karnataka politics
-
కోడిగుడ్లతో బీజేపీ సీనియర్ ఎమ్మెలేపై దాడి
బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, ఆర్ ఆర్ నగర్ ఎమ్మెల్యే మునిరత్న నాయుడి(Muniratna Naidu)పై కొందరు ఆగంతకులు కోడిగుడ్డు విసిరారు. అత్యాచారం కేసులో జైలుకు వెళ్లి మునిరత్న బెయిల్ మీద బయటకు వచ్చి రెండు నెలలు అయ్యింది. అయితే అప్పటి నుంచి ఆయనకు ప్రజల్లోకి వచ్చింది ఇదే తొలిసారికాగా.. ఆ టైంలోనే దాడి జరగడం గమనార్హం.బుధవారం లక్ష్మీ నగర్లో నిర్వహించిన వాజ్పేయి(Vajpayee) శతజయంతి ఉత్సవాల్లో మునిరత్న పాల్గొన్నారు. తిరిగి తన అనుచరులతో వెళ్తున్న సమయంలో కొందరు వ్యక్తులు ఆయనపైకి గుడ్డు విసిరారు. ఆపై మంటతో కాసేపు ఆయన విలవిలలాడిపోయారు. దీంతో పోలీసులు ఆస్పత్రికి తరలించగా.. అక్కడ ఆయనకు రకరకాల వైద్య పరీక్షలు జరిపారు. చివరకు ఆయన బాగానే ఉన్నారని ప్రకటించి అర్ధరాత్రి పూట వైద్యులు డిశ్చార్జి చేశారు.ఇదిలా ఉంటే.. మునిరత్న నాయుడు రాజకీయాలతోనే కాదు.. సినిమాలతోనూ పేరు సంపాదించుకున్నారు. ఉపేంద్ర, దర్శన్ లాంటి అగ్ర తారాలతో ఆయన చిత్రాలను నిర్మించారు. 2013, 2018, 2020, 2024 ఎన్నికల్లో రాజరాజేశ్వరి నగర్(RR Nagar) నుంచి ఆయన ఎమ్మెల్యేగా నెగ్గారు. గతంలో కర్ణాటక కేబినెట్ మినిస్టర్గానూ పని చేశారు. అయితే.. In a dramatic incident on Wednesday, #BJP MLA #Munirathna was targeted with an egg during an event marking the birth anniversary of former Prime Minister #AtalBihariVajpayee in #Bengaluru's #NandiniLayout.Police have arrested three individuals in connection with the attack and… pic.twitter.com/TWavEBJADq— Hate Detector 🔍 (@HateDetectors) December 25, 2024ఈ ఏడాది సెప్టెంబర్లో ఆయనపై అనూహ్యమైన ఆరోపణలు వచ్చాయి. సోషల్ వర్కర్గా పని చేసే ఓ మహిళ(40) ఫిర్యాదుతో ఈ బీజేపీ ఎమ్మెల్యేపై పలు నేరాల కింద కేసు నమోదయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద మూడు రోజులుల్లో ఉండి బయటకు వచ్చారాయన. అయితే బయటకు వచ్చి కొన్నినిమిషాలకే.. అత్యాచారం కేసు(Rape Case)లో ఆయన్ని మరోసారి అరెస్ట్ చేశారు.వాపై నెలరోజులపాటు సెంట్రల్ జైల్లో గడిపిన ఆయనకు.. అక్టోబర్ మూడో వారంలో ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం ఊరట ఇస్తూ బెయిల్ మంజూరు చేసింది. గుడ్డు దాడిపై రాజకీయం తమ పార్టీ సీనియర్ నేత మునిరత్నపై కోడిగుడ్డు దాడి కాంగ్రెస్ కార్యకర్తల పనేనని బీజేపీ(BJP) ఆరోపిస్తోంది. మునిరత్న మరో అడుగు ముందుకు వేసి.. ఇది తనను చంపేందుకు జరిగిన కుట్ర అని ఆరోపిస్తున్నారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, మరికొందరు కాంగ్రెస్ నేతలు ఈ కుట్రలో భాగమయ్యారని అన్నారాయన. అయితే ఘటనపై నందిని లేఅవుట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వాళ్ల వివరాలను వెల్లడించాల్సి ఉంది. -
కుటుంబ రాజకీయాలకు చెక్..!
సాక్షి బెంగళూరు: కర్ణాటక రాష్టంలోని మూడు విధానసభ నియోజకవర్గాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో మూడు చోట్ల కాంగ్రెస్ పార్టీ విజయభేరీ మోగించింది. బీజేపీ, జేడీఎస్ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమికి ఘోర పరాజయం ఎదురైంది. అయితే ఉప ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే కుటుంబ రాజకీయాలకు కన్నడిగులు చెక్ పెట్టినట్లు అర్థం అవుతోంది. చెన్నపట్టణ, శిగ్గావి నియోజకవర్గాల్లో కుటుంబ రాజకీయాల నుంచి వచ్చిన అభ్యర్థులను ఓటర్లు తిరస్కరించారు. ఒక్క సండూరులో మాత్రమే ఈ.తుకారాం సతీమణి అన్నపూర్ణకు గెలుపు వరించింది. బీజేపీ అభ్యర్థి బంగార హనుమంతప్పపై ఈమె గెలిచారు. చెన్నపట్టణలో కేంద్ర మంత్రి, జేడీ(ఎస్)చీఫ్ హెచ్డీ కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామి, శిగ్గావిలో మాజీ ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై కుమారుడు భరత్ బొమ్మై ఓటమి పాలయ్యారు. హెచ్డీ కుమారస్వామి, డీసీఎం డీకే శివకుమార్ల ప్రతిష్టాత్మక పోటీగా నిలిచిన చెన్నపట్టణ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా బరిలో నిలిచిన నిఖిల్ కుమారస్వామి ఓడిపోవడం ద్వారా ప్రత్యక్ష ఎన్నికల్లో హ్యాట్రిక్ ఓటమిని సాధించినట్లు అయింది. ఇక్కడ బీజేపీ నుంచి ఎన్నికల ముందు టికెట్ దక్కక కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న సీనియర్ నేత సీపీ యోగేశ్వర విజయం సాధించారు. జేడీఎస్ పార్టీ కంచుకోట అయిన రామనగర జిల్లా నాలుగు నియోజకవర్గాల్లో ఒకటైన చెన్నపట్టణను కోల్పోవడం ఎన్డీఏను తీవ్రంగా నిరాశ పరిచింది. 2023 విధానసభ ఎన్నికల్లోనూ రామనగర నుంచి పోటీ చేసిన నిఖిల్ ఓడిపోయారు. అలాగే 2019 లోకసభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి, సీనియర్ నటి సుమలతా అంబరీశ్ చేతిలో కూడా నిఖిల్ పరాజయం పొందారు. తాజాగా చెన్నపట్టణలో కూడా ఓటమి పలకరించింది. హేమాహేమీలు ఇక్కడ నిఖిల్ తరపున ప్రచారం చేపట్టారు. అయినప్పటికీ సత్ఫలితాన్ని పొందలేకపోయారు.భరత్ బొమ్మైకు నిరాశేఅయితే శిగ్గావిలో తొలిసారి అదృష్టాన్ని పరీక్షించుకున్న మాజీ సీఎం బసవరాజు బొమ్మై కుమారుడు, బీజేపీ అభ్యర్థి భరత్ బొమ్మైకు నిరాశే ఎదురైంది. ఎన్నికల తొలినాళ్లలో తన కుమారుడికి టికెట్ వద్దని చెప్పిన బసవరాజు బొమ్మై ఆ తర్వాత చివరి నిమిషంలో మనసు మా ర్చుకుని టికెట్ ఇప్పించుకున్నారు. ఆలస్యంగా బరిలో దిగడం, ప్రచారానికి తక్కువ సమయం ఉండటంతో ఎక్కువమంది ఓటర్లను చేరుకోలేకపోయా రు. దీంతో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం భరత్కు కష్టంగా మారింది. భరత్ ఓటమికి ఇది కూడా ఒక కారణమే. కాంగ్రెస్ అభ్యర్థి యాసిర్ అహ్మద్ఖాన్ 13వేల ఓట్ల మెజారిటీతో భరత్పై గెలిచారు. -
Karnataka: మాజీ మంత్రి శ్రీరాములు కాంగ్రెస్లో చేరుతున్నారా?
బెంగళూరు: కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బి.శ్రీరాములు.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ను సోమవారం బెంగళూరులోని ఆయన నివాసంలో కలిశారు. దీంతో శ్రీరాములు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప కుమారుడు విజయేంద్రను పార్టీ ఇటీవల నియమించింది. దీంతో ఈ పదవిని ఆశించిన శ్రీరాములుకు భంగపాటు ఎదురైంది. ఈ నేపథ్యంలో ఆయన పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే శ్రీరాములు తన కుమార్తె వివాహానికి ఆహ్వానించేందుకు డీకే నివాసానికి వెళ్లినట్లు సమాచారం. శ్రీరాములు బొమ్మై నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో 2021 ఆగస్టు నుండి 2023 మే వరకు రాష్ట్ర రవాణా, గిరిజన సంక్షేమ శాఖలకు మంత్రిగా పనిచేశారు. అంతకుముందు 2020 అక్టోబర్ నుండి 2021 జూలై వరకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు. శ్రీరాములు ప్రస్తుతం చిత్రదుర్గ జిల్లాలోని బళ్లారి రూరల్ మొలకల్మూరు నియోజకవర్గం నుంచి రాష్ట్ర శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. -
Siddaramaiah vs DK Shivakumar: కర్ణాటకలో కుర్చీలాట!
సాక్షి, బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ పార్టిలో వర్గపోరు పెరుగుతోంది. ఎవరికి వారు వర్గాలుగా మారి సీఎం కురీ్చపై టార్గెట్ పెట్టారు. ఇందులో ముఖ్యంగా సిద్ధరామయ్య వర్గం, డీకే శివకుమార్ వర్గం పేర్లు కీలకంగా వినిపిస్తున్నాయి. ఈ సమయంలో గురువారం హోసపేట నగరంలో సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ రానున్న ఐదేళ్ల పాటు తానే సీఎంగా కొనసాగుతానని వ్యాఖ్యలు చేయడంతో డీకే శివకుమార్ వర్గం నోటిలో పచ్చి వెలక్కాయ పడ్డట్లయ్యింది. రెండున్నరేళ్ల తర్వాత అధికార మార్పిడితో తాను సీఎం అవుతానని ఆశలు పెట్టుకున్న డీకే శివకుమార్కు ఈ వ్యాఖ్యలు మింగుడు పడడం లేదు. ముఖ్యమంత్రిగా ఆరు నెలలు పూర్తి చేసుకున్న సిద్ధరామయ్య రానున్న ఐదేళ్లపాటు తానే సీఎంగా కొనసాగుతానని నర్మగర్భంగా వ్యాఖ్యలు చేయడంపై రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. సీఎం వ్యాఖ్యలపై అనుకూల, ప్రతికూల వ్యాఖ్యానాలను రాజకీయ విశ్లేషకులు చేస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టిలో ఈ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రెండున్నరేళ్ల తర్వాత తానే సీఎం అనే ఆశలతో ఉన్న ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మాత్రం తాను కేవలం హైకమాండ్ మాట మాత్రమే వింటానని, ఎవరేమి చెప్పినా పట్టించుకోనని తెలిపారు. ఇదే సమయంలో కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా అధిష్టాన నిర్ణయమే శిరోధార్యమని బాహాటంగా వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ లోలోపల ఎవరి వర్గానికి వారు మద్దతు ప్రకటిస్తూ వస్తున్నారు. ఈ విషయంపై మంత్రి ప్రియాంక్ ఖర్గే శుక్రవారం మైసూరులో విలేకరులతో మాట్లాడుతూ సీఎం వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, ఎవరిని కొనసాగించాలి, ఎవరికి అడ్డుకట్ట వేయాలనే విషయం తమ అధిష్టానం చూసుకుంటుందని తెలిపారు. మరో మంత్రి కేఎన్ రాజణ్ణ శుక్రవారం తుమకూరులో మాట్లాడుతూ మాజీ డీప్యూటీ సీఎం, హోం మంత్రి పరమేశ్వరకు కూడా సీఎం అయ్యే అర్హత ఉందని పేర్కొన్నారు. తుమకూరులో హోం మంత్రి పరమేశ్వర మాట్లాడుతూ సీఎం వ్యాఖ్యలపై తాను స్పందించబోనని చెప్పారు. అధికార పంపిణీ కేవలం సీఎం, డీసీఎం మధ్యజరిగిన చర్చ అని, అసలు ఢిల్లీలో ఎలాంటి ఒప్పందం జరిగిందనే విషయంపై వారిద్దరికే స్పష్టమైన అవగాహన ఉందని, అలాంటప్పుడు ఇది సత్యం, ఇది అబద్ధమని తానే వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. అయితే రామనగర ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ మాత్రం డీసీఎం డీకే శివకుమార్కు మద్దతు పలికారు. పోస్టు ఖాళీగా లేదు కదా! ఖాళీగా లేని ముఖ్యమంత్రి పదవిపై అవసరంగా చర్చ సాగుతోందని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోదరుడు, ఎంపీ డీకే సురేశ్ అన్నారు. ఇలాంటి చర్చకు అర్ధం లేదని వ్యాఖ్యానించారు. ‘ప్రస్తుతం సిద్ధరామయ్య సీఎంగా ఉన్నారు. సీఎం పోస్టు ఖాళీగా లేదు. ఆ పదవి ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే దీనిపై చర్చించాలి. ఇప్పుడు మాట్లాడుకోవడం వల్ల లాభం ఏమిటి?’ అని వ్యాఖ్యానించారు. -
Karnataka: కేసులు మాఫీ.. సీఎం, డిప్యూటీ సీఎంలకు ఊరట
కర్ణాటక: మేకెదాటు పాదయాత్ర సమయంలో కాంగ్రెస్ సీనియర్లు సిద్దరామయ్య, డీకే శివకుమార్, డీకే.సురేశ్లకు ఊరట కల్పిస్తూ, వారిపై నమోదైన కోవిడ్ మార్గదర్శకాల ఉల్లంఘన కేసులు ఎత్తివేయాలని కేబినెట్లో తీర్మానించారు. గతేడాది జనవరిలో మేకెదాటు ప్రాజెక్టు నిర్మాణం కోరుతూ డీకే ఆధ్వర్యంలో మేకెదాటు నుంచి బెంగళూరుకు పాదయాత్ర నిర్వహించడం తెలిసిందే. ఈ సమయంలో కోవిడ్ థర్డ్ వేవ్ నిబంధనలు అమల్లో ఉన్నాయి. గురువారం విధానసౌధలో మంత్రిమండలి సమావేశం అనంతరం మంత్రి హెచ్కే పాటిల్ వివరాలను వెల్లడించారు. రామనగరలో వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన 9 క్రిమినల్ కేసులను ఎత్తివేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. పాదయాత్రలో కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా వందలాది మందితో ర్యాలీలు చేయడంతో బొమ్మై సర్కారు కేసులు నమోదుచేసింది. పలు ముఖ్యమైన తీర్మానాలు.. ► వాణిజ్య పన్నుల శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఎంహెచ్.నాగేశ్, గత జాయింట్ డైరెక్టర్లకు నిధుల దుర్వినియోగం కేసులో సెషన్స్కోర్టు 5 ఏళ్లు జైలుశిక్ష విధించడంతో వారిని ఉద్యోగాల నుంచి తొలగించాలని తీర్మానం. ► బెంగళూరులో ఏరోస్పేస్ రక్షణ కేంద్రం ఏర్పాటుకు రూ.391 కోట్లకు పాలనాత్మక ఆమోదం. ఇందిరానగర సీవీ.రామన్ ఆసుపత్రి వైద్యురాలు ఎస్డీ.నాగమణి లోకాయుక్తకు పట్టుబడగా తప్పనిసరి రిటైర్మెంటుకు తీర్మానం. రామనగర మహిళా వైద్యురాలు డాక్టర్ ఉషా కదరమండలగికి ఇదే నిర్ణయం. ► హువినహడగలి నియోజకవర్గం విద్యాశాఖాదికారి ఎన్ఎస్. హళ్లిగుడిపై ఆరోపణలు ఉన్నందున సేవల నుంచి సస్పెండ్. ఆస్పత్రులకు నిధులు.. ►బెళగావి మెడికల్ కాలేజీలో 325 పడకల సూపర్ స్పెషాలిటి ఆసుపత్రికి రూ.187 కోట్ల మంజూరు ► కరావళి అభివృద్ధి ప్రాధికార పేరును కరావళి ప్రాదేశికాభివృద్ధి మండలి అని పేరు మార్పు ► ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ నియోజకవర్గాల్లో 20 సంచార ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు. రూ. 47 కోట్లతో ఐదు జిల్లా ఆసుపత్రులైన మైసూరు, చిత్రదుర్గ, సీవీ రామన్నగర, వెన్లాక్ ఆసుపత్రి, కేసీ.జనరల్ ఆసుపత్రుల్లో 15 ఎంఆర్ఐ స్కానింగ్ సేవలు. కొత్తగా సైబర్ భద్రతా చట్టం ► కర్ణాటక సైబర్ భద్రతా చట్టం 2023 –24 కు అనుమతి. రాష్ట్రంలో పెరుగుతున్న సైబర్ నేరాల కట్టడి నేపథ్యంలో సైబర్ భద్రతకు చట్టం ఆమోదం● సమగ్ర శిశు అభివృద్ధి పథకంలో పామాయిల్కు బదులుగా సన్ ఫ్లవర్ నూనె పంపిణీ. ► బీబీఎంపీ చట్టాన్ని ఇతర మహానగర పాలికె, నగర సభ, పురసభల్లో అమలుకు పరిశీలన, అలాగే అక్రమ కట్టడాలు, బయలు భూమిపై పన్ను విధింపు పరిశీలనకు మంత్రి వర్గ ఉపసమితి ఏర్పాటు. -
కన్నడ నాట పొత్తు రాజకీయం
శివాజీనగర: రానున్న లోక్సభ ఎన్నికల్లో కన్నడనాట బీజేపీ, జేడీఎస్ పార్టీలు పొత్తు పెట్టుకోవాలని జాతీయస్థాయి నాయకులు భావిస్తుంటే, రాష్ట్ర బీజేపీ ఇందుకు సుముఖంగా లేదని తెలుస్తోంది. తమ ఓటు బ్యాంకును అప్పనంగా జేడీఎస్కు అప్పజెప్పడమేనని రాష్ట్ర బీజేపీ నాయకులు ఆందోళనతో ఉన్నారు. ఈ ఏడాది మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్లను కాదని ప్రతిపక్ష కాంగ్రెస్ విజయదుందుభి మోగించి సర్కారును ఏర్పాటు చేయడం తెలిసిందే. మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలవకుండా చేతులు కలపాలని జేడీఎస్, బీజేపీలు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై బీజేపీ హైకమాండ్తో జేడీఎస్ అగ్రనేత హెచ్డీ కుమారస్వామి చర్చలు జరిపేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 18న ఢిల్లీలో ఎన్డీఏ సమావేశం జరగనుంది. దీనికి జేడీఎస్ను ఆహ్వానించాలని బీజేపీ హైకమాండ్ యోచిస్తోంది. పిలుపు వస్తే వెళ్లాలని కుమారస్వామి సిద్ధమయ్యారు. అక్కడ చర్చలు ఫలిస్తే లోక్సభ ఎన్నికలకు పొత్తు కుదిరే అవకాశముంది. కానీ కుమారస్వామితో పొత్తు పెట్టుకొంటే పాత మైసూరు భాగంలో పార్టీ ప్రభావం తగ్గుతోంది, అంతేకాకుండా ఒక్కలిగుల ఓట్ బ్యాంకును కోల్పోతాము. పొత్తు వద్దని బీజేపీ రాష్ట్ర నాయకులు, అందులోనూ ఒక్కలిగ నేతలు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఇది గ్రహించిన కుమారస్వామి రాష్ట్ర నాయకులను కాదని బీజేపీ కేంద్ర నాయకులతో పొత్తు చర్చలకు సిద్ధంగా ఉన్నారు. జేడీఎస్తో చేతులు కలిపి ఎక్కువ ఎంపీ స్థానాలను గెలుపొందాలని బీజేపీ కూడా ఆశిస్తోంది. గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ రికార్డుస్థాయిలో 20కి పైగా ఎంపీ సీట్లను గెలుచుకుంది. ఈసారి అదే జాదూను పునరావృతం చేయాలనుకుంటోంది. కాగా, బీజేపీ–జేడీఎస్ పొత్తు వార్తలపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. అవకాశవాద జేడీఎస్ పార్టీ అధికారం కోసం ఎంతకైనా దిగజారుతుందని ఆరోపించింది. జేడీఎస్ను చీల్చేందుకు కాంగ్రెస్ ఎత్తుగడ ఇదిలా ఉండగా, అధికార కాంగ్రెస్ పార్టీ మరో ఎత్తుగడలో ఉంది. బీజేపీతో పొత్తును వ్యతిరేకిస్తున్న జేడీఎస్ ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకోవాలని చూస్తోంది. సుమారు 12 జేడీఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లోకి తీసుకు రావటం ద్వారా పార్టీ ఫిరాయింపు చట్టం వర్తించకుండా చూడాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్య భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జేడీఎస్కు 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అలా వచ్చే వారికి మంత్రి పదవులు, నామినేటెడ్ పోస్టులను ఇవ్వాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. అదనుచూసి జేడీఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవాలని పథకం వేస్తోంది. చర్చలు జరిగాయి: బొమ్మై పొత్తు గురించి బీజేపీ మాజీ సీఎం బస్వరాజ బొమ్మై ఆదివారం స్పందిస్తూ తమ హైకమాండ్, జేడీఎస్ అధినేత దేవేగౌడ మధ్య పొత్తులపై చర్చలు జరిగాయన్నారు. చర్చలు సఫలమైతే రాజకీయ మార్పులు తథ్యమన్నారు. -
ముహూర్తం ఫిక్స్.. కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరంటే?
సాక్షి, ఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు వెలువడి నాలుగు రోజులు గడిచినా కానీ, సీఎం ఎవరన్నదానిపై కాంగ్రెస్ పార్టీ ఇంకా ఓ నిర్ణయానికి రాలేకపోయింది. అయితే, ఎట్టకేలకు బుధవారం.. ఉత్కంఠకు తెరపడింది. సిద్ధూకు ఒకే అన్న కాంగ్రెస్ అధిష్టానం.. మరికాసేపట్లో ప్రకటన వెలువరించే అవకాశం ఉంది. కాగా, ముందుగా ఢిల్లీ వెళ్లిన సిద్ధరామయ్య.. ఖర్గేతో మంగళవారం ఓ దఫా చర్చలు జరిపారు. నిన్న ఉదయం కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కూడా ఢిల్లీ వెళ్లి ఖర్గేతో సమావేశమై చర్చలు జరిపారు. నిన్న మల్లికార్జున్ ఖర్గే నివాసంలో నిరంతరం సమావేశాలు, చర్చలు జరిగినా ఎలాంటి నిర్ణయానికి రాలేకపోయారు. కాగా, రాహుల్ గాంధీతో సిద్దరామయ్య బుధవారం సమావేశమయ్యారు. అరగంట పాటు రాహుల్తో చర్చించారు. సిద్ధరామయ్య వైపే కాంగ్రెస్ హైకమాండ్ మొగ్గు చూపుతున్నట్లు మధ్యాహ్ననికి క్లారిటీ రాగా, సాయంత్రానికి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. రొటేషన్ సీఎం ఫార్ములాను కాంగ్రెస్ హైకమాండ్ సూచిస్తోంది. డీకే శివకుమార్కు డిప్యూటీ సీఎం ఇచ్చే అవకాశం ఉంది. రాహుల్గాంధీని డీకే శివకుమార్ కూడా కలిశారు. కర్ణాటక సీఎం అభ్యర్థిపై అధిష్టాన నిర్ణయాన్ని డీకేకి రాహుల్ తెలిపారు. చదవండి: కాషాయ పార్టీకి షాకిచ్చిన ఆ ఓటర్లు.. కాంగ్రెస్కు కలిసొచ్చిన అంశాలు ఇవే! రేపు(గురువారం) సాయంత్రం బెంగుళూరులో సీఎల్పీ భేటీ జరగనుంది. కర్ణాటకలో సిద్ధరామయ్య ఇంటి దగ్గర భద్రత పెంచారు. రేపు ప్రమాణస్వీకారం ఉంటుందని సిద్ధూ అనుచరులు అంటున్నారు. -
Karnataka, assembly elections 2023: మైకులు బంద్
బెంగళూరు: కర్ణాటకలో మైకులు మూగబోయాయి. నెలకు పైగా జోరుగా కొనసాగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సోమవారంతో తెరపడింది. పార్టీలు, అభ్యర్థులు మంగళవారం కేవలం ఇంటింటి ప్రచారానికే పరిమితం కావాల్సి ఉంటుంది. కాంగ్రెస్ తరఫున రాహుల్, ప్రియాంక, పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే తదితరులు నెల రోజులుగా ముమ్మరంగా ప్రచారంలో పాల్గొన్నారు. బసవరాజ్ బొమ్మై సారథ్యంలోని బీజేపీ సర్కారును 40 శాతం కమీషన్ల ప్రభుత్వంగా అభివర్ణిస్తూ అవినీతే ప్రధానాంశంగా ప్రజల్లోకి వెళ్లారు. ఇక బీజేపీ పూర్తిగా ప్రధాని మోదీపైనే ఆశలు పెట్టుకుంది. అమిత్ షా, నడ్డా వంటి అతిరథులు రంగంలోకి దిగినా ప్రధానంగా మోదీయే సుడిగాలి పర్యటనలు, వరుస సభలు, రోడ్షోలతో హోరెత్తించారు. ఎన్నికల షెడ్యూలుకు ముందు నుంచే కర్ణాటకలో పదేపదే పర్యటించిన ఆయన, 10 రోజుల్లో ఏకంగా 19 భారీ బహిరంగ సభలు, ఆరు రోడ్షోలతో రాష్ట్రమంతటా చుట్టేశారు. డబుల్ ఇంజిన్ సర్కారుతోనే స్థిరత్వం, అభివృద్ధి సాధ్యమంటూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. 40 శాతం కమీషన్ల సర్కారు విమర్శలకు విరుగుడుగా కాంగ్రెస్ 85 శాతం కమిషన్ల పార్టీ అంటూ ప్రతి దాడికి దిగారు. ఇక ప్రచారం చివరి దశలో బజరంగ్ దళ్ను నిషేధిస్తామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన హామీని బీజేపీ రెండు చేతులా అందిపుచ్చుకుంది. ఆ పార్టీని హిందూ వ్యతిరేకిగా చిత్రించేందుకు శాయశక్తులా ప్రయత్నించింది. బీజేపీ జాతీయ నేతలు మొత్తం 206 సభలు, 90 రోడ్షోలు, రాష్ట్ర నేతలు 231 బహిరంగ సభలు, 48 రోడ్ షోలు నిర్వహించారు. ఇక కాంగ్రెస్ జాతీయ, రాష్ట్ర నేతలంతా కలిసి 99 బహిరంగ సభలు, 33 రోడ్షోలు జరిపారు. విషసర్పం, పనికిమాలిన కుమారుడు, విషకన్య తదితర వ్యక్తిగత విమర్శలు ఈసారి కాంగ్రెస్, బీజేపీ ప్రచారంలో హైలైట్గా నిలిచాయి. 2024 లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో అధికారాన్ని నిలబెట్టుకోవాలని కమలనాథులు, ఎలాగైనా గెలిచి విశ్వాసాన్ని ప్రోది చేసుకోవాలని కాంగ్రెస్ పట్టుదలగా ప్రయత్నించాయి. ఈసారి ఎలాగైనా పూర్తి మెజారిటీ సాధనే లక్ష్యంగా రెండు పార్టీలూ పరిశ్రమించాయి. జేడీ(ఎస్) నేతలు కూడా నిప్పులు చెరిగే ఎండల్లో చెమటలు కక్కారు. ఇప్పుడిక బుధవారం జరగబోయే కీలకమైన పోలింగ్ మీదే అందరి దృష్టీ నెలకొంది. అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చే ఫలితాలు 13వ తేదీన వెలువడనున్నాయి. రూ.375 కోట్లు జప్తు కర్ణాటక ఎన్నికల ప్రచారంలో డబ్బు కట్టలు తెంచుకుని పారింది. మార్చి 29 నుంచి ఏకంగా రూ.375.6 కోట్ల మేరకు నగదు తదితరాలను స్వాధీనం చేసుకున్నట్టు ఈసీ వెల్లడించింది. ఇందులో రూ.147 కోట్లు నగదు, రూ.84 కోట్ల విలువైన మద్యం, రూ.97 కోట్ల విలువైన బంగారం, వెండి, రూ.24 కోట్ల విలువైన కానుకలు, రూ.24 కోట్ల డ్రగ్స్ ఉన్నాయి. వీటికి సంబంధించి ఏకంగా 2,896 ఎఫ్ఐఆర్లు దాఖలయ్యాయి. మార్చి 29కి ముందు కూడా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు తరలిస్తున్న రూ.58 కోట్ల విలువైన నగదు తదితరాలు దొరికాయి. -
కన్నడనాట తెలుగువాడి వేడి.. వలస ఏ పార్టీకో! ఆరు రాష్ట్రాలతో సరిహద్దులు
సాక్షి బెంగళూరు : కర్ణాటక ఎన్నికల్లో ఒక పార్టీ విజయం సాధించాలంటే కన్నడిగుల ఓట్లు మాత్రం పడితే చాలనుకుంటే పొరపాటు పడ్డట్లే..! దశాబ్దాలుగా కన్నడ నాట ఇరుగు పొరుగు రాష్ట్రాల ఓటర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. మరే ఇతర రాష్ట్రానికి లేని విదంగా దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక ఏకంగా ఆరు రాష్ట్రాలతో సరిహద్దుల్ని పంచుకుంటోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాలతో సరిహద్దులున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల నుంచి వచ్చే వలసలు ఎక్కువే. బెంగుళూరు వంటి మహానగరంలో వ్యాపారాలు, ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడిన వారెందరో ఉన్నారు. రాష్ట్రంలో 65.45 లక్షల మందివరకు వలసదారులు ఉన్నారు. వీరి ఓట్ల కోసం అన్ని పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇక ఈ సారి ఎన్నికల బరిలో కూడా ఎందరో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తెలుగు మూలాలున్న వారు 100 మంది, మరాఠా మూలాలున్న వారు 50 మందికి పైగా, తమిళులు 10 మంది వరకు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. బెంగళూరులో ఎవరి జనాభా ఎంత? ► రాజధానిలో 44 శాతం కన్నడిగులు ఉంటే 56 శాతం ఇతర భాషా ప్రజలు ఉన్నారు. తెలుగు వారు అత్యధికంగా 25–30 లక్షల మంది ఉన్నారు. ► తమిళులు 16–17 లక్షల మంది ఉంటే మళయాలీలు 4–5 లక్షలు ఉన్నారు ► ఇక ఉత్తరాది రాష్ట్రాల జనాభా 11–12% ఉన్నారు.రాజస్తాన్, బిహార్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. ఇటీవల కాలంలో జార్ఖండ్, త్రిపుర నుంచి కూడా వలసలు పెరిగాయి. ► రాజస్తాన్కు చెందిన జైన సామాజికవర్గం ప్రజలు బెంగళూరులో చాలా చోట్ల నివసిస్తూ ఎన్నికల్లో నిర్ణయాకత్మకమైన పాత్రను పోషిస్తున్నారు. తెలుగు వాడి వేడి కర్ణాటకలో దాదాపుగా 40–50 అసెంబ్లీ స్థానాల్లో తెలుగువారి ప్రభావం అధికంగా ఉంది. రాష్ట్రంలో సుమారు కోటి మంది వరకు తెలుగు ప్రజలు కర్ణాటకలో నివసిస్తున్నట్లు అనధికారిక సమాచారం. పలు దశాబ్దాలుగా వివిధ కారణాలతో కర్ణాటకకు వచ్చి ఇక్కడి కన్నడిగులతో మిళితమై తెలుగు వారు జీవనం సాగిస్తున్నారు. ఉద్యోగ, వ్యాపారాలు చేసుకుంటూ స్థిరపడిపోయారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగాన్ని నిర్వహిస్తున్న వారిలో అధిక భాగం తెలుగు ప్రాంత ప్రజలే కావడం గమనార్హం. ఒక్క బెంగళూరులోనే సుమారు 25 లక్షలకు పైగా తెలుగు వారు ఉన్నారు. కర్ణాటకలో కన్నడ, ఉర్దూ తర్వాత అత్యధికంగా మాట్లాడే భాషల్లో తెలుగు మూడో స్థానంలో ఉంది. బెంగళూరులోని కేఆర్ పురం, రామ్మూర్తినగర, హెబ్బాళ, మారతహళ్లి, మహదేవపుర, యలహంకా, దేవనహళ్లితో పాటు ఏపీ, తెలంగాణ సరిహద్దు కలిగిన బళ్లారి జిల్లా, బీదర్, కలబురిగి, రాయచూరు, యాదగిరి, బసవకల్యాణ, కోలార, తుమకూరు, చిత్రదుర్గ, చిక్కబళ్లాపుర జిల్లాల్లో తెలుగు వారు అధికంగా ఉన్నారు. 1947లో ఏర్పడిన మైసూరు రాష్ట్రానికి తెలుగు వ్యక్తి క్యాసంబల్లి చెంగరాయరెడ్డి ఎన్నికయ్యారు. 1956లో కర్ణాటక రాష్ట్రం ఏర్పడ్డాక ఎందరో తెలుగువారు రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. ఓట్ల కోసం వ్యూహాలు కర్ణాటకకు పొట్ట చేతపట్టుకొని వచ్చిన వలసదారులు గుర్తింపు సమస్యని అధికంగా ఎదుర్కొంటున్నారు. 65 లక్షల మంది వలసదారుల్లో ఎంత మందికి కర్ణాటకలో ఓటు హక్కు ఉందో అన్న దానిపై స్పష్టమైన గణాంకాలేవీ లేవు. కార్మికులుగా పని చేస్తున్న వారికి తాగు నీరు, ఉండడానికి ఇల్లు, పారిశుద్ధ్యం, విద్యుత్ వంటివన్నీ సమస్యలుగానే ఉన్నాయి. టీ, కాఫీ తోటల్లో పని చేస్తున్న కూలీలు కూడా అధిక సంఖ్యలోనే ఉన్నారు. అధికార బీజేపీ వీరిని సంప్రదిస్తూ రేషన్ కార్డులు ఇప్పించడం, ప్రభుత్వం పథకాలు వారికి అందేలా చూస్తామని హామీలు ఇస్తోంది. వలసదారుల ఓట్లను రాబట్టేందుకు వివిధ రాష్ట్రాలకు చెందిన యువ ఎమ్మెల్యేలు, ఎంపీలను రంగంలోకి దింపింది. గుజరాత్కు చెందిన హార్దిక్ పటేల్ సహా వివిధ రాష్ట్రాల యువ నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా వివిధ భాషలకు చెందిన వారి ఓట్లను రాబట్టేందుకు ఆయా రాష్ట్రాల నాయకుల్ని ప్రచార పర్వంలోకి తీసుకువచ్చింది. -
Karnataka assembly elections 2023:ఎవరిదో రాజధాని!
రాష్ట్రాన్ని గెలవాలంటే ముందు రాజధానిని గెలవాలి. కర్ణాటకలో అధికారిక పీఠానికి తాళాలు బెంగళూరులోనే ఉన్నాయి. బీజేపీకీ, కాంగ్రెస్కూ ఈ విషయం బాగా తెలుసు. దాంతో ఈసారి అధికార విపక్షాల మధ్య సిలికాన్ సిటీలో సంకుల సమరం సాగుతోంది. సాక్షి, బెంగళూరు: బెంగళూరులో ఎక్కువ సీట్లు గెలిచిన పార్టీయే కర్ణాటకలో అధికారంలోకి వస్తుందని గడచిన పలు ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే తెలుస్తోంది. అందుకే బెంగళూరు పరిధిలోని 28 అసెంబ్లీ స్థానాల్లో అత్యధిక స్థానాలు నెగ్గి అధికారంలోకి రావాలని బీజేపీ, కాంగ్రెస్ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. గడిచిన మూడు అసెంబ్లీ ఎన్నికల్లో తీరు తెన్నులు.. ► 2008లో బెంగళూరులో బీజేపీ 17, కాంగ్రెస్ పార్టీ 10 సీట్లు గెలవగా జేడీ(ఎస్) ఒక్క స్థానానికి పరిమితమైంది. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసి దక్షిణ భారతంలో తొలిసారి ఆ ఘనత సాధించింది. ► 2013 ఎన్నికల్లో కాంగ్రెస్ 13, బీజేపీ 12, జేడీ(ఎస్) 3 సీట్లు గెలిచాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సిద్ధరామయ్య తొలిసారి సీఎం అయ్యారు. ► 2018లో కాంగ్రెస్15, బీజేపీ 11, జేడీ(ఎస్) 2 స్థానాలు దక్కించుకున్నాయి. కాంగ్రెస్, జేడీ(ఎస్) సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కుమారస్వామి సీఎం అయ్యారు. కానీ సర్కారు బలపరీక్షలో ఓడి 14 నెలలకే కుప్పకూలింది. ► 2019లో కాంగ్రెస్, జేడీ(ఎస్) సభ్యులు బీజేపీకి ఫిరాయించడంతో 15 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయ ముఖచిత్రమే మారిపోయింది. బీజేపీ ఏకంగా 12 సీట్లు నెగ్గింది. అలా బెంగళూరులో బీజేపీ బలం 15కు పెరగగా కాంగ్రెస్ 11 స్థానాలకు పడిపోయింది. బీజేపీ అధికారాన్ని స్థిరపరచుకుంది. వేధిస్తున్న తక్కువ ఓటింగ్ బెంగళూరులో ప్రతిసారీ తక్కువ ఓటింగ్ శాతం నమోదవుతుండడం పరిపాటిగా వస్తోంది. 2013, 2018 ఎన్నికల్లో ఓటింగ్ శాతం బాగా పడిపోయింది. సగానికి సగం, అంటే నియోజకవర్గాల్లో మరీ తక్కువ ఓటింగ్ నమోదవుతూ వస్తోంది. బెంగళూరు వాసులు ఓటింగ్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపరన్న అపప్రథా ఉంది. దీన్ని ఈసారైనా తొలగించుకుంటారా అన్నది చూడాలి. ► 2013 ఎన్నికల్లో బెంగళూరు పరిధిలో కేవలం 55.04% ఓటింగ్ నమోదైంది. 2018లో అది కాస్తా 48.03 శాతానికి తగ్గింది. ► దాంతో ఈసారి ఎలాగైనా రాజధానిలో ఓటింగ్ శాతాన్ని పెంచడంపై ఎన్నికల సంఘం ప్రధానంగా దృష్టి పెట్టింది. కొద్ది రోజులుగా ప్రత్యేక ర్యాలీలు, వాకథాన్లు, ప్రచారాలు చేపడుతోంది. తటస్థ ఓటర్లే కీలకం ► ట్రాఫిక్ సమస్య, మౌలిక వసతుల లేమి వంటి పలు సమస్యలు బెంగళూరును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎవరు అధికారంలోకి వచ్చినా ఈ సమస్యల పరిష్కారంలో విఫలమవుతున్నారన్నది నగరవాసుల ప్రధాన ఆరోపణ. ► ఇక్కడ 15 నుంచి 20 శాతం ఓటర్లు కులమతాలకు అతీతంగా తటస్థంగా ఉంటారు. ► వీరిని తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ► బీజేపీ అవినీతి, పాలన వైఫల్యాలు, కుంభకోణాలను ప్రచారం చేస్తూ నగర వాసులను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. శాంతినగర, సర్వజ్ఞ నగర వంటి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎంతో బలంగా ఉంది. ► ఇక తటస్థ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు బీజేపీ నేతలు ఇంటింటి ప్రచారానికి దిగారు. ► కాంగ్రెస్, జేడీ(ఎస్)ల నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలతో నగరంలో బీజేపీ బలంగా కనిపిస్తోంది. -
ఆదర్శనేత సురేశ్ గౌడ
తుమకూరు: సురేష్ గౌడ్ ఒక ఆదర్శవంతమైన నేత అని, మోసంతో గతంలో ఓడిపోయారని, ఈసారి 50 వేల ఓట్ల మెజారిటీతో గెలిపించాలని మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప పిలుపునిచ్చారు. తుమకూరు గ్రామీణ నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా యడియూరప్ప మాట్లాడుతూ సురేశ్ గౌడ వంటి ఎమ్మెల్యే ఇంకొకరు దొరకరని, ఎంతో ప్రామాణికంగా పని చేశారని కొనియాడారు. ఈసారి మాత్రం కచ్చితంగా చట్టసభకు సురేశ్ గౌడను పంపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మళ్లీ బీజేపీదే అధికారం శివాజీనగర: విధానసభ ఎన్నికల్లో బీజేపీ పూర్తి మెజారిటీతో మళ్లీ అధికారం చేపడుతుందని బెంగళూరు సెంట్రల్ ఎంపీ పీ.సీ.మోహన్ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. సోమవారం సర్వజ్ఞన నగర బీజేపీ అభ్యర్థి పద్మనాభరెడ్డికి మద్దతుగా బాణసవాడి, సేవానగర తదితర ప్రాంతాల్లో రోడ్షో నిర్వహించి ప్రచారం చేపట్టి ఈ సందర్భంగా మాట్లాడారు. కేంద్రంలో ప్రధాని మోదీ ప్రభుత్వ సాధనాలు, రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి పనులే తమ పార్టీ అభ్యర్థులు గెలుపునకు అవకాశమన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే కే.జే.జార్జ్కు పోటీగా బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థి పద్మనాభరెడ్డిని గెలిపించాలన్నారు. -
Karnataka assembly election 2023: రాజకీయాల్లో నటీనటులు
సాక్షి, ఎన్నికల డెస్క్: దక్షిణాది రాష్ట్రాలలో రాజకీయాలకు– సినీ తారలకు విడదీయలేని అనుబంధం ఉంటుంది. తమిళనాడు, ఏపీ, కర్ణాటక ఏది చూసినా సినిమాలు– రాజకీయాలు పెనవేసుకుని కనిపిస్తాయి. కొంతకాలంగా కన్నడ చిత్రసీమ శాండల్వుడ్ నుంచి సినీనటులు రాజకీయ రంగంపై చాలా మంది ఆసక్తి చూపించారు. అయితే ఈ విధానసభ ఎన్నికల్లో ఎందుకనో ఎక్కువమంది తారలు చురుగ్గా పాల్గొనడం లేదు. ఒకరో ఇద్దరో బరిలో ఉండగా, తక్కువమంది మాత్రమే నేతలకు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రముఖులు కొందరే ఇప్పటివరకు ఎన్నికల ప్రచారంలో సినీ నటీనటులు ఓ మోస్తరుగానే ఉన్నారు. ఎన్నికల బరిలో ప్రముఖ నటులు కూడా లేకపోవడం విశేషం. రాజకీయ నేతలు ఎవరూ కూడా సినీ తారలకు రెడ్ కార్పెడ్ పరిచినట్లు లేదు. జేడీఎస్ తరఫున రామనగర నుంచి వర్ధమాన నటుడు నిఖిల్ పోటీలో ఉన్నారు. బీజేపీకి, సీఎం బొమ్మైకి మద్దతుగా నటుడు కిచ్చా సుదీప్ కొన్ని నియోజకవర్గాల్లో ప్రచారానికి పరిమితం అయ్యారు. మరో ప్రముఖ నటుడు దర్శన్దీ అదే తీరు. కేజీఎఫ్ హీరో యశ్ ఎన్నికల ఛాయలకే రాలేదు. గతంలో ప్రజాకీయ పార్టీని పెట్టిన ఉపేంద్ర మళ్లీ ఆ ఊసే ఎత్తలేదు. కాంగ్రెస్ లీడర్ రమ్య ఎక్కడ? అందాల నటి, మాజీ ఎంపీ రమ్య అలియాస్ దివ్యస్పందన తారాజువ్వలా ఎగిశారు. ఆమె తల్లి రజిత కాంగ్రెస్లో చురుగ్గా పని చేశారు. నటి రమ్య 2012లో కాంగ్రెస్లో చేరి మండ్య ఉప ఎన్నికలో పోటీ చేసి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత 2014 సాధారణ ఎన్నికల్లో మరోసారి మండ్య నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి మూటగట్టుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగంలో ఉన్నప్పటికీ కన్నడనాట ప్రచారానికి దూరంగానే ఉండడం చర్చనీయాంశమైంది. అంబరీశ్దే అగ్రస్థానం కన్నడ రెబల్స్టార్ 1994లో కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తర్వాత జనతాదళ్లో (1996 – 99) చేరి మండ్య నుంచి ఎంపీగా పోటీ చేసి పార్లమెంటులో అడుగుపెట్టారు. తిరిగి సొంతగూటికి చేరుకుని మరోసారి పార్లమెంటుకు ఎన్నికై కేంద్రమంతి అయ్యారు. అంబరీశ్ సతీమణి సుమలత 2019లో మండ్య నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు ఆమె తరఫున నటులు దర్శన్, యశ్ ముమ్మరంగా ప్రచారం చేయడం తెలిసిందే. రాజకీయాల్లో నటీనటులు ► పోలీసు అధికారిగా పని చేసిన బీసీ పాటిల్ తర్వాత సినీ రంగం వైపు దృష్టి సారించారు. వెండితెరపై రాణిస్తూనే రాజకీయాల్లో రంగప్రవేశం చేశారు. ప్రస్తుతం వ్యవసాయ శాఖమంత్రిగా కొనసాగుతున్నారు. ► తెలుగు, కన్నడ సినిమాల్లో నటించిన సాయికుమార్ చిక్కబళ్లాపుర బాగేపల్లి నుంచి బీజేపీ తరఫున రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినా అదృష్టం కలిసిరాలేదు. ఆపై రాజకీయాల వైపు చూడలేదు. ► జస్ట్ ఆస్కింగ్ అంటూ 2018 ఎన్నికల్లో కన్నడనాట ఆకర్షించిన వైవిధ్య నటుడు ప్రకాష్రాజ్ ఈ ఎన్నికల్లో కనిపించనేలేదు. ఏ పార్టీకి మద్దతుగా గళమెత్తలేదు. గతంలో ఆయన ప్రధాని మోదీపై విమర్శలు చేశారు. ► రెండు దశాబ్దాల పాటు వెండితెరపై వెలిగిన తార శృతి. బీజేపీలో మహిళా విభాగం నేతగా కొనసాగుతున్నారు. ► సుమారు 300 చిత్రాల్లో నటించిన అనంత్నాగ్ ఆరు ఫిలిం ఫేర్ అవార్డులు సొంతం చేసుకున్నారు. తర్వాత రాజకీయాల్లో చేరి జేహెచ్ పటేల్ ప్రభుత్వంలో ఎమ్మెల్సీ అయ్యారు. మళ్లీ చురుకై న పాత్ర పోషించలేదు. ► కన్నడ చిత్రాల్లో సహాయక నటిగా రాణించిన ఉమాశ్రీ హాస్యం పండించి ఆకట్టుకునేది. 2013లో కాంగ్రెస్లో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. సిద్ధరామయ్య మంత్రివర్గంలో మహిళా శిశు సంక్షేమ మంత్రిగా పని చేశారు. ► సినిమాల్లో సహాయక నటిగా రాణించిన తార అనురాధ బీజేపీలో చేరి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. కర్ణాటక చలనచిత్ర అకాడమీ చైర్మన్గా వ్యవహరించారు. తర్వాత ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్నారు. -
Karnataka assembly election 2023: వారికి మతి పోయింది
సాక్షి, బళ్లారి: ప్రధాని మోదీ విషసర్పమన్న ఖర్గే చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీకి, వారి నేతలకు మతి భ్రమించిందనేందుకు రుజువని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా దుయ్యబట్టారు. శుక్రవారం కర్ణాటకలో గదగ్, ధార్వాడ జిల్లాల్లో ఆయన పలు సభలో మాట్లాడారు. ‘‘మోదీని విషసర్పంతో పోల్చడం ఆ పార్టీ ఎంతగా దిగజారిందనేందుకు రుజువు. వారెంతగా విమర్శిస్తే అంతగా ఆయనకు ప్రజల్లో మద్దతు పెరుగుతుంది’’ అన్నారు. ‘తీవ్రవాద భావజాల పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)ను నిషేధించినందుకు నాపై కేసు పెట్టారు. పీఎఫ్ఐను కాంగ్రెస్ నెత్తిన పెట్టుకుంది. దానిపై నిషేధం తర్వాత కర్ణాటక సురక్షితంగా ఉంది’’ అన్నారు. ‘‘సీఎం తానంటే తానని పీసీసీ చీఫ్ డీకే శివకుమార్, సిద్ధరామయ్య వాదులాడుకుంటున్నారు. అవసరం లేదు. సీఎం బీజేపీ వ్యక్తే అవుతారు. కన్నడ ఓటర్లు బీజేపీనే గెలిపిస్తారు. ఓటర్ల నమ్మకం కోల్పోయిన కాంగ్రెస్ వాగ్దానాలను ఎవరు విశ్వసిస్తారు?. కొన్ని విషయాల్లో మాత్రం కాంగ్రెస్ ఇచ్చే గ్యారెంటీని ఖచ్చితంగా నమ్మవచ్చు. అవి.. అబద్దాలు, అవినీతి, కులతత్వం, వంశపాలన, బుజ్జగింపు రాజకీయాలు’ అంటూ అమిత్ షా ఎద్దేవా చేశారు. -
Karnataka assembly elections 2023: కొన్ని పార్టీలకు రాజకీయాలంటే అవినీతి
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయమే లక్ష్యంగా బీజేపీ కార్యకర్తలంతా కష్టపడి పనిచేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ గురువారం బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి వర్చువల్గా ప్రసంగించారు. వారికి దిశానిర్దేశం చేశారు. కర్ణాటకలో ఓటర్లకు ప్రతిపక్ష కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ఆయన వ్యంగ్యాస్త్రాలు విసిరారు. కాంగ్రెస్ వారంటీ ఎప్పుడో ముగిసిపోయిందని, ఆ పార్టీ ఇచ్చే గ్యారంటీలకు అర్థంపర్థం లేదని ఎద్దేవా చేశారు. ఉచిత పథకాలపై మోదీ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి పథకాల వల్ల రాష్ట్రాలు దివాలా తీయడం ఖాయమని చెప్పారు. భవిష్యత్తు తరాలకు దక్కాల్సిన ప్రయోజనాలను ఈ ఉచిత పథకాలు మింగేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఉచితాల సంస్కృతికి తెరపడాలని మోదీ స్పష్టం చేశారు. ప్రజల ఆశీస్సులు కోరుతా.. ‘మన దేశంలో రాజకీయాలు అంటే అర్థం అధికారం, అవినీతిగా కొన్ని పార్టీలు మార్చేశాయి. అధికారం కోసం ఆయా పార్టీలు సామ దాన భేద దండోపాయాలన్నీ ప్రయోగిస్తున్నాయి. దేశ భవిష్యత్తు గురించి, కర్ణాటకలోని యువత, మహిళల భవిష్యత్తు గురించి ఏమాత్రం ఆలోచించడం లేదు’అని మండిపడ్డారు. కర్ణాటక ప్రజలు బీజేపీపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారని, ఈ నమ్మకాన్ని వమ్ము కానివ్వబోమని చెప్పారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వాల వల్ల దక్కే లాభాలను బూత్స్థాయిలో ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. రాబోయే రోజుల్లో పార్టీ కార్యకర్తలతో కలిసి పని చేస్తానని చెప్పారు. ఒక కార్యకర్తగా కర్ణాటక ప్రజల వద్దకు వెళ్లి, వారి ఆశీస్సులు కోరుతానని వివరించారు. ‘ఫస్ట్ డెవలప్ ఇండియా’ షార్ట్కట్లను తాము నమ్ముకోవడం లేదని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఆత్యాధునిక భౌతిక, డిజిటల్, సామాజిక మౌలిక సదుపాయాల కల్పనకు భారీగా నిధులు వెచ్చిస్తున్నామని గుర్తుచేశారు. ఎఫ్డీఐ అంటే తమకు ‘ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్’ కాదని, ‘ఫస్ట్ డెవలప్ ఇండియా’ అని వివరించారు. ఐదేళ్ల పాలనా కాలం గురించి యోచించడం లేదని, దేశం గురించి ఆలోచిస్తున్నామని పేర్కొన్నారు. పార్టీ కాదు, దేశమే తమకు ముఖ్యమని చెప్పారు. -
Karnataka assembly elections 2023: ‘కల్యాణం’ఎవరికో?
కల్యాణ (హైదరాబాద్) కర్ణాటక. కన్నడ సీమలో అత్యంత వెనకబడ్డ మెట్ట ప్రాంతం. దశాబ్దాలుగా కాంగ్రెస్కు కంచుకోటగా నిలుస్తూ వస్తోంది. రాష్ట్రంలో బీజేపీ రెండుసార్లు 100కు పైగా స్థానాలు ఒడిసిపట్టినా మెజారిటీ మార్కును దాటలేకపోవడానికి ఈ ప్రాంతంలో పట్టు లేకపోవడమే ప్రధాన కారణం. దాంతో ఈసారి రెండు పార్టీలకూ కల్యాణ కర్ణాటక కీలకంగా మారింది. పట్టు కొనసాగించాలని కాంగ్రెస్, కోటను ఎలాగైనా బద్దలు కొట్టాలని బీజేపీ పట్టుదలగా ఉన్నాయి. ఇక్కడ ఎప్పుడూ ఐదు స్థానాలకు మించి గెలవని జేడీ(ఎస్) ఈసారి బీజేపీ, కాంగ్రెస్ రెబెల్స్ను బరిలో దించి అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది... ‘హైదరాబాద్ రాష్ట్రం’లో భాగమే ► కల్యాణ కర్ణాటక ఒకప్పటి హైదరాబాద్ రాజ్యంలో భాగంగా నిజాంల ఏలుబడిలో కొనసాగింది. ఇటీవలి దాకా కూడా ఈ ప్రాంతాన్ని హైదరాబాద్ కర్ణాటకగానే పిలిచేవారు. ► ఈ ప్రాంతంలో ఎస్సీ, ఎస్టీ, లింగాయత్, ముస్లింలు అధిక సంఖ్యాకులు. 50 శాతానికి పైగా ఉండే ఈ వెనుకబడిన వర్గాలే ఇక్కడ నిర్ణాయక శక్తి. ► వీరేంద్ర పాటిల్, ధరంసింగ్ రూపంలో ఇద్దరు సీఎంలను అందించినా ఈ ప్రాంతం అత్యంత వెనకబాటుతనానికి మారుపేరు. ► దేశంలోనే రెండో అతి పెద్ద మెట్ట ప్రాంతంగా పేరొందింది. దాంతో వెనకబాటుతనం ఇక్కడ ప్రతిసారీ ఎన్నికల అంశంగా మారుతుంటుంది. ► ఈసారి కూడా పార్టీలన్నీ అభివృద్ధి నినాదాన్నే జపిస్తున్నాయి. ► అతివృష్టితో ఇక్కడ 90 శాతం పంటనష్టం జరిగింది. బీజేపీ ప్రభుత్వం హెక్టార్కు రూ.10 వేల పరిహారం ప్రకటించినా అదింకా అందలేదు. ఇది ఎన్నికల్లో ప్రభావం చూపవచ్చంటున్నారు. ► ఆర్టికల్ 371(జే) ప్రకారం విద్య, ఉద్యోగాల్లో ఈ ప్రాంతానికి ప్రత్యేక హోదా ఉన్నా ఒరిగిందేమీ లేదని స్థానికుల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. ► దాంతో కొన్నేళ్లుగా ప్రత్యేక కల్యాణ రాష్ట్ర డిమాండ్ ఊపందుకుంటోంది! ఖర్గే ఖిల్లా మల్లికార్జున ఖర్గే కల్యాణ కర్ణాటక ప్రాంతానికి చెందిన నాయకుడే. కాంగ్రెస్ సారథిగా ఈసారి ఇక్కడ పార్టీకి అత్యధిక స్థానాలు సాధించి పెట్టాలని పట్టుదలగా ఉన్నారు. ఖర్గే కుమారుడు, చిత్తాపుర ఎమ్మెల్యే ప్రియాంక్ ఖర్గే ఇక్కడ బీజేపీకి కొరకరాని కొయ్యగా మారారు. ► బీదర్, కలబురిగి, యాద్గిర్, రాయచూరు, కొప్పళ, బళ్లారి, విజయనగర జిల్లాలతో కూడిన కల్యాణ కర్ణాటకలో 40 స్థానాలున్నాయి. ► గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇక్కడ సగానికి పైగా స్థానాలను కాంగ్రెస్ చేజిక్కించుకుని సత్తా చాటింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్కు 21 సీట్లు రాగా బీజేపీ 15, జేడీ(ఎస్) 4 గెలిచాయి. అయితే 2013తో పోలిస్తే కాంగ్రెస్కు 2 సీట్లు తగ్గగా బీజేపీకి 9 పెరిగాయి! ► ఈ కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొట్టేందుకు అధికార బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. డబుల్ ఇంజిన్ సర్కార్, అభివృద్ధి కార్యక్రమాలనే బీజేపీ ప్రచారాస్త్రాలుగా చేసుకుంది. మోదీపై ఆశలు పెట్టుకుంది. ► కల్యాణ కర్ణాటక ఉత్సవం, బీదర్ ఉత్సవం వంటివాటితో స్థానికుల మనసు దోచుకునే ప్రయత్నాలు చేసింది. ► కల్యాణ కర్ణాటక ప్రాంతీయాభివృద్ధి మండలికి వార్షిక కేటాయింపులను రూ. 1,500 కోట్ల నుంచి రూ.5,000 కోట్లకు పెంచింది. ► ఖర్గేకు సుదీర్ఘ రాజకీయ జీవితంలో 2019 లోక్సభ ఎన్నికల్లో తొలి ఓటమిని రుచి చూపిన స్ఫూర్తితో కల్యాణ కర్ణాటకలో పూర్తిగా పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. ► జేడీఎస్ గత మూడు ఎన్నికల్లో ఇక్కడ ఎప్పుడూ ఐదు సీట్లకు మించి నెగ్గలేదు. ఈసారి తమ పంచరత్న యాత్ర విజయవంతం కావడం, కాంగ్రెస్, బీజేపీ సీనియర్ నేతలు జేడీ(ఎస్)లో చేరడంతో మంచి ఫలితాలపై ఆశలు పెట్టుకుంది. ► ఈసారి కల్యాణ కర్ణాటక నుంచి బరిలో దిగిన గాలి జనార్ధన్ రెడ్డి కల్యాణ రాజ్య ప్రగతి పార్టీ (కేఆర్పీపీ) మూడు ప్రధాన పార్టీల అవకాశాలను తారుమారు చేసే అవకాశముంది. ► లింగాయత్లు ఎక్కువగా ఉన్నందున వారికి 2 శాతం అదనపు రిజర్వేషన్ల నిర్ణయం కలిసొస్తుందని ఆశ పడుతోంది. కానీ 40 శాతం కమీషన్లు, నియామక అక్రమాలు, రెబెల్స్ వంటివి బీజేపీకి ప్రతికూలంగా మారాయి. – సాక్షి, బెంగళూరు -
Karnataka assembly elections 2023: వాగ్దానాల నుంచి కోటా దాకా... కీలకాంశాలివే...!
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. నామినేషన్ల సమర్పణ, పరిశీలన, ఉపసంహరణ గడువు కూడా ముగిసింది. ప్రచారమూ జోరందుకుంది. ఆయా పార్టీల నేతలు ఊరూవాడా ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. పార్టీల ఉచిత వాగ్దానాలతో పాటు రెబెల్స్ వంటి పలు అంశాలు ఈసారి ఎన్నికలను గట్టిగానే ప్రభావితం చేసేలా కన్పిస్తున్నాయి... – సాక్షి, బెంగళూరు వాగ్దానాలు, తాయిలాలు ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ఈసారి కూడా పోటాపోటీగా ఓటర్లపై హామీల వర్షం కురిపించాయి. ముఖ్యంగా ప్రతి మహిళకూ నెలకు రూ.2,000 అందిస్తామని కాంగ్రెస్ చెప్పడంతో బీజేపీ తక్షణం ప్రతిస్పందించింది. దారిద్య్ర రేఖకు దిగువనున్న కుటుంబాలకు నెలకు రూ.3,000 ప్రకటించింది. మహిళా వ్యవసాయ కూలీలకు నెలకు రూ.1,000తో పాటు 30 లక్షల మంది మహిళలకు, 8 లక్షల మంది విద్యార్థినులకు ఉచిత బస్ పాస్ హామీలిచ్చింది. కాంగ్రెసేమో కుటుంబానికి నెలకు 10 కిలోల ఉచిత బియ్యం, పట్టభద్రులకు రూ.3,000 నిరుద్యోగ భృతి, 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తామని పేర్కొంది. ఇక జేడీ(ఎస్) పేద మహిళలకు నెలకు రూ.2,000 జీవన భృతి, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం తదితర వాగ్దానాలు చేసింది. తొలిసారి రాష్ట్రంలో ఎన్నికల బరిలో దిగుతున్న ఆప్ కూడా ఏమీ వెనకబడలేదు. ఉచిత విద్యుత్, తాగునీరు, సాగు రుణ మాఫీ, పట్టణ ప్రాంత మహిళలకు ఉచిత బస్ పాస్ వంటి హామీలిచ్చింది. పాల ప్యాకెట్లో తుఫాన్ స్థానిక నందిని డెయిరీని దెబ్బతీసేందుకు గుజరాత్కు చెందిన అమూల్ డెయిరీ వచ్చి పడుతోందన్న ప్రచారం బీజేపీకి తలనొప్పిగా మారింది. దీన్ని అస్త్రంగా మలుచుకున్నాయి. కర్ణాటకలో అమూల్, నందిని కలసి పనిచేస్తాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పదేపదే ప్రస్తావిస్తోంది. దీనివల్ల దేశంలో రెండో అతి పెద్ద డెయిరీ సహకార వ్యవస్థ అయిన కర్ణాటక పాల సమాఖ్య మనుగడే ప్రమాదంలో పడుతుందంటూ ప్రచారం చేస్తోంది. దాంతో దిమ్మెరపోయిన బీజేపీ కీలకమైన డెయిరీ రైతుల ఓట్లు చేజారకుండా చూసుకునేందుకు కిందామీదా పడుతోంది. ‘అవినీతి’ పై కాంగ్రెస్ ఆశలు బొమ్మై ప్రభుత్వ అవినీతిపై కాంగ్రెస్ ప్రధానంగా అస్త్రాలు ఎక్కుపెడుతోంది. 40 శాతం కమిషన్ సర్కారు అంటూ చేస్తు న్న ఆరోపణలు ప్రజల్లోకి బాగా వెళ్తున్నాయ ని నమ్ముతోంది. ప్రభుత్వ పెద్దలే ప్రతి పనిలోనూ 40 శాతం కమీషన్లు, ముడుపులు తీసుకుంటున్నారంటూ హో రెత్తిస్తోంది. దీనికి కౌంటర్గా కాంగ్రెస్ అధికారంలో ఉండగా కర్ణాటకను ఆ పార్టీ అధిష్టానం అచ్చం ఏటీఎం మాదిరిగా వాడుకుందంటూ బీజేపీ ఎదురు దాడి చేస్తోంది. ‘కోటా’తో బీజేపీ ఆట ఎన్నికల వేళ బీజేపీ సర్కారు వ్యూహాత్మకంగా రిజర్వేషన్ల తేనెతుట్టెను కదిపింది. ముస్లింలకున్న 4 శాతం రిజర్వేషన్లను రద్దు చేయడమే గాక బలమైన సామాజిక వర్గాలైన లింగాయత్లు, ఒక్కలిగలకు చెరో 2 శాతం చొప్పున బ దలాయించింది. ఊహించినట్టే ముస్లింల నుంచి దీనిపై భారీ నిరసన ఎదురైనా ఈ ఎత్తుగడ హిందూ ఓట్లను తనకు అనుకూలంగా సంఘటితం చేస్తుందని బీజేపీ నమ్ముతోంది. ఎస్సీ, ఎస్టీలకు కూడా రిజర్వేషన్ పెంచి ఆయా కులాలను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. దీంతోపాటు హిజాబ్, టిప్పు సుల్తాన్ అంశాలూ ప్రభావం చూపనున్నాయి. కింగ్(మేకర్) ఆశల్లో జేడీ(ఎస్) 2013లో మినహాయించి గత 20 ఏళ్లలో కన్నడ ఓటరు ఎప్పుడూ స్పష్టమైన తీర్పు ఇవ్వలేదు. హోరాహోరి పోరు నేపథ్యంలో ఈసారి కూడా ఎవరికీ మెజారిటీ రాకపోవచ్చని సర్వేలు చెబుతున్నాయి. 224 సీట్లలో కాంగ్రెస్ 100కు అటూ ఇటుగా, బీజేపీ 90లోపు, జేడీ(ఎస్) 30 నుంచి 40 గెలుస్తాయని అంచనా. అదే జరిగితే కింగ్మేకర్గా మరోసారి చక్రం తిప్పాలని జేడీ(ఎస్) ఆశపడుతోంది. పాత మైసూరులోని 89 అసెంబ్లీ స్థానాల్లో కనీసం 30కి పైగా గెలుస్తామని ధీమాగా ఉంది. బీజేపీ, కాంగ్రెస్ రెబల్స్ తద్వారా మరిన్ని స్థానాలు తెచ్చిపెడతారని భావిస్తోంది. గుండెల్లో రె‘బెల్స్’ ► బీజేపీ కనీసం 20కి పైగా నియోజకవర్గాల్లో తిరుగుబాటును ఎదుర్కొంటోంది. ► సీనియర్లకు ఉద్వాసన పలికి కొత్తవారికి, యువతకు చాన్సివ్వాలన్న అధిష్టానం నిర్ణయం కాస్త బెడిసికొట్టినట్టు కన్పిస్తోందని పరిశీలకులు అంటున్నారు. ► మాజీ సీఎం జగదీశ్ శెట్టర్, ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ సవదితో పాటు చాలామంది సీనియర్లు టికెట్ రాక పార్టీని వీడారు. ► వారిని కాంగ్రెస్ సాదరంగా ఆహ్వానించి టికెట్లిచ్చింది. ఇది ముఖ్యంగా ఉత్తర కర్ణాటకలో బీజేపీని బాగా దెబ్బ తీస్తుందంటున్నారు. ► రెబెల్స్ దెబ్బకు బీజేపీ ఓటు బ్యాంకుకు చిల్లి పడేలా కన్పిస్తోంది. ► మరీ నామినేషన్ల దాకా ఆగకుండా ఏ మూడు నెలల ముందో సీనియర్లతో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకుని ఉండాల్సిందన్న భావన వ్యక్తమవుతోంది. -
Karnataka Assembly Elections 2023: కర్ణాటకలో మాదే విజయం
సాక్షి, బళ్లారి/విజయపుర: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఘన విజయం సాధించబోతున్నామని, 224 స్థానాలకు గాను 150 స్థానాలు కచ్చితంగా గెలుచుకుంటామని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. ఆయన ఆదివారం కర్ణాటకలోని విజయపురలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. శివాజీ సర్కిల్ నుంచి కనకదాస సర్కిల్ వరకూ జరిగిన భారీ రోడ్డు అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ‘40 పర్సెంట్ బీజేపీ సర్కారు’కు ఈ ఎన్నికల్లో 40 సీట్లు మాత్రమే వస్తాయని జోస్యం చెప్పారు. ప్రధాని మోదీతోపాటు బీజేపీ నాయకులు 12వ శతాబ్దపు సంఘ సంస్కర్త బసవణ్ణ బోధనల గురించి మాట్లాడుతున్నారు గానీ వాటిని ఏమాత్రం ఆచరించడం లేదని రాహుల్ ఆక్షేపించారు. బసవేశ్వరుడికి రాహుల్ నివాళులు సంఘ సంస్కర్త బసవేశ్వరుడి జయంతి సందర్భంగా రాహుల్ గాంధీ ఆదివారం కర్ణాటక రాష్ట్రం బాగల్కోట జిల్లాలోని కూడల సంగమంలోని బసవణ్ణ సమాధిని దర్శించుకున్నారు. నివాళులర్పించారు. కూడల సంగమంలో సంగమనాథ దేవాలయాన్ని దర్శించుకుని విశేష పూజలు చేశారు. నుదుటిన విభూతి ధరించారు. విశ్వగురు బసవణ్ణ సమసమాజ స్థాపన కోసం కృషి పడ్డారని, ఆనాడే చట్టసభ ద్వారా అన్ని వర్గాల ప్రజలను అందలమెక్కించాలని తపనపడ్డారని రాహుల్ కొనియాడారు. సమాజాన్ని సన్మార్గంలో నడిపించడానికి బసవణ్ణ చేసిన కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు. అనంతరం అసెంబ్లీ ఎన్నికల ప్రచారం గురించి కాంగ్రెస్ నేతలతో రాహుల్ చర్చించారు. హుబ్లీకి వెళ్లి ఇటీవల కాంగ్రెస్లో చేరిన మాజీ సీఎం జగదీశ్ శెట్టర్తో మాట్లాడారు. -
మా నామినేషన్లు చెల్లకుండా చేసే కుట్ర
బెంగళూరు: కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల వేడితో పాటే అధికార బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం కూడా తారస్థాయికి చేరుతోంది. తమ నామినేషన్లను ఏదోలా చెల్లకుండా చేసేందుకు బసవరాజ్ బొమ్మై సర్కారు భారీ కుట్రకు తెర తీస్తోందని పీసీసీ చీఫ్ శివకుమార్ మండిపడ్డారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. తమ అభ్యర్థుల నామినేషన్లలో ఏదో ఒక లోపాన్ని వెతకాలని, అలాగే బీజేపీ నామినేషన్లలో ఏమైనా తప్పులుంటే సరి చేయాలని రిటర్నింగ్ ఆఫీసర్లందరి మీదా ఎంతగానో ఒత్తిడి తెస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు స్వయానా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే వారికి ఫోన్లు వెళ్తున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తక్షణం రంగంలోకి దిగి దీనిపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. సీఎంఓ కాల్ డీటైల్స్ తెప్పించుకుని పరిశీలించాలని సూచించారు. బీజేపీ అధికార దుర్వినియోగానికి అంతూ పొంతూ లేకుండా పోతోందంటూ దుయ్యబట్టారు. ‘‘ఈ కుట్రకు సంబంధించి మా దగ్గర సాక్ష్యాలున్నాయి. సౌందత్తి ఎల్లమ్మ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి నామినేషన్ పత్రాల్లో తప్పులున్నాయి. వాటిని సరిచేయాల్సిందిగా సీఎంఓ నుంచి ఆర్ఓకు ఫోన్ వెళ్లింది. ఇక నా నామినేషన్ను ఏదోలా తిరస్కరింపజేసేందుకు బీజేపీ తరఫున పెద్ద టీమే రంగంలోకి దిగింది. నా పరిస్థితే ఇలా ఉంటే ఇతర సాధారణ అభ్యర్థుల సంగతేమిటో అర్థం చేసుకోవచ్చు’’ అన్నారు. -
ఆ 84 సీట్లు కీలకం.. గతంలో 56 బీజేపీకే.. మరి ఇప్పుడు.. స్వింగ్ ఎటో?
