ఆఫర్ ఇచ్చినా అదీ అంగీకరించలేదు. చివరకు తక్కువ బడ్జెట్తో, అదీ గేమ్స్ ఫెడరేషన్ సంయుక్త ఆరి్థక సహకారంతో గ్లాస్గో ముందుకు వచి్చంది. వచ్చే ఏడాది జూలై 23 నుంచి ఆగస్టు 2 వరకు 23వ కామన్వెల్త్ క్రీడలు జరుగుతాయి. మరోవైపు 2036 ఒలింపిక్స్ నిర్వహణకు ఆసక్తి చూపిస్తూ భారత ప్రభుత్వం ఇప్పటికే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)కి లేఖ పంపించింది. వచ్చే మార్చి తర్వాత దీని పురోగతిపై స్పష్టత రావచ్చు. -
ఐర్లాండ్పై భారత్ విజయం
భువనేశ్వర్: అంతర్జాతీయ హాకీ సమాఖ్య ప్రొ లీగ్లో భారత పురుషుల జట్టుకు మరో విజయం లభించింది. శుక్రవారం జరిగిన మ్యాచ్లో హర్మన్ప్రీత్ సింగ్ నాయకత్వంలోని టీమిండియా 3–1 గోల్స్ తేడాతో ఐర్లాండ్ జట్టును ఓడించింది. భారత్ తరఫున మన్దీప్ సింగ్ (22వ నిమిషంలో), జర్మన్ప్రీత్ సింగ్ (45వ నిమిషంలో), సుఖ్జీత్ సింగ్ (58వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. ఐర్లాండ్ జట్టుకు జెరెమీ డంకన్ (8వ నిమిషంలో) ఒక గోల్ అందించాడు. మరోవైపు జర్మనీతో జరిగిన మ్యాచ్లో భారత మహిళల జట్టు 0–4 గోల్స్ తేడాతో పరాజయం పాలైంది. -
అంగరంగ వైభవంగా...
లండన్: ఫార్ములావన్ 75వ వార్షికోత్సవ సీజన్ ఆరంభ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. నలుపు రోడ్డుపై వాయువేగంతో కార్లు నడుపుతూ అభిమానులను అలరించే రేసర్లు... ఈ ఈవెంట్లో ‘రెడ్ కార్పెట్’పై అభిమానులకు చేతులుపుతూ దర్శనమిచ్చారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో 2025 సీజన్లో పోటీపడే 20 మంది డ్రైవర్లు తమ కార్లతో పాటు పాల్గొన్నారు. ఏడుసార్లు ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్... స్టేజి మీదకు వచ్చిన సమయంలో ప్రేక్షకుల హర్షధ్వానాలతో ఆడిటోరియం మార్మోగిపోయింది. సుదీర్ఘ ఎఫ్1 చరిత్రలో ఇలాంటి వేడుక జరగడం ఇదే తొలిసారి కాగా... ఇందులో భాగంగా బ్రిటన్ సింగర్ కేన్ బ్రౌన్ మ్యూజిక్ షో ఆహుతులను కట్టిపడేసింది. కనీవినీ ఎరగని రీతిలో కళ్లు మిరుమిట్లు గొలిపేలా సాగిన ఈ కార్యక్రమంలో... పలువురు ప్రముఖ కళాకారులు పాల్గొన్నారు. ఫార్ములావన్ను మరింత విస్తరించడంలో భాగంగానే హాలీవుడ్ సినిమా స్థాయిలో ఈ వేడుకు నిర్వహించారు. దీనిపై హామిల్టన్ స్పందిస్తూ... ‘చాలా ఉత్సాహంగా ఉంది. కొత్త సీజన్లో మరింత వేగంగా దూసుకెళ్లాలని చూస్తున్నా. అందుకు కావాల్సిన శక్తి ఉంది. కొత్త జట్టులో భాగం కావడం ఆనందంగా ఉంది. ఇదే ఉత్తేజంతో ముందుకు సాగుతా’ అని అన్నాడు. 24 రేసులతో కూడిన 2025 ఫార్ములావన్ సీజన్ మార్చి 16న మెల్బోర్న్లో జరిగే ఆ్రస్టేలియన్ గ్రాండ్ప్రితో మొదలవుతుంది. -
యూకీ జోడీ సంచలనం
దోహా: ఖతర్ ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోర్నీలో భారత డబుల్స్ స్టార్స్ యూకీ బాంబ్రీ, రోహన్ బోపన్నలకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్స్లో యూకీ బాంబ్రీ (భారత్)–ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా) జోడీ ఏకంగా ప్రపంచ నంబర్వన్, టాప్ సీడ్ జంటను బోల్తా కొట్టించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లగా... రోహన్ బోపన్న (భారత్)–నునో బోరెజెస్ (పోర్చుగల్) ద్వయం క్వార్టర్ ఫైనల్లో ఇంటిదారి పట్టింది. ప్రపంచ నంబర్వన్ జంట మార్సెలో అరెవాలో (ఎల్ సాల్వడార్)–మాట్ పావిక్ (క్రొయేషియా)లతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో యూకీ–డోడిగ్ 2–6, 6–3, 10–8తో విజయం సాధించింది. 74 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో యూకీ–డోడిగ్ ఆరు డబుల్ ఫాల్ట్లు చేసింది. తమ సర్విస్ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థుల సర్వీస్ను ఒకసారి బ్రేక్ చేసింది. అయితే ‘సూపర్ టైబ్రేక్’లో యూకీ–డోడిగ్ ద్వయం పైచేయి సాధించింది. జూలియన్ క్యాష్–లాయిడ్ గ్లాస్పూల్ (బ్రిటన్)లతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో బోపన్న–బోర్జెస్ 4–6, 7–6 (7/5), 7–10తో ‘సూపర్ టైబ్రేక్’లో ఓటమి పాలయ్యారు. -
భారత్ శుభారంభం
షార్జా: ‘పింక్ లేడీస్ కప్–2025’లో భారత మహిళల ఫుట్బాల్ జట్టు శుభారంభం చేసింది. గురువారం జరిగిన తమ తొలి పోరులో స్వీటీ దేవీ సారథ్యంలోని భారత జట్టు 2–0 గోల్స్ తేడాతో జోర్డాన్పై విజయం సాధించింది. భారత్ తరఫున ప్రియాంక దేవి (23వ నిమిషంలో), మనీషా (54వ నిమిషంలో) చెరో గోల్ చేశారు. మ్యాచ్ ఆరంభం నుంచే భారత మహిళల జట్టు దూకుడు కనబర్చింది. తొలి అర్ధభాగంలో వచ్చిన అవకాశాన్ని ప్రియాంక దేవి సద్వినియోగ పర్చుకుంటూ... జోర్డాన్ గోల్ కీపర్ను బోల్తా కొట్టించి భారత్ ఖాతా తెరిచింది. కాసేపటికే స్కోరు పెంచే అవకాశం వచ్చినా... దాన్ని మనీషా సరిగ్గా వినియోగించుకోలేక పోయింది. ద్వితీయార్థంలో ఎలాంటి పొరపాటుకు తావివ్వకుండా మనీషా గోల్ కొట్టి జట్టుకు విజయం ఖాయం చేసింది.క్రిస్పిన్ ఛెత్రి భారత మహిళల కోచ్గా ఎంపికైన అనంతరం మన జట్టుకు ఇదే తొలి విజయం కావడం విశేషం. జోర్డాన్ పదే పదే ప్రతి దాడులకు ప్రయత్నించినా... స్వీటీ దేవి, పుర్ణిమ కస్తూరితో కూడిన రక్షణ శ్రేణి వాటిని సమర్థవంతంగా అడ్డుకుంది. తెలంగాణ అమ్మాయి గుగులోతు సౌమ్య ఆకట్టుకుంది. ఈ మ్యాచ్ ద్వారా భారత యంగ్ప్లేయర్ లిషమ్ బబీనా దేవి అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. తదుపరి పోరులో ఆదివారం రష్యాతో భారత్ తలపడుతుంది. -
పంకజ్... అదే జోరు
దోహా: భారత క్యూస్పోర్ట్స్ దిగ్గజం cమరో అంతర్జాతీయ టైటిల్ సాధించాడు. గురు వారం ముగిసిన ఆసియా స్నూకర్ చాంపియన్షిప్ లో అతను విజేతగా నిలిచాడు. ఫైనల్లో పంకజ్ 4–1 (42–72, 93–17, 93–1, 89–21, 70–41) ఫ్రేమ్ల తేడాతో ఇరాన్కు చెందిన మాజీ ఆసియా, ప్రపంచ స్నూకర్ చాంపియన్ అమిర్ సర్ఖోష్ పై గెలుపొందాడు. అతని ఖాతాలో ఇది 14వ ఆసియా టైటిల్ కావడం విశేషం. ఇదివరకే అతను స్నూకర్లో నాలుగు, cతొమ్మిది టైటిల్స్ గెలిచాడు. వీటితో పాటు 2006, 2020లలో జరిగిన ఆసియా క్రీడల్లోనూ స్వర్ణ పతకాలు గెలిచాడు. తాజా ఆసియా టైటిల్తో ఓ క్యాలెండర్ ఇయర్లో జాతీయ, ఆసియా, ప్రపంచ స్నూకర్ చాంపియన్షిప్లు గెలిచిన ఆటగాడిగా ఘనత వహించనున్నాడు. బిలియర్డ్స్లో ఇదివరకే ఈ రికార్డు లిఖించిన పంకజ్ స్నూకర్లో లిఖించాల్సి ఉంది. ఇదే జరిగితే క్యూస్పోర్ట్స్ (బిలియర్డ్స్, స్నూకర్)లోనే ఈ ఘనత వహించిన ఆటగాడిగా చరిత్ర పుటల్లోకెక్కుతాడు. ‘ఆసియా పతకం నాకు ప్రత్యేక ఆనందాన్నిచ్చింది. ఈ టోర్నీ చాలా కఠినంగా సాగింది. చివరకు మరో బంగారు పతకాన్ని నా ఖాతాలో వేసుకున్నాను. ఇదే నిలకడైన ప్రదర్శనతో భారత్ గర్వించే విజయాలు మరెన్నో సాధించాలని ఆశిస్తున్నాను’ అని మ్యాచ్ విజయానంతరం పంకజ్ అద్వానీ అన్నాడు. -
సాత్విక్ సాయిరాజ్కు పితృవియోగం
సాక్షి, అమలాపురం: ఇది విధి రాసిన విషాదవార్త! తనయుడి అవార్డుని చూసి మురిసిపోదామనుకుంటే... తండ్రి భౌతికకాయాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యే పరిస్థితి! ‘ఖేల్రత్న’తో విజయోత్సవ వేడుకలు చేసుకోవాల్సిన ఇంట విషాదం అలుముకున్న దుస్థితి! ఆంధ్రప్రదేశ్ స్టార్ షట్లర్ సాత్విక్ సాయిరాజ్ తండ్రి రంకిరెడ్డి కాశీ విశ్వనాథం గురువారం ఉదయం గుండెపోటుతో హఠాత్తుగా కన్నుమూశారు. ఆయనకు భార్య రంగమణి, ఇద్దరు కుమారులు రాంచరణ్, సాత్విక్ ఉన్నారు. 65 ఏళ్ల కాశీ విశ్వనాథం గురువారం సాయంత్రం దేశ రాజధానిలో తనయుడు సా త్విక్కు ‘ఖేల్రత్న’ పురస్కార ప్రదానోత్సవంలో పాల్గొనాల్సి ఉంది. ఇందుకోసం సొంతూరు అమలాపురం నుంచి కారులో రాజమండ్రి విమానాశ్రయానికి బయలుదేరిన ఆయన పట్టణం దాటిన కొద్దిసేపటికే గుండెపోటుకు గురై మృతి చెందారు. ఊహించని విషాద వార్త అక్కడి కుటుంబసభ్యుల్ని, ఢిల్లీలో ఉన్న సా త్విక్ సాయిరాజ్ను కన్నీటి సంద్రంలో ముంచేసింది. అమెరికాలో ఉన్న సాత్విక్ సోదరుడు రాంచరణ్ స్వస్థలం చేరుకున్నాక శనివారం అంత్యక్రియలు నిర్వహిస్తారు. బ్యాడ్మింటన్ క్రీడపై ఆసక్తి కనబరిచిన సాత్విక్కు తొలి కోచ్గా ఓనమాలు నేరి్పన తండ్రి తదనంతరం అతని ప్రతిభను గుర్తించి అంతర్జాతీయ షట్లర్గా తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషించారు. డబుల్స్లో అసాధారణ ప్లేయర్గా ఎదిగిన సాత్విక్ ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య అంతర్జాతీయ టోర్నీల్లో, ఒలింపిక్స్, కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో పాల్గొన్నాడు. అనతికాలంలోనే ఎన్నో పతకాలు, ట్రోఫీలు నెగ్గిన సా త్విక్ ప్రతిభను గుర్తించిన భారత ప్రభుత్వం సా త్విక్తోపాటు అతని డబుల్స్ భాగస్వామి చిరాగ్ శెట్టిని 2023 సంవత్సరానికిగాను ‘ఖేల్రత్న’ పురస్కారానికి ఎంపిక చేసింది.2024 జనవరిలో ఢిల్లీలో జాతీయ క్రీడా అవార్డుల ప్రదానోత్సవం జరగ్గా... సా త్విక్–చిరాగ్ మలేసియా ఓపెన్ టోర్నీ లో ఆడుతుండటంతో హాజరు కాలేకపోయారు. ప్రస్తుతం పెట్రోలియం స్పోర్ట్స్ ఇంటర్ యూనిట్ టోర్నీ ఆడేందుకు సాత్విక్, చిరాగ్ ఢిల్లీలో ఉన్నారు. దాంతో కేంద్ర క్రీడా శాఖ ‘ఖేల్రత్న’ అందజేయాలని భావించి కార్యక్రమం ఏర్పాటు చేసింది. -
దీప్తి జివాంజికి స్వర్ణం
సాక్షి, హైదరాబాద్: జాతీయ పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో తెలంగాణకు స్వర్ణ పతకం లభించింది. చెన్నైలో జరుగుతున్న ఈ టోర్నీలో తెలంగాణ అమ్మాయి, అంతర్జాతీయ పారాథ్లెట్ జివాంజి దీప్తి 400 మీటర్ల విభాగంలో విజేతగా నిలిచింది. దీప్తి అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా 57.82 సెకన్లలో గమ్యానికి చేరి పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. హర్యానాకు చెందిన పూజా 1:08.21 సెకెన్లలో గమ్యాన్ని చేరుకుని రజతం సొంతం చేసుకోగా.. హర్యానాకే చెందిన భువి అగర్వాల్ కాంస్యం దక్కించుకుంది. ఇటీవల ‘అర్జున అవార్డు’ పొందిన దీప్తి గచ్చిబౌలి స్టేడియంలో భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) కోచ్ నాగపురి రమేశ్ వద్ద శిక్షణ తీసుకుంటోంది. మూడు పతకాలుతెలంగాణ రాష్ట్ర యూత్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం వహించిన కొర్ర అఖిల, నేనావత్ విజయలక్ష్మి... హైదరాబాద్ అథ్లెట్ ఇస్లావత్ నితిన్ నాయక్ మెరిశారు. ఉస్మానియా యూనివర్సిటీ మైదానంలో బుధవారం జరిగిన ఈ మీట్లో నితిన్ 400 మీటర్ల విభాగంలో స్వర్ణ పతకం సాధించాడు. అఖిల జావెలిన్ త్రోలో పసిడి పతకం, డిస్కస్ త్రోలో రజత పతకం... విజయలక్ష్మి 400 మీటర్ల విభాగంలో స్వర్ణం, జావెలిన్ త్రోలో రజత పతకం గెలిచారు. ఈ ముగ్గురు హయత్నగర్లోని అకాడమీ ఆఫ్ స్పోర్ట్స్లో కోచ్ నేనావత్ వినోద్ కుమార్ వద్ద శిక్షణ తీసుకుంటున్నారు.శ్రీనిధి డెక్కన్ ఎఫ్సీ జట్టుకు ఐదో విజయంజైపూర్: ఐ–లీగ్ జాతీయ ఫుట్బాల్ టోర్నమెంట్లో హైదరాబాద్కు చెందిన శ్రీనిధి డెక్కన్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) జట్టు ఐదో విజయం నమోదు చేసింది. బుధవారం జరిగిన మ్యాచ్లో శ్రీనిధి డెక్కన్ ఎఫ్సీ 2–1 గోల్స్ తేడాతో రాజస్తాన్ యునైటెడ్ ఎఫ్సీ జట్టును ఓడించింది. 10 మ్యాచ్ల తర్వాత రాజస్తాన్ జట్టుకిది తొలి ఓటమి కావడం గమనార్హం. శ్రీనిధి జట్టు తరఫున ఏంజెల్ ఒరెలియన్ (43వ నిమిషంలో), డేవిడ్ కాస్టనెడా మునోజ్ (73వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. రాజస్తాన్ యునైటెడ్ జట్టుకు మైకోల్ కబ్రెరా (75వ నిమిషంలో) ఏకైక గోల్ అందించాడు. ఈనెల 25న జరిగే తదుపరి మ్యాచ్లో డెంపో స్పోర్ట్స్ క్లబ్తో శ్రీనిధి జట్టు తలపడుతుంది. 12 జట్లు పోటీపడుతున్న ఐ–లీగ్లో 15 మ్యాచ్లు పూర్తి చేసుకున్న శ్రీనిధి జట్టు 19 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉంది. -
తీవ్ర విషాదం.. ప్రాక్టీస్లో భారీ బరువులెత్తబోయి 17 ఏళ్ల యస్తిక..
యువ పవర్ లిఫ్టర్(Powerlifter) మృతి చెందిన విషాద ఘటన బుధవారం చోటు చేసుకుంది. రాజస్తాన్కు చెందిన 17 ఏళ్ల యస్తిక ఆచార్య(Yashtika Acharya) పవర్లిఫ్టర్గా జాతీయ స్థాయిలో రాణిస్తోంది. గత ఏడాది సబ్ జూనియర్ విభాగంలో (ప్లస్ 84 కేజీలు) జాతీయ బెంచ్ ప్రెస్ చాంపియన్షిప్లో స్వర్ణం కూడా సాధించింది.270 కేజీల బరువును ఎత్తే క్రమంలోతన రెగ్యులర్ ప్రాక్టీస్లో భాగంగా జిమ్లో ఆమె కోచ్తో కలిసి సాధన చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 270 కేజీల బరువును ఎత్తే క్రమంలో పట్టు జారి ఆమె వెనక్కి పడిపోయింది. రాడ్ ఆమె మెడ వెనకభాగంలో పడటంతో మెడ విరిగిపోయి యస్తిక కుప్పకూలిపోయింది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినా లాభం లేకపోయింది. ఇంత భారీ బరువు ఎత్తుతున్నప్పుడు సాధారణంగా వెనక నిలబడి కోచ్ సహకరిస్తాడు. కానీ అతను కూడా నిలువరించలేకపోవడంతో యువ క్రీడాకారిణి జీవితం ముగిసింది. ఈ క్రమంలో కోచ్కు కూడా స్వల్ప గాయాలయ్యాయి.యస్తిక దుర్మరణంపైఈ విషాదం గురించి స్థానిక పోలీసులు మాట్లాడుతూ.. ఘటన జరిగిన వెంటనే యస్తిక ఆచార్యను ఆస్పత్రికి తీసుకువెళ్లగా.. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారని తెలిపారు. అయితే, ఈ యస్తిక దుర్మరణంపై ఆమె కుటుంబ సభ్యులు ఇంత వరకు ఫిర్యాదు మాత్రం చేయలేదని చెప్పారు. పోస్ట్మార్టం అనంతరం ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలిపారు.కాగా పవర్లిఫ్టింగ్లో స్క్వాట్, బెంచ్ ప్రెస్, డెడ్లిఫ్ట్ అనే మూడురకాల లిఫ్ట్స్ ఉంటాయి. కాగా ఈనెల 19 నుంచి 23 వరకు పురుషుల,మహిళల క్లాసిక్ పవర్లిఫ్టింగ్ చాంపియన్షిప్నకు పంజాబ్లో గల జలంధర్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఆతిథ్యం ఇస్తోంది. చదవండి: ధనవంతులకు మాత్రమే.. : పుల్లెల గోపీచంద్ ‘షాకింగ్’ కామెంట్స్ -
జగజ్జేత జర్మనీకి భారత్ షాక్
భువనేశ్వర్: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్లో భారత పురుషుల జట్టు సంచలనం సృష్టించింది. ప్రపంచ చాంపియన్ జర్మనీ జట్టుతో బుధవారం జరిగిన రెండో రౌండ్ రెండో మ్యాచ్లో టీమిండియా 1–0 గోల్ తేడాతో విజయం సాధించింది. ఆట నాలుగో నిమిషంలో గుర్జంత్ సింగ్ చేసిన గోల్తో భారత్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత చివరి వరకు ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని భారత్ విజయాన్ని ఖరారు చేసుకుంది.మంగళవారం జర్మనీతో జరిగిన రెండో రౌండ్ తొలి మ్యాచ్లో భారత్ 1–4 గోల్స్ తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. మరోవైపు భారత మహిళల జట్టుకు మరో ఓటమి ఎదురైంది. స్పెయిన్ జట్టుతో జరిగిన రెండో రౌండ్ రెండో లీగ్ మ్యాచ్లో భారత జట్టు 0–1తో ఓడిపోయింది. స్పెయిన్ తరఫున సెగూ మార్టా (49వ నిమిషంలో) ఏకైక గోల్ సాధించింది. -
జొకోవిచ్కు చుక్కెదురు
దోహా: కెరీర్లో 100వ టైటిల్ సాధించాలనే లక్ష్యంతో ఈ ఏడాది బరిలోకి దిగిన మూడో టోర్నమెంట్లోనూ సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్కు నిరాశ ఎదురైంది. ఖతర్ ఓపెన్ ఏటీపీ–500 టోర్నీలో మూడో సీడ్గా పోటీపడ్డ జొకోవిచ్ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. ప్రపంచ మాజీ ఆరో ర్యాంకర్, 2021 వింబుల్డన్ టోర్నీ రన్నరప్ మాటియో బెరెటిని (ఇటలీ)తో జరిగిన మ్యాచ్లో 37 ఏళ్ల జొకోవిచ్ 6–7 (4/7), 2–6తో ఓడిపోయాడు.గతంలో జొకోవిచ్తో ఆడిన నాలుగుసార్లూ ఓడిపోయిన బెరెటిని ఐదో ప్రయత్నంలో తొలిసారి గెలుపొందడం విశేషం. 93 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో జొకోవిచ్ 9 ఏస్లు... బెరెటిని 13 ఏస్లు సంధించారు. బెరెటిని సర్వీస్ను మూడుసార్లు బ్రేక్ చేసేందుకు వచి్చన అవకాశాలను జోకోవిచ్ చేజార్చుకోగా... బెరెటిని తన ప్రత్యర్థి సర్వీస్ను రెండుసార్లు బ్రేక్ చేశాడు. -
బోపన్న జోడీ సంచలనం
దోహా: ఖతర్ ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న (భారత్)–నునో బోర్జెస్ (పోర్చుగల్) జోడీ సంచలన విజయంతో శుభారంభం చేసింది. బుధవారం జరిగిన తొలి రౌండ్లో బోపన్న–బోర్జెస్ ద్వయం 7–6 (7/2), 7–6 (7/4)తో రెండో సీడ్ సిమోన్ బొలెలీ–ఆండ్రియా వావాసోరి (ఇటలీ) జంటను బోల్తా కొట్టించింది. 89 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో బోపన్న ద్వయం ఏడు ఏస్లు సంధించింది. మ్యాచ్ మొత్తంలో రెండు జంటలు తమ సర్వీస్లను నిలబెట్టుకోవడంతో టైబ్రేక్లు అనివార్యమయ్యాయి. టైబ్రేక్లో బోపన్న–బోర్జెస్ పైచేయి సాధించి విజయాన్ని అందుకోవడంతోపాటు క్వార్టర్ ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకున్నారు. -
ధనవంతులకు మాత్రమే.. : పుల్లెల గోపీచంద్ ‘షాకింగ్’ కామెంట్స్
