Welfare schemes
-
ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీతో ఇలాగే ఉంటుంది మరి!
ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వారు పార్టీలకు అతీతంగా వ్యవహరించాలి. అందరికీ ఉపయోగపడే పనులు చేయాలి. ఎన్నికలు ముగిసిన తరువాత రాజకీయాల వద్దని, అందరూ సమానమేనని అనాలి. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేస్తున్నదేమిటి? సీఎం హోదాలో ఉంటూనే.. వైఎస్సార్సీపీ వారికి ఎలాంటి పనులూ చేయవద్దని చెబుతున్నారంటే.. ఏంటి అర్థం?. ఈ రకమైన వ్యాఖ్యలకు బాధ పడాల్సింది... సిగ్గుపడాల్సింది వైఎస్సార్సీపీ(YSRCP) వాళ్లు కాదు.. టీడీపీ మిత్రపక్షాల వారే. భవిష్యత్తులో ఏ కారణం వల్లనైనా బాబుతో పొత్తు లేకుండా పోతే.. ఆయన వ్యవహారశైలి ఎలా ఉంటుందో ఈ తాజా వ్యాఖ్యలను బట్టి అర్థం చేసుకోవచ్చు. గతంలో.. ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ మోహన్రెడ్డి కులాలు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా సంక్షేమ అమలు గురించి బహిరంగంగానే ప్రకటించారు. కానీ చంద్రబాబు మాత్రం గద్దెనెక్కిందే తడవు.. తమది రాజకీయ పాలనేనని నిస్సిగ్గుగా చెప్పుకున్నారు. ఆపై రాక్షస పాలనకు శ్రీకారం చుట్టారు. చివరకు ఇందుకు ఆయన తన కుమారుడు లోకేష్ తాలూకూ రెడ్బుక్ రాజ్యాంగాన్ని ప్రాతిపదికగా తీసుకోవడం బాబుకొచ్చిన దుస్థితి అని అనుకోవాల్సిందే. అధికారులైనా.. పార్టీ నాయకులైనా సరే.. వైఎస్సార్సీపీ కార్యకర్తలకు వీసమెత్తు పని చేసినా ఊరుకోనని చంద్రబాబు హూంకరిస్తున్నారు. ఒకవేళ అలా చేస్తే పాముకు పాలు పోసినట్లేనని ఆయన దుర్మార్గంగా, బహిరంగంగా మాట్లాడుతున్నారు. మాటల విషం కక్కుతూ YSRCP వాళ్లను పాములతో పోల్చుతున్నారు. ఎన్నికలతోనే రాజకీయాలు మరచిపోవాలన్నది చాలామంది చెప్పే మాట. కానీ చంద్రబాబులా(Chandrababu) ఎవరూ ఇంత బరితెగించి మాట్లాడరు. సీఎం చెప్పినదాని ప్రకారం ఇకపై అధికారులు తమ వద్దకు వచ్చేవారు టీడీపీ వారా? లేక వైఎస్సార్సీపీ వారా? అన్నది తెలుసుకుని పనులు చేయాలా? చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత.. అంతా ఒకసారి గత ముఖ్యమంత్రుల గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఉదాహరణకు వైఎస్ రాజశేఖరరెడ్డి(YS Rajasekhar Reddy) ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు, ప్రస్తుత ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వంటి వారు వైఎస్ను కలిసి నియోజకవర్గాలకు సంబంధించి పనులకు నిధులు పెద్ద ఎత్తున తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. సీపీఎం నేత నోముల నరసింహయ్య ఒకసారి అసెంబ్లీలో వైఎస్ను తీవ్రంగా విమర్శించారు. ఆ తర్వాత నియోజకవర్గ పనులపై వైఎస్ను కలిశారు. ఆ సందర్భంలో అసెంబ్లీ చర్చను నోముల ప్రస్తావించినా, అదేమీ తప్పు కాదని చెప్పడమే కాకుండా ఆయన కోరినట్లు నిధులు మంజూరు చేసి పంపించారు. ఆ రకంగా వైఎస్సార్ పేరు తెచ్చుకుంటే, ఆయన కుమారుడు జగన్ ముఖ్యమంత్రి అయ్యాక పార్టీలు, కులాలు, మతాలు వంటివాటి జోలికి వెళ్లకుండా తనకు ఓటు వేయని వారికి సైతం పనులు చేయాలని పథకాలు అమలు చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించి మరింత మంచి ఖ్యాతి సాధించారు. చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేయడానికి కారణాలపై కూడా చర్చలు జరుగుతున్నాయి. వైఎస్సార్సీపీలో ఉండడానికి భయం కల్పించి, టీడీపీలోకి వారిని లాక్కొవడానికి చేస్తున్న కుట్రలలో ఇదొకటని తెలుస్తూనే ఉంది. అంతమాత్రాన వైఎస్సార్సీపీ వారంతా భయపడరని పలు అనుభవాలు చెబుతున్నాయి. చివరికి బంధువులు, స్నేహితుల మధ్య కూడా విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ది పొందాలన్న యావకు వెళ్లినట్లు అనిపిస్తుంది. గతంలో చంద్రబాబు నాయుడు మాట వరసకు ఒకటి చెప్పేవారు. ‘‘ఎన్నికలయ్యాక రాజకీయాలు ఉండవద్దు.. అంతా అభివృద్దే ఉండాలి’’ అని సుద్దులు చెప్పేవారు. కాని చేసేది చేసేవారు. 2014 టర్మ్లో తన పార్టీలో చేరితేనే పనులు చేస్తానని బెదిరించి, ఇతర ప్రలోభాలు పెట్టి 23 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు. ఇప్పుడు మరీ ఓపెన్ అయి ఇలా మాట్లాడారు కాని, ఆయన అసలు తత్వం అదేనని అంటారు. తెలుగుదేశం పార్టీని ఒక వ్యాపార సంస్థగా మార్చారన్న విమర్శను ఎప్పటినుంచో ఎదుర్కొంటున్నారు. చంద్రబాబు ఎప్పుడూ ప్రజలను నమ్ముకుని రాజకీయాలు చేయలేదనే చెప్పాలి. వ్యూహాలు పన్నడం, వర్గాలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించడం ద్వారానే రాజకీయాలు సాగించారన్న భావన ఉంది.పైకి మాత్రం ప్రజల కోసం పని చేస్తున్నట్లుగా ప్రచారం చేసుకునేవారు. కాకపోతే ఈసారి మరీ బహిరంగం అయిపోయారు. 1978లో చంద్రబాబు ఎమ్మెల్యే అయ్యాక కాంగ్రెస్లో గ్రూపులు నడిపారు. ఒకసారి పార్టీ నుంచి సస్పెండ్ కూడా అయినట్లు గుర్తు. 1983లో ఓటమి తర్వాత మామ ఎన్టీఆర్ వద్దకు వెళ్లి పార్టీలో చేరిపోయారు. తదుపరి మళ్లీ వర్గ రాజకీయాలను జోరుగా నడిపారు. మామను మాయ చేసి కర్షక పరిషత్ చైర్మన్ పదవి తీసుకున్నారు. విశేషం ఏమిటంటే కర్షక పరిషత్ చైర్మన్ పదవి అంటే అదేదో సూపర్ సీఎం మాదిరి ఆయా శాఖల మంత్రులకన్నా తానే పవర్ పుల్ గా కనిపించే యత్నం చేసేవారు. తన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రాబల్యాన్ని తగ్గించడానికి అన్ని వ్యూహాలు అమలు చేసేవారు. ట్విస్టు ఏమిటంటే దగ్గుబాటి వెంకటేశ్వర రావును కూడా అలాగే ప్రలోభపెట్టి తనవైపు లాక్కుని మామ ఎన్.టి.రామారావునే శంకరగిరి మాన్యాలు పట్టించగలిగారు. ఆ తర్వాత కొంతకాలం దగ్గుబాటి కుటుంబాన్ని దగ్గరకు కూడా రానివ్వలేదు. ఇప్పుడు మళ్లీ పరిస్థితి మారింది. చంద్రబాబును విమర్శిస్తూ అనేక సంచలన విషయాలను బయటపెట్టిన దగ్గుబాటి తాజాగా ఆయన ఇంటికి వెళ్లి తన మరో పుస్తకావిష్కరణ సభకు రావాలని ఆహ్వానించడం విశేషం. అది వేరే సంగతి.చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) తొలిసారి ముఖ్యమంత్రి అవ్వడానికి కారణం ప్రజలు కాదు. ఎమ్మెల్యేలలో తెచ్చిన చీలిక. అప్పట్లో ఎవరైనా ఎన్టీఆర్ వర్గంలో ఎమ్మెల్యేలు ఉంటే వారిని రకరకాలుగా ప్రలోభాలు పెట్టేవారని వార్తలు వచ్చేవి. లొంగకపోతే ఇతర మార్గాలు ఎటూ ఉంటాయి. పోలీసు వ్యవస్థతో బెదిరించడం, పనులు చేయకపోవడం వంటివి చేస్తుంటారు. అప్పటి నుంచే ఆయనకు ఈ వ్యూహం తెలుసు. టీడీపీ వారికే పనులు అయ్యేలా జాగ్రత్త పడేవారు. కొంతమంది కాంట్రాక్టర్లను కూడా తనతో ఉండేలా చేసుకునేవారు. వారికి ముఖ్యమైన కాంట్రాక్టులు ఇచ్చి పార్టీకి ఆర్థికంగాఅండగా ఉండేలా చేసుకుంటారు. 2004 ఎన్నికలకు ముందు కేంద్రం నుంచి ఏభైలక్షల టన్నుల బియ్యాన్ని పనికి ఆహారం పథకం కింద తీసుకు వచ్చారు. దానిలో అధిక భాగం టీడీపీ కార్యకర్తలే అమ్ముకున్నారన్న విమర్శలను అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ చేసేది. దాని ప్రభావం కూడా ఎన్నికలలో కనిపించింది. చంద్రబాబు ప్రభుత్వంపై పెరిగిన అసంతృప్తితోపాటు, కార్యకర్తల దోపిడీని కూడా భరించలేక 2004లో టీడీపీని ఇంటికి పంపించారు. జన్మభూమి కమటీల వ్యవస్థను చంద్రబాబు తీసుకు వచ్చారు. మొదట అదేదో మంచి కార్యక్రమమేమో అనే భావన కల్పించారు. ఈనాడు వంటి ఎల్లో మీడియా అచ్చంగా అదే పనిలో ఉండేది. 2014-19 టర్మ్లో ప్రజలు దాని విశ్వరూపాన్ని చూడవలసి వచ్చింది. ప్రజలకు ఏ అవసరం ఉన్నా, ఏ స్కీమ్ కావాలన్నా ఆ కమిటీలలో ఉన్న టీడీపీ కార్యకర్తలకు లంచాలు ఇవ్వాల్సి వచ్చేదని చెబుతారు. చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ తదితర వందలాది హామీలుకు నోచుకోకపోవడం, టీడీపీ కార్యకర్తల ఆగడాలతో జనంలో విపరీతమైన వ్యతిరేకత ఏర్పడింది. అంతేకాదు. కార్యకర్తల ఆర్థిక పుష్టి కోసమే కొన్ని స్కీములను వాడుతుంటారన్న ఆరోపణలు ఉన్నాయి. ఉదాహరణకు చెట్టు-నీరు పధకం కింద సుమారు రూ.13 వేల కోట్లు టీడీపీ కార్యకర్తలు దోచేశారని అప్పట్లో బీజేపీ అధ్యక్షుడుగా ఉన్న సోము వీర్రాజు ఆరోపించారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం విజిలెన్స్ విచారణ చేసి పలువురిపై కేసులు పెట్టడం, బిల్లులు నిలుపుదల చేసింది. ఈసారి అధికారంలోకి వచ్చాక వారి బిల్లలుకు ఈ మధ్యే రూ.900 కోట్లు విడుదల చేసేయడమే కాకుండా, కేసులు కూడా ఎత్తేవేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వడం, నానా పాట్లు పడి ప్రధాని నరేంద్ర మోదీని ప్రసన్నం చేసుకోవడం, పవన్ కల్యాణ్ ద్వారా ఒక సామాజికవర్గ ఓట్లుకు గాలమేసే ప్రయత్నం చేయడం.. ఈవీఎంల ప్రభావం తదితర కారణాలతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 2024లో అధికారంలోకి వచ్చింది. మళ్లీ యథా ప్రకారం ఆయన పాత పాట మొదలు పెట్టారు. లోకేష్ రెడ్ బుక్ పేరుతో వైఎస్సార్సీపీ కార్యకర్తలను, హామీల అమలును ప్రశ్నించే సోషల్ మీడియా వారిని వేధిస్తుండడం ఒక సమస్యగా ఉంటే, ఇంకోవైపు చంద్రబాబు అసలు వైఎస్సార్సీపీ వారికి ఏ పని చేయవద్దని చెబుతున్నారు. ఇంతలా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్న ప్రభుత్వం దేశ చరిత్రలో మరొకటి ఉండకపోవచ్చు. అయినా వివిధ వ్యవస్థలను మేనేజ్ చేయడంలో సిద్దహస్తుడుగా పేరొందిన చంద్రబాబు జోలికి ఎవరు వెళ్లినా ఏమీ కాదనే ధైర్యం టీడీపీలో ఉందని చెబుతారు. ఈ నేపథ్యంలో యథేచ్ఛగా కార్యకర్తల అడ్డగోలు దోపిడీకి పచ్చజెండా ఊపారన్న భావన ఉంది. ఇప్పటికే ఇసుక దందాతో లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారు. మద్యం షాపులన్నీ తన వారికే కట్టబెట్టారు. జగన్ టైమ్ లో ఆయన వీటిని ప్రభుత్వపరం చేసి ఆదాయం పెంచడానికి ప్రయత్నించారు. దాంతో కార్యకర్తలకు పెద్దగా ఆదాయ వనరు లేకుండా పోయిందని భావిస్తారు. అలాగే జగన్ సర్కార్ వలంటీర్ల వ్యవస్థ ద్వారా పార్టీలకు అతీతంగా స్కీములు, వివిధ సేవలను అందించడంతో కార్యకర్తలు, వైసీపీ నేతలకు పెద్దగా పని లేకుండా పోయింది. వలంటీర్ తెలిస్తే చాలు..వైసీపీ వారితో పని లేదన్నట్లుగా పరిస్థితి ఏర్పడింది. పైగా టీడీపీ వారికి కూడా అన్ని సదుపాయాలు సమకూరాయి. చంద్రబాబేమో కార్యకర్తల ఆర్జనకు అన్ని అవకాశాలు కల్పించి, ఆ తర్వాత వారితో ఎన్నికలలో ఖర్చు పెట్టించే వ్యూహంతో పని చేయిస్తుంటారని చెబుతారు. అంటే టీడీపీని గెలిపిస్తే, పెత్తనంతోపాటు తాము ఇష్టారాజ్యంగా సంపాదించుకోవచ్చనే ధైర్యాన్ని వారికి కల్పించారన్నమాట. టీడీపీ విజయానికి కార్యకర్తల దోపిడీ తోడ్పడదని పలుమార్లు రుజువైంది. టీడీపీ కార్యకర్తల వేధింపులు, ధనార్జనను భరించలేక ప్రజలంతా ఒక్కటై టీడీపీని పలుమార్లు ఓడించారు. ప్రస్తుతం కూడా రెడ్ బుక్ పేరుతో పోలీసులతో వైఎస్సార్సీపీ వారిని వేధిస్తుంటే, మరో వైపు టీడీపీ కార్యకర్తల దౌర్జన్యాలు, అరాచకాలు, అడ్డగోలు సంపాదనకు అదుపు, ఆపు లేకుండా పోయింది. ఈ దశలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబే వారి అవినీతికి లైసెన్స్ ఇచ్చేసినట్లు, వైసీపీ వారిని వేధించండని పిలుపు ఇచ్చినట్లు మాట్లాడితే జనం వారికి గుణపాఠం చెప్పకుండా ఉంటారా?:::కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
వైఎస్సార్సీపీ వాళ్లకు చిన్న పని చేసినా ఊరుకోను: చంద్రబాబు
చూశారా.. ఇద్దరు నాయకుల మధ్య ఎంత తేడానో! తనకు ఓటు వేయకపోయినా అర్హత ఉంటే చాలు.. సంక్షేమ పథకాలు అందించాలనే తపన కలిగిన వ్యక్తిత్వం ఒకరిది.. తనకు ఓటు వేయని వారిని పాముతో పోల్చిన నైజం ఇంకొకరిది. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు చేరవేయాలనే తాపత్రయం ఒకరిది.. తన వాళ్లకు మాత్రమే లబ్ధి జరగాలనే స్వార్థం మరొకరిది.. ప్రతి కుటుంబం, ప్రతి ఒక్కరూ బాగుండాలని అనుక్షణం పరితపించిన తీరు ఒకరిది.. ఎదుటి వాళ్లపై కక్ష సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న కుతంత్రం మరొకరిది.. తను చనిపోయాక కూడా ప్రజల గుండెల్లో నిలిచిపోయేలా మంచి చేయాలన్న ఆరాటం ఒకరిది.. మనవాళ్లు కాని వారందరినీ అణచి వేయాలన్న కుట్ర మరొకరిది.. చిత్తూరు అర్బన్/ సాక్షి, అమరావతి : వైఎస్సార్సీపీ వాళ్లకు చిన్న పని చేసినా ఊరుకోనని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే అధికారులు, టీడీపీ నేతలను హెచ్చరించడం కలకలం రేపింది. చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరులో శనివారం పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం సర్వత్రా విస్మయ పరిచింది. కులం, మతం, ప్రాంతం, రాజకీయం చూడకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలని గత సీఎం వైఎస్ జగన్ పరితపిస్తే.. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు ఇలా మాట్లాడటం విస్తుగొలిపింది.విజనరీనని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా, కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీ వారికి ఎలాంటి లబ్ధి చేకూరకూడదని బహిరంగంగా ఆదేశించడంపై రాజకీయ విశ్లేషకులు, పలు పార్టీల నేతలు విస్తుపోతున్నారు. బహుశా ప్రపంచంలోనే ఇలా ఎక్కడా జరిగి ఉండదు. రాగద్వేషాలకు అతీతంగా పని చేస్తానని ప్రమాణం చేసి.. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా దిగజారి వ్యవహరించడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. రాజ్యాంగ బద్ధమైన ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఇలా వ్యాఖ్యానించడం సబబేనా అనే చర్చ మొదలైంది. సీఎం స్థానంలో ఉంటూ ప్రజలందరినీ సమాన దృష్టితో చూడాల్సిందిపోయి ఇలా మాట్లాడటం తగదంటున్నారు. నాడు వైఎస్ జగన్ కూడా ఇలానే ఆలోచించారా.. అంటూ ప్రశ్నిస్తున్నారు. నాడు సంతృప్త స్థాయిలో పథకాలు అమలు చేయడం మీరు గమనించలేదా.. రాజకీయాలు అనేవి ఎన్నికల వరకేనని, ఆ తర్వాత అందరూ మనవాళ్లేనని వైఎస్ జగన్ పదేపదే చెప్పడం గుర్తు లేదా అని ప్రజలు గుర్తు చేస్తున్నారు. జగన్ పథకాల వల్ల తాము ఎంతగానో లబ్ధి పొందామని ఊరూరా అందరితోపాటు టీడీపీ వారు సైతం అప్పట్లో స్వచ్ఛందంగా చెప్పుకున్నారని చెబుతున్నారు. ఏం చేయాలో దిక్కు తెలియడం లేదట! ఓ వైపు రాష్ట్రంలో ఆదాయం లేదని, ఏం చేయాలో దిక్కు తోచడం లేదని చెప్పుకొచి్చన ముఖ్యమంత్రి చంద్రబాబు మరో వైపు అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే 12.9 శాతం వృద్ధి రేటు సాధించేశానని లేని గొప్పలు చెప్పడం విస్తుగొలుపుతోంది. సంక్షేమ పథకాలు ఎలా అమలు చేయాలో దిక్కు తెలియడం లేదని అంటూనే వృద్ధి రేటు పెంచేశానని చెప్పుకోడం పచ్చి అబద్ధమని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఆదాయం అంతా తన చుట్టూ ఉన్న వారికి కమిషన్ల రూపంలో దోచిపెట్టి.. ‘నీకింత.. నాకింత’ అని పంచుకోవడానికే సరిపోతోందని అంటున్నారు.నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టులు కట్టబెడుతూ, మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చేస్తూ.. వాటిలో కమిషన్లు కొట్టేస్తూ ఆదాయం లేదనడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆద్యంతం వైఎస్సార్సీపీ నేతలను తిట్టిపోశారు. రూ.10 లక్షల కోట్లు అప్పులు చేశారని, ఆ అప్పుల నుంచి ఎలా బయట పడాలో తెలియడం లేదని.. తానొక్కడినే పరుగెడుతూ ఉన్నానని చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్కరు ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనాలని, వారి బాగోగులను చూసే బాధ్యత తనదన్నారు. సూపర్ సిక్స్ హామీల సంగతి చెప్పవయ్యా అంటే.. ఆకాశానికి నిచ్చెన వేసేలా మాట్లాడటం చూసి ప్రజలు నవ్వుకున్నారు. రెండు రాష్ట్రాల్లో పార్టీని కాపాడుకోవడం చారిత్రాత్మక అవసరం అన్నారు. చిన్న పిల్లల తల్లిదండ్రుల వ్యక్తిగత విషయాలు బహిర్గతం చేస్తారా? ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు తాను ఏం చేస్తున్నాననే విషయం విస్మరించారు. ఎనిమిది, పదేళ్ల వయస్సున్న ఇద్దరు ఆడ పిల్లల్ని సభలో తన పక్కన కూర్చోబెట్టుకుని అధికారులు, మీడియా ఎదుట వారి తల్లిదండ్రుల వ్యక్తిగత విషయాలను వెల్లడించడం చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. వీళ్ల నాన్న మరో మహిళతో వెళ్లిపోయాడు.. వీళ్ల అమ్మ మరో వ్యక్తి వెంట వెళ్లిందంటూ మాట్లాడటం విస్తుగొలిపింది. తద్వారా ఆ పిల్లల మనస్సును ఎంతగా గాయ పరిచారో సీఎం తెలుసుకోలేకపోయారనే విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం.. వాసు, సెల్వి దంపతుల ఇంట్లోకి వెళ్లి పింఛన్ డబ్బులిచ్చారు. ‘సార్ కాస్త నీళ్లు తాగండి..’ అంటూ సెల్వి ఆప్యాయంగా అడగ్గా.. ‘అవి వద్దమ్మా.. నా వద్ద ఉన్న నీటినే తాగుతాను’ అంటూ హిమాలయ కంపెనీ నీళ్ల బాటిల్ చూపిస్తూ అందులోని నీళ్లు తాగారు. సర్పంచ్ వి.సి. సుబ్రమణ్యం యాదవ్ వైఎస్సార్సీపీకి చెందిన వారని వేదికపై చోటు కల్పించలేదు. -
సర్వే గణాంకాలతోనే సంక్షేమ పథకాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే ప్రతి సంక్షేమ పథకానికి సమగ్ర కుటుంబ సర్వే గణాంకాలే ప్రామాణికమని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్పష్టం చేశారు. రేషన్ కార్డుల మంజూరు మొదలు.. ప్రతి పథకానికి ఈ గణాంకాల ఆధారంగానే లబ్ధి కల్పించే విధంగా ప్రభు త్వం కార్యాచరణ రూపొందిస్తోందన్నారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రక్రియంతా పూర్తిస్థాయిలో శాస్త్రీయంగా జరిగిందని, ప్రభుత్వ ఉద్యోగుల ద్వారానే క్షేత్రస్థాయిలో సర్వే గణాంకాలు సేకరించామని వివరించారు. సర్వేపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సందేహాలు లేవనెత్తుతున్న నేపథ్యంలో బుధవారం అసెంబ్లీ కమిటీ హాలులో మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ ఉత్తమ్కుమార్రెడ్డి పవర్పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా వారి సందేహాలను నివృత్తి చేశారు. దాదాపు రెండు గంటల పాటు ఈ కార్యక్రమం కొనసాగింది. అనంతరం ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. సమగ్ర సర్వే జరిగినతీరు, నిబంధనలు పాటించిన విధానం వంటి అంశాలను సభ్యులకు వివరించినట్లు ఉత్తమ్ వెల్లడించారు. ఈ సర్వే పూర్తిగా ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో జరిగిందన్నారు. కేంద్రంలో జనగణన విభాగం అనుసరించే విధానంలోనే రాష్ట్రంలో ప్రణాళిక శాఖ సర్వే చేసిందన్నారు. ఈ సర్వే సారాన్ని వెయ్యి పేజీల్లో పొందుపరిచారని, ఈ సమాచారాన్ని ఒకటి, రెండు రోజుల్లో పబ్లిక్ డొమైన్లో కులాలు, ఉపకులాలు, జిల్లాల వారీగా అందుబాటులో ఉంచనున్నట్లు ఆయన చెప్పారు. కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
అత్యంత శాస్త్రీయతతో కుల సర్వే చేశాం..
సాక్షి, హైదరాబాద్: ప్రజా సంక్షేమ పథకాలను మరింత సమర్థంగా అమలుచేసేందుకు తమ ప్రభు త్వం నిర్వహించిన ‘సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే– 2024’సమాచారం ఎంతగానో ఉపయోగపడుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. భవిష్యత్లో అమలుచేయబోయే సంక్షేమ పథకాలను ఈ సర్వే గణాంకాల ఆధారంగానే చేపడుతా మని చెప్పారు. శాసనమండలిలో మంగళవారం ఆయన సమగ్ర కుల సర్వేతోపాటు, ఎస్సీ వర్గీకరణ నివేదికలను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. దేశంలో ఇంతటి శాస్త్రీయతతో ఏ రాష్ట్రంలోనూ సర్వే చేయలేదని తెలిపారు. అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే ప్రత్యేక రూట్మ్యాప్ ఆధారంగా సర్వే నిర్వహించామని చెప్పా రు. 50 రోజులపాటు నిర్వహించిన సర్వేలో 96.9% స్పష్టమైన వివరాలు వచ్చాయని వెల్లడించారు. గత ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేకు శాస్త్రీయత లేదని, ఆ వివరాలను అప్పటి ప్రభుత్వం ఎక్కడా బహిర్గతం చేయలేదని విమర్శించారు.సర్వేలో ఉద్దేశపూర్వకంగా పాల్గొనని పెద్ద మనుషులు కూడా ఉన్నారని ప్రతిపక్షాలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సర్వేలో పాల్గొనని వారి వివరాల నమోదుకు మరోమారు అవకాశం ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసిందని వెల్లడించారు. కమిషన్ ఇచి్చన నివేదిక ఆధారంగా వర్గీకరణ ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు. సర్వే వివరాలు బయటపెట్టకుండా చర్చ ఏంటి? సమగ్ర సర్వేకు సంబంధించిన వివరాలు సభ్యులకు ఇవ్వకుండా సభలో చర్చఎలా నిర్వహిస్తారని మండలిలో ప్రతిపక్ష నేత మధసూదనాచారి ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వ నిర్ణయం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు. దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం సరికాదని అన్నారు.ప్రకటనలు ప్రవేశపెట్టేందుకు అసెంబ్లీ వేదిక కాదని, కనీసం లోతైన చర్చ కూడా జరపకపోవడం దారుణమని ఆగ్ర హం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. సర్వేలో అన్ని వర్గాల జనాభా తగ్గిందని, ఓసీల జనాభాను మాత్రం భారీగా పెంచి చూపించారని ఆరోపించారు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వండి: బండ ప్రకాశ్ గత ప్రభుత్వం చేసిన సమగ్ర సర్వే వివరాలు ఎంసీఆర్హెచ్ఆర్డీ వైబ్సైట్లో ఉన్నాయని మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీకి అనుగుణంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తూ ఆర్డినెన్స్ జారీ చేయాలని కోరారు. అందుకు సభ్యులు కూడా మద్దతుగా నిలుస్తారని తెలిపారు. సర్వే విషయంలో ప్రభుత్వం నుంచి సమాచారం అందకపోవడం, స్పష్టత లేకుండా సభ నిర్వహించడంపై నిరసన వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ఆ తర్వాత ఎస్సీ వర్గీకరణ చర్చలో పాల్గొన్నారు. సమగ్ర కుటుంబ సర్వే, ఎస్సీ వర్గీకరణపై సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీర్మానాలు ప్రవేశపెట్టగా సభ్యులు ఆమోదం తెలిపారు. -
కేంద్ర బడ్జెట్లో వైఎస్ జగన్ మార్క్?!
ఏపీలో గత ఐదేళ్లపాటు ప్రజా సంక్షేమమే పరమావధిగా పాలన కొనసాగింది. ఎక్కడా అవినీతి, లంచం ప్రస్తావన లేకుండా.. పారదర్శకమైన వ్యవస్థలతో నేరుగా అర్హులకే మేలు కలిగింది. ఆ టైంలో జగన్ పాలనపై దేశవ్యాప్త చర్చ నడవడగా.. ఇవాళ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లోనూ ఆయన మార్క్ కనిపించడం విశేషం.ఈసారి బడ్జెట్లో వచ్చే ఐదేళ్లకుగానూ ‘‘పేద, యువత, అన్నదాత, మహిళల.. అభివృద్ధి, సంక్షేమం’’ మీద దృష్టిసారించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇందుకోసం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినట్లు.. ప్రధాని నరేంద్ర మోదీ సైతం ప్రకటించుకున్నారు. అయితే ఈ అభివృద్ధి ఎలా ఉంటుందో సీఎంగా జగన్ తన పాలనలో చేసి చూపించారు. 👉వ్యవ‘సాయాని’కే తొలి ప్రాధాన్యమంటూ నిర్మలమ్మ ప్రసంగం పేర్కొంది. ఈక్రమంలో.. ప్రధాన మంత్రి ధాన్య కృషి యోజన కింద పంట ఉత్పత్తులను పెంచడంతోపాటు రైతులకు పలు రకాల సాయాలు అందిస్తామని కేంద్రం ప్రకటించింది. అలాగే వెనుకబడిన జిల్లాల్లో వ్యవసాయానికి ప్రోత్సాహం అందించే క్రమంలో.. గోదాములను ఏర్పాటు చేయిస్తామని ప్రకటించింది. ఇక.. జగన్ పాలనలో.. రైతు భరోసాతో పంట సాయం అందించడం, ఆర్బీకే సెంటర్లు.. ఆర్బీకే పరిధిలోని రైతన్నలకు వ్యవసాయ పనిముట్ల అందజేత, ఒకవేళ పంట నష్టం జరిగినా సత్వర పరిహారం లాంటి చర్యలు తీసుకున్నారు. దేశంలో వ్యవసాయంలో ముందంజలో ఉన్న రాష్ట్రాలు కూడా ఈ తరహా సంక్షేమాన్ని అందించలేకపోవడం గమనార్హం. 👉వైద్య విద్యను విస్తరించే క్రమంలో 10,000 అదనపు సీట్లు కేటాయిస్తున్నట్లు బడ్జెట్లో కేంద్రం ప్రకటించింది. అయితే.. దశాబ్దాల తర్వాత ఏపీలో ఏకంగా 17 కొత్త మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి వైద్య విద్యను ప్రొత్సహించారు వైఎస్ జగన్. అలాగే.. ప్రజారోగ్య భద్రత కోసం ఆరోగ్యశ్రీ పరిధిని విసర్తించడం, ఇంటికే వైద్యంలో భాగంగా విలేజ్.. ఫ్యామిలీ క్లినిక్ల ఏర్పాటు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 👉దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ తీసుకొస్తామని బడ్జెట్లో కేంద్రం ప్రకటించింది. 50వేల ప్రభుత్వ పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేయడంతో పాటు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ శిక్షణ కోసం ఏర్పాట్లు చేయాలనుకుంటోంది. కానీ, జగన్ హయాంలో.. నాడు-నేడుతో స్కూళ్లు కళకళలాడాయి. డిజిటల్ క్లాస్ రూంలతో కార్పొరేట్ బడులకు ఏమాత్రం తీసిపోకుండా తీర్చిదిద్దారాయన. అలాగే.. ఇంకోవైపు విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలతో విద్యార్థులను చదువును దూరం కాకుండా చూసుకోగలిగారు. 👉మహిళా సాధికారత కోసం కేంద్రం తరఫున రకరకాల పథకాలను ప్రవేశపెడతామని బడ్జెట్లో కేంద్రం ప్రకటించింది. అయితే పేద వర్గాలకు వైఎస్సార్ చేయూత, ఆసరా, ఇంకా వివిధ పథకాలతో జగన్ ప్రభుత్వం సాయం అందించింది తెలిసిందే. గ్రామ స్వరాజ్యం, ప్రజారోగ్యం, విద్యా రంగం, మహిళా సాధికారికత.. ఇలా దాదాపు కేంద్ర బడ్జెట్కు సంబంధించిన కీలక అంశాల్లో జగన్ మార్క్ స్పష్టంగా కనిపించిందనే అభిప్రాయం ఇప్పుడు వ్యక్తమవుతోంది. -
మా పథకాలతో రూ.25 వేల ఆదా: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఆప్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ఢిల్లీలోని ప్రతి కుటుంబానికి నెలకు రూ.25 వేల వరకు ఆదా అవుతోందని ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. మరోసారి తమకు అధికారమిస్తే అదనంగా రూ.10 వేలు ఆదా అయ్యేలా కొత్తగా పథకాలను తీసుకువస్తామని ప్రకటించారు. శుక్రవారం ఆయన ‘బచత్ పాత్ర’ప్రచారం ప్రారంభించి మాట్లాడారు. ఆప్ ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ఎంత మేరకు లబ్ధి కలుగుతుందో తెలుసుకునేందుకు తమ వలంటీర్లు ఇంటింటికీ వచ్చి ‘బచత్ పాత్ర’గురించి వివరిస్తారన్నారు. కొత్త పథకాల్లో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, మహిళా సమ్మాన్ యోజన, సంజీవని యోజన వంటివి ఉన్నాయని కేజ్రీవాల్ వివరించారు. ‘సామాన్యంగా బడ్జెట్తో ద్రవ్యోల్బణం, సామాన్యులపై ఏ మేరకు ప్రభావం చూపుతుంది వంటి అంశాలను తెలుపుతుంది. కానీ, ఢిల్లీ ఆప్ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబానికి అయ్యే ఆదాపైనే దృష్టి పెడుతుంది’అని అన్నారు. బీజేపీ ప్రభుత్వం మాత్రం సన్నిహితులైన వాణిజ్యవేత్తలకు ఎలాంటి ప్రయోజనాలను కల్పించాలని యోచిస్తోందని ఆరోపించారు. ముంబైలోని ధారావిలో మురికివాడల వాసుల భూమిని ఇప్పటికే తమ సంబంధీకులకు కట్టబెట్టిందని, ఢిల్లీలో కూడా భూముల్ని ఆక్రమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుందని విమర్శించారు. 70లో 60 సీట్లు మావే: ఆప్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు. వచ్చే 5న జరిగే ఎన్నికల్లో అసెంబ్లీలోని 70 స్థానాలకు 60 సీట్లను చేజిక్కించుకుంటుందని ఆయన చెప్పారు. బీజేపీ ఇప్పటికే ఓటమిని అంగీకరించిందని వ్యాఖ్యానించారు. ఢిల్లీలోని లక్ష్మీనగర్లో జరిగిన జనసభలో ఆయన మాట్లాడారు. -
అంతా మీ ఆశీర్వాదంతోనే..!
సాక్షి, హైదరాబాద్: నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతోనే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేయగలుగుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. రేవంత్ అన్నగా ప్రజలు ఆశీర్వదించడంతో ఏర్పడ్డ ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా నాలుగు కొత్త సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశం ఇచ్చారు. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలోని ఓ గ్రామంలో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలను ప్రభుత్వం ప్రారంభించింది. ఆయా గ్రామాల్లో అర్హులైన లబ్ధిదారులందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేయడంతో పాటు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా చెక్కులు విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన గ్రామసభల్లో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ గ్రామ సభల్లో తొలుత సీఎం వీడియో సందేశం ప్రదర్శించారు. మీ ఆశీర్వాదంతోనే సీఎంగా 13 నెలలు పూర్తిచేశా.. ‘మీ ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 13 నెలలు పూర్తి చేశా. రాష్ట్ర ప్రజలకిచ్చిన గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం. రైతు భరోసా, నిరుద్యోగ సమస్య పరిష్కారం, వరికి బోనస్ లాంటి వాటితో పాటు మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం, రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు, రూ.500కే గ్యాస్ సిలెండర్ అందిస్తూ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్రాన్ని చుట్టుముట్టిన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం. దళిత, గిరిజన ఆదివాసీలు, బలహీన వర్గాలు, మైనార్టీలు, మహిళలు, నిరుపేదలు.. ఇలా అన్ని వర్గాలను ఆదుకోవాలన్న లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది..’ అని సీఎం చెప్పారు. -
నాలుగు పథకాలకు ఏటా రూ.45 వేల కోట్లు
కొణిజర్ల: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన ఇందిరమ్మ ఇళ్లు, రేషన్కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయభరోసా, రైతుభరోసా పథకాలకు ఏటా రూ.45 వేల కోట్లు వెచ్చిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఖర్చుకు వెరవకుండా సంక్షేమ పథకాల అమలులో ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం చిన్నగోపతిలో ఆదివారం ఆయన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసి మాట్లాడారు. ఇటీవల గ్రామసభల్లో లక్షలాది దరఖాస్తులు అందగా, వాటిని క్రోడీకరించి ప్రతీ నిరుపేదకు లబ్ధి జరగాలనే లక్ష్యంగా రాష్ట్రంలోని 66 మండలాల్లో ఒక్కో గ్రామంలో లాంఛనంగా పథకాలు ప్రారంభించామని తెలిపారు. దీనిపై బురదజల్లే యత్నం చేస్తూ ‘ఎక్స్’లో పోస్టులు పెట్టిన మాజీమంత్రి కేటీఆర్ సంక్షేమ పథకాల ప్రవాహంలో కొట్టుకుపోవడం ఖాయమని చెప్పారు.గత పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేసి ఉంటే.. ఇప్పుడు త మకు పని ఉండేది కాదని భట్టి తెలిపారు. రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతీ నిరుపేదకు గూడు కల్పించే వరకు పథకం కొనసాగుతుందని, రాబోయే ఐదేళ్లలో మహిళలకు రూ.లక్ష కోట్ల రుణాలు ఇస్తామని భట్టి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ముజమ్మిల్ఖాన్, ఎమ్మెల్యే మాలోత్ రాందాస్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
రైతులకు.. కాంగ్రెస్ కు బలమైన అనుబంధం ఉంది: సీఎం రేవంత్
-
ప్రజా ప్రతినిధులే ఫైనల్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపికలో స్థానిక ప్రజాప్రతినిధులే కీలక పాత్ర పోషించనున్నారు. లబ్ధిదారులను అధికారులు ప్రాథమికంగా ఎంపిక చేసిన తర్వాత జిల్లాల ఇన్చార్జి మంత్రులు, ఎమ్మెల్యేల సిఫారసులతో తుది జాబితా సిద్ధం కానుంది. ఈ నెల 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకాల అమలు, కొత్త రేషన్కార్డుల జారీ ప్రక్రియ షురూ కానుంది. దీంతో గురువారం నుంచి దాదాపుగా అన్ని ప్రధాన ప్రభుత్వ శాఖలు రంగంలోకి దిగాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్లు ఇచ్చిన సూచనలతో అధికార యంత్రాంగం క్షేత్రస్థాయికి తరలివెళ్లింది. రెవెన్యూ, వ్యవసాయ శాఖ, పంచాయతీరాజ్, ఎంఏయూడీ, హౌసింగ్ విభాగాల అధికారులు, సిబ్బంది అర్హులను గుర్తించడంలో బిజీగా ఉన్నారు. ఈ ప్రక్రియ ఈనెల 20వ తేదీ వరకు కొనసాగనుంది. 21, 22 తేదీల్లో గ్రామ సభలు, పట్టణాల్లో వార్డు సభలు నిర్వహించనున్నారు. అర్హులు, అనర్హుల జాబితాను ఈ సభల్లో ప్రకటించే అవకాశం ఉంది. 23, 24 తేదీల్లో జిల్లా స్థాయిల్లో తుది జాబితా సిద్ధం కానుంది. తుది జాబితాను రూపొందించే క్రమంలో ప్రజా ప్రతినిధుల నిర్ణయం కీలకం కానుంది. స్థానికంగా ఉన్న రాజకీయ, సామాజిక అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ అర్హుల ఎంపికలో ఎమ్మెల్యేలు కీలక పాత్ర పోషించనున్నారు. ఎమ్మెల్యేల సిఫారసులతో తుదిరూపు దిద్దుకున్న జాబితా ఇన్చార్జి మంత్రి ఆమోదం తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి వెళుతుంది. ఆ జాబితా ప్రకారమే 26వ తేదీన లబ్ధిదారుల ప్రకటన ఉండే అవకాశం ఉందని అధికార వర్గాలు చెపుతున్నాయి. భూభారతిలోకి సాగు యోగ్యం కాని భూములు రైతుభరోసా పథకం కింద సీజన్కు రూ. 6,000 చొప్పున వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతుభరోసా అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో సాగు యోగ్యం కాని భూములను గుర్తించేందుకు ప్రస్తుతం ఫీల్డ్ సర్వే జరుగుతోంది. సాగు యోగ్యం కాని భూములను రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, మండల వ్యవసాయ విస్తరణాధికారులు పరిశీలించి, భూ భారతి పోర్టల్లో అప్లోడ్ చేస్తున్నారు. 20వ తేదీ వరకు ఈ ప్రక్రియ పూర్తి చేసి గ్రామసభల్లో నివేదిస్తారు. గ్రామసభల్లో వచ్చే విజ్ఞాపనల ఆధారంగా స్థానిక ఎమ్మెల్యే ఆమోదంతోనే అధికారులు తుది నిర్ణయం తీసుకోనున్నారు. రేషన్కార్డు ఆధారంగా కుటుంబం గుర్తింపు గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీలుగా నమోదై ఉండి సంవత్సరంలో కనీసం 20 రోజుల పాటు వ్యవసాయ కూలీగా పనిచేసిన వారి కుటుంబాలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి అర్హులని ప్రభుత్వం పేర్కొంది. ఒక కుటుంబంలో ఎంత మంది కూలీలు ఉన్నా, ఆ కుటుంబం మొత్తానికి కలిపి ఒక్కో సీజన్కు రూ.6 వేల చొప్పున రెండు సీజన్లకు ఏటా రూ.12 వేలు ఈ పథకం కింద చెల్లించనున్నారు. ఈ మేరకు అర్హత కలిగిన కుటుంబాలను గుర్తించే పనిలో అధికారులున్నారు. అయితే కుటుంబాన్ని నిర్ధారించేందుకు రేషన్కార్డునే ప్రామాణికంగా తీసుకోనున్నట్లు తెలిసింది. అయితే రేషన్కార్డులు గత కొన్నేళ్లుగా అప్డేట్ కాకపోవడంతో కుటుంబంలోని వారికి పెళ్లిళ్లై, వేర్వేరు కుటుంబాల్లో నివసించే పక్షంలో వారిని గుర్తించడంలో గ్రామసభలు కీలకం కానున్నాయి. ఇక్కడ వచ్చిన ఫిర్యాదులు, సూచనలను కూడా స్థానిక ఎమ్మెల్యేల దృష్టికే తీసుకెళ్లి తుది నిర్ణయం తీసుకోనున్నారు. అర్హులందరికీ రేషన్కార్డులు! ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కుటుంబ సర్వేలో ఏ కుటుంబానికి రేషన్కార్డు లేదనేది సిబ్బంది నమోదు చేశారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 20 లక్షల కుటుంబాలు కొత్త రేషన్కార్డుల కోసం ఎదురు చూస్తుండగా, కార్డుల్లో పేర్ల చేర్పుల కోసం లక్షలాది మంది వెయిటింగ్లో ఉన్నారు. ఎమ్మెల్యేలకు రేషన్కార్డుల అంశం కీలకం కాబట్టి అర్హులైన వారందరికీ ఇప్పించేందుకు ప్రయత్నించే అవకాశం ఉందని ఓ ప్రజా ప్రతినిధి పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్లతోనే తిప్పలు నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రతి నియోజకవర్గంలో కొత్తగా ఇళ్ల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా ఇప్పటికే ఫీల్డ్ సర్వే కూడా పూర్తయింది. లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంది. కాగా ఒక్కో గ్రామం నుంచి ఎంతమంది లబ్ధిదారులను ఎంపిక చేస్తారనేదే ప్రధాన సమస్యగా మారనుంది. ఇప్పటికే సొంత స్థలం ఉన్న వారికి తొలి ప్రాధాన్యత అని ప్రభుత్వం చెప్పడంతో ఎమ్మెల్యే విచక్షణ మేరకు ఆయా నియోజకవర్గాల్లో లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
Telangana: సర్కారు నిధుల వేట!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పథకాలకు అవసరమయ్యే నిధులను అన్వేషించే పనిలో ఆర్థిక శాఖ పడింది. ఆయా పథకాల అమలు కోసం తక్షణమే ఎన్ని నిధులు అవసరం? ఏ నెలలో ఎన్ని నిధులు ఇవ్వాల్సి ఉంటుంది? వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఎంత ప్రతిపాదించాల్సి ఉంటుంది? ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలు, జీతాలు, పింఛన్లకు తోడు కొత్త పథకాలకు కలిపి నిధుల సమీకరణ ఎలా? రిజర్వు బ్యాంకు ద్వారా బహిరంగ మార్కెట్లో రుణాలు ఏ మేరకు సాధ్యమవుతాయనే లెక్కలు వేసుకుంటోంది. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలతోపాటు దశల వారీగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, కొత్త రేషన్కార్డుల జారీతో పెరిగే సబ్సిడీ వ్యయం కలిపి తక్షణమే రూ.10 వేల కోట్లు అవసరమని ఆర్థిక శాఖ అధికారులు తేల్చారు. ఈ నిధులు సర్దుబాటు చేసే పనిలో నిమగ్నమయ్యారు. రాబడులకు తోడు అప్పులతో.. పథకాల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి నెలా వస్తున్న రాబడులకు తోడు గణనీయంగానే అప్పులు చేయాల్సి వస్తోంది. ప్రస్తుతం నెలకు రూ.11 వేల కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వానికి సొంత ఆదాయం సమకూరుతోంది. వచ్చే మూడు నెలల్లో అదనంగా నెలకు మరో రూ.2వేల కోట్ల వరకు వస్తాయని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. మరోవైపు రూ.30 వేల కోట్లు బహిరంగ మార్కెట్ రుణాలను రిజర్వు బ్యాంకు ద్వారా సేకరించనుంది. ఈ మేరకు జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో ప్రతి నెలా రూ.10 వేల కోట్ల చొప్పున కావాలని ఆర్బీఐకి ఇండెంట్ కూడా పెట్టింది. మొత్తంగా సమకూరే నిధుల నుంచి ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పింఛన్లు, సామాజిక పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాలు, రెవెన్యూ ఖర్చుతోపాటు రుణ వాయిదాలను చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఖర్చులన్నింటినీ సర్దుబాటు చేసుకుంటూనే కొత్త పథకాలకు నిధులను సమకూర్చడంపై ఆర్థిక శాఖ దృష్టి పెట్టింది. ఇప్పటికే గత రెండు నెలలుగా పెద్ద పెద్ద బిల్లుల చెల్లింపును నిలిపివేసినట్టు తెలిసింది. వచ్చే మూడు నెలలు కూడా ఇదే పద్ధతిని అవలంబిస్తామని, ప్రస్తుతానికి నిధుల లోటు లేకుండా సర్దుబాటు చేస్తామని ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఎలాంటి ప్రణాళికతో వెళ్లాలన్న దానిపై రూట్ మ్యాప్ సిద్ధమైందని వెల్లడించారు.మొత్తంగా రూ.45 వేల కోట్ల దాకా...ఈ నెల 26వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ప్రారంభించబోతోంది. రైతు భరోసా కింద రాష్ట్రంలోని సుమారు 70లక్షల మంది రైతులకు ఎకరానికి రూ.6 వేల చొప్పున రూ.8,200 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని అంచనా. ఇక భూమి లేని పేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద తొలి విడత సాయంగా రూ.6 వేల చొప్పున ఇచ్చేందుకు మరో రూ.600 కోట్లు అవసరమని భావిస్తున్నారు. ఈ పథకం కింద 10 లక్షల మంది రైతు కూలీలు లబ్ధిపొందుతారని అంచనా. ఈ రెండు పథకాలకు ఈనెల 31లోపు నిధులు వెచ్చించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రూ.8,800 కోట్లను ఖజానాకు సమకూర్చడం కోసం ఆర్థిక శాఖ రెండు నెలలుగా కార్యాచరణ అమలు చేస్తోంది. ⇒ మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేలోపు గ్రామ పంచాయతీల్లో పనులు చేసిన మాజీ సర్పంచ్లకు చెల్లించాల్సిన రూ.10లక్షలలోపు బిల్లులను చెల్లించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇవి సుమారు రూ.800 కోట్ల వరకు ఉంటాయని అంచనా. ⇒ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం (తొలి విడతలో స్థలమున్న పేదలకు రూ.5 లక్షల సాయం) కోసం ఒక్క ఆర్థిక సంవత్సరంలో రూ.20 వేల కోట్లకుపైగా అవసరమని భావిస్తున్నారు. దశల వారీగా ఈ నిధులు విడుదల చేసే నేపథ్యంలో... ఏ నెలలో ఎంత అవసరమన్న దానిపైనా ఆర్థిక శాఖ లెక్కలు వేసుకుంటోంది. ⇒ ఇక జనవరి 26 నుంచే కొత్త రేషన్కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆ కార్డుల జారీ పూర్తయ్యాక మార్చి నెల నుంచి రేషన్షాపుల్లో సన్నబియ్యం పథకాన్ని అమలు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 90లక్షల వరకు రేషన్కార్డులు ఉండగా.. మరో 10లక్షల వరకు కొత్తవి జారీ చేసే అవకాశం ఉందని పౌరసరఫరాల శాఖ అంచనా వేస్తోంది. మొత్తమ్మీద కోటి కార్డులకు గాను ఒక్కొక్కరికి 6 కేజీల చొప్పున సన్నబియ్యం ఇచ్చేందుకు గణనీయంగా నిధులు కావాలి. ⇒ మొత్తంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (జనవరి నుంచి మార్చి నెలాఖరు)లోనే రూ.45 వేల కోట్లు కావాలని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు నిధులు సమకూర్చుకోవడంపై దృష్టిపెట్టినట్టు వివరిస్తున్నారు. -
భార్యకే పెన్షన్.. భర్తకు టెన్షన్!
సాక్షి, అమరావతి: దంపతులంటే..? జీవిత భాగస్వాములంటే..? భార్యాభర్తలు కాదా? వైవాహిక బంధానికి కూటమి సర్కారు కొత్త భాష్యం చెబుతోంది! పేదల పింఛన్ల విషయంలో చిత్ర విచిత్ర నిబంధనలు పెడుతోంది. పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు మనసొప్పని సీఎం చంద్రబాబు ప్రభుత్వం మరణించిన పింఛన్దారుల పట్ల మానవత్వం లేకుండా వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఎడాపెడా పింఛన్లకు కోత పెడుతూ.. అసలు కొత్త వాటి ఊసే లేకుండా చేసింది. ఆర్నెల్లలో దాదాపు 1.72 లక్షల పింఛన్లు తగ్గిపోయాయి. మరోవైపు లక్షలాది దివ్యాంగ పింఛన్లపై ఏరివేతల కత్తి వేలాడుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన రోజు నుంచి కొత్త పింఛన్ల మంజూరు కోసం కనీసం దరఖాస్తులు కూడా స్వీకరించడం లేదు. ఇప్పటికే పింఛన్ పొందుతున్న కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే ఆ కుటుంబంలో కొత్తగా మరొకరికి పెన్షన్ ఇచ్చే విషయంలో వింత విధానాలను అమలు చేస్తోంది. పింఛన్ తీసుకుంటున్న భర్త చనిపోతే స్పౌజ్ కేటగిరీలో కేవలం భార్యకు మాత్రమే ఆ స్థానంలో పెన్షన్ మంజూరు చేసే విధానాన్ని అమలు చేస్తోంది. స్పౌజ్ అంటేనే భార్యా భర్తలని అర్థం! కానీ ఆ పదానికే అర్థం మార్చేసింది. ప్రభుత్వం అమలు చేస్తున్న ఒక ఇంటికి ఒకే పింఛను విధానం ప్రకారం... ఎక్కడైనా భార్య చనిపోయి, ఆ కుటుంబంలో భర్త ఇప్పటికీ పింఛను పొందని పరిస్థితి ఉంటే... 70–80 ఏళ్ల వయసులోనూ స్పౌజ్ కేటగిరీలో పెన్షన్ మంజూరు కాని దుస్థితి నెలకొంది. గత ప్రభుత్వ హయాంలో పింఛన్ల కోసం అర్హులకు ఏడాది పొడవునా సచివాలయాల్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించగా, ఇప్పుడా ఆస్కారమే లేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక 2లక్షల మంది కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకుని పడిగాపులు కాస్తున్నా కనికరించడం లేదు. ప్రస్తుతం ఫించన్ తీసుకుంటూ కుటుంబంలో భర్త చనిపోతే అతని భార్యకు మాత్రమే కొత్త పింఛన్ మంజూరు చేసేలా జారీ చేసిన సర్క్యులర్ ఇది. అది కూడా నవంబర్ 1 తర్వాత చనిపోయిన వారికే వర్తించేలా.. 23 వేల మంది చనిపోతే.. ఐదు వేల మందికే! కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతేడాది నవంబరు 1 నుంచి డిసెంబరు 15 మధ్య పింఛను లబ్ధిదారుల్లో దాదాపు 23 వేల మంది చనిపోగా స్పౌజ్ కేటగిరీలో కేవలం 5,401 మందికి మాత్రమే లబ్ధి చేకూరింది. వీరికి డిసెంబరులో పింఛన్లు మంజూరు కాగా నెలాఖరులో తొలి పింఛన్ డబ్బులు పంపిణీ చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జూన్ 12వ తేదీ నుంచి నవంబరు 1కి ముందు వరకు దాదాపు నాలుగున్నర నెలల వ్యవధిలో భర్తలు మృతి చెందిన పింఛన్ లబ్ధిదారుల కుటుంబాల్లో వారి భార్యలకు మాత్రం పెన్షన్లు మంజూరు చేయలేదు. 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామంటూ.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 ఏళ్లకే నెలకు రూ.నాలుగు వేల పింఛన్ ఇస్తామంటూ టీడీపీ – జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో హామీలిచ్చాయి. 50 ఏళ్లకే పింఛను దేవుడెరుగు.. కూటమి సర్కారు వచ్చాక ఉన్న పెన్షన్లే ఊడగొడుతున్నారని లబ్ధిదారులు ఆక్రోశిస్తున్నారు. ఎడాపెడా కోతలు.. ఒకవైపు కొత్తగా పింఛన్ల కోసం ఏ ఒక్కరూ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లేకుండా చేసిన చంద్రబాబు సర్కార్ మరోవైపు ఎడాపెడా పెన్షన్లు ఏరివేస్తూ పింఛన్దారులను హడలెత్తిస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి రాష్ట్రంలో ప్రతి నెలా పింఛన్ల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తోంది. గత ఆర్నెల్లలో ఏకంగా 1,71,921 పింఛన్లను తగ్గించేసింది. గతేడాది మే నెలలో 65,49,864 మందికి పింఛన్ల పంపిణీ జరగగా, గత డిసెంబరు 31న కూటమి ప్రభుత్వం కేవలం 63,77,943 మందికి మాత్రమే పింఛన్ల డబ్బులు విడుదల చేసిన విషయం తెలిసిందే.పింఛన్లకు మరింత భారీగా కోతలు పెట్టేందుకు పక్షవాత బాధితులు, దివ్యాంగులు అని కూడా చూడకుండా దీర్ఘకాలిక జబ్బుల రోగులకు శల్య పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ కేటగిరీలో పింఛన్లు పొందుతున్న 8.18 లక్షల మంది లబ్ధిదారులు తిరిగి వైద్య పరీక్షలకు హాజరై సర్టిఫికెట్లు మళ్లీ సమర్పించాలంటూ వారిపై కత్తి వేలాడదీసింది. ‘రియల్’ సీన్ ఇదీ.. గత ఐదేళ్లపాటు కోవిడ్ సమయంలోనూ ప్రతి నెలా లబ్ధిదారుల ఇంటి వద్దనే సజావుగా కొనసాగిన పింఛన్ల పంపిణీకి కూటమి ప్రభుత్వం రాగానే తూట్లు పొడిచింది. ఏళ్ల తరబడి పింఛన్లు తీసుకుంటున్న వారికి అనర్హత నోటీసులిస్తూ నిద్ర లేకుండా చేస్తోంది. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన రియల్టైం గవర్నెన్స్ (ఆర్టీజీఎస్) సర్వేలో 12.7 శాతం మంది లబ్ధిదారులు తమకు ఇంటి వద్ద పెన్షన్లు అందడం లేదని వెల్లడించడం గమనార్హం. మరోవైపు పింఛన్ల పంపిణీలో అవినీతి జరుగుతున్నట్టు ఆరు శాతం మంది లబ్ధిదారులు తెలిపారు.నాడు నిరంతరం.. సంతృప్త స్థాయిలో..వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఉండగా పింఛను మొత్తాన్ని పెంచడంతో పాటు వృద్ధాప్య పింఛను కనీస అర్హత వయసును 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించి పెద్ద సంఖ్యలో లబ్ధి చేకూర్చింది. అర్హులందరికీ సంతృప్త స్థాయిలో నిరంతరం కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది. గత ఐదేళ్ల పాటు కొత్తగా పింఛనుకు అర్హత పొందే ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు దరఖాస్తు చేసుకునేందుకు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. వలంటీర్లే అర్హత ఉన్న ప్రతి ఒక్కరి ఇంటికీ వెళ్లి దరఖాస్తులు స్వీకరించి కొత్తవి మంజూరు చేయించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక 60 ఏళ్ల దాటిన వారు సైతం కొత్తగా పింఛనుకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లేకుండా సచివాలయాల్లో ఆ సేవలను నిలిపివేసింది. ఎన్నికల ముందు రాష్ట్రవ్యాప్తంగా కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న దాదాపు రెండు లక్షలకు పైగా అర్జీలను కూడా కూటమి ప్రభుత్వం మూలన పడేసింది. -
మరీ ఇంత ద్రోహమా? ఇంత బరితెగింపా?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి : ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో అలసత్వం, నిర్లక్ష్యం, ఎగవేత ధోరణి ప్రదర్శిస్తున్న కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తాజాగా తల్లికి వందనం ఎగవేతపై కూటమి సర్కార్ను నిలదీశారు. లక్షలాది మంది తల్లులు, పిల్లలు.. అన్నదాతలంటే మీకు అలుసా.. అని ప్రశ్నించారు. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేయడం, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కడం మీకు అలవాటుగా మారిపోయిందని నిప్పులు చెరిగారు. ఈ మేరకు శనివారం ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.⇒ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలపై ఇంతటి బరితెగింపా? మేనిఫెస్టోపై ఇంతటి తేలిక తనమా? ప్రజలకు ఇచ్చిన మాటను అమలు చేయకుండా టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకుంటారా? లక్షల మంది తల్లులకు, పిల్లలకు, రైతులకు ఇంతటి ద్రోహం తలపెడతారా?⇒ అధికారంలోకి వస్తే తల్లికి వందనం అని, ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ ఏడాదికి రూ.15 వేలు చొప్పున ఇస్తామన్నారు. అధికారంలోకి రాగానే అంతకు ముందు మేం ఇస్తున్న అమ్మ ఒడి పథకాన్ని సైతం ఆపేశారు. వరుసగా కేబినెట్ సమావేశాలు జరుగుతున్నాయి కానీ, తల్లికి వందనం పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారో నిర్దిష్టంగా చెప్పలేదు. తీరా ఈ ఏడాదికి ఇవ్వం అని కేబినెట్లో తేల్చి చెప్పేశారు. ఇంతకన్నా మోసం ఏమైనా ఉంటుందా? ఇంతకన్నా పచ్చి దగా ఏమైనా ఉంటుందా?⇒ చంద్రబాబు గారూ.. ఎన్నికల వేళ మీరు, మీ కూటమి నాయకులు రాష్ట్రంలోని ప్రతి చోటా తల్లికి వందనంపై చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. ఇంటింటికీ తిరిగి కనిపించిన ప్రతి పిల్లాడినీ పట్టుకుని నీకు రూ.15 వేలు.. నీకు రూ.15వేలు.. నీకు రూ.15వేలు అన్నారు. ఇద్దరుంటే రూ.30 వేలు ఇస్తామన్నారు. ముగ్గురుంటే రూ.45 వేలు ఇస్తామన్నారు. నలుగురు ఉంటే రూ.60 వేలు ఇస్తామన్నారు. ప్రజలకు మీరు చేసిన వాగ్దానం, మీరు చెప్పిన మాటలు ఆడియో, వీడియోల రూపంలో సాక్ష్యాధారాలుగా ప్రతి ఒక్కరి సెల్ఫోన్లో ఉన్నాయి.వైఎస్సార్సీపీ హయాంలో 44.48 లక్షల మంది తల్లులకు, దాదాపు 84 లక్షల మంది పిల్లలకు రూ.26,067 కోట్లను మేము అందించి, అత్యంత విజయవంతంగా అమలు చేసిన అమ్మ ఒడిని ఆపేసినా, మీరు ఇస్తామన్న పథకం వస్తుందేమోనని బడికి వెళ్లే ఆ పిల్లలు, వారి తల్లులు ఏడెనిమిది నెలలుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. చివరకు వారి ఆశలపై నీళ్లు జల్లి, ఈ ఏడాది ఇవ్వం అని నిస్సిగ్గుగా చెబుతున్నారు. ప్రజలకు ఒక మాట ఇచ్చి, దాన్ని నమ్మించి, వారి ద్వారా అధికారాన్ని తీసుకుని, ఇప్పుడు ఇవ్వలేమంటూ ఎలాంటి సంకోచం లేకుండా చెబుతున్నారు. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేయడం, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కడం మీకు అలవాటుగా మారిపోయింది.⇒ ఇక రైతు భరోసా తీరు కూడా అలానే ఉంది. ఈ ఏడాది ఖరీఫ్, రబీ రెండు సీజన్లు అయిపోతున్నా ఇవ్వకుండా గడిపేశారు. అదిగో, ఇదిగో అంటూ లీకులు ఇస్తున్నారు కానీ, ఇప్పటి వరకు రైతులకు పెట్టుబడి సహాయం కింద ఒక్కపైసా ఇవ్వలేదు. మేము అధికారంలోకి వచ్చిన ఆ ఏడాదే.. అంటే 2019 అక్టోబర్లో ప్రారంభించి నప్పటి నుంచి క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం రూ.13,500 చొప్పున 53.58 లక్షల మంది రైతుల చేతిలో, రూ.34,378 కోట్లు పెట్టాం. కేంద్రం ఇచ్చేది కాకుండా మీరు ఏడాదికి రూ.20 వేలు ఇస్తామన్నారు.ఇప్పుడు ఖరీఫ్ అయిపోయిందీ, రబీ కూడా అయిపోయింది. ఒక్క పైసా ఇవ్వలేదు. ఇన్ని కేబినెట్ మీటింగ్లు పెట్టుకున్నాం ఎప్పుడు ఇస్తారో చెప్పడం లేదు. ఇది రైతులను నిలువెల్లా మోసం చేయడం కాదా? రైతులకు పెట్టుబడి సహాయం లేదు.. కనీస మద్దతు ధరా అందడం లేదు.. ఉన్న ఉచిత పంటల బీమాను కూడా రద్దు చేశారు.. ఆర్బీకేలను సైతం నిర్వీర్యం చేశారు. సంక్షోభంలో ఎవరైనా రైతులు దురదృష్టవశాత్తు ఆత్మహత్య చేసుకుంటే కనీసం ఆ కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందడం లేదు కదా, కనీసం పరామర్శకు కూడా నోచుకోవడం లేదు. ⇒ ప్రతి పిల్లాడికి రూ.15 వేలు చొప్పున ఎంత మంది పిల్లలు ఉంటే, అంత మందికీ ఇస్తామన్న తల్లికి వందనం మోసమే. రైతులకు పెట్టుబడి సాయంగా రూ.20 వేలు ఇస్తామన్నదీ మోసమే. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకూ రూ.18 వేలు ఇస్తామన్నదీ మోసమే. నిరుద్యోగ భృతి కింద యువతీ యువకులకు రూ.36 వేలు చొప్పున ఇస్తామన్నది కూడా మోసమే. 50 సంవత్సరాలు నిండిన ప్రతి అక్కకూ రూ.48 వేలు అయినా మోసమే. ఇంటింటికీ సేవలు అందిస్తూ మంచికి అర్థం చెప్పిన వలంటీర్లకూ మీరు చేసింది మోసమే. ఈ మోసాలు అన్నింటికీ తోడు, మీ పాలనలో ప్రజలపై ఛార్జీలతో బాదుడే బాదుడు కనిపిస్తోంది. ప్రతి అడుగులోనూ స్కామ్లే. ఇసుకను వదలడం లేదు, మద్యాన్నీ వదలడం లేదు. ⇒ చంద్రబాబూ గారూ.. రోజులు గడుస్తున్న కొద్దీ, మీరు చేస్తున్న మోసాలు ఒక్కొక్కటీ బయటకు వస్తూనే ఉన్నాయి. ఇవి ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీస్తున్నాయి. ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి, వారి గొంతుకై నిలుస్తోంది. ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానాల అమలు కోసం వారి తరఫున నిలబడుతుంది. -
‘చంద్రబాబుగారూ.. ఇంతటి బరితెగింపా?’