కిత్తూరు కర్ణాటకలో (గతంలో ముంబై కర్ణాటక) రాన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే అదే పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న సెంటిమెంట్ ఉంది. 1957 సంవత్సరం నుంచి రాన్ నియోజకవర్గం ప్రజలు అధికారంలోకి వచ్చే పార్టీ అభ్యర్థినే ఎన్నుకుంటూ వస్తున్నారు. ఒకే పార్టీని వరుసగా రెండుసార్లు గెలిపించే సంప్రదాయం ఇక్కడ లేదు. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో ఇలా ఓటరు తీర్పు తిరగరాసే నియోజకవర్గాలు రాన్తో సహా 84 ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా పనిచేస్తుందని, అందుకే ఏ పార్టీ కూడా రెండోసారి గెలవడం కష్టంగా మారిందని అజీమ్ ప్రేమ్జీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ ఎ. నారాయణ అభిప్రాయపడ్డారు. 2018 : స్వింగ్ స్థానాల్లో బీజేపీ స్వీప్ ► లింగాయత్లకు గట్టి పట్టున్న ముంబై కర్ణాటక ప్రాంతంలో 19 స్వింగ్ సీట్లున్నాయి. 2013 ఎన్నికల్లో బీజేపీ ఈ స్థానాలన్నింటిలోనూ విజయం సాధించింది ► సెంట్రల్ కర్ణాటకలో 20 స్వింగ్ సీట్లు ఉన్నాయి. ఈ ప్రాంతంలో లింగాయత్, వొక్కలిగలు పట్టుంది. గత ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 16 స్థానాల్లో నెగ్గింది. ► బీజేపీకి కంచుకోటగా భావించే కోస్తా కర్ణాటకలో అత్యధిక స్థానాలు స్వింగ్ సీట్లుగా పేరొందాయి. ఈ ప్రాంతంలో 19 స్థానాలకు గానే 10 స్వింగ్ సీట్లుగా ఉన్నాయి. 2018 ఎన్నికల్లో అన్ని స్వింగ్ స్థానాలను బీజేపీ స్వీప్ చేసింది. 20% మంది ముస్లిం జనాభా ఉన్న ఈ ప్రాంతంలో విభజన రాజకీయాలే కీలకం. ► హైదరాబాద్ కర్ణాటక ప్రాంతంలో 12 స్వింగ్ సీట్లు బీజేపీ ౖMðవశం చేసుకుంది. రాష్ట్రంలో ఈ ప్రాంతం అత్యంత వెనుకబడి ఉంది. ► దక్షిణ కర్ణాటకలో మొత్తం స్థానాలు 46 కాగా అందులో స్వింగ్ సీట్లు 14 ఉన్నాయి. వొక్కలిగల ప్రాబల్యం అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో జేడీ (ఎస్) సగం స్వింగ్ స్థానాలైన ఏడింటిలో విజయం సాధించింది. బీజేపీ నాలుగు, కాంగ్రెస్ మూడు స్థానాలను దక్కించుకున్నాయి. ► బెంగళూరు నగరంలో రెండు స్వింగ్ సీట్లు బీజేపీ ఖాతాలోకే వెళ్లాయి. స్వింగ్ స్థానాల్లో పట్టుకు బీజేపీ, కాంగ్రెస్ వ్యూహాలు లింగాయత్లకు పట్టున్న స్థానాలు, మత విభజన రాజకీయాలకు కేంద్రమైన కోస్తా కర్ణాటకలో 2018 ఎన్నికల్లో బీజేపీ స్వింగ్ స్థానాలన్నింటినీ స్వీప్ చేసింది. మొత్తం 84 స్వింగ్ స్థానాలకు గాను బీజేపీ ఖాతాలో 56 ఉన్నాయి. దశాబ్దాల గణాంకాలను పరిశీలిస్తే ఈ స్థానాల్లో బీజేపీ నెగ్గే అవకాశాలు లేవు. అందుకే బీజేపీ ఎన్నికలకు చాలా రోజుల ముందు నుంచి ఈ స్థానాలపై దృష్టి సారించింది. వీటిలో 30 స్థానాల్లో లింగాయత్లు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. లింగాయత్లు బీజేపీ వైపు నిలుస్తూ ఉండడంతో ఆ స్థానాలు తిరిగి నిలబెట్టుకోగలమన్న కమలదళం ధీమాగా ఉంది. అధికార వ్యతిరేకత, బొమ్మై ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు, ముస్లింలకు 4 శాతం కోటాలో కోత, పెరిగిపోతున్న ధరలు వంటివన్నీ బీజేపీకి మైనస్గా మారాయి. వీటన్నింటినీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇమేజ్తో కప్పిపుచ్చే వ్యూహాలు రచిస్తోంది. అంతే కాకుండా చాలా నియోజకవర్గాల్లో కొత్త ముఖాలకు టికెట్లు ఇచ్చింది. తద్వారా అధికార వ్యతిరేకతను అధిగమించవచ్చునని వ్యూహరచన చేసింది. అయితే మోదీ ఇమేజ్ అసెంబ్లీ ఎన్నికలకు పని చేసే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ‘‘నరేంద్ర మోదీ పట్ల ప్రజల్లో ఎంతో ఆకర్షణ ఉన్నప్పటికీ ఆయనను స్థానికుడిగా చూడలేరు. పార్లమెంటు ఎన్నికల్లో ఆయన ఇమేజ్ పని చేస్తుందే తప్ప శాసనసభ ఎన్నికల్లో పని చేసే అవకాశం లేదు’’ అని ఎన్నికల విశ్లేషకుడు చేతన్ చౌహాన్ పేర్కొన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఈ స్థానాల్లో పాగా వెయ్యడానికి పకడ్బందీ వ్యూహాలనే రచించింది. స్థానికంగా బలంగా ఉన్న అభ్యర్థుల్ని ఎంపిక చేయడంతో పాటు మాజీ సీఎం జగదీశ్ షెట్టర్ రాకతో లింగాయత్ ఓటు బ్యాంకును కొంతవరకైనా కొల్లగొట్టవచ్చునన్న ఆశగా ఉంది. ఇక బసవరాజ్ బొమ్మై అవినీతి, ముస్లిం కోటా రద్దుని ప్రధాన ప్రచారాస్త్రాలుగా మలుచుకుంది. సిద్దరామయ్య, డి.కె.శివకుమార్ వంటి బలమైన నాయకులు ఉన్నప్పటికీ పార్టీలో అంతర్గత పోరు ఆ పార్టీకి మైనస్గా మారింది. ఫలితంగా ఈ 84 సీట్లలోనూ హోరాహోరీ పోరు నెలకొంది. ఇక 224 స్థానాలకు గాను 60 సీట్లు సేఫ్ సీట్లుగా ఉన్నాయి. గత మూడు ఎన్నికల్లో వరుసగా ఒకే పార్టీ గెలుస్తూ వచ్చింది. ఈ సేఫ్ సీట్లు కాంగ్రెస్కి 27, బీజేపీకి 23, జేడీ(ఎస్)కి 10 ఉన్నాయి. ఈ సీట్లను కాపాడుకోవడానికి కూడా రెండు పార్టీలు సర్వశక్తులూ ఒడ్డవల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రసకందాయంలో కర్నాటకం.. పార్టీలు చిన్నవి.. ప్రభావం పెద్దది
కర్ణాటక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ వేడి పెరిగిపోతోంది. ఎన్నికల బరిలో ఉన్న పదుల సంఖ్యలో చిన్న పార్టీలు ఎవరి ఓటు బ్యాంకుని చీలుస్తాయన్న చర్చ మొదలైంది. చిన్న పార్టీలకు సొంతంగా విజయం సాధించే బలం లేకపోయినప్పటికీ జయాపజయాలను మార్చే సత్తా కలిగి ఉన్నాయి. ఇంతకీ ఈ చిన్న పార్టీలు ఎవరి ఓటు బ్యాంకుని కొల్లగొడతాయి? ప్రధాన పార్టీల్లో ఎవరికి నష్టం? ఎవరికి లాభం? కర్ణాటక ఎన్నికలు రసకందాయంలో పడ్డాయి. రాజకీయ పార్టీల ప్రచార హోరు తీవ్రతరమైంది. గత ఎన్నికల్లో కీలక స్థానాల్లో 3 వేల లోపు మెజార్టీయే లభించడంతో ప్రతీ ఓటు కీలకంగా మారింది. ఇలాంటి సమయంలో చిన్న పార్టీలు, ఎన్నికల బరిలో దిగిన కొత్త పార్టీలు ప్రధానపార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, జేడీ(ఎస్)ల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) గత ఎన్నికల్లో బెంగుళూరులోని 18 నియోజకవర్గాల్లో పోటీ చేసినప్పటికీ అభ్యర్థులు డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు. ఇప్పుడు ఆప్ పరిస్థితి వేరు. ఢిల్లీ, పంజాబ్లో అధికారంలో ఉండడంతోపాటు జాతీయ పార్టీ హోదా దక్కించుకుంది. కర్ణాటక ఓటరు మొదట్నుంచి ప్రాంతీయ పార్టీల కంటే, జాతీయ పార్టీలవైపు మొగ్గు చూపిస్తున్నాడు. కేజ్రివాల్ ఢిల్లీ మోడల్ పాలన పట్ల యువత, మహిళల్లో విపరీతమైన ఆకర్షణ ఉంది. అందుకే ఈ సారి ఆప్ను కూడా ప్రధాన పార్టీలు ముప్పుగానే పరిగణిస్తున్నాయి. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకి అనుబంధంగా పనిచేసే సోషల్ డెమొక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియాకు కోస్తా కర్ణాటకలో గట్టి పట్టుంది. అధికార వ్యతిరేకతకు చిన్న పార్టీలతో చెక్! కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. 40% కమీషన్ల సీఎంగా పేరు పడడం, యడ్డీయూరప్ప స్థానంలో వచ్చి ఆ స్థాయిలో ప్రతిభ కనబరచలేకపోవడంతో ప్రభుత్వ వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యక్తిగతంగా ఉన్న ఇమేజ్, హిందూత్వ కార్డుతో ఎన్నికల బరిలో దిగిన బీజేపీ చిన్న పార్టీలు, ఆమ్ ఆద్మీ పార్టీ, ఎంఐఎం తమ విజయావకాశాలను పెంచుతాయని ఆశల పల్లకిలో విహరిస్తోంది. గుజరాత్, యూపీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, ఎంఐఎం, బీఎస్పీ కాంగ్రెస్ ఓటు బ్యాంకునే చీల్చడంతో బీజేపీ ఘన విజయం సాధించింది. కర్ణాటకలో కూడా అదే పునరావృతమై బహుముఖ పోటీ జరుగుతుందని, అది బీజేపీకి లాభం చేకూరుస్తుందని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కర్ణాటకలో గత ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే అక్కడ ప్రజలు జాతీయ పార్టీలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. లేదంటే అతి పెద్ద ప్రాంతీయ పార్టీల వైపు మొగ్గు చూపిస్తున్నాయి. గత ఎన్నికల్లో చిన్న పార్టీలు, స్వతంత్రులు కలిపి 6% వరకు మాత్రమే ఓట్లను సంపాదించాయి. పార్టీ అనుసరించే సిద్ధాంతాలే ముఖ్యమైనవని, ప్రస్తుతమున్న పరిస్థితుల్లో అవినీతిని అంతమొందిస్తామంటూ రొటీన్ హామీలిస్తే ప్రజల నుంచి స్పందన కరువై చిన్న పార్టీలు మనుగడ సాధించడం కష్టమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఈ సారి ఎన్నికల్లో మొదటిసారిగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న కేఆర్ఎస్ పార్టీ మాత్రం తాము ప్రజల మద్దతుతోనే ఎన్నికల బరిలో దిగామని చెబుతోంది. క్రౌడ్ ఫండింగ్ ద్వారా 40 వేల మంది ఆర్థిక సాయం చేసి పార్టీలో సభ్యులుగా చేరారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రవికృష్ణ రెడ్డి తెలిపారు. 50 స్థానాల్లో ప్రభావం కర్ణాటకలో చిన్న పార్టీలు ఏకంగా 50 సీట్లలో ప్రభావం చూపించనున్నాయి. గాలి జనార్దన్ రెడ్డికి చెందిన కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష (కేఆర్పీపీ), కర్ణాటక రాష్ట్ర సమితి (కేఆర్ఎస్), నటుడు ఉపేంద్రకు చెందిన ఉత్తమ ప్రజాకీయ పార్టీ (యూపీపీ)లతో పాటు అసదుద్దీన్ ఒవైసీకి చెందిన ఎంఐఎం గట్టి ప్రభావాన్ని చూపిస్తాయనే అంచనాలున్నాయి. 69 గుర్తింపులేని రిజిస్టర్డ్ పార్టీలు బరిలో ఉన్నాయి. గత ఎన్నికల్లో 30 స్థానాల్లో 5 వేల కంటే తక్కువ మెజార్టీ రావడం, చిన్న పార్టీల సంఖ్య బాగా పెరిగిపోవడంతో ప్రధాన పార్టీలు క్షేత్రస్థాయిలో బలం పెంచుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. సాక్షి, నేషనల్ డెస్క్ -
కొత్తా ఓటరండీ! ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత ఆనందం.. మాట వినే ప్రసక్తే లేదు
బెంగళూరులోని మహారాణి క్లస్టర్ యూనివర్సటీలో విద్యార్థిని ఎంజే గుణ. కొద్ది రోజుల క్రితమే ఆమెకు 18 ఏళ్లు నిండాయి. మొదటి సారిగా ఓటు హక్కు వినియోగించుకునే చాన్స్ వచ్చింది. ఎప్పుడెప్పుడు తమ నాయకుడ్ని ఎన్నుకునే రోజు వస్తుందాని ఆమె ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ఆమె ఉద్దేశంలో నాయకుడంటే బాగా చదువుకుని, దార్శినికుడై ఉండాలి. ‘‘నేను ఓటు వేసే ముందు ఏ పార్టీ అని కూడా చూడను. మా నియోజకవర్గానికి అభ్యర్థి ఏం చేస్తాడన్నదే ముఖ్యం. ఆ తర్వాత అభ్యర్థి బ్యాక్గ్రౌండ్, విద్యార్హతలు, గతంలో చేసిన పని, భవిష్యత్లో ఏం చేయగలడు వంటివన్నీ చూశాకే ఓటేస్తా’’అని ఆమె కచ్చితంగా చెప్పింది. సునీత అనే మరొక ఫస్ట్ టైమ్ ఓటరు సరైన వ్యక్తిని ఎంపిక చేసుకునే సామర్థ్యం మనకున్నప్పుడే రాష్ట్రం, దేశం సరైన మార్గంలో వెళతాయని చెప్పుకొచ్చింది. వీరి మాటలు వింటే సంప్రదాయంగా రాజకీయ వ్యూహాలు రచిస్తూ, తాయిలాల ఆశ చూపిస్తూ వెళ్లే పార్టీల వైపు వీరు చూసే చాన్సే లేదు. కొత్తగా ఓటు హక్కు పొందడం అంటే ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత ఆనందం. తల్లిదండ్రులు చెప్పారనో, స్నేహితులు సిఫారసు చేశారనో ఎవరికి పడితే వారికి నేటి తరం ఓటు వెయ్యరు. సొంతంగా ఆలోచించి తమకు నచ్చిన అభ్యర్థికి తొలిసారి ఓటు వేస్తే ఆ కిక్కే వేరబ్బా అంటున్నారు. ఓటు వెయ్యడంలో ఉదాసీనత మచ్చుకైనా లేదు. ఉరిమే ఉత్సాహంతో చూపుడు వేలి మీద సిరా గుర్తు చూపిస్తూ ఫొటోలు దిగి ఓట్ల పండుగను సంబరంగా చేసుకుంటున్నారు. కర్ణాటకలో మెజార్టీ మార్కు దాటడానికి అత్యంత కీలకమైన కొత్త ఓటర్ల మదిలో ఏముంది ? గత ఎన్నికల్లో... మొదటి సారి ఓటు వేసే వారిలో కొత్త ఉత్సాహం, ఓటు వెయ్యాలన్న తపన ఎక్కువ ఉంటుంది. వారు తప్పనిసరిగా ఓటు వెయ్యడానికి పోలింగ్ కేంద్రాలకు కదిలి వెళతారు. గత 3 ఎన్నికల్లోనూ కొత్త ఓటర్లు ఓటు వేసే విధానాన్ని విశ్లేషిస్తే వారి నాడి పట్టుకోవడం కష్టమనే అభిప్రాయం కలుగుతుంది. సీఎస్డీఎస్–లోక్నీతి పోస్ట్ పోల్ సర్వే కొత్త ఓటరు అండదండ లేనిదే ఏ పార్టీ కూడా మెజార్టీ మార్క్ సాధించలేదు. కొత్త ఓటరు ఎటుంటే.. కర్ణాటకలో ఈ సారి 11 లక్షల మంది కొత్త ఓటర్లు రిజిస్టర్ చేసుకున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2018లో 7.7 లక్షలుంటే ఈ సారి వారి సంఖ్య 11 లక్షలకు చేరుకుంది. ప్రతీ సారి ఎన్నికల్లోనూ కొత్త ఓటర్లు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. కొత్త ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగరు. మనీ, మద్యం కంటే అభివృద్ధికే అధిక ప్రాధాన్యం ఇస్తారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ మంచి, చెడులను తామే విశ్లేషించుకునే శక్తి సామర్థ్యాలున్నవారు. ఓపెన్ మైండ్తో ఉంటారు. పార్టీలు వారిని తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలైతే చేస్తున్నాయి. కర్ణాటకలో ఏదైనా పార్టీ మెజార్టీ మార్కు దాటాలంటే కొత్త ఓటర్లు అత్యత కీలకమని రాజకీయ విశ్లేషకుడు సందీప్ శాస్త్రి అభిప్రాయపడ్డారు. పార్టీల కొత్త పంథా..! మేము ఏం చేస్తాం అన్నది కాదు.. మీకేం కావాలన్నదే ముఖ్యం అని కొత్త ఓటర్ల మనసులో ఏముందో పార్టీలు తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. కొత్త ఓటర్లను ఆకర్షించడానికి కాంగ్రెస్ పార్టీ ‘‘సెలబ్రేట్ యువర్ ఓటు’’అనే ప్రచారాన్ని ప్రారంభించింది. 18–23 మధ్య వయసున్న వారే లక్ష్యంగా చేసుకొని వారికి ఏం కావాలో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తోంది. వాతావరణ మార్పుల వల్ల కలిగే దుష్పరిణామాలను అరికట్టడం, అందరికీ ఉన్నత విద్యనభ్యసించే అవకాశాన్నివ్వడం ప్రస్తుతం యువత ఆశిస్తుందని తెలుసుకొని ఆ దిశగా వ్యూహాలు పన్నుతోంది. దాంతో పాటు నిరుద్యోగులు తల్లిదండ్రులకి భారంగా మారకుండా రెండేళ్ల పాటు నెలకి రూ.3 వేల భృతి ఇస్తామని హామీ ఇచ్చింది. భారతీయ జనతా పార్టీ యువ సంవాద్ కార్యక్రమం ద్వారా కొత్త ఓటర్ల ఆశలు, ఆకాంక్షల్ని తెలుసుకునే ప్రయత్నాలు చేస్తోంది.కొత్త ఓటర్లను దృష్టిలో ఉంచుకునే బీజేపీ సిట్టింగ్లను కాదని అత్యధికంగా 60 మంది కొత్త ముఖాలకు టికెట్లిచ్చింది. జేడీ(ఎస్) పంచరత్న రథయాత్రలో యువతకే అత్యధిక ప్రాధాన్యమిచ్చింది. కుమారస్వామి ప్రచారంలో యువతతోనే మాట్లాడుతూ వారి నాడి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ కొత్త ఓటర్లు తమ వైపేనని ధీమాతో ఉంది. ఢిల్లీ, పంజాబ్లో యువ ఓటర్లను అధికంగా ఆకర్షించిన ఆప్ ఈసారి ఉన్నత విద్య అభ్యసించిన వారికే ఎక్కువగా టిక్కెట్లు ఇచ్చింది. 2008: ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ మార్కుకి కేవలం మూడు సీట్ల దూరంలో నిలిచిపోయింది. ఈ ఎన్నికల్లో పార్టీకి వచ్చిన సగటు ఓటు షేరు కంటే కొత్త ఓటరు వేసిన ఓట్ల వాటా (మొత్తం పోలయిన కొత్త ఓటర్ల ఓట్లలో) ఎక్కువగా ఉంది. కొత్త ఓటర్ల ఓటు షేర్ మూడు శాతం ఎక్కువగా ఉంది. 2013: అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త ఓటర్లు కాంగ్రెస్ వైపు స్వల్పంగా మొగ్గు చూపించారు. ఆ పార్టీకి వచ్చిన సగటు ఓట్ల కంటే కొత్త ఓటర్లు కాంగ్రెస్కు వేసిన ఓటు షేరు ఒక్క శాతం అధికంగా ఉంది. హస్తం పార్టీ గద్దెనెక్కింది. 2018: బీజేపీ మెజార్టీ మార్కుకి 9 సీట్ల దూరంలో ఉండిపోయింది. దీనికి కారణం కొత్త ఓటర్లేనని సీఎస్డీఎస్–లోక్నీతి గణాంకాల్లో తేలింది. బీజేపీకి పోలయిన సగటు ఓట్ల కంటే కొత్త ఓటర్ల షేరు ఆరు శాతం తక్కువగా ఉంది. హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. 2013, 2018 ఎన్నికల్లో జేడీ(ఎస్) పార్టీకి సగటు ఓటు షేర్ కంటే తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్న వారి ఓటు షేర్ నాలుగు శాతం అధికంగా ఉంది. దీంతో పట్టణ యువత జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ కంటే ప్రాంతీయ పార్టీ వైపు మొగ్గు చూపిస్తున్నారని తేలుతోంది. -సాక్షి, నేషనల్ డెస్క్ -
త్రిముఖ పోరులో కన్నడనాట కులాల కోలాటం.. కరుణ కోసం పార్టీల ఆరాటం
మన దేశంలో ఎన్నికలంటేనే కులం చుట్టూ తిరుగుతుంటాయి. అందులోనూ కర్ణాటక రాజకీయాల్లో కులాలు, మతాల పాత్ర మరీ ఎక్కువ. లింగాయత్, వొక్కలిగ, ఓబీసీ, ముస్లిం వర్గాలు నాలుగు స్తంభాలుగా ఎన్నికల ఫలితాలను శాసిస్తూ వస్తున్నాయి. అందుకే మరోసారి వారి మనసు చూరగొనేందుకు బీజేపీ, కాంగ్రెస్, జేడీ(ఎస్) సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి... కర్ణాటకలో త్రిముఖ పోరు నేపథ్యంలో కులాలవారీగా ఓటర్లను ఆకర్షించడంలో బీజేపీ, కాంగ్రెస్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. జేడీ(ఎస్) మాత్రం ప్రధానంగా రాష్ట్ర జనాభాల్లో లింగాయత్ల తర్వాత అత్యధికంగా 15% ఓటర్లున్న వొక్కలిగ ఓటు బ్యాంకునే నమ్ముకుంది. 59 అసెంబ్లీ స్థానాలున్న పాత మైసూరు ప్రాంతంలో వొక్కలిగలు ఇప్పటికీ మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడను ఎంతగానో ఆరాధిస్తారు. ఆ ఓటు బ్యాంకును చీల్చే లక్ష్యంతో ఎన్నికల ముందు నుంచే కోటా రాజకీయాలకు బీజేపీ తెర తీసింది. దాంతో దాన్ని ఎలాగైనా కాపాడుకునే పనిలో జేడీ(ఎస్) తలమునకలుగా ఉంది. కోటాతో రాజకీయ ఆట అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచే అధికార బీజేపీ అన్ని సామాజిక వర్గాల ఓట్లూ రాబట్టేలా వ్యూహాలు పన్నడం మొదలు పెట్టింది. 2018 ఎన్నికల్లో 100కు పైగా స్థానాలు సాధించినా మెజారిటీ మాత్రం అందలేదు. పాత మైసూరులోని 59 సీట్లలో ఆరు మాత్రమే దక్కడం అందుకు ప్రధాన కారణం. దాంతో ఈసారి సరిగ్గా ఎన్నికల వేళ ముస్లింల 4 శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తూ సంచలనం నిర్ణయం తీసుకోవడమే గాక వాటిని బలమైన సామాజిక వర్గాలైన లింగాయత్, వొక్కలిగలకు చెరో 2 శాతం చొప్పున పంచింది. ఈ నిర్ణయం పాత మైసూరు ప్రాంతంలో తమ భాగ్యరేఖలను కాస్త మెరుగు పరుస్తుందని ఆశ పడుతోంది. అలాగే ఎస్సీ రిజర్వేషన్లను 15 నుంచి 17 శాతానికి పెంచడమే గాక అంతర్గత కోటాను అమలు చేయాలని కూడా నిర్ణయించింది. ఈ నిర్ణయాలను లింగాయత్లు, దళితుల్లో ఒక వర్గం ఆహ్వానించినా ముస్లింలు భగ్గుమంటున్నారు. బంజారాల్లో కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అంతర్గత రిజర్వేషన్లతో తమకు మరింత అన్యాయం జరుగుతుందన్న భయం వారిలో ఉంది. పాత మైసూరులో బీజేపీ ఏకంగా 41 మంది వొక్కలిగలకు టికెట్లిచ్చింది! వీరు వ్యవసాయం మీద ఆధారపడ్డవారే కావడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ కార్యక్రమాలు బాగా జనంలోకి వెళ్లేలా ప్రయత్నాలు చేస్తోంది. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తరచూ పాత మైసూరులో పర్యటిస్తున్నారు. హింద్ వర్సెస్ అహిందా లింగాయత్, బ్రాహ్మణుల ఓట్లతో పాటుగా హిందూత్వ ఓటు బ్యాంకునే బీజేపీ బాగా నమ్ముకుంది. హిందూత్వ, దేశభక్తి, అభివృద్ధి నినాదాలతో ఓట్లు రాబట్టజూస్తోంది. బాహుబలిగా పేరొందిన లింగాయత్ నేత బి.ఎస్.యడియూరప్పనే ముందుంచి ఎన్నికల వ్యవహారాలను నడిపిస్తోంది. 51 మంది లింగాయత్లకు టికెట్లిచ్చింది. కానీ బలమైన లింగాయత్ నేతలైన మాజీ సీఎం జగదీశ్ శెట్టర్, మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ్ సవాది పార్టీని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం బీజేపీలో తాజాగా ప్రకంపనలు సృష్టిస్తోంది. తాను కనీసం 25 సీట్లలో బీజేపీ అవకాశాలకు గండి కొడతానన్న శెట్టర్ హెచ్చరికలను వారు గుర్తు చేస్తున్నారు. ఓబీసీలు ఎటువైపో...! వీరశైవ లింగాయత్లలో బీజేపీ ఓట్లలో 2 నుంచి 3% తమకు వస్తాయని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. హిందూత్వకు పోటీగా అహిందా (ఓబీసీ, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ) నినాదంతో ఓట్లు కొల్లగొట్టే పనిలో పడింది. ఓబీసీల్లో ఒకప్పుడు కాంగ్రెస్కు ఓటుబ్యాంకుగా ఉన్న బిల్వాస్, మొగవీరాస్, విశ్వకర్మ, కొలిస్లు కొన్నేళ్లుగా బీజేపీ వైపు తిరిగారు. ఈసారి లింగాయత్, వొక్కలిగలు ఏ ఒక్క పార్టీకీ పూర్తిస్థాయిలో మద్దతునిచ్చే అవకాశాలు లేవన్న అభిప్రాయాల నడుమ ఈ ఓబీసీల ఓటు బ్యాంకే కీలకంగా మారింది. వారి ఓటుబ్యాంకును ఈసారి బీజేపీ నిలబెట్టుకోని పక్షంలో దానికి కాంగ్రెస్ నుంచి గట్టి ముప్పు పొంచి ఉన్నట్టే! – సాక్షి, నేషనల్ డెస్క్ -
కర్ణాటకలో మళ్లీ ముఖ్యమంత్రి మార్పు?
బెంగళూరు: 2023 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ, ప్రభుత్వంలో పలు మార్పులు చోటు చేసుకోనున్నాయని కర్ణాటక బీజేపీలో చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మార్పులు ఉండబోతున్నట్లు సూత్రప్రాయంగా తెలిపారు మాజీ ఎమ్మెల్యే బీ సురేశ్ గౌడ. ముఖ్యమంత్రి మార్పు సహా ఇతర అంశాలపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందన్నారు. అయితే.. మార్పు ఉంటుందా? ఉండదా అనే అంశంపై స్పష్టత లేదన్నారు. కానీ, పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామన్నారు. ‘రాష్ట్రంలో ఏదైనా మార్పు జరిగితే అది ఆగస్టు 15లోపే జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆ మార్పులు ఉండబోతున్నాయి. 2023లో రాష్ట్రంలో బీజేపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావటం, 2024లో నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని కావటమే లక్ష్యం. ఏ సమయంలోనైనా పార్టీ ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు.’ అని పేర్కొన్నారు గౌడ. మరోవైపు.. ప్రస్తుత ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మంచి పనితీరు కనబరుస్తున్నారని తెలిపారు. ఏడాది పదవీ కాలంలో చాలా మంచి పనులు చేశారని, అయితే.. పార్ట ఏ నిర్ణయం తీసుకున్నా దానిని అనుసరిస్తామన్నారు. ఎన్నికలకు కొద్ది నెలల ముందు ముఖ్యమంత్రులను మార్చే ఆనవాయితీ బీజేపీలో కొనసాగుతోందన్నారు తుమకూరు రూరల్ మాజీ ఎమ్మెల్యే. అయితే, ఆ నిర్ణయం కేంద్ర నాయకత్వం చేతిలో ఉంటుందన్నారు. ఇటీవల రాష్ట్రంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన అనంతరం బీజేపీలో ఊహాగానాలు మొదలయ్యాయి. పార్టీలో ముఖ్యంగా ఉన్నత స్థాయిలో ఈ మార్పులు ఉండబోతున్నాయని పార్టీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. మరోవైపు..కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శోభ కరండ్లేజ్ను ముఖ్యమంత్రిగా నియమించే అవకాశం ఉందా? అని అడగగా.. అది మీడియా క్రియేషన్గా పేర్కొన్నారు గౌడ. ఇదీ చదవండి: CM Nitish Kumar: నితీశ్లో ఎందుకీ అసంతృప్తి? -
బీజేపీకి షాకివ్వనున్న యడియూరప్ప? బల నిరూపణకు సై
బెంగళూరు: కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు తర్వాత పరిస్థితులు చక్కబడతాయనుకుంటే ఏం మారలేదని తెలుస్తోంది. ఇప్పటికే మంత్రులు తమ శాఖలపై అసహనంతో ఉన్నారు. అప్రాధాన్య శాఖలు ఇచ్చారని సీనియర్ నాయకులు అసంతృప్తిలో ఉండగా.. మరికొందరు సీఎం బసవరాజు బొమ్మైకు వ్యతిరేకంగా ఉన్నారు. అయితే పదవి నుంచి అకారణంగా పంపించి వేసిన వైనంపై మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. తనతో బలవంతంగా రాజీనామా చేయించిన పార్టీ తీరుపై మండిపడుతున్నారు. వాటితోపాటు కొత్త ప్రభుత్వంలో తన కుమారుడికి, అనుచరులకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం కూడా మరో కారణంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తన బలం చూపించేందుకు యడియూరప్ప సిద్ధమయ్యారని కర్ణాటకలో వార్తలు వస్తున్నాయి. పదవి నుంచి దిగిన అనంతరం కొన్నాళ్లు ఎవరితో మాట్లాడకుండా ఉన్న యడియూరప్ప వారం కిందట మాల్దీవులుకు వెళ్లి వచ్చారు. రావడంతోనే మళ్లీ రాజకీయంగా క్రియాశీలకంగా మారుతాననే సంకేతాలు పంపారు. ఈ క్రమంలోనే శివమొగ్గలో పంచాయతీ, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప యడియూరప్పను కలిశారు. వీరిద్దరి భేటీ రాజకీయంగా చర్చనీయాంశమైంది. తన కుమారుడు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయేంద్రకు సహకరించనున్నట్లు సమాచారం. త్వరలోనే కుమారుడితో రాష్ట్రవ్యాప్త యాత్ర చేపట్టే ఆలోచనలు ఉన్నాయని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి కుమారుడికి బలం చేకూర్చాలని యడ్డియూరప్ప లక్ష్యమని పార్టీలోని ఓ నాయకుడు చెప్పారు. (చదవండి: తొందరపడుతున్న నవ జంటలు: అలా పెళ్లి.. ఇలా విడాకులు) అయితే సోమవారం పార్టీ కర్ణాటక ఇన్చార్జి అరుణ్సింగ్ మూడు రోజుల పర్యటనకు మైసూర్ చేరుకున్నారు. పార్టీలో ఇంకా సద్దుమణగని విబేధాలు, లుకలుకలపై దృష్టి సారించనున్నారు. ముఖ్యమంత్రి మార్పు తర్వాత జరిగిన పరిణామాలపై చర్చించనున్నారు. ఈ క్రమంలోనే యడియూరప్ప తన బలం చూపించాలని భావిస్తున్నారట. ఈ సందర్భంగా తన అనుచరులకు ఈ మేరకు ఆదేశాలు పంపారంట. త్వరలోనే తన మద్దతుదారులతో కలిసి ప్రత్యక్ష కార్యాచరణ రూపొందించుకుని ఎన్నికలకు వెళ్లనున్నారని ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే తెలుస్తోంది. తనకు తన వర్గానికి అప్రాధాన్యం ఇవ్వడంపై యడియూరప్ప వర్గం ఎప్పటి నుంచో గుర్రుగా ఉంది. త్వరలోనే యడియూరప్ప వర్గం పార్టీలోనే ఉంటూనే తమ బలం నిరూపించుకునే మార్గాలు అన్వేషిస్తోంది. తనే బీజేపీకి పెద్ద దిక్కు అనిపించేలా యడ్డి వర్గం కార్యాచరణ ఉండనుందని సమాచారం. జూలై 26వ తేదీన ముఖ్యమంత్రి పదవికి యడియూరప్ప రాజీనామా చేయగా జూలై 28న బొమ్మై సీఎంగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. చదవండి: పుట్టింటికి వస్తానన్న కుమార్తె.. తల్లి వద్దనడంతో -
ఎంపీ, ఎమ్మెల్యే మధ్య తిట్ల పురాణం
తుమకూరు(కర్ణాటక): రైతులకు అబద్ధపు హామీలు ఇచ్చుకుంటూ వారిని మాయ చేస్తున్నారని బీజేపీ ఎంపీ బసవరాజుపై జేడీఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ విమర్శలు చేయగా, ఎంపీ సైతం వాగ్బాణాలు సంధించడంతో పరిస్థితి వేడెక్కింది. గుబ్బి తాలూకా చేళూరు హోబళి సి.నందిహళ్లిలో కొత్త విద్యుత్ సబ్స్టేషన్ను ప్రారంభించిన అనంతరం అధికారులతో ఎంపీ వివరాలు తెలుసుకుంటున్నారు. ఈ సమయంలో రైతుల కోసం నీటి ప్రాజెక్టు కట్టడానికి కేంద్రం రూ. 500 కోట్లు విడుదల చేసిందని ఎంపీ చెప్పారు. ఎమ్మెల్యే శ్రీనివాస్ కలుగజేసుకుని అసత్య హామీలు, మాటలు చెప్పొద్దంటూ ఎంపీపై గట్టిగా మాట్లాడారు. ఎంపీ కూడా ఎమ్మెల్యేకు ఘాటుగా హెచ్చరికలు చేయడంతో అధికారులు, నేతలు నచ్చజెప్పి పంపించారు. కాగా, ఎంపీ, ఎమ్మెల్యే మధ్య తిట్ల పురాణంతో సభ వేడెక్కింది. -
ఇమేజ్ కాపాడుకునే పనిలో యడియూరప్ప
సాక్షి బెంగళూరు: ముఖ్యమంత్రి స్థానానికి రాజీనామా చేసిన బీఎస్ యడియూరప్ప అధికారంలో లేకున్నప్పటికీ తన ఇమేజ్ను, తన ప్రాభవాన్ని కాపాడుకునే పనిలో పడ్డారు. రాష్ట్ర రాజకీయాల్లో తన పట్టును కొనసాగించేందుకు కొత్త ప్లాన్ను అమలు చేయనున్నారు. సీఎంగా రాజీనామా చేసినప్పటికీ మంత్రిమండలిలో తన అనుంగు అనుచరులను చేర్చేందుకు శ్రమిస్తున్నారు. అదే సమయంలో రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండేందుకు రాష్ట్ర పర్యటన చేపట్టాలని నిర్ణయించారు. 1983 నుంచి 2021 వరకు సుదీర్ఘ రాజకీయ జీవితంలో విరామం ఎరుగకుండా శ్రమించిన యడియూరప్ప దక్షిణాదిన తొలిసారిగా కర్ణాటకలో బీజేపీ అధికారం చేపట్టడంలో ముఖ్యభూమిక పోషించారు. 78 ఏళ్ల యడ్డి జూలై 26న సీఎంగా రెండేళ్ల పదవీకాలాన్ని పూర్తిచేసుకొని రాజీనామా చేసిన విషయం తెలిసిందే. 75 ఏళ్లు పైబడిన వారికి కీలక పదవులు ఇవ్వకూడదనే నియమాన్ని మోదీ హయాంలో పాటిస్తున్నప్పటికీ... యడియూరప్పకు మాత్రం మినహాయింపునిచ్చి రెండేళ్లు సీఎంగా కొనసాగడానికి అవకాశం ఇవ్వడం ఆయన బలాన్ని, అవసరాన్ని తెలియజేసింది. ఇప్పటికీ యడ్డినే పవర్ఫుల్.. ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త ముఖ్యమంత్రిగా బసవరాజ బొమ్మై బాధ్యతలు చేపట్టినప్పటికీ యడియూరప్పనే పవర్ సెంటర్గా మారారు. పార్టీలో ఇప్పటికీ యడియూరప్ప తన పట్టును కొనసాగిస్తున్నారు. ఇదే పట్టు, బలాన్ని వచ్చే అసెంబ్లీ, లోకసభ ఎన్నికల వరకు కొనసాగించాలని తీర్మానించుకున్నారు. గవర్నగిరీ వద్దని, రాష్ట్ర రాజకీయాల్లోనే క్రియాశీలకంగా ఉంటానని ఆయన ఇదివరకే స్పష్టం చేశారు. తాలూకాల యాత్రకు ప్లాన్ పార్టీని వచ్చే ఎన్నికల్లో గెలిపించి తీరుతానని యడ్డి ఇటీవల చెప్పడం గమనార్హం. వారానికో తాలూకాకు వెళ్లిని పార్టీని బలోపేతం చేసి తద్వారా తనకు వయసు పైబడిన, అధికారం ఇవ్వకపోయినా రాజకీయంగా శక్తివంతుడినని హైకమాండ్కు తెలిసేలా చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. అందుకోసమే గవర్నర్ పదవిని సైతం యడియూరప్ప తిరస్కరించినట్లు సమాచారం. తన ఇద్దరు కుమారులు విజయేంద్ర (బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు), రాఘవేంద్రలను రాజకీయంగా మంచి స్థాయిలో నిలబెట్టాలంటే ప్రజల్లో తిరుగుతూ తిరిగి తన శక్తిని అధిష్టానానికి తెలియజేయాలని భావించినట్లు తెలిసింది. వారి రాజకీయ భవిష్యత్తుకు మంచి పునాది వేయడం వంటి లక్ష్యాలు ఆయన ముందున్నాయి. -
కర్ణాటకం కోసం బీజేపీ కసరత్తు
కర్ణాటక మంత్రివర్గ కూర్పుపై ముఖ్యమంత్రి బసవ రాజ బొమ్మైతో పాటు బీజేపీ హైకమాండ్ కసరత్తు చేస్తోంది. బసవరాజ్ పేరుకు ముఖ్యమంత్రి అయినా కేబినెట్లోకి ఎవరిని తీసుకోవాలనే దానిపై ఆయన కున్న అధికారం తక్కువ. పార్టీ ఢిల్లీ పెద్దలే మంత్రుల ఎంపికలో కీలకపాత్ర వహిస్తారు. ఈ పరిస్థితిని నిశి తంగా పరిశీలించిన వారికి ఇందిర హయాంలో కాంగ్రెస్ రాజకీయాలు గుర్తుకురాక మానవు. కర్ణాటకలో కొత్త తరం నాయకులను ప్రోత్సహిం చాలని బీజేపీ హైకమాండ్ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హిందూత్వ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండటం, కనీసం మూడు దఫాలు ఎమ్మె ల్యేగా ఎన్నికవడాన్ని ప్రాతిపదికలుగా తీసుకుంటు న్నట్లు బెంగళూరు రాజకీయ వర్గాల కథనం. ఈ నేప థ్యంలో యడ్యూరప్ప కేబినెట్లో పనిచేసిన చాలా మందికి మంత్రి పదవులు దక్కే అవకాశాలు కనిపిం చడం లేదు. అయితే యడియూరప్ప రాజీనామా తరు వాత ముఖ్యమంత్రి పదవిని ఆశించిన అరవింద్ బెల్లాడ్, బీపీ యత్నాల్కు తప్పకుండా చోటు దొరుకు తుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. సంఘ్ పరివార్కు సన్నిహితుడైన సురేష్ కుమార్, యడ్యూరప్ప శిబిరం నుంచి అశోక్కు మంత్రి పదవులు ఖాయమన్న వార్తలు వినిపిస్తున్నాయి. బసవరాజ బొమ్మై ప్రమాణస్వీకారం చేశారో లేదో మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ సెట్టార్ నిరసన గళం వినిపించారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ కేబి నెట్లో చేరే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు. 2012లోనే ముఖ్యమంత్రిగా పనిచేసిన చరిత్ర జగదీశ్ది. అయితే 2019లో ఏర్పడ్డ యడియూరప్ప కేబినెట్లో ఎలాంటి భేషజాలకు పోకుండా పనిచేశారు. యడియూరప్ప తనకంటే వయసులోనూ, రాజకీయంగానూ సీనియర్ కావడంతో ఆయన కేబినెట్లో ఉన్నానన్నారు. బసవ రాజతో తనకెలాంటి గొడవలూ లేవనీ, ఆత్మ గౌర వాన్ని కాపాడుకోవడానికే తనకు సబ్ జూనియర్ అయిన బసవరాజ మంత్రివర్గంలో చేరదలుచుకోలే దనీ స్పష్టత ఇచ్చారు. ఇదిలావుంటే, బసవరాజ ప్రమాణ స్వీకారానికి బళ్లారి నేత బి. శ్రీరాములు డుమ్మా కొట్టారు. ఆయన్ని కొంతకాలంగా ఢిల్లీ పెద్దలు దూరం పెడుతున్నారు. దీంతో ఆయన కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. సుష్మా స్వరాజ్ చనిపోయిన తరువాత శ్రీరాములు రాజకీయ జీవితం దాదాపుగా మసక బారిందనే చెప్పవచ్చు. ఇక సీనియర్ నేత కేఎస్ ఈశ్వరప్ప ఉపముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్నారు. చాలా మంది మఠాధిపతులు తనను ఉప ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారని మనసులోని మాటను బయటపెట్టారు. అయితే బీజేపీలాంటి సైద్ధాంతిక పార్టీలో ఇలాంటి బెదిరింపులు ఎవరూ పట్టించుకోరు. యడియూరప్ప మీద నమ్మకంతోనో, పదవులకు ఆశపడో గతంలో కాంగ్రెస్, జేడీ (ఎస్) నుంచి 17 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. వారికి యడి యూరప్ప మంచి పదవులే కట్టబెట్టారు. ఇప్పుడు దళపతి మారడంతో తమ పరిస్థితి ఏమిటని వారు ఆందోళన పడుతున్నారు. అయితే వీరిని దూరం చేసు కుంటే ప్రభుత్వ మనుగడకే ప్రమాదం ఏర్పడవచ్చు. అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ కంటే కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఎక్కువున్నారు. అంటే ఏడు గురు ఎమ్మెల్యేలు ప్లేటు ఫిరాయిస్తే బసవరాజ సర్కార్ పడి పోవడం ఖాయం. ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మె ల్యేలకు ఎలాంటి అన్యాయం జరగదని తాను భావి స్తున్నట్లు మాజీ మంత్రి బీసీ పాటిల్ అన్నారు. ఏమైనా ఎవరినీ నారాజ్ చేయకుండా అడుగులు వేస్తోంది బీజేపీ. బసవరాజ టీమ్తోనే 2023 అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలన్నది బీజేపీ పెద్దల ఆలోచనగా తెలుస్తోంది. కర్ణాటకలో పార్టీ బలోపేతానికి యడియూరప్ప పునా దులు తవ్విన విషయాన్ని ఎవరూ కాదనలేరు. అయితే కొంతకాలంగా ఆయన పాలన గాడి తప్పిందన్న విమ ర్శలున్నాయి. యంత్రాంగంలో అవినీతి పెరిగింది. ప్రభుత్వ వ్యవహారాల్లో యడియూరప్ప పుత్రరత్నం జోక్యం పెరగడంతో బీజేపీ ఇమేజ్ డ్యామేజ్ అయింది. అలాగే కోవిడ్ను కట్టడి చేసే విషయంలోనూ యడియూరప్ప సర్కార్ విఫలం అయిందన్న విమర్శలు న్నాయి. దీంతో పాతవారిని పక్కనపెట్టి ప్రజలకు కొత్త నాయకత్వాన్ని పరిచయం చేయాలని బీజేపీ నిర్ణయిం చుకున్నట్లు రాజకీయవర్గాల మాట. ఎస్. అబ్దుల్ ఖాలిక్ సీనియర్ జర్నలిస్ట్ ‘ మొబైల్ : 87909 99335 -
ఒక్క దెబ్బకు... రెండు పిట్టలు
చాలాకాలంగా వినిపిస్తున్నదే నిజమైంది. కర్ణాటక పీఠంపై యడియూరప్ప స్థానంలో కొత్త నేత కూర్చున్నారు. కర్ణాటక 23వ ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై బుధవారం పదవీ స్వీకారం చేయడంతో యడియూరప్ప పాత అధికార శకం ముగిసింది. దక్షిణాదిలో తమకు పట్టం కట్టిన తొలి రాష్ట్రంలో బీజేపీ కొత్త అధ్యాయం మొదలుపెట్టింది. కన్నడనాట పార్టీ బలోపేతంలో, అధికారంలోకి తేవడంలో కీలక పాత్రధారి యడ్డీ తర్వాత ఎవరన్న చిరకాలపు చిక్కుప్రశ్నకు బీజేపీ జవాబిచ్చింది. యడ్డీ మంత్రివర్గంలో హోమ్ మంత్రి బొమ్మై ఇప్పుడు పార్టీనీ, ప్రభుత్వాన్నీ చక్కదిద్దాల్సిన బరువు భుజానికెత్తుకున్నారు. 1980లలో తొమ్మిది నెలల పాటు కర్ణాటకకు ముఖ్యమంత్రిగా పనిచేసిన తన తండ్రి, మాజీ కేంద్ర మంత్రి స్వర్గీయ ఎస్సార్ బొమ్మై వారసుడిగా నడక ప్రారంభించారు. ఇంజనీరింగ్ చదివి, టాటా మోటార్స్లో ఉద్యోగం చేస్తూ, వ్యాపారవేత్తగా మారాలని బెంగళూరొచ్చి, అనుకోకుండా రాజకీయాల్లోకి దిగిన బసవరాజ్ సీఎం స్థాయికి ఎదగడం అనూహ్యమే. జనతాదళ్తో మొదలై, బీజేపీలో చేరడానికన్నా ముందు జేడీయూలో పనిచేసిన గతం బొమ్మైది. కరోనా వేళ ప్రభుత్వ వైఫల్యం, అవినీతి, బంధుప్రీతి, పెరుగుతున్న అసమ్మతితో యడ్డీ క్రమంగా పార్టీకి బరువవుతున్న సంగతిని అధిష్ఠానం చాలాకాలం క్రితమే గుర్తించింది. ఇప్పటిదాకా నాలుగు సార్లు సీఎం అయినా, ఒక్కసారీ పూర్తికాలం పదవిలో లేని జాతకం యడ్డీది. 2012లోనైతే ఏకంగా అవినీతి ఆరోపణలతో పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఒకప్పుడు ఇదే యడ్డీ... బీజేపీ నుంచి బయటకొచ్చి, సొంత పార్టీ పెట్టి సత్తా చాటిన రోజులనూ అధినాయకత్వం మర్చిపోలేదు. ఈసారి పార్టీకి ఇబ్బంది తలెత్తకుండా జాగ్రత్తగా, అదే సమయంలో గౌరవంగా యడ్డీని సాగనంపాలని అధిష్ఠానం 4 నెలలుగా ప్రణాళికలు వేస్తూ వచ్చింది. అందుకే, ఆయనను కానీ, రాష్ట్రంలో దళితుల (23 శాతం) తరువాత రెండో అతి పెద్దదైన (17 శాతం) ఆయన లింగాయత్ సామాజిక వర్గాన్ని కానీ శత్రువుల్ని చేసుకోకుండా తెలివిగా వ్యవహరించింది. ఒక దశలో లింగాయత్ల బదులు మరో కీలక ఒక్కళిగల వర్గానికి చెందిన నేతను గద్దెపై కూర్చోబెట్టాలని అధిష్ఠానం తర్జనభర్జన పడింది. కానీ, దక్షిణాదిన బలంగానూ, అధికారంలోనూ ఉన్న ఏకైక రాష్ట్రంలో అతిగా ప్రయోగాలు చేస్తే మొదటికే మోసం వస్తుందని వెనక్కు తగ్గింది. రాష్ట్రంలోని 224 అసెంబ్లీ స్థానాల్లో 100 స్థానాల్లో ఫలితాన్ని నిర్ణయించే లింగాయత్లకు జోల పాడింది. వయసు మీద పడ్డ 78 ఏళ్ళ యడ్డీ స్థానంలో తోటి లింగాయత్ అయిన 61 ఏళ్ళ బొమ్మై మెరుగు అనుకుంది. అలా ఉత్తర కర్ణాటక ప్రాంతానికి చెందిన నేతకు సీఎం సీటు దక్కాలన్న ఆ ప్రాంతీయుల చిరకాల డిమాండ్ను కూడా తీర్చింది. వాజ్పేయి – అడ్వాణీల తరం నేతలను ఒక్కొక్కరిగా వదిలించుకుంటూ వస్తున్న మోదీ, అమిత్ షా ద్వయం ఆ క్రమంలోనే యడ్డీ స్థానంలో బొమ్మైని తెచ్చింది. అదే సమయంలో ‘దశాబ్దాలుగా మీరు చేసిన సేవలకు మాటలు సరిపోవు’ అంటూ ట్విట్టర్ సాక్షిగా యడ్డీపై ప్రశంసల వర్షమూ కురిపించింది. ఆచితూచి చేసిన ఈ మార్పుతో బీజేపీకి ఒకే దెబ్బకు రెండు పిట్టలు దక్కాయి. ఒకటి – బొమ్మై కూడా లింగాయత్ సామాజిక వర్గానికి చెందినవాడే కావడంతో, రాష్ట్రంలో తమ బలమైన ఓటు బ్యాంకును దూరం చేసుకోకుండా, కాపాడుకున్నట్టయింది. రెండోది – యడ్డీకి బొమ్మై నమ్మినబంటు కావడం వల్ల, నిష్క్రమిస్తున్న సీనియర్ నేత నుంచి అసమ్మతులు, కొత్త ఇబ్బందులు లేకుండా చూసుకున్నట్టయింది. యడియూరప్ప సైతం నిష్క్రమణ సమయంలోనూ కోరుకున్న హిరణ్యాక్ష వరాలు దక్కించుకొని, పార్టీపై తన పట్టు సడలలేదని చాటుకున్నారు. పదవి పోయినా తానే తెర వెనుక సీఎం అనే ఇమేజ్ తెచ్చుకున్నారు. బీజేపీ కర్ణాటక రాష్ట్ర శాఖకు ఉపాధ్యక్షుడైన తన చిన్న కొడుకు 45 ఏళ్ళ విజయేంద్ర ప్రాధాన్యానికి భంగం రాదన్న హామీ పుచ్చుకున్నారు. ఇక, యడ్డీ వారసుడిగా పీఠమెక్కిన బొమ్మైకి 20 నెలల్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు ఉన్న సమయం తక్కువ. సవాళ్ళు ఎక్కువ. కరోనా వేళ దిగజారిన ప్రభుత్వ ప్రతిష్ఠను ఆయన పునరుద్ధ రించాల్సి ఉంటుంది. యడ్డీ అవినీతి, బంధుప్రీతి మరకలు పార్టీ విజయావకాశాలకూ, ప్రభుత్వ గౌరవానికీ భంగం కలిగించకుండా చకచకా చర్యలు చేపట్టాలి. యడ్డీ ఖాళీ చేయగానే సీఎం సీటులో కూర్చోవాలని ఆశపడ్డ ఆశావహులను బుజ్జగించి, కలుపుకొని పోవాలి. వ్యక్తిగత గురువైన యడ్డీని తోసిపుచ్చకుండానే, సొంతకాళ్ళపై నిలబడి పదవిని సుస్థిరం చేసుకొనేందుకు సమస్త ప్రయత్నాలూ చేయాలి. అన్నిటికన్నా ముఖ్యంగా... పార్టీలో సమస్యల పరిష్కర్తగా, సౌమ్యుడిగా, మధ్యేవాదిగా ఇప్పటి దాకా తనకున్న పేరును కాపాడుకుంటూనే, యడ్డీ లాంటి జననేతగా ఓటర్ల గుండెల్లో గూడు కట్టుకోవాలి. 2018 ఎన్నికలలో గెలిచినా – ఎమ్మెల్యేలపై యడ్డీ వేసిన ‘ఆపరేషన్ కమల్’ మంత్రంతో అధికారానికి దూరమైన కాంగ్రెస్, జనతాదళ్ (ఎస్)లు తిరిగి బలం పుంజుకోకుండా జాగ్రత్త పడాలి. ఇప్పటికే అధిష్ఠానం మరో ముగ్గురిని ఉప ముఖ్యమంత్రుల్ని చేస్తోందన్న వార్తలొచ్చాయి. అంటే, బొమ్మైకి ఆది నుంచే ఆట మొదలైపోయింది. మరి, స్వతహాగా క్రికెట్ వీరాభిమాని, గతంలో కర్ణాటక క్రికెట్ సంఘానికి చైర్మన్ అయిన బొమ్మై తన కెప్టెన్సీలో కర్ణాటక బీజేపీ టీమ్ను ఎంత సమన్వయంతో, సమర్థంగా నడిపిస్తారో చూడాలి. నిండా రెండేళ్ళయినా దూరం లేని 2023 అసెంబ్లీ ఎన్నికలలో ఆయన సిక్సర్ కొడతారా? రోజుకో రకంగా మారే రాజకీయాలలో అధిష్ఠానం ఆశలు, ఆలోచనల్ని నిజం చేస్తారా? ఇప్పుడే తెర తీసిన కర్ణాటకంలో కొత్త అంకానికి స్వాగతం. -
Karnataka Politics: ఇంజనీరు రిపేర్ చేస్తాడా?
రాజకీయ ఉద్దండుడిగా పేరొందిన యెడ్డీనే స్థానిక బీజేపీ నేతలు ఇబ్బంది పెట్టగా, సౌమ్యుడిగా పేరున్న బొమ్మై వీరితో ఎలా నెగ్గుకొస్తారన్నది ఆసక్తికరంగా మారింది. యెడ్డీ ఆశీస్సులతో పాటు, పార్టీ లో సీనియర్ నేతల మద్దతుందని బొమ్మై చెప్పారు. గతంలో సదానంద గౌడను యెడ్డీ మద్దతుతోనే సీఎం చేశారు. కానీ హైకమాండ్ ఆశించినట్లు గౌడ రాణించలేకపోయారు. సీఎంగా దిగినంత మాత్రాన యెడ్డీ ఊరికే ఉండరు. రాజకీయాల్లో యాక్టివ్గానే ఉండే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆయన కుమారులు సైతం బీజేపీలోనే కొనసాగుతారు. వీరిలో రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు విజయేంద్రను సూపర్ సీఎంగా పిలిచేవారు. తండ్రి సీఎంగా దిగిపోయినా, విజయేంద్ర హవా కొనసాగించే యత్నాలు సాగించవచ్చు. యెడ్డీని వ్యతిరేకించిన ఎమ్మెల్యేలు అరవింద్ బెల్లాద్, బసన్న గౌడ పాటిల్ ఎంతవరకు బొమ్మైకి సహకరిస్తారో తెలీదు. అరవింద్.. యెడ్డీ స్థానంలో సీఎం కావాలని ఆశించారు. కానీ అధిష్టానం బొమ్మైను ఎంచుకుంది. వీరితో పాటు సీఎం పోస్టు ఆశించిన పలువురు ఆశావహులను బుజ్జగించుకుంటూ రాబోయే ఎన్నికల్లో పార్టీని తిరిగి గెలిపించాల్సిన బాధ్యత బొమ్మైపై ఉంది. ఈ మెకానికల్ ఇంజనీరు యెడ్డీ వర్గాన్ని, అసమ్మతి వర్గాన్ని సముదాయించుకుంటూ సొంత పార్టీని గెలుపు తీరాలకు చేరుస్తారో, లేదో వేచిచూడాల్సిందే! –నేషనల్ డెస్క్, సాక్షి 50%కి పైగా 2 ఏళ్ల లోపే... కర్ణాటక సీఎంలుగా పనిచేసిన వారిలో 50 శాతానికి పైగా రెండేళ్లలోపే పదవిలో ఉన్నారు. బుధవారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న బసవరాజ బొమ్మైకి మరో 19 నెలల పదవీకాలం మాత్రమే మిగిలి ఉంది. 2023 మేలోపు కర్ణాటక అసెంబ్లీకి తదుపరి ఎన్నికలు జరగనున్నాయి. కన్నడనాట సీఎంల పదవీకాలం వివరాలిలా ఉన్నాయి. పదవీకాలం సీఎంలు 0–1 ఏళ్లు 9 మంది 1–2 7 2–3 6 3–4 3 4–5 3 5+ 3 -
కర్ణాటక 20వ సీఎంగా రేపు బసవరాజ్ బొమ్మై ప్రమాణ స్వీకారం
బెంగళూరు: కర్ణాటక 20వ ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేపు ఉ.11 గంటలకు రాష్ట్ర గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్.. బొమ్మైచే ప్రమాణం స్వీకారం చేయించనున్నారు. అంతకుముందు కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా బసవరాజు బొమ్మైను బీజేపీ శాసన సభాపక్షం ఎన్నుకుంది. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్, యడియూరప్ప సమక్షంలో మంగళవారం ఈ నిర్ణయం తీసుకున్నారు. లింగాయత్ సామాజిక వర్గానికి మరోసారి ముఖ్యమంత్రి పీఠం దక్కింది. మాజీ ముఖ్యమంత్రి ఎస్ఆర్ బొమ్మై కుమారుడే బసవరాజు. యడియూరప్ప వారసుడిగా ప్రస్తుతం హోంమంత్రిగా ఉన్న బసవరాజు వైపే పార్టీ ఎమ్మెల్యేలు మొగ్గు చూపారు. దీంతో అధిష్టానం ఆదేశాలతో పరిశీలకులు బసవరాజు పేరును ఖరారు చేశారు. తాజా మాజీ సీఎం యడియూరప్ప కూడా తదుపరి సీఎంగా బసవరాజునే సూచించిన విషయం తెలిసిందే. జనతా దళ్ పార్టీతో రాజకీయాల్లోకి ప్రవేశించిన బసవరాజు 1998, 2004లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2008లో బీజేపీలో చేరి కీలక నాయకుడిగా అవతరించారు. షిగ్గాన్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. యడియూరప్ప మంత్రివర్గంలో హోంమంత్రిగా ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి పదవి కోసం రేసులో అరవింద్ బెల్లాద్, బసన్నగౌడ పాటిల్, సీటీ రవి తదితర పేర్లు తెరమీదకు వచ్చాయి. చివరకు బసవరాజు బొమ్మైకే ఆ అదృష్టం వరించింది. బసవరాజు గతంలో టాటా గ్రూప్లో ఇంజనీర్గా బసవరాజు పని చేశారు. రెండు, మూడు రోజుల్లో ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. -
బ్రేకింగ్: కర్ణాటక కొత్త సీఎంగా బసవరాజు బొమ్మై
బెంగళూరు: కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా బసవరాజు బొమ్మైను బీజేపీ శాసన సభాపక్షం ఎన్నుకుంది. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్, యడియూరప్ప సమక్షంలో మంగళవారం ఈ నిర్ణయం తీసుకున్నారు. లింగాయత్ సామాజిక వర్గానికి మరోసారి ముఖ్యమంత్రి పీఠం దక్కింది. మాజీ ముఖ్యమంత్రి ఎస్ఆర్ బొమ్మై కుమారుడే బసవరాజు. యడియూరప్ప వారసుడిగా ప్రస్తుతం హోంమంత్రిగా ఉన్న బసవరాజు వైపే పార్టీ ఎమ్మెల్యేలు మొగ్గు చూపారు. దీంతో అధిష్టానం ఆదేశాలతో పరిశీలకులు బసవరాజు పేరును ఖరారు చేశారు. తాజా మాజీ సీఎం యడియూరప్ప కూడా తదుపరి సీఎంగా బసవరాజునే సూచించిన విషయం తెలిసిందే. జనతా దళ్ పార్టీతో రాజకీయాల్లోకి ప్రవేశించిన బసవరాజు 1998, 2004లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2008లో బీజేపీలో చేరి కీలక నాయకుడిగా అవతరించారు. షిగ్గాన్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. యడియూరప్ప మంత్రివర్గంలో హోంమంత్రిగా ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి పదవి కోసం రేసులో అరవింద్ బెల్లాద్, బసన్నగౌడ పాటిల్, సీటీ రవి తదితర పేర్లు తెరమీదకు వచ్చాయి. చివరకు బసవరాజు బొమ్మైకే ఆ అదృష్టం వరించింది. బసవరాజు గతంలో టాటా గ్రూప్లో ఇంజనీర్గా బసవరాజు పని చేశారు. రెండు, మూడు రోజుల్లో ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. -
కర్ణాటక సంకీర్ణం అందుకే కూలిందా ?
న్యూఢిల్లీ: 2019లో కర్ణాటకలో కాంగ్రెస్ నేతృత్వంలో అధికారంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు పెగసస్ స్పైవేర్ను ఉపయోగించారని కాంగ్రెస్ నేతలు మంగళవారం బీజేపీని విమర్శించారు. పెగసస్ స్పైవేర్ లిస్టులో అప్పటి ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి, ఉపముఖ్యమంత్రి జి. పరమేశ్వర, మాజీ సీఎం సిద్దరామయ్యల కార్యదర్శులు ఉన్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా బీజేపీపై విరుచుకుపడ్డారు. పెగసస్ను వినియోగించుకొని మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని హత్య చేసిందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో దీనిపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. కేంద్ర హోంమంత్రిగా కొనసాగే హక్కు అమిత్షాకు లేదని వ్యాఖ్యానించారు. -
‘మా సీఎం మారడు.. 65 మంది మద్దతు ఉంది’
బెంగళూరు: కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు అంశానికి సంబంధించి రోజుకో పరిణామం చోటుచేసుకుంటోంది. అయితే ముఖ్యమంత్రి యడియూరప్ప మాత్రం మారడని ఆయన రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్యే రేణుకాచార్య కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. యడియూరప్ప సీఎం పదవికి రాజీనామా చేయాల్సిన అవసరమే లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రికి 65 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ప్రకటించారు. ఈ మేరకు సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా యడియూరప్పకు వ్యతిరేకంగా పని చేస్తున్న వారిపై రేణుకాచార్య విరుచుకుపడ్డారు. వారి పక్క నియోజకవర్గాన్ని గెలిపించుకునే సత్తాలేనివారు యడియూరప్ప గురించి మాట్లాడుతుండడం వింతగా ఉందని పేర్కొన్నారు. యత్నాళ్ పిచ్చోడి తరహాలో మాట్లాడారని తెలిపారు. ఆయనకు వ్యతిరేకంగా ఏమి జరగదని చెప్పారు. వారం కిందట 18 మంది ఎమ్మెల్యేలు యడియూరప్పకు మద్దతుగా తాము ఢిల్లీకి వెళ్లి వస్తామని చెప్పారని.. అయితే ఏ సమస్య లేదని యడియూరప్ప చెప్పినట్లు’ రేణుకాచార్య వివరించారు. ఈ సమయంలో యడియూరప్ప రాజీనామా చేయాల్సిన అవసరమే లేదు అని స్పష్టం చేశారు. ప్రస్తుతం కరోనా తీవ్రంగా విజృంభిస్తున్న సమయంలోనూ యడియూరప్ప వృద్ధాప్యంలో చురుగ్గా పని చేస్తున్నారని రేణుకాచార్య తెలిపారు. కోవిడ్ సందర్భంలో కొందరు ఢిల్లీకి వెళ్లి ఏవేవో ప్రయత్నాలు చేయడం సరికాదని ప్రత్యర్థి గ్రూపులకు హితవు పలికారు. నాయకత్వ మార్పు వివాదం రేగిన నేపథ్యంలో యడియూరప్పకు మద్దతుగా 65 మందికి పైగా ఎమ్మెల్యేలు సంతకాలు చేశారని, దానికి సంబంధించిన లేఖ తన వద్ద ఉందని రేణుకాచార్య తెలిపారు. చదవండి: కలకలం..ముఖ్యమంత్రిని పంపేందుకు ముహూర్తం పెట్టాం చదవండి: ‘సీఎంను మార్చే ప్రసక్తే లేదు.. అవి కేవలం పుకార్లే’ -
‘సీఎంను మార్చే ప్రసక్తే లేదు.. అవి కేవలం పుకార్లే’
బెంగళూరు: కర్ణాటక సీఎం యడియూరప్పను తప్పిస్తారన్న వార్తలపై బీజేపీ క్లారిటీ ఇచ్చింది. యడియూరప్పను సీఎంగా తొలగించే అవకాశమే లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి స్పష్టం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యడియూరప్ప మా సీఎం, ఆయన పదవీకాలం ముగిసేంత వరకూ సీఎంగానే ఉంటారు. మేము ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నాము, కర్ణాటకలో సీఎంను మార్చే ఆలోచన లేదు. ఈ వార్తలు కేవలం పుకారు మాత్రమేనని తెలిపారు. అంతకుముందు కర్ణాటక పర్యాటక శాఖ మంత్రి సీపీ యోగేశ్వర్ రాష్ట్ర నాయకత్వానికి సంబంధించి వ్యతిరేకంగా ప్రకటనలు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్, అరవింద్ బెల్లాడ్ సహా పలువురు సీనియర్ బీజేపీ నాయకులు కూడా సీఎం మార్చాలని డిమాండ్ చేశారు. మార్చి నెలలో యట్నాల్ మాట్లాడుతూ.. కర్ణాటకలో బీజేపీ పార్టీ సజీవంగా ఉండాలంటే, ముఖ్యమంత్రి మార్పు అవసరం ఉందని పేర్కొన్నారు. అయితే ఢిల్లీలో బీజేపీ నాయకులతో సమావేశమైన తరువాత, సీటీ రవి యడియూరప్ప ముఖ్యమంత్రిగా కొనసాగుతారని స్పష్టం చేశారు. చదవండి: కర్ణాటకలో కీలకంగా మారుతున్న పరిణామాలు -
కలకలం: ముఖ్యమంత్రిని పంపేందుకు ముహూర్తం పెట్టాం
మైసూరు: సీఎం యడియూరప్పకు ఆరోగ్యం సరిగా లేదు, దీంతోపాటు రాష్ట్ర పరిపాలన కూడా సరిగా లేదని, దీనిపై హైకమాండ్ వెంటనే ఒక నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్సీ హెచ్.విశ్వనాథ్ అన్నారు. ఆయన బుధవారం మైసూరు జయలక్ష్మీపురంలో ఎంపీ శ్రీనివాస్ ప్రసాద్ ఇంటికి వెళ్లి తాజా రాజకీయాలపై చర్చించారు. అనంతరం విశ్వనాథ్ మాట్లాడుతూ ఎంపీ ఇంట్లో పలు విషయాలకు ముహూర్తం పెట్టినట్లు చెప్పారు. కొద్ది రోజులు వేచి చూడాలని తెలిపారు. చదవండి: ఢిల్లీ టూర్తో వేడెక్కిన కర్ణాటక రాజకీయం చదవండి: సొంత ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిన మంత్రి -
ఢిల్లీ టూర్తో వేడెక్కిన కర్ణాటక రాజకీయం
శివాజీనగర: రాష్ట్ర బీజేపీలో నాయకత్వ మార్పుపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో సీఎం యడియూరప్ప తనయుడు, యువమోర్చా నేత విజయేంద్ర ఢిల్లీకి వెళ్లడం రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యార్థకమైంది. పరిపాలనలో విజయేంద్ర వేలు పెడుతున్నారని, సీఎంను మార్చాలని యడ్డి వ్యతిరేక వర్గం డిమాండ్ చేస్తున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ రాష్ట్ర ఇన్చార్జి అరుణ్సింగ్ను కలుస్తారని తెలిసింది. రాష్ట్ర రాజకీయాల గురించి చర్చించే అవకాశముది ఇది మూడు ముక్కల ప్రభుత్వమని మంత్రి యోగీశ్వర్ ఇటీవల విమర్శలు చేయడంపై విజయేంద్ర ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఆయన వల్ల పారీ్టకి, ప్రభుత్వానికి అవమానమైందని, వీలైతే మంత్రి పదవి నుంచి తొలగించాలని కోరే అవకాశముంది. బళ్లారి జిల్లాలో జిందాల్కు ఇచ్చిన 3 వేల ఎకరాలకు పైగా భూమిని వెనక్కు తీసుకోవడంపైనా వివరణ ఇవ్వనున్నారు. హైకమాండ్ వద్ద తన వాదనను వినిపించేందుకు యడియూరప్ప తనయున్ని పంపినట్లు తెలిసింది. సీఎం మార్పు ఉండదు మైసూరు: ఢిల్లీకి ఎవరు, ఎందుకు వెళ్లారు అన్న విషయం నాకు తెలియదు, సీఎంగా యడియూరప్ప పూర్తి కాలం పదవిలో ఉంటారని బీజేపి జాతీయ కార్యదర్శి సి.టి.రవి అన్నారు. మంగళవారం మైసూరులో ఆయన పార్టీ ఆఫీసులో మాట్లాడారు. బీ.వై. విజయేంద్ర ఢిల్లీకి వెళ్లడాన్ని ప్రస్తావిస్తూ పార్టీ నాయకులు అన్నాక అనేక కార్యక్రమాలు ఉంటాయన్నారు. కరోనా సమయంలో రాజకీయాలువద్దని అన్నారు. సీఎం మార్పు ఉండబోదని చెప్పారు. -
సీఎం మార్పు: కుట్రలపై ముఖ్యమంత్రి ఘాటు స్పందన
శివాజీనగర: ప్రస్తుతం నా ఎదురుగా ఉన్నది కరోనా సవాల్ మాత్రమే. దానిని ఎదుర్కోవడానికి ఏమేం చేయాలో చేస్తాను. ఢిల్లీకి వెళ్లినవారికి హైకమాండ్ తగిన సమాధానం చెప్పి పంపింది. శాసనసభా పక్ష సమావేశం గురించి మీ ముందు చర్చించలేను అని సీఎం యడియూరప్ప అన్నారు. సీఎం మార్పు కోసం బీజేపీలో ఒక వర్గం చేస్తున్న ప్రయత్నాలపై ఘాటుగా స్పందించారు. జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా గురువారం విధానసౌధ ఆవరణలో ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మంత్రులు, ఎమ్మెల్యేలు కలసికట్టుగా కోవిడ్ ఎదుర్కోవాల్సి ఉందన్నారు. ఎవరో ఒకరు ఎక్కడికో వెళ్లి వచ్చారంటే వారికి హైకమాండ్ సమాధానం చెప్పి పంపారు కదా అన్నారు. యడియూరప్పని తొలగించాలని బీజేపీలోని కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు ఇటీవల ఢిల్లీలో బీజేపీ పెద్దలకు విజ్ఞప్తి చేశారని వార్తలు రావడం తెలిసిందే. -
థాంక్యూ సీఎంజీ
సాక్షి, కర్ణాటక: ఇటీవల సీఎం యడియూరప్ప, బీజేపీ వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినట్లు వార్తల్లోకి ఎక్కిన కత్తి సోదరులు, మురుగేశ్ నిరాణి తమ డిమాండ్లను పరిష్కరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రమేశ్ కత్తికి రాజ్యసభ టికెట్కు సిఫార్సు చేసినందుకు ధన్యవాలు తెలిపారు. ఆదివారం ఉదయం సీఎం నివాసం కావేరిలో కత్తి సోదరులు, నిరాణి వెళ్లి కలిశారు. కాగా, డిమాండ్ల సాధనకు ఉమేశ్ కత్తి ఆధ్వర్యంలో నిరాణి తదితర బీజేపీ ఎమ్మెల్యేలు విందు రాజకీయం నిర్వహించడం తెలిసిందే. దీంతో యడియూరప్ప వారిని పిలిపించి బుజ్జగించారు. మురుగేశ్ నిరాణి వర్గానికి మండ్య జిల్లా పాండవపుర సహకార కార్మాగారాన్ని 40 సంవత్సరాల పాటు కాంట్రాక్ట్కు అప్పగించినట్లు తెలిసింది. చదవండి: ఉత్కంఠ రేపుతున్న కర్ణాటక రాజకీయాలు -
ఉత్కంఠ రేపుతున్న కర్ణాటక రాజకీయాలు
సాక్షి, బెంగళూరు : ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ సంక్రమిస్తున్న తరుణంలో కన్నడ నాట రాజకీయ అసమ్మతి తారస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో అధికార భారతీయ జనతా పారీ్టకి ప్రమాదం ముంచుకొస్తోందని పుకార్లు షికారు చేశాయి. అయితే అసమ్మతి ఎమ్మెల్యేగా ముద్ర వేసుకున్న ఉమేశ్ కత్తి మరోసారి తన నివాసంలో గురువారం రాత్రి కొందరు నేతలతో సమావేశం నిర్వహించారు. ఈక్రమంలో శుక్రవారం ఉదయం నుంచి రాజకీయంగా చర్చ మొదలైంది. అంతేకాకుండా ఉమేశ్ కత్తిని తన ఇంటికి రావాల్సిందిగా ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ఆహ్వానించారు. ఉమేశ్ కత్తి బెంగళూరులోని సీఎం నివాసం సమావేశమై అనంతరం మీడియాతో మాట్లాడారు. తన నివాసంలో సమావేశానికి.. రాజకీయానికి సంబంధం లేదని కొట్టి పారేశారు. రహస్య సమావేశంపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందించారు. రేణుకాచార్య ఏమన్నారంటే.. ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప నాయకత్వంపై తమకందరికి విశ్వాసముందని, ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి ఎంపీ రేణుకాచార్య తెలిపారు. శుక్రవారం ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ యడియూరప్ప ఎమ్మెల్యేలందరి విశ్వాసంతో పాలన అందిస్తున్నారన్నారు. సీఎం నాయకత్వంపై ఎవరికీ ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. చిన్నపాటి వివాదాలున్నా పరిష్కరించేందుకు పార్టీ ప్రముఖులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. సీఎం యడియూరప్ప కరోనా సమస్యను సమర్థంగా ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. చదవండి: జయ ఆస్తిపై పూర్తి హక్కులు వారికే కష్టసుఖాలు మాట్లాడుకున్నాం : ఉమేశ్ కత్తి బీజేపీలో బాధ్యతాయుత ఎమ్మెల్యేలుగా ఉన్నాం. అందరూ కలిసి భోజనం చేశాం. కష్టసుఖాల గురించి మాట్లాడుకున్నాం. ఎలాంటి రాజకీయ చర్చలు జరపలేదు. బీజేపీలో తిరుగుబాటు లేచిందని, ఎమ్మెల్యేలు ప్రత్యేక సమావేశం నిర్వహించారనే వార్తల్లో నిజం లేదు. మా నాయకుడు మోదీ ప్రభుత్వం మరో మూడేళ్లు ఉండాలని కోరుకున్నాం. రాజ్యసభ స్థానం గురించి ఎలాంటి చర్చలు జరుగలేదు. చదవండి: ప్రముఖ జ్యోతిష్యుడు కన్నుమూత తిరుగుబాటు ఎమ్మెల్యేలు కాదు : యత్నాళ్ తాము తిరుగుబాటు ఎమ్మెల్యేలు కాదని.. ప్రభుత్వాన్ని కూల్చటం లేదని ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాళ్ తెలిపారు. తాము ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తల్లో నిజం లేదన్నారు. లాక్డౌన్ ద్వారా హోటల్ బంద్ అయిన కారణంగా ఉమేశ్ కత్తి ఇంట్లో విందుకు వెళ్లామన్నారు. ప్రభుత్వానికి ఢోకా లేదు : మంత్రి బీ.సీ.పాటిల్ నాయకత్వ మార్పు ఎట్టి పరిస్థితిలోను ఉండబోదని.. మరో మూడేళ్లపాటు బీజేపీ ప్రభుత్వం భద్రంగా ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి బీసీ.పాటిల్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా యడియూరప్ప సమర్థ పాలన అందిస్తున్నారన్నారు. స్నేహితులందరు ఒకచోట కలిస్తే తప్పుగా భావించడం సరికాదన్నారు. -
మంత్రిగిరి కోసం.. ధవళగిరి ప్రదక్షిణ
సాక్షి బెంగళూరు: మంత్రివర్గంలో చోటు ఆశించిన పలువురు శాసనసభ్యులు డాలర్స్ కాలనీలోని ముఖ్యమంత్రి నివాసం ధవళగిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. నేడు (శనివారం) కేంద్ర హోంమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా కర్ణాటక రానున్న సందర్భంగా మంత్రివర్గ విస్తరణపై తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని ఆశావహులు జోరు పెంచారు. ఈమేరకు సీఎం యడియూరప్పతో ఎవరికి వారు లాబీయింగ్ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అయితే పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు కర్తవ్యం నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం నివాసం వద్ద కొందరు ఎమ్మెల్యేలు మీడియాకు తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఉమేశ్ కత్తి, కె.గోపాలయ్య, గోలిహట్టి శేఖర్, ఎం.చంద్రప్ప, సోమశేఖరరెడ్డి, రేణుకాచార్య, జ్ఞానేంద్ర, మాజీ మంత్రులు ఎంటీబీ నాగరాజు, ఆర్.శంకర్ మత్తికెరెలోని సీఎం నివాసానికి శుక్రవారం వెళ్లి వచ్చారు. ఈ సందర్భంగా మంత్రివర్గంలో తమకు చోటు ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. శనివారం ఉదయం ప్రత్యేక విమానం ద్వారా అమిత్షా బెంగళూరు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్యాలెస్ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మధ్యాహ్నం 12 గంటలకు పాల్గొంటారు. తర్వాత సాయంత్రం 4 గంటలకు హుబ్బళి బయలుదేరి వెళ్తారు. అక్కడ పౌరసత్వ సవరణ చట్టంపై జాగృతి కార్యక్రమంలో పాల్గొంటారు. ఆదివారం ఉదయం ఢిల్లీ వెళ్తారు. కాగా అమిత్షా శుక్రవారమే కర్ణాటక వస్తారని భావించారు. కానీ ఆయన ఉన్నఫలంగా నిర్ణయం మార్చుకుని శనివారానికి వాయిదా వేసుకున్నారు. అమిత్షాతో నేడు సీఎం భేటీ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు శనివారం కర్ణాటక రానున్నారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప భేటీ అయి మంత్రివర్గ విస్తరణ గురించి చర్చిస్తారని తెలిసింది. ఈమేరకు ఇప్పటికే మంత్రివర్గం జాబితా కూడా సీఎం సిద్ధం చేసినట్లు సమాచారం. అంతేకాకుండా అసెంబ్లీ సమావేశాలకు ముందే కేబినెట్ విస్తరిస్తారా? లేక తర్వాతా? అనేది కూడా నేడు తేలనుంది. మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోవాలి? ఏ శాఖ ఇవ్వాలనే దానిపై అమిత్షాతో సీఎం యడియూరప్ప చర్చించనున్నారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. కాగా ఉప ఎన్నికల్లో గెలిచిన వారందరికీ మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని సీఎం ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఓడిన వారిని మంత్రిమండలిలోకి తీసుకోవాలా? వద్దా? అనే దానిపై అమిత్షాతో చర్చించి తీర్మానిస్తారు. దీనికి తోడు పార్టీలో ఎన్నో ఏళ్లుగా ఉంటూ ఎమ్మెల్యేలుగా గెలుస్తున్న సీనియర్ నేతలను కూడా కేబినెట్లోకి తీసుకునే విషయమై మాట్లాడుతారు. -
అనర్హత ఎమ్మెల్యేలకు బీజేపీ కండువా
సాక్షి, బెంగళూరు: అనర్హత ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు తీర్పు అనంతరం కన్నడనాట రాజకీయాలు ఊపందుకున్నాయి. అనర్హుల్లో రోషన్ బేగ్ తప్ప అందరూ అధికార బీజేపీలో చేరారు. వీరు డిసెంబరులో జరిగే 15 అసెంబ్లీ సీట్ల ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేస్తారని, వారిలో పలువురు కాబోయే మంత్రులని ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప స్పష్టం చేశారు. అనర్హత ఎమ్మెల్యేల్లో 17 మందికి గాను 16 మందికి గురువారం బెంగళూరులో బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో యడియూరప్ప కాషాయ కండువా కప్పారు. బెంగళూరు శివాజీనగర కాంగ్రెస్ అనర్హత ఎమ్మెల్యే రోషన్ బేగ్ను బీజేపీలోకి ఆహ్వానించలేదు. టికెట్ కూడా ఇవ్వలేదు. కాగా, కొత్త నేతల రాకను బీజేపీ స్థానిక నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో బుజ్జగించడం యడ్యూరప్ప ముందున్న ప్రధాన కర్తవ్యంగా మారింది. -
అనర్హులే.. కానీ పోటీ చేయొచ్చు!