భారత బ్యాడ్మింటన్ దిగ్గజం, ఆల్ ఇంగ్లండ్ మాజీ చాంపియన్ పుల్లెల గోపీచంద్(Pullela Gopichand) సంచలన వ్యాఖ్యలు చేశాడు. ధనవంతులు మాత్రమే తమ పిల్లలను క్రీడలను కెరీర్గా ఎంచుకోవాలని సూచించాలన్నాడు. లేదంటే భవిష్యత్తులో చాలా కష్టాలు పడాల్సి వస్తుందని హెచ్చరించాడు. క్రీడాకారులకు తగినంత గుర్తింపు, దక్కాల్సిన గౌరవం దక్కడం లేదన్న ఆవేదనతో తాను ఇలా మాట్లాడుతున్నట్లు తెలిపాడు.కాగా భారత్లో బ్యాడ్మింటన్(Badminton) సూపర్ పవర్గా మారడంలో కీలక పాత్ర పోషించిన పుల్లెల గోపిచంద్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. క్రీడలను ప్రొఫెషన్గా ఎంచుకునే యువత సంఖ్య పెరుగుతుండటం సంతోషాన్ని ఇస్తుందన్నాడు. అయితే, అదే సమయంలో క్రీడాకారులలో కేవలం ఒక శాతం కంటే తక్కువ మంది కెరీర్ మాత్రమే సాఫీగా సాగిపోవడం కాస్త ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్నాడు.ధనవంతులకు మాత్రమే..‘‘ధనికులై ఉండి లేదంటే.. వ్యాపారంలో బాగా లాభాలు ఆర్జిస్తున్న కుటుంబాల నుంచి వచ్చిన వారు మాత్రమే స్పోర్ట్స్ను కెరీర్గా ఎంచుకోవాలన్నది నా అభిప్రాయం. నేను మాత్రం సాధారణ కుటుంబాలకు చెందిన తల్లిదండ్రులకు మాత్రం వారి పిల్లలను క్రీడల్లోకి పంపవద్దనే సలహా ఇస్తాను.క్రికెట్లో రాణించిన వాళ్లు అన్నిరకాలుగా కొంతమేర సక్సెస్ అవుతారు. కానీ ఇతర క్రీడల్లో రాణించే వాళ్ల పరిస్థితి ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం కదా. వారి త్యాగాలు, సేవలకు తగినంత మూల్యం అందుకోగలుగుతున్నారా?సర్, మేడమ్ అని సంబోధిస్తూ ఒలింపిక్ మెడల్స్ సాధించిన వాళ్లలో చాలా మంది రైల్వేస్, ఆర్బీఐ , ఇన్కమ్ టాక్స్, పోలీస్ ఉద్యోగాలు.. లేదంటే అంతకంటే తక్కువ కేడర్ కలిగిన జాబ్స్ చేస్తున్నారు. అయితే, ఓ సివిల్ సర్వెంట్ మాత్రం అరవై ఏళ్ల వరకు అన్ని రకాల ప్రయోజనాలు పొందుతారు. కానీ స్పోర్ట్స్ కోటాలో వచ్చిన వాళ్లు మాత్రం వారిని సర్, మేడమ్ అని సంబోధిస్తూ జీవితం గడపాలి.వారి దయాదాక్షిణ్యాల మీదే అంతా ఆధారపడి ఉంటుంది. కొంతమంది మాత్రమే క్రీడాకారులకు గౌరవం ఇస్తారు. అయితే, ఆటగాళ్ల పట్ల ప్రతికూల భావనలు ఉన్నవారు మాత్రం సులువుగా ఉద్యోగానికి వచ్చేశారని చులకనగా చూసే అవకాశం ఉంది. గత ఇరవై ఏళ్లలో దేశానికి ప్రాతినిథ్యం వహించిన ఆటగాళ్ల పరిస్థితి ఇప్పుడు ఇలా ఉందో చూశారా?ఈరోజు వారి సంపాదన ఎంత?వివిధ క్రీడల్లో వారు పతకాలు సాధించారు. కానీ ఈరోజు వారి సంపాదన ఎంత? వారి భవిష్యత్తు ఏమిటి? దేశానికి పతకాలు సాధించిపెడుతున్న వారికి అంతే స్థాయిలో రివార్డులు దక్కుతున్నాయా? మరి అలాంటప్పుడు పిల్లలను స్పోర్ట్స్ను కెరీర్గా ఎంచుకోవాలని ఎలా చెప్పగలం?ఒకవేళ మీరు స్పోర్ట్స్పర్సన్ కావాలని కచ్చితంగా నిర్ణయించుకుంటే... అప్పుడు ఇంగ్లిష్ భాషలో అనర్గళంగా మాట్లాడగల నైపుణ్యం కూడా సంపాదించండి. అదే విధంగా రిటైర్ అయిన తర్వాత ఏం చేయాలో కూడా ముందుగానే డిసైడ్ చేసుకోండి. ఎల్లప్పుడూ సానుకూల దృక్పథంతో ఉండటం మాత్రం మర్చిపోకూడదు’’ అని ఆటలతో పాటు చదువు, కమ్యూనికేషన్ స్కిల్స్ పట్ల శ్రద్ధ చూపాలని వర్దమాన క్రీడాకారులకు గోపీచంద్ దిశానిర్దేశం చేశాడు. కాగా గోపీచంద్ అకాడమీ నుంచి సైనా నెహ్వాల్, పీవీ సింధు వంటి ఒలింపిక్ మెడలిస్టులు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన విషయం తెలిసిందే. ఇక గోపీచంద్ కుమార్తె గాయత్రి కూడా డబుల్స్ విభాగంలో ప్రతిభను నిరూపించుకుంటోంది.చదవండి: శెభాష్ అన్నా!.. జింబాబ్వే ఓపెనర్పై ఇంగ్లండ్ ఆల్రౌండర్ పోస్ట్ -
నేను రాజీనామా చేయలేదు
న్యూఢిల్లీ: భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అథ్లెట్స్ కమిషన్ చైర్పర్సన్, దిగ్గజ మహిళా బాక్సర్ మేరీకోమ్ తన పదవికి రాజీనామా చేయలేదని స్పష్టం చేసింది. పదవీకాలం ముగిసేవరకు బాధ్యతలు కొనసాగిస్తానని చెప్పింది. ఐదుసార్లు ప్రపంచ చాంపియన్గా నిలిచిన ఆమె 2012 లండన్ ఒలింపిక్స్లో కాంస్య పతకం కూడా గెలుచుకుంది. 42 ఏళ్ల ఈ మణిపురి స్టార్ బాక్సర్ ఇటీవల డెహ్రాడూన్లో జరిగిన జాతీయ క్రీడల ముగింపు కార్యక్రమంలో పాల్గొంది. ఆ సమయంలో ఆమె అథ్లెట్స్ కమిషన్ పదవిపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు నెట్టింట ప్రచారం జరిగింది. కానీ మేరీ మాత్రం తన వాట్సాప్ గ్రూప్ సంభాషణను తప్పుగా అన్వయిస్తూ మీడియాకు లీక్ చేశారని, రాజీనామా చేసినట్లు కూడా ప్రచారం చేశారని పేర్కొంది. ‘నేను అథ్లెట్స్ కమిషన్కు రాజీనామా చేయనేలేదు. 2026లో పూర్తయ్యే పదవీకాలం వరకు చైర్పర్సన్గా కొనసాగుతాను. ఆ రోజు నేను కమిషన్ సభ్యులతో అన్నది వేరు... నెట్టింట ప్రచారమైంది వేరు. అథ్లెట్స్ కమిషన్ సభ్యులు తమ పద్ధతి మార్చుకోవాలని సూచించాను. తనతో ప్రవర్తించే తీరు ఇలాగే కొనసాగితే రాజీనామాకు సైతం వెనుకాడనని చెప్పాను. కానీ రాజీనామా చేశానని చెప్పనే లేదు. నేను రాజీనామా చేశానంటున్నారు కదా! మరి రాజీనామా లేఖ ఏది? ఎవరైనా చూశారా? అని ప్రశ్నించింది. ఐఓఏ తన కుటుంబమని... దీంతో ఎప్పుడు విబేధించనని... ఇంతటితో వాట్సాప్ సంభాషణ వివాదానికి ముగింపు పలుకుతున్నానని చెప్పారు. 2022లో ఐఓఏ అథ్లెట్స్ కమిషన్కు మేరీకోమ్ చైర్పర్సన్గా ఎన్నికైంది. టేబుల్ టెన్నిస్ స్టార్ అచంట శరత్ కమల్ వైస్ చైర్మన్గా ఉన్నారు. ఇంకా ఈ కమిషన్లో రెండు ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు, మాజీ షాట్పుటర్ ఓం ప్రకాశ్ కర్హాన, ఒలింపియన్ శివ కేశవన్, లండన్ ఒలింపిక్స్ కాంస్య విజేత, షూటర్ గగన్ నారంగ్ (షూటర్), రోయర్ బజరంగ్ లాల్, ఫెన్సింగ్ ప్లేయర్ భవానీ దేవి, భారత మహిళల హాకీ మాజీ కెపె్టన్ రాణి రాంపాల్, టోక్యో ఒలింపిక్స్ రజత విజేత మీరాబాయి చాను సభ్యులుగా ఉన్నారు. -
‘నమ్మకం కోల్పోయాం’
దోహా: ప్రపంచ టెన్నిస్ నంబర్వన్ యానిక్ సినెర్ డోపింగ్ ఉదంతం... ఇటీవలే అతనికి విధించిన శిక్షపై సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశాడు. అంతర్జాతీయ టెన్నిస్ ఇంటిగ్రిటీ ఏజెన్సీ (ఐటీఐఏ), ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా)లు రెండూ పక్షపాత ధోరణితో వ్యవహరించాయని 24 గ్రాండ్స్లామ్ టైటిళ్ల చాంపియన్ బాహాటంగా తన అసంతృప్తిని వెలిబుచ్చాడు. ‘తాజా ఘటనతో టెన్నిస్ ప్లేయర్లంతా నమ్మకం కోల్పోయారు. ఎందుకంటే ఇటు ఐటీఐఏ కానీ, అటు ‘వాడా’ కానీ సహేతుకంగా వ్యవహరించలేదు. నిస్పక్షపాత వైఖరి కనబరచలేదు. ఈ రెండు సంస్థల తీరు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కానేకాదు. కచి్చతంగా ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నా... టెన్నిస్ క్రీడ ఇమేజ్ను దిగజార్చేలా వ్యవహరించాయి. సుదీర్ఘకాలంగా నానుతున్న సినెర్ డోపింగ్ ఉదంతానికి కంటితుడుపు శిక్షతో పలికిన ముగింపు అసమంజసంగా ఉంది. ఎందుకంటే నేను ఈ విషయమై చాలా మంది ప్లేయర్లతో మాట్లాడాను. వారి అభిప్రాయలను నాతో పంచుకున్నారు. వాళ్లందరు కూడా రెండుసార్లు పట్టుబడిన సినెర్కు విధించిన మూడు నెలల శిక్షపై అసంతృప్తిగా ఉన్నారు’ అని జొకోవిచ్ అన్నాడు. ‘సినెర్–ఐటీఐఏ–వాడా’ల మధ్య కుదిరిన ఒప్పందం జరిగిన తప్పిదానికి తగిన శిక్షను ఖరారు చేయలేకపోయిందని పెదవి విరిచాడు. సినెర్లాగే రెండు నమూనాల్లో పాజిటివ్గా తేలిన స్పానిష్ మహిళా ఫిగర్ స్కేటర్ లౌరా బార్కెలోపై ‘వాడా’ ఏకంగా ఆరేళ్ల నిషేధం తాజాగా తెరపైకి వచ్చింది. క్రీడాలోకంలో చర్చనీయాంశమైంది. ‘వాడా’ వివరణ ఇది... మాడ్రిడ్: డోపింగ్లో దొరికిన టెన్నిస్ స్టార్ సినెర్కు, స్పెయిన్ స్కేటర్ లౌరా బార్కెరోలకు వేర్వేరు శిక్షలు విధించడంపై ‘వాడా’ వివరణ ఇచ్చింది. ‘ఇద్దరి నమూనాల్లో పాజిటివ్గా తేలినప్పటికీ లౌరా తన శరీరంలోకి నిషిద్ధ ఉత్రేరకాలు ఎలా ప్రవేశించాయో సరైన కారణాన్ని చెప్పలేకపోయింది. ఈ కారణాన్ని బలపరిచే రుజువు (సాక్ష్యం)ను చూపించలేదు. కానీ సినెర్ కావాలని తీసుకోలేదని, బహుశా తాను తీసుకున్న మెడిసిన్ లేదంటే మసాజ్కు వాడిన తైలం రూపంలో తన శరీరంలోకి ప్రవేశించి ఉండొచ్చని తను వాడిన మెడిసిన్లతో సహా సంజాయిషీ ఇచ్చాడు’ అని ‘వాడా’ తెలిపింది. -
భారత హాకీ జట్లకు నిరాశ
భువనేశ్వర్: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్ రెండో రౌండ్ మ్యాచ్ల్లో భారత పురుషుల, మహిళల జట్లకు నిరాశ ఎదురైంది. మంగళవారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్ల్లో భారత పురుషుల జట్టు 1–4 గోల్స్ తేడాతో ప్రపంచ మాజీ చాంపియన్ జర్మనీ జట్టు చేతిలో... భారత మహిళల జట్టు 3–4 గోల్స్ తేడాతో స్పెయిన్ జట్టు చేతిలో ఓడిపోయాయి. జర్మనీతో జరిగిన మ్యాచ్లో భారత్ తరఫున గుర్జంత్ సింగ్ (13వ నిమిషంలో) ఏకైక గోల్ చేశాడు. జర్మనీ తరఫున ఫ్లోరియన్ స్పెర్లింగ్ (7వ నిమిషంలో), థీస్ ప్రింజ్ (14వ నిమిషంలో), మైకేల్ స్ట్రుతోఫ్ (48వ నిమిషంలో), రాఫెల్ హార్ట్కోప్ (55వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. స్పెయిన్తో జరిగిన మ్యాచ్లో భారత మహిళల జట్టు తరఫున బల్జీత్ కౌర్ (19వ నిమిషంలో), సాక్షి రాణా (38వ నిమిషంలో), రుతుజా (45వ నిమిషంలో) ఒక్కో గోల్ నమోదు చేశారు. స్పెయిన్ జట్టుకు సోఫియా (21వ నిమిషంలో), లూసియా (52వ నిమిషంలో) ఒక్కో గోల్ చేయగా... ఎస్తెల్ (25వ, 49వ నిమిషాల్లో) రెండు గోల్స్ అందించింది. -
ఒలింపిక్స్కు ముందు ‘కామన్వెల్త్’ నిర్వహించండి.. భారత్కు సీజీఎఫ్ చీఫ్ సూచన
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం ఇటీవల తరచూ ఒలింపిక్స్ ఆతిథ్యం కోసం తహతహలాడుతోంది. 2036 ఒలింపిక్స్ నిర్వహణకు ఆసక్తి కనబరుస్తోంది. అయితే భారత్ లక్ష్యం విశ్వక్రీడలైతే ముందుగా కామన్వెల్త్ క్రీడలు నిర్వహిస్తే ఇది మెగా ఈవెంట్కు ముందు మార్గదర్శకంగా ఉపయోగపడుతుందని కామన్వెల్త్ క్రీడల సమాఖ్య (సీజీఎఫ్) సీఈఓ కేటీ సాడ్లియెర్ సూచించారు. ప్రముఖ జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన ‘గ్లోబల్ బిజినెస్ సమ్మిట్’లో పాల్గొన్న ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘ఏ దేశానికైనా ఒలింపిక్స్ ఆతిథ్యమనేది గొప్ప కీర్తిని తెస్తుంది. అయితే అలాంటి ప్రతిష్టాత్మక క్రీడలకు ముందు కామన్వెల్త్ క్రీడలు (2030) నిర్వహిస్తే మేటి అంతర్జాతీయ ఈవెంట్కు సరైన సన్నాహకంగా, చక్కని ముందడుగుగా ఉపయోగపడుతుంది’ అని అన్నారు. భవిష్యత్తులో ఒలింపిక్స్ పతకాల పట్టికలో భారత్ టాప్–10లో నిలుస్తుందని ఆమె చెప్పారు. ‘భారత్ దశ, దిశ ఇప్పుడు మారుతోంది. సరైన నాయకత్వం, మౌలిక వసతుల కల్పన, ప్రామాణిక శిక్షణతో క్రీడల భవిష్యత్ మారబోతోంది. అంతర్జాతీయ క్రీడా వేదికలపై ప్రదర్శన, పతకాలనేవి ఆ దేశ ప్రతిష్టను కచ్చితంగా పెంచుతాయి. తప్పకుండా భారత్ క్రీడాశక్తిగా ఎదుగుతుంది’ అని కేటీ సాడ్లియెర్ తెలిపారు. సరిగ్గా పదిహేనేళ్ల క్రితం భారత్ ఒకే ఒక్కసారి 2010లో కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యమిచ్చింది. -
20 ఏళ్ల తర్వాత ఆల్ స్టార్ ఎన్బీఏ మ్యాచ్కు దూరమైన లెబ్రాన్ జేమ్స్
శాన్ఫ్రాన్సిస్కో: విఖ్యాత నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ) లీగ్ ఆల్ స్టార్ మ్యాచ్కు అమెరికా దిగ్గజం లెబ్రాన్ జేమ్స్ తొలిసారి దూరమయ్యాడు. 20 ఏళ్ల తర్వాత లెబ్రాన్ జేమ్స్ లేకుండా ఆల్ స్టార్ మ్యాచ్ జరగడం గమనార్హం. 2005 నుంచి ప్రతి సీజన్లో ఆల్ స్టార్ మ్యాచ్లలో ఆడిన 40 ఏళ్ల లెబ్రాన్ ఈసారి చీలమండ గాయంతో ఆడలేకపోయాడు. రెగ్యులర్ సీజన్లో లాస్ఏంజెలిస్ లేకర్స్ జట్టుకు ఆడే లెబ్రాన్ ఆల్ స్టార్ మ్యాచ్లలో ఈసారి షకిల్లా ఓనీల్ జట్టుకు జట్టుకు ప్రాతినిధ్యం వహించాల్సింది. 2005లో తొలిసారి ఆల్ స్టార్ మ్యాచ్లో ఆడిన లెబ్రాన్ వరుసగా 20 ఏళ్లపాటు ఈ మేటి మ్యాచ్లలో భాగస్వామిగా ఉన్నాడు. 6 అడుగుల 9 అంగుళాల ఎత్తు, 113 కేజీల బరువున్న లెబ్రాన్ ఇప్పటి వరకు ఎన్బీఏ లీగ్లో 1,540 మ్యాచ్లు ఆడి అత్యధికంగా 41,641 పాయింట్లు స్కోరు చేశాడు. -
భారత ఫుట్బాల్ జట్టులో తెలంగాణ ప్లేయర్
న్యూఢిల్లీ: నాలుగు దేశాలు పాల్గొనే పింక్ లేడీస్ కప్ అంతర్జాతీయ మహిళల ఫుట్బాల్ టోర్నమెంట్ కోసం భారత జట్టును ప్రకటించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని షార్జాలో ఈనెల 20 నుంచి 26వ తేదీ వరకు ఈ టోర్నీ జరుగుతుంది. 23 మంది సభ్యులతో కూడిన భారత జట్టులో తెలంగాణ అమ్మాయి, నిజామాబాద్ జిల్లాకు చెందిన గుగులోత్ సౌమ్య చోటు సంపాదించింది. ఈనెల 7 నుంచి అనంతపురంలో శిక్షణ శిబిరంలో పాల్గొంటున్న భారత జట్టు నేడు యూఏఈకి బయలుదేరి వెళుతుంది. భారత జట్టు తమ తొలి మ్యాచ్ను ఈనెల 20న జోర్డాన్తో... రెండో మ్యాచ్ను 23న రష్యాతో... మూడో మ్యాచ్ 26న దక్షిణ కొరియా జట్టుతో ఆడుతుంది. ఈ ఏడాది మే–జూన్లలో జరిగే ఆసియా కప్–2027 క్వాలిఫయర్స్ టోర్నీకి సన్నాహాల్లో భాగంగా పింక్ లేడీస్ కప్లో భారత జట్టు బరిలోకి దిగుతోంది.‘పింక్ లేడీస్ కప్ టోర్నీ ద్వారా భారత క్రీడాకారిణులకు తమ సామర్థ్యమేంటో తెలుస్తుంది. రష్యాతో పోలిస్తే దక్షిణ కొరియా జట్టు పూర్తి భిన్నంగా ఉంటుంది. రెండు జట్ల వీడియోలు పరిశీలించాను. రష్యా శైలితో పోలిస్తే కొరియా ఆటలో చాలా వేగం ఉంది. ఫలితంగా భారత జట్టు రెండు రకాలుగా వ్యూహాలు రచించి ఆడాల్సి ఉంటుంది’ అని భారత జట్టు హెడ్ కోచ్ క్రిస్పిన్ ఛెత్రి తెలిపాడు. భారత మహిళల ఫుట్బాల్ జట్టు: ఎలాంగ్బమ్ పంథోయ్ చాను, పాయల్ బసుదె, శ్రేయా హుడా (గోల్కీపర్లు), అరుణ బాగ్, కిరన్ పిస్దా, మార్టినా థోక్చోమ్, నిర్మలా దేవి ఫాన్జుబమ్, పూరి్ణమ కుమారి, సంజు, సిల్కీ దేవి హెమమ్, స్వీటీ దేవి ఎన్గాంగ్బమ్ (డిఫెండర్లు), బబీనా దేవి లిషామ్, గ్రేస్ డాంగ్మె, మౌసుమి ముర్ము, ప్రియదర్శిని సెల్లాదురై, ప్రియాంక దేవి నోరెమ్, రత్నబాల దేవి నోంగ్మైథెమ్ (మిడ్ ఫీల్డర్లు), కరిష్మా పురుషోత్తమ్, లిండా కోమ్ సెర్టో, మనీషా, రేణు, సంధ్య రంగనాథన్, సౌమ్య గుగులోత్ (ఫార్వర్డ్స్). -
రామ్కుమార్ సంచలనం
పుణే: మహా ఓపెన్ ఏటీపీ చాలెంజర్–100 టెన్నిస్ టోర్నమెంట్లో భారత అగ్రశ్రేణి ఆటగాడు రామ్కుమార్ రామనాథన్(Ramkumar Ramanathan) మెయిన్ ‘డ్రా’కు మరో విజయం దూరంలో నిలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో రామ్కుమార్ సంచలనం సృష్టించాడు. టాప్ సీడ్, ప్రపంచ 267వ ర్యాంకర్ ఇలియాస్ ఇమర్ (స్వీడన్)తో జరిగిన మ్యాచ్లో ప్రపంచ 403వ ర్యాంకర్ రామ్కుమార్ 5–7, 6–1, 6–4తో గెలుపొందాడు.ఒక గంట 52 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో రామ్కుమార్ తొమ్మిది ఏస్లు సంధించి, ఐదు డబుల్ ఫాల్ట్లు చేశాడు. తన సర్వీస్ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను మూడుసార్లు బ్రేక్ చేశాడు. నేడు జరిగే క్వాలిఫయింగ్ రెండో రౌండ్ మ్యాచ్లో కిమర్ కాప్జాన్స్ (బెల్జియం)తో రామ్కుమార్ ఆడతాడు. ఈ మ్యాచ్లో నెగ్గిన ప్లేయర్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధిస్తాడు. చైనా జట్టుకు ఇండోనేసియా షాక్కింగ్డావో (చైనా): ఆసియా మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో ఇండోనేసియా జట్టు తొలిసారి విజేతగా అవతరించింది. డిఫెండింగ్ చాంపియన్ చైనా జట్టుతో జరిగిన ఫైనల్లో ఇండోనేసియా 3–1తో నెగ్గింది. తొలి మ్యాచ్గా జరిగిన మిక్స్డ్ డబుల్స్లో రివాల్డీ–ఫాదియా జంట 21–11, 21–13తో జువాన్–మెంగ్ యింగ్ జోడీని ఓడించడంతో ఇండోనేసియా 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది.ఇక రెండో మ్యాచ్గా జరిగిన పురుషుల సింగిల్స్లో ఫర్హాన్ 21–15, 21–13తో హు జె ఆన్ను ఓడించడంతో ఇండోనేసియా ఆధిక్యం 2–0కు పెరిగింది. మూడో మ్యాచ్గా జరిగిన మహిళల సింగిల్స్లో జు వెన్ జింగ్ 21–12, 21–13తో కుసుమ వర్ధినిపై గెలవడంతో చైనాకు తొలి విజయం దక్కింది. నాలుగో మ్యాచ్గా జరిగిన పురుషుల డబుల్స్లో షోహిబుల్ ఫిక్రి–డానియల్ మారి్టన్ జోడీ 21–15, 21–9తో చెన్ జుజున్–హువాంగ్ ది (చైనా) ద్వయంపై గెలిచి ఇండోనేసియాకు టైటిల్ను ఖరారు చేసింది. -
అనిసిమోవా అదరహో
దోహా: ఎనిమిదేళ్ల క్రితం మహిళల టెన్నిస్లో భవిష్యత్ తారగా గుర్తింపు తెచ్చుకున్న అమెరికా ప్లేయర్ అమండా అనిసిమోవా ఎట్టకేలకు తన కెరీర్లోనే గొప్ప విజయాన్ని అందుకుంది. గ్రాండ్స్లామ్ తర్వాత రెండో అత్యున్నత శ్రేణి అయిన మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) 1000 సిరీస్ టోర్నీలో ఆమె మొదటిసారి విజేతగా అవతరించింది. ఖతర్ ఓపెన్లో 23 ఏళ్ల అనిసిమోవా చాంపియన్గా నిలిచింది. దోహాలో జరిగిన సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 41వ ర్యాంకర్ అనిసిమోవా 6–4, 6–3తో 2017 ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ ఎలెనా ఒస్టాపెంకో (లాత్వియా)పై గెలిచింది. అనిసిమోవాకు 5,97,000 డాలర్ల (రూ. 5 కోట్ల 17 లక్షలు) ప్రైజ్మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. 2002లో మోనికా సెలెస్ తర్వాత ఖతర్ ఓపెన్లో విజేతగా నిలిచిన రెండో అమెరికా ప్లేయర్గా అనిసిమోవా గుర్తింపు పొందింది. ఈ గెలుపుతో అనిసిమోవా నేడు విడుదలయ్యే డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్లో కెరీర్ బెస్ట్ 18వ ర్యాంక్ను అందుకుంటుంది. ఓవరాల్గా అనిసిమోవా కెరీర్లో ఇది మూడో సింగిల్స్ టైటిల్. 2019లో బొగోటా ఓపెన్లో, 2022లో మెల్బోర్న్ ఓపెన్లో ఆమె టైటిల్స్ సాధించింది. -
భారత హాకీ జట్లకు మిశ్రమ ఫలితాలు
భువనేశ్వర్: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ హాకీ లీగ్లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్ల్లో భారత జట్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ముందుగా భారత మహిళల జట్టు ‘షూటౌట్’లో 1–2తో ఇంగ్లండ్ జట్టు చేతిలో ఓడిపోగా... అనంతరం భారత పురుషుల జట్టు 2–0 గోల్స్ తేడాతో స్పెయిన్ జట్టుపై విజయం సాధించింది. భారత జట్టు తరఫున మన్దీప్ సింగ్ (32వ నిమిషంలో), దిల్ప్రీత్ సింగ్ (39వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. ఇంగ్లండ్–భారత్ మహిళల జట్ల మధ్య మ్యాచ్లో నిర్ణీత సమయం ముగిశాక రెండు జట్లు 2–2తో సమంగా నిలిచాయి. భారత్ తరఫున నవ్నీత్ కౌర్ (53వ నిమిషంలో), రుతుజా (57వ నిమిషంలో)... ఇంగ్లండ్ తరఫున పెయిజ్ గిలోట్ (40వ నిమిషంలో), టెసా హొవార్డ్ (56వ నిమిషంలో) ఒక్కో గోల్ నమోదు చేశారు. విజేతను నిర్ణయించేందుకు ‘షూటౌట్’ నిర్వహించారు. తొలి ఐదు షాట్లు ముగిశాక రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. ఆ తర్వాత ఆరో షాట్లో రెండు జట్ల క్రీడాకారిణులు విఫలమయ్యారు. ఏడో షాట్లో భారత ప్లేయర్ లాల్రెమ్సియామి గురి తప్పగా... ఇంగ్లండ్ ప్లేయర్ సోఫీ హామిల్టన్ బంతిని లక్ష్యానికి చేర్చడంతో భారత్కు ఓటమి ఖరారైంది. -