గుంటూరు, సాక్షి: హామీల అమలులో అలసత్వం.. నిర్లక్ష్యం.. ఎగవేత ధోరణి ప్రదర్శిస్తున్న కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) ధ్వజమెత్తారు. తాజాగా తల్లికి వందనం ఎగవేత కూటమి సర్కార్ను నిలదీస్తూ ఎక్స్ ఖాతాలో ఆయన సుదీర్ఘంగా ఓ సందేశం ఉంచారు. ‘‘ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలపై ఇంతటి బరితెగింపా? మేనిఫెస్టోపై ఇంతటి తేలిక తనమా? ప్రజలకు ఇచ్చిన మాటను అమలు చేయకుండా టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకుంటారా? లక్షలమంది తల్లులకు, పిల్లలకు, రైతులకు ఇంతటి ద్రోహం తలపెడతారా?. అధికారంలోకి వస్తే తల్లికి వందనం అని, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ ఏడాదికి రూ.15వేలు చొప్పున ఇస్తామన్నారు, అధికారంలోకి రాగానే అంతకుముందు మేం ఇస్తున్న అమ్మ ఒడి పథకాన్ని సైతం ఆపేశారు... వరుసగా కేబినెట్(Cabinet) సమావేశాలు జరుగుతున్నాయి కాని, తల్లికి వందనం పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారో నిర్దిష్టంగా చెప్పలేదు. తీరా ఈ ఏడాదికి ఇవ్వమని కేబినెట్లో తేల్చిచెప్పేశారు. ఇంతకన్నా మోసం ఏమైనా ఉంటుందా? ఇంతకన్నా పచ్చి దగా ఏమైనా ఉంటుందా?. చంద్రబాబుగారూ… ఎన్నికల వేళ మీరు, మీ కూటమి నాయకులు రాష్ట్రంలోని ప్రతిచోటా తల్లికి వందనంపై చేసిన ప్రచారం అంతా ఇంతాకాదు. ఇంటింటికీ తిరిగి కనిపించిన ప్రతి పిల్లాడినీ పట్టుకుని నీకు రూ.15వేలు, నీకు రూ.15వేలు, నీకు రూ.15వేలు అన్నారు. ఇద్దరుంటే రూ.30వేలు ఇస్తామన్నారు, ముగ్గురు ఉంటే రూ.45వేలు ఇస్తామన్నారు. నలుగురు ఉంటే రూ.60వేలు ఇస్తామన్నారు. ప్రజలకు మీరుచేసిన వాగ్దానం, మీరు చెప్పిన మాటలు ఆడియో, వీడియోల రూపంలో సాక్ష్యాధారాలుగా ప్రతిఒక్కరి సెల్ఫోన్లో ఉన్నాయి. వైఎస్సార్సీపీ(YSRCP) హయాంలో 44.48 లక్షల మంది తల్లులకు, దాదాపు 84 లక్షల మంది పిల్లలకు, రూ.26,067 కోట్లను మేము అందించి, అత్యంత విజయవంతంగా అమలుచేసిన అమ్మ ఒడిని ఆపేసినా, మీరు ఇస్తామన్న పథకం వస్తుందేమోనని బడికి వెళ్లే ఆ పిల్లలు, వారి తల్లులు ఈ 7-8నెలలుగా ఎదురుచూస్తూనే ఉన్నారు. చివరకు వారి ఆశలపై నీళ్లు జల్లి, ఈ ఏడాది ఇవ్వమని నిస్సిగ్గుగా చెప్తున్నారు. ప్రజలకు ఒక మాట ఇచ్చి, దాన్ని నమ్మించి, వారి ద్వారా అధికారాన్ని తీసుకుని, ఇప్పుడు ఇవ్వలేమంటూ ఎలాంటి సంకోచంలేకుండా చెప్తున్నారు. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేయడం, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కడం మీకు అలవాటుగా మారిపోయింది చంద్రబాబుగారూ…?.. ఇక రైతు భరోసా(Rythu Bharosa) తీరు కూడా అలానే ఉంది. ఈ ఏడాది ఖరీఫ్, రబీ రెండు సీజన్లు అయిపోతున్నా ఇవ్వకుండా గడిపేశారు. అదిగో, ఇదిగో అంటూ లీకులు ఇస్తున్నారు కాని, ఇప్పటివరకూ రైతులకు పెట్టుబడి సహాయం కింద ఒక్కపైసా ఇవ్వలేదు. అధికారంలోకి వచ్చిన ఆ ఏడాదే 2019 అక్టోబరులో ప్రారంభమై, అప్పటినుంచి క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం రూ.13,500 చొప్పున 53.58 లక్షల రైతుల చేతిలో, రూ.34,378కోట్లు మేము పెట్టాం. కేంద్రం ఇచ్చేది కాకుండా మీరు ఏడాదికి రూ.20వేలు ఇస్తామన్నారు. ఇప్పుడు ఖరీఫ్ అయిపోయిందీ, రబీకూడా అయిపోయింది. ఒక్కపైసా ఇవ్వలేదు. ఇన్ని కేబినెట్ మీటింగ్లు పెట్టుకున్నా… ఎప్పుడు ఇస్తామో చెప్పడంలేదు. ఇది రైతులను నిలువెల్లా మోసం చేయడం కాదా? రైతులకు పెట్టుబడి సహాయం లేదు, కనీస మద్దతు ధరా అందడంలేదు, ఉన్న ఉచిత పంటలబీమాను రద్దుచేశారు, ఆర్బీకేలను నిర్వీర్యంచేశారు. సంక్షోభంలో ఎవరైనా రైతులు దురదృష్టవశాత్తూ ఆత్మహత్య చేసుకుంటే కనీసం ఆ కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందడంలేదుకదా, కనీసం పరామర్శకు కూడా నోచుకోవడం లేదు... ప్రతి పిల్లాడికి రూ.15వేలు చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే, అంతమందికీ అన్న తల్లికి వందనం అయినా మోసమే, రైతులకు పెట్టుబడి సాయంగా రూ.20వేలు ఇస్తామన్నదీ మోసమే, 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకూ రూ.18వేలు అయినా మోసమే, నిరుద్యోగభృతి కింద ప్రతి పిల్లాడికీ రూ.36వేలు అయినా మోసమే, 50 సంవత్సరాలు నిండిన ప్రతి అక్కకూ రూ.48వేలు అయినా మోసమే, ఇంటింటికీ సేవలు అందిస్తూ మంచికి అర్థం చెప్పిన వాలంటీర్లకూ మీరు చేసింది మోసమే, ఈ మోసాలు అన్నింటికీ తోడు, మీ పాలనలో ప్రజలపై ఛార్జీలతో బాదుడే బాదుడు కనిపిస్తోంది. ప్రతి అడుగులోనూ స్కాంలే. ఇసుకను వదలడంలేదు, మద్యాన్ని వదలడంలేదు. చంద్రబాబుగారూ.. రోజులు గడుస్తున్నకొద్దీ, మీరు చేస్తున్న మోసాలు ఒక్కొక్కటీ బయటకు వస్తూనే ఉన్నాయి. ఇవి ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీస్తున్నాయి. ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి, వారి గొంతుకై నిలుస్తుంది. ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానాల అమలుకోసం వారి తరఫున నిలబడుతుంది’’ అని పేర్కొన్నారాయన. చదవండి👉: బలవంతంగా ఏపీ రాజకీయాలను అందులో ఇరికించారా? -
ఫార్మర్ రిజిస్ట్రీ తయారీకి రంగం సిద్ధం
సాక్షి, అమరావతి: వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజేషన్ చేయాలన్న సంకల్పంతో దేశవ్యాప్తంగా చేపట్టిన ఫార్మర్ రిజిస్ట్రీ తయారీకి రాష్ట్రంలోనూ రంగం సిద్ధమైంది. ఇందులో ఆధార్ తరహాలోనే ప్రతి రైతుకు 14 నంబర్లతో విశిష్ట గుర్తింపు సంఖ్య (యూనిక్ కోడ్) కేటాయించనున్నారు. తొలి దశలో దేశవ్యాప్తంగా 5 కోట్ల మంది భూ యజమానులకు యూసీ జారీ చేయనున్నారు. ఏపీలో మాత్రం భూ యజమానులతో పాటు కౌలుదారులకు కూడా యూసీలు జారీ చేస్తారు. ఇప్పటికే రాష్ట్రంలోని కొన్ని గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టు చేపట్టగా, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రీ తయారీకి ఏర్పాట్లు చేస్తున్నారు. అగ్రి సెన్సస్–2019 ప్రకారం రాష్ట్రంలో 76.07 లక్షల మంది రైతులు ఉన్నారు. వారిలో పీఎం కిసాన్ పథకం లబ్ధిదారులు 41.84 లక్షల మంది ఉన్నారు. కౌలు రైతులు 16.50 లక్షల మంది ఉన్నారు. వీరిలో సెంటు భూమి కూడా లేని కౌలుదారులు 8 నుంచి 10 లక్షల మంది ఉండగా, దేవాదాయ, అటవీ భూముల సాగుదారులు 1.50 లక్షల మందికి పైగా ఉన్నారు. వీరందరికీ ఫార్మర్ రిజిస్ట్రీలో యూసీలు జారీ చేస్తారు.ప్రాజెక్టు నిర్వహణ, స్టీరింగ్, అమలు కమిటీలు ఏర్పాటుజాతీయ డిజిటల్ అగ్రికల్చర్ మిషన్– అగ్రిస్టాక్ ప్రాజెక్టు పేరిట కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఎస్.ఢిల్లీరావు నేతృత్వంలో స్టేట్ ప్రాజెక్టు మేనేజ్మెంట్ యూనిట్ (ఎస్పీఎంయూ) ఏర్పాటు చేశారు. తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ నేతృత్వంలో స్టీరింగ్ కమిటీ, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్ నేతృత్వంలో అమలు కమిటీ గురువారం ఏర్పాటయ్యాయి. మాస్టర్ ట్రైనీస్కు గురువారం నుంచి 3 రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు.26న నుంచి నమోదుఈ నెల 23న రాష్ట్ర స్థాయిలో అధికారికంగా ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తారు. రైతు సేవా కేంద్రాల ద్వారా 24న ప్రాజెక్టు పోస్టర్లు, కరపత్రాలు పంపిణీ చేస్తారు. 26 నుంచి రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు విశిష్ట గుర్తింపు సంఖ్య జారీ ప్రారంభమవుతుంది. ముందుగా జనవరి 21వ తేదీలోగా పీఎం కిసాన్ లబ్ధిదారులకు వీటిని జారీ చేస్తారు. ఆ తర్వాత మిగిలిన రైతులు, కౌలు రైతులకు ఇస్తారు. ఈ ప్రాజెక్టు కోసం కేంద్రం రూపొందించిన అప్లికేషన్ ద్వారా తొలుత ఆర్ఎస్కే సిబ్బంది వెబ్ల్యాండ్ డేటా ఆధారంగా రైతుల వివరాలను ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసి యూసీలు కేటాయిస్తారు. వాటిని తహసీల్దార్లు అప్రూవ్ చేస్తారు. రైతులు లేవనెత్తే అభ్యంతరాలను మండల వ్యవసాయ శాఖాధికారులు పరిష్కరిస్తారు. జిల్లాలు, మండలాలు, గ్రామాల వారీగా రైతుల రిజిస్ట్రీని రూపొందిస్తారు.ఎన్నో ప్రయోజనాలు..యూనిక్ కోడ్తో రైతులకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. సబ్సిడీలు, రుణాలు, పంటల బీమా వంటి పథకాలను ఈ కోడ్తో అనుసంధానం చేస్తారు. ఫార్మర్ రిజిస్ట్రీని యూనిఫైడ్ ల్యాండ్ ఏపీఐ, ఆధార్ బేస్డ్ అథంటికేషన్, పీఏం కిసాన్ వంటి డిజిటల్ అగ్రికల్చర్ ప్లాట్ఫామ్స్కు సైతం అనుసంధానం చేస్తారు. కౌలు రైతులతో పాటు భూమి లేని కూలీలకు సైతం ఆధార్ నంబర్ల ఆధారంగా రిజిస్ట్రీలో పేర్లు నమోదు చేసుకోవచ్చు. ఈ ఐడీలను ఉపయోగించి కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా బ్యాంక్ లింకేజ్తో కూడిన ఆర్ధిక సేవలు పొందవచ్చు. పంటలకు కనీస మద్దతు ధర పొందేందుకు కూడా ఈ ఐడీ ఉపకరిస్తుంది. ఈ ఐడీ సాయంతో దేశంలో ఎక్కడి నుంచైనా రైతుల రుణ అర్హత, రుణ బకాయిలు, ప్రభుత్వ పథకాల జమ వంటి వివరాలను క్షణాల్లో తెలుసుకోవచ్చు.పారదర్శకంగా రైతు విశిష్ట సంఖ్య నమోదు: ఢిల్లీరావురైతు విశిష్ట సంఖ్య నమోదు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తామని వ్యవసాయ శాఖ డైరెక్టర్ సేనాపతి ఢిల్లీరావు వెల్లడించారు. పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం నుదురుపాడు రైతు సేవా కేంద్రంలో నమోదు ప్రక్రియను ఆయన గురువారం పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వ బ్లూ ప్రింట్తో క్షేత్ర స్థాయిలో సమాచార సేకరణ, విశిష్ట సంఖ్య నమోదులో వ్యత్యాసాలను పరిశీలించారు. ఈ ప్రక్రియలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు, లోటుపాట్లపై డిజిటల్ సిబ్బంది, ఆర్ఎస్కే సహాయకులను ఆరా తీశారు. ఆయన మాట్లాడుతూ రైతులందరూ తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకోవాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఎరువుల సరఫరా, కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా లోన్ లింకేజ్లు ఇతర సౌకర్యాలకు రైతు విశిష్ట సంఖ్య ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. -
సంక్షేమ పథకాల విస్తృతికే సర్వే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను విస్తృతపర్చేందుకే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేపట్టినట్టు రాష్ట్ర రెవెన్యూ, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులే టి శ్రీనివాస్రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వం అన్ని రకాల అంశాలతో ఈ సర్వేను శాస్త్రీయంగా నిర్వ హిస్తోందని, ప్రజలు కూడా సహకరిస్తున్నారన్నారు. సోమవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈనెల 17వ తేదీనాటికి రాష్ట్రవ్యాప్తంగా 58.3% ఇళ్లను సర్వే చేశామని, నెలాఖరులోగా నూరుశాతం సర్వే పూర్తి చేస్తామన్నారు.ఇప్పటికే సర్వే చేసిన ఇళ్లకు సంబంధించి వివరాలను కంప్యూ టరీకరిస్తున్నట్టు మంత్రి స్పష్టం చేశారు. ప్రజల స్థితి గతులు తెలుసుకొని ప్రస్తుతం అమలు చేస్తున్న పథ కాలను విస్తృతం చేయడంతోపాటు కొత్త పథకాల అమలు కోసం ఈ సర్వే ఎంతో ఉపయోగ పడుతుందని, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా సర్వే ప్రక్రియను నిర్వ హిస్తోందన్నారు. తాజాగా చేప డుతున్న సర్వే దేశానికే రోల్ మోడల్గా నిలుస్తుందని మంత్రి వ్యాఖ్యానించారు.మంచి ఉద్దేశంతో చేపడుతున్న సర్వేను ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని, అధికారులకు వివరాలు ఇవ్వకుండా తప్పుదారి పట్టించేలా ప్రకటనలు చేయడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ పథకాల్లో కోతపడుతుందని, పలు రకాల బెనిఫిట్స్ ఆగిపోతాయంటూ ప్రతిపక్ష పార్టీలు దుర్మార్గంగా మాట్లాడుతున్నాయని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం సమగ్ర సర్వే చేసిందని, కానీ ఆ సర్వేకు సంబంధించిన వివరాలను బహిర్గతం చేయలేదన్నారు. ప్రజల ఆస్తులు తెలుసుకొని వాటిని కొల్లగొట్టేందుకు అప్పటి సర్వేను బీఆర్ఎస్ ప్రభుత్వం వినియోగించుకుందన్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం చేపట్టే సర్వే దేశానికే ఆదర్శంగా నిలిపేలా ఉంటుందని చెప్పారు. -
హానికరమైన కొత్త జాతీయవాదం
2024 నవంబర్ 11న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘ఏక్ రహేంగే తో సేఫ్ రహేంగే’ అనే విచిత్రమైన నినాదాన్ని ఇచ్చారు. ఇదొక భాషాపరమైన కొత్త క్రీడ అని చెప్పాలి. మోదీ నినాదం ముస్లింలకు వ్యతిరేకంగా ఉందనుకొని, కొందరు దాన్ని మతపరమైనదిగా వ్యాఖ్యానించారు. కానీ ఈ నినాదం కుల గణన ప్రచారాన్ని వ్యతిరేకించేది. సుప్రీంకోర్టు విధించిన 50 శాతం రిజర్వేషన్ పరిమితిని తొలగించడం లక్ష్యంగా పెట్టుకున్నది. భారతీయ సమాజాన్ని కుల గణన చీల్చుతుందనే ప్రచారం చేస్తున్నారు గానీ, ప్రతి కులం వాస్తవ స్థితి తెలియాలంటే కుల గణనే ఆధారం. కుల గణనతో కూడిన సామాజిక ఆర్థిక గణన ఇప్పటి అవసరం.నరేంద్ర మోదీ ఇచ్చిన ‘ఏక్ రహేంగే తో సేఫ్ రహేంగే’ నినాదంలోని భాషను చూద్దాం. ఏక్ అనేది ఐక్యతకు హిందీ పదం. సేఫ్ అనేది ఆంగ్ల పదం. దీని అర్థం మనకు తెలుసు. మహారాష్ట్రలో ఒక నినాదంలో సేఫ్ అనే ఆంగ్ల పదాన్ని ఎందుకు ఉపయోగించారు? ఆ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లోనూ ఆంగ్ల భాష వ్యాప్తి చెందడం వల్లనే. అదే ఉత్తరప్రదేశ్ అయివుంటే, బహిరంగ సభలలో కూడా ఒక ఆంగ్ల పదాన్ని మోదీ తన నినాదంలో ఉపయోగించరు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల భాషను ప్రవేశపెట్టడానికి మోదీ, ఆయన పార్టీ వ్యతిరేకం. అదే హిందుత్వ మద్దతుదారులు నిర్వహిస్తున్న అగ్రశ్రేణి కార్పొరేట్ పాఠశాలలు ఆంగ్ల భాషను ధనికులకు అమ్ముతూ అత్యున్నత వ్యాపారాన్ని చేస్తున్న ప్పుడు మాత్రం మౌనంగా ఉంటారు. నిజమైన లక్ష్యంఇంతకుముందు యోగి ఆదిత్యనాథ్ ‘బటేంగే తో కటేంగే’ నినాదం ఇచ్చారు. ఈ నినాదాన్ని ఆర్ఎస్ఎస్ ఆమోదించింది. ఇప్పుడు మోదీ దాన్ని మిశ్రమ భాషతో వాడుతున్నారు. 2014 ఎన్నికల నుండి బీజేపీ, ఇతర వెనుకబడిన తరగతులనుంచి తెలివిగా ఓట్లను రాబట్టుకోవడం ప్రారంభించింది.ఆరెస్సెస్, బీజేపీ 2014 ఎన్నికల నుండి కుల సమీకరణను అంగీకరించాయి. దాంతో గుజరాత్ నుండి ఓబీసీ అయిన మోదీని ప్రధానమంత్రి అభ్యర్థిగా తేవడంతో పాటు, చదరంగం లాగా తెలివిగా కుల క్రీడను ఆడటం మొదలెట్టాయి. యూపీలో యాదవుల వంటి శూద్ర అగ్రవర్ణ సమాజం పాలకులుగా ఉన్న రాష్ట్రాల్లో, పాలక కుల నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న దిగువ ఓబీసీలను సమీకరించారు. ఆ విధంగారెండుసార్లు ఆ రాష్ట్రంలో మెజారిటీ ఎంపీ స్థానాలను, అధికారాన్ని కైవసం చేసుకోగలిగారు.చాలా కాలంగా శూద్ర పాలక కులాలుగా రెడ్డి, వెలమలు ఉన్న తెలంగాణలో 2024 ఎన్నికల్లో ‘ఈసారి బీసీ ముఖ్యమంత్రి’ అనే నినాదంతో మున్నూరు కాపులు, ముదిరాజ్లపై బీజేపీ దృష్టి సారించింది. సాధారణంగా తెలంగాణలో రెడ్లు కాంగ్రెస్తో, వెలమలు బీఆర్ఎస్తో ఉన్న సంగతి తెలిసిందే. మాలలు కాంగ్రెస్లో ఉన్నందున దళితుల్లో మాదిగలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు మాదిగల ఓట్లను రాబట్టేందుకు, ప్రత్యేక మాదిగ బహిరంగ సభలో ప్రధాని స్వయంగా ప్రసంగించారు. ఈ సమావేశంలోనే ఆయన మాదిగలకు సుప్రీంకోర్టులో న్యాయపరమైన అడ్డంకిని అధిగమించేందుకు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. అందువల్ల ఎస్సీ రిజర్వేషన్లలో ఉపకులాల విభజన రాజ్యాంగ విరుద్ధం కాదని సుప్రీంకోర్టు ఏడుగురు న్యాయమూర్తుల బెంచ్ ముందు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. దాంతో రాజ్యాంగబద్ధంగా ఏదైనా సంక్షేమ ప్రయోజనాలు అందించే రిజర్వేషన్ల కోసం ఉపకుల వర్గీకరణను సుప్రీంకోర్టు సమర్థించింది.కుల గణనతోనే రిజర్వేషన్లుఇలాంటి విభజన రాజకీయాలు ప్రమాదకరమని ఆరెస్సెస్, బీజేపీ శక్తులు భావించడం లేదు. వారు తమ కుల ఆధారిత విభజ నలను జాతీయవాదాలుగా ప్రదర్శిస్తారు. అయితే ఆ తీర్పును అమలు చేయాలంటే, అంతకుముందటి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం, భారత దేశం అంతటా ప్రతి ఉప కులానికి సంబంధించిన వస్తుగతమైన, ధ్రువీకరించదగిన డేటా తప్పనిసరి. ఈ ఉప కుల రిజర్వేషన్ తీర్పు అనేది, రిజర్వేషన్లు వర్తించే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలలో న్యాయమైన వాటాను అడిగే అన్ని ఉప కులాలకూ వర్తిస్తుంది. అందువల్ల రాజ్యాంగ సంస్థ అయిన ‘రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా’ సేకరించిన జాతీయ కుల గణన డేటా లేకుండా సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడం సాధ్యం కాదు.అయినా రాబోయే జాతీయ జనాభా గణనలో కుల గణనను చేపట్టాలని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కోరుకోవడం లేదు. అందుకే సుప్రీంకోర్టు తీర్పు, మోదీ ప్రభుత్వం రెండూ రాష్ట్ర ప్రభుత్వాలకు కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టాయి. ఎందుకంటే అనేక ఉపకులాలు సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని అడుగు తున్నాయి. కానీ, విశ్వసనీయమైన కుల డేటాను సేకరించడానికికేంద్రం సుముఖంగా లేదు.ఈ నేపథ్యంలోనే కుల గణన భారతీయ సమాజాన్ని చీల్చుతుందనే ప్రచారాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్, ముఖ్యంగా రాహుల్గాంధీ, కుల గణనను సమాజానికి చెందిన సామాజిక ఆర్థిక వివరా లకు సంబంధించిన ఎక్స్రేగా ప్రచారం చేస్తున్నందున, దీన్ని అగ్ర వర్ణాలు వ్యతిరేకిస్తున్నాయి. ఆరెస్సెస్, బీజేపీ ప్రయోజనాలు ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ఐదు అగ్ర కులాలతో ముడిపడి ఉన్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు బీజేపీ ‘ఏక్ రహేంగే తో సేఫ్ రహేంగే’ ప్రచారాన్ని ప్రారంభించింది. అయితే, 2024 ఎన్నికలనుంచి మోదీ, అమిత్ షా ఓబీసీ ఓట్లను తామే నిలుపుకోవడం కోసం, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఓబీసీ రిజర్వేషన్లను తగ్గించి ముస్లిం రిజర్వేషన్లు పెంచుతారని ప్రచారం ప్రారంభించారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు అన్ని ప్రయో జనాలను కోల్పోతారని బహిరంగంగానే చెబుతున్నారు. వారు భార తీయ ముస్లింలకూ, మిగిలిన జనాభాకూ మధ్య స్పష్టమైన రేఖను గీయాలని అనుకుంటున్నారు. ఎందుకంటే ముస్లింలు చాలా కాలంగా ఓట్ల పరంగా కాంగ్రెస్తో జతకట్టారు.కుల గణన ముస్లింలకు ఎలా ఉపయోగం?భారతీయ ముస్లిం సమాజం చాలాకాలంగా రిజర్వేషన్ భావ జాలాన్ని అంగీకరించలేదు. వారు తమలో కుల ఉనికిని తిరస్కరించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం సచార్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ నివేదికతో తమ విద్యాపరమైన వెనుక బాటుతనం ఒక తీవ్రమైన సమస్య అని ముస్లింలు గ్రహించారు. వాస్తవానికి, వారి వెనుకబాటుతనానికి వారి మతంతో సంబంధంఉంది. ముస్లింలు కూడా కుల గణనను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారు.రిజర్వేషన్ ను వాడుకోవడం తమ సామాజిక స్థాయికి తగనిదని భావించిన శూద్ర అగ్రవర్ణాలు కూడా ఇప్పుడు రిజర్వేషన్ వ్యవస్థలోకి రావాలనుకుంటున్నాయి. జాతీయ రాజకీయాల్లో రిజర్వేషన్ల సిద్ధాంతం ప్రధాన అంశంగా మారింది. అందుకే రెడ్లు, మరాఠాలు కుల గణనకు విముఖత చూపడం లేదు.కుల గణనతో కూడిన సామాజిక ఆర్థిక గణన భారతీయ ముస్లింలలోని ప్రతి కులం వాస్తవ స్థితిని బయటకు తెస్తుంది. ముస్లింలలో ఉన్నత కులాలు ఉన్నాయి. వీరు మొఘల్, మొఘల్ అనంతర భూస్వామ్య వ్యవస్థ నుండి, సాంప్రదాయిక ఇస్లామిజం నుండి ప్రయోజనం పొందారు. ఉదాహరణకు, పేద దిగువ కులాలముస్లింలు వెనుకబడిన మదర్సా ఉర్దూ మీడియం విద్యలోకి నెట్ట బడ్డారు; ధనిక ఉన్నత కుల ముస్లింలు స్వాతంత్య్రానికి ముందు రోజుల నుండీ ఆంగ్ల మాధ్యమ విద్యను పొందారు. ముస్లింల మధ్య ఉన్న ఈ వలయాన్ని కూడా ఛేదించి తీరాలి.కుల గణన, సంక్షేమ పథకాల న్యాయబద్ధమైన పంపిణీ,విద్య– ఉద్యోగాలలో రిజర్వేషన్ ప్రయోజనాల కోసం జాతీయ డిమాండ్ నేపథ్యంలో ‘ఏక్ రహేంగే తో సేఫ్ రహేంగే’ నినాదాన్ని బీజేపీ తెలివిగా ఇచ్చింది. కుల గణన, సంక్షేమ వలయాన్ని అత్యంత అర్హులైన వారికి విస్తరించడం మాత్రమే... ఆధునిక అభివృద్ధి ప్రక్రియను కొనసాగించే భారతీయ మధ్యతరగతిని మరింతగాపెంచుతుంది.- వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త - ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ -
రైతులకూ ఆధార్ తరహా యూనిక్ ఐడీలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రతి రైతుకూ ఆధార్ తరహాలో యూనిక్ కోడ్ (యూసీ) ఐడీలను కేటాయించేందుకు రంగం సిద్ధమైంది. నవంబర్ మొదటి వారం నుంచి మార్చి నెలాఖరు వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఈ ప్రాజెక్ట్ మార్గదర్శకాలను విడుదల చేస్తూ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డిజిటలైజేషన్ దిశగా.. వ్యవసాయ రంగాన్ని పూర్తి గా డిజిటలైజేషన్ చేయాలన్న సంకల్పంతో ప్రతి రై తుకు విశిష్ట గుర్తింపు సంఖ్య జారీ చేయడం ద్వారా జాతీయ స్థాయిలో ఫార్మర్ రిజిస్ట్రీ రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. పైలట్ ప్రాజెక్ట్గా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో చేపట్టిన ఈ విధానం విజయవంతం కావడంతో దేశవ్యాప్తంగా అమలు చేయా లని కేంద్రం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో భూ యజమానులతోపాటు కౌలు రైతులకు సైతం వీటిని జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. డిజిటల్ అగ్రికల్చర్ మిషన్–అగ్రిస్టాక్ ప్రాజెక్ట్ పేరిట అమలు చేయబోతున్న ఈ ప్రాజెక్ట్ కోసం స్టేట్ ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్ యూనిట్ (ఎస్పీఎంయూ)ను ఏర్పాటు చేశారు. వెబ్ల్యాండ్ డేటా ఆధారంగా జిల్లాలు, మండలాలు, గ్రామాల వారీగా రైతుల రిజిస్ట్రీని రూపొందిస్తారు. అనంతరం 14 అంకెల విశిష్ట సంఖ్యతో ఆధార్ తరహాలోనే ప్రతి రైతుకు ఫార్మర్ రిజిస్ట్రీ కార్డు జారీ చేస్తారు. యూనిక్ ఐడీ ద్వారానే సంక్షేమ ఫలాలు ఈ కార్డుల ద్వారా రైతులకు బహుళ ప్రయోజనాలు కలగనున్నాయి. ఇక నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే అన్ని సంక్షేమ పథకాలు ఈ యూనిక్ కోడ్ను తప్పనిసరి కానుంది. పంటలకు కనీస మద్దతు ధర పొందేందుకు, పంటను మార్కెట్లో విక్రయించుకునేందుకు ఈ కార్డు ఉపయోగపడుతుంది. దీనిని కిసాన్ క్రెడిట్ కార్డుగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ ఐడీ సాయంతో దేశంలో ఎక్కడి నుంచైనా రుణార్హత, రుణ బకాయిలు, పథకాల జమ వంటి వివరాలను క్షణాల్లో తెలుసుకోవచ్చు.అగ్రి సెన్సెస్–2019 ప్రకారం లెక్క ఇదీవ్యవసాయ, ఉద్యాన, పట్టు పంటల సాగు విస్తీర్ణం: 67.44 లక్షల హెక్టార్లు వెబ్ల్యాండ్ డేటా ప్రకారం రైతులు: 76,06,943 మంది 2.5 ఎకరాలలోపు ఉన్న రైతులు: 52,01,870 మంది 2.5 నుంచి 5 ఎకరాల మధ్య ఉన్న రైతులు: 15,62,042 మంది 5 ఎకరాలకు పైబడి ఉన్న రైతులు: 8,43,031 మంది కౌలు రైతులు: 16.50 లక్షల మంది సెంటు భూమి కూడా లేని కౌలుదారులు: 810 లక్షల మంది దేవదాయ, అటవీ భూముల సాగుదారులు: 1.50 లక్షల మంది -
విదేశీ విద్యానిధికి మరింత ప్రోత్సాహం!
సాక్షి, హైదరాబాద్: ‘విదేశీ విద్యానిధి పథకం’లబ్ధిదారుల సంఖ్య పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. సంక్షేమ పథకాల్లో అత్యంత ఎక్కువ ఆర్థికసాయం అందుతున్న పథకం కూడా ఇదే కావడంతో డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. అత్యంత పరిమిత సంఖ్యలో అర్హులను గుర్తిస్తుండటంతో విదేశాల్లో ఉన్నత చదువులు చదవాలన్న విద్యార్థులు తీవ్ర నిరాశ పడుతున్నారు. గత ఆరేళ్లుగా సంక్షేమశాఖల వారీగా వస్తున్న దరఖాస్తుల సంఖ్యను విశ్లేషిస్తూ విద్యార్థుల సంఖ్య పెంపు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు నివేదించగా...ఆ ఫైలు ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరినట్టు సమాచారం. అతి త్వరలో ఈ ఫైలుకు మోక్షం కలుగుతుందని, ఎక్కువ మందికి లబ్ధి కలిగించాలని సంక్షేమశాఖలు భావిస్తున్నాయి.పూలే విద్యానిధికి అత్యధిక దరఖాస్తులు విదేశీ విద్యానిధి పథకం కింద అర్హత సాధించిన విద్యార్థికి నిర్దేశించిన దేశాల్లో పీజీ కోర్సు చదివేందుకు గరిష్టంగా రూ.20లక్షల ఆర్థిక సాయం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ఈ మొత్తాన్ని విద్యార్థి తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. పీజీ మొదటి సంవత్సరం పూర్తి చేసిన వెంటనే రూ.10 లక్షలు, రెండో సంవత్సరం పూర్తి చేసిన తర్వాత మరో రూ.10 లక్షల సాయాన్ని సంబంధిత సంక్షేమ శాఖలు నేరుగా విద్యార్థి ఖాతాలో జమ చేస్తాయి. ఈ పథకం కింద అర్హత సాధించిన విద్యార్థులకు రూ.20లక్షల సాయంతో పాటుగా ప్రయాణ ఖర్చుల కింద కోర్సు ప్రారంభ సమయంలో ఫ్లైట్ చార్జీని కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది.ప్రస్తుతం బీసీ సంక్షేమశాఖ ద్వారా అమలు చేస్తున్న మహాత్మా జ్యోతిబా పూలే విదేశీ విద్యా నిధి పథకం కింద 300 మందికి మాత్రమే అవకాశం కలి్పస్తున్నారు. ఇందులో బీసీ కేటగిరీలోని కులాల ప్రాధాన్యత క్రమంలో 285 మంది విద్యార్థులకు, ఈబీసీల నుంచి 15 మందికి అవకాశం ఇస్తున్నారు. వాస్తవానికి బీసీ సంక్షేమ శాఖకు ఏటా 5 వేలకు పైబడి దరఖాస్తులు వస్తున్నాయి. కానీ అందులో 5 నుంచి 7శాతం మందికే అవకాశం లభిస్తుండగా, మిగిలిన విద్యార్థులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. దీంతో లబ్ధిదారుల సంఖ్య పెంచాలని పెద్ద సంఖ్యలో వినతులు రావడంతో బీసీ సంక్షేమశాఖ ఈ దిశగా ప్రతిపాదనలు తయారు చేసింది.ప్రస్తుతమున్న 300 పరిమితిని కనీసం వెయ్యి వరకు పెంచాలని కోరింది. ఒకేసారి ఇంతపెద్ద సంఖ్యలో పెంచే అవకాశం లేదని ఉన్నతాధికారులు సూచించడంతో కనీసం 800లకు పెంచాలని కోరుతూ ప్రతిపాదనలు సమర్పించింది. మరోవైపు ఎస్సీ అభివృద్ధి శాఖ పరిధిలో 210 పరిమితిని 500కు, ఎస్టీ సంక్షేమ శాఖ పరిధిలో 100 పరిమితిని 300 నుంచి 500 వరకు పెంచాలంటూ ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వానికి పంపినట్టు సమాచారం. ఈ అంశంపై ఇటీవల సంక్షేమ శాఖల అధికారులతో జరిగిన సమావేశంలోనూ చర్చించారు. సీఎం రేవంత్రెడ్డి సానుకూలంగా ఉండటంతో ఈ ప్రతిపాదనలు ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించినట్టు తెలిసింది. అతి త్వరలో ఈ ప్రతిపాదనలు ఆమోదించిన తర్వాత ఉత్తర్వులు వెలువడతాయని విశ్వసనీయ సమాచారం. -
మరో నాలుగేళ్లు ఫోర్టీఫైడ్ రైస్
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మరో నాలుగేళ్ల పాటు ఉచిత ఫోర్టీఫైడ్ రైస్ అందించనున్నారు. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనతో పాటు ఇతర సంక్షేమ పథకాల ద్వారా 2028 డిసెంబర్ వరకు ఉచిత ఫోర్టిఫైడ్ రైస్ సరఫరా కొనసాగింపునకు కేంద్ర కేబినెట్ ఆమోదించింది. సూక్షపోషకాలైన ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి12లను బియ్యానికి జోడిస్తారు. దీన్నే ఫోర్టీఫైడ్ రైస్గా పిలుస్తారు. 2024 జూలై నుంచి 2028 డిసెంబర్ వరకు ఈ కార్యక్రమం అమలు కోసం రూ.17,082 కోట్లు ఖర్చు చేయనున్నారు. బుధవారం ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఫోర్టీఫైడ్ రైస్ ఉచిత సరఫరాను కొనసాగించడంతో పాటు పలు అంశాలకు ఆమోదముద్ర వేశారు. గుజరాత్లో ని లోథాల్లో జాతీ య మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ (ఎన్ఎంహెచ్సీ)ని ఏర్పాటు చేయడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎన్ఎంహెచ్సీ అభివృద్ధిలో 22 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేంద్రం తెలిపింది. ‘ఫేజ్ 1ఎ’లో జాతీయ మారిటైమ్ హెరిటేజ్ మ్యూజియం, ఆరు గ్యాలరీలు ఉంటాయని వివరించింది. భారత నావికాదళం, తీరప్రాంత రక్షకదళం గ్యాలరీలు ఉంటాయని, దేశంలోనే అతిపెద్దవిగా ఇవి నిలుస్తాయని తెలిపింది. ఫేజ్–2లో తీరప్రాంత రాష్ట్రాల పెవిలియన్లు, మారిటైమ్ ఇనిస్టిట్యూట్, హాస్టల్, నాలుగు థీమ్ బేస్డ్ పార్క్లను ఏర్పాటు చేస్తారు. -
ఏపీలో ప్రశ్నార్థకంగా సంక్షేమ పథకాల అమలు
-
కూటమి సర్కార్ కుచ్చుటోపీ.. బాబు కొత్త డ్రామా: వైఎస్సార్సీపీ
సాక్షి, తాడేపల్లి: ఏపీలో పథకాల అమలును కూటమి సర్కార్ గాలికొదిలేసింది. నాలుగు నెలల్లో ఒక్క పథకం కూడా అమలు చేయకుండా.. గత ఐదేళ్లలో అందిన పథకాల్లో కోతలు విధిస్తోందని వైఎస్సార్సీపీ తెలిపింది. అలాగే, ఉచిత ఇసుక అంటూ చంద్రబాబు కుచ్చుటోపీ పెట్టాడని చెప్పుకొచ్చింది.కూటమి సర్కార్ను ప్రశ్నిస్తూ వైఎస్సార్సీపీ ట్విట్టర్ వేదికగా.. నాలుగు నెలల్లోనే ఇసుకని సాంతం దోచేసిన తెలుగు తమ్ముళ్లు. వైఎస్సార్సీపీ హయాంలో నిండుగా కనిపించిన ఇసుక యార్డులన్నీ ఇప్పుడు ఖాళీగా దర్శనం ఇస్తున్నాయి. ఉచిత ఇసుక అంటూ.. చంద్రబాబు కుచ్చుటోపీ పెట్టాడు. ఇప్పుడు ఇసుక లేదంటే జనం ఉమ్మేస్తారని భయపడి.. ఆన్లైన్ బుకింగ్ పేరుతో కూటమి ప్రభుత్వం నాటకాలాడుతోంది.నాలుగు నెలల్లోనే ఇసుకని సాంతం దోచేసిన తెలుగు తమ్ముళ్లు వైయస్ఆర్సీపీ హయాంలో నిండుగా కనిపించిన ఇసుక యార్డులన్నీ ఇప్పుడు కాళీగా దర్శనం ఫ్రీ ఇసుక అంటూ.. కుచ్చుటోపీ పెట్టిన @ncbn ఇప్పుడు ఇసుక లేదంటే జనం ఉమ్మేస్తారని భయపడి.. ఆన్లైన్ బుకింగ్ పేరుతో నాటకాలాడుతున్న @JaiTDP… pic.twitter.com/c3ia5cOyOE— YSR Congress Party (@YSRCParty) October 3, 2024 👉అలాగే, పథకాల అమలు గాలికొదిలేసి.. కోతలతో సరిపెట్టిన చంద్రబాబు. నాలుగు నెలల్లో ఒక్క పథకం కూడా అమలు చేయకుండా.. గత ఐదేళ్లుగా అందిన పథకాలకి వరుసగా కోతలు పెడుతున్నాడు. వైఫల్యాలను ప్రశ్నిస్తారని భయపడి.. టాపిక్ డైవర్ట్ చేస్తూ బురద రాజకీయాలతో చంద్రబాబు సరిపెడుతున్నాడు. పథకాల అమలు గాలికొదిలేసి.. కోతలతో సరిపెట్టిన చంద్రబాబునాలుగు నెలల్లో ఒక్క పథకం కూడా అమలు చేయకుండా.. గత ఐదేళ్లుగా అందిన పథకాలకి వరుసగా కోతలువైఫల్యాలను ప్రశ్నిస్తారని భయపడి.. టాపిక్ డైవర్ట్ చేస్తూ బురద రాజకీయాలతో సరిపెడుతున్న @ncbn #MosagaduBabu#100DaysOfCBNSadistRule pic.twitter.com/74wuVFoQYl— YSR Congress Party (@YSRCParty) October 3, 2024👉పెన్షన్ల విషయంలో కూడా పండుటాకులపై కక్ష సాధిస్తున్న చంద్రబాబు. పెన్షన్ పెంపు ముసుగేసి.. 100 రోజుల్లోనే లక్షా 50వేల మందికి కూటమి సర్కార్లో పెన్షన్ల కోత విధించారు. ఇదేంటని అడిగితే.. చిత్ర, విచిత్రమైన కారణాలు చెప్తున్న కూటమి నేతలు. అవ్వాతాతలపై ఎందుకు నీకు ఇంత పగ చంద్రబాబు?. పండుటాకులపై కక్ష సాధిస్తున్న చంద్రబాబు పెన్షన్ పెంపు ముసుగేసి.. 100 రోజుల్లోనే లక్షా 50 వేల మందికి పింఛను కోత అడిగితే.. చిత్ర, విచిత్రమైన కారణాలు చెప్తున్న కూటమి నేతలు అవ్వాతాతలపై ఎందుకు @ncbn నీకు ఇంత పగ?#MosagaduBabu#100DaysOfCBNSadistRule pic.twitter.com/lglZ0zqJjI— YSR Congress Party (@YSRCParty) October 3, 2024 👉కూటమి చేతగానితనంతో బెజవాడ వరద బాధితులకి తప్పని తిప్పలు. టీడీపీకి అనుకూలమైన వారికే సాయం అందేలా పావులు కదిపిన తెలుగు తమ్ముళ్లు. అర్హత ఉండి కూడా.. సాయం కోసం కలెక్టరేట్ వద్ద పడిగాపులు కాస్తున్న వేలాది మంది బాధితులు. అస్తవ్యస్తంగా బాధితుల జాబితాతో చేతులెత్తేసిన అధికారులు.. ఇదేనా చంద్రబాబు నీ అనుభవం? అని ప్రశ్నించింది. .@JaiTDP కూటమి చేతగానితనంతో బెజవాడ వరద బాధితులకి తప్పని తిప్పలు టీడీపీకి అనుకూలమైన వారికే సాయం అందేలా పావులు కదిపిన తెలుగు తమ్ముళ్లు అర్హత ఉండి కూడా.. సాయం కోసం కలెక్టరేట్ వద్ద పడిగాపులు కాస్తున్న వేలాది మంది బాధితులుఅస్వవ్యస్తంగా బాధితుల జాబితాతో చేతులెత్తేసిన… pic.twitter.com/nZghdgRDA9— YSR Congress Party (@YSRCParty) October 3, 2024ఇది కూడా చదవండి: తిరుమల జోలికి వెళ్లొద్దు.. చంద్రబాబుకు విజయసాయి వార్నింగ్ -
ఆల్ ఇన్ వన్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ప్రతి పథకానికి ఇకపై ఒకే కార్డు ఆధారం కానుంది. అదే డిజిటల్ కార్డు. ప్రతి కుటుంబానికీ ఇచ్చే ఈ డిజిటల్ కార్డులో కుటుంబసభ్యుల వివరాలన్నీ నమోదై ఉంటాయి. ఆరోగ్య, సంక్షేమ పథకాలతో పాటు రేషన్ సరుకులకు సైతం ఉపయోగపడేలా ఈ కార్డును రూపొందించనున్నారు. కుటుంబానికి చెందిన ఆధార్ కార్డు లేదా సెల్ నంబర్ను ఈ డిజిటల్ కార్డుతో అనుసంధానిస్తారు. ప్రస్తుతం కర్ణాటక, రాజస్తాన్, మహారాష్ట్ర, హరియాణా రాష్ట్రాల్లో కుటుంబ ఆర్యోగానికి సంబంధించిన సమాచారాన్ని డిజిటల్ కార్డులో పొందుపరిచి ఉపయోగిస్తున్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి అన్ని ప్రభుత్వ పథకాలకు చిప్ అమర్చిన ఒకే డిజిటల్ కార్డు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చింది. ఇందులో ఒక్కో పథకానికి ఒక్కో నంబర్ను కేటాయిస్తారు. తొలిదశలో ప్రయోగాత్మకంగా ప్రతి నియోజకవర్గంలో ఒక పట్టణం, ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకుని ఈ విధానాన్ని అమలు చేసేందుకు రంగం సిద్ధమైంది. అయితే ప్రయోగాత్మకంగా అమల్లోకి తీసుకురావడానికి ముందే ఆయా రాష్ట్రాల్లో అమల్లో ఉన్న విధానాన్ని అధ్యయనం చేయాలని, అక్కడ ఎదురవుతున్న సమస్యలు ఇక్కడ తలెత్తకుండా పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు అధికారుల బృందాన్ని అక్కడకు పంపించాలని నిర్ణయించారు. అన్ని రికార్డులు ఒకే దగ్గర..: కేవలం ఆరోగ్యానికి సంబంధించిన అంశాలే కాకుండా.. ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలు, ఆ కుటుంబ సభ్యులకు అందుతున్న పథకాల వివరాలను కూడా ఈ డిజిటల్ కార్డులో పొందుపర్చనున్నారు. ఒక కుటుంబంలో నలుగురు సభ్యులుంటే..ఆ కుటుంబానికి ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ (యూఐఎన్)ను కేటాయించి, కుటుంబసభ్యుల సంఖ్య ఆధారంగా ఆ యూఐఎన్కు బై నంబర్ కేటాయిస్తారు. ఆ బై నంబర్ ఎదురుగా ఆ కుటుంబ సభ్యుని పేరు, ఆ సభ్యుడి సమస్త సమాచారం ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ డిజిటల్ కార్డు పూర్తిగా సురక్షితమైనదని, అన్నిరకాల రికార్డులు ఒకే దగ్గర అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం చెబుతోంది. కాగా కుటుంబంలోని ప్రతి ఇంటి సభ్యుని హెల్త్ ప్రొఫైల్ అందులో ఉండాలని, తద్వారా దీర్ఘకాలంలో వైద్య సేవలకు ఇది ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్య సమాచారంతో పాటు, సంక్షేమ పథకాలు కూడా ఒకేచోట ఒకే క్లిక్తో లభ్యమవుతాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఎక్కడైనా సేవలు, రేషన్ పొందేలా.. రాజస్థాన్, హరియాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కార్డులపై అధ్యయనం చేయాలని, వాటితో కలుగుతున్న ప్రయోజనాలు, ఇబ్బందులపై అధ్యయనం చేసి త్వరగా ఒక సమగ్ర నివేదిక రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఉండాలని సూచించారు. లబ్ధిదారులు ఎక్కడైనా రేషన్, ఆరోగ్య సేవలు పొందేలా ఈ కార్డులు ఉండాలని అన్నారు. కుటుంబసభ్యులను జత చేయడం, తొలగింపునకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకునేలా ఉండాలని కూడా సీఎం సూచించారు. ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డుల పర్యవేక్షణకు జిల్లాల వారీగా వ్యవస్థలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమావేశంలో సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, కార్యదర్శులు చంద్రశేఖర్రెడ్డి, సంగీత సత్యనారాయణ కూడా పాల్గొన్నారు. ఆలస్యం లేకుండా వైద్యండిజిటల్ కార్డులపై సోమవారం సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన ఆయన నివాసంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, దామోదర రాజనరసింహ, సీఎస్ శాంతికుమారి, పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్, వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తూ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ డిజిటల్ కార్డులో ఆ కుటుంబంలోని సభ్యుల పూర్తి ఆరోగ్య సమాచారం, వారు అంతకుముందు చేయించుకున్న వైద్య పరీక్షల నివేదికలు ఉండేలా చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా ప్రభుత్వంలో ఎంప్యానల్ అయిన అసుపత్రులన్నింటిలోనూ ఈ కార్డులను ఉపయోగించి ఎలాంటి ఆలస్యం లేకుండా వైద్యం చేయించుకోవడానికి వీలవుతుందని భావిస్తోంది. -
2026కల్లా నక్సలిజం అంతం
న్యూఢిల్లీ/షహీబ్గంజ్ (జార్ఖండ్): దేశంలో నక్సలిజం 2026 మార్చి నాటికి పూర్తిగా అంతమైపోతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ‘‘2026 మార్చి 31లోగా నక్సల్స్ హింసను, భావజాలాన్ని దేశం నుంచి తుడిచిపెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించారు. అంతకంటే ముందే నక్సలిజాన్ని అంతం చేస్తాం’’ అని పేర్కొన్నారు. హింసను విడనాడి ఆయుధాలు వదిలేసి లొంగిపోవాలని మావోయిస్టులకు విజ్ఞప్తి చేశారు. నక్సల్ హింసకు గురైన 55 మంది బాధితులనుద్దేశించి బుధవారం ఆయన మాట్లాడారు. ‘‘మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లలో భద్రతా దళాలు భారీ విజయాలు సాధించాయి. సమస్య ఇప్పుడు ఛత్తీస్గఢ్లోని నాలుగు జిల్లాలకు మాత్రమే పరిమితమైంది. పశుపతినాథ్ (నేపాల్) నుంచి తిరుపతి (ఏపీ) దాకా కారిడార్ ఏర్పాటు చేయాలని మావోయిస్టులు ఒకప్పుడు అనుకున్నారు. కానీ ఆ ప్రణాళికలను మోదీ ప్రభుత్వం తిప్పికొట్టింది. ఛత్తీస్గఢ్లోని నక్సల్స్ ప్రభావిత ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కేంద్ర హోం శాఖ త్వరలో సంక్షేమ పథకం రూపొందిస్తుంది. ఉద్యోగాలు, ఆరోగ్య సంరక్షణ, ఇతర రంగాల్లో సంక్షేమ కార్యక్రమాల ద్వారా సాయం చేస్తుంది’’ అని వెల్లడించారు. జార్ఖండ్లో జేఎంఎం–కాంగ్రెస్ సంకీర్ణ సర్కారు బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లను విపరీతంగా ప్రోత్సహిస్తోందని అమిత్ షా ధ్వజమెత్తారు. దీనికి అడ్డుకట్ట వేయని పక్షంలో మరో పాతికేళ్లలో చొరబాటుదారులే రాష్ట్రంలో మెజారిటీ ప్రజలుగా మారిపోతారని హెచ్చరించారు. స్థానిక గిరిజన సంస్కృతిని వాళ్లు సర్వనాశనం చేస్తున్నారని ఆరోపించారు. జార్ఖండ్లోని గిరి«ద్లో పరివర్తన్ యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఓటుబ్యాంకు రాజకీయాల కోసం చొరబాటుదారులను రాష్ట్ర ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందని ధ్వజమెత్తారు. వీటి దెబ్బకు సంతాల్ పరగణాల్లో స్థానిక గిరిజనుల జనాభా 44 శాతం నుంచి 28 శాతానికి తగ్గిందన్నారు. -
ప్రజల బాగు కోరిన పాలకుడు
ముఖ్యమంత్రి పదవిని లక్కీ లాటరీలా పొందినవారు కొందరు, పైరవీలతో చేజిక్కించుకున్నవారు కొందరు, తెలివిగా పావులు కదిపి సాధించినవారు కొందరు... ఈ కేటగిరీల్లో కాంగ్రెస్ ఏలుబడిలోని రాష్ట్రాల్లో ఎందరినో చూశాం. పూర్తి ప్రజాదరణతో ఒకే ఒక్కడై నిలిచి, గెలిచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన వ్యక్తి... కాదు శక్తి... డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రమే! జమ్మలమడుగులో పుట్టి, స్వగ్రామం పులివెందులలో, బళ్లారిలో చదివి, గుల్బర్గాలో మెడిసిన్ చేసి డాక్టరుగా పులివెందులలో రూపాయి డాక్టరుగా ఊరి జనానికి చేరువయ్యారు. చిన్ననాటి నుండీ గాంధీ, నెహ్రూలపై పెరుగుతూ వస్తున్న అభిమానం ఆయనను కాంగ్రెస్కు చేరువ చేసింది. పులివెందుల డిగ్రీ కాలేజీ స్థాపించి విద్యాభివృద్ధికీ, 20 పడకల ఆసుపత్రి నిర్మించి, పేదలకు ఉచిత వైద్యం చేసి ఊరి చుట్టుపక్కల ప్రజలకూ దగ్గరయ్యారు. యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడై 1978లో కాంగ్రెస్ చీలిక రాగా ‘రెడ్డి కాంగ్రెస్’ ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా ప్రతిసారీ గెలుస్తూ వచ్చారు. యువజన సర్వీసులు, ఎక్సైజ్, విద్యా శాఖలకు మంత్రిగా పనిచేశారు. రెండుసార్లు పీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. 1999 అసెంబ్లీ ఎన్నికల్లో తన నాయకత్వంలో 91 స్థానాలు గెలుచుకుని ప్రతిపక్ష నాయకుడిగా సత్తా చాటారు. 2004 ఎన్నికలకు ఏడాది ముందు జనంలోకి వెళ్ళారు. ఆ ఏడాది ఏప్రిల్ 3న రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో పాదయాత్రకు శ్రీకారం చుట్టి, ఆంధ్రప్రదేశ్ చివరి గ్రామం ఇచ్ఛాపురం వరకూ దాదాపు 1600 కిలోమీటర్లు వైఎస్ పాదయాత్ర చేశారు. దారి పొడవునా, గ్రామ గ్రామాన ప్రజల కష్టనష్టాలను కళ్ళారా చూశారు. చెవులారా విన్నారు. భగ్గున మండుతున్న ఎండల్లో కాలినడకలో ప్రజలు ఎన్నెన్ని అవస్థలు పడుతున్నారో గమనించారు.ఓ పక్క కరువు, మరోవంక గంజినీళ్లకు కూడా నోచుకోని అభాగ్యులు, విద్యుత్ కొరత వల్ల బోర్లు పనిచేయక అచేతనులైన రైతన్నల దౌర్భాగ్య స్థితి, నిరుద్యోగుల నిస్తేజం... ఇవన్నీ ఆయనను కొత్త మనిషిగా తీర్చిదిద్దాయి. ‘ఇందిరమ్మ రాజ్యం’ తెస్తాననీ, అన్ని కష్టాల నుంచి గట్టెక్కిస్తాననీ ప్రజలకు మాటిచ్చారు. నమ్మకం కలిగించారు. వ్యవసాయ ప్రధానమైన గ్రామీణ ప్రజలకు విద్యుత్ చార్జీలు భారం కావడం, ఎప్పుడు వస్తుందో, పోతుందో తెలియని కరెంటు సరఫరా ప్రాథమిక అవరోధంగా గుర్తించి ‘ఉచిత విద్యుత్’ హామీ ఇచ్చి ముఖ్యమంత్రిగా తొలి సంతకం ఆ ఫైలు పైనే చేస్తానన్నారు. సరిగా పండక, అరకొర దిగుబడి తెగనమ్మితే పెట్టుబడి ధర కూడా రాక రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్న వార్తలు విని, చదివి ఆయన చలించి పోయారు. వివిధ వర్గాల ప్రజల జీవన్మరణ సమస్యలను ఎలాగైనా సరే పరిష్కరించాలని నిశ్చయించుకున్నారు. పాదయాత్ర క్రమంలో రాజమండ్రి నగరం వచ్చాక తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మూడు రోజుల విశ్రాంతి అనంతరం మళ్ళీ నిర్విరామంగా ఇచ్ఛాపురం వరకూ నడక సాగించి, 64 రోజుల పాదయాత్ర (3 రోజుల విరామంతో కలిపి 67 రోజులు) లక్ష్యం పూర్తి చేశారు.అంతలో 2004 ఎన్నికల నగారా మోగింది. వైఎస్ హైదరాబాద్ తిరుగు పయనమయ్యారు. అంతకు పదేళ్ళ ముందు 1994 ఎన్నికల్లో ఎన్టీఆర్ అఖండ విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. కొద్దికాలానికే ఎన్టీఆర్ను పదవీచ్యుతుణ్ణి చేసి, తెలుగుదేశం పార్టీని హైజాక్ చేసి, ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు చంద్రబాబు. అలాంటి చంద్రబాబు బీజేపీ ఆసరా తోడై, 1999లో మళ్ళీ అధికార పగ్గాలు చేపట్టారు. ప్రజలంటే గొఱె<లనీ, ఎన్నికలంటే కాస్త పేరున్న పార్టీతో జతకట్టి సునాయాసంగా గెలవచ్చనీ పాత అనుభవ పాఠాల ద్వారా నమ్మి, ఈసారి 2004 ఎన్నికల బరిలోనూ దూకారు. అలిపిరి మందుపాతర పేలుడులో త్రుటిలో బతికి బయటపడిన ఘటన సానుభూతి తెచ్చి గెలిపిస్తుందని నమ్మారు. సానుభూతి చల్లారకుండా ముందస్తు ఎన్నికలకు చంద్రబాబు దిగారు. ప్రచార పర్వంలో ఎక్కడా సానుభూతి జాడలేదు సరికదా ప్రజాగ్రహం ఎదురైంది. కాంగ్రెస్ అఖండ విజయం, వైఎస్ ముఖ్యమంత్రి కావడం చకచకా జరిగిపోయాయి.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 2004 మే 14న హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో ప్రజా సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు వైఎస్. ఇచ్చిన మాట ప్రకారం ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేశారు. అది మొదలు ప్రజలకు ఎలా మేలు చేయాలన్న ఆలోచన తప్ప ఆయనకు మరొకటి లేదు. రైతులకు సహకార రుణమాఫీ కోసం కేంద్రాన్ని ఒప్పించారు. పీకల లోతు అప్పుల్లో మునిగి ఉన్న రైతులకు రుణ విముక్తి కలిగించారు. ‘ఆరోగ్యశ్రీ’తో అత్యంత ఖరీదైన వైద్యాన్ని నిరుపేదలకు అందించారు. పేదరికం కారణంగా పౌష్టికాహార లోపంతో గుండెజబ్బుల బారిన పడిన పసిపిల్లలకు ఉచిత శస్త్రచికిత్సలు చేయించారు.‘108 వాహనం’ ద్వారా అత్యవసర అంబులెన్సు వాహనాలను రాష్ట్రమంతటా అందుబాటులోకి తెచ్చారు. బీసీ విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్య కోసం ‘ఫీజు రీ–ఇంబర్స్మెంట్’ పథకాన్ని ప్రవేశపెట్టారు. ముస్లిమ్ మైనారిటీ విద్యార్థులకు 4 శాతం రిజర్వేషన్లతో ఇంజనీరింగ్ విద్యను అందించారు. ‘జలయజ్ఞం’తో భారీ, మధ్యతరహా, చిన్నతరహా సాగునీటి ప్రాజెక్టులను రాష్ట్రం నలుమూలలా విస్తరించే పథకాలకు శ్రీకారం చుట్టారు. కోటి ఎకరాల సాగుభూమితో రాష్ట్రం అన్నపూర్ణగా విరాజిల్లాలని పట్టుదలతో కృషి చేసారు. అంతకు ముందు నామమాత్రంగా ఉండే వికలాంగ, వృద్ధాప్య పింఛన్లను ఇబ్బడిముబ్బడిగా పెంచారు. ఎస్సీ, ఎస్టీ పథకాల రుణమాఫీతో ఊరట కలిగించారు.‘ఇందిరమ్మ ఇళ్ల’ను ‘ఇందిరమ్మ ఊళ్ళు’ అనేలా గణనీయంగా నిర్మించారు. ప్రకృతి కూడా పరవశించిందేమో... హర్షాతిరేకంతో వర్షాలను చాలినంతగా రాష్ట్రమంతటా కురిపించింది. గ్రామదేవతల, దేవాలయ ఉత్సవాలు ఊరూరా పునః ప్రారంభమయ్యాయి. దేశం ఆంధ్రప్రదేశ్ వైపు తల తిప్పి చూడసాగింది. కాంగ్రెసేతర ముఖ్యమంత్రులు సైతం ‘ఆరోగ్యశ్రీ’తో పాటు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన మరికొన్ని పథకాలను తమ రాష్ట్రంలో అమలు చేశారు. 2009 ఎన్నికల్లోనూ వైఎస్ నేతృత్వంలో కాంగ్రెస్ అధికారం కైవసం చేసుకుంది. రెండోసారి ముఖ్యమంత్రిగా అధికార పీఠాన్ని అధిష్ఠించి, మరింత జాగరూకతతో సాగుతూ, పథకాల అమలు తీరు ఎలా ఉందో ప్రజల నుండి నేరుగా తెలుసుకోవాలన్న కోరికతో ‘రచ్చబండ’ ప్రవేశపెట్టారు. తొలి సమావేశానికి హాజరవడానికి హెలికాప్టర్లో చిత్తూరు జిల్లాకు పోయే క్రమంలో వాతావరణం ప్రతికూలించింది. కంట్రోల్ రూముతో సంబంధాలు తెగిపోయాయి. మరునాడు ఊహించని విషాద వార్త వెల్లడైంది. ‘నల్లమల అడవుల్లో హెలికాప్టర్ కూలిపోయింది. వైఎస్ ఇకలేరు’! ఈ వార్తను తట్టుకోలేక రాష్ట్రవ్యాప్తంగా సుమారు 700 గుండెలు ఆగిపోయాయి. ఇంతగా ప్రేమను పొందిన నాయకుడు చరిత్రలో మరొకరు లేరు. 2009 సెప్టెంబరు 3వ తేదీ జన హృదయ విజేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఇక లేరని లోకానికి తెలిసిన రోజు. అదే రోజు గణేశ నిమజ్జనం. ‘గణేశ్ మహరాజ్కీ జై’, ‘గణపతి బప్పా మోరియా’ నినాదాలతో, పిల్లలు, పెద్దలు సహా అశేష జనసందోహంతో, నృత్యాలు, ఆటపాటలు, టపాసుల, డప్పులు, ఆర్కెస్ట్రాల కోలాహలంతో 24 గంటలపాటు నిర్విరామంగా సాగాల్సిన హైదరాబాద్ గణేశ్ నిమజ్జనోత్సవం అంతే జనంతో నిర్వికారంగా, ఎటువంటి ఆర్భాటం లేకుండా ఒక మహా మౌనప్రదర్శన అన్నట్టుగా సాగిపోయింది. లెక్కకు మిక్కిలిగా పూనుకున్నా జరగదనిపించే ఆ సంఘటన ఆ జననేత పట్ల గొప్ప గౌరవానికి తార్కాణం. ‘పథకాలంటే ఇవీ, పరిపాలన అంటే ఇదీ, పాలకుడంటే ఇలా...’ అని మామూలు వ్యక్తుల నుండి మేధావుల దాకా అనుకునేలా సాగిన ఆయన రాష్ట్ర నాయకత్వ హయాం ‘న భూతో న భవిష్యతి!’తిరుమలగిరి సురేందర్ – వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ -
హామీల అమలెప్పుడు ‘నెల’రాజా!
ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ అత్యంత జనాదరణ కలిగిన నాయకుడు జగన్మోహన్రెడ్డి అనే విషయం చంద్రబాబుకూ, ఆయన కొలువు కూటమికీ స్పష్టంగా తెలుసు. మొన్నటి ఎన్నికల ఫలితాలను ఎంత శాతం మేరకు ట్యాంపరింగ్ చేశారన్న రహస్యం కూడా వారికి మాత్రమే తెలుసు. అలవికాని హామీలతో తాము ఓటర్ల చెవుల్లో పెట్టిన పొద్దుతిరుగుడు పువ్వులు తమ వైపే తిరిగి ప్రశ్నించే సమయం ఆసన్నమైంది. ఆ దృష్టిని మళ్లించాలి. జనంలో జగన్కున్న ప్రతిష్ఠను తగ్గించాలి. ఇది వారి తక్షణ కర్తవ్యం.మంత్రిమండలి ప్రమాణ స్వీకారం చేసి నెలరోజులు దాటింది. చేసిన వాగ్దానాల అమలు సంగతి దేవుడెరుగు. మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను ఫలానా తేదీల వారీగా అమలు చేయబోతున్నామనే షెడ్యూల్కు కూడా జనం నోచుకోలేదు. ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించగానే సంతకం చేసిన ‘మెగా డీఎస్సీ’ ఫైలుతో ఫుట్బాల్ ఆడుతున్నారు. అందుతున్న సూచనలను బట్టి ఈ సంవత్సరాంతానికి కూడా ఆ పరీక్షలు పూర్తయ్యే అవకాశం లేదు. వచ్చే సంవత్సరం ఏప్రిల్ నాటికి పదవీ విరమణ చేయబోయే వారిని దృష్టిలో పెట్టుకొని ఆ సమయానికల్లా డీఎస్సీ నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.ఈ విద్యా సంవత్సరానికే భర్తీ అయ్యే విధంగా జగన్ ప్రభుత్వం 6,100 పోస్టులతో ప్రకటించిన డీఎస్సీని చాపచుట్టేసి, వచ్చే సంవత్సరం ఖాళీ అయ్యే పోస్టులను కూడా కలిపి దానికి ‘మెగా డీఎస్సీ’ అనే ముద్ర వేసి వచ్చే సంవత్సరమే భర్తీ చేయబోతున్నారన్నమాట. ఈ సంవత్సరమే కొలువుల్లో చేరవలసిన 6,100 మంది ఉపాధ్యాయ ఔత్సాహికుల నోళ్లల్లో ఆ విధంగా మట్టికొట్టారు. సర్కార్వారి తొలి అడుగే చీటింగ్!పెంచిన పెన్షన్లను తొలి మాసం నుంచే ఇస్తున్నట్టు భారీ ఆర్భాటం చేశారు. అంతకు ముందు ఇళ్లకు వెళ్లి లబ్ధిదారుల చేతిలో పెన్షన్ డబ్బులు పెట్టి వచ్చే సంప్రదాయాన్ని కొనసాగిస్తామన్నారు. కానీ ఆచరణ అందుకు విరుద్ధంగా జరిగింది. చాలామందిని గ్రామ సచివాలయాలకు పిలిపించి క్యూలైన్లో కూర్చోబెట్టుకున్నారు. కొన్నిచోట్ల స్థానిక తెలుగుదేశం నాయకుల ఇళ్లల్లోనే కార్యక్రమాన్ని జరిపించారు. ప్రతిచోటా మెడలో పార్టీ జెండాలు కప్పుకొని హడావిడి చేశారు. కొన్నిచోట్ల జనసేన జెండాలకూ, తెలుగుదేశం జెండాలకూ మధ్య క్రెడిట్ వార్ జరిగింది.పెన్షన్ల పంపిణీ అనే కార్యక్రమం గడిచిన ఐదేళ్లూ ఎలా జరిగింది? ఎప్పుడైనా రాజకీయ జోక్యం మాట విన్నామా? ఎక్కడైనా జెండాలు, కండువాలు కనిపించాయా? కుల మత రాజకీయ వర్గ లింగ భేదం లేకుండా లబ్ధిదారుల ఎంపిక జరిగింది. ఒకటో తేదీ సూర్యోదయం వేళకే ప్రతి ఇంటి గుమ్మానికీ వలంటీర్లు చేరుకొని పెన్షన్ సొమ్ములు అందజేశారు. ఎక్కడా రాజకీయం లేదు. కేవలం ప్రభుత్వ కార్యక్రమంగానే జరిగింది. లబ్ధిదారుల ఎంపికలోగానీ, పెన్షన్ల పంపిణీలో గానీ వైసీపీ కార్యకర్తలు జోక్యం చేసుకోలేదు. నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తి అంటే ఇదే కదా! ప్రభుత్వాలు పని చేయవలసిన తీరు ఇదే కదా!కొత్త సర్కారు వారి తొలి మాసం నిర్వాకంలోనే రాజకీయం గజ్జెలు కట్టుకొని దూకింది. తమ పార్టీ వారు కాదన్న కారణంతో చాలాచోట్ల పంపిణీ చేయలేదన్న ఆరోపణలు వచ్చాయి. ఈ ధోరణి ఇంకెంతదూరం వెళ్తుందో రానున్న రోజుల్లో పూర్తిగా అర్థమవుతుంది. పోనీ, మేనిఫెస్టోలో చెప్పినట్టుగా పెన్షన్ కార్యక్రమాన్ని సంపూర్ణంగా అమలు చేశారా? బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు యాభయ్యేళ్లకు పెన్షన్ వర్తింపజేస్తామన్నారు! మొదటి నెలలోనే ఇవ్వడం కుదరకపోవచ్చు. కనీసం ఏ నెలలో, ఏ సంవత్సరంలో అమలు చేస్తారన్న ప్రకటనైనా రావాలి కదా! ఆ ముహూర్తం కోసం లక్షలాదిమంది ఎదురు చూస్తున్నారు.‘సూపర్ సిక్స్’ పేరుతో తెలుగుదేశం పార్టీ ఆరు మాసాలపాటు ఊదరగొట్టిన ఆరు హామీలనైనా వెంటనే అమలు చేయడం ప్రారంభించి ఉంటే... మిగిలిన మేనిఫెస్టోపై జనం నమ్మకం పెట్టుకునే అవకాశం ఉండేది. కనీసం వాటికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఈ నెల రోజుల్లో విడుదల కాకపోవడం ఆందోళన కలిగిస్తున్నది. 20 లక్షల ఉద్యోగాలన్నారు, షెడ్యూల్ ప్లీజ్! నిరుద్యోగులందరికీ మూడు వేల రూపాయల నెలసరి భృతి అన్నారు. ఎప్పటి నుంచి? కనీసం ఒక ప్రకటన వచ్చినా వారికి కొంత ఊరట లభిస్తుంది.ప్రతి బిడ్డా తప్పనిసరిగా బడికి వెళ్లాలనీ, మంచి చదువు అభ్యసించాలన్న లక్ష్యంతో జగన్మోహన్రెడ్డి ‘అమ్మ ఒడి’ అనే ఒక వినూత్న కార్యక్రమాన్ని అమలు చేశారు. పిల్లల్ని బడికి పంపే విధంగా ప్రోత్సహించడం కోసం బడి వయసు పిల్లలున్న ప్రతి తల్లికీ ఏటా 15 వేల రూపాయలను అందజేశారు. ఈ కార్యక్రమం సత్ఫలితాలను ఇచ్చింది. ‘ఒక్క పదిహేను వేలే ఇవ్వడం ఏమిటి, మేము అధికారంలోకి వస్తే ఇంట్లో ఎందరు పిల్లలుంటే అన్ని పదిహేను వేలు ఇస్తామ’ని కూటమి టముకు వేసింది. ‘సూపర్ సిక్స్’లో రెండో కార్యక్రమంగా దాన్ని నమోదు చేసింది. సుమారు కోటిమంది పిల్లలు ఆశతో ఎదురు చూస్తున్నారు.పసిపిల్లల్ని ఆశపెట్టి మోసగించడం మహాపాపం. తేదీలు త్వరగా ప్రకటించండి. పుణ్యకాలం గడిచిపోతున్నది.వ్యవసాయ సీజన్ ప్రారంభానికి ముందే వైఎస్ జగన్ ప్రభుత్వం ‘రైతు భరోసా’ పేరుతో రైతుకు పెట్టుబడి ఖర్చును అందజేసేది. ఈ సాయాన్ని తాము 20 వేల రూపాయలకు పెంచుతామని మేనిఫెస్టోలో మూడో సిక్సర్ కొట్టారు. వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. అప్పుడే మృగశిర, ఆరుద్ర కార్తెలు ముగిసి పునర్వసు నడుస్తున్నది. సర్కారు సాయం చినుకులు ఎప్పుడు రాలుతాయో చెప్పే నాథుడు కనిపించడం లేదు. పందొమ్మిదో యేడు నుంచి యాభై తొమ్మిదేళ్ల వరకు ప్రతి మహిళకూ నెలకు పదిహేను వందలు అందజేస్తామని ‘సూపర్ సిక్స్’లో పేర్కొన్నారు.ఈ వయసులో ఉన్న మహిళల సంఖ్య సుమారు ఒక కోటీ ఎనభై లక్షలని అంచనా. వచ్చే నెల శ్రావణమాసం. శుభ దినాలు. ఆడపడుచులు ఆశతో ఎదురుచూస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణం గురించి ఇంకెప్పుడు చెబుతారని అడుగుతున్నారు. ఉచితంగా ఇచ్చే మూడు సిలిండర్లను ఏయే నెలల్లో ఇవ్వబోతున్నారో తెలుసుకోగోరుతున్నారు. ఈ నిరీక్షణంతా కూటమి వాగ్ధానాల్లో పెద్దపీట వేసిన ‘సూపర్ సిక్స్’ గురించే! చేంతాడు పొడవు మేనిఫెస్టో గురించిన ప్రస్తావన ఇంకా మిగిలే ఉంది.ఎన్నికలకు ముందు అన్ని రాష్ట్రాలూ, కేంద్ర ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లను ఆమోదించుకున్నాయి. ఈ నెలలో పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టవలసి ఉన్నది. ఈ నేపథ్యంలోనే మేనిఫెస్టో హామీల అమలుకు సంబంధించిన షెడ్యూల్ ప్రకటనకు ప్రాధాన్యం ఉన్నది. ఎందుకంటే వాటికి అవసరమైన కేటాయింపులను ఈ బడ్జెట్లో ప్రతిపాదించాలి. అటువంటి ప్రతిపాదనలకు చోటు దక్కనట్టయితే మేనిఫెస్టో అమలు అటకెక్కినట్టే! మరో ఏడాదిపాటు మాట్లాడే అవకాశం ఉండదు. ‘సూపర్ సిక్స్’ హామీలు, పెంచిన పెన్షన్ల అమలుకు మాత్రమే అదనంగా ఏటా లక్ష కోట్లకు పైగా నిధుల అవసరం ఉన్నదని ఒక అంచనా.గతంలో అమలులో ఉన్న పథకాలను యథావిధిగా అమలు చేస్తూనే (పెన్షన్లు, అమ్మ ఒడి మినహా) అదనంగా లక్ష కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. అంత సొమ్మును అదనంగా ఎలా సమీకరించబోతున్నారో తేలవలసి ఉన్నది. వారి మాటల్లోనే చెప్పాలంటే, అడ్డగోలుగా అప్పులు చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని శ్రీలంకకు అమ్మమ్మగా మారుస్తారో, అమల్లో ఉన్న పథకాలకు అంటకత్తెర వేసి ఇచ్చిన హామీలను అటకెక్కిస్తారో పూర్తిస్థాయి బడ్జెట్లో తేలిపోతుంది. చంద్రబాబు ‘సంపద సృష్టి’ కార్యక్రమం ఇంకా ప్రారంభం కాలేదు. ఎప్పుడవుతుందో తెలియదు! అమరావతి నిర్మాణంతో సంపద సృష్టించడం అంటే మెజీషియన్ టోపీలోంచి పిల్లిని బయటకు తీయడం లాంటిదేనని ఆర్థిక నిపుణుల అభిప్రాయం.ఈ నేపథ్యంలో మేనిఫెస్టో హామీలు, సంక్షేమ పథకాల కొనసాగింపు తదితర అంశాల నుంచి జనం దృష్టిని మళ్లించే రాజకీయ టక్కుటమారాలే చంద్రబాబు సర్కార్ ముందున్న ప్రత్యామ్నాయమన్న అభిప్రాయం బలపడుతున్నది. అందువల్లనే ‘రెడ్ బుక్’ ఎజెండాగానే గడిచిన నెలరోజుల పరిపాలన జరిగింది. రాజకీయ ప్రత్యర్థులపై వెయ్యికి పైగా దాడులు, విధ్వంసాలు ఈ స్వల్పకాలంలో జరిగాయి. అనేకమందిపై కేసులు పెట్టారు. మేనిఫెస్టో అమలు గురించి అడిగే సాహసం ఎవరూ చేయకూడదు. అందుకోసమని రెడ్బుక్ టెర్రర్ను అమలుచేస్తున్నారు. సాక్షాత్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముద్దాయిగా చేరుస్తూ ఒక దిక్కుమాలిన కేసును కూడా నమోదు చేశారు. మూడేళ్ల కింద సుప్రీంకోర్టు కొట్టివేసిన కేసును మళ్లీ నమోదు చేసి మాజీ ముఖ్యమంత్రిని, ఇద్దరు ఐపీఎస్ అధికారులను, ఒక ప్రభుత్వ డాక్టర్ను ముద్దాయిలుగా చేర్చడం ఎంత తెంపరితనమో అర్థం చేసుకోవచ్చు. నిన్నటిదాకా ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వ్యక్తిపైనే కేసు పెడితే ప్రశ్నించే గొంతులు వణికిపోతాయని సర్కార్ పెద్దలు భావిస్తే అంతకన్నా అవివేకం ఉండదు. మేనిఫెస్టో హామీలు, ‘సూపర్ సిక్స్’ వాగ్దానాలు బడ్జెట్ పరీక్షను పాస్ కావలసిందే! లేకపోతే నిలదీసే గళాలు వేలల్లో, లక్షల్లో ఉండవు. కోట్ల గొంతుకలు విచ్చుకుంటాయి. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
వైఎస్ జగన్ చేసిన అభివృద్ధి, మేలుపై దేశవ్యాప్తంగా చర్చ
-
YS జగన్ ప్రభుత్వంపై SBI ప్రశంసలు
-
సంక్షేమం.. సాధికారత.. వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక ప్రశంసలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గత ఐదేళ్లలో మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం పౌరుల ఆరోగ్యం, విద్య, మహిళా సాధికారత లక్ష్యంగా పలు సంక్షేమ పథకాలను అమలు చేసిందని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక ప్రశంసించింది. ఏపీతో పాటు మహారాష్ట్ర, కేరళ, కర్నాటక తమ ఆదాయ రాబడుల్లో సంక్షేమ పథకాల కోసం గణనీయంగా వ్యయం చేశాయని పేర్కొంది. త్వరలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో వివిధ రాష్ట్రాల ఆదాయ వనరులు, సంక్షేమ పథకాలకు చేసిన వ్యయాలపై రీసెర్చ్ నివేదికను ఎస్బీఐ సోమవారం విడుదల చేసింది. దేశం సంక్షేమ రాజ్యంగా మారుతున్నట్లు కనిపిస్తోందని తెలిపింది. వైఎస్ జగన్ ప్రభుత్వం మహిళలు, పిల్లల విద్య, ఆరోగ్యంతో పాటు సాధికారత దిశగా సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేసినట్లు నివేదిక విశ్లేషించింది. ⇒ ఏపీలో గత ప్రభుత్వం అమలు చేసిన కొన్ని పథకాలను రీసెర్చ్ నివేదిక వ్యయంతో సహా ప్రముఖంగా ప్రస్తావించింది. ఏటా 47 లక్షల మంది పిల్లలకు జగనన్న విద్యా కానుక కింద యూనిఫాం, బ్యాగ్, బూట్లు, పాఠ్యపుస్తకాలు తదితరాలను ఉచితంగా అందచేశారని పేర్కొంది. జగనన్న అమ్మ ఒడి కింద పిల్లల తల్లుల ఖాతాల్లో పారదర్శకంగా నగదు జమ చేశారని, ఇవన్నీ మహిళలు, పిల్లల విద్యతో ముడిపడి రూపొందించిన సంక్షేమ పథకాలని తెలిపింది. మహిళల ఆర్ధికాభివృద్ధే లక్ష్యంగా అర్హత కలిగిన ప్రతి మహిళకూ వైఎస్సార్ చేయూత పథకాన్ని అందించారని, పేద మహిళలను ఆర్ధికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా దీన్ని రూపొందించారని వెల్లడించింది. జగనన్న గోరు ముద్ద ద్వారా సుమారు 43 లక్షల మంది స్కూలు పిల్లలకు నాణ్యమైన, రుచికరమైన పౌష్టికాహారాన్ని అందించారని, చిన్నారుల్లో పౌష్టికాహార లోపాలను నివారించడమే లక్ష్యంగా చర్యలు తీసుకున్నారని ప్రశంసించింది. పొదుపు సంఘాల మహిళల (ఎస్హెచ్జీ) సాధికారతే లక్ష్యంగా వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేశారని ఎస్బీఐ నివేదిక తెలిపింది. విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత లక్ష్యంగా రూపొందించిన ఈ పథకాలు దేశ ఆర్ధికాభివృద్ధికి దోహదం చేస్తాయని పేర్కొంది. ⇒ ఆంధ్రప్రదేశ్లో గత ఐదేళ్లలో సగటు వార్షిక రెవెన్యూ రాబడులు 12 శాతం వృద్ధి నమోదు కాగా అందులో 11 శాతం మేర సంక్షేమ పథకాలకు వ్యయం చేసినట్లు రీసెర్చ్ నివేదిక తెలిపింది. మహారాష్ట్రలో గత ఐదేళ్లలో సగటు వార్షిక రెవెన్యూ రాబడులు 10 శాతం వృద్ధి చెందగా అందులో 11 శాతం సంక్షేమ పథకాలకు వ్యయం చేశారు. ఒడిశాలో ఐదేళ్లలో సగటు వార్షిక రెవెన్యూ రాబడుల్లో వృద్ధి 13 శాతం కాగా అందులో 8.10 శాతం సంక్షేమ పథకాలకు వ్యయం చేసినట్లు తెలిపింది. కేరళలో గత ఐదేళ్లలో సగటు వార్షిక రెవెన్యూ రాబడుల వృద్ధి 8 శాతం నమోదు కాగా అందులో 8 శాతం సంక్షేమ పథకాలకు వ్యయం చేశారు. కర్నాటక, పశ్చిమ బెంగాల్లో సగటు వార్షిక రెవెన్యూ రాబడుల వృద్ధి కంటే సంక్షేమ పథకాలకు కేటాయింపులు ఎక్కువగా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. కర్నాటకలో సగటు వార్షిక రెవెన్యూ రాబడులు వృద్ధి 8 శాతం ఉండగా పధకాలకు కేటాయింపులు 15 శాతం ఉంది. పశ్చిమ బెంగాల్లో సగటు వార్షిక రెవెన్యూ రాబడుల వృద్ధి 8 శాతం ఉండగా పథకాలకు కేటాయింపులు 10 శాతంగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. -
అవసరం కాదు... అనివార్యం!
ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో కని విని ఎరుగని రీతిలో విద్య, వైద్యం వంటి అనేక రంగాల్లో వైఎస్ జగన్ తీసుకువచ్చిన మార్పు విప్లవాత్మకమైనది. మొన్నటి ఎన్నికలలో జగన్ పార్టీ ఓటమికి కారణాలు బలమైనవేమీ కావు. ప్రత్యర్థులు జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలైన నవరత్నాలపై తప్పుడు ప్రచారాలతో ప్రజలను నమ్మించారు. బడుగు–బలహీన వర్గాల సంక్షేమాన్నీ, అభివృద్ధినీ ఓర్వలేని కూటమి నేతలు పనిగట్టుకొని విషప్రచారం చేశారు. కుటుంబ వ్యవహారాలను రాజకీయ అంశాలుగా చిత్రిచారు. సంక్షేమ పథకాలపై పెడుతున్న దృష్టి అభివృద్ధిపై లేదని ప్రచారం చేశారు. విదేశాల్లో స్థిరపడి అమరావతిలో భూములు కొన్న కార్పొరేట్స్తో డబ్బులు వెదజల్లించి అడ్డదారిలో, అసంబద్ధపు ప్రేలాపనలతో కూటమి అధికారంలోకి వచ్చింది.అభివృద్ధి చెందుతున్న మనలాంటి దేశాల్లో సంక్షేమాన్ని విస్మరిస్తే వెనకబడిన జాతులు సామాజికంగా, ఆర్థికంగా మరింత నష్టపోతాయి. సంక్షేమం, అభివృద్ధి వేరు వేరు కాదని రాజకీయ పార్టీలూ, నాయకులూ గుర్తించాలి. ప్రజలకు విద్య, వైద్యం ఇవ్వడం ప్రభుత్వాల ప్రాథమిక విధి. పేదల జీవితాలను సామజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి పరచకుండా దేశం ముందుకు పోదు. అభివృద్ధి చెందిన వారితో ఈ పేద ప్రజలు పోటీ పడాలంటే వారికి విద్య అవసరం అని బలంగా నమ్మారు కాబట్టే జగన్ సంక్షేమానికి పెద్దపీట వేశారు. జగన్ సామాజిక వర్గాల వారీగా ఇవ్వాల్సిన సీట్ల కంటే ఎక్కువ ఇచ్చి సామాజిక న్యాయం పాటించారు. కాగా చంద్రబాబు జనాభా దామాషా ప్రకారం సీట్లు ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వంలో తీసుకున్న మంత్రి పదవులను ఒక్క దళితుడికి కూడా కేటాయించలేదు. అధికారంలోకి వస్తే మా మేనిఫెస్టోను పక్కాగా అమలుపరుస్తామని ప్రగల్బాలు పలికిన కూటమి నేతలు ఒక పథకం కూడా అమలు కాకముందే అక్రమ కట్టడాల పేరుతో వైసీపీ పార్టీ ఆఫీసులు కూలగొడుతున్నారు. ఆ పార్టీ కార్యకర్తల ఇళ్లపైనా దాడులు చేస్తూ విధ్వంసక పాలన ప్రారంభించారు. ప్రజల పక్షాన నిలబడి వారి భవితకు బంగారు బాటలు వేస్తారని ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే... పగలు, ప్రతీకారాలు తీర్చుకోవడానికి ఈ విజయాన్ని బాబు ప్రభుత్వం వాడుకోవడం శోచనీయం. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి కంటే ఎక్కువ అభివృద్ధిచేసి తాము గత పాలకుల కంటే ఎంత గొప్పవాళ్లమో నిరూపించుకోవాల్సిన కూటమి నేతలు... అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు.గత ఐదేళ్ళల్లో అనేక రంగాల్లో వచ్చిన మార్పులను చూస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కు ‘జగన్ అవసరం కాదు... అనివార్యం’ అనిపిస్తోంది. జగన్ ఈసారి కూడా అధికారంలోకి వచ్చి ఉంటే ఒక తరం పిల్లలు గొప్ప విద్యవంతులుగా విద్యాలయాల నుంచి బయటకు వచ్చేవారు. చంద్రబాబు అధికారం చేపట్టాక ఈ తరహా అభివృద్ధి ముందుకు వెళుతుందా అన్నది సందేహమే. – సునీల్ నీరడి, ఉస్మానియా యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ రీసర్చ్ స్కాలర్ -
అరుదైన గౌరవం.. రష్యా లైబ్రరీలో వైఎస్ జగన్ గ్రామ స్వరాజ్యం పుస్తకం
-
సంక్షేమ పథకాలకు పేర్లు మార్చిన రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, అమరావతి: సాంఘిక సంక్షేమశాఖ పరిధిలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన ఆరు పథకాలకు టీడీపీ ప్రభుత్వం పేర్లు మార్చింది. ఈ మేరకు సాంఘిక సంకేమ శాఖ కార్యదర్శి కె.హర్షవర్థన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్గా ‘నాడు–నేడు’ డాష్ బోర్డు పేరు మార్పు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం ‘మనబడి నాడు–నేడు’ పేరుతో ప్రత్యేక విభాగాన్ని అందుబాటులోకి తెచ్చింది.]ఈ పనుల పురోగతితో పాటు అన్ని అంశాలను పరిశీలించి తగు నిర్ణయం తీసుకునేందుకు ఓ ప్రత్యేక కమిషనర్ను కూడా నియమించింది. అయితే, ఇప్పటి వరకు పాఠశాల విద్యాశాఖలో ‘నాడు–నేడు’ పేరుతో ఉన్న వెబ్సైట్ను ‘స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్’గా పేరు మార్చారు. ఈ విభాగంలో రాష్ట్రంలోని సుమారు 45 వేల ప్రభుత్వ పాఠశాలల పునర్ నిర్మాణంతో పాటు 11 రకాల సదుపాయాలను కల్పించే బృహత్తర కార్యక్రమాన్ని ఈ విభాగం చేపట్టింది. -
సరిగ్గా ఐదేళ్ల క్రితం.. ప్రజా పరిపాలనకు శ్రీకారం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు అరాచక పాలనకు చరమగీతం పాడి.. ప్రజాపరిపాలనకు సీఎం వైఎస్ జగన్ నాంది పలికి నేటికి సరిగ్గా ఐదేళ్లు. గత ఎన్నికల్లో 50 శాతం ఓట్లు.. 151 శాసనసభ, 22 లోక్సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ చారిత్రక విజయం సాధించింది. కేవలం 23 అసెంబ్లీ, మూడు లోక్సభ స్థానాలకు పరిమితమైన టీడీపీ ఘోర పరాజయం పాలైంది. వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధించడంతో 2019, మే 30న విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారంచేసి.. ప్రజాపరిపాలనకు శ్రీకారం చుట్టారు. ఎన్నికల్లో ఇచి్చన హామీల్లో 95 శాతం అధికారం చేపట్టిన తొలి ఏడాదే అమలుచేశారు. మొత్తమ్మీద 99 శాతం హామీలు అమలుచేసి మేనిఫెస్టోకు సరికొత్త నిర్వచనం ఇచ్చారు. సువర్ణాక్షరాలతో లిఖించేలా గత ఐదేళ్లుగా సంస్కరణలు, వికేంద్రీకరణ, సంక్షేమం, అభివృద్ధి పథకాలతో రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించేలా సీఎం జగన్ సుపరిపాలన అందించారు. నవరత్నాలు, సంక్షేమ పథకాల ద్వారా అర్హతే ప్రామాణికంగా.. వివక్ష చూపకుండా.. లంచాలకు తావులేకుండా అత్యంత పారదర్శకంగా పేదల ఖాతాల్లో డీబీటీ రూపంలో నేరుగా రూ.2.70 లక్షల కోట్లు జమచేశారు. నాన్ డీబీటీ రూపంలో రూ.1.79 లక్షల కోట్ల ప్రయోజనం చేకూర్చారు. దేశ చరిత్రలో ఐదేళ్లలో డీబీటీ, నాన్ డీబీటీ రూపంలో రూ.4.49 లక్షల కోట్ల ప్రయోజనాన్ని పేదలకు చేకూర్చిన దాఖలాలు ఎక్కడాలేవు. గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ, జిల్లాల పునర్వ్యవస్థీకరణ ద్వారా పరిపాలనను వికేంద్రీకరించారు. ఇంటిగుమ్మం వద్దకే ప్రజలకు ప్రభుత్వ సేవలను అందించారు. విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలతో అభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపారు.మంచి చేసిన ప్రభుత్వానికి దన్నుగా..ఈ నేపథ్యంలో.. ఇప్పటికే అమలవుతున్న పథకాలను కొనసాగిస్తూ.. ఏటా అమ్మఒడి పథకం కింద ఇస్తున్న సొమ్మును రూ.15 వేల నుంచి రూ.17 వేలకు పెంచుతామని.. రైతుభరోసా కింద ఇస్తున్న రూ.13,500 నుంచి రూ.16 వేలకు పెంచుతామంటూ కొత్తగా హామీలిచ్చిన సీఎం జగన్.. మీ బిడ్డ ప్రభుత్వంవల్ల మీ కుటుంబానికి మంచి జరిగి ఉంటే.. ఫ్యాన్ గుర్తుపై రెండు బటన్లు నొక్కి ఓటువేసి ఆశీర్వదించాలని ప్రజలకు వినమ్రంగా విజ్ఞప్తి చేశారు. సీఎం జగన్ వినతికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా తీర్చిదిద్దేందుకు.. రాష్ట్రం రూపురేఖలను మరింతగా గొప్పగా మార్చేందుకు వైఎస్సార్సీపీకి ప్రజలు దన్నుగా నిలిచారు. గత ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లోనూ అధిక స్థానాలు చేజిక్కించుకుని వైఎస్సార్సీపీ చారిత్రక విజయం సాధించడం ఖాయమని రాజకీయ పరిశీలకులు స్పష్టంచేస్తున్నారు. -
గెలుపెవరిదో వారి పాలనే చెబుతుంది!
జూన్ 4న ఎన్నికల ఫలితాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాలు ప్రజలకోసం అమలు చేసిన కార్యక్రమాలు లోతుగా పరిశీలిస్తే గెలుపు ఎవరిది అనేది స్పష్టంగానే బోధపడుతుంది.బాబు పాలన ఎక్కువకాలం రాజధాని అమరావతి చుట్టూ తిరిగింది. ఒక పెద్ద స్కామ్ను నడిపింది. బాబు ముఖ్యమంత్రిగా దిగిపోయేనాటికి తాత్కాలిక సచివాలయం, కోర్టు భవనాలు నిర్మించారే తప్ప శాశ్వతమైన నిర్మాణాలు ఏవీ జరగలేదు. జగన్ మోహన్ రెడ్డి జూన్ 2019లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి మనసా, వాచా, కర్మణా ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టి నిర్వహించారు. గ్రామస్థాయికి అధికార వికేంద్రీకరణ చేశారు. గ్రామ సచివాలయం, దానికి అనుబంధంగా వలంటీర్ వ్యవస్థను గ్రామాలలో ఏర్పాటు చేసి ప్రజలకు కావలసిన అన్ని సేవలు ఇంటి వద్దకే చేర్చారు. బాబు పాలనలో ప్రభుత్వ పాఠాశాలలు నిర్వీర్యం అయ్యాయి. ప్రభుత్వ ఆసుపత్రులలో కావలసిన వైద్య పరికరాలు, రోగులకు కావలసిన మందులు ఇవ్వలేదు. వైద్యులు, నర్సుల ఖాళీలు నింపలేదు. ప్రైవేట్ పాఠశాలలను, వైద్యశాలలను బాగా ప్రొత్సహించారు బాబు. అయితే జగన్ పాలన ప్రభుత్వ ఆసుపత్రులు, పాఠశాలలకు స్వర్ణయుగం అయ్యింది. వైద్యులు, నర్సుల పోస్టులు ¿ý ర్తీ చేశారు. ఆరోగ్యశ్రీ కింద పరిమితిని ఇరవై ఐదు లక్షల వరకు పెంచి, అధిక రోగాలకు ఆ పథకాన్ని వర్తింపజేశారు. కొత్తగా జగన్ ప్రభుత్వం 17 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తోంది. జగన్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టడం, బడికి పిల్లలను పంపించే తల్లులకూ, బడికి వచ్చే పిల్లలకూ అనేక పథకాలను వర్తింపచేయడం తెలిసిందే. బాబు 2014లో ఇచ్చిన మ్యేనిఫెస్టోలోని ముఖ్య హామీలైన రైతు, డ్వాక్రా గ్రూపుల రుణమాఫీ చేయలేదు. పుట్టిన బిడ్డకు రూ. 25,000 డిపాజిట్ చేసే ‘మహాలక్ష్మి’ పథకం పూర్తిగా అమలు కాలేదు. ఇంటింటికీ ఉద్యోగాలు ఇవ్వలేదు. 2019లో జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత వేల కోట్ల డ్వాక్రా రుణాలు మాఫీ చేశారు. మేనిఫెస్టోలో చెప్పిన హామీలు 99 శాతం అమలు చేశారు. ఇళ్లస్థలాలను మహిళల పేర ఇవ్వడం, వారికి రాజకీయాల్లోనూ మంచి అవకాశాలు ఇవ్వడం, అనేక రకాల పెన్షన్లు అమలుచేయడం చూస్తే ఆయన మహిళా పక్షపాతి అని అర్థమవుతుంది.2014 మేనిఫెస్టో అమలులో పూర్తిగా విఫలమైన బాబు 2024లో ‘బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ’ పేరుతో 177 హామీలు, ‘సూపర్ సిక్స్’ పేరుతో ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం వంటివాటిని చేర్చారు. అయితే సంక్షేమ పథకాలతో జగన్ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నారని విమర్శించిన బాబు ఇప్పుడు ఆయన కన్నా ఎక్కువ సంక్షేమ పథకాలు అమలు చేస్తానని ఎన్నికల్లో చెప్పడాన్ని ప్రజలు నమ్మలేదు. అందుకే మే 13న రాష్ట్రంలో జరగిన ఎన్నికలలో 80 శాతం మంది వృద్ధులు, 65 శాతం మంది మహిళలు జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓట్లు వేసినట్లు అంటున్నారు. కావున ఎన్నికలలో జగన్ విజయం సునాయాసమే! ఎ. జయప్రదా రాఘవరెడ్డి వ్యాసకర్త సామాన్య గృహిణి, కడప -
అందరివాడికే అందలం
తన వల్ల మేలు జరిగిందీ అంటేనే ఓటేయండి అని జగన్ అడిగిన తీరు ఎన్నడూ కననిదీ, విననిదీ. బహుశా దేశంలోనే ఏ నాయకుడు కూడా ఇంత ఆత్మవిశ్వాసంతో సూటిగా అడిగి ఉండరు. అన్ని వర్గాల ప్రజలూ వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులే అన్నది ఈ విశ్వాసానికి కారణం. దానికి రుజువే ఎన్నికల ప్రచారంలో ఆయనకు లభిస్తున్న అమితమైన ఆదరణ! ఆంధ్రప్రదేశ్ ఓటర్లు మరోసారి ఆయన్ని అధికార పీఠం ఎక్కించడానికి ‘సిద్ధం’గా ఉన్నారని దీన్నిబట్టి అర్థమవుతోంది.‘కాణి’ ముత్యాలు ఇంటికే – మళ్లీ పట్టం జగన్కే!ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరోమారు విస్పష్టంగా జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇవ్వనున్నారు. ఇది తెలుసుకోవడానికి ‘సర్వేశ్వరులను’ అడగనవసరం లేదు. గతంలో సర్వేలన్నీ సుప్రసిద్ధ మీడియా సంస్థలు నిర్వహించేవి. ఇప్పుడు ఎవరికి నచ్చిన విధంగా వారు సర్వేలు చేయించుకుంటూ ‘స్వింగ్’ ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ప్రకటన వెలువడిన దగ్గర నుంచి ఇటు వైసీపీ, అటు కూటమి ప్రచార సరళి, అభ్యర్థుల ఎంపిక, ప్రజాస్పందన నిశితంగా పరిశీలిస్తే, తీర్పు ఎలా ఉండబోతోందో మనకే అర్థమవుతుంది.జగన్ అన్ని పార్టీల కంటే ముందుగానే విడతల వారీగా అభ్యర్థులను ప్రకటించారు. టీడీపీ, జనసేన అవగాహన కుదుర్చుకున్నా, చివరి వరకూ బీజేపీ జత కడుతుందో లేదో తెలియని సందిగ్ధం. అందుకే చాలాచోట్ల ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటించేసుకున్నారు. తీరా బీజేపీ వచ్చి చేరాక, మళ్ళీ అభ్యర్థుల ప్రకటనలో కుస్తీ పట్టాల్సి వచ్చింది. ఆశించిన స్థాయిలో కాక అతి తక్కువ సీట్లు జనసేన తీసుకోవడం, బీజేపీ పూర్వ అధ్యక్షుడు సోము వీర్రాజుతో సహా సిసలైన బీజేపీ వారికి టికెట్లు దక్కకపోవడం వంటివి లుకలుకలకు కారణమయ్యాయి. పేరుకే మూడు పార్టీల జెండాలు. జన శ్రేణులు మాత్రం కలిసి పనిచేసే పరిస్థితి చాలా చోట్ల లేకుండా పోయింది.పోనీ నిలబెట్టిన టీడీపీ అభ్యర్థుల్లో ఆణిముత్యాల లాంటి వారు ఉన్నారా అంటే, అబ్బే! చాలావరకు కాణి ముత్యాలే! ఇంచుమించు చంద్రబాబు మహా దోపిడీలో భాగస్వాములు లేదా ఆ దోపిడీ నుంచి స్ఫూర్తి పొందినవారే. ఇటు బెజవాడ దుర్గమ్మ, అటు విశాఖ కనకమహాలక్ష్మి, ఆ పక్క అనకాపల్లి నూకాలమ్మ సాక్షిగా వీరంతా కాణి ముత్యాలు. ఇలాంటివాళ్లే చంద్రబాబుకు కావాలి. టిప్పర్ డ్రైవర్లు, కమతగాళ్లు అంటే ఆయనకు అసహ్యం. ఈ బాపతు కాణి ముత్యాల్ని జనం ఆదరించరని చరిత్ర చెబుతున్న సత్యం. అందుకే వీళ్ళు ఎక్కువగా ‘బ్యాక్ డోర్ పాలిటిక్స్’ నడుపుతుంటారు.ఇక ప్రచార తీరు పరిశీలిస్తే, తన వల్ల మేలు జరిగిందీ అంటేనే ఓటేయండి అని జగన్ అడిగిన తీరు... బహుశా దేశంలోనే ఏ నాయకుడు ఇంత ఆత్మ విశ్వాసంతో సూటిగా అడిగి ఉండరు. ఆయన ప్రచారాస్త్రాలు కూడా విలక్షణంగా ఉన్నాయని చెప్పాలి. ఎక్కడా నిగ్రహం కోల్పోకుండా విమర్శలకే పరిమితమయ్యారు తప్ప స్థాయి మరచి తిట్లులంకించుకోలేదు, హుందాతనాన్ని కోల్పోలేదు. మరి కూటమి విషయానికొస్తే– వెకిలితనం, బూతు పురాణం, కొట్టండి, చంపండి, నరకండి అని జనాల్ని ప్రేరేపించటం సభ్య సమాజాన్ని విస్తుపరిచాయి. జగన్పై విసిరిన రాయి దాడిని ఖండించాల్సింది పోయి ‘గులక రాయి’ అని వెకిలితనాన్ని ప్రదర్శించటం, వలంటరీ వ్యవస్థను కట్టడి చేయడం, పండు టాకుల, పుండు రెక్కలపై ఆక్రోశం వెలిబుచ్చి వాళ్ళ చావుకి కారణం కావడం, లేని భూయాజమాన్య హక్కు చట్టంపై దుష్ప్రచారానికి పూనుకోవడం వంటివి అన్నీ బూమరాంగ్ ఆయ్యాయి. అయితే జగన్ పని అయిపోయింది, ఇక తామే అధికారంలోకి వస్తున్నామనే ఫేక్ సర్వేలలో మాత్రం ముందున్నారు. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 4 కోట్ల 13 లక్షలు. ఇందులో అర్బన్ ఓటర్లు కేవలం 87 లక్షలు. జగన్కు పెట్టని కోటల వంటి గ్రామీణ ఓటర్ల సంఖ్య 3 కోట్ల 20 లక్షలు. అందులో సంక్షేమ పథకాల లబ్ధిదారులే అధికం. ఇక కులాల ప్రాతిపదికగా చూస్తే... ఎస్సీలు 35 లక్షల 46 వేల 748, ఎస్టీలు 25 లక్షల 85 వేల 726, ముస్లింలు 23 లక్షల 84 వేల 449, బీసీ యాదవులు 25 లక్షలు, మత్స్యకారులు 15 లక్షల 74 వేల 868, గౌడలు 19 లక్షల 78 వేల 866,చంద్రబాబు చేత తీవ్ర అవమానాలకు గురైన రజకులు, నాయీ బ్రాహ్మణులు 8 లక్షల 41 వేల 400+ 4 లక్షల 15 వేల 520, బ్రాహ్మణులు 7 లక్షల 4 వేల 165. క్రైస్తవులు 3 లక్షల 15 వేల 320... ఈ సామాజిక వర్గాలలో అత్యధికులు జగన్ వైపే ఉన్నారు. అధిక శాతం ఉన్న మరొక వర్గం, గోదావరి జిల్లాల్లో నిర్ణయాత్మక శక్తి అని చెబుతున్న కాపులు, రాయలసీమలోని బలిజలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ ప్రాంతాల్లో ప్రధానంగా, ఇంకా ఇతర ప్రాంతాల్లో ఉన్న తూర్పు కాపులు, ఒంటరులు మొత్తం 52 లక్షల 97 వేల 748 మంది. వీరిలో జనసేన వైపు ఆశగా చూసి భంగపడిన వారు, చంద్రబాబు సామాజిక వర్గంతో దశాబ్దాల వ్యతిరేకత ఉన్నవారు, వైసీపీలోని కాపు నాయకుల వెంట ఉన్నవారు... ఇలా భిన్నాభిప్రాయాలతో అటూ ఇటూ ఉంటారు. ఇక రెడ్డి వర్గంలోని 26 లక్షల 748 మందిలో అధికులు జగన్ వైపు ఉండగా, కమ్మ వర్గంలోని 26 లక్షల 46 వేల 748 మందిలో అత్యధికులు చంద్రబాబు వైపు ఉంటారు. ఇతర బీసీలు, 13 లక్షల పైచిలుకు ఉన్న వైశ్యులు ఆయా ప్రాంతాల పార్టీ అభ్యర్థుల ప్రాతిపదికన రెండు వైపులా చీలతారు. మొత్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలలో అధిక శాతం వైసీపీ వైపే ఉన్నారు. గెలుపును నిర్ణయించే మరో శక్తి, నారీ శక్తి. అలాంటి మహిళలు జగన్ వైపే ఉన్నారని స్పష్టంగా తెలుస్తోంది. దీనిని బట్టి, ‘మళ్లీ పట్టం జగన్కే – కాణి ముత్యాలు ఇంటికే!’_వ్యాసకర్త పూర్వ సంపాదకుడు- పి. విజయబాబుముస్లింలు బీజేపీని ఓడించాలి – వైసీపీని గెలిపించాలి!ప్రధాని నరేంద్ర మోదీజీ, బీజేపీల నాయకత్వంలో పదేళ్ళుగా కేంద్రంలో అధికా రంలో వున్న ఎన్డీయే ప్రభుత్వం దేశ సంపదను అస్మదీయ కార్పొరేట్లకు కట్టబెడు తున్నది. ఒకవైపు భారతదేశాన్ని మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తానంటూనే మరోవైపు దేశ ప్రజల్ని పేదరికం లోనికి నెట్టి వేస్తున్నది. దేశ ప్రజలంటే 80 శాతం హిందువులు, 14 శాతం ముస్లింలు, 6 శాతం క్రైస్తవులు, సిక్కులు, తదిత రులు. ఐక్యరాజ్య సమితి ప్రకటించిన హ్యాపీనెస్ రిపోర్టులో భారతదేశం 126వ స్థానంలో వుంది. భారత ప్రజలు సంతోషంగా లేరు. అణిచివేతకు గురవుతున్న ప్రతి ఆరుగురిలో ఒకరు మాత్రమే ముస్లిం, ఐదుగురు హిందువులు. దీని అర్థం ఏమంటే మోదీ పాలనకు ప్రధాన బాధితులు హిందువులు. ఈ వాస్తవాన్ని కప్పి పుచ్చడానికి, హిందూ–ముస్లింల మధ్య తగువుపెట్టి ఎన్నికల్ని ఒక మత యుద్ధంగా మార్చడానికిస్వయంగా మోదీజీ నడుం బిగించారు. 2019 లోక్ సభ ఎన్నికల్ని ఆ పార్టీ 1761 నాటి పానిపట్టుయుద్ధంతో పోల్చేది. ఆ యుద్ధంలో అహ్మద్ షా అబ్దాలీ దుర్రానీ చేతుల్లో పీష్వా బాలాజీ బాజీరావు ఓడిపోవడంతో హిందువులు 250 ఏళ్లు అధికారాన్ని కోల్పోయారని గుర్తు చేసి, మళ్ళీ అలాంటి దుఃస్థితి వస్తుందని భయపెట్టింది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్ని ఔరంగజేబ్, శివాజీ మహారాజ్ల మధ్య పోరాటంగా ప్రచారం చేసింది. గతేడాది జరిగిన కర్ణాటక ఎన్నికల్లో టిప్పూ సుల్తాన్కు ఓటేస్తారా? రాణి అబ్బక్కకు ఓటేస్తారా? అని అడిగింది.వివిధ రాష్ట్రాలు విద్యా, ఉపాధి రంగాల్లో ముస్లింలకు ఇస్తున్న రిజర్వేషన్లను రద్దు చేసి హిందూ సమా జంలోని కింది కులాలకు కేటాయిస్తామని బీజేపీ చెపుతున్నది. కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ అంశాన్ని విస్తారంగా ప్రచారం చేశారు. ఆ రెండు రాష్ట్రాల ప్రజలూ ఈ మాటల్ని నమ్మలేదు. మత ప్రాతి పదికన రిజర్వేషన్లను బీజేపీ ఆమోదించదని మరో బూటకపు ప్రచారాన్ని ప్రధాని సాగిస్తున్నారు. నిజానికి మత ప్రాతిపదికనే కులాలుంటాయి. భారత రాజ్యాంగం కొన్ని సమూహాలకు ఇచ్చిన రిజర్వేషన్లు వాస్తవా నికి మత రిజర్వేషన్లే. మాల సామాజిక వర్గానికిచెందిన ఒక వ్యక్తి తాను హిందువుననిగానీ, సిక్కును అనిగానీ ప్రకటించుకుంటేనే ఎస్సీ రిజర్వేషను పొందు తాడు. క్రైస్తవుడినని ప్రకటించుకుంటే బీసీ రిజర్వేషను పొందుతాడు. ఏమిటి దీనర్థం? బీజేపీ ముస్లిం రిజర్వేషన్గా ప్రచారం చేస్తున్నది కూడా నిజానికి ముస్లిం రిజర్వేషన్ కాదు. ముస్లిం సమాజంలో ఓసీలుగా పరిగణించే సయ్యద్, పఠాన్, మొఘల్, బేగ్లకు బీసీ రిజర్వేషన్ వర్తించదు. మహా అయితే వాళ్ళు ఆర్థికంగా వెనుకబడిన సమూహాల (ఇడబ్ల్యూఎస్) కోటాలో లబ్ధి పొందవచ్చు. ముస్లింలను సాంస్కృతిక రంగంలో వివక్షకు గురి చేయడం, ఆర్థిక రంగంలో అతి క్రూరంగా బుల్ డోజర్లతో కూల్చి వేయడం బీజేపీ విధానంగా మారింది. ఏపీలో ప్రధాన పోటీదారులు అధికార వైఎస్సార్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం. ఆంధ్రప్రదేశ్ మొదటి నుండీ మత సామరస్యవాదుల నేల, సామ్యవాదుల భూమి. మతవిద్వేషాన్ని రగిల్చితే తప్ప రాజకీయ మనుగడ సాగించలేని బీజేపీ ఈ నేల మీద తనంత తానుగా మొలకెత్తలేని విత్తనం. 2019 ఎన్నికల్లో విడిగా పోటీచేస్తే బీజేపీకి ఒక్క శాతం ఓట్లు కూడ రాలేదు. లోక్ సభ, అసెంబ్లీల్లో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. జాతీయ స్థాయిలో ఎన్డీయేకు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి మాత్రమే. ఏపీ ముస్లింలు ఈసారి ఒక లెక్క ప్రకారం కాంగ్రెస్కు మద్దతు పలకాలి. అయితే, కర్ణాటక, తెలంగాణాల్లా ఏపీలో కాంగ్రెస్ నిర్మాణం బలంగా లేదు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఎంచుకున్న ప్రాధాన్య తల్ని ఆ పార్టీ ఏపీ నాయకులు పట్టించుకుంటున్నట్టు లేదు. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు బీజేపీని ఓడించాలనే పట్టుదల వున్నట్టు లేదు. కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమిని గెలిపించాలా? బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమిని ఓడించాలా? అనేది ఏపీ ముస్లింల ముందున్న ప్రశ్న. రాష్ట్ర ఆర్థిక అవసరాల కోసమో, మరో కారణాలతోనో వైసీపీ జగన్ ఇన్నాళ్ళు అధికారంలో ఉన్న ఎన్డీయేతో సఖ్యంగా వున్నారు. ఇప్పుడు ఆయనే ఏపీ నేల మీద బీజేపీని ఎదుర్కోవాల్సిన స్థితిలో పడ్డారు. ఎన్నికల ప్రచార ఘట్టం ముగిసేలోగా బీజేపీ, జగన్ల మధ్య పోరు మరింత వుధృతం అవుతుంది. భారత జాతీయ కాంగ్రెస్సా? వైఎస్సార్ కాంగ్రెస్సా? అనే ప్రశ్న మళ్ళా ముస్లింల ముందుకు వచ్చి నిలిచింది. ఇది రాజకీయ సమస్య మాత్రమే కాదు. ఒక విధంగా నైతిక సమస్య కూడా. ఆంధ్రప్రదేశ్ భౌతిక రాజకీయ సమీకరణలు, కాంగ్రెస్ ఏపీ యూనిట్ వాస్తవిక బలాబలాలు, పనితీరుల్ని పరిగణన లోనికి తీసుకుంటే ముస్లింలు వైసీపీకి మద్దతు ఇవ్వడమే మెరుగైన నిర్ణయం అవుతుంది. అది అవసరం కూడా. ఇటీవల విజయవాడలో ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ (ముస్లిం జేఏసీ), ముస్లిం ఆలోచనాపరుల వేదిక(ఎంటీఎఫ్) సంయుక్తంగా నిర్వహించిన ముస్లిం ఉలేమాలు, ఆలోచనాపరులు, అడ్వకేట్లు, డాక్టర్లు, ప్రొఫె షనల్స్తో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఈ మేరకు ఒక తీర్మానం చేసింది. -వ్యాసకర్త ముస్లిం ఆలోచనాపరుల వేదిక (ఎంటీఎఫ్) కన్వీనర్-ఏఎం ఖాన్యజ్దానీ డానీ -
మన ప్రభుత్వం ఉంటే..మరెన్నో సంక్షేమ పథకాలు
-
సీఎం జగన్ పేదలకు డబ్బు పంచడంపై పోసాని హాట్ కామెంట్స్
-
పేదలపై చంద్రబాబు పెత్తందారీ కుట్ర
-
జగన్ ఒక నిజం... ఒక భావోద్వేగం
ఎన్నో ఆటుపోట్లను భరించి ఒంటరిగా రాజకీయ పార్టీని స్థాపించారు. వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఒక బలమైన నిజాయితీ గల ప్రజానాయకుడిగా ఎదిగారు. కనీవినీ ఎరుగని మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. కరోనా వల్ల రెండేళ్లు కలిసిరాక పోయినా ప్రజల్ని కంటిరెప్పల్లా కాపాడుకున్నారు. మిగిలిన కాలంలోనే పేద బిడ్డలకు కార్పొరేట్ స్థాయి ఆంగ్ల విద్యను అందుబాటులోకి తెచ్చారు. పేద తల్లిదండ్రులకు అద్భుతమైన ఆరోగ్య సేవలను అందించారు. వలంటీర్ వ్యవస్థ, గ్రామ సచివాలయాల ద్వారా పాలనను ప్రజల గడప వద్దకు తెచ్చారు. పెట్టుబడులను ప్రోత్సహించి పరిశ్రమలు వచ్చేట్టు చూశారు. ఒక్కమాటలో సర్వతోముఖాభివృద్ధికి కృషి చేశారు. అందుకే జగన్ అంటే జనాల్లో అంత ఆదరణ! జగన్ అంటే ఒక నిజం, ఒక భావోద్వేగం, ఒక విజయ సంకేతం.వై.ఎస్. జగన్మోహన్రెడ్డి రాజకీయ ప్రవేశం చేసినప్పటినుంచీ పది సంవత్సరాలు ఆటుపోట్లతో నడిచింది. తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణం తరువాత రాజకీయంగా కాకలు తీరిన, కుట్రలు కుతంత్రాలు తెలిసిన నాయకులను ఎదిరించి ఒంటరిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. అప్పుడే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్కు బీజం పడింది. తరువాతి కాలంలో సోనియా గాంధీ కుట్రలకు బలైపోయి పదహారు నెలలు జైలు జీవితం గడిపారు. 2017 జూలైలో తూర్పు గోదావరి జిల్లా, వైరా మండలం చాపరాయి గ్రామంలో పదహారు మంది ఆదివాసీలు విషజ్వరాలతో వైద్య సదుపాయం అందక మరణించిన విషయం తెలిసిందే. అప్పుడు జగన్ పది కిలోమీటర్లు అటవీ ప్రాంతంలో పోలీసు రక్షణ కూడా లేకుండా నడక దారిన వెళ్లి ఆ విషయాన్ని వెలుగులోకి తెచ్చి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టారు. పేదల పక్షాన శాసనసభలో గళం వినిపించారు. ఇక జగన్ రాజకీయ జీవితంలో మరువలేని ప్రధాన ఘట్టం ప్రజా సంకల్ప యాత్ర పేరుతో 3,648 కిలోమీటర్లు ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు నడిచిన పాదయాత్ర. ఈ పాదయాత్రలో జగన్ ప్రజలతో మమేకమై వారి కష్టాలు చూసి చలించి ‘నేను చూశాను, నేను విన్నాను, నేను ఉన్నాను’ అంటూ ప్రజలకు భవిష్యత్తుపై నమ్మకం కలిగించారు. ఆంధ్ర రాష్ట్రంలో ఒక బలమైన నిజాయితీ గల ప్రజానాయకుడిగా ఎదిగారు. 2019లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో 175 స్థానాల్లో 151 గెలిచి ఏపీ ముఖ్యమంత్రిగా అశేష జన వాహిణి మధ్య ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న యాభై ఎనిమిది నెలల పాలనా కాలంలో కరోనాతో 24 నెలలు ప్రజలను కంటికి రెప్పలా కాపాడు కోవడంలోనే గడిచింది. మిగిలిన దాదాపు మూడు సంవత్సరాల కాలంలో తన మేనిఫెస్టోలోని పథకాల ద్వారా ప్రజల ఆర్థిక అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. ఈ పథకాల ద్వారా మహిళా సాధికారతకు అడుగులు పడ్డాయి. వై.ఎస్.ఆర్. చేయూత, ఆసరా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం వంటి పథకాలతో పేద ప్రజల బతుకులలో వెలుగులు ప్రసరించాయి. వడ్డీ లేని రుణాలు ఇప్పించడం వలన గ్రామీణ కుటుంబాలకు ఆర్థిక పుష్టి కలిగింది. ముప్పై ఒక్క లక్షల మంది నిరుపేద మహిళలకు జగన్ ప్రభుత్వం ఇంటి పట్టాలు మంజూరు చేసింది.అందులో ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్లతో పదహారు లక్షల ఇల్లు... రోడ్లు, డ్రైనేజి, నీటి వసతి, వీధి దీపాలు వంటి పూర్తి మౌలిక సదుపాయాలతో ఏర్పాటయ్యాయి. ఒక్కో ఇంటి విలువ స్థలంతో కలిపి పది లక్షలనుండి పదుహైదు లక్షల వరకు చేరి, పేదవారికి సొంత ఇంటి కల నెరవేరింది.జగన్ సుపరిపాలనలో మరో ముందడుగు 2019 ఆగస్ట్ 15 నుంచి ప్రారంభమైన వలంటీర్ వ్యవస్థ. ఇక 2019 అక్టోబర్ 2న ప్రారంభించిన గ్రామ వార్డు సచివాలయాలు ఒక సువర్ణ అధ్యాయం. వృద్ధులకు, వికలాంగులకు ఇంటి వద్దకే పెన్షన్, బియ్యం, ఇతర నిత్యావసర సరుకుల పంపిణీ జరుగుతోంది. సచివాలయాల ద్వారా ప్రజలకు రెవెన్యూ రికార్డులు, జనన మరణ ధ్రువీకరణ పత్రాలు, కుల ధ్రువీకరణ పత్రాలు, భూముల సర్వే సేవలు, ఆరోగ్యసేవలు ఏమాత్రం వ్యయ ప్రయాసలు లేకుండా, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయకుండా వేగవంతంగా లభిస్తున్నాయి. గ్రామ స్థాయిలో తెచ్చిన రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) ద్వారా రైతులకు కావలసిన విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ యంత్ర సామగ్రి సేవలు మార్కెట్ కంటే తక్కువ ధరలకు అందుతున్నాయి.వైద్య రంగంలో జగన్ ప్రభుత్వం తెచ్చిన గొప్ప మార్పు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు పైసా ఖర్చు లేకుండా అందించడం. నాడు నేడు పథకం కింద ప్రభుత్వ హాస్పిటల్స్ను ఆధునీకరించారు. మహానేత రాజశేఖర రెడ్డి ప్రారంభించిన ఆరోగ్య శ్రీ సేవల పరిమితిని రూ.ఇరవై ఐదు లక్షలకు పెంచారు. చికిత్స సేవలు 1,059 నుంచి 3,250 వరకు పెంచారు. జగనన్న ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్ కాన్పెప్ట్ ద్వారా ప్రజలకు గడప గడపకు వైద్య సేవలు అందు తున్నాయి. ఇవి కాక శ్రీకాకుళం జిల్లాలో దశాబ్దాలుగా ఉద్దానం ప్రాంతంలో ఉన్న కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా వంశధార నది నుంచి 100 కిలోమీటర్లు పైప్లైన్ ద్వారా 807 గ్రామాలలోని ఏడు లక్షల మంది ప్రజలకు రక్షిత మంచినీరు అందించడం జరుగుతోంది. పలాసలో జగన్ తన పాదయాత్రలో చెప్పిన మాట ప్రకారం 200 పడకల సూపర్ స్పెషాలిటీ మరియు కిడ్ని పరిశోధన హాస్పిటల్ నిర్మించడంతో అక్కడి ప్రజలకు నిరంతరం వైద్య సేవలు అందుతున్నాయి. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా చేసేనాటికి రాష్ట్రంలో 7 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉండేవి. ఆయన శ్రీకాకుళం, కడప, ఒంగోలులో ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా మెరుగైన వైద్య సేవలు ప్రజలకు అందించడానికి కొత్తగా 17 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటవుతున్నాయి. ఇప్పటికే నంద్యాల, ఏలూరు, రాజ మండ్రి, మచిలీపట్నం, విజయనగరంలలో ప్రారంభించారు. మిగిలిన 12 వైద్య కళాశాలలు కూడా త్వరలో అందుబాటులోకి రానున్నాయి.పేద పిల్లల అభివృద్ధికి విద్య అత్యవసరం అని జగన్ విశ్వసించారు. ఈ దిశగా జగన్ ప్రభుత్వం సమూల మార్పులు చేసింది. నాడు నేడు కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిస్థాయిలో మౌలిక వసతులు ఏర్పాటు చేసింది. పేద విద్యార్థులకు అందని ద్రాక్షగా ఉన్న ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులోకి వచ్చింది. ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థులు ఐక్యరాజ్యసమితిలోని అధి కారులతో స్థిరమైన ఆర్థికాభివృద్ధిపై చర్చలో పాల్గొనడం సామాన్య మైన విషయం కాదు.పారిశ్రామిక అభివృద్ధికి ఊతమిచ్చే సులభతర విధానంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలుస్తోంది. టీడీపీ ప్రభుత్వంలో ఏపీకి రూ.32,800 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రాగా, ప్రస్తుత ప్రభుత్వంలో రూ.1.03 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి. చిత్తూరు జిల్లా కోటర్ల పల్లె గ్రామం దగ్గర స్మార్ట్ డీవీ ప్రాజెక్ట్, అనకాపల్లి అచ్యుతా పురం దగ్గర టైర్ల తయారీ కంపెనీ, తూర్పు గోదావరి జిల్లా బలభద్రపురం దగ్గర బిర్లా క్యాస్టిక్ సోడా యూనిట్, వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ దగ్గర సెంచ్యురీ ప్యానల్స్ లాంటి పరిశ్రమలు వచ్చాయి.ఇంకా, అరబిందో, దివీస్ సంస్థల విస్తరణలతో కాకినాడ ఫార్మా యూనిట్గా ఎదుగుతోంది. విశాఖపట్నంలో ఇన్పోసిస్, విప్రో, భారత్ ఎలక్టాన్రిక్స్ తమ కార్యకలాపాలు ప్రారంభించాయి. ఆంధ్ర రాష్ట్రానికి 972 కిలోమీటర్ల మేర సముద్ర తీరం ఉన్నా కొత్తగా పోర్టులు గానీ, ఫిషింగ్ హార్బర్లు గానీ ఇదివరకు రాలేదు. ప్రస్తుతం జువ్వలదిన్నె, నిజాంపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. వీటి వలన మత్స్యకార కుటుంబాల వారు చేపల వేటకు గుజరాత్ తీర ప్రాంతానికి వలసలు పోనవసరం లేదు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పాలనలో పేద ప్రజలకోసం అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరిస్తున్నారు. తన ప్రభుత్వం వలన తమ కుటుంబాలకు మంచి జరిగితేనే తనకు తోడుగా నిలవమని అడుగుతున్నారు. జగన్ ఒక సంఘ సంస్కర్తగా, ప్రజారంజక పాలకుడిగా పేరు పొందిన మాట వాస్తవం. ప్రజలతో జగన్ బంధం భావోద్వేగాలతో ముడిపడి ఉంది. అందుకే సిద్ధం యాత్రలో లక్షలాది మంది పిల్లలు, యువతీ యువకులు, వృద్ధులు, మహిళలు ఎర్రటి ఎండల్లో కూడా జగన్ కోసం నిరీక్షిస్తున్నారు. ఆయన కనబడితే కేరింతలు కొడుతూ జై జగన్ అని నినాదాలు చేస్తున్నారు. ఇవి జగన్ విజయానికి సంకేతాలు.– అమూరు రాఘవరెడ్డి ‘ జె.డి.ఎస్.డబ్ల్యూ. (రిటైర్డ్),– జి.సాంబశివారెడ్డి ‘ రిటైర్డ్ ప్రిన్సిపల్,యోగి వేమన యూనివర్సిటీ, కడప -
మళ్లీ వచ్చేది మీ బిడ్డ ప్రభుత్వమే..!
-
పేదల పథకాలపై కూటమి కుట్ర..!
-
కూటమి కుట్రలు.. పథకాలనూ అడ్డుకుంటారా?: సీఎం జగన్
వదినమ్మ బంధువులే...!ఇవాళ వాళ్ల అబద్ధాలు ఏ స్థాయికి వెళ్లిపోయాయంటే.. కొద్ది వారాల క్రితం ఓ ప్రైవేట్ ఆక్వా కంపెనీ కంటైనర్లో విశాఖకు ఏకంగా రూ.2లక్షల కోట్ల విలువైన డ్రగ్స్ తెచ్చారని, అదంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పనే అంటూ ఇదే చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, దత్తపుత్రుడు దుష్ప్రచారం చేశారు. తీరా చూస్తే ఆ కంటైనర్ బుక్ చేసింది ఎవరంటే... చంద్రబాబు వదినమ్మ బంధువులే. తమవారేనని ఎప్పుడైతే బయటకు వచ్చిందో... అప్పుడు అందరూ గప్చుప్! అది బయటకు వచ్చేదాకా రూ.రెండు లక్షల కోట్ల డ్రగ్స్ అంట... తెచ్చింది వైఎస్సార్సీపీ అంట... అని బురద చల్లేయడమే!– మచిలీపట్నం సభలో సీఎం జగన్ఈసీపై ఒత్తిడి తెచ్చి..వీళ్ల కుట్రలు ఏ స్థాయికి వెళ్లాయంటే.. మనం బటన్లు నొక్కిన ఆన్ గోయింగ్ స్కీమ్స్ను కూడా ఎన్నికల కమిషన్పై తీవ్ర ఒత్తిడి తెచ్చి అక్కచెల్లెమ్మల ఖాతాలకు పోవాల్సిన డబ్బులను దిక్కుమాలిన చంద్రబాబు ఆపుతున్నాడు. – బందరు సభలో సీఎం జగన్జగన్ అనే రైతు చల్లిన విత్తనాలు..జగన్ అనే రైతు.. రాష్ట్రం అనే పంటపొలంలో విప్లవాత్మక మార్పులు, సంక్షేమ పథకాలు, మంచి భవిష్యత్తు అనే విత్తనాలను నాటాడు. ఇవాళ్టికి ఐదేళ్లు అయింది. ప్రతి గ్రామం, పట్టణం, సామాజికవర్గాల్లో మొక్కలు ఏపుగా ఎదుగుతున్నాయి. మరో 15 ఏళ్లలో అవి మహా వృక్షాలు అవుతాయి. పిల్లలు క్వాలిటీ చదువులతో బయటకు వస్తారు. ఐబీ సిలబస్ చదువులతో స్టాన్ఫర్డ్, హార్వర్డ్ నుంచి 25 శాతం కరిక్యులమ్తో డిగ్రీ పూర్తి చేసి ఆ కోర్సులకు సంబంధించిన సర్టిఫికెట్లు అందుకుంటారు. అనర్గళంగా ఇంగ్లిష్లో మాట్లాడుతూ అత్యుత్తమ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటారు. వారి బతుకులు, పేద కుటుంబాల తలరాతలు మారతాయి. పేదరికం అన్నది మటుమాయం అయిపోతుంది. మీ బిడ్డ ప్రతి ఆలోచనా పేదవాడి బతుకులు ఎలా మార్చాలన్నదే.– రేపల్లె సభలో సీఎం జగన్సాక్షి ప్రతినిధి, గుంటూరు/సాక్షి, నరసరావుపేట/సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎన్నికల కమిషన్ మీద తీవ్ర ఒత్తిళ్లు తెచ్చి ఇప్పటికే అమలవుతున్న పథకాలను (ఆన్ గోయింగ్) సైతం అడ్డుకుంటూ పేదలు, రైతులు, మహిళలు, అవ్వాతాతల పట్ల చంద్రబాబు రాక్షసంగా ప్రవర్తిస్తున్నారని ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం గతంలోనే ప్రవేశపెట్టి, కొనసాగుతున్న పథకాలకు సంబంధించి బటన్లు నొక్కినా కూడా అక్కచెల్లెమ్మల ఖాతాలకు డబ్బులు జమ కాకుండా కావాలనే ఆపుతున్నారని మండిపడ్డారు. ప్రజలకు అందాల్సిన మంచికి అడ్డుపడుతూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ‘ఇన్ని కుట్రలు పన్నుతున్నారు. ఇష్టానుసారంగా అధికారులను మారుస్తున్నారు. ఎన్నికలు బాగా జరుగుతాయనే నమ్మకం సన్నగిల్లుతోంది. కేవలం పేదలకు మంచి చేసే మీ జగన్ ఉండకూడదనే ఇవన్నీ చేస్తున్నారు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత అన్నది చాలా అవసరం. అలాంటి వారికే ఓటు వేస్తామని గట్టి సందేశం ఇవ్వాలి. మనం ఓటు వేస్తే ఢిల్లీ దాకా ఆ మెసేజ్ వినిపించాలి’ అని రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. కిరాణా దుకాణాల్లో గంజాయి అమ్ముతున్నారంటూ చంద్రబాబు, దత్తపుత్రుడు సంస్కారహీనంగా, పరమ దుర్మార్గంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలాంటి దుష్ప్రచారాలతో రాష్ట్రం పరువు ఏమవుతుందనే కనీస ఇంగిత జ్ఞానం లేకుండా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా కిరాణా షాపులు నడుపుకొంటున్న అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలు గంజాయి విక్రయిస్తున్నారంటూ వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుకు ఓటు అనే అస్త్రంతో గట్టిగా బుద్ధి చెప్పాలని సూచించారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పైనా దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. భూ వివాదాలు పెరిగిపోయి కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి లేకుండా ఎలాంటి వివాదం లేదని ప్రభుత్వమే గ్యారెంటీ ఇస్తూ టైటిల్ ఇన్సూరెన్స్తో సంస్కరణ తేవాలన్నది మీ బిడ్డ ప్రభుత్వం ఆలోచన అని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సర్వే పూర్తి అయిన 6 వేల రెవెన్యూ గ్రామాల్లో ఏ ఒక్క రైతు అయినా తన భూమి లాక్కున్నట్లు చెప్పారా? అని చంద్రబాబు, ఎల్లో మీడియాను నిలదీశారు. చంద్రబాబును నమ్మడం అంటే మరోసారి మోసపోవడం, కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టడమేనని ప్రజలను హెచ్చరించారు. ఇది చరిత్ర చెబుతున్న సత్యమన్నారు. సోమవారం ఉదయం బాపట్ల జిల్లా రేపల్లెలో, మధ్యాహ్నం పల్నాడు జిల్లా మాచర్లలో, సాయంత్రం కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో సీఎం జగన్ ప్రసంగించారు. మూడు సభల్లో సీఎం ఏమన్నారంటే...పథకాల విప్లవం.. గడగడా చెబుతానాడు–నేడుతో బాగుపడ్డ గవర్నమెంట్ స్కూళ్లు, ఇంగ్లిష్ మీడియం, 6వ తరగతి నుంచే డిజిటల్ బోధన, ఐఎఫ్పీలు, 8వ తరగతికి రాగానే పిల్లల చేతుల్లో ట్యాబ్లు, 3వ తరగతి నుంచే టోఫెల్ క్లాసులు, సబ్జెక్ట్ టీచర్లు నుంచి ఏకంగా ఐబీ దాకా మన ప్రయాణం కొనసాగుతోంది. పిల్లల చేతుల్లో తొలిసారిగా బైలింగ్యువల్ టెక్ట్స్ బుక్స్ (ద్వి భాషా పాఠ్యపుస్తకాలు) కనిపిస్తున్నాయి. బడులు తెరవగానే విద్యాకానుక, రోజుకో రుచికరమైన మెనూతో గోరుముద్ద, పిల్లలను చదివించేలా తల్లులను ప్రోత్సహిస్తూ అమ్మఒడి లాంటి గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఉన్నత చదువులు అభ్యసించే 93 శాతం మంది విద్యార్థులకు విద్యాదీవెనతో పూర్తి ఫీజులు చెల్లిస్తున్నాం. ఖర్చులకు ఇబ్బంది పడకుండా వసతిదీవెన అందిస్తున్నాం. విద్యారంగంలో ఇలాంటి విప్లవాలు గతంలో ఉన్నాయా?అక్కచెల్లెమ్మల సాధికారత..చరిత్రలో ఏ ప్రభుత్వమూ చేయని రీతిలో మహిళా సాధికారతపై మీ బిడ్డ చిత్తశుద్ధితో వ్యవహరించాడని గర్వంగా చెబుతున్నా. నా అక్కచెల్లెమ్మలు సొంత కాళ్లపై నిలదొక్కుకునేలా ఓ ఆసరా, సున్నావడ్డీ, చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తంతోపాటు ఏకంగా 31లక్షల ఇళ్ల పట్టాలు, 22లక్షల గృహ నిర్మాణాలు చేపట్టాం. అవ్వాతాతలు ఇబ్బంది పడకూడదని గతంలో ఏ ప్రభుత్వమైనా ఆలోచన చేసిన పరిస్థితులు ఉన్నాయా? వారి కష్టాలను గుర్తించి ఇంటికే రూ.3 వేల పెన్షన్, ఇంటివద్దకే పౌర సేవలు, పథకాలు, రేషన్ డెలివరీ చేస్తున్నాం.రైతన్నకు అండగా...పదిమందికి పట్టెడన్నం పెట్టే రైతన్నలకు గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా పెట్టుబడి సాయంగా రైతుభరోసా, ఉచిత పంటల బీమా, సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ, పగటిపూటే 9 గంటలపాటు నాణ్యమైన ఉచిత విద్యుత్, చేయి పట్టుకుని నడిపించేలా ఆర్బీకే వ్యవస్థ తెచ్చాం. స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ వాహనమిత్ర, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, తోడు, చేదోడు, లా నేస్తం∙లాంటివి తీసుకొచ్చాం. పేదలెవరూ వైద్యం కోసం అప్పులపాలు కాకుండా విస్తరించిన ఆరోగ్యశ్రీతో రూ.25 లక్షల దాకా ఉచిత వైద్యం అందిస్తూ భరోసా కల్పించాం. కోలుకునే సమయంలో జీవనభృతికి ఇబ్బంది లేకుండా ఆరోగ్య ఆసరా, గ్రామానికే ఫ్యామిలీ డాక్టర్, విలేజీ క్లినిక్స్, ఇంటికే వచ్చే ఆరోగ్య సురక్షతో అండగా నిలిచిన ప్రభుత్వాలను గతంలో ఎప్పుడైనా చూశారా?అవ్వాతాతల పెన్షన్ అడ్డుకున్నదీ బాబేఅవ్వాతాతలకు మొన్నటిదాకా ఇంటికే వచ్చిన పెన్షన్ను అడ్డుకున్నది ఎవరు? తన మనిషి నిమ్మగడ్డ రమేష్ ద్వారా సాక్షాత్తూ చంద్రబాబే ఎన్నికల కమిషన్కు లేఖ రాయించాడు. వలంటీర్లు ఇంటికి రాకూడదంటూ పెన్షన్ను అడ్డుకున్నాడు. అవ్వాతాతలకు ఇచ్చే పెన్షన్ను బ్యాంక్ అకౌంట్లలో వేయాలని ఎన్నికల కమిషన్తో ఉత్తర్వులు ఇప్పించాడు. అవ్వాతాతలు చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతుంటే ఆ నెపాన్ని మీ బిడ్డ జగన్పై వేస్తున్నాడు.మన అభ్యర్థులను ఆశీర్వదించండిబాపట్ల ఎంపీ అభ్యర్థి నందిగం సురేష్, రేపల్లె ఎమ్మెల్యే అభ్యర్థి ఈవూరి గణేష్, నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్కుమార్ యాదవ్, మాచర్ల ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, బందరు ఎమ్మెల్యే అభ్యర్ధి పేర్ని కిట్టు (కృష్ణమూర్తి),ఎంపీ అభ్యర్థి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావును మీరంతా ఆశీర్వదించి గొప్ప మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నా.మీ కళ్లెదుటే కనిపిస్తున్న విప్లవాలు..గ్రామంలోనే 600 రకాల సేవలు అందిస్తున్న సచివాలయం, 60–70 ఇళ్లకు వలంటీర్ సేవలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్, నాడు–నేడుతో బాగుపడ్డ ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు, గ్రామానికే ఫైబర్ గ్రిడ్, నిర్మాణంలో డిజిటల్ లైబ్రరీలు, మహిళా పోలీస్, దిశ యాప్.. లాంటి మన కళ్లెదుటే కనిపిస్తున్న విప్లవాలను ఇంతకు ముందెప్పుడైనా చూశారా? 14 ఏళ్లు అధికారంలో ఉండి మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికీ ఒక్క మంచి కూడా గుర్తురాదు. ఈ ఎన్నికల్లో పేదల శత్రువులంతా.. పేదలకు అండగా నిలబడిన ఒక్క మీ జగన్ మీద ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారో మీరే చూస్తున్నారు. మళ్లీ వలంటీర్లు మీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా, పిల్లల చదువులు, బడులు బాగుండాలన్నా, మన హాస్పిటళ్లు, వ్యవసాయం మెరుగ్గా ఉండాలన్నా ఫ్యాను గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలి. మంచి చేసిన ఫ్యాను ఇంట్లో ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ సింక్లోనే ఉండాలి.2014లో బాబు ముఖ్యమైన మోసాలివీ..⇒ రూ.87,612 కోట్ల రైతు రుణాలు మాఫీ అయ్యాయా? ⇒ రూ.14,205 కోట్ల పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేశాడా? ⇒ ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు కాదు కదా.. ఒక్క రూపాయైనా ఎవరి ఖాతాలోనైనా జమ చేశాడా?⇒ ఇంటికో ఉద్యోగం లేదంటే రూ.2వేలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నాడు. మరి ఐదేళ్లలో రూ.1.20 లక్షలు ఏ ఇంటికైనా ఇచ్చాడా? ⇒ అర్హులందరికీ మూడు సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇళ్లు అన్నాడు. ఏ ఒక్కరికైనా సెంటు స్థలం ఇచ్చాడా? ⇒ రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత, పవర్ లూమ్స్ రుణాల మాఫీ జరిగిందా? ⇒ ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేశాడా? ⇒ సింగపూర్కి మించి అభివృద్ధి, ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మాణం జరిగిందా? రేపల్లె, మాచర్ల, మచిలీపట్నంలలో ఎవరికైనా కనిపిస్తోందా? ⇒ ప్రత్యేక హోదా తేకపోగా అమ్మేశాడు. ⇒ మరోసారి వంచనకే ముగ్గురూ కొత్త మోసాలతో వస్తున్నారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్, ఇంటింటికీ కేజీ బంగారం, బెంజి కార్లు అంటూ నమ్మబలుకుతున్నారు.గతంలో ఎప్పుడైనా జరిగాయా?వారం రోజుల్లో కురుక్షేత్ర మహా సంగ్రామం జరగబోతోంది. ఇవి కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేవి కావు. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్లు ఇంటింటి భవిష్యత్తు, పథకాల కొనసాగింపును నిర్ణయించేవి. మీ జగన్కు ఓటేస్తే పథకాలు, ఇంటింటి అభివృద్ధి కొనసాగింపు. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్లీ మోసపోవడమే. చంద్రముఖి మళ్లీ నిద్ర లేచి లకలక లకలకా..అంటూ ఐదేళ్లు మీ రక్తం తాగేందుకు మీ గడప తొక్కుతుంది. చంద్రబాబుకు ఏ రోజూ మాట మీద నిలబడ్డ చరిత్ర లేదు. సాధ్యం కాని హామీలతో బాబు విడుదల చేసిన మేనిఫెస్టో ఆయన మోసాలను కళ్లకు కడుతుంది. మరోవైపు అక్కచెల్లెమ్మల బాగు కోసం మీ బిడ్డ 59 నెలల వ్యవధిలో ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు పారదర్శకంగా నేరుగా అందించి 130సార్లు బటన్లు నొక్కాడు. రాష్ట్రంలో గతంలో నాలుగు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే ఉంటే మీ బిడ్డ ఏకంగా మరో 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశాడు. ఏ సచివాలయానికి వెళ్లినా నా తమ్ముళ్లు, చెల్లెమ్మలు 1.31 లక్షల మంది చిరునవ్వుతో ఉద్యోగాలు చేస్తూ కనిపిస్తారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎక్కడా సిబ్బంది కొరత లేకుండా పోస్టులను భర్తీ చేశాం. ఇలాంటివి గతంలో ఎప్పుడైనా జరిగాయా?మన మచిలీపట్నం అభివృద్ధి...⇒ మన మచిలీపట్నంలో రూ.5,100 కోట్లతో పోర్టు నిర్మాణం వాయువేగంగా జరుగుతోంది. దీన్ని సాయంత్రం అలా వెళ్లినప్పుడు మీరే చూస్తున్నారు. ⇒ ఇదే మచిలీపట్నంలో రూ.550 కోట్లతో మెడికల్ కాలేజీ నిర్మాణం చేపట్టి పూర్తి చేసింది మీ బిడ్డ పాలనలోనే. ⇒ ఇదే బందరులో పక్కనే రూ.350 కోట్లతో ఫిషింగ్ హార్బర్తో ఈ ప్రాంతం అభివృద్ధికి బాటలు వేసింది ఎవరంటే మీ బిడ్డ జగన్. ⇒ ఈ ప్రాంతంలో భూముల సమస్యను పరిష్కరించింది ఎవరు? ఎవరు ఉంటే సమస్యలు పరిష్కారం అవుతాయో ఆలోచించండి. అన్నింటికీ సొల్యూషన్ మీ జగన్. ⇒ నాని ఇప్పుడే చెబుతున్నాడు.. బందరు తీర ప్రాంతంలోని 14 గ్రామాల్లో 30–40 ఏళ్లుగా భూములను అనుభవిస్తున్న పేద రైతులకు భూ హక్కులు కల్పించే ఫైల్ను చంద్రబాబు ఆపారు. మళ్లీ మీ బిడ్డ గెలిచి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇదే బందరుకు వచ్చి అవే భూములు మీ అందరికీ పంచిపెడతాడని హామీ ఇస్తున్నా. -
రైతన్నకు మన ప్రభుత్వం చేసిన మంచి.. చంద్రబాబు ఎందుకు చేయలేదు?