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వం కూలిపోవడానికి కారణమైన 17 మంది కాంగ్రెస్–జేడీఎస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలను అసెంబ్లీ స్పీకర్ అనర్హులుగా ప్రకటించడాన్ని బుధవారం సుప్రీంకోర్టు సమర్ధించింది. ఆ ఎమ్మెల్యేలు రానున్న ఉపఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించింది. ఆ ఎమ్మెల్యేలను అనర్హులుగా పేర్కొంటూ స్పీకర్రమేశ్ ఇచ్చిన ఉత్తర్వుల్లో.. 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల వరకు పోటీ చేసే అవకాశం లేదన్న భాగాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఉప ఎన్నికల్లో గెలిస్తే వారు మంత్రులూ కావచ్చని పేర్కొంది. కుమారస్వామి ప్రభుత్వం కూలిపోవడంతో జూలై నెలలో యడియూరప్ప నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే. కాగా, ఆ ఎమ్మెల్యేలు నేడు(గురువారం) బీజేపీలో చేరనున్నారని సీఎం యడియూరప్ప, ఉప ముఖ్యమంత్రి అశ్వద్ధ నారాయణ్ వెల్లడించారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ద్వారా సంక్రమించిన అధికారాలను స్పీకర్ ఉపయోగించిన విషయాన్ని జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ కృష్ణ మురారిల ధర్మాసనం ప్రస్తావిస్తూ.. ‘ఎంత కాలం అనర్హులుగా ప్రకటించాలనే విషయంలో కానీ, ఎన్నికల్లో పోటీ చేయరాదనే విషయంలో కానీ స్పీకర్కు అధికారం లేదు’ అని స్పష్టం చేసింది. నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్న రాజ్యాంగ ధర్మానికి వ్యతిరేకంగా స్పీకర్లు వ్యవహరించడం ఎక్కువైందని ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది. రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న అవినీతికి పాల్పడటం, ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టడం వంటి చర్యల వల్ల పౌరులు స్థిర ప్రభుత్వాన్ని పొందే హక్కును కోల్పోతున్నారని పేర్కొంది. ‘ఎమ్మెల్యేలు రాజీనామా చేసినప్పుడు, వారు స్వచ్చంధంగానే చేశారా? అనే విషయాన్ని మాత్రమే స్పీకర్ పరిగణనలోకి తీసుకుని, ఆ రాజీనామాను ఆమోదించడమో, లేక తిరస్కరించడమో చేయాలి’ అని కోర్టు పేర్కొంది. ‘స్వచ్చంధంగానే రాజీనామా చేసినట్లు తేలితే, ఆ రాజీనామాను ఆమోదించడం మినహా స్పీకర్కు మరో మార్గం లేదు. ఆ రాజీనామాను ఆమోదించే విషయంలో సంబంధం లేని ఇతర అంశాలను స్పీకర్ పరిగణనలోకి తీసుకోవడం రాజ్యాంగపరంగా ఆమోదనీయం కాదు. స్పీకర్ నిర్ణయం న్యాయసమీక్షకు అర్హమైనదే’ అని ధర్మాసనం తేల్చిచెప్పింది. ఎమ్మెల్యేలు మొదట హైకోర్టును కాకుండా సుప్రీంకోర్టునే ఆశ్రయించడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. హైకోర్టును ఆశ్రయించి, ఆ తీర్పుపై సంతృప్తి చెందనట్లయితేనే, సుప్రీంకోర్టును ఆశ్రయించడం çసరైనదని వ్యాఖ్యానించింది. డిసెంబర్ 5న ఉప ఎన్నికలు తమను అనర్హ ఎమ్మెల్యేలుగా స్పీకర్ రమేశ్ కుమార్ ప్రకటించడాన్ని సవాలు చేస్తూ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్పై తాజా తీర్పును సుప్రీంకోర్టు వెలువరించింది. ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించడంతో ఖాళీ అయిన 17 అసెంబ్లీ స్థానాల్లో 15 సీట్లకు డిసెంబర్ 5వ తేదీని ఉప ఎన్నికలు జరగనున్నాయి. 18 వరకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు. ‘ఆ’ ఎమ్మెల్యేలపై కఠిన విధానం సరికాదు పార్టీ ధిక్కరణకు పాల్పడే చట్ట సభల సభ్యులపై కఠినమైన అనర్హత విధానాన్ని తీసుకురావడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. దానివల్ల న్యాయమైన భిన్నాభిప్రాయాన్ని వ్యక్తీకరించడానికి ఆటంకం కలుగుతుందని కాబట్టి అది ఆమోదయోగ్యం కాదని వ్యాఖ్యానించింది. పార్టీ విధానాన్ని ధిక్కరించే, పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడే ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించేందుకు ఒక కఠిన విధానాన్ని రూపొందించేలా ఆదేశాలు జారీ చేయలన్న కాంగ్రెస్ పార్టీ కర్ణాటక శాఖ విజ్ఞప్తిపై సుప్రీంకోర్టు పై విధంగా స్పందించింది. కర్ణాటకకు చెందిన 17 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై తీర్పు సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది. ‘ఒకవేళ అలాంటి విధానమేదైనా తీసుకురావాలన్నా.. అది శాసన వ్యవస్థ చేయాల్సిన విధి. ఆ పని కోర్టులు చేయలేవు’ అని పేర్కొంది. విశ్వాస పరీక్షకు ముందే... జూలై 23న కుమారస్వామి ప్రభుత్వం విశ్వాస పరీక్ష నేపథ్యంలో... విప్ను వ్యతిరేకించే అవకాశమున్న కాంగ్రెస్, జేడీఎస్లకు చెందిన 17 మంది ఎమ్మెల్యేలను స్పీకర్ అనర్హులుగా ప్రకటించారు. తరవాత జరిగిన విశ్వాస పరీక్షలో గెలవకపోవడంతో కుమార స్వామి రాజీనామా చేశారు. జూలై 29న∙విశ్వాస పరీక్షలో నెగ్గి, యడియూరప్ప నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. 17 మంది ఎమ్మెల్యేల అనర్హతతో అసెంబ్లీలోని ఎమ్మెల్యేల సంఖ్య 225 నుంచి 208కి తగ్గింది. మెజారిటీకి అవసరమైన మేజిక్ ఫిగర్ 105కి చేరింది. ఒక స్వతంత్ర ఎమ్మెల్యే, తమ 105 మంది ఎమ్మెల్యేల మద్దతుతో యడియూరప్ప విశ్వాస పరీక్షలో నెగ్గారు. -
తిరుగుబాటు వ్యూహం అమిత్షాదే
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వాన్ని కూల్చడంలో కీలకపాత్ర పోషించిన 17 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేల విషయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. దీనికి సంబంధించి యడియూరప్ప మాట్లాడిన ఆడియో క్లిప్పింగులు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. జేడీఎస్ అధినేత, మాజీ సీఎం కుమారస్వామి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు 17 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఈ 17 మంది విశ్వాస పరీక్షకు హాజరుకాకుండా ముంబైలోని ఓ స్టార్ హోటల్కు తరలించడం సహా అన్ని ఏర్పాట్లను బీజేపీ అధ్యక్షుడు, హోంమంత్రి అమిత్షా పర్యవేక్షించారని యడియూరప్ప చేసిన వ్యాఖ్యలు వివాదమయ్యాయి. బీజేపీ కార్యకర్తలతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఆ 17 మంది ఎమ్మెల్యేలు తమ కుటుంబాలను వదిలి రెండు మూడు నెలల పాటు ముంబైలో ఉన్నారు. వారంతా మన ప్రభుత్వ ఏర్పాటుకు సహాయం చేశారు. నన్ను నమ్మి వారంతా తమ పదవులకు రాజీనామా చేశారు. వాళ్లకు అన్యాయం చేసి సీఎం అయ్యి నేరం చేశాననే భావన నాలో కలుగుతుంది. మీకు ఈ విషయాలన్నీ తెలియవు. మనం వాళ్లకి అండగా ఉండాలి’అని యడియూరప్ప వ్యాఖ్యానించారు. సుప్రీం కోర్టును ఆశ్రయిస్తా: కుమారస్వామి యడియూరప్ప వ్యాఖ్యలతో బీజేపీ నిజస్వరూపం బయటపడిందని కుమారస్వామి ఆరోపించారు. రెబల్ ఎమ్మెల్యేల విషయంలో యడియూరప్ప తనంతట తానే వాస్తవాలను బయటపెట్టారని అన్నారు. ఈ విషయంలో వీడియో క్లిప్పింగుల ఆధారంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తానని శనివారం చెప్పారు. -
నా తొలి శత్రువు సిద్ధరామయ్య
సాక్షి, బెంగళూరు: ‘సిద్ధరామయ్యే నా తొలి శత్రువు. బీజేపీ కాదు’అని జేడీఎస్ మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి స్పష్టం చేశారు. సీఎల్పీ నాయకుడు సిద్ధరామయ్యపై మూడు రోజుల నుంచి జేడీఎస్ అధినేత హెచ్డీ దేవెగౌడ ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడానికి సిద్ధరామయ్యే కారణమని ఆరోపించారు, తాను సీఎం కావడాన్ని ఆయన ఏమాత్రం సహించలేకపోయారని మీడియాతో ఆదివారం వ్యాఖ్యానించారు. తన సన్నిహిత ఎమ్మెల్యేల ద్వారా ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతూ చివరికి వారి చేత రాజీనామాలు చేయించి, ప్రభుత్వం కూలిపోవడానికి కారకులయ్యారని మండిపడ్డారు. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం కొనసాగాలని కాంగ్రెస్ పార్టీ అధిస్టానం సూచించడంతో, ఇష్టం లేకపోయినా బలవంతంగా తనను ముఖ్యమంత్రిగా అంగీకరించారన్నారు. ఆయన ఒత్తిడి మేరకే రాష్ట్ర ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కేసులో సీబీఐ విచారణకు ప్రభుత్వం ఆదేశించిందని అన్నారు. సంకీర్ణ ప్రభుత్వంలో తాను ముఖ్యమంత్రిగా కాకుండా, క్లర్క్లాగా పనిచేశానని అన్నారు. సంకీర్ణ ప్రభుత్వంలో కాంగ్రెస్ నేతలు తనపై పెత్తనం చేసేవారని, కలెక్టర్లు సహా అందరి బదిలీలు వారు చెప్పినట్లే చేశానని తెలిపారు. సాయంత్రానికి మాట మార్పు.. ఈ వ్యాఖ్యల అనంతరం సాయంత్రానికే కుమారస్వామి మాట మార్చారు. తానెప్పుడూ సిద్ధరామయ్య తన తొలి శత్రువు అని చెప్పలేదని తెలిపారు. డిజిటల్ మీడియా విలేకరులకు కొన్ని రోజుల క్రితం ఇచ్చిన సందేశాన్ని తాజాగా కొందరు మార్చి చెబుతున్నారని అన్నారు. -
గౌడ X సిద్ధూ రగడ
సాక్షి, బెంగళూరు: మొన్నటి వరకు సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల నేతలిపుడు నిందారోపణలకు దిగుతున్నారు. కుమారస్వామి ప్రభుత్వం కూలిపోయి నెల రోజులు గడవటంతో ఇరు పార్టీల మధ్య రాజకీయ రచ్చ రాజుకుంటోంది. ప్రభుత్వం కూలిపోయింది మీ వల్లే అని జేడీఎస్ నేత, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ అంటే.. కాదు మీరు, మీ కుమారుల వల్లే కూలిపోయిందని మాజీ సీఎం సిద్దరామయ్య విమర్శలకు దిగారు. కాంగ్రెస్ వల్లే కుమారస్వామికి అష్టకష్టాలు.. సంకీర్ణ ప్రభుత్వంలో తన కుమారుడు కుమారస్వామిని కాంగ్రెస్ నాయకులు అష్టకష్టాలు పెట్టి బాధపెట్టారని దేవెగౌడ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం జేడీఎస్ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ పెట్టిన హింసలకు కుమారస్వామి నా దగ్గరకొచ్చి కన్నీళ్లు పెట్టుకునేవారు. అది చూసి నాకు భోజనం చేయడానికి కూడా మనసొప్పేది కాదు. కాంగ్రెస్ నేతలు పెట్టే బాధల్ని తట్టుకోలేక సీఎం పదవికి రాజీనామా చేస్తానని కుమార స్వామి చాలాసార్లు ప్రస్తావించారు’’ అంటూ వెల్లడించారు. పతనానికి దేవెగౌడ కారణం: సిద్దరామయ్య జేడీఎస్– కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం పతనం కావడానికి తాను కారణం కాదని సీఎల్పీ నాయకుడు సిద్దరామయ్య వ్యాఖ్యానించారు. మాజీ ప్రధాని దేవెగౌడ, ఆయన కుమారులే కారణమని, రాజకీయ దురుద్దేశంతో దేవెగౌడ తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు. గతంలో రామకృష్ణ హెగ్డే, ఎస్ఆర్ బొమ్మై, ధరంసింగ్ ప్రభుత్వాలను దేవెగౌడ కూల్చిన విషయం తనకు తెలుసన్నారు. ç జేడీఎస్తో మైత్రి వద్దన్న మాట వాస్తవమేనని, అది తన వ్యక్తిగత అభిప్రాయమని, కానీ ఆ తర్వాత కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు పూర్తిగా సహకరించి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. -
రాజకీయాల్లో ఉండాలనిపించడం లేదు
సాక్షి, బెంగళూరు: కర్ణాకట మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత హెచ్డీ కుమరస్వామి మరోసారి కన్నీటిపర్యంతమయ్యారు. మాండ్య జిల్లాలోని కేఆర్ పేట రాజకీయాల్లో తమ కుటుంబ స్వయంకృతాపరాధం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని ఆయన వాపోయారు. ఇక్కడి నుంచి జేడీఎస్ ఎమ్మెల్యేగా గెలిచి సంకీర్ణంపై తిరుగుబాటు చేసిన నారాయణ గౌడను ఉద్దేశిస్తూ కుమారస్వామి ఈ వ్యాఖ్యలు చేశారు. శనివారం మండ్య జిల్లాలోని కేఆర్పేటకు వచ్చిన ఆయన కార్యకర్తల సమావేశంలోను, మీడియాతో మాట్లాడారు. కేఆర్ పేటలో అసెంబ్లీ ఎన్నికల్లో తాము కృష్ణకు కాకుండా నారాయణగౌడను నమ్మి టికెట్ ఇచ్చి గెలిపించినందుకు తమకు తగిన శాస్తి జరిగిందని అన్నారు. నారాయణగౌడ గెలుపు కోసం గ్రామ గ్రామానికి తిరిగి పని చేçసి ఆయనను గెలిపిస్తే తన కుటుంబంపైనే ఆరోపణలు చేశాడని అన్నారు. అతడు క్రిమినల్ అని మండపడ్డ కుమరస్వామి, ఇదంతా మా కుటుంబం చేసుకున్న స్వయంకృతాపరాధమని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన కన్నీళ్లు తుడుచుకున్నారు. రాజకీయాల్లో ఉండాలనిపించడం లేదు తాను మనసులో ఏముంటే దానిని మాట్లాడతానన్న కుమారస్వామి...తనకు ముఖ్యమంత్రి పదవి ముఖ్యం కాదని, రాష్ట్రంలో ఉన్న ప్రజల హృదయాల్లో ఉండిపోవాలని అనుకున్నానని అన్నారు. పదవి పోయినా బాధ పడకుండా సంతోషంగా వదిలివచ్చానని అన్నారు. దేశం కోసం తమ కుటుంబం ఎంతో చేసిందని, కానీ సోషల్ మీడియాలో నిఖిల్ ఎల్లిదియప్పా అని ప్రచారం జరగడం బాధగా ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కుల రాజకీయాలు జరుగుతున్నాయని, రాజకీయాల్లో మంచికి కాలం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామాలతో తనకు రాజకీయాల్లో కొనసాగాలని అనిపించడం లేదని కుమారస్వామి వ్యాఖ్యానించారు. -
దేవెగౌడ ఇంటికెళ్తే టీ కూడా ఇవ్వలేదు
సాక్షి, బెంగళూరు: తాను పదవి..డబ్బులు కోసం రాజీనామా చేయలేదని నియోజక వర్గం అభివద్ధి కోసం రాజీనామా చేసిన్నట్లు కేఆర్ పేట జేడీఎస్ అనర్హత ఎమ్మెల్యే నారాయణగౌడ తెలిపారు. ఆయన శనివారం బెంగళూరులో విలేకర్లతో మాట్లాడారు. ‘మాజీ ప్రధాని దేవేగౌడ ఇంట్లో ఒక సిండికేట్ ఉంది. ఈ సిండికేట్ను ఆయన పెంచి పెద్ద చేశారు. ఒక ఎమ్మెల్యేగా అయన ఇంటికి వెళ్తే టీ కూడా ఇవ్వలేదు. చెప్పుడు మాటలను విని నన్ను వేధించారు’ అని ఆరోపించారు. ఉప ఎన్నికలు వచ్చేలా ఉన్నాయి మండ్య: రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడిన నేపథ్యంలో మూడు పార్టీల్లో ఉపఎన్నికల హడావిడి మొదలైందని, అయితే జేడీఎస్లో ఈ పరిస్థితి కొంచెం ఎక్కువగా ఉందని మాజీ మంత్రి చెలువనారాయణస్వామి తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ జేడీఎస్ అధినేతలు దేవేగౌడ,కుమారస్వామి కేఆర్ పేటె నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితులపై అధ్యయనం చేస్తున్నారని మిగిలిన పార్టీల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొందన్నారు. ఈ పరిణామాలన్నింటిని గమనిస్తుంటే ఉపఎన్నికల ప్రచారాలు మొదలైన ట్లు కనిపిస్తోందన్నారు. 17 మంది ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి సు ప్రీంకోర్టు వచ్చే వారంలో తీర్పు వెల్లడించే అవకాశం ఉందని, కోర్టు తీర్పు ఎ లా వచ్చినా ఉపఎన్నికలు జరిగేలాగానే కనిపిస్తున్నాయన్నారు. ఉపఎన్నికల్లో కాంగ్రెస్–జేడీఎస్ మైత్రి కొనసాగితే తమకేమి అభ్యంతరాలు లేవన్నారు. -
కర్ణాటక నూతన స్పీకర్గా విశ్వేశ్వర హెగ్డే
సాక్షి, బెంగళూరు: కర్ణాటక నూతన ప్రభుత్వంలో విధానసభ స్పీకర్గా బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి విశ్వేశ్వర హెగ్డే కాగేరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ స్థానానికి బుధవారం జరగనున్న ఎన్నికలకు మంగళవారం మధ్యాహ్నం 12 గంటల వరకు నామినేషన్లకు గడువు ఉండగా కాగేరి ఒక్కరే నామినేషన్ సమర్పించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్, జేడీఎస్ల నుంచి ఒక్కరూ కూడా నామినేషన్ వేయలేదు. దీంతో విశ్వేశ్వర హెగ్డే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విశ్వాస పరీక్షలో యడియూరప్ప ప్రభుత్వం విజయం సాధించడంతో కేఆర్ రమేష్ కుమార్ స్పీకర్ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన స్థానంలో విశ్వేశ్వర్ను నూతన సభాపతిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సీఎంతో సహా బీజేపీ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. అంకోలా నుంచి రాజకీయ ప్రస్థానం 1961 జులై 10న జన్మించిన కాగేరి, న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1994 నుంచి ఉత్తర కన్నడ జిల్లా అంకోలా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాగేరి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. పునర్విభజన కారణంతో 2008లో సిర్సి–సిద్ధాపుర నియోజకవర్గం నుంచి తొలిసారిగా, ఆ తరువాత 2013, 2018లో అక్కడి నుంచే ఎన్నికయ్యారు. 2008లో యడియూరప్ప మంత్రిమండలిలో ప్రాథమికోన్నత విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఆర్ఎస్ఎస్ నేపథ్యం నుంచి వచ్చిన కాగేరి 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే గతంలో స్పీకర్గా పనిచేసిన కే.జీ.బోపయ్యను సోమవారం వరకు అనుకున్నారు. అయితే హఠాత్తుగా మంగళవారం ఉదయం బోపయ్యకు బదులుగా కాగేరిని ఎంపిక చేశారు. పార్టీ అధినేత అమిత్ షా సూచనల ప్రకారమే ఈ మార్పు జరిగిందని బీజేపీ వర్గాలు తెలిపాయి. -
విశ్వాసపరీక్షలో ‘యెడ్డీ’ విజయం
సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో గత నెల రోజులుగా కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితికి తెరపడింది. విధానసౌధలో సోమవారం జరిగిన విశ్వాసపరీక్షలో ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప విజయం సాధించారు. అసెంబ్లీ ఉదయం 10 గంటలకు ప్రారంభం కాగానే సీఎం యడియూరప్ప ‘నా నేతృత్వంలోని మంత్రివర్గంపై ఈ సభ విశ్వాసం ఉంచుతోంది’ అనే ఏకవాక్య తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. ఆయన మాట్లాడుతూ..‘నేను ప్రతీకార రాజకీయాల జోలికిపోను. కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వ హయాంలో పాలనా యంత్రాంగం నిర్వీర్యమైంది. దీన్ని చక్కదిద్దడమే మా తొలి ప్రాధాన్యత’ అని తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష కాంగ్రెస్–జేడీఎస్ సభ్యులు డివిజన్ కోరకపోవడంతో విశ్వాసతీర్మానం మూజువాణి ఓటుతో ఆమోదం పొందిందని స్పీకర్ రమేశ్ కుమార్ ప్రకటించారు. స్పీకర్ రమేశ్ కుమార్ ఆదివారం కాంగ్రెస్–జేడీఎస్లకు చెందిన 17 మంది ఎమ్మెల్యేలపై అనర్హతవేటు వేసిన విషయం తెలిసిందే. ఇది అనైతిక ప్రభుత్వం.. విశ్వాసతీర్మానంపై చర్చ సందర్భంగా సీఎల్పీ నేత సిద్దరామయ్య ముఖ్యమంత్రి యడియూరప్పపై నిప్పులు చెరిగారు. ‘యడియూరప్ప నేతృత్వంలో రాజ్యాంగానికి వ్యతిరేకంగా, అనైతిక పద్ధతుల్లో ప్రభుత్వం ఏర్పడింది. ఆయనకు ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ లేదు. కేవలం 105 మంది ఎమ్మెల్యేలతో మీరు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ముఖ్యమంత్రిగా పదవీకాలాన్ని పూర్తిచేసుకోవాలని నేను కోరుకుంటున్నా. కానీ మీరెంతకాలం ముఖ్యమంత్రిగా ఉంటారో చూద్దాం!’ అని సిద్దరామయ్య వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మాజీ సీఎం హెచ్.డి.కుమారస్వామి మాట్లాడుతూ..‘మీరు(బీజేపీ) కుట్రలు పన్ని అధికారంలోకి వచ్చారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు చేసిన పనులు, ఈ రాజకీయాలు చరిత్రలో నిలిచిపోతాయి’ అని వ్యంగ్యంగా అన్నారు. విశ్వాసఘట్టం ముగిసిన నేపథ్యంలో మంత్రివర్గ ఏర్పాటుపై దృష్టిసారిస్తామని బీజేపీ నేత సురేశ్ కుమార్ తెలిపారు. స్పీకర్ రాజీనామా.. అసెంబ్లీలో విశ్వాసతీర్మానం ఆమోదం పొందినవెంటనే తాను స్పీకర్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు రమేశ్ కుమార్ ప్రకటించారు.‘రాజ్యాంగాన్ని అనుసరించి మనస్సాక్షి ప్రకారం విధుల్ని నిర్వర్తించాను. స్పీకర్ కుర్చీ గౌరవాన్ని కాపాడేందుకు శాయశక్తులా కృషిచేశాను. ప్రజలు మీకు(యడియూరప్ప) రెండో అవకాశం ఇచ్చారు. రాష్ట్రంలో సుపరిపానలతో మీదైన ముద్ర వేయండి’ అని తెలిపారు. అనంతరం తన రాజీనామా లేఖను డిప్యూటీ స్పీకర్ కృష్ణారెడ్డికి అందించి సభనుంచి నిష్క్రమించారు. అంతకుముందు ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర ఖర్చులకు ఉద్దేశించిన ఆర్థికబిల్లును అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. -
కర్ణాటక స్పీకర్ రాజీనామా
సాక్షి, బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ కే.ఆర్.రమేశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. గతకొంత కాలంగా రాష్ట్రంలో సాగుతోన్న రాజకీయ సంక్షోభానికి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన స్పీకర్ సోమవారం తన పదవి నుంచి తప్పుకున్నారు. అసెంబ్లీలో యుడియూరప్ప విశ్వాస పరీక్షలో విజయం సాధించిన విషయం తెలిసిందే. అనంతరం సభలో ప్రవేశపెట్టిన ఆర్థిక బిల్లుకు ఆమోదం లభించిన వెంటనే ఆయన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సభలోనే ఆయన రాజీనామా లేఖను సభ్యులందరికీ చదవి వినిపించారు. కాగా స్పీకర్ రాజీనామాకు ఒక్కరోజు ముందు (ఆదివారం) 14 మంది సభ్యులపై అనర్హత వేటు వేస్తూ.. సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసి.. సభా నియమాలను ఉల్లంఘించినందుకు వారిపై వేటు వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. కాగా కర్ణాటక ముఖ్యమంత్రిగా బీఎస్ యడియూరప్ప ప్రమాణస్వీకారం చేసి అనంతరం.. స్పీకర్ను దింపేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ స్పీకర్ కే.ఆర్.రమేశ్ కుమార్ వెంటనే బాధ్యతల నుంచి తప్పుకోవాలని సందేశాన్ని పంపింది. స్వచ్ఛందంగా తప్పుకోకుంటే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి బలవంతంగా సాగనంపాల్సి ఉంటుందని కూడా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సోమవారం సభలో జరిగిన విశ్వాస పరీక్షలో యడియూరప్ప సర్కార్ విజయం సాధించడంతో ఆయన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆయన స్థానంలో బీజేపీ నూతన స్పీకర్ను ఎన్నుకోనుంది. -
విశ్వాస పరీక్షలో నెగ్గిన యడ్డీ సర్కార్
సాక్షి, బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప విశ్వాస పరీక్షలో నెగ్గారు. సోమవారం జరిగిన బలపరీక్షలో ప్రభుత్వానికి మద్దతుగా 106 మంది సభ్యులు ఓటేశారు. దీంతో మ్యాజిక్ ఫిగర్ను యడ్డీ సునాయాసంగా ఛేదించగలిగారు. సభకు కాంగ్రెస్-బీజేఎస్ సభ్యులు కూడా హాజరయ్యారు. వీరంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసినప్పటికీ.. విశ్వాస పరీక్షలో సర్కార్ విజయం సాధించింది. బీజేపీకి ఉన్న 105 మందితో పాటు ఓ స్వతంత్ర ఎమ్మెల్యేతో కలుసుకుని బలం 106కి చేరింది. దీంతో మ్యాజిక్ ఫిగర్ 104 కంటే రెండు ఓట్లను ఎక్కువగా సాధించి బలపరీక్షలో గెలుపొందింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా 99 మంది సభ్యులు ఓటు వేశారు. మూజువాణి పద్దతిలో స్పీకర్ రమేష్ కుమార్ ఓటింగ్ను చేపట్టారు. ప్రభుత్వానికి స్పష్టమైన మెజార్టీ ఉండడంతో విశ్వాస పరీక్షలో ప్రభుత్వం విజయం సాధించిందని స్పీకర్ ప్రకటించారు. అనంతరం సీఎం యడియూరప్ప సభలో సంతోషం వ్యక్తం చేశారు. ఇది ప్రజల విజయమన్నారు. విశ్వాస పరీక్షకు ముందు సభలో యడియూరప్ప మాట్లాడుతూ.. బల నిరూపణలో తమ ప్రభుత్వం విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ స్ఫూర్తితో పాలనలో ముందుకు వెళ్తామని ఆయన అన్నారు. రైతులకు పెద్దపీఠ వేస్తామని స్పష్టం చేశారు. ప్రజల, ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటామని సీఎం పేర్కొన్నారు. చర్చలో భాగంగా కాంగ్రెస్ నేత సిద్దరామయ్య మాట్లాడుతూ.. యడియూరప్ప వ్యాఖ్యలను తాము పూర్తిగా స్వాగతిస్తున్నామని అన్నారు. ప్రజల విశ్వాసాలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని నడపాలని సూచించారు. రైతుల సమస్యల పరిష్కారానికి గత ప్రభుత్వాలు ఎంతో చేశాయని ఆయన గుర్తుచేశారు. కాగా బలపరీక్షలో ప్రభుత్వం విజయం సాధించడంతో.. గత కొంత కాలంగా సాగుతోన్న రాజకీయ సంక్షోభానికి తెరపడినట్టయింది. కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలడానికి కారణమయిన 17 మంది సభ్యులపై స్పీకర్ అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. స్పీకర్ చర్యతో సభలో మ్యాజిక్ ఫిగర్ 104కి పడిపోయింది. దీంతో విశ్వాస పరీక్షలో యడియూరప్ప సునాయాసంగా విజయం సాధించారు. -
జాతకం తారుమారు అయ్యిందా?
సంచలనాలన్నీ తిరుగుబాటు ఎమ్మెల్యేల చుట్టూనే పరిభ్రమిస్తున్నాయి. వారి రాజీనామాలతో కుమార సర్కారు కూలిపోగా, ఇప్పుడు వారివంతు వచ్చింది. మూకుమ్మడిగా అనర్హత వేటు పడడంతో రెబెల్స్ సందిగ్ధంలో పడిపోయారు. యడియూరప్ప ప్రభుత్వంలో మంత్రుల పదవులు ఊరిస్తూ ఉండగా ఇలా జరిగిందేమిటని కంగుతిన్నారు. సాక్షి, బెంగళూరు: అసంతృప్త ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడడంతో బీజేపీ ప్రభుత్వ మంత్రివర్గ కూర్పు మారిపోయే అవకాశాలున్నాయి. బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించిన రెబెల్స్కు కేబినెట్లో చోటు కల్పించాల్సిన తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పుడు వారిపై అనర్హత వేటు వేయడంతో పదవులు దక్కడం అనుమానమే. ఈ పరిణామం అధికార బీజేపీ ఎమ్మెల్యేల్లో సంతోషాన్ని నింపింది. తమ పదవులకు ఢోకా లేదని సీనియర్లు ఊహల్లో విహరిస్తున్నారు. ఒకవేళ రాజీనామాలను స్పీకర్ ఆమోదిస్తే వారికే బీజేపీ టికెట్ ఇచ్చి ఉప ఎన్నికలు జరపాల్సి ఉండేది. గెలిచిన అభ్యర్థులకు బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగిరి ఇవ్వాల్సి ఉంది. చదవండి: కర్ణాటక స్పీకర్ సంచలన నిర్ణయం పదవుల సంగతేమిటి? అనూహ్యంగా అందరిమీదా అనర్హత వేటు పడడంతో అసంతృప్త ఎమ్మెల్యేలు ఆందోళనకు గురవుతున్నారు. అనర్హత గురయిన ఎమ్మెల్యేలంతా సుప్రీంకోర్టుకు వెళ్లనున్నారు. సుప్రీంలో తమకు అనుకూలంగా తీర్పు వస్తే మంత్రి పదవులను డిమాండ్ చేసేందుకు ఆస్కారముంది. వ్యతిరేకంగా వస్తే మంత్రి పదవిపై ఆశలు వదులుకోవాల్సిందే. కానీ ప్రభుత్వంలోని బోర్డులు, నామినేషన్ల అధ్యక్షులు, డైరెక్టర్ల పదవులను చేపట్టడానికి ఏ అడ్డంకీ లేనందున ఆ పదవులనే రెబెల్స్ డిమాండ్ చేయవచ్చు. ఆది నుంచీ ఆవేశాలు అనర్హతకు గురయిన రెబెల్ ఎమ్మెల్యేల భవిష్యత్తు ప్రస్తుతం అగమ్యగోచరంగా మారింది. దురాశకు వెళ్లి ఉన్న పదవులు పోగొట్టుకున్నారనే విమర్శలు రెబెల్ ఎమ్మెల్యేలపై వస్తున్నాయి. స్పీకర్ అనర్హత వేటు వేయడంతో వీరు 2023 వరకు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయడానికి వీలు లేకుండా పోయింది. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అప్పటి సీఎం కుమారస్వామితో పొసగడం లేదు. 14 నెలల పాలన కాలం లో విమర్శలు గుప్పిస్తూ కాం గ్రెస్, జేడీఎస్ నేతలకు మింగు డు పడకుండా తయారయ్యా రు. పదవులు దక్కలేదన్న ఆగ్రహంతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేయాలని ప్రయత్నాలు చేస్తూనే వచ్చారు. రాజీనామాలతో మొత్తం సంకీర్ణం చాపకిందకు నీళ్లు వచ్చాయి. ఇప్పుడు రెబెల్స్ భవిత ఏమిటనేది చర్చనీయాంశమైంది. అనర్హతకు గురైన ఎమ్మెల్యేలు ఎ.శివరామ్ హెబ్బార్ ( యల్లాపుర), శ్రీమంత్ పాటిల్ (కాగవాడ); బైరతి బసవరాజు (కృష్ణరాజపురం); మునిరత్న ( రాజరాజేశ్వరి నగర); ఆర్.రోషన్ బేగ్ (శివాజీనగర); ప్రతాప్ గౌడ పాటిల్ (మస్కి); కేసీ నారాయణ గౌడ (కేఆర్ పేట); కె.గోపాలయ్య(మహాలక్ష్మి లేఔట్); ఎంటీబీ నాగరాజు (హోసకోటె); కె.సుధాకర్ (చిక్కబళ్లాపుర); హెచ్. విశ్వనాథ్(హుణసూరు); బీసీ పాటిల్ (హీరేకరూర్); ఆనంద్ సింగ్ (హొసపేట); ఎస్టీ సోమశేఖర్ (యశ్వంతపుర). -
14 మంది రెబెల్స్పై కొరడా
సాక్షి, బెంగళూరు/పుణే : కర్ణాటకలో రెబెల్ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ రమేశ్ కుమార్ ఆదివారం షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 11 మంది, జేడీఎస్కు చెందిన ముగ్గురు రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. వీరంతా కర్ణాటక అసెంబ్లీ కాలపరిమితి ముగిసేవరకూ(2023) ఎన్నికల్లో పోటీకి అనర్హులని స్పష్టం చేశారు. తాజా నిర్ణయంతో అనర్హత వేటుపడ్డ ఎమ్మెల్యేల సంఖ్య 17కు చేరుకుంది. ఈ నెల 25న ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను స్పీకర్ అనర్హులుగా ప్రకటించారు. రమేశ్ కుమార్ నిర్ణయంతో యడియూరప్ప ప్రభుత్వం సోమవారం విశ్వాసపరీక్షను సులభంగా గట్టెక్కేందుకు అవకాశమేర్పడింది. కాగా, స్పీకర్ నిర్ణయాన్ని కాంగ్రెస్, జేడీఎస్ స్వాగతించగా, ఓ పార్టీ నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగానే రమేశ్ రెబెల్స్పై వేటేశారని బీజేపీ విమర్శించింది. నోటీసులిచ్చినా స్పందించలేదు.. చట్టాన్ని అనుసరించి, మనస్సాక్షి ఆధారంగా తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హతవేటు వేసినట్లు స్పీకర్ రమేశ్ కుమార్ తెలిపారు. ఆదివారం బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ..‘ప్రస్తుత రాజకీయ సంక్షోభం నన్ను తీవ్రమైన డిప్రెషన్లోకి నెట్టేసింది. ఇది నా రాజకీయ జీవితంలో చివరిదశ కావొచ్చు. ఎమ్మెల్యేల అనర్హత విషయంలో నాపై వచ్చిన విమర్శలు నూటికి నూరుశాతం బాధించాయి. రెబెల్ ఎమ్మెల్యేలు విప్ ఉల్లంఘించినట్లు కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు ఫిర్యాదు చేశాయి. దీంతో మూడు రోజుల్లోగా నా ముందు హాజరై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీచేశాను. వారు స్పందించకపోవడంతో ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఎమ్మెల్యేలు ప్రతాప్గౌడ పాటిల్, బీసీ పాటిల్, శివరామ్ హెబ్బర్, ఎస్టీ సోమశేఖర్, జేడీఎస్ ఎమ్మెల్యేలు గోపీనాథ్, ఎ.హెచ్.విశ్వనాథ్, నారాయణ గౌడ, తదితరుల్ని అనర్హులుగా ప్రకటించాను’ అని చెప్పారు. ఏకైక బీఎస్పీ ఎమ్మెల్యే ఎన్.మహేశ్పై అనర్హత వేటేయాలని బీఎస్పీ కోరిందనీ, దీనిపైనా నిర్ణయం తీసుకుంటానన్నారు. తనపై బీజేపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతుందన్న వార్తలపై స్పందిస్తూ..‘నేనే సభాపతిగా ఉంటా. వాళ్లను(బీజేపీ) రానివ్వండి. నేను రాజీనామా చేయను. నా విధులను బాధ్యతతో నిర్వర్తిస్తాను’ అని తెలిపారు. విశ్వాసపరీక్షతో పాటు ఆర్థికబిల్లుకు ఆమోదం నేపథ్యంలో సోమవారం 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి మరణంపై స్పీకర్ రమేశ్ భావోద్వేగానికి లోనయ్యారు. ‘జైపాల్ రెడ్డి నాకు పెద్దన్నలాంటివారు. నాకు మార్గదర్శి. మాది 40 ఏళ్ల అనుబంధం ’ అని చెప్పారు. ‘సుప్రీం’లో సవాల్ చేస్తాం: రెబెల్స్ స్పీకర్ రమేశ్ కుమార్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సోమవారం సవాలు చేస్తామని రెబెల్ ఎమ్మెల్యేలు ప్రకటించారు. అనర్హత విషయంలో స్పీకర్ చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించారని జేడీఎస్ రెబెల్ ఎమ్మెల్యే ఎ.హెచ్.విశ్వనాథ్ ఆరోపించారు. ఓ వీడియోను విడుదలచేసిన తిరుగుబాటు ఎమ్మెల్యే ప్రతాప్గౌడ పాటిల్..అనర్హత వేటుపై సుప్రీంకోర్టుకు వెళతామనీ, న్యాయపోరాటంలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అన్ని తెలుసుకునే పదవులకు రాజీనామా చేశామనీ, ఈ విషయాన్ని చట్టపరంగా ఎదుర్కొంటామని తెలిపారు. స్పీకర్ పక్షపాతంతో వ్యవహరించారని ఎమ్మెల్యే శివరామ్ హెబ్బర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో బలాబలాలు కర్ణాటక అసెంబ్లీలో 224 మంది సభ్యులు(స్పీకర్ కాకుండా) ఉన్నారు. స్పీకర్ 17 మందిపై అనర్హతవేటు వేయడంతో అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య 207కు చేరుకుంది. అదే సమయంలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన ఎమ్మెల్యేల సంఖ్య 104కు తగ్గింది. ప్రస్తుతం బీజేపీకి 105 మంది బలం ఉండగా, ఓ స్వతంత్ర ఎమ్మెల్యే కూడా మద్దతు ఇస్తున్నారు. ఇక కాంగ్రెస్–జేడీఎస్ కూటమికి 100 మంది(నామినేటెడ్తో కలిపి) ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ నేపథ్యంలో సోమవారం జరిగే బలపరీక్షలో బీజేపీ విజయం సాధించడం నల్లేరుపై నడకేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సోమవారం బలపరీక్ష నేపథ్యంలో అసెంబ్లీకి తప్పనిసరిగా హాజరుకావాలని తమ ఎమ్మెల్యేలకు బీజేపీ విప్ జారీ చేసింది. ఇక మిషన్ మధ్యప్రదేశ్! జైపూర్: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మధ్యప్రదేశ్ బీజేపీ నేత కైలాశ్ విజయవర్గీయ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయిన నేపథ్యంలో బీజేపీ మధ్యప్రదేశ్పై దృష్టిసారించబోతోందన్న వార్తలపై ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యడియూరప్ప కేబినెట్ ఏర్పాటయ్యాక కొత్త మిషన్ ప్రారంభిస్తామని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ‘ప్రభుత్వాలు కూల్చాలన్నది మా ఉద్దేశం కాదు. కానీ మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య అనేక విభేదాలు నెలకొన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై సొంత ఎమ్మెల్యేలకే నమ్మకం లేదు. కాంగ్రెస్తో పోల్చుకుంటే ప్రధాని మోదీ నాయకత్వం మంచిదని వారంతా భావిస్తున్నారు. అంతర్గత కలహాలు, కుమ్ములాటలతోనే కాంగ్రెస్ ప్రభుత్వాలు కూలిపోతున్నాయి’ అని విజయవర్గీయ అన్నారు. 100% విజయం: యడియూరప్ప సోమవారం జరిగే విశ్వాసపరీక్షలో విజయం సాధిస్తామని ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప విశ్వాసం వ్యక్తం చేశారు. ‘సోమవారం అసెంబ్లీలో మెజారిటీని 100 శాతం నిరూపించుకుంటా. ఆర్థిక బిల్లును ఆమోదించకుంటే ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేం. కాబట్టి అసెంబ్లీ ప్రారంభంకాగానే విశ్వాసపరీక్షను ముగించి, ఆర్థిక బిల్లుకు ఆమోదం తెలుపుతాం. కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వం తయారుచేసిన ఆర్థిక బిల్లునే సభలో ప్రవేశపెట్టబోతున్నాం. ఇందులో చిన్న కామా, ఫుల్స్టాప్ను కూడా మార్చలేదు’ అని అన్నారు. -
కర్ణాటక రాజకీయాల్లో మరో ట్విస్ట్
సాక్షి, బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేశ్ కుమార్ ఆదివారం అనూహ్య నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కుమారస్వామి ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన 14 మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. వీరిలో 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు జేడీ(ఎస్)కు చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రెబల్ ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నారు. అనర్హత వేటు వేయడం చట్టవిరద్దమని, రేపు సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని జేడీ(ఎస్) రెబల్ ఎమ్మెల్యే విశ్వనాథ్ తెలిపారు. తమపై అనర్హత వేటు వేయడాన్ని చట్ట విరుద్ధంగా భావిస్తున్నానని, అందుకే ఈ విషయమై తాను సుప్రీంను ఆశ్రయిచంనున్నట్లు స్పష్టం చేశారు. స్పీకర్ నిర్ణయం చట్టవిరుద్ధంగా ఉందని, సుప్రీంకోర్టులోనే తమకు న్యాయం జరుగుతుందని మరో రెబల్ ఎమ్మెల్యే ప్రతాప్ గౌడ ఓ వీడియో విడుదల చేశారు. (చదవండి : కర్ణాటక స్పీకర్ సంచలన నిర్ణయం) కాగా స్పీకర్ తాజా నిర్ణయంతో వేటు పడిన మొత్తం సభ్యుల సంఖ్య 17కి చేరింది(ఇదివరకే ముగ్గురు ఎమ్మెల్యేలపై వేటు వేశారు). మరోవైపు సోమవారం అసెంబ్లీలో బలనిరూపణ ఉంటుందని, సభ్యులంతా దీనికి హాజరుకావాలంటూ స్పీకర్ ఆదేశాలు జారీచేశారు. శుక్రవారం రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన యడియూరప్ప.. సోమవారం అసెంబ్లీలో బలనిరూపణ చేయాల్సి ఉన్న విషయం తెలిసిందే. 17 మంది ఎమ్మెల్యేలపై వేటు పడటంతో కర్ణాటక అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 207కు పడిపోయింది. బల నిరూపణకు కావల్సిన బలం 105. భాజపాకి 105మంది సొంత పార్టీ సభ్యులతో పాటు ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు ఉంది. దీంతో రేపు బల పరీక్షలో సీఎం యడియూరప్ప నెగ్గేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. -
కర్ణాటక స్పీకర్ సంచలన నిర్ణయం
సాక్షి, బెంగళూరు: గత కొంతకాలంగా ఉత్కంఠ రాజకీయాలకు వేదికయిన కర్ణాటకలో అసెంబ్లీ స్పీకర్ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. కుమారస్వామి ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన మొత్తం 14 మంది రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ రమేష్ కుమార్ అనర్హత వేటు వేస్తూ.. సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇదివరకే ముగ్గురు ఎమ్మెల్యేలపై వేటు వేసిన స్పీకర్.. తాజాగా 13 మంది కాంగ్రెస్, ఓ స్వతంత్ర సభ్యుడిపై అనర్హత వేటు వేశారు. దీంతో వేటు పడిన మొత్తం సభ్యుల సంఖ్య 17కి చేరింది. స్పీకర్ తాజా నిర్ణయం తక్షణమే అమల్లోకి రానుంది.. దీంతో వారంత నాలుగేళ్లపాటు ఎన్నికల్లో పోటీకి దూరం కానున్నారు. మరోవైపు సోమవారం అసెంబ్లీలో బలనిరూపణ ఉంటుందని, సభ్యులంతా దీనికి హాజరుకావాలంటూ స్పీకర్ ఆదేశాలు జారీచేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడినా తాను మాత్రం స్పీకర్ పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. శుక్రవారం రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన యడియూరప్ప.. సోమవారం అసెంబ్లీలో బలనిరూపణ చేయాల్సి ఉన్న విషయం తెలిసిందే. 17 మంది సభ్యులపై అనర్హత వేట పడడంతో.. సభలో మొత్తం సభ్యుల సంఖ్య 208కి పడిపోయింది. దీంతో మేజిక్ ఫిగర్ 104కి చేరింది. బీజేపీకి ప్రస్తుతం 105 మంది సభ్యులు ఉండగా.. ఓ స్వతంత్ర ఎమ్మెల్యే మద్దతు ప్రకటించారు. దీంతో విశ్వాస పరీక్షలో బీజేపీ సునాయాసంగా నెగ్గే అవకాశం ఉంది. అనర్హత వేటుకు గురయిన ఎమ్మెల్యేలు వీరే.. కాంగ్రెస్ బస్వరాజు మునిరత్నం సోమశేఖర్ రోషన్బేగ్ ఆనంద్సింగ్ నాగరాజు బీసీ పాటిల్ ప్రతాప్ గౌడ్ సుధాకర్ శివరాం హెబ్బర్ మంత్ పాటిల్ రమేష్ జార్జ్హోళి మహేష్ జేడీఎస్ గోపాలయ్య నారాయణ గౌడ్ విశ్వనాథ్ శంకర్(స్వతంత్ర) -
మర్యాదగా తప్పుకోకుంటే అవిశ్వాసమే!
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా బీఎస్ యడియూరప్ప ప్రమాణస్వీకారం చేసి 24 గంటలు కూడా కాకముందే బీజేపీ జోరుపెంచింది. కాంగ్రెస్ నేత, కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ కె.ఆర్.రమేశ్ కుమార్ వెంటనే బాధ్యతల నుంచి తప్పుకోవాలని సందేశాన్ని పంపింది. స్వచ్ఛందంగా తప్పుకోకుంటే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి బలవంతంగా సాగనంపాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ మేరకు బీజేపీ తరఫు ప్రతినిధి ఒకరు ఈ విషయాన్ని నేరుగా స్పీకర్కు చేరవేసినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఈ విషయమై బీజేపీ సీనియర్ నేత ఒకరు మాట్లాడుతూ.. ‘రమేశ్ కుమార్ స్వచ్ఛందంగా తప్పుకోకుంటే ఆయనపై అవిశ్వాసం పెట్టక తప్పదు. అయితే మా తొలిప్రాధాన్యం సోమవారం అసెంబ్లీలో బలపరీక్ష నెగ్గడం, ఆర్థిక బిల్లుకు ఆమోదం తెలపడమే. ఇది పూర్తయ్యాక స్పీకర్ విషయమై నిర్ణయం తీసుకుంటాం’ అని చెప్పారు. కాంగ్రెస్–జేడీఎస్ కూటమికి లబ్ధి చేకూర్చేలా స్పీకర్ వ్యవహరించవచ్చన్న అనుమానంతోనే బీజేపీ దూకుడు పెంచినట్లు తెలుస్తోంది. మరోవైపు యడియూరప్ప ప్రభుత్వానికి తాము మద్దతిచ్చే ప్రసక్తే లేదని జేడీఎస్ చీఫ్ దేవెగౌడ చెప్పారు. అనర్హతపై రెబెల్స్ న్యాయపోరాటం.. స్పీకర్ అనర్హతవేటు వేసిన నేపథ్యంలో ముగ్గురు కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేలు న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. స్పీకర్ నిర్ణయంపై సుప్రీంకోర్టుతో పాటు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాలని ఎమ్మెల్యేలు రమే శ్ జార్కిహోళి, మహేశ్ కుమటహళ్లి, శంకర్లు నిర్ణయించారు. సుప్రీంలో రమేశ్, మహేశ్ల పిటిషన్లు ఇప్పటికే పెండింగ్లో ఉన్నందున స్పీకర్ కనీసం నోటీసు ఇవ్వకుండా, తమ వివరణ తీసుకోకుండా అనర్హులను చేయడంపై వీరిద్దరూ అఫిడవిట్లు దాఖలు చేస్తారని సమాచారం. స్వతంత్ర ఎమ్మెల్యే ఆర్.శంకర్ను కాంగ్రెస్ సభ్యుడిగా పరిగణిస్తూ స్పీకర్ అనర్హతవేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శంకర్ సోమవారం హైకోర్టును ఆశ్రయిస్తారని తెలుస్తోంది. తాను స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలుపొందినందున ఫిరాయింపుల చట్టం కింద వేటువేయడం కుదరదని శంకర్ చెబుతున్నారు. తమిళనాడులో 18 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడినప్పటికీ, 6 నెలల్లోపు జరిగిన ఉపఎన్నికల్లో పోటీచేసేందుకు సుప్రీంకోర్టు, ఈసీ అనుమతించిన విషయా న్ని గుర్తుచేస్తున్నారు. కాబట్టి అసెంబ్లీ ముగిసేవరకూ (2023) అనర్హత వేటేస్తూ స్పీకర్ ఇచ్చిన ఉత్తర్వులు కోర్టులో నిలబడవని స్పష్టం చేస్తున్నారు. -
బీజేపీకి కుమారస్వామి మద్దతు!
సాక్షి, బెంగళూరు: రాజకీయ సంక్షోభంలో ఉన్న కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ.. తదుపరి బలపరీక్షపై వ్యూహాలు రచిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో యడియూరప్ప చాలా జాగ్రత్తగా ముందుకెళ్లాల్సి ఉంది. ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హతతో కర్ణాటక అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 221 (స్పీకర్ను మినహాయించి)కి చేరుకుంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 112 అయింది. బీజేపీకి ప్రస్తుతం 106 మంది సభ్యుల (బీజేపీ 105, ఓ స్వతంత్ర ఎమ్మె ల్యే) బలముంది. ఈ నేపథ్యంలో మిగిలిన ఆరుగురిని బీజేపీ ఎలా సంపాదిస్తుందన్నది ఇప్పు డు ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో జేడీఎస్ సభ్యుల మద్దతును కోరతారా అనేది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు శుక్రవారం రాత్రి జేడీఎస్ ఎమ్మెల్యేలు ఓ హోటల్లో సమావేశం నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ముఖ్యంగా రెండు ప్రతిపాదనలు ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం మాజీ మంత్రి జీవీ దేవెగౌడ ఈ వివరాలను వెల్లడించారు. బీజేపీ ప్రభుత్వానికి మద్దతునిచ్చి ప్రభుత్వంలో భాగస్వామి కావడమా? లేక ప్రజల్లో ఉంటూ యడియూరప్పపై పోరాటం చేయడమా? అనే అంశాలపై చర్చ జరిగినట్లు తెలిపారు. అయితే ఈ భేటీలో పలువురు ఎమ్మెల్యేలు బీజేపీకి బయటినుంచి మద్దతు ఇచ్చేందుకు సుముకంగా ఉన్నారని వెల్లడించారు. తనతో పాటు మరో ఐదుగురు ఎమ్మెల్యే మద్దతుకు సిద్ధంగా ఉన్నామని.. దీనిపై కుమారస్వామి తుది నిర్ణయం తీసుకోవల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో కుమారస్వామి నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్తో జేడీఎస్ చెలిమిని కొనసాగిస్తుందా? బీజేపీకి పరోక్షంగా మద్దతు తెలుపుతుందా? కాంగ్రెస్తో చెలిమికి గుడ్బై చెప్పి, బీజేపీ ప్రభుత్వంపై ఒంటరిగానే పోరాటం చేస్తుందా? అనే అంశాలు ఆసక్తిగా మారాయి. మరోవైపు బీజేపీ కూడా జేడీఎస్ సభ్యుల మద్దతు కోరడంపై ఆలోచనలు చేస్తున్నట్ల తెలిసింది. వారితోపాటు రెబల్స్ను కూడా తమవైపునకు తిప్పుకునేందుక ప్రయత్నలను ముమ్మరం చేస్తోంది కమళ దళం. ఈ నేపథ్యంలో సోమవారం జరిగే విశ్వాస పరీక్షపై ఉత్కంఠ రోజురోజుకూ పెరుగుతోంది. -
కన్నడ పీఠంపై మళ్లీ ‘కమలం’
సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో మరోసారి కమలనాథుల ప్రభుత్వం కొలువుదీరింది. కర్ణాటక 32వ ముఖ్యమంత్రిగా బూకనకెరె సిద్ధలింగప్ప యడియూరప్ప(76) ప్రమాణస్వీకారం చేశారు. రాజ్భవన్లో గవర్నర్ వజూభాయ్వాలా శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు ఆయన చేత ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి సదానంద గౌడతో పాటు మాజీ సీఎం ఎస్.ఎం.కృష్ణ, కర్ణాటక బీజేపీ ఇన్చార్జ్ మురళీధరరావు, బీజేపీ నేత శోభాకరంద్లాజే, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. వీరితో పాటు కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యే రోషన్బేగ్, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే రాజన్న ఈ వేడుకకు వచ్చి అందర్ని ఆశ్చర్యపరిచారు. కర్ణాటకలో హెచ్.డి.కుమారస్వామి ప్రభుత్వం కూలిపోయిన మూడ్రోజులకే యడియూరప్ప ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణస్వీకారం చేయడం గమనార్హం. కాంగ్రెస్ నేతలెవరూ ఈ కార్యక్రమానికి రాలేదు. యెడ్డీకి అమిత్ షా ఫోన్.. కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేశ్ కుమార్ ముగ్గురు కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేయడంతో బీజేపీ అధిష్టానం చకచకా పావులు కదిపింది. పలువురు న్యాయ నిపుణులతో చర్చలు జరిపిన బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా.. శుక్రవారం ఉదయాన్నే యడియూరప్పకు ఫోన్చేసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధం కావాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో గవర్నర్ వజూభాయ్వాలా అపాయింట్మెంట్ తీసుకున్న యడియూరప్ప నేరుగా రాజ్భవన్కు వెళ్లిపోయారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలనీ, సభలో మెజారిటీని నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇందుకు అంగీకరించిన గవర్నర్ వజూభాయ్వాలా సాయంత్రం 6–6.15 గంటల మధ్యలో ప్రమాణస్వీకారం చేయాలని ఆదేశించారు. యడియూరప్ప ఇప్పటికే ప్రతిపక్ష నేత కాబట్టి ఆయన్ను బీజేపీ ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా మరోసారి ఎన్నుకోలేదు. 29న అసెంబ్లీలో బలపరీక్ష.. కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాక యడియూరప్ప స్పందిస్తూ.. ఈ నెల 29న ఉదయం 10 గంటలకు బలపరీక్షను చేపడతామని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపరుస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల జీతభత్యాలకు సంబంధించిన ఆర్థిక బిల్లును కూడా ఆమోదిస్తామని చెప్పారు. బీజేపీ చీఫ్ అమిత్ షాను సంప్రదించి త్వరలోనే మంత్రివర్గ విస్తరణను చేపడతామని పేర్కొన్నారు. మరోవైపు యడియూరప్ప విజ్ఞప్తి మేరకు సోమవారం సభను నిర్వహిస్తానని స్పీకర్ చెప్పారు. యడ్యూరప్ప కాదు.. యడియూరప్ప! కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప తన పేరును మరోసారి మార్చుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం తమను ఆహ్వానించాలని గవర్నర్కు రాసిన లేఖలో తన పేరును ఆయన ‘బీఎస్ యడియూరప్ప’గా రాశారు. న్యుమరాలజీ ప్రభావంతో యడియూరప్ప ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన సన్నిహితవర్గాలు తెలిపాయి. 2007లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సిరావడంతో న్యుమరాలజీ ప్రకారం యడియూరప్ప తన పేరును యడ్యూరప్పగా మార్చుకున్నారు. అయితే ఇది కలిసిరాకపోవడంతో ఈ బీజేపీ నేత తన పాత పేరునే వాడాలని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటు సాధ్యమా? ప్రస్తుత పరిస్థితుల్లో యడియూరప్ప చాలా జాగ్రత్తగా ముందుకెళ్లాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హతతో కర్ణాటక అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 221 (స్పీకర్ను మినహాయించి)కి చేరుకుం టుంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 112 అయింది. బీజేపీకి ప్రస్తుతం 106 మంది సభ్యుల (బీజేపీ 105, ఓ స్వతంత్ర ఎమ్మె ల్యే) బలముంది. ఈ నేపథ్యంలో మిగిలిన ఆరుగు రిని బీజేపీ ఎలా సంపాదిస్తుందన్నది ఇప్పు డు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ స్పీకర్ రమేశ్ మిగిలిన 14 మంది రెబెల్స్ రాజీనామాలను ఆమోదిస్తే/ అనర్హత వేటేస్తే అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 208కి చేరుకుంటుంది. అప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు 105 మంది ఎమ్మెల్యేలు ఉంటే సరిపోతుంది. ఇదే జరిగితే ఓ స్వతంత్ర ఎమ్మెల్యే మద్దతుతో బీజేపీ గట్టెక్కుతుంది. అయితే 14 మంది రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటారన్నదానిపై ప్రస్తుతం అస్పష్టత నెలకొంది. ప్రజానుకూల పాలన అందిస్తాం: అమిత్ షా కర్ణాటకలో యడియూరప్ప నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం సుస్థిరమైన, రైతు, ప్రజానుకూల పాలన అందిస్తుందని బీజేపీ చీఫ్ అమిత్ షా తెలిపారు. కర్ణాటక సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన యడియూరప్పకు ఆయన శుభాకాంక్షలు చెప్పారు. కర్ణాటక ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు బీజేపీ కట్టుబడి ఉందన్నారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ.. కలహాలవల్లే కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వం కూలిపోయిందనీ, తమ ప్రమేయం లేదన్నారు. మండిపడ్డ కాంగ్రెస్, జేడీఎస్.. యడియూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకా రం చేయడంపై కాంగ్రెస్, జేడీఎస్ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. ‘బీజేపీకి అండగా నిలిచిన వజూభాయ్వాలా సాయంతో రాజ్యాంగ విరుద్ధంగా కర్ణాటకలో యడియూరప్ప ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేశారు. అవినీతి రారాజు, జైలు పక్షి యడియూరప్ప రాజకీయ ప్రలోభాల విషయంలో తన అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసి అధికారంలోకి వచ్చారు’ అని కాంగ్రెస్ పార్టీ ఘాటుగా విమర్శించింది. కర్ణాటక బీజేపీకి ప్రయోగశాలగా మారిపోయిందని సీఎల్పీ నేత సిద్దరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. యడియూరప్ప వరాల జల్లు కర్ణాటకలో రైతులు, చేనేత కార్మికులకు సీఎం యడియూరప్ప వరాలు ప్రకటించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద ఎంపికైన రైతులకు అదనంగా రూ.4000ను రెండు విడతల్లో అందజేస్తామని తెలిపారు. ఈ పథకం కింద కేంద్రం ఏటా రూ.6 వేలు అందిస్తుందన్నారు. అలాగే చేనేత కార్మికులకు రూ.100 కోట్ల మేర ఉన్న అప్పులను మాఫీ చేస్తామని వెల్లడించారు. రైతుల రుణమాఫీ విషయంలో అన్నిపక్షాలను సంప్రదించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. 15 ఏళ్లకే ఆరెస్సెస్ కార్యకర్త కర్ణాటకలోని మాండ్యా జిల్లా బూకనకెరె గ్రామంలో లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన సిద్దలింగప్ప, పుట్టతాయమ్మ దంపతులకు 1943, ఫిబ్రవరి 27న జన్మించారు. 15 ఏళ్ల వయసులోనే ఆరెస్సెస్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులయ్యారు. ఎమర్జెన్సీ సమయంలో జైలు జీవితం గడిపారు. తన స్వగ్రామం శికారిపురలో ఒక రైలు మిల్లులో పని చేశారు. ఆ మిల్లు యజమాని కుమార్తె మైత్రిదేవిని ప్రేమించి పెళ్లాడారు. ఆరెస్సెస్ శికారిపుర సంఘ్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 1980లో బీజేపీలో చేరిన యడ్యూరప్ప 1983 నుంచి శికారిపుర ఎమ్మెల్యేగా ఏడు సార్లు ఎన్నికయ్యారు. తొలిసారి 2007లో.. 2007 నవంబర్లో తొలిసారి యడియూరప్ప సీఎం అయ్యారు. జేడీ(ఎస్) మద్దతు ఉపసంహరించడంతో ఆయన ఏడు రోజుల్లోనే రాజీనామా చేయాల్సి వచ్చింది. 2008 మేలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడంతో రెండోసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు. అక్రమ మైనింగ్ కేసులో లోకాయుక్త యడియూరప్పను దోషిగా తేల్చడంతో మూడేళ్లకే 2011 జులైలో సీఎం పదవిని వదులుకోవాల్సి వచ్చింది. వారం రోజులు జైల్లో ఉన్నారు. కొత్త పార్టీ.. మళ్లీ విలీనం ఆ తరువాత కర్ణాటక జనతా పక్ష (కేజేపీ) పేరుతో పార్టీ పెట్టారు. 2014లో కేజేపీని బీజేపీలో విలీనం చేశారు. 2018 ఎన్నికల్లో అత్యధిక స్థానాలను బీజేపీ గెలుచుకోవడంతో యడియూరప్ప మూడోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ బలనిరూపణకు 15 రోజుల సమయం ఇచ్చారు. కానీ, దీనిపై కాంగ్రెస్, జేడీ(ఎస్) కోర్టుకెక్కడంతో సుప్రీంకోర్టు వెంటనే బలాన్ని నిరూపించుకోవాలంటూ ఆదేశించింది. కేవలం 3 రోజులు మాత్రమే సీఎంగా ఉన్న యెడ్డీ మే 19న బలపరీక్షకు కాస్త ముందు రాజీనామా చేశారు. -
యడ్యూరప్ప బల పరీక్షకు డెడ్లైన్ ఫిక్స్
సాక్షి, బెంగళూరు: రాజకీయ సంక్షోభంలో ఉన్న కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ సిద్ధమయింది. ఈరోజు సాయంత్రం ఆరుగంటలకు రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్పీకారం చేయనున్నారు. దీనికి గవర్నర్, కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. అయితే సీఎంగా యడ్యూరప్ప ప్రమాణం చేసిన అనంతరం అసెంబ్లీలో బల నిరూపణ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతమున్న రాజకీయ సంక్షోభం కారణంగా విశ్వాస నిరూపణకు గవర్నర్ అనూహ్యాంగా వారికి ఏడు రోజుల సమయం ఇచ్చారు. జూలై 31న శాసనసభలో యడ్యూరప్ప బల పరీక్షను ఎదుర్కోనున్నారు. గవర్నర్ వారికి ఏడు రోజుల సమయం కేటాయించడంపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శాసనసభను బీజేపీ ఓ ప్రయోగశాలగా మార్చిందని మండిపడింది. రాజ్యాంగంలో ఏ అధికారణ ప్రకారం గవర్నర్ మెజార్టీకి తక్కువగా ఉన్న పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారని ప్రశ్నించింది. ఈచర్య సిగ్గుచేటని ఘటుగా స్పందించింది. ఈ మేరకు పార్టీ ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్ను పావుగా ఉపయోగించుకుంటోందని విమర్శించింది. గతంలోలా అసెంబ్లీలో బలం సరిపోక మరోసారి యడ్యూరప్ప రాజీనామా చేయక తప్పదని కాంగ్రెస్ జోస్యం చెప్పింది. మరోవైపు యడ్యూరప్ప విశ్వాసపరీక్షపై బీజేపీ నేతలు ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టారు. రెబల్ ఎమ్మెల్యేలను తమ వైపునకు తిప్పుకునేందుకు కేంద్ర నాయకత్వం ఆపార్టీ నేతలను రంగంలోకి దింపింది. కాంగ్రెస్ కూడా మరోసారి రెబల్స్ను బుజ్జగించేందుకు ప్రయత్నిస్తోంది. ఇదిలావుండగా రెబల్స్పై స్పీకర్ తీసుకునే నిర్ణయం ఉత్కంఠగా మారింది. ఇదివరకే ముగ్గురు సభ్యులపై అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. -
మా వెనుకున్నది ఆయనే: రెబల్ ఎమ్మెల్యే
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వం పడిపోవడానికి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రధాన కారణమని వార్తలు వినిపిస్తోన్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ రెబల్స్ వెనుక ఆయన హస్తం ఉందంటూ జేడీఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా వారి ఆ వార్తలను నిజం చేస్తూ.. కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యే శివరాం హెర్బర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తామంతా సిద్దరామయ్య సూచనల మేరకే నడుచుకున్నామంటూ బాంబు పేల్చారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘కర్ణాటకలో నెలకొన్న అనిశ్చితికి సిద్దరామయ్యే కారణం. పార్టీకి దూరంగా ఉండమని కొద్ది రోజుల క్రితం ఆయన మాకు చెప్పారు. కానీ ఇప్పుడు మమ్మల్నే నిందిస్తున్నారు. మేమంతా ఏకతాటిపై ఉన్నాం. అందరం కలిసే నిర్ణయం తీసుకున్నాం. మేం బీజేపీలో చేరుతున్నామనేది అబద్ధం’ అని తెలిపారు. శివరాం వ్యాఖ్యలపై కన్నడ రాజకీయాల్లో పెను దుమారం చేలరేగుతోంది. ఈ నేపథ్యంలో హెర్బర్ వ్యాఖ్యలపై సిద్దరామయ్య స్పందించారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించడానికే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్నారని. ఇంకోసారి ఇలాంటి ఆరోపణలు చేస్తే వారికి గట్టిగా బుద్ధి చెప్తానని ట్వీట్ చేశారు. విశ్వాస పరీక్షలో ప్రభుత్వాన్ని కాపాడటానికి తనవంతు కృషి చేశానని సిద్దూ చెప్పుకొచ్చారు. కాగా కర్ణాటక సంక్షోభం అనంతరం స్థానిక నేతలపై రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రభుత్వ పతనం వెనుక సిద్దరామయ్య ఉన్నారన్న వార్తలు కాంగ్రెస్ అధిష్టానం దృషికి కూడా వెళ్లాయి. దీంతో ఆయనపై పార్టీ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: ప్రభుత్వ పతనం వెనుక కాంగ్రెస్! ఇదిలావుండగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా శుక్రవారం సాయంత్రం యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్తో భేటీ అనంతరం ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు తెలపకుండా ఉండేందుకు మరోసారి రెబల్స్ను బుజ్జగింజే ప్రయత్నంలో పడ్డారు జేడీఎస్, కాంగ్రెస్ నేతలు. మరోవైపు వారి రాజీనామాలపై అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. దీంతో కర్ణాటక రాజకీయాల ఉత్కంఠ మరికొన్ని రోజులు సాగనున్నట్లు తెలుస్తోంది. -
సీఎంగా నేడు యడ్యూరప్ప ప్రమాణం!
సాక్షి, బెంగళూరు: అనేక ఉత్కంఠ పరిణమాల అనంతరం కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా బీజేపీ నాయకత్వం అడుగులు వేస్తోంది. శుక్రవారం ఉదయం రాజ్భవన్లో ఆ రాష్ట్ర గవర్నర్తో బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో గవర్నర్ దానికి సానుకూలంగా స్పందించారని, ఆరోజు సాయంత్రం 6గంటలకు కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్పీకారం చేస్తారని సమాచారం. గవర్నర్తో భేటీ అనంతరం యడ్యూరప్ప మాట్లాడుతూ.. రాష్ట్రంలో నూతన ప్రభుత్వాన్ని బీజేపీ ఏర్పాటు చేయనుందని తెలిపారు. ఈరోజు సాయంత్రం 6 గంటలకు సీఎంగా తాను ప్రమాణం చేస్తానని యడ్డీ స్పష్టం చేశారు. ఇదిలావుండగా కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన 17 మంది ఎమ్మెల్యేల్లో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై స్పీకర్ కె.ఆర్.రమేశ్ కుమార్ అనర్హత వేటు వేయడం సంచలనంగా మారింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలైన రమేశ్ జార్కిహోళి, మహేశ్ కుమటల్లి, శంకర్లపై ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేసినట్లు స్పీకర్ తెలిపారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా రాజీనామాలు ఇవ్వలేదనీ, రాజ్యాంగంలోని పదో షెడ్యూల్(ఫిరాయింపుల నిరోధక చట్టం)ను ఉల్లంఘించారని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తాజా పరిస్థితిపై ఆచితూచి అడుగులు వేస్తోన్న బీజేపీ కేంద్రనాయకత్వం.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవల్సిందిగా యడ్డీకి ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు మిగిలిన రెబల్స్పై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఆసక్తిగా మారింది. -
ముగ్గురు రెబెల్స్పై అనర్హత వేటు
సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ కె.ఆర్.రమేశ్ కుమార్ గురువారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన 17 మంది ఎమ్మెల్యేల్లో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలైన రమేశ్ జార్కిహోళి, మహేశ్ కుమటల్లి, శంకర్లపై ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేసినట్లు స్పీకర్ తెలిపారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా రాజీనామాలు ఇవ్వలేదనీ, రాజ్యాంగంలోని పదో షెడ్యూల్(ఫిరాయింపుల నిరోధక చట్టం)ను ఉల్లంఘించారని స్పష్టం చేశారు. ప్రస్తుత శాసనసభ కాలం ముగిసే వరకూ (2023) వీరు ఎన్నికల్లో పోటీ చేసేందుకు, సభలో పదవులు చేపట్టేందుకు అనర్హులని తేల్చిచెప్పారు. మిగిలిన 14 మంది ఎమ్మెల్యేల రాజీనామాలపై త్వరలో నిర్ణయం తీసుకుంటానన్నారు. అసెంబ్లీలో ఇటీవల జరిగిన విశ్వాసపరీక్షలో కుమారస్వామి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఓడిపోవటం తెలిసిందే. తన నిర్ణయంపై రెబెల్స్ కోర్టులకు వెళ్లే అవకాశముందన్నారు. ఆర్థిక బిల్లుకు గనక ఈ నెల 31లోగా ఆమోదం లభించకపోతే ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుందని, అప్పుడు అసెంబ్లీని సస్పెండ్ చేయడం లేదా రాష్ట్రపతి పాలన విధించడం తప్ప మరో ప్రత్యామ్నాయం ఉండదని చెప్పారాయన. మరోవైపు తమ రాజీనామాలపై స్పీకర్ ముందు హాజరై వివరణ ఇచ్చేందుకు 4 వారాల గడువు కావాలని రెబెల్స్ కోరారు. యెడ్డీ జోరుకు షా బ్రేక్.. బీజేపీ కర్ణాటక చీఫ్ యడ్యూరప్ప, నేతలు జగదీశ్ షెట్టర్, అరవింద్ లింబావలి, మధుస్వామి, బసవరాజ్ బొమ్మై గురువారం ఢిల్లీ చేరారు. పార్టీ అధ్యక్షుడు అమిత్ షాతో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారు. అయితే మిగిలిన 14 మంది రెబెల్ ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ రమేశ్ కుమార్ తుది నిర్ణయం తీసుకున్న తరవాతే ముందుకెళ్లాలనీ, అప్పటివరకూ ఓపికపట్టాలని యడ్యూరప్పకు షా సూచించినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. -
ముగ్గురు రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు
సాక్షి, బెంగళూరు : విశ్వాస పరీక్ష ముగిసినా కర్ణాటకలో రాజకీయ సంక్షోభానికి ఇంకా తెరపడలేదు. కుమారస్వామి ప్రభుత్వం కూలిపోయిన 48 గంటల్లోనే కర్ణాటక స్పీకర్ రమేష్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముగ్గురు రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ గురువారం అనర్హత వేటు వేశారు. స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆర్.శంకర్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రమేష్ జార్జ్హోళి, మహేష్... 2023 వరకూ ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేస్తున్నట్లు ప్రకటన చేశారు. విశ్వాస తీర్మానంలో కుమారస్వామి ప్రభుత్వానికి వీరంతా మద్దతు ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. కాగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో శంకర్ కేపీజేపీ (కర్ణాటక ప్రజకీయ జనతా పార్టీ) తరపును పోటీ చేసి గెలుపొందారు. అయితే ఆయన కాంగ్రెస్లో చేరుతున్నట్లు ఈ ఏడాది జూన్ 14న గవర్నర్కు లేఖ ఇచ్చారు. అంతేకాకుండా కేపీజేపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. విలీన ప్రక్రియకు స్పీకర్ ఈ ఏడాది జూన్ 25న ఆమోదం తెలపడంతో ఆర్.శంకర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పరిగణించడం జరిగింది. కాగా తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్యే శంకర్ బీజేపీలోకి చేరేందుకు సన్నద్ధం అయ్యారు. దీంతో కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత సిద్ధరామయ్య ఆయనపై అనర్హత పిటిషన్ దాఖలు చేశారు. ఆ ఫిర్యాదుపై స్పీకర్ ఇవాళ నిర్ణయం తీసుకున్నారు. 17 రోజులు హైడ్రామా కాంగ్రెస్-జేడీఎస్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో భాగంగా ముఖ్యమంత్రి కుమారస్వామి పనితీరుకు వ్యతిరేకంగా రెండు పార్టీల నుంచి 16మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఫలితంగా సంకీర్ణ ప్రభుత్వం ఒక్కసారిగా ప్రమాదంలో పడింది. అయితే ఎవరు ఎందుకు రాజీనామా చేశారనే దానిపై ఇప్పటివరకూ స్పష్టత రాలేదు. రాజీనామా చేసిన 16మందిలో 12మంది ముంబయిలో మకాం వేశారు. పార్టీ అధిష్టానం విప్ జారీ చేసినప్పటికీ పట్టించుకోలేదు. ముంబయికి ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్తో పాటు కాంగ్రెస్ జాతీయ నేతలు గులాంనబీ ఆజాద్, కేసీ వేణుగోపాల్ వెళ్లినా ఎలాంటి ఫలితం లేకపోయింది. -
హై‘కమాండ్’ కోసం ఎదురుచూపులు
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని కర్ణాటక బీజేపీ చీఫ్, ప్రతిపక్ష నేత బీఎస్ యడ్యూరప్ప తెలిపారు. అయితే ఈ విషయంలో బీజేపీ హైకమాండ్ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు. బెంగళూరులోని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) ప్రధాన కార్యాలయం ‘కేశవ కృప’లో బుధవారం సంఘ్ పెద్దలను కలుసుకున్న అనంతరం యడ్యూరప్ప మీడియాతో మాట్లాడారు. ‘నేను ఢిల్లీ నుంచి ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నా. ఎప్పుడు అవసరమైనా నేను బీజేపీ శాసనసభా పక్షాన్ని సమావేశపర్చి ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్ను కలుసుకోగలను. కానీ ఇందుకోసం పార్టీ హైకమాండ్ నుంచి తొలుత స్పష్టత రావాలి’ అని తెలిపారు. కర్ణాటక అసెంబ్లీలో మంగళవారం జరిగిన విశ్వాసపరీక్షకు అనుకూలంగా 99 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలపగా, 105 మంది బీజేపీ ఎమ్మెల్యేలు వ్యతిరేకించారు. దీంతో విశ్వాసతీర్మానం వీగిపోయి సీఎం కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే. ఆరెస్సెస్ ఆశీర్వాదం వల్లే.. ఆరెస్సెస్ పెద్దల ఆశీర్వాదం, సహకారం కారణంగానే తాను తాలూకా స్థాయి నుంచి రాష్ట్రస్థాయి నేతగా, ముఖ్యమంత్రిగా ఎదిగానని యడ్యూరప్ప తెలిపారు. ‘తదుపరి కార్యాచరణను చేపట్టేముందు ఆరెస్సెస్ పెద్దల ఆశీస్సులు తీసుకునేందుకే ఇక్కడకు వచ్చాను. విశ్వాసపరీక్ష సందర్భంగా మా ఎమ్మెల్యేలు బలంగా, ఐకమత్యంతో నిలిచారు. మాకు రాబోయే కాలంలో కీలకమైన పరీక్షలు ఎదురుకానున్నాయి. ఇలాంటి పరిస్థితులన్నింటిని దీటుగా ఎదుర్కొని ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తాం’ అని వెల్లడించారు. మరోవైపు విశ్వాసపరీక్షకు డుమ్మా కొట్టిన 17 మంది రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాల విషయంలో స్పీకర్ రమేశ్ కుమార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని బీజేపీ అధిష్టానం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. దీనిపై స్పష్టత వచ్చాకే కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ముందుకెళ్లాలని భావిస్తోంది. కాగా, ముంబైలో ఆందోళన చెందుతున్న రెబెల్ ఎమ్మెల్యేలకు సర్దిచెప్పేందుకు బీజేపీ నేతలు అశ్వంత్ నారాయణ్, ఆర్.అశోక ముంబైకి బయలుదేరివెళ్లారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక దూత.. కర్ణాటకలో నాటకీయ పరిణామాల మధ్య సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయిన నేపథ్యంలో బీజేపీ అధిష్టానం పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియను సాఫీగా జరిగేలా చూసేందుకు త్వరలోనే ప్రత్యేక పరిశీలకుడిని పంపనుంది. కర్ణాటకలో విశ్వాసపరీక్షకు మొత్తం 17 మంది అధికార కూటమి సభ్యులు గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలో వీరిపై స్పీకర్ చర్యలు తీసుకునేవరకూ వేచిఉండాలన్న ధోరణితోనే బీజేపీ అధిష్టానం ఉన్నట్లు సమాచారం. ఒకవేళ స్పీకర్ సుప్రీంకోర్టుకెళ్లిన 15 మంది రెబెల్స్ రాజీనామాలను ఆమోదించి లేదా అనర్హత వేటేస్తే అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 210కి, కాంగ్రెస్–జేడీఎస్ కూటమి బలం(బీఎస్పీ ఎమ్మెల్యేతో కలుపుకుని) 103కు చేరుకుంటుంది. అప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 106కు తగ్గుతుంది. దీంతో 107 ఎమ్మెల్యేల మద్దతున్న బీజేపీ కూటమి(బీజేపీ 105, ఇద్దరు స్వతంత్రులు) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమమౌతుంది. అయితే స్వతంత్రుల దయాదాక్షిణ్యాలపై బీజేపీ ప్రభుత్వం మనుగడ సాగించాల్సి ఉంటుంది. -
ప్రజాతీర్పే పరిష్కారం
‘ఇంకెన్నాళ్లు...?’ అని అందరి చేతా పదే పదే అనిపించుకున్నాక, మూడు వారాలపాటు కాలయాపన చేశాక కర్ణాటకలో కాంగ్రెస్–జేడీఎస్ కూటమి ప్రభుత్వం అధికారం నుంచి తప్పుకుంది. అక్కడి రాజకీయ పరిణామాలతో విసుగు చెందిన జనం ఊపిరిపీల్చుకునేంతలోనే మధ్యప్రదేశ్లో కుర్చీలాట మొదలైంది. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 24 గంటల్లో కూల్చేస్తామని బీజేపీ ప్రకటించగా, ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలను తమకు అనుకూలంగా మలుచుకుని ముఖ్యమంత్రి కమల్నాథ్ ఈ సవాలుకు జవాబిచ్చారు. ఆ రాష్ట్రంలోని రాజకీయం మరెన్ని మలుపులు తిరుగు తుందో రానున్న రోజుల్లో చూడాల్సి ఉంది. కర్ణాటక రాజకీయ చదరంగంలో అటు అధికార పక్షమూ, ఇటు విపక్షమూ రెండూ సాధారణ ప్రజానీకానికి ఏవగింపు కలిగించాయి. నిరుడు మే నెలలో కూటమి ప్రభుత్వం ఏర్పడిననాటినుంచి దినదిన గండంగానే బతుకీడుస్తోంది. 104మంది ఎమ్మెల్యేలతో అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ... యడ్యూరప్ప సారధ్యంలో సర్కారు ఏర్పరి చినా అది మూణ్ణాళ్ల ముచ్చటే అయింది. అటుపై 116మంది బలం ఉన్న కాంగ్రెస్–జేడీఎస్ కూటమి డీకే కుమారస్వామి నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ కూటమి ప్రభు త్వానికి పాలనపై దృష్టి పెట్టే అవకాశమే కలగలేదు. స్వీయ రక్షణే దాని ఏకైక ఎజెండాగా మారింది. కూటమి సర్కారును కూల్చడానికి ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని స్వల్పకాలం ఏలిన యడ్యూరప్ప కాచుక్కూర్చోగా... కేవలం 37 స్థానాలు మాత్రమే గెల్చుకున్న కుమారస్వామి అందలం ఎక్కడాన్ని కాంగ్రెస్కు చెందిన మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య జీర్ణించుకోలేక పోయారు. వెలుపలి నుంచి యడ్యూరప్ప, లోపలినుంచి సిద్దరామయ్య ఇలా రగిలిపోతుంటే కుమారస్వామి భరోసాతో ఉండటం ఎలా సాధ్యం? అందుకే ఆయన రాజీనామా చేసి పోతానని అనేకసార్లు బెదిరించారు. ఒక సందర్భంలో కంటతడి పెట్టారు. ఎవరినీ సంతృప్తిపరచలేక, సము దాయించలేక అయోమయానికి లోనయ్యారు. అయినా సిద్దరామయ్యను అదుపు చేయడంలో కాంగ్రెస్ విఫలమైంది. ఆయన్ను ఏదోవిధంగా సముదాయించినా ఆ పార్టీలో ఇతరేతర వర్గాలున్నాయి. వాటి డిమాండ్లు వాటికున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సైతం కూటమి ప్రభుత్వం 14 నెలలు అధికారంలో కొనసాగడం నిజంగా వింతే. ఇప్పుడు యడ్యూరప్ప వెంటనే ముఖ్యమంత్రి పీఠం అధిష్టిస్తారో, లేదో చూడాల్సి ఉంది. సభకు గైర్హాజరైన 17మంది కాంగ్రెస్, జేడీఎస్ సభ్యుల వ్యవహారం ఏ మలుపుతిరుగుతుందో కూడా ఆసక్తికరమే. అయితే యడ్యూరప్ప ఏర్పరిచే ప్రభుత్వమైనా సుస్థిరంగా ఉంటుందన్న గ్యారెంటీ లేదు. ఇప్పుడు పదవులు దక్కని కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు చేసినట్టే, రేపు బీజేపీ ఎమ్మెల్యేలు ప్రవర్తించరని చెప్పలేం. 2008లో అధికారంలోకి వచ్చాక బీజేపీలో చెలరేగిన అంతర్గత కుమ్ము లాటలు ఎవరూ మరిచిపోరు. తొలుత యడ్యూరప్ప, ఆ తర్వాత సదానంద గౌడ, అటుపై జగదీశ్ శెట్టార్లకు అధికార పగ్గాలు అప్పగించినా అసంతృప్తి సద్దుమణగలేదు. పార్టీలో ముఠా తగాదాలు ముదిరిపోగా అధిష్టానం నిస్సహాయంగా మిగిలిపోయింది. చివరకు 2013లో దారుణంగా ఓటమి పాలయింది. ఇప్పుడు కొత్తగా వచ్చిచేరే కాంగ్రెస్, జేడీఎస్ సభ్యుల అండతో ఏర్పడబోయే ప్రభుత్వం ఎన్నాళ్లు మనుగడ సాగించగలదో చూడాలి. అధికారం కోల్పోయిన కాంగ్రెస్, జేడీఎస్ లకు ప్రభుత్వాన్ని పడగొట్టే స్థాయిలో వనరులు లేవు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉండగా అదంత సులభమూ కాదు. కాంగ్రెస్, జేడీఎస్లు ఇప్పుడున్న ఎమ్మెల్యేలను కాపాడుకోగలిగితే అదే గొప్ప అనుకోవాలి. అసలు ఆ రెండూ ఇప్పుడున్నట్టే మిత్రపక్షాలుగా కొనసాగుతాయన్న నమ్మకం ఎవరికీ లేదు. అయితే బీజేపీ తెరవెనక ఉండి ఆడించిన రాజకీయ క్రీడ వల్ల తాము అధికారం కోల్పోయామని ప్రజల ముందు ఏకరువు పెట్టి సానుభూతి సంపాదించుకోవడానికి వాటికి అవ కాశం ఉంటుంది. రెండూ కలిసి నడిస్తేనే ఇదంతా సాధ్యం. తగినంత మెజారిటీతో ఏర్పడిన ప్రభుత్వాలు ఫిరాయింపుల వల్ల కూలిపోవడం విచారించదగ్గ విషయమే. కానీ దేశంలో వామపక్షాలు, వైఎస్సార్ కాంగ్రెస్ తప్ప ఏ పార్టీ కూడా ఫిరాయింపుల విషయంలో సూత్రబద్ధమైన వైఖరితో లేవు. ఫిరాయింపుల వల్ల బలైనప్పుడు ఒకలా, వాటివల్ల లబ్ధి పొందే పరిస్థితులున్నప్పుడు మరొకలా మాట్లాడటం ఆ పార్టీలకు అలవాటైపోయింది. సాగినన్నాళ్లు కాంగ్రెస్ ఫిరాయింపులను ప్రోత్సహించింది. ప్రభుత్వాలను పడగొట్టింది. గతంలో కాంగ్రెస్ను తప్పుబట్టిన బీజేపీ ఇప్పుడు అధికారం అందుకున్నాక తానూ ఆ మార్గాన్నే అనుసరిస్తోంది. ఫిరా యింపుల నిరోధక చట్టం ఆచరణలో పనికిమాలినదని రుజువయ్యాక కూడా కేంద్రంలో అధికారం చలాయించిన ఏ పక్షమూ దాన్ని సరిచేయడానికి పూనుకోలేదు. అలా చేయనివారే నష్టపోయినప్పుడల్లా అన్యాయం జరిగిందని శోకాలు పెడుతున్నారు. తాము అధికారంలోకొచ్చినప్పుడు మళ్లీ ఆ ఫిరాయింపులనే ప్రోత్సహించి, వాటితోనే మనుగడ సాగిస్తున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకునే హక్కు స్పీకర్ పరిధి నుంచి తొలగించి ఎన్నికల సంఘానికి కట్టబెడితే ఈ సమస్య సులభంగా పరిష్కారమవుతుంది. కానీ అది ముందుమునుపూ ఏం సమస్యలు తెచ్చిపెడు తుందోనన్న భయంతో అలాంటి సవరణకు ఏ ప్రభుత్వమూ సిద్ధపడదు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని పది కాలాలపాటు నిలబెడదామని, విలువలతో కూడిన రాజకీయాలకు కట్టుబడి ఉందామని పార్టీలు భావించనంతకాలమూ పరిస్థితులు ఇలాగే ఉంటాయి. ఫిరాయింపుల్ని, వాటిని ప్రోత్స హించే పార్టీలనూ ప్రజలు ఏవగించుకుంటే పార్టీలు పంథా మార్చుకోక తప్పని స్థితి ఏర్పడుతుంది. అంతవరకూ ఈ రాజకీయ సంతలు, బేరసారాలు కొనసాగక తప్పదు. కర్ణాటకలో ఇప్పుడున్న రాజ కీయ అస్థిరత సమసిపోవాలన్నా, అనైతిక రాజకీయాలకు కళ్లెం పడాలన్నా కొత్తగా ప్రజల తీర్పు కోరడమే శ్రేయస్కరం. అయితే అందుకు ఎన్ని పార్టీలు సిద్ధపడతాయన్నది ప్రశ్నార్థకమే. -
కర్ణాటకం: పతనం వెనుక కాంగ్రెస్!