జాతీయ రికార్డు బద్దలు కొట్టిన యువ అథ్లెట్
న్యూఢిల్లీ: భారత యువ అథ్లెట్ గుల్వీర్ సింగ్ (Gulveer Singh) బోస్టన్లో జరిగిన ఇన్విటేషనల్ టోర్నీలో జాతీయ రికార్డు నెలకొల్పాడు. 3000 మీటర్ల ఇండోర్ రేసులో గుల్వీర్ సింగ్ 7 నిమిషాల 38.26 సెకన్లలో లక్ష్యాన్ని చేరాడు. తద్వారా 16 ఏళ్ల క్రితం సురేందర్ సింగ్ (7:49.47) నెలకొల్పిన రికార్డును గుల్వీర్ బద్దలు కొట్టాడు. 2022 హాంగ్జూ ఆసియా క్రీడల 10,000 మీటర్ల పరుగులో కాంస్య పతకం సాధించిన గుల్వీర్... సీజన్ ఆరంభంలోనే రికార్డు నెలకొల్పడం ఆనందంగా ఉందన్నారు.‘సీజన్ తొలి ఇండోర్ టోర్నీలోనే మంచి ప్రదర్శన కనబర్చడం సంతోషంగా ఉంది. దీంతో ఆత్మవిశ్వాసం రెట్టింపు అయింది. ఈ స్ఫూర్తితో ఔట్ డోర్ ఈవెంట్లలోనూ సత్తా చాటుతా’ అని 26 ఏళ్ల గుల్వీర్ పేర్కొన్నాడు.ఇదే టోర్నీలో పాల్గొన్న భారత మరో రన్నర్ రాహుల్ 8 నిమిషాల 8.27 సెకన్లలో లక్ష్యాన్ని చేరాడు. ప్రస్తుతం గుల్వీర్ పేరిటే 5000 మీటర్లు, 10,000 మీటర్ల జాతీయ రికార్డులు ఉన్నాయి. 5000 మీటర్ల పరుగును 13 నిమిషాల 11.82 సెకన్లలో పూర్తి చేసిన గుల్వీర్... 10,000 మీటర్ల రేసును 27 నిమిషాల 14.88 సెకన్లలో లక్ష్యాన్ని చేరాడు. ఈ ఏడాది ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ జరగనున్న నేపథ్యంలో భారత మిడిల్, లాంగ్ డిస్టాన్స్ రన్నర్లు ప్రస్తుతం అమెరికాలో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. -
జాతీయ కోచ్గా భారత దిగ్గజ షూటర్
భారత దిగ్గజ షూటర్ జస్పాల్ రాణా తిరిగి కోచ్గా జాతీయ షూటింగ్ జట్టుతో చేరాడు. భారత జాతీయ రైఫిల్ సమాఖ్య (ఎన్ఆర్ఏఐ).. జస్పాల్ రాణాను 25 మీటర్ల పిస్టల్ విభాగానికి ‘హై పెర్ఫార్మెన్స్’ కోచ్గా నియమించింది. అతడితో పాటు మాజీ ఆటగాడు జీతు రాయ్ను కూడా కోచింగ్ బృందంలో భాగం చేసింది.జీతూ ఆటగాడిగా ఆసియా క్రీడల్లో రెండు, కామన్వెల్త్ క్రీడల్లో రెండు పతకాలు గెలవడంతో పాటు ఆరు వరల్డ్ కప్ పతకాలు సాధించింది. అతని ఖాతాలో వరల్డ్ చాంపియన్íÙప్ రజతం కూడా ఉంది. తొలి సారి అతను కోచ్గా బాధ్యతలు చేపడుతున్నాడు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో జీతూ రాయ్ శిక్షణ ఇవ్వనున్నాడు.రైఫిల్ విభాగానికి హెడ్ కోచ్గా ఇటీవల ద్రోణాచార్య అవార్డు దక్కించుకున్న దీపాలీ దేశ్పాండేను ఎంపిక చేసింది. మొత్తంగా ఎన్ఆర్ఏఐ 16 మంది కొత్త కోచ్లను ఎంపిక చేసింది. వీరితో పాటు ఇప్పటికే ఉన్న 19 మందిని కూడా కొనసాగించనున్నారు.పిస్టల్ విభాగంలో జీతు యువ షూటర్లకు శిక్షణ ఇవ్వనుండగా... 10 మీటర్ల రైఫిల్ ఈవెంట్కు పూజ ఘట్కర్, 25 మీటర్ల పిస్టల్ విభాగానికి పెంబా తమాంగ్, స్కీట్కు అమరిందర్ చీమ, ట్రాప్కు వర్ష తోమర్ కోచ్లుగా వ్యవహరించనున్నారు. ఇద్దరు హై పెర్ఫార్మెన్స్ మేనేజర్లుగా మాన్షేర్ సింగ్, రోనక్ పండిట్ను ఎన్ఆర్ఏఐ నియమించింది. రాణాతో పాటు డీఎస్ చండేల్ (ఎయిర్ రైఫిల్), అన్వర్ సుల్తాన్ (ట్రాప్), మనోజ్ కుమార్ (50 మీటర్ల రైఫిల్) హై పెర్ఫార్మెన్స్ కోచ్లుగా వ్యవహరించనున్నారు. -
ఎట్టకేలకు సినెర్పై నిషేధం
లండన్: వరల్డ్ టాప్ ర్యాంక్ టెన్నిస్ ప్లేయర్ యానిక్ సినెర్పై ఎట్టకేలకు మూడు నెలల నిషేధం విధించారు. స్టార్ అయినా... ఎంతటి వారైనా... డోపింగ్కు పాల్పడితే శిక్ష తప్పదనే సంకేతాన్ని ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) ఇచ్చినట్లయ్యింది. దాదాపు ఏడాదిగా నలుగుతున్న ఈ కేసుకు ఎట్టకేలకు నిషేధంతో తెర పడనుంది. మూడు గ్రాండ్స్లామ్ల విజేత, ఇటలీకి చెందిన ప్రపంచ నంబర్వన్ సినెర్ గత మార్చిలో డోపింగ్లో పట్టుబడ్డాడు.అతని నమూనాల్లో నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలినా... ఈ టాప్ ర్యాంకర్పై అంతర్జాతీయ టెన్నిస్ ఇంటిగ్రిటీ ఏజెన్సీ (ఐటీఐఏ) మెతక వైఖరి అవలంభించింది. అతని టెస్టు ఫలితాన్ని ప్రపంచానికి తెలియనివ్వలేదు. కొన్ని నెలల తర్వాత బయటికి పొక్కినా కూడా 23 ఏళ్ల సినెర్ తను ఉద్దేశ పూర్వకంగా తీసుకోలేదని, బహుశా మసాజ్కు వాడిన తైలం వల్లా తన శరీరంలోకి ప్రవేశించి ఉండొచ్చనే వివరణతో ఐటీఐఏ సంతృప్తి చెంది పెద్దగా చర్యలేం తీసుకోలేదు. దీంతో టెన్నిస్ ఇంటిగ్రిటీపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. పలువురు దిగ్గజాలు, స్టార్లు, విశ్లేషకులు ‘ఒక్కొక్కరికి ఒక్కోలా చట్టాలు–చర్యలా’ అంటు దుమ్మెత్తిపోశారు. అయినా ఐటీఐఏ నిమ్మకు నీరెత్తినట్లే ఉండిపోయింది కానీ చర్యలు మాత్రం చేపట్టలేదు. ‘వాడా’ మాత్రం పరీక్షల్లో పట్టుబడ్డాడు కాబట్టి ఏడాదైనా నిషేధం విధించాలని స్పోర్ట్స్ అర్బిట్రేషన్ కోర్టులో అప్పీల్ చేసింది. చివరకు తాజాగా ఐటీఐఏ, సినెర్, వాడాల మధ్య ఒప్పందం కుదరడంతో వాడా ఇటీవల అప్పీల్ను ఉపసంహరించుకుంది. ఒప్పందంలో భాగంగా మూడు నెలలు నిషేధం విధించేందుకు ఐటీఐఏ సిద్ధమవగా... సినెర్ కూడా విమర్శలకు చెక్ పెట్టేందుకు సమ్మతించడంతో డోపింగ్ వివాదం ముగిసింది. ఫిబ్రవరి 9వ తేదీ నుంచి మే 4 వరకు ఈ నిషేధం అమలవుతుంది. ఈ కాలంలో అతను ఏ స్థాయి టెన్నిస్ టోర్నీల్లో పాల్గొనేందుకు వీలుండదు. అయితే మే 25 నుంచి జరిగే సీజన్ రెండో గ్రాండ్స్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్ ఆడేందుకు ఎలాంటి ఇబ్బంది లేకపోవడంతో అతను బరిలోకి దిగుతాడు. ఇదేం సస్పెన్షన్? సినెర్కు విధించిన మూడు నెలల శిక్ష పట్ల టెన్నిస్లో పలువురు ఆటగాళ్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గతంలో విమర్శించిన తరహాలోనే సినెర్ చాలా తక్కువ శిక్షతో బయటపడ్డాడని... టెన్నిస్లో ఒక్కో ఆటగాడికి ఒక్కో రకమైన నిబంధన ఉందని వారు వ్యాఖ్యానించారు. ‘సినెర్ సన్నిహితులు తమ పరపతిని బాగా ఉపయోగించినట్లుంది. కేవలం మూడు నెలల నిషేధంతో సరిపెట్టేలా చేసుకోగలిగారు. ఒక్క టైటిల్ వెనక్కి తీసుకోలేదు. కనీసం ప్రైజ్మనీలో కూడా కోత విధించలేదు. మరి అతను తప్పు చేసినట్లా, చేయనట్లా. టెన్నిస్కు దురదృష్టకరమైన రోజు. ఇక్కడ నిజాయితీ మిగల్లేదు’ అని కిరియోస్ అన్నాడు. మూడు గ్రాండ్స్లామ్ టైటిల్స్ గెలిచిన స్టాన్ వావ్రింకా కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. ‘టెన్నిస్ ఇక ఏమాత్రం స్వచ్ఛమైన ఆట కానే కాదు’ అని చెప్పాడు. టెన్నిస్ ప్లేయర్స్ అసోసియేషన్ కూడా ‘ఇక్కడి వ్యవస్థ నిజంగా చెడిపోయింది. ఇది ఒక క్లబ్లా మాత్రమే వ్యవహరిస్తోంది. ఒక్కో కేసుకు ఒక్కో రకంగా స్పందిస్తోంది. అన్నింటా అసమానతలు ఉన్నాయి. ఎలాంటి పారదర్శకత, పద్ధతి లేవు. ఇది ఆటగాళ్లను అగౌరవపర్చడమే. ఇకపై మార్పు అవసరం’ అని స్పందించింది. -
అబ్బాయిల ఓటమి...అమ్మాయిల గెలుపు
భువనేశ్వర్: ఎఫ్ఐహెచ్ పురుషుల ప్రొ లీగ్లో భారత జట్టు పరాజయం పాలైంది. భారత అంచె పోటీల్లో భాగంగా శనివారం జరిగిన తొలి మ్యాచ్లో హర్మన్ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత్ 1–3 గోల్స్ తేడాతో స్పెయిన్ చేతిలో ఓడింది. 2024 పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక పోరులో భారత జట్టు చేతిలో ఎదురైన పరాజయానికి స్పెయిన్ బదులు తీర్చుకున్నట్లైంది. భారత్ తరఫున సుఖ్జీత్సింగ్ (25వ నిమిషంలో) ఏకైక గోల్ సాధించాడు. స్పెయిన్ తరఫున బోర్జా లాకల్లె (28వ నిమిషంలో), ఇగ్నాషియా కొబొస్ (38వ ని.లో), బ్రూనో అవిలా (56వ ని.లో) తలా ఒక గోల్ చేశారు. భారత జట్టు పదే పదే దాడులు చేసినా స్పెయిన్ రక్షణ పంక్తి సమర్థవంతంగా అడ్డుకుంది. తొలి క్వార్టర్లో ఇరు జట్లు ఎంత ప్రయత్నించినా... గోల్ చేయలేకపోయాయి. రెండో క్వార్టర్ను ఇరు జట్లు మరింత దూకుడుగా ప్రారంభించాయి. ఈ క్రమంలో సుఖ్జీత్ సింగ్ గోల్తో భారత్ ఆధిక్యంలోకి వెళ్లగా... మూడు నిమిషాల వ్యవధిలోనే గోల్ కొట్టిన స్పెయన్ స్కోరు సమం చేసింది. ఆ తర్వాత వరుసగా రెండు క్వార్టర్స్లో ఒక్కో గోల్ బాదిన స్పెయిన్ మ్యాచ్ను చేజిక్కించుకుంది. ఆదివారం మరోసారి స్పెయిన్తో భారత్ ఆడనుంది. హోరాహోరీ పోరులో భారత అమ్మాయిల విజయం ఎఫ్ఐహెచ్ మహిళల ప్రొ లీగ్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. భారత అంచె పోటీల్లో భాగంగా శనివారం హోరాహోరీగా సాగిన తొలి పోరులో భారత్ 3–2 పాయింట్ల తేడాతో ఇంగ్లండ్పై విజయం సాధించింది. కళింగ స్టేడియంలో జరిగిన పోరులో తమకన్నా మెరుగైన ర్యాంక్ ఉన్న ఇంగ్లండ్ జట్టుపై భారత్ స్ఫూర్తిదాయకమైన ప్రదర్శన కనబర్చింది. భారత్ తరఫున వైష్ణవి (6వ నిమిషంలో), దీపిక (25వ ని.లో) నవ్నీత్ కౌర్ (59వ ని.లో) తలా ఒక గోల్ చేశారు. వైష్ణవి, దీపిక పెనాల్టీ కార్నర్లను గోల్స్గా మలచగా... ఆట ఆఖరి నిమిషంలో అదిరిపోయే ఫీల్డ్గోల్తో నవ్నీత్ జట్టుకు విజయాన్ని అందించింది. ఇంగ్లండ్ తరఫున డార్సీ బౌర్నె (12వ నిమిషంలో), ఫియానా క్రాక్లెస్ (58వ ని.లో) చెరో గోల్ కొట్టారు. ఎఫ్ఐహెచ్ ర్యాంకింగ్స్లో తొమ్మిదో స్థానంలో ఉన్న భారత్.. వైష్ణవి గోల్తో తొలి క్వార్టర్లోనే ఖాతా తెరిచింది. అయితే కాసేపటికే ఏడో ర్యాంక్లో ఉన్న ఇంగ్లండ్ స్కోరు సమం చేసింది. రెండో క్వార్టర్లో దీపిక గోల్తో ఆధిక్యంలోకి వెళ్లిన భారత్... సునాయాసంగానే మ్యాచ్ గెలిచేలా కనిపించింది. ఈ క్రమంలో గోల్కీపర్ సవిత పూనియా కొన్ని చక్కటి సేవ్లతో ప్రత్యర్థికి స్కోరు చేసే అవకాశం ఇవ్వలేదు. చివర్లో ఇంగ్లండ్ స్కోరు సమం చేసినా... నిమిషం వ్యవధిలోనే మరో గోల్ కొట్టిన భారత్ విజయం సాధించింది. ఆదివారం జరగనున్న మ్యాచ్లో మరోసారి ఇంగ్లండ్తో భారత అమ్మాయిల జట్టు తలపడుతుంది. -
గుకేశ్కు చివరి స్థానం
హాంబర్గ్ (జర్మనీ): ఫ్రీస్టయిల్ గ్రాండ్స్లామ్ చెస్ టూర్ టోర్నమెంట్లో ప్రపంచ చాంపియన్, భారత గ్రాండ్మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ నిరాశ పరిచాడు. శనివారం ముగిసిన ఈ టోర్నీలో గుకేశ్ ఆఖరి స్థానంతో సరిపెట్టుకున్నాడు. ప్లే ఆఫ్ పోరులో గుకేశ్ 0.5–1.5 పాయింట్ల తేడాతో అలిరెజా ఫిరౌజా (ఇరాన్) చేతిలో పరాజయం పాలయ్యాడు. క్వార్టర్ ఫైనల్లో ఫాబియానో కరువానా (అమెరికా) చేతిలో ఓడిన గుకేశ్... ప్లే ఆఫ్ రౌండ్లోనూ ఆకట్టుకోలేకపోయాడు. తొలి రౌండ్ను ‘డ్రా’చేసుకున్న గుకేశ్... రెండో రౌండ్లో తెల్ల పావులతో ఆడినా సత్తా చాటలేకపోయాడు. 30 ఎత్తుల్లో పరాజయం పాలయ్యాడు. ఓవరాల్గా విన్సెంట్ కైమెర్ (జర్మనీ) అగ్రస్థానం దక్కించుకోగా... ఫాబియా కరువానా (అమెరికా), మాగ్నస్ కార్ల్సన్ (నార్వే) వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. ఆ తర్వాత వరుసగా జవోఖిర్ సిందరోవ్ (ఉజ్బెకిస్తాన్; 4వ స్థానం), హికారు నకమురా (అమెరికా; 5వ స్థానం), నొడ్రిబెక్ అబ్దుసత్తరోవ్ (ఉజ్బెకిస్తాన్; 6వ స్థానం), అలిరెజా ఫిరౌజా (7వ స్థానం) నిలిచారు. ఎనిమిది మంది గ్రాండ్మాస్టర్లు పాల్గొన్న ఈ టోర్నీలో గుకేశ్ ఎనిమిదో స్థానంతో ముగించాడు. ఈ టోర్నీ మొత్తంలో గుకేశ్ ఒక్క మ్యాచ్లోనూ విజయం సాధించలేకపోయాడు. -
చెన్నైయిన్ విజయం
చెన్నై: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో చెన్నైయిన్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) వరుసగా రెండో విజయం నమోదు చేసుకుంది. శనివారం జరిగిన పోరులో చెన్నైయిన్ ఎఫ్సీ 2–1 గోల్స్ తేడాతో పంజాబ్ ఎఫ్సీపై విజయం సాధించింది. చెన్నైయిన్ జట్టు తరఫున విల్మార్ జోర్డాన్ గిల్ (19వ నిమిషంలో), డానియల్ చిమ చుకువా (84వ నిమిషంలో) చెరో గోల్ చేశారు. పంజాబ్ జట్టు తరఫున లూకా మాజ్కెన్ (48వ నిమిషంలో) ఏకైక గోల్ సాధించాడు. మ్యాచ్లో ఇరు జట్లు చెరో 12 షాట్లు ఆడాయి. అందులో ఐదేసి సార్లు ప్రత్యర్థి గోల్పోస్ట్పై దాడి చేశాయి. అయితే మ్యాచ్ ఆరంభంలోనే జోర్డాన్ గిల్ గోల్తో చెన్నైయిన్ జట్టు ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత పంజాబ్ జట్టు స్కోరు సమం చేసినా... మ్యాచ్ మరికాసేపట్లో ముగుస్తుందనగా... చెన్నైయిన్ మరో గోల్తో విజయం సాధించింది. తాజా సీజన్లో 21 మ్యాచ్లు ఆడిన చెన్నైయిన్ 6 విజయాలు, 9 పరాజయాలు, 6 ‘డ్రా’లతో 24 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో 10వ స్థానంలో ఉంది. శనివారమే జరిగిన మరో మ్యాచ్లో మోహన్ బగాన్ జట్టు 3–0 గోల్స్ తేడాతో కేరళా బ్లాస్టర్స్పై గెలుపొందింది. జేమీ మెక్లారెన్ (18వ, 40వ నిమిషాల్లో) డబుల్ గోల్స్తో విజృంభించగా... అల్బర్టో రోడ్రిగోజ్ (66వ నిమిషంలో) మరో గోల్ సాధించాడు. తాజా సీజన్లో 21 మ్యాచ్లు ఆడిన మోహన్ బగాన్ జట్టు 15 విజయాలు, 2 పరాజయాలు, 4 ‘డ్రా’లతో 49 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక ‘టాప్’లో సాగుతోంది. లీగ్లో భాగంగా ఆదివారం జరగనున్న మ్యాచ్లో మోహమ్మదన్ స్పోర్ట్స్ క్లబ్తో ఈస్ట్ బెంగాల్ జట్టు తలపడుతుంది. -
రన్నరప్ నికీ పునాచా జోడీ
న్యూఢిల్లీ: ఏటీపీ చాలెంజర్ 75 టోర్నీ ఢిల్లీ ఓపెన్లో భారత టెన్నిస్ ఆటగాడు నికీ పునాచా రన్నరప్గా నిలిచాడు. పురుషుల డబుల్స్ ఫైనల్లో రెండో సీడ్గా బరిలోకి దిగిన నికీ పునాచా–కోర్ట్నీ జాన్ లాక్ (జింబాబ్వే) జంట చేతిలో ఫైనల్లో ఓడి రన్నరప్గా నిలిచింది. శనివారం జరిగిన తుదిపోరులో అన్సీడెడ్ మసమిచి ఇమామురా–రియో నొగుచి (జపాన్) ద్వయం 6–4, 6–3తో నికీ–జాన్ లాక్ జోడీపై విజయం సాధించింది. తొలి సెట్ ఆరంభం నుంచే విజృంభించిన జపాన్ జోడీ... 4–1తో ముందంజ వేసింది. ఈ దశలో పుంజుకున్న పునాచా జంట 3–4తో ఆధిక్యాన్ని తగ్గించగలిగిందే తప్ప... చివరి వరకు అదే జోరు కొనసాగించలేక తొలి సెట్ కోల్పోయింది. రెండో సెట్లోనూ రాణించిన జపాన్ ద్వయం సునాయాసంగా సెట్తో పాటు టైటిల్ గెలుచుకుంది.మరో వైపు సింగిల్స్ విభాగంలో కైరియాన్ జాక్వెట్ (ఫ్రాన్స్), బిల్లీ హారిస్ (బ్రిటన్) ఫైనల్లోకి ప్రవేశించారు. తొలి సెమీస్లో జాక్వెట్ 6–3, 6–1తో విట్ కొప్రివా (చెక్ రిపబ్లిక్)పై...రెండో సెమీస్లో హారిస్ 4–6, 7–6 (7/4), 6–2తో ట్రిస్టన్ స్కూల్కేట్ (ఆ్రస్టేలియా)పై గెలుపొందారు. -
మంత్రి గారూ.. జోక్యం చేసుకోండి!
కేంద్ర క్రీడా శాఖా మంత్రి మన్సుఖ్ మాండవీయ(Mansukh Mandaviya)ను కలిసేందుకు భారత రెజ్లర్లు శనివారం ఆయన నివాసం వద్దకు వెళ్లారు. అల్బేనియాలో జరగనున్న అంతర్జాతీయ రెజ్లింగ్ ర్యాంకింగ్ సిరీస్కు తమను పంపేలా ఏర్పాట్లు చేయించాలని విజ్ఞప్తి చేయాలని భావించారు. అయితే, మంత్రి ఇంట్లో లేకపోవడంతో వారికి నిరాశే మిగిలింది.కాగా కేంద్ర క్రీడాశాఖ, భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI)ల మధ్య కొరవడిన సమన్వయంతో రెజ్లర్లు మూల్యం చెల్లించుకుంటున్నారు. ఇప్పటికే ఈ సీజన్లో తొలి ర్యాంకింగ్ సిరీస్ టోర్నమెంట్కు దూరమైన భారత రెజ్లర్లు... మళ్లీ ఇప్పుడు రెండో ర్యాంకింగ్ సిరీస్ టోర్నీకి వెళ్లలేని పరిస్థితి వచ్చింది. డబ్ల్యూఎఫ్ఐ నిర్ణీత సమయంలోగా అవసరమైన డాక్యుమెంట్లు సమకూర్చకపోవడంతో అల్బేనియాలో జరగనున్న అంతర్జాతీయ రెజ్లింగ్ ర్యాంకింగ్ సిరీస్కు రెజ్లర్లను పంపలేక పోతున్నామని క్రీడాశాఖ ... సమాఖ్య తీరుపై విమర్శించింది.సమాఖ్య నిర్వాకం వల్లే‘డబ్ల్యూఎఫ్ఐ ప్రతిపాదిత జాబితాను గడువులోగా పంపడంలో తాత్సారం చేసింది. భారత స్పోర్ట్స్ అథారిటీ (SAI)కి చాలా ఆలస్యంగా జాబితా చేరడంతో తదుపరి ప్రక్రియను చేపట్టలేకపోయాం. ఏదైనా అంతర్జాతీయ టోర్నీలకు వెళ్లాలంటే ఓ పద్ధతి ఉంటుంది. ముందస్తు ప్రతిపాదన, తదుపరి డాక్యుమెంట్ల పరిశీలన తదనంతరం తుది జాబితా ఆమోదించబడాలి. కానీ సమాఖ్య నిర్వాకం వల్లే జాబితా ఆలస్యమైంది. ఆమోదానికి దూరమైంది. దీంతో అథ్లెట్లు అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే అవకాశాన్ని కోల్పోయారు’ అని క్రీడాశాఖ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ విషయంలో క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవీయ జోక్యం కోరుతూ.. ఆసియా చాంపియన్ సునిల్ కుమార్, అండర్-23 ఆసియా చాంపియన్షిప్ స్వర్ణ పతక విజేత మీనాక్షితో పలువురు రెజ్లర్లు న్యూఢిల్లీలోని ఆయన ఇంటికి వెళ్లారు.మంత్రి గారూ.. జోక్యం చేసుకోండి!ఈ సందర్భంగా సునిల్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘మా తప్పు లేకపోయినా ర్యాంకింగ్ సిరీస్కు దూరమయ్యే పరిస్థితి వచ్చింది. మంత్రిగారి జోక్యంతోనైనా మాకు మేలు జరుగుతుందని ఇక్కడకు వచ్చాం. ఈ సిరీస్లో పాల్గొనడంవల్లమార్చిలో జరుగబోయే డ్రా, తొలి దశ బౌట్లలో మాకు కాస్త వెసలుబాటు కలుగుతుంది.అందుకే మా సమస్యను మంత్రిగారి దృష్టికి తీసుకువెళ్లాలని భావిస్తున్నాం’’ అని తెలిపాడు. అయితే, మధ్యాహ్నం రెండు గంటల వరకు దాదాపు పది మంది రెజ్లర్లు మాండవీయ నివాసం వద్ద పడిగాపులు కాసినా ఫలితం లేకపోయింది. ఆయన అందుబాటులోకి రాకపోవడంతో రెజ్లర్లు నిరాశగా తిరిగి వెళ్లిపోయారు. కాగా గతంలో క్రీడాశాఖ సస్పెన్షన్ వల్ల జాగ్రేబ్ ర్యాంకింగ్ సిరీస్కు భారత జట్టు దూరమైంది. ఇప్పుడు ఇరు సమాఖ్యల మధ్య సమన్వయలేమి వల్ల ఈ నెల 26 నుంచి మార్చి 2 వరకు టిరానాలో జరిగే ఈవెంట్కూ గైర్హాజరు అవుతోంది. ఇక భారత రెజ్లర్లు సీనియర్ ఆసియా చాంపియన్షిప్పైనే ఆశలు పెట్టుకున్నారు. జోర్డాన్లో మార్చి 25 నుంచి 30 వరకు ఆసియా ఈవెంట్ జరుగుతుంది. -
మేఘాలయలో కలుద్దాం!