-
పేదవాడు వైద్యం కోసం అప్పుల పాలు కాకూడదు.. అందుకే..
-
సామాజిక న్యాయపాలనే గెలిపిస్తుంది!
ఇటీవల విశాఖపట్టణంలో ఓ దళిత మేధావుల సమా వేశంలో పాల్గొన్నప్పుడు ఏపీ ముఖ్యమంత్రిపై చర్చ జరి గింది. ఈ సమావేశంలో 90 శాతం దళితులు, క్రైస్తవులు ఉన్నారు. జగన్ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇచ్చే విధంగా అసెంబ్లీ తీర్మానం చేసిన కారణంగా, ఎస్సీ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారి సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నందుకు ఈ ఎన్నికల్లో ఆయనకు మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. నయా మనువాది చంద్రబాబు నాయుడుకీ, అతని కూటమికీ ఓటు వేయకుండా తిరిగి రెండవసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలనే దృక్పథంతో దళిత సమాజం ఉందనేది వారి మాటల సారాంశం.విద్యా, వైద్య రంగాల్లో దేశంలో ఎక్కడా లేని విధంగా విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చి పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపారు జగన్. ఒకసారి ఒక కుటుంబం ఉన్నత చదువులు చదివితే, ఆ కుటుంబం ప్రభుత్వ రాయితీల కోసం ఎదురు చూసే పరిస్థితి ఉండదు. ఆదాయం పెరగడం మూలంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ముఖ్యంగా సబ్సిడీ బియ్యం, వృద్ధాప్య పింఛన్లు, గృహ నిర్మాణ పథకాలపై ప్రభుత్వ భారం తగ్గిపోతుంది. పదేళ్ల కాలంలో 40 శాతం, మరో పది సంవత్సరాల కాలంలో మరో 50 శాతం మొత్తం 20 సంవత్సరాల కాలంలో 90 శాతం సబ్సిడీ పథకం కింద లబ్ధిపొందే వారు, అభివృద్ధి పథకాల కింద లబ్ధిపొందే వారు అభివృద్ధి చెంది ఈ పథకాలను అంటే పెన్షన్ పథకం, సబ్సిడీ పథకాలు వద్దనే స్థాయికి ఈ కుటుంబాలు ఎదిగి పోతాయి. వీటిపై ప్రభుత్వం ఖర్చు చేస్తున్న బడ్జెట్లో 90 శాతం బడ్జెట్ తగ్గిపోతుంది. సామాజిక న్యాయాన్ని దేశంలో ఏ ముఖ్యమంత్రి అమలు చేయని విధంగా జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారు. ఇందుకు కొన్ని ఉదాహరణలు చూద్దాం.తాజాగా ఎన్నికల కోసం వైఎస్సార్సీపీ ప్రకటించిన ఎంపీ సీట్లలో 11 సీట్లనూ; అసెంబ్లీ సీట్లలో 48 సీట్లనూ బీసీలకు కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు మొత్తం కలిపి 100 అసెంబ్లీ సీట్లు కేటాయించారు. ఇది దేశంలోనే ఓ రికార్డు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రాలలో కూడా ఇంత ప్రాతినిధ్యం ఆ యా వర్గాలకు ఇవ్వడం కనిపించదు. అలాగే ఇటీవల 18 ఎమ్మెల్సీ స్థానాలకు గాను 11 సీట్లు బీసీలకు కేటాయిస్తే దేశంలోని బీసీలందరూ ఆశ్చర్య పోయారు. పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ బిల్లు పెట్టి చట్టసభలలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రతిపాదించి చరిత్రను తిరగరాశారు.గత ఏప్రిల్ 11న చేపట్టిన మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో 25 మందితో కూడిన మంత్రివర్గంలో ఏకంగా 17 పదవులను (70 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే అవకాశం కల్పించడం ద్వారా సరికొత్త సామాజిక మహా విప్లవాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. నామినేటెడ్ పోస్టులలో 50 శాతాన్ని వెనుకబడిన వర్గాలకు ఇచ్చారు. అలాగే కాంట్రాక్టు పనులలో వారికి 50 శాతం కోటా కేటాయిస్తూ అసెంబ్లీలో చట్టం చేశారు. 56 బీసీ కులాల కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్లకు 56 చైర్మన్లు, 672 డైరెక్టర్ల పోస్టులకు గాను మొత్తం 100 శాతం బీసీలకే కేటాయించారు. ఫలితంగా ఆ కులాలలో నాయకత్వ లక్షణాలు పెరిగాయి. రాజ్యసభలో మొత్తం 9 మంది వైఎస్సార్సీపీ సభ్యులు ఉంటే... అందులో నలుగురు బీసీలు. శాసనసభ స్పీకర్; శాసన మండలి చైర్మన్, డిప్యుటీ చైర్మన్ పదవుల కేటాయింపు కూడా జగన్ సామాజిక న్యాయ దృష్టికి నిదర్శనంగా నిలిచాయి. స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గిస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. కానీ ఆ మేర బీసీలకు జరిగే నష్టాన్ని పూరించడానికి పార్టీ పరంగా అదనంగా 20 శాతం ఆ వర్గానికి పెంచి మొత్తం 44 శాతం స్థానాలను బీసీలకు కేటాయించారు. జిల్లా పరిషత్ ఎన్నికల్లో మొత్తం 13 జిల్లా పరిషత్లను వైఎస్సార్సీపీ గెలువగా అందులో తొమ్మిది పదవులను (70 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకే కేటాయించారు. మండల పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ 635 మండల పరిషత్ అధ్యక్ష పదవులను గెలిస్తే అందులో ఈ వర్గాలకు 442 స్థానాలు (67 శాతం) కేటాయించారు. చివరగా ముగించే ముందు మూడు రాజ ధానుల అంశం కూడా పరిపాలన విభజనలో భాగంగా నేను చూస్తాను. సంపద సృష్టి జరగా లన్నా, సంపద పంపిణీ జరగాలన్నా ఒకే ప్రాంతం / లేదా సిటీ అభివృద్ధి చెందితే జరగదు. అందుకే కోస్తాంధ్రా, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలు అభివృద్ధి చెందే విధంగా శాసన రాజధానిగా అమరావతి, కార్యనిర్వహణ రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలును చేయాలని జగన్ సంకల్పించారు. అభివృద్ధి చెందిన దేశాల అభివృద్ధి నమూనా కూడా ఇదే. ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబడాలంటే జగన్మోహన్ రెడ్డి రెండవసారి ముఖ్యమంత్రి కావాలని తెలంగాణ సామాజిక న్యాయ కోవిదులు కూడా ఆశిస్తున్నారు.ప్రొ‘‘ గాలి వినోద్ కుమార్ వ్యాసకర్త ఉస్మానియా, తెలంగాణ విశ్వ విద్యాలయాల మాజీ డీన్–ఫ్యాకల్టీ ఆఫ్ లా -
చేనేతకు సంక్షేమ అద్దకం
సాక్షి, అమరావతి: పడుగు–పేకల్లా కష్టాలు అల్లుకున్న చేనేత బతుకులకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. గత ప్రభుత్వంలో ఆదరణ కోల్పోయిన చేనేత రంగానికి సంక్షేమ రంగులు అద్దారు. నేతన్న నేస్తంతోపాటు క్లస్టర్లు, నూలు రాయితీ, రుణాలు, పెన్షన్లు వంటి అనేక రకాల సాయమందించి మగ్గానికి మహర్దశ తెచ్చారు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు చేనేత రంగానికి ఇచ్చిన 25 హామీల్లో ఏ ఒక్కటి సక్రమంగా అమలు చేయకపోగా కమిటీలు, అధ్యయనాలు అంటూ కాలయాపన చేశారు. బాబు ఐదేళ్ల హయాంలో రూ.442 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తే, వైఎస్ జగన్ ప్రభుత్వం నవరత్నాలు తదితర సంక్షేమ పథకాల ద్వారా రూ.3,706 కోట్లుపైగా ఖర్చు చేసింది, నేతన్న నేస్తం సాయం రూ.969.77 కోట్లు 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఇచ్చిన ప్రతి హామీని తు.చ. తప్పకుండా అమలు చేశారు. సొంత మగ్గం కలిగిన ప్రతి కార్మికునికీ నేతన్న నేస్తం ద్వారా ఏడాదికి రూ.24 వేలు చొప్పున రూ.1.20 లక్షలు అందించారు. దీనికి తోడు కరోనా కష్టకాలంలో 82 వేల చేనేత కుటుంబాలకు రూ.వెయ్యి చొప్పున జమ చేయడంతోపాటు బియ్యం, కందిపప్పు, నూనె వంటి నిత్యావసర సరుకులు అందించారు.కరోనా రెండేళ్లు సహా ఐదేళ్లుగా కేటాయించిన ఈ మొత్తం అక్షరాలా రూ.969.77 కోట్లు. ఈ నిధులతో డబుల్ జాకార్డ్, జాకార్డ్ లిఫ్టింగ్ మెషిన్ తదితర ఆధునిక పరికరాలతో తమ మగ్గాలను ఆధునికీకరించుకున్నారు. 2018–19లో నెలవారీ ఆదాయం సగటున రూ.4,680 ఉంటే ఈ పథకం అమలుతో మూడు రెట్లు పెరిగింది. మరోవైపు అర్హులైన 94,224 మంది చేనేత కార్మికులకు నెలకు రూ.3 వేలు చొప్పున పెన్షన్ అందిస్తున్నారు.ఉత్పత్తుల మార్కెటింగ్కు ఊతం చేనేత ఉత్పత్తులకు ఊతమిచ్చేలా ఆప్కోకు రూ.468.84 కోట్లు (గత ప్రభుత్వ బకాయిలు రూ.103 కోట్లతో కలిపి) చెల్లించింది. ఆప్కో, రాష్ట్ర చేనేత జౌళి శాఖల ద్వారా ఆర్గానిక్ వ్రస్తాల తయారీ, కొత్త కొత్త డిజైన్ల రూపకల్పన తదితరాల్లో శిక్షణ ఇప్పించింది. 46కి పైగా ప్రాంతాల్లో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసింది. శిక్షణ అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో సబ్సిడి అందించి మగ్గాలు, షెడ్డులు, ఇతర సామగ్రిని సమకూర్చింది. అమెజాన్, మింత్ర, ఫ్లిప్కార్ట్, లూమ్ఫోక్స్, పేటీఎం, గోకూప్ వంటి ఈ– కామర్స్ సంస్థలతో ఒప్పందాలు చేసుకుని ఆన్లైన్ మార్కెటింగ్ సౌకర్యం కలి్పంచింది. ఆప్కో షోరూమ్లు విస్తరించింది. కేరళ, ఢిల్లీ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లోను ఏపీ చేనేత వస్త్రాల విక్రయాలకు చర్యలు చేపట్టింది. జీఎస్టీపై పచ్చ మీడియా గందరగోళం ((బాక్స్)) చేనేతపై కేంద్ర ప్రభుత్వం విధించే జీఎస్టీపై టీడీపీ పచ్చ మీడియా ఇటీవల అర్థంలేని విమర్శలు చేసి గందరగోళం సృష్టిస్తోంది. వాస్తవానికి చేతి వృత్తులు, గ్రామాల్లో కుటీర పరిశ్రమలపై పన్ను వేయకూడదని రాజ్యాంగంలోని ఆరి్టకల్ 43 చెబుతోంది. అయినప్పటికీ నేతకు ఉపయోగించే చిలప నూలుపై కేంద్ర ప్రభుత్వం 5 శాతం, తయారైన వస్త్రంపై 12 శాతం చొప్పున జీఎస్టీ వసూలు చేస్తోంది. తయారైన వ్రస్తానికి వసూలు చేస్తున్న జీఎస్టీని 18 శాతానికి పెంచాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను చేనేత సహకార సంఘాలు తీవ్రంగా ప్రతిఘటించడంతో దాన్ని విరమించుకుంది. మొత్తం జీఎస్టీనే ఎత్తివేయాలని చేనేత సహకార సంఘాలు కోరుతున్నాయి. ఉప్పాడకు వైఎస్సార్ లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు చేనేత రంగానికి ఆరి్థక ఊతంతోపాటు అవార్డులతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రోత్సాహం అందించింది. జమ్దానీ పట్టు నేత కళను కొనసాగిస్తున్న ఉప్పాడ హ్యాండ్లూమ్స్ వీవర్స్ కో–ఆపరేటివ్ సొసైటీ(కాకినాడ)కు వైఎస్సార్ లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు వరించడంతో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతోపాటు దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఒక జిల్లా–ఒక ఉత్పత్తి(ఓడీఓపీ)లో రాష్ట్రానికి చెందిన చేనేత రంగం హవా కొనసాగింది. దేశంలో మొత్తం మీద 64 ఉత్పత్తులు దరఖాస్తులు చేస్తే.. వాటిలో ఆంధ్రప్రదేశ్ నుంచి చేసిన 14 ఉత్పత్తుల్లో 8 చేనేతవే కావడం విశేషం. నేతన్న నేస్తం మా జీవితంలో వెలుగులు నింపింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందించిన నేతన్న నేస్తం ద్వారా ఏడాదికి రూ.24 వేలు చొప్పున ఇప్పటి వరకు రూ.1.20 లక్షల ఆరి్థక సాయం అందింది. ఆ డబ్బుతో చేనేత మగ్గాలను ఆధునికీకరించుకొని రెట్టింపు ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నాం. – శంకర, చేనేత కార్మికుడు, కేశవనగర్, ధర్మవరం జగన్కు రుణపడి ఉంటాం.. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి మా కుటుంబం అంతా రుణపడి ఉంటుంది. ఆరోగ్యశ్రీలో రూ.మూడు లక్షలు సాయం అందించడంతో ఆపరేషన్ చేయించుకున్నాను. ప్రతి నెల పెన్షన్ వస్తోంది. నా భార్యకు చేయూత పథకం కింద రూ.18,750 నాలుగు సార్లు వచ్చాయి. వైఎస్సార్ ఆసరా ద్వారా రూ.15 వేలు చొప్పున మూడుసార్లు వచ్చాయి. –చింతలపూడి రాంబాబు, చేనేత కార్మికుడు, వాకతిప్ప, కాకినాడ జిల్లా మగ్గాన్ని ఆధునికీకరించుకుని ఆదాయం పొందుతున్నా నేతన్న నేస్తంతో రూ.1.20 లక్షలు ఆరి్థక సాయంతో రావడంతో మగ్గాన్ని ఆధునికీకరించుకున్నాను. ముడిసరుకులు కొనుగోలు చేసుకుని అదనపు ఆదాయం పొందుతున్నాను. నేతన్న నేస్తంతోపాటు ఆసరా ద్వారా రూ.84 వేలు, అమ్మ ఒడి రూ.54 వేలు, సున్నా వడ్డీ రూ.7 వేలు ఆరి్థక సాయం అందడంతోపాటు పిల్లల్ని బాగా చదివించుకుని సమాజంలో గౌరవంగా బతుకుతున్నాను. –పిచ్చుక గంగాధరరావు, పెడన, కృష్ణా జిల్లా మగ్గాన్ని విరిచేసింది చంద్రబాబు రాష్ట్రంలో మగ్గాన్ని విరిచేసింది చంద్రబాబు. చేనేత రంగాన్ని ఆదుకుంటానంటూ 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ఏకంగా 25 హామీలు గుప్పించిన చంద్రబాబు ఏ ఒక్కటీ నెరవేర్చకుండా దగా చేశారు. చేనేత రుణాల మాఫీపై అధ్యయనానికి ఒక కమిటీ వేస్తూ జీవో ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. రుణమాఫీ చేయకపోవడంతో కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. ఇల్లు, మగ్గానికి రూ.లక్షన్నర చొప్పున సాయమందిస్తానని మోసం చేశారు. చేనేత కార్మికులకు రూ.వెయ్యి కోట్లతో ప్రత్యేక నిధి, బడ్జెట్లో ప్రతి సంవత్సరం రూ.వెయ్యి కోట్లు కేటాయింపు, ఉచిత విద్యుత్ వంటి హామీలను చంద్రబాబు మరిచారు. – బండారు ఆనందప్రసాద్, అధ్యక్షుడు, ఆలిండియా వీవర్స్ ఫెడరేషన్. బాబు దగా, జగన్ అండబాబు హయాంలో ► ఆప్కోకు రూ.103 కోట్ల బకాయిలు పెట్టారు. ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయలేదు ► సహకార సంఘాల్లో పనిచేసే కార్మికుల కూలీ నుంచి 8 శాతం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 8 శాతం చొప్పున మొత్తం 24 శాతం జమ చేసి ఏడాదికి ఒకసారి అందించే త్రిఫ్ట్ ఫండ్ను గత ఎన్నికలకు ఏడాదిన్నర ముందు నిలిపేశారు. ► 2014 ఎన్నికల మేనిఫెస్టోలో 25 హామీలు గుప్పించి ఏ ఒక్కటీ నెరవేర్చలేదు, ► చేనేత రుణాలు మాఫీపై అధ్యయనానికి కమిటీ వేస్తూ చేతులు దులుపుకొన్నారు. జగన్ హయాంలో ► పాత బకాయిలు కలిపి మొత్తం రూ.468.84కోట్లను చెల్లించారు. ► నేతన్న నేస్తం, నేతన్న పెన్షన్ అమలు చేశారు. సంక్షేమానికి మొత్తం రూ.3,706 కోట్లు ఖర్చు చేయడం ఒక రికార్డు. వీటితో పాటు రుణ పరపతి, ముడి సరుకులకు పెట్టుబడి, నైపుణ్య శిక్షణ, తయారీ–విక్రయాలకు క్లస్టర్ల ఏర్పాటు. మేలైన మార్కెటింగ్కు ఈ–కామర్స్ దిగ్గజాలతో ఒప్పందాలు. ► చేనేతకు కీలకమైన నూలు పోగుల కొనుగోలుకు జాతీయ చేనేత అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్డీసీ) ఏర్పాటు. ► 416 ప్రాథమిక చేనేత కార్మికుల సహకార సంఘాలకు (పీహెచ్డబ్ల్యూసీఎస్) రూ.250.01కోట్ల సాయం. ► వ్యక్తిగతంగాను, స్వయం సహాక సంఘాల్లోని (ఎస్హెచ్జీ) వారికి నాలుగేళ్లలో రూ.122.50 కోట్ల విలువైన నూలు అందజేత. -
కళ్ళ ముందు కనిపిస్తున్న అభివృద్ధి...జగన్ కే జై అంటున్న జనం
-
ఏపీకి మళ్లీ జగనే సీఎం కావాలి
కూకట్పల్లి (హైదరాబాద్): ఏ నోట విన్నా అదే మాట.. ఏ నోట విన్నా అదే పాట.. జై జగన్.. జైజై జగన్.. కూకట్పల్లిలో ఆంధ్రప్రదేశ్ ఓటర్లు మేమంతా సిద్ధం పేరిట ఏర్పాటు చేసిన వైఎస్సార్ సీపీ అభిమానుల ఆత్మీయ సమ్మేళనం జగన్నినాదంతో పోటెత్తింది. జెండాలు జతకట్టడమే మీ ఎజెండా.. జనం గుండెల్లో గుడి కట్టడమే జగన్ ఎజెండా’ అంటూ యువత హోరెత్తించింది. కూకట్పల్లి, కుత్భుల్లాపూర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలోని పలు ప్రాంతాల్లో ఉన్న వేలాది మంది ఏపీ ఓటర్లు ఈ ఎన్నికల్లో మళ్లీ ఫ్యాన్ తడాఖా చూపిస్తామంటూ నినదించారు. ఆదివారం ఎన్ఎకెఎన్ఆర్ గార్డెన్లో జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్కి చెందిన ప్రజాప్రతినిధులు పాల్గొని ప్రసంగించారు. ఏపీని అన్ని రంగాల్లో అగ్రగామిగా అభివృద్ధి చేసిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని విపక్షాలు రాజకీయంగా ఎదుర్కోలేకనే భౌతిక దాడులకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రం విడిపోయి కష్ట కాలంలో ఉన్న సమయంలో రూ.లక్షల కోట్లతో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుందన్నారు. పేద విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియం చదువు కోసం ఏపీలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ. 54 వేల కోట్లను వెచ్చించిందని గుర్తుచేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని సమానంగా ముందుకు తీసుకెళ్లిన వైఎస్ జగన్ ప్రభుత్వానికి ప్రజలు నీరాజనాలు పలుకుతుంటే ఓ వైపు ఎల్లో మీడియా, మరో వైపు ప్రతిపక్షాలుగా చెప్పుకుంటున్న అన్ని పార్టీలు మల్టీ మాఫియాలా తయారయ్యాయని ధ్వజమెత్తారు. అందరూ ఓట్లేయాలి తిరుపతి ఎంపీ అభ్యర్థి గురుమూర్తి, ఎమ్మెల్యే అభ్యర్థులు రఘురామిరెడ్డి, అన్నాబత్తుని శివకుమార్, ఎమ్మెల్సీలు శివరామిరెడ్డి, కల్పలతతో పాటు ఈశ్వర్ప్రసాద్రెడ్డి, నేతలు కరుణాకర్రెడ్డి, ఎంఈవీప్రసాద్రెడ్డి, హనుమంతరెడ్డి తదితరులు ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్లో మాఫియా ముఠాలు ఎన్ని కుట్రలు పన్నినా వైఎస్సార్సీపీదే అంతిమ విజయమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రూ.15 లక్షల కోట్ల పెట్టుబడులతో అభివృద్ధి పనులు, పరిశ్రమలు వచ్చాయని, అవి సంపూర్ణంగా ఆంధ్ర ప్రజలకు అందాలంటే జగన్ మరోసారి సీఎం కావాల్సిందే అని వారు తెలిపారు. ఇక్కడి కార్యకర్తలందరూ వారం రోజులు ముందుగానే తమ గ్రామాల్లో ఉన్న ఓటర్ల వివరాలను సేకరించుకుని వారితో ఓటు వేసే విధంగా కృషి చేయాలని సూచించారు. నిర్వాహకులు ఎస్వీ సుబ్రమణ్యం, బాణరాగవు సునీల్రెడ్డి, సత్యనారాయణరెడ్డి, చంద్రారెడ్డి, విజయభాస్కరరెడ్డి, రఘురాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తొలుత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ చిత్రపటానికి, వైఎస్సార్ విగ్రహానికి పూలదండలు వేసి నివాళులరి్పంచారు. -
మళ్లీ జగనే అవసరం
సాక్షి, విశాఖపట్నం: ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో గడిచిన ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో శరవేగంగా అభివృద్ధి జరిగింది. దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని విధంగా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. ఏపీ ప్రభుత్వ పౌర సేవలు దేశానికే ఆదర్శం. అవినీతికి ఆస్కారం లేని సుపరిపాలన అందుతోంది. విద్య, వైద్య రంగాల్లో పశ్చిమ దేశాలకు దీటుగా ఏపీ అభివృద్ధి చెందింది. అందుకే ఆంధ్రప్రదేశ్కు మళ్లీ జగనే అవసరం. ఆయన గెలిస్తే ఏపీ మరో సింగపూర్గా మారుతుంది’ అంటూ పలువురు ప్రవాసాంధ్రులు కొనియాడారు. ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘జగన్ పాలన – ప్రవాసాంధ్రుల స్పందన’ అనే అంశంపై శనివారం విశాఖలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 15 దేశాల నుంచి 50 మందికి పైగా ప్రవాసాంధ్రులు ప్రత్యక్షంగా, మరికొన్ని దేశాల నుంచి వర్చువల్గా పాల్గొన్నారు. రాష్ట్రంలో సంక్షేమంపైప్రవాసాంధ్రులు రూపొందించిన అభివృద్ధి నివేదికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు ప్రవాసాంధ్రులు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల భవనాలు, వాటిలో మౌలిక సదుపాయాలు పశ్చిమ దేశాల్లో స్కూళ్లను తలపిస్తున్నాయని పేర్కొన్నారు. విలువైన ట్యాబ్లు, అత్యుత్తమ సిలబస్ను ఆ దేశాల్లో ఏ ప్రభుత్వమూ విద్యార్థులకు ఉచితంగా ఇవ్వడంలేదన్నారు. ఏపీలో మాత్రం లక్షలాది విద్యార్థులు వీటిని ఉచితంగా పొందుతున్నారన్నారు. సుమారు కోటీ నలభై లక్షల కుటుంబాలు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్య సదుపాయాలు పొందుతున్నాయని, ఇలాంటి సదుపాయం అగ్రదేశం అమెరికాలో కూడా లేదని గుర్తు చేశారు. సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ ద్వారా 12 కోట్ల పౌర సేవలు అందడం విశేషమని చెప్పారు. ఈ ఐదేళ్లలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని, సంక్షేమ పథకాలను ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీవీఆర్ కృష్ణంరాజు గణాంకాలతో సహా వివరించారు. సీఎం జగన్ రాష్ట్రంలో సుమారు 31 లక్షల మంది మహిళలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేశారని, వీటి విలువ రూ.7.75 లక్షల కోట్లని చెప్పారు. నిరుద్యోగం 4.5 శాతానికి తగ్గిందని, కొత్త పరిశ్రమల ద్వారా గతేడాది 14 లక్షల పీఎఫ్ ఖాతాలు కొత్తగా చేరాయని, 18 లక్షల మంది ఆదాయ పన్ను చెల్లింపుదార్లు పెరిగారని తెలిపారు. ఈ రౌండ్టేబుల్ సమావేశంలో ప్రవాసాంధ్రులు ఏమన్నారంటే.. ముందు చూపు ఉన్న నేత జగన్ విద్యారంగంలో వైఎస్ జగన్ చేపట్టిన సంస్కరణలతో విద్యార్థులు ఏ రంగంలోనైనా రాణించే నైపుణ్యాన్ని సాధిస్తున్నారు. నైపుణ్య వనరులుంటే పెట్టుబడులకు ముందుకు వస్తారు. అలాంటి వనరులను సీఎం జగన్ ఏపీలో సమకూర్చారు. ఇలాంటి ముందు చూపు అంబేడ్కర్కే సొంతం. మళ్లీ ఇప్పుడు జగన్లో అంబేడ్కర్ను చూస్తున్నా. రాష్ట్రంలో రూ.10 వేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులతో పాటు ఐటీ కంపెనీలు, అమెరికాలో మాదిరిగా రూ.2 వేల కోట్ల విలువైన ఎంఎస్ఎంఈలు వస్తున్నాయి. తీరప్రాంతంలో కొత్తగా పోర్టులు, హార్బర్లు నిర్మిస్తున్నారు. – శివ, టెక్సాస్ స్వాతంత్య్రం వచ్చాక ఇంతలా అభివృద్ధి లేదు వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఏపీలోకి చాలా పరిశ్రమలు వస్తున్నాయి. నాడు–నేడులో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా మారాయి. స్వాతంత్య్రం వచ్చాక రాష్ట్రంలో ఇంతలా అభివృద్ధి జరగలేదు. వైఎస్ జగన్కు మళ్లీ అవకాశం ఇస్తే ఈ అభివృద్ధి కొనసాగుతుంది. ఈ బాధ్యత రాష్ట్ర ప్రజలపై ఉంది. – వెంకట్ కల్లూరి, కాలిఫోర్నియా సీఎం విప్లవాత్మక మార్పులు తెచ్చారు వైద్య రంగంలో సీఎం విప్లవాత్మక మార్పులు తెచ్చారు. 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నారు. వనరులు తక్కువ ఉన్నా కోవిడ్ సమయంలో సమర్థవంతంగా మరణాల సంఖ్యను బాగా తగ్గించగలిగారు. అగ్రదేశం అమెరికాలో సైతం ఇంతలా చేయలేకపోయారు. మరో పదేళ్లు వైఎస్ జగన్ సీఎంగా కొనసాగితే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుంది. – డాక్టర్ పవన్ పాముకుర్తి, టెక్సాస్ మరే నాయకుడైనా ఇలా పాలించాడా? ఏపీలో నాడు–నేడుతో ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మారిపోయాయి. పేద విద్యార్థులను అమ్మ ఒడి ద్వారా ఆదుకుంటున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్తో ఉన్నత విద్యకు దోహదపడుతున్నారు. మరే నాయకుడైనా ఇలా పరిపాలన చేశారా? ఏపీని ముందుకు తీసుకెళ్తున్న జగన్ను మరోసారి సీఎంగా ఎన్నుకోవాలి. – కార్తీక్ ఎల్లాప్రగడ, నెదర్లాండ్స్ సామాజిక న్యాయం చేసి చూపారు సామాజిక న్యాయం నినాదం కాదు.. చేతల్లో చూపించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. అన్ని పార్టీలు ధనవంతులకే అవకాశాలు కల్పిస్తే.. జగన్ మాత్రం పేదలు, సామాన్యులకు టికెట్లు ఇచ్చారు. బీసీ ముస్లింను ఉప ముఖ్యమంత్రిని చేశారు. బీసీ ముస్లింలకు వైఎస్ రాజశేఖర్రెడ్డికంటే మిన్నగా ఆయన తనయుడు జగన్ ఎన్నో మేళ్లు చేస్తున్నారు. –ఇలియాస్, కువైట్ మహిళా సాధికారిత భేష్ ముఖ్యమంత్రి జగన్ మహిళా సాధికారితకు పెద్దపీట వేశారు. గతంలో ఎవరూ చేయని విధంగా అన్నింటా అవకాశాలు కల్పించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుతోంది. ఉద్దానం సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారు. – పాలకుర్తి నీలిమ, యూఏఈ ప్రతి స్కూలూ స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీనే ఏపీ సీఎం జగన్ 40 వేల ప్రభుత్వ స్కూళ్లను అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ స్కూళ్లలో పేద, ధనిక తేడా లేకుండా అందరూ వారి పిల్లల్ని చదివించుకోవచ్చు. రాష్ట్రంలో ఇప్పుడు ప్రతి ప్రభుత్వ పాఠశాల స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీగానే చెప్పవచ్చు. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే మరిన్ని అద్భుతాలు జరుగుతాయి. ఆయన్నే మరోసారి గెలిపించుకోవలసిన బాధ్యత అందరికీ ఉంది. – కోటిరెడ్డి, సింగపూర్ అవినీతి గురించి విన్నామా? విద్యావంతులు పుష్కలంగా ఉంటే పరిశ్రమలు వాటంతట అవే వస్తాయి. ఇప్పుడు రాష్ట్రంలో అదే పరిస్థితి ఉంది. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో స్కాంలు, ఆశ్రిత పక్షపాతం గురించే వినే వాళ్లం. ఈ ఐదేళ్లలో ఒక్క అవినీతి గురించైనా విన్నామా? వలంటీర్ల వ్యవస్థతో ప్రజల వద్దకే పాలన అందుతోంది. ప్రజలకు మంచి చేసే ప్రభుత్వానికి మద్దతు అవసరం. సీఎంగా మళ్లీ జగన్నే గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత రాష్ట్ర ప్రజలకు ఉంది. – వెంకట్ ఇక్కుర్తి, యూఎస్ సచివాలయ వ్యవస్థ సత్ఫలితాలిస్తోంది ఏపీలో సంక్షేమం, అభివృద్ధి విశేషంగా జరిగింది. ఐదేళ్లలో రాష్ట్రంలో 280 కొత్త కంపెనీలు ఏర్పాటయ్యాయి. వీటి ద్వారా రూ.15 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ సత్ఫలితాలనిస్తోంది. ఆరోగ్యశ్రీ పరిమితి రూ.25 లక్షలకు పెంపు ఎంతో గొప్ప విషయం. కొత్తగా 4 లక్షల ఎంఎస్ఎంఈలు వచ్చాయి. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. – వెంకట్ మేడపాటి, అమెరికా -
మళ్లీ జగనే అవసరం
సాక్షి, విశాఖపట్నం: ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో గడిచిన ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో శరవేగంగా అభివృద్ధి జరిగింది. దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని విధంగా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. ఏపీ ప్రభుత్వ పౌర సేవలు దేశానికే ఆదర్శం. అవినీతికి ఆస్కారం లేని సుపరిపాలన అందుతోంది. విద్య, వైద్య రంగాల్లో పశి్చమ దేశాలకు దీటుగా ఏపీ అభివృద్ధి చెందింది. అందుకే ఆంధ్రప్రదేశ్కు మళ్లీ జగనే అవసరం. ఆయన గెలిస్తే ఏపీ మరో సింగపూర్గా మారుతుంది’ అంటూ పలువురు ప్రవాసాంధ్రులు కొనియాడారు. ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘జగన్ పాలన – ప్రవాసాంధ్రుల స్పందన’ అనే అంశంపై శనివారం విశాఖలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 15 దేశాల నుంచి 50 మందికి పైగా ప్రవాసాంధ్రులు ప్రత్యక్షంగా, మరికొన్ని దేశాల నుంచి వర్చువల్గా పాల్గొన్నారు. రాష్ట్రంలో సంక్షేమంపై ప్రవాసాంధ్రులు రూపొందించిన అభివృద్ధి నివేదికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు ప్రవాసాంధ్రులు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల భవనాలు, వాటిలో మౌలిక సదుపాయాలు పశి్చమ దేశాల్లో స్కూళ్లను తలపిస్తున్నాయని పేర్కొన్నారు. విలువైన ట్యాబ్లు, అత్యుత్తమ సిలబస్ను ఆ దేశాల్లో ఏ ప్రభుత్వమూ విద్యార్థులకు ఉచితంగా ఇవ్వడంలేదన్నారు. ఏపీలో మాత్రం లక్షలాది విద్యార్థులు వీటిని ఉచితంగా పొందుతున్నారన్నారు. సుమారు కోటీ నలభై లక్షల కుటుంబాలు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్య సదుపాయాలు పొందుతున్నాయని, ఇలాంటి సదుపాయం అగ్రదేశం అమెరికాలో కూడా లేదని గుర్తు చేశారు. సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ ద్వారా 12 కోట్ల పౌర సేవలు అందడం విశేషమని చెప్పారు. ఈ ఐదేళ్లలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని, సంక్షేమ పథకాలను ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీవీఆర్ కృష్ణంరాజు గణాంకాలతో సహా వివరించారు. సీఎం జగన్ రాష్ట్రంలో సుమారు 31 లక్షల మంది మహిళలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేశారని, వీటి విలువ రూ.7.75 లక్షల కోట్లని చెప్పారు. నిరుద్యోగం 4.5 శాతానికి తగ్గిందని, కొత్త పరిశ్రమల ద్వారా గతేడాది 14 లక్షల పీఎఫ్ ఖాతాలు కొత్తగా చేరాయని, 18 లక్షల మంది ఆదాయ పన్ను చెల్లింపుదార్లు పెరిగారని తెలిపారు. ఈ రౌండ్టేబుల్ సమావేశంలో ప్రవాసాంధ్రులు ఏమన్నారంటే.. ముందు చూపు ఉన్న నేత జగన్ విద్యారంగంలో వైఎస్ జగన్ చేపట్టిన సంస్కరణలతో విద్యార్థులు ఏ రంగంలోనైనా రాణించే నైపుణ్యాన్ని సాధిస్తున్నారు. నైపుణ్య వనరులుంటే పెట్టుబడులకు ముందుకు వస్తారు. అలాంటి వనరులను సీఎం జగన్ ఏపీలో సమకూర్చారు. ఇలాంటి ముందు చూపు అంబేడ్కర్కే సొంతం. మళ్లీ ఇప్పుడు జగన్లో అంబేడ్కర్ను చూస్తున్నా. రాష్ట్రంలో రూ.10 వేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులతో పాటు ఐటీ కంపెనీలు, అమెరికాలో మాదిరిగా రూ.2 వేల కోట్ల విలువైన ఎంఎస్ఎంఈలు వస్తున్నాయి. తీరప్రాంతంలో కొత్తగా పోర్టులు, హార్బర్లు నిర్మిస్తున్నారు. – శివ, టెక్సాస్ స్వాతంత్య్రం వచ్చాక ఇంతలా అభివృద్ధి లేదు వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఏపీలోకి చాలా పరిశ్రమలు వస్తున్నాయి. నాడు–నేడులో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా మారాయి. స్వాతంత్య్రం వచ్చాక రాష్ట్రంలో ఇంతలా అభివృద్ధి జరగలేదు. వైఎస్ జగన్కు మళ్లీ అవకాశం ఇస్తే ఈ అభివృద్ధి కొనసాగుతుంది. ఈ బాధ్యత రాష్ట్ర ప్రజలపై ఉంది. – వెంకట్ కల్లూరి, కాలిఫోరి్నయా సీఎం విప్లవాత్మక మార్పులు తెచ్చారు వైద్య రంగంలో సీఎం విప్లవాత్మక మార్పులు తెచ్చారు. 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నారు. వనరులు తక్కువ ఉన్నా కోవిడ్ సమయంలో సమర్థవంతంగా మరణాల సంఖ్యను బాగా తగ్గించగలిగారు. అగ్రదేశం అమెరికాలో సైతం ఇంతలా చేయలేకపోయారు. మరో పదేళ్లు వైఎస్ జగన్ సీఎంగా కొనసాగితే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుంది. – డాక్టర్ పవన్ పాముకుర్తి, టెక్సాస్ మరే నాయకుడైనా ఇలా పాలించాడా? ఏపీలో నాడు–నేడుతో ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మారిపోయాయి. పేద విద్యార్థులను అమ్మ ఒడి ద్వారా ఆదుకుంటున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్తో ఉన్నత విద్యకు దోహదపడుతున్నారు. మరే నాయకుడైనా ఇలా పరిపాలన చేశారా? ఏపీని ముందుకు తీసుకెళ్తున్న జగన్ను మరోసారి సీఎంగా ఎన్నుకోవాలి. – కార్తీక్ ఎల్లాప్రగడ, నెదర్లాండ్స్ సామాజిక న్యాయం చేసి చూపారు సామాజిక న్యాయం నినాదం కాదు.. చేతల్లో చూపించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. అన్ని పారీ్టలు ధనవంతులకే అవకాశాలు కలి్పస్తే.. జగన్ మాత్రం పేదలు, సామాన్యులకు టికెట్లు ఇచ్చారు. బీసీ ముస్లింను ఉప ముఖ్యమంత్రిని చేశారు. బీసీ ముస్లింలకు వైఎస్ రాజశేఖర్రెడ్డికంటే మిన్నగా ఆయన తనయుడు జగన్ ఎన్నో మేళ్లు చేస్తున్నారు. –ఇలియాస్, కువైట్ మహిళా సాధికారిత భేష్ ముఖ్యమంత్రి జగన్ మహిళా సాధికారితకు పెద్దపీట వేశారు. గతంలో ఎవరూ చేయని విధంగా అన్నింటా అవకాశాలు కలి్పంచారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుతోంది. ఉద్దానం సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారు. – పాలకుర్తి నీలిమ, యూఏఈ ప్రతి స్కూలూ స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీనే ఏపీ సీఎం జగన్ 40 వేల ప్రభుత్వ స్కూళ్లను అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ స్కూళ్లలో పేద, ధనిక తేడా లేకుండా అందరూ వారి పిల్లల్ని చదివించుకోవచ్చు. రాష్ట్రంలో ఇప్పుడు ప్రతి ప్రభుత్వ పాఠశాల స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీగానే చెప్పవచ్చు. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే మరిన్ని అద్భుతాలు జరుగుతాయి. ఆయన్నే మరోసారి గెలిపించుకోవలసిన బాధ్యత అందరికీ ఉంది. – కోటిరెడ్డి, సింగపూర్ అవినీతి గురించి విన్నామా? విద్యావంతులు పుష్కలంగా ఉంటే పరిశ్రమలు వాటంతట అవే వస్తాయి. ఇప్పుడు రాష్ట్రంలో అదే పరిస్థితి ఉంది. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో స్కాంలు, ఆశ్రిత పక్షపాతం గురించే వినే వాళ్లం. ఈ ఐదేళ్లలో ఒక్క అవినీతి గురించైనా విన్నామా? వలంటీర్ల వ్యవస్థతో ప్రజల వద్దకే పాలన అందుతోంది. ప్రజలకు మంచి చేసే ప్రభుత్వానికి మద్దతు అవసరం. సీఎంగా మళ్లీ జగన్నే గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత రాష్ట్ర ప్రజలకు ఉంది. – వెంకట్ ఇక్కుర్తి, యూఎస్ సచివాలయ వ్యవస్థ సత్ఫలితాలిస్తోంది ఏపీలో సంక్షేమం, అభివృద్ధి విశేషంగా జరిగింది. ఐదేళ్లలో రాష్ట్రంలో 280 కొత్త కంపెనీలు ఏర్పాటయ్యాయి. వీటి ద్వారా రూ.15 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ సత్ఫలితాలనిస్తోంది. ఆరోగ్యశ్రీ పరిమితి రూ.25 లక్షలకు పెంపు ఎంతో గొప్ప విషయం. కొత్తగా 4 లక్షల ఎంఎస్ఎంఈలు వచ్చాయి. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. – వెంకట్ మేడపాటి, అమెరికా -
మీరు వచ్చాక చేయూత పథకంతో మేలు జరిగింది: చేనేత కార్మికులు
-
పేదల జీవితాల్లో వెలుగులు..
-
ఐదేళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పలు సంక్షేమ పథకాల ద్వారా ప్రజల ఆర్థికాభివృద్ధికి, జీవన ప్రమాణాల పెంపునకు, రాష్ట్రాభివృద్ధికి బాటలు వేశారు. ఈ ఐదేళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిపుష్టంగా తయారైంది. బ్యాంకింగ్ రంగం కీలక సూచికలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. గత ఐదేళ్లలో రాష్ట్రంలో డిపాజిట్లతో పాటు రుణాల మంజూరులో భారీగా వృద్ధి నమోదైనట్లు 226వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ నివేదిక వెల్లడించింది. ఐదేళ్లలో రెండేళ్లు కోవిడ్ సంక్షోభం నెలకొన్నప్పటికీ రాష్ట్ర ప్రజల జీవనోపాధికి సమస్యల్లేకుండా వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు సత్పలితాలు ఇస్తున్నాయనడానికి డిపాజిట్లలో భారీ వృద్ధి నిదర్శనం. గత ఐదేళ్లలో డిపాజిట్లలో ఏకంగా 58.23 శాతం వృద్ధి నమోదైంది. 2019 మార్చి నాటికి డిపాజిట్లు రూ.3,12,642 కోట్లు ఉండగా 2023 డిసెంబర్ నాటికి రూ.4,94,690 కోట్లు.. అంటే రూ.1,82,048 కోట్లు పెరిగాయి. అన్ని రంగాలకు బ్యాంకు రుణాల మంజూరులో ఏకంగా 96.64 శాతం భారీ వృద్ధి నమోదైంది. 2019 మార్చి నాటికి రుణాల మంజూరు రూ.3,97,350 కోట్లు ఉండగా 2023 డిసెంబర్ నాటికి రూ.7,81,313 కోట్లకు పెరిగాయి. అంటే రుణాలు రూ.3,83,963 కోట్లు పెరిగాయి. డిపాజిట్ల పెరుగుదల ప్రజల ఆదాయం పెరుగుదలకు నిదర్శనం కాగా రుణాలు ఆర్థిక కార్యకలాపాల పెరుగుదలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. నవరత్నాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదలందరి జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా నేరుగా నగదు బదిలీని అమలు చేసింది. అలాగే బ్యాంకుల ద్వారా పేదలు, రైతులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, ఎంఎస్ఎంఈలు, ఇతర వర్గాలకు వివిధ పథకాల కింద బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించడం ద్వారా వారి ఆదాయం మెరుగుపడేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది., ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతో పాటు మహిళలకు బ్యాంకుల నుంచి రుణాలు విరివిగా లభించేలా చర్యలు చేపట్టింది. అందువల్లే గతంలో ఎన్నడూ లేని విధంగా అన్ని రంగాల్లో రుణాల మంజూరులో భారీ వృద్ధి నమోదైంది. ఆర్బీఐ నిబంధనలకన్నా అన్ని రంగాల్లో అత్యధికంగా బ్యాంకులు రుణాలు మంజూరు చేశాయి. బ్యాంకులు ఇచ్చిన రుణాలను సకాలంలో చెల్లించేలా ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు, స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేస్తోంది. అలాగే నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు లబ్ధిదారులకు పావలా వడ్డీకి రుణాలు ఇప్పిస్తోంది. వీధుల్లో, వాడల్లో చిరు వ్యాపారాలు చేసుకునే వారికి బ్యాంకులు ద్వారా సున్నా వడ్డీకే బ్యాంకుల ద్వారా రుణాలను ఇప్పిస్తోంది. వైఎస్సార్ చేయూత ద్వారా పేద మహిళలకు ప్రభుత్వం ఆర్థిక సాయంతో పాటు బ్యాంకు రుణాలను మంజూరు చేయించి, వ్యాపారాలు చేసుకునేలా ప్రోత్సహిస్తోంది. ప్రజలు కూడా ప్రభుత్వం అందించిన చేయూతతో సకాలంలో రుణాలు చెల్లిస్తూ వారి వ్యాపారాలను అభివృద్ధి చేసుకుంటూ ఆర్థికంగా ఎదుగుతున్నారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం గత ఏడాది డిసెంబర్ నాటికి క్రెడిట్ రేషియో 60 శాతం ఉండాల్సి ఉండగా దానికి మించి 157.94 శాతం నమోదైనట్లు బ్యాంకర్ల కమిటీ నివేదిక పేర్కొంది. సీడీ రేషియో అధికంగా ఉందంటే ఆ రాష్ట్రంలో వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు అధికంగా జరగుతున్నాయనే అర్ధమని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. -
ఆరోగ్యశ్రీ పేదల పాలిట ఆరోగ్యప్రదాయిని: లబ్ధిదారులు
-
ఇంటింటికి వెళ్లి పింఛన్లు ఇవ్వడం ఏపీలోనే..
సాక్షి, అమరావతి: ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేయడం ఆంధ్రప్రదేశ్లో తప్ప దేశంలో మరెక్కడా లేదని, ఇలా ఇంటి వద్దకే సంక్షేమ పథకాలను తీసుకెళ్లడం చాలా మంచి పని అని హైకోర్టు వ్యాఖ్యానించింది. పెన్షన్లు పంపిణీ చేయకుండా వలంటీర్లపై నిషేధం విధిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) గత నెల 30న జారీ చేసిన ఉత్తర్వుల విషయంలో జోక్యానికి నిరాకరించింది. ఏప్రిల్, మే, జూన్ నెలల పెన్షన్ల పంపిణీ విషయంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని, వృద్ధులు, రోగులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారి ఇళ్లకే వెళ్లి పింఛన్లు అందచేసే ఏర్పాట్లు చేశామన్న కేంద్ర ఎన్నికల సంఘం వాదనను పరిగణనలోకి తీసుకుంది. ఎన్నికల సంఘం ఉత్తర్వుల్లో తమ జోక్యం అవసరం లేదంది. ఎన్నికల సంఘం ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్ను) కొట్టేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్రావు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయాల్లో క్యూలో నిల్చుకుని పెన్షన్ తీసుకోవాల్సి వస్తోంది పెన్షన్లు పంపిణీ చేయకుండా వలంటీర్లపై నిషేధం విధిస్తూ ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులను చట్ట విరుద్ధంగా ప్రకటించి, వాటిని రద్దు చేయాలని కోరుతూ గుంటూరు జిల్లా, కుంచెనపల్లి, మున్నంగికి చెందిన వంగా వరలక్ష్మి, వంగా బిందు, అల్లు సునీత దాఖలు చేసిన పిల్పై సీజే ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది గుండాల శివప్రసాద్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల సంఘం ఉత్తర్వుల కారణంగా పెన్షనర్లు గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి క్యూలో నిల్చుని పింఛన్లు తీసుకోవాల్సి వస్తోందన్నారు. పక్షవాతం, కిడ్నీ తదితర రోగాలతో బాధపడే వారు పింఛను పొందలేని పరిస్థితి ఉందన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ప్రత్యామ్నాయల సంగతి ఏమిటని, దేశవ్యాప్తంగా ఎలాంటి విధానం అమలవుతోందని ఆరా తీసింది. ఇంటింటికి వెళ్లి పెన్షన్ ఇవ్వడం ఈ రాష్ట్రంలో తప్ప ఎక్కడా లేదని, ఇది మంచి పని అని వ్యాఖ్యానించింది. ► కేంద్ర ఎన్నికల సంఘం తరపున సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ స్పందిస్తూ, తమ ఆదేశాల మేరకు పెన్షనర్లు ఇబ్బంది పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిందన్నారు. వృద్ధులు, రోగులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఇళ్లకే వెళ్లి పింఛన్లు ఇచ్చేలా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. మిగిలిన వారు గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా పింఛన్లు పొందేలా ఆదేశాలు ఇచ్చిందన్నారు. ఈ మేరకు ఈ నెల 2న మెమో జారీ చేసిందని తెలిపారు. ఏప్రిల్, మే, జూన్ నెలలకు ఈ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కొనసాగుతాయన్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో సంతృప్తి చెందామని ధర్మాసనం తెలిపింది. అలా అయితే తాను లేవనెత్తిన అంశాలన్నింటినీ రికార్డ్ చేయాలని, తరువాత తాను సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని శివప్రసాద్రెడ్డి చెప్పారు. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండని శివప్రసాద్ను ధర్మాసనం కోరింది. పెన్షన్లు పంపిణీ చేయకుండా వలంటీర్లపై నిషేధం విధిస్తూ ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులు ఏకపక్షమని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సంప్రదించకుండానే నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. రాజకీయ దురుద్దేశాలతోనే నిమ్మగడ్డ రమేష్ ఆధ్వర్యంలో పనిచేసే సిటిజన్ ఫర్ డెమొక్రసీ ఎన్నికల సంఘం వద్ద పిటిషన్ దాఖలు చేసిందన్నారు. గతంలో ఆయన రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా పనిచేశారని తెలిపారు. శివప్రసాద్ వాదనలు విన్న ధర్మాసనం.. పిల్ను కొట్టేస్తున్నట్లు తెలిపింది. దేశంలో మిగిలిన అన్ని చోట్లా ప్రజలే వెళ్లి పెన్షన్లు తీసుకుంటున్నారని వ్యాఖ్యానించింది. ఇదే అంశంపై మరో ఐదుగురు కూడా పిటిషన్ దాఖలు చేశారని మరో న్యాయవాది చెప్పగా, ఆ వ్యాజ్యాన్ని కూడా కొట్టేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. -
పింఛన్లపై బాబు డబుల్ గేమ్
సాక్షి, అమరావతి: అటుపక్క సామాజిక పింఛన్లను అడ్డుకోవడం.. ఇటుపక్క సకాలంలో ఇచ్చేయాలంటూ ఎన్నికల సంఘానికి లేఖలు రాయడం! ఇదీ చంద్రబాబు రెండు నాలుకల వైఖరి! స్వార్థ ప్రయోజనాల కోసం దిగజారుడు రాజకీయాలు, పేదల నోట్లో మట్టి కొట్టే ఆలోచనలు తనకు మినహా మరెవరికీ ఉండవని మరోసారి రుజువు చేసుకున్నారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో భాగంగా ప్రభుత్వం నియమించిన వలంటీర్లు ప్రతి నెలా ఒకటో తేదీన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఇంటివద్దే పింఛన్లు అందిస్తూ పాలనను ప్రతి గడపకూ చేరువ చేశారు. దేశంలోనే తొలిసారిగా సీఎం జగన్ తీసుకొచ్చిన ఈ వ్యవస్థపై చంద్రబాబు వేయని నింద లేదు, చేయని ఆరోపణ లేదు. వివక్ష, లంచాలు లేకుండా ప్రభుత్వ పథకాల ద్వారా పేదలు పారదర్శకంగా లబ్ధి పొందడం టీడీపీకి, ఎల్లో మీడియాకు కంటగింపుగా మారింది. చంద్రబాబు, ఆయన పార్ట్నర్ పవన్ కళ్యాణ్, ఎల్లో మీడియా నిత్యం అభాండాలు వేయడమే పనిగా వ్యవహరించారు. వలంటీర్లు రాత్రిళ్లు వెళ్లి తలుపులు కొడుతున్నారని, వారి వల్ల ఆడపిల్లలకు రక్షణ లేదని, ఆ వ్యవస్థను రద్దు చేయాలని కుట్రపూరిత ఆరోపణలు చేశారు. పవన్ కళ్యాణ్ అయితే రాష్ట్రంలో వేలమంది యువతులు కనిపించకుండా పోయారని, అందుకు వలంటీర్లే కారణమంటూ దారుణంగా మాట్లాడారు. ఇలా అడుగడుగునా విపక్షం వేధించి అవమానించినా వలంటీర్లు పేదల సంక్షేమమే లక్ష్యంగా సేవాభావంతో విధులు నిర్వహించారు. నిమ్మగడ్డ ద్వారా.. సంక్షేమ పథకాలను ప్రజలకు అందకుండా చేయడం ద్వారా ప్రభుత్వంపై బురద చల్లాలన్నది చంద్రబాబు కుతంత్రం. ఈ పనిని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్కు ఆయన ప్రత్యేకంగా అప్పగించారు. నిమ్మగడ్డ రాష్ట్ర ఎన్నికల అధికారిగా ఉన్నప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, చంద్రబాబుకు అనుకూలంగా ఏ స్థాయిలో పని చేశారో అందరికీ తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికలను టీడీపీ కోసం హఠాత్తుగా వాయిదా వేసి రాజ్యాంగాన్నే అపహాస్యం చేసిన చరిత్ర ఆయనది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూనే హైదరాబాద్లోని ఓ హోటల్లో చంద్రబాబు బినామీలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ను కలసి చంద్రబాబు కోసం ఏం చేయడానికైనా వెనుకాడబోనని చాటుకున్నారు. పదవీ విరమణ తరువాత కూడా నిస్సిగ్గుగా చంద్రబాబుకు మేలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. అందుకోసం కొంతమందిని పోగుచేసి సిటిజన్ డెమొక్రటిక్ ఫోరం పేరుతో తెర వెనుక రాజకీయాలు నడిపారు. అందులో భాగంగానే వలంటీర్ల వ్యవస్థ లేకుండా చేసేందుకు కోర్టులో కేసు వేశారు. పింఛన్ల పంపిణీకి అడ్డుపడి ఈసీకి ఫిర్యాదులు చేశారు. ప్రజాగ్రహంతో... పింఛన్ల పంపిణీకి అడ్డంకులు సృష్టించడంలో సక్సెస్ అయిన చంద్రబాబు, నిమ్మగడ్డ కుట్రపూరిత రాజకీయాలతో వలంటీర్లను ప్రజలకు దూరం చేయగలిగామని చంద్రబాబు బృందం చంకలు గుద్దుకున్నా ఒకటో తేదీ రావడంతో వారిలో వణుకు మొదలైంది. చంద్రబాబు, నిమ్మగడ్డ నిర్వాకాల కారణంగా ఒకటో తేదీన పింఛన్ల పంపిణీ ఆగిపోయే పరిస్థితి నెలకొంది. దీనిపై ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నట్లు పసిగట్టిన చంద్రబాబు బృందం ప్లేటు ఫిరాయించింది. తాము అడ్డుకున్న కార్యక్రమం గురించి మళ్లీ వారే ఎన్నికల కమిషన్, రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాయడం గమనార్హం. పింఛన్ల పంపిణీకి తక్షణమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలంటూ అందులో పేర్కొన్నారు. -
సంక్షేమ పథకాలతో హాయిగా జీవిస్తున్నామంటున్న లబ్ధిదారులు
-
మోసగాళ్లను నమ్మొద్దు
చంద్రబాబు ఈ రోజు శింగనమలకు వెళ్లారు. వైఎస్సార్సీపీ ఓ టిప్పర్ డ్రైవర్కు టికెట్ ఇచ్చిందని హేళన చేసి తూలనాడారు. ఆ పిల్లోడు చదువుపై కూడా తప్పులు చెప్పారు. అవునయ్యా.. పేదవాడికి టికెట్ ఇచ్చాం. తప్పేముందయ్యా చంద్రబాబూ? వీరాంజనేయులు టిప్పర్ డ్రైవరే. కాదని చెప్పలేదు. కానీ అతను చదివింది చంద్రబాబు కంటే పెద్ద చదువులు. ఎంఏ ఎకనామిక్స్ చదివి బీఈడీ కూడా చేశాడు. చంద్రబాబు హయాంలో ఉద్యోగాలు దొరక్క టిప్పర్ డ్రైవర్గా తన కాళ్లపై నిలబడ్డాడు. వీరాంజనేయులు చాలా ఏళ్లుగా మనకు తోడుగా ఉన్నాడు. అలాంటి పేద కార్యకర్తకు మీ జగన్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. మీ జగన్ 175 అసెంబ్లీ, 25 ఎంపీలలో 200 స్థానాల్లో ఏకంగా 50 శాతం అంటే 100 సీట్లు నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చారు. పేదవారికి అండగా ఉండే జగన్కు, పెత్తందారీ మనస్తత్వం ఉన్న చంద్రబాబుకు మధ్య తేడాను గమనించాలని కోరుతున్నా. అదే అనంతపురం జిల్లాలో మడకశిర నియోజకవర్గం ఎస్సీలది. అక్కడ మన అభ్యర్థి పేరు లక్కప్ప. చంద్రబాబు అక్కడికి వెళ్లి ఉపాధి హామీ కూలీకీ జగన్ టికెట్ ఇచ్చారు అని అంటారు. అవునయ్యా.. ఉపాధి కూలీ, పేదవాడైన లక్కప్పకు టికెట్ ఇచ్చాం. జగన్కు, చంద్రబాబుకు మధ్య ఇదీ తేడా. మాది పేదల పార్టీ. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ‘పొత్తులు, జిత్తులు, మోసాలు, అబద్దాలు, కుట్రలతో వారు మళ్లీ మీ ముందుకు వస్తున్నారు. మాట నిలబెట్టుకున్న మనకూ, మాట తప్పిన చంద్రబాబుకూ మధ్య ఎన్నికలు జరగబోతున్నాయి. మనందరి ప్రభుత్వంలో లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ జగన్ చేసిన మంచిని, చంద్రబాబు మోసాలను ఇంటింటికీ వెళ్లి చెప్పాలి. మోసం చేసిన వారి తోకలు కత్తిరించే స్టార్ క్యాంపెయినర్లు మీరే. ఈ ఐదేళ్ల పాలనలో మేలు చేసి చూపించి ప్రజల ఇళ్ల వద్దకు వెళుతున్నాం. మీకు మంచి జరిగి ఉంటేనే మీ బిడ్డకు అండగా నిలిచేందుకు స్టార్ క్యాంపెయినర్లుగా రావాలి’ అని ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా మూడో రోజు శుక్రవారం ఆయన ఎమ్మిగనూరు బహిరంగ సభలో మాట్లాడారు. జన సముద్రంగా మారిన ఎమ్మిగనూరు సభ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతుందని చెప్పారు. మే 13న జరిగే కురుక్షేత్ర యుద్ధంలో పేదల పక్షాన నిలిచి పెత్తందారులను ఓడించేందుకు మీరంతా సిద్ధమా.. అని ప్రశ్నించారు. సిద్ధం అంటూ చేతులు పైకెత్తిన ఈ మహా సైన్యం.. పైకి లేచిన ప్రతి చేయి, ఉప్పొంగిన ప్రతి గుండె మా ఇంట గత ఐదేళ్లుగా మంచి జరిగింది అని చెబుతోందన్నారు. ఈ సభలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.., – సాక్షి ప్రతినిధి, కర్నూలు పిల్లల భవిష్యత్ కోసమే సంస్కరణలు ♦ మా ప్రభుత్వ బడులు బాగుపడుతున్నాయని, మా పిల్లల చదువులు మెరుగు పడుతున్నాయని ప్రతీ గుండె చెబుతోంది. రాష్ట్రంలో ఈ 58 నెలల్లో కనీవినీ ఎరుగని విధంగా విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. 10–16 ఏళ్ల తర్వాత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మన బడుల్లో, విద్యా రంగంలో మార్పులు తీసుకొచ్చిన ప్రభుత్వం మనది. నిలబెట్టే చదువు, తలెత్తుకునే ఉద్యోగాలు, ప్రపంచంలో ఎక్కడైనా బతికేలా అవకాశాలు మన విద్యా విధానంలో తీసుకొచ్చాం. ♦ బడులకు పంపే తల్లులను ప్రోత్సహించేందుకు అమ్మ ఒడిని తీసుకొచ్చాం. నాడు–నేడు, ఇంగ్లిష్ మీడియం, తరగతి గదులు, కార్పొరేట్ కంటే గొప్పగా 6వ తరగతి నుంచి ఐఎఫ్బీ ప్యానల్ ద్వారా డిజిటల్ బోధన, 8వ తరగతి నుంచి ట్యాబ్లు, విద్యా కానుక కిట్లు, గోరుముద్ద, 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్లు, సీబీఎస్ఈ నుంచి ఐబీ వరకు మంచి మార్పులు తీసుకొచ్చాం. ♦పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తూ పేదల పెద్ద చదువులకు అండగా నిలిచాం. బోధనలో మార్పులు, ఇంటర్న్షిప్తో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాం. పిల్లలకు ఓట్లు ఉండవని, వారి చదువుల గురించి గతంలో ఏ పాలకుడు పట్టించుకోలేదు. వారి బతుకులు మారాలన్న తపన, తాపత్రయంతో మనం అడుగులు ముందుకు వేశాం. ఈ ఎన్నికలు కేవలం ఓ ఎమ్మెల్యేనో, ఎంపీనో ఎన్నుకునేందుకు తూతూ మంత్రంగా ఓటు వేసేవి కాదు. పిల్లల భవిష్యత్, వారి తల్లిదండ్రుల భవిష్యత్ మారుతుందని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆడబిడ్డలు ఎదిగేలా అడుగులు వేశాం ♦ మన బంగారు తల్లులు ఆడబిడ్డలు, అవ్వల కోసం గత ప్రభుత్వం ఏం చేసిందని అడిగితే చెప్పేందుకు ఒక్కటైనా ఉందా? మన రాష్ట్రంలో నూటికి 30 మంది ఆడపిల్లలు పదో తరగతి కూడా పూర్తి చేయలేదు. బాల్య వివాహాలను ఆపే పరిస్థితి కూడా లేదు. తన బిడ్డను, వారి భవిష్యత్ను నిర్ణయించే శక్తి తల్లుల చేతుల్లో లేదంటే.. అలాంటి పాలకులు ఉన్నా, లేకున్నా ఒకటే. ♦ పాదయాత్రలో నా కళ్లతో చూసిన మరో విషయం చెబుతా. పూలు, వరి, తృణధాన్యాల దాకా ప్రతి గింజ ఎవరి నోట్లోకి వెళుతుందో భగవంతుడు రాస్తాడు. ప్రతీ గింజ పండించడంలో అక్క చెల్లెమ్మల పాత్ర ఎంత ఉందో నా కళ్లతో చూశా. పని వాళ్లుగా, రోజు కూలీలుగా చిన్న చిన్న పనులు చేసుకుని జీవిస్తున్న లక్షల మంది వారి బతుకులను ఎంత కష్టంగా లాగుతున్నారో చూశా. వారి బతుకులు మారాలని ఈ 58 నెలల్లో అడుగులు ముందుకు వేశాం. ♦రోజు కూలీ, దోశలు.. ఇడ్లీలు అమ్మే ఓ అక్క, కుట్టుమిషన్ నడిపే ఓ చెల్లి ఇలా వీరంతా బాగుపడాలి. వీరందరి జీవితాల్లో వెలుగులు రావాలని పథకాలు తీసుకొచ్చాం. ఈ ఆలోచనల నుంచే అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, తోడు, చేదోడు, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా పుట్టాయి. కుదేలైన పొదుపు సంఘాలు ఆసరా, సున్నా వడ్డీ పథకాలతో ఇవాళ తలెత్తుకుని నిలబడ్డాయి. 45–60 ఏళ్ల వయస్సులో నా అక్కచెల్లెమ్మల జీవితాలను బాగు చేసేందుకు చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం అనే పథకాలు పుట్టాయి. చేతల్లో సామాజిక న్యాయం ♦ స్వాతంత్య్రం వచ్చిన ఈ 77 ఏళ్లలో సామాజిక న్యాయం అంశంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అంటూ అణగారిన వర్గాలకు భరోసా ఇచ్చింది మీ బిడ్డ ప్రభుత్వం. ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు ఇందులో 75 శాతం పైచిలుకు నా.. నా.. అని పిలిచే నా సామాజిక వర్గాలకే వచ్చాయి. మీ బిడ్డ ప్రభుత్వం వచ్చే వరకూ రాష్ట్రంలో 4 లక్షల ఉద్యోగాలు ఉంటే, ఇప్పుడు ఏకంగా మరో 2.30 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. ఇందులో 80 శాతం ఉద్యోగాలు ఈ వర్గాల వారే. నామినేషన్పై ఇచ్చే ఉద్యోగాలు, కాంట్రాక్టులు ఏకంగా 50 శాతం చట్టం చేసి ఈ వర్గాలకే వచ్చేట్లు చేసింది కూడా మీ ప్రభుత్వమే. రాజ్యసభ నుంచి ఎమ్మెల్సీ, మంత్రి పదవుల వరకూ ఈ వర్గాలకే ప్రాధాన్యత ఇస్తూ పదవులు ఇవ్వడం సప్తవర్ణాల మిశ్రమం, సామాజిక ఇంధ్ర ధనస్సు అని చెప్పేందుకు సంతోష పడుతున్నా. భవిష్యత్ను మార్చే ఎన్నికలివి ♦ దేశంలో తొలిసారి ఆలయ బోర్డులు, మార్కెట్ కమిటీలు, రాజకీయ నియామకాల్లో ఏకంగా 50 శాతం పదవులకు చట్టం చేసి మహిళలకు ఇచ్చిన ప్రభుత్వానికి రక్షాబంధన్ కట్టాలి. బ్యాంకులకు వెళ్లి.. మహిళల అకౌంట్లలో చంద్రబాబు ఐదేళ్ల వివరాలు, మన ప్రభుత్వంలోని ఐదేళ్ల వివరాలు చూడండి. చంద్రబాబు పాలనలో మీ ఖాతాలకు ఒక్క రూపాయి అయినా వచ్చిందా? మీ బిడ్డ ప్రభుత్వ హయాంలో రూ.2.70 లక్షల కోట్లు జమ చేశాం. ప్రతిపక్షం మాయలు, మోసాల్ని నమ్ముకుంటే.. మీ ప్రభుత్వం మీకు చేసిన మంచిని నమ్ముకుంది. ఈ ఎన్నికలు 2.5 కోట్ల మంది అక్క చెల్లెమ్మలు.. వారి భవిష్యత్, వారి పిల్లల భవిష్యత్ను నిర్ణయించే ఎన్నికలని గుర్తు పెట్టుకోవాలి. ♦రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని గట్టిగా నమ్మిన ప్రభుత్వం ఇది. రైతు భరోసా ద్వారా పెట్టుబడి సాయంగా ఏటా రూ.13,500 చొప్పున ఈ 58 నెలల్లో ఏకంగా రూ.67,500 ప్రతీ రైతు చేతిలో పెట్టాం. చంద్రబాబు ఐదేళ్లలో రూ.87,612 కోట్లు రుణమాఫీ చేస్తానని మోసం చేశారు. చంద్రబాబు హయాంలో రాత్రి పూట 12 గంటలకు ఎప్పడో కరెంట్ వచ్చేది. ఈ రోజు పగటి పూటే నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నాం. విత్తనం నుంచి పంట కొనుగోలు దాకా ఆర్బీకేలు చేయి పట్టుకుని నడిపిస్తున్నాయి. ప్రతి ఎకరాకు ఈ క్రాప్ చేసి రైతులకు ఉచిత పంటల బీమా ఇస్తున్నాం. వరదలు, తుపాన్లు వచ్చి రైతులకు నష్టం జరిగితే ఆ సీజన్లోనే ఇన్ఫుట్ సబ్సిడీ ఇచ్చేది మీ బిడ్డ ప్రభుత్వంలోనే. అసైన్డ్, ఇనాంతో పాటు 22ఏకు సంబంధించిన 35 లక్షల ఎకరాల భూములపై శాశ్వత భూ హక్కులు కల్పించిన ప్రభుత్వం ఇది. రైతు పేరు పలకడమే నేరంగా భావించి, వారిని మోసం చేయడం, వ్యవసాయం దండుగ అనే పార్టీలకు మద్దతిస్తారా? మీకు అండగా నిలిచే మీ భూమిపుత్రుడికి అండగా నిలుస్తారా? మంచి చేసిన ప్రభుత్వానికి రాఖీ కట్టండి ♦ నా చేతికి మాత్రమే కాదు.. మంచి చేసిన మీ ప్రభుత్వానికి రాఖీ కట్టాలని కోరుతున్నా. 31 లక్షల ఇళ్లపట్టాలు ఇచ్చిన, 22 లక్షల ఇళ్లు నిర్మిస్తున్న ప్రభుత్వానికి రాఖీ కట్టాలి. దిశ యాప్ ద్వారా 35 వేల మంది అక్క చెల్లెమ్మలు ఆపదలో ఉంటే వారికి భద్రత కల్పించిన ప్రభుత్వానికి రక్షా బంధన్ కట్టాలి. మహిళా పోలీసును ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి రక్షాబంధన్ కట్టాలి. అవ్వా, తాతలకు.. అభాగ్యులైన అక్కచెల్లెమ్మలకు, దివ్యాంగులకు ఒకటో తేదీన, సెలవైనా సూర్యోదయానికి ముందే వారి చేతిలో పింఛన్ పెట్టేందుకు వలంటీర్ను ఇంటికే పంపిన ప్రభుత్వానికి రాఖీ కట్టాలి. ♦ పింఛన్ తీసుకునే 66 లక్షల మందిలో అవ్వలు, వితంతు అక్క చెల్లెమ్మలు 45 లక్షల మంది ఉన్నారు. వీరందరూ మీ ప్రభుత్వానికి రక్షాబంధన్ కట్టాలని కోరుతున్నా. ఈ 58 నెలల్లో లంచాలు, వివక్ష లేకుండా నేరుగా రూ.2.70 లక్షల కోట్లు ప్రజలకు ఇచ్చాం. అందులో రూ.1.90 లక్షల కోట్లు కేవలం నా అక్క చెల్లెమ్మలకు ఇచ్చి మహిళ సాధికారతను ఉద్యమంగా నడిపిన ప్రభుత్వం ఇది. వారి భవిష్యత్ కోసం రక్షాబంధన్ కట్టాలని కోరుతున్నా. బాబు తోక కత్తిరించండి ♦ ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం వద్దని అడ్డుకున్న వారికి బుద్ది చెప్పండి. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కులాల మధ్య సమతుల్యత దెబ్బతింటుందని కోర్టుల్లో కేసులు వేసిన వారు, బీసీల తోకలు కత్తిరిస్తాం.. ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా? అనే చంద్రబాబు తోకను మరోసారి కత్తిరించాలని కోరుతున్నా. నాన్న ఇచ్చిన 4 శాతం రిజర్వేషన్లను పణంగా పెట్టడమే కాకుండా, గత 30 ఏళ్లుగా చెలగాటం ఆడుతున్న బాబును ఏ ఒక్కరైనా సమర్థిస్తారా? ఈ వర్గాలన్నీ నేను అక్కున చేర్చుకున్న వర్గాలు. ♦ బాబుకు నా.. నా.. అని పిలచుకునే వర్గాలు హైదరాబాద్ మెట్రోలో హైటెక్సిటీలో ఉన్నాయి. ఇక్కడ లేవు. ఓ ఈనాడు, ఆంధ్ర‡జ్యోతి, టీవీ–5 వీరికి తోడు ఓ దత్తపుత్రుడు. వీరు మన రాష్ట్రంలో ఉండరు. చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చేది వెన్నుపోటు, మోసాలు మాత్రమే. ఐదేళ్ల కిందట ఓ దత్తపుత్రుడు, ఢిల్లీ నుంచి మోడీని తెచ్చుకుని ఇదే చంద్రబాబు 2014లో మేనిఫెస్టో అని చెప్పి రంగు రంగుల కాగితాలు తీసుకొచ్చారు. 650 హామీలు ఇచ్చారు. ఇవి ప్రజలు మర్చిపోతారు అని ముఖ్యమైన హామీలు అంటూ ఓ కరపత్రం (చేత్తో పట్టుకుని చూపిస్తూ) సంతకం చేసి ప్రతీ ఇంటికి పంపారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5లో ప్రకటనలు ఇచ్చారు. చంద్రబాబు మోసాలు ఇవిగో.. ♦ రైతులకు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నారు. రూ. 87,612 కోట్లు మాఫీ చేశాడా? ♦ డ్వాకా రుణాలు పూర్తిగా రద్దు చేస్తామన్నారు. రూ.4,205 కోట్లు. ఒక్క రూపాయి అయినా మాఫీ చేశారా? ♦ ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నారు. ఎవరికైనా రూపాయి డిపాజిట్ చేశారా? ♦ ఇంటింటికీ ఓ ఉద్యోగం.. లేదా నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఐదేళ్లలో రూ.1.20 లక్షలు ఇచ్చారా? ♦ అర్హులైన వారికి 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు సాయం ఇస్తామన్నారు. ఒక్కరికైనా సెంటు స్థలం ఇచ్చారా? ♦రూ.10వేల కోట్లతో బీసీ సబ్ప్లాన్, చేనేత, మహిళ రుణాలు మాఫీ, ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్, రాష్ట్రాన్ని సింగపూర్కు మించి అభివృద్ధి, ప్రతీ నగరాన్ని హైటెక్సిటీగా నిర్మించడం ఇలా ఎన్నో హామీలు ఇచ్చారు. మీ నగరంలో, జిల్లాలో హైటెక్సిటీ ఎక్కడైనా కన్పించిందా? ♦ ఇదే చంద్రబాబు, దత్తపుత్రుడు మోడీ ఫొటో పెట్టుకుని ఇంటింటికీ పంపిన ఈ కరపత్రంలో కనీసం ఒక్కటైనా చేశారా? పోనీ ప్రత్యేక హోదా అయినా తెచ్చారా? మన టార్గెట్ 175కు 175 ఒక్క హామీ నెరవేర్చకపోగా, ఇప్పుడు ఎన్నికలు వచ్చేసరికి, మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమయ్యారు. మళ్లీ దత్తపుత్రుడు, చంద్రబాబు, మోడీ ఇదే ముగ్గురూ కలిసి సూపర్సిక్స్, సూపర్సెవన్ అంటున్నారు. ప్రతి ఇంటికీ కిలో బంగారం, బెంజ్ కారు కొనిస్తారట. ఇలాంటి మోసాల నుంచి రాష్ట్రంలోని పేదల భవిష్యత్ను కాపాడుకోవాలా? వద్దా? ఈ యుద్ధానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమేనా? సిద్ధం అంటే జేబులో నుంచి సెల్ఫోన్లు బయటకు తీసి పేదవాడి భవిష్యత్ కోసం మేమంతా సిద్ధం అని లైట్ వేసి పిలుపునివ్వండి. (ప్రజలందరూ సెల్లో టార్చ్ ఆన్ చేసి మద్దతు పలికారు). మీకు మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు అండగా నిలిచేందుకు స్టార్ క్యాంపెయినర్లుగా రావాలి. ఈ ఎన్నికల్లో మన టార్గెట్ 175కు 175. 25కు 25 ఎంపీలు గెలవాలి. కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి బీవై రామయ్య, ఎమ్మిగనూరు, ఆదోని, ఆలూరు, కర్నూలు, కోడుమూరు, మంత్రాలయం, పత్తికొండ ఎమ్మెల్యేలుగా బుట్టారేణుక, సాయిప్రసాద్రెడ్డి, విరూపాక్షి, ఇంతియాజ్, డాక్టర్ సతీశ్, బాలనాగిరెడ్డి, శ్రీదేవిని నిండు మనస్సుతో ఆశీర్వదించి ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి, వేయించి గెలిపించాలి. సంక్షేమంతో ఎమ్మిగనూరుకు రూ.650 కోట్లు.. పేదలకు కార్పొరేట్ స్థాయి విద్య, వైద్యాన్ని అందించేందుకు ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న చర్యలు అమోఘం. ముఖ్యమంత్రి జగన్ చొరవతో ఒక ఎమ్మిగనూరు నియోజకవర్గంలోనే వివిధ సంక్షేమ పథకాల రూపంలో పేదలకు రూ.650 కోట్ల మేర లబ్ధి చేకూరింది. దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్న నాగలదిన్నె బ్రిడ్జిని పూర్తి చేసిన ఘనత సీఎం జగన్దే. గాజులదిన్నె ప్రాజెక్టును ఆధునీకరించడం, గాజులదిన్నెకు హంద్రీనీవా నుంచి 3 టీంఎంసీల నీటిని తరలించే అవకాశాన్ని కల్పించింది కూడా ముఖ్యమంత్రి జగనే. సామాజిక న్యాయం లక్ష్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుంది. ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేశాక ఎమ్మిగనూరు నియోజకవర్గంలో చేనేతల సంక్షేమానికి టైక్స్టైల్ హబ్ను విస్తరించడంతోపాటు సాగు, తాగునీటి అవసరాలు తీర్చేందుకు మరిన్ని ఎత్తిపోతల పథకాలను చేపట్టాలని కోరుతున్నా. పేద వర్గాలకు అందుతున్న పథకాలు కొనసాగాలన్నా, మరింత మెరుగుపర్చాలన్నా వైఎస్ జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ప్రతి పేదవాడి గుండెల్లో ఆనందం నింపాలనే లక్ష్యంతో ఐదేళ్ల పాటు సుపరిపాలన అందించిన ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వానికి మరోసారి పట్టం కట్టాలి. బీసీ మహిళనైన నాకు ఎమ్మిగనూరు అభ్యర్థిగా అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నా.– బుట్టా రేణుక, ఎమ్మిగనూరు వైఎస్సార్సీపీ అసెంబ్లీ అభ్యర్థి చిన్నా.. నేనున్నా! ♦ చూపులేని చిన్నారికి సీఎం భరోసా ♦ తక్షణమే స్పందించిన సీఎంవో కర్నూలు జిల్లా పెంచికలపాడులో సీఎం వైఎస్ జగన్ రాత్రి బస చేసిన శిబిరం నుంచి శుక్రవారం ఉదయం బస్సు యాత్ర ప్రారంభమైన సమయంలో గ్రామానికి చెందిన రేష్మ అనే మహిళ తన నాలుగేళ్ల కుమార్తె పింజరి జుహతో కలసి ఆయన వద్దకు వచ్చింది. పుట్టుకతోనే తన కుమార్తెకు రెండు కళ్లు కనిపించవని సీఎం జగన్ వద్ద ఆవేదన వ్యక్తం చేసింది. మూడు ఆసుపత్రుల చుట్టూ తిరిగినా పాపకు కంటి చూపు రాదని డాక్టర్లు చెప్పారని విలపించింది. కనీసం పెన్షనైనా మంజూరు చేస్తే పాపకు అవసరమైన మందులకు ఉపయోగపడుతుందని అభ్యర్థించారు. దీనిపై తక్షణమే స్పందించిన ముఖ్యమంత్రి జగన్ తన పీఏ ద్వారా సమాచారాన్ని సీఎంవోకు చేరవేశారు. సీఎంవో కార్యాలయం అధికారులు పాపకు సంబంధించి వివరాలను సేకరించారు. -
అవ్వాతాతల అప్యాయతపై సీఎం జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: అవ్వాతాతల అప్యాయతపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. ‘‘అవ్వాతాతలకి భరోసా కల్పిస్తూ వారికి అండగా నిలిచిన ప్రభుత్వం మనది. అవ్వాతాతల సంక్షేమం కోసం వారికి ఇచ్చే పెన్షన్ను రూ.3000కు పెంచి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. మనం చేసిన మంచి దారి పొడువునా వారు చూపిస్తున్న అభిమానంలో కనిపిస్తుంది’’ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. కర్నూలు జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్ర కొనసాగుతోంది. జననేత సీఎం జగన్పై ప్రజలు హద్దులు లేని అభిమానం చూపుతున్నారు. వివిధ వర్గాల తరఫున సీఎం జగన్కు కానుకలు అందిస్తున్నారు. చిరునవ్వులతో స్వీకరించి వారితో సీఎం ఫొటోలు దిగారు. అవ్వాతాతలకి భరోసా కల్పిస్తూ వారికి అండగా నిలిచిన ప్రభుత్వం మనది. అవ్వాతాతల సంక్షేమం కోసం వారికి ఇచ్చే పెన్షన్ను రూ.3000కు పెంచి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. మనం చేసిన మంచి దారిపొడువునా వారు చూపిస్తున్న అభిమానంలో కనిపిస్తుంది.#MemanthaSiddham#VoteForFan pic.twitter.com/C0VOCM7NvQ — YS Jagan Mohan Reddy (@ysjagan) March 29, 2024 -
చంద్రబాబు ఓ మోసగాడు..