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలడానికి కారణం ఎవరు. అసెంబ్లీ ఎన్నికల్లో అతి తక్కువ స్థానాలు గెలుకుచుకున్న జేడీఎస్కు సీఎం పదవి దక్కడంతో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్దరామయ్య ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెరవెనుక చక్రం తిప్పారా?. అంటూ కన్నడ వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. మంగళవారం జరిగిన విశ్వాసపరీక్షలో కుమారస్వామి ప్రభుత్వం సభ విశ్వాసాన్ని కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో ఆయన సీఎం పదవికి రాజీనామా చేయగా.. నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప సిద్ధమయ్యారు. అయితే ఈ విషయంలో కాంగ్రెస్ నేతల తీరుపై రాహుల్ గాంధీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పార్టీలో సీనియర్ నాయకులు ఉండి బీజేపీ వ్యూహాలకు చెక్ పెట్టలేకపోయారంటూ రాష్ట్ర నేతలపై అసహనంగా ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా సిద్దరామయ్యపై వ్యవహారంపై రాహుల్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, పతానానికి కారణం ఆయనే అంటూ మండిపడుతున్నారని తెలిసింది. దీనికి కారణం కూడా లేకపోలేదు. సీఎంగా కుమారస్వామి పదవీ బాధ్యతలు చేపట్టనప్పటి నుంచీ ప్రభుత్వంపై సిద్దరామయ్య తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. గత ప్రభుత్వంలో కాంగ్రెస్కు అన్నీ తానై నడిపించిన తనను కాదని, అతి తక్కువ స్థానాలు గెలుచుకున్న జేడీఎస్కు, అందులోనూ తనకు గిట్టని కుమారస్వామికి సీఎం పదవి కట్టబెట్టడంపై రామయ్య గుర్రుగా ఉన్నారంటూ పెద్దస్థాయిలో చర్చ కూడా జరిగింది. అంతేకాదు సంకీర్ణ ప్రభుత్వం ఎక్కువ రోజులు నిలబడదని, రానున్న ఏడాదిలోపు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద మార్పులు చోటుచేసుకుంటాయని గతంలో ఆయన వ్యాఖ్యానించిన సందర్భాలెన్నో. మరోవైపు కుమారస్వామితో పాటు, మాజీ ప్రధాని దేవెగౌడ సైతం సిద్దరామయ్య తీరుపై అనేకసార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు సిద్దూ కుట్రపన్నుతున్నారని, తమకు వ్యతిరేకంగా వ్యూహాలు రచిస్తున్నారంటూ బహిరంగ ప్రకటనలు కూడా చేశారు. ప్రభుత్వం ఏర్పడిన తొలినాటి నుంచి వీరి మధ్య సరైన అవగహన లేనట్లు బయటపడింది. దీనికి తోడు ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఇరు పార్టీలు ఘోర పరాజయం పాలవ్వడం సంకీర్ణంలో విభేదాలు మరింత పెరిగాయి. జేడీఎస్-కాంగ్రెస్ కూటమి రాష్ట్ర వ్యాప్తంగా 28 లోక్సభ స్థానాల్లో పోటీ చేయగా.. ఇరు పార్టీలు కేవలం ఒక్కో స్థానానికి మాత్రమే పరిమితమయ్యాయి. దేవెగౌడ సైతం ఓటమి చవిచూడక తప్పలేదు. ఫలితాల అనంతరం సిద్దరామయ్య మాట్లాడుతూ.. జేడీఎస్తో పొత్తు కారణంగా తాము ఎంతో నష్టపోయామని ఏకంగా మీడియా సమావేశంలోనే విమర్శించారు. దేవెగౌడ, కుమారస్వామి కాంగ్రెస్ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేసారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలూ చేశారు. దీంతో కన్నడ పంచాయతీ కాంగ్రెస్ పెద్దల దగ్గరకు వెళ్లడంతో సిద్దరామయ్య అధిష్టానం ఆగ్రహానికి కూడా గురయ్యారు. ఇదిలావుండగా తాజాగా ప్రభుత్వం పడిపోవడానికి కూడా కారణం ఆయనే అని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. ప్రభుత్వంపై తిరుగుబాటుకు దిగిన ఎమ్మెల్యేలు అత్యధిక మంది సిద్దరామయ్య వర్గానికి చెందినవారే ఉన్నారు. రెబల్స్ వెనుక సిద్దూ హస్తం ఉందంటూ జేడీఎస్ మొదటి నుంచి చెబుతూనే ఉంది. అయినా కూడా కాంగ్రెస్ పెద్దలు పట్టించుకోలేదని ఆ పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇరుపార్టీల మధ్య ఉన్న విభేదాలను ప్రతిపక్ష బీజేపీ ఆసరాగా చేసుకుని రెబల్స్ను తమపైపు తిప్పుకున్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చివరికి ఉన్న ప్రభుత్వం ఊడిపోయి.. బీజేపీ ఖాతాలోకి మరో రాష్ట్రం చేరబోతోంది. -
‘ఎందుకు బహిష్కరించారో అర్థం కావట్లేదు’
సాక్షి, బెంగళూరు : కర్ణాకటకలో 14 నెలల పాటు కొనసాగిన కుమారస్వామి ప్రభుత్వం.. నాటకీయ పరిస్థితుల మధ్య మంగళవారం అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. కుమారస్వామి ప్రవేశ పెట్టిన తీర్మాణానికి 99 మంది అనుకూలంగా మద్దతు ఇవ్వగా.. 105 మంది వ్యతిరేకించారు. అయితే ఈ విశ్వాస పరీక్షకు బీఎస్పీ ఎమ్మెల్యే ఎన్ మహేశ్ హాజరుకాలేదు. కూటమికి అనుకూలంగా ఓటు వేయాలని ఆదేశించనా.. ఓటింగ్లో పాల్గొనకపోవడం పట్ల పార్టీ అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నాట్లు బీఎస్పీ అధినేత్రి మాయావతి ట్వీట్ చేశారు. (చదవండి : కుమార ‘మంగళం’) మాయావతి నిర్ణయంపై ఎమ్మెల్యే మహేశ్ స్పందింస్తూ.. తనను పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించారో అర్థం కావడంలేదన్నారు. తాను ఓటింగ్లో పాల్గొనడంలేదని ముందే చెప్పానని, అయినప్పటికీ ఎందుకు బహిష్కరించారో తెలియడం లేదన్నారు. మయావతి ట్వీట్ గురించి తనకు తెలియదని, ఈ విషయంపై తర్వాత మాట్లాడతానని తెలిపారు. కాగా కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయాలని చెప్పినా.. పార్టీ నియమామలను ఉల్లంఘిస్తూ మహేశ్ సభకు హాజరుకాలేదని అందుకే అతన్ని బహిష్కరిస్తున్నాని మాయావతి ట్వీట్ చేశారు. (చదవండి : కూలిన కుమార సర్కార్ : బీఎస్పీ ఎమ్మెల్యేపై వేటు) 2018 మే నెలలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ, జేడీఎస్లు కూటమిగా బరిలో నిలిచాయి. ఈ కూటమి తరఫున బరిలో నిలిచిన మహేశ్ కొల్లెగల నుంచి విజయం సాధించారు. అయితే ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి మెజారిటీ స్థానాలు రాకపోవడంతో కాంగ్రెస్, జేడీఎస్లు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. సంకీర్ణ ప్రభుత్వం తరఫున సీఎంగా ఎన్నికైన కుమారస్వామి తన మంత్రివర్గంలో మహేశ్కు స్థానం కల్పించారు. ఆయనకు ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. అయితే కొద్దికాలం పాటు మంత్రిగా కొనసాగిన మహేశ్.. 2018 అక్టోబర్లో ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. -
‘ప్రతిదీ కొనలేం.. ఆ రోజు వస్తుంది’
న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీలో మంగళవారం జరిగిన విశ్వాస పరీక్షలో కాంగ్రెస్-జేడీఎస్ల సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ అంశంలో బీజేపీపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మండిపడ్డారు. ‘ప్రతిదీ కొనలేం.. ప్రతి ఒక్కరిని బెదిరించలేం.. ప్రతి అబద్ధం బయటపడే రోజు తప్పక వస్తుంది.. త్వరలోనే బీజేపీ ఈ విషయాన్ని గ్రహిస్తుందని’ ప్రియాంక ట్వీట్ చేశారు. ‘ప్రజలు భరించినంత వరకే.. నాయకుల అంతులేని అవినీతి, ప్రజా ప్రయోజనాలను కాపాడే సంస్థలను నిర్వీర్యం చేయడం.. ప్రజాస్వామ్యాన్ని బలహీనపర్చడం వంటి అంశాలు కొనసాగుతాయి. ఒక్కసారి ప్రజల్లో సహనం నశిస్తే.. ఎంతటి నాయకుడైనా తుడిచిపెట్టుకుపోతా’డని మరో ట్వీట్ చేశారు ప్రియాంక గాంధీ. One day the BJP will discover that everything cannot be bought, everyone cannot be bullied and every lie is eventually exposed. 1/2 — Priyanka Gandhi Vadra (@priyankagandhi) July 23, 2019 దురాశ, స్వార్థ ప్రయోజనాలే గెలిచాయి: రాహుల్ కాగా, కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలడంతో రాహుల్ గాంధీ బీజేపీపై విమర్శలు చేశారు. బీజేపీ దురాశ ముందు నిజాయతీ, ప్రజాస్వామ్యం, కర్ణాటక ప్రజల తీర్పు కుప్పకూలిందన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే తమను కూల్చేందుకు బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. -
కూలిన కుమార సర్కార్ : బీఎస్పీ ఎమ్మెల్యేపై వేటు
బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీలో మంగళవారం జరిగిన విశ్వాస పరీక్షలో కాంగ్రెస్-జేడీఎస్ల సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిన సంగతి తెలిసిందే. దీంతో సీఎం కుమారస్వామి గవర్నర్ వజూభాయ్ వాలాను కలిసి రాజీనామా లేఖను సమర్పించారు. అయితే ఈ విశ్వాస పరీక్షకు బీఎస్పీ ఎమ్మెల్యే ఎన్ మహేశ్ హాజరుకాకపోవడంపై ఆ పార్టీ అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మహేశ్ను ఓటింగ్లో పాల్గొనాల్సిందిగా బీఎస్పీ అధ్యక్షురాలు మయావతి ఆదేశించిన సంగతి తెలిసిందే. అయినా కూడా మహేశ్ ఓటింగ్కు గైర్హాజరు కావడంతో అతన్ని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు మయావతి ప్రకటించారు. ‘కుమారస్వామి ప్రభుత్వానికి అనుకూలంగా ఓటింగ్లో పాల్గొనాలనే పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా మహేశ్ మంగళవారం రోజున సభకు హాజరుకాలేదు. దీనిని పార్టీ హైకమాండ్ తీవ్రంగా పరిగణిస్తోంది. తక్షణమే మహేశ్ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నాన’ని మయావతి ట్విటర్లో వెల్లడించారు. అయితే 2018 మే నెలలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ, జేడీఎస్లు కూటమిగా బరిలో నిలిచాయి. ఈ కూటమి తరఫున బరిలో నిలిచిన మహేశ్ కొల్లెగల నుంచి విజయం సాధించారు. అయితే ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి మెజారిటీ స్థానాలు రాకపోవడంతో కాంగ్రెస్, జేడీఎస్లు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. సంకీర్ణ ప్రభుత్వం తరఫున సీఎంగా ఎన్నికైన కుమారస్వామి తన మంత్రివర్గంలో మహేశ్కు స్థానం కల్పించారు. ఆయనకు ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. అయితే కొద్దికాలం పాటు మంత్రిగా కొనసాగిన మహేశ్.. 2018 అక్టోబర్లో ఆ బాధ్యతల నుంచి తప్పుకొన్నారు. కానీ కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణానికి తన మద్దతు ఉంటుందని తెలిపారు. कर्नाटक में कुमारस्वामी सरकार के समर्थन में वोट देने के पार्टी हाईकमान के निर्देश का उल्लंघन करके बीएसपी विधायक एन महेश आज विश्वास मत में अनुपस्थित रहे जो अनुशासनहीनता है जिसे पार्टी ने अति गंभीरता से लिया है और इसलिए श्री महेश को तत्काल प्रभाव से पार्टी से निष्कासित कर दिया गया। — Mayawati (@Mayawati) July 23, 2019 చదవండి : కుమార ‘మంగళం’ -
కుమార ‘మంగళం’
సాక్షి బెంగళూరు: దాదాపు మూడు వారాలపాటు కొనసాగిన హైడ్రామాకు తెరపడింది. కర్ణాటకలో 14 నెలలపాటు కొనసాగిన కుమారస్వామి సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. నాటకీయ పరిస్థితుల మధ్య మంగళవారం అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో ఓడిపోయింది. ప్రభుత్వంలోని కాంగ్రెస్, జేడీఎస్లకు చెందిన 16 మంది ఎమ్మెల్యేల రాజీనామాతో ఈ నెల మొదటి వారంలో రాజకీయ సంక్షోభం మొదలైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతూ వస్తోంది. గవర్నర్ విధించిన గడువులు కూడా ముగిశాయి. చివరి అంకంగా స్పీకర్ సూచన మేరకు తప్పనిసరి పరిస్థితుల్లో సాయంత్రం అసెంబ్లీలో సీఎం కుమారస్వామి విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి అనుకూలంగా కాంగ్రెస్ నుంచి 65 మంది, జేడీఎస్కు చెందిన 34 మంది కలిపి మొత్తం 99 మంది ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. బీజేపీకి చెందిన 105 మంది వ్యతిరేకించారు. దీంతో స్పీకర్ రమేశ్ కుమార్ ‘సీఎం పెట్టిన తీర్మానం వీగిపోయింది’ అని ప్రకటించడంతో ప్రభుత్వ పతనం అనివార్యమైంది. బీజేపీ ప్రభుత్వం ఏర్పడేందుకు మార్గం సుగమమయింది. అంతకుముందు తీర్మానంపై జరిగిన చర్చలో అధికార, ప్రతిపక్ష సభ్యుల వాగ్వాదాలతో సభా వాతావరణం వేడెక్కింది. ప్రభుత్వం ఏర్పాటైన నాటినుంచి కాంగ్రెస్, జేడీఎస్ నేతల మధ్య విభేదాలు పొడచూపుతూనే ఉన్నాయి. పరస్పర విమర్శలు, క్యాంపు రాజకీయాలతోనే ఏడాదంతా గడిచిపోయింది. ఇటీవలి లోక్సభ ఎన్నికల ఫలితాల ప్రభావం సంకీర్ణంపైనా పడింది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలోని స్థానాలన్నిటినీ దాదాపు కైవసం చేసుకోవడంతో కాంగ్రెస్–జేడీఎస్ నేతల మధ్య విభేదాలు మరింత ముదిరాయి. బీజేపీ పరోక్ష ప్రోద్బలంతో సంకీర్ణానికి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు సమర్పించారు. అయితే, వీరిని అసెంబ్లీకి హాజరుకావాలంటూ బలవంతం చేయరాదని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం, అలాగే తీవ్ర హెచ్చరికలు చేసినా రాజీనామా చేసిన వారు తిరిగి వచ్చేందుకు నిరాకరించడంతో కుమారస్వామి సర్కారు పతనానికి దారులు పడ్డాయి. నాలుగు రోజులుగా చర్చలు, వాయిదాల అనంతరం మంగళవారం సభలో బల నిరూపణకు సిద్ధం కావాలని స్పీకర్ గడువు విధించారు. అయితే, తనకు బుధవారం వరకు సమయం ఇవ్వాలని సీఎం కుమారస్వామి కోరగా ఆయన నిరాకరించారు. దీంతో మంగళవారం యథావిధిగా అసెంబ్లీ సమావేశమయింది. సాయంత్రం సభలో కుమారస్వామి విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. తీర్మానం వీగిపోయిందిలా.. ప్రత్యర్థి పార్టీల ఉచ్చులో పడకుండా ఇప్పటి దాకా ముంబై వంటి చోట్ల తమ ఎమ్మెల్యేలను రిసార్టులు, హోటళ్లలో బస ఏర్పాటు చేసిన అధికార, ప్రతిపక్షాలు మంగళవారం నాటి బలపరీక్షకు ప్రత్యేకంగా అసెంబ్లీకి బస్సుల్లో తరలించాయి. కాంగ్రెస్–జేడీఎస్లకు చెందిన 17 మంది, బీఎస్పీ సభ్యుడు ఒకరు, స్వతంత్రులు ఇద్దరు మొత్తం 20 మంది మంగళవారం సభకు గైర్హాజరయ్యారు. దీంతో సభలో సభ్యుల సంఖ్య 225 నుంచి 204(స్పీకర్ మినహా)కు తగ్గింది. మ్యాజిక్ ఫిగర్ 103 కాగా, తీర్మానానికి అనుకూలంగా 99 మంది, వ్యతిరేకంగా 105 మంది నిలిచారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో ఉద్వేగపూరితంగా ప్రసంగించిన అనంతరం ముఖ్యమంత్రి సభా కార్యకలాపాలను నిర్వేదంతో చూస్తూ తన స్థానంలో కూర్చుండిపోయారు. బీజేపీ సభ్యులు చర్చలో పాల్గొనలేదు. సర్కారు కూలిపోయినట్లు ప్రకటించగానే బీజేపీ ఎమ్మెల్యేల్లో ఆనందోత్సాహాలుపెల్లుబికాయి. బీజేపీ పక్ష నేత, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్పను అభినందించారు. సంతోషంగా త్యజిస్తున్నా: కుమారస్వామి బలపరీక్షకు ముందు సీఎం కుమారస్వామి సుదీర్ఘంగా ప్రసంగించారు. రెబల్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు కేటాయించిన నిధుల వివరాలను చదివి వినిపించారు. పలు అభివృద్ధి పనులు కేటాయించినా ప్రభుత్వంపై విశ్వాసం లేకుండా తిరుగుబాటు చేశారని వాపోయారు. అయితే కుమారస్వామి తనకు మూడు గంటల వ్యవధి ఇవ్వాలని కోరగా, త్వరగా ముగించాలని స్పీకర్ సూచించారు. సాయంత్రం 6 గంటలకు ఎట్టి పరిస్థితుల్లో బలపరీక్షను నిర్వహించాలని స్పీకర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ.. సీఎం పదవి ఎవరికీ శాశ్వతం కాదని, తాను అధికారం కోసం పాకులాడలేదన్నారు. సీఎం కుర్చీని సంతోషంగా వదిలివేస్తున్నట్లు తెలిపారు. బల పరీక్షను వాయిదాలు వేసి స్పీకర్ను నొప్పించినందుకు క్షమిం చాలని కోరారు. సభాపతిని అవమానించాలనే ఉద్దేశం తనకు లేదన్నారు. 10 రోజులుగా జరిగిన పరిణామాల గురించి చర్చించాల్సిన అవసరం లేదన్నారు. ‘మాకూ సిగ్గుంది. ఇంకా అధికారంలో కొన సాగలేం. అయినా మేం చేసిన తప్పేంటి? నిజాయతీతో ప్రజల అవసరాలు తీర్చేందుకు కృషిచేశాం. రాజీనామా తర్వాత నేను ఎక్కడికీ పారిపోను. నన్ను ఎందుకు తప్పించారో ప్రజలు కూడా తెలుసుకోవాలి. కుర్చీ శాశ్వతం కాదు’ అని అన్నారు. ‘మా ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ పదేపదే ప్రయత్నించింది. ఆ పార్టీ ప్రభుత్వం కూడా ఎక్కువ కాలం ఉండదు. అదే జరిగితే, ఎన్నికలకు వెళ్లడం ఉత్తమం’ అని అన్నారు. కుమారస్వామి రాజీనామా విశ్వాస పరీక్షలో ఓటమి అనంతరం సీఎం కుమారస్వామి రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ వజూభాయ్ వాలాను కలిసి రాజీనామా సమర్పించారు. ఆయన రాజీనామాను వెంటనే ఆమోదించిన గవర్నర్.. మరో ప్రభుత్వం ఏర్పడేవరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరారు. కాగా, బల పరీక్షలో కాంగ్రెస్కు మద్దతు ఇవ్వని బీఎస్పీ ఎమ్మెల్యే ఎన్.మహేశ్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు అధినేత్రి మాయావతి ప్రకటించారు. అపవిత్ర మైత్రికి చెల్లుచీటీ: యడ్యూరప్ప కర్ణాటకలో బీజేపీ నేతృత్వంలో ప్రజాప్రభుత్వం ఏర్పడనుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీలో బల పరీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత 14 నెలలుగా రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. కాంగ్రెస్–జేడీఎస్ నేతలు కమీషన్ల కోసం పని చేశారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ –జేడీఎస్ అపవిత్ర మైత్రికి కాలం చెల్లిపోయిందన్నారు. 2018 ఎన్నికల్లో 104 సీట్లు గెలుచుకున్న బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. అనంతరం ఉప ఎన్నికలో మరో సీటును గెలుచుకుని 105కు బలం పెంచుకుంది. గత ఏడాది మేలో విశ్వాస పరీక్ష ఎదుర్కోకుండానే యడ్యూరప్ప వైదొలగిన విషయం తెలిసిందే. అనంతరం కుమారస్వామి ఆధ్వర్యంలో కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వం ఏర్పాటయింది. స్పీకర్, నామినేటెడ్ సభ్యుడితో కలిపి 225 సభ్యులున్న అసెంబ్లీలో రెబెల్స్ రాజీనామాలకు ముందు కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వం బలం 117. ఇందులో స్పీకర్ కాకుండా కాంగ్రెస్ 78, జేడీఎస్ (37), బీఎస్పీ (1), నామినేటెడ్ (1)సభ్యులున్నారు. ప్రజాస్వామ్యం ఓడింది: రాహుల్ ‘ప్రజాస్వామ్యం, నిజాయితీ, రాష్ట్ర ప్రజల తీర్పు’ ఓడిపోయాయి అని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ‘సంక్షోభాలు సృష్టించిన వారి లక్ష్యం నేరు నెరవేరింది’ అని బీజేపీనుద్దేశించి అన్నారు. తదుపరి సీఎం యడ్యూరప్ప! న్యూఢిల్లీ : కర్ణాటకలో ప్రభుత్వం కూలిపోయిన నేపథ్యంలో తర్వాత ఏం చేయాలనేదానిపై బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తమ పార్టీ నేతలతో సమావేశమై చర్చలు జరిపారు. బీజేపీ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప తదుపరి సీఎం అవుతారనే ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో పార్టీ నాయకుడొకరు మాట్లాడుతూ, ‘సీఎం పదవిని చేపట్టేది యడ్యూరప్పేనన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే ప్రధాని మోదీ, అమిత్ షా తదితరులతో కూడిన పార్టీ అగ్రనాయకత్వం దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది’ అని చెప్పారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి, కర్ణాటకకే చెందిన ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ యడ్యూరప్పకే సీఎం అవకాశాలు అత్యధికంగా ఉన్నప్పటికీ, పార్టీ జాతీయ నాయకత్వం దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. మోదీ, షాతో మాట్లాడాక గవర్నర్ను కలుస్తాం: యడ్యూరప్ప పార్టీ కేంద్ర నాయకత్వంలోని మోదీ, అమిత్ షాతో సంప్రదింపులు జరిపిన అనంతరం తాము గవర్నర్ను కలుస్తామని యడ్యూరప్ప వెల్లడించారు. కుమారస్వామి ప్రభుత్వంతో ప్రజలు విసిగిపోయారనీ, వారి ప్రభుత్వం కూలిపోవడం ప్రజా విజయమని ఆయన అన్నారు. విశ్వాసపరీక్షలో బీజేపీ పక్షానే నిలిచిన 105 మంది బీజేపీ ఎమ్మెల్యేలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇకనుంచి అభివృద్ధిలో నవశకం మొదలవుతుందని పేర్కొన్నారు. 4 రాష్ట్రాల్లోనే.. న్యూఢిల్లీ: కాంగ్రెస్కు గడ్డు రోజులు కొనసాగుతున్నాయి. లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకుని, దేశవ్యాప్తంగా కేవలం 52 స్థానాల్లో గెలుపుతో చావుతప్పి కన్నులొట్టపోయిన చందంగా బయటపడిన ఆ పార్టీని కర్ణాటక పరిణామాలు మరో దెబ్బతీశాయి. సంకీర్ణ భాగస్వామి అయిన కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలడంతో కాంగ్రెస్ అధికారంలో ఉన్న మరో రాష్ట్రం ‘చే’జారింది. 2018లో కాంగ్రెస్– జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కర్ణాటకలోనూ అధికారాన్ని కోల్పోవడంతో ప్రస్తుతం ‘చేతి’లో నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతం మాత్రమే ఉన్నాయి. పంజాబ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్గఢ్, పుదుచ్చేరిల్లో మాత్రమే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. దక్షిణాదిలో అధికారం పంచుకుంటున్న ఏకైక రాష్ట్రాన్ని కూడా కోల్పోవాల్సి రావడం పార్టీకి దెబ్బగానే కాంగ్రెస్ సీనియర్ నేతలు భావిస్తున్నారు. ముచ్చటగా ముగ్గురే! ఐదేళ్లు పూర్తి చేసుకున్న సీఎంలు వీరే న్యూఢిల్లీ : కర్ణాటక చరిత్రలో ఐదేళ్ల పూర్తి కాలం కొనసాగిన ముఖ్యమంత్రులు ముగ్గురే. వారు కూడా కాంగ్రెస్ పార్టీ వారే కావడం గమనార్హం. ఎస్.నిజలింగప్ప (1962–68), డీ దేవరాజ ఉర్స్ (1972–77), సిద్దరామయ్య (2013–18) మాత్రమే విజయవంతంగా తమ పదవీకాలాన్ని ముగించగలిగారు. బీజేపీ నుంచి కానీ జేడీఎస్ నుంచి కానీ ఎవరూ ఐదేళ్లు సీఎంగా నిలవలేకపోయారు. గతంలో బీజేపీ సంకీర్ణంలో భాగంగా సీఎం పదవి చేపట్టిన కుమారస్వామి రెండేళ్లలోపే గద్దె దిగారు. ఫిబ్రవరి 2006 నుంచి అక్టోబర్ 2007 వరకు మాత్రమే అప్పుడు ఆయన సీఎంగా ఉన్నారు. అనంతరం కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని మరోసారి 2018 మే నెలలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కుమారస్వామి.. విశ్వాస పరీక్షలో ఓడిపోవడంతో 2019 జూలై 23న రాజీనామా చేశారు. బీజేపీ విషయానికి వస్తే.. 2007లో తొలిసారి సీఎం అయిన యడ్యూరప్ప జేడీఎస్ మద్దతు ఉపసంహరించుకోవడంతో వారం రోజులకే పదవీచ్యుతులయ్యారు. మరోసారి, 2018 మే 17 నుంచి 23 వరకే అధికారంలో కొనసాగి, మెజారిటీ లేకపోవడంతో రాజీనామా చేశారు. 1956లో కర్ణాటక రాష్ట్రం ఏర్పడింది. ఇప్పటివరకు 25 మంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు. సంక్షోభం సాగిందిలా.. 2019 జూలై 1: కుమారస్వామి సర్కార్తో విభేదాలతో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామా. జూలై 6: రాజీనామా చేసిన మరో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు జేడీఎస్ ఎమ్మెల్యేలు. మొత్తంగా 11 మంది ఎమ్మెల్యేల రాజీనామాలు అందాయని స్పీకర్ ప్రకటన. రెబెల్స్ అంతా విమానంలో ముంబైకి వెళ్లారు. జూలై 7: అమెరికా నుంచి తిరిగొచ్చిన కుమారస్వామి జూలై 8: మంత్రి పదవులకు రాజీనామా చేసిన ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు నగేశ్, శంకర్. బీజేపీకి మద్దతు. జూలై 9: 8 మంది ఎమ్మెల్యేల రాజీనామాలు సక్రమంగా లేవన్న స్పీకర్. సరైన ఫార్మాట్లో పంపాలని సూచన. సీఎల్పీ భేటీ. 20 మంది ఎమ్మెల్యేల డుమ్మా. మరో ఎమ్మెల్యే రోషన్ బేగ్ రాజీనామా. జూలై 10: ముంబైలో ఒక ఫైవ్ స్టార్ హోటల్లోని ముగ్గురు అసంతృప్త నేతల్ని బుజ్జగించడానికి కాంగ్రెస్ నేత శివకుమార్ రంగంలోకి దిగారు. ఎమ్మెల్యేలు ఆయనను కలవడానికి నిరాకరించి పోలీసుల సాయాన్ని అభ్యర్థించారు. మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంటీబీ నాగరాజ్, డాక్టర్ కె.సుధాకర్ రాజీనామా జూలై 11: స్పీకర్ తమ రాజీనామాలు చెల్లవని తోసిపుచ్చడాన్ని సవాల్ చేస్తూ సుప్రీం తలుపు తట్టిన రెబెల్ ఎమ్మెల్యేలు జూలై 17: రాజీనామాలపై తుది నిర్ణయం స్పీకర్దేనన్న సుప్రీంకోర్టు. దానికి నిర్దిష్ట సమయం అంటూ లేదని, సభకు హాజరు కావాలా వద్దా అన్నది రెబెల్ ఎమ్మెల్యేల ఇష్టమని స్పష్టీకరణ. తన రాజీనామాను వెనక్కి తీసుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి. జూలై 18: ఇదే రోజు కర్ణాటకలో సీఎం కుమారస్వామి తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉండేది. అయితే 15 మంది రెబెల్ ఎమ్మెల్యేలు సహా 21 మంది అసెంబ్లీకి గైర్హాజరయ్యారు. బీజేపీ తమ ఎమ్మెల్యేలను అపహరించిందంటూ సభలో కాంగ్రెస్–జేడీఎస్ కూటమి ఆరోపణలు. సభకు హాజరుకావడంపై ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ ఇస్తే, విప్ జారీ చేసి ఉపయోగం ఉండదని, దీనిపై స్పష్టత కావాలంటూ వాదించిన కాంగ్రెస్. విశ్వాసపరీక్ష జరగకుండా సభ వాయిదా వేయడంతో సభలోనే రాత్రంతా కూర్చొని బీజేపీ ఎమ్మెల్యేల నిరసన ప్రదర్శన జూలై 19: శుక్రవారం సభలో విశ్వాస పరీక్ష జరపాలని గవర్నర్ వజూభాయ్ రెండుసార్లు సీఎం కుమారస్వామికి లేఖలు రాశారు. అయినా సీఎం, స్పీకర్ ఆయన ఆదేశాలను పట్టించుకోలేదు. గందరగోళ పరిస్థితుల మధ్య సభ వాయిదా జూలై 22: సభలో బలాన్ని నిరూపించుకోవడానికి బుధవారం వరకూ స్పీకర్ని గడువు కోరిన కుమారస్వామి. నిరాకరించిన స్పీకర్. విశ్వాస పరీక్షపై కాలయాపన ఎవరికీ మంచిది కాదని హితవు. విశ్వాస తీర్మానం చర్చకు సంబంధించి ఎమ్మెల్యేల ప్రసంగాన్ని తగ్గించాలంటూ స్పీకర్ అసహనం. అధికార, విపక్ష సభ్యుల గందరగోళం మధ్యే సభ వాయిదా. జూలై 23: ఎట్టకేలకు బలపరీక్ష నిర్వహణ. కుప్పకూలిన కుమారస్వామి సర్కార్. గైర్హాజరైన 21 మంది ఎమ్మెల్యేలు. కుమారస్వామి ప్రభుత్వానికి అనుకూలంగా 99 ఓట్లు, వ్యతిరేకంగా 105 ఓట్లు. సభలో బలాబలాలు మొత్తం సభ్యులు (1 నామినేటెడ్ సహా) 225 సభకు హాజరైనవారు (స్పీకర్తో) 205 మ్యాజిక్ ఫిగర్ 103 విశ్వాసానికి అనుకూలంగా 99 విశ్వాసానికి వ్యతిరేకంగా 105 హాజరుకాని వారు 20 -
కర్ణాటక నూతన సీఎంగా యడ్యూరప్ప!
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోవడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మరికాసేట్లో బీజేపీ శాసనసభ పక్షనేత, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప గవర్నర్ను కలవనున్నారు. ప్రస్తుతం బీజేపీకి 105 మంది సభ్యులున్న విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా యడ్యూరప్ప గవర్నర్ను కోరే అవకాశం ఉంది. కాగా అసెంబ్లీలో బలపరీక్ష అనంతరం సభలోనే బీజేపీ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తూ.. తర్వాతి ప్రభుత్వం తమదేనని సంకేతమినిచ్చారు. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. యడ్యూరప్ప మరోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. బల పరీక్షలో కుమారస్వామి ఓటమి అనంతరం.. యడ్యూరప్ప స్పందించారు. ఇది కర్ణాటక ప్రజల విజయమన్నారు. కన్నడ ప్రజలను అభివృద్ధి పథం వైపు నడిపిస్తామని అన్నారు. రాష్ట్రానికి పట్టిన శని వదిలిందని, 105 మంది సభ్యులతో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. జేడీఎస్- కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసిగిపోయారని చెప్పుకొచ్చారు. సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలడంతో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. మరోవైపు ప్రభుత్వం కూలిపోవడంతో తన ముఖ్యమంత్రి పదవికి కుమారస్వామి రాజీనామా చేశారు. విశ్వాస పరీక్ష అనంతరం గవర్నర్ను కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. అయితే రెబల్ ఎమ్మెల్యేలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇంకా తేలాల్సిఉంది. -
అయ్యో ‘కుమార’ కూల్చేశారా
సాక్షి, బెంగళూరు: దేశమంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన కర్ణాటక సంక్షోభం ముగిసింది. ప్రభుత్వాన్ని కూల్చడానికి ఓ పార్టీ, కాపాడుకోడానికి మరో పార్టీ రచించిన వ్యూహాలన్నీంటికి నేటితో తెరపడింది. బీజేపీ అనుకున్నట్లుగానే విశ్వాస పరీక్షలో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం కుప్పకూలింది. కుమారుస్వామి ప్రభుత్వానికి మెజార్టీ సభ్యుల మద్దతు లేకపోవడంతో విశ్వాస పరీక్షలో ప్రభుత్వం పడిపోయినట్లు స్పీకర్ రమేష్ కుమార్ ప్రకటించారు. సీఎం కుమారస్వామి ఉద్వేగ ప్రసంగం అనంతరం.. స్పీకర్ రమేష్ కుమార్ బలపరీక్ష నిర్వహించారు. మెజార్టీకి కావాల్సిన సంఖ్యాబలం 103 కాగా. రెబల్స్ తిరుగుబాటుతో మైనార్టీలో పడిపోయిన కాంగ్రెస్-జేడీఎస్ సభ్యుల సంఖ్య 99కి పడిపోయింది. మరోవైపు బీజేపీ సభ్యులు 105 మంది సభకు హాజరయ్యారు. ఓటింగ్ జరిగిన సమయంలో సభలో మొత్తం 204 మంది సభ్యులున్నారు. తొలుత ఎవరికి కేటాయించిన స్థానాల్లో వారు కూర్చోవాలని స్పీకర్ ఆదేశించడంతో వారు ఆశీనులయ్యారు. ఓటింగ్ ముగిసే వరకు అసెంబ్లీ తలుపులను పూర్తిగా మూసివేశారు. అనంతరం డివిజన్ పద్దతిలో ఓటింగ్ నిర్వహించారు. అనంతరం విశ్వాస పరీక్షలో ప్రభుత్వ ఓడినట్లు స్పీకర్ ప్రకటించారు. దీంతో 14 నెలల సంకీర్ణ ప్రభుత్వ పాలన నేటితో ముగిసింది. మరోవైరు సభకు గైర్హాజరు అయిన వారిలో 15 మంది రెబల్స్, ఓ స్వతంత్ర ఎమ్మెల్యే ఉన్నారు. అనారోగ్యంతో ఇద్దరు కాంగ్రెస్ సభ్యులు సభకు హాజరుకాలేదు. దీంతో జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. అంతకుమందు విశ్వాస పరీక్షపై సీఎం కుమార స్వామి భావోద్వేగంగా మాట్లాడారు. తాను అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చానని, సీఎంగా కన్నడ ప్రజలకు ఎంతో చేశానని ఉద్వేగంగా మాట్లాడారు. త్వరలో కుమారస్వామి గవర్నర్ను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించనున్నారు. బెంగళూరులో 144 సెక్షన్ సంకీర్ణ ప్రభుత్వం పడిపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా జేడీఎస్-కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. బీజేపీకి వ్యతిరేంగా నినాదాలు చేస్తూ.. పలు ప్రాంతాల్లో ధర్నాలు చేపట్టారు. రాజధాని ప్రాంతం బెంగళూరులో 144 సెక్షన్ అమలు చేశారు. దీంతో పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా భద్రతను కుట్టుదిట్టం చేశారు. సున్నితమైన ప్రాంతాల్లో రెండు రోజులపాటు బార్ షాపులను మూసివేయాలని ఆదేశాలు జారీచేశారు. -
కర్ణాటకం: నా రక్తం మరిగిపోతోంది: స్పీకర్
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజకీయ సంక్షోభం చివరి దశకు చేరుకుంది. మరికొద్ది సేపట్లో స్పీకర్ అసెంబ్లీలో విశ్వాసపరీక్ష నిర్వహించనున్నారు. సభలో చర్చలో భాగంగా స్పీకర్ రమేష్ కుమార్ భావోద్వేగ ప్రసంగం చేశారు. గత కొన్ని రోజులుగా సభలో జరిగే పరిణామాలన్నింటితో తన రక్తం మరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సభ్యులు కనీస సంప్రదాయలు పాటించకుండా స్పీకర్ పదవిలో ఉన్న తనను అనేక ఇబ్బందులకు గురిచేశారని అన్నారు. రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవికి తాను పూర్తిగా న్యాయం చేసినట్లు భావిస్తున్నానని చెప్పారు. రాజ్యాంగ ప్రమాణాల మేరకు సభను నిర్వహించానన్నారు. సభలో జరగబోయే పరిణామాలను తాము ముందే ఊహించి.. తన రాజీనామా పత్రాన్ని జేబులో పెట్టుకుని తిరుగుతున్నట్లు వెల్లడించారు. తానేంటో ప్రపంచానికి తెలుసని వ్యాఖ్యానించారు. కాగా సభలో సీఎం కుమార స్వామి ఉద్వేగభరితంగా ప్రసంగించారు. ఓటింగ్కు తాము సిద్ధమేని...కానీ డివిజన్ పద్దతిలో ఓటింగ్ జరపాలని స్పీకర్ని కోరారు. దానికి స్పీకర్ నిరాకరించారు. -
నన్ను క్షమించండి: కుమారస్వామి
సాక్షి, బెంగళూరు: ఉత్కంఠ పరిణామాల నడుమ కర్ణాటక రాజకీయం తుదిదశకు చేరుకుంది. విశ్వాస పరీక్షపై సభ్యులంతా ప్రసంగించిన అనంతరం.. చివరగా సీఎం కుమారస్వామి మాట్లాడారు. విశ్వాసపరీక్షపై సీఎం ఉద్వేగంగా ప్రసంగించారు. కన్నడ ప్రజలకు తన పాలనలో ఎన్నో మంచి పనులు చేశానని, ఏమైనా తప్పులు చేసి ఉంటే తనను క్షమించాలని ప్రజలను కోరారు. అనుకోకుండా తాను రాజకీయాల్లోకి వచ్చానని.. పాలనలో పొరపాటున కొన్ని తప్పులు కూడా చేశానని అన్నారు. సభలో ఆయన మాట్లాడుతూ.. కన్నడ సంక్షోభంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అందరి సభ్యుల అభిప్రాయం తీసుకోవడం కోసం.. విశ్వాస పరీక్ష కొంత ఆలస్యమయినట్లు సభలో ఒప్పుకున్నారు. సంకీర్ణాన్ని భాజపా ఎలా అస్థిరపరిచిందో సభలో వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రభుత్వానికి సరైన సంఖ్యాబలం లేకపోవడంతో ప్రసంగం అనంతరం రాజీనామా చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. ప్రస్తుతం సభలో ఆయన ప్రసంగం కొనసాగుతోంది. ఆయన మాట్లాడిన వెంటనే స్పీకర్ విశ్వాస పరీక్షను చేపట్టనున్నారు. కుమార స్వామి ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉండటంతో రాష్ట్ర వ్యాప్తంగా జేడీఎస్-కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. బీజేపీకి వ్యతిరేంగా నినాదాలు చేస్తూ.. పలు ప్రాంతాల్లో ధర్నాలు చేపడుతున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు భద్రతను కుట్టుదిట్టం చేశారు. సున్నితమైన ప్రాంతాల్లో బార్ షాపులను మూసేశారు రాజధాని ప్రాంతం బెంగళూరులో 144 సెక్షన్ అమలు చేశారు. సభలో మెజార్టీకి కావాల్సిన సంఖ్యాబలం 103 కాగా. సభకు హాజరయిన బీజేపీ సభ్యులు 105 మంది ఉన్నారు. మరోవైరు రెబల్స్తో మైనార్టీలో పడిపోయిన కాంగ్రెస్-జేడీఎస్ సభ్యుల సంఖ్య 101 మాత్రమే. స్పీకర్, నామినేటేడ్ సభ్యులను మినహాయిస్తే అధికారపక్షం బలం 99కి పడిపోతుంది. సభకు గైర్హాజరు అయిన వారిలో 15 మంది రెబల్స్, ఓ స్వతంత్ర ఎమ్మెల్యే ఉన్నారు. అనారోగ్యంతో ఇద్దరు కాంగ్రెస్ సభ్యులు సభకు హాజరుకాలేదు -
కర్ణాటకం: ఒక్కో ఎమ్మెల్యేకి 25 నుంచి 50 కోట్లా?
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజకీయ సంక్షోభంపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిద్దరామయ్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీకి మద్దతు తెలుపుతూ రెబల్ ఎమ్మెల్యేలు రాజకీయ విలువలను సమాధి చేశారని అన్నారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ, 25 కోట్ల నుంచి 50 కోట్ల వరకు బీజేపీ నేతలు వెచ్చించారని, ఆ డబ్బాంతా ఎక్కడి నుంచి తెస్తున్నారని ప్రశ్నించారు. రాజకీయాలను భ్రష్టు పట్టించే విధంగా పార్టీకి వెన్నుపోటు పొడిచిన తిరుగుబాటు దారులపై అనర్హత వేటు వేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా దేశ వ్యాప్తంగా ఉత్కంఠగా మారిన కర్ణాటక రాజకీయం చివరిదశకు చేరుకున్న విషయం తెలిసిందే. అసెంబ్లీ ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రసంగం అనంతరం విశ్వాసపరీక్ష నిర్వహిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. సభలో మెజార్టీకి కావాల్సిన సంఖ్యాబలం 103 కాగా. సభకు హాజరయిన బీజేపీ సభ్యులు 105 మంది ఉన్నారు. మరోవైరు రెబల్స్తో మైనార్టీలో పడిపోయిన కాంగ్రెస్-జేడీఎస్ సభ్యుల సంఖ్య 101 మాత్రమే. స్పీకర్, నామినేటేడ్ సభ్యులను మినహాయిస్తే అధికారపక్షం బలం 99కి పడిపోతుంది. సభకు గైర్హాజరు అయిన వారిలో 15 మంది రెబల్స్, ఓ స్వతంత్ర ఎమ్మెల్యే ఉన్నారు. అనారోగ్యంతో ఇద్దరు కాంగ్రెస్ సభ్యులు సభకు హాజరుకాలేదు. స్పీకర్ విశ్వాస పరీక్ష చేపడితే కుమారస్వామి ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉంది. దీంతో రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు. రాజధాని బెంగళూరులో పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేసినట్లు తెలిసింది. -
ఒక్కరోజు ఆగితే తిరుగులేదు
కర్ణాటక,శివాజీనగర: బల పరీక్ష నిరూపణ ప్రక్రియను మంగళవారం కూడా వాయిదా పడేటట్లు చూసుకోవాలి, బుధవారం నుంచి అదృష్టమే మారిపోతుంది అని జ్యోతిష్యులు ముఖ్యమంత్రి హెచ్.డీ.కుమారస్వామికి సూచించినట్లు వదంతులు విహరించాయి. జ్యోతిష్యుల సలహా ప్రకారమే కుమారస్వామి విశ్వాస పరీక్షను వాయిదా వేస్తున్నారని సమాచారం. ఆయన జ్యోతిష్యాన్ని గట్టిగా నమ్ముతారన్నది తెలిసిందే. మంగళవారం కూడా బలపరీక్ష జరగకుండా ఉంటే, బుధవారం నుంచి గ్రహబలం అనుకూలిస్తుందని కొందరు జ్యోతిష్యులు చెప్పినట్లు సమాచారం. అందుకే ఆయన పదేపదే స్పీకర్ను కలిసి వాయిదాకు గడువు కోరడంతో పాటు గవర్నర్ ఆదేశాలనూ పక్కనపెడుతూ వచ్చారు. -
నేడే బల నిరూపణ!
సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ‘విధానసౌధ’లో సోమవారం హైడ్రామా నెలకొంది. విశ్వాసపరీక్షను చేపట్టేందుకు తమకు బుధవారం వరకూ గడువు ఇవ్వాలని ముఖ్యమంత్రి కుమారస్వామి స్పీకర్ను కోరారు. ఈ మేరకు ఆయన స్పీకర్ రమేశ్ కుమార్ ఛాంబర్కు వెళ్లి విజ్ఞప్తి చేశారు. అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ సోమవారం విశ్వాసపరీక్షపై ఓటింగ్ జరగాల్సిందేనని స్పీకర్ రమేశ్ కుమార్ స్పష్టం చేశారు. ‘ఇప్పటికే పలుమార్లు గడువు ఇచ్చాం. మళ్లీ ఇవ్వాలంటే కుదరదు. నా పరిస్థితిని కూడా మీరు అర్థం చేసుకోవాలి. నేడు విశ్వాస పరీక్ష నిర్వహించాల్సిందే’ అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తమకు న్యాయం చేయాలంటూ కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగడంతో అసెంబ్లీ రెండుసార్లు వాయిదాపడింది. చివరికి స్పీకర్ రమేశ్ కుమార్ అసెంబ్లీని మంగళవారానికి వాయిదా వేశారు. మంగళవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ప్రారంభమవుతుందనీ, బలపరీక్షను సాయంత్రం 4 గంటలకు నిర్వహిస్తామని ప్రకటించారు. సాయంత్రం 6గంటల్లోపు ఈ ప్రక్రియ మొత్తం పూర్తైపోతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్–జేడీఎస్ సభ్యుల ఆందోళన.. విధానసౌధ సోమవారం గంట ఆలస్యంగా ప్రారంభం కాగానే బీజేపీ సభ్యుడు మధుస్వామి మాట్లాడుతూ.. నేడు ఎలాగైనా విశ్వాసపరీక్షపై ఓటింగ్ నిర్వహించాలని స్పీకర్ను కోరారు. ‘విశ్వాసపరీక్షపై చర్చను సోమవారం నాటికి ముగించి బలపరీక్షను చేపడతామని సీఎం కుమారస్వామి, సీఎల్పీ నేత సిద్దరామయ్య అసెంబ్లీలో చెప్పారు. వారి మాటలను మేం నమ్మాం. మీ(స్పీకర్) ఆదేశాలను గౌరవించాం. కాబట్టి విశ్వాసపరీక్షపై ఇక ఎంతమాత్రం ఆలస్యం చేయొద్దు’ అని మధుస్వామి కోరారు. అనంతరం కాంగ్రెస్ నేత, మంత్రి బైరె గౌడ స్పందిస్తూ.. ‘విశ్వాసపరీక్షను బుధవారానికి వాయిదా వేయాల్సిందిగా స్పీకర్ను కోరుతున్నా. రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై ఓ నిర్ణయం తీసుకోకుండా బలపరీక్ష చేపడితే సభ పవిత్రతే దెబ్బతింటుంది. ఎమ్మెల్యేలు చేసిన రాజీనామాలు స్వచ్ఛందమా? ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం కాదా? దేశంలో ప్రతిపక్షాన్ని ఓ ప్రణాళికతో బీజేపీ నిర్మూలిస్తోంది. ప్రస్తుతం దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోంది. ప్రజాస్వామ్యపు రక్త బీజేపీ చేతులకు అంటుకుంది’ అని ఘాటుగా విమర్శించారు. అయితే చర్చ ముగిసినవెంటనే బలపరీక్ష చేపడతామని స్పీకర్ రమేశ్ ప్రకటించడంతో కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు ‘మాకు న్యాయం కావాలి’ ‘విశ్వాస పరీక్షపై పూర్తిస్థాయిలో చర్చ జరగాలి’ అంటూ సభలో ఆందోళనకు దిగారు. సీఎం రాజీనామాకు బీజేపీ డిమాండ్.. సీఎం కుమారస్వామి వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ సోమవారం డిమాండ్ చేసింది. సోమవారం ఫేస్బుక్లో బీజేపీ స్పందిస్తూ..‘కుమారస్వామికి నిజంగా కర్ణాటక ప్రజలపై, భారత రాజ్యాంగంపై నమ్మకముంటే వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోవాలి’ అని పోస్ట్ చేసింది. కర్ణాటక ప్రజలు కుమారస్వామిని క్షమించబోరని స్పష్టం చేసింది. కాగా, సీఎం పదవిని త్యాగం చేసేందుకు సీఎం కుమారస్వామి ఒప్పుకున్నా, జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ గుర్రుగా ఉన్నట్లు సమాచారం. సీఎం పదవిని వీడరాదని దేవెగౌడ ఆయనకు సూచించినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. మరోవైపు కుమారస్వామి రాజీనామా చేశారంటూ ఓ లేఖ సోషల్మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. అయితే ఇది నకిలీ లేఖ అని జేడీఎస్ వర్గాలు స్పష్టం చేశాయి. రాజీనామా విషయాన్ని ఖండించిన సీఎం కుమారస్వామి, ఈ వ్యవహారంపై విచారణ జరపాలని పోలీసులను ఆదేశించారు. స్వతంత్రులకు సుప్రీంలో నిరాశ.. కర్ణాటక స్వతంత్ర ఎమ్మెల్యేలు ఆర్.శంకర్, హెచ్.నగేశ్లకు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. సోమవారం సాయంత్రం 5 గంటల్లోపు అసెంబ్లీలో విశ్వాసపరీక్షను నిర్వహించేలా ఆదేశాలు జారీచేయాలని వీరిద్దరు దాఖలుచేసిన పిటిషన్ను తక్షణం విచారించేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. స్వతంత్రుల తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ మాట్లాడుతూ..‘కర్ణాటకలో బలపరీక్షను ఏదో ఒక కారణం చెప్పి వాయిదా వేస్తున్నారు. కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయినా అధికారంలో కొనసాగుతోంది. అసెంబ్లీలో విశ్వాసపరీక్షను చేపట్టేలా ఆదేశించండి’ అని కోరారు. దీంతో సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ అనిరుద్ధ బోస్ల ధర్మాసనం స్పందిస్తూ..‘అసాధ్యం. మేం ఇంతకుముందెప్పుడు ఇలా చేయలేదు. ఈ పిటిషన్ను మంగళవారం పరిశీలిస్తాం’ అని స్పష్టం చేసింది. అర్ధరాత్రయినా అసెంబ్లీలోనే ఉంటాం: యడ్యూరప్ప కర్ణాటక అసెంబ్లీని వాయిదావేస్తామంటే ఒప్పుకోబోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత బీఎస్ యడ్యూరప్ప తెలిపారు. ‘సీఎం కుమారస్వామి, సీఎల్పీ నేత సిద్దరామయ్య ఇచ్చినమాట మేరకు సోమవారం విశ్వాసపరీక్ష నిర్వహించాలి. ఇందుకోసం అర్ధరాత్రివరకైనా వేచిఉంటాం. అంతేతప్ప సభను వాయిదా వేస్తామంటే ఒప్పుకోం. విశ్వాసపరీక్ష సమయాన్ని ఇప్పటికే రెండు సార్లు మార్చారు. ఒకవేళ మాకు అసెంబ్లీలో న్యాయం జరగకుంటే గవర్నర్ వజూభాయ్వాలాతో భేటీ అవుతాం. బలపరీక్షపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు’ అని యడ్యూరప్ప స్పష్టం చేశారు. బలిపశువును చేయొద్దు: స్పీకర్ అధికార పక్ష సభ్యుల ఆందోళనతో స్పీకర్ రమేశ్ సహనం కోల్పోయారు. ‘ప్రతీఒక్కరూ మనల్ని గమనిస్తున్నారు. ఇలాంటి చర్యలు సభకు ఎంతమాత్రం శోభనివ్వవు. మనం ప్రజాజీవితంలో ఉన్నాం. చర్చల పేరుతో సమయాన్ని వృధా చేస్తున్నామన్న అభిప్రాయం ఏర్పడితే అది నాతో పాటు ఎవ్వరికీ మంచిది కాదు. ఈ వ్యవహారంలో నన్ను బలిపశువును చేయవద్దు. చర్చను వీలైనంత త్వరగా ముగించి బలపరీక్షను చేపడతాం’ అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సీఎల్పీ నేత సిద్దరామయ్య మాట్లాడుతూ.. విప్ల జారీవిషయంలో సుప్రీంకోర్టు జూలై 17న ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా రూలింగ్ ఇవ్వాలని కోరారు. రెబెల్ ఎమ్మెల్యేలు ఈ తీర్పును బూచీగా చూపి విశ్వాసపరీక్షకు గైర్హాజరవుతారని చెప్పారు. దీంతో స్పీకర్ రమేశ్ కుమార్ స్పందిస్తూ..‘విప్ జారీచేయడం అన్నది రాజకీయ పార్టీల హక్కు. వాటిని పాటించడం, పాటించకపోవడం అన్నది ఎమ్మెల్యేల ఇష్టం. ఒకవేళ ఎవరైనా ఎమ్మెల్యే విప్ను పాటించలేదని నాకు ఫిర్యాదు అందితే, నిబంధనల మేరకు పరిశీలించి నిర్ణయం తీసుకుంటాను’ అని స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు తనను కలుసుకోవాల్సిందిగా రెబెల్ ఎమ్మెల్యేలను ఆదేశించినట్లు చెప్పారు. -
కర్ణాటకం : రాజీనామాకు సిద్ధమైన సీఎం
బెంగళూర్ : కర్ణాటకలో రాజకీయం నిమిషానికో మలుపు తిరుగుతోంది. ముఖ్యమంత్రి కుమారస్వామి రాజీనామాకు సిద్ధమయ్యారు. రాజీనామా లేఖను అసెంబ్లీలో చూపించారు. బలపరీక్షకు ముందే కుమారాస్వామి రాజీనామాను ప్రకటించనున్నారు. సంకీర్ణ సర్కార్ భవితవ్యం తేల్చే విశ్వాస పరీక్షకు డెడ్లైన్లు మారుతూనే ఉన్నాయి. బలపరీక్ష గడువు పెంచాలన్న జేడీఎస్-కాంగ్రెస్ నేతల అభ్యర్ధనను స్పీకర్ ఆర్ రమేష్ కుమార్ తోసిపుచ్చారు. సోమవారం రాత్రి 9 గంటల వరకూ బలపరీక్షకు సమయం ఇచ్చిన స్పీకర్ ఇక వాయిదాలకు ఆస్కారం లేదని సంకీర్ణ నేతలకు స్పష్టం చేశారు. బలపరీక్షను వాయిదా వేయాలని ఒత్తిడి పెంచితే తానే రాజీనామా చేస్తానని ఆయన తేల్చిచెప్పారు. తాను చెప్పినట్టు బలపరీక్ష చేపట్టాల్సిందేనని కుండబద్దలు కొట్టారు. సుప్రీం కోర్టులో పిటిషన్లు పెండింగ్లో ఉన్నందున బలపరీక్షను రేపటికి వాయిదా వేయాలని కోరిన జేడీఎస్ వినతిని ఆయన అంగీకరించలేదు. బలపరీక్షపై గందరగోళంతో సభ వాయిదా పడటంతో విరామ సమయంలో స్పీకర్తో బీజేపీ సభ్యులు భేటీ అయ్యారు. ఎట్టిపరిస్థితుల్లో ఈరోజే బలపరీక్ష నిర్వహించాలని వారు పట్టుబట్టారు. బలపరీక్షకు తాను సిద్ధమని స్పీకర్ వారితో స్పష్టం చేశారు. -
క్లైమాక్స్కు చేరిన కన్నడ రాజకీయాలు
సాక్షి, బెంగళూరు : విశ్వాస తీర్మానంపై మరికాసేపట్లో ఓటింగ్ జరగనుండగా కన్నడ రాజకీయం కీలక ఘట్టానికి చేరింది. గంట గంటకి ఆసక్తికర మలుపులు తిరుగుతోన్న ‘కర్నాటకం’లో తాజాగా ముఖ్యమంత్రి కుమారస్వామి మరోసారి స్పీకర్ రమేశ్కుమార్ను కలిశారు. బలపరీక్షకు సిద్ధంగా కావాలని స్పీకర్ సూచించగా, మరోవైపు సీఎం తనకుఓటింగ్కు మరి కొంత సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే స్పీకర్ మాత్రం బలపరీక్ష ప్రక్రియ ఇవాళే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. మరోవైపు ఓటింగ్కు ముందే ముఖ్యమంత్రి కుమారస్వామి రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది. రాత్రి ఏడు గంటలకు కుమారస్వామి గవర్నర్ వాజుభాయ్ వాలా అప్పాయింట్ మెంట్ కోరారని వార్తలు రాగా.. అయితే ఆ వార్తలను సీఎంవో కార్యాలయ వర్గాలు ఖండించాయి. చదవండి: బలపరీక్షకు ముందే కుమారస్వామి రాజీనామా..? సభ 10 నిమిషాలు వాయిదా అటు విశ్వాస తీర్మానంపై విధానసభలో చర్చ సందర్భంగా సభలో గందరగోళం నెలకొంది. చర్చను సాగదీయకుండా త్వరగా ముగించాలని స్పీకర్ సభ్యులను కోరారు. ప్రతి ఎమ్మెల్యే 10 నిమిషాలు మాత్రమే మాట్లాడాలని సూచించారు. అయితే బలపరీక్ష తక్షణమే నిర్వహించాలంటూ బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగటంతో స్పీకర్ సభను 10నిమిషాల పాటు వాయిదా వేశారు. మరోవైపు విశ్వాస పరీక్ష వద్దని కాంగ్రెస్ పట్టుబడుతోంది. కాగా 15మంది కాంగ్రెస్ జేడీఎస్ ఎమ్మెల్యేల రాజీనామా, ఇద్దరు స్వతంత్రుల మద్దతు ఉపసంహరణతో కుమారస్వామిప్రభుత్వం మైనార్టీలో పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సంకీర్ణ సర్కార్కి స్పీకర్ సహా 102మంది సభ్యుల బలముంది. ఇద్దరు స్వతంత్రుల మద్దతుతో బీజేపీ బలం 107కు పెరిగింది. సభలో బలపరీక్ష గట్టెక్కాలంటే 105మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేయాలి. ఇప్పటికే 15మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా.. రాజీనామా చేయకున్నా మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బలపరీక్షకు దూరంగా ఉంటున్నారు. జేడీఎస్కి మద్దతిస్తున్న బీఎస్పీ ఎమ్మెల్యే మహేష్ కూడా సభకు గైర్హాజరయ్యారు. కాబట్టి బలపరీక్షపై ఓటింగ్ జరిగితే, కుమారస్వామి సర్కార్ కూలి కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ సర్కార్కి ఇక కాలం చెల్లినట్టే భావించాలి. బలపరీక్షపై ఓటింగ్ జరిగితే ప్రభుత్వం కూలిపోవడం తప్పనిసరి. ఒకవేళ అదే జరిగితే 107మంది సభ్యుల బలంతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం లేకుంటే రాజకీయ సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో గవర్నర్... రాష్ట్రపతి పాలనకు ఆదేశాలు ఇవ్వవచ్చు. కాగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 ప్రకారం ఏదైనా రాష్ట్రంలో సంక్షోభ పరిస్థితులు నెలకొంటే రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రానికి గవర్నర్ సిఫార్సు చేయవచ్చు. ఇప్పటివరకూ కర్ణాటకలో ఐదుసార్లు రాష్ట్రపతి పాలన విధించారు. -
క్లైమాక్స్కు చేరిన కర్ణాటక రాజకీయం
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజకీయ సంక్షోభం నేటితో ముగిసేలా కనిపిస్తోంది. విధానసౌధలో విశ్వాసపరీక్ష ప్రక్రియను సోమవారం రోజు సాయంత్ర 6 గంటలకు ముగిస్తాననీ, ఇకపై ఎంతమాత్రం ఆలస్యం చేయబోనని స్పీకర్ రమేశ్కుమార్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో నేడు జరగనున్న అసెంబ్లీ సమావేశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అంతకుముందు స్పీకర్తో సీఎం కుమారస్వామి భేటీ అయ్యారు, విశ్వాస పరీక్షకు మరింత సమయం ఇవ్వాలని కోరారు. దీనికి నిరాకరించిన స్పీకర్ నేడు తప్పనిసరిగా బల పరీక్ష నిర్వహించాల్సిందే అని స్పష్టం చేశారు. అయితే సోమవారం రెబల్స్ ఎమ్మెల్యేపై స్పీకర్ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. రేపటి లోగా వారంత తన ముందు హాజరుకావాలని 16 మంది సభ్యులకు సమన్లు జారీచేశారు. జేడీఎస్, కాంగ్రెస్ నేతలు రెబల్స్పై అనర్హత వేటు వేయాలని స్వీకర్కు చెప్పడంతో ఆయన సమన్లు జారీచేసినట్లు తెలుస్తోంది. అయితే విశ్వాస పరీక్షపై చర్చ పూర్తయిన వెంటనే బలపరీక్ష ప్రక్రియను చేపట్టే అవకాశం ఉంది. దీంతో కర్ణాటక రాజకీయ సంక్షోభానికి నేడో, రేపో తెరపడే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు తమ రాజీనామాలను ఆమోదించాలంటూ స్వతంత్ర ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం తోసిపుచ్చింది. పిటిషన్ను అత్యవసరంగా విచారణ చేపట్టాలన్న వారి అభ్యర్థనకు ధర్మాసనం నిరాకరించింది. విశ్వాస పరీక్షలో తాము జోక్యం చేసుకోలేని స్పష్టం చేస్తూ.. ఇవాళే బలపరీక్ష చేపట్టాలని తాము స్వీకర్కు ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీం తేల్చిచెప్పింది. స్వతంత్ర ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషిన్ను రేపు విచారిస్తామని తెలిపింది. ‘ప్రభుత్వం మైనారిటీలో పడిపోయినప్పటికీ కర్ణాటక అసెంబ్లీలో విశ్వాసపరీక్షను నిర్వహించడం లేదు. ఈ విషయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు తన అసాధారణ అధికారాలను ఉపయోగించి సోమవారం సాయంత్రం 5 గంటల్లోగా మెజారిటీని నిరూపించుకునేలా సీఎం కుమారస్వామిని ఆదేశించాలి’ అని పిటిషన్ దాఖలుచేసిన విషయం తెలిసిందే. కాగా విశ్వాస పరీక్షపై గవర్నర్ ఇప్పటికే రెండు సార్లు స్పీకర్ను లేఖ రాయగా.. వాటిని రమేష్ కుమార్ ధిక్కరించారు. దీంతో బలనిరూపణపై స్పీకర్ తీసుకునే నిర్ణయం కీలకంకానుంది. -
కర్నాటకంలో కాంగ్రెస్ సీఎం!
బెంగళూరు/ముంబై/న్యూఢిల్లీ: విశ్వాస పరీక్షకు ఒక్కరోజు ముందు కర్ణాటకలో రాజకీయం అనూహ్య మలుపు తిరిగింది. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు అవసరమైతే ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకునేందుకు కుమారస్వామి సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, మంత్రి డి.కె.శివకుమార్ తెలిపారు. సీఎం కుమారస్వామి, ఆయన సోదరుడు రేవణ్ణ తీరునచ్చకే తాము రాజీనామా చేస్తున్నామని పలువురు రెబెల్ ఎమ్మెల్యేలు చెప్పిన నేపథ్యంలో శివకుమార్ ఈ ప్రకటన చేశారు. బెంగళూరులో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు నాతో పాటు డిప్యూటీ సీఎం పరమేశ్వర, సీఎల్పీ నేత సిద్దరామయ్యల్లో ఎవరు ముఖ్యమంత్రి పదవిని చేపట్టినా తమకు అభ్యంతరం లేదని జేడీఎస్ నేతలు చెప్పారు. మా ముగ్గురిలో ఒకరిని ఎంపిక చేసే బాధ్యతను కాంగ్రెస్ అధిష్టానికి అప్పగించారు’ అని చెప్పారు. విధానసౌధలో విశ్వాసపరీక్ష ప్రక్రియను సోమవారంతో ముగిస్తాననీ, ఇకపై ఎంతమాత్రం ఆలస్యం చేయబోనని స్పీకర్ రమేశ్కుమార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు జరగనున్న అసెంబ్లీ సమావేశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వెనక్కితగ్గే ప్రసక్తే లేదు: రెబెల్స్ ముంబైలోని రినైసెన్స్ హోటల్లో ఉంటున్న రెబెల్ ఎమ్మెల్యేలు శివకుమార్ ప్రతిపాదనను నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. ఈ మేరకు రెబెల్ ఎమ్మెల్యేలు ఆదివారం ఓ వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా సిద్దరామయ్య అనుచరుడు, ఎమ్మెల్యే బైరాతి బసవరాజ్ మాట్లాడుతూ..‘‘సంకీర్ణ ప్రభుత్వంలో మా ఆత్మగౌరవం దెబ్బతింది. కాబట్టి ఇప్పుడు సిద్దరామయ్యను సీఎం చేసినా మేం రాజీనామాలను వెనక్కు తీసుకునే ప్రసక్తే లేదు. మమ్మల్ని ఎవ్వరూ నిర్బంధించలేదు. ఇష్టపూర్వకంగానే ఇక్కడ ఉంటున్నాం. మేం డబ్బు లేదా వేరేవాటి కోసం ఇక్కడకు రాలేదు. కుమారస్వామి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకే వచ్చాం. పరిస్థితులు సద్దుమణిగాక బెంగళూరుకు తిరిగివెళ్లిపోతాం’ అని తెలిపారు. కలవరపెట్టిన బీఎస్పీ ఎమ్మెల్యే.. విశ్వాస పరీక్షకు ఒక్కరోజు ముందు బీఎస్పీ ఎమ్మెల్యే ఎన్.మహేశ్ సంకీర్ణ ప్రభుత్వానికి చెమటలు పట్టించారు. సోమవారం జరిగే విశ్వాసపరీక్షకు వెళ్లొద్దని పార్టీ అధినేత్రి మాయావతి తనను ఆదేశించారని మహేశ్ తెలిపారు. ఇది జరిగిన కొద్దిసేపటికే స్పందించిన మాయావతి, కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వానికి ఓటేయాల్సిందిగా ఆదేశించారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ నేతలు బెంగళూరులోని ‘తాజ్వివంత హోటల్’లో, బీజేపీ నేతలు ‘హోటల్ రమద’లో సమావేశమై చర్చించారు. ‘సుప్రీం’లో స్వతంత్రుల పిటిషన్.. బీజేపీకి ఇటీవల మద్దతు ప్రకటించిన ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు హెచ్.నగేశ్, ఆర్.శంకర్లు నేడు సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. ఈ విషయమై స్వతంత్ర ఎమ్మెల్యేల న్యాయవాది మాట్లాడుతూ..‘ప్రభుత్వం మైనారిటీలో పడిపోయినప్పటికీ కర్ణాటక అసెంబ్లీలో విశ్వాసపరీక్షను నిర్వహించడం లేదు. ఈ విషయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు తన అసాధారణ అధికారాలను ఉపయోగించి సోమవారం సాయంత్రం 5 గంటల్లోగా మెజారిటీని నిరూపించుకునేలా సీఎం కుమారస్వామిని ఆదేశించాలి’ అని పిటిషన్ దాఖలుచేయబోతున్నట్లు చెప్పారు. కాగా, ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారమే విచారించే అవకాశముందని సమాచారం. సర్కారుకు ఆఖరిరోజు: యడ్యూరప్ప కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి నేడే ఆఖరిరోజని కర్ణాటక బీజేపీ చీఫ్ యడ్యూరప్ప తెలిపారు. ‘సీఎం కుమారస్వామి, సీఎల్పీ నేత సిద్దరామయ్య, స్పీకర్ సోమవారం విశ్వాసపరీక్షపై ఓటింగ్ చేపడతామని చెప్పారు. కాబట్టి ఈ వ్యవహారం రేపటికల్లా ఓ ముగింపుకొస్తుందని విశ్వాసంతో ఉన్నా. సోమవారమే కుమారస్వామి ప్రభుత్వానికి చివరిరోజు అవుతుందని నాకు నమ్మకముంది’ అని యడ్యూరప్ప చెప్పారు. దయచేసి వెనక్కి రండి: సీఎం ప్రభుత్వ తీరుకు నిరసనగా రాజీనామా చేసిన రెబెల్స్ అంతా వెనక్కు రావాలని సీఎం కుమారస్వామి విజ్ఞప్తి చేశారు. ‘నైతికత గురించి మాట్లాడే బీజేపీ ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలను, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతోంది.ఈ విషయాన్ని దేశం దృష్టికి తీసుకెళ్లాలా చేసేందుకే అసెంబ్లీలో చర్చకు సమయం కోరాను. మీరంతా(రెబెల్స్) వెనక్కురండి. సమస్యలను మనం కలిసి కూర్చుని చర్చల ద్వారా పరిష్కరించుకుందాం. సోమవారం జరిగే విశ్వాసపరీక్షకు హాజరై బీజేపీ అసలు రూపాన్ని బట్టబయలు చేయండి’ అని కుమారస్వామి రెబెల్ ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. అసెంబ్లీలో ఎవరి బలమెంత? కర్ణాటక అసెంబ్లీలో నామినేటెడ్ సభ్యుడితో కలిపి 225 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అసెంబ్లీలో అధికార కాంగ్రెస్–జేడీఎస్ కూటమికి ప్రస్తుతం 117 ఎమ్మెల్యేలు(స్పీకర్, నామినేటెడ్ ఎమ్మెల్యేను కలుపుకుని) ఉండగా, వీరిలో 15 మంది పదవు లకు రాజీనామా చేశారు. అదేసమయంలో 105 స్థానాలున్న బీజేపీకి ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించడంతో ఆ పార్టీ బలం అసెంబ్లీలో 107కు చేరుకుంది. ఒకవేళ 15 మంది రెబెల్ ఎమ్మెల్యేలు సోమవారం సభకు రాకపోయినా లేక వారిపై అనర్హత వేటుపడ్డా అసెంబ్లీలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 210కి చేరుకుంటుంది. అప్పుడు ఏకైక బీఎస్పీ ఎమ్మెల్యే మద్దతుతో కాంగ్రెస్–జేడీఎస్ కూటమి బలం 103కు తగ్గిపోతుంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 106 అవుతుంది. దీంతో ఇప్పటికే 107 మంది ఎమ్మెల్యేల మద్దతున్న బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆస్కారముంది. -
కర్ణాటకలో రాష్ట్రపతి పాలన?