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో అలరించిన జాతీయ క్రీడలు అట్టహాసంగా ముగిశాయి. తదుపరి మేఘాలయ జాతీయ క్రీడల ఆతిథ్యానికి సిద్ధం కానుంది. 2027లో అక్కడ 39వ నేషనల్ గేమ్స్ జరుగనున్నాయి. శుక్రవారం మేఘాలయ ముఖ్యమంత్రి కొంగ్కల్ సంగ్మా క్రీడాజ్యోతి అందుకోవడంతో దీనికి సంబంధించిన లాంఛన ప్రకియ కూడా ముగిసింది. 18 రోజుల పాటు విజయవంతంగా నిర్వహించిన తాజా జాతీయ క్రీడల్లో సర్వీసెస్ 121 పతకాలతో ఓవరాల్ చాంపియన్షిప్ గెలుచుకుంది. సర్వీసెస్ క్రీడాకారులు 68 స్వర్ణాలు, 26 రజతాలు, 27 కాంస్యాలు గెలిచారు. మహారాష్ట్ర అత్యధికంగా 198 పతకాలు గెలిచినప్పటికీ పసిడి వేట (54 స్వర్ణాలు)లో వెనుకబడిపోవడంతో రెండో స్థానంలో నిలిచింది. 71 రజతాలు, 73 కాంస్యాలు మరాఠా క్రీడాకారులు చేజిక్కించుకున్నారు. హరియాణా 153 పతకాలు (48 పసిడి, 47 రజతాలు, 58 కాంస్యాలు) మూడో స్థానంలో నిలువగా, ఆతిథ్య ఉత్తరాఖండ్ 24 స్వర్ణాలు, 35 రజతాలు, 44 కాంస్యాలతో మొత్తం 103 పతకాలు సాధించి ఏడో స్థానంలో నిలిచింది. తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ (14 పతకాలు) 18వ స్థానంలో, తెలంగాణ (18 పతకాలు) 26వ స్థానంలో నిలిచాయి. 2036 ఒలింపిక్స్కు సిద్ధం: అమిత్ షా జాతీయ క్రీడల ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విశ్వక్రీడల నిర్వహణకు భారత్ సిద్ధంగా ఉందని చెప్పారు. ‘క్రీడల్లో భారత్కు బంగారు భవిష్యత్తు ఉంది. 2036 ఒలింపిక్స్కు ఆతిథ్యమిచ్చేందుకు రెడీగా ఉంది. ఉత్తరాఖండ్ అంటేనే దేవభూమిగా ప్రసిద్ధి. అయితే తాజా ఈవెంట్ నిర్వహణ ద్వారా ఖేల్ భూమి అయ్యింది. కేవలం క్రీడల నిర్వహణే కాదు. ఆటగాళ్లు రాటుదేలిన తీరు సాధించిన ప్రగతి రాష్ట్ర ప్రభుత్వం క్రీడారంగంలో చేసిన విశేష కృషికి నిదర్శనం. గత జాతీయ క్రీడల్లో ఉత్తరాఖండ్ 21వ స్థానంలో నిలిచింది. తాజా క్రీడల్లో ఏడో స్థానానికి ఎగబాకింది. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడం వల్లే క్రీడారంగంలో ఆ రాష్ట్రం ఇంతలా ఎదిగింది. ఇదే జోరు ఇకమీదటా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నా’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామి, కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ, భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలు పీటీ ఉష, మేఘాలయ ముఖ్యమంత్రి కొంగ్కల్ సంగ్మా తదితరులు పాల్గొన్నారు. పీటీ ఉష మాట్లాడుతూ ‘ఈ మహత్తర ప్రయాణం ఇక్కడితో ముగిసేది కాదు. ఎల్లప్పుడు దిగి్వజయంగా సాగేది. భారత క్రీడల ప్రగతిని చాటేది’ అని ఆమె కితాబిచ్చారు. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ ‘2036 విశ్వక్రీడల్లో టాప్–10లో నిలిచేందుకు ఇదొక గొప్ప ఆరంభం. దేశంలో క్రీడాసంస్కృతి పెరుగుతుందనడానికి ఇదో నిదర్శనం’ అని అన్నారు. -
ఇంగ్లండ్తో భారత మహిళల తొలి పోరు
మరోవైపు మహిళల ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్లో భాగంగా నేడు జరగనున్న తొలి పోరులో ఇంగ్లండ్తో భారత్ తలపడుతుంది. ఆదివారం రెండో మ్యాచ్లోనూ ఇంగ్లండ్తో ఆడుతుంది. ఫలితాలతో సంబంధం లేకుండా మెరుగైన ఆటతీరు కనబర్చడమే తమ ముందున్న లక్ష్యమని భారత మహిళల హాకీ జట్టు సారథి సలీమా టెటె పేర్కొంది. మెరుగు పర్చుకోవాల్సిన అంశాలపై దృష్టి పెట్టేందుకు ఈ లీగ్ ఎంతగానో ఉపయోగపడుతుందిన సలీమా వెల్లడించింది. ఈ నెల 18, 19న స్పెయిన్తో... 21, 22న జర్మనీతో... 24, 25న నెదర్లాండ్స్తో భారత్ మ్యాచ్లు ఆడుతుంది. ‘మా ఆటపైనే ప్రధానంగా దృష్టి పెడతాం. పలువురు ప్లేయర్లు తొలిసారి ప్రొ లీగ్ మ్యాచ్లు ఆడనున్నారు. గెలుపోటములు ఆటలో భా గం. మా వరకు అత్యుత్తమ ప్రదర్శన చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. హరేంద్ర సింగ్ చీఫ్ కోచ్గా వచ్చినప్పటి నుంచి గేమ్ప్లాన్ మెరుగైంది. ప్లేయర్ల మధ్య అనుబంధం కూడా పెరిగింది. అదే మైదానంలో ప్రస్ఫుటమవుతోంది’ అని సలీమా వెల్లడించింది. -
‘ప్రతీ మ్యాచ్ గెలవడమే లక్ష్యం’
భువనేశ్వర్: వచ్చే ఏడాది హాకీ ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో... నేరుగా మెగా టోర్నీకి అర్హత సాధించేందుకు ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్లో ప్రతీ మ్యాచ్ గెలవాలనుకుంటున్నామని భారత హాకీ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ పేర్కొన్నాడు. లీగ్లో మంచి ప్రదర్శన కనబర్చి అగ్రస్థానంలో నిలవడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమని హర్మన్ప్రీత్ అన్నాడు. లీగ్లో భాగంగా శనివారం తొలి పోరులో స్పెయిన్తో భారత్ తలపడుతుంది. అనంతరం ఆదివారం స్పెయిన్తో మరో మ్యాచ్ ఆడుతుంది. ఈ నెల 18న, 19న జర్మనీతో 21, 22న ఐర్లాండ్తో... 24, 25న ఇంగ్లండ్తో మ్యాచ్లు ఆడుతుంది. ‘హాకీ ఇండియా లీగ్ నుంచి మా శిక్షణ సాగుతూనే ఉంది. ఫిట్నెస్ కాపాడుకుంటూ ప్రాక్టీస్ చేస్తున్నాం. ఆటగాళ్లంతా మంచి ఉత్సాహంగా ఉన్నారు. ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకొని ప్రొ లీగ్లో అన్నీ మ్యాచ్లు గెలవడమే మా ప్రధాన లక్ష్యం’ అని హర్మన్ప్రీత్ అన్నాడు. 2026 ఆగస్టులో బెల్జియం, నెదర్లాండ్స్ వేదికగా హాకీ వరల్డ్ కప్ జరగనుంది. ‘హాకీ ఇండియా లీగ్ ద్వారా దేశవాళీ ఆటగాళ్ల ప్రతిభ వెలుగులోకి వచ్చింది. వారిని సక్రమంగా వినియోగించుకుంటే భవిష్యత్తులో మరింత మంచి ప్లేయర్లుగా ఎదుగుతారు. స్పెయిన్ గట్టి ప్రత్యర్థి, వారిని తక్కువ అంచనా వేయడం లేదు. మా వరకు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడంపైనే దృష్టి పెడతాం’అని హర్మన్ప్రీత్ పేర్కొన్నాడు. -
National games: తెలంగాణకు 2 కాంస్యాలు
డెహ్రాడూన్: జాతీయ క్రీడల్లో గురువారం తెలంగాణ రాష్ట్రానికి రెండు పతకాలు లభించాయి. నెట్బాల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో తెలంగాణ జట్టుకు కాంస్య పతకం దక్కగా... షూటింగ్ మిక్స్డ్ స్కీట్ టీమ్ ఈవెంట్లో బత్తుల మునేక్–రష్మీ రాథోడ్ జోడీ కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది.నెట్బాల్లో తెలంగాణ, ఛత్తీస్గఢ్ జట్ల మధ్య జరిగిన కాంస్య పతకం మ్యాచ్ 31–31 పాయింట్లతో ‘డ్రా’గా ముగిసింది. దాంతో రెండు జట్లకు కాంస్య పతకాలు ఖరారయ్యాయి. తెలంగాణ నెట్బాల్ జట్టు తరఫున బోడ విక్రమ్ రెడ్డి, అబ్దుల్ ఖాన్, అబ్దుల్ షరీఫ్, మొహమ్మద్ ఖాజాయుద్దీన్, శ్రవణ్ కుమార్, రఘునందన్, పులి రితిక రెడ్డి, గేయశ్రీ, శ్రుతి, గోపీ చంద్రిక, ముద్దం కీర్తన, సంహిత ప్రాతినిధ్యం వహించారు.షూటింగ్ మిక్స్డ్ స్కీట్ ఫైనల్లో ఆరు జోడీలు పోటీపడ్డాయి. 138 పాయింట్లతో ఇషాన్ సింగ్–రైజా ధిల్లాన్ (హరియాణా) జంట స్వర్ణం దక్కించుకోగా... భవతేజ్ సింగ్–గనీమత్ సెఖోన్ (పంజాబ్) ద్వయం రజతం సంపాదించింది. 133 పాయింట్లతో మునేక్–రష్మీ జంటకు కాంస్యం లభించింది. గురువారం పోటీలు ముగిశాక తెలంగాణ 18 పతకాలతో (3 స్వర్ణాలు, 3 రజతాలు, 12 కాంస్యాలు) 26వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ 14 పతకాలతో (7 స్వర్ణాలు, 1 రజతం, 6 కాంస్యాలు) 18వ స్థానంలో కొనసాగుతోంది. -
భారత్ X జపాన్
కింగ్డావో (చైనా): ఆసియా మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత జట్టు కాంస్య పతకాన్ని నిలబెట్టుకునేందుకు విజయం దూరంలో నిలిచింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో జపాన్ జట్టుతో భారత్ తలపడుతుంది. ఈ మ్యాచ్లో భారత్ గెలిస్తే సెమీఫైనల్లోకి ప్రవేశించి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంటుంది. గురువారం జరిగిన గ్రూప్ ‘డి’ చివరి లీగ్ మ్యాచ్లో భారత్ 2–3తో దక్షిణ కొరియా జట్టు చేతిలో పోరాడి ఓడిపోయింది. తొలి మ్యాచ్లో ధ్రువ్ కపిల–తనీషా క్రాస్టో ద్వయం 21–11, 12–21, 15–21తో కి డాంగ్ జు–జియోంగ్ నా యున్ (కొరియా) జంట చేతిలో ఓడిపోయింది. రెండో మ్యాచ్లో మాళవిక బన్సోద్ 9–21, 10–21తో సిమ్ యు జిన్ చేతిలో పరాజయం పాలైంది. దాంతో భారత్ 0–2తో వెనుకబడింది. మూడో మ్యాచ్లో సతీశ్ కుమార్ కరుణాకరన్ 17–21, 21–18, 21–19తో చో జియోన్యోప్పై గెలుపొందాడు. నాలుగో మ్యాచ్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం 19–21, 21–16, 21–11తో కిమ్ ఇన్ జి–కిమ్ యు జుంగ్ జంటను ఓడించడంతో స్కోరు 2–2తో సమమైంది. నిర్ణాయక ఐదో మ్యాచ్లో సాతి్వక్ సాయిరాజ్–అర్జున్ జంట 14–21, 21–23తో జిన్ యోంగ్–నా సుంగ్ సెయోంగ్ జోడీ చేతిలో ఓడిపోవడంతో భారత ఓటమి ఖరారైంది. -
క్వార్టర్ ఫైనల్లో రిత్విక్ జోడీ
డెల్రే బీచ్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్కు చెందిన బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ పురుషుల డబుల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. అమెరికాలోని ఫ్లోరిడాలో ఈ టోర్నీ జరుగుతోంది. గురువారం జరిగిన తొలి రౌండ్లో రిత్విక్ చౌదరీ (భారత్)–నికోలస్ బారింటోస్ (కొలంబియా) ద్వయం 7–6 (7/4), 7–6 (7/5)తో రొంబోలి–జొర్మాన్ (బ్రెజిల్) జంటపై గెలిచింది. 1 గంట 40 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో రిత్విక్–బారింటోస్ జోడీ మూడు ఏస్లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్లు చేసింది. రెండు జోడీలు తమ సర్వీస్ను ఒక్కోసారి కోల్పోయాయి. రెండు సెట్లలోటైబ్రేక్లో రిత్విక్–బారింటోస్ ద్వయం పైచేయి సాధించింది. ఇదే టోర్నీలో ఆడుతున్న శ్రీరామ్ బాలాజీ (భారత్)–మిగెల్ రేయస్ వరేలా (మెక్సికో) జంట కూడా క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. తొలి రౌండ్లో నాలుగో సీడ్ బాలాజీ–వరేలా ద్వయం 3–6, 6–2, 10–4తో లెర్నర్ టియెన్–ఈథన్ క్విన్ (అమెరికా) జంటపై గెలిచింది. -
మకావును మట్టికరిపించి...
కింగ్డావో (చైనా): ఆసియా మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత జట్టు భారీ విజయంతో బోణీ కొట్టింది. మకావు జట్టుతో బుధవారం జరిగిన గ్రూప్ ‘డి’ తొలి లీగ్ మ్యాచ్లో టీమిండియా 5–0 తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ గెలుపుతో భారత జట్టుకు క్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖరారైంది. మంగళవారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్లో దక్షిణ కొరియా చేతిలో ఓడిన మకావు జట్టు వరుసగా రెండో ఓటమితో లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. ఇప్పటికే క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లిన దక్షిణ కొరియా నేడు భారత జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు గ్రూప్ ‘డి’ టాపర్గా నిలుస్తుంది. తొలి మ్యాచ్లో సతీశ్ కుమార్ కరుణాకరన్–ఆద్యా వరియత్ జోడీ 21–10, 21–9తో లోక్ చోంగ్ లియోంగ్–వెంగ్ చి ఎన్జీ జంటను ఓడించి భారత్కు 1–0 ఆధిక్యాన్ని అందించింది. రెండో మ్యాచ్లో లక్ష్య సేన్ 21–16, 21–12తో పాంగ్ ఫాంగ్ పుయ్పై గెలవడంతో భారత ఆధిక్యం 2–0కు పెరిగింది.మూడో మ్యాచ్లో రైజింగ్ స్టార్ మాళవిక బన్సోద్ 21–15, 21–9తో హావో వాయ్ చాన్ను ఓడించడంతో భారత్ 3–0తో విజయాన్ని ఖరారు చేసుకుంది.నాలుగో మ్యాచ్లో చిరాగ్ శెట్టి–అర్జున్ ద్వయం 21–15, 21–19తో చిన్ పోన్ పుయ్–కోక్ వెన్ వోంగ్ జోడీపై... ఐదో మ్యాచ్లో ట్రెసా జాలీ–పుల్లెల గాయత్రి జంట 21–10, 21–5తో ఎన్జీ వెంగ్ చి–పుయ్ చి వా ద్వయంపై గెలుపొందడంతో భారత విజయం 5–0తో సంపూర్ణమైంది. 2023లో దుబాయ్లో జరిగిన ఆసియా మిక్స్డ్ టీమ్ చాంపియన్షిప్లో భారత జట్టు కాంస్య పతకాన్ని సాధించింది. -
తెలంగాణ జిమ్నాస్ట్ నిష్కా అగర్వాల్కు స్వర్ణ పతకం
జాతీయ క్రీడల్లో తెలంగాణ ఖాతాలో మూడో పసిడి పతకం చేరింది. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో బుధవారం జరిగిన మహిళల ఆరి్టస్టిక్ జిమ్నాస్టిక్స్లో తెలంగాణ అమ్మాయి నిష్కా అగర్వాల్ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. టేబుల్ వాల్ట్ ఈవెంట్లో నిష్కా విజేతగా నిలిచింది. ఎనిమిది మంది పోటీపడ్డ ఫైనల్లో నిష్కా 12.717 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానాన్ని దక్కించుకొని బంగారు పతకాన్ని హస్తగతం చేసుకుంది. ఈ జాతీయ క్రీడల్లో నిష్కాకిది రెండో పతకం. మంగళవారం జరిగిన ఆల్ అరౌండ్ ఈవెంట్లో నిష్కా కాంస్య పతకాన్ని సాధించింది. మరోవైపు పురుషుల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ 65 కేజీల విభాగంలో తెలంగాణ రెజ్లర్ నిఖిల్ యాదవ్ కాంస్య పతకాన్ని గెల్చుకున్నాడు. బుధవారం పోటీలు ముగిశాక తెలంగాణ 16 పతకాలతో (3 స్వర్ణాలు, 3 రజతాలు, 10 కాంస్యాలు) 25వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ 14 పతకాలతో (7 స్వర్ణాలు, 1 రజతం, 6 కాంస్యాలు) 18వ స్థానంలో నిలిచింది. -
చెస్ గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరిగేశి సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: యువ ఆటగాళ్లు కెరీర్లో ఎదిగేందుకు ప్రోత్సాహకంగా ఇప్పటి వరకు అందిస్తున్న ఆర్దిక సహకారాన్ని ఆపి వేయాలని ఇటీవలే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై అంతర్జాతీయ ఈవెంట్లలో విజయాలు సాధిస్తేనే నగదు పురస్కారాలు లభిస్తాయి. చెస్లో గ్రాండ్మాస్టర్గా (జీఎం) మారితే రూ. 4 లక్షలు, ఇంటర్నేషనల్ మాస్టర్ (ఐఎం) సాధిస్తే రూ.1.5 లక్షలు ఇచ్చేవారు. అయితే వీటిని నిలిపివేయడం సరైన నిర్ణయం కాదని అగ్రశ్రేణి ఆటగాడు అర్జున్ ఇరిగేశి అభిప్రాయపడ్డాడు. ‘చెస్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న వర్ధమాన ఆటగాళ్లకు ఈ సమస్య అర్థం కాకపోవచ్చు. కానీ వారిని ప్రోత్సహించే తల్లిదండ్రులకు మాత్రం ఈ నిర్ణయం తీవ్ర నిరాశ కలిగిస్తుంది. దీని వల్ల వారికి ఆర్దికపరమైన సమస్యలు వస్తాయి. డబ్బుల కోసం ప్రత్యామ్నాయాలు చూడాల్సి వస్తుంది. పిల్లలను ప్రోత్సహించాలనే ప్రేరణ తగ్గిపోతుంది. సరిగ్గా చెప్పాలంటే చెస్, చదువులో ఏదైనా ఎంచుకోవాల్సి వస్తే వారు ఆటను పక్కన పెట్టవచ్చు’ అని అర్జున్ వ్యాఖ్యానించాడు. -
36వసారి జాతీయ టైటిల్ సాధించిన పంకజ్ అద్వానీ
ఇండోర్: భారత స్టార్ క్యూయిస్ట్, ప్రపంచ చాంపియన్ పంకజ్ అద్వానీ తన ఖాతాలో 36వసారి జాతీయ టైటిల్ను జమ చేసుకున్నాడు. మంగళవారం జరిగిన 91వ జాతీయ స్నూకర్ చాంపియన్షిప్ ఫైనల్లో పంకజ్ 5–1 ఫ్రేమ్ల తేడాతో బ్రిజేశ్ దమానిపై నెగ్గాడు. ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్న ఆసియా స్నూకర్ చాంపియన్షిప్లో పంకజ్తో పాటు బ్రిజేశ్ జాతీయ జట్టు తరఫున ఆడే అవకాశం దక్కించుకున్నారు. ‘అంతర్జాతీయ టోరీ్నల్లో పాల్గొనే అవకాశం ఇచ్చే ఈవెంట్ ఇదొక్కటే కావడంతో... తీవ్ర పోటీ ఎదురైంది. గ్రూప్ దశలో పేలవ ప్రదర్శన అనంతరం తిరిగి పుంజుకొని స్వర్ణం నెగ్గడం ఆనందంగా ఉంది. అంతర్జాతీయ వేదికపై దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించినందుకు సంతోషంగా ఉంది’ అని పంకజ్ అన్నాడు. -
సౌదీ అరేబియాలో ఇ–స్పోర్ట్స్ ఒలింపిక్స్
లుసానే (స్విట్జర్లాండ్): మొట్టమొదటి ఒలింపిక్స్ ఇ–స్పోర్ట్స్కు సౌదీ అరేబియా ఆతిథ్యమివ్వబోతోంది. 2027లో సౌదీ రాజధాని రియాద్లో ఎలక్ట్రానిక్ స్పోర్ట్స్ విశ్వక్రీడలు జరుగనున్నాయి. గతేడాది పారిస్ ఒలింపిక్స్ సందర్భంగా ఈ ఏడాదే ఇ–స్పోర్ట్స్ మెగా ఈవెంట్ నిర్వహించాలని మొదట అనుకున్నారు. అయితే ఇది కార్యరూపం దాల్చేందుకు ఇంకో రెండేళ్లు ఆలస్యమవుతుంది. అయితే 2027 నుంచి రెగ్యులర్గా ప్రతీ రెండేళ్లకోసారి మెగా ఈవెంట్ ఇ–స్పోర్ట్స్ నిర్వహించేందుకు సౌదీ ప్రభుత్వం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)తో 12 ఏళ్ల ఒప్పందం చేసుకుంది. గతేడాది జూలై, ఆగస్టు నెలల్లో రియాద్లో ఇ–స్పోర్ట్స్ ప్రపంచకప్ జరిగింది. కాల్ ఆఫ్ డ్యూటీ, ఫోర్ట్నైట్, స్ట్రీట్ ఫైటర్ క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించారు. అయితే ఇందులో సాధారణ షూటర్లకు అనుమతించేది లేనిది తేలలేదు. త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుంది. సౌదీ క్రీడల మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజిజ్ బిన్ తుర్కీ అల్ ఫైజల్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ ఒలింపిక్స్ ఇ–స్పోర్ట్స్ క్రీడాంశాలపై చర్చించనుంది. ఇటీవల ఐఓసీ చైర్మన్ థామస్ బాచ్, సౌదీ రాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ల మధ్య చర్చలు ఫలప్రదంగా జరగడంతో తాజాగా ఇ–స్పోర్ట్స్ విశ్వక్రీడలపై ప్రకటన వెలువడింది. అయితే ఇంకో రెండేళ్లలో జరిగే ఈ పోటీల కోసం ఈ ఏడాది నుంచే క్వాలిఫయింగ్ పోటీలు మొదలవుతాయని ఐఓసీ వర్గాలు తెలిపాయి. -
దోహా డైమండ్ లీగ్తో...
న్యూఢిల్లీ: భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఈ ఏడాదిలో మే నెలలో తిరిగి ట్రాక్పై అడుగు పెట్టనున్నాడు. దోహాలో జరగనున్న డైమండ్ లీగ్ ఈవెంట్లో నీరజ్ బరిలోకి దిగనున్నాడు. ఈ మేరకు భారత జాతీయ అథ్లెట్లిక్స్ చీఫ్ కోచ్ రాధాకృష్ణన్ నాయర్ వివరాలు వెల్లడించారు. ఇటీవల వివాహ బంధంలోకి అడుగు పెట్టిన నీరజ్ ప్రస్తుతం ప్రాక్టీస్ ప్రారంభించినట్లు రాధాకృష్ణన్ పేర్కొన్నాడు. ఒక సీజన్లో 14 డైమండ్ లీగ్ మీట్లు జరగనుండగా... దోహా ఈవెంట్ అందులో మూడోది. ఈ ఏడాది ఆగస్టు 27, 28న జ్యూరిక్లో డైమండ్ లీగ్ ఫైనల్ జరగనుంది. 26 ఏళ్ల నీరజ్ చోప్రా ప్రస్తుతం తన వ్యక్తిగత కోచ్ జాన్ జెలెజ్నీ (చెక్ రిపబ్లిక్)తో కలిసి పోచెఫ్స్టోమ్లో శిక్షణ పొందుతున్నాడు. ఒలింపిక్స్లో రెండు పతకాలు, ప్రపంచ చాంపియన్షిప్లో రెండు పతకాలు సాధించిన నీరజ్ చోప్రా 2020 టోక్యో, 2024 పారిస్ ఒలింపిక్స్కు ముందు కూడా పోచెఫ్స్ట్రోమ్లోనే సాధన చేశాడు. కెరీర్లో ఇప్పటి వరకు అత్యుత్తమంగా 89.94 మీటర్ల దూరం జావెలిన్ను విసిరిన నీరజ్... 90 మీటర్ల మార్క్ దాటడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. -
అన్నింటికంటే ‘మిక్స్డ్’ ముందు!
న్యూయార్క్: కేవలం నాలుగు గ్రాండ్స్లామ్ టోర్నీలకే పరిమితమైన ‘మిక్స్డ్ డబుల్స్’ ఈవెంట్ నానాటికీ తీసికట్టుగా జరుగకుండా... మరింత రసవత్తరంగా జరిగేలా... అందర్నీ ఆకర్షించేలా.. ఆదరణ పొందేలా... యూఎస్ ఓపెన్ నిర్వాహకులు గట్టి చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ‘మిక్స్డ్’లో సరైన భాగస్వాముల ఎంపిక, తదనంతరం పురుషుల, మహిళ డబుల్స్, సింగిల్స్లలో తాజాగా ఆడేందుకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ప్రధాన టోర్నీకి ముందుగానే మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్ల్ని నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. గేమ్ ఫార్మాట్ను మార్చింది. దీంతో పాటు ప్రత్యేకంగా మిక్స్డ్ డబుల్స్ విభాగం కోసం 10 లక్షల డాలర్లు (రూ.8.67 కోట్లు) ప్రైజ్మనీని కూడా పెంచింది. ఈ సీజన్ యూఎస్ ఓపెన్లో ఇబ్బడిముబ్బడిగా జోడీలను దించట్లేదు. 16 జోడీలే ‘మిక్స్డ్’ బరిలోకి దిగుతాయి. ఇందులో మెరుగైన ర్యాంకింగ్ ఆధారంగా ఎనిమిది జోడీలు, వైల్డ్ కార్డ్ ఎంట్రీతో మరో ఎనిమిది జోడీలు మిక్స్డ్ టైటిల్ కోసం పోటీ పడతాయి. మెయిన్ ‘డ్రా’ మ్యాచ్లు మొదలుకావడానికి ఐదు రోజుల ముందే అంటే క్వాలిఫయింగ్ పోటీలు జరుగుతున్న సమయంలో మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్లు వరుసగా జరుగుతాయి. ఆ మరుసటి రోజే సెమీస్, ఫైనల్స్తో విజేత కూడా ఖాయమమవుతుంది. 6 గేములతో కూడా బెస్టాఫ్ త్రీ కాకుండా 4 గేములతో బెస్టాఫ్ త్రీ ఫార్మాట్లో మిక్స్డ్ పోటీలు నిర్వహిస్తారు. గతంలో 6–6 స్కోరుదాకా సాగితేనే టైబ్రేక్ చేసేవారు. కానీ ఇప్పుడు 4–4 వద్దే టైబ్రేక్ మొదలుపెడతారు. దీంతో పోటీ రసవత్తరంగా సాగడంతో పాటు రెండే రోజుల్లో (ఈ ఏడాది అయితే ఆగస్టు 19, 20 తేదీల్లోనే) మిక్స్డ్ డబుల్స్ విజేత ఎవరో తేలుతుంది. 2024లో యూఎస్ ఓపెన్లో సారా ఎరాని–ఆండ్రియా వావాసోరి (ఇటలీ) జోడీ విజేతగా నిలిచింది. -
జ్యోతి ‘డబుల్’ ధమాకా
డెహ్రాడూన్: భారత స్టార్ అథ్లెట్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యర్రాజీ జాతీయ క్రీడల్లో మరోసారి ‘పసిడి’ ప్రదర్శనతో అదరగొట్టింది. మంగళవారం జరిగిన మహిళల అథ్లెటిక్స్ 200 మీటర్ల విభాగంలో విశాఖపట్నం జిల్లాకు చెందిన 25 ఏళ్ల జ్యోతి యర్రాజీ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. 200 మీటర్ల ఫైనల్ రేసును జ్యోతి అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా 23.35 సెకన్లలో పూర్తి చేసి విజేతగా అవతరించింది. తెలంగాణ అమ్మాయి నిత్య (23.76 సెకన్లు) కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. గత ఆదివారం జ్యోతి 100 మీటర్ల హర్డిల్స్ ఈవెంట్లో వరుసగా మూడోసారి జాతీయ క్రీడల్లో బంగారు పతకం సాధించి ‘హ్యాట్రిక్’ నమోదు చేసిన సంగతి తెలిసిందే. జిమ్నాస్టిక్స్లో భాగమైన మహిళల ట్రాంపోలిన్ ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన షేక్ యాసీన్ స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. ఎనిమిది మంది పోటీపడిన ఫైనల్లో కాకినాడ జిల్లాకు చెందిన షేక్ యాసీన్ తన విన్యాసాలతో మెరిపించి 39.790 పాయింట్లతో విజేతగా నిలిచింది. 2022 గుజరాత్ జాతీయ క్రీడల్లో యాసీన్ రజతం నెగ్గింది. నందిని నిలకడగా... ఏడు క్రీడాంశాల సమాహారమైన మహిళల హెప్టాథ్లాన్ (100 మీటర్ల హర్డిల్స్, హైజంప్, షాట్పుట్, 200 మీటర్లు, లాంగ్జంప్, జావెలిన్ త్రో, 800 మీటర్లు) ఈవెంట్లో తెలంగాణకు చెందిన అంతర్జాతీయ క్రీడాకారిణి అగసార నందిని స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. రెండు రోజులపాటు జరిగిన ఈ ఈవెంట్లో నందిని మొత్తం 5601 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచింది. అంతేకాకుండా ఈ ఏడాది మే 27 నుంచి 31 వరకు దక్షిణ కొరియాలో జరిగే ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలకు అర్హత సాధించింది. మహిళల ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ ఆల్ అరౌండ్ విభాగంలో తెలంగాణ అమ్మాయి నిష్కా అగర్వాల్ (44.767 పాయింట్లు) కాంస్య పతకాన్ని సాధించింది. మరోవైపు మహిళల నెట్బాల్ ఫాస్ట్–5 ఈవెంట్లో తెలంగాణ జట్టుకు రజత పతకం లభించింది. ఫైనల్లో తెలంగాణ జట్టు 20–23తో హరియాణా చేతిలో ఓడిపోయింది. తెలంగాణ నెట్బాల్ జట్టు తరఫున నట్టి అఖిల, సయ్యదా మస్రతున్నీసా, జంగా సుప్లవి రాజ్, యరువా యషశ్రీ, సాయిప్రియ, కొమర రిషిక, అలోనా, తరుణ, అంజలి, యదనవేణి దీప్తి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ 14 పతకాలతో (7 స్వర్ణాలు, 1 రజతం, 6 కాంస్యాలు) 17వ స్థానంలో... తెలంగాణ 14పతకాలతో (2 స్వర్ణాలు, 3 రజతాలు, 9 కాంస్యాలు) 27వ స్థానంలో ఉన్నాయి. -
తెలంగాణ టీటీ జట్టుకు కాంస్యం
డెహ్రాడూన్: జాతీయ క్రీడల్లో (National Games) తెలంగాణ (Telangana) ఖాతాలో పదో పతకం చేరింది. సోమవారం జరిగిన టేబుల్ టెన్నిస్ (Table Tennis) (టీటీ) టీమ్ ఈవెంట్లో తెలంగాణ పురుషుల జట్టుకు కాంస్య పతకం లభించింది. సూరావజ్జుల స్నేహిత్, అలీ మొహమ్మద్, మొహమ్మద్ అలీ, స్వర్ణేందు చౌధురీ, సంతోష్ రమేశ్ కుమార్లతో కూడిన తెలంగాణ జట్టు సెమీఫైనల్లో ఓడిపోయింది. మహారాష్ట్రతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో తెలంగాణ 0–3తో పరాజయం పాలైంది. తొలి మ్యాచ్లో స్నేహిత్ 6–11, 7–11, 9–11తో జశ్ మోదీ చేతిలో... రెండో మ్యాచ్లో మొహమ్మద్ అలీ 9–11, 9–11, 6–11తో రీగన్ చేతిలో... మూడో మ్యాచ్లో స్వర్ణేందు చౌధురీ 12–10, 1–11, 9–11, 3–11తో చిన్మయ సోమయ్య చేతిలో ఓడిపోయారు. మరో సెమీఫైనల్లో తమిళనాడు 2–3తో పశి్చమ బెంగాల్ చేతిలో పరాజయం చూవిచూసి కాంస్యంతో సరిపెట్టుకుంది. ఫైనల్లో పశి్చమ బెంగాల్ 3–0తో మహారాష్ట్రపై నెగ్గి పసిడి పతకం సొంతం చేసుకుంది. మహిళల విభాగంలోనూ పశి్చమ బెంగాల్ జట్టుకే స్వర్ణ పతకం లభించింది. సుతీర్థ ముఖర్జీ, ఐహిక ముఖర్జీ, పొయ్మంతీ బైస్యా, మౌమా దాస్, మౌహిత దత్తాలతో కూడిన పశ్చిమ బెంగాల్ ఫైనల్లో 3–0తో మహారాష్ట్రపై గెలిచింది. సోమవారం క్రీడలు ముగిశాక తెలంగాణ 10 పతకాలతో (1 స్వర్ణం, 2 రజతాలు, 7 కాంస్యాలు) 29వ స్థానంలో ఉంది. -
రిటైర్మెంట్ వీడి మళ్లీ బరిలోకి దిగనున్న భారత స్క్వాష్ స్టార్
న్యూఢిల్లీ: దాదాపు ఏడాది క్రితం...భారత స్క్వాష్ (Squash) స్టార్ సౌరవ్ ఘోషాల్ (Sourav Ghoshal) ఆటకు గుడ్బై చెప్పాడు. ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్ (పీఎస్ఏ) టూర్లో భాగంగా చికాగోలో జరిగిన విండీ సిటీ ఓపెన్లో ఆడిన తర్వాత అతను రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే 38 ఏళ్ల ఘోషాల్ ఇప్పుడు మళ్లీ ఆటగాడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు. రిటైర్మెంట్ వదిలి మైదానంలో పోటీ పడాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో గత నెలలో పీఎస్ఏలో సభ్యుడిగా తన పేరు నమోదు చేసుకున్న ఘోషాల్ చాలెంజర్ ఈవెంట్ ఆక్టేన్ సిడ్నీ క్లాసిక్లో బరిలోకి దిగుతున్నాడు. ‘టోర్నీల కోసం చేసే ప్రయాణాలు, ఆ పోటీని నేను మళ్లీ ఆస్వాదించాలనుకుంటున్నా. గత 20 ఏళ్లలో ఆటగాడిగా ఉన్నప్పుడు గడిపిన సమయంతో పోలిస్తే ఈ సారి 10 నెలల్లోనే అంతకంటే ఎక్కువ సమయంలో ఇంట్లో ఉన్నాను. ఈ సమయంలో భార్యాపిల్లలతో సంతోషంగా గడిపా. కనీసం మరో మూడేళ్లు ఆడగల సత్తా నాలో ఉందని భావిస్తున్నా. విరామ సమయంలో నా కెరీర్ను విశ్లేషించేందుకు ప్రయత్నించా. కాబట్టే ఇంకా ఆడాలనిపించింది. ఈ రెండో భాగం మొదటిదానికంటే బాగుంటుందని ఆశిస్తున్నా’ అని ఘోషాల్ చెప్పాడు. భారత్ తరఫున ఆడాలని... ఈ సారి పీఎస్ఏ టోర్నీలకంటే అంతర్జాతీయ ఈవెంట్లలో భారత్కు ప్రాతినిధ్యం వహించడమే తన మొదటి ప్రాధాన్యతగా అతను పెట్టుకున్నాడు. పురుషుల విభాగంలో భారత అత్యుత్తమ స్క్వాష్ ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న ఘోషాల్... సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో కలిపి కామన్వెల్త్ క్రీడల్లో 1 రజతం, 2 కాంస్యాలు, ఆసియా క్రీడల్లో 2 స్వర్ణాలు, 2 రజతాలు, 5 కాంస్యాలు గెలుచుకున్నాడు.భారత్ తరఫున దాదాపు అన్ని ఘనతలు అతని పేరిటే ఉన్నాయి. ‘పీఎస్ఏ నుంచి రిటైర్ అయిన తర్వాత కూడా భారత్ తరఫున మాత్రం ఆడుతూ ఉండాలని భావించా. అయితే పీఎస్ఏలో కొనసాగితేనే జాతీయ జట్టు తరఫున ఎంపికయ్యే అవకాశాలు మెరుగ్గా ఉంటాయని అర్థమైంది. భారత్ తరఫున ఇంకా అత్యుత్తమ ప్రదర్శన ఇస్తాననే నమ్మకం ఉంది. కొన్ని నెలల క్రితమే నా శిక్షణను మళ్లీ ప్రారంభించా. ఆరంభంలో ఫిట్నెస్పై మాత్రమే దృష్టి పెట్టి ఆపై సాధన కొనసాగించా. దాదాపు ఆరు నెలల మైదానానికి దూరమై మళ్లీ ఆడటం అంత సులువు కాదు’ అని ఘోషాల్ పేర్కొన్నాడు.ఒలింపిక్స్ ఆశలు... 2026 కామన్వెల్త్ క్రీడల నుంచి స్క్వాష్ను తప్పించినా... 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లో స్క్వాష్ను చేర్చడం కూడా ఘోషాల్ భవిష్యత్తుపై ఆశలు పెంచింది. ‘కామన్వెల్త్ క్రీడల్లో మేం స్వర్ణం సాధించలేదు. ఈ సారి గెలవవచ్చని ఆశించా. అయితే ఇప్పుడు ఆ అవకాశం లేదు కాబట్టి ఏమీ చేయలేం. ఆసియా క్రీడల్లో మాత్రం రాణించే అవకాశం ఉంది. ఒలింపిక్స్లో పతకం అనేది నిజంగానే పెద్ద లక్ష్యం. నేను మన దేశం తరఫున ఆడిన పతకం గెలవగలిగితే అంతకన్నా గొప్ప విషయం ఉండదు. కానీ దానికి దాదాపు మూడేళ్లుకు పైగా సమయం ఉంది. ఇప్పటికిప్పుడైతే అంత దూరం ఆలోచించడం లేదు’ అని ఘోషాల్ అభిప్రాయపడ్డాడు. ఆక్టేన్ సిడ్నీ క్లాసిక్ టోర్నీలో తాను విజయం సాధిస్తానని అతను విశ్వాసం వ్యక్తం చేశాడు. -
‘స్పోర్ట్స్ డేటా గేమ్థాన్’ను ప్రారంభించింన FIFS..