-
నమ్మకం గెలిచింది...నేతన్ననేస్తంతో చేనేతకు మంచిరోజులు వచ్చాయన్న నేతకార్మికులు
-
సీఎం జగన్ పాలనలో సంక్షేమం, అభివృద్ధి పరుగులు..
-
విషపు రాతలు.. నీచపు కూతలు..
-
జగన్ సంక్షేమమే మేము చేస్తాం అంటున్న ప్రతిపక్షాల పై పబ్లిక్ రియాక్షన్
-
వలంటీర్ల వల్ల మంచే జరుగుతోందిగా
సాక్షి, అమరావతి: వలంటీర్ల వల్ల మంచే జరుగుతోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. వారి వల్ల ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరువవుతున్నాయని తెలిపింది. వారి విషయంలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయబోమని స్పష్టం చేసింది. వారి విషయంలో స్పందించాల్సింది ఎన్నికల సంఘమేనని తేల్చి చెప్పింది. వలంటీర్లు ఎన్నికల్లో విధుల్లో పాల్గొనకుండా ఎన్నికల సంఘం (ఈసీ) ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తు చేసింది. వలంటీర్ల నియామకం, తదితరాల వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను మూడు నెలలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్రావు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 2.57 లక్షల మంది కార్యకర్తలను గ్రామ, వార్డు వలంటీర్లుగా నియమించారని, దీనిని చట్ట, రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ వైఎస్సార్ కడప జిల్లా రాజంపేటకు చెందిన షేక్ అబూబాకర్ సిద్దిఖీ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై సీజే ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు వాదనలు వినిపిస్తూ, అధికార పార్టీకి చెందిన కార్యకర్తలనే వలంటీర్లుగా నియమించారని, వారి ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలని అధికార పార్టీ చూస్తోందని అన్నారు. రాష్ట్ర ఖజానా నుంచే వీరికి గౌరవ వేతనం చెల్లిస్తోందని తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, వలంటీర్ల వల్ల మంచే జరుగుతోంది కదా, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేస్తున్నారు కదా అని వ్యాఖ్యానించింది. వలంటీర్లు పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనకుండా ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని ఉన్నం మురళీధరరావు కోరారు. ఇందుకు ధర్మాసనం నిరాకరించింది. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. -
పేదలకు ఆర్థిక శక్తిగా మారిన సీఎం జగన్ సంక్షేమ పథకాలు
-
జనం కొరకు – జనం కన్న – జననేత జగన్!
లాభాలే లక్ష్యంగా గల వ్యాపారుల్లో టాటాల వంటి సామాజిక శ్రేయోభిలాషులు కొందరున్నట్లే; అధికారమే పరమావధిగా గల పాలక వర్గాల్లోనూ సేవా దృక్పథం గల మానవీయ నేతలు కొందరున్నారు. చనిపోయి గూడ బతికున్న ‘రామన్న’ – ‘రాజన్న’ల వంటి నేతలే అందుకు నిదర్శనం! ‘ఉన్నది అమ్ముకో! లేనిది కొనుక్కో’ మంటున్న గ్లోబల్ వ్యాపార వ్యవస్థలో, అట్టి మానవీయ నేతల్ని పది కాలాలపాటు కాపాడుకోవాలి. ముఖ్యంగా రెక్కల కష్టం తప్ప, అమ్ముకోవటానికి ఏమీ లేని పేద, బడుగు, బలహీన, మైనారిటీ వర్గాల వారికిది అవశ్య కర్తవ్యం. అడ్డగోలుగా పెరిగిపోతున్న ఈ ఆర్థిక అసమానతల సమాజంలో మానవీయ నేతను ఎన్నుకోవటమే, కులమతాతీతంగా పేదలందరికీ శ్రీరామరక్ష! ‘డబ్బుతో అధికారం – అధికారంతో డబ్బు’గ మారిన నేటి రాజకీయ వ్యవస్థలో మానవీయ నేతల ప్రకాశాన్ని, కార్పొరేట్ల మీడియా, సోషల్ మీడియాలు అభాండాలు, ఆరోపణల కారుమబ్బులతో కప్పేస్తున్నాయి. అవెంతటి బలీయమైనవంటే... కేవలం నిరక్షరాస్యులనే కాదు, సగటు విద్యావంతుల్ని సైతం అపమార్గం పట్టిస్తున్నాయి. ఏపీలోని ప్రస్తుత రాజకీయ పార్టీల నేతలందరిలోనూ మానవతా దృక్పథం కలిగిన ఏకైక నేత జగన్ మోహన్ రెడ్డే. ఆయన హృదయం నుండి పొంగి పొరలిన ‘అమ్మ ఒడి – గోరుముద్ద – ఫీజు రీయింబర్స్మెంట్ – పేద లందరికీ ఆంగ్ల మాధ్యమంలో విద్య – ఆరోగ్యశ్రీ – జల యజ్ఞం – రైతు భరోసా – పింఛన్ల పెంపు – పేదలకు ఇళ్ళు – వైఎస్సార్ ఆసరా – వైఎస్సార్ చేయూత వంటి సంక్షేమ పథకాలే అందుకు నిలువెత్తు నిదర్శనాలు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయాన అన్ని మతాల పెద్దల చేత ప్రార్థనలు చేయించి తనలోని ‘సర్వమత సామ రస్యత’ను చాటుకున్నారు జగన్. నాడు మత పెద్దలందరికీ వినమ్రంగా నమస్కరించి, అందరితో చేయి కలపటం ద్వారా ‘హిందూ–ముస్లిం– క్రిస్టియన్ భాయీ భాయీ – మన రాష్ట్ర ప్రగతికై కలిపి నడుద్దాం చేయీ – చేయీ’ అన్న ప్రబోధా న్నందించారు. భారతీయులకు, జాతీయ సమైక్యతా మార్గాన్ని చూపా రాయన. ప్రమాణ స్వీకారానంతరం ‘ఇది మా మేనిఫెస్టోకు లభించిన విజయం. అందుకే నాకూ, మా పార్టీ నేత లందరికీ పవిత్ర గ్రంథం’ అని ప్రకటించ టమే గాదు, దాన్ని ఆచరించే పరీక్షలో 99 శాతం మార్కులు సాధించి, దేశంలోనే అగ్రనేతగా నిలిచారు. సామాజిక సమతుల్యత కోసం మంత్రి పద వుల్లో సగానికి పైగా ఎస్సీ–ఎస్టీ–బీసీ–మైనారిటీ లకు కేటాయించారు. నామినేటెడ్ పదవుల్లోనే కాక పనుల్లోకూడా 50 శాతం వారికి కేటాయించారు. మహిళలకు కూడా ఇదే విధమైన కేటాయింపులు చేశారు. ఆలయాల ట్రస్టుల్లో బీసీ–ఎస్సీ–ఎస్టీ మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించారు. ఇవన్నీ జగన్ మానవీయతకు దర్పణాలు. పేదలకు అందని చందమామగా ఉన్న ఇంగ్లీష్ మీడియం విద్యను అందించి పేద పిల్లలకు ఆత్మబంధువ య్యారు. అందుకే పేద విద్యార్థులు ‘మా జగన్ మామ’ అంటూ సగర్వంగా చెప్పుకుంటున్నారు. గ్రామ సచివాలయాలు, వాలంటరీ వ్యవస్థల ద్వారా ఇంటింటికీ పాలనను తెచ్చి; వృద్ధులు, పేదలందరి చేత ‘మా పెద్ద బిడ్డ జగన్ బాబు’ అంటూ ఆత్మీయునిగా చెప్పుకోబ డుతున్న ఏకైక నేత జగన్! ‘సత్య నిష్ఠ’ మినహా పాలకులకు ప్రజా విశ్వాసాన్ని – మరేదీ సంపాదించలేద’న్నాడు మహాభారతంలో భీష్ముడు. మరి సత్యనిష్ఠ కలిగి ఉన్నందునే జగనన్నకంతటి జన బలం! ‘సత్య నిష్ఠ’ను పాటించక పోవటమే ‘బాబు టీడీపీ’, ‘పవన్ జనసేన’ల బలహీనత! ‘పేదల, అన్నదాతల జీవితాలను ఇప్పుడున్న దానికన్నా ఇంకా మెరుగు పరచటమే నా లక్ష్యం!... మీ ఈ బిడ్డ వల్ల మీ కుటుంబాలకు మేలు జరిగితేనే తిరిగి నన్ను ఆశీర్వదించ’ మంటున్నారు జగన్. అందుకే ‘రానున్న ఎన్నికల కురుక్షేత్రంలో జగన్ను గెలిపిస్తే అది జన విజయం. మీరు గెలిచేందుకు సిద్ధమా?’ అంటూ జనాన్నే ప్రశ్నిస్తున్నారు జగన్. మేం సిద్ధమే అంటున్నారు జనం. – ఆదివిష్ణు రాజకీయ విశ్లేషకులు ‘ 96662 65693 -
కుట్రతోనే వేధింపులు
తెనాలి: ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల గురించి సంతోషంగా తన అభిప్రాయాన్ని తెలియజేసిన గొల్తి గీతాంజలిపై సోషల్ మీడియాలో వికృతంగా ట్రోల్ చేసి ఆమె బలవన్మరణానికి కారకులైన ఐటీడీపీ, జనసేన సోషల్ మీడియా మృగాలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని హెచ్చరించారు. గీతాంజలి వ్యక్తిత్వ హననానికి పాల్పడటం వెనుక ప్రభుత్వం చేసిన మంచిని మరెవరూ చెప్పకుండా అణచివేయాలనే పెద్ద కుట్ర ఉందని ఆమె మండిపడ్డారు. ఈ ఘటనల వెనక నారా లోకేశ్ హస్తం ఉందని ఆమె ఆరోపించారు. గీతాంజలి మరణించిన తర్వాత కూడా అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని, వీరికసలు మనసనేది ఉందా అని ఆమె ప్రశ్నించారు. మహిళలంతా వీరి దుశ్చర్యలను గమనించాలని రానున్న ఎన్నికల్లో బుద్ధిచెప్పాలని ఆమె సూచించారు. గుంటూరు జిల్లా తెనాలి ఇస్లాంపేటలోని గొల్తి గీతాంజలి నివాసానికి మంగళవారం సాయంత్రం రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, ప్రభుత్వ విప్ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, పోతుల సునీత, ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కన్వినర్ సజ్జల భార్గవరెడ్డి, విశ్వబ్రాహ్మణ సంఘ కార్పొరేషన్ చైర్పర్సన్ పవిత్ర పరామర్శించారు. గీతాంజలి భర్త బాలచంద్రను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కుమార్తెలు రిషిత, రిషికలను పరామర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనతో తామంతా వచ్చామని, ధైర్యంగా ఉండాలని చెప్పారు. సీఎం జగన్ రూ.20 లక్షలు ఎక్స్గ్రేషియో ప్రకటించినట్లు పేర్కొన్నారు. వీరితోపాటు గుంటూరు తూర్పు అసెంబ్లీ ఇన్చార్జి నూరి ఫాతిమా, మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జి మురుగుడు లావణ్య, ఎన్నారై అధికార ప్రతినిధి కడప రత్నాకర్, గాలి అరవింద, పలువురు ప్రజాప్రతినిధులు, మహిళా నాయకులు పాల్గొన్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. చితిమంటల్లోనూ చలికాచుకుంటున్నారు... ప్రభుత్వం చేసిన మంచిని చెప్పే ఉత్సాహంలో ఒక అంకె తప్పు చెప్పడం బూతులాగా అనిపించిందా? గీతాంజలి చనిపోయి రెండురోజులైనా ఇంకా పోస్టులు పెడుతూ, ఇంకా రాబందుల్లా పీక్కుతింటున్నారు. తాగుబోతులు, సైకోలు వీరంగం వేసినట్టుంది. గీతాంజలి చితిమంటల్లోనూ చలికాచుకుంటున్న మీకు సిగ్గుండాలి.లోకేశ్ భార్య, చంద్రబాబు భార్యపై పోస్టులు పెడితే పరిస్థితి ఏమిటి? చంద్రబాబు భార్యను ఏమీ అనకుండానే అసెంబ్లీ నుంచి బయటకొచ్చి గొడవ చేశారు. రాజీపడేదే లేదు. అందరికీ శిక్షలు పడతాయి. ఎవరినీ వదిలిపెట్టేది లేదు. – నందిగం సురేష్, ఎంపీ సోషల్ మీడియా టెర్రరిజం గీతాంజలిపై ఐటీడీపీ, జనసేన సోషల్ మీడియా చేసింది ట్రోలింగ్ కాదు...టెర్రరిజం అంటాను. మా పార్టీలోని మహిళా ప్రజాప్రతినిధులు, మంత్రులు, సీనియర్ లీడర్లు, జర్నలిస్టులు అందరూ ఈ టెర్రరిజం బాధితులే. గీతాంజలి చనిపోయాక కూడా వదలడం లేదు. బాధపడుతున్నట్టు ఒక్కరు కూడా చెప్పటం లేదు. ఒక కుటుంబంలో భార్య, తల్లి, కోడలు, కుమార్తెగా ఉంటున్న మహిళ మరణానికి కారకులయ్యారు. న్యాయం ఏమిటి? నారా లోకేశ్, చంద్రబాబు, పవన్కళ్యాణ్ చెప్పాలి. ప్రజాస్వామ్యానికి ఇది నిజంగా బ్లాక్ డే. వైఎస్సార్సీపీ సోషల్ మీడియాలో ఎక్కడా అసభ్యత ఉండదు. – సజ్జల భార్గవ, కన్వినర్, వైఎస్సార్సీపీ సోషల్ మీడియా టీడీపీ, జనసేన సోషల్మీడియా చేసిన హత్య గీతాంజలిది ఆత్మహత్య కాదు...టీడీపీ, జనసేన సోషల్మీడియా చేసిన హత్య. ప్రభుత్వం చేసిన మంచిని ప్రతి కుటుంబంలోని లబ్దిదారులే స్టార్ క్యాంపెనర్లు అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చెబుతుంటారు. ప్రభుత్వం నుంచి పొందిన లబ్ధిని చెప్పిన గీతాంజలి నోరు నొక్కితే ఇంకెవరూ నోరు విప్పరు అనే కుట్రతో ఆమెను ట్రోల్ చేశారు. సీఎం జగన్ చేసిన మంచిని ఎవరూ చెప్పకూడదనే ఆమె జీవితాన్ని అంతం చేశారు. సోషల్ మీడియాలో మహిళలు ఎవరూ మాట్లాడకూడదనే వారి కుట్ర. – వాసిరెడ్డి పద్మ, ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ పట్టా ఇచ్చిన చేత్తోనే నివాళి అర్పించడం దురదృష్టం... గీతాంజలికి ఈ నెల 4వ తేదీన రిజిస్ట్రేషన్ పట్టాను ఇచ్చిన చేతులతోనే ఆమె భౌతికకాయంపై పూలమాల వేసి నివాళి అర్పించాల్సి రావడం దురదృష్టం. ఆమె మరణానికి కారకులను ప్రభుత్వం శిక్షిస్తుంది. మానవతా దృక్పథంతో సీఎం జగన్మోహన్రెడ్డి రూ.20 లక్షల ఎక్స్గ్రేషియాను ప్రకటించారు. ఆ మొత్తాన్ని ఆమె ఇద్దరు ఆడపిల్లల పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం. ఆ కుటుంబానికి అండగా ఉంటాం. – అన్నాబత్తుని శివకుమార్, తెనాలి ఎమ్మెల్యే గీతాంజలిని దారుణంగా వేధించారు.. ఐటీడీపీ, జనసేన సోషల్ మీడియావాళ్లు గీతాంజలిని దారుణంగా వేధించారు. ఆమె బలవన్మరణానికి కారకులయ్యారు. ప్రభుత్వం వీరిని కఠినంగా శిక్షిస్తుంది. మళ్లీ మరో మహిళకు ఇలా జరగకుండా చూడటమే ప్రభుత్వ ధ్యేయం. – ఎస్ఎం పవిత్ర, చైర్పర్సన్, ఏపీ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ -
సామాజిక రంగ వ్యయంలో దక్షణాదిలో ఏపీనే టాప్
సాక్షి, అమరావతి: పేదలను విద్యావంతులు, ఆరోగ్యవంతులుగా చేస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు నవరత్నాలు, ఇతర సంక్షేమ పథకాలపై అత్యధిక వ్యయం చేస్తున్నారు. పేదల అభ్యన్నతి కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. ప్రభుత్వ రంగ విద్య అభివృద్ధికి పలు కార్యక్రమాలు చేపట్టారు. ప్రతి పేదింటి పిల్లవాడూ లేదా అమ్మాయి చదువు మధ్యలో ఆపేయకుండా అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన వంటి అనేక ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలనూ అత్యాధునికంగా తీర్చిదిద్దుతున్నారు. అంతర్జాతీయ స్థాయి సిలబస్ను పిల్లలకు అందిస్తున్నారు. అదే విధంగా ఆరోగ్య శ్రీ పథకం ద్వారా పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరించి, అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తున్నారు. పేదల ఇంటి వద్దకే వైద్యాన్ని చేరుస్తున్నారు. గ్రామీణ, పట్టణాభివృద్ధిపైనా దృష్టి కేంద్రీకరించారు. బడి పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. గ్రామాలు, నగరాల్లో పారిశుద్ధ్యాన్ని పెంపొందిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రక్షిత మంచి నీరు అందిస్తున్నారు. ఇలా సామాజిక రంగానికి సీఎం వైఎస్ జగన్ పెద్ద పీట వేస్తున్నారు. తద్వారా గత ఐదేళ్లుగా సామాజిక రంగ కేటాయింపులు, వ్యయంలో మన రాష్ట్రం ముందుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) తొలి పది నెలల్లోనూ (ఏప్రిల్ నుంచి జనవరి వరకు) సామాజిక రంగ కేటాయింపులతో పాటు వ్యయంలోనూ దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. ఈ విషయాన్ని కాగ్ గణాంకాలు వెల్లడించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాల బడ్జెట్ కేటాయింపులు, నెలవారీ వివిధ రంగాలకు చేసిన వ్యయాలపై కాగ్ గణాంకాలను వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రాష్ట్ర బడ్జెట్లో వైఎస్ జగన్ ప్రభుత్వం సామాజిక రంగానికి రూ.1,30,366 కోట్లు కేటాయించింది. ఇందులో పది నెలల్లోనే రూ.1,07,610 కోట్లు ఖర్చు చేసినట్లు కాగ్ తెలిపింది. ఇది ఏకంగా 82.54 శాతం. సామాజిక రంగానికి ఇంత పెద్ద ఎత్తున కేటాయింపులు, ఆ నిధులను సమర్ధంగా వినియోగించడంలో దక్షిణాదిలో మిగతా రాష్ట్రాలు వెనకబడ్డాయని కాగ్ గణాంకాలు వెల్లడించాయి. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ తరువాత స్థానంలో తమిళనాడు రాష్ట్రం ఉంది. మూడో స్థానంలో కర్నాటక,, నాలుగో స్థానంలో తెలంగాణ,, ఐదో స్థానంలో కేరళ రాష్ట్రాలు ఉన్నట్లు కాగ్ గణాంకాలు స్పష్టం చేశాయి. సామాజిక రంగ వ్యయం అంటే.. సామాజిక రంగ వ్యయం అంటే విద్య, వైద్య, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, పౌష్టికాహారం, సంక్షేమం, పారిశుద్ధ్యం, మంచి నీటి సరఫరాపై చేసిన వ్యయంగా పరిగణిస్తారు. సామాజిక రంగ వ్యయాన్ని మానవ వనరుల అభివృద్ధితో పాటు ప్రజలకు అవసరమైన కనీస మౌలిక సదుపాయాల కల్పనకు కొలబద్దగా కాగ్, ఆర్బీఐ పరిగణిస్తాయి. -
దేశం చూపు రాష్ట్రం వైపు
సాక్షి, అమరావతి : ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం ద్వారా పేదరికం నిర్మూలనే ధ్యేయంగా.. అర్హతే ప్రమాణికంగా.. వివక్ష చూపకుండా.. లంచాలకు తావు లేకుండా సంక్షేమ పథకాలను 87 శాతం కుటుంబాలకు సీఎం జగన్ అందిస్తున్నారు. సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) రూపంలో రూ. 2,58,855.97 కోట్లను పేదల ఖాతాల్లో జమ చేశారు. దేశ చరిత్రలో డీబీటీ రూపంలో ఇంత భారీ ఎత్తున పేదల ఖాతాల్లో జమ చేయడం ఇదే తొలిసారి. ఇది దేశంలో అన్ని వర్గాల ప్రజల చూపు రాష్ట్రం వైపు చూసేలా చేసింది. నాన్ డీబీటీ రూపంలో మరో రూ.1,79,246.94 కోట్ల ప్రయోజనం చేకూర్చారు. డీబీటీ, నాన్ డీబీటీ కలిపి రూ.4,38,102.91 కోట్ల లబ్ధి చేకూర్చారు. సంక్షేమాభివృద్ధి పథకాలను సద్వినియో గం చేసుకున్న ప్రజలు వాటి ద్వారా జీవనోపాధులను మెరుగు పరుచుకున్నారు. రాష్ట్రంలో టీడీపీ సర్కార్ హయాంలో పేదరికం 11.77 శాతం ఉంటే.. అది 2022–23 నాటికి 4.19 శాతానికి తగ్గడమే అందుకు నిదర్శనం. అభివృద్ధికి ఊతం ♦ అంతర్జాతీయ స్థాయి విద్యార్థులతో మన పిల్లలు పోటీ పడేలా రాష్ట్రంలో విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి అభివృద్ధి చేయడంతోపాటు ఇంగ్లిష్ మీడియంలో బోధనను ప్రవేశపెట్టారు. సీబీఎస్ఈ సిలబస్ను బోధిస్తూనే.. రానున్న రోజుల్లో ఐబీ సిలబస్ను అమల్లోకి తెచ్చేందుకు నడుం బిగించారు. అమ్మ ఒడి పథకం ద్వారా ఏటా తల్లుల ఖాతాల్లో రూ.15 వేలు జమ చేస్తుండటతో ప్ర భుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నికర నమోదు నిష్ఫత్తి రేటు 98.73 శాతానికి పెరిగింది. ♦ జగనన్న విద్యా దీవెన ద్వారా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెనతో నాణ్యమైన ఉన్నత విద్యను అందిస్తూ.. ఉద్యోగ నైపుణ్యాలను అభివృద్ధి చేసే శిక్షణ ఇస్తున్నారు. దాంతో 2022–23లో 1.80 లక్షల మంది క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగాలను పొందారు. నైపుణ్యాలను మరింతగా పెంచేందుకు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధి చెందిన ఎడెక్స్ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. విద్యా రంగంపై ఉద్యోగుల జీతభత్యాలు కాకుండా రూ.74 వేల కోట్లు ఖర్చు చేశారు. ♦ నాణ్యమైన వైద్యం అందించడానికి నాడు–నేడు ద్వారా ప్రభుత్వ ఆస్పత్రులను కార్పొరేట్ స్థాయికి అభివృద్ధి చేశారు. ఆస్పత్రుల్లో ఖాళీలు లేకుండా 53,466 ఉద్యోగాలను భర్తీ చేశారు. ఆరోగ్య శ్రీ వైద్య సేవల పరి మితిని రూ.25 లక్షలకు పెంచడంతోపాటు.. చికిత్స విధానాలను 1059 నుంచి 3,257కు పెంచారు. ఇప్పటిదాకా 44.78 లక్షల మందికి రూ.13 వేల కోట్ల వ్యయం చేసి.. ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స చేయించారు. ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో 17 కొత్త కాలేజీలకు శ్రీకారం చుట్టారు. ఈ విద్యా సంవత్సరంలో 5 కాలేజీలు ప్రారంభమవగా.. వచ్చేవి ద్యా సంవత్సరంలో మరో 5 మెడికల్ కాలేజీ లు ప్రారంభం కానున్నాయి. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్్ట, విలేజ్ క్లినిక్ల ద్వారా ప్రజలకు నాణ్యమై న వైద్య సేవలు అందిస్తున్నారు. ♦ పారిశ్రామికాభివృద్ధికి ఊతమిచ్చేలా పారదర్శక విధానాన్ని సీఎం వైఎస్ జగన్ అమల్లోకి తెచ్చారు. సులభతర వాణిజ్యంలో వరుసగా మూడేళ్లు రాష్ట్రం అగ్రగామిగా నిలవడమే అందుకు తార్కాణం. కొత్తగా నాలుగు పోర్టులతోపాటు పది ఫిషింగ్ హార్బర్లను అభివృద్ధి చేస్తున్నారు. దాంతో రాష్ట్రంలో భారీ ఎత్తున పెట్టుబడి పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఉత్సాహం చూపుతున్నారు. టీడీపీ సర్కార్ హయాంలో రూ.32,803 కోట్లు పెట్టుబడులు వస్తే.. గత 58 నెలల్లోనే రూ.1.03 లక్షల కోట్లు పెట్టుబడులు రావడమే అందుకు తార్కాణం. పారిశ్రామికాభివృద్ధితో ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా పెరిగాయి. ♦ ఆర్బీకే (రైతు భరోసా కేంద్రాలు)ల ద్వారా వ్యవసాయ రంగం అభివృద్ధిలో దూసుకెళ్తోంది. దేశంలో స్థూల దేశీయోత్పత్తి(జీఎస్డీపీ)లో వ్యవసాయ రంగం వాటా 17–18 శాతం ఉంటే.. మన రాష్ట్రంలో 35 శాతం ఉండటమే అందుకు తార్కాణం. ♦ విప్లవాత్మక సంస్కరణతో అన్ని రంగాల్లో రాష్ట్రం దూసుకెళ్తోంది. 2021–22లో 11.23 శాతం వృద్ధి రేటుతో దేశంలో రాష్ట్రం అగ్రగామిగా నిలవడమే అందుకు నిదర్శనం. ♦ సీఎం జగన్ సుపరిపాలన వల్ల ప్రతి ఇంట్లో.. విప్లవాత్మక మార్పులు కళ్లకు కట్టినట్లు కన్పిస్తున్నాయి. ప్రజల జీవన ప్రమాణాలు మరింతగా పెరగాలంటే.. రాష్ట్రం ప్రగతిపథంలో మరింతగా దూసుకెళ్లాలంటే విప్లవాత్మక పరిపాలన కొనసాగాల్సిందేననే చైతన్యం విద్యావంతులు, మేధావులతోపాటు అన్ని వర్గాల ప్రజల్లో రగులుతోంది. -
మసి‘బీసీ’ నవ్వులపాలు దిక్కుమాలినబీసీ డిక్లరేషన్
బీసీ డిక్లరేషన్ సభలో తాను అధికారంలోకి వస్తే.. వచ్చే ఐదేళ్లలో చంద్రబాబు చేస్తానన్న ఖర్చు రూ. 1.50 లక్షల కోట్లు.. గత ఐదేళ్లలో బీసీల కోసం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ఖర్చు రూ. 1.76 లక్షల కోట్లు బీసీలను కేవలం ఓటు బ్యాంకు రాజకీయంగా చూసిన చంద్రబాబు ‘బ్యాక్ బోన్’ అంటూ జగన్ ప్రభుత్వ స్లోగన్ను కాపీ కొట్టారు. బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు.. ‘బ్యాక్ బోన్’ అంటూ గత ఐదేళ్లలో వారికి అన్ని రంగాల్లో జగన్ అగ్రప్రాధాన్యం ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో ఏ పార్టీ అయినా.. గత ప్రభుత్వం కంటే ఎక్కువ మేలు చేస్తామని హామీలిస్తుంది. కానీ నమ్మిన వాళ్లను వెన్నుపోటు పొడవడంలోసిద్ధహస్తుడైన చంద్రబాబు మాత్రం బీసీలకు అంతకంటే తక్కువ ఖర్చు చేస్తానని చెప్పి నవ్వుల పాలయ్యారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ కాపీ కొట్టి డిక్లరేషన్ అంటూ విడుదల చేయడం ఆ పార్టీ శ్రేణుల్ని ఆశ్చర్యపరిచింది. చంద్రబాబు కాపీల్లో మచ్చుకు కొన్ని బీసీ కార్పొరేషన్లు.. కుల ధ్రువీకరణ పత్రాలు.. కుల గణన.. పెన్షన్లు –సాక్షి, అమరావతి మళ్లీ మోసం చేసేందుకు బాబు రెడీ వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక 2019 నుంచి ఇంతవరకు 1.78 లక్షల కోట్లను బీసీలకు ఇచ్చారు. అందులో డీబీటీ(డైరక్ట్ టు బెనిఫి షియర్) ద్వారా నేరుగా బీసీల బ్యాంక్ అకౌంట్లలోకి 1,27,730 కోట్లను వివిధ పథకాల ద్వారా జమ చేశారు. మరో రూ.50,657 కోట్లు నాన్–డీబీటీ కింద ఆ వర్గాలకు అందించారు. మొత్తం కలిపి రూ.1,78,387 కోట్లను బీసీలకు ఇచ్చారు. అయితే బీసీ సబ్ ప్లాన్ ద్వారా ఏడాదికి రూ.30 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తామని చంద్రబాబు మంగళవారం జరిగిన సభలో గొప్పగా చెప్పారు. అంటే వైఎస్ జగన్ ఇచ్చిన దాని కంటే తగ్గించి చేస్తామని బీసీ డిక్లరేషన్ ద్వారా చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో కలిసి హామీ ఇవ్వడం విశేషం. బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన హామీలన్నీ వైఎస్ జగన్ ఇప్పటికే అమలు చేస్తున్నారు. నిజానికి ఇదే డిక్లరేషన్ను గతంలోనూ ప్రకటించిన చంద్రబాబు అమలు చేయకుండా బీసీలను మోసం చేశారు. మళ్లీ వారిని మోసం చేసేందుకు కొత్త బీసీ డిక్లరేషన్ను ప్రకటించి తమ డొల్లతనాన్ని బయటపెట్టుకున్నారు. ఇంటికే కుల ధ్రువీకరణ పత్రాలు కనిపించలేదా? శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు ఇస్తామని గొప్పగా చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఇస్తున్న కుల ధ్రువీకరణ పత్రాలు శాశ్వతమైనవే. వైఎస్ జగన్ దానిపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వడంతో రెవెన్యూ శాఖ గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తోంది. అది తెలిసి కూడా బీసీలకు చేయడానికి ఏం హామీలు లేవన్నట్లు కాపీ కొట్టారు. బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తెస్తామని ప్రతి ఎన్నికల్లోనూ చంద్రబాబు హామీ ఇస్తూనూ ఉన్నారు. ఇప్పుడు మళ్లీ ఆ హామీలో బీసీలను మభ్యపెట్టాలని చూస్తున్నారు. గత ఐదేళ్లుగా వలంటీర్లతో ఇంటికే పెన్షన్ అందిస్తుండగా.. చంద్రబాబు మాత్రం ఇప్పుడు కొత్త బిచ్చగాడిలా వలంటీర్లతో ఇంటికే పెన్షన్ అందిస్తామని చెప్పడం కొసమెరుపు. 2012 బీసీ డిక్లరేషన్ ఏమైంది బాబూ! ♦ బీసీ డిక్లరేషన్ పేరుతో గతంలో వందకు పైగా ఇచ్చిన హామీల్లో చంద్రబాబు ఒక్కటీ పూర్తిగా అమలు చేయలేదు. ♦ 2012లో 19 ప్రధాన హామీలతోపాటు చేతి వృత్తులు, కులాల వారీగా మొత్తం 119 హామీలిస్తూ బీసీ డిక్లరేషన్ ప్రకటించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక దాన్ని అమలు చేయలేదు. డిక్లరేషన్ అమలు పేరుతో ఏకంగా 56 కమిటీలు వేసి కాలయాపన చేశారు. కత్తెరలు, ఇస్త్రీ పెట్లెలు ఇచ్చి అదే ఆదరణ అంటూ డబ్బాలు కొట్టుకున్నారు. చివరికి దాన్ని ఒక కుంభకోణంగా మార్చారు. ఇప్పుడు ఆ కుంభకోణాన్ని మళ్లీ తీసుకువస్తానని ప్రకటించడం విశేషం. ♦ బీసీలకు వంద అసెంబ్లీ సీట్లు ఇస్తానని డిక్లరేషన్లో ప్రకటించిన చంద్రబాబు 2014లో సగం సీట్లు కూడా ఇవ్వలేదు. 2019 ఎన్నికల్లో కేవలం 43 సీట్లతో సరిపెట్టాడు. తాజాగా ప్రకటించిన తొలి జాబితాలో కేవలం 18 సీట్లు బీసీలకు కేటాయించి వంచన చేశాడు. ♦ రూ.10 వేల కోట్లతో ప్రత్యేక బడ్జెట్ కేటాయించి బీసీ సబ్ప్లాన్ అమలు చేస్తానన్న చంద్రబాబు ఆ హామీ గాలికి వదిలేశారు. ఐదేళ్లలో రూ.50 కోట్లు సబ్ప్లాన్కు కేటాయించాల్సి ఉండగా అందులో సగం నిధులు కూడా కేటాయించలేదు. చివరికీ స్లోగన్ కూడా కాపీనే.. టీడీపీ బీసీ డిక్లరేషన్ రూపకల్పన మొక్కుబడి తంతు అని చంద్రబాబు నిరూపించుకున్నారు. ఈ డిక్లరేషన్ కోసం కనీసం ఒక స్లోగన్ను కూడా చంద్రబాబు, టీడీపీ ఇవ్వలేకపోయింది. వైఎస్సార్సీపీ ఐదేళ్ల క్రితం ఇచ్చిన ‘బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు.. బ్యాక్ బోన్ క్లాస్’ అనే స్లోగన్ను కాపీ కొట్టి తమ డిక్లరేషన్లో పెట్టుకోవడం బీసీల పట్ల ఆ పార్టీకి ఉన్న నిర్లిప్తత, భావ దార్రిద్యాన్ని తేటతెల్లం చేసింది. బీసీల పార్టీ అని డబ్బా కొట్టుకుంటూ కనీసం వారి ఒక కొత్త స్లోగన్ కూడా చెప్పలేని స్థితిలో చంద్రబాబు, ఆయన పరివారం ఉంది. కొత్తగా మళ్లీ కార్పొరేషన్లా? జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదం. ఇప్పటికే 139 కులాలకు 56 కార్పొరేషన్లను వైఎస్ జగన్ ఏర్పాటు చేశారు. మళ్లీ తాను వస్తే ఏర్పాటు చేస్తానని డిక్లరేషన్లో చెప్పడం మోసగించడమేనని చెబుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఈ కార్పొరేషన్లను ఎందుకు ఏర్పాటు చేయలేదు? మళ్లీ ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేస్తామని ఎందుకు చెబుతున్నారు? ఇది మోసం కాదా? అని ప్రశ్నిస్తున్నారు. 2014లో కులగణన ఎందుకు చేయలేదు? చట్టబద్ధంగా కుల గణన చేస్తామని చంద్రబాబు డిక్లరేషన్లో డబ్బా కొట్టుకున్నారు. గతంలో ఇచ్చిన ఆ హామీ ఏమైంది. అధికారంలోకి వచ్చాక దాన్ని బుట్టదాఖలు చేశారు. వైఎస్ జగన్ కుల గణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. అంతేకాదు రాష్ట్రంలో ఇప్పటికే కుల గణన ప్రారంభించారు. అన్నీ జగన్ అమలు చేస్తున్న పథకాలే.. బాబు కాపీ నేతన్నలను ఆదుకుంటానని చెప్పిన చంద్రబాబు మోసం చేస్తే సీఎం జగన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ నేతన్న నేస్తంతో ఏటా రూ.24 వేలు సాయంతోపాటు పెన్షన్ వయో పరిమితి కుదించి అర్హులందరికీ రూ.3 వేలు పెన్షన్ ఇస్తున్నారు. బీసీలకు 50 శాతం సీట్లు కేటాయించాలంటూ పార్లమెంట్లో వైఎస్సార్సీపీ ఎంపీలతో ప్రైవేట్ బిల్లు పెట్టించి సీఎం జగన్ చరిత్ర సృష్టించారు. బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ, ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని కోరారు. వంచనలో వస్తాద్ ♦ చేనేత రంగానికి 25 హామీలు గుప్పించి ఒక్కటీ నెరవేర్చలేదు. రుణాలు మాఫీ చేస్తానని.. కమిటీతో చేతులు దులిపేసుకున్నారు. చేనేత కారి్మకులకు రూ.వెయ్యి కోట్లతో ప్రత్యేక నిధి, బడ్జెట్లో ఏటా రూ.వెయ్యి కోట్ల మాటే మరిచారు. ♦ ప్రమాదవశాత్తు మరణించిన వృత్తి పనివారికి పరిహారం.. చేతి, కుల వృత్తుల సమాఖ్యలను బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్తో అనుసంధానం చేసి ఆదుకుంటామమన్న హామీ గాల్లో కలిపేశారు. ♦ గీత కార్మికులకు ఏడు హామీలిచ్చి మోసం చేశారు. బెల్టుషాపులు తొలగించి గీత వృత్తిని ఆదుకుంటామని, హైబ్రిడ్ విత్తనాలు సరఫరా చేసి గీత చెట్లను పెంచేలలా ప్రోత్సహిస్తామని, తాటితోపుల పెంపకానికి భూమిని కేటాయిస్తామని ఇచ్చిన హామీని, అన్ని కులాలకు ఇచ్చిన హామీలను గాలికొదిలేశారు. -
విప్లవ భేరి
ఐదేళ్ల కిందట అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 151 స్థానాలను గెలవటం ఓ విప్లవం.. ఆ తర్వాత.. స్కూళ్లు, విద్యార్థుల నుంచి.. చెప్పే చదువుల వరకూ విద్యా రంగం సమూలంగా మారింది. ఇంటికే వైద్యులు, గ్రామాల్లోనే పరీక్షలు సహా... పేదల ప్రతి చికిత్సకూ ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందుతోంది. ఆర్బీకేల నుంచి పంటల కొనుగోళ్లు, బీమా వరకూ ప్రతి చర్యా రైతుకు భరోసా ఇస్తోంది. ఈ రాష్ట్ర మహిళలకు సొంతింటి పట్టాలున్నాయి. సొంత కాళ్లపై నిలబడగలిగే సత్తా ఉంది. ఇవే కాదు.. ఇంటింటికీ పథకాలు చేరవేసే వలంటీర్లు, గ్రామాల్లో పాలన భవనాలు, వ్యవసాయ– వైద్యారోగ్య కేంద్రాలు.. ఇవన్నీ ఐదేళ్లలోనే. కోవిడ్ కబళించిన రెండేళ్లను మినహాయిస్తే మూడేళ్లలోనే ఇంతటి సంక్షేమాభివృద్ధితో కూడిన విప్లవాన్ని... బహుశా ఈ రాష్ట్రమే కాదు.. ఏ రాష్ట్రమూ ఇదివరకెన్నడూ చూడలేదు. సమాజంలోని అట్టడుగు వర్గాలనూ అభివృద్ధిలో భాగం చేయాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచన ఫలితమే ఈ విప్లవం. అందుకే దేశంలో ఏ నాయకుడూ చెప్పని విధంగా ఆయన ధైర్యంగా జనానికి ఓ మాట చెబుతున్నారు. ‘గత ఎన్నికల ముందు చేస్తానని చెప్పినవన్నీ చేశా. మీ కుటుంబానికి మంచి జరిగిందని మీరు నమ్మితేనే మళ్లీ నాకు ఓటెయ్యండి’ అని. ఇలాంటి నాయకత్వమే అసలైన విప్లవం. విప్లవంతోనే చరిత్ర మారుతుంది. దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించేలా విప్లవాత్మక మార్పులతో గత 58 నెలలుగా రాష్ట్రంలో పాలన సాగుతోంది. ఇదివరకెన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సుపరిపాలన అందిస్తున్నారు. గత ఎన్నికల్లో 50 శాతం ఓట్లు, 151 శాసనసభ (86.28 శాతం), 22 లోక్సభ (88 శాతం) స్థానాల్లో వైఎస్సార్సీపీ చరిత్రాత్మక విజయం సాధించింది. 2019 మే 30న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వేదికపై నుంచే సుపరిపాలనకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. గత పాలకులకు భిన్నంగా మేనిఫెస్టోనే దిక్సూచిగా పరిపాలిస్తున్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేసి.. మద్యపాన నియంత్రణ, సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం) రద్దు వంటి వాటిని ఎందుకు అమలు చేయలేదో సహేతకమైన కారణాలు చెప్పడం ద్వారా విశ్వసనీయతను చాటుకున్నారు. దేశ చరిత్రలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేయడం ఇదే ప్రథమం కావడం గమనార్హం. సీఎంగా జగన్ బాధ్యతలు స్వీకరించాక పరిపాలనలో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. గ్రామ, వార్డు సచివాలయాలు.. జిల్లాల పునర్ వ్యవస్థీకరణ ద్వారా పరిపాలనను వికేంద్రీకరించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి భారీ ఎత్తున ఉద్యోగాల నియామకాలు చేపట్టారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా రాష్ట్రంలో 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే.. అందులో 58 నెలల్లో నియమించిన వారే 2.13 లక్షలు కావడం గమనార్హం. ఒకే నోటిఫికేషన్ ద్వారా గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.34 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసి రికార్డు సృష్టించారు. దేశ చరిత్రలో ఇంత భారీ ఎత్తున ఉద్యోగులను నియమించడం ఇదే ప్రథమం. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 50 ఇళ్లకూ.. పట్టణాల్లో 75 నుంచి వంద ఇళ్లకు ఒకరు చొప్పున 2.65 లక్షల మంది వలంటీర్లను నియమించారు. గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటి గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలు అందిస్తున్నారు. –సాక్షి, అమరావతి -
పేదల జీవితాల్లో మార్పు తెచ్చిన సంక్షేమ పథకాలు
-
జగన్ స్కీములు లేకపోతే చచ్చి పోయే వాళ్ళం
-
ఆంధ్రప్రదేశ్ లో అమలవుతోన్న సంక్షేమపథకాలు
-
‘గ్యారంటీ’గా ఇస్తారా?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ సంక్షేమ పథకాలు ‘గ్యారంటీ’గా రావాలంటే.. రేషన్ కార్డు తప్పనిసరి కావడంతో వాటి కోసం అర్హులైన లక్షలాది కుటుంబాలు ఆశగా ఎదురు చూస్తున్నాయి. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకానికి రేషన్కార్డు నిబంధన లేదు. అయితే, ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచే పథకానికి మాత్రం రేషన్కార్డు తప్పనిసరి చేశారు. ఇటీవల మరో రెండు గ్యారంటీలు..రూ.500కు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ హామీల అమలుకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. ఈ పథకాలకు కూడా రేషన్కార్డునే ప్రామాణికంగా తీసుకొంది. దీంతో రేషన్కార్డు లేని అర్హులైన లక్షలాది కుటుంబాలు కొత్త రేషన్కార్డులు జారీ చేసి తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. రేషన్కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని సీఎం రేవంత్రెడ్డి, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఇటీవల ప్రకటించారు. ప్రజాపాలనలో భాగంగా రేషన్కార్డులకు కూడా దరఖాస్తులు స్వీకరించారు. కానీ కొత్త కార్డుల విషయంలో ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి విధివిధానాలను ప్రకటించడం కానీ, ఎప్పటి నుంచి కార్డులు జారీ చేస్తారన్న సమాచారం ఇవ్వడం కానీ చేయకపోవడంతో ప్రజల్లో అయోమయం నెలకొంది. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలు ప్రక్రియలో భాగంగా విద్యుత్ శాఖ అధికారులు ఆధార్, రేషన్కార్డు నంబర్లు సిద్ధంగా ఉంచుకోవాలంటూ సందేశాలు పంపిస్తుండటంతో రేషన్ కార్డులు రానివారు ఆందోళనకు గురవుతున్నారు. 20 లక్షల దరఖాస్తులు.. కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్లోనే ఆరు గ్యారంటీలకు ప్రజాపాలన పేరిట దరఖాస్తులను ఆహ్వానించింది. ప్రతి గ్రామం, పట్టణం నుంచి వార్డుల వారీగా 1.28 కోట్ల దరఖాస్తులు వచ్చాయి. ఈ సందర్భంగా రేషన్కార్డుల కోసం అర్హులైన కుటుంబాల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చింది. దీంతో రేషన్కార్డుల కోసం కూడా విడిగా దరఖాస్తులు స్వీకరించారు. అలా సుమారు 20 లక్షల వరకు దరఖాస్తులు వచ్చినట్లు అనధికారిక లెక్క. కాగా పౌరసరఫరాల శాఖ.. కొత్త రేషన్కార్డుల దరఖాస్తులు తమకు అందలేదని స్పష్టం చేస్తుండటంతో ప్రజాపాలనలో ప్రజలు రేషన్కార్డుల కోసం చేసిన దరఖాస్తుల పరిస్థితి ఏమిటి అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ప్రజాపాలనలో వచ్చిన 1.28 కోట్ల దరఖాస్తుల్లో కూడా రేషన్కార్డు జిరాక్స్ కాపీ లేకుండా అందజేసినవే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. దీంతో ఈ దరఖాస్తుల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అదే సమయంలో కొత్త రేషన్కార్డులు ఇవ్వకుండా ఆరు గ్యారంటీలను అమలు చేయడం అంటే అర్హులకు అన్యాయం చేయడమే అవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో 90.14 లక్షల రేషన్కార్డులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం తెలుపు, గులాబీ కార్డులను జారీ చేసింది. 2014లో కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండు రకాల కార్డులను రద్దు చేసి, ఆహార భద్రతా కార్డు పేరుతో కొత్త కార్డులు జారీ చేసింది. ఇందులో జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ) కింద 54.48 లక్షల కార్డులు ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆహారభద్రత కార్డులు 35.66 లక్షలు ఉన్నాయి. మొత్తం 90.14 లక్షల కార్డుల ద్వారా 2.83 కోట్ల మంది దారిద్య్ర రేఖకు దిగువున (బీపీఎల్) ఉన్నట్టు తెలుస్తోంది. కాగా కొత్తగా పెళ్లిళ్లయి కుటుంబాల నుంచి వేరుపడిన వాళ్లు, వివిధ కారణాల వల్ల కార్డులు పొందలేని వాళ్లు లక్షల సంఖ్యలో ఇప్పుడు కొత్త కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. వీరు కాకుండా రేషన్కార్డుల్లో పుట్టిన పిల్లల పేర్లు చేర్చడానికి కూడా లక్షల కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. వెంటనే అర్హులకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ, కార్డుల్లో అడిషన్స్ (చేర్పులు) చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. -
వలంటీర్లకు గుడ్ న్యూస్
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, గుంటూరు: సంక్షేమ పథకాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల అమల్లో ఎలాంటి పక్షపాతం, అవినీతికి తావు లేకుండా క్షేత్ర స్థాయిలో విశేష సేవలు అందిస్తున్న వలంటీర్లను రాష్ట్ర ప్రభుత్వం గురువారం నగదు పురస్కారాలతో సత్కరించనుంది. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. కాగా ప్రభుత్వం ఈ ఏడాది నగదు పురస్కారాలను భారీగా పెంచింది. ప్రతి శాసనసభా నియోజకవర్గంలో ఉత్తమ సేవలు అందించిన ఐదుగురికి సేవావజ్ర అవార్డులను అందించనుంది. వీటి కింద గత మూడేళ్లుగా రూ.30 వేల చొప్పున ప్రభుత్వం నగదు బహుమతి అందజేయగా.. ఇప్పుడు ఆ మొత్తాన్ని 50 శాతం పెంచి ఏకంగా రూ.45 వేలు చేసింది. అలాగే మండలాలు, మున్సిపాలిటీల స్థాయిలో ఉత్తమ సేవలు అందించిన ప్రతి ఐదుగురు వలంటీర్లకు సేవారత్న అవార్డులను అందించనుంది. వీటి కింద గత మూడేళ్లు రూ. 20 వేల చొప్పున నగదు బహుమతి అందజేయగా.. ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.30 వేలకు పెంచింది. అదేవిధంగా కనీసం ఏడాదికాలంగా పనిచేస్తూ.. ఎటువంటి ఫిర్యాదులు, వివాదాలు లేకుండా పనిచేసిన మిగిలిన వలంటీర్లందరికీ సేవామిత్ర అవార్డులు అందించనుంది. వీటి కింద గత మూడేళ్లుగా రూ.10 వేల చొప్పున నగదు బహుమతి అందజేయగా.. ఇప్పుడు ఈ మొత్తాన్ని రూ.15 వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెంచిన నగదు బహుమతులను తాజా పురస్కారాల ప్రదానోత్సవంలో వలంటీర్లకు అందించనుంది. 2.55 లక్షల మంది వలంటీర్లకూ అవార్డులు.. ప్రతి లబ్ధిదారు ఇంటికి వెళ్లి పింఛన్లను పంపిణీ చేయడంతోపాటు రేషన్ డెలివరీ, ఆరోగ్యశ్రీ కార్డు, ఇళ్ల పట్టాలతో సహా వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలను, అమలు తేదీలను లబ్ధిదారులకు వలంటీర్లు వివరిస్తున్నారు. లబ్ధిదారులతో ఆయా పథకాలకు దరఖాస్తులు చేయిస్తున్నారు. అలాగే కోవిడ్, వరదలు, విపత్తులు, ప్రమాదాల సమయంలో వలంటీర్లు వివిధ సహాయ కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటున్నారు. ఇలా విశేష సేవలు అందిస్తున్న వలంటీర్లకు నగదు పురస్కారాలు అందించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సత్కరించనున్నారు. తర్వాత ఈ నెల 22 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాసనసభా నియోజకవర్గాల పరిధిలో స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు వలంటీర్లకు నగదు పురస్కారాలు అందించనున్నారు. ఈ కార్యక్రమాల నిర్వహణకు ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల శాఖ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. పురస్కారాలు ఇలా.. ♦ ప్రతి శాసనసభా నియోజకవర్గంలో అత్యుత్తమ ర్యాంకు సాధించిన మొదటి ఐదుగురు వలంటీర్ల చొప్పున.. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో 875 మంది వలంటీర్లకు సేవావజ్ర అవార్డుతోపాటు సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్, మెడల్, రూ.45,000 చొప్పున నగదు బహుమతి అందజేస్తారు. ♦ప్రతి మండలం లేదా మున్సిపాలిటీ పరిధిలో ఐదుగురు చొప్పున, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 10 మంది చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 4,150 మందికి సేవారత్న అవార్డుతోపాటు సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్, మెడల్, రూ.30,000 చొప్పున నగదు బహుమతి అందిస్తారు. ♦రాష్ట్రవ్యాప్తంగా ఏడాది పాటు ఎటువంటి ఫిర్యాదులు, వివాదాలు లేకుండా పనిచేసిన మిగిలిన 2,50,439 మంది వలంటీర్లకు సేవామిత్ర అవార్డుతోపాటు సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్, రూ.15,000 చొప్పున నగదు బహుమతిని అందజేయనున్నారు. ♦ సేవావజ్ర, సేవారత్న, సేవామిత్ర కలిపి మూడు కేటగిరీల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,55,464 మందికి మొత్తం రూ.392.05 కోట్ల నగదును బహుమతుల రూపంలో అందిస్తారు. ♦ సేవావజ్ర, సేవారత్న, సేవామిత్ర మూడు కేటగిరీ అవార్డులకు అదనంగా వైఎస్సార్ పెన్షన్ కానుక, ఆసరా తదితర పథకాల లబ్ధిదారుల మనోభావాలను అత్యుత్తమంగా సేకరించి, జిల్లా కలెక్టర్లు ఎంపిక చేసిన 997 మంది వలంటీర్లకు వేరేగా ప్రత్యేకంగా నగదు బహుమతులను కూడా ప్రభుత్వం గురువారం అందించనుంది. ఈ ప్రత్యేక నగదు బహుమతి కింద మండల, పట్టణ, మున్సిపల్ కార్పొరేషన్ స్థాయిలో ఎంపికయ్యే వలంటీర్లకు ఒక్కొక్కరికి రూ.15 వేలు చొప్పున అందిస్తారు. అలాగే నియోజకవర్గ స్థాయిలో ఎంపికైన ఒక్కో వలంటీర్కు రూ.20 వేలు చొప్పున అందజేస్తారు. జిల్లా స్థాయిలో ఎంపికయ్యే వారికి రూ. 25 వేల చొప్పున అందజేయనున్నారు. మొత్తం 997 మంది వలంటీర్లకు ప్రత్యేక నగదు బహుమతుల రూపంలో మొత్తం రూ.1.61 కోట్లు అందిస్తారు. -
‘ఆరు’పై అయోమయం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలు కోసం బడ్జెట్లో కేటాయించిన నిధులపై అటు అధికారిక వర్గాల్లో, ఇటు రాష్ట్ర ప్రజానీకంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. తాము కేటాయించిన నిధులతో ఆరు గ్యారంటీల అమలు జరిగి తీరుతుందని సర్కారు చెబుతోంటే.. మరికొన్ని నిధులు అవసరమని అధికార వర్గాలు లెక్కలు కడుతున్నాయి. మరోవైపు ఎన్నికల సమయంలో, మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను యథాతథంగా అమలు చేయాలంటే.. ఇప్పుడు బడ్జెట్లో పెట్టిన దానికి సుమారు మూడు రెట్లు ఎక్కువగా నిధులు అవసరమనే చర్చ జరుగుతోంది. హామీలను సంపూర్ణంగా అమలు చేయాలంటే ఏటా రూ.1.36 లక్షల కోట్లకుపైనే కావాల్సి ఉంటుందనే అంచనాలు వెలువడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రవేశపెట్టిన 2024–25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఆరు గ్యారంటీలకు రూ.53 వేల కోట్లను మాత్రమే కేటాయించింది. ఈ లెక్కలన్నీ చూస్తుంటే ఆరు గ్యారంటీల అమలు వ్యవహారం అయోమయంగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకవేళ గ్యారంటీలను పూర్తిస్థాయిలో కాకుండా, కొందరికే పరిమితం చేసినా ఏటా రూ.80 వేలకోట్లకుపైనే అవసరమని అధికార వర్గాలు అంటున్నా.. దీనిపై స్పష్టత ఇవ్వడం లేదు. ఆరు గ్యారంటీల్లో.. 13 పథకాలు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు ‘మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి, రైతు భరోసా, చేయూత, యువ వికాసం ఉన్నాయి. ఈ ఆరు గ్యారంటీల పరిధిలో మొత్తం 13 పథకాలను అమలు చేయాల్సి ఉంది. వీటిని పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు భారీ స్థాయిలో నిధులు అవసరం కానున్నాయి. రైతు భరోసా.. గత సర్కారు రాష్ట్రంలోని దాదాపు 1.52 కోట్ల ఎకరాలకు సంబంధించి సుమారు 69లక్షల మంది రైతులకు ఏటా ఎకరానికి రూ.10,000 చొప్పున చెల్లించింది. కాంగ్రెస్ తాము అధికారంలోకి వచ్చాక ఎకరాకు రూ.15,000 ఇస్తామని ప్రకటించింది. దీనికి ఏటా సుమారు రూ.22,800 కోట్లు అవసరం. ► రాష్ట్రంలో భూమి లేని కౌలు రైతులు 6.5 లక్షల మంది ఉన్నట్టు అంచనా. వారికి ఏటా రూ.15 వేల చొప్పున ఇచ్చేందుకు ఏటా రూ. 975 కోట్లు కావాలి. ► కాంగ్రెస్ కూలీలకు ఏటా రూ. 12 వేలు ఇస్తామని పేర్కొంది. రాష్ట్రంలో 52లక్షలకుపైగా ఉపాధి హామీ జాబ్కార్డులు ఉన్నా యాక్టివ్గా ఉన్న జాబ్కార్డులు దాదాపు 32 లక్షల మేర ఉన్నాయి. జాబ్కార్డులున్న అందరికీ పథకాన్ని వర్తింపజేస్తే ఏటా రూ.6,240 కోట్లు కావాలి, యాక్టివ్ వారికే ఇస్తే రూ.3,840 కోట్లు అవసరం. ► వరి ధాన్యానికి క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ పేర్కొంది. రాష్ట్రంలో కొనుగోలు చేస్తున్న కోటీ 30లక్షల టన్నుల ధాన్యానికి బోనస్ ఇవ్వాలంటే రూ.6,500 కోట్లు అవసరం. గృహ జ్యోతి.. ప్రస్తుతం రాష్ట్రంలో 200యూనిట్లలోపు విద్యుత్ వినియోగిస్తున్న గృహ విద్యుత్ కనెక్షన్ల సంఖ్య 95.23 లక్షలు. ఆ కుటుంబాలు ఏటా దాదాపు 9,022 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగిస్తున్నాయి. ఒక్కో యూనిట్ విద్యుత్ కొనుగోలు వ్యయం సగటున రూ.7గా లెక్కించినా.. ఏటా గృహజ్యోతి అమలు కోసం సుమారు రూ.6,315 కోట్లను విద్యుత్ సంస్థలకు చెల్లించాల్సి ఉంటుంది. ఇందిరమ్మ ఇళ్లు.. రాష్ట్రంలో సొంతిల్లు లేనిపేదలకు 20 లక్షల ఇళ్లు కట్టిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. అంటే ఏటా నాలుగు లక్షల ఇళ్ల నిర్మాణం కోసం నిధులు ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కో ఇంటికి రూ.5 లక్షలు ఇస్తామన్న హామీ మేరకు.. 20లక్షల ఇళ్లకు మొత్తంగా రూ. లక్ష కోట్లు అవసరం. ఏటా బడ్జెట్లో రూ.20 వేల కోట్లు కేటాయించాల్సి ఉంటుంది. అయితే సర్కారు తాజా ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో రూ. ఏడు వేల కోట్లే కేటాయించింది. చేయూత.. రాష్ట్రంలో ప్రస్తుతం మొత్తం 43.68 లక్షల మంది వివిధ రకాల పింఛన్లు పొందుతున్నారు. ప్రస్తుతం ప్రతినెలా దివ్యాంగులకు రూ.4వేలు, ఇతర లబ్ధిదారులకు రూ.2 వేలు ఇస్తున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో దివ్యాంగుల పింఛన్ రూ.6 వేలకు, ఇతర పింఛన్లను రూ.4 వేలకు పెంచుతామని హామీ ఇచ్చింది. ఈ లెక్కన ఏటా 5.5 లక్షల మంది దివ్యాంగుల పింఛన్లకు రూ.3,960 కోట్లు, సుమారు 38 లక్షల ఇతర పింఛన్లకు రూ.18,240 కోట్లు కేటాయించాల్సి ఉంటుంది. యువ వికాసం.. యువ వికాసం పథకంపై ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు. విద్యార్థుల ఫీజులు, కోచింగ్ చెల్లింపుల కోసం రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామని హామీ ఇచ్చింది. రాష్ట్రంలో ఏటా దాదాపు ఆరు లక్షల మంది విద్యార్థులు డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఇంటర్మీడియట్ వంటివి పూర్తి చేసుకుంటున్నారు. వీరికి విద్యా భరోసా కోసం బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని ఇస్తారా? ఎలా సర్దుబాటు చేస్తారు. లోన్లు తీసుకుని ఇస్తే వడ్డీ ఎవరు భరిస్తారన్నది తేలలేదు. మహాలక్ష్మి.. మహాలక్ష్మి పథకం కింద రాష్ట్రంలోని ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, రూ.500కే వంట గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కలి్పస్తామని కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ప్రకటించింది. ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన మహిళలు కోటీ 65లక్షల మంది ఉన్నారు. ఇందులో సుమారు 26 లక్షల మంది ఇప్పటికే వితంతు, ఒంటరి, వృద్ధాప్య పింఛన్లు పొందుతున్నారు. వారిని మినహాయించినా మిగతా కోటీ 39లక్షల మందికి ప్రతీనెలా రూ.2,500 లెక్కన ఏటా రూ.41,700 కోట్లు కావాల్సి ఉంటుంది. ► రాష్ట్రంలో మొత్తం 70లక్షల మంది మహిళల పేరిట వంటగ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. సిలిండర్ రూ.500కే ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఏడాదికి పన్నెండు సిలిండర్లు ఇస్తే.. ఏటా రూ.4,200 కోట్లు గ్యాస్ కంపెనీలకు చెల్లించాల్సి ఉంటుంది. ఆరు సిలిండర్లకే పరిమితం చేస్తే రూ.2,100 కోట్లు చెల్లించాలి. ► ఆర్టీసీ ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలవుతోంది. దీనికోసం ప్రతి నెలా రూ.300 కోట్ల చొప్పున ఏటా ఆర్టీసీకి రూ.3,600 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. -
పేదల జీవితాల్లో వెలుగులు నింపుతోన్న నవరత్నాలు
-
ఏపీలో ‘సంక్షేమం’ సూపర్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో పేదల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు అద్భుతమని ఢిల్లీ నేషనల్ డిఫెన్సు కళాశాల సీనియర్ డైరెక్టింగ్ స్టాఫ్, ఎయిర్ వైస్మార్షల్ మనీష్కుమార్ గుప్తా ప్రశంసించారు. ఢిల్లీలోని నేషనల్ డిఫెన్సు కళాశాలకు చెందిన సుమారు 20 మంది ప్రతినిధులతో కూడిన బృందం మనీష్కుమార్ నేతృత్వంలో రాష్ట్రంలో పర్యటించింది. ఇందులో భాగంగా శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో పలువురు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశమైంది. మనీష్కుమార్ మాట్లాడుతూ.. నేషనల్ డిఫెన్స్ కళాశాల ఫ్యాకల్టీ, కోర్సు సభ్యులతో కలిసి రెండ్రోజులుగా విశాఖపట్నం, అరకు తదితర ప్రాంతాల్లో పర్యటించి రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య, మహిళ, రైతు సంక్షేమం తదితర రంగాల్లో అమలుచేస్తున్న పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించడంతో పాటు అక్కడి ప్రజలతో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఈ ఎన్డీసీ బృందం పర్యటించి ఆక్కడ అమలుచేస్తున్న పథకాలు, కార్యక్రమాలను పరిశీలించామని.. అయితే, ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రాల కంటే చాలా ముందంజలో ఉందని మనీష్కుమార్ కొనియాడారు. విద్య, వైద్య రంగాల్లో మౌలిక సదుపాయాలు మెరుగు.. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్జైన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్య, వైద్యం, మహిళ, రైతు సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చి పలు కార్యక్రమాలను అమలుచేస్తోందన్నారు. అలాగే, ప్రాథమిక విద్యాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా విద్యా, వైద్య రంగాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు పెద్దఎత్తున చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. అలాగే, పేద ప్రజల సంక్షేమానికి పలు వినూత్న కార్యక్రమాలు, పథకాలను విజయవంతంగా అమలుచేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్రంలో విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలను వివరించారు. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచిత విద్యుత్.. ఇక రాష్ట్రంలో ఇంధన శాఖకు సంబంధించిన అంశాలపై ఎపీ ట్రాన్స్కో సీఎండీ కేవీఎస్ చక్రధర్బాబు వివరిస్తూ.. ప్రజలకు 24 గంటలూ యాక్ససబుల్, రిలయబుల్ విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్ను అందిస్తున్నామని.. సుమారు 20 లక్షల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. ఒకే దేశం ఒకే గ్రిడ్ నినాదంలో భాగంగా 5 గిగావాట్ల సోలార్ విద్యుదుత్పత్తికి చర్యలు తీసుకుంటున్నామని, ఐదు పంపు స్టోరేజ్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటుచేస్తున్నామన్నారు. రాష్ట్ర ఇంధన రంగంలో మెరుగైన ఫలితాలు సాధించినందుకు ఈ ఏడాది నాలుగు జాతీయ, మూడు అంతర్జాతీయ అవార్డులతో పాటు రాష్ట్రపతి అవార్డును కూడా సాధించామన్నారు. అనంతరం.. వ్యవసాయ రంగం అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను వ్యవసాయ శాఖ ఇన్ఛార్జి కమిషనర్ జి. శేఖర్బాబు వివరిస్తూ.. రాష్ట్ర జీడీపీలో 34 శాతం పైగా వాటా వ్యవసాయ రంగం నుంచే వస్తోందని చెప్పారు. రైతులకు అవసరమైన సేవలంని్నటినీ ఆర్బీకేల ద్వారా ఒకేచోట నుండి అందిస్తున్నామన్నారు. కొత్తగా 17 ప్రభుత్వ వైద్య కళాశాలలు.. రాష్ట్రంలో వైద్యసేవలను రాష్ట్ర సెకండరీ హెల్త్ డైరెక్టర్ డా. వెంకటేశ్వర్ వివరిస్తూ.. రాష్ట్రంలో వైద్యపరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. ఇందులో భాగంగా ఎన్నడూలేని విధంగా 53 వేల పోస్టులను భర్తీచేయడంతోపాటు ఇంటివద్దకే మెరుగైన వైద్య సేవలందించేందుకు కృషి జరుగుతోందని వివరించారు. అలాగే.. కొత్తగా 17 ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటుచేస్తున్నట్లు చెప్పారు. -
‘సబ్ప్లాన్’ను మాయం చేశారు
సాక్షి, హైదరాబాద్: దివంగత నేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఉదాత్త ఆశయంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్ప్లాన్ విధానాన్ని ప్రారంభించి, ఆయా వర్గాల పేదల సంక్షేమానికి చర్యలు తీసుకుంటే, గత బీఆర్ఎస్ ప్రభుత్వం దానిని తొలగించి పేదల సంక్షేమాన్ని దెబ్బతీసిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్ ప్లాన్ నిధులతో ఆయా వర్గాల వారికి ఎంతో లబ్ధి కలిగిందని, సంక్షేమ పథకాలకు సంబంధించి ఒక్కో గ్రామానికి పది వరకు యూనిట్లు దక్కాయని గుర్తు చేశారు. కానీ గత ప్రభుత్వం ఆ విధానాన్ని తొలగించి, దళితబంధు పేరుతో నిధులు పక్కదారి పట్టించిందని ఆరోపించారు. శుక్రవారం ఆయన అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై చర్చను ప్రారంభించారు. ఆయన ప్రసంగం ప్రారంభించగానే బీఆర్ఎస్ సభ్యులు తమ పార్టీ నుంచి వెళ్లిపోయి మాట్లాడుతున్నావంటూ వ్యాఖ్యానించారు. ‘నన్ను ఓ మనిషిగా చూడలేని మిమ్మల్ని వదిలి ఆదరించిన కాంగ్రెస్లో చేరి గెలిచా. అన్నీ చెప్తా.. వినే ఓపిక ఉందా, నన్ను గెలకొద్దు, గెలికించుకోవద్దు’అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ ప్రమాణస్వీకారం చేస్తూనే తెలంగాణ సమాజం స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవటం ప్రారంభించిందన్నారు. అంతా బాగుంటే ప్రజలు ఎందుకు ఓడించారు దొరల పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తమను గెలిపించారని, దొరల పాలనకు గుర్తుగా ఉన్న ప్రగతి భవన్ కంచెలు తొలగించామని వీరేశం పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం పనిచేశామని గత ప్రభుత్వంలో గొప్పలు చెప్పుకొన్నారని, మరి సంక్షేమం బాగుంటే ప్రజలు ఎందుకు ఓడించారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలను చైతన్యపరిచేందుకు కృషి చేసిన గద్దర్ను ప్రగతి భవన్లోకి అనుమతించకుండా అవమానించారని, ఇప్పుడు ఆయన సేవలను తమ ప్రభుత్వం తగు రీతిలో గౌరవించుకుంటోందన్నారు. అబద్ధానికి ప్రతిరూపం కేసీఆర్: యెన్నం అబద్ధానికి ప్రతిరూపంగా కేసీఆర్ నిలుస్తారని అధికార పక్ష సభ్యుడు యెన్నం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. కృష్ణానదికి కాళ్లు అడ్డుపెట్టి పాలమూరును సస్యశ్యామలం చేస్తామని ఎంపీగా అక్కడి నుంచి గెలిచి, ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కూడా మహబూబ్నగర్ను పట్టించుకోలేదని విమర్శించారు. ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదని బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని.. కానీ, నాలుగు సార్లు దావోస్ వెళ్లి రూ.19 వేల కోట్లకు మించి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోలేకపోయిందని యెన్నం ఎద్దేవా చేశారు. అయితే సీఎంగా బాధ్యతలు తీసుకున్న వెంటనే దావోస్ వెళ్లి ఏకంగా రూ.40 వేల కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకున్న ఘనత రేవంత్దన్నారు. -
చిన్న తరహా పరిశ్రమలకు ఊతమిస్తోన్న సీఎం జగన్ పారిశ్రామిక పాలసీలు
-
అన్నా మా కోసమే నువ్వున్నావ్..మహిళ సూపర్ కామెంట్స్
-
కేంద్రం బకాయిలను మేమే ఇస్తాం: మమత
కోల్కతా: వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి కేంద్రప్రభుత్వం నుంచి పశి్చమబెంగాల్ రాష్ట్రానికి రావాల్సిన బకాయిలపై ఇక ఎవరినీ అడిగేదిలేదని, తామే చెల్లిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలపై కోల్కతాలో శుక్రవారం నుంచి 48 గంటల ధర్నాకు దిగిన మమత శనివారం మాట్లాడారు. ‘‘ ఇకపై మేం బీజేపీ ప్రభుత్వాన్ని దేహీ అని అడుక్కోవాలనుకోవట్లేదు. వాళ్ల భిక్ష మాకు అక్కర్లేదు. రాష్ట్రంలో ఉపాధి హామీ పనులు చేసి కేంద్రం నుంచి బకాయిల కోసం ఎదురుచూస్తున్న 21 లక్షల మంది కారి్మకుల ఖాతాలకు ఆ మొత్తాలను ఫిబ్రవరి 21కల్లా మా ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఆవాస్ యోజన పథకంపైనా త్వరలో నిర్ణయం తీసుకుంటాం’’ అన్నారు. ధర్నా వద్దే మమత రాత్రి బస ధర్నాకు దిగిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం రాత్రంతా ధర్నా స్థలి వద్దే గడిపారు. అక్కడే నిద్రించి ఉదయం మారి్నంగ్వాక్కు వెళ్లారు. -
జగన్ ప్రభం‘జనం’
సిద్ధం సభ ప్రాంగణం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: జనం.. జగన్ కలిస్తే ప్రభంజనమేనని గోదారమ్మ సాక్షిగా మరోసారి ప్రజలు చాటిచెప్పారు. రాష్ట్రంలో 175కు 175 శాసనసభ, 25కు 25 లోక్సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా శ్రేణులను సన్నద్ధం చేయడానికి శనివారం ఏలూరుకు సమీపంలో ‘సిద్ధం’ పేరుతో నిర్వహించిన సభకు కెరటాల్లా జనం పోటెత్తారు. ఉభయగోదావరి, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లోని 50 నియోజకవర్గాల నుంచి వేలాది వాహనాల్లో లక్షలాది మంది కదలివచ్చారు. సభా వేదికపైకి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేరుకోకముందే ప్రాంగణం కిక్కిరిసిపోయింది. లక్షలాది మంది ప్రజలు కోల్కత–చెన్నై జాతీయరహదారిపై నిలబడిపోయారు. సభా ప్రాంగణం నిండిపోవడం, జాతీయ రహదారిపై లక్షలాది మంది ప్రజలు బారులు తీరడంతో.. హైవేపై కలపర్రు టోల్ ప్లాజ్ నుంచి విజయవాడ వైపు 15 కి.మీల పొడవున.. రాజమహేంద్రవరం వైపు గుండుగొలను వరకూ 17 కి.మీల పొడవునా వాహనాలు నిలిచిపోయాయి. సభా ప్రాంగణం, జాతీయ రహదారిపై ఎన్ని లక్షల మంది ఉంటారో.. అదే స్థాయిలో ట్రాఫిక్లో చిక్కుకుపోయిన వాహనాల్లో జనం ఉంటారని చెబుతున్నారు. దుష్టచతుష్టయంపై యుద్ధానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా? అంటూ వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన రణగర్జనకు... సిద్ధమంటూ లక్షలాది గొంతులు ప్రతిధ్వనించాయి. ఎండ తీవ్రత పెరిగినా జనం లెక్క చేయలేదు. సీఎం జగన్ ప్రసంగాన్ని ఆసక్తిగా వింటూ జై జగన్ అంటూ నినదించారు. జగన్ ఒంటరివాడని దుష్టచతుష్టయం అనుకుంటోందని అంటే.. ‘మీరేలా ఒంటరి అవుతారు.. మేమంతా మీ వెంటే.. మీ సైన్యం మేమే’ అంటూ లక్షలాది గొంతులు నినదించాయి. భీమిలి సభ కంటే రెండు రెట్లు అధికంగా ఏలూరు సభకు జనం తరలివచ్చారు. ‘చంద్ర’ముఖిపై అప్రమత్తం చేద్దాం రాష్ట్రంలో గత 57 నెలలుగా అందిస్తున్న సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన వల్ల ప్రతి ఇంట్లో.. గ్రామంలో.. నియోజకవర్గంలో వచ్చిన విప్లవాత్మక మార్పును కళ్లకు కట్టినట్లు వివరిస్తూ సీఎం జగన్ ప్రసంగించారు. సంక్షేమ పథకాల ద్వారా రూ.2.55 లక్షల కోట్లను పేదల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశామని.. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా పనిచేసినప్పుడు ఇచ్చిన హామీల్లో పది శాతమైనా అమలు చేశారా? అని ప్రతి ఇంటికెళ్లి అడగాలంటూ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. వైఎస్సార్సీపీకి ఓటేయకపోవడం.. చంద్రబాబు నేతృత్వంలోని కూటమికి ఓటేయడమంటే సంక్షేమ పథకాల రద్దుకు ఆమోదం తెలిపినట్లేనన్నది ప్రతి ఇంటికి వెళ్లి చెప్పాలని పిలుపునిచ్చారు. సంక్షేమ పథకాల ద్వారా 124 సార్లు సీఎం జగన్ బటన్ నొక్కి లబ్ధి చేకూర్చారని.. ఇప్పుడు ఒకటి అసెంబ్లీకి, ఒకటి పార్లమెంటుకు ఫ్యాను గుర్తు మీద బటన్ రెండు సార్లు నొక్కాలని.. లేదంటే.. చంద్రముఖి సైకిలెక్కుతుందని హెచ్చరించారు. టీ గ్లాసు పట్టుకొని పేదల రక్తం తాగేందుకు ఒక డ్రాకులా మాదిరిగా మీ తలుపు తడుతుందని గడపగడపకు చెప్పాలని పిలుపునిచ్చారు. పోటెత్తిన యువత సభకు హాజరైన వారిలో అత్యధికులు 20 నుంచి 35 ఏళ్లలోపు వారే ఉండటం గమనార్హం. యువతను అభిప్రాయ నిర్ణేతలుగా రాజకీయ పరిశీలకులు భావిస్తారు. ఏలూరు సభకు యువత పోటెత్తడానికి ప్రధాన కారణం సీఎం వైఎస్ జగన్ విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో తెచ్చిన విప్లవాత్మక మార్పులేనని అంటున్నారు. వైఎస్ జగన్ను మళ్లీ సీఎంగా చేసుకుంటేనే.. రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని బలంగా విశ్వసిస్తుండటం వల్లే యువత వైఎస్సార్సీపీ పక్షాన సైనికుల్లా నిలబడుతున్నారని చెబుతున్నారు. ఈ సభకు యువతతో పోటీపడి వృద్ధులు కూడా తరలివచ్చారు. ఉదయం నుంచే బారులు సభకు సీఎం జగన్ మధ్యాహ్నం మూడు గంటలకు వస్తారని తెలిసినా.. ఉదయం 11 గంటల నుంచే జనం తరలివచ్చారు. మధ్యాహ్నం 2 గంటలకే సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. దీంతో కోల్కతా–చెన్నై జాతీయ రహదారిపై లక్షలాది మంది జనం నిలబడిపోయారు. సభలో సీఎం వైఎస్ జగన్ ప్రసంగిస్తున్నంత సేపు ఇంకా వాహనాలు వస్తూనే ఉన్నాయి. ట్రాఫిక్ సమస్య తలెత్తడంతో వేలాది మంది సభకు రాలేక వెనుదిరిగారు. -
వలంటీర్ మానవత్వం..