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజకీయం ప్రస్తుతం అనూహ్య మలుపులతో సాగుతోంది. అసెంబ్లీలో మెజారిటీని నిరూపించుకోవాలని గవర్నర్ వజూభాయ్వాలా రెండుసార్లు లేఖలు రాసినా సీఎం కుమారస్వామి పట్టించుకోకపోవడం, స్పీకర్ రమేశ్ కుమార్ సభను సోమవారానికి వాయిదా వేయడంతో ఏం జరగబోతోందో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సందర్భంగా కర్ణాటకలో రాష్ట్రపతి పాలన విధించాల్సిందిగా గవర్నర్ వజూభాయ్వాలా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సుచేసే అవకాశముందని రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. కర్ణాటక అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలు, రాష్ట్రంలో పరిస్థితులపై గవర్నర్ ఇప్పటికే కేంద్ర హోం శాఖ కార్యదర్శికి నివేదిక పంపినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఒకవేళ సోమవారం కూడా అసెంబ్లీలో బలపరీక్ష జరగకపోతే వజూభాయ్వాలా నేరుగా రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయొచ్చని వెల్లడించాయి. ఈ విషయమై ప్రముఖ రాజ్యాంగ నిపుణుడు సుభాష్ కశ్యప్ మాట్లాడుతూ..‘ఇలాంటి పరిస్థితుల్లో గవర్నర్ నిర్ణయమే శిరోధార్యం. ప్రభుత్వానికి సభలో మెజారిటీ లేదని గవర్నర్ భావిస్తే, రాజీనామా చేయమని ముఖ్యమంత్రికి చెప్పే అధికారం గవర్నర్కు ఉంది. ఇక చట్టపరంగా కూడా కాంగ్రెస్–జేడీఎస్ కూటమికి మార్గాలన్నీ మూసుకుపోయినట్లే’ అని అభిప్రాయపడ్డారు. రాష్ట్రపతిపాలన ఎప్పుడు పెట్టొచ్చు? రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 ప్రకారం ఏదైనా రాష్ట్రంలో సంక్షోభ పరిస్థితులు నెలకొంటే రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రానికి గవర్నర్ సిఫార్సు చేయవచ్చు. ఆ పరిస్థితులు ఏమిటంటే.. ► రాష్ట్ర శాసనసభ ముఖ్యమంత్రిని ఎన్నుకోలేని పరిస్థితులు నెలకొన్నప్పుడు ► సంకీర్ణ ప్రభుత్వం మెజారిటీ శాసనసభ్యుల మద్దతు కోల్పోయినప్పుడు ► గవర్నర్ ఆదేశించిన సమయంలోగా సీఎం అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోలేకపోతే ► అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు సభలో మెజారిటీ కోల్పోతే ► రాష్ట్రంలో శాంతిభద్రతలకు ముప్పు వాటిల్లినా, యుద్ధ పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించి పాలన గాడితప్పితే రాష్ట్రపతి పాలన విధించవచ్చు రాష్ట్రంలో గతంలో రాష్ట్రపతి పాలన ► 1971, మార్చి 9: వీరేంద్ర పాటిల్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మెజార్టీ కోల్పోయింది (ఏడాది మీద ఒక్క రోజు) ► 1977, డిసెంబర్ 31: ముఖ్యమంత్రి దేవరాజ్ (కాంగ్రెస్)కు సంపూర్ణ మెజార్టీ ఉన్నప్పటికీ గవర్నర్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేశారు(59 రోజులు) ► 1989, ఏప్రిల్ 21: ఎస్.ఆర్.బొమ్మై ప్రభుత్వం మెజారిటీ కోల్పోయింది(223 రోజులు) ► 1990, అక్టోబర్ 10: వీరేంద్ర పాటిల్ ప్రభుత్వం బర్తరఫ్ (ఏడు రోజులు) ► 2007, అక్టోబర్ 9: బీజేపీ–జేడీఎస్ సంకీర్ణ కూటమిలో అధికార మార్పిడిపై ప్రతిష్టంభనతో మెజారిటీ కోల్పోయిన ప్రభుత్వం (33 రోజులు) ► 2007, నవంబర్ 20: అసెంబ్లీలో మెజారిటీ లేకపోవడంతో సీఎం యడ్యూరప్ప రాజీనామా(189 రోజులు) నేడు సీఎల్పీ భేటీ బెంగళూరు: కాంగ్రెస్ నేతలు జి.పరమేశ్వర, డి.కె.శివకుమార్తో శనివారం బెంగళూరులో సమావేశమైన సీఎం కుమారస్వామి, సభలో అనుసరించాల్సిన వ్యూహంపై సమాలోచనలు జరిపారు. ఓటింగ్ నేపథ్యంలో ఆదివారం సీఎల్పీ భేటీకి హాజరు కావాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మాజీ సీఎం, సీఎల్పీ నేత సిద్దరామయ్య ఆదేశించారు. విశ్వాసపరీక్షలో తాము మెజారిటీని నిరూపించుకుంటామని మంత్రి శివకుమార్ ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల రాజీనామాను వెనక్కితీసుకున్న కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యే రామలింగారెడ్డితో జేడీఎస్ అధినేత దేవెగౌడ సమావేశమయ్యారు. మరోవైపు, ప్రతిపక్ష నేత యడ్యూరప్ప బీజేపీ ఎమ్మెల్యేలతో చర్చించారు. ఆయనే కీలకం! కర్ణాటకలో 16 మంది రెబెల్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయగానే అందరి దృష్టి ఓ వ్యక్తివైపు కేంద్రీకృతమైంది. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారన్న విషయమై రాజకీయ పార్టీలతో పాటు సామాన్య ప్రజల్లో సైతం ఆసక్తి నెలకొంది. ఆయనే కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేశ్ కుమార్. టీవీ సీరియల్స్లో నటించిన రమేశ్ తన తెలివితేటలూ, పంచ్ డైలాగులతో అసెంబ్లీని నిర్వహించారు. విశ్వాసపరీక్ష నేపథ్యంలో తీవ్రమైన ఒత్తిడి నెలకొన్నప్పటికీ అటు అధికార కాంగ్రెస్–జేడీఎస్, ఇటు ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలను నియంత్రిస్తూ విధానసౌధను సజావుగా నడిపించారు. రెబెల్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ, తాను రాజ్యాంగ నిబంధనల మేరకే ముందుకెళతాననీ, తప్పుడు నిర్ణయాలతో చరిత్రలో ద్రోహిగా మిగిలిపోవాలనుకోవడం లేదన్నారు. 1978లో కోలార్ జిల్లా శ్రీనివాసపుర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున గెలవడంతో రమేశ్ రాజకీయ ప్రస్థానం మొదలైం ది. అప్పటినుంచి పలు రాజకీయ పార్టీల తరఫున పోటీచేసిన రమేశ్ 5సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు.. కర్ణాటకలో కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడగానే స్పీకర్గా ఎవరిని నియమించాలన్న ప్రశ్న తలెత్తింది. ఓవైపు బీజేపీ 105 మంది ఎమ్మెల్యేలతో అతిపెద్ద పార్టీగా అవతరించడం, మరోవైపు ఇద్దరు స్వతంత్రులు, ఓ బీఎస్పీ ఎమ్మెల్యేతో ప్రభుత్వం అతుకులబొంతగా మారిన నేపథ్యంలో సభను సజావుగా ఎవరు నడిపించగలరన్న కాంగ్రెస్ పెద్దల ప్రశ్నకు రమేశ్ కుమార్ సమాధానంగా నిలిచారు. 2018లో కర్ణాటక అసెంబ్లీ స్పీకర్గా బాధ్యతలు స్వీకరించిన రమేశ్.. తన నటనానుభవాన్ని ప్రదర్శిస్తూ అసెంబ్లీని సజావుగా నడుపుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే ఈ క్రమంలో కొన్నిసార్లు ఆయన నోరు జారారు. తాను అత్యాచార బాధితుడినని అసెంబ్లీ సాక్షిగా రమేశ్ వ్యాఖ్యానించడం పెనుదుమారాన్ని రేపింది. తర్వాత సారీ చెప్పారు. -
గవర్నర్ వర్సెస్ ముఖ్యమంత్రి
సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ/ముంబై: కర్ణాటకలో గవర్నర్, ముఖ్యమంత్రి మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. రెండు వారాలుగా నెలకొన్న రాజకీయ సంక్షోభం శుక్రవారం కొత్త మలుపు తీసుకుంది. అసెంబ్లీలో మెజారిటీని నిరూపించుకోవాలని గవర్నర్ వజూభాయ్వాలా రెండుసార్లు ఆదేశించినప్పటికీ కుమారస్వామి ప్రభుత్వం బేఖాతరు చేసింది. ఎమ్మెల్యేలు ప్రలోభాలకు గురవుతున్నట్లు గవర్నర్కు ఇప్పుడే జ్ఞానోదయమైందని కుమారస్వామి ఘాటుగా విమర్శలు గుప్పించారు. అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ఇప్పటికే ప్రవేశపెట్టినందున వజూభాయ్వాలా జోక్యం చేసుకోలేరని కుండబద్దలు కొట్టారు. ప్రభుత్వాన్ని ఆదేశించేందుకు ఆయనేమీ శాసనవ్యవస్థకు అంబుడ్స్మన్ కాదని చురకలు అంటించారు. బల నిరూపణపై గవర్నర్ రాసిన రెండు లేఖలను ‘లవ్ లెటర్స్’గా సీఎం అభివర్ణించారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో అధికార కాంగ్రెస్–జేడీఎస్, ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు వాగ్వాదానికి దిగడంతో సభ కొద్దిసేపు వాయిదాపడింది. జూలై 22న విశ్వాసపరీక్షపై తప్పనిసరిగా ఓటింగ్ నిర్వహిస్తామనీ, ఇక ఆలస్యం చేయబోమని చెబుతూ స్పీకర్ రమేశ్ కుమార్ సభను సోమవారానికి వాయిదా వేశారు. బీజేపీపై కుమారస్వామి ఆగ్రహం.. విధానసౌధ సమావేశాలు శుక్రవారం ప్రారంభంకాగానే ప్రతిపక్ష నేత బీఎస్ యడ్యూరప్ప మాట్లాడుతూ.. కుమారస్వామి ప్రభుత్వం ఇప్పటికే మెజారిటీ కోల్పోయిందని తెలిపారు. కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే విశ్వాసపరీక్షపై ఓటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. అనంతరం సీఎం కుమారస్వామి మాట్లాడుతూ..‘కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకుంటే రూ.40 నుంచి 50 కోట్లు ఇస్తామని బీజేపీ మా ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టింది. ఈ సొమ్మంతా ఎక్కడిది? కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచే ఈ అస్థిరపరిచే ప్రక్రియ సాగుతోంది. 14 నెలల తర్వాత ఇప్పుడది చివరిదశకు చేరుకుంది. ఈ ప్రభుత్వం ఎక్కువకాలం కొనసాగదని నాకు ముందే తెలుసు.కాబట్టి విశ్వాసపరీక్ష విషయంలో మనం నిదానంగా చర్చిద్దాం. సోమవారం లేదా మంగళవారం కూడా విశ్వాసపరీక్షను చేపట్టవచ్చు. మీరు(బీజేపీ) ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు ఇబ్బందేమీ లేదు. మీకిప్పుడు మద్దతు తెలిపిన రెబెల్స్ అండతో మీ ప్రభుత్వం ఎంత స్థిరంగా ఉంటుందో, ఎంతకాలం అధికారంలో ఉంటుందో నేనూ చూస్తా’ అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సమయం మధ్యాహ్నం 1.30 గంటలు కావడంతో గవర్నర్ ఆదేశాల మేరకు విశ్వాసపరీక్ష డివిజన్ నిర్వహించాలని ప్రతిపక్ష నేత బీఎస్ యడ్యూరప్ప డిమాండ్ చేశారు. అయితే నిబంధనల మేరకు విశ్వాసతీర్మానంపై చర్చ పూర్తయ్యాకే ఓటింగ్ జరగాలని స్పీకర్ రమేశ్ కుమార్ స్పష్టం చేశారు. దీంతో బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగగా, పోటీగా కాంగ్రెస్ సభ్యులు బీజేపీకి, గవర్నర్కు వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. సభ్యులు శాంతించకపోవడంతో స్పీకర్ రమేశ్ అసెంబ్లీని మధ్యాహ్నం 3 గంటలకు వాయిదావేశారు. నిమ్మకాయ ఉంటే చేతబడేనా? ఈ సందర్భంగా సీఎం కుమారస్వామి సోదరుడు రేవణ్ణ చేతిలో నిమ్మకాయతో సభలోకి రావడంతో రగడ మొదలైంది. ప్రభుత్వ మనుగడ కోసమే ఆయన చేతబడి చేయించిన నిమ్మకాయతో వచ్చారని కొందరు బీజేపీ సభ్యులు ఆరోపించారు. దీనిపై కుమారస్వామి వెంటనే స్పందిస్తూ..‘నిమ్మకాయను తెచ్చుకున్నందుకు మీరంతా రేవణ్ణను నిందిస్తున్నారు. మీరు హిందూ సంస్కృతిని గౌరవిస్తామంటూనే, ఆయన్ను అవమానిస్తున్నారు. రేవణ్ణ ఆలయాలకు వెళతారు. వెంట నిమ్మకాయను ఉంచుకుంటారు. కానీ మీరుమాత్రం ఆయన చేతబడి చేశారని ఆరోపిస్తున్నారు. చేతబడులతో అసలు ఎక్కడైనా ప్రభుత్వాలు నిలుస్తాయా?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అన్ని జిల్లాలకు నిధులు కేటాయించినా, బీజేపీ మాత్రం తనను 2–3 జిల్లాల ముఖ్యమంత్రిగా అభివర్ణిస్తోందని మండిపడ్డారు. గవర్నర్ ఇచ్చిన రెండో గడువు దాటిపోతున్న సమయంలో బీజేపీ నేత సురేష్ కుమార్ విశ్వాసపరీక్ష ఓటింగ్ చేపట్టాలని కోరారు. తాను చెప్పాల్సింది చెప్పేశాననీ, ఇంకేమైనా ఉంటే సోమవారం చూసుకుందామని కుమారస్వామి అన్నారు. దీంతో సభను సోమవారానికి వాయిదావేస్తున్నట్లు స్పీకర్ రమేశ్ కుమార్ ప్రకటించారు. రెబెల్స్ను హోటల్లో బంధించారు: శివకుమార్ కాంగ్రెస్–జేడీఎస్ పార్టీలకు చెందిన 15 మంది రెబెల్ ఎమ్మెల్యేలను ముంబైలోని రినైసెన్స్ హోటల్లో బంధించారని మంత్రి డి.కె.శివకుమార్ అసెంబ్లీలో ఆరోపించారు. ‘మమ్మల్ని బంధించారు.. కాపాడండి అని రెబెల్ ఎమ్మెల్యేల నుంచి సీఎం కుమారస్వామికి ఫోన్ వచ్చింది. అందుకే మేం ముంబై వెళ్లాం. తొలుత కుమారస్వామి స్వయంగా అక్కడకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కానీ సీఎం అలా వెళ్లాల్సిన అవసరం లేదని అధికారులు వారించారు. ఈ నేపథ్యంలో మేం సదరు హోటల్లో గదిని బుక్ చేశాం’ అని తెలిపారు. దీంతో ఎమ్మెల్యేలు, వారి కుటుం సభ్యులెవరూ సాయం కోసం తనను సంప్రదించలేదని స్పీకర్ రమేశ్కుమార్ స్పష్టం చేశారు. మరోవైపు ఛాతినొప్పితో ముంబైలోని సెయింట్ జార్జ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీమంత్ పాటిల్కు మహారాష్ట్ర పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. రెండో ‘లవ్ లెటర్’ వచ్చింది.. అసెంబ్లీ వాయిదా పడగానే రాజకీయ పరిణామాలు చకచకా మారిపోయాయి. ముఖ్యమంత్రి కుమారస్వామికి గవర్నర్ వజూభాయ్వాలా రెండో లేఖను రాశారు. ‘కర్ణాటకలో ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టే చర్యలు జరుగుతున్నట్లు నా దృష్టికి వచ్చింది. ఇలాంటి చర్యల్ని అరికట్టాలంటే వీలైనంత త్వరగా విశ్వాసపరీక్షను పూర్తిచేయండి. శుక్రవారం సాయంత్రం 6 గంటల్లోపు మీ మెజారిటీని నిరూపించుకోండి’ అని లేఖరాశారు. దీన్ని అసెంబ్లీలో చదివిన కుమారస్వామి..‘‘గవర్నర్ వజూభాయ్వాలా అంటే నాకు గౌరవముంది. కానీ ఆయన్నుంచి వచ్చిన రెండో ప్రేమలేఖ మాత్రం నన్ను బాధపెట్టింది. వజూభాయ్వాలాకు ఇప్పుడే జ్ఞానోదయం అయినట్లుంది. ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని గవర్నర్ లేఖలో చెప్పారు. అంటే ఇన్నిరోజులు రాష్ట్రంలో జరుగుతున్న తతంగమంతా ఆయనకు కన్పించలేదా? మా ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తుంటే ప్రలోభాలపర్వం ఆయనకు కనిపించలేదా? ఆరోజే గవర్నర్ చర్య తీసుకునిఉంటే ఈ ప్రత్యేక విమానాలు అసలు గాల్లోకి లేచేవా? రెబెల్ ఎమ్మెల్యేలకు పోలీస్భద్రత కల్పించిన గవర్నర్ వారు ముంబైకి వెళ్లేలా చేశారు. ఇక విశ్వాసపరీక్షకు సంబంధించిన అంశాన్ని నేను మీకే(స్పీకర్కే) వదిలిపెడుతున్నాను. ఇలాంటి ఆదేశాలు ఢిల్లీ(కేంద్రం) సూచనలతో రాకూడదు. గవర్నర్ రాసిన లేఖ నుంచి నన్ను రక్షించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను’ అని కోరారు. స్పీకర్ విధుల్లో గవర్నర్ జోక్యం తగదు అరుణాచల్ప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు న్యూఢిల్లీ: కర్ణాటకలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం ఆ రాష్ట్ర గవర్నర్ వజూభాయ్వాలా వైపు మళ్లింది. శాసన సభలో కుమారస్వామి సర్కారు బల పరీక్షకు గడువులు విధిస్తూ గవర్నర్ వజూభాయ్ వాలా ముఖ్యమంత్రికి లేఖలు రాయడం వివాదాస్పదమయింది. ఈ నేపథ్యంలో శాసనసభ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికారం గవర్నర్కు లేదని గతంలో అరుణాచల్ప్రదేశ్ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రాధాన్యతను సంతరించుకుంది. అరుణాచల్ అసెంబ్లీ కేసు.. 2016లో అరుణాచల్ప్రదేశ్లో మెజారిటీ లేదన్న కారణంగా అప్పటి గవర్నర్ రాజ్కోవా నబం తుకి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రద్దు చేశారు.దాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఆ కేసులో తీర్పు ఇస్తూ స్పీకర్ విధుల్లో జోక్యం చేసుకునే అధికారం గవర్నర్కు లేదని స్పష్టం చేసింది. రద్దయిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పునరుద్ధరించింది. ‘గవర్నర్ స్పీకర్కు గురువుగానీ మార్గదర్శిగానీ కాదు. కాబట్టి స్పీకర్ విధుల్లో జోక్యం చేసుకునే అధికారం ఆయనకు లేదు. స్పీకర్ను తొలగించే హక్కు గవర్నర్కు లేదు. స్పీకర్, గవర్నర్లు ఇద్దరూ వేర్వేరు రాజ్యాంగ సంస్థలకు అధిపతులు’అని ఆనాటి తీర్పులో సుప్రీం కోర్టు వివరించింది. రాజకీయ పార్టీలో చెలరేగే సంక్షోభం లేదా కల్లోలానికి గవర్నర్కు ఎలాంటి సంబంధం లేదని, ఈ విషయాలకు ఆయన దూరంగా ఉండాలని కోర్టు స్పష్టం చేసింది. గవర్నర్ లేఖపై భిన్నాభిప్రాయాలు స్పీకర్కు గవర్నర్ లేఖ రాయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రికి గవర్నర్ ఇలా లేఖలు పంపడం సమర్థనీయమేనని లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కాశ్యప్ అన్నారు. రాజ్యాంగంలోని 175వ అధికరణ కింద శాసన సభకు ఆదేశం పంపే అధికారం గవర్నర్కు ఉందని, దానిపై వీలయినంత త్వరగా చర్య తీసుకోవలసిన బాధ్యత సభపై ఉందని ఆయన అన్నారు. గవర్నర్ శాసన సభలో భాగమేనని రాజ్యాంగంలోని 168వ అధికరణ స్పష్టంగా చెపుతోందన్నారు. అయితే, కర్ణాటక గవర్నర్ రాజ్యాంగానికి విరుద్దంగా వ్యవహరించారని లోక్సభ మరో మాజీ సెక్రటరీ జనరల్ పీడీటీ ఆచార్య అభిప్రాయపడ్డారు.శాసన సభ లేదా శాసన మండలిలో ఏదైనా బిల్లు పెండింగులో ఉన్నప్పుడు దానిపై నిర్ణయం తీసుకోవాలని గవర్నర్ సభకు సూచించవచ్చని రాజ్యాంగంలోని 175వ అధికరణ చెబుతోందని అన్నారు. రాజ్యాంగం ప్రకారం పెండింగు బిల్లులకు సంబంధించి మాత్రమే గవర్నర్ శాసన సభకు ఆదేశాలివ్వవచ్చు. అంతేకాని సభ ఎలా జరగాలో చెప్పే అధికారం ఆయనకు లేదు. ఏమైనా కర్ణాటక గవర్నర్ అసాధారణ చర్య తీసుకున్నారు’అని ఆచార్య తెలిపారు. గవర్నర్ చర్య సరైనదా కాదా అన్నది న్యాయస్థానం తేల్చుతుందన్నారు. శాసన సభకు సంబంధించినంత వరకు స్పీకరే సర్వాధికారి అని, సభ కార్యకలాపాల నిర్వహణలో స్పీకర్ను అజమాయిషీ చేసే అధికారం ఎవరికీ లేదని ఆయన స్పష్టం చేశారు. గురువారం రాత్రి విధానసౌధలో నిద్రిస్తున్న బీఎస్ యడ్యూరప్ప -
‘నన్నెవరూ కిడ్నాప్ చేయలేదు’
బెంగళూరు: తననేవరూ కిడ్నాప్ చేయలేదు అంటున్నారు కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీమంత్ పాటిల్. కర్ణాటక అసెంబ్లీ ‘విధానసౌధ’లో గురువారం విశ్వాస పరీక్ష సందర్భంగా హైడ్రామా నెలకొన్న సంగతి తెలిసిందే. సరిగా విశ్వాస పరీక్షకు ముందు ఎమ్మెల్యే శ్రీమంత్ పాటిల్ అదృశ్యమయ్యారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీయే తమ ఎమ్మెల్యేను కిడ్నాప్ చేసిందని మంత్రి డి.కె.శివకుమార్ విధానసౌధలో ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాను కిడ్నాప్ అయ్యానంటూ వస్తోన్న వార్తలపై శ్రీమంత్ పాటిల్ స్పందించారు. ‘వ్యక్తిగత పని మీద ముంబై వెళ్లిను. బాగా అలసి పోయాను. ఉన్నట్లుండి ఛాతీలో నొప్పి రావడంతో ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం నా ఆరోగ్యం సరిగా లేదు. అందుకే ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటున్నాను. అంతే తప్ప నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు’ అంటూ వీడియో సందేశాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు శ్రీమంత్ పాటిల్. ఇదిలా ఉండగా పాటిల్ను బలవంతంగా ఆస్పత్రిలో చేర్చారని.. ఆయన వెంట బీజేపీ నేత లక్ష్మణ్ సావధి ఉన్నారని డి.కె.శివకుమార్ ఆరోపించిన సంగతి తెలిసిందే. పాటిల్ను బలవంతంగా తరలించారనడానికి తన దగ్గర సాక్ష్యాలున్నాయి అన్నారు శివకుమార్. -
కర్నాటకం క్లైమాక్స్ నేడే
సాక్షి బెంగళూరు/ముంబై/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ‘విధానసౌధ’లో గురువారం విశ్వాస పరీక్ష సందర్భంగా హైడ్రామా నెలకొంది. ముఖ్యమంత్రి కుమారస్వామి శాసనసభ ప్రారంభం కాగానే ‘ఈ సభ నా నేతృత్వంలోని మంత్రివర్గంపై విశ్వాసం ఉంచుతోంది’ అని ఏకవాక్య విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా 15 మంది రెబెల్ ఎమ్మెల్యేలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే ఈరోజే విశ్వాసపరీక్షను పూర్తిచేయాలని ప్రతిపక్ష నేత బీఎస్ యడ్యూరప్ప స్పీకర్ రమేశ్ను డిమాండ్ చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. వెంటనే రంగంలోకి దిగిన సీఎల్పీ నేత సిద్దరామయ్య రెబెల్ ఎమ్మెల్యేలకు విప్ జారీచేసేందుకు వీలుగా రూలింగ్ ఇవ్వాలని స్పీకర్ను కోరారు. ఈ విషయమై తాను అడ్వొకేట్ జనరల్ను సంప్రదించి నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ ప్రకటించడంతో బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. దీంతో వారికి పోటీగా కాంగ్రెస్ నేతలు కూడా ఆందోళన చేయడంతో సభ మూడుసార్లు వాయిదాపడింది. ఈ సందర్భంగా బీజేపీ ప్రతినిధుల బృందం గవర్నర్ వజూభాయ్వాలాను కలుసుకున్నప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. చివరికి స్పీకర్ న్యాయ సలహా కోసం వెళ్లిపోవడంతో డిప్యూటీ స్పీకర్ కృష్ణారెడ్డి అసెంబ్లీని శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి తన రాజీనామాను గురువారం ఉపసంహరించుకున్నారు. దేశానికి నిజాలు చెప్పాలి: కుమారస్వామి విధానసౌధలో గురువారం జరిగిన విశ్వాసపరీక్షకు అధికార కూటమికి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు(రెబెల్స్తో కలిపి) గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో కుమారస్వామి మాట్లాడుతూ..‘తిరుగుబాటు ఎమ్మెల్యేలు మా సంకీర్ణ ప్రభుత్వంపై దేశమంతటా పలు అనుమానాలు నెలకొనేలా చేశారు. మా ప్రభుత్వం ఐఎంఏ కుంభకోణం, జేఎస్డబ్ల్యూ కుంభకోణంలో చిక్కుకుందని నిరాధార ఆరోపణలు చేశారు. కాబట్టి ఈ విషయంలో మేం దేశ ప్రజలకు నిజాలు చెప్పాల్సిన అవసరముంది. ప్రస్తుతం దేశమంతా కర్ణాటకవైపు చూస్తోంది’ అని తెలిపారు. వెంటనే ప్రతిపక్ష నేత, కర్ణాటక బీజేపీ చీఫ్ యడ్యూరప్ప స్పందిస్తూ..‘విశ్వాసపరీక్ష ప్రక్రియ మొత్తం ఒక్కరోజులోనే పూర్తికావాలి’ అని డిమాండ్ చేశారు. దీంతో ‘చూస్తుంటే ప్రతిపక్ష నేతకు తొందర ఎక్కువైనట్లు ఉంది’ అని కుమారస్వామి వ్యంగ్యంగా జవాబిచ్చారు. ఈ సందర్భంగా రెబెల్ ఎమ్మెల్యేలకు విప్ జారీచేయడంపై తుది నిర్ణయం తీసుకునేవరకూ విశ్వాసపరీక్షను వాయిదా వేయాలని సీఎల్పీ నేత సిద్దరామయ్య స్పీకర్ను కోరారు. సుప్రీంకోర్టు తీర్పును సాకుగా చూపుతూ రెబెల్ ఎమ్మెల్యేలు పార్టీ విప్ను ధిక్కరించే అవకాశముందనీ, కాబట్టి ఈ విషయంలో రూలింగ్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యను పరిష్కరించకుండా విశ్వాసపరీక్షను చేపడితే అది రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని స్పష్టం చేశారు. దీంతో ఈ వ్యవహారంలో తాను అడ్వొకేట్ జనరల్ సలహా ఆధారంగా తుది నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. దీంతో స్పీకర్ కావాలనే విశ్వాసపరీక్షను ఆలస్యం చేస్తున్నారని బీజేపీ సభ్యులు అసెంబ్లీలో ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అదృశ్యం.. అసెంబ్లీలో విశ్వాసపరీక్షకు ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీమంత్ పాటిల్ అదృశ్యమయ్యారు. దీంతో సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీయే తమ ఎమ్మెల్యేను కిడ్నాప్ చేసిందని మంత్రి డి.కె.శివకుమార్ విధానసౌధలో ఆరోపించారు. ‘పాటిల్ను కిడ్నాప్ చేసి ముంబైలోని ఆసుపత్రిలో బలవంతంగా చేర్పించారు. ఆయన కుటుంబ సభ్యుల నుంచి నాకు ఫోన్వచ్చింది. పాటిల్ వెంట బీజేపీ నేత లక్ష్మణ్ సవది ఉన్నారు. నేను రెండు చేతులు జోడించి మిమ్మల్ని(స్పీకర్ను) ఒక్కటే కోరుతున్నా. మా ఎమ్మెల్యేను వెనక్కి తీసుకురండి సార్. మాకు పోలీస్ భద్రత కావాలి. పాటిల్ను బలవంతంగా తరలించారనడానికి నా దగ్గర సాక్ష్యాలున్నాయి’ అని తెలిపారు. ఈ సందర్భంగా పాటిల్ ఫొటోలతో వెల్లోకి దూసుకెళ్లిన కాంగ్రెస్ సభ్యులు ‘బీజేపీ డౌన్డౌన్’ ‘ఆపరేషన్ కమల డౌన్డౌన్’ అని నినాదాలు చేశారు. అయితే సంఖ్యాబలం లేకపోవడంతోనే కాంగ్రెస్ నేతలు నాటకాలు ఆడుతున్నారని బీజేపీ విమర్శించింది. దీంతో స్పీకర్ రమేశ్ స్పందిస్తూ..‘అంటే నేను కళ్లు మూసుకుని నాకు ఏమీ సంబంధం లేనట్లు కూర్చోవాలా? అసలు మనం ఎటువైపు పోతున్నాం. ఛాతినొప్పి ఉండటంతో తాను ఆసుపత్రిలో చేరినట్లు పాటిల్ నుంచి లేఖ అందింది. ఇది సహజంగా అనిపించడం లేదు. ఈ విషయంలో ఎమ్మెల్యే కుటుంబీకులతో మాట్లాడి నాకు నివేదిక అందించండి’ అని హోంమంత్రి ఎంబీ పాటిల్ను ఆదేశించారు. ఈ సందర్భంగా శ్రీమంత్ పాటిల్ అదృశ్యంపై కాంగ్రెస్ నేతలు బెంగళూరు పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. అయితే తననెవరూ కిడ్నాప్ చేయలేదనీ, సొంతపనిపై బుధవారం ముంబైకి రాగా ఛాతిలోనొప్పి రావడంతో ఆసుపత్రిలో చేరానని శ్రీమంత్ పాటిల్ ఓ వీడియోను విడుదల చేశారు. అసెంబ్లీలోనే బీజేపీ ధర్నా.. విశ్వాసపరీక్షపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా డిప్యూటీ స్పీకర్ సభను వాయిదావేయడంపై కర్ణాటక ప్రతిపక్ష నేత బీఎస్ యడ్యూరప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. విశ్వాసతీర్మానంపై కనీసం 15 నిమిషాలు కూడా సభలో చర్చించలేదని విమర్శించారు. ఇందుకు నిరసనగా తాము విధానసౌధలోనే నిద్రపోతామని తెలిపారు. సభలో విశ్వాసపరీక్ష ఎప్పుడు జరుగుతుందో ఖరారయ్యేవరకూ ఈ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్లే అంశాన్ని బీజేపీ ముఖ్యనేతలు పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. 2018లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఇది మూడో విశ్వాసపరీక్ష తీర్మానం కావడం గమనార్హం. మొదటగా సీఎం యడ్యూరప్ప తగిన సంఖ్యాబలం లేక విశ్వాసపరీక్షకు 3 రోజులముందే రాజీనామా చేయగా, రెండోసారి కుమారస్వామి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం బలపరీక్షలో నెగ్గింది. గవర్నర్తో బీజేపీ బృందం భేటీ విశ్వాసపరీక్ష ఆలస్యమయ్యే అవకాశమున్న నేపథ్యంలో బీజేపీ నేతలు చురుగ్గా పావులు కదిపారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే మాజీ సీఎం జగదీశ్ షెట్టర్ నేతృత్వంలో బీజేపీ ప్రతినిధి బృందం గవర్నర్ వజూభాయ్వాలాను కలుసుకుంది. ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రవేశపెట్టిన తీర్మానం ఆధారంగా వెంటనే విశ్వాసపరీక్ష జరిపేలా స్పీకర్ రమేశ్ కుమార్ను ఆదేశించాలని వినతిపత్రాన్ని సమర్పించింది. మైనారిటీ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి అధికార కూటమి కుయుక్తులు పన్నుతుందన్న భయం తమకు ఉందని ఈ సందర్భంగా జగదీశ్ షెట్టర్ అన్నారు. దీంతో ‘సీఎం సభలో ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంపై గురువారంలోగా నిర్ణయం తీసుకోండి’ అని వజూభాయ్వాలా స్పీకర్ను ఆదేశించారు. దీంతో స్పీకర్ రమేశ్ కుమార్ ఈ సందేశాన్ని సభలో చదివి వినిపించారు. మరోవైపు బీఎస్పీ అధినేత్రి మాయావతి నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో ఆ పార్టీ ఏకైక ఎమ్మెల్యే మహేశ్ బలపరీక్షకు దూరంగా ఉన్నారు. కుమారస్వామికి గవర్నర్ లేఖ కర్ణాటక రాష్ట్ర గవర్నర్ వజూభాయ్వాలా ముఖ్యమంత్రి కుమారస్వామికి లేఖ రాశారు. శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటల్లోగా అసెంబ్లీలో మెజారిటీని నిరూపించుకోవాలని సీఎంను ఆయన ఆదేశించారు. ‘విశ్వాసపరీక్ష తీర్మానాన్ని రాష్ట్ర అసెంబ్లీలో ఇప్పటికే ప్రవేశపెట్టిన నేపథ్యంలో రాష్ట్రానికి అధిపతిగా ఈ వ్యవహారంలో నేను జోక్యం చేసుకోకూడదు. కానీ ఈ తీర్మానంపై ఎలాంటి తుదినిర్ణయం తీసుకోకుండా సభ పదేపదే వాయిదా పడుతోందని నాకు ఫిర్యాదు అందింది. భారత రాజ్యాంగం ప్రకారం ఇలాంటి ఘటనలు చోటుచేసుకునేందుకు వీల్లేదు’ అని తెలిపారు. 15 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ప్రాథమికంగా మెజారిటీని కోల్పోయిందని అభిప్రాయపడ్డారు. కాగా, గవర్నర్ ముఖ్యమంత్రి కుమారస్వామికి లేఖరాసిన విషయాన్ని మంత్రి డి.కె.శివకుమార్ ధ్రువీకరించారు. విప్ అంటే? చట్టసభల్లో ఏదైనా కీలకాంశం చర్చకు వచ్చిన సందర్భాల్లో, లేదంటే ఫలానా తరహాలోనే ప్రజాప్రతినిధులు వ్యవహరించాల్సి ఉంటుందని రాజకీయ పార్టీలు భావించిన సందర్భాల్లో తమ సభ్యులకు విప్లను పార్టీ జారీచేస్తాయి. ఇది ఏకవాక్య విప్, రెండులైన్ల విప్, మూడులైన్ల విప్ అని మూడురకాలుగా ఉంటుంది. సభలో కోరం(కనీస సభ్యులు) ఉండాలని భావించినప్పుడు పార్టీలు ఏకవాక్య విప్ను జారీచేస్తాయి. సభలో ఓటింగ్ సందర్భంగా హాజరుకావాలని తమ సభ్యులకు రాజకీయ పార్టీలు రెండు లైన్ల విప్ను జారీచేస్తాయి. సభలో ముఖ్యమైన బిల్లుపై రెండోసారి చర్చ జరిగినప్పుడు, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే సందర్భాల్లో సభ్యులు తప్పనిసరిగా తమ ఆదేశాలమేర నడుచుకోవాలని పార్టీలు మూడు లైన్ల విప్ను జారీచేస్తాయి. వీటిలో మూడులైన్ల విప్ను ఉల్లంఘించే చట్టసభ్యులు ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటును ఎదుర్కొంటారు. విధానసౌధలో ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్న యడ్యూరప్ప -
లంచం పునాదులపై కర్ణాటకం
రాజీనామా చేసిన ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ ఉందన్న సుప్రీంకోర్టు తీర్పుతో తేలేదేమిటో కనబడడం లేదు. 15 మంది ఎమ్మెల్యేల రాజీనామాతో ముఖ్యమంత్రికి అవసరమయ్యే మెజారిటీ తగ్గుతుంది. 15 స్థానాల్లో ఉపఎన్నికలు జరిగితే సమస్యను ప్రజలు తేల్చాల్సి వస్తుంది. సోమ్నాథ్ చటర్జీ లోక్సభ స్పీకర్ పదవికి వన్నె తెచ్చిన వ్యక్తి. ఆయన సీపీఎం పట్ల పక్షపాతం చూపలేదు. తనను ఎంచుకున్న సంకీర్ణ నేత అడుగులకు మడుగులొత్తలేదు. కొందరు ప్రశ్నలు వేయడానికి లంచాలు తీసుకున్నారని తెలియగానే ఆ ఎంపీలను అనర్హులుగా ప్రకటించి సభనుంచి బహిష్కరించారు. లంచగొండి ఎంపీలు అన్యాయమని అరుస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లారు. తనతో సమాన సార్వభౌమాధికారం ఉన్న న్యాయవ్యవస్థ తన పరిధిని అతిక్రమించి నోటీసులు ఇవ్వడం రాజ్యాంగ పరిధిని అతిక్రమించడం, మరో వ్యవస్థ కార్యసరళిలో జోక్యం చేసుకోవడం అవుతుందని ప్రకటించి సోమ్నాథ్ గంభీరంగా తన ఉనికిని చాటుకున్నారు. కర్ణాటక స్పీకర్ 15 మంది కర్ణాటక ఎమ్మెల్యేల రాజీనామాలను వెంటనే ఎందుకు ఆమోదించలేదని సుప్రీంకోర్టు వారం కిందట అడిగింది. మహామహులైన న్యాయవేత్తలు, రాజీనామాచేసిన ప్రజాప్రతినిధుల పక్షాన సుప్రీంకోర్టులో నిలబడి గొప్పవాదనలు చేశారు. అత్యంత విలువైన సమయాన్ని ఈ లంచగొండి రాజీనామా రాజకీయానికి సుప్రీంకోర్టు వినియోగించి తన మేధస్సును రంగరించి, సహనంతో వాదనలు విని అటూ ఇటూ మొగ్గకుండా సమతుల్యమైన తీర్పు ఇవ్వడానికి విశ్వప్రయత్నం చేసింది. స్పీకర్, కర్ణాటక సీఎం తరఫున వాదించిన ప్రముఖ న్యాయాగ్రగణ్యులు కూడా రాజ్యాంగ సూత్రాలను అరటిపండు ఒలిచినట్టు వివరించారు. ‘‘మఘవ (మహా ఘనత వహించిన) సర్వోన్నత న్యాయమూర్తులైన మీకు చేతులుజోడించి మనవిచేసేదేమంటే, మీకు ఇందులో జోక్యం చేసుకునే అధికారమే లేదు, సభాపతిని సబార్డినేటుగా భావించి అదిచేయ్ ఇది చెయ్ అని ఆదేశించే అధికారాన్ని మన సంవిధానం తమకు సమకూర్చలేదు మహా ప్రభో’’ అని వేడుకున్నారు. ‘‘ఏం ఎందుకు లేదు? రాజీనామాలు ఇస్తే ఆమోదించడానికి అన్ని రోజులెందుకు’’ అని కాస్త గట్టిగానే అడిగినట్టు కనిపించినా తుది తీర్పు ఇచ్చే సమయానికి రాజ్యాంగ విలువలకు అనుగుణంగా స్పీకర్ మహాశయుడికి పూర్తి స్వేచ్ఛ ఉందని ప్రకటించారు. కానీ దాని భావమేమి? శాసన సభా ప్రక్రియ ప్రకారం ఒక్కో రాజకీయ పార్టీకి ఒక విప్ ఉంటారు. ప్రభుత్వాన్ని నిలబెట్టాలన్నా పడగొట్టాలన్నా సభ్యులకు విప్ జారీ చేస్తే తమ పార్టీ వారంతా రావాలని ఆదేశించాలి. అయినా రాకపోతే, వచ్చి వ్యతిరేక ఓటు వేస్తే వారి మీద సభలో ఉండకూడదని అనర్హత వేటు వేయాలి. ఎందుకంటే మన ఫిరాయింపు వ్యతిరేక చట్టం పదో షెడ్యూలు అది ఫిరాయింపుతో సమానమని వివరిస్తున్నది. లక్షల రూపాయలు ఖర్చుచేసి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత పెట్టుబడికి రెండింతలు మూడింతలు డబ్బు సంపాదించకుండా చేతులు కట్టుకునే నేతలు మనకు లేరు. అటువంటి ఎమ్మెల్యేలు ఊరికే రాజీనామా చేస్తారా? వారు ఎందుకు రాజీనామా చేస్తున్నారో అందరికీ తెలుసు. ఒక్కొక్కరికి పది కోట్ల నుంచి 25–30 కోట్ల దాకా ఇస్తామని ఫిరాయించడానికి తమ ఎమ్మెల్యేలను బీజేపీ నేతలు ప్రలోభపెడుతున్నారని కాంగ్రెస్, జనతాదళ్ (ఎస్) నేతలు ఆరోపిస్తూ ఆడియో రికార్డులను విడుదల చేశారు. ఏడాది కిందట కుమారస్వామి ప్రభుత్వం విశ్వాసతీర్మానంపై చర్చించడానికి ముందు లంచాలతో తమవైపు మళ్లించుకునే ప్రయత్నాలు సాగించారని కాంగ్రెస్ నాయకుడు బీసీ పటేల్ ఆరోపించారు. స్వయంగా తనతో ఫోన్లో బీజేపీ నేతలు లంచాలు ఇవ్వజూపే సంభాషణలను ఆయనే రికార్డుచేసి విడుదల చేసారు. విచిత్రం ఏమంటే పాటిల్ ప్రస్తుతం బీజేపీ వారి ముంబై క్యాంప్లో చేరి వారి విలాసవంతమైన హోటళ్లలో గడుపుతూ, ప్రత్యేక విమానాల్లో ప్రయాణిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని పరిత్యజించి బీజేపీలో చేరడానికి ఎమ్మెల్యే గిరీకి రాజీనామా చేసేసారు. ఇవి స్వచ్ఛంద రాజీనామాలని అనుకోవాలా? ఏడాదిన్నరలోగానే ఎమ్మెల్యే పదవిపై వీరికి విరక్తి వచ్చిందా, లేదా పెట్టుబడులన్నీ సంపాదించినట్టేనా? డబ్బు, పదవి ఎరజూపి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి సాగుతున్న ఈ కుట్రల గురించి సర్వోన్నత న్యాయస్థానంలో ప్రస్తావించే వారే లేరా? పడగొట్టే సీఎం, పడిపోయే సీఎం, మధ్యలో నలిగిపోయే స్పీకర్, ఈ కర్ణాటక లంచపు పునాదుల గురించి అడిగే వాడే లేడా, ఓటర్కు ప్రశ్నించే అవకాశమే రాదా? కర్ణాటక వ్యవహారం ఓటరు ముందుకు 15 స్థానాలకు ఉపఎన్నికల రూపంలో వెళ్లబోతున్నది. జనం స్వేచ్ఛగా ఏపార్టీ పరిపాలించాలో తీర్పుచెప్పాలి. మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
కర్ణాటక అసెంబ్లీ మ.3గంటల వరకూ వాయిదా
సాక్షి, బెంగళూరు : కర్ణాటక శాసనసభ మధ్యాహ్నం మూడు గంటల వరకూ వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం గురువారం ఉదయం 11 గంటలకు విధానసభలో ముఖ్యమంత్రి కుమారస్వామి సర్కారుపై బలపరీక్ష చర్చ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి బలపరీక్ష కోసం ప్రవేశపెట్టిన తీర్మానంపై మధ్యాహ్నం వరకూ చర్చ కొనసాగగా....స్పీకర్ సభను భోజన విరామం కోసం మూడింటి వరకూ వాయిదా వేశారు. మరోవైపు 15మంది రెబల్ ఎమ్మెల్యేలు సహా మొత్తం 21మంది సభకు గైర్హాజరు అయ్యారు. విశ్వాస తీర్మానంపై ఓటింగ్ కోసం బీజేపీ పట్టుపట్టగా, సభలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. ఈ సందర్భంగా అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. కుమరస్వామి సర్కార్ మైనార్టీలో పడిందన్న బీజేపీ ఎమ్మెల్యేలు...బల నిరూపణ చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పక్షనేత, మాజీ సీఎం సిద్ధరామయ్య ఘాటుగా స్పందించారు. సుప్రీంకోర్టు వాదనల్లో న్యాయమూర్తులు, న్యాయవాదులెవరూ విప్పై మాట్లాడలేదన్న ఆయన సభకు హాజరు కాకుంటే రెబల్ ఎమ్మెల్యేలు విప్ ధిక్కరించినట్లేనని అన్నారు, పార్టీ నాయకుడిగా విప్ జారీ చేసే హక్కు తనకు ఉందని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. అసమ్మతి ఎమ్మెల్యేల భవితవ్యం తేలేవరకూ విశ్వాస పరీక్ష జరపటం సరికాదని అన్నారు. మరోవైపు తమ ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణలన్నింటికీ సమాధానం చెబుతామని ముఖ్యమంత్రి కుమారస్వామి పేర్కొన్నారు. -
ఎమ్మెల్యేల్ని ఆదేశించలేరు!
సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో 15 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేల రాజీనామాతో అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు బుధవారం కీలక ఉత్తర్వులు జారీచేసింది. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు చెందిన ఈ 15 మందిని విశ్వాసపరీక్షకు హాజరుకావాల్సిందిగా ఆదేశించలేరని సీజేఐ జస్టిస్ గొగోయ్ నేతృత్వంలోని బెంచ్ తెలిపింది. విశ్వాసపరీక్షకు హాజరుకావాలా? వద్దా? అన్నది ఎమ్మెల్యేల ఇష్టమంది. రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామా విషయంలో స్పీకర్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 190, 208 కర్ణాటక అసెంబ్లీ నియమ నిబంధనలు (రెడ్విత్ 202ను) అనుసరించి నిర్ణయం తీసుకుంటారని చెప్పింది. ఈ వ్యవహారంలో స్పీకర్ తన విచక్షణాధికారం మేరకు, స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవచ్చనీ, నిర్ణీత కాలపరిమితిలోగా నిర్ణయం తీసుకోవాలని తాము ఆదేశించబోమనితేల్చిచెప్పింది. 15 మంది రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై ఓసారి నిర్ణయం తీసుకున్నాక ఆ వివరాలను స్పీకర్ తమకు సమర్పించాలని ఆదేశించింది. స్పీకర్ తొలుత రెబెల్ ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాలా? లేక రాజీనామాలపై నిర్ణయం తీసుకోవాలా?లేక రెండింటిని ఒకేసారి పరిశీలించాలా? అనేది తర్వాతి దశలో విచారణ చేపడతాం’ అని కోర్టు తెలిపింది. అసెంబ్లీలో అడుగుపెట్టబోం: ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు 15 మంది రెబెల్ ఎమ్మెల్యేలు తెలిపారు. ఈ విషయమై రెబెల్ ఎమ్మెల్యే బీసీ పాటిల్ మాట్లాడుతూ.. ‘రాజీనామాల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. మేమంతా కలసికట్టుగా తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉన్నాం. మేం విశ్వాసపరీక్ష కోసం గురువారం అసెంబ్లీలో అడుగుపెట్టబోం’ అని స్పష్టం చేశారు. సుప్రీం తీర్పును తప్పుపట్టిన కాంగ్రెస్.. తిరుగుబాటు ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. ప్రజాతీర్పును తుంగలోతొక్కిన ఎమ్మెల్యేలకు రక్షణ కవచంలా సుప్రీం తీర్పుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సూర్జేవాలా విమర్శించారు. ఈ ఉత్తర్వులతో రాజకీయ పార్టీలు జారీచేసే విప్లు చెల్లకుండాపోతాయనీ, దేశంలోని కోర్టుల ముందు ప్రమాదకరమైన ఉదాహరణను అత్యున్నత న్యాయస్థానం ఉంచిందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి ఓటేస్తా: రామలింగారెడ్డి కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి తన రాజీనామాపై వెనక్కి తగ్గారు. ఎమ్మెల్యే పదవికి తాను చేసిన రాజీనామాను ఉపసంహరించుకుంటాననీ, గురువారం జరిగే విశ్వాస పరీక్షలో కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేస్తానని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినప్పటికీ రామలింగారెడ్డి ముంబైలో రెబెల్ ఎమ్మెల్యేల క్యాంప్కు వెళ్లలేదు. తీర్పును స్వాగతిస్తున్నా: స్పీకర్ సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను స్వాగతిస్తున్నట్లు కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ కె.ఆర్.రమేశ్ కుమార్ తెలిపారు. ‘అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం. సుప్రీంకోర్టు నాపై అదనపు భారాన్ని ఉంచింది. రాజ్యాంగంలోని నియమనిబంధనలకు అనుగుణంగా>, బాధ్యతతో ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటాను’ అని స్పీకర్ చెప్పారు. మరోవైపు సుప్రీం తీర్పు నేపథ్యంలో సీఎం కుమారస్వామి, సీఎల్పీ నేత సిద్దరామయ్య స్పీకర్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మద్దతును కూడగట్టుకునేందుకు విశ్వాసపరీక్షను కొద్దికాలం వాయిదావేయాలని కోరినట్లు సమాచారం. కాగా, ఈ భేటీ అనంతరం బీజేపీ నేతలు బోపయ్య, మధుస్వామి తదితరులు స్పీకర్ను కలుసుకుని విశ్వాసపరీక్షను వాయిదా వేయొద్దని విజ్ఞప్తి చేశారు. అయితే గురువారం బలపరీక్ష జరుగుతుందనీ, ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని స్పీకర్ రమేశ్ ప్రకటించారు. విశ్వాస పరీక్ష నేడే కర్ణాటక అసెంబ్లీలో నేడు విశ్వాసపరీక్ష జరగనుండటంతో ఉత్కంఠ నెలకొంది. అధికార కూటమికి చెందిన ఎమ్మెల్యేలు వెనక్కిరాకపోవడంతో కుమారస్వామి ప్రభుత్వం కొనసాగడంపై నీలినీడలు అలుముకున్నాయి. 225 మంది సభ్యులున్న కర్ణాటక అసెంబ్లీలో అధికార కూటమికి 117 ఎమ్మెల్యేల బలం ఉంది. బీజేపీకి 105 మంది సభ్యులు ఉండగా, ఇటీవల ఇద్దరు స్వతంత్రులు మద్దతు ప్రకటించడంతో అది 107కు చేరుకుంది. ప్రస్తుతం రామలింగారెడ్డిని మినహాయించి 15 మంది రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించినా లేక వారు గైర్హాజరైనా అసెంబ్లీలో అధికార కూటమి బలం 102కి పడిపోనుంది. రాజీనామాల ఆమోదంతో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన ఎమ్మెల్యేల సంఖ్య 106కు చేరుకుంటుంది. ఈ పరిస్థితుల్లో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో కొనసాగడం కష్టమేనని విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీ 107 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తథ్యమని వ్యాఖ్యానిస్తున్నారు. -
కాంగ్రెస్ ఎమ్మెల్యే రోషన్ బేగ్ అరెస్ట్
బెంగళూరు : కర్ణాటకలో రాజకీయ సంక్షోభంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్ నుంచి సస్పెండయిన ఎమ్మెల్యే రోషన్ బేగ్ను ఐఎమ్ఏ అవినీతి కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్ ) అదుపులోకి తీసుకుంది. ముంబయి వెళ్లడానికి సిద్ధమైన రోషన్ బేగ్ను సిట్ అధికారులు బెంగళూరు విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామి ట్విటర్ ద్వారా వెల్లడించారు. అవినీతి కేసులో ఉన్న ఓ వ్యక్తిని బీజేపీ కాపాడేందుకు ప్రయత్నిస్తోందని కుమారస్వామి ఆరోపించారు. దీన్ని సిగ్గుమాలిన చర్యగా కుమార స్వామి వర్ణించారు. సంకీర్ణ ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందనడానికి ఇదే నిదర్శనమన్నారు. గురువారం జరగబోయే బలపరీక్షలో ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని కుమార స్వామి ఆరోపించారు.ఆ సమయంలో బీజేపీ ఎమ్మెల్యే యోగేశ్వర్ సైతం సంఘటనా స్థలంలో ఉండడం అనుమానాలు రేకెత్తిస్తోందన్నారు కుమారస్వామి. Today SIT probing the #IMA case detained @rroshanbaig for questioning at the BIAL airport while he was trying leave along with @BSYBJP's PA Santosh on a chartered flight to Mumbai. I was told that on seeing the SIT, Santhosh ran away while the team apprehended Mr. Baig. 1/2 pic.twitter.com/MmyH4CyVfP — H D Kumaraswamy (@hd_kumaraswamy) July 15, 2019 దీనిపై సిట్ అధికారులు స్పందిస్తూ.. ఐఎమ్ఏ కేసులో విచారణ నిమిత్తం ఈ నెల 19న హాజరు కావాల్సి ఉంటుందని బేగ్కు నోటీసులు జారీ చేశాం. కానీ ఈ లోపు ఆయన రాష్ట్రం విడిచి వెళ్లేందుకు ప్రయత్నించారు. దాంతో ఆయనను అదుపులోకి తీసకోవాల్సి వచ్చింది. బేగ్ను అరెస్ట్ చేయాలా వద్దా అనే అంశాన్ని విచారణ పూర్తయిన తర్వాత నిర్ణయిస్తాం అన్నారు. -
‘కోట్ల’ కర్నాటకం
కర్ణాటకలో నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఇటు అధికార కాంగ్రెస్–జేడీఎస్ కూటమి, అటు బీజేపీ అధికారం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఇందుకోసం కోట్లాది రూపాయలను మంచినీళ్లలా ఖర్చు పెడుతున్నాయి. ఓవైపు సొంత కూటమి నుంచి ఎమ్మెల్యేలు చేజారిపోకుండా కాంగ్రెస్–జేడీఎస్ పార్టీలు అన్నిప్రయత్నాలు చేస్తుంటే, మరోవైపు ఈ రెండు పార్టీల్లోని అసంతృప్త నేతలను చీల్చడం ద్వారా అధికారాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కర్ణాటక రాజకీయ వ్యవహారాలను సునిశితంగా పరిశీలిస్తున్నవారి అంచనా ప్రకారం రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు తమ ఎమ్మెల్యేలకు రూ.20 కోట్ల చొప్పున నగదును ముట్టజెప్పినట్లు సమాచారం. కేవలం నగదు మాత్రమే కాకుండా ప్రత్యేకంగా హోటళ్లు, రిసార్టుల్లో గదులు బుక్చేయడంతో పాటు వారి డిమాండ్లన్నింటిని తీరుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ హోటల్/ రిసార్టుల్లో ఒక్కో గదికి రోజుకు రూ.4000 నుంచి రూ.11,000 వరకూ ఖర్చవుతోంది. ఈ మొత్తాన్ని ఆయా రాజకీయ పార్టీలే భరిస్తున్నాయి. ఒక్కో ట్రిప్కు రూ.4 లక్షల ఖర్చు.. ఇక ముంబైలో క్యాంప్ ఏర్పాటుచేసిన 15 మంది రెబెల్ ఎమ్మెల్యేలు ప్రత్యేక విమానాల్లో ముంబై–బెంగళూరు మధ్య రాకపోకలు సాగిస్తున్నారు. ఈ మార్గంలో ఒక్కో ట్రిప్కు రూ.4 లక్షల వరకూ ఖర్చవుతోంది. కర్ణాటక సంక్షోభం మొదలైనప్పటి నుంచి ఈ తిరుగుబాటు ఎమ్మెల్యేలు పలుమార్లు ఇలా రాకపోకలు సాగించారు. మహారాష్ట్రలోని ప్రముఖ ఆలయాలను కూడా సందర్శించుకుంటున్నారు. అలాగే సుప్రీంకోర్టులో ముకుల్ రోహత్గీ వంటి సీనియర్ న్యాయవాదిని కూడా నియమించుకున్నారు. కొద్ది రోజులుగా ఇలా ప్రత్యేక విమానాల్లో ప్రయాణం, హోటళ్లలో బస కోసం రాజకీయ పార్టీలు రూ.50 లక్షల మేర ఖర్చు చేసినట్లు సమాచారం. అయితే సొంత డబ్బుతోనే తాము హోటళ్లలో ఉంటున్నామని రెబెల్ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. కానీ కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే మాత్రం బీజేపీవైపు వేలెత్తి చూపిస్తున్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేల వెనుక బీజేపీ లేకుంటే, రాజీనామాలు చేసినవెంటనే ఎమ్మెల్యేలకు ప్రత్యేక విమానాలు, హోటళ్లలో గదులు ఎలా సమకూరాయని ప్రశ్నిస్తున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాకపోవడంతో రిసార్టుల రాజకీయం మొదలైంది. తమ ఎమ్మెల్యేలు ప్రలోభాలకు లొంగిపోకుండా కాంగ్రెస్, జేడీఎస్, బీజేపీలు 14 నెలల్లో శాసనసభ్యులను మూడుసార్లు రిసార్టులకు తరలించాయి. -
18న బలపరీక్ష
సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ/ముంబై: కర్ణాటకలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం క్లైమాక్స్కు చేరింది. సీఎం కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో ఈ నెల 18న(గురువారం) ఉదయం 11 గంటలకు విశ్వాస పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పీకర్ రమేశ్ ప్రకటించారు. బీఏసీ సమావేశంలో అధికార, ప్రతిపక్ష పార్టీలను సంప్రదించాకే ఈ నిర్ణయం తీసుకున్నాననీ, ఇందుకు ఇరుపక్షాలు అంగీకరించాయన్నారు. ఈ మేరకు సోమవారం విధానసౌధలో ప్రకటించిన స్పీకర్..విశ్వాసపరీక్షకు వీలుగా సభను గురువారానికి వాయిదా వేశారు. తమ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందేమీ లేదని సీఎం ధీమా వ్యక్తం చేశారు. ‘పూర్తి నమ్మకంతో ఉన్నా. మీరెందుకు ఆందోళన చెందుతున్నారు?’ అని మీడియాను ప్రశ్నించారు. స్పీకర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: యడ్యూరప్ప బీఏసీ సమావేశం సోమవారం సహృద్భావ వాతావరణంలో సాగిందని కర్ణాటక బీజేపీ చీఫ్ యడ్యూరప్ప తెలిపారు. అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని తాము ప్రకటించడంతో, ప్రభుత్వం బలపరీక్షకు తేదీని ఖరారు చేసిందని వ్యాఖ్యానించారు. ‘విశ్వాసపరీక్ష జరిగేవరకూ ఎలాంటి సభా కార్యకలాపాలు కొనసాగరాదని మేం స్పీకర్ను కోరాం. మా విజ్ఞప్తి మేరకు ఆయన సభను గురువారానికి వాయిదా వేశారు. దీన్ని మేం స్వాగతిస్తున్నాం. రాబోయే 3–4 రోజుల్లోనే కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది. బీజేపీ ప్రభుత్వం కర్ణాటకకు అత్యుత్తమ పాలన అందిస్తుంది’ అని తెలిపారు. అసెంబ్లీలో మంచి ప్రసంగం ఒకటి ఇచ్చాక సీఎం కుర్చీ నుంచి కుమారస్వామి తప్పుకుంటారని వ్యాఖ్యానించారు. విచారణకు ఇద్దరు రెబెల్స్ డుమ్మా.. స్పీకర్ ముందు విచారణకు ఇద్దరు రెబెల్ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. రాజీనామాల విషయంలో తమ వాదనల్ని వినిపించేందుకు సోమవారం వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి, జేడీఎస్ ఎమ్మెల్యే గోపాలయ్యలను స్పీకర్ ఆదేశించారు. అయితే అసెంబ్లీ కార్యదర్శి ఆఫీసుకు ఫోన్చేసిన ఇద్దరు నేతలు, విచారణకు తాము రాలేకపోతున్నట్లు సమాచారం అందించారు. ఈ సందర్భంగా విచారణకు మరో తేదీని ఖరారు చేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే వీరి విజ్ఞప్తిపై స్పీకర్ స్పందించలేదు. పోలీస్ కమిషనర్కు రెబెల్స్ లేఖ.. తమను బుజ్జగించేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఖర్గే, ఆజాద్లు రాబోతున్నారన్న వార్తల నేపథ్యంలో 15 మంది రెబెల్ ఎమ్మెల్యేలు అప్రమత్తమయ్యారు. ఈ 15 మంది కాంగ్రెస్–జేడీఎస్ ఎమ్మెల్యేలు సోమవారం ముంబై పోలీస్ కమిషనర్కు లేఖ రాశారు. ‘ ఖర్గే లేదా ఆజాద్ లేదా మరో కాంగ్రెస్ నేతను కలుసుకునే ఉద్దేశం మాకు లేదు. కాంగ్రెస్ నేతల రాక నేపథ్యంలో మా భద్రతపై ఆందోళనతో ఉన్నాం. కాబట్టి దయచేసి కాంగ్రెస్ నేతలు మమ్మల్ని కలుసుకోకుండా నిలువరించండి’ అని లేఖలో కోరారు. కాంగ్రెస్–జేడీఎస్ పార్టీలకు చెందిన 15 మంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం ముంబైలోని రినైసెన్స్ హోటల్లో బస చేస్తున్నారు. కాగా, ఈ రెబెల్ ఎమ్మెల్యేలు గురువారం జరిగే విశ్వాసపరీక్షకు హాజరుకాబోరని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. సిట్ విచారణకు ఎమ్మెల్యే బేగ్ గైర్హాజరు కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రోషన్ బేగ్ సోమవారం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణకు గైర్హాజరయ్యారు. ఐఎంఏ జువెల్స్ అధినేత మన్సూర్ ఖాన్ నుంచి రూ.400 కోట్లు పుచ్చుకున్న కేసులో ఆయనకు సిట్ నోటీసులు జారీచేసింది. ముఖ్యమైన పనిపడటంతో తాను విచారణకు రాలేకపోతున్నానని రోషన్ బేగ్ తెలిపారు. ఈ నెల 25న విచారణకు వస్తానని చెప్పారు. అయితే ఇందుకు అంగీకరించని సిట్.. జూలై 19న విచారణకు హాజరుకావాల్సిందేనని స్పష్టం చేస్తూ రెండోసారి నోటీసులు జారీచేసింది. బేగ్ తన దగ్గర రూ.400 కోట్లు పుచ్చుకుని తిరిగివ్వడం లేదని మన్సూర్ ఖాన్ ఓ వీడియో ఆరోపించిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేల విజ్ఞప్తికి సుప్రీం ఓకే స్పీకర్ తమ రాజీనామాలను ఉద్దేశపూర్వకం గానే ఆమోదించడంలేదని సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఐదుగురు రెబెల్ ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. తమ పిటిషన్ను మిగిలిన 10 మంది ఎమ్మెల్యేల పిటిషన్తో కలిపి విచారించాలన్న రెబెల్ ఎమ్మెల్యేల విజ్ఞప్తికి కోర్టు అంగీకరించింది. ఈ 15 మంది ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్ను మంగళవారం విచారిస్తామని సీజేఐ జస్టిస్ గొగోయ్, జస్టిస్ గుప్తాల బెంచ్ తెలిపింది. కర్ణాటకకు చెందిన 10 మంది ఎమ్మెల్యేల రాజీనామాలపై జూలై 16 వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోరాదని కోర్టు ఇంతకుముందు స్పీకర్ రమేశ్ను ఆదేశించడం తెల్సిందే. ఎమ్మెల్యేల రాజీనామాల కంటే ముందు అనర్హత పిటిషన్పైనే స్పీకర్ నిర్ణయం తీసుకోవాలా? అనే విషయాన్ని తాము పరిశీలించాల్సి ఉందని బెంచ్ వ్యాఖ్యానించింది. -
సంకీర్ణానికి నాగరాజ్ ఝలక్
బెంగళూరు/ముంబై: కర్ణాటకలో రాజకీయం ఆదివారం అనూహ్య మలుపు తిరిగింది. రాజీనామాను వెనక్కు తీసుకోవాలని కాంగ్రెస్ ముఖ్యనేతలు చేసిన విజ్ఞప్తికి తొలుత సానుకూలంగా స్పందించిన రెబెల్ ఎమ్మెల్యేల ఎంటీబీ నాగరాజ్ ఒక్కరోజులోనే తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. బీజేపీ నేత ఆర్.అశోక్తో కలిసి ప్రత్యేక విమానంలో ఆదివారం బెంగళూరు నుంచి ముంబైలోని రెబెల్ ఎమ్మెల్యేల క్యాంప్కు చేరుకున్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలను వెనక్కి తీసుకొస్తానని చెప్పి ముంబైలో దిగగానే మాటమార్చారు. దీంతో కాంగ్రెస్–జేడీఎస్ నేతల ఆనందం ఒక్క రోజులోనే ఆవిరైంది. అయితే రెబెల్ ఎమ్మెల్యే సుధాకర్తో పాటు మరికొందరిని ఒప్పించి వెనక్కు తీసుకొచ్చేందుకే నాగరాజ్ ముంబైకి వెళ్లారని కాంగ్రెస్ సీనియర్ నేత హెచ్.కె.పాటిల్ తెలిపారు. కర్ణాటక అసెంబ్లీ ‘విధానసౌధ’లో విశ్వాసపరీక్ష నాటికి అన్నీ సర్దుకుంటాయని ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటకలో ఇప్పటివరకూ కాంగ్రెస్–జేడీఎస్ పార్టీలకు చెందిన 16 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా సమర్పించిన సంగతి తెలిసిందే. రాజీనామా వెనక్కి తీసుకోను: నాగరాజ్ ముంబైకి వెళ్లేముందు నాగరాజ్ మీడియాతో మాట్లాడుతూ..‘సుధాకర్ గత రెండ్రోజులుగా తన ఫోన్ను స్విచ్ఛాఫ్ చేసుకున్నారు. ఆయనతో మాట్లాడి ఒప్పించి వెనక్కి తీసుకొస్తాను. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేతలకు ఇప్పటికే చెప్పాను’ అని తెలిపారు. కానీ ముంబైలో రెబెల్ ఎమ్మెల్యేల క్యాంప్కు చేరుకున్న వెంటనే నాగరాజ్ మాటమార్చారు. ‘మేమంతా(రెబెల్ ఎమ్మెల్యేలు) ఒకేసారి రాజీనామా చేశాం. ఇప్పుడు రాజీనామా విషయంలో నేను పూర్తి స్పష్టతతో ఉన్నాను. నా రాజీనామాను వెనక్కు తీసుకునే ప్రసక్తే లేదు. మా వెనుక బీజేపీ లేదు. బీజేపీ నేత అశోక్తో కలిసి నేను ముంబైకి వచ్చినట్లు మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదు’ అని వెల్లడించారు. మరో రెబెల్ ఎమ్మెల్యే ఎస్.టి.సోమశేఖర్ స్పందిస్తూ.. నాగరాజ్ తమతో కలవడానికే ముంబై వచ్చారనీ, ఎమ్మెల్యే సుధాకర్ను వెనక్కి తీసుకెళ్లడానికి కాదన్నారు. నాగరాజ్ చేరికతో ముంబైలో మకాం వేసిన రెబెల్స్ సంఖ్య 15కు చేరుకుంది. రామలింగారెడ్డితో కాంగ్రెస్ నేతల భేటీ.. ఎమ్మెల్యే నాగరాజ్ చాకచక్యంగా ముంబైలోని రెబెల్స్ క్యాంప్కు చేరుకోవడంతో సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ నేతలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన రెబెల్ నేత రామలింగారెడ్డితో కర్ణాటక కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఈశ్వర్ ఖంద్రే, సీఎల్పీ నేత సిద్దరామయ్య, సీనియర్ నేత హెచ్.కె.పాటిల్ భేటీ అయ్యారు. ఎమ్మెల్యే పదవికి సమర్పించిన రాజీనామాను వెనక్కు తీసుకోవాలని కోరారు. అనంతరం ఖంద్రే మీడియాతో మాట్లాడుతూ..‘రామలింగారెడ్డి సీనియర్ నేత. కాంగ్రెస్ పార్టీకి ఆయన అవసరం చాలాఉంది. ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదు. కాబట్టి రాజీనామాను ఉపసంహరించుకోవాల్సిందిగా కోరాం‘’ అని తెలిపారు. మరోవైపు రామలింగారెడ్డి స్పందిస్తూ.. స్పీకర్ రమేశ్కుమార్తో సోమవారం సమావేశమయ్యేవరకూ తానేమీ మాట్లాడబోనని స్పష్టం చేశారు. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు సీఎల్పీ సోమవారం సమావేశం కానుంది. 2–3 రోజుల్లోనే బీజేపీ ప్రభుత్వం: యడ్యూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని రాష్ట్ర బీజేపీ చీఫ్ యడ్యూరప్ప మరోసారి డిమాండ్ చేశారు.‘కుమారస్వామి నిజంగా నిజాయితీపరుడైతే, ఆయనకు ప్రజాస్వామ్య వ్యవస్థపై గౌరవముంటే వెంటనే రాజీనామా చేయాలి. లేదంటే అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి. సోమవారం జరిగే బీఏసీ సమావేశంలో ముఖ్యమంత్రికి నేను ఇదే సూచిస్తాను. రెబెల్ ఎమ్మెల్యేలు వెనక్కు రాబోమని ఇప్పటికే స్పష్టం చేశారు. ఇంకో 2–3 రోజుల్లో కర్ణాటక ప్రజలకు సేవలందించే సదవకాశం బీజేపీకి లభిస్తుంది’ అని చెప్పారు. కాంగ్రెస్పై కుమారస్వామి చిందులు.. సాక్షి, బెంగళూరు: కర్ణాటక సంక్షోభం నేపథ్యంలో సీఎం కుమారస్వామి కాంగ్రెస్ రాష్ట్ర ఇన్చార్జ్ కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గే, సీఎల్పీ నేత సిద్దరామయ్యతో సమావేశమయ్యారు. బెంగళూరులోని కుమారకృప గెస్ట్హౌస్లో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ నేతలపై ముఖ్యమంత్రి చిందులు తొక్కారు. ‘మా పార్టీ నుంచి కేవలం ముగ్గురే వెళ్లారు. కానీ కాంగ్రెస్ నుంచి ఏకంగా 13 మంది రాజీనామాలు చేశారు. మీ ఎమ్మెల్యేలను కూడా మీరు బుజ్జగించలేరా?’ అని అసహనం వ్యక్తం చేశారు. అప్రమత్తమైన కమల్నాథ్ కర్ణాటక, గోవా రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాల నేపథ్యంలో మధ్యప్రదేశ్ సీఎం కమల్నాథ్ అప్రమత్తమయ్యారు. మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వం నడుస్తున్న వేళ ఎమ్మెల్యేలు జారిపోకుండా బుధవారం విందు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 230 స్థానాలున్నమధ్యప్రదేశ్ అసెంబ్లీకి 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 114, బీజేపీ 109 స్థానాల్లో గెలుపొందాయి. అయితే స్వతంత్రులు(4), బీఎస్పీ(2) ఎస్పీ(1)ల మద్దతుతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాగా, కాంగ్రెస్ ముఖ్యనేత జ్యోతిరాదిత్య సింధియా ఇప్పటికే మిత్రపక్షాలతో సమావేశమయ్యారు. అసెంబ్లీలో బలాబలాలు 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో అధికార కాంగ్రెస్–జేడీఎస్ కూటమికి 118 మంది ఎమ్మెల్యేలు ఉండగా, వారిలో 16 మంది రాజీనామా చేయగా, మరో ఇద్దరు స్వతంత్రులు మద్దతు ఉపసంహరించుకున్నారు. ఒకవేళ స్పీకర్ ఈ 16 రాజీనామాలను ఆమోదిస్తే కూటమి బలం 100కు పడిపోతుంది. సభలో ఎమ్మెల్యేల సంఖ్య 208కు చేరుతుంది. అప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సభ్యుల సంఖ్య 105 అవుతుంది. ఇద్దరు స్వతంత్రుల మద్దతుతో బీజేపీ బలం 107కు పెరిగినందున ఆ పార్టీ సులభంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. -
రేపే ‘విశ్వాసం’ పెట్టండి
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీలో బుధవారం బలపరీక్ష నిర్వహించాలని సీఎం కుమారస్వామి ప్రతిపాదించడంతో ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్–జేడీఎస్ నేతలు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. రెబెల్ ఎమ్మెల్యే ఎంటీబీ నాగరాజ్ ఇంటికి శనివారం వెళ్లిన కాంగ్రెస్ సీనియర్ నేత శివకుమార్, రాజీనామాను వెనక్కు తీసుకునేలా ఆయన్ను ఒప్పించారు. దీంతో కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వం బలం పుంజుకోకుండా బీజేపీ నేతలు అప్రమత్తమయ్యారు. కర్ణాటక సీఎం తన బలాన్ని అసెంబ్లీలో సోమవారం నిరూపించుకోవాలని రాష్ట్ర బీజేపీ చీఫ్ యడ్యూరప్ప డిమాండ్ చేశారు. బెంగళూరులో శనివారం యడ్యూరప్ప మీడియాతో మాట్లాడారు. ‘సీఎం స్వయంగా సోమవారం విశ్వాస తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టాలి. సోమవారం జరగబోయే బీఏసీ సమావేశంలో ఈ మేరకు మేం సీఎంకు సూచిస్తాం. సీఎం పదవికి రాజీనామా చేసి కొత్త ప్రభుత్వానికి పరిపాలన బాధ్యతలు అప్పగించడం ఆయనకే మంచిది’ అని తెలిపారు. కాంగ్రెస్–జేడీఎస్ కూటమి నుంచి ఎమ్మెల్యేల వలసలను ఆపేందుకే కుమారస్వామి ‘విశ్వాసపరీక్ష’ పేరుతో కొత్త కుట్రకు తెరలేపారని ఆరోపించారు. దమ్ముంటే సీఎం విశ్వాసపరీక్ష కోరాలనీ, ప్రస్తుతం పరిస్థితి తమకే అనుకూలంగా ఉందని చెప్పారు. స్పీకర్కు స్వతంత్ర ఎమ్మెల్యేల లేఖ.. కాంగ్రెస్–జేడీఎస్ సర్కారుకు మద్దతు ఉపసంహరించుకున్న ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు హెచ్.నగేశ్, ఆర్.శంకర్ శనివారం స్పీకర్ రమేశ్ కుమార్కు వేర్వేరుగా లేఖలు రాశారు. శాసనసభలో ప్రతిపక్షం(బీజేపీ)వైపు తమ స్థానాలను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ప్రారంభమైన కర్ణాటక అసెంబ్లీ వర్షకాల సమావేశాలు జూలై 26 వరకూ కొనసాగనున్నాయి. కుమారస్వామి కేబినెట్లో నగేశ్ చిన్నతరహా పరిశ్రమల మంత్రిగా, శంకర్ల మున్సిపల్ శాఖ మంత్రిగా ఇటీవల నియమితులయ్యారు. కానీ అనూహ్యంగా ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకున్నారు. ఒకవేళ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు ముందుకొస్తే మద్దతిస్తామని ప్రకటించారు. మా పిటిషన్లను కలిపి విచారించండి సాక్షి, బెంగళూరు: కర్ణాటకకు చెందిన మరో ఐదుగురు రెబెల్ ఎమ్మెల్యేలు శనివారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అసెంబ్లీ స్పీకర్ తమ రాజీనామాలను కావాలనే ఆమోదించడంలేదని ఎమ్మెల్యేలు ఆనంద్ సింగ్, కె.సుధాకర్, ఎన్.నాగరాజ్, మునిరత్న, రోషన్బేగ్లు ఆరోపించారు. గతంలో 10 మంది రెబెల్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషనత్తో తమ పిటిషన్ను కలిపి విచారించాలని కోర్టును కోరారు. 10 మంది ఎమ్మెల్యేల రాజీనామాలు, అనర్హత విషయంలో జూలై 16 వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోరాదని స్పీకర్ను కోర్టు ఇప్పటికే ఆదేశించింది. అనర్హతపై నిర్ణయం రిజర్వు: స్పీకర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన రెబెల్ ఎమ్మెల్యేలు రమేశ్ జార్కిహోళి, మహేశ్ కుమటళ్లిపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ పార్టీ ఈ ఏడాది ఫిబ్రవరి 11న కోరిందని స్పీకర్ తెలిపారు. దీనిపై పలుమార్లు విచారణ జరిపామనీ, చివరికి నిర్ణయాన్ని రిజర్వులో ఉంచినట్లు వెల్లడించారు. సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో రమేశ్ కుమార్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఆపరేషన్ ‘నాగరాజ్’ సఫలం ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ నేతలు సొంత పార్టీకి చెందిన రెబెల్ ఎమ్మెల్యే నాగరాజ్ను తమవైపునకు తిప్పుకున్నారు. బెంగళూరులోని నాగరాజ్ నివాసానికి చేరుకున్న కాంగ్రెస్ మంత్రి శివకుమార్ ఆయనతో చర్చలు జరిపారు. రాజీనామాను వెనక్కు తీసుకుని పార్టీలోకి రావాలని కోరారు. ఈ సందర్భంగా నాగరాజ్ ఇంటికొచ్చిన డిప్యూటీ సీఎం పరమేశ్వర, రాజీనామాను వెనక్కు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీంతో మెత్తబడ్డ నాగరాజ్ రాజీనామాను వెనక్కు తీసుకునేందుకు చూచాయగా అంగీకరించారు. తర్వాత నాగరాజ్ మీడియాతో మాట్లాడారు. ‘నా రాజీనామాను వెనక్కు తీసుకోవాలని సిద్దరామయ్య, దినేశ్గూండూరావులు ఫోన్లో విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడానికి కొంత టైం అడిగా. చిక్కబళ్లాపుర ఎమ్మెల్యే సుధాకర్తో మాట్లాడి ఆయన్ను కూడా రాజీనామా ఉపసంహరించుకునేలా ప్రయత్నిస్తానని చెప్పా’ అని తెలిపారు. మరోవైపు రమడా రిసార్టులో బసచేసిన బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి యడ్యూరప్ప భోజనం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రెబెల్ ఎమ్మెల్యే నాగరాజ్ వెనక్కి వెళ్లబోరని తాను భావిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే రామలింగారెడ్డితో బీజేపీ ఎమ్మెల్యే విశ్వనాథ్, బెంగళూరు కార్పొరేటర్ పద్మనాభ రెడ్డి శనివారం భేటీ అయ్యారు. దీనిపై స్పందించేందుకు రామలింగారెడ్డి నిరాకరించారు. ఫిరాయింపులపై చర్యలేవి? నిర్వీర్యమవుతున్న పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం దేశంలో ఇప్పటివరకూ ఒక్క నేతకూ శిక్షపడని వైనం కర్ణాటక, గోవాల్లో తలెత్తిన రాజకీయ సంక్షోభాలను నివారించేందుకు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఆయుధంగా వాడుకోవడానికి రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ చట్టాన్ని 1985లో నాటి ప్రధాని రాజీవ్గాంధీ తీసుకొచ్చారు. ఈ చట్టం కింద ఒక్క ప్రజాప్రతినిధికి శిక్ష పడకపోవడం గమనార్హం. స్పీకర్ పాత్రే కీలకం.. 1985లో వచ్చిన ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రచారం ఏ ప్రజాప్రతినిధి అయినా తమ పార్టీ విప్ను పాటించకపోయినా, స్వచ్ఛందంగా తన పదవికి రాజీనామా చేసినా అతను/ఆమె అనర్హులవుతారు. అయితే ఈ చట్టం ప్రజాస్వామ్య మౌలిక స్వరూపాన్ని దెబ్బతీస్తోందన్న వాదన కూడా ఉంది. ఎందుకంటే చాలా రాజకీయ పార్టీలు అంతర్గత విభేదాలను అణచివేయడానికి ఈ చట్టాన్ని ఓ ఆయుధంగా వాడుతున్నాయి. ఫిరాయింపుల నిరోధక చట్టం అమలులో స్పీకర్ పాత్రే కీలకం. స్పీకర్ ఈ విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించకపోతే ఈ చట్టం ఉద్దేశమే నీరుగారిపోతుంది. ఆంధ్రప్రదేశ్లో గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 23 మంది వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అధికార పార్టీ కొనుగోలు చేసింది. వీరిలో నలుగురికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టింది. ఈ సందర్భంగా ఫిరాయింపుదారులపై వేటేయాలని వైఎస్సార్కాంగ్రెస్ విజ్ఞప్తి చేసినప్పటికీ అప్పటి స్పీకర్ పట్టించుకోకపోవడాన్ని నిపుణులు గుర్తుచేస్తున్నారు. స్పీకర్ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం నిష్ప్రయోజనమవుతుందని చెబుతున్నారు. బెంగళూరులో సిద్ధరామయ్యను కలిసి వెళ్తున్న కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యే నాగరాజ్ -
ఫలించిన ట్రబుల్ షూటర్ చర్చలు
సాక్షి, బెంగళూరు : కర్నాటకలోని కాంగ్రెస్ జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి కౌంట్డౌన్ మొదలైంది. ముఖ్యమంత్రి కుమారస్వామి విశ్వాసపరీక్షకు సిద్ధం కావడంతో... రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ బుజ్జగిస్తోంది. ఇందులో భాగంగా ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ చర్చలు ఫలించాయి. రెబల్ ఎమ్మెల్యే నాగరాజ్ తన రాజీనామాను వెనక్కి తీసుకునేందుకు సుముఖత వ్యక్తం చేశారు. చర్చల్లో భాగంగా శివకుమార్ శనివారం ఉదయం ఉప ముఖ్యమంత్రి పరమేశ్వరతో కలిసి నాగరాజ్ నివాసానికి వెళ్లి ఆయనతో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. రాజీనామాకు వెనక్కి తీసుకోవాలని వీరు నాగరాజ్ను కోరారు. అనంతరం శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ... నాగరాజ్ కాంగ్రెస్లో ఉంటానని తమకు మాటిచ్చారన్నారు. కాంగ్రెస్ పార్టీతో తమకు 40ఏళ్ల అనుబంధం ఉందని, ప్రతి కుటుంబంలో కష్టనష్టాలు ఉంటాయని శివకుమార్ వ్యాఖ్యానించారు. నాగరాజ్ కాంగ్రెస్కి వీధేయుడని... పార్టీలోనే కొనసాగుతారని డీకే శివకుమార్ తెలిపారు. ఆయన తిరిగిరావడంతో తమకు కొండంతబలం వచ్చినట్టుందన్నారు. మరో రెబల్ ఎమ్మెల్యే సుధాకర్తో చర్చించి ఇద్దరూ కలిసి వస్తామని నాగరాజ్ హామీ ఇచ్చారు. చదవండి: రెబల్ ఎమ్మెల్యే నాగరాజ్తో మంతనాలు మరోవైపు ఎమ్మెల్యే రామలింగారెడ్డి వర్గంతోనూ శివకుమార్ టచ్లో ఉన్నారు. వారంతా బెంగళూరు రావాలని ఆయన ఆహ్వానించారు. తనతో ఉన్న ఎమ్మెల్యేలకు నచ్చచెప్పే ప్రయత్నం కాగా శాసనసభలో అవిశ్వాస తీర్మానంలో నెగ్గడానికి కాంగ్రెస్ ముమ్మర ప్రయత్నాలు మొదలుపెట్టింది. అసమ్మతిలో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలను సమావేశాలకు తీసుకురావడానికి డీకే బ్రదర్స్ శివకుమార్, సురేశ్ రంగంలోకి దిగారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే రామలింగారెడ్డి, శివాజీనగర ఎమ్మెల్యే రోషన్ బేగ్, ఆనంద్ సింగ్, మునిరత్నలను ఒప్పించి సభకు తీసుకు రావడం ద్వారా ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలని డీకే బ్రదర్స్ తమవంతు ప్రయత్నాలు చేపట్టారు. ఇప్పటికే అసమ్మతితో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి కుమారస్వామి మాట్లాడారు. అయితే వారు తమ రాజీనామా విషయంలో వెనక్కి తగ్గడం లేదు. అయినా కూడా ఏదో రకంగా వారిని ఒప్పించి తీసుకు వస్తామని సీఎంకు డీకే బ్రదర్స్ హామీ ఇచ్చారు. -
రెబల్ ఎమ్మెల్యే నాగరాజ్తో మంతనాలు
సాక్షి, బెంగళూరు : రాజీనామాలు చేసిన రెబల్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ బుజ్జగిస్తోంది. ఇందులో భాగంగా ఆ పార్టీ సీనియర్ నేత శివకుమార్ శనివారం ఉదయం రెబల్ ఎమ్మెల్యే నాగరాజ్ నివాసానికి వెళ్లారు. రాజీనామా వెనక్కి తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా నాగరాజ్ను కోరారు. మరోవైపు ఎమ్మెల్యే రామలింగారెడ్డి, ఆయన కుమార్తె సౌమ్యారెడ్డికి కూడా శివకుమార్ ఫోన్ చేశారు. కాగా కన్నడ రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి. జేడీఎస్–కాంగ్రెస్ సంకీర్ణ సర్కార్ సంక్షోభంలో కూరుకుపోయిన క్రమంలో అసెంబ్లీలో బలపరీక్షకు సిద్ధమని, సమయం ఖరారు చేయాలని ముఖ్యమంత్రి కుమారస్వామి శుక్రవారం అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్ను కోరిన విషయం తెలిసిందే. 16 మంది రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై యథాతథ స్థితి కొనసాగించాలని సుప్రీం కోర్టు పేర్కొన్న నేపథ్యంలో కుమారస్వామి విశ్వాస పరీక్షకు కోరడం ఉత్కంఠ రేపుతోంది. ఈ క్రమంలో మళ్లీ రిసార్టు రాజకీయాలు ప్రారంభమయ్యాయి. మూడు పార్టీల ఎమ్మెల్యేలను వేర్వేరు రిసార్టులకు తరలించారు. అయితే రాజీనామా చేసిన వారెవ్వరూ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేదు. కాంగ్రెస్ – జేడీఎస్ నిర్దేశించిన రిసార్టులకు కూడా వెళ్లలేదు. కొందరు ముంబయిలో ఉండగా.. మరికొందరు బెంగళూరులోనే ఉన్నారు. బల నిరూపణకు సిద్ధమని చెప్పడంతోనే.. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సీఎం కుమారస్వామి మాట్లాడుతూ కాంగ్రెస్ – జేడీఎస్లోని అసంతృప్త ఎమ్మెల్యేల రాజీనామా నేపథ్యంలో సంకీర్ణ ప్రభుత్వంలో గందరగోళం నెలకొందన్నారు. ఈసందర్భంగా వచ్చే మంగళవారం సుప్రీంకోర్టు తీర్పు అనంతరం బుధవారం అవిశ్వాస తీర్మానానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ నేతలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు రిసార్టుకు తరలించారు. ఈమేరకు రాజానుకుంటె సమీపంలోని రమడా రిసార్టుకు బీజేపీ సభ్యులను తరలించారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడే వరకు తమ పార్టీ సభ్యులంతా ఒక్క చోట ఉండాలని రిసార్టులో ఉన్నట్లు మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప తెలిపారు. అసెంబ్లీ సమావేశం ముగియగానే ఎమ్మెల్యేలందరినీ రాజానుకుంటెకు ఒకే బస్సులో తరలించారు. రిసార్టు నుంచి నేరుగా సోమవారం జరిగే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్నట్లు యడ్యూరప్ప తెలిపారు. మొత్తం 30 గదులు బుక్ చేసినట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క ఎమ్మెల్యేను కూడా చేజార్చుకోకూడదని బీఎస్ యడ్యూరప్ప గట్టి ప్రయత్నం చేస్తున్నారు. కాగా జేడీఎస్ ఎమ్మెల్యేలు గత నాలుగు రోజులుగా దేవనహళ్లి సమీపంలోని ఓ రిసార్టులో మకాం వేసిన సంగతి తెలిసిందే. సభ ముగియగానే వారందరినీ అదే రిసార్టుకు తీసుకెళ్లారు. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరినీ రిసార్టు బదులు యశవంతపురలోని తాజ్వివాంటా హోటల్కు తీసుకెళ్లారు. అయితే ముంబయిలో ఉన్న అసంతృప్త ఎమ్మెల్యేలు ఎవరూ అందుబాటులోకి రాలేదు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని విప్ జారీ చేసినప్పటికీ డుమ్మా కొట్టారు. మేమేం ఆపరేషన్ చేయలేదు: సిద్ధరామయ్య అసెంబ్లీలో బల నిరూపణకు సిద్ధంగా ఉన్నట్లు సీఎం కుమారస్వామి ప్రకటించారు. ఈనేపథ్యంలో తమ పార్టీ ఎమ్మెల్యేలపై నమ్మకం లేకుండా బీజేపీ రిసార్టులకు తరలిస్తోంది. సీఎంకు విశ్వాసం ఉన్నప్పటికీ ప్రతిపక్షం భయపడ్డం విడ్డూరంగా ఉంది. తాము ఎలాంటి ‘ఆపరేషన్’ చేయలేదు. రాజీనామా చేసిన వారిని అనర్హులుగా ప్రకటించాలని పిటిషన్ వేశాను. అయితే సుప్రీంకోర్టు నిబంధనలకు అనుగుణంగా ఏ నిర్ణయం తీసుకున్నా సరే. రాజీనామా చేసిన కె.సుధాకర్, రామలింగారెడ్డి ముంబయి వెళ్లలేదు. రోషన్బేగ్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశామని సిద్ధు అన్నారు. గోవాకు ఆనంద్సింగ్ రాజీనామా చేసిన ఎమ్మెల్యేల జాబితాలో ముందు వరుసలో ఉన్న ఆనందసింగ్ శుక్రవారం గోవా తరలివెళ్లారు. ఈమేరకు ఆయన కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వెళ్లారు. ఈనెల 1వ తేదీన రాజీనామా చేశారు. అయితే ఆ రోజు నుంచి రాష్ట్రం వదిలి వెళ్లలేదు. కానీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత ఇతర రాష్ట్రాలకు వెళ్లడం చర్చనీయంగా మారింది. అయితే ఆనందసింగ్ ముంబయి వెళ్లి అక్కడ అసంతృప్త ఎమ్మెల్యేలతో భేటీ తర్వాత గోవా వెళ్తారనే ప్రచారం సాగుతోంది. ముగ్గురు రెబల్ ఎమ్మెల్యేలు గైర్హాజరు సమర్పించిన రాజీనామాల విషయంపై వివరణ ఇచ్చేందుకు తన ఎదుట హాజరు కావాలని స్పీకర్ ఆదేశించినప్పటికీ ఎమ్మెల్యేలు అనంద్సింగ్, నారాయణగౌడ, ప్రతాప్గౌడ పాటిల్ గైర్హాజరయ్యారు. ఒత్తిడికి గురై రాజీనామా చేశారా? లేక ఇష్టంతోనే రా జీనామాలు చేశారా అనే విషయాలపై ఆరా తీసేందుకు నిన్న సాయం త్రం 3 నుంచి 4 గంటల సమయంలో తన ముందు హాజరు కావాలని స్పీకర్ నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ ఆ ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. -
విశ్వాసపరీక్షకు సిద్ధం!