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10, 2025: స్పోర్ట్స్ టెక్లో భారతదేశాన్ని గ్లోబల్ హబ్గా మార్చాలనే లక్ష్యంతో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫాంటసీ స్పోర్ట్స్ (FIFS) ఆధ్వర్యంలో డ్రీమ్11 సమర్పనలో స్పోర్ట్స్ AI ఛాలెంజ్ ‘స్పోర్ట్స్ డేటా గేమ్థాన్’ను ప్రారంభించింది. ఈ అధునాతన సాంకేతిక పోటీ డేటాను సమగ్రపరచడంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ (ML) వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను క్రీడలకు ఉపయోగించుకోవడానికి నూతన మార్గాలను అన్వేషించే దిశగా అడుగులేస్తుంది.ఈ గేమ్థాన్లో ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ల నుండి విద్యార్థి జట్లు పాల్గొంటాయి. ఇందులో పాల్గొనే వారు ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సందర్భంగా రోజువారీ ఫాంటసీ స్పోర్ట్స్ ఫార్మాట్లో పోటీపడతారు. ముఖ్యంగా డేటా అనలిటిక్స్ నైపుణ్యాలను ఉపయోగించుకుంటూ, గేమ్థాన్ యొక్క బదిలీ పరిమితులు ఇతర నియమాలకు కట్టుబడి విజేతగా నిలవడానికి వ్యూహాన్ని రూపొందించడంలో ఏఐ, ఎమ్ఎల్ నమూనాలను నిర్మించాలి.ఈ ప్రతిష్టాత్మక పోటీకి 30 కి పైగా ప్రముఖ సంస్థలు ఆసక్తి చూపాయి. వారి వ్యూహాత్మక ప్రణాళికలను సమీక్షించిన తర్వాత., IIT బాంబే, IIT ఢిల్లీ, IIT ఖరగ్పూర్, IIT కాన్పూర్, IIIT ధార్వాడ్ వంటి సంస్థల నుండి 52 జట్లు షార్ట్లిస్ట్ చేయబడ్డాయి. మొదటి మూడు జట్లు వరుసగా రూ.12.5 లక్షలు, 7.5 లక్షలు, 5 లక్షలు అందుకుంటూ మొత్తంగా 25 లక్షల బహుమతిని గెలుచుకుంటారు.గేమ్థాన్ అంతటా విద్యార్థులకు మద్దతుగా, FIFS ఇద్దరు నిపుణులను ఆన్-బోర్డ్ చేసింది - ప్రఖ్యాత క్రికెట్ విశ్లేషకుడు జాయ్ భట్టాచార్య మరియు USలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో AI వైస్ డీన్ ప్రొఫెసర్ విశాల్ మిశ్రా, విద్యార్థి బృందాలకు వారి నిపుణుల మార్గదర్శకత్వాన్ని అందిస్తారు.ఈ సందర్భంగా FIFS డైరెక్టర్ జనరల్ జాయ్ భట్టాచార్య మాట్లాడుతూ.., "స్పోర్ట్స్ డేటా గేమ్థాన్ యొక్క మొదటి ఎడిషన్ను ప్రారంభించడానికి మేము సంతోషిస్తున్నాము. మా ప్రయత్నానికి విశేష స్పందన లభిస్తుంది. ఈ గేమ్థాన్లో ప్రధానంగా యువతరం పోటీ పడటం పట్ల మేము సంతోషిస్తున్నామ’’ని అన్నారు.‘స్పోర్ట్స్ డేటా గేమ్థాన్’ అనేది ఆవిష్కరణకు ప్రోత్సాహక వేదికగా మారడంతో పాటు భారతదేశాన్ని స్పోర్ట్స్ టెక్నాలజీలో ప్రపంచ నేతగా ఎదగడమే లక్ష్యంగా ముందుకు తీసుకెళ్లన్నుంది. ఈ తరంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న స్పోర్ట్స్ అనలిటిక్స్ రంగంలో యువ ప్రతిభను పెంపొందించడంతో గేమ్థాన్ అభిమానుల భాగస్వామ్యాన్ని పునర్నిర్వచించడానికి.. అత్యాధునిక సాంకేతికత, డిజిటల్ కంటెంట్ అనుసంధానం చేసే విశిష్టమైన వ్యవస్థను పెంపొందిస్తుంది. -
PV Sindhu: కీలక టోర్నీకి దూరం.. భర్తతో ‘మ్యాచీ మ్యాచీ’!
ఆసియా మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత పతకావకాశాలకు దెబ్బ పడింది. భారత స్టార్ షట్లర్, ప్రపంచ మాజీ చాంపియన్ పీవీ సింధు(PV Sindhu) కండరాల గాయం కారణంగా ఈ టోర్నీ నుంచి వైదొలిగింది. క్రితంసారి 2023లో దుబాయ్(Dubai)లో జరిగిన ఈ మెగా ఈవెంట్లో సింధు సభ్యురాలిగా ఉన్న భారత జట్టు కాంస్య పతకాన్ని(Bronze Medal) సాధించింది. గువాహటిలో ఈనెల నాలుగో తేదీన మొదలైన జాతీయ శిక్షణ శిబిరం సందర్భంగా సింధు ప్రాక్టీస్ సమయంలో గాయపడింది.ఎంఆర్ఐ స్కాన్ తీయగా సింధు కండరాల గాయం నుంచి కోలుకోవడానికి కొన్ని వారాల సమయం పడుతుందని తేలింది. దాంతో సింధు ఈ టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆసియా మిక్స్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ ఈనెల 11 నుంచి 15 వరకు చైనాలోని కింగ్డావో నగరంలో జరుగుతుంది. గ్రూప్ ‘డి’లో ఉన్న భారత్ ఈనెల 12న మకావు జట్టుతో, 13న దక్షిణ కొరియా జట్టుతో ఆడుతుంది. ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్ల (పురుషుల, మహిళల సింగిల్స్, పురుషుల, మహిళల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్) చొప్పున జరుగుతాయి. భారత బ్యాడ్మింటన్ జట్టు: లక్ష్య సేన్, ప్రణయ్, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి, ధ్రువ్ కపిల, అర్జున్, సతీశ్ కుమార్, మాళవిక బన్సోద్, గాయత్రి గోపీచంద్, ట్రెసా జాలీ, అశ్విని పొన్నప్ప, తనీషా క్రాస్టో, ఆద్య. మ్యాచీ మ్యాచీఇదిలా ఉంటే.. గాయం కారణంగా ఆటకు దూరమైన పీవీ సింధు వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించింది. భర్త వెంకట దత్తసాయితో కలిసి క్వాలిటీ టైమ్ స్పెండ్ చేస్తోంది. ఈ క్రమంలో ఇద్దరూ చాక్లెట్ కలర్ దుస్తులు ధరించిన ఉన్న ఫొటోను షేర్ చేసిన సింధు.. ‘మ్యాచీ మ్యాచీ’ అంటూ మురిసిపోయింది.శభాష్ మానస్ న్యూఢిల్లీ: భారత పురుషుల టెన్నిస్ రైజింగ్ స్టార్ మానస్ ధామ్నే తన కెరీర్లో తొలి ప్రొఫెషనల్ టైటిల్ సాధించాడు. ట్యూనిషియాలో జరిగిన అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఎం15 టోర్నీలో 17 ఏళ్ల మానస్ విజేతగా నిలిచాడు. ఐటీఎఫ్ ర్యాంకింగ్స్లో 64వ స్థానంలో ఉన్న ఈ మహారాష్ట్ర కుర్రాడు ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో 2–6, 6–0, 6–2తో ఇటలీకి చెందిన లొరెంజో కార్బోనిపై గెలుపొందాడు.తద్వారా భారత్ నుంచి ఐటీఎఫ్ టైటిల్ నెగ్గిన రెండో అతి పిన్న వయస్కుడిగా మానస్ గుర్తింపు పొందాడు. ఈ రికార్డు యూకీ బాంబ్రీ (16 ఏళ్ల 10 నెలలు; 2009లో న్యూఢిల్లీ ఫ్యూచర్స్ టోర్నీ) పేరిట ఉంది. క్వాలిఫయర్గా ట్యూనిషియా ఎం15 టోర్నీలో మెయిన్ ‘డ్రా’లోకి అడుగు పెట్టిన మానస్ వరుసగా 8 మ్యాచ్లు గెలిచి చాంపియన్గా అవతరించడం విశేషం. ప్రస్తుత ప్రపంచ నంబర్వన్ యానిక్ సినెర్ మాజీ కోచ్ రికియార్డో పియాటి వద్ద మానస్ శిక్షణ తీసుకుంటున్నాడు. -
జ్యోతి ‘హ్యాట్రిక్’
డెహ్రాడూన్: జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ ఖాతాలో ఐదో స్వర్ణ పతకం చేరింది. ఆదివారం జరిగిన మహిళల అథ్లెటిక్స్ 100 మీటర్ల హర్డిల్స్లో జ్యోతి యర్రాజీ పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. విశాఖపట్నం జిల్లాకు చెందిన జ్యోతి 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ రేసును అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా 13.10 సెకన్లలో ముగించి జాతీయ క్రీడల్లో కొత్త రికార్డును నెలకొల్పింది.జాతీయ క్రీడల్లో జ్యోతికిది వరుసగా మూడో స్వర్ణ పతకం కావడం విశేషం. ఇటీవల దక్షిణ మధ్య రైల్వేలో జూనియర్ క్లర్క్గా చేరిన జ్యోతి 2022 గుజరాత్, 2023 గోవా జాతీయ క్రీడల్లోనూ పసిడి పతకాలు సాధించింది. మరోవైపు 10 క్రీడాంశాల సమాహారమైన డెకాథ్లాన్ ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన రోహిత్ రోమన్ (6753 పాయింట్లు) కాంస్య పతకాన్ని సాధించాడు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ 12 పతకాలతో (5 స్వర్ణాలు, 1 రజతం, 6 కాంస్యాలు) 18వ స్థానంలో ఉంది.తెలంగాణకు రెండు కాంస్యాలు జాతీయ క్రీడల్లో ఆదివారం తెలంగాణకు రెండు కాంస్య పతకాలు లభించాయి. అథ్లెటిక్స్ మహిళల 4్ఠ100 మీటర్ల రిలేలో నిత్య, మైథిలి ఆకుమడుపుల, మాలోత్ సింధు, అగసార నందినిలతో కూడిన తెలంగాణ జట్టు (47.58 సెకన్లు) కాంస్య పతకాన్ని సాధించింది. మహిళల నెట్బాల్లో తెలంగాణ జట్టు సెమీఫైనల్లో 43ృ48 పాయింట్ల తేడాతో హరియాణా చేతిలో ఓడిపోయి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం తెలంగాణ 9 పతకాలతో (1 స్వర్ణం, 2 రజతాలు, 6 కాంస్యాలు) 29వ స్థానంలో ఉంది. -
ఫ్రీ స్టయిల్ చెస్ నాకౌట్కు గుకేశ్
హంబర్గ్ (జర్మనీ): భారత యువ గ్రాండ్మాస్టర్, ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్ ఫ్రీస్టయిల్ గ్రాండ్స్లామ్ చెస్ టూర్లో నాకౌట్కు అర్హత సాధించాడు. శనివారం క్వాలిఫయర్స్ చివరి మ్యాచ్లో స్టార్ ప్లేయర్ మాగ్నస్ కార్ల్సన్ చేతిలో ఓటమి పాలైనప్పటికీ గుకేశ్ ముందంజ వేశాడు. ఈ టోర్నీ మొత్తంలో 9 మ్యాచ్లు ఆడిన గుకేశ్ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయాడు. ఒక్క మ్యాచ్లోనూ విజయం సాధించని భారత గ్రాండ్మాస్టర్... ఏడు మ్యాచ్లను ‘డ్రా’ చేసుకొని... మరో రెండు మ్యాచ్ల్లో ఓటమి పాలయ్యాడు. ఫలితంగా గుకేశ్ ఖాతాలో 3.5 పాయింట్లు చేరాయి. పది మంది ప్లేయర్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో ఎనిమిదో స్థానంలో నిలవడం ద్వారా గుకేశ్ నాకౌట్లో అడుగుపెట్టాడు. క్వాలిఫయింగ్ దశ ముగిసే సరికి ఫ్రాన్స్ గ్రాండ్మాస్టర్ అలిరెజా ఫిరౌజా, ఉజ్బేకిస్తాన్కు చెందిన జవోకిర్ సిందరోవ్ చెరో 6.5 పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో నిలిచారు. అమెరికా గ్రాండ్మాస్టర్ ఫాబియానో కరున (6 పాయింట్లు) మూడో స్థానం దక్కించుకోగా... మాగ్నస్ కార్ల్సన్ (నార్వే), హికారు నకమురా (అమెరికా) చెరో 5.5 పాయింట్లతో వరుసగా నాలుగో, ఐదో స్థానాల్లో నిలిచారు. జర్మనీకి చెందిన విన్సెంట్ కైమెర్ 4 పాయింట్లతో ఆరో ‘ప్లేస్’ దక్కించుకున్నాడు. ఉజ్బేకిస్తాన్కు చెందిన నొదిర్బెక్ అబ్దుసత్తోరోవ్, గుకేశ్ చెరో 3.5 పాయింట్లతో వరుసగా ఏడు, ఎనిమిదో స్థానాల్లో నిలిచారు. -
చెన్నై ఏటీపీ టోర్నీ రన్నరప్గా సాకేత్ జోడీ
చెన్నై: ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ ప్లేయర్, భారత డేవిస్ కప్ జట్టు మాజీ సభ్యుడు సాకేత్ మైనేని ఈ సీజన్లో చెన్నై ఓపెన్ ఏటీపీ చాలెంజర్–100 టోర్నీలో డబుల్స్ టైటిల్ నిలబెట్టుకోలేకపోయాడు. భారత సహచరుడు రామ్కుమార్ రామనాథన్తో కలిసి బరిలోకి దిగిన సాకేత్ చివరకు రన్నరప్తో సరిపెట్టుకున్నాడు. శనివారం జరిగిన తుదిపోరులో సాకేత్ – రామ్కుమార్ జోడి 4–6, 4–6తో షింటారో మొచిజుకి–కైటో వుసుగి (జపాన్) జంట చేతిలో పరాజయం చవిచూసింది. జపాన్ జోడీ మ్యాచ్ ఆరంభం నుంచే భారత ఆటగాళ్లపై పైచేయి సాధించింది. దీంతో తొలి సెట్ గెలిచేందుకు ఎంతోసేపు పట్టలేదు. తర్వాత రెండో సెట్లోనూ భారత జంట పుంజుకోలేకపోయింది. ఇదే అదనుగా షింటారో–కైటోలు చక్కని సమన్వయంతో వరుసగా రెండో సెట్తో పాటు టైటిల్ను గెలుచుకుంది. గతేడాది ఇక్కడ భారత ద్వయం టైటిల్ సాధించింది. ఈ సారీ టైటిల్ వేటలో నిలిచినా... చివరి మెట్టుపై చతికిలబడింది. సాకేత్–రామ్ కుమార్ జోడీ తదుపరి ఈ నెల 17 నుంచి పుణేలో జరిగే ఏటీపీ చాలెంజర్ టోర్నమెంట్ బరిలోకి దిగుతుంది. -
మాయ పోరాటం ముగిసె...
ముంబై: భారత టీనేజ్ టెన్నిస్ స్టార్ మాయ రాజేశ్వరన్ రేవతి సంచలన ప్రదర్శన సెమీ ఫైనల్లో ముగిసింది. ముంబై ఓపెన్ డబ్ల్యూటీఏ–125 టోర్నీలో వైల్డ్కార్డ్ ఎంట్రీతో బరిలోకి దిగిన ఆమె అద్భుత ప్రదర్శనతో పలువురు అంతర్జాతీయ క్రీడాకారిణులను కంగుతినిపించి ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. కానీ ఆమె జోరుకు సెమీస్లో చుక్కెదురైంది. శనివారం జరిగిన ఈ మ్యాచ్లో 15 ఏళ్ల భారత ప్లేయర్ 3–6, 1–6తో స్విట్జర్లాండ్కు చెందిన ప్రపంచ 117వ ర్యాంకర్ జిల్ టెచ్మన్ చేతిలో పరాజయం చవిచూసింది. మొత్తానికి బరిలోకి దిగిన తొలి సీనియర్ స్థాయి టోరీ్నలో మాయ చేసిన పోరాటం అందర్ని ఆకట్టుకుంది. రెండో సెమీస్లో ఎనిమిదో సీడ్ మనంచయ సవంగ్కావ్ (థాయ్లాండ్) 6–2, 6–2తో రెండో సీడ్ రెబెక్కా మరినో (కెనడా)పై గెలిచి ఫైనల్ చేరింది. టెచ్మన్, రెబెక్కాల మధ్య నేడు టైటిల్ పోరు జరుగనుంది. డబుల్స్లో డచ్ ప్లేయర్ అరియనె హర్తొనొతో కలిసి బరిలోకి దిగిన భారత స్టార్ ప్రార్థన తోంబరే తుదిపోరుకు అర్హత సాధించింది. -
తైక్వాండోలో హర్షప్రదకు రజతం... వరుణ్కు కాంస్యం
డెహ్రాడూన్: 38వ జాతీయ క్రీడల్లో శుక్రవారం తెలంగాణ ఖాతాలో ఒక పతకం... ఆంధ్రప్రదేశ్ ఖాతాలో ఒక పతకం చేరాయి. మహిళల తైక్వాండో (క్యోరుగీ) అండర్–73 కేటగిరీలో తెలంగాణకు చెందిన పాయం హర్షప్రద రజత పతకం సొంతం చేసుకుంది. ఫైనల్లో హర్షప్రద 0–2 తేడాతో ఇతిషా దాస్ (చండీగఢ్) చేతిలో పరాజయం పాలైంది.ప్రస్తుతం తెలంగాణ ఆరు పతకాలతో (1 స్వర్ణం, 1 రజతం, 4 కాంస్యాలు) 28వ స్థానంలో ఉంది. మరోవైపు పురుషుల తైక్వాండో అండర్–68 కేటగిరీలో ఆంధ్రప్రదేశ్కు చెందిన టి.వరుణ్ కాంస్య పతకం గెలిచాడు. సెమీఫైనల్లో వరుణ్ 0–2తో మహేంద్ర పరిహార్ (ఉత్తరాఖండ్) చేతిలో ఓడిపోయాడు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ 10 పతకాలతో (4 స్వర్ణాలు, 1 రజతం, 5 కాంస్యాలు) 18వ స్థానంలో ఉంది. మరిన్ని క్రీడా వార్తలుసెమీస్లో మాయ ముంబై: తన సంచలన ప్రదర్శన కొనసాగిస్తూ భారత టీనేజ్ టెన్నిస్ స్టార్ మాయ రాజేశ్వరన్ రేవతి ముంబై ఓపెన్ డబ్ల్యూటీఏ–125 టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో 15 ఏళ్ల మాయ 6–4, 3–6, 6–2తో ప్రపంచ 285వ ర్యాంకర్ మి యామగుచి (జపాన్)పై గెలిచింది. రెండు గంటలపాటు సాగిన ఈ మ్యాచ్లో మాయ ఐదు ఏస్లు సంధించి, ప్రత్యర్థి సర్వీస్ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. స్పెయిన్లోని రాఫెల్ నాదల్ అకాడమీలో శిక్షణ పొందుతున్న మాయ నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ 117వ ర్యాంకర్ జిల్ టెచ్మన్ (స్విట్జర్లాండ్)తో తలపడుతుంది.భారత మూడో ర్యాంకర్, తెలంగాణకు చెందిన భమిడిపాటి శ్రీవల్లి రష్మిక పోరాటం ఈ టోరీ్నలో ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో రష్మిక 2–6, 2–6తో జిల్ టెచ్మన్ చేతిలో ఓడిపోయింది. క్వార్టర్ ఫైనల్లో ఓటమి పాలైన రష్మికకు 3,450 డాలర్ల (రూ. 3 లక్షలు) ప్రైజ్మనీతోపాటు 27 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. రాజస్తాన్ రాయల్స్ స్పిన్ బౌలింగ్ కోచ్గా బహుతులేజైపూర్: భారత మాజీ లెగ్స్పిన్నర్ సాయిరాజ్ బహుతులే ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ జట్టుతో మరోసారి జత కట్టనున్నాడు. టీమ్ స్పిన్ బౌలింగ్ కోచ్గా బహుతులేను మేనేజ్మెంట్ ఎంపిక చేసింది. ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) కోచ్లలో ఒకడిగా ఉన్న బహుతులే 2018–21 మధ్య కాలంలో కూడా రాజస్తాన్ రాయల్స్ సహాయక సిబ్బందిలో భాగంగా ఉన్నాడు.టీమ్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, బౌలింగ్ కోచ్ షేన్ బాండ్లతో కలిసి అతను పని చేస్తాడు. భారత జట్టు హెడ్ కోచ్గా ద్రవిడ్ ఉన్న సమయంలో రెండు వేర్వేరు సిరీస్లలో బహుతులే కోచింగ్ బృందంలో ఉన్నాడు. బహుతులే భారత్ తరఫున 2 టెస్టులు, 8 వన్డేలు ఆడి 5 వికెట్లు తీశాడు. -
చెప్పినా వినలేదు.. పాకిస్తాన్కు భారీ షాక్!