రొంపిచర్ల: ప్రతి లబ్ది దారుని ఇంటికి సంక్షేమ పథకాలు అందాలనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాన్ని నిండు గర్భిణితో ఉన్న మహిళా వలంటీరు నెరవేర్చింది. నరసరావుపేట నియోజకవర్గం రొంపిచర్ల క్లస్టర్లో మేకతోటి జయంతి వలంటీర్గా పనిచేస్తుంది. రెండేళ్ల కిందట మగ బిడ్డకు జన్మనిచ్చిన జయంతి.. మరోసారి గర్భం దాల్చి నవమాసాలతో మరో బిడ్డకు జన్మనిచ్చేందుకు నేడో రేపో అనే దశలో ఉంది. తన పరిధిలో నివాసం ఉండే మానసిక వికలాంగుడు సోర ప్రసన్న గత రెండు నెలలుగా తెనాలి సమీపంలోని ఎరుకలపూడిలోని ఆయుర్వేద వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. గత నెలలో అతను ఫించన్ తీసుకోలేదు. ఈ నెల కూడా తీసుకోకుంటే, తనకు సీజేరియన్ ద్వారా ప్రసవం జరిగితే వచ్చే నెల కూడా అతనికి అందజేయగలనో లేదోననే సంచయం ఆమెను వెంటాడింది. వరుసగా మూడు నెలలపాటు పింఛన్ తీసుకోకుంటే లబ్ధిదారునికి పింఛన్ ఫ్రీజ్ అయ్యే అవకాశం ఉంది. తొమ్మిదో నెల గర్భిణి అయిన జయంతి.. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. ఒకటో తేదీనే వెంటనే తన కుటుంబ సభ్యులను ఒప్పించి భర్త సాగర్ సాయంతో బైక్పై రొంపిచర్ల నుంచి ఎరుకలపాలెం వెళ్లింది. అక్కడ జయంతిని చూడగానే.. అక్కా.. అక్కా అంటూ ప్రసన్న వడివడిగా పైకి లేచాడు. వేలిముద్ర వేసి రూ.3,000 తీసుకుని ఆనందంతో మా వలంటీర్ అక్క చాలా మంచిది.. అంటూ లోపలికి వెళ్లాడు. అప్పటి వరకు 102 కిలోమీటర్ల దూరం బైక్పై వస్తుంటే.. పొత్తి కడుపులో అప్పుడప్పుడూ పుట్టిన నొప్పి సోరన్న చిరునవ్వును చూడగానే మాయమైంది. అదే వాహనంపై తిరిగి 102 కిలోమీటర్ల ప్రయాణించి వచ్చింది. మరుసటి రోజు(ఫిబ్రవరి 2న ) గుంటూరులోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరి సీజేరియన్ ఆపరేషన్ ద్వారా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. -
నవరత్నాలతో పేదల జీవితాల్లో వెలుగులు
-
AP: పేదరికంపై గెలుపు.. మెరుగుపడ్డ ప్రజల జీవన ప్రమాణాలు
ఉండటానికి ఇల్లు.. తినటానికి తిండి.. కట్టుకోవటానికి బట్ట... ఈ మూడూ లేక ఇబ్బందులు పడేవారే పేదలన్నది ఒకప్పటి ప్రాతిపదిక. కానీ రోజులు మారాయి. ఈ మూడూ ఉండటమే కాదు... అవి నాణ్యంగా ఉండాలి. నిరంతరం కొనసాగాలి. అలా కొనసాగించటానికి అవసరమైన సదుపాయాలు వారికి అందుబాటులోకి రావాలి. అదిగో... అప్పుడే వారు పేదరికం నుంచి బయటపడినట్లు. స్థూలంగా చెప్పాలంటే వీటన్నిటినీ సాధించడానికి పేదల ఆదాయాలు పెరగాలి. అలా పెరగటంతో పాటు... భవిష్యత్తుపై భరోసా ఉండేలా వారికి నాణ్యమైన విద్య, వైద్యం అందాలి. గృహ వసతితో పాటు తాగునీరు, పౌష్టికాహారం అందటం.. మాతా శిశు మరణాలు తగ్గటం... ఇవన్నీ జరిగితేనే పేదరికం తగ్గినట్లని నీతి ఆయోగ్ స్పష్టంచేసింది. నాణ్యమైన విద్య, వైద్యం అందితే పేదల జీవితాల్లో గణనీయమైన మార్పులు వస్తాయని పేర్కొంది. విశేషమేమిటంటే... నవరత్నాలతో పేదలకు అండగా నిలిచి, ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ నాలుగున్నరేళ్లలో ఏకంగా రూ.4.21 లక్షల కోట్లను పేదలకు అందజేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో గణనీయమైన పురోగతి సాధించింది. ఇక్కడ పేదలు గడిచిన నాలుగున్నరేళ్లలో ఏకంగా 1.87 శాతం తగ్గారు. పేదరికం ఇప్పుడు 4.19 శాతానికి మాత్రమే పరిమితమయింది. ఇదీ... కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని నీతి ఆయోగ్ నివేదికలో వెల్లడించిన వాస్తవం. ఇదీ... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన మార్పు. సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం తొమ్మిది పథకాల ద్వారా జాతీయ స్థాయిలో 2019–21లో 14.96 శాతంగా ఉన్న పేదరికాన్ని 2022–23 నాటికి 11.28 శాతానికి తగ్గించిందని నీతి ఆయోగ్ నివేదిక పేర్కొంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం నవరత్నాలతో 2019–21లో 6.06 శాతంగా ఉన్న పేదరికాన్ని 2022–23 నాటికి 4.19 శాతానికి తగ్గించిందని కూడా తన నివేదికలో వెల్లడించింది. రాష్ట్రంలో వైఎస్.జగన్ సర్కారు డీబీటీ, నాన్ డీబీటీ పథకాల ద్వారా పేదలకు రూ.4.21 లక్షల కోట్లను సాయంగా అందించటంతో ఎక్కడికక్కడ మహిళలు సైతం తమ కాళ్లపై నిలబడి సొంత వ్యాపారాలు చేసుకోవటం... ప్రతి ఒక్కరూ పిల్లల్ని స్కూళ్లకు పంపించటంతో గ్రాస్ ఎన్రోల్మెంట్రేíÙయో ఏకంగా 100 శాతానికి చేరటం తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పలు పథకాల కారణంగా గత కొన్ని సంవత్సరాలుగా పేదల సంఖ్య వేగంగా తగ్గుతోందని నివేదిక వివరించింది. 2015–16 సంవత్సరం, 2019–21 సంవత్సరం, 2022–23 సంవత్సరాల్లో దేశంలోనూ, రాష్ట్రాల్లోనూ పేదరికం ఎలా తగ్గుతూ వస్తోందనే విషయాన్ని నీతి ఆయోగ్ ఈ నివేదికలో వెల్లడించింది. పౌష్టికాహారం అందుతోందా? శిశు మరణాల రేటు ఎలా ఉంది? తల్లుల ఆరోగ్యం మెరుగుపడిందా? పాఠశాలలకు పిల్లల హాజరు శాతం ఎంత? వంటకు ఏ రకమైన ఇంధనం వినియోగిస్తున్నారు? పరిశుభ్రత పరిస్థితులు, తాగునీరు, గృహవసతి, విద్యుత్ వినియోగం, ఆస్తులు, బ్యాంకు ఖాతాలకు చెందిన బహుముఖ సూచికల ఆధారంగా పేదరికం శాతాన్ని నీతి ఆయోగ్ లెక్కగట్టింది. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై ఆహార ధాన్యాలు అందించటం, పారిశుద్ధ్యంతో పాటు ఉచిత విద్య, ఆరోగ్యం, పోషకాహారాలపై తీసుకుంటున్న చర్యలు కారణంగా పేదరికం శాతం గణనీయంగా తగ్గిందని నివేదికలో వివరించింది. ప్రజల జీవన నాణ్యతలో గణనీయమైన మెరుగుదల ఉందని నివేదిక స్పష్టంగా పేర్కొంది. నిబద్ధతతో వేగంగా అడుగులు... రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలతో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను వేగంగా సాధిస్తోంది. దీంతో పేదరికం శాతం కూడా అదే స్థాయిలో తగ్గుతోంది. వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ సున్నా వడ్డీ ద్వారా వడ్డీ భారం లేకుండా రుణాలు అందజేయటం... ఇలా పలు కార్యక్రమాలు చేపడుతూ వరుసగా నాలుగేళ్ల పాటు ఫోకస్డ్గా పేద అక్క చెల్లెమ్మల కుటుంబాలను పేదరికం నుంచి బయటకు తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేసింది. అంతే కాకుండా నవరత్నాల్లో ప్రతి పథకాన్నీ పేదలను పేదరికం నుంచి బయటకు తీసుకు రావటానికే అన్న లక్ష్యంతో చర్యలు తీసుకుంది. పేదలు తమ పిల్లలను స్కూళ్లకు పంపడాన్ని ప్రోత్సహించేందుకు అమ్మ ఒడి పథకాన్ని అమలు చేస్తూనే... ఆ స్కూళ్లలో కార్పొరేట్ స్కూళ్లకు తీసిపోని నాణ్యమైన విద్యను అందించటానికి వేల కోట్ల రూపాయల్ని ఖర్చుచేసి మౌలిక సదుపాయాలను మెరుగుపరిచింది. చదువు చెప్పే తీరును, చదువుకునే పద్ధతిని ఆధునిక స్థాయిలకు తీసుకెళ్లి సమూలంగా మార్చింది. అలాగే మహిళలు, పిల్లల్లో పౌష్టికాహార లోపాలను రూపుమాపేందుకు సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ ప్లస్ కార్యక్రమాలను, స్కూళ్లలో జగనన్న గోరుముద్ద పథకాన్ని అమలు చేస్తోంది. ఇక వైద్య సేవల విషయంలో ఈ రాష్ట్రంలో పేదలకున్న భరోసా మరెక్కడా లేదనే చెప్పాలి. పేద, మధ్యతరగతి ప్రజలకు వైఎస్సార్ ఆరోగ్య శ్రీ ద్వారా ఉచిత వైద్య సేవల్ని ఏకంగా రూ.25 లక్షల పరిమితి వరకూ అందిస్తోంది. వీటన్నిటితో పాటు నవరత్నాలు –పేదలందరికీ ఇళ్లు పథకం కింద 31.91 లక్షల మందికి ఇళ్ల స్థలాలను పంపిణీ చేయడంతో పాటు వాటిలో పక్కా ఇళ్ల నిర్మాణాలనూ చేపట్టింది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం సామాజిక రంగానికి పెద్ద పీట వేస్తూ అత్యధికంగా వ్యయం చేస్తుండటంతో రాష్ట్రంలో పేదల సంఖ్య గణనీయంగా తగ్గుతోందని నీతి ఆయోగ్ వెల్లడించింది. ‘ఆసరా’ సంకల్పం సాకారమైన వేళ.. ఒక మహిళ ఆర్థికంగా నిలదొక్కుకుంటే... కుటుంబం బాగుపడుతుంది. ఒక కుటుంబ పరిస్థితి మెరుగుపడితే... ఊరు అభివృద్ధి చెందుతుంది. ఊళ్లన్నీ పురోగమిస్తే రాష్ట్రం ఉన్నత స్థాయికి ఎదుగుతుంది. ఇదే సిద్ధాంతాన్ని నమ్మిన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి మహిళలకు ఆసరా కల్పించేందుకు సంకల్పించారు. 2014 ఏప్రిల్ 11వ తేదీనాటికి బ్యాంకుకు బకాయిపడిన మొత్తాన్ని వారు సక్రమంగా చెల్లిస్తే నాలుగు విడతల్లో వైఎస్సార్ ఆసరా కింద వాపసు చేస్తానని హామీ ఇచ్చారు. దానిని తూచా తప్పకుండా పాటించారు. ఆయన ఆలోచన నిజమైంది. ఆయన సంకల్పం సాకారమైంది. ఇప్పుడు ఆసరా అందించిన తోడ్పాటుతో ఎంతగానో ఎదుగుతున్నారు. వైఎస్సార్ జిల్లాకు చెందిన లక్ష్మీదేవి పాడిపశువుల పెంపకం చేపడుతున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన గూడూరు కమలమ్మ ఓ ఇంటినే కొనుగోలు చేశారు. ఏలూరు జిల్లాకు చెందిన సుంకరబుజ్జమ్మ కూరగాయల వ్యాపారం చేసుకుంటూ కుటుంబానికి బాసటగా నిలుస్తున్నారు. ఇలాంటి విజయగాథలు చాలవా... జగనన్న సంకల్పం ఎంతగొప్పదో? – సాక్షి, నెట్వర్క్ పాడి వ్యాపారంతో కుటుంబానికి బాసట మాది వైఎస్సార్ జిల్లా ముద్దనూరు. నేను శివ ఎస్హెచ్జీ సభ్యురాలిని. నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ఆసరా పథకం కింద అందిస్తున్న డ్వాక్రా రుణమాఫీ సొమ్మును పాడి పశువుల పెంపకానికి వినియోగిస్తున్నాను. ఇప్పటివరకూ ఏడాదికి రూ.18,750లు వంతున మొత్తం రూ.75వేలు వచ్చింది. ఆ సొమ్ముతో పాడిపశువులు కొని పాల వ్యాపారం చేస్తున్నాను. ఇప్పుడు నేను కుటుంబానికి బాసటగా నిలుస్తున్నాను. ప్రభుత్వానికి రుణపడి ఉంటాను. – లక్ష్మీదేవి, ఎస్హెచ్జీ సభ్యురాలు, ముద్దనూరు వైఎస్సార్ జిల్లా ఇల్లు కొనుగోలుకు సాయపడింది నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని దోర్నాదులవారి వీధికి చెందిన ఈమె పేరు గూడూరు కమలమ్మ. వీరిది వ్యవసాయ కుటుంబం. ఈమెకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. పొదుపు గ్రూపులో సభ్యురాలైన ఈమెకు వైఎస్సార్ఆసరా పథకం కింద ఏడాదికి రూ.16,780 వేల చొప్పున ఇప్పటివరకూ రూ.67,120 నగదు ఆమె వ్యక్తిగత ఖాతాలో జమయింది. ఆ మొత్తంతో తాము అద్దెకు ఉంటున్న ఇంటినే కొనుగోలు చేయగలిగామనీ, పిండిమర ఇంట్లో ఏర్పాటు చేసుకుని చిరు వ్యాపారం చేసుకుంటున్నామని తెలిపారు. కేవలం సీఎం జగన్ వల్లే తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగైంది. – గూడూరు కమలమ్మ, ఆత్మకూరు, నెల్లూరు జిల్లా కూరగాయల వ్యాపారానికి ఆధారం ఏలూరు జిల్లా మండవల్లికి చెందిన ఈమె పేరు సుంకర బుజ్జమ్మ. వనిత గ్రూపు సభ్యురాలైన ఈమె భర్త నాలుగేళ్ల క్రితం మృతిచెందాడు. దీంతో ముగ్గురు పిల్లల పోషణభారం ఈమెపై పడింది. వైఎస్సార్ ఆసరా పథకం కింద ఏడాదికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.40 వేలు రాగా ఆ మొత్తంతో కూరగాయల వ్యాపారం ప్రారంభించారు. దీనికి మరో రూ.2 లక్షల రుణంతో వ్యాపారం విస్తరించారు. ఇప్పుడు పిల్లలను గౌరవంగా చదివించగలుగుతున్నానన్నారు. సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. – సుంకర బుజ్జమ్మ, మండవల్లి, ఏలూరు జిల్లా బిడ్డల చదువుకు తోడ్పడుతున్నా... ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఆసరా పథకం ద్వారా నాలుగేళ్లలో రూ.60 వేలు వచ్చాయి. వీటితో చిల్లరకొట్టు, కూరగాయల వ్యాపారం చేస్తున్నా. వచ్చిన ఆదాయంతో మా పాప ఇంజినీరింగ్, మా బాబును సివిల్స్ కోచింగ్కు పంపాం. వారిద్దరికీ ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన వచ్చాయి. సీఎం జగనన్న సాయంతోనే మా కుటుంబం ఇప్పుడు ఆర్థికంగా నిలదొక్కుకుంది. – మిర్యాల ఉషారాణి, ఈలప్రోలు, ఎన్టీఆర్ జిల్లా -
మారుమూలనా హల్‘సెల్’
సాక్షి, అమరావతి: మారుమూల గిరిజన ప్రాంతాలకు సమర్థవంతమైన టెలికాం సేవలందించడంతో పాటు సంక్షేమాభివృద్ధి పథకాలు ప్రతి ఇంటికి పారదర్శకంగా అందాలన్న తపన, తాపత్రయంతో అడుగులు వేగంగా వేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఇందులో భాగంగా దాదాపు రూ.400 కోట్లతో 400 సెల్ టవర్లను నిర్మించామని తెలిపారు. గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వాటిని వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 400 సెల్ టవర్ల ద్వారా 2.42 లక్షల మందికి ప్రయోజనం చేకూరిందన్నారు. ప్రధానంగా అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, ప్రకాశం, ఏలూరు, శ్రీకాకుళం, కాకినాడ జిల్లాల్లోని మారు మూల ప్రాంతాల వారు ఫోన్లలో మాట్లాడే వీలు కలుగుతోందన్నారు. ప్రస్తుతం ప్రారంభించిన టవర్ల ద్వారా 944 గ్రామాలకు కనెక్టివిటీ ఏర్పడుతుందని చెప్పారు. మొత్తంగా రూ.3,119 కోట్లతో 2,900 టవర్లను ఏర్పాటు చేసేలా కార్యాచరణ రూపొందించామని తెలిపారు. తద్వారా 5,549 ఆవాసాలను కనెక్టివిటీలోకి తీసుకొచ్చేందుకు మార్గం ఏర్పడుతుందని తెలిపారు. దీన్ని సఫలీకృతం చేసేందుకు కేంద్రంతో మాట్లాడి.. ఇందులో భాగస్వామ్యం అయ్యేలా ఒప్పించామన్నారు. సెల్ టవర్ల ఏర్పాటుకు అవసరమైన భూములను 2,900 లొకేషన్లలో ఇప్పటికే ఇచ్చామని స్పష్టం చేశారు. ‘ఎటువంటి ఇబ్బంది లేకుండా సెల్ టవర్ల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చాం. పవర్ కనెక్షన్కు చర్యలు తీసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేయాల్సినవన్నీ రెట్టించిన వేగంతో చేశాం. టవర్ల నిర్మాణ కార్యక్రమం ఇప్పటికే మొదలైంది. దేవుడు ఆశీర్వదిస్తే ఇదే మాదిరిగా ప్రతి 3 నెలలకొకసారి...400 నుంచి 500 టవర్ల నిర్మాణం పూర్తి చేసి అన్నింటినీ అందుబాటులోకి తీసుకొస్తాం. మరో ఏడాది కాలంలో అన్ని టవర్ల నిర్మాణం పూర్తి చేస్తాం’ అని తెలిపారు. మారుమూల ఆవాసాల్లో టీవీలు, ఫోన్లు సెల్ టవర్ల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో.. కనెక్టివిటీ లేని ఆవాసాలను సమాజంతో కనెక్ట్ చేసే కార్యక్రమం జరుగుతోందని.. టీవీలు, ఫోన్లు పనిచేస్తాయని సీఎం వైఎస్ జగన్ అన్నారు. మనం ఇచ్చే పథకాలకు సంబంధించి వివరాలన్నింటినీ వెంటనే ఆన్లైన్లో నమోదు చేసే కార్యక్రమం వేగవంతంగా జరుగుతుందని చెప్పారు. మనం బటన్ నొక్కిన వెంటనే వాళ్లకు డబ్బులు ట్రాన్స్ఫర్ కావడం కూడా అంతే వేగంగా జరుగుతుందన్నారు. వెంటనే వాళ్లు చూసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. ఇవన్నీ వేగవంతంగా, ఎఫెక్టివ్గా, పారదర్శకంగా జరగడం కోసమే ఈ కనెక్టివిటీ చాలా అవసరంగా భావించి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని స్పష్టం చేశారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకే వ్యవస్థ, విలేజ్ క్లినిక్లు, నాడు–నేడుతో బాగు పడుతున్న ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు.. ఇవన్నీ గ్రామ రూపురేఖలను మార్చే దిశగా పడుతున్న అడుగులని, ఈ నేపథ్యంలో కనెక్టివిటీ అన్నది అత్యంత ఉపయోగకరమైన అంశం అవుతుందన్నారు. ఈ కార్యక్రమం నిర్వహించిన సీఎం క్యాంపు కార్యాలయంలో ఐటీ, పరిశ్రమలు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, ఐటీ శాఖ కార్యదర్శి కోన శశిధర్, కమ్యూనికేషన్స్ (ఐటీ శాఖ) డైరెక్టర్ సి చంద్రశేఖర్ రెడ్డి, భారతీ ఎయిర్టెల్, రిలయెన్స్ సంస్థల ప్రతినిధులు.. డుంబ్రిగుడ మండలం ఈదులపాలెంలో పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, పాడేరు నియోజకవర్గ సమన్వయకర్త మత్స్యరాస విశ్వేశ్వరరాజు, కలెక్టర్ సుమిత్కుమార్, ఎస్పీ తుహిన్సిన్హా, సబ్కలెక్టర్ «ధాత్రిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. గతంలో ఫోన్ చేయాలంటే కొండ ఎక్కాల్సి వచ్చేది సార్.. మేం గతంలో చాలా ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. గతంలో ఫోన్ చేయాలంటే కొండల పైకి ఎక్కాల్సి వచ్చేది. ఇప్పుడు మా గ్రామంలోనే సెల్ టవర్ ఏర్పాటు చేశారు. సిగ్నల్ బాగా వస్తోంది. మా గ్రామస్తులందరూ సంతోషంగా ఉన్నారు. మాకు గతంలో సచివాలయం అంటే, కలెక్టర్ అంటే, వలంటీర్ అంటే తెలీదు. ఇప్పుడు అందరి గురించి తెలిసింది. జగనన్న మా బాధలు గమనించి మాకు సాయం చేస్తున్నారు. గతంలో రోడ్లు లేవు. ఇప్పుడు చక్కటి రోడ్లు వేశారు. మీరు (సీఎం) ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలు మాకు అందుతున్నాయి. మీరు మా వెంట ఉన్నామన్న భరోసా ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. మీ పథకాల ద్వారా లబ్ధి పొంది మా కాళ్లపై మేం నిలబడ్డాం. మేమంతా కూడా మళ్లీ మీరే రావాలని కోరుకుంటున్నాం. గతంలో మీరు పాడేరు వచ్చినప్పుడు దగ్గర నుంచి చూడలేకపోయాను. ఇప్పుడు నేరుగా మీతో మాట్లాడే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. – చిట్టెమ్మ, గిరిజన మహిళ, పాడేరు మండలం, ఏఎస్ఆర్ జిల్లా ఐదు కిలోమీటర్లు వెళ్లాల్సిన బాధ తప్పింది అన్నా.. మా గిరిజన గ్రామాలకు ఇన్నాళ్లూ ఫోన్ సిగ్నల్ లేదు. 5 కిలోమీటర్లు వెళ్లి ఫోన్ చేయాల్సి వచ్చేది. ఏదైనా ప్రమాదం జరిగినా అంబులెన్స్ వాళ్లకు చెప్పడానికి కూడా ఫోన్ సిగ్నల్ ఉండేది కాదు. మా బంధువుల కష్టసుఖాలు తెలిసేవి కాదు. కానీ ఇప్పుడు నేరుగా వారితో మాట్లాడుతున్నాం. మా పిల్లలు కూడా బాగా చదువుకుంటున్నారు. నేరుగా టీచర్స్తో మాట్లాడుతున్నాం. ఇదివరకు గవర్నమెంట్ స్కీమ్స్ గురించి తెలిసేది కాదు. ఇప్పుడు నేరుగా జగనన్నకు చెబుదాం నెంబర్ 1902కు కాల్ చేసి మాట్లాడగానే మా సమస్య పరిష్కారం అవుతోంది. ఆరోగ్యశ్రీ యాప్, దిశ యాప్ విలువ తెలిసింది. మా సచివాలయంలో ఇదివరకు సిగ్నల్ లేక ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు మీ చొరవ వల్ల ఇంటి నుంచే అన్నీ తెలుసుకుంటున్నాం. ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేకుండా ఊళ్లోనే అన్ని సేవలు అందుతున్నాయి. మీ వల్ల అందరం చాలా సంతోషంగా ఉంటున్నాం. – చలపతిరావు, గిరిజనుడు, పార్వతీపురం మన్యం జిల్లా -
వైఎస్సార్సీపీ ప్రభుత్వ మేలును ప్రజల్లోకి తీసుకెళ్లాలి: సజ్జల
సాక్షి, విజయవాడ: వైఎస్సార్ ఆశయాలు.. ఆలోచనలకు అనుగుణంగా పెట్టిన పార్టీ వైఎస్సార్సీపీ.. అణగారిన వర్గాలతో అసోసియేట్ అవ్వడమే ప్రధాన లక్ష్యమని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం ఆయన ఆంధ్రప్రదేశ్ ఎస్సీ,ఎస్టీ గెజిటెడ్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 2024-డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సీఎం జగన్.. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసి తన చిత్తశుద్ధి నిరూపించుకున్నారన్నారు. ‘‘పథకాలు, సంస్కరణల్లో సీఎం జగన్ బడుగు బలహీన వర్గాలకు పెద్ద పీట వేశారు. అణగారిన వర్గాలనుపైకి తీసుకువచ్చే ప్రక్రియలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల భాగస్వామ్యం కావాలి. గత ప్రభుత్వాలు వెనుకబడిన తరగతుల కోసం ఖర్చు చేసిందేమీ లేదు. సంపన్నులతో పోటీ పడే స్థాయికి అన్ని వర్గాలనూ తీర్చిదిద్దిన ఘనత సీఎం జగన్కే దక్కింది. సచివాలయ ఉద్యోగాల్లో 80 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీలకే దక్కాయి. మేనిఫెస్టోలో లేనివి కూడా సీఎం జగన్ అమలు చేశారు’’ అని సజ్జల పేర్కొన్నారు. ‘‘టీడీపీ హయాంలో పథకాలు కొందరికే దక్కేవి. సీఎం జగన్ అర్హులైన వారిని వెతికి మరీ ఇచ్చారు. ఈ నాలుగున్నరేళ్లలో జరిగినంత సంక్షేమం స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జరగలేదు. ఎన్నికలు రాబోతున్నాయ్. మీ భవిష్యత్తులు మారాలంటే.. మీరంతా ప్రభుత్వం చేస్తున్న మేలును ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఏ చిన్న తేడా జరిగినా పేదలకు జరుగుతున్న మంచి దూరమైపోతుంది. మీడియాను మేనేజ్ చేస్తే సరిపోతుందని కొన్ని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఏమీ జరగడం లేదని ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచికి.. అభివృద్ధికి పబ్లిసిటీ అవసరం లేదని సీఎం భావించారు’’ అని సజ్జల తెలిపారు. ఇదీ చదవండి: భావితరాలకు అనుగుణంగా సీఎం జగన్ పాలన: సజ్జల కొత్తగా రూపుదిద్దుకుంటున్న పోర్టులు రాష్ట్రం రూపురేఖలు మార్చేస్తాయి. 11 మెడికల్ కళాశాలల ద్వారా దేశానికి కావాల్సిన వైద్యులను ఏపీ అందించబోతోంది. అంబేద్కర్కు హిమాలయాలంత విగ్రహం పెట్టినా సరిపోదు. అంతర్జాతీయ స్థాయిలో అంబేద్కర్ విగ్రహం, స్మృతివనం రూపుదిద్దుకుంది. అంబేద్కర్ విగ్రహం గొప్ప పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుకుంటుంది. అమెరికాలో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కనిపిస్తుంది. విజయవాడలో కొండ పై అమ్మవారు...కొండ కింద అంబేద్కర్ కనిపిస్తారు. దళితుల నుంచి మరింత మేధావులు రావాలనేదే సీఎం జగన్ ఆలోచన. ఆయన చేపట్టిన యజ్ఞంలో మీరంతా భాగస్వామ్యం కావాలని కోరుతున్నా’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. -
మహిళల ముఖాల్లో చిరునవ్వులు చూడటమే సీఎం జగన్ లక్ష్యం
-
మహిళల ముఖాల్లో చిరునవ్వులు చూడటమే సీఎం జగన్ లక్ష్యం
-
AP: సంక్షేమ పథకాలపై సైబర్ నేరగాళ్ల కన్ను
సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలపై సైబర్ నేరగాళ్లు కన్ను పడింది. అమ్మ ఒడి, చేయూత, జగన్నన విద్యా దీవెన, వైఎస్సార్ కాపు నేస్తం, వాహన మిత్ర లాంటి పథకాలు వస్తున్నాయా అంటూ ఫోన్ కాల్స్ చేస్తున్న సైబర్ నేరగాళ్లు.. ఏదైనా పథకం రాక పోతే వెంటనే డబ్బులు ఖాతాలో వేస్తామంటూ కేటుగాళ్లు లింక్ పంపిస్తున్నారు. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఢిల్లీ కేంద్రంగా రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు.. ఫోన్ చేసి అమాయకుల్ని నిండా ముంచేస్తున్నారు. ఇలాంటి లాంటి ఫోన్ కాల్స్ నమ్మొద్దని, అప్రమత్తంగా ఉండాలని విశాఖ పోలీసులు తెలిపారు. -
సీఎం జగన్ వ్యూహంతో బాబుకు వణుకు..