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం మరో మలుపు తిరిగింది. సంకీర్ణ ప్రభుత్వ మనుగడపై అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో తాను విశ్వాసపరీక్షకు వెళతానని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రకటించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. శుక్రవారం నుంచి కర్ణాటక అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో విధానసౌధలో సీఎం మాట్లాడారు. విశ్వాసపరీక్ష విషయంలో తాను స్వచ్ఛందంగానే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విశ్వాసపరీక్షకు తేదీని ఖరారు చేయాలని స్పీకర్ రమేశ్ కుమార్ను కోరారు. అధికార దుర్వినియోగానికి పాల్పడాలన్న ఉద్దేశం తనకు లేదని పునరుద్ఘాటించారు. అనంతరం బిజినెస్ అడ్వైజరీ కమిటీ భేటీలో బుధవారం విశ్వాసపరీక్ష జరపాలని సీఎం తీర్మానించారు. అయితే ఈ భేటీకి బీజేపీ సభ్యులు హాజరుకాకపోవడంతో తుది నిర్ణయం తీసుకోలేదు. కాగా, 16 మంది రెబెల్ ఎమ్మెల్యేల్లో నలుగురితో కుమారస్వామి టచ్లో ఉన్నారనీ, అందుకే విశ్వాసపరీక్ష విషయంలో ముందుకెళుతున్నారనీ జేడీఎస్ సన్నిహితవర్గాలు తెలిపాయి. సీఎం ఎప్పుడు కోరినా రెడీ: స్పీకర్ సీఎం ఎప్పుడు కోరితే అప్పుడు విశ్వాసæపరీక్షకు స్లాట్ కేటాయిస్తానని స్పీకర్ తెలిపారు. ‘ప్రస్తుత గందరగోళ పరిస్థితుల్లో తాను అధికారంలో కొనసాగలేనని సీఎం అన్నారు. సీఎం బలపరీక్ష నిర్వహించాలని నన్ను కోరితే మరుసటి రోజే ఈ ప్రక్రియను చేపట్టవచ్చు’ అని స్పీకర్ అన్నారు. ఫలానా తేదీన విశ్వాసపరీక్ష కోసం సిద్ధమవ్వాలని తాను ముఖ్యమంత్రిని ఆదేశించలేనన్నారు. ఇక రెబెల్ ఎమ్మెల్యేలు ఆనంద్ సింగ్, ప్రతాప్ గౌడ, నారాయణ గౌడల రాజీనామాల విషయమై మాట్లాడుతూ..‘వాళ్లు నా దగ్గరకు వస్తే రాజీనామాల ప్రక్రియను మొదలుపెడతా. ఒకవేళ వాళ్లు రాకుంటే ఇంట్లో హాయిగా నిద్రపోతా. అంతే’ అని వ్యాఖ్యానించారు. ఒకవేళ స్పీకర్ 16 మంది రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదిస్తే కాంగ్రెస్–జేడీఎస్ బలం 100కు, ఇద్దరు స్వతంత్రుల మద్దతున్న బీజేపీ బలం 107కు చేరుకుంది. మరోవైపు కాంగ్రెస్–జేడీఎస్ పార్టీలు కలిసి విశ్వాసపరీక్షపై నిర్ణయం తీసుకున్నాయని సీఎల్పీ నేత సిద్దరామయ్య తెలిపారు. అసెంబ్లీలో బలం లేకుంటే ఎవ్వరూ విశ్వాసపరీక్షను కోరరనీ, తమ ప్రభుత్వానికి మెజారిటీ ఉందని పునరుద్ఘాటించారు. రిసార్టుకు బీజేపీ ఎమ్మెల్యేలు బలపరీక్షకు సిద్ధంగా ఉన్నామని కర్ణాటక సీఎం ప్రకటించడతో బీజేపీ నేతలు అప్రమత్తమయ్యారు. చివరి నిమిషంలో బీజేపీ ఎమ్మెల్యేలు అధికారపక్షం ప్రలోభాలకు లొంగకుండా అందరినిరాజానుకుంటె సమీపంలోని రమడా రిసార్టుకు తరలించారు. ఈ విషయమై కర్ణాటక బీజేపీ చీఫ్ యడ్యూరప్ప మాటాడారు. ‘ఈ పరిస్థితుల్లో మా ఎమ్మెల్యేలు అంతా కలసికట్టుగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అలాగే అందరూ కలిసి అసెంబ్లీకి రావాలని నిర్ణయించారు’ అని తెలిపారు. రెబెల్ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామాలు చేసినందున కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు జారీచేసే విప్లు వర్తించబోవని స్పష్టం చేశారు. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరినీ యశవంతపురలోని తాజ్వివాంటా హోటల్కు తీసుకెళ్లారు. అసెంబ్లీకి రెబల్స్ డుమ్మా సాక్షి, బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం ప్రారంభంకాగా, సమావేశాలకు హాజరుకావాలని ఎమ్మెల్యేలందరికీ కాంగ్రెస్, జేడీఎస్లు విప్ జారీచేశాయి. సమావేశాలకు హాజరై ప్రభుత్వానికి అనుకూలంగా మద్దతును తెలపాలని ఆదేశించాయి. ఆదేశాలను ధిక్కరిస్తే అనర్హత వేటు వేస్తామని హెచ్చరించాయి. ఈ విప్లను బేఖాతరు చేసిన రెబల్ ఎమ్మెల్యేలు సమావేశాలకు రాలేదు. ధనబలంతో ప్రభుత్వాల్ని కూల్చేస్తున్నారు: రాహుల్ అహ్మదాబాద్: వ్యతిరేక ప్రభుత్వాలను కూల్చేయడానికి బీజేపీ తన ధన బలాన్ని వాడుతోందని, బెదిరింపులకు పాల్పడుతోందనీ, కర్ణాటకలోనూ ఇదే జరుగుతోందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ ఆరోపించారు. అహ్మదాబాద్ జిల్లా సహకార బ్యాంకు రాహుల్పై వేసిన పరువునష్టం కేసులో విచారణకు హాజరయ్యేందుకు ఆయన శుక్రవారం గుజరాత్లోని అహ్మదాబాద్కు వచ్చారు. అక్కడ విలేకరులతో మాట్లాడారు. ‘తమకు వ్యతిరేక ప్రభుత్వాలను కూల్చేయడమే బీజేపీ పని. ధన బలాన్ని ఉపయోగించడం, ఇతర పార్టీల నేతలను బెదిరించడం, భయపెట్టడం ద్వారా ఇతర పార్టీల ప్రభుత్వాలను బీజేపీ ఏ రాష్ట్రంలో వీలైతే ఆ రాష్ట్రంలో కూల్చేస్తోంది. మొదట దీన్ని మనం గోవాలో చూశాం. ఈశాన్య భారతంలో ఇదే జరిగింది. కర్ణాటకలోనూ బీజేపీ అదే ప్రయత్నాల్లో ఉంది’ అని ఆరోపించారు. రాహుల్కు బెయిలు మంజూరు నోట్ల రద్దుసమయంలో అహ్మదాబాద్ జిల్లా సహకార బ్యాంకు రూ. 750 కోట్ల విలువైన పాత నోట్లను కొత్త నోట్లతో మార్పిడి చేసిందన్న రాహుల్ ఆరోపణలపై ఆ బ్యాంక్ గతంలో పరువునష్టం దావావేసింది. ఈ కేసులో అహ్మదాబాద్ కోర్టులో జరిగిన విచారణకు రాహుల్ హాజరయ్యారు. తాను ఏ తప్పూ చేయలేదనీ, తప్పుగా మాట్లాడలేదని కోర్టుకు రాహుల్ విన్నవించారు. రాహుల్ వాదనలను విన్న అనంతరం, ఆయన తరఫు లాయరు సమర్పించిన బెయిలు దరఖాస్తును కోర్టు ఆమోదించి, రాహుల్కు బెయిలు మంజూరు చేసింది. ప్రస్తుతం రాహుల్ గాంధీపై దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పరువునష్టం కేసులున్నాయి. యథాతథ స్థితి: సుప్రీంకోర్టు 10 మంది రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలు, అనర్హత విషయంలో జూలై 16 వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ను సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. అప్పటివరకూ యథాతథ స్థితిని కొనసాగించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ సందర్భంగా రెబెల్ ఎమ్మెల్యేల న్యాయవాది రోహత్గీ వాదిస్తూ..‘మా పిటిషనర్లపై అనర్హత వేటు వేసేందుకే స్పీకర్ ఇంకా రాజీనామాలను ఆమోదించలేదు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాక విప్ జారీచేయడం ద్వారా వీరిపై అనర్హత వేటేయాలని చూస్తున్నారు. కోర్టు అధికారాన్నే ప్రశ్నిస్తూ, తనకు సమయం కావా లంటూ స్పీకర్ రెండు పడవలపై ప్రయాణం చేస్తున్నారు’ అని వాదించారు. ఈ వాదనల్ని స్పీకర్ తరఫు లాయర్ సింఘ్వీ ఖండించారు. స్పీకర్ మమ్మల్నే సవాల్ చేస్తున్నారా? ఈ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు స్పీకర్ విషయంలో ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసింది. స్పీకర్ తరఫున న్యాయవాది అభిషేక్ సింఘ్వీని ఉద్దేశించి ధర్మాసనం స్పందిస్తూ.. ‘కర్ణాటక స్పీకర్ మా అధికారాన్ని, హోదాను సవాల్ చేస్తున్నారా? ఈ కేసులో స్పీకర్కు ఆదేశాలివ్వడంపై మాకున్న అధికారాలను సవాల్ చేస్తున్నారా? స్పీకర్కు సంబంధించిన ఏ విషయమైనా మమ్మల్ని చేతులు ముడుచుకుని కూర్చోమం టున్నారా? ఎమ్మెల్యేల రాజీనామాల కంటే ముందు అనర్హతపై చట్టప్రకారం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్పీకర్ చెబుతున్నారా?‘ అని ప్రశ్నలవర్షం కురిపించింది. దీనికి సింఘ్వీ ‘అవును. ఈ కేసులో అంతే’ అని బదులిచ్చారు. దీంతో అత్యున్నత న్యాయస్థానం స్పందిస్తూ..‘ఈ కేసు రాజ్యాంగంలోని ఆర్టికల్ 32తో పాటు 190, 361తో ముడిపడుంది. రాజీనామాలపై అనర్హత కంటే ముందే స్పీకర్ నిర్ణయం తీసుకోవాలా? అన్న విషయాన్ని పరిశీలించాలి. విస్తృత అంశాలను పరిశీలించేందుకు విచారణను జూలై 16కు(మంగళవారానికి) వాయిదా వేస్తున్నాం’ అని స్పష్టం చేసింది. అహ్మదాబాద్లో కోర్టు ప్రాంగణంలో రాహుల్ గాంధీ -
పార్టీ మారకుండా ఎందుకు రాజీనామా !?
సాక్షి, న్యూఢిల్లీ : అటో ఇటో తొందర్లోనే తేలిపోతుందనుకున్న కర్ణాటక సంక్షోభం అనూహ్యంగా ఇంకా కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో యథాతధా స్థితిని కొనసాగించాల్సిందిగా సుప్రీం కోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో తాను సభా విశ్వాసానికి సిద్ధమంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రకటించడం విశేషమే. అప్పటి వరకు సందిగ్ధత కొనసాగక తప్పదు. బీజేపీ ప్రలోభాల వల్లనే 14 మంది శాసన సభ్యులు రాజీనామా చేశారంటూ కాంగ్రెస్–జేడీఎస్ పార్టీలు ఆరోపిస్తున్నాయి. రెబల్స్ బీజేపీ ప్రలోభాలకు లొంగిపోయినట్లయితే రాజీనామా చేయడానికి బదులు అవిశ్వాసం తీర్మానం సందర్భంగా పాలకపక్షానికి వ్యతిరేకంగా ఓటు వేయవచ్చుగదా? అన్న సందేహం కలుగుతుంది. పార్టీ విప్లను ఉల్లంఘించినందుకు బర్తరఫ్తో అసెంబ్లీ సభ్వత్వాన్ని కోల్పోవాల్సి వస్తుందన్న భయమా? రాజీనామా చేసినా సభ్యత్వం ఎలాగు పోతుందికదా! అవినీతి కేసుల కారణంగా కాకుండా పార్టీల ఫిరాయింపుల కింద అసెంబ్లీ సభ్యత్వం రద్దవుతుంది. అలాంటి సమయాల్లో తదుపరి జరిగి ఉప ఎన్నికల్లో మరో పార్టీ టిక్కెట్పై పోటీ చేసి గెలవచ్చు. మరి ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకోకుండా రాజీనామానే ఎందుకు చేశారు? 14 మంది శాసన సభ్యులు రాజీనామా చేయడం వల్ల శాసనసభలో మొత్తం సభ్యుల సంఖ్య 210కి, పాలకపక్షం సభ్యుల సంఖ్య 104కు పడిపోతుంది. 105గా ఉన్న బీజేపీ బలం స్వతంత్ర అభ్యర్థి, మరో పార్టీ ఏకైక అభ్యర్థి మద్దతులో 106కు చేరుకుంటుంది. అంటే మెజారిటీ సభ్యుల బలం బీజేపీకి ఉంటుంది. అదే అవిశ్వాసానికి వెళ్లినట్లయితే 14 మంది బీజేపీకే వేస్తారన్న నమ్మకం బీజేపీకి లేదు. అందులో ముగ్గురు, నలుగురు సభ్యులు పాలకపక్షం వెంట ఉన్నా ఆ ప్రభుత్వం పడిపోవడం కష్టం. పైగా కుమారస్వామి సర్కారుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే దాన్ని అనుమతిస్తారా, లేదా? అన్నది కూడా అనుమానమే కనుక రెబల్స్కు బీజేపీ రాజీనామాల దారినే చూపింది. ఇప్పుడు కుమారస్వామియే అవిశ్వాసానికి సిద్ధమవడంతో పరిస్థితి మరో మలుపు తిరిగింది. -
స్పీకర్ కోర్టులో బంతి
సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ/ముంబై: కర్ణాటక రాజకీయం గురువారం మరింత రసవత్తరంగా మారింది. అసెంబ్లీ స్పీకర్ రమేశ్ తమ రాజీనామాలను కావాలనే ఆమోదించట్లేరని 10 మంది రెబెల్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఆ ఎమ్మెల్యేలను కలవాలని స్పీకర్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో వీరంతా ప్రత్యేక విమానాల్లో ముంబై నుంచి కర్ణాటకలోని హాల్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడినుంచి పోలీస్ భద్రత మధ్య లగ్జరీ బస్సులో విధానసౌధ(అసెంబ్లీ)లోని స్పీకర్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా తిరుగుబాటు ఎమ్మెల్యేలతో సాయంత్రం 6 నుంచి గంటపాటు సమావేశమైన స్పీకర్ రమేశ్‡.. వారు మరోసారి సమర్పించిన రాజీనామా లేఖల్ని స్వీకరించారు. సమావేశం అనంతరం రమేశ్ మీడియాతో మాట్లాడారు. ‘ఎమ్మెల్యేలు తమ రాజీనామాలను ఈసారి సరైన ఫార్మాట్లో సమర్పించారు. ఈ రాజీనామాలను శాసనసభ్యులు ఇష్టపూర్వకంగానే ఇచ్చారా? లేదా? అనేది సమీక్షిస్తా. ఇందుకోసం కొంత సమయం పడుతుంది. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులకు, రాబోయే ఫలితానికి నేను ఎంతమాత్రం బాధ్యుడ్ని కాదు’ అని రమేశ్ స్పష్టం చేశారు. రాజీనామాలు సమర్పించిన అనంతరం తిరుగుబాటు ఎమ్మెల్యేలు ముంబైకి వెళ్లిపోయారు. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు 10 మంది రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై తక్షణం నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు గురువారం అసెంబ్లీ స్పీకర్ రమేశ్ను ఆదేశించింది. వీరి రాజీనామాలపై తీసుకున్న నిర్ణయాన్ని శుక్రవారం తమకు తెలియజేయాలని సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ అనిరుద్ధ బోస్ల ధర్మాసనం సూచించింది. ఈ 10 మంది ఎమ్మెల్యేలు బెంగళూరు విమానాశ్రయం నుంచి విధానసౌధ వరకూ వెళ్లేందుకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని కర్ణాటక డీజీపీని ఆదేశించింది. వీరంతా గురువారం సాయంత్రం 6 గంటలకు స్పీకర్తో భేటీ కావాలని ఆదేశించింది. ఈ ఆదేశాలు వెలువడ్డ కొన్నిగంటల్లోనే స్పీకర్ రమేశ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నిబంధనల మేరకు తొలుత అందిన, పెండింగ్లో ఉన్న విజ్ఞప్తులపై తాను నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఈ సందర్భంగా స్పీకర్ కోర్టుకు విన్నవించారు. కాబట్టి రెబెల్ ఎమ్మెల్యేల పిటిషన్ విషయంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవరించాలని కోరారు. అయితే ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చినందున స్పీకర్ పిటిషన్ను రెబెల్ ఎమ్మెల్యేల పిటిషన్తో కలిపి విచారిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. తమ ఉత్తర్వులు కేవలం ఈ 10 మంది ఎమ్మెల్యేలకే వర్తిస్తాయని తేల్చిచెప్పింది. విధానసౌధ వద్ద 144 సెక్షన్ కర్ణాటక అసెంబ్లీ వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. శుక్రవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండటం, మరోవైపు ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికల నేపథ్యంలో విధానసౌధకు 2 కి.మీ పరిధిలో సీఆర్పీసీ సెక్షన్ 144 కింద నిషేధాజ్ఞలు విధించారు. ఈ ప్రాంతంలో ఐదుగురి కంటే ఎక్కువమంది గుమిగూడేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసిన నగర కమిషనర్ అలోక్ కుమార్.. ఈ నిషేధాజ్ఞలు గురువారం నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చేందుకు మరో నలుగురు ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారు. సౌమ్యా రెడ్డి(జయనగర–బెంగళూరు), సుబ్బారెడ్డి(బాగేపల్లి), మహంతేశ్ కౌజలగి(రాయభాగ), అంజలి నింబాళ్కర్(ఖానాపుర)లు త్వరలోనే రాజీనామా చేస్తారని సమాచారం. మనస్సాక్షి ఆధారంగా నిర్ణయం: స్పీకర్ రెబెల్ ఎమ్మెల్యేల పిటిషన్ విషయంలో సుప్రీంకోర్టు చాలా జాగ్రత్తగా స్పందించిందని స్పీకర్ రమేశ్ కుమార్ తెలిపారు. ‘10 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలను కలుసుకోవాలనీ, వారి రాజీనామాలను స్వీకరించాలని అత్యున్నత న్యాయస్థానం నన్ను కోరింది. ఒకవేళ ఈ రాజీనామాలను ఆమోదిస్తే, అనర్హతవేటు వేయాలంటూ కాంగ్రెస్, జేడీఎస్ చేసిన విజ్ఞప్తులు చెల్లకుండాపోతాయి. ఒకవేళ నేను ఈ ప్రక్రియను ఆదరాబాదరాగా చేపడితే మొత్తంగా అన్యాయం చేసినట్లు అవుతుంది. ఈ విషయంలో నేను మనస్సాక్షి ఆధారంగా ముందుకెళతా. ఎమ్మెల్యేల రాజీనామాల విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాలని మాత్రమే సుప్రీంకోర్టు నన్ను కోరింది. 10 మంది శాసనసభ్యులతో గురువారం జరిగిన భేటీని వీడియో తీయించాను. శుక్రవారం ఈ వీడియోను సుప్రీంకోర్టుకు సమర్పిస్తాను. అలాగే ఎమ్మెల్యేలు ఇష్టపూర్వకంగా, స్వచ్ఛందంగానే రాజీనామాలు సమర్పించారా.. అనే విషయమై రాత్రంతా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిఉంటుంది. నేనేమీ మెరుపువేగంతో పనిచేయలేను. ప్రజలకు, రాష్ట్రానికి, పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు తప్ప నేను ఎవ్వరికీ జవాబుదారీ కాదు’ అని వెల్లడించారు. ఎమ్మెల్యేల రాజీనామాలపై తాను కావాలనే ఆలస్యం చేస్తున్నట్లు కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు రావడంతో కలత చెందానని స్పీకర్ రమేశ్ పేర్కొన్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు గవర్నర్ వజూభాయ్వాలాను జూలై 6న కలిశారనీ, ఆ రోజున తాను కార్యాలయంలోనే ఉన్నానన్నారు. అయితే తాను సొంతపనిపై బయటకు వెళ్లగా, ఎమ్మెల్యేలు కనీస సమాచారం ఇవ్వకుండా తన కార్యాలయానికి వచ్చారని చెప్పారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో పరిస్థితులు గందరగోళంగా, రోతపుట్టించేలా తయారయ్యాయని రమేశ్ వ్యాఖ్యానించారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలతో భేటీకి ముందు రమేశ్ మీడియాతో మాట్లాడుతూ..‘వాళ్లు(శాసనసభ్యులు) నా కార్యాలయానికి రావాలనుకుంటే నేను అడ్డుకునేవాడిని కాదు. ఇందుకోసం వాళ్లు సుప్రీంకోర్టు వరకూ ఎందుకెళ్లారో నాకు అర్థం కావట్లేదు. శాసనసభ్యుల్ని కలుసుకోవడానికి నేను ఏనాడూ నిరాకరించలేదు‘ అని స్పష్టం చేశారు. స్పీకర్పై అభిశంసన? సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: కర్ణాటకలో ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించాలని సుప్రీంకోర్టు స్పీకర్ను ఆదేశించజాలదని రాజ్యాంగ నిపుణులు, సీనియర్ న్యాయవాదులు చెబుతున్నారు. శాసన, కార్యనిర్వాహక, న్యాయశాఖల మధ్య ఉన్న అధికారాల విభజనే ఇందుకు కారణమని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విషయంలో ఓస్థాయి దాటి అత్యున్నత న్యాయస్థానం కూడా జోక్యం చేసుకోలేదనీ, తమ అభిప్రాయాలను మాత్రమే చెప్పగలదని స్పష్టం చేశారు. మరోవైపు అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు కమలనాథులు సిద్ధమవుతున్నారు. అసెంబ్లీలో బీజేపీకి ఇప్పటికే 107 మంది సభ్యుల మద్దతున్న నేపథ్యంలో స్పీకర్ రమేశ్ కుమార్పై ‘అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. నేటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ద్రవ్య బిల్లు(ఓటాన్ అకౌంట్)ను ప్రవేశపెట్టనుంది. రాజీనామా ప్రసక్తే లేదు: సీఎం ‘అసలు నేనెందుకు రాజీనామా చేయాలి? ఇప్పుడు నేను రాజీనామా చేయాల్సిన అవసరం ఏంటి? 2009–10 సమయంలో కొంత మంది మంత్రులు సహా 18 మంది ఎమ్మెల్యేలు అప్పటి సీఎం యడ్యూరప్పను వ్యతిరేకించారు. అప్పుడాయన రాజీనామా చేయలేదే’ అని సీఎం కుమారస్వామి అన్నారు. అవిశ్వాస పరీక్షను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు గురువారం సమావేశమైన రాష్ట్ర కేబినెట్ తీర్మానించింది. అసెంబ్లీకొస్తున్న సీఎం కుమారస్వామి బీజేపీ నేతలతో మంత్రి మహేశ్ రహస్య భేటీ సాక్షి, బెంగళూరు: సీఎం కుమారస్వామి సన్నిహితుడు, మంత్రి సా.రా.మహేశ్ గురువారం రాత్రి బెంగళూరులో కర్ణాటక బీజేపీ ఇన్చార్జ్ మురళీధరరావు, బీజేపీ సీనియర్ నేత ఈశ్వరప్పతో రహస్యంగా భేటీ అయ్యారు. బీజేపీతో జేడీఎస్ మైత్రి కోసమే మహేశ్ రంగంలోకి దిగారని వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో మంత్రి మహేశ్ స్పందిస్తూ.. తాను బీజేపీ నేతలను అనుకోకుండా కలిశానని తెలిపారు. విశ్రాంతి తీసుకునేందుకు తాను వెళ్లగా బీజేపీ నేతలు కనిపించారనీ, దీంతో మర్యాదపూర్వకంగా మాట్లాడానని స్పష్టం చేశారు. -
‘ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరడం లేదు’
సాక్షి, విజయనగరం : టీడీపీ ఎంపీలపై ఉన్నది కేవలం ఆరోపణలు మాత్రమే.. అవి నిజం కావాలని లేదు కదా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎవరూ బీజేపీలో చేరడం లేదని ఆయన స్పష్టం చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 2014 ముందు వరకూ చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఉండేది.. కానీ ఇప్పుడు 12 కోట్ల సభ్యత్వాలతో బీజేపీ అతి పెద్ద రాజకీయ పార్టీగా మారిందన్నారు. ఆగస్టు 11 వరకూ బీజేపీ సభ్యత్వ నమోదు జరుగుతుందని తెలిపారు. గడిచిన ఐదేళ్లలో మోదీ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే మళ్లీ ఎన్డీఏకు పట్టం కట్టేలా చేశాయన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వం నచ్చి, మెచ్చి, ఢిల్లీ నుంచి గల్లీ వరకూ చేరికలు జరుగుతున్నాయన్నారు. ఆర్థిక సంస్థల దాడులను ప్రశ్నించడం దౌర్భాగ్యం అన్నారు కన్నా. బీజేపీని అనడం సరి కాదు : పురంధరేశ్వరి కర్ణాకటలో ఏర్పడిన రాజకీయ సంక్షోభానికి బీజేపీని బాధ్యులని చేయడం సరికాదన్నారు కేంద్ర మాజీ మంత్రి పురందరేశ్వరి. కాంగ్రెస్ నన్ను క్లర్క్ కన్నా హీనంగా చూస్తుందని అనేక సందర్భాల్లో కుమార్ స్వామి స్వయంగా ఆవేదన వ్యక్తం చేయడం నిజం కాదా అని ఆమె ప్రశ్నించారు. ప్రస్తుత సంక్షోభానికి కాంగ్రెస్-జేడీఎస్ అంతర్గత విబేధాలే కారణం అన్నారు. -
కర్ణాటకానికి క్లైమాక్స్ ఏంటి?
కర్ణాటకలో రాజకీయ సంక్షోభం రోజుకో మలుపు తిరుగుతోంది. తిరుగుబాటు ఎమ్మెల్యేల రాజీనామాల విషయంలో నిర్ణయం తీసుకోవడానికి ఆరు రోజులు పడుతుందని స్పీకర్ మంగళవారం చెప్పారు. తమ రాజీనామాల విషయంలో స్పీకర్ కావాలనే తాత్సారం చేస్తున్నారని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని తిరుగుబాటు ఎమ్మెల్యేలు కొందరు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సంక్షోభ నివారణకు చర్య తీసుకోవాలని బీజేపీ గవర్నర్కు విజ్ఞప్తి చేసింది. మరోవైపు రాజీనామా చేసిన ఎమ్మెల్యేలను నయానో, భయానో వెనక్కి రప్పించడానికి కాంగ్రెస్, జేడీఎస్లు ప్రయత్నిస్తున్నాయి. శుక్రవారం నుంచి శాసన సభ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సమస్యకు పరిష్కారాలేమిటన్నది చర్చనీయాంశమయింది. రాజీనామాల ఆమోదం 16 మంది ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించడం. అదే జరిగితే కాంగ్రెస్ కూటమి బలం 100 కి పడిపోతుంది. దాంతో శాసన సభలో బలం నిరూపించుకోవాలని స్పీకర్ కుమార స్వామిని ఆదేశించవచ్చు. 16 మంది ఎమ్మెల్యేలు తగ్గిపోవడంతో శాసన సభలో మొత్తం సభ్యుల సంఖ్య 209 అవుతుంది. ప్రభుత్వం ఏర్పాటుకు 105 మంది ఉంటే సరిపోతుంది. బీజేపీకి సొంతంగా 105 మంది ఉన్నారు. మరో ఇద్దరు ఇండిపెండెంట్లు ,ఒక బీఎస్పీ ఎమ్మెల్యే మద్దతిస్తున్నందున వారి బలం 108కి పెరుగుతుంది..కాబట్టి ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశమివ్వాలని ఆ పార్టీ డిమాండు చేసే అవకాశం ఉంది. రాజీనామాల తిరస్కరణ ఒకవేళ స్పీకర్ ఎమ్మెల్యేల రాజీనామాలను తిరస్కరిస్తే దానిపై వారు కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్ ఇన్ని రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలన్న నిబంధన ఏదీ లేదు. స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాతే ఎమ్మెల్యేలు కోర్టుకు వెళ్లేందుకు వీలవుతుంది. ఫలితంగా సంక్షోభం మరింత కాలం కొనసాగవచ్చు.పది మంది తిరుగుబాటుఎమ్మెల్యేలు కోర్టును ఆశ్రయించారు. రాజీనామాలపై నిర్ణయం తీసుకోమని కోర్టు స్పీకర్కు సూచించవచ్చు. లేదా శాసన సభలో బల నిరూపణకు ఆదేశించవచ్చు. ఎమ్మెల్యేలు వెనక్కి రావడం రాజీనామా చేసిన ఎమ్మెల్యేల్లో పలువురు తిరిగి వస్తారని కాంగ్రెస్,జేడీఎస్ నేతలు ఇప్పటికీ నమ్మకంగా ఉన్నారు. తిరుగుబాటు నేతలకు మంత్రిపదవులివ్వడం కోసం ప్రస్తుత మంత్రివర్గం రాజీనామా కూడా చేసింది. ఆ ఆశతోనైనా కొందరు తిరిగొస్తారని భావిస్తున్నారు. ముందు నలుగురైదుగురు వెనక్కి వస్తే..తర్వాత మిగతావాళ్లు ఆ దారినే వస్తారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడొకరు అన్నారు. అది జరగని పక్షంలో బీజేపీ ఎమ్మెల్యేలు కొంత మంది రాజీనామా చేసేలా కూటమి నేతలు వ్యూహం పన్నవచ్చు. ఫిరాయింపు నిరోధక చట్టం తిరుగుబాటు ఎమ్మెల్యేలపై పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని ప్రయోగించాలని కాంగ్రెస్ ఆలోచిస్తోంది. అయితే, చట్ట ప్రకారం అది చెల్లదని న్యాయనిపుణులు అంటున్నారు. ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం శాసన సభ్యుడిని అనర్హుడిగా ప్రకటించాలంటే ఆ సభ్యుడు పార్టీ విప్ను ధిక్కరించాలి. లేదా స్వచ్ఛందంగా పార్టీకి రాజీనామా చేయాలి. ఇక్కడ ఈ రెండూ జరగలేదు. కాబట్టి వీరికి ఫిరాయింపు చట్టం వర్తించదు. -
సుప్రీంకు చేరిన కర్ణాటకం
న్యూఢిల్లీ: శాసనసభ స్పీకర్ తమ రాజీనామాలను ఉద్దేశపూర్వకంగానే ఆమోదించడం లేదంటూ కాంగ్రెస్, జేడీఎస్లకు చెందిన పది మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు బుధవారం సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ గురువారం అత్యవసర విచారణకు వచ్చేలా చూస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్తో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ ఎమ్మెల్యేలు ఇప్పటికే రాజీనామా చేశారని, ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాది రోహత్గి కోర్టుకు తెలిపారు. తమ రాజీనామాల విషయంలో స్పీకర్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని, మైనారిటీలో పడిపోయిన ప్రభుత్వాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో కావాలనే తమ రాజీనామాలను ఆమోదించడం లేదని తిరుగుబాటు ఎమ్మెల్యేలు పిటిషన్లో ఆరోపించారు. తమ రాజీనామాలను ఆమోదించాల్సిందిగా స్పీకర్ను ఆదేశించాలని వారు ధర్మాసనాన్ని కోరారు. అంతేకాకుండా తమను అనర్హులుగా ప్రకటించకుండా స్పీకర్ను నిరోధించాలని కూడా వారు కోరారు. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ కాంగ్రెస్ పార్టీ స్పీకర్కు పిటిషన్ సమర్పించిందని వారు పేర్కొన్నారు. తమను అనర్హులుగా ప్రకటించడం పూర్తిగా చట్టవిరుద్దమన్నారు. రాజ్యసభలో రభస కర్ణాటకలో రాజకీయ సంక్షోభంపై కాంగ్రెస్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేయడంతో రాజ్యసభలో వరసగా రెండో రోజు బుధవారం కార్యకలాపాలకు అంతరాయం కలిగింది.భోజన విరామం తర్వాత బడ్జెట్పై చర్చ మొదలవగానే కాంగ్రెస్ ఎంపీలు సభ మధ్యకు దూసుకొచ్చి నినాదాలు చేశారు. చర్చను ప్రారంభించాల్సిన కాంగ్రెస్ నేత చిదంబరం ఈ గొడవ కారణంగా మాట్లాడలేకపోయారు. గందరగోళం మధ్య చర్చించలేమంటూ సమాజ్వాదీ ఎంపీలు వాకౌట్ చేశారు. గందరగోళం కారణంగా సభ మూడు సార్లు వాయిదా పడింది. తర్వాత అధికార, విపక్ష సభ్యులు మాట్లాడుకుని గురువారం బడ్జెట్పై చర్చను కొనసాగించాలని నిర్ణయించారు. దాంతో సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్టు ఉపాధ్యక్షుడు హరివంశ్ ప్రకటించారు. -
విధానసౌధలో బీజేపీ ఆందోళన
సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్న బీజేపీ నేతలు బుధవారం రంగంలోకి దిగారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప నేతృత్వంలో బీజేపీ నేతలు, ఎమ్మెల్యేలు విధానసౌధ(అసెంబ్లీ) ముందు ఆందోళనకు దిగారు. గాంధీజీ విగ్రహం ముందు బైఠాయించిన నేతలు, కుమారస్వామి సీఎం పదవికి రాజీనామా చేయాలని నినాదాలు ఇచ్చారు. అనంతరం రాజ్భవన్లో గవర్నర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. బుధవారం నాటికి 16 మంది కాంగ్రెస్–జేడీఎస్ కూటమి ఎమ్మెల్యేలు రాజీనామా సమర్పించిన నేపథ్యంలో వాటిపై త్వరితగతిన నిర్ణయం తీసుకునేలా స్పీకర్ను ఆదేశించాలని గవర్నర్ను కోరారు. దీంతో అన్ని అంశాలను పరిశీలించాక దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటానని గవర్నర్ జవాబిచ్చారు. గవర్నర్ రాజ్యాంగబద్ధంగా ఏ నిర్ణయం తీసుకున్నా, బలపరీక్షకు ఆదేశించినా బీజేపీ శిరసావహిస్తుందని కేంద్ర మంత్రి సదానంద గౌడ తెలిపారు. కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ 9 మంది రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలను తిరస్కరించిన నేపథ్యంలో వీరంతా గురువారం మరోసారి రాజీనామాలను సమర్పించారు. మెజారిటీ కోల్పోయారు: యడ్యూరప్ప ‘ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ రమేశ్ కుమార్ ఆలస్యం చేయకుండా ఆమోదిస్తే జూలై 12 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలు కూడా జరగవు. కాంగ్రెస్–జేడీఎస్ కూటమి నుంచి ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసే అవకాశముంది. కాబట్టి సీఎం కుమారస్వామి ఈ వాస్తవాన్ని అర్థం చేసుకుని తన పదవికి రాజీనామా చేస్తే మంచిది’ అని యడ్యూరప్ప హితవు పలికారు. మరోవైపు స్పీకర్ రమేశ్ కుమార్తో బుధవారం సమావేశమైన బీజేపీ ప్రతినిధి బృందం.. రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరింది. ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా.. కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వానికి తాజాగా ఇద్దరు కాంగ్రెస్ నేతలు షాకిచ్చారు. రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి నాగరాజ్, ఎమ్మెల్యే సుధాకర్లు బుధవారం స్పీకర్ను కలిసి తమ రాజీనామాలను సమర్పించారు. దీంతో అధికార కూటమి నుంచి రాజీనామాలు సమర్పించిన ఎమ్మెల్యేల సంఖ్య 16(13 మంది కాంగ్రెస్, ముగ్గురు జేడీఎస్ ఎమ్మెల్యేలు)కు చేరుకుంది. రాజీనామా చేసేందుకు స్పీకర్ ఆఫీస్కు వచ్చిన ఎమ్మెల్యే సుధాకర్ను కాంగ్రెస్, జేడీఎస్ నేతలు నిర్బంధించారు. విధానసౌధ మూడో అంతస్తులో మంత్రి కేజే జార్జ్ కార్యాలయంలోకి సుధాకర్ను లాకెళ్లి కూర్చోబెట్టారు. కొద్దిసేపటికే అక్కడకు చేరుకున్న సిద్దరామయ్య మంత్రి పదవి ఇస్తామనీ, రాజీనామా చేయవద్దని కోరారు. అయితే తనకు నమ్మకం పోయిందనీ, రాజీనామా చేస్తున్నానని సుధాకర్ స్పష్టం చేశారు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ నేతలు అక్కడకు చేరుకుని ఆందోళనకు దిగారు. మరోవైపు సుధాకర్ భార్య వజూభాయ్వాలాకు ఫోన్ చేయడంతో వెంటనే ఎమ్మెల్యేలను తన దగ్గరకు తీసుకురావాలని నగర కమిషనర్ను గవర్నర్ ఆదేశించారు. దీంతో కమిషనర్ స్వయంగా ఎమ్మెల్యేను రాజ్భవన్కు తీసుకురావడంతో వ్యవహారం సద్దుమణిగింది. అన్ని హద్దులు దాటేశారు: కుమారస్వామి బీజేపీ అన్ని చట్టాల ఉల్లంఘన విషయంలో అన్ని హద్దులు దాటేసిందని కుమారస్వామి విమర్శించారు. బీజేపీ రాజకీయం చేస్తోందా? లేక వక్రబుద్ధి ప్రదర్శిస్తోందా? అని నిలదీశారు. మంత్రి శివకుమార్కు రక్షణ కల్పించాల్సిన మహారాష్ట్ర ప్రభుత్వం ప్రొటోకాల్ను ఉల్లంఘించిందన్నారు. -
సంక్షోభం ముదిరింది
బెంగళూరులో మొదలైన కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వ సంక్షోభం ముదిరి ముంబై, ఢిల్లీలకూ విస్తరించింది. బెంగళూరులో కాంగ్రెస్ నేత, మంత్రి నాగరాజ్, ఎమ్మెల్యే సుధాకర్లు బుధవారం రాజీనామా సమర్పించడంతో హైడ్రామా మొదలైంది. రాజీనామావేళ ఎమ్మెల్యే సుధాకర్ను కాంగ్రెస్–జేడీఎస్ నేతలు నిర్బంధించగా, గవర్నర్ జోక్యంతో బయటపడ్డారు. ముంబైలోని 10 మంది రెబెల్ ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు వెళ్లిన మంత్రి శివకుమార్ను పోలీసులు హోటల్ గేటు వద్దే అడ్డుకున్నారు. అనంతరం బలవంతంగా బెంగళూరుకు వెళ్లే విమానం ఎక్కించారు. మరోవైపు స్పీకర్ తమ రాజీనామాలను ఆమోదించట్లేరంటూ రెబల్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టు మెట్లు ఎక్కారు. దీంతో, కన్నడ రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముంబై: కర్ణాటక రెబెల్ ఎమ్మెల్యేలు ఉంటున్న ముంబైలోని రినైసన్స్ హోటల్ వద్ద బుధవారం హై డ్రామా నడిచింది. ఎమ్మెల్యేలతో మాట్లాడేందుకు వచ్చిన కర్ణాటక మంత్రి, కాంగ్రెస్లో కీలక నేత డీకే శివకుమార్ను హోటల్ లోపలికి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకుని, అదుపులోకి తీసుకుని కొన్ని గంటల అనంతరం బలవంతంగా బెంగళూరుకు పంపారు. అంతకుముందు హోటల్ బయట శివకుమార్ మీడియాతో మాట్లాడుతుండగా, పోలీసులు ఆయనను పక్కకు లాగేసినంత పనిచేసి, వ్యానులో కూర్చోబెట్టుకుని వెళ్లిపోయారు. తాను ఆ హోటల్లో రిజర్వేషన్ చేసుకున్నాననీ, తనను లోపలకు వెళ్లనివ్వాలని శివకుమార్ కోరినా ముంబై పోలీసులు పట్టించుకోలేదు. శివకుమార్ను కలిసేందుకు హోటల్ వద్దకు వచ్చిన మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలు మిలింద్ దేవరా, నసీం ఖాన్లను కూడా పోలీసులు శివకుమార్తోపాటే అదుపులోకి తీసుకుని, వారు ముగ్గురినీ కలీనా ప్రాంతంలోని ఓ అతిథి గృహానికి తరలించారు. కొద్దిసేపటి అనంతరం దేవరా, ఖాన్లను విడిచిపెట్టి, శివకుమార్ను నేరుగా ముంబై విమానాశ్రయానికి బలవంతంగా తీసుకెళ్లి బెంగళూరు విమానం ఎక్కించారు. కాగా, రినైసన్స్ హోటల్లో మొత్తం 12 మంది కర్ణాటక రెబెల్ ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో ఏడుగురు కాంగ్రెస్, ముగ్గురు జేడీఎస్, ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు. ఉదయం 8.20 గంటలకే శివకుమార్ హోటల్ వద్దకు చేరుకోగా, ఆయనను లోపలకు వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, శివకుమార్ల నుంచి తమకు ప్రాణహాని ఉందనీ, వారిని హోటల్ లోపలకు రానివ్వద్దంటూ రెబెల్ ఎమ్మెల్యేలు తమను కోరారని పోలీసులు చెప్పారు. హోటల్ బయట ఉన్నవాళ్లు ‘శివకుమార్ వెనక్కు వెళ్లిపోవాలి’ అంటూ నినాదాలు కూడా చేశారు. హోటల్ బయట, ఆ మార్గంలో భారీ సంఖ్యలో పోలీసు సిబ్బందిని మహారాష్ట్ర ప్రభుత్వం మోహరించింది. హోటల్ సెక్యూరిటీ గార్డులు, కెమెరాల సిబ్బంది, విలేకరులు, పార్టీ కార్యకర్తల మధ్య కొద్దిసేపు తోపులాట చోటుచేసుకుంది. వెనక్కి తీసుకెళ్లగలననే నమ్మకంతో వచ్చా.. పోలీసులు తనను అదుపులోకి తీసుకోడానికి ముందు శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ తాను రెబెల్ ఎమ్మెల్యేలతో శాంతంగా చర్చలు జరపడం కోసమే వచ్చానన్నారు. తన వద్ద ఏ ఆయుధమూ లేదనీ, భద్రతా సిబ్బందిని కూడా వెంట తెచ్చుకోలేదనీ, కేవలం మాట్లాడేందుకే ఇక్కడకు వచ్చానని ఆయన వెల్లడించారు. లోపల ఉన్న ఎమ్మెల్యేలంతా గత 40 ఏళ్లుగా తనకు మిత్రులనీ, వారితో కలిసి కాఫీ తాగుతూ మాట్లాడటానికి ఇక్కడకు వచ్చాననీ, అయినా తనను లోపలకు వెళ్లనివ్వడం లేదని శివకుమార్ తెలిపారు. కర్ణాటక ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర పన్నుతుండకపోతే తనను ఎందుకు లోపలకు వెళ్లనివ్వడం లేదనీ, ఏ ఆయుధమూ లేకుండానే తన మిత్రులకు తానెలా హాని తలపెట్టగలనని ఆయన ప్రశ్నించారు. వారితో మాట్లాడితే తాను వారిని కర్ణాటకకు వెనక్కి తీసుకెళ్లగలనన్న నమ్మకం తనకు ఉందని శివకుమార్ చెప్పారు. ఎమ్మెల్యేలను కలవనీయకుండానే శివకుమార్ను పోలీసులు వెనక్కు పంపేశారు. బీజేపీ ప్రజాస్వామ్యం గొంతునులుముతోంది: చవాన్ కర్ణాటక ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందనీ, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని అస్థిరపరచడం ద్వారా ప్రజాస్వామ్యం గొంతును ఆ పార్టీ నులుముతోందని మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ ఆరోపించారు. బీజేపీ వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యానికి చేటని ఆయన అన్నారు. చవాన్ మాట్లాడుతూ కర్ణాటకలో ప్రభుత్వాన్ని అస్థిరపరచడాన్ని మహారాష్ట్ర సీఎం, బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ ప్రోత్సహిస్తున్నారనీ, రెబెల్ ఎమ్మెల్యేలను ముంబైలోని హోటల్లో బంధించారని చవాన్ మండిపడ్డారు. గతంలో గోవా, మణిపూర్ల్లోనూ ప్రజాస్వామ్యాన్ని బీజేపీ అపహాస్యం చేసిందని చవాన్ అన్నారు. రెబెల్ ఎమ్మెల్యేల్లో అత్యధికులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలేననీ, కానీ వారిని కలిసేందుకు కాంగ్రెస్ నాయకులనే లోపలకు అనుమతించని విషయాన్ని అందరూ గుర్తించాలని చవాన్ కోరారు. శివకుమార్ మీడియాతో మాట్లాడుతుండగా, పోలీసులు ఆయనను పక్కకు లాగేసినంత పనిచేయడం గర్హనీయమన్నారు. -
కర్ణాటక సంక్షోభం : రతన్ టాటాను తప్పుపడతారా?
బెంగళూరు : కర్ణాటకలోని జేడీఎస్–కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలో ఏర్పడిన సంక్షోభం ఇప్పట్లో ముగిసేలా లేదు. శాసన సభ్యుల తిరుగుబాటు వెనక బీజేపీ హస్తం ఉందంటూ జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి. అయితే వీటిని బీజేపీ కేంద్ర నాయకత్వం ఖండించడమూ తెల్సిందే. పది మంది రెబెల్ శాసన సభ్యులు, బీజేపీ రాజ్యసభ సభ్యుడు రాజీవ్ చంద్రశేఖర్ కంపెనీకి చెందిన విమానంలో ముంబైకి వెళ్లినట్లు కాంగ్రెస్, జేడీఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు రాజీవ్ చంద్రశేఖర్. ‘విమానంలో ప్రయాణించింనంత మాత్రాన ప్రభుత్వం కూలిపోతుందా.. అలానే జరిగితే ప్రభుత్వాన్ని కూలదోయడానికి అందరూ అలానే చేస్తారు కదా. ఎమ్మెల్యేలు విస్తారా విమానంలో ప్రయాణించారు. అంటే ఈ సంక్షోభానికి రతన్ టాటాను కూడా బాధ్యుడిని చేస్తారా’ అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు ప్రయాణించింది చార్టెడ్ ప్లైట్లో.. ఇంతకు ముందు ఈ విమానాన్ని కాంగ్రెస్ నాయకులు కూడా ఉపయోగించారు. కాబట్టి జరగుతున్న పరిణామాలకు విమానాన్ని నిందించడం మాని కూటమిలోని అస్థిరత్వాన్ని విమర్శించుకుంటే మంచిందన్నారు రాజీవ్. ఈ సమస్యను బీజేపీ మీద నెట్టాలని సంకీర్ణ కూటమి నాయకులు ప్రయత్నించారు. కానీ వారి మాటలను ప్రజలు నమ్మరని తెలిపారు రాజీవ్ తెలిపారు. -
‘కర్నాటకం’లో రాజ్యాంగం మిస్సింగ్!
సాక్షి, న్యూఢిల్లీ : కర్ణాటకలోని జేడీఎస్–కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలో సంక్షోభం ఏర్పడి నేటికి సరిగ్గా పది రోజులవుతోంది. జూలై ఒకటవ తేదీనే తమ శాసన సభ్యత్వాలకు రాజీనామా చేసినా నేటికి వాటిని స్పీకర్ ఆమోదించక పోవడంతో 14 మంది రెబెల్ జేడీఎస్, కాంగ్రెస్ శాసన సభ్యులు బుధవారం నాడు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. శాసన సభకు సంబంధించిన వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోలేవంటూ సుప్రీం కోర్టు గతం లాగా చేతులెత్తేసే అవకాశం ఉంది. శాసన సభ్యుల తిరుగుబాటు వెనక బీజేపీ హస్తం ఉందంటూ జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలు చేస్తున్న ఆరోపణలను బీజేపీ కేంద్ర నాయకత్వం ఖండించడమూ తెల్సిందే. పది మంది రెబెల్ శాసన సభ్యులు బీజేపీ రాజ్యసభ సభ్యుడి కంపెనీకి చెందిన విమానంలో ముంబైకి వెళ్లి, అక్కడి హోటల్లో మకాం వేయడం జేడీఎస్, కాంగ్రెస్ ఆరోపణల్లోని వాస్తవాస్తవాలకు అద్దం పడుతోంది. చదవండి: కర్ణాటకం : గవర్నర్ను కలవనున్న యడ్యూరప్ప రాజీనామాలు చేసిన శాసన సభ్యులు తనను వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడే వారి రాజీనామాలపై తాను నిర్ణయం తీసుకుంటానని అసెంబ్లీ స్పీకర్ రమేశ్ కుమార్ మంగళవారం స్పష్టం చేసిన విషయం తెల్సిందే. అంటే రెబెల్ ఎమ్మెల్యేలు తనను వ్యక్తిగతంగా కలుసుకున్నట్లయితే ప్రభుత్వం తరఫున వారిని ప్రలోభ పెట్టి వారి చేత రాజీనామాలను ఉపసంహరింప చేయాలన్నదే ఆయన ఉద్దేశమని సులభంగానే తెలుస్తోంది. ఈ దశంలో రాష్ట్ర గవర్నర్ జోక్యం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం విశ్వాసాన్ని కోరవచ్చు. ఇలాంటి సంక్షోభ సందర్భాల్లో ప్రభుత్వం తన మెజారిటీని సభలోనే నిరూపించుకోవాలంటూ సుప్రీం కోర్టు కూడా పలు సందర్భాల్లో స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. 14 మంది ఎమ్మేల్యేల రాజీనామాతో 224 మంది సభ్యులుగల రాష్ట్ర అసెంబ్లీలో సభ్యుల బలం 210కి పడిపోయింది. దీంతో ప్రభుత్వానికి 106 సభ్యుల మద్దతు అవసరం. 14 మంది రాజీనామా అనంతరం సంకీర్ణ ప్రభుత్వం మెజారిటీ 104కు పడిపోయింది. స్వతంత్ర సభ్యుడు హెచ్. నగేశ్, కర్ణాటక ప్రజ్ఞావంత జనతా పార్టీకి చెందిన సభ్యుడు ఆర్ శంకర్ల మద్దతుతో బీజేపీ బలం 107కు చేరుకుంది. ఈ దశలో వారి రాజీనామాలను ఆమోదించకుండా స్పీకర్ తాత్సారం చేయడం అంటే అది కచ్చితంగా రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా వ్యవహరించడమే. మరి బీజేపీ ప్రలోభాలతో 14 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కాదా? అని జేడీఎస్–కాంగ్రెస్ పార్టీలు ఆరోపిస్తున్నాయి. 14 మంది రెబెల్ శాసన సభ్యులు తమ రాజీనామాలను ఉపసంహరించకునేందుకు అంగీకరించక పోవడంతో వారిని సభకు అనర్హులుగా ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ స్పీకర్ను డిమాండ్ చేసింది. అలా చేసినట్లయితే వారు ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేదు. ఆ రకంగా కూడా సభ్యులను కాంగ్రెస్ పార్టీ బెదిరిస్తోంది. రాజీనామాలను ఉపసంహరించుకున్నట్లయితే వారందరికి మంత్రి పదవులు ఇస్తామని సంకీర్ణ ప్రభుత్వం ఆశ చూపుతోంది. మొత్తానికి పాలక, ప్రతిపక్షాల వ్యవహారం రాజ్యాంగ స్ఫూర్తిని అపహాస్యం చేస్తోంది. -
హోటల్ముందు శివకుమార్ పడిగాపులు
ముంబై : జేడీఎస్, కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు వారు బస చేసిన హోటల్ వద్దకు చేరుకున్న మంత్రి డీకే శివకుమార్ను ముంబై పోలీసులు అడ్డగించిన సంగతి తెలిసిందే. హోటల్లో రూం బుక్ చేసుకున్నప్పటికి లోపలికి వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకోవటంతో మండిపడ్డ ఆయన అక్కడినుంచి వెనుదిరగలేదు. రెబల్ ఎమ్మెల్యేలతో మాట్లాడేంత వరకు హోటల్ వద్దనుంచి కదిలేది లేదని తేల్చి చెప్పారు. వర్షంలో తడుస్తూ అక్కడే ఉండి పోయారు. సీఎం కుమారస్వామి, డీకే శివకుమార్ వల్ల తమకు ముప్పు ఉందని, రక్షణ కల్పించాలంటూ రెబల్ ఎమ్మెల్యేలు ముంబై పోలీస్ కమిషనర్కు లేఖ రాయటంతో సదరు హోటల్ యాజమాన్యం శివకుమార్ బుకింగ్ను రద్దు చేసింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోవాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జూలై 12 వరకు 144 సెక్షన్ను అమలు చేస్తూ అధికారులు ఆదేశాలు జారీచేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మేము.. మా స్నేహితులు 30,40 సంవత్సరాల నుంచి కలిసి రాజకీయాల్లో ఉంటున్నాం. తల్లీదండ్రులకు, భార్యాభర్తలకు, అన్నదమ్ములకు, స్నేహితులకు మధ్య ఒక్కోసారి బేధాభిప్రాయాలు వస్తుంటాయి. అంత మాత్రాన శాశ్వతంగా దూరమై పోరు. సంసారంలో గొడవలు వచ్చి భార్య బయటకు వెళ్లిపోతే విడాకులు ఇచ్చేసినట్లేనా? సంసారంలో ఇవన్నీ మామూలే. ఎవరో ఒకరు వారి మధ్య సయోధ్య కుదర్చాలి. రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు. ఈ రోజు ఎమ్మెల్యేలు గొడవపడి బయటకు వచ్చేశారు. బయటకు వచ్చేసినంత మాత్రాన కాంగ్రెస్తో శాశ్వతంగా బంధాలు తెంచుకున్నట్లు కాదు. నాతో కలిసి ఎన్నో ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నవారు ఈ రోజు బయటకు వచ్చేశారు. అందుకే వాళ్లతో మాట్లాడదామని నేను ఇక్కడకు వచ్చాను. పోలీసులు నన్ను అడ్డగించారు. ఈ బీజేపీ వాళ్లు నాటకాలు చేస్తున్నార’’ని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
సుప్రీంకు చేరిన కర్ణాటక సంక్షోభం
న్యూఢిల్లీ/ముంబై : కర్ణాటక రాజకీయ సంక్షోభం సుప్రీం కోర్టుకు చేరింది. తమ రాజీనామాలను స్పీకర్ రమేశ్ కుమార్ ఆమోదించకపోవడంపై కాంగ్రెస్, జేడీఎస్ రెబల్ ఎమ్మెల్యేలు సుప్రీంను ఆశ్రయించారు. రెబల్ ఎమ్మెల్యేల తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి, సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీలైనంత త్వరగా దీనిపై విచారణ చేపట్టాలని కోరారు. అయితే ఈ పిటిషన్పై గురువారం విచారణ చేపట్టేందుకు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ అంగీకరించారు. కర్ణాటకకు చెందిన 14 మంది కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేల రాజీనామా లేఖలు సమర్పించగా.. వాటిలో ఐదు మాత్రమే ఫార్మట్ ప్రకారం ఉన్నాయని స్పీకర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే స్పీకర్ నిర్ణయంపై రెబల్ ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. స్పీకర్ రాజ్యాంగ విధులను సక్రమంగా నిర్వహించడంలేదని విమర్శించారు. ముంబైలో శివకుమార్కు చుక్కెదురు.. మరోవైపు రెబల్ ఎమ్మెల్యేలు బస చేసిన హోటల్ వద్ద బుధవారం ఉదయం హైడ్రామా చోటుచేసుకుంది. కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలను కలిసేందుకు వెళ్లిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు డీకే శివకుమార్ను పోలీసులు లోనికి అనుమతించలేదు. మరోవైపు సీఎం కుమారస్వామి, డీకే శివకుమార్ వల్ల తమ ప్రాణాలకు ముప్పు ఉందని, రక్షణ కల్పించాలంటూ రెబల్ ఎమ్మెల్యేలు ముంబై పోలీస్ కమిషనర్కు లేఖ రాయడంతో హోటల్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. పూటకో మలుపు.. కర్ణాటక రాజకీయం పూటకో ములుపు తిరుగుతోంది. కాంగ్రెస్, జేడీఎస్కు చెందిన 14 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వం మైనారిటీలోకి జారిపోయింది. సంకీర్ణ ప్రభుత్వంపై అసమ్మతితో రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలు ముంబై స్టార్ హోటల్లో మకాం వేశారు. దీంతో రంగంలో దిగిన కాంగ్రెస్, జేడీఎస్ ముఖ్య నేతలు రాజీనామా చేసిన ఎమ్మేల్యేలను బుజ్జగించేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రాజకీయ సంక్షోభంతో తమకేలాంటి సంబంధం లేదని చెబుతున్న బీజేపీ పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకోవడానికి అంతర్గత ప్రయత్నాలను ముమ్మరం చేసింది. మరోవైపు ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా ప్రభుత్వాన్ని కాపాడుకునే పనిలో బిజీబిజీగా ఉన్నారు. తన పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశాలు నిర్వహిస్తూ ఎవరూ బీజేపీ ప్రలోభాలకు లోనుకావద్దని.. త్వరలోనే పరిస్థితి సర్దుకుంటుందని చెబుతున్నారు. చదవండి: కర్నాటకంలో కొత్త ట్విస్ట్ రెబల్ ఎమ్మెల్యేల క్యాంప్ వద్ద హైడ్రామా -
హోటల్ వద్ద హైడ్రామా, శివకుమార్కు చుక్కెదురు
సాక్షి, ముంబై : కర్ణాటకలో రాజకీయ సంక్షోభం కొత్త మలుపులు తిరుగుతోంది. తాజాగా ముంబైలో కర్ణాటక రెబల్ ఎమ్మెల్యేలు బస చేసిన హోటల్ వద్ద బుధవారం ఉదయం హైడ్రామా చోటుచేసుకుంది. అసంతృప్త కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు వెళ్లిన డీకే శివకుమార్కు చుక్కెదురు అయింది. హోటల్ బయటే ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో హోటల్ లోనికి ఎందుకు వెళ్లనివ్వడం లేదంటూ శివకుమార్ పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. రెబల్స్లో కొంతమంది ఎమ్మెల్యేలు చర్చలకు రమ్మంటేనే తాను వచ్చానని అన్నారు. అంతేకాకుండా తాను కూడా హోటల్లో రూమ్ బుక్ చేసుకున్ట్లు ఆయన తెలిపారు. భద్రత పేరుతో తమను అడ్డుకుంటున్నారంటూ శివకుమార్ ఆరోపించారు. స్నేహితులను కలిసేందుకే ముంబై వచ్చానని, ఎమ్మెల్యేలను కలవకుండా వెనక్కి వెళ్లేది లేదని ఆయన స్పష్టం చేశారు. శివకుమార్తో పాటు జేడీఎస్ ఎమ్మెల్యే శివలింగగౌడ కూడా ముంబై వచ్చారు. మరోవైపు సీఎం కుమారస్వామి, డీకే శివకుమార్ వల్ల తమకు ముప్పు ఉందని, రక్షణ కల్పించాలంటూ రెబల్ ఎమ్మెల్యేలు ముంబై పోలీస్ కమిషనర్కు లేఖ రాయడంతో హోటల్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. చదవండి: కర్నాటకంలో కొత్త ట్విస్ట్ ముంబై నుంచి పుణె, లేదా గోవా సంకీర్ణ ప్రభుత్వంపై అసమ్మతితో ఇప్పటికే రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలు ముంబై స్టార్ హోటల్లో మకాం వేసిన విషయం తెలిసిందే. తమ రాజీనామాలపై స్పీకర్ రమేశ్ కుమార్ తీసుకునే నిర్ణయంపై ఎక్కడకు వెళ్లాలి అనే దానిపై నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటికే మూడు రోజులుగా రాజీనామా చేసిన 14మంది ఎమ్మెల్యేలు ముంబైలోనే ఉంటున్నారు. స్పీకర్ తమ రాజీనామాలు అంగీకరించిన అనంతరమే తాము బెంగళూరు వస్తామని అసమ్మతి ఎమ్మెల్యేలు తెలిపారు. ఒకవేళ ఆమోదం పొందకుండా చేస్తే తాము ఇక్కడి నుంచి గోవా, లేదా పుణె వెళ్లడానికి నిర్ణయించుకున్నామని అసమ్మతి ఎమ్మెల్యేలు తెలిపారు. ఇదిలా ఉంటే అసమ్మతి ఎమ్మెల్యే ఎక్కడికి వెళ్లినా వారికి బీజేపీ నాయకులు సకల సౌకర్యాలు కల్పించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రపతి పాలన తప్పదా? తీవ్ర రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయిన కన్నడనాట రాష్ట్రపతి పాలన తప్పదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సుమారు 14 మంది కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్, గవర్నర్ తీసుకునే నిర్ణయంపైనే ప్రభుత్వ భవితవ్యం ఆధారపడి ఉంది. ఏ పార్టీకి స్పష్టమైన మద్దతు లేక పరిస్థితులు ఇలాగే కొనసాగితే రాష్ట్రపతి పాలనకు గవర్నర్ సిఫారసులు చేసే అవకాశం ఉందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్– జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం మనుగడ గాల్లో దీపంలా మారిపోయింది. ఎప్పుడు ఏ ఎమ్మెల్యే రాజీనామా చేస్తారో తెలియని గందరగోళం నెలకొంది. గవర్నర్ ఏమంటారు? అసంతృప్త ఎమ్మెల్యేల రాజీనామాలను ఉపసంహరించుకునేలా కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపులకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అలాగే రాజీనామాలతో తమకు ఎలాంటి సంబంధం లేదంటూనే బీజేపీ లోలోపల తన కార్యాచరణను అమలు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు, జేడీఎస్కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రుల రాజీనామాలు చేయడంతో సంకీర్ణం మైనారిటీలో జారిపోయింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో గవర్నర్ వజుభాయి వాలా కుమారస్వామి ప్రభుత్వాన్ని అసెంబ్లీలో బలపరీక్షకు ఆహ్వానిస్తారా లేక రాష్ట్రపతి పాలనకే సిఫార్సు చేస్తారా అనేది సస్పెన్స్గా మిగిలింది. మైనారిటీలో కుమార సర్కారు 224 మంది సభ్యులున్న అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 78, జేడీఎస్కు 37 మంది, బీజేపీకి 105 మంది, బీఎస్పీ నుంచి ఒకరు, ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు. సంకీర్ణ ప్రభుత్వంలో అధికారపక్షానికి మొత్తం 119 ఎమ్మెల్యేల బలం ఉంది. ప్రస్తుతం 14 మంది ఎమ్మెల్యేల రాజీనామాలు, ఇద్దరు స్వతంత్రుల మద్దతు ఉపసంహరణతో ఆ బలం 103కు క్షీణించింది. సర్కారు ఏర్పాటుకు 113 మంది శాసనసభ్యుల బలముండాలి. గ తంలో పలు కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ముందుగా బలపరీక్షకు అధికార పక్షాల్ని గవర్నర్ ఆహ్వానించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గవర్నర్ నిర్ణయమే కీలకంగా మారింది. బలపరీక్షకే సీఎం మొగ్గు బలపరీక్షకు సిద్ధంగా ఉండాలని సీఎం కుమారస్వామి యోచిస్తున్నట్లు సమాచారం. ఈ నెల 12న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. బలం చాటుకోవడానికి విశ్వాస పరీక్షను ఎదుర్కొవడమే ఉత్తమమని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది. విశ్వాస పరీక్ష సందర్భంగా రాజీనామా చేసిన ఎమ్మెల్యేలకు కూడా విప్ జారీ చేయవచ్చని, విప్కు భయపడి ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్దతు పలుకుతారని భావిస్తున్నారు. ఒకవేళ విప్ను ధిక్కరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా విశ్వాస పరీక్షలో ఓటు వేస్తే సంబంధిత ఎమ్మెల్యేను అనర్హుడిగా ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. సంకీర్ణానికే మహేశ్ మద్దతు నానాటికీ బలం కోల్పోతున్న సంకీర్ణ ప్రభుత్వానికి బీఎస్పీ ఎమ్మెల్యే ఎన్.మహేశ్ మద్దతు ప్రకటించారు. మంగళవారం విధానసౌధ కార్యదర్శితో భేటీ అయి సర్కారుకు తన మద్దతు ఉంటుందని ప్రకటించి వెళ్లిపోయారు. -
సభకు కర్ణాటక సెగ
న్యూఢిల్లీ: కర్ణాటకలో కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాల సూచనల మేరకు బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోందంటూ పార్లమెంటులో ఈ అంశంపై మంగళవారం కాంగ్రెస్ ఆందోళనలు చేపట్టింది. ఆ పార్టీ సభ్యులు ఆందోళనను విరమించకపోవడం, వివిధ ఇతర అంశాలపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), సీపీఐ, సీపీఎం సభ్యులు కూడా ఆందోళన చేపట్టడంతో రాజ్యసభ మంగళవారం పూర్తిగా వాయిదా పడింది. ఉదయం రాజ్యసభ అధ్యక్షుడు వెంకయ్య నేతృత్వంలో సభ ప్రారంభం కాగానే కాంగ్రెస్ సభ్యులు వెల్లోకి దూసుకొచ్చి ఆందోళనలు, నినాదాలు చేశారు. దీంతో సభను వెంకయ్య వాయిదా వేసి, మళ్లీ మధ్యాహ్నం 12 గంటలకు రాజ్యసభ సమావేశం ప్రారంభమవుతుందని చెప్పారు. 12 గంటలకు సభ తిరిగి సమావేశమైనప్పుడు రాజ్యసభ ఉపాధ్యక్షుడు హరివంశ్ కార్యకలాపాలను చేపట్టారు. ఆ సమయాన్ని ప్రశ్నోత్తరాలకు కేటాయించినప్పటికీ, సభ్యులు సభ మొదలవగానే వెల్లోకి వచ్చి నిరసనలకు దిగారు. దీంతో మధ్యాహ్నం రెండు గంటలకు సభను వాయిదా వేస్తున్నట్లు హరివంశ్ ప్రకటించారు. 2 గంటలకు సమావేశమైనప్పుడు పరిస్థితిలో మార్పు లేకపోవడంతో రాజ్యసభను బుధవారానికి వాయిదా వేశారు. కాగా, మంగళవారం ఉదయం సభా కార్యకలాపాలను ప్రారంభించిన అనంతరం వెంకయ్య మాట్లాడుతూ ముందే నిర్ణయించిన, సభలో ప్రస్తుతం చర్చించాల్సిన విషయాలను పక్కనబెట్టి కర్ణాటక అంశంపై చర్చించేందుకు అనుమతి ఇవ్వాలంటూ కాంగ్రెస్ సభ్యుడు బీకే హరిప్రసాద్ నుంచి తనకు నోటీసు అందిందనీ, కానీ దీనికి ఒప్పుకోవడం లేదని తెలిపారు. లోక్సభలో నినాదాలు చేసిన రాహుల్ కర్ణాటక అంశంపై లోక్సభలోనూ కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యేలను ‘వేటాడే’ చర్యలను బీజేపీ ఆపివేయాలని డిమాండ్ చేస్తూ లోక్సభ నుంచి ఆ పార్టీ ఎంపీలు బయటకు వెళ్లిపోయారు. అంతకుముందు సభలో కాంగ్రెస్పక్ష నాయకుడు అధిర్ రంజన్ మాట్లాడుతూ కర్ణాటకలో తమ ప్రభుత్వాన్ని కూల్చడమే బీజేపీ లక్ష్యమని ఆరోపించారు. కాంగ్రెస్ సభ్యులు లోక్సభలోనూ వెల్లోకి వచ్చి నినాదాలు చేశారు. చౌధరి మాట్లాడుతుండగా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ సభలోకి వచ్చారు. ‘నియంతృత్వం నశించాలి. వేటాడే రాజకీయాలను ఆపేయాలి’ అని నినాదాలు చేశారు. ఈడీ, సీబీఐల చేత కేసులు పెట్టిస్తామని బెదిరిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేత బీజేపీయే రాజీనామాలు చేయిస్తోందని బీకే హరివంశ్ ఆరోపించారు. కర్ణాటక ప్రభుత్వాన్ని అస్థిర పరచడంలో తమ పాత్ర లేదని బీజేపీ చెప్పడం పెద్ద అబద్ధమన్నారు. -
కర్నాటకంలో కొత్త ట్విస్ట్
సాక్షి, బెంగళూరు/ ముంబై: కర్ణాటక రాజకీయ పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తను తీసుకునే ప్రతి నిర్ణయమూ చరిత్రలో నిలిచిపోతుందని, తప్పుడు నిర్ణయంతో చరిత్రలో ద్రోహిగా మారడం ఇష్టం లేదని స్పీకర్ రమేశ్ కుమార్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, తనకు అందిన 14 మంది ఎమ్మెల్యేల రాజీనామా లేఖల్లో 5 మాత్రమే ఫార్మాట్ ప్రకారం ఉన్నాయని ప్రకటించారు. కాంగ్రెస్కు చెందిన శివాజీనగర ఎమ్మెల్యే రోషన్ బేగ్ కూడా రెబెల్స్ జాబితాలో చేరిపోగా, సర్కారు మనుగడ ఇప్పుడు స్పీకర్ నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. బేగ్ రాజీనామా లేఖ అందింది ‘నేను జాగరూకతతో వ్యవహరించాల్సి ఉంది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో నేను తీసుకునే ప్రతి నిర్ణయమూ చరిత్రలో నిలిచిపోతుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పు చేయకూడదు. భవిష్యత్ తరాలు నన్నో అపరాధిగా చూస్తాయి’అని కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేశ్ అన్నారు. మంగళవారం విధాన సౌధలో స్పీకర్ మీడియాతో మాట్లాడారు. రాజీనామాలు సమర్పించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న కాంగ్రెస్ అభ్యర్థనపై ఆయన స్పందిస్తూ.. రెబెల్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్లు ఈ నెల 11వ తేదీలోగా ఆధారాలను చూపాలని కోరానని, సమాధానాన్ని బట్టి చర్యలుంటాయని వివరించారు. రాజీనామా చేసిన 14 మందిలో 11 మంది కాంగ్రెస్, ముగ్గురు జేడీఎస్కు చెందిన ఎమ్మెల్యేలున్నారని వెల్లడించారు. రాజీనామాలను ఆమోదించాలా లేక మరే ఇతర చర్యలు చేపట్టాలా అనే విషయంలో అనుభవజ్ఞుల సలహాలు, రూల్బుక్ ప్రకారం నడుచుకుంటానన్నారు. మంత్రుల రాజీనామాలు గవర్నర్ పరిధిలోకి వస్తాయని చెప్పారు. ‘ఎమ్మెల్యే రోషన్ బేగ్ రాజీనామా లేఖ ఈ రోజే అందింది. దానిని ఇంకా పరిశీలించలేదు. ఇప్పటికే అందిన అధికార కాంగ్రెస్, జేడీఎస్లకు చెందిన 14 ఎమ్మెల్యేల రాజీనామా పత్రాల్లో ఐదుగురివే ఫార్మాట్ ప్రకారం ఉన్నాయి. మిగతా వారికి ఈ మేరకు సమాచారం అందించాం. వారు మరోసారి రాజీనామా పత్రాలు అందజేస్తే పరిశీలిస్తా’అని స్పష్టం చేశారు. సీఎల్పీ భేటీకి రాని 20 మంది మంగళవారం ఉదయం బెంగళూరులో కాంగ్రెస్ శాసనసభా పక్షం సమావేశం జరిగింది. పదవులకు రాజీనామా చేసిన వారితోపాటు మొత్తం 20 మంది ఈ భేటీకి గైర్హాజరయ్యారని సమాచారం. ఈ సమావేశం అనంతరం కాంగ్రెస్ నేతలు స్పీకర్ను కలిశారు. తమ పార్టీ రెబెల్ ఎమ్మెల్యేలపై ఫిరాయింపుల చట్టం కింద వెంటనే అనర్హత వేటు వేయాలని కోరారు. లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో చేసిన తీర్మానం ప్రతిని వారు స్పీకర్కు అందజేశారు. అనంతరం రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు దినేశ్ గుండూరావు మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు రాజీనామాలు చేసి, బీజేపీతో చేతులు కలిపిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ను కోరాం. స్పీకర్ వారిని అనర్హులుగా ప్రకటించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి’అని వెల్లడించారు. రాజీనామాలు సమర్పించిన ఎమ్మెల్యేలంతా వెనక్కి తిరిగి రావాలని, లేకుంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని సీఎల్పీ నేత సిద్దరామయ్య హెచ్చరించారు. ‘రాజ్యాంగం పదో షెడ్యూల్లోని ఫిరాయింపుల చట్టంలోని నిబంధనలు తెలియకనే వారంతా రాజీనామా చేశారు. బీజేపీ వలలో చిక్కుకున్న ఆ ఎమ్మెల్యేలు ఆ పార్టీతో చేతులు కలిపారు. మోదీ, అమిత్ షా ఈ వ్యవహారంలో తలదూరుస్తున్నారు’ అని అన్నారు. అంతకుముందు విధానసౌధ వద్ద ఉన్న గాంధీ విగ్రహం ఎదుట కాంగ్రెస్ నేతలు ధర్నా చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, బీకే హరిప్రసాద్ బెంగళూరుకు చేరుకుని ఎమ్మెల్యేలు, నేతలతో చర్చలు ప్రారంభించారు. రెబెల్స్ మళ్లీ ముంబైకి.. కర్ణాటక తిరుగుబాటు శాసనసభ్యులు సోమవారం ముంబై నుంచి గోవాకు బయలుదేరి మార్గమధ్యంలో సతారా సమీపంలో ఆగిపోయారు. తమ రాజీనామాలపై స్పీకర్ తీసుకునే నిర్ణయం కోసం వారు అక్కడే మంగళవారం ఎదురు చూశారు. కొందరి ఎమ్మెల్యేల రాజీనామాలు నిర్దేశిత నమూనా ప్రకారం లేవని స్పీకర్ ప్రకటించడంతో తిరిగి ముంబై వెళ్లారు. రిసార్టులో జేడీఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని కాపాడుకునే పనిలో ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా బిజీబిజీగా ఉన్నారు. తన పార్టీ ఎమ్మెల్యేలలతో సమావేశాలను నిర్వహిస్తూ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని చెబుతున్నారు. నగర శివార్లలోని ఒక రిసార్టులో జేడీఎస్ ఎమ్మెల్యేలు మకాం వేశారు. ఎవరూ బీజేపీ ప్రలోభాలకు లోనుకావద్దని, మరో నాలుగు రోజుల్లో అంతా సర్దుకుంటుందని చెప్పారు. హెచ్చరికలకు లొంగని రెబెల్స్ రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తామంటూ కాంగ్రెస్ హెచ్చరికలు పంపినప్పటికీ వారు దిగివచ్చే సూచనలు కనిపించడం లేదు. ‘రాజీనామాలను ఉపసంహరించుకునే ప్రశ్నే లేదు. స్వచ్ఛందంగా రాజీనామాలు ఇచ్చాం. ఎటువంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదు’అని కాంగ్రెస్ ఎమ్మెల్యే సోమశేఖర్ మీడియాతో వ్యాఖ్యానించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో ఇటీవల సస్పెండయిన ఎమ్మెల్యే రోషన్ బేగ్ మంగళవారం రాజీనామా సమర్పించినట్లు ప్రకటించారు. అనంతరం కొద్ది సేపటికే.. ఐఎంఏ గ్రూప్ చిట్ ఫండ్ కుంభకోణం కేసులో విచారణకు హాజరు కావాలంటూ ఎమ్మెల్యే బేగ్కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఐఎంఏ గ్రూప్ ముఖ్య నిర్వాహకుడు, ఐఎంఏ జ్యుయెల్లర్స్ అధినేత మొహమ్మద్ మన్సూర్ ఖాన్ ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. రోషన్బేగ్ తన వద్ద నుంచి రూ.400 కోట్లు తీసుకుని, ఎగనామం పెట్టాడని ఆయన విడుదల చేసిన ఆడియోలో ఆరోపించడం కలకలం రేపింది. -
మంత్రులంతా రాజీనామా
సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ: కర్నాటకం రోజుకో మలుపు తిరుగుతూ మరింత ఉత్కంఠ రేపుతోంది. అధికారాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్–జేడీఎస్ కూటమి, ఎలాగైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్–జేడీఎస్ ముఖ్యనేతలు సోమవారం చివరి అస్త్రాన్ని ప్రయోగించారు. అసంతృప్త నేతలకు మంత్రి పదవులు ఇచ్చేందుకు వీలుగా కాంగ్రెస్ నుంచి 21 మంది మంత్రులు, జేడీఎస్కు చెందిన 9 మంది మంత్రులు తమ పదవులకు రాజీనామా సమర్పించారు. మరోవైపు ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు తమ మంత్రి పదవులకు రాజీనామా చేసి బీజేపీకి మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో కర్ణాటకం మరింత రంజుగా మారింది. కర్ణాటక డిప్యూటీ సీఎం పరమేశ్వర ఇంట్లో సమావేశమైన కాంగ్రెస్ నేతలు, జేడీఎస్ ప్రతినిధులు ఈ మేరకు చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా పరమేశ్వరతో సమావేశమైన సీఎం కుమారస్వామి రాష్ట్ర రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. మంత్రుల రాజీనామా నేపథ్యంలో వీలైనంత త్వరగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపడతామని అధికారిక వర్గాలు తెలిపాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం మొత్తం 34 మంత్రి పదవులకు గానూ కాంగ్రెస్ 22, జేడీఎస్ 12 మంత్రి పదవులను తీసుకునేలా ఇరుపార్టీల మధ్య అంగీకారం కుదిరింది. అయితే తమకు న్యాయం జరగలేదంటూ 13 మంది అసంతృప్త ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా సమర్పించారు. కాగా, ఈ రాజీనామాలను ఆమోదించవద్దని కాంగ్రెస్ న్యాయవిభాగం స్పీకర్ రమేశ్కుమార్ను కోరింది. ఈ ఎమ్మెల్యేలు నియమ నిబంధనల మేరకు, స్వచ్ఛందంగా రాజీనామాలు సమర్పించలేదని స్పష్టం చేసింది. ఇద్దరు మంత్రుల రాజీనామా కర్ణాటకలో ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న అధికార కూటమికి మరో షాక్ తగిలింది. ఇటీవల కుమారస్వామి కేబినెట్లో మంత్రులుగా నియమితులైన స్వతంత్ర ఎమ్మెల్యేలు హెచ్.నగేశ్, ఆర్.శంకర్లు తమ మంత్రి పదవులకు రాజీనామా సమర్పించారు. సోమవారం ఉదయం బెంగళూరులోని రాజ్భవన్కు చేరుకున్న నగేశ్, గవర్నర్ వజూభాయ్వాలాకు తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. సీఎం కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్–కాంగ్రెస్ ప్రభుత్వానికి తాను మద్దతును ఉపసంహరించుకుంటున్నట్లు నగేశ్ లేఖలో తెలిపారు. ఒకవేళ గవర్నర్ బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తే తాను మద్దతు ఇస్తానని స్పష్టం చేశారు. అలాగే మంత్రి ఆర్.శంకర్ కూడా ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. అనంతరం బీజేపీకి బహిరంగంగా మద్దతు పలికారు. మరోవైపు తన సమస్యలను పరిష్కరించకుంటే అధికార కూటమిని వీడుతానని మంత్రి రహీమ్ మహమూద్ ఖాన్ హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ తనను అవమానించిందనీ, అందుకే త్వరలో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరుతానని బహిష్కృత ఎమ్మెల్యే రోషన్ బేగ్ ప్రకటించారు. మంగళవారం జరిగే సీఎల్పీ భేటీని తాను బహిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. తుది నిర్ణయం అధిష్టానానికే పార్టీ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా కాంగ్రెస్ మంత్రులంతా రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారని ఏఐసీపీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. ‘సోమవారం మేం మంత్రులతో భేటీ అయ్యాం. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ మంత్రులు తమ పదవులకు రాజీనామాలు సమర్పించారు. కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై తుది నిర్ణయాన్ని పార్టీ అధిష్టానానికి వదిలిపెట్టారు. కర్ణాటక ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తున్న ప్రజాస్వామ్య వ్యతిరేక బీజేపీని నిలువరించేందుకు మంత్రులు చేసిన త్యాగాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. బీజేపీ ఇప్పటికే ఐదుసార్లు మా ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నించి విఫలమైంది’ అని వేణుగోపాల్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేసిన నేతలు తిరిగివస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. మరోవైపు ఈ విషయమై కాంగ్రెస్ నేత, మాజీ సీఎం సిద్దరామయ్య మాట్లాడుతూ.. ‘పార్టీపై మాకు పూర్తి విశ్వాసముంది. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ విషయంలో కాంగ్రెస్ అధిష్టానికి పూర్తి స్వేచ్ఛనిచ్చాం. కాంగ్రెస్ మంత్రులు శివనదా పాటిల్, ఆర్వీ దేశ్పాండేలు వ్యక్తిగత కారణాలతో ఈ సమావేశానికి హాజరుకాకపోయినా రాజీనామాకు తమ సమ్మతిని తెలియజేశారు. సామాజిక న్యాయం, ప్రాంతం, అర్హతల ఆధారంగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుంది’ అని తెలిపారు. నేను దేనికీ భయపడను: కుమారస్వామి కర్ణాటకలో రాజకీయ సంక్షోభంపై సీఎం కుమారస్వామి తొలిసారి నోరువిప్పారు. తాను దేనికీ భయపడబోననీ, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి తాను ఏమాత్రం ఆలోచించడం లేదని స్పష్టం చేశారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రాన్ని పరి పాలించాల్సిన బాధ్యత నాపై ఉంది. ఆ బాధ్యతను నెరవేర్చడంపైనే నేను దృష్టి సారించా. ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలపై నేను దృష్టి సారించలేదు. అంత అవసరం కూడా నాకు లేదు’ అని వ్యాఖ్యానించారు. కర్ణాటక గవర్నర్ వజూభాయ్వాలా ఎమ్మెల్యేల కొనుగోళ్లను ప్రోత్సహిస్తున్నారని కర్ణాటక డిప్యూటీ సీఎం పరమేశ్వర ఆరోపించారు. గోవాకు రెబెల్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్–జేడీఎస్కు చెందిన 13 మంది రెబెల్ ఎమ్మెల్యేలు సోమవారం ముంబై నుంచి గోవాకు బయలుదేరారు. 10 మంది కాంగ్రెస్, ముగ్గురు జేడీఎస్ ఎమ్మెల్యేలు గోవాకు చేరుకోనున్నట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. బీజేపీ ముంబై యువమోర్చా అధ్యక్షుడు మోహిత్ వీరితో ఉన్నట్లు వెల్లడించాయి. వీరంతా గోవా శివార్లలోని ఓ రిసార్టులో బస చేస్తారని పేర్కొన్నాయి. నేటి నుంచి బీజేపీ ఆందోళన కర్ణాటక సీఎం కుమారస్వామి ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిందనీ, ఆయన వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. కుమారస్వామి రాజీనామా చేయకుంటే రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం నుంచి ఆందోళనలు చేపడతామని కర్ణాటక బీజేపీ చీఫ్ యడ్యూరప్ప హెచ్చరించారు. కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదు: రాజ్నాథ్ కర్ణాటకలో జరుగుతున్న రాజకీయ పరిణామాలతో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. లోక్సభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కాంగ్రెస్ పక్షనేత అధిర్ రంజన్ చౌదరి తొలుత మాట్లాడుతూ..‘కర్ణాటక, మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకు బీజేపీ కుట్ర పన్నుతోంది. అందులో భాగంగానే మా ఎమ్మెల్యేలను ముంబైలోని స్టార్ హోటల్కు తరలించారు. ఎమ్మెల్యేలు గవర్నర్ వజూభాయ్వాలాను కలిసిన వెంటనే అప్పటికప్పుడు కార్లు, విమానాలు, హోటల్ సదుపాయాలు ఏర్పాటైపోయాయి. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. 303 మంది లోక్సభ ఎంపీలున్నప్పటికీ మీ కడుపు నిండలేదు. ఇప్పుడు మీ(బీజేపీ) కడుపు, ఢిల్లీ గేటు ఒకేలా కనిపిస్తున్నాయి’ అని దుయ్యబట్టారు. దీంతో రాజ్నాథ్ స్పందిస్తూ..‘కర్ణాటకలో ప్రస్తుతం ఏదైతే జరుగుతుందో, దానికి మాకు ఎలాంటి సంబంధం లేదు. మీ పార్టీలో పెద్దపెద్ద నేతలే(రాహుల్ గాంధీ, సింధియా తదితరులు) రాజీనామాలు చేస్తున్నారు. దీన్ని రాహుల్ గాంధీయే ప్రారంభించారు’ అని తేల్చిచెప్పారు. దీంతో కాంగ్రెస్ నేతలు ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’ అనే నినాదాలున్న ప్లకార్డులతో ఆందోళనకు దిగారు. తమ ఎమ్మెల్యేలను కొనేందుకు ఎంత నగదు వెచ్చించారో చెప్పాలని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్, రక్షణ మంత్రి రాజ్నాథ్లను కాంగ్రెస్ ట్విట్టర్లో డిమాండ్ చేసింది. 12 మందికి యెడ్డీ కేబినెట్లో చోటు! సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: యడ్యూరప్ప నేతృత్వంలో త్వరలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకావడం ఖాయమని బీజేపీవర్గాలు తెలిపాయి. కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన 13 మంది ఎమ్మెల్యేలకు యడ్యూరప్ప మంత్రివర్గంలో చోటు దక్కుతుందని వెల్లడించాయి. ఈ విషయమై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ మాట్లాడుతూ..‘13 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే రాజీనామా చేసినందున వారికి విప్ జారీ వర్తించదు. వీరి రాజీనామాలపై నిర్ణయాన్ని స్పీకర్ ఆలస్యం చేయగలరే తప్ప తిరస్కరించలేరు’ అని స్పష్టం చేశారు. ప్రభు త్వం పడిపోకుండా ఉండేందుకు అసెంబ్లీ సమావేశాలను వాయిదావేయడం లేదా రద్దుచేసే చాన్సుందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. స్పీకర్ నిర్ణయమే కీలకం.. కాంగ్రెస్–జేడీఎస్ కూటమికి ఇప్పటికే 13 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ఇద్దరు మంత్రులు బీజేపీకి మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేశ్ కుమార్ ఏ నిర్ణయం తీసుకుంటారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాజీనామాలన్నీ పద్దతి ప్రకారం, నిర్ధిష్ట నమూనాలో ఉంటే వాటిని ఆమోదించడం తప్ప స్పీకర్ మరో ప్రత్యామ్నాయం ఉండదు. అయితే, ఆమోదానికి కొంత వ్యవధి తీసుకోవడం ద్వారా ప్రభుత్వానికి ఒక అవకాశం కల్పించవచ్చు. లేదా బలపరీక్షకు సిద్ధంకావాలని సీఎం కుమారస్వామిని ఆదేశించవచ్చు. స్పీకర్ గనుక రాజీనామాలను ఆమోదిస్తే ఆ క్షణమే కుమారస్వామి సర్కారు మైనారిటీలో పడిపోతుంది. కుమార స్వామి బలపరీక్షకు ఒప్పుకోకపోతే బీజేపీ అవిశ్వాస తీర్మానాస్త్రాన్ని ప్రయోగించే అవకాశం ఉంది. అంతేకాకుండా స్పీకర్ను తొలగించాలని కూడా ఆ పార్టీ డిమాండు చేయవచ్చు. అదే జరిగితే సభలో బలపరీక్ష తప్పదు. ఒకవేళ స్పీకర్ నిర్ణయం సరిగా లేదని భావిస్తే ఇరు పక్షాల్లో ఎవరైనా కోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉంది. బలాబలాలు ఇలా... 224 మంది సభ్యులున్న అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 113 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. రాజీనామాల ముందు వరకు సంకీర్ణ ప్రభుత్వానికి 118 మంది ఎమ్మెల్యేలున్నారు. ఒకవేళ స్పీకర్ రమేశ్ కుమార్ 13 మంది రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదిస్తే అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య 211కు తగ్గిపోతుంది. అలాగే ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 106 అవుతుంది. అదే సమయంలో అధికార జేడీఎస్–కాంగ్రెస్ కూటమి బలం 103కు పడిపోతుంది. ఇదే జరిగితే 105 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న బీజేపీ ఇద్దరు స్వతంత్రుల మద్దతు (107) తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆస్కారముంది. మీడియాతో మాట్లాడుతున్న సిద్ధరామయ్య, కేసీ వేణుగోపాల్, దినేశ్ గుండూరావు -
రామలింగారెడ్డితో కుమారస్వామి మంతనాలు
సాక్షి, బెంగళూరు : రాష్ట్రంతో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి సోమవారం ఉదయం రెబల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డితో భేటీ అయ్యారు. బెంగళూరులోని ఓ రహస్య ప్రాంతంలో వీరు సమావేశం కావడం విశేషం. కాగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మాజీమంత్రి, బీటీఎం లేఔట్ ఎమ్మెల్యే రామలింగారెడ్డిని, ఆయన కుమార్తె సౌమ్యారెడ్డిని శనివారం రాత్రి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ కలిసి రాజీనామా వెనక్కి తీసుకోవాలని కోరారు. అయితే రామలింగారెడ్డి తనకు జరిగిన అన్యాయంతో పాటు పార్టాలో నెలకొన్న సమస్యలనూ చెబుతూ రాజీనామాపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని చెప్పడంతో వేణుగోపాల్ నిరాశతో వెనుదిరిగారు. ఈ సమావేశంలో రామలింగారెడ్డి డీసీఎం పరమేశ్వర్పైన ఆరోపణలు గుప్పించినట్లు తెలిసింది. మరోవైపు పార్టీలో జరుగుతున్న అనూహ్య మార్పులు తనను ఆవేదనకు గురి చేశాయని, దీంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని, పార్టీకి కాదని, 46ఏళ్లుగా పార్టీ కోసం సేవ చేస్తూనే ఉన్నానని రామలింగారెడ్డి అన్నారు. పార్టీ కూడా తనకు అనేక పదవులు ఇచ్చిందని, అయితే పార్టీలో జరుగుతున్న పరిస్థితులపై రాష్ట్ర ఇన్చార్జ్ కేసీ వేణుగోపాల్, సీఎం కుమారస్వామికి వివరించినట్లు తెలిపారు. భవిష్యత్లో ఏమి జరుగుతుంతో చెప్పలేనని రామలింగారెడ్డి పేర్కొన్నారు. చదవండి: బుజ్జగింపుల పర్వం షురూ -
కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం సిద్దు!