అంతర్జాతీయ ఫుట్బాల్ సంఘాల సమాఖ్య (FIFA) పాకిస్తాన్ ఫుట్బాల్ సమాఖ్యపై సస్పెన్షన్ వేటు వేసింది. ‘ఫిఫా’ నియమావళికి అనుగుణంగా పాక్ ఫుట్బాల్ సమాఖ్య (PSF) నిర్వహణ జరగకపోవడంతో ‘ఫిఫా’ శుక్రవారం ఆ దేశ సమాఖ్యపై నిషేధం విధించింది. ‘ఫిఫా’ నియమావళి ప్రకారం నడుచుకునేలా పీఎఫ్ఎఫ్ నిబంధనల్ని సవరించుకోవాలని.. తద్వారా దేశంలో ఆటపై జవాబుదారీతనం పెరగాలని ‘ఫిఫా’ పలు సూచనల్ని చేసినా... పీఎఫ్ఎఫ్ పెడచెవిన పెట్టింది. నిషేధాజ్ఞలుంటాయని హెచ్చరించినా సవరణలు చేయకపోవడంతో ‘ఫిఫా’ తాజాగా సమాఖ్యను సస్పెండ్ చేసింది.అదే విధంగా తాము సూచించిన సవరణలు పూర్తి చేసేదాకా నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. 2019 జూన్లో ‘ఫిఫా’ నియమించిన కమిటీనే పీఎఫ్ఎఫ్ వ్యవహారాలను చక్కబెడుతోంది. కానీ హరూన్ మాలిక్ నేతృత్వంలోని ఈ కమిటీని అక్కడి ప్రభుత్వం శాసించడంతో ఎన్నికల నిర్వహణ, నిబంధనల్లో సవరణల ప్రక్రియ మాత్రం చేపట్టలేకపోయింది.ఈ నేపథ్యంలో హరూన్ తమపై వేటు తప్పదని ఇటీవల పార్లమెంటరీ ప్యానెల్ దృష్టికి తెచ్చినా అక్కడి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. ‘ఫిఫా’ నియమావళికి తగ్గ మార్పుచేర్పులకు పాక్ ప్రభుత్వ ఆజమాయిషీలోని సమాఖ్య సిద్ధంగా లేదని హరూన్ మాలిక్ ఇటీవల వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ‘ఫిఫా’ కఠిన చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. 2017 నుంచి పాక్ సమాఖ్యపై వేటు పడటం ఇది మూడోసారి! మరిన్ని క్రీడావార్తలు40 ఏళ్ల వయసులో 40 పాయింట్లు!.. లెబ్రాన్ జేమ్స్ కొత్త రికార్డు లాస్ఏంజెలిస్: అమెరికా బాస్కెట్బాల్ దిగ్గజం లెబ్రాన్ జేమ్స్ ప్రతిష్టాత్మక నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ) లీగ్లో అరుదైన ఘనతను నమోదు చేశాడు. ఒక ఎన్బీఏ గేమ్లో 40కి పైగా పాయింట్లు సాధించిన అతి పెద్ద వయస్కుడిగా అతను నిలిచాడు. గురువారం లెబ్రాన్ గోల్డెన్ స్టేట్ వారియర్స్తో జరిగిన మ్యాచ్లో 120–112 పాయింట్ల తేడాతో లాస్ఏంజెలిస్ లేకర్స్ విజయం సాధించింది. ఇందులో లెబ్రాన్ ఒక్కడే 42 పాయింట్లు సాధించాడు. గత ఏడాది డిసెంబర్ 30న లెబ్రాన్ 40 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. గతంలో ఆల్టైమ్ గ్రేట్ మైకేల్ జోర్డాన్ 40 ఏళ్ల 3 రోజుల వయసులో (2003లో వాషింగ్టన్ విజార్డ్స్ తరఫున) ఒక గేమ్లో 40కి పైగా పాయింట్లు నమోదు చేశాడు. ఈ రికార్డును ఇప్పుడు లెబ్రాన్ సవరించాడు.పోరాడి ఓడిన రిత్విక్ జోడీ సాక్షి, హైదరాబాద్: డాలస్ ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ పేయర్ బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. అమెరికాలోని టెక్సస్లో జరుగుతున్న ఈ టోర్నీ పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో రిత్విక్ (భారత్)–నికోలస్ బారింటోస్ (కొలంబియా) ద్వయం 6–7 (4/7), 7–5, 6–10తో ‘సూపర్ టైబ్రేక్’లో రాజీవ్ రామ్–ఆస్టిన్ క్రాయిసెక్ (అమెరికా) జంట చేతిలో ఓడిపోయింది.1 గంట 57 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్లో రిత్విక్–బారింటోస్ మూడు ఏస్లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్లు చేశారు. తమ సర్వీస్ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను రెండుసార్లు బ్రేక్ చేశారు. అయితే నిర్ణాయక సూపర్ టైబ్రేక్లో అనుభవజ్ఞులైన రాజీవ్ రామ్, క్రాయిసెక్ పైచేయి సాధించి విజయాన్ని ఖరారు చేసుకున్నారు. రిత్విక్–బారింటోస్లకు 11,840 డాలర్ల (రూ. 10 లక్షల 38 వేలు) ప్రైజ్మనీ లభించింది. గత ఏడాది అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్ సర్క్యూట్లో నిలకడగా రాణించిన రిత్విక్ ... గత వారం భారత్–టోగో జట్ల మధ్య న్యూఢిల్లీలో జరిగిన వరల్డ్ గ్రూప్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ మ్యాచ్ ద్వారా డేవిస్ కప్లో అరగేంట్రం చేశాడు. -
ఫైనల్లో సాకేత్–రామ్ జోడీ
చెన్నై: కొత్త ఏడాదిలో ఆడుతున్న మూడో టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ ప్లేయర్, భారత డేవిస్కప్ జట్టు మాజీ సభ్యుడు సాకేత్ మైనేని(Saket Myneni) టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. భారత్కే చెందిన రామ్కుమార్ రామనాథన్తో జత కట్టిన సాకేత్ చెన్నై ఓపెన్ ఏటీపీ చాలెంజర్–100 టోర్నీలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి సెమీఫైనల్లో మూడో సీడ్, డిఫెండింగ్ చాంపియన్ సాకేత్–రామ్కుమార్ (భారత్) ద్వయం 7–6 (7/5), 7–6 (10/8)తో టాప్ సీడ్ రే హో (చైనీస్ తైపీ)–మాథ్యూ క్రిస్టోఫర్ రోమియోస్ (ఆ్రస్టేలియా) జోడీపై సంచలన విజయం సాధించింది. 98 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సాకేత్–రామ్ ఐదు ఏస్లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్లు చేశారు. రెండు జోడీలు తమ సర్వీస్లను రెండేసి సార్లు కోల్పోయాయి. అయితే టైబ్రేక్లో మాత్రం సాకేత్–రామ్ ద్వయం పైచేయి సాధించి విజయాన్ని ఖరారు చేసుకుంది. నేడు జరిగే ఫైనల్లో షింటారో మొచిజుకి–కైటో యుసుగి (జపాన్) జోడీతో సాకేత్–రామ్ ద్వయం తలపడుతుంది. రెండో సెమీఫైనల్లో మొచిజుకి–యుసుగి జంట 4–6, 6–4, 10–6తో ‘సూపర్ టైబ్రేక్’లో రెండో సీడ్ జీవన్ నెడుంజెళియన్–విజయ్ సుందర్ ప్రశాంత్ (భారత్) జోడీపై గెలిచింది. -
ఒడిశాపై గోవా గెలుపు
గోవా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నమెంట్లో గోవా ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) 2–1 స్కోరుతో ఒడిశా జట్టుపై విజయం సాధించింది. జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో గురువారం జరిగిన మ్యాచ్లో గోవా తరఫున బ్రిసన్ డ్యూబెన్ ఫెర్నాండెజ్ 29వ నిమిషంలో గోల్ సాధించి గోవాకు తొలి ఆధిక్యం ఇచ్చాడు. ఒడిశా ఆటగాడు లాల్తతంగ ఖవిహ్రింగ్ (47వ నిమిషంలో) చేసిన సెల్ఫ్ గోల్ గోవా ఆధిక్యాన్ని రెట్టింపు చేసింది. 54వ నిమిషంలో ఒడిశా స్ట్రయికర్ కేపీ రాహుల్ గోల్ చేసినప్పటికీ గోవా విజయాన్ని మాత్రం అడ్డుకోలేకపోయాడు. నిజానికి ఈ మ్యాచ్లో ఒడిశా తమ దాడులకు పదునుపెట్టలేకపోయింది. అవతలివైపు నుంచి గోవా ఎఫ్సీ ఆటగాళ్లు మాత్రం పదేపదే ప్రత్యర్థి గోల్పోస్ట్వైపు దూసుకొచ్చి ఏకంగా 20 షాట్లు కొట్టారు. లక్ష్యంపై ఆరుసార్లు గురిపెట్టగా ఒకసారి గోల్తో విజయవంతమైంది. ఒడిశా 15 షాట్లు ఆడినా... కేవలం ప్రత్యర్థి గోల్పోస్ట్పై రెండే సార్లు దాడి చేసింది. ఇందులో ఒకసారి మాత్రం ఫలితాన్ని సాధించింది. గోవా ఆటగాళ్లు మైదానంలో పాదరసంలా కదిలారు. బంతిని ప్రత్యర్థులకంటే తమ ఆధీనంలో ఉంచుకునేందుకు అదేపనిగా చకచకా పాస్లు చేశారు. శుక్రవారం షిల్లాంగ్లో జరిగే పోరులో నార్త్ఈస్ట్ యునైటెడ్ ఎఫ్సీ జట్టుతో ముంబై సిటీ ఎఫ్సీ తలపడుతుంది. -
15 పాయింట్లతో మూడు గేమ్లు!
న్యూఢిల్లీ: గత కొంతకాలంగా మెరుపు వేగంలో ముగిసే ఆటలపై పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా బ్యాడ్మింటన్ కూడా అటువైపే పయనించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్ ) 21 పాయింట్లతో మూడు గేముల (బెస్టాఫ్ త్రీ) స్కోరింగ్ విధానాన్ని అమలు చేస్తోంది. ఆయా దేశాల్లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లోనూ ఇదే స్కోరింగ్తో టోర్నీలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఆట మరింత రసవత్తరంగా జరిగేందుకు, మ్యాచ్ చకచకా ముగిసిపోయేందుకు కొత్త స్కోరింగ్ విధానం అమలు చేసేందుకు బీడబ్ల్యూఎఫ్ సిద్ధమైంది. ఇప్పుడున్న మూడు గేమ్లను 15 పాయింట్లతో ముగించి ఆటలో వేగం పెంచనుంది. తద్వారా కొత్తతరం ప్రేక్షకుల్ని ఆకర్శించాలని, సుదీర్ఘంగా సాగదీయకుండా, నిమిషాల్లో మ్యాచ్ ఫలితం వచ్చేలా కొత్త స్కోరింగ్ విధానాన్ని ఈ ఏప్రిల్ నుంచే అమలు చేయాలని బీడబ్ల్యూఎఫ్ కౌన్సిల్ నిర్ణయించింది. నవంబర్లో కౌలాలంపూర్లో జరిగే బీడబ్ల్యూఎఫ్ అత్యున్నత సమావేశానికి ముందు ఆరు నెలల పాటు ఈ స్కోరింగ్ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేశాక... ఆ సమావేశంలో సమీక్షించి తుది నిర్ణయాన్ని తీసుకుంటారు. ‘కాంటినెంటల్ చాంపియన్షిప్లు, గ్రేడ్–3 టోర్నమెంట్లు, జాతీయ, అంతర్జాతీయ లీగ్లు, జాతీయ టోర్నీల్లో ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఈ కొత్త స్కోరింగ్ పద్ధతిని అవలంభిస్తారు’ అని బీడబ్ల్యూఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త విధానం వల్ల మ్యాచ్ల్లో పోటీ మరింత పెరుగుతుందని, ప్రతీ పాయింట్ కోసం ప్రత్యర్థులు దీటుగా సన్నద్ధమై బరిలోకి దిగుతారని, మ్యాచ్ త్వరగా ముగియడం కాదు... పోటాపోటీగా జరగడం ఖాయమని బీడబ్ల్యూఎఫ్ వివరణ ఇచ్చింది. నిజానికి 15 పాయింట్ల ‘బెస్టాఫ్ త్రీ’ గేమ్లు కొత్తేం కాదు. అంతర్జాతీయ బ్యాడ్మింటన్లో గతంలో ఏళ్ల తరబడి ఈ స్కోరింగ్ పద్ధతిలో మ్యాచ్లు జరిగాయి. తర్వాత 7 పాయింట్లతో ‘బెస్టాఫ్ ఫైవ్’ పద్ధతిలోనూ కొన్నాళ్లు జరిగాయి. క్రమానుగతంగా మారుతుండగా 2014లో తొలిసారి 11 పాయింట్లతో ‘బెస్టాఫ్ ఫైవ్’ స్కోరింగ్ పద్ధతి తెరపైకి వచ్చింది. కానీ బీడబ్ల్యూఎఫ్లోని సభ్యదేశాలు సమ్మతించకపోవడంతో ఆ ఏడాది, తర్వాత 2021లో బీడబ్ల్యూఎఫ్ కౌన్సిల్లో కనీస మద్దతు లభించక మరోసారి ఇలా రెండుసార్లూ ప్రతిపాదన దశలోనే ఆ స్కోరింగ్ (11 పాయింట్ల బెస్టాఫ్ ఫైవ్) పద్ధతిని ఉపసంహరించుకున్నారు. దీంతో 2006 నుంచి స్థిరంగా ప్రస్తుత 21 పాయింట్ల స్కోరింగే కొనసాగుతోంది. -
‘కామన్వెల్త్’లో స్విమ్మింగ్, సైక్లింగ్లకు పెద్దపీట
గ్లాస్గో: వచ్చే ఏడాది జరిగే కామన్వెల్త్ గేమ్స్లో క్రీడల్ని కుదించినప్పటికీ కొన్ని క్రీడలకు పెద్దపీట వేశారు. ముఖ్యంగా సైక్లింగ్, స్విమ్మింగ్, పారా పోటీల్లో గణనీయంగా పతకాల ఈవెంట్లు పెంచారు. దీంతో వచ్చే ఏడాది గ్లాస్గో ఆతిథ్యమివ్వబోయే ఈ కామన్వెల్త్ మెగా ఈవెంట్లో 200కు పైగా బంగారు పతకాలు అథ్లెట్ల పరం కానున్నాయి. దాదాపు 60 ఏళ్ల తర్వాత మిక్స్డ్ 4–400 మీటర్ల రిలే విభాగాన్ని తిరిగి ఈ కామన్వెల్త్లో చేర్చారు. చివరిసారిగా 1966లో మిక్స్డ్ రిలే విభాగం పోటీలు నిర్వహించాక తదనంతరం క్రీడల్లో ఆ ఈవెంట్కు మంగళం పాడారు. దీనిపై ప్రపంచ అథ్లెటిక్స్ అధ్యక్షుడు సెబాస్టియన్ కో హర్షం వ్యక్తం చేశారు. 1930 నుంచి 1966 వరకు కామన్వెల్త్లో అలరించిన మిక్స్డ్ రిలే ఈవెంట్ మళ్లీ ఆరు దశాబ్దాల తర్వాత గ్లాస్గోలో పతకాల కోసం పరుగుపెట్టబోతోంది’ అని అన్నారు. పారా అథ్లెటిక్స్లోని 10 ఈవెంట్లలో ఏకంగా ఆరు క్రీడాంశాలకు గేమ్స్ ఆర్గనైజింగ్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రికార్డుస్థాయిలో 47 పతకాలు పారా అథ్లెట్లు అందుకోనున్నారు. సైక్లింగ్లో 26 పతకాల ఈవెంట్లు (పారా సైక్లింగ్ కలిపి), స్విమ్మింగ్, పారా స్విమ్మింగ్లలో 56 పతకాలు ఈతకొలనులో కొల్లగొట్టనున్నారు. ఈ సారి కొత్తంగా 800 మీటర్ల ఫ్రీస్టయిల్, 1500 మీటర్ల మహిళల ఫ్రీస్టయిల్ రేసుల్ని చేర్చారు. 2026లో జూలై 23 నుంచి ఆగస్టు 2 వరకు 11 రోజుల పాటు గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ జరుగనున్నాయి. పది క్రీడాంశాలు జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్, పారా అథ్లెటిక్స్, బాస్కెట్బాల్, వీల్చైర్ బాస్కెట్బాల్, బాక్సింగ్, స్విమ్మింగ్, పారా స్విమ్మింగ్ , బౌల్స్, పారా బౌల్స్ (ఇండోర్), జూడో, నెట్బాల్, ట్రాక్ సైక్లింగ్, పారా సైక్లింగ్, వెయిట్లిఫ్టింగ్, పారా పవర్లిఫ్టింగ్లో పోటీలుంటాయి. కామన్వెల్త్ ఎరెనా, సర్ క్రిస్ హో వెలొడ్రోమ్, స్కాటిష్ ఎగ్జిబిషన్ సెంటర్ (ఎస్ఈసీ), స్కాట్స్టౌన్ స్టేడియం, టోల్క్రాస్ ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ సెంటర్ వేదికల్లో పది రోజుల పాటు పోటీలు జరుగుతాయి. తొలి రోజు కేవలం ఆరంభ వేడుకలు నిర్వహిస్తారు. -
స్వప్నిల్కు కాంస్యం
డెహ్రాడూన్: జాతీయ క్రీడల్లో ఒలింపిక్ పతక విజేత స్వప్నిల్ కుసాలె కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు. షూటింగ్ పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రి పొజిషన్ విభాగంలో మహారాష్ట్ర షూటర్ స్వప్నిల్ మూడో స్థానంలో నిలిచాడు. ఈ విభాగంలో సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు (ఎస్ఎస్సీబీ) తరఫున బరిలోకి దిగిన 25 ఏళ్ల నీరజ్ కుమార్ 464.1 పాయింట్లతో స్వర్ణం చేజిక్కించుకున్నాడు. మధ్యప్రదేశ్కు చెందిన ఐశ్వరి ప్రతాప్ సింగ్ (462.4 పాయింట్లు) రజత పతకం దక్కించుకోగా... పారిస్ ఒలింపిక్స్ కాంస్యం నెగ్గి ఈ విభాగంలో దేశానికి తొలి పతకం అందించిన స్వప్నిల్ (447.7 పాయింట్లు) కాంస్యం గెలుచుకున్నాడు. మరోవైపు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో సురుచి సింగ్–ప్రమోద్ (హరియాణా) 17–7 పాయింట్ల తేడాతో అంజలి షెఖావత్–ఉమేశ్ చౌదరీ (రాజస్తాన్)పై గెలిచి పసిడి ఖాతాలో వేసుకుంది. రాహి సర్ణోబత్–ప్రణవ్ అరవింద్ పాటిల్ (మహారాష్ట్ర) జట్టు కాంస్యం గెలుచుకుంది. సుదీర్ఘ కాలంగా భారత టాప్ ఆర్చర్గా ఉన్న దీపిక కుమారి పసిడిని అందుకుంది. పారిస్ ఒలింపిక్స్లో పతకం సాధించడంలో విఫలమైన దీపిక నేషనల్ గేమ్స్లో జార్ఖండ్ తరఫున బరిలోకి దిగి వ్యక్తిగత విభాగంతో పాటు టీమ్ ఈవెంట్లోనూ స్వర్ణం కైవసం చేసుకుంది. పురుషుల విభాగంలో నాలుగుసార్లు ఒలింపిక్స్లో పాల్గొన్న సీనియర్ ఆర్చర్ తరుణ్దీప్ రాయ్ను ఓడించిన 18 ఏళ్ల బెంగాల్ ఆర్చర్ జుయెల్ సర్కార్ జాతీయ చాంపియన్గా అవతరించాడు. మరో వైపు బాక్సింగ్లో లవ్లీనా బోర్గొహైన్, ఆరు సార్లు ఆసియా చాంపియన్ శివ థాపా విజయాలు సాధించారు. మహిళల 75 కేజీల విభాగంలో లవ్లీనా తిరుగులేని ప్రదర్శన కనబర్చగా... పురుషుల 64 కేజీల విభాగంలో శివ థాపా (అసోం) సత్తాచాటాడు. -
ఫెరారీ రిజర్వ్ డ్రైవర్గా జో గ్వాన్యు
ఫార్ములావన్లో బరిలోకి దిగిన తొలి చైనా డ్రైవర్గా గుర్తింపు పొందిన జో గ్వాన్యు తన కెరీర్లో గొప్ప పురోగతి సాధించాడు. 2025 సీజన్కుగాను విఖ్యాత ఫెరారీ జట్టులో రిజర్వ్ డ్రైవర్గా స్థానం దక్కించుకున్నాడు. రెండో రిజర్వ్ డ్రైవర్గా ఆంటోనియో జియోవినాజి కొనసాగుతాడు. ఈ సీజన్లో ఫెరారీ జట్టుకు రెగ్యులర్ డ్రైవర్లయిన లూయిస్ హామిల్టన్, చార్లెస్ లెక్లెర్క్లలో ఒకరు ప్రధాన రేసులో బరిలోకి దిగే అవకాశం లేకపోతే వారి స్థానాల్లో జో గ్వాన్యు లేదా జియోవినాజిలకు చాన్స్ లభిస్తుంది. 25 ఏళ్ల జో గ్వాన్యు 2022లో అల్ఫా రోమియో జట్టు తరఫున ఫార్ములావన్లో అరంగేట్రం చేశాడు. 2024లో అల్ఫా రోమియో జట్టు తమ పేరును సాబెర్గా మార్చుకుంది. వరుసగా మూడేళ్లు అల్ఫా రోమియో/సాబెర్ జట్టుకు ప్రధాన డ్రైవర్గా వ్యవహరించిన జో గ్వాన్యు మొత్తం 68 రేసుల్లో పోటీపడ్డాడు. ఓవరాల్గా ఏడుసార్లు టాప్–10లో నిలిచాడు. 2022లో కెనడా గ్రాండ్ప్రిలో, 2024లో ఖతర్ గ్రాండ్ప్రిలో గ్వాన్యు అత్యుత్తంగా ఎనిమిదో స్థానంలో నిలిచాడు. సాకేత్–రామ్ జంట శుభారంభంచెన్నై ఓపెన్ ఏటీపీ చాలెంజర్–100 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేని శుభారంభం చేశాడు. బుధవారం జరిగిన డబుల్స్ తొలి రౌండ్ మ్యాచ్లో సాకేత్–రామ్కుమార్ రామనాథన్ (భారత్) జోడీ 6–3, 6–1తో కిమర్ కాప్జాన్స్ (బెల్జియం)–ఎర్గీ కిర్కిన్ (టర్కీ) ద్వయంపై అలవోకగా గెలిచింది. 53 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో సాకేత్–రామ్ ద్వయం ఎనిమిది ఏస్లు సంధించింది. తమ సరీ్వస్ను ఒక్కసారి కూడా కోల్పోకుండా ప్రత్యర్థి సరీ్వస్ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. భారత్కే చెందిన విజయ్ సుందర్ ప్రశాంత్–జీవన్ నెడుంజెళియన్ జంట 6–3, 3–6, 13–11తో చిరాగ్ దుహాన్–దేవ్ జావియా (భారత్) జోడీపై నెగ్గి క్వార్టర్ ఫైనల్ చేరింది. -
Ranji Trophy QFs: ముంబై- హర్యానా మ్యాచ్ వేదికను మార్చిన బీసీసీఐ
ముంబై: డిఫెండింగ్ చాంపియన్ ముంబై(Mumbai), హరియాణా జట్ల మధ్య ఈనెల 8 నుంచి జరగాల్సిన రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్(Ranji Trophy Quarter Finals) వేదిక మారింది. హరియాణాలోని లాహ్లీలో జరగాల్సిన ఈ మ్యాచ్ను కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్కు మార్చారు. హరియాణాలో చలితీవ్రత అధికంగా ఉండటంతో పాటు... ఉదయం పూట పొగమంచు కప్పేస్తుండటంతో లాహ్లీలో నిర్వహించాల్సిన మ్యాచ్ను కోల్కతాకు మార్చినట్లు బీసీసీఐ నుంచి సమాచారం అందింది’ అని ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) అధ్యక్షుడు అజింక్య నాయక్ బుధవారం పేర్కొన్నారు.కాగా 42 సార్లు రంజీ ట్రోఫీ విజేతగా నిలిచిన ముంబై జట్టు ఈసారి కూడా ఫేవరెట్గా బరిలోకి దిగనుంది. సీనియర్ బ్యాటర్ అజింక్య రహానే(Ajinkya Rahane) సారథ్యం వహిస్తున్న ముంబై జట్టులో భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, పేస్ ఆల్రౌండర్లు శివమ్ దూబే, శార్దుల్ ఠాకూర్ వంటి పలువురు స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. మిగిలిన మూడు క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్లు షెడ్యూల్ ప్రకారమే నిర్వహించనున్నారు. రాజ్కోట్ వేదికగా సౌరాష్ట్ర, గుజరాత్ క్వార్టర్ ఫైనల్... నాగ్పూర్ వేదికగా విదర్భ, తమిళనాడు పోరు... పుణేలో జమ్ముకశ్మీర్, కేరళ మ్యాచ్లు జరగనున్నాయి. మరిన్ని క్రీడా వార్తలుభారత బ్యాడ్మింటన్ జట్టులో జ్ఞాన దత్తు, తన్వీ రెడ్డి న్యూఢిల్లీ: డచ్ ఓపెన్, జర్మనీ ఓపెన్ అండర్–17 జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లలో పాల్గొనే భారత జట్లను ప్రకటించారు. జాతీయ జూనియర్ చాంపియన్, హైదరాబాద్ కుర్రాడు జ్ఞాన దత్తుతోపాటు హైదరాబాద్కే చెందిన మరో ప్లేయర్ తన్వీ రెడ్డి భారత జట్టులోకి ఎంపికయ్యారు. డచ్ ఓపెన్ ఫిబ్రవరి 26 నుంచి మార్చి 2 వరకు... జర్మన్ ఓపెన్ మార్చి 5 నుంచి 9 వరకు జరుగుతాయి.మనుష్–దియా జోడీ ఓటమి న్యూఢిల్లీ: సింగపూర్ స్మాష్ వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) టోర్నమెంట్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో మనుష్ షా–దియా చిటాలె (భారత్) ద్వయం పోరాటం ముగిసింది. బుధవారం సింగపూర్లో జరిగిన మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో మను‹Ù–దియా జోడీ 11–9, 4–11, 8–11, 8–11తో అల్వారో రాబెల్స్–మరియా జియో (స్పెయిన్) జంట చేతిలో ఓడిపోయింది. క్వార్టర్స్లో ఓడిన మనుష్–దియా జోడీకి 2000 డాలర్ల (రూ. 1 లక్ష 74 వేలు) ప్రైజ్మనీతోపాటు 350 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. క్వార్టర్స్లో రియా–రష్మిక జోడీముంబై: ఎల్ అండ్ టి ముంబై ఓపెన్ డబ్ల్యూటీఏ–125 టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక–రియా భాటియా (భారత్) జోడీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్లో రషి్మక–రియా ద్వయం 5–7, 6–2, 10–7తో ‘సూపర్ టైబ్రేక్’లో మియా హొంటామా–క్యోకా ఒకమురా (జపాన్) జంటను ఓడించింది. 89 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో భారత జోడీ రెండు ఏస్లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్లు చేసింది.తమ సర్వీస్ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. రుతుజా భోస్లే (భారత్)–అలీసియా బార్నెట్ (బ్రిటన్); ప్రార్థన తొంబారే (భారత్)–అరీన్ హర్తానో (నెదర్లాండ్స్) జోడీలు కూడా క్వార్టర్ ఫైనల్ చేరుకున్నాయి. నేడు జరిగే సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్లో అలెగ్జాండ్రా క్రునిక్ (సెర్బియా)తో రష్మిక; రెబెకా మరీనో (కెనడా)తో అంకిత రైనా; జరీనా దియాస్ (కజకిస్తాన్)తో మాయ రాజేశ్వరి తలపడతారు. -
హాలెప్ వీడ్కోలు