-
క్లీన్స్వీపే లక్ష్యం
సాక్షి, అమరావతి: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో 175కు 175 శాసనసభ స్థానాల్లో వైఎస్సార్ర్సీపీ విజయమే లక్ష్యంగా ఆ పార్టీ అధ్యక్షులు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగులు వేస్తున్నారు. జనబలమే గీటురాయిగా.. సామాజిక న్యాయం చేకూర్చడంలో మరో అడుగు ముందుకేస్తూ అవసరమైన అసెంబ్లీ, లోక్సభ స్థానాల్లో సమన్వయకర్తలను మారుస్తున్నారు. ఇప్పటికే 50 శాసనసభ, 9 లోక్సభ స్థానాలకు కొత్తగా సమన్వయకర్తలను నియమించారు. మెరుగైన ఫలితాలు సాధించడానికి అవసరమైన చోట్ల సమన్వయకర్తలను మార్చడంపై కసరత్తు కొనసాగిస్తూనే.. క్లీన్స్వీపే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసేందుకు సమాయత్తమయ్యారు. ఇందులో భాగంగా.. రాష్ట్రవ్యాప్తంగా ఐదు ప్రాంతాల్లో కార్యకర్తలతో సమావేశమై.. 175 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించడానికి చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఈ క్రమంలో తొలుత ఉత్తరాంధ్ర ప్రాంత కార్యకర్తలతో విశాఖపట్నం జిల్లా భీమిలిలో ఈనెల 25న సమావేశం నిర్వహించాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఇలా ఐదుచోట్ల కార్యకర్తల సమావేశాలు పూర్తయిన వెంటనే ఎన్నికల ప్రచారానికి ఆయన శ్రీకారం చుట్టనున్నారు. సంక్షేమాభివృద్ధి, సంస్కరణలతో విప్లవాత్మక మార్పు.. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 95 శాతం సీఎం జగన్ అమలుచేశారు. ఇప్పటికి 99.5% హామీలు అమలుచేశారు. విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక.. ఇలా అన్ని రంగాల్లో సంస్కరణలతో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. గ్రామ, వార్డు సచివాలయాలు.. పునర్విభజన ద్వారా కొత్త జిల్లాల ఏర్పాటుతో సహా వికేంద్రీకరణ ద్వారా సుపరిపాలన అందిస్తున్నారు. సంక్షేమ పథకాల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) రూపంలో ఇప్పటికే రూ.2.46 లక్షల కోట్లను పేదల ఖాతాల్లో జమచేశారు. నాన్ డీబీటీ రూపంలో రూ.1.67 లక్షల కోట్ల ప్రయోజనాన్ని చేకూర్చారు. డీబీటీ, నాన్ డీబీటీ వెరసి రూ.4.13 లక్షల కోట్ల లబ్ది చేకూర్చారు. ఇందులో 75% నిధులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే చేరాయి. సంక్షేమాభివృద్ధి, సుపరిపాలనతో వచ్చిన విప్లవాత్మక మార్పులు ప్రతి నియోజకవర్గంలో కళ్లకు కట్టినట్లు కన్పిస్తున్నాయి. ఆ మార్పును గుర్తుచేసి.. మరింత మేలుచేయడానికి ఆశీర్వదించాలని కోరుతూ 2022, మే 11న గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. ఇంటింటా ఈ కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వైఎస్సార్సీపీకి ప్రజాదరణ పైపైకి.. ఇక ప్రతి ఇంట్లో.. ప్రతి గ్రామంలో.. ప్రతి నియోజకవర్గంలో మార్పు కళ్లెదుటే కన్పిస్తున్నప్పుడు 175కు 175 స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించడం సుసాధ్యమేనని గడప గడపకూ మన ప్రభుత్వం వర్క్షాప్లలో ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలకు జగన్ దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలో ప్రతి ఇంటికీ చేసిన మంచిని వివరించడానికి చేపట్టిన ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంలో 80% ప్రజలు ‘మా నమ్మకం నువ్వే జగన్’ అంటూ నినదించి, ప్రభుత్వానికి మద్దతు పలికారు. ఇది జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేల్లో ప్రస్ఫుటితమైంది. ఈ నేపథ్యంలో.. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే 25కు 25 లోక్సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించడం తథ్యమని టైమ్స్ నౌ వంటి ప్రముఖ జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే గడాది అక్టోబరు 10న విజయవాడలో పార్టీ ప్రతినిధుల సదస్సు నిర్వహించి 175కు 175 స్థానాల్లో విజయమే లక్ష్యంగా చేపట్టాల్సిన చర్యలపై సీఎం జగన్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. -
జగనన్న పాలన.. పల్లెకు పండగొచ్చింది
సాక్షి, అమరావతి: సంక్రాంతి అంటేనే పల్లెకు ప్రత్యేక కళ వస్తుంది. పచ్చని పంట పొలాలు, ఇంటికి చేరిన ధాన్యం రాశులతో రైతన్నలు సంతోషంగా ఉండే సమయంలో ఈ పండుగ వస్తుంది. నాడు కరువు కాటకాలు, కరెంట్ కోతల మధ్య కష్టాలు, అప్పులతో తల్లడిల్లిన కుటుంబాల్లో సంక్రాంతి సంబురాలు అంతగా కనిపించేవి కావు. కానీ, జగనన్న పాలనలో ఊరు మారింది.. సంక్రాంతితో సంబంధం లేకుండా పల్లెకు పండగొచ్చింది. అది ఎలా ఉందంటే.. వైఎస్సార్ రైతు భరోసా కేంద్రం విత్తనం నుంచి పంట విక్రయం వరకు రైతన్నలకు అన్ని సేవలు గడప వద్దనే అందించే వన్ స్టాప్ సెంటర్లుగా 10,778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. గ్రామ సచివాలయం గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేస్తూ గడప వద్దకే 540కి పైగా ప్రభుత్వ సేవలు అందించేలా 15,004 గ్రామ/ వార్డు సచివాలయాలు ఏర్పాటు, 1,35,819 మంది శాశ్వత ఉద్యోగులు, 2.60 లక్షల నుంది వాలంటీర్ల ద్వారా సేవలు అందిస్తున్నారు. డా. వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ 2,500 మంది జనాభాకు ఒకటి చొప్పున రాష్ట్రంలో మొత్తం 10,132 విలేజ్ హెల్త్ క్లీనిక్లు, ఉచిత వైద్యసేవలు, 14 రకాల పరీక్షలు, 105 రకాల మందులు అందుబాటులో.. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో సేవలు అందిస్తున్నారు. మనబడి "నాడు-నేడు” కార్పొరేట్ స్కూళ్లే ప్రభుత్వ బడులతో పోటీ పడేలా ఇంగ్లీషు మీడియం, డిజిటల్ బోధనతో మన విద్యార్థులను గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దుతూ రూ.17,805 కోట్ల ఖర్చుతో రాష్ట్రంలోని 56,703 విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఆధునికీకరణ మూడు దశల్లో.. 8వ తరగతి విద్యార్థులకు ఉచిత ట్యాబ్లు.. బై లింగువల్ టెక్స్ట్ బుక్స్ బైజూస్ కంటెంట్.. జగనన్న గోరుముద్ద. విద్యా కానుక అమలు చేస్తున్నారు. వైఎస్సార్ డిజిటల్ లైబ్రరీ వర్క్ ఫ్రమ్ హోం కాన్సెప్టును బలోపేతం చేసే దిశగా, పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న యువతకు 12,979 పంచాయతీల్లో కడుతున్న వైఎస్సార్ విలేజ్ డిజిటల్ లైబ్రరీలు, అన్లిమిటెడ్ బ్యాండ్ విడ్త్తో అందుబాటులోకి తీసుకువచ్చారు. అంగన్వాడీ కేంద్రం పిల్లలు, గర్భిణీలు, బాలింతల పోషణ, బంగారు భవిష్యత్తుకు రక్షణ కల్పిస్తూ రాష్ట్రవ్యాప్తంగా 55,607 అంగన్ వాడీ కేంద్రాలు.. నాడు-నేడు ద్వారా అంగన్వాడీలో మంచి వసతులు, మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా వేగంగా అడుగులు.. సంపూర్ణ పోషణ, పోషణ ప్లస్ ద్వారా బలవర్ధక ఆహారం అందిస్తున్నారు. వలంటీర్ల సేవలు దరఖాస్తు చేసుకోవడం నుండి లబ్ది పొందే వరకు లబ్దిదారుల చేయి పట్టుకొని నడిపిస్తూ వారి గడప వద్దనే సేవలు అందిస్తున్న 2.60 లక్షల మంది వలంటీర్లను ఏర్పాటు చేశారు. చదవండి: ఏపీ ఎన్నికలు 2024: రాష్ట్రవ్యాప్తంగా సీఎం జగన్ పర్యటన.. వైఎస్సార్సీపీ కేడర్తో భేటీ -
నాలుగున్నరేళ్లుగా ప్రజారంజక పాలన
‘పేదవాళ్లు పింఛన్ కావాలన్నా.. రేషన్ కార్డును అడగాలన్నా గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అయినా వారికి న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర్నుంచీ సంక్షేమ పథకాలు అర్హుల ఇంటి గుమ్మంలోకే వస్తున్నాయి. గ్రాఫిక్స్లోనే కనిపించిన అభివృద్ధిని గ్రామ స్థాయిలో చేసి చూపించారు సీఎం వైఎస జగన్. అసత్య హామీలతో ప్రజలను చంద్రబాబు వంచించారు. అన్నం పెట్టే జగన్ను కాదని.. సున్నం రాసే బాబుకు జనం ఓటేయరు.’ అంటూ మేథావి వర్గం స్పష్టంగా చెప్పింది. ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్, సోషల్ డెమొక్రటిక్ ఫ్రంట్ సంయుక్తంగా ‘జగన్ పాలన–ప్రజా తీర్పు’ అనే అంశంపై బుధవారం విజయవాడలో రాష్ట్రస్థాయి ప్రజా సదస్సు నిర్వహించాయి. ఈ సమావేశంలో వివిధ రంగాలకు చెందిన మేధావులు పాల్గొన్నారు. వారి అభిప్రాయాలు వారి మాటల్లోనే.. – సాక్షి, అమరావతి విద్యా రంగంలో మరో నార్వేలా ఆంధ్రప్రదేశ్ – ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీవీఆర్ కృష్ణంరాజు సీఎం జగన్ రాష్ట్రంలో విద్యా రంగాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్తున్నారు. విద్యా రంగంలో ఏపీ మరో నార్వేగా మారుతోంది. తొలిసారిగా విద్యార్థులకు సీఎం జగన్ 6 లక్షల ట్యాబ్లు ఇచ్చారు. రూ. 8 వేల కోట్ల విలువైన కంటెంట్ను ఉచితంగా ఇస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో నో అడ్మిషన్స్ బోర్డు పెట్టే స్థాయికి తెచ్చారు. దేవాలయాలను పునరుద్ధరిస్తున్నారు. ప్రధాన దేవాలయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్లు రూపొందించారు. ప్రతి రంగంలోనూ ఏపీ అభివృద్ధిలో ఉంది. కోవిడ్ సమయంలో సీఎం జగన్ చేపట్టిన చర్యల వల్ల ఇతర రాష్ట్రాలతో పోల్చితే మరణాలు తక్కువ. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఇతర ఎల్లో మీడియా సీఎం జగన్ ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నాయి. అసత్యాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయి. ఉదాహరణకు ఈ నెల 4న ఈనాడులో 53, జ్యోతిలో 50 నెగెటివ్ వార్తలు వచ్చాయి. సాక్షి పత్రికలో ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధిని ప్రతిబింబిస్తూ కథనాలు వస్తున్నాయి. ఏ పార్టీ లక్షణాలు ఏమిటో తెలుసుకోవడానికి ఇంతకంటే ఉదాహరణ అవసరంలేదు. వై నాట్ 175 జరిగి తీరుతుంది సీఎం వైఎస్ జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాల వల్ల వైనాట్ వైఎస్సార్సీపీ మరోసారి ఘనవిజయం సాధిస్తుంది. సీఎం జగన్ చెప్పిన వై నాట్ 175 జరిగితీరుతుంది. సీఎం జగన్ ప్రజల జీవన ప్రమాణాలను పెంచేలా పాలన చేస్తున్నారు. రాష్ట్రానికి ఆర్థిక పరిపుష్టిని తీసుకువస్తున్నారు. ఎల్లో మీడియా విషపు రాతలు, ప్రతిపక్షాల కుట్రలు పటాపంచలయ్యేలా ప్రజలు మరోసారి సీఎం జగన్కు పట్టం కడతారు. సీఎం జగన్ పేదలకు ఇళ్లు కట్టిస్తుంటే చంద్రబాబు స్టేలు తెచ్చి వాటిని అడ్డుకోవాలని చూస్తున్నారు. – సోషల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం సీఎం జగన్ సంస్కరణలు మంచి ఫలితాలనిస్తాయి సంక్షేమం అంటే మంచి జరగడం. సీఎం జగన్ పాలనలో ఇదే జరుగుతోంది. అన్ని వర్గాలకూ పథకాలు అందుతున్నాయి. సామాజిక న్యాయం, సంక్షేమమే ప్రధాన కర్తవ్యంగా సీఎం పనిచేస్తున్నారు. రాష్ట్ర ఆరి్థక సూచీలు వృద్ధిలో ఉన్నాయని కేంద్రమే ప్రశంసిస్తోంది. జగన్ చేస్తున్న సంస్కరణలు భవిష్యతులో మంచి ఫలితాలనిస్తాయి. – గీతావిజన్ ట్రస్ట్ వ్యవస్థాపకులు పొక్కులూరి సుబ్బారావు అది దుష్ప్రచారమే బలిసినొడికీ బక్కోడికీ జరుగుతున్న పోరాటం ఇది. బలిసినోళ్ల వైపు చంద్రబాబు ఉంటే.., బక్కోళ్లకు అండగా సీఎం జగన్ ఉన్నారు. బాబు పాలనలో ఆటోడ్రైవర్లపై వేధింపులు ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు వాహన మిత్రతో జగన్ మమ్మల్ని ఆదుకుంటున్నారు. పేదలకు సంక్షేమ ప«థకాలిచ్చి సోమరిపోతులను చేస్తున్నారనేది దు్రష్పచారమే. – ఆటో డ్రైవర్స్ అసోసియేషన్ ప్రతినిధి వినోద్ బెస్ట్ సీఎం వైఎస్ జగన్ సంక్షేమం, అభివృద్ధి, అనేక సంస్కరణలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెస్ట్ సీఎం అనిపించుకుంటున్నారు. కోవిడ్ సమయంలో సీఎం వైఎస్ జగన్ చేపట్టిన చర్యలు నభూతో నభవిష్యతి. రెండేళ్లు కోవిడ్లో పోయాయి. ఆ తర్వాత రెండేళ్ల నుంచే అసలు పాలన మొదలైంది. ఈ రెండేళ్లలోనే విద్యా రంగంలో రాష్ట్రం కేరళను అధిగమించేలా చేశారు. మరో ఇరవై ఏళ్లు సీఎంగా జగన్కు అవకాశం ఇస్తే అమెరికా, సింగపూర్లా ఏపీ ఎందుకు అవదు? పాత ముఖ్యమంత్రిలా గ్రాఫిక్స్ చూపించడం లేదు. పోర్టులు వస్తున్నాయి. పరిశ్రమలు వస్తున్నాయి. ఇంటింటికీ డాక్టర్ వస్తున్నారు. ఇది జరుగుతుందని ఎప్పుడైనా ఊహించామా? రేషన్ ఇంటికే వస్తోంది. ఇలాంటి పాలన, ఇలాంటి సీఎం లేకపోతే రాష్ట్రం మరో 75 ఏళ్లు వెనక్కి పోతుంది. – ఆంధ్రా అడ్వకేట్స్ ఫోరం కన్వీనర్ అశోక్ కుమార్ అందరికీ మంచి జరుగుతోంది గత ప్రభుత్వంలో సబ్సిడీ లోన్ అని మూడో వంతు లంచాల రూపంలో తినేశారు. సీఎం జగన్ మమ్మల్ని ప్రతి దేవాలయంలో బోర్డు డైరెక్టర్లుగా నియమిస్తున్నారు. జగనన్న చేదోడు ద్వారా సాయం చేస్తున్నారు. మంత్రివర్గంలో చోటిచ్చారు. నాయీ బ్రాహ్మణులకు గతంలో కనీస వేతనాలు కోరినా ఇవ్వలేదు. సీఎం జగన్ గుడిబయట ఉండే నాయీ బ్రాహ్మణులను గుడిలోపలికి తీసుకువచ్చారు. క్షౌరశాలల్లో రూ.20 వేల జీతం ఇస్తున్నారు. – నాయీ బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు గణపతిరావు, మల్కాపురం కనకారావు సీఎం జగన్ పాలన కోల్పోతే రాక్షస పాలన వస్తుంది సీఎం జగన్ పేదల సంక్షేమం, రాష్టర సమగ్రాభివృద్ధితో సుపరిపాలన అందిస్తున్నారు. ఆయన క్రిస్టియన్ అయితే అనేక దేవాలయాలను అభివృద్ధి చేస్తారా? సీఎం వైఎస్ జగన్ అందిస్తున్న జనరంజక పాలనను కోల్పోతే రాక్షస పాలన వస్తుంది. – ప్రొఫెసర్ రాచకొండ ముత్యాలరాజు అభివృద్ధికి ఇదే నిదర్శనం రాష్ట్రంలోని బ్యాంకుల్లో డిపాజిట్లు గతంలోకంటే ఇప్పుడు రూ.85 వేల కోట్లు పెరిగాయి. అభివృద్ధికి ఇదే నిదర్శనం. ప్రజల తలసరి ఆదాయం పెరిగింది. పరిశ్రమలు పారిపోతే ఈజ్ ఆఫ్ డూయింగ్లో ఏపీ ఏటా ప్రథమ స్థానంలో ఉంటుందా? అన్నం పెట్టే జగన్కే ప్రజలంతా ఓటేస్తారు. అబద్ధాలు, మోసాలతో సున్నం రాసే చంద్రబాబుకు జనం ఓటేయరు. – బెటర్ ఆంధ్రప్రదేశ్ సంస్థ అధ్యక్షుడు మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎల్లో మీడియాదంతా అసత్య ప్రచారమే చంద్రబాబుని మరోసారి అధికారంలోకి తెచ్చేందుకు ఎల్లో మీడియా మొత్తం అసత్య ప్రచారం చేస్తోంది. ఈ ప్రయత్నాన్ని అడ్డుకోవాలి. పెత్తందారుల పాలనను రానివ్వకూడదు. సీఎం జగన్ రూపాయి అవినీతి లేకుండా రూ. 2.50 లక్షల కోట్లు ప్రజలకు అందించారు. వాటి ద్వారా మన రాష్ట్ర ఆరి్థక వ్యవస్థ బాగుపడుతోంది. ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాలొచ్చాయి. రాష్ట్రానికి ఆస్తుల కల్పన జరిగింది. – ఎన్నారై వెంకట్ మేడపాటి ఇప్పుడున్నది ఆరోగ్యవంతమైన సమాజం సీఎం వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రం అన్ని విధాలా ముందుంది. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నది ఆరోగ్యవంతమైన సమాజం. సీఎం జగన్ నాణ్యమైన విద్య, వైద్యాన్ని అందిస్తున్నారు. వ్యవసాయ రంగానికి భరోసా కల్పిస్తున్నారు. హెల్త్ క్లినిక్లు, ఆర్బీకేలతో గ్రామీణులకు మేలు చేస్తున్నారు. – సోషల్ వర్కర్ వెంకటరెడ్డి పేద పిల్లలు విదేశాల్లో చదవడం చిన్న విషయం కాదు సీఎం జగన్ విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తెస్తున్నారు. ఎన్నో కష్ట నష్టాలకోర్చి ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకొనే పేద పిల్లల కలలను సాకారం చేస్తున్నారు. వారికి అయ్యే ఖర్చంతా చెల్లిస్తున్నారు. పేద పిల్లలు విదేశాల్లో చదవడం చిన్న విషయం కాదు. – విశ్రాంత అధ్యాపకులు రెహమాన్ సాయెబ్ ఏపీ తలెత్తుకొనేలా జగన్ పాలన ఏపీ తలెత్తుకొనేలా సీఎం జగన్ పాలన సాగుతోంది. చంద్రబాబు హయాంలో ఒక్క పోర్టు, ఒక్క మెడికల్ కాలేజీ కట్టలేకపోయారు. సీఎం జగన్ 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు కడుతున్నారు.17 వైద్య కళాశాలలు నిర్మిస్తున్నారు. 2.94 లక్షల ఉద్యోగాలిచ్చారు. కేంద్ర ఈపీఎఫ్ లెక్కల ప్రకారం 16 లక్షల ఉద్యోగాలొచ్చాయి. – సామాజిక కార్యకర్త గూడపురెడ్డి శేఖరరెడ్డి సుపరిపాలనంటే ఇదీ సుపరిపాలన అంటే సీఎం జగన్ అందిస్తున్న పాలన. ప్రతి పేదవాడికీ ఇల్లు ఇస్తున్నారు. కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందుతోంది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పాలనను ప్రజల ముంగిటకే తెచ్చారు. గతంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థను నాశనం చేసి ప్రైవేటు విద్యాసంస్థలను ప్రోత్సహించారు. – హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధి ముక్కు వెంకటేశ్వరరెడ్డి మదర్ థెరిసా ఆదర్శంగా జగన్ పాలన మదర్ థెరిస్సాను సీఎం జగన్ ఆదర్శంగా తీసుకున్నారు. పార్టీలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల పేదలకు నవరత్న పథకాలు అందిస్తున్నారు. పని చేయని వారు పని చేస్తున్న వారిని విమర్శించడం సహజం. – గుంటూరు ఏసీ కళాశాల మాజీ ప్రిన్సిపల్ డాక్టర్ పోలే ముత్యం బ్రాహ్మణులకు మేలు చేస్తున్న సీఎం జగన్ రాష్ట్రంలో బ్రాహ్మణులకు సీఎం వైఎస్ జగన్ చాలా మేలు చేస్తున్నారు. వంశ పారంపర్య వ్యవస్థను పునరుద్ధరించారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. కామన్ డెవలప్మెంట్ ఫండ్ ఇచ్చారు. ధూప దీప నైవేద్యాలకు, అర్చకుల వేతనాలను కూడా భారీగా ఇస్తున్నారు. – అర్చకులు ప్రసన్నాంజనేయ కుమారశర్మ -
పరిపాలనలో ‘రెవెన్యూ’ కీలకం
కుత్బుల్లాపూర్: రెవెన్యూ శాఖ పరిపాలనలో కీలకమని, ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడానికి రెవెన్యూ ఉద్యోగులు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్న తీరు అభినందనీయమని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. మంగళవారం కొంపల్లిలో తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్విసెస్ అసోసియేషన్ (ట్రెసా) రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభకు మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రెవెన్యూ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, గత ప్రభుత్వం ఆ శాఖను నిర్విర్యం చేసిందని, భూరికార్డులను ధరణి పేరుతో అస్తవ్యస్తంగా నిర్వహించడంతో రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో రెవెన్యూ శాఖను పటిష్టపరిచి రైతులకు న్యాయం చేస్తామని, రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం రవీందర్రెడ్డి మాట్లాడారు. ట్రెసా ప్రధాన కార్యదర్శి గౌతమ్ కుమార్ మాట్లాడుతూ గ్రామ రెవెన్యూ స్థాయిలో సేవలకు ఆటంకం కలగకుండా క్షేత్రస్థాయిలో సిబ్బందిని నియమించాలని కోరారు. కార్యక్రమానికి సుమారు 5వేలకు పైగా రెవెన్యూ ఉద్యోగులు తరలిరావడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. -
సంక్షేమం కొనసాగింపు జగన్కే సాధ్యం
డాబాగార్డెన్స్ (విశాఖపట్నం): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో అమలుచేస్తున్న సంక్షేమ ఫలాలు కొనసాగాలంటే వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఆయననే సీఎంగా గెలిపించుకోవాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఈ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ ఫలాలు ఏ ప్రభుత్వం వచ్చినా కొనసాగించలేవని కుండబద్ధలుగొట్టారు. మరే పాకి సంక్షేమ ఫలాలు అందించే సత్తా లేదన్నారు. సంఘ సంస్కర్త జగన్ను గెలిపించుకోవల్సిన బాధ్యత బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనాలతో పాటు అన్ని వర్గాల ప్రజలపై ఉందని తెలిపారు. ఆయన ఆదివారం నగరంలోని ఓ హోటల్లో విలేకరులతో మాట్లాడారు. అధికారం కోసం ప్రతిపక్ష పార్టీలు బీసీలను ప్రలోభపెడుతున్నాయని, అటువంటి వాటిని తిప్పికొట్టాలన్నారు. బీసీల కోసం అనేక సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని స్పష్టంచేశారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో బీసీ ముఖ్యమంత్రులున్నప్పటికీ ఆయా రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న సంక్షేమ ఫలాలు అమలుకావడం లేదన్నారు. స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేళ్లలో ఏ నాయకుడు ప్రవేశపెట్టని, అమలుచేయలేని ఎన్నో సంక్షేమ పథకాలు జగన్ ప్రవేశపెట్టి దేశంలో వివిధ రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారని గుర్తుచేశారు. 70 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు దాదాపు 70 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని కృష్ణయ్య చెప్పారు. శాసనసభ స్పీకర్ పదవి బీసీ, శాసనమండలి చైర్మన్ ఎస్సీ వర్గానికి ఇవ్వడమే గాక 18 మంది ఎమ్మెల్సీల్లో 11 సీట్లు బీసీలకు కేటాయించడం చూసి దేశంలోని బీసీలంతా ఆశ్చర్యం వ్యక్తంచేశారన్నారు. పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని పార్లమెంట్ చరిత్రను జగన్మోహన్రెడ్డి తిరగరాశారన్నారు. అందుకు వైఎస్సార్ సీపీ రెండేళ్ల కిందట బీసీ బిల్లు పెట్టిందని, మద్దతుగా 14 రాజకీయ పాల మద్దతు కూడగట్టిందన్నారు. అధికార బీజేపీ వ్యతిరేకించడంతో బిల్లు పెండింగ్లో ఉందన్నారు. చివరకు పార్లమెంట్లో బీసీ పార్టీలుగా చెప్పుకుంటున్న డీఎంకే, అన్నాడీఎంకే, పీఎంకే, ఆర్జేడీ, సమాజ్వాద్ పార్టీ, బీఎస్పీ, ఆప్నాదళ్, జనతాదళ్ వంటి పాలు కూడా బీసీ బిల్లు పెట్టలేదన్నారు. 50 శాతం నామినేటెడ్ పోస్టులు బీసీలకే.. ఏపీలో 50 శాతం నామినేటెడ్ పోస్టులు వెనుకబడిన వర్గాలకు ఇవ్వడమే గాక, కాంట్రాక్టు పనుల్లో 50 శాతం కోటా ఇస్తూ అసెంబ్లీలో చట్టం చేసి దేశంలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ ముఖ్యమంత్రులకు జగన్ సవాల్ విసిరారని కృష్ణయ్య చెప్పారు. 56 బీసీ కులాల కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్లకు 56 చైర్మన్లు, 672 మంది డైరెక్టర్లను నియమించారన్నారు. 193 కార్పొరేషన్లకు సంబంధించి 109 కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కడం చూసి ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు దిమ్మతిరిగిందన్నారు. మంత్రివర్గంలో ఏకంగా 17 పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే అవకాశం కల్పించడం ద్వారా సరికొత్త సామాజిక మహావిప్లవాన్ని సీఎం ఆవిష్కరించారని చెప్పారు. ఐదుగురు డిప్యూటీ సీఎం పదవులు ఇస్తే..నాలుగు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనాలకే అవకాశం కల్పించారన్నారు. రాజ్యసభలో 9 మంది వైఎస్సార్ సీపీ సభ్యులుంటే..అందులో ఐదుగురు బీసీలేనని పేర్కొన్నారు. కాగా, చట్ట సభల్లో బీసీ రిజర్వేషన్ అమలు చేయాలంటూ ఈ నెల 29, 30 తేదీల్లో దేశ రాజధాని ఢిల్లీలో పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించనున్నట్టు ఆర్.కృష్ణయ్య తెలిపారు. -
మనసున్న ముఖ్యమంత్రి జగన్
సాక్షి, అమరావతి: దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో గిరిజనులకు అత్యధికంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ మాజీ ఎంపీ, ఆచార్య అజ్మీర సీతారాంనాయక్ అన్నారు. గిరిజనులకు అన్ని విధాలుగా మేలు చేస్తున్న మనసున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని ప్రశంసించారు. ఆదివారం విజయవాడలో ‘గిరిజన శంఖారావం’ సభకు ముఖ్య అతిథిగా హాజరైన సీతారాంనాయక్ మాట్లాడుతూ.. ఏపీలో ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరుగా కమిషన్లు ఏర్పాటు చేసి వారి సమస్యల పరిష్కారానికి ముందడుగు వేయడం గొప్ప విషయమన్నారు. ఏపీలో గిరిజనులకు జరుగుతున్నంత సంక్షేమం, అభివృద్ధి దేశంలో మరెక్కడా అందడం లేదని చెప్పారు. అందుకే ఏపీలోని గిరిజనులు జగన్ను దేవుడిగా అభిమానిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పపూలు ఏరుకుని బతికే కుటుంబానికి చెందిన తాను ఉమ్మడి ఏపీలో మొదటి పీహెచ్డీ చేసిన గిరిజన వ్యక్తినని చెప్పారు. విద్య ద్వారానే సమాజంలో ఉన్నతంగా ఎదుగుతామన్నారు. రాష్ట్రంలో గిరిజనులకు ఆర్థిక, సామాజిక, రాజకీయ ప్రాధాన్యత ఏపీ ఎస్టీ కమిషన్ చైర్మన్ డీవీజీ శంకరరావు మాట్లాడుతూ.. సీఎం జగన్ రాష్ట్రంలోని గిరిజనులకు ఆర్థిక, సామాజిక, రాజకీయ ప్రాధాన్యతను మరింతగా పెంచాలనే తపనతో పనిచేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో గిరిజనుల మాట వినే ప్రభుత్వం ఉందని, దాన్ని మళ్లీ నిలబెట్టుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. గిరిజనులకు ఉప ముఖ్యమంత్రులుగా అవకాశం గిరిజన ప్రజా సమాఖ్య, గిరిజన విద్యార్థి సమాఖ్య వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు, ఎస్టీ కమిషన్ సభ్యుడు వడిత్యా శంకర్నాయక్ మాట్లాడుతూ.. గత టీడీపీ ప్రభుత్వం గిరిజనులకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదన్నారు. కానీ సీఎం జగన్ రెండు మంత్రివర్గాల్లోనూ గిరిజనులకు ఉప ముఖ్యమంత్రులుగా అవకాశం కల్పించారని చెప్పారు. ఎమ్మెల్సీలుగా గిరిజనులకు అవకాశం ఇచ్చి చరిత్ర సృష్టించారని చెప్పారు. అడవులకే పరిమితం అనుకున్న గిరిజన బిడ్డలను సీఎం జగన్ రాజకీయ రంగంలో కూడా చేయి పట్టుకొని ముందుకు నడిపిస్తున్నారని చెప్పారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించుకొని.. మరింతగా అభివృద్ధి చెందుదామని పిలుపునిచ్చారు. జీపీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు జి.మల్లిఖార్జున నాయక్, జీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కె.రాజునాయక్ మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాకే గిరిజన తండాలకు రోడ్లు, తాగునీటి సౌకర్యం, విద్య, వైద్యం.. తదితర సదుపాయాలన్నీ అందుబాటులోకి వచ్చాయన్నారు. రాష్ట్రంలో పెత్తందారులతో జరుగుతున్న యుద్ధంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనా, అగ్రవర్ణ పేదల నాయకుడైన సీఎం జగన్ను గెలిపించుకుందామని కోరారు. గిరిజనులకు ఎంతో మేలు చేస్తున్న సీఎం జగన్ రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైందన్నారు. కార్యక్రమంలో ఎస్టీ కమిషన్ సభ్యులు కె.రామలక్ష్మి, జె.లిల్లీ, నెల్లూరు నగర మేయర్ పొట్టూరి స్రవంతి, కదిరి రూరల్ జెడ్పీటీసీ కృష్ణ నాయక్, పలు కార్పొరేషన్ల డైరెక్లర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీ, గిరిజన సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రముఖ బంజార కళాకారుడు బిక్షు నాయక్ బృందం ప్రదర్శించిన గిరిజన కళారూపాలు ఆకట్టుకున్నాయి. -
సంక్షేమ పథకాలను రద్దు చేస్తున్న కాంగ్రెస్ సర్కార్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను రాజకీయ అక్కసుతో అధికారంలోకి రాగానే కాంగ్రెస్ సర్కార్ రద్దు చేసుకుంటూ వెళ్తోందని భారత్ రాష్ట్ర సమితి ఆందోళన వ్యక్తం చేసింది. గత పదేళ్లలో లక్షలాదిమంది జీవితాల్లో మార్పు తెచ్చిన కార్యక్రమాలను సైతం రాజకీయ దురుద్దేశంతో పక్కన పెడుతోందని పేర్కొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జ్లతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి హరీశ్రావు శుక్రవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రభుత్వ వ్యవస్థ శాశ్వతం అనే విషయాన్ని కాంగ్రెస్ మరిచిపోయిందని వారు పేర్కొన్నారు. ఇప్పటికే గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం జీఓ ఇచ్చిందని, అయితే గృహలక్ష్మిలో భాగంగా ఎంపికై, అధికారిక పత్రాలు అందుకున్న లబ్ది దారుల పరిస్థితి ఏంటో ప్రభుత్వం తెలియజేయాలని డిమాండ్ చేశారు. లక్షలాది యాదవుల కుటుంబాల్లో ఆర్థిక భరోసా కలిగించిన గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని కూడా రద్దు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నదన్నారు. ఇప్పటికే ఈ పథకంలో భాగంగా తమ వాటా మొత్తం చెల్లించిన వారికి వెంటనే ప్రభుత్వం గొర్రెలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. దళితబంధును కూడా ప్రభుత్వం రద్దు చేయాలని ఆలోచిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా దళితబంధును మరింతగా విస్తరించి రూ.12 లక్షలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీకి కట్టుబడి, ఇప్పటికే ఎంపికైన లబ్ది దారులకు రూ.10 లక్షలు లేదా కాంగ్రెస్ హామీ ఇచ్చిన రూ.12 లక్షలైనా వెంటనే అందించాలన్నారు. ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని రద్దు చేసుకుంటూ వెళ్లి తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తీరని ద్రోహం చేస్తుందని చెప్పారు. సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో కాంగ్రెస్ తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా నియోజకవర్గ కేంద్రాల్లో లబ్ది దారులకు అండగా నిలబడేలా నిరసనలు చేపట్టనున్నట్లు ఈ సందర్భంగా కేటీఆర్, హరీశ్రావు తెలిపారు. లబ్ధిదారుల కోసం పార్టీ బాధ్యులంతా ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అభివృద్ధి పనులు సైతం రద్దు గత ప్రభుత్వం మంజూరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఈ ప్రభుత్వం రద్దు చేస్తోందని మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావు మండిపడ్డారు. మున్సిపాలిటీలకు టీయూఎఫ్ఐడీసీ, ఇతర సంస్థల ద్వారా అందించిన అభివృద్ధి నిధుల మంజూరును ప్రభుత్వం రద్దు చేస్తోందని ఆరోపించారు. పంచాయతీరాజ్, ఆర్అండ్బీ రోడ్ల మంజూరును కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసేందుకు ప్రయత్నిస్తోందని చెప్పారు. దీనిపై లబ్ది దారులు కోర్టును ఆశ్రయించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. -
జనం చెంతకే సంక్షేమం.. అర్హతే ప్రామాణికం
-
‘మా కొడుకే మాకు కాపు నేస్తం ఇస్తున్నాడు’
సాక్షి, తాడేపల్లి: అర్హత ఉన్న ఏ లబ్ధిదారు కూడా సంక్షేమ పథకాలను మిస్ కాకుండా చూడాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలకు మన ప్రభుత్వం ఎప్పుడూ తోడుగా నిలబడుతుందని, అర్హత ఉండి సాంకేతిక కారణాలతో అందని వారికి పథకాన్ని వర్తింపచేయాలనే తలంపుతోనే ఈ మంచి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రం వ్యాప్తంగా పలువురు లబ్దిదారులతో సీఎం వైఎస్ జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా లబ్దిదారులు ‘మమ్మల్ని ఈ స్థాయిలో పట్టించుకున్న నాయకుడు మీరే’.. అంటూ సీఎం జగన్కు ధన్యవాదాలు తెలిపారు. మా కొడుకే మాకు కాపు నేస్తం ఇస్తున్నాడు.. నా పేరు శాంతిశ్రీ అన్నా.. నేను కాపునేస్తం మూడు విడతల్లో తీసుకున్నా అన్నా. నాలుగోసారి మిస్ అయితే వాలంటీర్లు నాకు రాకపోవడానికి కారణం కనుక్కొని మరీ నాలుగో విడత వచ్చేలా చేశారు. ఈ విషయం తెలియడంతో సంక్రాంతి పండగ ముందుగానే వచ్చినట్లు ఆనందం కలిగిందన్నా. నాకు కాపు నేస్తంతో చాలా సహాయం అందుతుంది. ఏ ప్రభుత్వం చేయని విధంగా మా కాపులను మీరు గుర్తుపెట్టుకొని, కాపులకు సాయం చేయాలనే తపనతో మాకు మీరు ఈ పథకాన్ని ఇచ్చారన్నా. కాపులు గురించి ఆలోచించి మీరు మంచి పని చేశారు. కాపు నేస్తం ద్వారా కుట్టుమిషన్ కొనుక్కొని అదే నా జీవన ఉపాధిగా కొనసాగిస్తున్నా అన్నా. నా భర్త వికలాంగుడు అన్నా.. జనవరి 1 తేదీనే వాలంటీర్ మా ఇంటికి వచ్చి మరీ పించన్ డబ్బులు తెచ్చి ఇస్తున్నారు అన్నా. నాకు కొడుకులు లేరన్నా.. నా కొడుకే మాకు కాపు నేస్తం ఇస్తున్నాడని మా భార్యభర్తలు ఇద్దరం చాలా సంతోషపడుతున్నాం అన్నా. -శాంతి శ్రీ, కాపు నేస్తం లబ్దిదారు (రాజమండ్రి రూరల్ హకుంపేట్ గ్రామం) మా అమ్మ సంతోష ఉంది.. మీరు సల్లంగా ఉండాలి.. నమస్తే జగన్ సర్.. గత రెండు నెలలుగా ఆటో డబ్బులు పడినాయ్ సార్. మూడోసారి పడలేదు.. వాలంటీర్ నాకు రాకపోవడానికి కరెంట్ బిల్లు సమస్య అని చెప్పి.. ఆ సమస్యను తీర్చి మళ్లీ మూడోసారి నాకు డబ్బులు పడేలా చేశారు. మాకు ముందు నుంచి ఈ పథకాలు లేకున్నా.. మీరు మాకు ఈ పథకం ఇస్తున్నందుకు మా ఆటోనడిపేవారందరీ తరఫున ధన్యవాదాలు సర్. మీ ద్వారా మా అమ్మకు పించన్ వస్తుంది. పించన్ మూడు వేల రూపాయలు కావటం వల్ల మా అమ్మ చాలా సంతోషంగా ఉంది. కాబట్టి సర్.. మీరు సల్లంగా ఉండాలి. - వాహన మిత్ర లబ్దిదారు (ఖాజా హుస్సేన్, పాణ్యం నియోజకవర్గం, కల్లూరు) మీ సాయం.. నా జీవితానికి ఓ మలుపు ముఖ్యమంత్రి జగనన్న గారికి నమస్కరం. నా పేరు సాయి ప్రత్యూష అన్నా.. నేను డిగ్రీ పూర్తి చేశాను. మా అమ్మగారు చిన్న హస్టల్లో పనిచేసేవారు. మా నాన్న గారు చిన్న సామాన్య బట్టల దుకాణంలో పనిచేస్తున్నారు. దురదృష్టవశాత్తు మా అమ్మగారు మరణించారు. అలాంటి సమయాలో నేను పైచదువులు చదవాలన్న ఆలోచనను వదులుకున్నా అన్నా. ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవటం వల్ల టైలరింగ్ వృత్తిని ఎంచుకున్నా. దానికి పెట్టుబడి పెట్టడానికి కూడా ఎవరూ నాకు సాయం చేయలేదన్నా. అలాంటి సమయంలో మా వాలంటీరు స్వయంగా మా ఇంటికి వచ్చి.. ‘జగనన్న చేదోడు’ పథకం కింద టైలర్లకు డబ్బులు ఇస్తున్నారని చెప్పడం జరిగింది. దాని నేను చాలా సంతోషించా. మీరిచ్చే చేదోడు పదివేలతో పెట్టుబడి పెట్టి ఉన్న ఈ చిన్న వ్యాపారాన్ని పెద్దగా తీసుకువెళ్లాలని అనుకున్నా. ఉదయం టైలరిగ్ చేస్తూ.. సాయంత్రం ట్యూషన్ చెబుతూ జీవనం సాగిసున్నా అన్నా. మీరు చేదోడు పథకం ద్వారా ఇచ్చే పదివేల సాయం చాలా చిన్నది కావొచ్చు.. కానీ నా దృష్టిలో నా జీవితానికి ఇదొక మలుపు తిరిగే పాయింట్ అన్నా. మీరు ఇచ్చే ఈ పట్టుబడితో నా కలలు నెరవేర్చుకోవాలనుకుంటున్నా. -సాయి ప్రత్యూష, జగనన్న చేదోడు లబ్ధిదారు, (శ్రీకాకుళం పట్టణం) -
ప్రజలకు మన ప్రభుత్వం ఎప్పుడూ తోడుగా నిలబడుతుంది: సీఎం జగన్
-
లబ్ధిదారులు ఎవ్వరూ సంక్షేమ పథకాలు మిస్ కావొద్దు: సీఎం జగన్
పాక్షి, తాడేపల్లి: అర్హత ఉన్న ఏ లబ్ధిదారు కూడా సంక్షేమ పథకాలను మిస్ కాకుండా చూడాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలకు మన ప్రభుత్వం ఎప్పుడూ తోడుగా నిలబడుతుందని, అర్హత ఉండి సాంకేతిక కారణాలతో అందని వారికి పథకాన్ని వర్తింప చేయాలనే తలంపుతోనే ఈ మంచి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి అందని వారికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమచేశారు. ఈ కార్యక్రమం ద్వారా 68,990 మంది అర్హులకు రూ.97.76 కోట్లను సీఎం జగన్ జమ చేశారు. ఇలా ఏటా రెండు పర్యాయాలు.. జనవరి–జూన్ మధ్య అందించిన సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ కారణంతోనైనా మిగిలిపోయిన వారికి జూన్–జూలైలోను.. అలాగే, జూలై నుంచి డిసెంబర్ వరకు మిగిలిపోయిన వారికి డిసెంబర్–జనవరిలో సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. నిధులు విడుదల సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. ఈరోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమం జరుగుతోంది. నా దగ్గర నుంచి మొదలు పెడితే కలెక్టర్లు, కింది స్థాయిలో సచివాలయం వరకు ప్రతి ఒక్కరికీ ఇదొక పెద్ద సంతృప్తినిచ్చే కార్యక్రమం. ఎవరికైనా ఎప్పుడైనా ఏ సమస్య వచ్చినా ప్రభుత్వం దాన్ని పరిష్కరించడం కోసం వారి తరఫున, మంచి సేవకుడిగా ప్రభుత్వం ఉందని భరోసా కల్పించే కార్యక్రమం. ఎవరైనా ఏ కారణం చేతనైనా పొరపాటున ఏ పథకం అయినా అందకపోతే, అర్హత ఉండి కూడా పథకం అందకపోయిన పరిస్థితి వచ్చినప్పుడు స్కీమ్ అయిపోయిన తర్వాత నెల సమయం ఇచ్చి అప్లికేషన్ పెట్టించి, వెరిఫికేషన్ చేయించి ఆ లబ్ధిదారుడికి మంచి జరిగిస్తూ నష్టపోకుండా లబ్ధిని అందజేసే ఒక మంచి కార్యక్రమం. ఇది మనందరికీ ఎంతో సంతృప్తినిస్తూ ప్రభుత్వం తోడుగా నిలబడుతోందని జవాబు చెప్పే ఒక సంకేతం కూడా దీని వల్ల జరుగుతుంది. ఈ పథకం ప్రతి 6 నెలలకోసారి క్రమం తప్పకుండా జూన్-జూలైలో ఒకసారి, మళ్లీ డిసెంబర్-జనవరిలో మరోసారి.. ఇలా 6 నెలలకు సంబంధించిన పథకాల్లో అర్హత ఉండి కూడా పొరపాటున ఏ కారణం చేతనైనా లబ్ది పొందని వారికి తోడుగా నిలుస్తున్నాం. దరఖాస్తు చేసుకోకపోయి ఉండటం, ఏదైనా పొరపాట్లు దొర్లడం వల్ల, కావాల్సిన పత్రాలు ఇవ్వని పరిస్థితులు, ఆధార్-బ్యాంక్ అకౌంటు మిస్ మ్యాచ్ లాంటి ఇతరత్రా కారణాల వల్ల పథకం బెనిఫిట్ రాని పరిస్థితి ఉంటే వాళ్లందరికీ ప్రతి ఆరు నెలలకోసారి పథకాలకు సంబంధించి ఏ ఒక్కరూ మిస్ కాకుండా ఇస్తూ ఈ కార్యక్రమం జరిగిస్తున్నాం. 2021 డిసెంబర్లో ఈ కార్యక్రమం మొదలు పెట్టి ప్రతి ఆరు నెలలకోసారి చేస్తున్నాం. ఈరోజు ఐదోసారి చేస్తున్నాం. అర్హత ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి పొందని వారికి మళ్లీ తోడుగా ఉంటూ నిలబడుతూ దాదాపు రూ.1,700 కోట్లు వారికి అందజేసే కార్యక్రమం. ఈరోజు దాదాపు వివిధ పథకాలకు సంబంధించి 68,990 మందికి వివిధ పథకాల ద్వారా లబ్ధిని వారికి మళ్లీ అందజేస్తూ రూ.98 కోట్లకు సంబంధించిన మొత్తాన్ని వాళ్ల బ్యాంకు ఖాతాల్లో అందేట్టుగా చేస్తున్నాం. అమ్మ ఒడి అనే కార్యక్రమం ద్వారా ఇంతకు ముందు పథకం తీసుకొచ్చినప్పుడు 42.62 లక్షల మంది అర్హత పొందారు. డబ్బులు ఖాతాల్లో పడ్డాయి. మిస్ ఔట్ అయిపోయిన 40,616 మంది ఉంటే వారికి కూడా మళ్లీ దరఖాస్తు చేసుకోవడం, వెరిఫికేషన్ పూర్తి కావడం వారికి మళ్లీ వెనక్కి వచ్చేట్టుగా చేస్తున్నాం. జగనన్న చేదోడులో అప్పట్లో 3.25 లక్షల మందికి మంచి జరిగింది. ఇప్పుడు 15 వేల మంది మిస్ ఔట్ అయిన వారికి ఇస్తున్నాం. ఈబీసీ నేస్తం ద్వారా 4.40 లక్షల మందికి మంచి జరిగింది. ఇప్పుడు 4,180 మందికి లబ్ధి జరిగిస్తున్నాం. వైఎస్సార్ వాహన మిత్ర ద్వారా 2.80 లక్షల మందికి మంచి జరిగింది. ఇప్పుడు మళ్లీ 3,030 మందికి ఈరోజు మంచి జరగబోతోంది. మత్స్యకార భరోసా కింద అప్పట్లో 1.20 లక్షల మందికి మంచి జరిగితే ఈరోజు మరో 2 వేల మందికి మంచి జరిగిస్తున్నాం. కళ్యాణమస్తు, షాదీతోఫా ద్వారా అప్పట్లో 29,934 మందికి మంచి జరిగితే 1,912 మందికి మిగిలిపోయిన వారికి మళ్లీ ఈరోజు మంచి జరిగిస్తున్నాం. వైఎస్సార్ కాపు నేస్తం 3.60 లక్షలమందికి అప్పట్లో మంచి జరిగితే, ఇప్పుడు 1884 మందికి మంచి జరిగిస్తున్నాం. నేతన్న నేస్తం ద్వారా అప్పట్లో 80,686 మందికి మంచి జరిగింది. ఇప్పుడు 352 మందికి మంచి జరిగిస్తున్నాం. వీళ్లే కాకుండా కొత్తగా మరో 1,17,161 మందికి పెన్షన్లు మంజూరు చేసే కార్యక్రమం. ఎవరైనా మిగిలిపోయినా, కొత్తవాళ్లెవరైనా దరఖాస్తు చేసుకోవడం, వెరిఫై చేసి మంజూరు చేయడం, మంజూరు చేసిన వారికి ప్రతి 6 నెలలకు డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమం జరుగుతోంది. మరో 1,11,321 మందికి కొత్త బియ్యం కార్డులు ఈనెల నుంచే వారికి కూడా ఇవ్వడం జరుగుతోంది. 6,314 మందికి ఆరోగ్యశ్రీ కార్డులు, 34,623 మందికి కొత్తగా ఇళ్ల స్థలాలు ఇస్తున్నాం. ఏ ఒక్కరూ మిస్ కాకూడదు, పేదవాడు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు, శాచురేషన్ పద్ధతిలో వివక్ష, లంచాలకు తావు లేకుండా ఈ కార్యక్రమం జరిపిస్తున్నాం. పథకం అయిన తర్వాత నెల సమయం ఇచ్చి అప్లికేషన్ పెట్టుకొనే వెసులుబాటు కల్పిస్తూ, వాలంటీర్ సేవలు అందుబాటులో ఉంచడం, సచివాలయంలోకి వారే వెళ్లి దరఖాస్తు చేసుకొనే వెసులుబాటు, 1902కు ఫోన్ చేసినా వాళ్లు గైడెన్స్ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా గవర్నమెంట్లో ఒక జవాబుదారీ తనం, ఒక ట్రాన్స్ పరెన్సీ, ఏ ఒక్కరూ మిస్ కాకూడదన్న భావన, తపన, తాపత్రయంతో ప్రభుత్వం అడుగులు వేస్తోందని చెప్పే సంకేతం. ప్రతి 6 నెలలకోసారి జరిగిస్తూ ప్రజలకు మంచి చేసే విషయంలో మనందరి ప్రభుత్వంతోడుగా ఉందని ఒక మెసేజ్ ఓరియెంటెడ్ గా ఈ కార్యక్రమం పని చేస్తుంది. కలెక్టర్ల దగ్గర నుంచి సచివాలయ సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ ఎంతో ధ్యాస పెట్టి, ఏ ఒక్కరూ మిగిలిపోకుండా వాళ్లందరికీ తోడుగా నిలబడి, సహాయ సహకారాలు అందిస్తున్నారు. వీళ్లందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోదాం. మమ్మల్ని ఈ స్థాయిలో పట్టించుకున్న నాయకుడు మీరే సాంకేతిక కారణాలతో పథకాలు అందని తమలాంటి వారికి తిరిగి మరో అవకాశం ఇస్తూ సంక్షేమాన్ని అమలు చేయడంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని కారణాలతో సంక్షేమ పథకాలు మిస్ అయిన తమకు మళ్లీ తిరిగి అవకాశం ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని, గతంలో ఎవ్వరూ ఇలా సంక్షేమ పథకాలు ఇవ్వలేదని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంత బాధ్యతగా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయడం చాలా సంతోషాన్ని ఇస్తుందని, మమ్మల్ని ఈ స్థాయిలో పట్టించుకున్న నాయకుడు మీరేనంటూ లబ్ధిదారులు ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. గతంలో దరఖాస్తు చేసుకుంటే సరిగ్గా రాలేని పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ఏదైనా కారణాలతో మిస్ అయిన సంక్షేమ పథకాలు మళ్లీ అమలు చేస్తున్నారని, అర్హత ఉంటే చాలు సిఫార్సు లేకుండానే సంక్షేమాన్ని ఇస్తున్నారని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
జనం చెంతకే సంక్షేమం..అర్హతే ప్రామాణికం
-
నాడు.. అవమానం నేడు ఆదరణ
నాడు: టీడీపీ హయాంలో హక్కులు పరిరక్షించాలని వేడుకున్న నాయీ బ్రాహ్మణులను తోకలు కత్తిరిస్తానంటూ తాత్కాలిక సచివాలయం సాక్షిగా చంద్రబాబు బెదిరించారు. హామీలను అమలు చేయాలని విన్నవించుకున్న పాపానికి తాట తీస్తానంటూ మత్స్యకారులపై హూంకరించారు. న్యాయమూర్తులుగా బీసీలు పనికి రారంటూ చంద్రబాబు అవహేళన చేశారు. నేడు: వెనుకబడిన వర్గాలను సమాజానికి వెన్నుముకగా తీర్చిదిద్దడమే లక్ష్యమని 2019 ఫిబ్రవరి 17న ఏలూరు బీసీ గర్జనలో చెప్పిన దానికి మిన్నగా సీఎం జగన్ మంచి చేస్తున్నారు. వివిధ సంక్షేమ పథకాలతో డీబీటీ రూపంలో రూ.2.45 లక్షల కోట్లు అందించగా అందులో బీసీల ఖాతాల్లోనే రూ.1,15,155.02 కోట్లు జమ చేశారు. బీసీ బిడ్డలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నారు. కేబినెట్ నుంచి నామినేటెడ్ పదవుల వరకూ సింహభాగం పదవులను బీసీలకే ఇచ్చి రాజ్యాధికారంలో వాటా కల్పించారు. సాక్షి, అమరావతి: సంక్షేమ పథకాల ద్వారా ఆర్థికంగా చేయూతనివ్వడం, రాజ్యాధికారంలో సింహభాగం వాటా, ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడం ద్వారా బీసీలను ముఖ్యమంత్రి జగన్ సమాజానికి వెన్నుముకలా తీర్చిదిద్దారని సామాజికవేత్తలు ప్రశంసిస్తున్నారు. దేశంలో సామాజిక న్యాయం నినాదంతో వివిధ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన బీసీ ముఖ్యమంత్రులకు సైతం సాధ్యం కాని రీతిలో సీఎం జగన్ రాజ్యాధికారంలో సింహభాగం వాటా బలహీన వర్గాలకు ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. వివిధ సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో గత 56 నెలల్లో రూ.2.45 లక్షల కోట్లను పేదల ఖాతాల్లో జమ చేయగా ఇందులో బీసీల ఖాతాల్లోనే రూ.1,15,155.02 కోట్లను నేరుగా జమ చేశారని ప్రస్తావిస్తున్నారు. డీబీటీ, నాన్ డీబీటీతో కలిపి పేదలకు రూ.4.12 లక్షల కోట్ల మేర ప్రయోజనం చేకూరగా అందులో బీసీ వర్గాలే రూ.1,65,476.89 కోట్ల మేర లబ్ధి పొందాయి. విద్యా సాధికారతతో ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దారు. ఇవన్నీ బీసీలను సమాజానికి వెన్నుముకలా మార్చేందుకు బాటలు వేశాయని విశ్లేషిస్తున్నారు. పరిపాలనలో సింహభాగం.. 2019 ఎన్నికల్లో 50 శాతం ఓట్లతో 151 శాసనసభ, 22 లోక్సభ స్థానాలలో వైఎస్సార్సీపీ చారిత్రక విజయాన్ని సాధించింది. 2019 మే 30న వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2019 జూన్ 8న ఏర్పాటు చేసిన మంత్రివర్గాన్ని గతేడాది ఏప్రిల్ 11న పునర్ వ్యవస్థీకరించారు. 25 మంది సభ్యులున్న మంత్రివర్గంలో ఏకంగా 11 మంది బీసీలకు స్థానం కల్పించారు. ఆ సామాజిక వర్గానికి చెందిన బూడి ముత్యాలనాయుడును డిప్యూటీ సీఎంగా నియమించారు. విద్య, రెవెన్యూ, పౌరసరఫరాలు, వైద్యారోగ్యం లాంటి కీలక శాఖలను ఆ వర్గాలకే అప్పగించారు. 2014–19 మధ్య చంద్రబాబు తన మంత్రివర్గంలో కేవలం 8 పదవులు మాత్రమే బీసీలకు ఇచ్చారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎనిమిది రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తే నలుగురు బీసీలను సీఎం వైఎస్ జగన్ రాజ్యసభకు పంపారు. శాసనసభ స్పీకర్గా బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారామ్కు అవకాశం కల్పించారు. శాసనమండలిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 29 పదవులు (69 శాతం) దక్కేలా సీఎం జగన్ చర్యలు తీసుకోగా 2014–19 మధ్య చంద్రబాబు ఆ వర్గాలకు కేవలం 18 పదవులు (37 శాతం) మాత్రమే ఇచ్చారు. స్థానిక సంస్థల్లో బీసీలకు పెద్దపీట టస్థానిక సంస్థల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడంపై హైకోర్టును ఆశ్రయించేలా చంద్రబాబు టీడీపీ నేతలను పురిగొల్పారు. దీనిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో బీసీల రిజర్వేషన్ 24 శాతానికి తగ్గిపోయింది. అయితే రిజర్వేషన్లు తగ్గినా అంతకంటే ఎక్కువ మంది బీసీలకు స్థానిక సంస్థల్లో అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చిన సీఎం జగన్ దాన్ని ఆచరించి చూపారు. ♦ జిల్లా పరిషత్ ఎన్నికల్లో 13 జడ్పీలను వైఎస్సార్సీపీ దక్కించుకోగా అందులో బీసీలకు 6 జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవులు (46 శాతం) కేటాయించారు. ♦మండల పరిషత్ ఎన్నికల్లో 648 మండలాలకుగాను వైఎస్సార్సీపీ 635 మండల పరిషత్ అధ్యక్ష పదవులను దక్కించుకోగా 67 శాతం పదవులను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల వర్గాలకే ఇచ్చారు. ఇందులో కూడా గరిష్టంగా బీసీలకే పదవులు దక్కాయి. ♦14 కార్పొరేషన్లలో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేయగా తొమ్మిది చోట్ల మేయర్ పదవులు (64 శాతం) బీసీలకు ఇచ్చారు. ♦ 87 మున్సిపాలిటీల్లో 84 మున్సిపాలిటీలను వైఎస్సార్సీపీ చేజిక్కించుకోగా చైర్పర్సన్ పదవుల్లో బీసీలకు 44(53 శాతం) ఇచ్చారు. చట్టం చేసి మరీ నామినేటెడ్ పదవులు ♦ దేశ చరిత్రలో ఎక్కడా లేని రీతిలో నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు రిజర్వేషన్ చేస్తూ సీఎం జగన్ ఏకంగా చట్టం తెచ్చారు. ♦ రాష్ట్రంలో 196 వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ పదవుల్లో 76 అంటే 39 శాతం బీసీలకు ఇచ్చారు. ♦ వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 చైర్మన్ పదవుల్లో 53 బీసీలకు ఇచ్చారు. బీసీలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆ వర్గాల వారికే అవకాశం కల్పించారు. ♦ 137 కార్పొరేషన్లకు సంబంధించి మొత్తం 484 డైరెక్టర్ పదవుల్లో 201 బీసీలకు (42 శాతం) ఇచ్చారు. వైఎస్సార్సీపీ వెంటే బీసీలు.. చట్టసభల్లో జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడే రాజ్యసభలో ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టడం, అనంతరం అధికారంలోకి వచ్చాక బీసీల అభ్యున్నతికి సీఎం జగన్ చిత్తశుద్ధితో కృషి చేస్తుండటంతో ఆ వర్గాలు వైఎస్సార్సీపీ వెంటే నడుస్తున్నాయని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. పంచాయతీ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్.. తిరుపతి లోక్సభ, బద్వేలు, ఆత్మకూరు ఉప ఎన్నికలలో వైఎస్సార్సీపీ చారిత్రక విజయాలు సాధించడం దీనికి రుజువుగా నిలిచింది. బీసీల జనాభా అధికంగా ఉన్న కుప్పం కోట కూలిపోయి చంద్రబాబు రాజకీయ పునాదులు పెకలించడానికి ఇదే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బీసీల అభ్యున్నతి కోసం శాశ్వత కమిషన్, కులగణన చేపట్టాలని కేంద్రాన్ని కోరుతూ శాసనసభలో సీఎం జగన్ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదింపజేశారు. కేంద్రం నుంచి స్పందన లేకపోవడంతో రాష్ట్రంలో కులగణన చేపట్టడానికి సిద్ధమవడం బీసీ వర్గాల అభ్యున్నతి పట్ల చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలిచిందని స్పష్టం చేస్తున్నారు. కుప్పం కోట బీసీలదే..! ఎన్టీఆర్కు 1995లో వెన్నుపోటు పొడిచి అధికారాన్ని దక్కించుకోవటానికి ముందే.. 1989లోనే బీసీలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున చంద్రగిరి నుంచి పోటీ చేసిన చంద్రబాబు టీడీపీ అభ్యర్థి చేతిలో ఘోరంగా ఓడిపోయారు. ఆ తర్వాత టీడీపీ పంచన చేరారు. టీడీపీ ఆవిర్భావం నుంచి అంటే 1983, 1985 ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గం నుంచి ఆ పార్టీ తరఫున బీసీ నేతలే పోటీ చేసి గెలుపొందారు. అక్కడ బీసీల జనాభా అధికం. తన సొంతూరు ఉన్న చంద్రగిరి నియోజకవర్గంలో రాజకీయంగా పప్పులు ఉడకవని గ్రహించిన చంద్రబాబు 1989లో కుప్పం నియోజక వర్గానికి వలస వెళ్లి రాజకీయంగా బీసీలకు ద్రోహం చేశారు. అప్పటి నుంచి కుప్పంలోనే పోటీ చేస్తూ వస్తున్నారు. తండ్రి బాటలోనే లోకేశ్ నడుస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో బీసీలు అధికం. 2019 ఎన్నికల్లో బీసీ నేతకు వెన్నుపోటు పొడిచి ఆ స్థానంలో పోటీ చేసిన నారా లోకేశ్ ఘోరంగా ఓడిపోయారు. -
మరో 68,990 మందికి సంక్షేమ ఫలాలు
సాక్షి, అమరావతి : జనం చెంతకే సంక్షేమం.. అర్హతే ప్రామాణికంగా అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి అందని వారికి మరో అవకాశమిస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి 68,990 మంది అర్హులకు రూ.97.76 కోట్లను బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమచేయనున్నారు. ఇలా ఏటా రెండు పర్యాయాలు.. జనవరి–జూన్ మధ్య అందించిన సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ కారణంతోనైనా మిగిలిపోయిన వారికి జూన్–జూలైలోను.. అలాగే, జూలై నుంచి డిసెంబర్ వరకు మిగిలిపోయిన వారికి డిసెంబర్–జనవరిలో సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. గత ఆగస్టు 2023 నుండి డిసెంబర్ 2023 వరకు అమలైన వివిధ సంక్షేమ పథకాలు అందని 68,990 మంది అర్హులకు రూ.97.76 కోట్లను సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి శుక్రవారం బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమచేయనున్నారు. దరఖాస్తు చేసుకోవడం ఎలా? ► అర్హత ఉండి ఆయా పథకాల లబ్ధి పొందని వారు వాటిని అందించిన నెలలోపు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. ► అవసరమైతే వలంటీర్ సేవలు వాడుకోవచ్చు లేదా 1902కి ఫోన్చేస్తే వారు తగు సూచనలు ఇస్తారు. ► సచివాలయాల్లో అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేశాక వెరిఫికేషన్ చేస్తారు. ► ఆ తర్వాత ఆరు నెలలకోసారి సంక్షేమ పథకాల లబ్ధి అందిస్తారు. లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత.. ► సోషల్ ఆడిట్ కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాల ను ప్రదర్శిస్తారు. ► లంచాలకు, కుల, మత, వర్గ, పార్టీల వివక్షకు తావులేకుండా రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా పథకాలను అమలుచేస్తోంది. ► నూటికి నూరు శాతం సంతృప్త స్థాయిలో అర్హులందరికీ పథకాల లబ్ధి చేకూరుస్తోంది. -
పేద కుటుంబాలను ఆదుకుంటున్న సంక్షేమ పథకాలు
-
ప్రజా సంక్షేమ రథ సారథి!
ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అప్పటికే ఉన్న వ్యవస్థలను అత్యంత ప్రభావవంతం చేయడంతో పాటు, ప్రజల కోసం నూతన వ్యవస్థలను ప్రవేశపెట్టారు. ముఖ్యంగా సంక్షేమ రంగంలో ఆయన తీసుకొచ్చిన సంస్కరణలూ, ప్రజలకు సంక్షేమ ఫలాలను చేరవేస్తున్న తీరూ విప్లవాత్మకం. అందుకే సంక్షేమ రంగానికి సంబంధించినంత వరకూ ప్రగతి గురించి చెప్పుకోవాలంటే జగన్కు ముందు, జగన్ తర్వాత అని చెప్పుకోవాలి. ఈ కారణంగానే యావత్ భారత దేశం ఈరోజున ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది. జగన్ తన నాలుగేళ్ల పదవీ కాలంలోనే ఎవరూ పూర్తిగా గుర్తు పెట్టుకోలేనన్ని ఎక్కువ సంక్షేమ పథకాలను అమల్లోకి తీసుకొచ్చారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అప్పటి వరకూ ఉన్న వ్యవస్థల పని తీరును ప్రభావితం చేస్తూ వాటిని ప్రజలకు మరింత చేరువ చేయగలిగారు. ఉదాహరణకు వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పెన్షన్లు ఇచ్చే పథకాలు గత ప్రభుత్వాల హయాంలోనూ ఉన్నాయి. అయితే అప్పట్లో పెన్షన్ మంజూరు కావడం, పెన్షన్ మొత్తాలు చేతికి అందడం పెద్ద ప్రహసనంగా ఉండేది. అయితే జగన్ అధికారంలోకి వచ్చాక ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అర్హత కలిగిన వారికి పెన్షన్ల మంజూరు చాలా సులభతరంగా మారింది. కచ్చితంగా ఒకటవ తేదీన సూర్యోదయానికి ముందే ఇంటి కొచ్చి తలుపుతట్టి పెన్షన్ మొత్తాలను అందించే సరికొత్త వ్యవస్థ రాష్ట్రంలో ఏర్పడింది. పెన్షన్లను మాత్రమే కాదు రాష్ట్రంలో రేషన్ షాపుల ద్వారా పేదలకు అందించే బియ్యం తదితర చౌక వస్తువుల కోసం దుకాణాల వరకూ వెళ్లాల్సిన పని లేకుండా ఇంటి ముంగిటకే రేషన్ వాహనాలను తెచ్చి పెట్టారు. అలాగే ఆపదలో ఉన్న మహిళలను ఆదుకోవడానికి ‘దిశ యాప్’ను జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టి అందరి మన్ననలూ పొందుతోంది. గతంలోనూ సంక్షేమ పథకాలు ఉన్నా... లబ్ధిదారులకు ఆ ఫలాలు చేరడానికి దళారీ వ్యవస్థ వాహకంగా ఉండేది. ‘కులం చూడం, మతం చూడం, పార్టీలు అసలే చూడం.. పేదరికం ఒక్కటే అర్హతకు ప్రామాణికం’ అన్నదే సంక్షేమ పథకాల అజెండాగా జగన్ పెట్టుకున్నారు. ఒక్క బటన్ నొక్కడం ద్వారా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తున్న ‘డీబీటీ’ (డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ ఫర్) విధానం సీఎంగా జగన్ రాకతోనే వచ్చింది. ఈ సంక్షేమ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేయ డంలో ఎక్కడైనా పొరపాట్లు దొర్లి దాని కారణంగా ఎవరైనా అర్హులు నష్టపోయే పరిస్థితి ఏర్పడితే అలాంటివారు ఎప్పుడైనా ఆ పథకాల కోసం దరఖాస్తు చేసుకొని లబ్ధి పొందే వెసులుబాటు కలిగించారు. గతంలో కుల, ఆదాయ సర్టిఫికెట్లు లాంటివి తీసుకోవాలంటే పెద్ద తతంగమే ఉండేది. లంచాలు ఇవ్వాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ గ్రామ, వార్డు సచివాలయాల వ్యవ స్థకు రూపకల్పన చేశారు. క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కం సర్టిఫికెట్, ఈడబ్లు్యఎస్ సర్టిఫికెట్, రెసిడెన్స్ సర్టిఫికెట్, మ్యారేజ్ సర్టిఫికెట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ లాంటి ముఖ్యమైన సర్టిఫికెట్లను ఈ రోజున ప్రజలు ఎవరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా, ఎవ రినీ కలవాల్సిన అవసరం లేకుండా సచివాలయాల ద్వారా సులభంగా అందుకోగలుగుతున్నారు. రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుపేదలకు ఎలాంటి వివాదాల్లేకుండా ఇళ్ల స్థలాలను అందించడం కూడా సచివాలయాల ద్వారా మత్రమే సాధ్యమైంది. సచివాలయాలకు అనుబంధంగా సీఎం జగన్ సృష్టించిన 2.56 లక్షల మంది ‘వాలంటీర్ల’ వ్యవస్థ... సిఫార్సులు, పైరవీలను పాతరేసింది. వ్యవసాయానికి వెన్ను దన్నుగా రైతుకు విత్తనాలు అందించడం దగ్గర నుంచి వ్యవసాయోత్పత్తుల అమ్మకాల దాకా ఆసరాగా నిలిచే ‘రైతు భరోసా కేంద్రాలు’ (ఆర్బీకే) కూడా ఈ రోజున దేశ, విదేశీ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సామాజిక న్యాయం కోసం బాబాసాహెబ్ అంబేడ్కర్, జ్యోతిబా ఫూలే, బాబూ జగ్జీవన్ రామ్, మౌలానా ఆజాద్, కొమురం భీం, అల్లూరి సీతారామరాజు కోరుకున్న సమాజం దిశగా ప్రభుత్వ ఫలాలు అట్టడుగువర్గాల వారికి చేరాలంటే పరిపాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి అత్యధిక ప్రాధా న్యత ఇవ్వాలన్నది జగన్ ప్రభుత్వం నమ్మిన సిద్ధాంతం. తాను నమ్మిన సిద్ధాంతాన్ని మాటల్లో చెప్పకుండా చేతల్లో చేసి చూపిస్తున్న ఘనత ముఖ్యమంత్రిది. ఏ వర్గాలైతే ఇంత కాలం అణచి వేయబడ్డాయో, ఏ వర్గాలైతే ఇంత కాలం రాజకీయ పదవులకు దూరంగా ఉన్నాయో ఆ వర్గాలకు రాజ్యాధికారం దక్కుతోంది. శాసనసభ స్పీకర్గా బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారాం, శాసనమండలి ఛైర్మన్గా ఎస్సీ వర్గానికి చెందిన కొయ్యే మోషేన్ రాజు, మండలి డిప్యూటీ ఛైర్ పర్సన్గా మైనార్టీ వర్గానికి చెందిన జకియా ఖానవ్ుకు అవకాశం ఇచ్చారు. ఇది కాకుండా శాశ్వత ప్రాతిపదికన ‘బీసీ కమిషన్’తో పాటుగా ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్లు ఏర్పాటు చేశారు. నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం చేసి, దాన్ని అమలు చేసిన తొలి ప్రభుత్వం జగన్దే. అందులోనూ 50 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పించిన ఘనతా జగన్ సర్కార్దే. గత మూడేళ్ల కాలంలోనే రెగ్యులర్, ఔట్ సోర్సింగ్లతో కలిపి ఇప్పటి వరకూ 2.61 లక్షల ఉద్యో గాలను బీసీ వర్గాల వారికి ఇవ్వడం, గ్రామ వార్డు సచివాలయాల్లో ఇచ్చిన 1.30 లక్షల శాశ్వత ఉద్యో గాలలో 83 శాతం ఉద్యోగాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికే ఇవ్వడం రాష్ట్ర చరిత్రలో సరికొత్త అధ్యాయమే. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వర్గాల వారికి జగనన్న ప్రభుత్వం అందిస్తున్న చేయూతను చూసి ‘మేము కూడా ఈ సామాజిక వర్గాల్లో పుట్టి ఉంటే బాగుండేద’నే భావన ఈ రోజున అగ్రవర్ణాల వారిలో కలుగుతోందంటే అతిశయోక్తి కాదు. ఈ విధంగా నవ్యాంధ్ర రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న జగన్ కలకాలం ఆయురారోగ్యాలతో విలసిల్లాలి! డా‘‘ మేరుగు నాగార్జున వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి -
వైద్యం, విద్యపై ఏపీ సర్కార్ ప్రత్యేక శ్రద్ధ: కొమ్మినేని
సాక్షి, విజయవాడ: సామాన్యులకు అత్యంత ఆవశ్యకాలైన వైద్యం, విద్యపై రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ శ్రద్ధ చూపుతున్న దృష్ట్యా వైద్య సేవలు ప్రజలకు సమర్ధవంతంగా అమలు కావాలని సీఆర్ మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు. స్థానిక ప్రయివేట్ హాలులో బుధవారం జరిగిన రాష్ట్రస్థాయి మెడికల్ సూపరింటెండెంట్ల సదస్సులో పౌర సంబంధాలు, మీడియా నిర్వహణ అంశంపై ఆయన మాట్లాడారు. స్థానికంగా వుండే ప్రధాన మీడియాతో, సోషల్ మీడియాతో సత్సంబంధాలు కలిగి వుండాలని ఈ సందర్భంగా చైర్మన్ పేర్కొన్నారు. సమాచారం అందించడంలో జాప్యాన్ని నివారించడం ద్వారా వైద్య అధికారులు, మీడియా తో సత్సంబంధాలు నెలకొల్పుకోవాలని ఆయన సూచించారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ ప్రాధాన్యత అంశమైన వైద్య సేవల సమగ్ర సమాచారాన్ని మీడియాకు అందించడం ద్వారా ప్రజల్లో విశ్వాసం నెలకొల్పగలమని ఆయన పేర్కొన్నారు. వైద్య సదుపాయాలపై మీడియా లేవనెత్తిన ప్రశ్నలకు వెంటనే సమాధానం ఇవ్వడం ద్వారా ప్రజల్లోని అపోహలను తొలగించవచ్చన్నారు. అదే విధంగా సీజనల్ వ్యాధుల పట్ల ప్రజల్ని జాగృతం చేసేందుకు మీడియా సహకారం తీసుకోవాలని సూచించారు. వైద్య రంగంలో వోస్తోన్న ఆధునిక పద్దతుల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రభుత్వం సాధారణ ఆసుపత్రుల్లో కల్పించిన అత్యంత ఆధునిక పరికరాల గురించి, వాటి పనితీరు వల్ల సామాన్య జనానికి కలిగే ప్రయోజనాలను తెలియ చెప్పడం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల పై ప్రజలకు నమ్మకం కలిగించ వచ్చని చైర్మన్ వివరించారు. ఇటీవల తాము శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగాంగా "ఉద్దానంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన "కిడ్నీ వ్యాధుల పరిశోధన సంస్థ" ఆసుపత్రిని సందర్శిస్తే ప్రయివేటు కార్పొట్ ఆసుపత్రులను తలదన్నేలా ఉండడం, అక్కడి వైద్యులు చక్కటి సేవలు ప్రజలకు అందించడం తాము ప్రత్యక్షంగా చూశామన్నారు. ఇటువంటి అంశాలపై ప్రచారం ఎక్కువ చేయాల్సి ఉందన్నారు. గాలిలో కాలుష్యం పేరుకుపోతుండడం ఆందోళనకరంగా మారి ఊపిరితిత్తులకు సంబంధించిన పలు వ్యాధులు తలెత్తుతుండడం పట్ల ప్రజల్లో అవగాహన పెరిగేలా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య విద్య డైరెక్టర్ డా.రఘునందన రావు, అదనపు డైరెక్టర్ డా. టి. సూర్యశ్రీ, జాయింట్ డైరెక్టర్ కె.అరుణ, సి.ఆర్. మీడియా అకాడమీ సెక్రెటరీ మామిడిపల్లి బాల గంగాధర తిలక్, అక్కౌంట్స్ అధికారి ఎం.ఎస్. ఎన్. మూర్తి, డి.పి.ఓ ఎం. లోవరాజు, తదితరులు పాల్గొన్నారు. -
కొత్త రేషన్కార్డులు ఇస్తారా?
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యశ్రీ మొదలు రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు లబ్ధిదారులుగా ఉండాలంటే..రేషన్కార్డు తప్పనిసరి అయ్యింది. అధికారంలోకి వస్తే అర్హులైన వారందరికీ కొత్త రేషన్కార్డులు (ఆహారభద్రత కార్డులు) జారీ చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. మంగళవారం పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్రెడ్డి హైదరాబాద్లోని పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసే సమీక్ష సమావేశంలో కొత్త రేషన్కార్డుల జారీకి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయంలో ఆసక్తి నెలకొంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొత్త రేషన్కార్డుల కోసం ఎన్ని విజ్ఞప్తులు వచ్చినా, ఇప్పటికే రాష్ట్రంలో 90 లక్షలకు పైగా కార్డులు ఉన్నాయనే కారణంతో ఆ దిశగా దృష్టి పెట్టలేదు. హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా పెండింగ్లో ఉన్న దరఖాస్తుల్లో 3 లక్షల కార్డులు జారీ చేశారు. అప్పటి నుంచి కొత్తగా దరఖాస్తులు ఆహ్వనించలేదు. ఉమ్మడి కుటుంబాల నుంచి వేరుపడినవారు... ఈ పదేళ్లలో జన్మించిన పిల్లల పేర్లు కూడా కార్డుల్లో చేర్చలేదు. చనిపోయిన వారి పేర్లు మాత్రమే ఎప్పటికప్పుడు తొలగించారు. రాష్ట్రంలో 90.14 లక్షల రేషన్కార్డులు: రాష్ట్రంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఆహారభద్రత కార్డులు 90.14 లక్షలు ఉన్నాయి. ఇందులో జాతీయ ఆహార భద్రత చట్టం(ఎన్ఎఫ్ఎస్ఏ) కింద 54.48 లక్షల కార్డులు ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆహారభద్రత కార్డులు 35.66 లక్షలు ఉన్నాయి. ఇవి కాకుండా అంత్యోదయ అన్నయోజన కింద 5.62 లక్షల కార్డులు, అన్నపూర్ణ పథకం కింద 5,211 కార్డులు ఉన్నాయి. ఈ కార్డుల పరిధిలో 2.83 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న జనాభా, ప్రజల ఆర్థిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకుంటే ఈ కార్డుల లబ్ధిదారుల్లో 20 శాతం వరకు అనర్హులే ఉన్నట్టు గత ప్రభుత్వం గుర్తించింది. అయితే అనర్హుల నుంచి కార్డులను ఏరివేత ప్రక్రియ ప్రారంభిస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే కారణంగా యథాతథ స్థితి కొనసాగించింది. అనర్హులను తొలగిస్తారా...? గతంలో తెలుపు, గులాబీ రేషన్కార్డులు ఉండేవి. 2014లో కేంద్ర ప్రభుత్వం గులాబీకార్డులను పూర్తిగా ఎత్తివేసి దారిద్య్రరేఖకు దిగువన ఉన్న (బీపీఎల్) వారికే ఆహారభద్రత కార్డులు జారీ చేసింది. కేంద్రం జారీ చేసిన రేషన్ కార్డులు పొందలేని వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహారభద్రత కార్డులు ఇచ్చిం ది. ఈ లెక్కన రాష్ట్రంలో 90.14 లక్షల కుటుంబాలకు రేషన్కార్డులు ఉండగా, లబ్ధిదారుల సంఖ్య దాదాపు 2.83 కోట్లు. రాష్ట్ర జనాభానే 4 కోట్లు అనుకుంటే సుమారు 3 కోట్ల మంది ఆహారభద్రత కార్డులకు అర్హులుగా ఉన్నారు. కొత్త రేషన్కార్డులు జారీ చేయాల్సి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి విధివిధానాలు రూపొందిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత రేషన్కార్డులలో అర్హులైన వారిని మాత్రమే కొనసాగించి, కొత్తగా బీపీఎల్ పరిధిలోకి వచ్చే వారికి కార్డులు జారీ చేస్తారా లేక ఉన్న వాటి జోలికి వెళ్లకుండా కొత్తగా అర్హులను గుర్తిస్తారా చూడాలి. -
కమిట్మెంట్ రాజకీయాలే ఊపిరిగా...
స్వాతంత్య్రానంతరం రాజకీయాల్లో కొన్ని విలువలుండేవి. కమిట్ మెంట్ రాజకీయాలుండేవి. క్రమక్రమంగా అవి మాయమై, గెలవ డమన్నదే ప్రధానాంశం అయిపోయింది. అంతే కాదు, పార్టీ సంగతి ఎలా ఉన్నా వ్యక్తిగత గెలుపునకు ప్రాధాన్య మివ్వడం పెరిగింది. సిద్ధాంతాలు మాయమై శుష్క వాగ్దానాలతో పొద్దుబుచ్చడం, గెలిచిన తర్వాత వాటిని గాలి కొదిలేయడం మామూలై పోయింది. అటువంటి పరిస్థితుల్లో వైఎస్ రాజ శేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యి అనేక వినూత్న పథకాలను అమలుచేసి రాజకీయాల్లో నవ శకాన్ని సృష్టించారు. యువనాయకుడు జగన్ తండ్రి ఆదర్శా లనూ, పోరాటపటిమనూ సొంతం చేసుకొని, స్పష్టమైన రాజకీయ దృక్పథంతో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీని స్థాపించి ఎన్నికల్లోకి దిగారు. 2014 ఎన్నికల్లో, అతి స్వల్పకాలంలోనే గెలుపు అంచులవరకెళ్ళారు. విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమ్రంతి అయిన చంద్రబాబు జగన్పై కక్ష సాధింపు చర్యలకు తెరతీశారు. సింగపూర్ లాంటి రాజధాని అంటూ గాలిమేడలు కడుతూ ఐదేండ్లు గడిపారు. ఇదే సమయంలో జగన్ తండ్రిని ఆదర్శంగా తీసుకొని ఏపీలో సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజల కష్టాలకు, కన్నీళ్ళకు కారణాలను అన్వేషించారు. తండ్రిని మించిన ఆదర్శాలతో, ప్రగతిశీల భావజాలంతో, స్పష్ట మైన రాజకీయ దృక్పథంతో, మానవీయ పథకా లతో, సామాజిక న్యాయబాటను తనదిగా చేసు కొని ఎన్నికల బరిలోకి దిగారు. దిగ్విజయం సొంతం చేసుకొన్నారు.చంద్రబాబులా పార్టీ మార్పిడులను ప్రోత్స హించి ఉంటే, టీడీపీ ప్రతిపక్షంగా కూడా మిగి లేది కాదు. కాని జగన్ ఆ పని చేయలేదు. 2019లో అధికారం చేపట్టిన జగన్ పాద యాత్రలో ప్రజలకిచ్చిన వాగ్దానాలను మేని ఫెస్టోలో పొందుపరచి దాదాపు నూటికి నూరు పాళ్లూ నెరవేర్చారు. ప్రభుత్వ రంగంలో విద్యాలయాలను బలో పేతం చేయడం, ఆంగ్ల మాధ్యమంలో విద్య, ఆరోగ్యశ్రీని మరిన్ని రోగాలకు వర్తింప చేయడం, ‘అమ్మ ఒడి’ లాంటి పథకాలు ప్రజా మన్నన పొందాయి. వ్యవసాయ రంగాన్ని, పారి శ్రామిక రంగాన్ని బలోపేతం చేయడం ఉత్పత్తి రంగంలో రాష్ట్రం ముందడుగు వేసేలా చేసింది. లక్షలాది ఉద్యోగాలు కల్పించి నిరుద్యోగ సమ స్యను తీర్చ డమే కాక ‘సచివాలయ’ వ్యవస్థ ద్వారా పాలనను ప్రజల గడప దగ్గరకు చేర్చారు జగన్. ఇప్పుడు జగన్ పాలనతో ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీకీ పుట్టగతులు లేని పరిస్థితులొచ్చాయి. జనం అంతా ఆయన వైపే! ఇది ప్రచారంతో వచ్చింది కాదు, పనుల వల్ల వచ్చింది. ఆంధ్ర ప్రదేశ్లో జగన్ పథకాలతో, పాలనతో లబ్ధిపొందని గడపంటూ లేదు. ఈ నాలుగేళ్ళుగా టీడీపీ, జనసేన, బీజేపీ జగన్పై ఎన్ని అభాండాలు మోపినా, ఎంత వ్యతిరేక ప్రచారం చేసినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్నే కోరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో మరో ఐదారు నెలల్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల వేడి ఎప్పుడో రాజుకుంది. అనైతిక పొత్తులు, ఏ విలువలూ లేని రాజకీయాలు, రంధ్రాన్వేషణలు, ఎలాగైనా సరే గెలిచి తీరాలన్న పట్టుదలలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మూడు దశాబ్దాల పైగా చరిత్ర ఉన్న పార్టీ, పది పన్నెండేళ్ల వయసున్న పార్టీని ఓడించడానికి సినీగ్లామర్ని ఉప యోగించుకోవడానికీ, కులమతాలను రెచ్చగొట్టే పార్టీతో పొత్తు పెట్టు కోవడానికీ సిద్ధమవుతోంది. 14 ఏళ్ళ ముఖ్యమంత్రి అను భవం, నలభై ఏండ్ల రాజకీయాను భవం ఉన్న పార్టీ నాయకునికి ఇతర పార్టీలతో పొత్తు ఎందుకో అర్థంకాని విషయం. పనినే దైవంగా భావించి, ప్రజలనే దేవు ళ్ళుగా భావిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న జగన్ మరోసారి సీఎం కావడం ఖాయం. రాజకీయ విలువల వలవలొలుస్తున్న నాయకులను, పార్టీలను మట్టికరిపించి, రాజ కీయ శాస్త్రాన్ని రాజనీతి శాస్త్రంగా మార్చే క్రమాన్ని ప్రజలే అడ్డుకొంటారని జగన్ పాలన రుజువు చేస్తున్నది. డా‘‘ కాలువ మల్లయ్య వ్యాసకర్త ప్రముఖ కథా రచయిత మొబైల్: 91829 18567 -
ప్రభుత్వ పెద్దలపై విషం చిమ్మడమే రఘురామ ధ్యేయం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు ప్రజా సంక్షేమ పథకాలకు దురుద్దేశాలను ఆపాదిస్తూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టును ఆశ్రయించారు. సంక్షేమ పథకాల్లో అక్రమాలు జరిగాయని, పలువురికి లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలున్నాయని, వాటిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. ఈ వ్యాజ్యంలో ముఖ్యమంత్రి జగన్, ఎంపీ వి.విజయసాయిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి , మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేయడంపై అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. దురుద్దేశాలతోనే వీరందరినీ వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేర్చారని నివేదించారు. ప్రభుత్వంపై, రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారిపై రఘురామ విషం చిమ్మడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు. వ్యక్తిగత కక్షతోనే ఆయన ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారన్నారు. సంక్షేమ పథకాలు, ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలను తప్పుబడుతూ వ్యాజ్యం దాఖలు చేస్తున్నట్లు పేర్కొన్న రఘురామ అందులో సంబంధం లేని వారిని వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేర్చారన్నారు. ఈ పిల్ దాఖలు చేసిన తరువాత సీఎంను వదిలేదిలేదంటూ మీడియా సమావేశాలు నిర్వహించి ప్రకటనలు చేశారని నివేదించారు. అందుకు అనుమతించొద్దు ప్రజా ప్రయోజనం పేరుతో వ్యాజ్యం దాఖలు చేసిన రఘురామ వాస్తవాలను కోర్టు ముందు ఉంచలేదని అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ తెలిపారు. తనకు సంబంధించిన అన్ని విషయాలను పిల్లో పేర్కొన్నట్లు డిక్లరేషన్ ఇచ్చిన రఘురామ వాస్తవానికి పలు కీలక విషయాలను తొక్కిపెట్టారన్నారు. ఆయన చైర్మన్, ఎండీగా వ్యవహరించిన కంపెనీ పలు రుణ సంస్థలకు రూ.700 కోట్లకు పైగా రుణాలను ఎగవేసిందన్నారు. పిటిషనర్ సీబీఐ కేసు కూడా ఎదుర్కొంటున్నారని శ్రీరామ్ కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ వివరాలను ఆయన వ్యాజ్యంలో పేర్కొనలేదన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో రఘురామపై నిబంధనల ప్రకారం అనర్హత వేటు వేయాలంటూ లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు అందిన విషయాన్ని కూడా దాచి పెట్టారని తెలిపారు. వ్యక్తిగత, రాజకీయ అజెండాతో.. వ్యక్తిగత, రాజకీయ అజెండాతో రఘురామ ముందుకెళుతున్నారని, అందుకు ఈ వ్యాజ్యమే ఉదాహరణ అని పేర్కొన్నారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారిపై విషం చిమ్మేందుకు కోర్టులను వేదికగా చేసుకుంటున్నారని తెలిపారు. ఇందుకు ఎంత మాత్రం అనుమతించొద్దని కోర్టును ఏజీ అభ్యర్థించారు. ఈ వ్యాజ్యం విచారణార్హతపై తమకు అభ్యంతరం ఉందన్నారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపే ముందు రఘురామకృష్ణరాజు దురుద్దేశాలను, ఆయనకెంత విశ్వసనీయత ఉందో పరిశీలించాలని కోరారు. ముందు దీన్ని తేల్చిన తరువాతే ఈ వ్యాజ్యంలో తదుపరి విచారణను చేపట్టాలన్నారు. పిల్ నిబంధనల ప్రకారం ప్రతివాదుల జాబితా నుంచి ఎవరినైనా తొలగించే అధికారం ధర్మాసనానికి ఉందన్నారు. ఆ విచక్షణాధికారాన్ని ఇప్పుడు వినియోగించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా ఉన్న వారిని ప్రతివాదుల జాబితా నుంచి తొలగించవచ్చన్నారు. అంతేకాక వారికి నోటీసులు కూడా అవసరం లేదన్నారు. ముందు విచారణార్హతపై తేలుస్తాం.. వాదనలు విన్న హైకోర్టు తొలుత రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన ఈ వ్యాజ్యం విచారణార్హతపై తేలుస్తామని స్పష్టం చేసింది. ఆ తరువాతే తదుపరి ప్రక్రియ చేపడతామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రతివాదులందరూ విచారణార్హతపై అభ్యంతరాలు తెలియచేయాలని, అందువల్ల వారందరికీ నోటీసులు జారీ చేస్తామని తెలిపింది. రేపు ఎవరూ తమకు వాదనలు వినిపించే అవకాశం రాలేదని అనకూడదని పేర్కొంది. న్యాయ ప్రయోజనాల నిమిత్తం అందరికీ నోటీసులు జారీ చేస్తున్నామంది. నోటీసులు జారీ చేయడం అందరికీ మంచిదని హైకోర్టు స్పష్టం చేసింది. పలువురికి నోటీసులు జారీ... ఈమేరకు వ్యక్తిగత ప్రతివాదులుగా ఉన్న ముఖ్యమంత్రి జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పలు కంపెనీలకు, డైరెక్టర్లకు కూడా నోటీసులు ఇచ్చింది. సీబీఐ డైరెక్టర్, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్థిక, రెవెన్యూ, గనులు, పరిశ్రమలు, సమాచార పౌర సంబంధాలు, వైద్య, ఆరోగ్య శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులకు సైతం నోటీసులు జారీ చేసింది. మొత్తం 41 మందికి నోటీసులు ఇచ్చిన హైకోర్టు వారందరినీ రఘురామకృష్ణరాజు వ్యాజ్యం విచారణార్హతపై అభ్యంతరాలను తెలియచేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 14కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ మండవ కిరణ్మయి ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. మధ్యంతర ఉత్తర్వులు సాధ్యం కాదు.. మధ్యంతర ఉత్తర్వుల కోసం తాము అనుబంధ పిటిషన్ దాఖలు చేశామని, దాన్ని అనుమతించాలని రఘురామకృష్ణరాజు తరఫు సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు కోరారు. ఇసుక, మద్యం పాలసీలకు సంబంధించిన రికార్డులను జాగ్రత్త చేసేలా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థించారు. ఆ పాలసీలకు సంబంధించిన రికార్డులను ధ్వంసం చేస్తున్నారని, వాటిని సీజ్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ ప్రభుత్వ హయాంలో కోర్టులో రికార్డులను మాయం చేసిన ఘటన కూడా చోటు చేసుకుందని వ్యాఖ్యలు చేయడంపై అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. కోర్టులో రికార్డులు మాయం అయిన ఘటనను ప్రభుత్వానికి ఆపాదించడం తగదన్నారు. ఇలా ఏదిపడితే అది మాట్లాడితే తాము కూడా అదే విధంగా మాట్లాడాల్సి వస్తుందన్నారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ప్రతివాదులకు తాము వ్యక్తిగతంగా నోటీసులు అందచేసేందుకు అనుమతినివ్వాలని మురళీధరరావు కోరగా అందుకు ధర్మాసనం నిరాకరించింది. హైకోర్టు రిజిస్ట్రీనే నోటీసులు పంపుతుందని తేల్చి చెప్పింది. -
కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందాయి: బండి పార్థసారథి
-
బీడీ బతుకులు మారలే...