కర్ణాటక రాజకీయాలు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్నాయి. 13మంది కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు రాజీనామాతో కన్నడ డ్రామా ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వం నిలబడుతుందా? లేదా? అనే అంశంపై స్పష్టత రానప్పటికీ.. కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణంలో మాత్రం లుకలుకలు బహిర్గతమయ్యాయి. మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్దరామయ్య కావాలనే తమ ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నం చేస్తున్నారని.. ఆయన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సీఎంగా ఒప్పుకోమంటూ మాజీ ప్రధాని, జేడీఎస్ చీఫ్ హెచ్డీ దేవేగౌడ చేసిన వ్యాఖ్యలు కర్ణాటక ప్రభుత్వం ఎక్కువ రోజులు కొనసాగే అవకాశం లేదనే సంకేతాలనిచ్చాయి. అయితే మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం లేనప్పటికీ.. పిల్లి పోరు – పిల్లి పోరు కోతి తీర్చినట్లు.. కాంగ్రెస్–జేడీఎస్ విభేదాలను సద్వినియోగం చేసుకునేందుకు బీజేపీ కాచుకుని కూర్చొంది. తాజా పరిణామాలను ఆ పార్టీ నిశితంగా గమనిస్తోంది. అవసరమైతే రాష్ట్రపతిపాలన పెట్టయినా పరిస్థితిని తన నియంత్రణలోకి తెచ్చుకునే ప్రయత్నం కూడా చేసే అవకాశం లేకపోలేదు. సిద్దరామయ్యే అంతా చేస్తున్నారా? అయితే ఉన్నపళంగా ప్రభుత్వం పడిపోయే అవకాశాల్లేవని.. ఒక్కొక్క ఇటుక రాలిపోతున్నట్లుగా కుమారస్వామి ప్రభుత్వం మెల్లిగా కూలిపోతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సంకీర్ణ సర్కారు ఏర్పాటైనప్పటినుంచీ సున్నితమైన బంధాలపైనే నడుస్తోంది. అయితే పార్లమెంటు ఎన్నికల తర్వాత నెలకొన్న పరిస్థితుల వెనక మాజీ సీఎం సిద్దరామయ్య పాత్ర ఉందని జేడీఎస్ ఆరోపిస్తోంది. రాజీనామాలు చేసిన కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలకు సిద్దు మద్దతుందని కుమారస్వామి సన్నిహితులు ఆరోపిస్తున్నారు. సిద్దు ప్రోద్బలంతోనే వీరంతా రాజీనామాలకు పాల్పడ్డారంటున్నారు. ఆయన్ను సీఎం చేస్తేనే రాజీనామాలు వెనక్కు తీసుకుంటామంటూ రెబల్ ఎమ్మెల్యేలు చెప్పడం కూడా ఈ వాదనలకు బలం చేకూరుస్తోంది. అటు కాంగ్రెస్ కూడా ఎమ్మెల్యేలను బుజ్జగించే ప్రయత్నం చేస్తూనే.. సిద్దరామయ్యను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రతిపాదించే అవకాశాలున్నాయి. అయితే దీనికి జేడీఎస్ కచ్చితంగా ఒప్పుకునే అవకాశం లేదు. అయితే.. ఇదంతా మంగళవారం సభకు రానున్న స్పీకర్.. ఈ 13 మంది ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదిస్తారా? లేదా అన్నదానిపైనే ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో సిద్దు అభ్యర్థిత్వానికే కాంగ్రెస్ జై కొడితే.. జేడీఎస్ ఏకపక్షంగా బీజేపీకి మద్దతిచ్చే అవకాశాలూ లేకపోలేదు. ఆపరేషన్ ‘లోటస్’ పార్లమెంటు ఎన్నికల వరకు నిశ్శబ్దంగా ఉన్న బీజేపీ తాజా పరిణామాల నేపథ్యంలో సాధ్యాసాధ్యాలపై దృష్టిసారించింది. మరింత మంది సంకీర్ణ కూటమి ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించే పరిస్థితులను ప్రోత్సహిస్తే.. కమలం పార్టీ గద్దెనెక్కేందుకు మార్గం సుగమం అవుతుందని భావిస్తోంది. ఇలా జరిగితే రాజీనామా చేసిన ఎమ్మెల్యేలకు ఫిరాయింపుల చట్టం వర్తించదు. విప్ ధిక్కరించారనే వివాదమూ ఉండదు. తద్వారా ఎలాంటి వివాదం లేకుండా బీజేపీ సర్కారు ఏర్పాటు జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒక్కసారి ప్రభుత్వం ఏర్పాటయ్యాక మిగిలిన ఎమ్మెల్యేలను బీజేపీ టికెట్లపై బరిలో దింపి గెలిపించుకోవాలనే ఆలోచనలో బీజేపీ ఉందనే చర్చ జరుగుతోంది. ఎవరి బలమెంత? కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 మంది ఎమ్మెల్యేలుంటారు. ఇందులో ప్రభుత్వ ఏర్పాటుకు 113 మంది బలం ఉండాల్సిందే. ప్రస్తుత జేడీఎస్–కాంగ్రెస్ సంకీర్ణ బలం 118. ఒకవేళ ఈ 13 మంది ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదం పొందితే కూటమి ఎమ్మెల్యేల సంఖ్య 105 (కాంగ్రెస్ 69, జేడీఎస్ 34, బీఎస్పీ 1, స్వతంత్రులు 1)కు చేరుతుంది. బీజేపీ సొంత బలం కూడా 105. రాజీనామాల ఆమోదంతో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 106 (స్పీకర్ను మినహాయిస్తే). ఇది బీజేపీ, సంకీర్ణ సర్కారు మధ్య నువ్వా–నేనా అనే పరిస్థితి నెలకొంటుంది. ఏకైక బీఎస్పీ ఎమ్మెల్యేను లాక్కుంటే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుచేయవచ్చు. -
రసవత్తరం కర్ణాటకం..
సాక్షి, బెంగళూరు/యశవంతపుర/న్యూఢిల్లీ/ముంబై: కర్నాటకం రసకందాయంలో పడింది. కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి 13 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన నేపథ్యంలో ఇరుపార్టీలకు చెందిన ముఖ్య నేతలు నష్టనివారణ చర్యలకు దిగారు. జేడీఎస్ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా సమర్పించిన నేపథ్యంలో ఆ పార్టీ అధినేత హెచ్డీ దేవెగౌడ ఆదివారం తన నివాసంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అలాగే బెంగళూరులోని ఓ హోటల్లో కాంగ్రెస్ ముఖ్యనేతలు సమావేశమై ప్రభుత్వాన్ని కాపాడుకోవడంపై చర్చలు జరిపారు. మరోవైపు కేపీసీసీ ఇన్చార్జ్ కేసీ వేణుగోపాల్, మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్దరామయ్య, మల్లికార్జున ఖర్గే, డిప్యూటీ సీఎం పరమేశ్వర, మంత్రి డికే శివకుమార్ తదితరులు అసంతృప్తితో రగిలిపోతున్న ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఒక్కో జిల్లా మంత్రికి ఆ జిల్లాలోని అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించే బాధ్యతలను అప్పగించారు. ఈ విషయమై మంత్రి శివకుమార్ మాట్లాడుతూ..‘ఈ సమస్యకు ఓ పరిష్కారాన్ని కనుగొనేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. ప్రభుత్వాన్ని, పార్టీని కాపాడుకునేందుకు ఎలాంటి త్యాగాలు చేసేందుకైనా నేను సిద్ధం’ అని ప్రకటించారు. దేవెగౌడతో సమావేశమైన శివకుమార్ ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. మరోవైపు ఈ వివాదంపై కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేశ్ కుమార్ స్పందించారు. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఉంటుందా? లేక కూలిపోతుందా? అన్న విషయం అసెంబ్లీలోనే తేలుతుందన్నారు. కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు జూలై 12న ప్రారంభం కానున్నాయి. సోనియాజీ.. చూస్తున్నారా?: దేవెగౌడ కర్ణాటకలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై జేడీఎస్ అధినేత దేవెగౌడ తీవ్రఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు రాష్ట్రంలో పార్టీని అస్తవ్యస్తం చేశారనీ, దానివల్లే ఈ దుస్థితి దాపురించిందని యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీకి ఫిర్యాదు చేశారు.‘శివాజీనగర కాంగ్రెస్ ఎమ్మెల్యే రోషన్బేగ్ను సస్పెండ్ చేయడం, మరో ఎమ్మెల్యే భీమానాయక్కు షోకాజ్ నోటీసులు ఇవ్వడం, ఎమ్మెల్యే బీసీ పాటిల్కు మంత్రి పదవి ఇస్తామని 2–3 సార్లు హామీలిచ్చి విస్మరించడం, మంత్రి డీకే శివకుమార్–మాజీ మంత్రి రమేశ్ జార్కిహోళి మధ్య గొడవలు.. ఇవన్నీ కాంగ్రెస్ నేతలు సృష్టించిన సమస్యలే’ అని విమర్శించారు. మరోవైపు సిద్దరామయ్యకు సీఎం పదవి అప్పగిస్తే రాజీనామా ఉపసంహరించుకుంటామని కొందరు రెబెల్ ఎమ్మెల్యేలు ప్రకటించడం గమనార్హం. దీంతో సిద్దరామయ్య సీఎం అభ్యర్థి అయితే తాము మద్దతు ఇవ్వబోమని, సంకీర్ణ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేస్తామని దేవెగౌడ కుండబద్ధలు కొట్టారు. మేం సన్యాసులం కాదు: యడ్యూరప్ప కర్ణాటకలో రాజకీయ పరిస్థితులను సునిశితంగా పరిశీలిస్తున్నామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప తెలిపారు. రాష్ట్రంలో అధికారం చేపట్టబోం అని చెప్పడానికి తాము సన్యాసులం కాదని వ్యాఖ్యానించారు. బెంగళూరులో ఆదివారం యడ్యూరప్ప మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎమ్మెల్యేల రాజీనామాపై స్పీకర్ ఓ నిర్ణయం తీసుకున్నాక ఏం చేయాలన్న విషయమై మా పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. మాది జాతీయపార్టీ. కాబట్టి ప్రభుత్వ విషయంలో హైకమాండ్తో చర్చించాకే తుదినిర్ణయం తీసుకుంటాం. రాష్ట్రంలో అధికారం చేపట్టబోం అని చెప్పడానికి మేమేమైనా సన్యాసులమా? రాష్ట్రంలో ఎన్నికలు జరిగి 13 నెలలు మాత్రమే అయింది. ఇంతలోనే మరోసారి అసెంబ్లీ ఎన్నికలకు మేము ఒప్పుకోం. ఏదేమైనా తుది నిర్ణయం కోసం వేచిచూడండి’ అని చెప్పారు. ఒకవేళ సమర్థవంతమైన పాలన అందించడంలో కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం విఫలమైతే, 105 మంది ఎమ్మెల్యేలతో తాము ఉన్నామని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేల రాజీనామాలు సిద్దరామయ్య గేమ్ప్లాన్లో భాగమని బీజేపీ నేత, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ ఆరోపించారు. ప్రజల విశ్వాసం కోల్పోయారు: మురళీధరరావు సాక్షి, న్యూఢిల్లీ: అవగాహనారాహిత్యంతోనే కాంగ్రెస్–జేడీఎస్ నేతలు బీజేపీని విమర్శిస్తున్నారని కర్ణాటక బీజేపీ ఇన్చార్జి మురళీధరరావు అన్నారు. ‘కర్ణాటకలో కాంగ్రెస్– జేడీఎస్ ఎమ్మెల్యేల వరుస రాజీనామాల వెనుక బీజేపీ ఉందన్న ఆరోపణలను ఖండిస్తున్నాం. అసలు అధ్యక్షుడే లేని కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చక, ప్రజల విశ్వాసం కోల్పోవడం తోనే పార్టీని వీడుతున్నారు’ అని ఆయన సాక్షితో అన్నారు. రెబెల్స్ కోసం బీజేపీ నేత విమానం.. ప్రస్తుతం 10 మంది కాంగ్రెస్–జేడీఎస్ రెబెల్ ఎమ్మెల్యేలు ముంబైలోని ఓ హోటల్లో ఉన్న సంగతి తెలిసిందే. వీరు ఆదివారం హోటల్ వద్ద మీడియాతో మాట్లాడారు. తమ రాజీనామాలను ఉపసంహరించుకునేది లేదని వారు స్పష్టం చేశారు. అయితే వీరంతా బీజేపీ నేతకు చెందిన చార్టెడ్ విమానంలో బెంగళూరు నుంచి ముంబై వెళ్లినట్లు వెలుగులోకివచ్చింది. బీజేపీ రాజ్యసభ ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ జూపిటర్ క్యాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు చైర్మన్గా ఉన్నారు. రెబెల్ ఎమ్మెల్యేలు తమ విమానంలోనే బెంగళూరు నుంచి ముంబై వెళ్లారని జూపిటర్ క్యాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వర్గాలు తెలిపాయి. అయితే ఈ చార్టెడ్ విమానాన్ని ఎవరు, ఎవరికోసం అద్దెకు తీసుకున్నారు.. అనే వివరాలను చెప్పేందుకు నిరాకరించాయి. తాము చార్డెట్ విమాన సర్వీసులను నడుపుతున్నామనీ, వాటిని ఎవరైనా బుక్ చేసుకోవచ్చని స్పష్టం చేశాయి. మరోవైపు రెబెల్ ఎమ్మెల్యేలు ముంబైలో ఉన్న విషయమై తమకు ఎలాంటి సమాచారం లేదని మహారాష్ట్ర బీజేపీ విభాగం ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీకి సీఎం కుర్చీ! 2018లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ఐదేళ్ల పాటు కుమారస్వామే ముఖ్యమంత్రిగా ఉంటారని కాంగ్రెస్ పెద్దలు ప్రకటించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కుమారస్వామి వెంటనే పదవి నుంచి తప్పుకోవాలనీ, మిగిలిన మూడేళ్ల కాలానికి సీఎం కుర్చీని తమకు ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు పట్టుబడుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఇరుపార్టీల నుంచి ఐదుగురు చొప్పున మంత్రులు రాజీనామాలు చేసి ఆ పదవులను రెబల్ ఎమ్మెల్యేలకు అప్పగించడం ద్వారా ఈ సంక్షోభాన్ని నివారించవచ్చని కాంగ్రెస్ నేతలు ప్రతిపాదించినట్లు సమాచారం. సీఎం కుమారస్వామి ఆదివారం రాత్రి అమెరికా నుంచి బెంగళూరుకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో జేడీఎస్ నేతలతో ఆయన సమావేశమైన తర్వాతే కాంగ్రెస్ డిమాండ్పై స్పష్టత రానుంది. మరోవైపు సిద్దరామయ్యకు సన్నిహితులైన బైరటి బసవరాజ్, ఎస్టీ సోమశేఖర్, మునిరత్నలు రాజీనామా చేయడంపై ఈ మాజీ సీఎంను కాంగ్రెస్ హైకమాండ్ నిలదీసినట్లు సన్నిహితవర్గాలు తెలిపాయి. సొంతవర్గం ఎమ్మెల్యేలు పార్టీ మారుతుంటే ఏం చేస్తున్నారని సిద్దరామయ్యపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. తనను ముఖ్యమంత్రిగా ప్రతిపాదించినట్లు వస్తున్న వార్తలను కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే ఖండించారు. ముంబైలోని హోటల్ వద్ద మీడియాతో మాట్లాడుతున్న రెబెల్ ఎమ్మెల్యేలు -
కన్నడ సంక్షోభం
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలోని జేడీఎస్– కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయేందుకు సిద్ధంగా ఉంది. శనివారం 13 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు సమర్పించడంతో రాజకీయం కీలక మలుపు తిరిగింది. రాష్ట్ర అసెంబ్లీలోని 224 మంది సభ్యులకుగాను మెజారిటీకి అవసరమైన 118 మంది సభ్యుల బలం సంకీర్ణానికి ఉంది. తాజా రాజీనామా లను స్పీకర్ అంగీకరిస్తే మాత్రం ప్రభుత్వం కూలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. స్పీకర్ ఆఫీస్లో రాజీనామా లేఖలు కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వానికి చెందిన కొందరు ఎమ్మెల్యేలు శనివారం స్పీకర్ కార్యాలయంలో రాజీనామా పత్రాలు సమర్పించారు. అనంతరం వారు రాజ్భవన్లో గవర్నర్ వాజూభాయ్ వాలాను కలిశారు. ‘ఇటీవలి రాజీనామా సమర్పించిన ఆనంద్ సింగ్తోపాటు కాంగ్రెస్, జేడీఎస్లకు చెందిన 14 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పీకర్ కార్యాలయంలో రాజీనామా లేఖలు అందజేశారు’ అని జేడీఎస్ ఎమ్మెల్యే ఏహెచ్ విశ్వనాథ్ గవర్నర్తోను కలిశాక మీడియాకు చెప్పారు. ‘ ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వం పనిచేయడం లేదు’ అని విశ్వనాథ్ అన్నారు. ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు ఎమ్మెల్యేలను బీజేపీ మచ్చిక చేసుకుంటోందన్న ఆరోపణలపై ఆయన మాట్లాడుతూ.. ‘ఆపరేషన్ కమలం వంటివన్నీ ఊహాగానాలు. బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నాం’ అని అన్నారు. అయితే, ఆనంద్ సింగ్ సహా 13 మంది ఎమ్మెల్యేలే రాజీనామా లేఖలను అందజేసినట్లు అసెంబ్లీ సెక్రటేరియట్ వర్గాలు చెప్పాయి. ఈ పరిణామంపై స్పీకర్ రమేశ్ కుమార్ స్పందిస్తూ.. ‘ఎమ్మెల్యేలు వచ్చిన సమయంలో కార్యాలయంలో లేను. మొత్తం 11 మంది శాసనసభ్యులు రాజీనామా లేఖలు ఆఫీస్లో ఇచ్చారు. ప్రభుత్వం కొనసాగేదీ లేనిదీ అసెంబ్లీలోనే తేలుతుంది. మంగళవారం ఆఫీసుకు వెళ్లి రాజీనామా లేఖలను పరిశీలించి, చర్య తీసుకుంటా’ అని తెలిపారు. ఈ పరిణామంతో కాంగ్రెస్లో ‘ట్రబుల్ షూటర్గా పేరున్న డీకే శివకుమార్ రంగంలోకి దిగారు. అసంతృప్త ఎమ్మెల్యేల్లో ముఖ్యులైన రామలింగారెడ్డి తదితరులను బుజ్జగించే పనిలో పడ్డారు. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ బెంగళూరుకు చేరుకోనున్నారు. ముంబై రిసార్టుకు 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు సమర్పించిన కర్ణాటక కాంగ్రెస్, జేడీఎస్కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు చార్టెర్డ్ విమానంలో శనివారం సాయంత్రం ముంబైకి బయలుదేరారు. వీరంతా హోటల్లో బస చేసే అవకాశముందని సమాచారం. ‘ప్రత్యర్థి పార్టీల్లో జరుగుతున్న పరిణామాలతో నాకు గానీ, మా పార్టీకి గాని ఎటువంటి సంబంధం లేదు’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప స్పష్టం చేశారు. అంతర్గత కుమ్ములాటలే కారణం: బీజేపీ కర్ణాటకలో ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న కాంగ్రెస్ ఆరోపణలపై కమలదళం స్పందించింది. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ సంక్షోభానికి కాంగ్రెస్, జేడీఎస్ అంతర్గత కుమ్ములాటలే కారణమని బీజేపీ మీడియా చీఫ్, రాజ్యసభ సభ్యుడు అనిల్ బలూనీ ఆరోపించారు. ఎమ్మెల్యేల రాజీనామాలతో తమకు ఎటువంటి సంబంధం లేదన్నారు. మా ప్రభుత్వానికి ఢోకాలేదు: కాంగ్రెస్ ధీమా ఎమ్మెల్యేల రాజీనామా వార్తలపై సంకీర్ణ ప్రభుత్వ సమన్వయ కమిటీ అధ్యక్షుడు సిద్దరామయ్య స్పందించారు. ‘మా ప్రభుత్వానికి ఢోకా లేదు. తిరుగుబాటు ఎమ్మెల్యేలతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ‘బంతి స్పీకర్ కోర్టులో ఉంది. ఏం జరుగుతుందో చూద్దాం’ అని జేడీఎస్ అధినేత హెచ్డీ దేవెగౌడ అన్నారు. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలతో మాట్లాడేందుకు వెళ్తున్న కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ -
కర్ణాటక సర్కారుకు షాక్
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో దినదినగండంగా కొనసాగుతున్న కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి షాక్ తగిలింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆనంద్ సింగ్ (విజయనగర), రమేశ్ జార్కిహోళి (గోకాక్)లు తమ పదవులకు, పార్టీకి సోమవారం రాజీనామా సమర్పించారు. కర్ణాటక స్పీకర్ రమేశ్ ఇంటికి వెళ్లిన ఆనంద్ సింగ్ రాజీనామా సమర్పించగా, రమేశ్ జార్కిహోళి ఫ్యాక్స్ ద్వారా రాజీనామా లేఖను పంపారు. ఈ సందర్భంగా రాజ్భవన్కు వెళ్లిన ఆనంద్ సింగ్ గవర్నర్ వజూభాయ్వాలాకు కూడా రాజీనామాను అందజేశారు. దీంతో అప్రమత్తమైన కాంగ్రెస్ నేతలు మాజీ సీఎం సిద్దరామయ్య ఇంట్లో అత్యవసరంగా సమావేశమయ్యారు. బీజేపీ తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కుమారస్వామి అమెరికాలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఇద్దరు ఎమ్మెల్యేలు సంకీర్ణ ప్రభుత్వాన్ని వీడటం గమనార్హం. డిమాండ్లు ఒప్పుకోనందుకే.. ఈ సందర్భంగా ఆనంద్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ..‘నిజమే.. నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా సమర్పించాను. విజయనగర జిల్లాను ఏర్పాటుచేయడం, జేఎస్డబ్ల్యూ కంపెనీకి బళ్లారి జిల్లాలో 3,667 ఎకరాలు అమ్మేందుకు ఇచ్చిన అనుమతుల్ని రద్దుచేయాలన్న నా డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చలేదు. ఒకవేళ ఈ డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరిస్తే, నా రాజీనామాపై పునరాలోచిస్తా’ అని స్పష్టం చేశారు. అయితే తనపై రిసార్టులో దాడిచేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జె.ఎన్.గణేశ్పై సస్పెన్షన్ ఎత్తివేయడంతో ఆనంద్సింగ్ రాజీనామా చేసినట్లు ఆయన సన్నిహితవర్గాలు చెప్పాయి. మరో తిరుగుబాటు ఎమ్మెల్యే రమేశ్ జార్కి హోళి స్పందిస్తూ..‘ మంగళవారం అమావాస్య కాబట్టి ఈరోజు(సోమవారం) నా రాజీనామాను స్పీకర్కు ఫ్యాక్స్ ద్వారా పంపాను. రేపు ఉదయం వ్యక్తిగతంగా కలిసి రాజీనామా సమర్పిస్తాను’ అని చెప్పారు. మరికొంత మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా పార్టీకి రాజీనామా చేయబోతున్నారా? అన్న మీడియా ప్రశ్నకు.. ‘మీకు ప్లాన్ మొత్తం చెప్పేస్తే ఎలా? వేచిచూడండి’ అని జవాబిచ్చారు. కాగా, ఆనంద్ సింగ్ రాజీనామా లేఖ తమకు అందిందనీ, నిబంధనల మేరకు ఈ విషయంలో చర్యలు తీసుకుంటామని స్పీకర్ కార్యాలయం తెలిపింది. కాంగ్రెస్ నేతల అత్యవసర భేటీ ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా చేయడంతో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. ఆ పార్టీ సీనియర్ నేతలు డిప్యూటీ సీఎం జి.పరమేశ్వర, మంత్రి డి.కె.శివకుమార్, కేపీసీసీ అధ్యక్షుడు దినేశ్ గుండూరావు మాజీ సీఎం సిద్దరామయ్య ఇంటిలో అత్యవసరంగా భేటీ అయ్యారు. పార్టీని ఎమ్మెల్యేలు ఎవరూ వీడకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం గుండూరావు మీడియాతో మాట్లాడుతూ..‘మా ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. బీజేపీ అగ్రనేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, కేంద్ర సంస్థల ద్వారా మా ఎమ్మెల్యేలను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఎన్నికుట్రలు చేసినా ఐదేళ్ల పాటు కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ సర్కారు కొనసాగుతుంది’ అని స్పష్టం చేశారు కర్ణాటకలో రాజకీయ పరిస్థితుల్ని తాను గమనిస్తున్నాననీ, తమ ప్రభుత్వాన్ని కూల్చాలని బీజేపీ పగటి కలలు కంటోందని సీఎం కుమారస్వామి ఎద్దేవా చేశారు. అయితే కాంగ్రెస్–జేడీఎస్ కూటమిలో తీవ్రమైన అసంతృప్తి ఉందనీ, ప్రభుత్వం దానంతట అదే కూలిపోతుందని రాష్ట్ర బీజేపీ చీఫ్ బీఎస్ యడ్యూరప్ప జోస్యం చెప్పారు. అసెంబ్లీలో బలాబలాలు.. కాంగ్రెస్ పార్టీకి 77 మంది, జేడీఎస్కు 37 మందితో పాటు ముగ్గురు స్వతంత్రులు కలిపి కర్ణాటక అసెంబ్లీలో అధికార కూటమికి 117 స్థానాలు ఉన్నాయి. అయితే ఆనంద్ సింగ్, రమేశ్ రాజీనామాతో ఆ బలం 115కు పడిపోయింది. ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కావాల్సిన ఎమ్మెల్యేల సంఖ్య 113కు తగ్గింది. ప్రస్తుతం బీజేపీకి 105 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్–జేడీఎస్ కూటమి నుంచి మరో 9 మంది ఎమ్మెల్యేను ఆకర్షించే దిశగా బీజేపీ పావులు కదుపుతోంది. -
కర్ణాటకలో వేడెక్కిన రాజకీయం
బెంగళూరు: లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత కర్ణాటకలో ప్రభుత్వాన్ని కూల్చేయడానికి బీజేపీ పావులు కదుపుతూ ఉండడంతో రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, జేడీ (ఎస్) కూటమి సంక్షోభంలో పడింది. హెచ్డీ కుమారస్వామి సర్కార్ని ఆపరేషన్ కమల్ నుంచి కాపాడుకోవడానికి ఇరు పార్టీలకు చెందిన నాయకులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. సంక్షోభ నివారణ కోసం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ముఖ్యమంత్రి కుమారస్వామి, ఇతర పార్టీ సీనియర్ నాయకులు, మంత్రులతో మంతనాలు జరిపారు. ఎమ్మెల్యేలు తమ నుంచి జారిపోకుండా ఉండడానికి కేబినెట్ను విస్తరించడం లేదంటే పునర్వ్యవస్థీకరణ చేయాలా అన్న దిశగా కేసీ వేణుగోపాల్, కుమారస్వామి, సీఎల్పీ నాయకుడు సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర వంటి నాయకులు చర్చలు జరిపారు. కానీ ఈ అంశంలో ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. కుమారస్వామి మంత్రివర్గంలో మూడు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయడమా లేదంటే కొందరు మంత్రుల్ని తొలగించి కొత్తవారికి అవకాశం ఇవ్వడమా అన్నదానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో లోతుగా చర్చించి ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్తో సంప్రదింపులు జరిపాక ఒక నిర్ణయం తీసుకోనున్నట్టుగా తెలుస్తోంది. కేబినెట్లో మొత్తం 34మంది మంత్రులకు గాను కాంగ్రెస్కు 22, జేడీ(ఎస్)కు 12 మంత్రి పదవులు ఉన్నాయి. ఇప్పటికే మంత్రి పదవులపై కాంగ్రెస్ నేతల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. -
కర్ణాటక సంకీర్ణంలో టెన్షన్.. టెన్షన్
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో సీఎం కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్–కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఏడాది ముచ్చటే కానుందా? సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే కర్ణాటకలో బీజేపీ ‘ఆపరేషన్ కమల’ను ప్రారంభించనుందా? అంటే రాజకీయ విశ్లేషకులు అవుననే సంకేతాలు ఇస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్లో అంచనా వేసినట్లు మొత్తం 28 లోక్సభ సీట్లలో బీజేపీ 18 నుంచి 25 స్థానాలు దక్కించుకుంటే కర్ణాటకలో కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వం కూలిపోతుందని వ్యాఖ్యానిస్తున్నారు. ఇందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీకి గతేడాది జరిగిన ఎన్నికల్లో బీజేపీ 104 మంది ఎమ్మెల్యేలతో అతిపెద్ద పార్టీగా అవతరించగా, కాంగ్రెస్(77), జేడీఎస్(37) పార్టీలు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అయితే యడ్యూరప్ప ప్రభుత్వం అసెంబ్లీలో 111 మంది సభ్యుల మద్దతు ఉన్నట్లు బలనిరూపణ చేసుకోలేకపోయింది. దీంతో ఓ బీఎస్పీ ఎమ్మెల్యే, మరో స్వతంత్ర అభ్యర్థి మద్దతుతో జేడీఎస్–కాంగ్రెస్ పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాయి. సొంత గూటిలో అసమ్మతి సెగలు కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవులు దక్కని అసమ్మతి నేతలను బీజేపీ లక్ష్యంగా చేసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. శుక్రవారం తెల్లవారేసరికి కుమారస్వామి ప్రభుత్వం కూలిపోతుందని కేంద్ర మంత్రి సదానంద గౌడ జోస్యం చెప్పారు. కర్ణాటకలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అన్నీ సిద్ధమయ్యాయని వ్యాఖ్యానించారు. మరోవైపు ఇందుకు తగ్గట్లు కాంగ్రెస్లోనూ అసమ్మతి స్వరాలు పెరుగుతున్నాయి. కేపీసీసీ చీఫ్ గుండూరావు ఫ్లాప్ షో అనీ, సిద్దరామయ్య ఓ మూర్ఖుడనీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఓ బఫూన్ అని ఆ పార్టీ సీనియర్ నేత రోషన్ బేగ్ విరుచుకుపడ్డారు. వీరివల్ల కర్ణాటకలో కాంగ్రెస్ భ్రష్టుపట్టిపోయిందని ఘాటుగా విమర్శించారు. మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే కె.సుధాకర్ స్పందిస్తూ ఈవీఎంలపై పార్టీ హైకమాండ్ పోరాటాన్నే తప్పుపట్టారు. కర్ణాటకలో సంకీర్ణ కూటమి బీటలు వారుతోందని చెప్పేందుకు ఇవన్నీ సాక్ష్యాలేనని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. రమేశ్ ఆధ్వర్యంలో ‘ఆపరేషన్ కమల’.. కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యే రమేశ్ జర్కిహోలీ ‘ఆపరేషన్ కమల’లో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో ఢిల్లీలో సమావేశమైన రమేశ్, కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు అమలుచేయాల్సిన వ్యూహంపై చర్చించినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఈ క్రమంలోనే తనతో పాటు మహేశ్ కుమతిహళ్లి, భీమా నాయక్, జేఎన్ గణేశ్ సహా 22 మంది అసంతృప్త కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని ఆయన షాకు వివరించినట్లు సమాచారం. గెలిచినఎంపీలతో మే 24న సమావేశం కావాలని యడ్యూరప్ప నిర్ణయించారు. మా ప్రభుత్వమే కొనసాగుతుంది: సీఎం కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం కూలిపోతుందన్న వాదనల్ని సీఎం కుమారస్వామి తోసిపుచ్చారు. తన ప్రభుత్వం మిగిలిన నాలుగేళ్ల కాలాన్ని విజయవంతంగా పూర్తిచేసుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. -
కర్ణాటక సంకీర్ణంలో కుదుపు
సాక్షి బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి కుదుపునిస్తూ కాంగ్రెస్ అసమ్మతి ఎమ్మెల్యే ఉమేశ్ జి.జాదవ్ పార్టీకి, పదవికి రాజీనామా చేశారు. సోమవారం విధానసభ సభాపతి రమేశ్ నివాసానికి వెళ్లి రాజీనామా లేఖను సమర్పించారు. కలబుర్గి జిల్లా చించోళి అసెంబ్లీ నుంచి ఎన్నికైన జాదవ్ వ్యక్తిగత కారణాలతో రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కాగా, ఈ నెల 6వ తేదీన కలబుర్గిలో ప్రధాని మోదీ పాల్గొనే సభలో ఉమేశ్ జాదవ్ బీజేపీలో చేరవచ్చని తెలుస్తోంది. జాదవ్కు బీజేపీ తరఫున కలబుర్గి ఎంపీ సీటు ఖరారైనట్లు కూడా సమాచారం. ఇక్కడ కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే ఎంపీగా ఉన్నారు. మల్లికార్జున ఖర్గే కుమారుడు, రాష్ట్ర మంత్రి ప్రియాంక్ ఖర్గే నియంతృత్వ పోకడలతో జాదవ్ పార్టీని వీడుతున్నారని సమాచారం. జాదవ్తోపాటు అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు రమేశ్ జర్కిహోలి, బి.నాగేంద్ర, మహేశ్ కుమతలి కూడా బీజేపీ నాయకత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు భావిస్తున్నారు. ఈ నలుగురూ విప్ను ధిక్కరించి అసెంబ్లీ సమావేశాలకు కూడా గైర్హాజరు కావడంతో అనర్హులుగా ప్రకటించాలంటూ కాంగ్రెస్ నేతలు గత నెలలో స్పీకర్ను కోరారు. రాష్ట్రంలోని కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణానికి మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసినా, తిరుగుబాటు చేసినా ప్రమాదం పొంచి ఉంది. జాదవ్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచారని కేపీసీసీ అధ్యక్షుడు దినేశ్ గుండూరావు ఆరోపించారు. -
రాజీనామా చేస్తే పది కోట్లు, మంత్రిపదవి
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో ఆడియో టేపుల వ్యవహారం సెగలు పుట్టిస్తోంది. జేడీఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభపెట్టాలని ప్రయత్నించినట్లుగా ఉన్న మరో ఆడియోటేపు తాజాగా బయటకొచ్చింది. ఇందుకు సంబంధించిన ఒక టేపును ఈ నెల 8న స్వయంగా సీఎం కుమారస్వామి విడుదల చేయడం తెలిసిందే. ఈ నెల 7న బీజేపీ కర్ణాటక అధ్యక్షుడు యడ్యూరప్ప జేడీఎస్ ఎమ్మెల్యేలు శివనగౌడ నాయక్, ఆయన కుమారుడు శరణ గౌడలతో మాట్లాడినట్లుగా చెబుతున్న మరో ఆడియో టేపు తాజాగా జేడీఎస్ వర్గాల ద్వారా బయటకొచ్చింది. ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తే ఒక్కొక్కరికి రూ. 10 కోట్లు ఇస్తామని, ఆ తర్వాత ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి తామే గెలిపించుకోవడంతోపాటు మంత్రి పదవి కూడా ఇస్తామని యడ్యూరప్ప హామీ ఇచ్చినట్లుగా ఆ టేపులో ఉంది. నువ్వే మంత్రివి కావచ్చు.. టేపులో ఉన్న దాని ప్రకారం శరణగౌడతో యడ్యూరప్ప మాట్లాడుతూ ‘మొదటి మీ నాన్నతో రాజీనామాకు ఒప్పించు. ముంబై లోని హోటల్లో 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. నీవు అక్కడికి వెళ్లు. సాయంత్రానికి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు వస్తారు. మొత్తం 15 మంది ఎమ్మెల్యేలు అయ్యాక అందరు కలసి ఒకేసారి రాజీనామా చేయండి. ఆ వెంటనే మొదట మీ ఇంటికి రూ. 20 కోట్లు వస్తాయి. ఆర్థిక వ్యవహారాలన్నీ నా కొడుకు బీవై విజయేంద్ర చూసుకుంటాడు. ఉప ఎన్నికల్లో నిన్ను గెలిపించి, మంత్రిని కూడా చేస్తాము. లోక్సభ ఎన్నికల తర్వాత జేడీఎస్ పార్టీ ఎక్కడికిపోతుందో ఎవరికీ తెలియదు’ అని సూచించారు. శివనగౌడ మాట్లాడుతూ రాజీనామా చేస్తే స్పీకర్ వెంటనే దాన్ని అంగీకరించరేమో.. అని చెప్పబోతుండగా మళ్లీ యడ్యూరప్ప.. ‘దాని గురించి మీరు ఆలోచించాల్సిన అవ సరం లేదు. సమావేశాలు ముగిసేలోగా రాజీనామాలను స్పీకర్ అంగీకరించి తీరాల్సిందే. అదం తా పెద్దలు చూసుకుంటారు. ప్రధాని, అమిత్ షా, గవర్నర్ చూసుకుంటారు. నిన్ను మంత్రిని చేయడమే కాకుండా యాదగిరి జిల్లాకు ఇంచార్జిని కూడా చేస్తాం. రాజీనామాకు అంగీకరిస్తే సాయంత్రంలోగా రాయ చూరులోని మార్వాడిల నుంచి రూ. 20 కోట్లు అందిస్తాం’ అని చెబుతున్నట్లుగా ఉంది. -
కర్ణాటక సంకీర్ణంలో గుబులు
బెంగళూరు: కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వానికి మళ్లీ గుబులు మొదలైంది. విప్ను ధిక్కరించి 9 మంది కాంగ్రెస్ సభ్యులు బుధవారం అసెంబ్లీకి డుమ్మా కొట్టారు. జనవరి 18న సీఎల్పీ సమావేశానికి గైర్హాజరైన నలుగురు ఇందులో ఉన్నారు. రిసార్ట్లో సహచర ఎమ్మెల్యేపై దాడిచేసి పరారైన జేఎన్ గణేశ్ ఈ 9 మందిలో ఉన్నారు. ఫిబ్రవరి 6 నుంచి 15 వరకు జరిగే బడ్జెట్ సమావేశాలకు అందుబాటులో ఉండాలని కాంగ్రెస్ నేత సిద్దరామయ్య తమ పార్టీ సభ్యులందరికీ విప్ జారీచేశారు. కాంగ్రెస్–జేడీఎస్ సర్కారును అస్థిరపరచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో 9 మంది సభ్యులు సభకు రాకపోవడం సందేహాలకు తావిస్తోంది. అందులో నలుగురు సభ్యులు బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకే వారు సిద్దరామయ్య నోటీసులకు స్పందించలేదని తెలుస్తోంది. మరోవైపు, అసెంబ్లీ సమావేశాలు తీవ్ర గందరగోళం నడుమ ప్రారంభమయ్యాయి. సంకీర్ణం చట్టబద్ధతను ప్రశ్నిస్తూ ప్రతిపక్ష బీజేపీ సభ్యులు నినాదాలు చేశారు. ఉభయ సభల్ని ఉద్దేశించి మాట్లాడుతున్న గవర్నర్ వాజూబాయ్ వాలా ప్రసంగానికి అంతరాయం కలిగించారు. దీంతో గవర్నర్ తన ప్రసంగంలో నేరుగా చివరి పేరా చదివి ముగించారు. -
రాజీనామాకు నేను సిద్ధమే
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలోని కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో విభేదాలు బహిర్గతమయ్యాయి. ఆదివారం బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.సోమశేఖర మాట్లాడుతూ..‘రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదు. అదే సిద్దరామయ్య హయాంలో అయితే, కెంపెగౌడ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు వంటి భారీ పనులు చేశారు’ అని వ్యాఖ్యానించారు. దీనిపై సీఎం కుమారస్వామి స్పందించారు. ‘కాంగ్రెస్ ఎమ్మెల్యేల మాటలను ఆ పార్టీ నేతలు గమనిస్తున్నారు. కాంగ్రెస్ పెద్దలే తమ ఎమ్మెల్యేలను అదుపులో పెట్టుకోవాలి. లేదా వారు ఇలాగే మాట్లాడతామంటే పదవికి రాజీనామా చేయడానికి నేను సిద్ధం. సీఎం కుర్చీపై నాకు మోజు లేదు’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ నుంచి అనేక అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సంకీర్ణ ధర్మం పాటించడంలో కాంగ్రెస్ విఫలం అవుతోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి ప్రకటనపై కేపీసీసీ అధ్యక్షుడు దినేశ్ గుండూరావ్ స్పందిస్తూ..ఎమ్మెల్యే సోమశేఖర తన పరిధిని అతిక్రమించి మాట్లాడారు. తన వ్యాఖ్యలపై కుమారస్వామికి సోమశేఖర క్షమాపణలు చెప్పారని దినేశ్ పేర్కొన్నారు. సిద్ధరామయ్య మాట్లాడుతూ కుమారస్వామితో చర్చించి విభేదాలను పరిష్కరించుకుంటామని తెలిపారు. సిద్దరామయ్య గొప్ప సీఎం అని, ఎమ్మెల్యేలు అలా అనడంలో తప్పు లేదని డిప్యూటీ సీఎం పరమేశ్వర్ వెనకేసుకొచ్చారు. సీఎం పదవికి కుమారస్వామి రాజీనామా చేసినా వచ్చే నష్టంలేదని బీజేపీ నేత, మాజీ సీఎం జగదీశ్ శెట్టర్ అన్నారు. కుమారస్వామికి సిగ్గుంటే పదవికి రాజీనామా చేయాలని బీజేపీ నేత ఈశ్వరప్ప ఎద్దేవా చేశారు. -
జేఎన్ గణేష్ను అరెస్ట్ చేసే ఛాన్స్
సాక్షి, బెంగళూర్ : కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బస చేసిన ఈగల్టన్ రిసార్ట్స్లో సహచర ఎమ్మెల్యే ఆనంద్ సింగ్పై దాడి చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జేఎన్ గణేష్ను పోలీసులు అరెస్ట్ చేయవచ్చని భావిస్తున్నారు. దాడి ఘటనపై ప్రశ్నించేందుకు గణేష్ను బుధవారం విచారణకు హాజరు కావాల్సిందిగా కోరిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. కాగా, గణేష్పై సోమవారం ఆనంద్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు గణేష్ను అదేరోజు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు కాంగ్రెస్ ప్రకటించింది. ఇక ఆనంద్ సింగ్ను ఆస్పత్రికి తరలించడంతో ఆయన కుటుంబ సభ్యులకు గణేష్ క్షమాపణలు చెప్పారు. తాను బీజేపీతో టచ్లో ఉన్నట్టు పార్టీ నేతలకు సమాచారం ఇచ్చాడనే ఆగ్రహంతో ఆనంద్ సింగ్పై గణేష్ దాడికి తెగబడినట్టు చెబుతున్నారు. తమ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురిచేస్తుందనే ఆందోళనతో కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలను శుక్రవారం సాయంత్రం బెంగళూర్లోని ఈగల్టన్ రిసార్ట్స్కు తరలించిన సంగతి తెలిసిందే. -
ఎమ్మెల్యేలను ఇళ్లకు పంపించేసిన కాంగ్రెస్
శివాజీనగర (బెంగళూరు): కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల రిసార్టు బస ముగిసింది. అయితే, క్యాంపులో ఉండగా తోటి ఎమ్మెల్యేపై దాడి చేసిన ఎమ్మెల్యే గణేశ్ సస్పెన్షన్కు గురికాగా, అతనిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. బీజేపీ ప్రలోభాల భయంతో కాంగ్రెస్ పార్టీ మూడు రోజులుగా బెంగళూరు శివార్లలోని ఈగల్టన్ రిసార్టులో 70 మందికిపైగా తమ ఎమ్మెల్యేలను ఉంచిన విషయం తెలిసిందే. వీరందరినీ సోమవారం ఇళ్లకు పంపించి వేసింది. సిద్ధగంగ మఠాధిపతి శివకుమారస్వామి కన్నుమూయడం, ఇద్దరు ఎమ్యెల్యేల ఘర్షణ వివాదాస్పదం కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీ పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. సోమవారం సీఎల్పీ నేత సిద్ధరామయ్య, కాంగ్రెస్ ఇన్చార్జి కేసీ వేణుగోపాల్ ఎమ్మెల్యేలతో విడివిడిగా మాట్లాడి, బీజేపీ ప్రలోభాలకు లొంగరాదని హితబోధ చేసినట్లు సమాచారం. రిసార్టులో ఉండగానే హొసపేటె ఎమ్మెల్యే ఆనంద్సింగ్, కంప్లి ఎమ్మెల్యే గణేశ్ కొట్టుకున్న ఘటన వివాదాస్పదమైంది. ఆనంద్సింగ్పై దాడికి పాల్పడిన ఎమ్మెల్యే గణేశ్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కేపీసీసీ అధ్యక్షుడు దినేశ్ గుండూరావు ఆదేశాలు జారీ చేశారు. కాగా, గణేశ్పై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆనంద్ సింగ్తోపాటు ఆయన కుటుంబసభ్యులు గట్టిగా పట్టుబట్టారు. గత్యంతరం లేక వారు ఫిర్యాదు చేసేందుకు అంగీకరించారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్థిక సాయం చేయలేదని గణేశ్ తనపై కోపంతో ఉన్నాడనీ, అలాగే, తన బంధువు ఒకరు గణేశ్ రాజకీయ జీవితాన్ని నాశనం చేస్తానని బెదిరించిన విషయం ప్రస్తావనకు వచ్చి గొడవ మొదలైందని ఆనంద్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. -
కాంగ్రెస్ ఎమ్మెల్యే సస్పెన్షన్
బెంగళూరు: సహచర ఎమ్మెల్యేపై దాడికి దిగిన కర్ణాటక ఎమ్మెల్యేపై కాంగ్రెస్ పార్టీ చర్య తీసుకుంది. హోసపేటె ఎమ్మెల్యే, గనుల వ్యాపారి ఆనంద్ సింగ్పై దాడి చేసిన కంప్లి ఎమ్మెల్యే జేఎన్ గణేశ్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పీసీసీ అధ్యక్షుడు దినేశ్ గుండురావు ఆదేశాల మేరకు ఈ చర్య తీసుకున్నారు. ఈ వివాదంపై విచారణ జరిపేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఉప ముఖ్యమంత్రి జి పరమేశ్వర నేతృత్వంలోని ఈ కమిటీలో మంత్రులు కృష్ణా బైరి, కేజే జార్జి సభ్యులుగా ఉంటారు. (రిసార్టులో ఎమ్మెల్యేల బాహాబాహీ) బెంగళూరు శివార్లలో ఉన్న ఈగల్టన్ రిసార్టులో శనివారం రాత్రి ఆనంద్ సింగ్పై గణేశ్ దాడి చేశారు. ఈ ఘటనపై ఇప్పటికే ఆనంద్ ఫిర్యాదు చేయగా, పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే ఆనంద్పై తాను దాడి చేయలేదని, జారి పడటం వల్ల ఆయన గాయపడ్డారని గణేశ్ చెప్పారు. తన వల్లే ఆయన గాయపడ్డారని భావిస్తే తన కుటుంబ సభ్యులతో కలిసి ఆయన క్షమాపణ చెబుతానని అన్నారు. (కర్ణాటకలో రిసార్ట్ రాజకీయాలకు తెర) -
కర్ణాటకలో రిసార్ట్ రాజకీయాలకు తెర
-
కర్ణాటకలో రిసార్ట్ రాజకీయాలకు తెర
బెంగళూరు: కర్ణాటకలో రిసార్ట్ రాజకీయాలకు తాత్కాలికంగా తెర పడింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ తమ నియోజకవర్గాలకు వెళ్లిపోయారని పీసీసీ అధ్యక్షుడు దినేశ్ గుండురావు తెలిపారు. జేడీయూ- కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని అస్ధిరపరిచేందుకు బీజేపీ చేస్తున్న కుట్రలను ఎదుర్కొనేందుకే తమ శాసనసభ్యులను రిసార్ట్కు తరలించామని వెల్లడించారు. తమ ప్రభుత్వం సురక్షితంగా, సుస్థిరంగా ఉందని పేర్కొన్నారు. మరోవైపు మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య పిలుపునిచ్చిన విధంగా సోమవారం సీఎల్పీ సమావేశం జరగలేదు. ‘ఈరోజు సీఎల్పీ సమావేశం ఉంటుందని గతరాత్రి నాకు చెప్పారు. ఇప్పుడేమో సమావేశం లేదంటున్నారు. చాలా మంది ఎమ్మెల్యేలు రిసార్ట్ నుంచి వెళ్లిపోయారు. మరికొంత మంది వెళ్లిపోయేందుకు సిద్ధమవుతున్నారు. బీజేపీ కారణంగానే ఈ గందరగోళం తలెత్తింది. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు అంతా సవ్యంగానే ఉంద’ని కాంగ్రెస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి చెప్పారు. ఈగల్టన్ రిసార్ట్లో తనతోటి ఎమ్మెల్యే ఆనంద్ సింగ్పై తాను చేసినట్టు వచ్చిన వార్తలను ఎమ్మెల్యే కంప్లి జేఎన్ గణేశ్ తోసిపుచ్చారు. ఇందులో వాస్తవం లేదన్నారు. ఆనంద్పై తాను దాడి చేయలేదని స్పష్టం చేశారు. ఒకవేళ ఆయన బాధపడివుంటే తన కుటుంబంతో కలిసి ఆయనను క్షమాపణ అడుగుతానని చెప్పారు. (రిసార్టులో ఎమ్మెల్యేల బాహాబాహీ) -
రిసార్టులో ఎమ్మెల్యేల బాహాబాహీ
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలోని బెంగళూరు శివార్లలో ఉన్న ఈగల్టన్ రిసార్టులో కలకలం చెలరేగింది. ఈ రిసార్టులో శనివారం రాత్రి కాంగ్రెస్ నేతలు భోజనం చేస్తుండగా కంప్లి ఎమ్మెల్యే జె.ఎన్.గణేశ్, హోసపేటె ఎమ్మెల్యే, గనుల వ్యాపారి ఆనంద్ సింగ్ల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో సహనం కోల్పోయిన గణేశ్ టేబుల్పై ఉన్న మద్యం బాటిల్తో ఒక్కసారిగా ఆనంద్సింగ్పై దాడిచేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఆనంద్సింగ్ను నేతలు అపోలో ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆయనకు 12 కుట్లు వేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. కాగా, ఆసుపత్రి ముందు మోహరించిన పోలీసులు ప్రస్తుతం రాజకీయ నేతలెవరినీ లోపలకు వెళ్లనివ్వడం లేదు. ఈ గొడవ విషయమై కాంగ్రెస్ అధికార ప్రతినిధి మధుయాష్కి మాట్లాడుతూ..‘బళ్లారి జిల్లాకు చెందిన గణేశ్, ఆనంద్ సింగ్ ఇద్దరూ పలు వ్యాపారాల్లో భాగస్వాములుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓ వ్యాపారానికి సంబంధించి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అదికాస్తా ముదరడంతో గణేశ్, ఆనంద్ సింగ్పై దాడి చేశారు. ఈ దాడికి, రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు’ అని స్పష్టం చేశారు. రహస్య సమాచారం లీక్ చేశాడనే.. ఈగల్టన్ రిసార్టులో రెండ్రోజులుగా గణేశ్, ఆనంద్ సింగ్ మధ్య వాగ్వాదం కొనసాగుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టడంలో భాగంగా బీజేపీ నేతలు గణేశ్ను సంప్రదించారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు తనను సంప్రదించిన విషయాన్ని, ఇస్తామన్న ఆఫర్ను గణేశ్ ఆనంద్సింగ్తో పంచుకున్నారు. సరిగ్గా ఇదే సమయంలో కాంగ్రెస్ సీఎల్పీ భేటీకి విప్ జారీచేయడంతో గణేశ్ గత్యంతరం లేక హాజరయ్యారు. సమావేశం అనంతరం సీనియర్లు ముందు జాగ్రత్తగా ఎమ్మెల్యేలను నేరుగా రిసార్టుకు తరలించారు. ఈ సందర్భంగా గణేశ్ను బీజేపీ ప్రలోభపెట్టిన విషయాన్ని ఆనంద్సింగ్ సీఎం కుమారస్వామి, సీఎల్పీ నేత సిద్దరామయ్య చెవిన వేశారు. ఈ విషయం తెలుసుకున్న గణేశ్ ఆగ్రహంతో ఊగిపోయారు. చివరికి మాటామాటా పెరగడంతో ఆనంద్సింగ్ తలపై మద్యం బాటిల్తో దాడిచేశారు. కాగా, తన భర్తపై దాడిచేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఆనంద్సింగ్ భార్య ప్రకటించారు. మరోవైపు ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని బిదాది పోలీసులు తెలిపారు. బీజేపీ విమర్శలు ఈగల్టన్ రిసార్టులో జరిగిన ఘటన ప్రజాస్వామ్యానికే కళంకమని బీజేపీ విమర్శించింది. ఈ గొడవను రాష్ట్ర పీసీసీ చీఫ్ గుండూరావు ఆపలేకపోవడం నిజంగా దురదృష్టకరమని ఎద్దేవా చేసింది. ఇన్నాళ్లూ ప్రతీ సమస్యకు బీజేపీనే కారణమని ఆరోపించిన గూండూరావు ఇప్పుడేం చేస్తారని ప్రశ్నించింది. మరోవైపు కర్ణాటక బీజేపీ చీఫ్ యాడ్యూరప్ప ఆదేశాల మేరకు ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా రాష్ట్రానికి తిరిగివస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే గవర్నర్ వజూభాయ్ వాలాను కలిసి కుమారస్వామి సర్కారును బలనిరూపణకు ఆదేశించాల్సిందిగా కమలనాథులు కోరే అవకాశమున్నట్లు సమాచారం. -
కర్ణాటక ప్రభుత్వంపై ‘అవిశ్వాస’ అస్త్రం!
సాక్షి బెంగళూరు: కన్నడనాట రాజకీయ సమరం ముదిరింది. కాంగ్రెస్ పార్టీలోని అసంతృప్తులను బీజేపీలోకి ఫిరాయించేలా చేయాలన్న వ్యూహం పనిచేయకపోవడంతో కమలనాథులు మరో ఎత్తుగడ వేశారు. ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు మాత్రమే తమవైపునకు వచ్చిన నేపథ్యంలో సీఎం కుమారస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన జాతీయ మండలి సమావేశాల కోసం బీజేపీ తమ ఎమ్మెల్యేలను గురుగ్రామ్లోని ఓ రిసార్ట్కు తరలించింది. వీరంతా శనివారం రాత్రి కర్ణాటకకు చేరుకుంటారని బీజేపీ వర్గాలు తెలిపాయి. తర్వాత ఎమ్మెల్యేలంతా కలిసి కుమారస్వామి ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోయామని రాష్ట్ర గవర్నర్కు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించాయి. ప్రభుత్వ వ్యవహారశైలితో అసంతృప్తిగా ఉన్న కొందరు ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ బలవంతంగా ఈగల్టన్ రిసార్ట్కు తరలించిందని ఫిర్యాదు చేస్తారని పేర్కొన్నాయి. ఈ పరిస్థితుల దృష్ట్యా అసెంబ్లీని సమావేశపర్చి బలనిరూపణకు ఆదేశించాల్సిందిగా బీజేపీ నేతలు గవర్నర్ను కోరనున్నారు. ఇందుకు గవర్నర్ ఓకే చెప్తే కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వంపై బీజేపీ సభ్యులు అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఏడుగురు రెబెల్స్పై గంపెడాశలు కుమారస్వామి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కాంగ్రెస్కు చెందిన ఏడుగురు అసంతృప్త ఎమ్మెల్యేలపై బీజేపీ గంపెడాశలు పెట్టుకుంది. శుక్రవారం సీఎల్పీ భేటీకి గైర్హాజరైన నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించేందుకు కమలనాథులు యత్నిస్తున్నారు. దీనివల్ల సభలో ప్రభుత్వాన్ని కూల్చడానికి కేవలం ముగ్గురు ఎమ్మెల్యేల మద్దతు అవసరం కానుంది. ఈ సందర్భంగా అవిశ్వాసం పెడితే మిగిలిన ముగ్గురు కాంగ్రెస్ అసంతృప్త ఎమ్మెల్యేల చేత క్రాస్ ఓటింగ్ చేయించాలని కమలనాథులు యోచిస్తున్నారు. ఒకవేళ స్పీకర్ అనర్హత వేటువేసినా, బీజేపీ ప్రభుత్వం వచ్చాక తగిన ప్రతిఫలం ఉంటుందని వీరందరికీ ఆశచూపుతున్నారు. సీఎల్పీకి గైర్హాజరైన నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రస్తుతం ముంబైలో ఉన్నట్లు తెలుస్తోంది. నేడు బీజేపీ కర్ణాటక అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప సొంత పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. ప్రభుత్వాన్ని కూల్చబోం: యడ్యూరప్ప కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన అవసరం తమకు లేదని కర్ణాటక బీజేపీ చీఫ్ బీఎస్ యడ్యూరప్ప తెలిపారు. కాంగ్రెస్ నేతలే సమన్వయ లోపంతో తమపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. సంకీర్ణ ప్రభుత్వం పతనమవుతుందని తామెన్నడూ చెప్పలేదన్నారు. బెంగళూరులోని డాలర్స్ కాలనీలో ఉన్న స్వగృహంలో మీడియాతో మాట్లాడుతూ.. సంకీర్ణ ప్రభుత్వం ఎలాంటి భయం లేకుండా సురక్షితంగా కొనసాగవచ్చని యడ్యూరప్ప వెల్లడించారు. తాము ప్రతిపక్ష పాత్రను పోషిస్తామని పేర్కొన్నారు. కాగా, కర్ణాటక ప్రభుత్వం కూలిపోతుందన్న ప్రచారం వెనుక మాజీ సీఎం సిద్దరామయ్య ఉన్నారని కేంద్ర మంత్రి సదానంద గౌడ ఆరోపించారు. సీఎం కుమారస్వామి ఏ పని చేసినా సిద్దరామయ్య అడ్డు తగులుతున్నారని విమర్శించారు. మరోవైపు యడ్యూరప్ప ప్రకటనను స్వాగతిస్తున్నట్లు సీఎల్పీ నేత సిద్దరామయ్య తెలపగా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా పార్టీతో టచ్లోనే ఉన్నారని మంత్రి శివకుమార్ చెప్పారు. అసంతృప్తుల్ని బుజ్జగించడంలో భాగంగా అధిష్టానం ఆదేశిస్తే మంత్రి పదవులు వదులుకోవడానికి తనతో సహా సీనియర్ నేతలంతా సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. -
‘కన్నడ’ కథ సుఖాంతం!
బెంగళూరు: కర్ణాటకలో రాజకీయ సంక్షోభం తప్పే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బీజేపీ వైపు ఆకర్షితులయ్యారని భావించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సొంత పార్టీకే విధేయత ప్రకటించి తిరిగొచ్చారు. మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య నేతృత్వంలో శుక్రవారం జరిగే సీఎల్పీ భేటీలో వారంతా పాల్గొనే అవకాశాలున్నాయి. ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రతిపక్ష బీజేపీ చేసిన ప్రయత్నం విఫలమైందని చాటిచెప్పడమే లక్ష్యంగా తన బలం చాటుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. అంతర్గత అసమ్మతిని చల్లార్చేందుకు ఆ పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. నేటి సమావేశానికి గైర్హాజరైతే తీవ్ర పరిణామాలుంటాయని తమ ఎమ్మెల్యేలను సిద్దరామయ్య హెచ్చరించారు. పార్టీలోకి తిరిగిస్తున్న అసంతృప్త ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇస్తారా? అని సిద్దరామయ్యను ప్రశ్నించగా..ఆయన బదులిస్తూ మంత్రి పదవులిస్తామని ఎవరికీ చెప్పలేదని, కాంగ్రెస్లో అసలు అసంతృప్తే లేదన్నారు. బీజేపీకి మిగిలింది భ్రాంతే: కుమారస్వామి కాంగ్రెస్– జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ఏ ప్రయత్నాలు ఫలించబోవని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి స్పష్టం చేశారు. జనవరి 15 తర్వాత బీజేపీకి సం‘క్రాంతి’ అని పలికిన ఆ పార్టీ నేతలకు చివరికి సం‘భ్రాంతి’ మిగిలిందని ఎద్దేవా చేశారు. గురువారం విధానసౌధలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను రెండు, మూడు రోజులు విదేశీ పర్యటనకు వెళ్తే విమర్శించిన బీజేపీ నేతలు ఇప్పుడు మొబైల్ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసుకుని గురుగ్రామ్ హోటల్లో ఏం చేస్తున్నారని నిలదీశారు. ‘ఆపరేషన్ కమల’ చేపట్టలేదు: యడ్యూరప్ప వచ్చే లోక్సభ ఎన్నికల సన్నాహాలపై చర్చించేందుకే తమ ఎమ్మెల్యేలు గురుగ్రామ్ వెళ్లినట్లు బీజేపీ కర్ణాటక అధ్యక్షుడు యడ్యూరప్ప వెల్లడించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు తాము ప్రయత్నించడం లేదని, కాంగ్రెస్– జేడీఎస్ అంతర్గత పోరుకు బీజేపీని నిందించడం సబబుకాదన్నారు. బీజేపీ నేతలు, ఎమ్మెల్యేలు ఎక్కడికి వెళ్తే కాంగ్రెస్ పార్టీకి ఎందుకని ప్రశ్నించారు. 104 మంది బీజేపీ ఎమ్మెల్యేలు గురుగ్రామ్ నుంచి బెంగళూరుకు బయల్దేరినట్లు తెలిసింది. -
రసకందాయంలో కన్నడ రాజకీయం
సాక్షి, బెంగళూరు: కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు బీజేపీ ‘ఆపరేషన్ కమలం’ను ప్రారంభించిందన్న వార్తల నేపథ్యంలో కర్నాటక రాజకీయాలు మరోసారి రసకందాయంలో పడ్డాయి. కాంగ్రెస్, జేడీఎస్ కూటమి ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోందంటూ బీజేపీ తమ 104 మంది ఎమ్మెల్యేలను హరియాణాలోని గురుగ్రామ్లోని ఒక హోటల్లో ఉంచిన విషయం తెలిసిందే. మరోవైపు, కాంగ్రెస్లోని దాదాపు ఆరుగురు అసంతృప్త ఎమ్మెల్యేలు ముంబైలో మకాం వేసి బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నారంటూ కూడా వార్తలు వచ్చాయి. అయితే, తమ ఎమ్మెల్యేలెవరూ కాంగ్రెస్ను వీడటం లేదని, ఆ ఎమ్మెల్యేలు తమతో టచ్లోనే ఉన్నారని కాంగ్రెస్ స్పష్టం చేసింది. రేపు(జనవరి 18న) పార్టీ ఎమ్మెల్యేలందరితో సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. మరోవైపు, ఇన్నాళ్లూ కుమారస్వామి ప్రభుత్వానికి మద్దతిచ్చిన ఇద్దరు ఎమ్మెల్యేలు మంగళవారం తమ మద్దతును ఉపసంహరించుకుని బీజేపీ వైపునకు వెళ్లారు. వారిలో ఒకరు స్వతంత్ర ఎమ్మెల్యే కాగా, మరొకరు కర్ణాటక ప్రజ్ఞావంత జనతా పార్టీ(కేపీజేపీ)కి చెందిన సభ్యుడు. దాంతో బీజేపీ బలం 106కి చేరింది. బీజేపీ కుయుక్తులు ఫలించవని, తన ప్రభుత్వానికి ఢోకా లేదని ముఖ్యమంత్రి కుమార స్వామి చెప్పారు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు తామేమీ ప్రయత్నించడం లేదని, తమ ప్రమేయం లేకుండానే, అంతర్గత విభేదాలతోనే కుమారస్వామి సర్కారు కూలుతుందని బీజేపీ పేర్కొంది. వీరిపైనే దృష్టి ఇటీవల మంత్రి పదవిని కోల్పోయిన రమేశ్ జార్కిహోళి, ఎమ్మెల్యేలు డాక్టర్ ఉమేశ్ జాదవ్, బి.నాగేంద్ర, ప్రతాప్గౌడపాటిల్, మహేశ్ కుమటళ్లి, బీసీ పాటిల్, కంప్లి గణేశ్, భీమానాయక్, డాక్టర్ సుధాకర్, శ్రీనివాసగౌడ సొంత పార్టీ కాంగ్రెస్పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సమాచారం. వీరు పార్టీ నేతలకు అందుబాటులో లేరని తెలుస్తోంది. రేపు సీఎల్పీ భేటీ ప్రాంతీయ కర్ణాటక ప్రజ్ఞావంత జనతా(కేపీజేపీ) పార్టీకి చెందిన ఆర్. శంకర్, స్వతంత్ర ఎమ్మెల్యే హెచ్. నగేశ్లు ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడంతో కాంగ్రెస్–జేడీఎస్ బలం 117కి తగ్గిపోయింది. వారిద్దరు బీజేపీకి మద్దతు ప్రకటించడంతో ఆ పార్టీ బలం 106కు పెరిగింది. అధికార కూటమిలో అంతర్గత విభేదాల్ని ఆసరాగా చేసుకుని అటువైపు నుంచి ఎమ్మెల్యేల్ని ఆకర్షించేందుకు బీజేపీ ‘ఆపరేషన్ లోటస్’ను ప్రారంభించినట్లు వార్తలు వచ్చాయి. అదే సమయంలో తమ సభ్యులు జారిపోకుండా బీజేపీ వారందరిని గురుగ్రామ్లోని ఓ విలాసవంత హోటల్కు తరలించింది. మరోవైపు, రేపు బెంగళూరులో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలో జరిగే శాసనసభా పక్ష సమావేశం ద్వారా అంతా సవ్యంగానే ఉందనే సంకేతాలు పంపాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. బడ్జెట్ గురించి చర్చిండమే అజెండాగా ఈ సమావేశం జరగాల్సి ఉండగా, తాజా రాజకీయ పరిస్థితులే ప్రముఖంగా చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలు.. కాంగ్రెస్ ఇన్చార్జి కేసీ వేణుగోపాల్, డిప్యూటీ సీఎం పరమేశ్వర, మాజీ సీఎం సిద్ధరామయ్య, ఇతర కేపీసీసీ నేతలు అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించే విషయంపై చర్చించారు. అవసరమైతే ఎమ్మెల్యేలను రిసార్ట్కు తరలించాలని యోచిస్తున్నారు. గురుగ్రామ్ హోటల్లో ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప సమావేశమై సమాలోచనలు జరిపారు. మా సంకీర్ణం భద్రం: కాంగ్రెస్ కాంగ్రెస్ సభ్యులంతా తమను సంప్రదిస్తూనే ఉన్నారని, పార్టీలో అంతా సవ్యంగానే ఉందని ఉపముఖ్యమంత్రి జి.పరమేశ్వర చెప్పారు. కర్నాటకలో సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చడం ద్వారా, జాతీయ స్థాయిలో ఏర్పడబోయే విపక్ష మహా కూటమి విఫలమవుతుందనే సంకేతాన్ని బీజేపీ ఇవ్వాలనుకుంటోందన్నారు. బీజేపీ ప్రయత్నాలు ఫలించవని నొక్కిచెప్పారు. తాజా పరిణామాలపై ముఖ్యమంత్రి కుమారస్వామి స్పందిస్తూ..తమ సంకీర్ణ ప్రభుత్వంలో ఇబ్బందులు లేవని, కాంగ్రెస్, జేడీఎస్ సభ్యులందరి మద్దతు ప్రభుత్వానికే ఉందన్నారు. కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడం వల్లే కూటమిలో విభేదాలున్నాయంటూ బీజేపీ ప్రచారం చేస్తోందని కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. బీజేపీ వ్యూహం కర్ణాటకలో కాంగ్రెస్–జేడీ(ఎస్) సంకీర్ణ ప్రభుత్వానికి 117మంది ఎమ్మెల్యేల బలం ఉంది. బీజేపీకి 104 సభ్యుల బలం ఉంది. తాజాగా ఇద్దరు స్వతంత్రులు బీజేపీ వైపు వచ్చారు. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కాంగ్రెస్, జేడీ(ఎస్)ల నుంచి 13 మంది ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాల్సి ఉంటుంది. అప్పుడు మొత్తం సభ్యుల సంఖ్య 211కి తగ్గుతుంది. మెజారిటీకి అవసరమైన సభ్యుల సంఖ్య 106 అవుతుంది. ప్రస్తుతం సొంత సభ్యులు 104, స్వతంత్రులు ఇద్దరు కలిస్తే బీజేపీ బలం 106కి చేరుతుంది. కాంగ్రెస్– జేడీఎస్ సభ్యులు నేరుగా బీజేపీకి మద్దతిస్తే ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం వారిపై అనర్హత వేటు పడుతుంది. అందుకే ‘ఆపరేషన్ కమలం’ ద్వారా రాజీనామా చేసిన వారిని ఉప ఎన్నికల్లో గెలిపించుకోవడమే బీజేపీ వ్యూహంగా తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల్లో మళ్లీ బీజేపీ అధికారం చేపట్టడం ఖాయమని సర్వేలు అంచనా వేస్తుండటంతో.. కర్ణాటక అసెంబ్లీ ఉప ఎన్నికలు కూడా వస్తే లాభమని బీజేపీ అంచనా. ఆపరేషన్ కమలం అంటే.. :దక్షిణాదిన తొలిసారిగా ఇక్కడ పాగావేసిన కమలనాథులు తమ ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఆపరేషన్ కమలం అస్త్రాన్ని బయటకు తీశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు డబ్బుని, అధికారాన్ని ఎరగా వేసి చీలిక తెచ్చి తమవైపు లాక్కోవడమే ఆపరేషన్ కమలం లక్ష్యం. బెంగళూరులో ఆందోళనకు దిగిన జేడీఎస్ ఎమ్మెల్యేలు -
వేడెక్కిన కన్నడ రాజకీయం
సాక్షి, బెంగళూరు/శివాజీనగర/మైసూరు: కన్నడ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. తమ ఎమ్మెల్యేలకు ఎరవేసి ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ‘ఆపరేషన్ కమలం’ ప్రారంభించిందని జేడీఎస్– కాంగ్రెస్.. తమ ఎమ్మెల్యేలనే లాక్కునేందుకు కుమారస్వామి సర్కారు ప్రయత్నిస్తోందంటూ బీజేపీ పరస్పరం ఆరోపణలకు దిగాయి. జాతీయ కౌన్సిల్ సమావేశాలకు ఢిల్లీ వెళ్లిన బీజేపీ ఎమ్మెల్యేలను తిరిగి బెంగళూరు వెళ్లనివ్వకుండా, పార్టీ అగ్ర నేతలు అక్కడే ఉంచారని, తాజాగా గురుగ్రామ్లోని ఒక హోటల్లో వారికి బస ఏర్పాటు చేశారని వార్తలు గుప్పుమన్నాయి. మరోవైపు, కాంగ్రెస్– జేడీఎస్లకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు ‘కనిపించడం’ లేదన్న వార్తలు ప్రభుత్వ శిబిరంలో ఆందోళనలకు కారణమయ్యాయి. ప్రత్యర్థి పార్టీల ఎమ్మెల్యేలు తమ శిబిరంలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నారంటూ ఇరు పార్టీల నేతలు మీడియాకు సమాచారమిస్తుండటంతో కర్ణాటక రాజకీయం రసకందాయంలో పడింది. 224 స్థానాలున్న కర్నాటక అసెంబ్లీలో ప్రస్తుతం మేజిక్ ఫిగర్ అయిన 113ను మించి కాంగ్రెస్– జేడీఎస్లకు 118 మంది సభ్యుల మద్దతుండగా, బీజేపీకి 104 మంది ఎమ్మెల్యేలున్నారు. వారు చెప్పే వెళ్లారు: సీఎం కుమారస్వామి బెళగావి, బళ్లారి జిల్లాలకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీ పక్షంలోకి చేరిపోయారనీ వస్తున్న వార్తలతోపాటు, పలువురు జేడీఎస్ ఎమ్మెల్యేలు కూడా గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్నారన్న దానిపైనా సీఎం కుమారస్వామి స్పందించారు. ‘జేడీఎస్–కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఒక్కరు కూడా బీజేపీ వలలో పడరు. ముంబై వెళ్లిన ఎమ్మెల్యేలు మా స్నేహితులే. వ్యక్తిగత పనులపై వెళుతున్నట్లు వారు ముందుగానే చెప్పారు. మా ప్రభుత్వానికి ఏ ఢోకా లేదు’ అని స్పష్టం చేశారు. ప్రధాని మోదీకి కర్ణాటక అంటే భయం పట్టుకుందన్నారు. తమ ఎమ్మెల్యేలపై పూర్తి విశ్వాసముందని ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరూ కూడా ఎక్కడికీ వెళ్లలేదని సీఎల్పీ అధ్యక్షుడు సిద్ధరామయ్య అన్నారు. కాగా, ఇటీవల రాష్ట్ర కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురైన రమేశ్ జరకిహొలితో పాటు ఆనంద్ సింగ్, బీ నాగేంద్ర, ఉమేశ్ జాధవ్, బీసీ పాటిల్ తదితర అధికార పక్ష ఎమ్మెల్యేలు బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రిసార్టు రాజకీయాలు చేయం: యెడ్డీ ‘జేడీఎస్–కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో మాకు సంబంధం లేదు. మేం వాళ్లను ఎక్కడికీ తీసుకెళ్లలేదు. వాళ్లు ముంబైలో ఎందుకున్నారో ఆ పార్టీల నేతలకే తెలియాలి’ అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప అన్నారు. ‘మా ఎమ్మెల్యేలపై వల వేసేందుకు జేడీఎస్– కాంగ్రెస్ ప్రయత్నాలు సాగిస్తున్నాయి. అందుకే ముందు జాగ్రత్తగా మావారిని ఢిల్లీలో ఉంచాం. రెండు రోజుల తర్వాత వారంతా తమ తమ నియోజకవర్గాలకు చేరుకుని లోక్సభ ఎన్నికలకు ఏర్పాట్లు చేపడతారు’ అని తెలిపారు. రిసార్టు రాజకీయాలు మాకు అవసరం లేదన్నారు. -
టీఆర్ఎస్ది జేడీఎస్ పాత్రే: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్ : కర్ణాటక ఆసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ను తిరస్కరించి తమ పార్టీని గెలిపించారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ అన్నారు. ఆయన సమక్షంలో సామాజిక కార్యకర్త భువన రెడ్డి, జంగు ప్రహ్లాద్ సోమవారం బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా విలేకరులతో లక్ష్మణ్ మాట్లాడుతూ... కర్ణాటకలో గవర్నర్ ఆదేశాలతోనే యడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవి చేపట్టారని, కానీ కాంగ్రెస్-జేడీఎస్ కుట్రలు చేసి ఆయనను పది నుంచి దించేశాయని విమర్శించారు. సీఎం పదవిని తాకట్టు పెట్టి జేడీఎస్ను కాంగ్రెస్ లోబర్చుకుందని దుయ్యబట్టారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కుట్రలో భాగస్వాములుగా ఉన్నారని ఆరోపించారు. ఒకప్పుడు కత్తులు దూసుకున్న జేడీఎస్, కాంగ్రెస్ ఇప్పుడు బీజేపీని అధికారంలోకి రాకుండా కుట్రలు పన్నుతున్నాయని అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ చేస్తున్న ఉద్యమాలు బూటకమన్నారు. ఈ రెండు పార్టీలు కూడా కలిసిపోతాయని, కాంగ్రెస్కు టీఆర్ఎస్ పావుగా మారిందని ఎద్ధేవా చేశారు. టీఆర్ఎస్-కాంగ్రెస్ కవల పిల్లలని వ్యాఖ్యానించారు. జేడీఎస్కు మద్దతు ఇచ్చిన సీఎం కేసీఆర్ ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని, హైదరాబాద్లో ఎమ్మెల్యేలకు బస ఏర్పాటు చేసి వారికి కావాల్సిన ఏర్పాట్లు చేసింది కేసీఆర్ అని అన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ ఒకవైపు ఉంటే మిగిలిన పార్టీలన్నీ మరొకవైపు అనే పరిస్థితి వచ్చిందన్నారు. ఒంటరిగా బీజేపీని ఎదుర్కోలేక కాంగ్రెస్ వైరుధ్యాలున్న పార్టీలతో కలిసి ఎదుర్కోవాలని అనుకుంటోందని మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని సంక్షేమ పథకాలు గులాబీ దండుకే పరిమితం, అయ్యాయని ఆరోపించారు. ప్రస్తుతం తెలంగాణాలో కూడా టీఆర్ఎస్ది జేడీఎస్ పాత్రేనని అన్నారు. కాగా, ఎస్సీ వర్గీకరణ చేపట్టాలంటూ తెలంగాణ మహా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి బీజేపీ కార్యాలయం వద్ద నిరసనకు దిగింది. లక్ష్మణ్ వినతిపత్రం తీసుకోవడంతో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సభ్యులు శాంతించారు. -
‘కుమారస్వామికి ఆఫర్ ఇచ్చింది మేమే’
సాక్షి, న్యూఢిల్లీ: కామన్ మినిమమ్ ప్రొగ్రామ్ ఆధారంగా కర్ణాటకలో తమ ప్రభుత్వం కొనసాగుతుందని కర్ణాటక కాంగ్రెస్ సహాయ ఇన్చార్జి, ఏఐసీసీ కార్యదర్శి మధు యాష్కీతెలిపారు. కుమారస్వామికి ముఖ్యమంత్రి పదవి ఆఫర్ ఇచ్చింది తామేనని, తమ పార్టీ సీఎం పదవి అడగబోదని వెల్లడించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... మళ్లీ కాంగ్రెస్ సీఎం అనే ప్రశ్న ఉత్పన్నం కాదన్నారు. మంత్రివర్గ కూర్పు దామాషా పద్ధతిలో ఉంటుందన్నారు. దూరదృష్టితో తమ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం సజావుగా నడించేందుకు సమన్వయ కమిటీని నియమించనున్నట్టు చెప్పారు. ఐదేళ్ళ పాటు సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా బీజేపీని ఎదుర్కొవాలంటే కాంగ్రెస్ త్యాగం చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. కుమారస్వామికి సీఎం సీటు ఎర కాదని మధు యాష్కీ స్పష్టం చేశారు. బీజేపీని అడ్డుకోవడమే తమ పార్టీ లక్ష్యమని అన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీని కలిసేందుకు కుమారస్వామికి ఢిల్లీకి వచ్చారు. ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గ కూర్పుపై ఆయన చర్చించనున్నారు. బుధవారం జరిగే తన ప్రమాణ స్వీకారానికి సోనియా, రాహుల్ను కుమారస్వామి ఆహ్వనించనున్నారు. -
‘సంకీర్ణాన్ని’ కాపాడేందుకే కాంగ్రెస్ మొగ్గు..!