బుకారెస్ట్ (రొమేనియా): మాజీ ప్రపంచ నంబర్వన్ మహిళా టెన్నిస్ ప్లేయర్ సిమోనా హాలెప్ (రొమేనియా) కెరీర్కు వీడ్కోలు పలికింది. డోపింగ్ సస్పెన్షన్తో పాటు గాయాల కారణంగా చాన్నాళ్లుగా ఇబ్బంది పడుతున్న 33 ఏళ్ల హాలెప్... బుధవారం ప్రొఫెషనల్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించింది. రెండు గ్రాండ్స్లామ్ టైటిల్స్ సాధించిన హాలెప్... టాన్సిల్వేనియా ఓపెన్ తొలి రౌండ్లో పరాజయం ఆనంతరం తన నిర్ణయాన్ని వెల్లడించింది. ‘ఇది సంతోషమో, బాధో అర్థం కావడం లేదు. కానీ ఈ నిర్ణయంతో నా మనసు ప్రశాంతంగా ఉంటుంది అని మాత్రం చెప్పగలను. ప్రొఫెషనల్ టెన్నిస్ ఆడేందుకు నా శరీరం సహకరించదని అనిపిస్తోంది. అందుకే ఆట నుంచి తప్పుకుంటున్నా. ఈ స్థాయికి చేరేందుకు ఎన్నో కష్టాలు పడ్డా. చివరి మ్యాచ్లో మెరుగైన ప్రదర్శన చేయలేకపోయా. అయినా అభిమానుల సమక్షంలో మైదానంలో దిగడాన్ని ఆస్వాదించా’ అని హాలెప్ పేర్కొంది. 2017లో డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో నిలిచిన హాలెప్... ఆ తర్వాత గాయాలు, నిషేధం కారణంగా 870వ ర్యాంక్కు పడిపోయింది. టాన్సిల్వేనియా ఓపెన్లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఆమె బుధవారం జరిగిన మ్యాచ్లో 1–6, 1–6తో లుసియా బ్రాంజెట్టి (రొమేనియా) చేతిలో ఓడింది. మోకాలు, భుజం గాయాలతో ఇబ్బంది పడుతున్న హాలెప్ ఇటీవల ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీ క్వాలిఫయింగ్ టోర్నీ నుంచి కూడా తప్పుకుంది. 2018 ఫ్రెంచ్ ఓపెన్, 2019 వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టైటిల్స్ నెగ్గిన హాలెప్ మరో మూడు గ్రాండ్స్లామ్ (2014, 2017 ఫ్రెంచ్ ఓపెన్, 2018 ఆస్ట్రేలియా ఓపెన్) టోర్నీల్లో రన్నరప్గా నిలిచింది. 2022 యూఎస్ ఓపెన్ తొలి రౌండ్ పరాజయం అనంతరం డోపింగ్ కారణంగా హాలెప్ ప్రొఫెషనల్ కెరీర్కు దూరమైంది. దీంతో ఆమె మీద నాలుగు సంవత్సరాల నిషేధం పడింది. దీనిపై హాలెప్ కోర్ట్ ఆఫ్ అర్బిట్రేషన్ స్పోర్ట్లో అప్పీల్ చేసుకోగా... నిషేధాన్ని 9 నెలలకు తగ్గించారు. అయితే గాయాల బెడద ఎక్కువవడంతో తిరిగి కోర్టులో పూర్వ వైభవం సాధించలేకపోయింది. కెరీర్ విశేషాలు 24 మొత్తం గెలిచిన సింగిల్స్ టైటిల్స్ 2 సాధించిన గ్రాండ్స్లామ్ టైటిల్స్ (2018 ఫ్రెంచ్ ఓపెన్; 2019 వింబుల్డన్) 580 కెరీర్లో గెలిచిన మ్యాచ్లు 243 కెరీర్లో ఓడిన మ్యాచ్లు 1 అత్యుత్తమ ర్యాంక్ (అక్టోబర్ 9, 2017) 64 ప్రపంచ నంబర్వన్గా ఉన్న వారాలు గ్రాండ్స్లామ్ టోర్నీలలో గెలుపోటములు (112/44) » ఆ్రస్టేలియన్ ఓపెన్ (12 సార్లు): 31/12 » ఫ్రెంచ్ ఓపెన్ (11 సార్లు): 32/11 » వింబుల్డన్ (10 సార్లు): 29/9 » యూఎస్ ఓపెన్ (12 సార్లు): 20/12 సంపాదించిన మొత్తం ప్రైజ్మనీ 4,02,32,663 డాలర్లు (రూ. 351 కోట్లు) -
ఆంధ్రప్రదేశ్కు మూడో స్వర్ణం
డెహ్రాడూన్: జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ ఖాతాలో మూడో స్వర్ణ పతకం చేరింది. బుధవారం మహిళల కనోయ్ స్లాలోమ్ కే–1 విభాగంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన నాగిడి గాయత్రి పసిడి పతకం సాధించింది. అంతకుముందు వెయిట్లిఫ్టింగ్లో నీలంరాజు, పల్లవి బంగారు పతకాలు గెలిచిన సంగతి తెలిసిందే. బుధవారమే ఆర్చరీలో ఆంధ్రప్రదేశ్కు ఒక రజతం, ఒక కాంస్యం లభించాయి. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో తిరుమూరు గణేశ్ మణిరత్నం–మాదాల సూర్య హంసిని జోడీ రజత పతకం గెలిచింది. ఫైనల్లో గణేశ్–సూర్య హంసిని ద్వయం 148–154 పాయింట్ల తేడాతో రిషభ్ యాదవ్–దీప్షిక (హరియాణా) జంట చేతిలో ఓడింది. కాంపౌండ్ పురుషుల వ్యక్తిగత విభాగంలో తిరుమూరు గణేశ్ మణిరత్నం కాంస్య పతకం సంపాదించాడు. తెలంగాణకు కాంస్యం మరోవైపు తెలంగాణ ఖాతాలో బుధవారం ఒక కాంస్య పతకం చేరింది. మహిళల ఆర్చరీ కాంపౌండ్ టీమ్ విభాగంలో చికిత, మానస నయన, శ్రేష్ణ రెడ్డి, మన్సూరా హసీబాలతో కూడిన తెలంగాణ జట్టు కాంస్య పతకాన్ని దక్కించుకుంది. తెలంగాణ జట్టు 232 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచింది. బుధవారం పోటీలు ముగిశాక ఆంధ్రప్రదేశ్ 3 స్వర్ణాలు, 1 రజతం, 4 కాంస్యాలతో కలిపి 8 పతకాలతో 18వ స్థానంలో... తెలంగాణ 1 స్వర్ణం, 3 కాంస్యాలతో కలిపి 4 పతకాలతో 25వ స్థానంలో ఉన్నాయి. -
స్విమ్మర్లు ధినిధి, శ్రీహరి నటరాజ్లకు చెరో తొమ్మిది పసిడి పతకాలు
జాతీయ క్రీడల్లో కర్ణాటక స్విమ్మర్లు ధినిధి డెసింగు, శ్రీహరి నటరాజ్ పతకాల పంట పండించారు. ఉత్తరాఖండ్లో జరుగుతున్న 38వ జాతీయ క్రీడల స్విమ్మింగ్ ఈవెంట్లో ఈ ఇద్దరూ చెరో 9 పసిడి పతకాలు ఖాతాలో వేసుకున్నారు. పారిస్ ఒలింపిక్స్లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన 14 ఏళ్ల ధినిధి మహిళల 100 మీటర్ల ఫ్రీస్టయిల్లో జాతీయ రికార్డు తిరగరాస్తూ స్వర్ణం చేజిక్కించుకోవడంతో పాటు... 400 మీటర్ల ఫ్రీస్టయిల్, మిక్స్డ్ 4్ఠ400 ఫ్రీస్టయిల్, 200 మీటర్ల ఫ్రీస్టయిల్, 100 మీటర్ల బటర్ఫ్లయ్, 4్ఠ100 మీటర్ల ఫ్రీస్టయిల్ రిలే, 50 మీటర్ల ఫ్రీస్టయిల్, 4x200 మీటర్ల ఫ్రీస్టయిల్ రిలే, మిక్స్డ్ 4x100 మీటర్ల మెడ్లేలో పసిడి పతకాలతో మెరిసింది. దీంతో పాటు 50 మీటర్ల బటర్ఫ్లయ్లో రజతం, 4x100 మీటర్ల రిలే మెడ్లేలో కాంస్యంతో మొత్తం 11 పతకాలు ఖాతాలో వేసుకుంది. పురుషుల విభాగంలో శ్రీహరి మొత్తం 10 పతకాలు (9 స్వర్ణాలు, 1 రజతం) సాధించాడు. మంగళవారంతో జాతీయ క్రీడల్లో స్విమ్మింగ్ పోటీలు ముగియగా... ఓవరాల్గా పట్టికలో కర్ణాటక 37 పతకాలతో (22 స్వర్ణాలు, 10 రజతాలు, 5 కాంస్యాలు)తో అగ్రస్థానంలో ఉంది. -
తెలంగాణకు తొలి స్వర్ణం
డెహ్రాడూన్: జాతీయ క్రీడల్లో తెలంగాణ ఖాతాలో మొదటి స్వర్ణం చేరింది. మహిళల బాస్కెట్బాల్ 3X3 ఈవెంట్లో తెలంగాణ జట్టు తొలి స్థానంలో నిలిచింది. ఫైనల్లో తెలంగాణ 21–11 పాయింట్ల తేడాతో కేరళపై విజయం సాధించింది. పసిడి పతకం సాధించిన మహిళల జట్టులో గులాబ్ షా అలీ, ఎస్.పుష్ప, కేబీ హర్షిత, పి.ప్రియాంక సభ్యులుగా ఉన్నారు. రెండేళ్ల క్రితం గోవా జాతీయ క్రీడల్లోనూ ఇదే ఈవెంట్లో విజేతగా నిలిచిన తెలంగాణ తమ స్వర్ణాన్ని నిలబెట్టుకుంది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో 14–12 తేడాతో తమిళనాడును ఓడించి మధ్యప్రదేశ్ కాంస్యం సొంతం చేసుకుంది. అంతకుముందు సెమీస్లో తెలంగాణ 18–11తో తమిళనాడును... కేరళ 13–10తో మధ్యప్రదేశ్ను ఓడించాయి. మరో వైపు పురుషుల బాస్కెట్బాల్ 3–3 ఈవెంట్లో మధ్యప్రదేశ్, కేరళ, తమిళనాడు స్వర్ణ, రజత, కాంస్యాలు గెలుచుకున్నాయి. ఫైనల్లో మధ్యప్రదేశ్ 22–20 తేడాతో కేరళను ఓడించింది. కాంస్యం కోసం జరిగిన మ్యాచ్లో తమిళనాడు చేతిలో 16–21తో ఓడిన తెలంగాణ నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. ఆంధ్రప్రదేశ్కు మూడు కాంస్యాలు మరోవైపు ఆంధ్రప్రదేశ్కు మంగళవారం మూడు కాంస్య పతకాలు లభించాయి. పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్ విభాగంలో కర్రి సాయిపవన్–షేక్ గౌస్ జోడీ... కనోయింగ్–కయాకింగ్ క్రీడాంశంలోని పురుషుల స్లాలోమ్–కే1 ఈవెంట్లో కొల్లకాని విష్ణు... మహిళల స్లాలోమ్–సీ1 ఈవెంట్లో దొడ్డి చేతన భగవతి కాంస్య పతకాలు సాధించారు. బ్యాడ్మింటన్ డబుల్స్ సెమీఫైనల్లో సాయిపవన్–షేక్ గౌస్ ద్వయం 13–21, 12–21తో నితిన్–ప్రకాశ్ రాజ్ (కర్ణాటక) జంట చేతిలో ఓడి కాంస్య పతకాన్ని ఖరారు చేసుకుంది. మంగళవారం పోటీలు ముగిశాక ఆంధ్రప్రదేశ్ ఆరు పతకాలతో 21వ స్థానంలో, మూడు పతకాలతో తెలంగాణ 24వ స్థానంలో ఉన్నాయి. -
రష్మిక సంచలనం
ముంబై: ఎల్ అండ్ టి ముంబై ఓపెన్ డబ్ల్యూటీఏ–125 టెన్నిస్ టోర్నమెంట్లో భారత మూడో ర్యాంకర్, హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక సంచలనంతో శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 325వ ర్యాంకర్ రష్మిక 6–1, 6–0తో ప్రపంచ 182వ ర్యాంకర్ ఎలీనా ప్రిడాన్కినా (రష్యా)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. 64 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో రష్మిక కేవలం ఒక్క గేమ్ మాత్రమే కోల్పోవడం విశేషం. రెండు ఏస్లు సంధించిన రష్మిక మూడు డబుల్ ఫాల్ట్లు చేసింది. తన సర్వీస్ను ఒక్కసారి చేజార్చుకున్న రష్మిక ప్రత్యర్థి సర్వీస్ను ఏడుసార్లు బ్రేక్ చేసింది. ఓవరాల్గా మ్యాచ్ మొత్తంలో ప్రిడాన్కినా తన సర్వీస్ను ఒక్కసారి కూడా నిలబెట్టుకోకపోవడం గమనార్హం. భారత్కే చెందిన అంకిత రైనా, మాయ రేవతి రాజేశ్వరన్ కూడా తొలి రౌండ్లో నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. 15 ఏళ్ల క్వాలిఫయర్ మాయ 6–4, 6–1తో ఇరీనా షైమనోవిచ్ (బెలారస్)పై, అంకిత రైనా 6–2, 6–2తో భారత్కే చెందిన వైష్ణవి అడ్కర్పై విజయం సాధించారు. -
మెస్సీ కాదు!.. నేనే అత్యుత్తమ ఆటగాడిని: రొనాల్డో
దాదాపు దశాబ్ద కాలానికి పైగా ఫుట్బాల్ ప్రపంచంలో మకుటం లేని మహారాజులుగా వెలుగొందుతున్నారు పోర్చుగల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో(Cristiano Ronaldo)- అర్జెంటీనా లెజెండ్ లియోనల్ మెస్సీ(Lionel Messi). అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకునే ఈ ఇద్దరికీ ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. అయితే, ఈ వీళ్లిద్దరిలో ఎవరు గొప్ప అన్న చర్చ ఎప్పుడూ ఆసక్తికరమే.ఈ విషయంపై రొనాల్డో స్వయంగా స్పందించాడు. చాలా మంది మెస్సీకే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్(GOAT) బిరుదు ఇచ్చేందుకు మొగ్గుచూపవచ్చని అభిప్రాయపడ్డాడు. అయితే, తాను మాత్రం పరిపూర్ణ ఫుట్బాలర్ని అని పేర్కొన్న రొనాల్డో.. ఫుట్బాల్ చరిత్రలో తన కంటే గొప్ప ఆటగాడు లేడని అనడం విశేషం.నేనే ‘కంప్లీట్ ప్లేయర్’స్పానిష్ మీడియా అవుట్లెట్ లాసెక్టా టీవీకి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో క్రిస్టియానో రొనాల్డో మాట్లాడుతూ.. ‘‘నాలాగా ప్రపంచంలో పరిపూర్ణమైన ఫుట్బాలర్ మరెవరూ లేరని అనుకుంటా. ఇప్పటి వరకు ఉన్న ఫుట్బాల్ ఆటగాళ్లందరిలో నేనే ‘కంప్లీట్ ప్లేయర్’. నేను అన్ని రకాలుగా ఫుట్బాల్ ఆడగలను. చాలా మంది మెస్సీ, మారడోనా లేదంటే.. పీలే పేరు చెప్తారేమో!చరిత్రలోనే అత్యుత్తమ ఆటగాడినివాళ్ల అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను. ఏదేమైనా మోస్ట్ కంప్లీట్ ప్లేయర్ మాత్రం నేనే! ఫుట్బాల్ చరిత్రలోనే నేను అత్యుత్తమ ఆటగాడిని. నా కంటే మెరుగ్గా ఆడే ఫుట్బాలర్ను ఇంత వరకూ చూడలేదు. ఇవి నా మనస్ఫూర్తిగా చెబుతున్న మాటలు’’ అని పేర్కొన్నాడు.అదే విధంగా మెస్సీతో తన అనుబంధం గురించి చెబుతూ.. ‘‘మెస్సీతో నాకు ఎప్పుడూ ఎలాంటి సమస్యా లేదు. గత పదిహేనేళ్లుగా మేము అవార్డులు పంచుకుంటున్నాం. మా మాధ్య ఎలాంటి గొడవలు లేవు. అంతా సవ్యంగానే ఉంది.తనకోసం నేను ఆంగ్లాన్ని తర్జుమా చేసిన సందర్భాలు ఉన్నాయి. అప్పట్లో భలే సరదాగా ఉండేవాళ్లం. ఇక ఆటగాళ్లుగా మేము ప్రత్యర్థులమే కదా. తను తన క్లబ్కి, నేను నా క్లబ్కి మద్దతుగా ఉంటాం. జాతీయ జట్ల విషయంలోనూ అంతే. అయితే, ఆటతీరు ఎలా ఉందన్న అంశంపై పరస్పరం చర్చించుకుంటూ.. ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. మా మధ్య ఎల్లప్పుడూ ఆరోగ్యకరమైన పోటీయే ఉంటుంది’’ అని రొనాల్డో తెలిపాడు.కాగా 2002లో పోర్చుగీస్ క్లబ్ స్పోర్టింగ్ జీపీ తరఫున ప్రొఫెషనల్ ఫుట్బాలర్గా ఎంట్రీ ఇచ్చిన రొనాల్డో.. క్లబ్, అంతర్జాతీయ స్థాయిలో కలిపి ఓవరాల్గా 923 గోల్స్తో టాప్ గోల్స్కోరర్గా కొనసాగుతున్నాడు. తన సుదీర్ఘ కెరీర్లో ఎన్నో రికార్డులు సాధించిన రొనాల్డోకు ఫిఫా వరల్డ్కప్ మాత్రం అందని ద్రాక్షగా మిగిలిపోయింది. 648 మిలియన్ల మంది ఫాలోవర్లుఅయితే, ఈ విషయంలో మెస్సీదే పైచేయి. కెప్టెన్గా అర్జెంటీనాకు ప్రపంచకప్ అందించిన ఘనత అతడికి దక్కింది. ఇక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఫాలోవర్ల విషయంలోనూ రొనాల్డో- మెస్సీ మధ్య పోటీ ఉంది. అయితే, ఇందులో పోర్చుగీస్ ఆటగాడిదే ఆధిపత్యం. ప్రపంచంలోనే అత్యధిక ఫాలోవర్లు రొనాల్డోకు ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో అతడికి ఏకంగా 648 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండగా.. మెస్సీకి 504 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.చదవండి: CT 2025: సమయం మించిపోలేదు.. అతడిని జట్టులోకి తీసుకోండి: అశ్విన్ -
‘నేనూ.. మావారు’ : క్లాసిక్ కాంజీవరం చీరలో పీవీ సింధు
భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సిందులో మరోసారి తన ఎటైర్తో అందర్నీ ఆకర్షించింది. సింధు కోర్టులో మెరుపు షాట్లతో అబ్బుర పర్చడంమాత్రమే కాదు, తనదైన శైలి ఫ్యాషన్తో అందమైన చీర కట్టుతో ఆకట్టుకుంది. ‘మీ అండ్ మైన్’ అంటూ ఇన్స్టాలో ఒక ఫోటోను పోస్ట్ చేసింది. దీంతో అభిమానులను ఆమె లుక్కి ఫిదా అవుతూ కామెంట్స్పెట్టారు.ఫ్రెండ్ పెళ్లికి వెళ్లిన పీవీ సింధు క్లాసిక్ ఇండియన్ కాంజీవరం చీరలో అద్భుతంగా కనిపించింది. అందమైన బిగ్ జరీ బోర్డ్ పట్టుచీరలో నవ్వుతూ యువరాణిలా కనిపించింది. చీర అంతా తెల్లటి ఎంబ్రాయిడరీ అందంగా కనిపిస్తోంది. దీనికి జతగా మల్టీ లేయర్ నెక్లెస్, మ్యాచింగ్ చెవిపోగులతో తన లుక్ ను మరింత ఎలివేట్ చేసుకుంది. మృదువైన కర్ల్స్లో స్టైల్ చేసి అలా వదిలేసింది. ఇదీ చదవండి: ఇన్నాళ్లకు శుభవార్త, ప్రముఖ ఫ్యాషన్ స్టైలిస్ట్ ఫోటోలు వైరల్వెంకట దత్త సాయి విషయానికొస్తే, అతను తెల్లటి కుర్తా-పైజామా సెట్లో ఎప్పటిలాగానే మెరిసిపోయాడు. తన లుక్ను మరింతగా పెంచుతూ,పీచ్-హ్యూడ్ఎంబ్రాయిడరీ జాకెట్ ధరించాడు. ఇంకా గోల్డెన్ ఎంబ్రాయిడరీ, బటన్స్ జాకెట్కు ట్రెండీ స్టైల్ను జోడించాయి. View this post on Instagram A post shared by PV Sindhu (@pvsindhu1) కాగా రెండుసార్లు ఒలింపియన్ అయిన సింధు గత సంవత్సరం డిసెంబర్లో వ్యాపారవేత్త వెంకట దత్త సాయిని వివాహం చేసుకుంది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకల్లో ప్రతీది ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మెహిందీ, సంగీత్ వేడుకల్లో అందంగాముస్తాబై, ఫ్యాషన్ ప్రియులు కూడా ఆశ్చర్యపోయేలా చేశారు. సమయానికి తగ్గట్టుఅద్భుతమైన సాంప్రదాయ దుస్తులతో ఈ జంట అందరి దృష్టిని తమవైపు తిప్పుకున్నారు. మ్యాచింగ్ డైమండ్ ఆభరణాలతో పీవీ సింధు కొత్త ట్రెండ్ను క్రియేట్ చేసింది.ఇదీ చదవండి: తెల్లవెంట్రుకలను చూసి చింతించాల్సిన అవసరం లేదు! ఇంట్రస్టింగ్ స్టోరీ -
నందినికి నజరానా.. నగదు ప్రోత్సాహకంగా రూ. లక్ష
సాక్షి, హైదరాబాద్: ఆసియా క్రీడల కాంస్య పతక విజేత, హైదరాబాద్ యువ అథ్లెట్ అగసార నందినికి హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) అధ్యక్షుడు, అక్షర విద్యాసంస్థల చైర్మన్ అరశనపల్లి జగన్మోహన్ రావు అండగా నిలిచారు. అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ (ఉప్పల్ బ్రాంచ్)లో జరిగిన వార్షికోత్స వేడుకలో నందినిని జగన్మోహన్ రావు ఘనంగా సత్కరించారు. ఉత్తరాఖండ్లో జరుగుతున్న జాతీయ క్రీడల్లో ఈనెల 8వ తేదీన తెలంగాణకు తరఫున బరిలోకి దిగుతున్న నందినికి రూ.1 లక్ష చెక్ను నగదు ప్రోత్సాహకంగా ఆయన అందించారు.భవిష్యత్లో కూడా నందినికి అన్ని విధాలా అండగా ఉంటానని ఈ సందర్భంగా జగన్మోహన్ రావు హామీ ఇచ్చారు. సాధారణ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి, అనేక కష్టాలను అధిగమించి ఈ స్థాయికి చేరుకున్న నందిని విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలని జగన్మోహన్ రావు సూచించారు. నందిని 2028 లాస్ఏంజెలిస్ ఒలింపిక్స్లో పతకం సాధించాలని ఆయన ఆకాంక్షించారు.అనంతరం నందిని మాట్లాడుతూ... ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణ, పట్టుదలతో కృషి చేస్తే జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని, అందుకు తానే ఒక ఉదాహరణ అని చెప్పింది. తల్లిదండ్రులు పిల్లల ఇష్టాలను తెలుసుకొని వారికి నచ్చిన రంగంలో ప్రోత్సహించాలని కోరింది. అనంతరం పాఠశాలలో వివిధ పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నందిని పతకాలను ప్రదానం చేసింది. ఈ కార్యక్రమంలో అక్షర విద్యాసంస్థల సీఈఓ ఎ.మదన్మోహన్ రావు, ఫైనాన్స్ డైరెక్టర్ రామారావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సరితా రావు, ప్రిన్సిపాల్ స్వప్న తదితరులు పాల్గొన్నారు. మరిన్ని క్రీడా వార్తలుశ్రీనిధి డెక్కన్ ఎఫ్సీ జట్టుకు నాలుగో విజయం సాక్షి, హైదరాబాద్: ఐ–లీగ్ జాతీయ ఫుట్బాల్ లీగ్లో హైదరాబాద్కు చెందిన శ్రీనిధి డెక్కన్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) జట్టు ఖాతాలో నాలుగో విజయం చేరింది. హైదరాబాద్లో సోమవారం జరిగిన మ్యాచ్లో శ్రీనిధి డెక్కన్ జట్టు 3–0 గోల్స్ తేడాతో ఐజ్వాల్ ఎఫ్సీ జట్టుపై గెలిచింది. శ్రీనిధి డెక్కన్ జట్టు తరఫున గుర్ముఖ్ సింగ్ (5వ నిమిషంలో), లాల్రొమావియా (24వ నిమిషంలో), డేవిడ్ కాస్టనెడా మునోజ్ (33వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. 12 జట్లు పోటీపడుతున్న ఈ లీగ్లో శ్రీనిధి జట్టు 12 మ్యాచ్లు పూర్తి చేసుకుంది. నాలుగింటిలో గెలిచి, మూడింటిని ‘డ్రా’ చేసుకొని, ఐదింటిలో ఓడి 15 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉంది. ఈనెల 6న హైదరాబాద్లో జరిగే తదుపరి మ్యాచ్లో రియల్ కశ్మీర్ ఎఫ్సీ జట్టుతో శ్రీనిధి జట్టు తలపడుతుంది. సుశ్రుత–శ్రీశాన్వి జోడీకి కాంస్య పతకం సాక్షి, హైదరాబాద్: జాతీయ సబ్ జూనియర్, క్యాడెట్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్షిప్లో తెలంగాణకు కాంస్య పతకం లభించింది. మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరంలో జరిగిన ఈ టోరీ్నలో అండర్–15 బాలికల డబుల్స్ విభాగంలో సుశ్రుత అనియా ఆనంద్–శ్రీశాన్వి కామారపు (తెలంగాణ) జోడీ కాంస్య పతకాన్ని దక్కించుకుంది. సెమీఫైనల్లో సుశ్రుత–శ్రీశాన్వి ద్వయం 11–13, 6–11, 9–11తో దివ్యాంశి–నైషా (మహారాష్ట్ర) జంట చేతిలో ఓడిపోయింది. తెలంగాణ జట్టుకు ఎస్.ప్రణీత్, ఎం.చైతన్య కోచ్లుగా వ్యవహరించారు. -
భారత్లో పర్యటించనున్న మాజీ బాక్సింగ్ లైట్ వెయిట్ ఛాంపియన్
భారత్లో పోరాట క్రీడలను ప్రోత్సహించడానికి.. అలాగే అంతర్జాతీయ, దేశీయ ప్రతిభ మధ్య అంతరాన్ని తగ్గించడానికి మాజీ యుఎఫ్సి లైట్ వెయిట్ ఛాంపియన్ ఆంథోనీ పెట్టిస్ మొదటిసారి (మార్చిలో) భారత్లో పర్యటించనున్నాడు. ఆరు భారతీయ నగరాల్లో (ఢిల్లీ, జైపూర్, ముంబై, గోవా, హైదరాబాద్, బెంగళూరు) ఆంథోనీ పెట్టిస్ ఫైటింగ్ ఛాంపియన్షిప్ (APFC), ఇండియన్ ప్రో బాక్సింగ్ లీగ్ (IPBL) మధ్య బాక్సింగ్ పోటీలు జరుగనున్నాయి. ఏపీఎఫ్సీ భారత పర్యటన ఖరారైన విషయాన్ని ఐపీబీఎల్ నిర్ధారించింది. 'ROAD TO IPBL' పేరుతో సాగే ఈ పర్యటనలో WBC ఇండియా ఛాంపియన్ శబరి జైశంకర్.. మాజీ బెల్లాటర్ బాంటమ్వెయిట్ ఛాంపియన్ సెర్గియో పెట్టిస్ (ఆంథోనీ పెట్టిస్ సోదరుడు) మధ్య ప్రధాన పోటీ జరుగనుంది.అమెరికన్ మిక్స్డ్ మార్షల్ ఆర్టిస్ట్ అయిన సెర్గియో పెట్టిస్.. ప్రస్తుతం బెల్లాటర్ MMAతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. బెల్లాటర్లో చేరడానికి ముందు సెర్గియో అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్షిప్ (UFC)లో పోటీ పడ్డాడు. అక్కడ బాంటమ్వెయిట్ విభాగంలో అగ్రశ్రేణి యోధులలో ఒకరిగా గుర్తింపు పొందాడు.సెర్గియో ప్రత్యర్థి శబరి జైశంకర్ భారతదేశపు అగ్రశ్రేణి ప్రొఫెషనల్ బాక్సర్. శబరి జైశంకర్.. WBC ఇండియా, WBC ఆస్ట్రలేసియా, WBC మిడిల్ ఈస్ట్ టైటిళ్లతో సహా బహుళ ప్రపంచ బాక్సింగ్ కౌన్సిల్ (WBC) టైటిళ్లను గెలుచుకున్నారు.'రోడ్ టు IPBL' ఇండియా టూర్ అనేది కేవలం బాక్సింగ్ మ్యాచ్ల శ్రేణి మాత్రమే కాదు. ఇది ప్రపంచ పోరాట క్రీడల వేడుక. ఇది భారతీయ అభిమానులు మరియు పోరాట క్రీడాకారుల అభిరుచిని రేకెత్తించడానికి ప్రపంచంలోని అత్యుత్తమమైన వాటిని ఒకచోటికి చేర్చింది. మేము సందర్శించే ప్రతి నగరంలో IPBL ను కొత్త శిఖరాలకు తీసుకెళ్లడం మరియు మరపురాని క్షణాలను సృష్టించాలని భావిస్తున్నాము. ఇది ప్రారంభం మాత్రమే. మేము చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాము అని IPBL వ్యూహాత్మక భాగస్వామి రానా దగ్గుబాటి అన్నారు.IPBL బాక్సింగ్ గురించి:IPBL బాక్సింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (www.indianproboxingleague.com) భారతదేశంలోని ఒక ప్రముఖ బాక్సింగ్ ప్రమోషన్ కంపెనీ. ఇది బాక్సింగ్ క్రీడను ఉన్నతీకరించడానికి మరియు దేశవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి బాక్సర్ల ప్రతిభను ప్రదర్శించడానికి అంకితం చేయబడింది. బాక్సింగ్ యొక్క ఉత్సాహం మరియు అభిరుచిని విస్తృత ప్రేక్షకులకు చేరువ చేయాలనే లక్ష్యంతో ఇది ఏర్పడింది. -
Tata Steel Chess Masters: ఛాంపియన్గా ప్రజ్ఞానంద
టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్-2025కు ఎండ్ కార్డ్ పడింది. ఈ టోర్నీ విజేతగా భారత గ్రాండ్మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద(Praggnanandhaa) నిలిచాడు. నెదర్లాండ్స్లోని విక్ ఆన్ జీ వేదికగా జరిగిన టై బ్రేకర్లో వరల్డ్ ఛాంపియన్ డి గుకేశ్పై ప్రజ్ఞానంద విజయం సాధించాడు. కాగా అంతకుముందు చివరి రౌండ్లో గుకేశ్, ప్రజ్ఞానానంద ఇద్దరూ తమ మ్యాచ్లలో ఓటమి చవిచూశారు.జర్మన్ గ్రాండ్ మాస్టర్ జీఎమ్ విన్సెంట్ ప్రగ్నందందాను ఓడించగా.. గుకేష్ను అర్జున్ ఎరిగైసి ఖంగుతిన్పించాడు. దీంతో 8.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్న గుకేశ్, ప్రజ్ఞానంద.. టైటిల్ కోసం టైబ్రేకర్లో తలపడ్డారు. టైబ్రేకర్లో తొలి గేమ్లో గుకేష్ విజయం సాధించగా, రెండో గేమ్లో ప్రజ్ఞానంద గెలుపొందాడు.ఫలితంగా విజేతను తేల్చేందుకు సడన్ డెత్ నిర్వహించాల్సి వచ్చింది. ఇందులో ప్రజ్ఞానంద విజయం సాధించి టైటిల్ను సొంతం చేసుకున్నాడు. ఈ టోర్నీ చివరి రౌండ్(13వ రౌండ్)లో ప్రజ్ఞానంద 2741 పాయింట్లతో అగ్రస్ధానంలో నిలవగా.. దొమ్మరాజు గుకేశ్(2777) రెండో స్ధానంలో నిలిచాడు.చదవండి: టీ20 వరల్డ్ కప్ విజేతలకు బీసీసీఐ భారీ నజరానా.. ఎన్ని కోట్లంటే? -