కర్ణాటకలో జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ ఆచితూచి స్పందిస్తోంది. వచ్చే లోక్సభ ఎన్నికల వరకు ఈ సర్కార్కు ఇబ్బందులు తలెత్తకుండా చూడడమో తక్షణ అవసరంగా ముందుకు సాగుతోంది. ఆ రాష్ట్రంలో బీజేపీని అధికారానికి దూరంగా పెట్టడంతో పాటు, లోక్సభ ఎన్నికల నేపధ్యంలో వివిధ రాష్ట్రాల్లో వీలైనన్ని ఎక్కువ భాగస్వామ్యపక్షాలకు చేరువయ్యేలా మంచి ఇమేజీ సాధనకు ప్రయత్నాలు సాగిస్తోంది. ఇటీవల ఎన్నికల్లో 78 సీట్లు సాధించినా , కేవలం 38 సీట్లు గెలుచుకున్న జేడీఎస్కు ప్రభుత్వ ఏర్పాటులో బేషరతు మద్ధతునివ్వడంతోనే కాంగ్రెస్ దీర్ఘకాల వ్యూహం స్పష్టమవుతోంది. దీని ద్వారా జేడీఎస్కు జూనియర్ భాగస్వామిగా కొనసాగేందుకు మానసికంగా సిద్ధమైంది. కేబినేట్ కూర్పు, ఇతర కీలకాంశాల విషయంలో పట్టు విడుపులు ప్రదర్శించనున్నట్లు వెల్లడవుతోంది. 2006లో జేడీఎస్, బీజేపీల మధ్య చెరి 20 నెలలు సీఎం సీటును పంచుకోవాలనే ఒప్పందం బెడిసికొట్టిన దరిమిలా ఈసారి కాంగ్రెస్ ముఖ్యమంత్రి పీఠాన్ని సైతం కోరుకోవడం లేదు. జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో బీజేపీ వ్యతిరేక, సెక్యులర్, ప్రాంతీయ పార్టీలను ఏకం చేసేందుకు సొంత రాజకీయ ప్రయోజనాలు సైతం వదులుకునేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. కర్ణాటకలో సంకీర్ణాన్ని సజావుగా కొనసాగించడం ద్వారా బీఎస్పీ, ఎస్పీ, తృణముల్ కాంగ్రెస్, ఎస్సీపీ, తదితర పార్టీల మద్ధతు కూడగట్టే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ ఏడాది చివర్లో జరగనున్న రాజస్తాన్, మధ్యప్రదేశ్, చత్తీస్గడ్ ఎన్నికల్లో అధికార బీజేపీకి చెక్ పెట్టడం ద్వారా లోక్సభ ఎన్నికలకు సానుకూల ధృక్పథంతో ముందుకు సాగాలని ఆశిస్తోంది. జేడీఎస్ లక్ష్యం లోక్సభ ఎన్నికలే జేడీఎస్ కురువృద్ధుడు హెడీ దేవెగౌడ కూడా తమ రాజకీయ ప్రాధాన్యాలను స్పష్టం చేశారు. తాము రాబోయే పెద్దయుద్ధానికి సిద్ధమవుతున్నట్లు(లోక్సభ ఎన్నికలకు) ప్రకటించారు. కర్ణాటకలో సెక్యులర్ విలువలున్న సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు సంతోషంగా ఉన్నట్లు పేర్కొన్నారు. గతంలో బీజేపీతో చేతులు కలపడం వల్ల ఏర్పడిన మచ్చను తన కుమారుడు కుమారస్వామి ఇప్పుడు చెరుపుకోవడం ఎంతో గర్వంగా ఉందన్నారు. బీజేపీని అధికారానికి రాకుండా చేయాలన్నదే తమ ఉమ్మడి లక్ష్యమన్నారు. 2004-06 మధ్యకాలంలో చేసిన పొరపాట్లను కాంగ్రెస్-జేడీఎస్ గ్రహించాయని, ప్రస్తుత సంకీర్ణ సర్కార్ ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేస్తుందన్నవిశ్వాసం వ్యక్తం చేశారు. తమ తదుపరి లక్ష్యం లోక్సభ ఎన్నికలేనని, బీజేపీకి వ్యతిరేకంగా కర్ణాటకలో అన్ని సెక్యులర్ పార్టీలు ఒకే వేదికపైకి రావడం తక్షణ అవసరమని పేర్కొన్నారు. గతఅనుభవాలు పునరావృతం కాకుండా.. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మాదిరిగానే 2004లోనూ బీజేపీకి 80 సీట్లు, కాంగ్రెస్కు 65 సీట్లు, జేడీఎస్కు 58 సీట్లు రావడంతో కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. వొక్కలిగల నాయకుడు డీకే శివకుమార్, ఇతర సీనియర్ కాంగ్రెస్ నాయకులకు మంత్రి పదవులు ఇవ్వొద్దంటూ జేడీఎస్ అధినేత హెచ్డీ దేవెగౌడ విధించిన షరతులతో మొదటి నుంచిఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. అప్పుడు జేడీఎస్లో ఉన్న డిప్యూటీ సీఎం సిద్ధరామయ్య ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమం కోసం చేపట్టిన‘ అహిందా ర్యాలీ’ లను దేవెగౌడ తీవ్రంగా వ్యతిరేకించారు. పార్టీని లేదా అహిందాలలో ఏదో ఒక దాన్ని ఎంచుకోవాలంటూ సిద్ధూపై తెచ్చిన ఒత్తిడి ఫలించకపోవడంతో ఆయనను బహిష్కరించారు. మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్న హెచ్డీ కుమారస్వామి ఈ పరిణామాలను తనకు అనుకూలంగా మలచుకుని, పార్టీలో మెజారిటీ ఎమ్మెల్యేలను కూడగట్టారు.జేడీఎస్ను చీల్చేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నిందని ఆరోపిస్తూ తన 40 మంది ఎమ్మెల్యేలతో కలసి బీజేపీతో దోస్తీకట్టారు. దీంతో ఆ సంకీర్ణ సర్కార్ పతనమైంది. దేవెగౌడ తన కొడుకు కుమారస్వామిని జేడీఎస్ నుంచి బహిష్కరించారు. 2006లో బీజేపీ-జేడీఎస్ల మధ్య చెరి 20 నెలలు అధికారాన్ని పంచుకోవాలనే ఒప్పందంతో ప్రభుత్వం ఏర్పడింది. మొదట కుమారస్వామి సీఎం పదవిని చేపట్టి 20 నెలల పదవీకాలం పూర్తయ్యాక బీజేపీకి అధికార మార్పిడి సందర్భంలో సమస్యలు తలెత్తాయి. ఆ తర్వాత సీఎంగా ప్రమాణం చేసినా బలనిరూపణకు జేడీఎస్ ఎమ్మెల్యేలు మద్ధతివ్వకపోవడంతో ఏడు రోజుల్లోనే యడ్యూరప్ప రాజీనామా చేయాల్సి వచ్చింది. కర్ణాటకలో ఈ పరిణామాలు పునరావృతం కాకూడదనే ఇప్పుడు కాంగ్రెస్ మరిన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. -సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
కర్ణాటక రాజకీయపై స్పందించిన రజనీకాంత్
-
బీజేపీపై రజనీకాంత్ విమర్శలు
సాక్షి, చెన్నై: కర్ణాటక రాజకీయ పరిణామాలపై సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారు. రజనీ మక్కల్ మండ్రమ్ మహిళా విభాగం కార్యకర్తలతో ఆదివారం రజనీ భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీపై రజనీ విమర్శలు గుప్పించారు. కర్ణాటకలో బీజేపీ ప్రజాస్వామ్యాన్ని పరిహసించాలని చూసిందని, కానీ, చివరకు న్యాయమే గెలిచిందని రజనీ వ్యాఖ్యానించారు. ‘కర్ణాటకలో గత కొన్ని రోజులుగా నాటకీయ పరిణామాలు నడిచాయి. ప్రభుత్వ ఏర్పాటు కోసం బీజేపీ గడువు కోరితే.. గవర్నర్ ఏకంగా 15 రోజుల సమయం ఇచ్చారు. అంతా కలిసి ప్రజాస్వామ్యాన్ని పరిహసించాలని యత్నించారు. కానీ, చివరకు ఏం జరిగింది? న్యాయస్థానం జోక్యం చేసుకోవటంతో పరిస్థితులు మారిపోయాయి. ఈ విషయంలో సుప్రీం కోర్టు తీర్పు హర్షించదగ్గ విషయం. ఎట్టకేలకు ప్రజాస్వామ్యం వర్థిల్లింది. కర్ణాటకలో జరిగిన విషయాన్ని పాలకులందరూ గమనించాలి’ అని రజనీ పేర్కొన్నారు. ఎన్నికల గురించి... 2019 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై రజనీ కాంత్ స్పష్టత ఇవ్వలేకపోయారు. ‘ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. ఎన్నికల తేదీలు ప్రకటించినప్పుడు నిర్ణయం తీసుకుంటాం. ఇంకా పార్టీని ప్రకటించలేదు కదా. అయినా అన్నింటికి మేం సిద్ధంగా ఉన్నాం. ఇక పొత్తుల గురించి ఇప్పుడే మాట్లడటం సరికాదు. పార్టీ ప్రకటించలేదు కాబట్టే కమల్ నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి వెళ్లలేకపోయా. భవిష్యత్తులో మాత్రం సమావేశాలకు ఖచ్ఛితంగా హాజరవుతా. కావేరీ జలాల బోర్డు, కర్నాటక ఆధీనంలో కాకుండా.. సీనియర్ ఐఏఎస్ అధికారి ఆధ్వర్యంలో ఉంటేనే తమిళనాడుకు న్యాయం జరుగుతుంది’ అని రజనీ తెలిపారు. -
రాష్ట్ర కాంగ్రెస్లో ‘కర్ణాటక’ జోష్
సాక్షి, హైదరాబాద్: కర్ణాటక రాజకీయ పరిణామాలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహం నింపాయి. ముఖ్యమంత్రి పదవికి యడ్యూరప్ప రాజీనామా చేయడం, కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం కావడంపై టీపీసీసీ నేతల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం యడ్యూరప్ప రాజీనామా చేసిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సంబురాలు చేసుకున్నాయి. పార్టీ రాష్ట్ర కార్యాలయమైన గాంధీ భవన్లో మాజీ ఎంపీలు వీహెచ్, అంజన్కుమార్ యాదవ్ల నేతృత్వంలో కార్యకర్తలు బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. సీఎల్పీ కార్యాలయ సిబ్బందికి ఆ పార్టీ శాసనసభాపక్ష ఉప నేత పొంగులేటి సుధాకర్రెడ్డి స్వీట్లు తినిపించారు. ఇది రాహుల్ గాంధీ విజయమని, ఈసారి ఆయన ప్రధాని కావడం ఖాయమంటూ నినాదాలు చేశారు. ఆ ఎమ్మెల్యేలకు సెల్యూట్ చేస్తున్నా: ఉత్తమ్ కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామా చేయడం ద్వారా దేశంలో ప్రజాస్వామానికి గొప్ప విజయం లభించిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి అభిప్రాయపడ్డారు. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడిన కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలకు సెల్యూట్ చేస్తున్నట్లు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ద్వయానికి గుణపాఠం చెప్పడం శుభ పరిణామమని, కర్ణాటక పరిణామాలు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీకి మంచి చేస్తాయన్నారు. కర్ణాటక విధాన సభలో రాజ్యాంగం రక్షించబడిందని, ఈ క్రమంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు తోడ్పడిన అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ ముఖ్య నేతలు పొన్నాల లక్ష్మయ్య, సర్వే సత్యనారాయణ, మర్రి శశిధర్రెడ్డి, వీహెచ్, పొంగులేటి సుధాకర్రెడ్డి, మల్లు రవి, గీతారెడ్డి, సంపత్కుమార్ తదితరులు హర్షం వ్యక్తం చేసిన వారిలో ఉన్నారు. కష్టానికి ఫలం... కన్నడ రాజకీయానికి హైదరాబాద్ కేంద్ర బిందువుగా మారడం కూడా కాంగ్రెస్ నేతలకు సంతోషం కలిగిస్తోంది. ‘మా అధినాయకత్వం ఆదేశాల మేరకు శుక్రవారమంతా మేం చాలా కష్టపడ్డాం. బడా నేతలతోపాటు ఎమ్మెల్యేలందరికీ ఏ లోటూ రాకుండా ఆతిథ్యం ఇచ్చాం. విమానాశ్రయం నుంచి హోటళ్లకు, హోటళ్ల నుంచి బెంగళూరుకు తరలించే వరకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు అప్రమత్తంగా వ్యవహరించారు. ఇప్పుడు మేం అనుకున్నట్లుగా విజయం సాధించడం చాలా తృప్తిగా ఉంది. ఈ కష్టంలో మాకూ భాగముందనే భావన వస్తోంది. ఇది కచ్చితంగా రాష్ట్ర కాంగ్రెస్కూ శుభ పరిణామమే’అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. -
అందరూ అందరే!
త్రికాలమ్ కర్ణాటకలో సంభవిస్తున్న పరిణామాలు ప్రజాస్వామ్యప్రియులకు పెద్దగా సాంత్వన కలిగించవు. సంఖ్యాబలం లేకపోయినా జబర్దస్తీగా అధికారం హస్తగతం చేసుకోవడానికి బీజేపీ నాయకత్వం చేసిన ప్రయత్నాన్ని సుప్రీంకోర్టు వమ్ము చేయడం సంతోషించదగినదే. ముఖ్యమంత్రిగా 55 గంటల క్రితం యడ్యూరప్ప ప్రమాణం చేసినప్పటి నుంచీ రాజీనామా చేసేవరకూ ఉత్కంఠ కలిగించే అనేక ఘటనలు జరిగాయి. 222 మంది సభ్యులు ఉండే కొత్త శాసనసభలో 104మంది సభ్యులు మాత్రమే కలిగిన బీజేపీని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి గవర్నర్ వజూభాయ్ ఆహ్వానించడం అంటే ఎంఎల్ఏల ఫిరాయింపులకూ, బేరసారాలకూ అవకాశం ఇవ్వడమేనన్న విమర్శలు వెల్లువెత్తాయి. బెంగళూరు నుంచి కొచ్చికి శుక్రవారం సాయంత్రం ప్రయాణమైన కాంగ్రెస్, జేడీ (ఎస్) ఎంఎల్ఏలు తెల్లవారే సరికి హైదరాబాద్లో తేలారు. ఐదారు నక్షత్రాల హోటళ్ళలో బస చేశారు. వారితో సమాలోచనలు జరపడానికి బెంగళూరు నుంచి గులాంనబీ ఆజాద్, సిద్ధరామయ్య, కుమారస్వామి ప్రభృతులు వచ్చారు. సుప్రీం తీర్పుతో హుటాహుటిన బెంగళూరు తిరిగి వెళ్ళారు. శనివారం ఉదయం శాసనసభ్యుల ప్రమాణస్వీకారం జరుగుతూ ఉండగానే ఇద్దరు కాంగ్రెస్ సభ్యుల ఆచూకీ తెలియడం లేదనీ, ఎనిమిది మంది బీజేపీకి మాట ఇచ్చేశారనీ బ్రేకింగ్న్యూస్ రూపంలో టీవీ చానళ్ళు ఊదరగొట్టాయి. బెంగళూరులో, ఢిల్లీలో సర్వాత్రా ఉద్వేగభరితమైన దృశ్యాలు. జాతి యావత్తూ కర్ణాటక రాజధానిపైన దృష్టి నిలిపిన సందర్భం. భోజన విరామం తర్వాత ప్రమాణాలు తిరిగి ప్రారంభమైనప్పుడు ఉదయం అదృశ్యమైన ఇద్దరు కాంగ్రెస్ శాసనసభ్యులూ ప్రత్యక్షమైనారు. అంతలోనే యడ్యూరప్ప ఉద్వేగభరితమైన ప్రసంగం చేసి, పదవి నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించి సభ నుంచి విసవిసా వెళ్ళిపోయారు. తాత్కాలిక సభాపతి సైతం జాతీయగీతం ఆలపించే వరకూ వేచి ఉండకుండానే నిష్క్రమించారు. న్యాయవ్యవస్థ పట్ల ద్వంద్వ వైఖరి న్యాయస్థానాలు, ముఖ్యంగా సర్వోన్నత న్యాయస్థానం ఎన్డీఏ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయంటూ కొంతకాలంగా ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో శుక్రవారం జేడీ (ఎస్), కాంగ్రెస్ల పిటీషన్లపైన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం బీజేపీకి అశనిపాత సదృశమైన నిర్ణయాలు వెలువరించింది. బీజేపీ అడిగిన వరాలలో ఒక్కటీ మంజూరు చేయకుండా యడ్యూరప్ప ఆశలు అడియాసలు చేసింది. యడ్యూరప్పను ఆహ్వానిం చాలన్న గవర్నర్ నిర్ణయాన్ని తప్పుపట్టకపోయినా బలనిరూపణకు రెండువారాల వ్యవధి ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు ఆమోదించలేదు. ఒక్క వారమైనా గడువు ఇవ్వాలంటూ బీజేపీ చేసిన వేడుకోలునూ అంగీకరించలేదు. కేవలం 24 గంటల వ్యవధి ఇచ్చింది. సీక్రెట్ బ్యాలట్ నిర్వహించాలన్న కోర్కెకు సైతం ససేమిరా అన్నది. గతంలో యడ్యూరప్పకు అనుకూలించే విధంగా వ్యవహరించాడంటూ న్యాయస్థానం మొట్టికాయలు తిన్న బోపయ్య చేత తాత్కాలిక సభాపతిగా గవర్నర్ ప్రమాణం చేయించడాన్ని కాంగ్రెస్, జేడీ(ఎస్)లు శనివారం ఉదయం సుప్రీంకోర్టులో సవాలు చేశాయి. న్యాయమూర్తులు బోపయ్య నియామకాన్ని రద్దు చేయలేదు కానీ అసెంబ్లీ కార్యక్రమాలను ప్రత్యక్షప్రసారం చేయాలని ఆదేశించారు. బీజేపీకి వరుసగా ఎదురు దెబ్బలు తగిలాయి. తమ ఎంఎల్ఏలను ప్రభావితం చేయడానికి బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఆడియో టేపులను విడుదల చేసింది. ఇదంతా చూసిన ప్రజలకు రాజకీయాలంటే వెగటు పెరిగి ఉంటుంది. గోవాలో దిగ్విజయ్సింగ్ నిర్వాకంతో ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ ఈసారి ఆజాద్నీ, గెహ్లాట్నీ బెంగళూరు పంపించి బీజేపీ ఆటకట్టించింది. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు వారికి అండగా నిలిచారు. జేడీ (ఎస్), కాంగ్రెస్లకు చెందిన శాసనసభ్యులు బీజేపీకి ఓటు వేసే అవకాశం లేదని గ్రహించిన యడ్యూరప్ప రాజీనామా చేయాలనుకోవడం సముచి తమే. ఈ నిర్ణయం యడ్యూరప్పదైనా, ప్రధాని నరేంద్రమోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షాలది అయినా అభినందనీయమే. ప్రజాస్వామ్యాన్ని మరింత అపహాస్యం చేయకుండా సరైన నిర్ణయం తీసుకున్నారనే చెప్పాలి. ప్రజాస్వామ్యాన్ని రక్షించినందుకు సుప్రీంకోర్టుకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ, ఇతర నాయకులు ధన్యవాదాలు చెప్పారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని అభిశంసించాలంటూ రాజ్యసభలో నోటీసు ఇచ్చి, అందుకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అనుమతించకపోవడంతో సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసి, చివరికి పరిస్థితులు అనుకూలించక దాన్ని ఉపసంహరించుకున్న కాంగ్రెస్ ఇప్పుడు అదే న్యాయస్థానం ప్రజాస్వామ్యాన్ని కాపాడిందంటూ స్తుతించడం విడ్డూరం. కర్ణాటక వ్యవహారంలో నిక్కచ్చిగా వ్యవహరించడం వల్ల సర్వోన్నత న్యాయస్థానం పట్ల ప్రజలకు గౌరవం పెరిగింది. అందులో సందేహం లేదు. కానీ తమకు అనుకూలంగా తీర్పు వచ్చినప్పుడు మెచ్చుకోవడం, ప్రతికూలంగా వచ్చినప్పుడు పక్షపాతం ఆపాదించడం రాజకీయ నాయకులకు తగదు. అలాగే రాజ్యాంగాన్ని అదే పనిగా ఉల్లంఘించిన నాయకులు కర్ణాటక పరిణామాలపై వ్యాఖ్యానించడం, పార్టీ ఫిరాయింపులను నిరోధించినందుకు సుప్రీంకోర్టును అభినందించడం మరో వింత. 23 మంది ప్రతిపక్ష ఎంఎల్ఏలను కొనుగోలు చేసి, వారిలో నలుగురికి మంత్రిపదవులు కట్టబెట్టిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వంటి రాజ కీయ నాయకుడికి రాజ్యాంగబద్ధతపైనా, రాజకీయ విలువలపైనా మాట్లాడే నైతిక హక్కు ఉంటుందా? 1996లో 13 రోజులు అధికారంలో ఉండి బలం నిరూపించుకోలేక రాజీనామా చేసిన వాజపేయితో యడ్యూరప్పను ఒకందుకు పోల్చవలసి వస్తున్నది. ఇద్దరి వ్యక్తిత్వాలూ, నైతిక స్థాయీ, దృక్ప«థాలూ వేరైనప్పటికీ లోక్సభలో నాటి పరిస్థితులకీ, కర్ణాటక శాసనసభలో నేటి వాతావరణానికీ ఎంతో కొంత సామ్యం ఉంది. నాడు వాజపేయి లోక్సభలో బలం నిరూపించుకోలేక వైదొలిగిన తర్వాత ప్రధానమంత్రిగా దేవెగౌడ అందలం ఎక్కారు. ఇప్పుడు యడ్యూరప్ప రాజీనామా అనంతరం ముఖ్యమంత్రిగా దేవెగౌడ కుమారుడు కుమారస్వామి బాధ్యతలు స్వీకరించబోతున్నారు. అప్పుడు దేవెగౌడ 46 మంది ఎంపీల బలంతో ప్రధాని కాగలిగితే ఇప్పుడు కుమారస్వామికి తనతో సహా 37 మంది జేడీ (ఎస్) ఎంఎల్ఏలు ఉన్నారు. ఇద్దరూ కాంగ్రెస్ మద్దతు స్వీకరించినవారే. దేవెగౌడ సంవత్సరం తిరగకుండానే కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకున్న కారణంగా పదవీచ్యుతులైనారు. కుమారస్వామికి కాంగ్రెస్ మద్దతు ఎంతకాలం కొనసాగుతుందన్నది ప్రశ్న. అనిశ్చితికీ, అస్థిరతకూ దారితీసే అంశాలు అనేకం కర్ణాటక రాజకీయాలలోనే నిక్షిప్తమై ఉన్నాయి. రాహుల్ తప్పిదం సమాజాన్నీ, పార్టీలనూ విభజించే ప్రమాదభూయిష్టమైన రాజకీయాన్ని అన్ని పార్టీలూ బాధ్యతారహితంగా ప్రోత్సహించాయి. కావేరీ నీటి కంటే విరివిగా ఎన్నికలలో డబ్బు ఖర్చు చేశాయి. చుట్టుపక్కల రాష్ట్రాలలో ఏటీఎంలలో డబ్బులు లేకుండా, రెండువేల రూపాయల నోట్లు మచ్చుకైనా కనిపించకుండా చేశాయి. రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు యధేచ్ఛగా చేసుకున్నారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా వ్యక్తిగత దూషణలతో, నిందారోపణలతో ప్రచారపర్వాన్ని వేడెక్కించారు. ఎన్నికలలో గెలుపొందేందుకు ఎన్ని కోట్లు అయినా ఖర్చు చేస్తారనీ, గెలిచినవారిని వెంటనే కొనుగోలు చేయడానికి ఏ మాత్రం వెనుకాడరనీ, అందుకు గవర్నర్ ఎంత వ్యవధి ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంటారనీ ప్రజలకు అర్థమైపోయింది. ఇటువంటి పరిస్థితులలో ఎన్నికల పట్లా, ప్రజాస్వామ్యం పట్లా సాధారణ ప్రజలకు విశ్వాసం ఏముం టుంది? కర్ణాటకంలో ఒక అంకానికి తెర పడింది. రెండో అంకానికి తెర లేవబోతున్నది. జేడీ(ఎస్) అధ్యక్షుడు కుమారస్వామి ముఖ్యమంత్రిగా సోమవారం కంఠీరవ స్టేడియంలో పదవీబాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఉపముఖ్యమంత్రిగా కాంగ్రెస్కు చెందిన దళిత నాయకుడు జి. పరమేశ్వర ఉంటారని అంటున్నారు. ఎన్నికల ప్రచారంలో సిద్ధరామయ్యను సంపూర్ణంగా బలపరిచే ప్రయత్నంలో రాహుల్గాంధీ ఒకానొక రాజకీయ తప్పిదం చేశారు. 2006లో జేడీ(ఎస్) నుంచి వైదొలిగి కాంగ్రెస్లో చేరినప్పటి నుంచీ సిద్ధరామయ్యకూ, దేవెగౌడ కుటుంబానికీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నది. ఎన్నికల ప్రచారంలో సిద్ధరామయ్య దాన్ని ప్రదర్శించడమే కాకుండా రాహుల్తో కూడా దేవెగౌడ కుటుంబానికి వ్యతిరేకంగా ప్రచారం చేయించారు. జేడీ (ఎస్)లో ‘ఎస్’అంటే సంఘ్ పరివారమనీ, జేడీ (ఎస్) బీజేపీకి ‘బీ–టీమ్’అనీ రాహుల్ నిందాస్త్రాలు సంధించారు. తన బొందిలో ప్రాణం ఉండగా బీజేపీతో పొత్తు పెట్టుకోనంటూ దేవెగౌడ పలుమార్లు ప్రకటించినా రాహుల్ వినిపించుకోలేదు. బీఎస్పీతో పొత్తు పెట్టుకొని ఆ పార్టీ అధినేత మాయావతితో ప్రచారం చేయించినా జేడీ (ఎస్) నాయకత్వాన్ని విశ్వసించలేదు. లోగడ దేవెగౌడ బీజేపీ పట్ల ఇదే విధమైన ప్రతికూలత వెలిబుచ్చారనీ, బీజేపీతో పొత్తు పెట్టుకుంటే కుమారస్వామితో సంబంధాలు తెగతెంపులు చేసుకుంటానని ప్రకటించారనీ, తీరా కుమారస్వామి అదే బీజేపీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఆనందించారనీ విమర్శకులు గుర్తు చేస్తారు. రాహుల్ కాంగ్రెస్ అధినేతగా బీజేపీకి వ్యతిరేకంగా కూటమిని నిర్మించాలని ప్రయత్నిస్తున్నారు. బీజేపీని వ్యతిరేకిస్తున్న పార్టీలన్నీ ఒకే వేదికపైకి రావాలనీ, ప్రతి లోక్సభ స్థానంలోనూ బీజేపీ అభ్యర్థికి వ్యతిరేకంగా అత్యంత యోగ్యుడైన అభ్యర్థిని ప్రతిపక్షాలు అన్నీ కలిసి నిలబెట్టాలనీ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ప్రతిపాదిస్తున్నారు. ప్రతిపక్షాల మధ్య ఐక్యత పెంపొం దించవలసిన రాహుల్ దేవెగౌడ కుటుంబంపైన మితిమీరి దాడి చేయడం అవివేకం. ఆ స్థాయిలో విరుచుకుపడకుండా ఉంటే నేటి మైత్రి అంత కృతకంగా కనిపించేది కాదు. మొత్తం మీద జేడీ (ఎస్), కాంగ్రెస్లు దక్షిణ కర్ణాటకలో హోరాహోరీ పోరాడాయి. అక్కడ బీజేపీ ఉనికి తక్కువ. ఆ విధంగా ద్వేషం పంచుకున్న రెండు పక్షాలు కేవలం బీజేపీని నిలువరించడంకోసం ఒకే తాటిమీదికి రావడం అవకాశవాదం అనాలో, సమయజ్ఞత అనాలో తేల్చుకోవడం కష్టం. రేపటి నుంచి ఈ సంకీర్ణం అంతర్గత విభేదాలను ఎట్లా పరిష్కరించుకుంటుందో, ప్రతిపక్ష బీజేపీని ఎట్లా ఎదుర్కొంటుందో మరి. కుమారస్వామి సారథ్యం విభజన రేఖలు స్పష్టంగా ఉన్నప్పటికీ సమైక్యంగా ఉంటామనీ, సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేస్తామనీ నమ్మబలికే నాయకులను నమ్మడం ఎట్లా అన్నది కర్ణాటక ప్రజలను వేధిస్తున్న ప్రశ్న. ఒక వైపు ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగానే మరోవైపు సోనియా, రాహుల్ అత్యవసర సమాలోచన జరిపి జేడీ (ఎస్)కు షరతులు లేని మద్దతు ప్రకటించాలని నిర్ణయించారు. ఇదే ప్రాప్తకాలజ్ఞత. ఢిల్లీలో నిర్ణయించినంత మాత్రాన స్థానికంగా నిన్నటి వరకూ ఒకరిపైన ఒకరు పోరాడుకున్నవారు సఖ్యతతో ఉండగలరా? తమ శాసనసభ్యులు నైతిక విలువలను కాపాడారనీ, బీజేపీ ప్రలోభాలకు లొంగలేదనీ కాంగ్రెస్ అధినాయకత్వం కితాబు ఇచ్చింది. తెలంగాణలో ఫిరాయించిన కాంగ్రెస్ శాసనసభ్యులూ, శాసనమండలి సభ్యులూ, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ను వీడి టీడీపీ పంచన చేరిన శాసనమండలి సభ్యులూ నిక్షేపంగా ఉన్నారు. వారిపై అనర్హత వేటు వేయమని రాజ్యాంగ వ్యవస్థలపైన ఒత్తిడి తేవడంలో దారుణంగా విఫలమైన కాంగ్రెస్ ఇలా గొప్పలు చెప్పుకోవడం ఆత్మవంచన. యడ్యూరప్ప అధికారంలో కొనసాగి ఉంటే 2019 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్, జేడీ (ఎస్)కు కర్ణాటకలో విజయావకాశాలు అధికంగా ఉండేవి. ఇప్పుడు అధికారం పంచుకుంటున్నాయి కనుక సంకీర్ణ భాగస్వాముల మధ్య విభేదాలు తలెత్తడం సహజం. ఆ మేరకు ప్రతిపక్షంలో ఉండే బీజేపీకి సానుకూల వాతావరణం ఉంటుంది. సార్వత్రిక ఎన్నికలకు గడువు ఏడాది మాత్రమే ఉన్నది కనుక కర్ణాటకలో ఎన్నికల వాతావరణం కొనసాగుతుంది. అప్పటి వరకైనా సంకీర్ణ ప్రభుత్వాన్ని రక్షించుకోవాలన్న తాపత్రయం రెండు పార్టీలకూ ఉంటుంది. అదొక్కటే ఊరట. కె. రామచంద్రమూర్తి -
కర్ణాటకలో ప్రజాస్వామ్యం కూనీ అవుతుందా!
-
కోర్టుకెక్కిన చట్టసభలు
కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం బలనిరూపణకు సుప్రీం కోర్టు కేవలం ఒక్క రోజే గడువు ఇవ్వడంతో ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప భవితవ్యం ఏమిటా అన్న చర్చ జరుగుతోంది. కర్ణాటక సీఎంగా యడ్యూరప్ప ఇప్పటివరకు పూర్తి కాలం పనిచేయలేదు. మొదటి సారి సీఎంగా ప్రమాణం చేసినప్పుడు జేడీ(ఎస్) మద్దతు ఉపసంహరించడంతో కేవలం ఏడురోజుల్లోనే గద్దె దిగాల్సి వచ్చింది. ఇక రెండోసారి అవినీతి ఆరోపణలు చుట్టుముట్టడంతో మూడేళ్లలోనే పదవీచ్యుతుడయ్యారు. సంకీర్ణ రాజకీయాల యుగంలో కోర్టుల కనుసన్నుల్లో ప్రభుత్వాల ఏర్పాటు చాలా సార్లు జరిగింది. వాటిల్లో యూపీలో జగదంబికా పాల్ ఒక్క రోజు సీఎం ఉదంతం చాలా ఆసక్తికరం. యూపీలో ఏం జరిగిందంటే ఇప్పుడు కర్ణాటకలో మాదిరిగానే 1998 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్లో రాజకీయాలు నరాలు తెగే ఉత్కంఠతో సాగాయి. బీఎస్పీ. ఎస్పీ ఫిరాయింపుదారులు, ఇతర చిన్నా చితక పార్టీల మద్దతుతో బీజేపీ అధికారంలో ఉండేది. ముఖ్యమంత్రిగా కల్యాణ్ సింగ్ ఉండేవారు. అదే సమయంలో కేంద్రంలో ఐకే గుజ్రాల్ ప్రధానమంత్రిగా యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం అధికారంలో ఉంది. కల్యాణ్ సింగ్ సంకీర్ణ సర్కార్కు మాయావతి మద్దతు ఉపసంహరించడంతో ప్రభుత్వం మైనార్టీలో పడిపోయి బలనిరూపణకు సిద్ధమవాల్సి వచ్చింది. బలపరీక్ష రోజు అసెంబ్లీలో యుద్ధవాతావరణం నెలకొని హింస చెలరేగింది. కప్పల తక్కెడ రాజకీయాలతో ఎవరు ఏ పార్టీకి మద్దతునిస్తున్నారో తెలీని పరిస్థితి నెలకొంది. దీంతో అప్పటి యూపీ గవర్నర్ రమేష్ భండారీ రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేసినా కేంద్రం తిరస్కరించింది. అదే సమయంలో కాంగ్రెస్ నుంచి విడిపోయిన జగదంబికా పాల్, నరేష్ అగర్వాల్లు లోక్తాంత్రిక్ కాంగ్రెస్ పేరుతో వేరు కుంపటి పెట్టి , అప్పటివరకు కళ్యాణ్ సింగ్కు మద్దతిచ్చినట్టే ఇచ్చి ప్లేట్ ఫిరాయించారు. ఎస్పీ, బీఎస్పీ మద్దతు తమకే ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలంటూ గవర్నర్ని కలిసారు. గవర్నర్ రమేష్ భండారీ కళ్యాణ్ సింగ్ సర్కార్ని 1998 ఫిబ్రవరి 21 అర్ధరాత్రి రద్దు చేయడం,జగదంబికా పాల్ సీఎంగా ప్రమాణస్వీకారం వెంట వెంటనే జరిగిపోయాయి. తెల్లారేసరికల్లా గవర్నర్ నిర్ణయంపై నిరసన స్వరాలు భగ్గుమన్నాయి. 425 సభ్యులున్న అసెంబ్లీలో కేవలం 21 సభ్యులతో కాంగ్రెస్ నుంచి చీలిపోయిన ఒక నేతకు అవకాశం ఇవ్వడమేమిటంటూ అటల్ బిహారి వాజపేయి ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. బీజేపీ కోర్టును ఆశ్రయించడంతో యూపీ హైకోర్టు అదే రోజు జగదంబికా పాల్ను సీఎంగా తొలగిస్తూ, కల్యాణ్సింగ్ సర్కార్ని పునరుద్ధరించింది. అంతేకాదు ఆయనని మాజీ ముఖ్యమంత్రి అని కూడా అనకూడదని తీర్పు చెప్పింది. అలా జగదంబికా పాల్ ఒక్క రోజు సీఎంగా రికార్డు సృష్టించారు. కోర్టులు కలుగజేసుకున్న ఇతర సందర్భాలు జార్ఖండ్ (2005) అసెంబ్లీలో విశ్వాస పరీక్షకు గవర్నర్ ఇచ్చిన గడువు తగ్గించడం మొదటిసారి 2005లో జార్ఖండ్లో జరిగింది. ముఖ్యమంత్రిగా జేఎంఎం అధినేత శిబుసోరెన్కు గవర్నర్ సయ్యద్ సిబ్టే రజీ అవకాశం ఇవ్వడాన్ని బీజేపీ నేత అర్జున్ ముండా వ్యతిరేకించారు. అసెంబ్లీలో తమకే బలం ఉందని, తమకే అవకాశం ఇవ్వాలంటూ సుప్రీం కోర్టుకెక్కారు. గవర్నర్ ఇచ్చిన గడువు కంటే నాలుగు రోజుల ముందుగానే బలం నిరూపించుకోవాలంటూ సుప్రీం అప్పట్లో ఆదేశించింది. ఉత్తరాఖండ్ (2016) ఉత్తరాఖండ్లో హరీశ్ రావత్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా అసంతృప్తులు తారాస్థాయికి చేరుకున్నాయి. అసెంబ్లీలో అత్యంత కీలకమైన ఆర్థిక బిల్లుకు తొమ్మిదిమంది ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా ఓటు వేయడమే కాదు, బీజేపీతో చేతులు కలిపి కాంగ్రెస్ సర్కార్కు మైనార్టీలో పడిపోయిందన్నారు. దీంతో హరీశ్ రావత్ బలపరీక్షకు సిద్ధమయ్యారు. సరిగ్గా బలపరీక్షకు ఒక్కరోజు ముందు కేంద్రంలో మోదీ ప్రభుత్వం రాష్ట్రపతి పాలనను విధించింది. దీనిపై కాంగ్రెస్ హైకోర్టుకెక్కడంతో రాష్ట్రపతి పాలనను రద్దు చేసి హరీశ్ రావత్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పునరుద్ధరిస్తూ తీర్పు చెప్పింది గోవా (2017) గత ఏడాది గోవాలో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్ను కాదని, బీజేపీకి చెందిన మనోహర్ పరికర్కు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వడంపై వివాదం చెలరేగింది. దీనిపై కాంగ్రెస్ కోర్టును ఆశ్రయిస్తే, వెంటనే ప్రభుత్వం అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలంటూ కోర్టు ఆదేశించింది. ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరిని పిలవాలో గవర్నర్కు విచక్షణాధికారాలు ఉన్నాయని, వాటిలో తాము జోక్యం చేసుకోలేమంటూ స్పష్టం చేసింది తమిళనాడు (2017) తమిళనాడులో జయలలిత మృతి అనంతరం ఏర్పడిన రాజకీయ గందరగోళ పరిస్థితుల్లోనూ కోర్టుల తీర్పే కీలకంగా మారింది. ఏఐఏడీఎంకేలో దినకరన్ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేయడం వివాదాస్పదమైంది. దీంతో బలపరీక్షకు ప్రభుత్వం సిద్ధపడుతూనే, ఆ పద్దెనిమిది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించాలంటూ ఎన్నికల కమిషన్కు లేఖ రాయడంతో ఆ ఎమ్మెల్యేలు కోర్టును ఆశ్రయించారు. అయితే మద్రాసు హైకోర్టు తదుపరి తీర్పు ఇచ్చేవరకు ఎన్నికల్ని నిర్వహించరాదని ఆదేశాలు జారీ చేస్తూనే వెంటనే పళనిస్వామి ప్రభుత్వం విశ్వాసపరీక్ష ఎదుర్కోవాలని తీర్పు ఇచ్చింది. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
శనివారం నెగ్గేదెవరు?
-
బీజేపీకి ఝలక్ : బేరసారాల క్లిప్ లీక్
సాక్షి, బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీలో బలనిరూపణకు గడువు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు వ్యూహప్రతివ్యూహాలకు పదును పెడుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం ఉందని బీజేపీ చెబుతుండగా, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నంలో ఎత్తులకు పైఎత్తులతో ముందుకు వెళుతున్నాయి. తమ ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టడానికి బీజేపీ బేరసారాలు మొదలుపెట్టిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు సంధించింది. అందుకు సంబంధించి శుక్రవారం సాయంత్రం ఒక ఆడియో క్లిప్ ను ఆ పార్టీ విడుదల చేసింది. సీఎం యెడ్యూరప్ప తరపున గాలి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఉగ్రప్ప మీడియా సమావేశంలో దీనికి సంబంధించి ఒక ఆడియోను విడుదల చేశారు. అయితే, వెంటనే రంగంలోకి దిగిన బీజేపీ అది ఫేక్ ఆడియో క్లిప్ అంటూ ఖండించింది. ‘‘యెడ్యూరప్పకు మద్ధతు ఇస్తే నీ లైఫ్సెటిల్ చేస్తా. రూ. 150 కోట్లతోపాటు మంత్రి పదవి దక్కేలా చూస్తా. పాత విషయాలు మరిచిపోండి. మీకు ఏం కావాలో జాతీయ అధ్యక్షుడు అమిత్షానే నేరుగా మీతో మాట్లాడుతారు. శివన్నగౌడ గతంలో నా మాట వినే మంత్రి అయ్యారు. రాజీవ్ గౌడ నా వల్లే అభివృద్ధి చెందారు. ఇవాళ శివన్న గెలిచినా లాభం లేదు. నేరుగా పెద్ద వాళ్లతో మాట్లాడిస్తా. నువ్వు మంత్రివి అవుతావ్... నువ్వు ఇప్పటిదాకా సంపాదించిన ఆస్తికన్నా వందరెట్లు ఎక్కువ సంపాదిస్తావ్ అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే బసన్న గౌడ (రాయచూర్)తో మంతనాలు జరిపినట్టుగా ఆ ఆడియో క్లిప్ లో వినిపిస్తోన్న విషయం ఉగ్రప్ప మీడియాకు వెల్లడించారు. ప్రలోభాలకు గురిచేసినప్పటికీ ‘మీపై గౌరవం ఉంది. కానీ, కాంగ్రెస్కు నమ్మక ద్రోహం చేయలేను’ అని బసన్న బదులిచ్చారని చెబుతూ, ఇదే తరహాలో మరికొందరిని కూడా ప్రలోభపెట్టాలని చూశారని ఉగ్రప్ప బీజేపీపై మండిపడ్డారు. మొదట్లో 25 కోట్ల రూపాయలు ఆఫర్ చేసిన బీజేపీ ఇప్పుడు ఏకంగా 150 కోట్ల రూపాయలు ఇస్తామంటూ బేరసారాలకు దిగుతోందని ఉగ్రప్ప ఆరోపించారు. ఈఆరోపణలకు సంబంధించి కర్ణాటక కాంగ్రెస్ పార్టీ కూడా ఓ ట్వీట్ చేసింది. బీజేపీ స్పందన.. కాగా, ఈ ఆడియో క్లిప్పై బీజేపీ నేత ప్రకాశ్ జవదేకర్ స్పందించారు. అది ఫేక్ క్లిప్ అని, కాంగ్రెస్ నీచపు రాజకీయాలకు తెరలేపిందని ఆయన మీడియాకు తెలియజేశారు. Congress released an Audio clip where BJP leader Janaradhana Reddy is trying to lure Congress MLA from Raichur Rural by offering money and posts. Janaradhana Reddy clearly says he has the backing of BJP President Amit Shah for doing horse trading! pic.twitter.com/oVEC88DgV2 — Karnataka Congress (@INCKarnataka) 18 May 2018 -
ఎమ్మెల్యేల తరలింపు, ప్లాన్ వన్..టూ.. త్రీ..!
సాక్షి, హైదరాబాద్ : కర్ణాటక అధికార పీఠం ఎవరికి దక్కబోతుందో మరికొన్ని గంటల్లో తేలబోతుంది. అధికారం దక్కించుకోవడానికి రేపు బెంగళూరులోని విధాన సౌధలో జరగబోయే బలపరీక్షలో నెగ్గేందుకు కాంగ్రెస్-జేడీఎస్, బీజేపీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఎమ్మెల్యేలు చేజారిపోకుండా కాంగ్రెస్-జేడీఎస్లు ఇప్పటికే తమ ఎమ్మెల్యేలను హైదరాబాద్లోని తాజ్కృష్ణ, నోవాటెల్కు తరలించి, భేటీల మీద భేటీలు నిర్వహిస్తోంది. రేపు విధాన సౌధలో జరగబోయే బలపరీక్షలో ఏ విధంగా వ్యవహరించాలో ఎమ్మెల్యేలకు సూచిస్తోంది. నేడు ఉదయం ఇక్కడికి వచ్చిన వీరిని, రేపు ఉదయం కల్లా మళ్లీ బెంగళూరుకు తరలించాల్సి ఉంది. అయితే వీరిని ఏ విధంగా బెంగళూరు తీసుకెళ్లాలి.. మధ్యలో బీజేపీ ఎలాంటి పన్నాగాలకు పాల్పడకుండా ఉండేందుకు ఎలాంటి వ్యూహాలు రచించాలో అనే అంశాలపై కాంగ్రెస్-జేడీఎస్ ఇప్పటికే నిర్ణయించాయి. ఎమ్మేల్యేల తరలింపు మూడు రకాల ప్లాన్లను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. అవేమిటంటే... ప్లాన్ వన్ : ఇప్పటికే ఎమ్మెల్యేల తరలింపుకు రెండు ప్రత్యేక విమానాలు సిద్ధమైనట్టు తెలిసింది. వీరు ఏ సమయానికి హైదరాబాద్ నుంచి బెంగళూరు బయలుదేరుతారో సరియైన టైం తెలియనప్పటికీ, ఏ క్షణమైనా ఇక్కడి నుంచి బయలుదేరటానికి ఎమ్మెల్యేలందరూ సిద్ధంగా ఉండాలంటూ కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు అందింది. ప్రత్యేక విమానాలు కాబట్టి విమానశ్రయానికి చేరుకుని.. అక్కడి నుంచి గంటన్నరలో బెంగళూరుకు చేరుకోవచ్చు. అయితే నిన్న రాత్రి బెంగళూరులో డీజీసీఏ.. ప్రత్యేక విమాన అనుమతిని నిరాకరించింది. దీనిలో దృష్టిలో పెట్టుకుని ఈ ప్లాన్లో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే మరో ప్లాన్ను అమలు చేయాలని భావిస్తోంది. ప్లాన్ టూ : ప్రత్యేక విమానాల్లో ఎమ్మెల్యేల తరలింపుకు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే, బస్సుల ద్వారానైనా బెంగళూరుకు తరలించాలని నాలుగు ఏసీ స్లీపర్ బస్సులు రెడీ చేసింది కాంగ్రెస్. హైదరాబాద్ టూ బెంగళూరు 550 కిలోమీటర్లు. హై ఎండ్ బస్సులు కావడంతో, బెంగళూరుకు 8 గంటల్లో చేరుకోవచ్చు. తెలంగాణ బోర్డర్ వరకు ఇక్కడి కాంగ్రెస్ నేతల సహకారం తీసుకోవాల్సి ఉంటుంది. నేతలు, కార్యకర్తలతో పెద్ద సంఖ్యలో సెక్యూరిటీ ఇస్తూ తెలంగాణ బోర్డర్ దాటించిన తర్వాత, ఏపీలోకి ప్రవేశమవుతారు. ఏపీలో ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండవని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. బెంగళూరుకి అత్యంత సురక్షితంగా వెళ్లిపోవచ్చని అనుకుంటున్నారు. అయితే నేడు హైదరాబాద్కు చేరుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, రోడ్డు మార్గం ద్వారానే వచ్చారు. దీంతో మళ్లీ రోడ్డు మార్గమే బెస్ట్ అని ఎక్కువ మంది ఎమ్మెల్యేలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్లాన్ త్రీ : ప్రత్యేక విమానాల్లో తరలింపు సాధ్యం కాక.. బస్సుల్లోనూ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తే మూడో ప్లాన్ను కూడా సిద్ధం చేసింది కాంగ్రెస్ అధిష్టానం. అదే కార్ల ద్వారా ఎమ్మెల్యేల తరలింపు. ఒక్కో కారులో నలుగురు ఎమ్మెల్యేల చొప్పున మొత్తం ఎమ్మెల్యేలను ఇక్కడి నుంచి బెంగళూరుకు తరలించడానికి సరిపడ కార్లను సిద్ధం చేసింది. కర్ణాటక నుంచి వచ్చిన కార్లతోపాటు తెలంగాణ కాంగ్రెస్ నేతలు తమ కార్లను ఎమ్మెల్యేల కోసం రెడీ చేశారు. ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కూడా బెంగళూరు వెళ్లేందుకు రెడీగా అయ్యారు. ఇది మూడో ప్లాన్. ఈ మూడు రకాల ప్లాన్లతో కాంగ్రెస్-జేడీఎస్లు తమ పార్టీ ఎమ్మెల్యేలను రేపటికి బెంగళూరు తరలించబోతున్నాయి. విధాన సౌధలో బలపరీక్ష ఎదుర్కోబోతున్నాయి. -
ఎమ్మెల్యేల తరలింపు.. పె...ద్ద హైడ్రామా
సాక్షి, బెంగళూరు/హైదరాబాద్: నాటకీయ పరిణామాల మధ్య కర్ణాటక కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలంతా హైదరాబాద్కు చేరుకున్నారు. అయితే వారిని తొలుత పంజాబ్గానీ, కేరళగానీ తరలించాలని భావించగా.. ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఒకానోక దశలో శరవేగంగా పరిణామాలు మారే అవకాశం ఉండటంతో ఆలస్యం చేయకుండా వారిని హైదరాబాద్ తరలించినట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. గురువారం అర్ధరాత్రి చోటు చేసుకున్న పరిణామాలు ఎలా ఉన్నాయో చూద్దాం... యెడ్డీ ఆదేశాల తర్వాత... ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన గంట తర్వాత యెడ్యూరప్ప.. పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు బస చేసిన ఈగల్టన్ గోల్ఫ్ రిసార్ట్, షాంగ్రీ-లా హోటల్ వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టులను ఎత్తేయాలని, భద్రత ఉపసంహరించుకోవాలని ఆయన ఆదేశించారు. గంటల వ్యవధిలోని పోలీస్శాఖ ఆ ఆదేశాలను అమలు చేసింది. దీంతో తమ ఎమ్మెల్యేలు చేజారకుండా ఉండేందుకు వారిని వెంటనే రాష్ట్రం తరలించాలని ఆయా పార్టీలు ప్రణాళిక రచించాయి. కాంగ్రెస్ తరపున డీకే శివకుమార్, జేడీఎస్ తరపున ఆ పార్టీ అధ్యక్షుడు కుమారస్వామి ఎమ్మెల్యేలు వారిని ఎక్కడ దాచాలన్న దానిపై మంతనాలు జరిపారు. ఆటంకాలు... తొలుత వారిని ఛార్టెడ్ ఫ్లైట్ల ద్వారా కొచ్చి(కేరళ)కు గానీ తరలించాలని అనుకున్నారు. అయితే డీజీసీఏ(Directorate General of Civil Aviation) నుంచి విమానానికి అనుమతి లభించకపోవటం, దానికి తోడు కొచ్చిలో హోటళ్లు ఖాళీగా లేవని సమాచారం రావటంతో (ఇదంతా బీజేపీ కుట్ర అన్నది వారి ఆరోపణ) తప్పనిసరై మరోచోటకు తరలించాలని ఇరు పార్టీలు నిర్ణయించాయి. అంతకు ముందు జేడీఎస్ సుప్రీం దేవగౌడ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఫోన్లో మాట్లాడి.. వారి నుంచి హామీ పొందిన విషయం తెలిసిందే. దీనికితోడు పొరుగునే ఉన్న తమిళనాడు అన్నాడీకేం ప్రభుత్వం బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోంది. అందుకే వారి కోసం హైదరాబాద్ బెస్ట్ ప్లేస్ అని భావించి ఆ ప్రయత్నాలు ప్రారంభించారు. ఎమ్మెల్యేల తరలింపు సాగిందిలా... తమ తరలింపు విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పిన ఎమ్మెల్యేలు.. దుస్తులను నేరుగా హోటళ్ల వద్దకే తెప్పించుకున్నారు. రాత్రి 11.30 ని. సమయంలో డీజీసీఏ.. ప్రత్యేక విమానానికి అనుమతి నిరాకరించింది. దీంతో ఫ్లాన్ మార్చి వారిని రాష్ట్రం దాటించాలని నిర్ణయించారు. చివరకు ఎమ్మెల్యేలకు కూడా వాళ్లను ఎక్కడికి తరలిస్తున్నారన్న విషయం తెలీకుండా జాగ్రత్త పడ్డారు. అర్ధరాత్రి 12గం.15 ని. సమయంలో శర్మ ట్రావెల్స్కు చెందిన రెండు బస్సులు ఈగల్టన్ రిసార్ట్ నుంచి ఎమ్మెల్యేలతో బయలుదేరాయి. అనంతరం షాంగ్రీ-లా హోటల్ వద్దకు చేరుకుని అక్కడ జేడీఎస్ ఎమ్మెల్యేలను ఎక్కించుకుని బయలుదేరాయి. బస్సులు నిండిపోవటంతో మరో బస్సు(స్లీపర్) వాటికి కలిసింది. ఎమ్మెల్యేలకు భోజనం, దుప్పట్లు ఇలా పరిస్థితులు సర్దుకున్నాక ఆ మూడు బస్సులు వేగంగా ఆంధ్రా సరిహద్దు వైపు కదిలాయి. ముందస్తు జాగ్రత్తగా... అయినప్పటికీ బీజేపీ నుంచి అవాంతరాలు ఎదురయ్యే అవకాశం ఉందని భావించి సరిహద్దు వరకు పలు ప్రాంతాల్లో(గౌరీబిదనూరు, చికబళ్లాపూర్ జిల్లాలో) ముందస్తుగా కొన్ని వాహనాలను ఉంచారు. ఒకవేళ వారిని అడ్డుకునే యత్నాలు జరిగితే స్థానిక నేతల సాయంతో ఆయా వాహనాల్లో వారిని రహస్య ప్రదేశాలకు తరలించాలని భావించారు. శర్మ ట్రావెల్స్ డ్రైవర్ల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంది. ఆంధ్రా బార్డర్ వరకు ఎమ్మెల్యేలు జమీర్ అహ్మద్ ఖాన్, శివరామ హెబ్బర్లు స్వయంగా బస్సులు నడిపినట్లు తెలుస్తోంది. కర్నూల్ మీదుగా ప్రయాణించిన వాహనాలు ఉదయం 5 గంటల సమయంలో హైదరాబాద్కు 80 కిలోమీటర్లు దూరంలో ఆగారు. అక్కడ ఎమ్మెల్యేలు కాఫీ బ్రేక్ తీసుకున్నాక తిరిగి బయలుదేరారు. చివరకు గంటర్నర ప్రయాణం తర్వాత నగరానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. మధు యాష్కీ మాటల్లో.. ‘మా పార్టీ ఎమ్మెల్యేల తరలింపు చాలా ప్రణాళిక బద్ధంగా జరిగింది. వారికి హైదరాబాద్లో ఉంచటమే సురక్షితమని భావించి ఇక్కడికి రప్పించాం. అధికారం కోసం బీజేపీ దారుణంగా దిగజారింది. అందుకు ప్రధాని మోదీ మద్ధతు పలకటం దారుణం. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ను బీజేపీ కిడ్నాప్ చేసింది. ఆయన కుటుంబ సభ్యులను బెదిరింపులకు గురి చేస్తోంది. బీజేపీ నేతలు క్రిమినల్స్లాగా వ్యవహరిస్తున్నారు’ కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కీ మండిపడ్డారు. -
నా దగ్గర 116 మంది ఎమ్మెల్యేలున్నారు...
సాక్షి, న్యూఢిల్లీ: కర్ణాటక రాజకీయాలకు సంబంధించిన ప్రతీ అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రేపు సాయంత్రం ఏం జరగబోతుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. అదే సమయంలో సోషల్ మీడియాలో కన్నడ రాజకీయాలకు జోకులు కూడా పేలుతున్నాయి. వాట్సాప్ మెసేజ్లు, మెమెలతో కొందరు సెటైర్లు పేలుస్తున్నారు. శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా జడ్జి అలా చక్కర్లు కొడుతున్న ఓ జోకును ప్రస్తావించటం విశేషం. ముగ్గురు సభ్యుల ధర్మాసనానికి జస్టిస్ ఏకే సిక్రీ నేతృత్వం వహించిన విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం పిటిషన్లపై సీరియస్గా వాదనలు కొనసాగుతున్న సమయంలో జడ్జి సిక్రీ జోక్యం చేసుకుంటూ... ఇందాకే వాట్సాప్లో మాకు ఓ మెసేజ్ వచ్చింది‘‘ అయ్యా... నా దగ్గర 116 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దయచేసి నన్ను సీఎంను చెయ్యండి’’ అంటూ గవర్నర్ కార్యాలయానికి ఓ వ్యక్తి ఫోన్ కాల్ చేసి కోరతాడు. ఇంతకీ మీరు ఎవరయ్యా అని సిబ్బంది అడిగితే... ఎమ్మెల్యేలు తలదాచుకున్న హోటల్ యాజమానిని అని అవతలి వ్యక్తి సమాధానమిస్తాడు... అంటూ ఆ జోకును న్యాయమూర్తి సిక్రీ చదివి వినిపించారు. దీంతో కోర్టు హాల్ మొత్తం నవ్వులతో నిండిపోయింది. బెంగళూరులోని ఇగల్టన్ రిసార్ట్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తలదాచుకోవటంపై ఈ జోకు నిన్నంతా వైరల్ అయ్యింది. కాగా, ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా హైదరాబాద్లోని హోటల్లలో బస చేసిన విషయం తెలిసిందే. కాగా, గవర్నర్ వాజుభాయ్ వాలా విధించిన 15 రోజుల గడువును తోసిపుచ్చిన కోర్టు శనివారం సాయంత్రం 4గంటలకు బలనిరూపణకు సిద్ధం కావాలని కర్ణాటక సీఎం యెడ్యూరప్పను ఆదేశించింది. -
మాదే పెద్ద పార్టీ.. మమల్ని ఆహ్వానించాల్సిందే!
సాక్షి, న్యూఢిల్లీ: కర్ణాటక గవర్నర్ వాజుభాయ్ వాలా నిర్ణయం పట్ల దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించాల్సిన గవర్నర్.. బీజేపీ అవసరాల మేరకు అనుగుణంగా పని చేయటం సరికాదంటూ పలు పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే అతిపెద్ద పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలన్న రూల్ రాజ్యాంగంలోనే ఉందని బీజేపీ చెబుతుండగా.. ఆ పాయింటే ఇప్పుడు బీజేపీని ఇరకాటంలో పడేసేలా కనిపిస్తోంది. అనూహ్యంగా గోవా, బిహార్ రాజకీయాలు తెరపైకి వచ్చాయి. ఆయా రాష్ట్రాల్లో అతిపెద్ద పార్టీలు తమవేనంటూ కాంగ్రెస్, ఆర్జేడీ లు తమకు అవకాశం ఇవ్వాలని వాదిస్తున్నాయి. గోవాలో కీలక పరిణామం... పానాజీ: గోవా రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ‘అతిపెద్ద పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి’ అన్న లాజిక్ లేవనెత్తుతూ కాంగ్రెస్ పార్టీ పోరాటానికి సిద్ధమైపోయింది. మొత్తం 16 మంది ఎమ్మెల్యేలతో రేపు(శుక్రవారం) రాజ్భవన్లో పేరేడ్కు సిద్ధమైపోయింది. హైకమాండ్ సూచనల మేరకు గురువారం మధ్యాహ్నం గోవా కాంగ్రెస్ లెజిస్లేటివ్ భేటీ జరిగింది. అనంతరం సీఎల్పీ చంద్రకాంత్ కవ్లేకర్ మీడియాతో మాట్లాడారు. ‘రేపు గవర్నర్ మృదులా సిన్హాను కలిసి ఎమ్మెల్యేల సంతకంతోపాటు కూడిన లేఖను సమర్పించబోతున్నాం. అవసరమైతే ఎమ్మెల్యేలతో పేరేడ్ కూడా నిర్వహిస్తాం. రూల్ ప్రకారం అతిపెద్ద పార్టీ మాదే. కాబట్టి ప్రస్తుత ప్రభుత్వ రద్దు చేసి, మాకు అవకాశం ఇవ్వాలని కోరతాం. కర్ణాటక పరిణామాలను చూశాక గోవా గవర్నర్ గతంలో చేసిన పొరపాటును సరిదిద్దుకుంటారని భావిస్తున్నాం’ అని చంద్రకాంత్ వెల్లడించారు. (గోవాలో ఏం జరిగిందో తెలుసా?) మొత్తం 40 మంది సభ్యులున్న గోవా అసెంబ్లీకి గతేడాది ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ 17 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 21 మాత్రం రాలేదు. దీంతో 14 సీట్లు వచ్చిన బీజేపీ.. గోవా ఫార్వర్డ్ పార్టీ-ఎంజీపీ-స్వతంత్ర్య అభ్యర్థుల(మొత్తం 9సీట్లు) సాయంతో కూటమిగా గోవాలో మారి ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. ఆర్జేడీ కూడా... పట్నా: ఆర్జేడీ నేత, బిహార్ మాజీ మంత్రి తేజస్వి యాదవ్ బీజేపీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘అతిపెద్ద పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించినట్లు బీజేపీ చెబుతోంది. ఆ లెక్కన్న బిహార్లో ఆర్జేడీనే అతిపెద్ద ప్రభుత్వం. మరి నితీశ్ కుమార్ సర్కార్ను రద్దు చేసి మమల్ని బిహార్ గవర్నర్ ఆహ్వానిస్తారా?’ అని తేజస్వి సెటైరిక్గా ఓ ట్వీట్ చేశారు. ఇక కర్ణాటక రాజకీయాలకు నిరసనగా ఆర్జేడీ గురువారం ఒక్కరోజు నిరసన ప్రదర్శనలు చేపట్టింది. ‘దేశం మొత్తం బీజేపీ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తోంది. విభజన రాజకీయాలు, గవర్నర్లను తమ గుప్పిట్లో పెట్టుకుని అధికారం చెలాయిస్తోంది. శుక్రవారం ఆర్జేడీ ఎమ్మెల్యేలంతా కలిసి గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరతాం. ఎందుకంటే మాదే పెద్ద పార్టీ కాబట్టి’ అని తేజస్వి మీడియాకు తెలిపారు. I will meet Honourable Governor of Bihar along with MLAs as we are single largest party of Bihar. — Tejashwi Yadav (@yadavtejashwi) 17 May 2018 2015లో ఆర్జేడీ-జేడీయూ కూటమి మహాఘట్భందన్ పేరిట ఎన్నికల్లో పాల్గొని 151 సీట్లు గెలుచుకున్నాయి. ఆర్జేడీకి 80 సీట్లు వచ్చి అతిపెద్దగా పార్టీగా ఆవిర్భవించగా.. జేడీయూ 71 సీట్లతో సరిపెట్టుకుంది. అయితే కొంత కాలం తర్వాత జేడీయూ మహాఘట్భందన్ నుంచి బయటకు వచ్చి బీజేపీ(53 సీట్లు)తో దోస్తీ కట్టింది. -
కీలుబొమ్మలుగా గవర్నర్లు...
సాక్షి, చెన్నై : కర్ణాటక తాజా రాజకీయ పరిణామాలపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... గవర్నర్ వాజుభాయ్ వాలా నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ‘గతంలో తమిళనాడులో ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసినట్లే, ఇప్పుడు ప్రధాని మోదీ కర్నాటకలోనూ రాజ్యాంగాన్ని ఆపహాస్యం చేశారు. అన్ని రాష్ట్రాల గవర్నర్లు కేంద్రం చేతిలో కీలుబొమ్మలుగా మారారు. ఇది అందరికి తెలిసిందే. కానీ, ఇప్పుడు వాజుభాయ్ వాలా తీసుకున్న నిర్ణయాన్ని డీఎంకే తీవ్రంగా ఖండిస్తోంది.’ అని స్టాలిన్ అన్నారు. ఇక మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్ హాసన్ ఆధ్వర్యంలో నిర్వహించబోతున్న అఖిలపక్ష సమావేశానికి వెళ్లకూడదని నిర్ణయించినట్లు స్టాలిన్ తెలిపారు. అంతకు ముందు ఆయన తన ట్వీటర్లో ఆయన కర్ణాటక పరిణామాలపై వరుస ట్వీట్లు చేశారు. ‘కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి స్పష్టమైన మెజార్టీ ఉన్నప్పటికీ బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వనించారు. ఏకపక్షంగా ఆయన తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్యం పునాదులను నాశనం చేసేదిగా, ముఖ్యంగా బేరసారాలను ప్రొత్సహించేదిగా ఉంది. తమిళనాడులోనూ అవినీతి అన్నాడీఎంకేను కాపాడేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ప్రజలు గమనిస్తున్నారు. ఇలాంటి చేష్టలు రాజ్యాంగ విలువలకు ప్రమాదకారకంగా మారుతున్నాయి’ అని స్టాలిన్ ట్వీట్ చేశారు. People of Tamil Nadu are familiar with the BJP's efforts to protect the corrupt ADMK Government, which also incidentally does not enjoy the majority support in the Legislative Assembly. Constitutional institutions and principles are under threat from these actions. — M.K.Stalin (@mkstalin) 17 May 2018 -
కర్ణాటకలో ‘ఈశాన్య’ ప్రకంపనలు
బెంగళూరు: ఈశాన్య రాష్ట్రాల్లో పరిణామాల ప్రభావం కర్ణాటక రాజకీయాలపై సాధారణంగా ఉండదు. ఒక్కమాటలో చెప్పాలంటే.. అసలే ఉండదు. కానీ, శనివారం నాటి పరిస్థితి వేరు. కర్ణాటక అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ నేతలు ఉదయం నుంచీ టీవీలకు అతుక్కుపోయారు. త్రిపురలో బీజేపీ ముందంజలో ఉందన్న వార్తలు రాగానే ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్ధి యడ్యూరప్ప సహా నేతల ముఖాల్లో ఆనందం తొణికిసలాడింది. ఢిల్లీలోని బీజేపీ పెద్దల చూపంతా ఇక కర్ణాటకపైనే ఉంటుందనీ, తమకు అధికారం ఖాయమనీ వారికి నమ్మకం కలిగినట్లుంది. అయితే, త్రిపుర, నాగాలాండ్లలో తుడిచి పెట్టుకు పోవటం కాంగ్రెస్ను షాక్కు గురిచేసింది. త్రిపురలో తమ పార్టీ అంతగా ప్రభావం చూపనప్పటికీ బీజేపీ దూకుడును మాణిక్సర్కార్ నిలువరిస్తారనీ, అదే మాదిరిగా కర్ణాటకలో పార్టీని తిరిగి అధికారంలో తెస్తామనే ఆశ ఇప్పటిదాకా కాంగ్రెస్ నేతల్లో ఉండింది. కానీ, తాజా ఫలితాలు వారి నమ్మకాన్ని వమ్ము చేశాయి. మేఘాలయలో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్..గోవా, మణిపూర్లో మాదిరి రాజకీయాలతో బీజేపీ అధికారంలోకి వస్తుందేమోనని భయపడుతోంది. దీనిపై రాష్ట్ర కాంగ్రెస్ నేత ఒకరు విశ్లేషిస్తూ..ఈశాన్య రాష్ట్రాల్లో ఫలితాలను కర్ణాటకతో పోల్చి చూసుకోవటం సరికాదన్నారు. అయితే, ఈశాన్య రాష్ట్రాల ఫలితాల ప్రభావం కర్ణాటకపై ఎందుకు ఉండబోదో చెప్పేందుకు కాంగ్రెస్ నేతలు ఇబ్బందిపడ్డారు. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఏకైక పెద్ద రాష్ట్రం కర్ణాటకనే. పంజాబ్లో అధికారంలో ఉన్నా అక్కడ ఖజానా ఖాళీగా ఉండటంతో ఏమీ చేయలేకపోతోంది. ఈ పరిస్థితుల్లో కర్ణాటకలో విజయం కాంగ్రెస్కు కీలకం. ఇక్కడ అధికారం కోల్పోతే జాతీయ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించే అవకాశం చేజారటం ఖాయం. బెంగాల్లో బీజేపీకి మార్గం సుగమం! న్యూఢిల్లీ .. త్రిపురలో ఫలితాల ప్రభావం 2019 ఎన్నికల్లో పశ్చిమబెంగాల్, ఒడిశాల పైనా పడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. త్రిపురలో రెండు లోక్సభ స్థానాలే ఉన్నప్పటికీ.. 25 ఏళ్ల వామపక్ష కూటమిని కూలదోయటం ఇతర బీజేపీయేతర ఈశాన్య రాష్ట్రాలను ప్రభావితం చేస్తుంది. పశ్చిమబెంగాల్లో సీపీఎంకు ఆదరణ తగ్గిపోతుండటంతో.. బీజేపీ ప్రధాన పోటీదారుగా ఎదుగుతోంది. అయితే బెంగాల్ గడ్డపై మమత ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఓటు శాతాన్ని ప్రభావితం చేసే స్థాయిలో ఇన్నాళ్లు ఎదగలేదు. త్రిపురలో భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయటం ఇప్పుడు పశ్చిమబెంగాల్, ఒడిశాలపై ప్రభావం చూపనుంది. ఈ రెండు రాష్ట్రాలపై బీజేపీ లుక్–ఈస్ట్ పాలసీతో వ్యూహాలు రచిస్తోంది. ఇంతవరకు ఏ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినా.. కాంగ్రెస్ నష్టపోతున్న ఓట్లు సీట్లు.. బీజేపీకి అదనపు బలంగా మారుతున్నాయి. ఇది మోదీ–షా ద్వయం అనుసరిస్తున్న వ్యూహం కారణంగానే. అయితే మేఘాలయాలో హంగ్ పరిస్థితులనుంచి తప్పించుకుని ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు అహ్మద్ పటేల్, కమల్నాథ్ను రాహుల్ రంగంలోకి దించారు. -
ఆల్మట్టి ఎత్తుపై కర్ణాటక రాజకీయం!
కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు - తొమ్మిది ఎత్తిపోతల పథకాలకు పర్యావరణ అనుమతుల కోసం ఒత్తిళ్లు - ఇప్పటికే కేంద్ర మంత్రిని కలసిన కర్ణాటక మంత్రులు - అనుమతులు సాధించి రాజకీయ లబ్ధి పొందే యత్నం - కేంద్రం తలొగ్గితే తెలంగాణ ఎడారే! సాక్షి, హైదరాబాద్: ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు రాజకీయ రంగు పులుముకుంటోంది.. ఆల్మట్టి ఎత్తు పెంపుపై ఆధారపడి చేపట్టిన ఎత్తిపోతల పథకాలకు పర్యావరణ అనుమతులు సాధించుకొనేందుకు కర్ణాటక ప్రభుత్వం రాజకీయ కోణాల్లో ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ మేరకు కర్ణాటక మంత్రులు కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిని కలసి విజ్ఞప్తులు చేసినట్లు తెలిసింది. మరోవైపు ఆ రాష్ట్రంలో రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వివిధ పార్టీల పెద్దలు కూడా ఈ పథకాలకు అనుమతులు సాధించి.. ఘనతను తమ ఖాతాలో వేసుకోవాలని యోచిస్తున్నారు. బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పు మేరకు.. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తును 519.6 మీటర్ల నుంచి 524.25 మీటర్లకు పెంచుకునేందుకు కర్ణాటక చాలాకాలంగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఆ పెంపుతో అదనంగా లభించే నీటిని వినియోగించుకునేలా తొమ్మిది ఎత్తిపోతల పథకాలకు రూపకల్పన చేసింది. కానీ బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పు అవార్డు కాకపోవడం (అమల్లోకి రాకపోవడం)తోపాటు పలు ఇతర అంశాల నేపథ్యంలో ఈ ఎత్తిపోతల పథకాలకు పర్యావరణ అనుమతులు ఇచ్చేందుకు కేంద్రం తిరస్కరించింది. అయితే కర్ణాటక చేపట్టిన ఈ తొమ్మిది ఎత్తిపోతల పథకాల నుంచి పలువురు కీలక నేతలకు సంబంధించిన నియోజకవర్గాల్లో ఉన్న ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. అందులో అధికార కాంగ్రెస్తోపాటు విపక్ష బీజేపీ నేతల నియోజకవర్గాలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయా నేతలంతా ఎత్తిపోతల పథకాలకు ఎలాగైనా అనుమతులు సాధించాలన్న ఉద్దేశంతో ఉన్నారు. తద్వారా ఈ అంశాన్ని రాజకీయంగా తమకు అనుకూలంగా మలచుకోవాలని భావిస్తున్నారు. ప్రయత్నాలు మొదలు.. ఇటీవల కర్ణాటక మంత్రులు ఇద్దరు కేంద్ర మంత్రిని కలసి ఎత్తిపోతల పథకాలకు అనుమతులపై విజ్ఞప్తులు చేశారు. ఆల్మట్టి ఎత్తు పెంచుకొనేందుకు బ్రిజేశ్ ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చిందని, అందువల్ల దానిపై ఆధారపడిన ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని వారు కోరినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆ పథకాలు పూర్తిచేస్తామని.. ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వచ్చాకే నీటి విని యోగం మొదలుపెడతామని వివరించినట్లు సమాచారం. మరోవైపు కర్ణాటకకు చెందిన పలువురు బీజేపీ కేంద్ర మంత్రులు సైతం.. ఆ ఎత్తిపోతల పథకాలకు అనుమతులపై దృష్టి సారించినట్లు తెలిసింది. తాము అనుమతులు సాధించడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలని భావిస్తున్నట్లు సమాచారం. కర్ణాటక ఒత్తిళ్లకు కేంద్రం తలొగ్గితే.. కర్ణాటక ప్రభుత్వం, అక్కడి నేతల ఒత్తిళ్లకు కేంద్రం తలొగ్గితే.. కృష్ణా పరీవాహకంలో దిగువన ఉన్న తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఇప్పటికే విచ్చలవిడిగా నీటిని వినియోగించుకుంటున్న కర్ణాటక.. ఆ ఎత్తిపోతల పథకాలకు కూడా నీటిని వినియోగించుకుంటే దిగువకు చుక్క నీరు కూడా రాదని నీటిపారుదల రంగ నిపుణులు పేర్కొంటున్నారు.