భారత్ 4 టోగో 0
న్యూఢిల్లీ: డేవిస్కప్ టీమ్ టెన్నిస్ టోర్నీలో భారత జట్టు వరల్డ్ గ్రూప్–1లోనే కొనసాగనుంది. టోగో జట్టుతో జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్లో భారత్ 4–0తో విజయం సాధించింది. తొలి రోజు శనివారం జరిగిన రెండు సింగిల్స్లో భారత ఆటగాళ్లు శశికుమార్ ముకుంద్, రామ్కుమార్ రామనాథన్ గెలుపొందగా... రెండో రోజు ఆదివారం జరిగిన డబుల్స్ మ్యాచ్లో బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ–శ్రీరామ్ బాలాజీ జంట 6–2, 6–1తో ఎంలాపా అకోమోలో–ఇసాక్ పాడియో (టోగో) ద్వయంపై నెగ్గింది. దాంతో భారత్ 3–0తో విజయాన్ని ఖరారు చేసుకుంది. ఫలితం తేలిపోయినా ప్రాక్టీస్ కోసం భారత జట్టు నాలుగో మ్యాచ్ను ఆడేందుకు సిద్ధమైంది. నాలుగో మ్యాచ్లో కరణ్ సింగ్ 6–2, 6–3తో పాడియోను ఓడించాడు. నామమాత్రమైన ఐదో మ్యాచ్ను ఆడకూడదని రెండు జట్లు నిర్ణయం తీసుకున్నాయి. డబుల్స్ మ్యాచ్ ద్వారా హైదరాబాద్ ప్లేయర్ రితి్వక్ చౌదరీ డేవిస్కప్లో అరంగేట్రం చేశాడు. -
బెంగాల్ టైగర్స్ విజయ గర్జన
రూర్కెలా: పది నిమిషాల వ్యవధిలో మూడు గోల్స్... ఆ తర్వాత మ్యాచ్ మరో ఆరు నిమిషాల్లో ముగుస్తుందనగా మరో గోల్... వెరసి పురుషుల హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో ష్రాచి రార్ బెంగాల్ టైగర్స్ జట్టు చాంపియన్గా అవతరించింది. శనివారం హోరాహోరీగా జరిగిన ఫైనల్లో రూపిందర్ సింగ్ పాల్ కెప్టెన్సీలోని బెంగాల్ టైగర్స్ జట్టు 4–3 గోల్స్ తేడాతో హైదరాబాద్ తూఫాన్స్ జట్టును ఓడించింది. బెంగాల్ టైగర్స్ జట్టు తరఫున జుగ్రాజ్ సింగ్ (25వ, 32వ, 35వ నిమిషాల్లో) మూడు గోల్స్ చేసి ‘హ్యాట్రిక్’ నమోదు చేయగా... స్యామ్ లేన్ (54వ నిమిషంలో) గెలుపు గోల్ కొట్టాడు. హైదరాబాద్ తూఫాన్స్ తరఫున గొంజాలో పీలాట్ (9వ, 39వ నిమిషాల్లో) రెండు గోల్స్ సాధించగా... అమన్దీప్ లాక్రా (26వ నిమిషంలో) ఒక గోల్ చేశాడు. ఏడేళ్ల విరామం తర్వాత హాకీ ఇండియా లీగ్ను పునరుద్ధరించారు. గత ఏడాది డిసెంబర్ 28వ తేదీన హాకీ ఇండియా లీగ్ మొదలైంది. విజేతగా నిలిచిన బెంగాల్ టైగర్స్ జట్టుకు రూ. 3 కోట్లు... రన్నరప్ హైదరాబాద్ తూఫాన్స్ జట్టుకు రూ. 2 కోట్లు... మూడో స్థానంలో నిలిచిన సూర్మా హాకీ క్లబ్ జట్టుకు రూ. 1 కోటి నగదు పురస్కారం లభించింది. మొత్తం ఎనిమిది జట్లు పోటీపడ్డ హెచ్ఐఎల్లో లీగ్ దశ మ్యాచ్లు ముగిశాక బెంగాల్ టైగర్స్ జట్టు 19 పాయింట్లతో టాపర్గా నిలిచింది. తుదకు బెంగాల్ టైగర్స్ జట్టుకే టైటిల్ లభించడం విశేషం. హెచ్ఐఎల్ ‘బెస్ట్ గోల్ కీపర్’గా బ్రికమ్జీత్ సింగ్ (రూ. 10 లక్షలు; హైదరాబాద్ తూఫాన్స్)... ‘అప్కమింగ్ ప్లేయర్’గా అర్ష్ దీప్ (రూ. 10 లక్షలు; హైదరాబాద్ తూఫాన్స్)... ‘టాప్ స్కోరర్’గా జుగ్రాజ్ సింగ్ (బెంగాల్ టైగర్స్; రూ. 10 లక్షలు)... ‘బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ సుఖ్జీత్ సింగ్ (రూ. 20 లక్షలు; బెంగాల్ టైగర్స్) ఎంపికయ్యారు. యూపీ రుద్రాస్ జట్టుకు ‘ఫెయిర్ ప్లే’ అవార్డు లభించింది. 8 పాల్గొన్న జట్లు 44 మొత్తం జరిగిన మ్యాచ్లు 199 నమోదైన మొత్తం గోల్స్ 103 ఫీల్డ్ గోల్స్ 89 పెనాల్టీ కార్నర్ గోల్స్ 7 పెనాల్టీ స్ట్రోక్ గోల్స్ 95 క్రీడాకారులకు లభించిన గ్రీన్ కార్డులు 16 క్రీడాకారులకు లభించిన ఎల్లో కార్డులు -
పసిడి పతకం నెగ్గిన పల్లవి
డెహ్రాడూన్: జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్కు రెండో స్వర్ణ పతకం లభించింది. శనివారం జరిగిన మహిళల వెయిట్లిఫ్టింగ్ 71 కేజీల విభాగంలో సనాపతి పల్లవి పసిడి పతకం సొంతం చేసుకుంది. పల్లవి మొత్తం 212 కేజీల బరువెత్తి అగ్రస్థానంలో నిలిచింది. పల్లవి స్నాచ్లో 94 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్లో 118 కేజీలు బరువెత్తింది. శుక్రవారం పురుషుల 67 కేజీల విభాగంలో నీలంరాజు ఆంధ్రప్రదేశ్కు తొలి బంగారు పతకాన్ని అందించాడు. -
Yoga: అడిషనల్ ఎస్పీ వాసుదేవరెడ్డికి కాంస్యం
పోలీసుగా రక్షణ బాధ్యతలు నిర్వహిస్తూనే క్రీడలు, యోగాలో రాణిస్తున్నారు అడిషనల్ ఎస్పీ వాసుదేవరెడ్డి. కరీంనగర్లో జరిగిన తెలంగాణ రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ అండ్ డ్యూటీ మీట్లో ఇంటలిజెన్స్ వింగ్ తరపున పాల్గొన్న వాసుదేవరెడ్డి యోగా విభాగంలో కాంస్య పతకం గెలుచుకున్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి చేతుల మీదుగా పతకం అందుకున్నారు.కరీంనగర్ జిల్లాకు చెందిన వాసుదేవరెడ్డి, కాకతీయ యూనివర్సిటీ నుంచి డిగ్రీ చదివారు. 1996 బ్యాచ్లో ఎస్సైగా ఎంపికై వేర్వేరు హోదాల్లో పదవీ బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం సీఎం సెక్యూరిటీ, ఇంటలిజెన్స్ వింగ్లో అడిషనల్ ఎస్పీగా పని చేస్తున్నారు.గత 25 సంవత్సరాలుగా యోగాను క్రమం తప్పకుండా చేస్తోన్న వాసుదేవరెడ్డి.. ప్రతీ జూన్ 21న, కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న ఇంటర్నేషనల్ యోగా డేలో క్రమం తప్పకుండా పాల్గొంటున్నారు. యోగా చేయడం వల్ల శారీరక క్రమశిక్షణతో పాటు మానసిక సంసిద్ధత లభిస్తోందని అని ఆయన అన్నారు. ప్రతీ ఒక్కరు యోగాను అనుసరిస్తే.. జీవితంలోని ఎన్నో సమస్యల నుంచి బయటపడతారని చెప్పారు. యోగాలో తనకు పతకం లభించడం పట్ల వాసుదేవరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. -
థాయ్లాండ్ మాస్టర్స్.. ముగిసిన భారత్ పోరు
బ్యాంకాక్: థాయ్లాండ్ మాస్టర్స్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. పురుషుల సింగిల్స్ విభాగంలో కిడాంబి శ్రీకాంత్, శంకర్ ముత్తుస్వామి సుబ్రమణియన్... మహిళల సింగిల్స్ లో రక్షిత శ్రీ క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయారు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లలో శ్రీకాంత్ 17–21, 16–21తో వాంగ్ జెంగ్ జింగ్ (చైనా) చేతిలో; శంకర్ ముత్తుస్వామి 21–19, 18–21, 13–21తో జు జువాన్ చెన్ (చైనా) చేతిలో; రక్షిత శ్రీ 21–19, 14–21, 9–21తో థ మోన్ వన్ నితిత్ క్రాయ్ (థాయ్ లాండ్) చేతిలో పరాజయం పాలయ్యారు. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాయి ప్రతీక్–పృథ్వీ కృష్ణమూర్తి రాయ్ జోడీ (భారత్) 19–21, 18–21తో డేనియల్ మార్టిన్–షోహిబుల్ ఫిక్రి (ఇండోనేసియా) ద్వయం చేతిలో ఓడిపోయింది. -
యూకీ బాంబ్రీ జంట పరాజయం
పారిస్: మోంట్ పెలియర్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో యూకీ బాంబ్రీ (భారత్)–ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా) జోడీకీ నిరాశ ఎదురైంది. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ యూకీ బాంబ్రీ–ఇవాన్ డోడిగ్ ద్వయం 4–6, 5–7తో మాన్యుయెల్ గినార్డ్–గ్రెగోరి జాక్ (ఫ్రాన్స్) జంట చేతిలో ఓటమి పాలైంది. 92 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్ లో ఇండో–క్రొయేషియన్ జంట తమ సర్వీస్ ను రెండుసార్లు చేజార్చుకుంది. యూకీ–డోడిగ్ జోడీకి 5,500 యూరోల (రూ. 4 లక్షల 95 వేలు) ప్రైజ్ మనీతోపాటు 45 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.ముగిసిన భారత్ పోరుబ్యాంకాక్: థాయ్ లాండ్ మాస్టర్స్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. పురుషుల సింగిల్స్ విభాగంలో కిడాంబి శ్రీకాంత్, శంకర్ ముత్తుస్వామి సుబ్రమణియన్... మహిళల సింగిల్స్ లో రక్షిత శ్రీ క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయారు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లలో శ్రీకాంత్ 17–21, 16–21తో వాంగ్ జెంగ్ జింగ్ (చైనా) చేతిలో; శంకర్ ముత్తుస్వామి 21–19, 18–21, 13–21తో జు జువాన్ చెన్ (చైనా) చేతిలో; రక్షిత శ్రీ 21–19, 14–21, 9–21తో థ మోన్ వన్ నితిత్ క్రాయ్ (థాయ్ లాండ్) చేతిలో పరాజయం పాలయ్యారు. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాయి ప్రతీక్–పృథ్వీ కృష్ణమూర్తి రాయ్ జోడీ (భారత్) 19–21, 18–21తో డేనియల్ మార్టిన్–షోహిబుల్ ఫిక్రి (ఇండోనేసియా) ద్వయం చేతిలో ఓడిపోయింది. -
హైదరాబాద్ X బెంగాల్
రూర్కేలా: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో హైదరాబాద్ తూఫాన్స్, ష్రాచీ రార్ బెంగాల్ టైగర్స్ జట్లు ఫైనల్కు దూసుకెళ్లాయి. శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్లో హైదరాబాద్ తూఫాన్స్ 3–1 గోల్స్ తేడాతో సూర్మా హాకీ క్లబ్పై విజయం సాధించగా... హోరాహోరీగా సాగిన పోరులో ష్రాచీ రార్ బెంగాల్ టైగర్స్ షూటౌట్లో తమిళనాడు డ్రాగన్స్పై గెలుపొందింది. హైదరాబాద్ జట్టు తరఫున అమన్దీప్ లక్రా (25వ నిమిషంలో), జాకబ్ అండర్సన్ (35వ నిమిషంలో), నీలకంఠ శర్మ (43వ నిమిషంలో) తలా ఒక గోల్ చేశారు. సూర్మ హాకీ క్లబ్ తరఫున మ్యాచ్ చివరి నిమిషంలో జెరెమీ హెవార్డ్ (60వ ని.లో) ఏకైక గోల్ కొట్టాడు. మ్యాచ్ ఆరంభం నుంచి పూర్తి ఆధిపత్యం కనబర్చిన హైదరాబాద్ తూఫాన్స్ ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగింది. ఇక బెంగాల్ టైగర్స్, తమిళనాడు డ్రాగన్స్ మధ్య తీవ్ర ఉత్కంఠ భరితంగా సాగిన మరో సెమీస్లో నిర్ణీత సమయంలో ఇరు జట్లు 2–2 గోల్స్తో సమంగా నిలిచాయి. బెంగాల్ టైగర్స్ తరఫున ప్రదీప్ సింగ్ సంధు (30వ నిమిషంలో), స్యామ్ లేన్ (53వ ని.లో) చెరో గోల్ చేయగా... డ్రాగన్స్ తరఫున నాథన్ ఎప్రామ్స్ (18వ ని.లో), సెల్వం కార్తి (32వ ని.లో) ఒక్కో గోల్ కొట్టారు. దీంతో ఫలితం తేల్చేందుకు షూటౌట్ నిర్వహించగా... బెంగాల్ టైగర్స్ జట్టు ‘సడెన్ డెత్’లో 6–5 గోల్స్ తేడాతో తమిళనాడు డ్రాగన్స్ పై గెలిచింది. ఆదివారం జరగనున్న తుది పోరులో బెంగాల్ టైగర్స్తో హైదరాబాద్ తూఫాన్స్ టైటిల్ కోసం పోటీ పడనుంది. -
భారత్ X టోగో
న్యూఢిల్లీ: డేవిస్ కప్ ప్రపంచ గ్రూప్–1 ప్లే ఆఫ్స్లో భారత టెన్నిస్ జట్టు ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. రెండు రోజుల పాటు జరగనున్న ఈ ఈవెంట్లో టోగో జట్టుతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. శనివారం జరగనున్న పురుషుల సింగిల్స్ మ్యాచ్ల్లో శశికుమార్ ముకుంద్, రామ్కుమార్ రామనాథన్ బరిలోకి దిగనుండగా... ఆదివారం జరగనున్న రెండు డబుల్స్ మ్యాచ్లో శ్రీరామ్ బాలాజీ–రిత్విక్ బొల్లిపల్లి, రివర్స్ సింగిల్స్లో శశికుమార్ ముకుంద్, రామ్కుమార్ రామ్నాథన్ ఆడనున్నారు. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే... భారత జట్టు సెప్టెంబర్లో జరగనున్న వరల్డ్ గ్రూప్–1లో పోటీ పడనుంది. చాన్నాళ్ల తర్వాత జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న శశికుమార్ ముకుంద్ మెరుగైన ప్రదర్శన చేయాలని చూస్తుండగా... ఇటీవల తన తొలి గ్రాండ్స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్ బరిలోకి దిగిన తెలుగు కుర్రాడు బొల్లిపల్లి రిత్విక్ చౌదరి జాతీయ జట్టు తరఫున అరంగేట్రం చేయనున్నాడు.శ్రీరామ్ బాలాజీతో కలిసి అతడు డబుల్స్ మ్యాచ్ ఆడనున్నాడు. ఇటీవలి కాలంలో నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్న రిత్విక్ చౌదరి మాట్లాడుతూ... ‘కల నిజమైనట్లు ఉంది. జాతీయ జట్టు తరఫున మంచి ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తా’ అని అన్నాడు. రిత్విక్తో కలిసి ఆడటం ఆనందంగా ఉందని ఇద్దరి మధ్య చక్కటి అవగాహన ఉందని... పరిస్థితులను త్వరగా ఆకలింపు చేసుకోవడం రిత్విక్కు అలవాటు అని బాలాజీ పేర్కొన్నాడు. శనివారం జరగనున్న తొలి సింగిల్స్ మ్యాచ్లో లివో అజావోన్ (టోగో)తో శశికుమార్ ముకుంద్, థామస్ సెటోజీ (టోగో)తో రామ్కుమార్ రామనాథన్ తలపడనున్నారు. -
ముగిసిన భారత్ పోరు
బ్యాంకాక్: థాయ్ లాండ్ మాస్టర్స్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. పురుషుల సింగిల్స్ విభాగంలో కిడాంబి శ్రీకాంత్, శంకర్ ముత్తుస్వామి సుబ్రమణియన్... మహిళల సింగిల్స్ లో రక్షిత శ్రీ క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయారు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లలో శ్రీకాంత్ 17–21, 16–21తో వాంగ్ జెంగ్ జింగ్ (చైనా) చేతిలో; శంకర్ ముత్తుస్వామి 21–19, 18–21, 13–21తో జు జువాన్ చెన్ (చైనా) చేతిలో; రక్షిత శ్రీ 21–19, 14–21, 9–21తో థ మోన్ వన్ నితిత్ క్రాయ్ (థాయ్ లాండ్) చేతిలో పరాజయం పాలయ్యారు. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాయి ప్రతీక్–పృథ్వీ కృష్ణమూర్తి రాయ్ జోడీ (భారత్) 19–21, 18–21తో డేనియల్ మార్టిన్–షోహిబుల్ ఫిక్రి (ఇండోనేసియా) ద్వయం చేతిలో ఓడిపోయింది. -
జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ కు తొలి పసిడి పతకం
డెహ్రడూన్: జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు పతకాల బోణీ కొట్టాయి. శుక్రవారం పురుషుల వెయిట్ లిఫ్టింగ్ 67 కేజీల విభాగంలో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు కొమెర నీలం రాజు పసిడి పతకాన్ని సాధించాడు. నీలం రాజు మొత్తం 289 కేజీలు (స్నాచ్ లో 128+క్లీన్ అండ్ జర్క్ లో 161) బరువెత్తి అగ్ర స్థానంలో నిలిచాడు. పురుషుల సైక్లింగ్ రోడ్ రేసు మాస్ స్టార్ట్ ఈవెంట్ లో తెలంగాణ ప్లేయర్ ఆశీర్వాద్ సక్సేనా (2గం:48ని:39.029 సెకన్లు) మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. మరోవైపు భారత స్టార్ వెయిట్ లిఫ్టర్ బింద్యారాణి దేవి జాతీయ క్రీడల్లో పసిడి పతకంతో సత్తాచాటింది. మహిళల 55 కేజీల విభాగంలో బింద్యారాణి 201 కేజీల (88+113) బరువెత్తి స్వర్ణం కైవసం చేసుకుంది. బింద్యారాణి స్నాచ్లో 88 కేజీల బరువెత్తి జాతీయ రికార్డు నెలకొల్పింది. గతంలో మీరాబాయి చాను ఈ విభాగంలో 86 కేజీల బరువెత్తగా... ఇప్పుడు బింద్యారాణి దాన్ని బద్దలు కొట్టింది. -
క్వార్టర్స్లో శ్రీకాంత్, శంకర్
బ్యాంకాక్: థాయ్లాండ్ మాస్టర్స్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ విభాగం భారత ప్లేయర్లు కిడాంబి శ్రీకాంత్, శంకర్ ముత్తుస్వామి సుబ్రమణియన్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. మహిళల సింగిల్స్ విభాగంలో రక్షిత శ్రీ క్వార్టర్ ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకుంది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్ల్లో శ్రీకాంత్ 21–19, 21–15తో జేసన్ గుణవాన్ (హాంకాంగ్)పై, శంకర్ 9–21, 21–10, 21–17తో చికో ద్వి వర్దోయో (ఇండోనేసియా)పై, రక్షిత శ్రీ 21–15, 21–12తో క్లౌ టాంగ్ టుంగ్ (చైనీస్ తైపీ)పై గెలుపొందారు.మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో గద్దె రుతి్వక శివాని–రోహన్ కపూర్ (భారత్) ద్వయం 19–21, 15–21తో రచాపోల్–నాథమోన్ (థాయ్లాండ్) జంట చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సాయిప్రతీక్–పృథ్వీ కృష్టమూర్తి రాయ్ (భారత్) జోడీ 14–21, 21–10, 21–9తో విచాయాపోంగ్–నారుసెట్ (థాయ్లాండ్) ద్వయంపై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. -
హర్మన్ప్రీత్ సారథ్యంలో...
న్యూఢిల్లీ: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) పురుషుల ప్రొ లీగ్లో పాల్గొనే భారత ప్రాబబుల్స్ను ప్రకటించారు. ప్రస్తుత కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ సారథ్యంలోనే భారత బృందం తొలి అంచె పోటీల్లో బరిలోకి దిగనుంది. హాకీ ఇండియా లీగ్, జూనియర్ టోర్నీలలో ఆయా ఆటగాళ్లు కనబరిచిన ప్రదర్శన ఆధారంగా మొత్తం 32 మందిని ఈ టోర్నీ కోసం ఎంపిక చేశారు. ఫిబ్రవరి 15 నుంచి 25వ తేదీ వరకు జరిగే మ్యాచ్ల్లో స్పెయిన్, జర్మనీ, ఐర్లాండ్, ఇంగ్లండ్ జట్లతో భారత జట్టు రెండేసి మ్యాచ్లు ఆడుతుంది. 2023–2024 ప్రొ లీగ్ సీజన్లో భారత జట్టు ఏడో స్థానంలో నిలిచింది. భారత హాకీ ప్రాబబుల్స్: కృషన్ బహదూర్ పాఠక్, సూరజ్ కర్కెరా, ప్రిన్స్దీప్ సింగ్ (గోల్కీపర్లు). డిఫెండర్లు: హర్మన్ప్రీత్ సింగ్, జర్మన్ప్రీత్ సింగ్, అమిత్ రోహిదాస్, సుమిత్, సంజయ్, జుగ్రాజ్ సింగ్, నీలం సంజీప్ జెస్, వరుణ్ కుమార్, యశ్దీప్ సివాచ్. మిడ్ఫీల్డర్లు: రాజ్కుమార్ పాల్, షంషేర్ సింగ్, మన్ప్రీత్ సింగ్, హార్దిక్ సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్, నీలకంఠ శర్మ, రబిచంద్ర సింగ్, రాజిందర్ సింగ్. ఫార్వర్డ్స్: అభిషేక్, సుఖ్జీత్ సింగ్, లలిత్ కుమార్ ఉపాధ్యాయ్, మన్దీప్ సింగ్, గుర్జంత్ సింగ్, అంగద్బీర్ సింగ్, బాబా సింగ్ ధామి, శిలానంద్ లాక్రా, దిల్ప్రీత్ సింగ్, అరిజిత్ సింగ్ హుండల్, ఉత్తమ్ సింగ్, అర్ష్ దీప్ సింగ్. -
బాక్సింగ్కు మనోజ్ వీడ్కోలు
న్యూఢిల్లీ: కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేత... ‘డబుల్ ఒలింపియన్’ భారత స్టార్ మనోజ్ కుమార్ బాక్సింగ్ నుంచి వీడ్కోలు తీసుకున్నాడు. త్వరలో కోచ్ రూపంలో ముందుకు వస్తానని హరియాణాకు చెందిన 39 ఏళ్ల మనోజ్ గురువారం ప్రకటించాడు. 2010 ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణ పతకం (64 కేజీలు) గెలిచిన మనోజ్... 2018 గోల్డ్కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్లో కాంస్య పతకం (69 కేజీలు) సాధించాడు. 2012 లండన్ ఒలింపిక్స్లో, 2016 రియో ఒలింపిక్స్లో పోటీపడ్డ మనోజ్ ప్రిక్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించాడు. 2007, 2013 ఆసియా చాంపియన్షిప్లలో కాంస్య పతకాలు నెగ్గిన మనోజ్ 2016 దక్షిణాసియా క్రీడల్లో పసిడి పతకం సొంతం చేసుకున్నాడు. -
క్వార్టర్ ఫైనల్లో అనిరుధ్ జోడీ
సాక్షి, హైదరాబాద్: బ్రిస్బేన్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్–75 టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్ అనిరుధ్ చంద్రశేఖర్ పురుషుల డబుల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ఆ్రస్టేలియాలోని బ్రిస్బేన్ నగరంలో జరుగుతున్న ఈ టోరీ్నలో బుధవారం జరిగిన డబుల్స్ తొలి రౌండ్లో టాప్ సీడ్ అనిరుధ్ (భారత్)–చార్లెస్ బ్రూమ్ (బ్రిటన్) ద్వయం 6–4, 6–3తో హేడెన్ జోన్స్–పావ్లె మారిన్కోవ్ (ఆ్రస్టేలియా) జోడీపై విజయం సాధించింది. మరోవైపు ఫ్రాన్స్లో జరుగుతున్న మాంట్పెలియర్ ఏటీపీ–250 టోరీ్నలో యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) ద్వయం క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. తొలి రౌండ్లో యూకీ–ఒలివెట్టి జంట 7–5, 3–6, 10–8తో జేకబ్ ష్నయిటర్–మార్క్ వాల్నర్ (జర్మనీ) ద్వయంపై గెలుపొందింది. మరో మ్యాచ్లో విజయ్ సుందర్ ప్రశాంత్–జీవన్ నెడుంజెళియన్ (భారత్) జోడీ 1–6, 5–7తో ఫ్లావియో కొ»ొల్లి (ఇటలీ)–జొనాథన్ ఎసెరిక్ (ఫ్రాన్స్) జంట చేతిలో ఓడిపోయింది. సహజ, రషి్మక ఓటమి పుణే: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) డబ్ల్యూ75 మహిళల టోర్నమెంట్లో భారత నంబర్వన్, తెలంగాణ అమ్మాయి సహజ యామలపల్లి, భారతమూడో ర్యాంకర్, తెలంగాణకే చెందిన భమిడిపాటి శ్రీవల్లి రషి్మక పోరాటం ముగిసింది. బుధవారం జరిగిన సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్ల్లో సహజ 4–6, 3–6తో టాప్ సీడ్ లియోలియా జీన్జీన్ (ఫ్రాన్స్) చేతిలో... రషి్మక 6–7 (2/7), 2/6)తో మూడో సీడ్ పన్నా ఉడ్వార్డి (హంగేరి) చేతిలో ఓడిపోయారు. -
ఒంటరిగా ఆధిక్యంలో గుకేశ్
విక్ ఆన్ జీ (నెదర్లాండ్స్): టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో పదో రౌండ్ తర్వాత భారత గ్రాండ్మాస్టర్, ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్(D Gukesh ) 7.5 పాయింట్లతో ఒంటరిగా ఆధిక్యంలో ఉన్నాడు. మాక్స్ వార్మెర్డామ్ (నెదర్లాండ్స్)తో బుధవారం జరిగిన పదో రౌండ్ గేమ్లో గుకేశ్ 34 ఎత్తుల్లో గెలిచాడు. ప్రపంచ చెస్ ఛాంపియన్గా నిలిచిన తర్వాత గుకేశ్కు ఇదే మొదటి టోర్నమెంట్ కావడం గమనార్హం. మరోవైపు ఉజ్బెకిస్తాన్ గ్రాండ్మాస్టర్ నోడిర్బెక్ అబ్దుసత్తోరోవ్ 7 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. రష్యాకు చెందిన అలెక్సీ సరానాను నోడిర్బెక్ ఓడించాడు. ఇక భారత్కే చెందిన గ్రాండ్మాస్టర్లు ప్రజ్ఞానంద 6.5 పాయింట్లతో మూడో స్థానంలో, ఇరిగేశి అర్జున్ 3 పాయింట్లతో 13వ స్థానంలో ఉన్నారు. 14 మంది మేటి గ్రాండ్మాస్టర్ల మధ్య 13 రౌండ్లపాటు ఈ టోర్నీ జరుగుతోంది.చదవండి: జనాయ్ భోంస్లే కాదు.. సిరాజ్ డేటింగ్లో ఉన్నది ఆమెతోనే?