మహిళల ఆర్థిక పరిపుష్టి, స్వావలంబనకు ఆసరాగా నిలుస్తున్న బీడీ పరిశ్రమ మసకబారిపోతున్న క్రమంలో తమ బాగుకు పనిచేసే వారి కోసం ఆ కార్మికులు ఎదురుచూస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపించేంతటి శక్తి ఉన్న తమను ఏ రాజకీయ పార్టీలు ఆదరిస్తాయా.. అని బీడీ కార్మికులు లెక్కలు వేసుకుంటున్నారు. బీడీ కార్మికులకు ఇప్పటి వరకు అందుతున్న జీవనభృతిని నెలకు రూ.2 వేల నుంచి రూ.5 వేలు చేస్తామని వివిధ రాజకీయ పార్టీలు హామీలిస్తున్నాయి. అయితే, కార్మికుల కనీస వేతనం, పింఛన్ పెంపుతో పాటు పూర్తిస్థాయిలో పనిదినాలు కల్పించడం, సంక్షేమం, వైద్య సౌకర్యాల అమలు హామీలు దిశగా రాజకీయ పార్టీలపై ఒత్తిడి తేవాలని కార్మిక సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. కంపెనీలను కట్టడి చేసేదెవ్వరు? కార్మికులకు వేతనాల పెంపు అంశంలో యాజమాన్యాలు ఆడిందే ఆటగా సాగుతోంది. గుజరాత్, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన ప్రధాన కంపెనీలపై స్థానిక సర్కారు అజమాయిషీ అంతంతమాత్రమే కావడంతో న్యాయం జరగడం లేదు. 2010 నవంబర్లో వేతనాల పెంపు కోరుతూ కార్మికులు బంద్ పాటించారు. సుమారు 32 రోజులపాటు సమ్మె సాగిన క్రమంలో అప్పటి సర్కార్ కార్మికుల కనీస వేతనం రూ.130గా నిర్ణయిస్తూ 2011 డిసెంబర్లో జీఓ 41 ద్వారా ఉత్తర్వులు జారీచేసింది. ఈ జీఓ అమలుకు యాజమాన్యాలు ఒప్పుకోలేదు. దాంతో కార్మిక సంఘాలు మరోసారి చర్చలు జరిపి ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం జీఓ 81 జారీ అయ్యింది. ప్రస్తుతం వేయి బీడీలకు రూ.231 మాత్రమే ఇస్తున్నారు. వాస్తవానికి జీఓ 41 అమలైతే ప్రస్తుత పరిస్థితుల్లో వేయి బీడీలకు కనీసంగా రూ.600 వస్తాయనికార్మికులు చెబుతున్నారు. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వస్థాయిలో సైతం ఒత్తిడి తెచ్చి కంపెనీల యాజమాన్యాలను ఒప్పించేలా ఎన్నికల బరిలో ఉన్న పార్టీలు స్పష్టమైన హామీ ఇవ్వాలన్న డిమాండ్ ఉంది. తగ్గుతున్న అమ్మకాలు.. పనిదినాలపై ప్రభావం తెలంగాణలో సుమారు 4,74,438 లక్షల మంది బీడీ కార్మికులున్నారు. ఈ మధ్యకాలంలో మార్కెట్లలోకి వచ్చి చేరుతున్న మినీ సిగరెట్లతో బీడీల అమ్మకాలు పడిపోతున్నాయి. ఫలితంగా కంపెనీలు తమ అవసరాలకు అనుగుణంగా నెలకు పది నుంచి పదిహేను రోజులు మాత్రమే కార్మికులకు ఆకు, తంబాకు ఇస్తూ మిగిలిన రోజుల్లో కంపెనీలు బంద్ చేస్తున్నాయి. కార్మిక చట్టాల ప్రకారం కనీసం ఏడాదికి 312 పనిదినాలు కల్పించాల్సి ఉండగా, యాజమాన్యాలు మాత్రం 100 నుంచి 120 రోజులు మాత్రమే పనిదినాలు కల్పిస్తున్నాయి. వాస్తవానికి సిగరెట్లపై నిబంధనల మేరకు ప్రచారం కల్పిస్తుండగా, బీడీలపై కనీసంగా ప్రచారం లేకపోవడంతోనే అమ్మకాలు తగ్గిపోతున్నాయని, ఫలితంగా తమ పనిదినాలూ తగ్గుతున్నాయని కార్మికులు వాదిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కార్మికులకు పూర్తిస్థాయిలో ఉపాధి కల్పించే దిశగా ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ దృష్టి సారించలేదన్న అసంతృప్తి కార్మికుల్లో నెలకొంది. ప్రధాన సమస్యలు.. ♦ పని దినాల కుదింపు.. ఫలితంగా వేతనం చాలడం లేదు జీఓ 41(కనీసవేతన చట్టం) అమలు కాలేదు. ♦ ఈఎస్ఐ వైద్య సౌకర్యం పూర్తిస్థాయిలో లేదు. ♦ సంక్షేమ పథకాలపై కార్మికులకు అవగాహన కరువు. పట్టించుకోని కార్మికశాఖ. ♦ 2018 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రధాన హామీ ప్రత్యామ్నాయఉపాధి.. కానీ ఇంతవరకు చూపలేదు. ♦ బీడీ కట్టపై పుర్రెగుర్తు తొలగింపు అమలుకాలేదు. ♦ జిల్లాకో ఈఎస్ఐ ఆస్పత్రి ఉండాలని కార్మికుల దీర్ఘకాల డిమాండ్ ఆసరా పింఛన్ రావడం లేదు నేను ఏడేళ్లుగా బీడీలు చేస్తున్నా. పీఎఫ్ కూడా ఉంది. కానీ ప్రభుత్వం అందించే ఆసరా పింఛన్ రావడం లేదు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి ఇస్తామని అంటున్నారే తప్ప.. మంజూరు చేయడం లేదు. – బోండ్ల స్రవంతి, రాచర్లబొప్పాపూర్ -ముజఫర్ -
గిరిజన పల్లెకు సంక్షేమ పలకరింపు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సంక్షేమ పథకాల ఫలాలతో పులకరిస్తున్న గిరిజన పల్లెలను మరోసారి ప్రభుత్వ యంత్రాంగం ఆత్మీయంగా పలకరించనుంది. ముఖ్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై ప్రచారంతో పాటు, పథకాలు అందని అర్హులు ఎవరైనా మిగిలుంటే వారికి పథకాలు అందేలా చూస్తారు. ఇందుకోసం ‘వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర’లో భాగంగా రాష్ట్రంలోని గిరిజన పల్లెల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ఈ నెల 15వ తేదీ నుంచి 26వ తేదీ వరకు షెడ్యూల్ను ఖరారు చేశారు. జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న ‘జన జాతీయ గౌరవ్ దివస్’ కార్యక్రమాన్ని పురస్కరించుకుని 15న విశాఖ బీచ్ రోడ్డులో ర్యాలీని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర ప్రారంభిస్తారు. గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, ప్రజలు, ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల(ఎస్హెచ్జీ) సభ్యులు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొంటారని ఏపీ గిరిజన సంక్షేమ శాఖ అడిషినల్ డైరెక్టర్ రవీంద్రబాబు తెలిపారు. ఈ నెల 26వ తేదీ వరకు అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లోనూ కార్యక్రమాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ఆ రెండు జిల్లాల్లోని 430 గిరిజన గ్రామాల్లో నాలుగు ప్రత్యేక వాహనాల(ప్రభుత్వ పథకాల ప్రచార వ్యాన్)తో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. గ్రామ, సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ), జిల్లాల స్థాయిలో స్థానిక ప్రజలు, స్వయం సహాయక సంఘాలు, ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఏ రోజు ఏ కార్యక్రమం నిర్వహించాలనేది ప్రత్యేకంగా షెడ్యూల్ను ఖరారు చేశారు. వీటిపై ప్రత్యేక దృష్టి ప్రధానంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై ప్రచారం నిర్వహించనున్నారు. గిరిజనుల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఇంకా అర్హత ఉన్న వాళ్లకు ఎవరికైనా రాకుంటే.. వారికి సంక్షేమ ఫలాలు అందించేలా తక్షణ చర్యలు చేపడతారు. గిరిజన జిల్లాల్లో సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలన మిషన్, ఏకలవ్య మోడల్ స్కూల్లో విద్యార్థులను చేరి్పంచడం, స్కాలర్షిప్ల మంజూరు, అటవీ హక్కుల చట్టం ప్రకారం పట్టాల పంపిణీ వంటి కార్యక్రమాల అమలు, అర్హులకు వాటిని దరి చేర్చడం వంటి వాటిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నారు. ‘జన జాతీయ గౌరవ్ దివస్’ను ఘనంగా జరుపుదాం సీఎం జగన్కు కేంద్ర మంత్రి లేఖ జన జాతీయ గౌరవ్ దివస్ను ఘనంగా జరిపేందుకు రాష్ట్ర స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేయాలని, మంత్రులు, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండా లేఖ రాశారు. 15న జనజాతీయ గౌరవ్ దివస్ సందర్భంగా పార్లమెంట్ కాంప్లెక్స్లో భగవాన్ బిర్సా ముండా విగ్రహానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ నివాళి అర్పిస్తారని తెలిపారు. అలాగే బిర్సా ముండా జన్మస్థలం జార్ఖండ్ రాష్ట్రం ఉలిహటు వద్ద నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొని.. దేశంలోని 75 ఆదివాసీల ప్రాబల్యం ఉన్న జిల్లాల్లో ‘హమారా సంకల్ప్ వికసిత్ భారత్‘ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని.. మీ రాష్ట్రంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. -
ఏపీలో అభివృద్ధి, సంక్షేమం.. మీడియాకు సమగ్ర సమాచారం: కొమ్మినేని
సాక్షి, విజయవాడ: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, యువత, వంటి వివిధ వర్గాల ప్రజలు పొందిన ప్రయోజనాలపై ఆయా వర్గాల ప్రజలకు, మీడియాకు సమగ్ర సమాచారం ఇవ్వడం కోసం రాష్ట్రవ్యాప్తంగా తాము పర్యటించనున్నామని సి.ఆర్. మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సి.ఆర్. మీడియా అకాడమీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వం చేపట్టిన పాలనా సంస్కరణలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, పరిశ్రమలు వంటి అంశాలపై పూర్తి సమాచారం కూడా అందచేస్తామని ఆయన వెల్లడించారు. "మళ్ళీ జగనే ఎందుకు రావాలి" అనే అంశంపై ప్రజలకు, మీడియాకు పూర్తి వివరాలు అందుబాటులోకి తెచ్చేందుకు తమ పర్యటన దోహద పడుతుందని ఆయన తెలిపారు. దీని గురించి వీలైనంత వరకు పాత్రికేయ మిత్రులకు ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నామని ఆయన తెలిపారు. ఈ నెల 16 నుంచి రాయల సీమ జిల్లాల్లో పర్యటించనున్నట్టు వెల్లడించారు. తొలి దశలో కర్నూలు, పుట్టపర్తి, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, జిల్లాల్లో పర్యటించి పాత్రికేయులకు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. గత ఏడాది నవంబర్ 10న తాను చైర్మన్గా బాధ్యతలు స్వీకరించినప్పుడు ప్రెస్ అకాడమీ పేరును "మీడియా" అకాడమీగా మార్పు చేయాలన్న తమ సూచనను పరిగణన లోకి తీసుకుని సంస్థ పేరును " ఆంధ్ర ప్రదేశ్ సి.ఆర్. మీడియా అకాడమీ" గా మార్చినందుకు సీఎం వై.ఎస్. జగన్మోహన్రెడ్డికి ఆయన కృతఙ్ఞతలు తెలిపారు. అన్ని వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్లతోనూ సత్సంబంధాలు నిర్వహిస్తూ, అందరినీ కలుపుకు పోయే ప్రయత్నం చేస్తూ గత ఏడాది కాలంలో సుమారు 100 కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహించుకోగలిగామని చైర్మన్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అన్నిటిలోనూ తమకు సంతృప్తినిచ్చే కార్యక్రమాలు ఆయన ప్రత్యేకంగా పేర్కొన్నారు. వివిధ జర్నలిస్టుల యూనియన్లు తమ దృష్టి కి తెచ్చిన పలు సమస్యల పై సంబంధిత శాఖల అధికార్లతో ఎప్పటికప్పుడు చర్చించి తగు పరిష్కారాలు సాధించడం జరిగిందన్నారు. వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ కేర్ స్కీం అమలులో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను డా. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ముఖ్య కార్యనిర్వాహణాధికారితో చర్చించడం జరిగిందన్నారు. ఈ సమస్యలు త్వరితంగా పరిష్కరించేందుకు వీలుగా 104 హెల్ఫ్లైన్లో ఒక ప్రత్యేక లైన్ (నెంబర్.4)ను ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆ అధికారి లిఖిత పూర్వకంగా తమకు తెలిపారని ఆయన వివరించారు. వర్కింగ్ జర్నలిస్టుల వృత్తి నైపుణ్యాన్ని పెంచేందుకు వీలుగా ప్రత్యేకంగా 6 నెలల జర్నలిజంలో డిప్లమో కోర్సును రూపొందించి, అతి సాధారణ ఫీజుతో నాగార్జున యూనివర్సిటీ తో కలిసి నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కోర్సు పూర్తయి విద్యార్థులంతా పరీక్షలు కూడా పూర్తి చేశారన్నారు. వర్కింగ్ జర్నలిస్టుల వృత్తి నైపుణ్యాన్ని పెంచడంలో భాగంగా ప్రతి శనివారం ప్రత్యేక అంశాలపై ప్రముఖులతో "ఆన్ లైన్ క్లాసులు" నిర్వహించడం జరిగిందన్నారు. 28 వారాల పాటు వివిధ అంశాల పై ప్రముఖ రచయితలు, ప్రొఫెసర్లు, ఉన్నత అధికారులు, రాష్ట్ర మంత్రులు, సీనియర్ పాత్రికేయులు ఆన్ లైన్ క్లాసుల్లో ప్రత్యేక ప్రసంగాలు చేశారని ఆయన వెల్లడించారు. వర్కింగ్ జర్నలిస్టులకు ఉపయోగపడే అంశాలైన, పర్యావరణం, వృత్తి నైపుణ్యం, ఒత్తిడిని అధిగమించడంపై జిల్లాల్లో శిక్షణా తరగతులు, సెమినార్లు నిర్వహించడం జరిగిందన్నారు. జర్నలిస్టులుగా పనిచేసి రిటైర్ అయి కాలం గడుపుతున్న సీనియర్ జర్నలిస్టుల ఇళ్లకు వెళ్లి ప్రభుత్వం తరపున వారిని సన్మానిస్తూ వారిని గౌరవించడం జరుగుతోందని ఆయన వివరించారు. రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ ద్వారా జర్నలిస్టు మిత్రులు రచించిన పుస్తకాలు కొనుగోలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా గ్రంథాలయాలకు సరఫరా చేసే ఉత్తర్వులు వెలువడేందుకు చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు. వివిధ జిల్లాల్లో తాము పర్యటించిన సందర్భాల్లో జర్నలిస్టు యూనియన్లు అక్రిడిటేషన్లు, ఇళ్ల స్థలాలు కోరుతూ ఇచ్చిన విజ్ఞాపనలు ప్రభుత్వానికి అందించామని, ఆయా అంశాల పై ప్రభుత్వం స్పందించి తగు నిర్ణయాలు తీసుకుందని ఆయన పేర్కొన్నారు. ఇటీవల జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని సీఎం జగన్ నిర్ణయించడం జర్నలిస్టులందరికీ మేలు చేస్తుందని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు. చదవండి: ఈనాడు కథనంపై ఏపీ గనుల శాఖ ఆగ్రహం -
జగనన్న ప్రభుత్వంలో మారుమూల పల్లెలకు కూడా సంక్షేమం చేరుతుంది
-
వేలం పాటలు మొదలయ్యాయి!
ఎన్నికల సీజన్ మొదలవడంతో, మళ్లీ మేనిఫెస్టోలను రూపొందించే పనిలో అన్ని రాజకీయ పార్టీలూ తలము నకలు అవుతున్నాయి. మేనిఫెస్టో అనేది రాజకీయ పార్టీలు అవి అధి కారంలోకి వచ్చిన తరువాత చేయగల పనులను పేర్కొనే హామీ పత్రం. మేనిఫెస్టోను నమ్మే చాలా మంది ఓట్లు వేస్తూ ఉంటారు. కాని, చాలా రాజ కీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన తరువాత మేనిఫెస్టోను మరచిపోయి ఇచ్చిన హామీలను గాలికి వదిలేస్తాయి. ఎక్కడో ఒకటో ఆరో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలాంటివి మాత్రం మేని ఫెస్టోను బైబిల్, భగవద్గీత, ఖురాన్ల వంటి పవిత్ర గ్రంథాలుగా భావిస్తున్నాయి. ఇచ్చిన ప్రతి హామీని చిత్తశుద్ధితో అమలు చేస్తున్నాయి. మేనిఫెస్టోలో అనేక సంక్షేమ పథకాలను ప్రకటించటం ప్రతి పార్టీ చేసే పనే. అయితే వాటిని చిత్తశుద్ధితో ఎంత వరకు అమలు చేశారు అనేది ముఖ్యం, చిత్తశుద్ధితో చేసే ఏ పనైనా విజయవంతమవుతుంది. తద్వారా ప్రజలకు మేలు కలిగి పాల కులు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఒకప్పుడు ‘రెండు రూపాయలకు కిలో బియ్యం’ తన మేనిఫెస్టోలో పొందు పరిచి, చిత్తశుద్ధితో అమలు పరిచిన నందమూరి తారక రామా రావు ఇప్పటికీ ప్రజల గుండెల్లో ఉన్నారు. ఈ పథకం పేరు చెప్పగానే ఆయనే గుర్తుకు వస్తారు. అలాగే ప్రజల ఆరోగ్యం కోసం ‘ఆరోగ్యశ్రీ’ పథకాన్ని రూపొందించిన డా‘‘ వై.ఎస్. రాజశేఖర రెడ్డి పేరు చెప్పగానే ఆరోగ్యశ్రీనే గుర్తుకు వస్తుంది. అదేవిధంగా పేద పిల్లల చదువుల కోసం అహర్నిశలూ పాటు పడుతున్న నేటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పగానే ‘అమ్మ ఒడి’ గుర్తుకొస్తుంది. పేదవాడి సంక్షేమం గురించి చిత్తశుద్ధితో ఆలోచించి అమలు పరిచే పథకాలకు ఎప్పటికీ మరణం ఉండదు. అందుకనే ఆ పథకాలూ, వాటిని అమలు పరిచిన నాయకులు చిరస్మరణీయం. అధికారంలోకి ఏ పార్టీ వచ్చినా ఆ పథకాలను మాత్రం మార్చలేని పరిస్థితికి పార్టీలు వచ్చాయి అంటే అవి ఎంతగా ప్రజలకు మేలు చేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ‘మేము అధికారంలోకి వస్తే కొనసాగిస్తాము’ అని ప్రతిపక్షాలు ప్రజలకు హామీ ఇస్తున్నాయి అంటే ఆ పథకాలు ఎంతగా ప్రజల్లోకి చొచ్చుకుపోయాయో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల పక్క రాష్ట్రంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను మెచ్చి ప్రజలు అక్కడ ఒక రాజకీయ పార్టీకి అధికారం కట్ట బెట్టడంతో, అవే హామీలను తెలుగు రాష్ట్రాలలో కూడా కొన్ని పార్టీలు తమ మేనిఫెస్టోలో పొందుపరుస్తున్నాయి. పొందు పరచడమేకాక ఒకరు వంద ఇస్తానంటే మరొకరు రెండు వందలు ఇస్తాం అంటూ వేలం పాటలు మొదలు పెట్టారు. వెయ్యి రూపాయలు ఉన్న వంట గ్యాస్ సిలిండర్ పై ఇటీవల కేంద్ర ప్రభుత్వం రెండు వందలు తగ్గించింది. అంటే ఏడు వందలకే ఇస్తుందన్నమాట. ఇది చూసి మరో రెండు వందలు తగ్గించి, ఐదు వందలకే ఇస్తామని మరో పార్టీ ప్రకటిస్తే, ఇంకో పార్టీ నాలుగొందలకే ఇస్తామని ప్రకటించింది. వృద్ధులకు ఇచ్చే పెన్షన్ను ఒక పార్టీ మూడు వేలు అంటే... మరో పార్టీ ఐదు వేలు అంటోంది. ఇలా వేలం పాటల్లో ఇచ్చే హామీలను అధికారం వచ్చిన తరువాత గాలికి వదిలేస్తారు అనటంలో ఏ సందేహం లేదు. మేనిఫెస్టోలో ప్రకటించే సంక్షేమ పథకాలకూ, ఉచిత పథకాలకూ ఉన్న తేడా ప్రజలు గుర్తించాలి. ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి కొన్ని రాజకీయ పార్టీలు గ్యారంటీ నినాదాన్ని అందుకున్నాయి. కొంత మంది భవిష్యత్తుకు గ్యారంటీ అంటే మరి కొంతమంది ‘ఆరు స్కీముల’ గ్యారంటీ అంటూ ప్రజలను మాయ చేయాలని చూస్తున్నారు. ఒకప్పుడు ఈ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకపోవటంతో గ్యారంటీ స్కీములతో ముందుకొచ్చారిప్పుడు ప్రజలను నమ్మించ టానికి! మరికొంత మంది ఇంటింటికీ తిరిగి, తమ స్కీముల వల్ల ఎంత లబ్ధి చేకూరుతుందో అంత మొత్తానికి ‘బాండ్లు’ రాసిస్తామని వాగ్దానాలు చేస్తున్నారు. అంటే ఒక రకంగా ఓట్లు కొనుగోలు చేస్తున్నట్లే! చిత్తశుద్ధితో ఇచ్చిన హామీలను అమలు చేసే వాళ్ళనే ప్రజలు నమ్ముతారు. ప్రజల నమ్మకం ముందు ఈ గ్యారంటీలు, బాండ్లు ఎందుకూ కొరగావు. ఒకసారి నమ్మకాన్ని పోగొట్టుకుంటే మళ్ళీ తిరిగి రాదు. కొన్నిసార్లు ఇచ్చిన హామీల్లో ఒకటో, రెండో అమలు చేయడం సాధ్యం కాదు. అలాంట ప్పుడు నిజాయతీగా ఎందుకు అమలు చేయలేక పోతున్నదీ ప్రజలకు వివరిస్తే అర్థం చేసుకుంటారు. అలా కాకుండా ఉత్తుత్తి హామీలు ఎన్ని ఇచ్చినా ఏ ఉపయోగమూ ఉండదు! ఈదర శ్రీనివాస రెడ్డి వ్యాసకర్త నాగార్జున యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ -
పేదరికం తగ్గుతోంది!
దేశంలో గత ఐదేళ్లలో రెండేళ్లు కరోనా మహమ్మారి ఇబ్బందిపెట్టినా పేదరికం తగ్గుముఖం పట్టడం శుభపరిణామం. మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే ధోరణి కనిపించడం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సంక్షేమ, విద్యా, వైద్య పథకాల ఫలితమేనని చెప్పవచ్చు. నీతి ఆయోగ్ నివేదిక –2023ను పరిశీలించినప్పుడు దేశంలో పేదరికం పరిస్థితి ఇటీవలి సంవత్సరాల్లో (2015–16, 2019–21) ఎలా ఉందో స్పష్టమవుతోంది. సుస్థిరాభివృద్ది లక్ష్యాలు (ఎస్డీజీ)... సామాజిక–ఆర్థిక, సామాజిక శ్రేయస్సు కొరకు ‘ఎవరినీ వదిలి పెట్టకూడదు’ అనే దృష్టితో నిర్దేశించబడ్డాయి. అంటే ఆదాయంతో ముడిపడిన పేదరికమే కాకుండా, మిగతా అన్ని వసతు లనూ పరిగణనలోకి తీసుకొని పేదరికాన్ని అంచనా వేసి దాని నిర్మూలించడం కూడా ఒక లక్ష్యమన్నమాట. అనేక కోణాలను పరిగణన లోకి తీసుకుని పేదరికాన్ని అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు, అవసరమైన వసతులు... అంటే నీరు, పారిశుద్ధ్యం, పోష కాహారం, శిశు, ప్రసూతి మరణాలు, పాఠశాల హాజరు, ఇతర ప్రాథమిక గృహ సౌకర్యాలు పొందడం వంటి వాటినన్నిటినీ పేదరికాన్ని నిర్వచించడంలో పరిగణించాలి. ఇటువంటి పేదరిక అంచనా కోసం నిర్దేశించిన 12 సూచికలలో పదింటిని, ప్రపంచ స్థాయిలో పేదరికాన్ని అంచనా వేయడానికి చేర్చినవి కాగా మిగిలిన రెండు సూచికలు: ప్రసూతి ఆరోగ్యం, బ్యాంక్ ఖాతాలు దేశంలో పేదరికాన్ని అంచనావేయడానికి అదనంగా చేర్చబడ్డాయి. ఇటువంటి అనేక కోణాల ఆధారంగా నిర్ధారించిన పేదరికం (ఎంపీఐ) జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయులలో ఎలా ఉందో నీతి ఆయోగ్ తాజా నివేదిక తెలియజేస్తోంది. దేశ స్థాయిలో పేదరికం బాగా తగ్గిందని నివేదిక స్పష్టం చేసింది. 2015–16లో మన జనాభాలో 25 శాతం పేదలు ఉండగా, 2019–21 నాటికి 15 శాతానికి పేదరికం తగ్గింది. అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని వేసిన అంచనా దేశంలో 13.5 కోట్ల మంది పేదరికం నుండి బయటపడ్డారని సూచిస్తోంది. సుస్థిర అభివృద్ధికి నిర్దేశించిన లక్ష్యాలు 2030 కంటే ముందుగానే, భారతదేశం సాధించవచ్చని ఇది చెబుతోంది. మొత్తం 12 సూచి కలు అభివృద్ధిని చూపించాయి. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం వేగంగా తగ్గుముఖం పట్టింది. పట్టణ ప్రాంతాలకు వచ్చేటప్పటికి 8.65 శాతం నుండి 5.27 శాతానికి పేదరికం తగ్గింది. 28 రాష్ట్రాలలో, పది రాష్ట్రాలు 2019–21లో దేశ సగటు 14.96 శాతం కంటే ఎక్కువ శాతం పేదరికాన్ని నమోదు చేశాయి. దేశంలో అత్యల్పంగా కేరళలో ఒక శాతం కంటే తక్కువ మంది పేదలుగా ఉన్నారు. మొత్తం ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలలో పేదల శాతం దేశ సగటు కంటే చాలా తక్కువగా ఉంది.2019–21లో దేశ సగటు పేదరిక స్థాయి కంటే, తెలుగు రాష్ట్రాల్లో, పైన చెప్పిన విధంగా అంచనా వేసిన పేదల శాతం చాలా తక్కువగా ఉంది. ఇది 2015–16 లో తెలుగు రాష్ట్రాలలో దాదాపు 12 నుండి 13 శాతం ఉండగా, 2019–21 నాటికి రెండు తెలుగు రాష్ట్రాలలో 6 శాతానికి తగ్గింది. పేదరిక అంచనాలో ఉపయోగించిన సూచికలలో, పిల్లల–కౌమార మరణాలు, పాఠశాలలో గడిపిన సంవత్సరాలు, పాఠశాల హాజరు, విద్యుత్ సౌకర్యం, ఆస్తులు కలిగి ఉండటం వంటివి రెండు తెలుగు రాష్ట్రాలలో సమాన శాతంలో ఉన్నాయి. 2023 ఏడాదిలో విడుదల అయిన నీతి ఆయోగ్ నివేదిక, కరోనా వైరస్ కారణంగా ఆర్థికంగా, సామాజికంగా అతలా కుతలం అయిన కాలాన్ని అనగా 2019–21ను ప్రతిబింబిస్తోంది. పేదరిక నిర్మూలనను దృష్టిలో ఉంచుకొని, రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభించిన అనేక కార్యక్రమాలు బహుసూచికలతో పొందు పరచిన పేదరిక శాతాన్ని తగ్గించడంలో బాగా సహాయ పడ్డాయి. ఉదాహరణకు, ఆంధ్రప్రదేశ్లో ‘వైఎస్ఆర్ అమ్మ ఒడి’, ‘వైఎస్ఆర్ జగనన్న విద్యా దీవెన’, ‘వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా’, ‘జగనన్న ఆరోగ్య సురక్ష’, గృహనిర్మాణ పథకం; తెలంగాణలో ‘ఆరోగ్య లక్ష్మి’, గృహనిర్మాణ పథకం, ‘కేసీఆర్ కిట్’ ‘మిషన్ భగీరథ’ పథకాలు పేదరిక శాతాన్ని గణనీయంగా తగ్గించడంలో సహాయపడ్డాయి. అదనంగా, రెండు రాష్ట్రాలలో, ఆరోగ్య మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని సరఫరా చేయడం కూడా పాఠశాల హాజరు, తల్లీ పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి దోహద పడుతున్నాయి. ఈ పథకాల పూర్తి ప్రభావం తదుపరి నీతి ఆయోగ్ నివేదికలో ఎక్కువగా ప్రస్ఫుటం గావచ్చు. ఈ పథకాల ప్రభావంతో, తెలుగు రాష్ట్రాలలో, పేదరిక నిర్మూలన గణనీయంగా తగ్గవచ్చు. డా‘‘ పృథ్వీకర్ రెడ్డి వ్యాసకర్త ఆర్థిక అంశాల నిపుణుడు ఈ–మెయిల్: prudhvikar@cess.ac.in -
Chhattisgarh elections 2023: సంక్షేమం X మౌలికం
ఛత్తీస్గఢ్లో ఈసారి అసెంబ్లీ ఎన్నికలను పాలక కాంగ్రెస్ సంక్షేమ పథకాలకు, బీజేపీ మౌలిక సదుపాయాల వాగ్దానాలకు మధ్య పోరుగా భావిస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపుగా స్వీప్ చేసిన కాంగ్రెస్, మళ్లీ అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని పట్టుదలగా ఉంది. దక్షిణాదిలో కీలకమైన కర్ణాటకలో ఇటీవలే బీజేపీ నుంచి అధికారాన్ని కాంగ్రెస్ చేజిక్కించుకోవడం తెలిసిందే. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో ఛత్తీస్గడ్తో పాటు రాజస్తాన్లో కూడా ఆ పార్టీ అధికారంలో ఉంది. అక్కడ కాస్త కష్టమేనన్న అంచనాల నేపథ్యంలో ఛత్తీస్గఢ్ను ఎలాగైనా నిలుపుకోవాలని పట్టుదలగా ఉంది. అందుకే ఇప్పటికే అమల్లో ఉన్నవాటికి తోడుగా మరెన్నో సంక్షేమ పథకాలను సీఎం భూపేశ్ భగేల్ ప్రకటిస్తున్నారు. మరోవైపు చిరకాలం పాటు తమ పాలనలో ఉన్న రాష్ట్రాన్ని గత ఎన్నికల్లో కాంగ్రెస్కు కోల్పోయిన నేపథ్యంలో ఈసారి ఎలాగైనా సత్తా చాటాలని బీజేపీ పట్టుదలగా ఉంది. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ కొంతకాలంగా తరచూ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. పుంఖానుపుంఖాలుగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రకటిస్తున్నారు. వాటితో రాష్ట్ర భాగ్యరేఖలే మారతాయని, యువతకు భారీగా ఉపాధి దొరుకుతుందని చెబుతూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రెండు పారీ్టల ప్రచారంలో ఓటరు దేనికి జై కొడతాడో చూడాలి... బీజేపీ బలాలు... ► ఇతర అంశాలు ఎన్నున్నా అన్నింటి కంటే ప్రధానమైనది ఎప్పట్లాగే హిందుత్వ కార్డే. కాకుంటే ఈ విషయంలో గ్రామీణ ఓట్లను ఈ మేరకు సంఘటితం చేస్తుందన్నది ఈసారి కీలకం కానుంది. ► 15 ఏళ్ల వరుస పాలనలో చేసిన అభివృద్ధిని కూడా కమలదళం బాగానే ప్రచారం చేస్తోంది. ► కాంగ్రెస్ ఐదేళ్ల పాలనలో అవినీతిలో కూరుకుపోయిందని గట్టిగా ప్రచారం చేస్తోంది. ► అయితే గతంలో రమణ్సింగ్లా ఈసారి బీజేపీ సీఎం అభ్యరి్థగా ఎవరినీ ప్రచారం చేయడం లేదు. ఇది కాస్త ప్రభావం చూపే అంశమేనని అంటున్నారు. అభివృద్ధే కాంగ్రెస్ మంత్రం ► బీజేపీ హిందూత్వ వాదానికి కౌంటర్గా రాష్ట్ర కాంగ్రెస్ కొంతకాలంగా ఉదారవాద హిందూత్వ గళం వినిపిస్తోంది. ఇది కొంతవరకు కలిసొస్తుందని భావిస్తోంది. ► సీఎం భగేల్ ఓబీసీ నేత కావడం ఆ సామాజికవర్గంలో తమ ఓట్లను మరింత సంఘటితపరుస్తుందని ఆశిస్తోంది. ► పేదలకు, రైతులకు అనుకూలంగా అమలు చేస్తున్న పలు పథకాలు ఈసారి కచి్చతంగా గట్టెక్కిస్తాయని భగేల్ నమ్ముతున్నారు. ► వీటికి తోడు ఛత్తీస్గఢ్ ఆత్మగౌరవాన్ని ఇటీవలి కాలంలో పదేపదే తెరపైకి తెస్తున్నారు. తద్వారా ఓటర్లను ఆకట్టుకోజూస్తున్నారు. ► అయితే అవినీతి ప్రచారం, ఎమ్మెల్యేలపై వ్యతిరేకత కాంగ్రెస్కు ప్రతికూలంగా మారేలా కనిపిస్తున్నాయి. బరిలోకి గిరిజన పార్టీ ఛత్తీస్గఢ్లో ఆదివాసీ సంఘాల సమాహారమైన సర్వ ఆదివాసీ సమాజ్ ఇటీవలే హమార్ రాజ్ పేరుతో రాజకీయ పారీ్టగా మారింది. ఒకనాటి కాంగ్రెస్ నేత అరవింద్ నేతం సారథ్యంలో ఎన్నికల బరిలో దిగుతోంది. ఫక్తు గిరిజన ఆచార వ్యవహారాలకు కట్టుబడి పని చేస్తామనే హామీతో దూసుకెళ్తోంది. రాష్ట్రంలో సంఖ్యాధికులైన గిరిజనుల్లో ఇది గట్టిగా ప్రభావం చూపితే అది బీజేపీ, కాంగ్రెస్ల్లో దేన్ని దెబ్బ తీస్తుందన్నది ఆసక్తికరం. కీలకాంశాలు ► వరికి సరైన మద్దతు ధర కావాలని రైతులు ఎంతోకాలంగా డిమాండ్ చేస్తున్నారు. క్వింటాలుకు రూ.2,500 మద్దతు ధర చెల్లిస్తామన్న 2018 నాటి హామీని భగేల్ సర్కారు నెరవేర్చలేదని ఆగ్రహంగా ఉన్నారు. ► కాంగ్రెస్ తరఫున సీఎం భగేల్ అన్నీ తానై నడిపిస్తున్నారు. అయితే పారీ్టలో అసమ్మతులు ఆయనకు తలనొప్పిగా మారారు. ► డిప్యూటీ సీఎం కేపీ సింగ్దేవ్ రూపంలో భగేల్కు సొంత పారీ్టలోనే గట్టి ప్రత్యర్థి పొంచి ఉన్నారు. ► ఇక బీజేపీకి ఇప్పటికీ మాజీ సీఎం రమణ్ సింగే రాష్ట్రంలో ఏకైక పెద్ద దిక్కు. 15 ఏళ్లు పాలించిన నేతగా ఈసారి తన అనుభవాన్నంతా రంగరిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సంక్షేమం X మౌలికం
ఛత్తీస్గఢ్లో ఈసారి అసెంబ్లీ ఎన్నికలను పాలక కాంగ్రెస్ సంక్షేమ పథకాలకు, బీజేపీ మౌలిక సదుపాయాల వాగ్దానాలకు మధ్య పోరుగా భావిస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపుగా స్వీప్ చేసిన కాంగ్రెస్, మళ్లీ అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని పట్టుదలగా ఉంది. దక్షిణాదిలో కీలకమైన కర్ణాటకలో ఇటీవలే బీజేపీ నుంచి అధికారాన్ని కాంగ్రెస్ చేజిక్కించుకోవడం తెలిసిందే. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో ఛత్తీస్గడ్తో పాటు రాజస్తాన్లో కూడా ఆ పార్టీ అధికారంలో ఉంది. అక్కడ కాస్త కష్టమేనన్న అంచనాల నేపథ్యంలో ఛత్తీస్గఢ్ను ఎలాగైనా నిలుపుకోవాలని పట్టుదలగా ఉంది. అందుకే ఇప్పటికే అమల్లో ఉన్నవాటికి తోడుగా మరెన్నో సంక్షేమ పథకాలను సీఎం భూపేశ్ భగేల్ ప్రకటిస్తున్నారు. మరోవైపు చిరకాలం పాటు తమ పాలనలో ఉన్న రాష్ట్రాన్ని గత ఎన్నికల్లో కాంగ్రెస్కు కోల్పోయిన నేపథ్యంలో ఈసారి ఎలాగైనా సత్తా చాటాలని బీజేపీ పట్టుదలగా ఉంది. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ కొంతకాలంగా తరచూ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. పుంఖానుపుంఖాలుగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రకటిస్తున్నారు. వాటితో రాష్ట్ర భాగ్యరేఖలే మారతాయని, యువతకు భారీగా ఉపాధి దొరుకుతుందని చెబుతూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రెండు పార్టీల ప్రచారంలో ఓటరు దేనికి జై కొడతాడో చూడాలి... బీజేపీ బలాలు... ఇతర అంశాలు ఎన్నున్నా అన్నింటి కంటే ప్రధానమైనది ఎప్పట్లాగే హిందుత్వ కార్డే. కాకుంటే ఈ విషయంలో గ్రామీణ ఓట్లను ఈ మేరకు సంఘటితం చేస్తుందన్నది ఈసారి కీలకం కానుంది. 15 ఏళ్ల వరుస పాలనలో చేసిన అభివృద్ధిని కూడా కమలదళం బాగానే ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ ఐదేళ్ల పాలనలో అవినీతిలో కూరుకుపోయిందని గట్టిగా ప్రచారం చేస్తోంది. అయితే గతంలో రమణ్సింగ్లా ఈసారి బీజేపీ సీఎం అభ్యరి్థగా ఎవరినీ ప్రచారం చేయడం లేదు. ఇది కాస్త ప్రభావం చూపే అంశమేనని అంటున్నారు. అభివృద్ధే కాంగ్రెస్ మంత్రం బీజేపీ హిందూత్వ వాదానికి కౌంటర్గా రాష్ట్ర కాంగ్రెస్ కొంతకాలంగా ఉదారవాద హిందూత్వ గళం వినిపిస్తోంది. ఇది కొంతవరకు కలిసొస్తుందని భావిస్తోంది. సీఎం భగేల్ ఓబీసీ నేత కావడం ఆ సామాజికవర్గంలో తమ ఓట్లను మరింత సంఘటితపరుస్తుందని ఆశిస్తోంది. పేదలకు, రైతులకు అనుకూలంగా అమలు చేస్తున్న పలు పథకాలు ఈసారి కచ్చితంగా గట్టెక్కిస్తాయని భగేల్ నమ్ముతున్నారు. వీటికి తోడు ఛత్తీస్గఢ్ ఆత్మగౌరవాన్ని ఇటీవలి కాలంలో పదేపదే తెరపైకి తెస్తున్నారు. తద్వారా ఓటర్లను ఆకట్టుకోజూస్తున్నారు. అయితే అవినీతి ప్రచారం, ఎమ్మెల్యేలపై వ్యతిరేకత కాంగ్రెస్కు ప్రతికూలంగా మారేలా కనిపిస్తున్నాయి. బరిలోకి గిరిజన పార్టీ ఛత్తీస్గఢ్లో ఆదివాసీ సంఘాల సమాహారమైన సర్వ ఆదివాసీ సమాజ్ ఇటీవలే హమార్ రాజ్ పేరుతో రాజకీయ పార్టీగా మారింది. ఒకనాటి కాంగ్రెస్ నేత అరవింద్ నేతం సారథ్యంలో ఎన్నికల బరిలో దిగుతోంది. ఫక్తు గిరిజన ఆచార వ్యవహారాలకు కట్టుబడి పని చేస్తామనే హామీతో దూసుకెళ్తోంది. రాష్ట్రంలో సంఖ్యాధికులైన గిరిజనుల్లో ఇది గట్టిగా ప్రభావం చూపితే అది బీజేపీ, కాంగ్రెస్ల్లో దేన్ని దెబ్బ తీస్తుందన్నది ఆసక్తికరం. – సాక్షి, నేషనల్ డెస్క్ కీలకాంశాలు వరికి సరైన మద్దతు ధర కావాలని రైతులు ఎంతోకాలంగా డిమాండ్ చేస్తున్నారు. క్వింటాలుకు రూ.2,500 మద్దతు ధర చెల్లిస్తామన్న 2018 నాటి హామీని భగేల్ సర్కారు నెరవేర్చలేదని ఆగ్రహంగా ఉన్నారు. కాంగ్రెస్ తరఫున సీఎం భగేల్ అన్నీ తానై నడిపిస్తున్నారు. అయితే పార్టీలో అసమ్మతులు ఆయనకు తలనొప్పిగా మారారు. డిప్యూటీ సీఎం కేపీ సింగ్దేవ్ రూపంలో భగేల్కు సొంత పార్టీలోనే గట్టి ప్రత్యర్థి పొంచి ఉన్నారు. ఇక బీజేపీకి ఇప్పటికీ మాజీ సీఎం రమణ్ సింగే రాష్ట్రంలో ఏకైక పెద్ద దిక్కు. 15 ఏళ్లు పాలించిన నేతగా ఈసారి తన అనుభవాన్నంతా రంగరిస్తున్నారు. -
అసంతృప్తిపై వారు..అభివృద్ధిపై వీరు..
భాషబోయిన అనిల్ కుమార్ : గోదావరి నది ఒడ్డున సింగరేణి కార్మికక్షేత్రం, వేములవాడ, ధర్మపురి, కొండగట్టు వంటి ధార్మిక క్షేత్రాలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నిలయం. ఉద్యమాలకు, పోరాటాలకు పురిటిగడ్డగా ఉంటూనే సెంటిమెంటుకు ఆలవాలంగా, విలక్షణ తీర్పులకు వేదికగా ప్రసిద్ధికెక్కింది. ఉద్యమాల ఖిల్లా, మలిదశ తెలంగాణ ఉద్యమానికి కేంద్రమైన కరీంనగర్లో 2014 నుంచి నేటి వరకు ఇక్కడ బీఆర్ఎస్ హవా సాగుతోంది. అభ్యర్థుల ప్రకటనతో దాదాపుగా నెలరోజులు ముందుగానే అధికార బీఆర్ఎస్ పార్టీ నేతలంతా ప్రచారం ప్రారంభించారు. ఈసారి కూడా సంక్షేమ పథకాలు తమను గట్టెక్కిస్తాయని బీఆర్ఎస్ ధీమాగా ఉంటే, ప్రభుత్వ వ్యతిరేకత తమను విజయతీరాలకు చేరుస్తుందని నమ్ముతున్న కాంగ్రెస్, బీజేపీలు ఈ మేరకు గెలుపు వ్యూహాలు రచిస్తుండటంతో ఉమ్మడి జిల్లాలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్.. అభివృద్ధి జపం! తెలంగాణకు ముందు– తరువాత పరిస్థితులను చూపిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచార ప్రణాళికలను రచిస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మునుపెన్నడూలేని భారీ నీటి ప్రాజెక్టు కాళేశ్వరం, అనుబంధ ప్రాజెక్టుల ద్వారా సాగులోకి వచ్చిన వేల ఎకరాలు, కరీంనగర్లో కేబుల్ బ్రిడ్జి, మానేరు రివర్ ఫ్రంట్, జాతీయ రహదారులు, కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వేలైన్, మెడికల్ కాలేజీల నిర్మాణం, దళితబందు, రైతబంధు, రైతుబీమా, పింఛన్లు తదితర సంక్షేమ పథకాలు తమను ఉమ్మడి జిల్లాలో మరోసారి గట్టెక్కిస్తాయని ఆ పార్టీ నేతలు బలంగా విశ్వసిస్తున్నారు. 2014, 2018లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో 13 అసెంబ్లీ స్థానాలున్న కరీంనగర్ జిల్లా పాత్ర కీలకం. ప్రతిసారీ 12 స్థానాలు గెలుస్తుండగా..పార్టీని వీడిన ఈటల రాజేందర్ బీజేపీలో చేరి గెలవడంతో ఇక్కడ బలం 11 స్థానాలకు చేరింది. అయితే ఈసారి మొత్తం 13 సీట్లూ తన ఖాతాలో వేసుకోవాలని బీఆర్ఎస్ పథక రచన చేస్తోంది. విపక్షాల ప్రచారాస్త్రాలు ♦ తమ పార్టీ ప్రకటించిన ఆరు పథకాలు తమను గెలిపిస్తాయని కాంగ్రెస్ నేతలు ధీమాగా ఉన్నారు. ♦ ప్రజావ్యతిరేకత, పాలనపై ఉద్యోగుల్లో అసంతృప్తి, యువ ఓటర్లలో సానుకూలత తమకు కలిసి వస్తాయని బీజేపీ భావిస్తోంది. ♦మైనార్టీ రుణాలు, బీసీబంధు కేటాయింపులో కొన్నిచోట్ల అర్హులకు చోటు దక్కకపోవడాన్ని విపక్షాలు ప్రచారా్రస్తాలుగా చేసుకునే అవకాశం ఉంది. అధికార పార్టీ ఆయుధాలు..! ♦ సంక్షేమ పథకాలు, దళితబంధు, పైలట్ ప్రాజెక్టులు.. ♦ ఉమ్మడి జిల్లాలో మెడికల్ కాలేజీల నిర్మాణం, సిరిసిల్లలో ఆక్వా హబ్, కరీంనగర్లో మానేరు రివర్ ♦ ఫ్రంట్ నిర్మాణం, కేబుల్ బ్రిడ్జి, కాళేశ్వరం ప్రాజెక్టు. ♦ కొత్తపల్లి– మనోహరాబాద్ రైల్వేలైన్, స్మార్ట్సిటీ నిర్మాణం, కొండగట్టు, వేములవాడ మాస్టర్ప్లాన్లు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులపై తకరారు..! కాంగ్రెస్, బీజేపీలు ఇంతవరకూ అభ్యర్థులను ప్రకటించలేదు. అయితే కాంగ్రెస్ ఇటీవల ప్రకటించిన ఆరు గ్యారంటీలను కొందరు నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. జగిత్యాల, మంథని, చొప్పదండి, వేములవాడ, ధర్మపురి, మానకొండూరు, పెద్దపల్లి స్థానాలు తమ ఖాతాలోకి వస్తాయని కాంగ్రెస్ పార్టీ దీమాతో ఉంది. అయితే పార్టీలో అంతర్గత కలహాలు, ప్రతి స్థానానికీ పదుల సంఖ్యలో ఆశావహులు (అధికారికంగా 85 మంది) పోటీపడటం పార్టీని కలవరపాటుకు గురిచేస్తోంది. ఆయా స్థానాల్లో నేతలు ప్రజా ఆశీర్వాద యాత్రలతో ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. ఇక బీజేపీ విషయంలో సంజయ్, ఈటల రాజేందర్ మినహా మిగిలిన వారి విషయంలో స్పష్టత రాలేదు. వేములవాడ, జగిత్యాల, కోరుట్ల, మానకొండూరులకు అభ్యర్థులు దొరికినా ఇంకా ఖరారు కాలేదు. కారుకు స్పీడ్బ్రేకర్లు ఇవే..! ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్కు బలమైన పునాదులు ఉన్నా.. కొన్ని విషయాలు పార్టీని కలవరపెడుతున్నాయి. పెద్దపల్లిలో పార్టీ రెబెల్ నల్ల మనోహర్రెడ్డి బరిలోకి దిగితే కారు ఓట్లు చీలే అవకాశముంది. రామగుండంలో రెబెల్ కందుల సంధ్యారాణి, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వ్యతిరేక వర్గం పార్టీకి ప్రతికూలంగా తయారయ్యారు. వేములవాడలో సిట్టింగ్ ఎమ్మెల్యే రమేశ్బాబు స్థానంలో చెలిమెడ లక్ష్మీ నరసింహారావుకు పార్టీ టికెట్ ఇచ్చింది. దీంతో రమేశ్ ఎంతమేరకు సహకరిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. కోరుట్లలో సిట్టింగ్ ఎమ్మెల్యే విద్యాసాగర్రావు కుమారుడు సంజయ్కు పోటీగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ బరిలో దిగితే పోటీ నువ్వా నేనా అన్నట్లుగా ఉంటుంది. ఇక హుజూరాబాద్లో ఈటల రాజేందర్ ఓటమికి బీఆర్ఎస్ చెమటోడ్చాల్సి ఉంటుంది. మంథనిలో శ్రీధర్బాబును ఓడించడానికి కారు పార్టీ ప్రత్యేక వ్యూహం రూపొందించింది. ఎంపీ బండి సంజయ్ బలమైన నాయకుడు అయినప్పటికీ.. కరీంనగర్లో పోటీపై అనాసక్తిగా ఉన్నారని సమాచారం. ధర్మపురిలో అడ్లూరి లక్ష్మణ్కు సెంటిమెంట్ కలిసి వచ్చే అవకాశాలున్నాయి. చొప్పదండిలో సొంత పార్టీ నేతల అసంతృప్తి కలవరపెడుతోంది. -
సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు ఆర్థిక భరోసా
సాక్షి, అమరావతి: కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అర్హులైన పౌరులందరికీ నవరత్నాలు ద్వారా అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరో నూతన పథకాన్ని ప్రకటించింది. సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు ఆర్థిక భరోసా కల్పిస్తూ ‘జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహం’ అనే కొత్త పథకాన్ని మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం జారీ చేశారు. ప్రతి సంవత్సరం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీఎస్ఈ)లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి దాదాపు 40 మంది ఎంపికవుతున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్రం నుంచి మరింత ఎక్కువ మంది ఎంపికయ్యేలా ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించింది. దీనిద్వారా సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా బలహీనమైన, వెనుకబడిన వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వం ఆర్థిక తోడ్పాటు అందించనుంది. ప్రిలిమినరీ, మెయిన్స్లో అర్హత సాధించిన వారికి నగదు ప్రోత్సాహకం అందిస్తుంది. యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీలో క్వాలిఫై అయిన అభ్యర్థులకు రూ.లక్ష, మెయిన్స్లో క్వాలిఫై అయిన వారికి రూ.50 వేలు చొప్పున డీబీటీ పద్ధతిలో నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తుంది. యూపీఎస్సీ అనుమతించే ఎన్ని పర్యాయాలు అయినా ఆ అభ్యర్థులకు ప్రభుత్వం ఈ ప్రోత్సాహకం అందిస్తుంది. ఈ ప్రోత్సాహకంతో అభ్యర్థుల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖలు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఇదీ ఉపయోగం ఈ పథకం ద్వారా దరఖాస్తుదారులకు ప్రభుత్వం రెండు దశల్లో ప్రయోజనాన్ని అందిస్తుంది. మొదటిది సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు రూ.లక్ష, నగదు ప్రోత్సాహకాన్ని అందిస్తుంది. అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు సన్నద్ధం కావడానికి ఈ నగదు ఉపయోగపడుతుంది. రెండోది సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు రూ.50వేలు ప్రోత్సాహకం అందిస్తుంది. ఇది వ్యక్తిత్వ పరీక్షకు సన్నద్ధమవడానికి ఉపయోగపడుతుంది. ఈ నగదు అభ్యర్థుల కోచింగ్, స్టడీ మెటీరియల్, ఇంటర్వ్యూ గైడెన్స్, ప్రిపరేషన్, ఇతర ఖర్చులకు భరోసా ఇస్తుంది. అర్హత ప్రమాణాలు ఇవి.. ♦ దరఖాస్తుదారు తప్పనిసరిగా సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా బలహీనమైన, వెనుకబడిన వర్గాలకు చెందిన వారు అయ్యుండాలి. ♦ ఆంధ్రప్రదేశ్లో శాశ్వత నివాసి(స్థానికుడు) అయ్యుండాలి. ♦ తప్పనిసరిగా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించి ఉండాలి. ఈమేరకు రుజువు పత్రాలు సమర్పించాలి. యూపీఎస్సీ అనుమతించిన ఎన్ని ప్రయత్నాల్లోనైనా ఈ పథకం కింద నగదు ప్రోత్సాహకాన్ని అభ్యర్థి పొందవచ్చు. ♦ దరఖాస్తుదారు కుటుంబ వార్షిక ఆదాయం సంవత్సరానికి రూ.8 లక్షలకు మించకూడదు. ఈమేరకు కుటుంబ ఆదాయ స్వీయ ధృవపత్రం, ఇంటిలోని ఉద్యోగి జీతం ధృవపత్రం, తాజా పన్ను వంటి ధృవపత్రం అందించాలి. కుటుంబ వార్షిక ఆదాయాన్ని తాహశీల్దార్ ద్వారా ధృవీకరిస్తారు. ♦ కుటుంబానికి పది ఎకరాల మాగాణి లేదా 25 ఎకరాల మెట్ట భూమి గానీ, మొత్తం 25 ఎకరాల మాగాణి, మెట్ట భూమి ఉండొచ్చు. ♦ఇలా పలు అర్హతలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులు అన్ని అవసరమైన ధృవపత్రాలతో సాంఘిక సంక్షేమ శాఖ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
మన పొత్తు ప్రజలతోనే: సీఎం జగన్
ప్రతిపక్షాలన్నీ పొత్తుల కోసం వెంపర్లాడుతున్నాయి. రెండు సున్నాలు కలిసినా.. నాలుగు సున్నాలు కలిసినా ఫలితం సున్నానే. ఎన్ని సున్నాలు కలిసినా వచ్చేది పెద్ద సున్నాయే. ఒకరైతే పార్టీ స్థాపించి 15 ఏళ్లవుతున్నా ఇవ్వాళ్టికీ ప్రతి నియోజకవర్గానికి అభ్యర్థి లేడు. ప్రతి గ్రామంలో జెండా మోసే కార్యకర్త లేడు. ఆయన జీవితమంతా చంద్రబాబును భుజానికెత్తుకుని మోయడమే. చంద్రబాబు దోచుకున్నది పంచుకోవడంలో ఆయన పార్ట్నర్. వారిద్దరూ కలిసి ప్రజలను ఎలా మోసం చేయాలని ఆలోచిస్తారు. ప్రజలకు మంచి చేయాలనే మనస్తత్వం వారికి లేదు. – వైఎస్సార్సీపీ ప్రతినిధుల సభలో సీఎం జగన్ సాక్షి, అమరావతి: ఎన్నికల సంగ్రామంలో తమ పొత్తు ప్రజలతోనేనని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పునరుద్ఘాటించారు. పొత్తుల కోసం ప్రతిపక్షాలు వెంపర్లాడుతున్నాయని.. రెండు సున్నాలు కలిసినా, నాలుగు సున్నాలు కలిసినా ఫలితం సున్నానేనంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై వ్యంగ్యోక్తులు విసిరారు. ‘మీ బిడ్డ పొత్తుల మీద ఆధారపడడు. దేవుడ్ని.. ఆ తర్వాత ప్రజలనే నమ్ముకుంటాడు. మన పొత్తు నేరుగా ప్రజలతోనే’ అని పేర్కొన్నారు. దేవుడి దయతో ప్రజలకు మనం చేసిన మంచే మన బలమని.. మన ధైర్యం.. మన ఆత్మవిశ్వాసమని స్పష్టం చేశారు. సోమవారం విజయవాడ మునిసిపల్ స్టేడియంలో నిర్వహించిన వైఎస్సార్సీపీ ప్రతినిధుల సభలో సీఎం జగన్ ప్రసంగించారు. ఇంటింటికీ వెళ్లిన పార్టీ మనదే.. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచిన 99 శాతం వాగ్ధానాలను అమలు చేసిన ప్రభుత్వం మనది. సంక్షేమ పథకాలను ఇంటింటికీ అందించిన ప్రభుత్వం మనది. ఇదే మన ధైర్యం. దేశ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో రాష్ట్రంలో 87 శాతం కుటుంబాలకు సంక్షేమ పథకాలను అందించిన ప్రభుత్వం మనది. ఇలాంటివన్నీ సాధ్యపడతాయని ఎవరైనా కలలోనైనా అనుకున్నారా? ఎక్కడా లంచాలు, వివక్షకు తావు లేకుండా, అర్హతే ప్రామాణికంగా మీ బిడ్డ బటన్ నొక్కగానే ఆర్థిక సహాయం అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా వస్తుందని ఎవరైనా అనుకున్నారా? అలాంటి విప్లవాత్మక చర్యలు మన సొంతం. నవరత్నాల్లోని ప్రతి సంక్షేమ పథకం అమలూ ఒక విప్లవమే. ఎన్నికల మేనిఫెస్టోను వెంటబెట్టుకుని ఇంటింటికీ వెళ్లి ఇదిగో వీటిని అమలు చేశామంటూ ప్రజల ఆశీర్వాదాన్ని తీసుకున్న పార్టీ దేశ చరిత్రలో ఏదైనా ఉందంటే.. అది వైఎస్సార్ సీపీనే. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా నిరంతరం ప్రజల్లో ఉన్న పార్టీ కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే. అప్పుడు ఎమ్మెల్యేల్లో కొంతమందికి కష్టం అనిపించినా ఇప్పుడు వారిలో చిరునవ్వులు చూస్తున్నాం. బాబు జనంలో ఉన్నా జైల్లో ఉన్నా ఒకటే! చంద్రబాబు అనే వ్యక్తి ప్రజల్లో ఉన్నా జైల్లో ఉన్నా పెద్ద తేడా ఏమీ ఉండదు. ఆయనకు విశ్వసనీయత లేదు. అలాంటి వ్యక్తి ఎక్కడున్నా ఒకటే. చంద్రబాబును, ఆయన పార్టీని చూసినప్పుడు పేదవాడికి, ప్రజలకు గుర్తుకొచ్చేది ఒక్కటే.. మోసాలు, వెన్నుపోట్లు, అబద్ధాలు, వంచనలే. అదే మన పార్టీని చూసినప్పుడు, జగన్ను చూసినప్పుడు సామాజిక న్యాయం గుర్తుకొస్తుంది. గ్రామాల్లో మారిన వైద్యం, స్కూళ్లు, వ్యవసాయం, ప్రాంతాల మధ్య న్యాయం, లంచాలు, వివక్షలేని వ్యవస్థలు గుర్తుకొస్తాయి. ఫోన్ తీసుకుని అక్క చెల్లెమ్మలు ధైర్యంగా బయటకు వెళ్లే పరిస్థితి గుర్తుకు వస్తుంది. దిశ యాప్ æద్వారా వారికి లభించే భరోసా గుర్తుకు వస్తుంది. 1.24 కోట్ల మంది అక్కచెల్లెమ్మలు దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు. ఆపదలో ఉన్నప్పుడు ఫోన్ను ఐదు సార్లు ఊపినా.. ఎస్వోఎస్ బటన్ నొక్కినా పోలీసులు వెంటనే వారి వద్ద ఉంటారు. రాష్ట్రంలో మంచి పోలీసన్న రూపంలో జగనన్న ఆ మహిళలకు గుర్తుకొస్తారు. ఎస్వోఎస్ కాల్ ఫీచర్ ద్వారా ఇప్పటికే 30,336 మంది అక్కచెల్లెమ్మలు సహాయం పొందారు. రాజకీయమంటే.. చంద్రబాబు, ఆయన పార్ట్నర్కు రాజకీయం, విశ్వసనీయత అంటే తెలియదు. చనిపోయిన తర్వాత ప్రతి ఇంట్లో మన ఫోటో ఉండాలనే ఆలోచన వారికి లేదు. వారికి తెలిసిన రాజకీయమంతా అధికారంలోకి రావడం.. దోచుకోవడం.. పంచుకోవడం.. తినడమే. రాజకీయం అంటే ఇది కాదు. చనిపోయిన తర్వాత కూడా ప్రతి మనిషి గుండెలో బతికి ఉండటం.. ప్రతి ఇంట్లో మన ఫోటో ఉండటం అన్నది మనకు తెలిసిన రాజకీయం. మీ బిడ్డ ఎవరితోనూ పొత్తు పెట్టుకోడు. నేరుగా ప్రజలతోనే మన పొత్తు. అబద్ధాలు, మోసాలను నమ్మకండి. మన ప్రభుత్వం వల్ల మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే దాన్ని మాత్రమే కొలమానంగా తీసుకోండి. కురుక్షేత్ర యుద్ధంలో మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలవండి. దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడూ ప్రజలను అడగడానికి ధైర్యం చేయని విషయాలను మీ బిడ్డ అడగగలుగుతున్నాడు. కష్టమైనా మాట తప్పలేదు.. మన ప్రభుత్వం చేసిన మంచి పనులే మన బలం. కోవిడ్ సమయంలోనూ, ఆదాయాలు తగ్గిన సమయంలో కూడా రాబడి తగ్గినా ఇచ్చి న మాటకు కట్టుబడి కష్టమైనా సరే సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు మంచి చేశాం. ఇదే మన బలం. మాట నిలబెట్టుకోవడం, విశ్వసనీయత అనే పదానికి నిజమైన అర్థం చెప్పడం మన బలం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుపేద వర్గాలకు అండగా నిలవడం మన బలం. అవ్వాతాతల గురించి ఆలోచించి సమయానికి వారికి మంచి చేయడం మన బలం. వ్యవసాయం, విద్య, ఆరోగ్య రంగాలలో మనం తెచ్చి న మార్పులు మన బలం. అధికార వికేంద్రీకరణ, పారదర్శకత వ్యవస్థ, లంచాల్లేని వ్యవస్థను గ్రామస్థాయిలో తీసుకురావడం మన బలం. ఇన్ని బలాలతో మనం ప్రజా క్షేత్రంలోకి వెళ్తున్నాం. ఏ గ్రామాన్ని చూసినా, ఏ నియోజకవర్గాన్ని చూసినా ప్రతి ఇంటికీ మనం చేసిన మంచే కనిపిస్తుంది. ప్రతి ఇంట్లో కూడా మనం తీసుకొచ్చి న మార్పు కనిపిస్తుంది. అలాంటప్పుడు వైనాట్ 175? అని అడుగుతున్నా. ‘సాక్షి’ తెలుగు న్యూస్ కోసం వాట్సాప్ చానల్ను ఫాలో అవ్వండి -
వైఎస్సార్సీపీలో సరికొత్త జోష్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ప్రతినిధుల సదస్సులో భాగంగా విజయవాడలో సీఎం వైఎస్ జగన్ చేసిన ప్రసంగం ఆ పార్టీ శ్రేణుల్లో సరికొత్త జోష్ను నింపింది. 175కి 175 స్థానాలను సాధించడమే లక్ష్యంగా ఎన్నికల కదన రంగంలోకి దూకడానికి సీఎం మాటలు బూస్ట్ ఇచ్చాయనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. గత 52 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, విప్లవాత్మక సంస్కరణల ద్వారా ప్రతి ఇంటికీ చేస్తున్న మంచిని వివరిస్తూ.. ప్రతిపక్షాల తీరును ఎండగడుతూ ముఖ్యమంత్రి చేసిన ప్రసంగం ఆ పార్టీ ప్రతినిధుల్లో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపయ్యేలా చేసింది. వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించేందుకు సేనానులుగా.. సైనికులుగా పోరాటం చేస్తామని ప్రతినిధులు నినదించారు. ‘2024లో వన్స్మోర్ జగనన్న’, ‘జగనన్నే మా భవిష్యత్తు’, ‘మా నమ్మకం నువ్వే జగన్’, ‘వైనాట్ 175’ నినాదాలతో ప్రతినిధుల సదస్సు ప్రాంగణం మార్మోగింది. ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడమే లక్ష్యంగా విజయవాడలో సోమవారం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పార్టీ ప్రతినిధుల సదస్సును వైఎస్సార్సీపీ నిర్వహించింది. పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, మండల పార్టీ అధ్యక్షుల వరకూ రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది వేల మందికిపైగా ప్రతినిధులు ఈ సమావేశానికి తరలివచ్చారు. 80 శాతం ప్రజల మద్దతుతో నూతనోత్సాహం.. గత సార్వత్రిక ఎన్నికల్లో 50 శాతం ఓట్లు, 151 శాసనసభ, 22 లోక్సభ స్థానాలతో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే మేనిఫెస్టోలో ఇచ్చిన 95 శాతం హామీలను సీఎం వైఎస్ జగన్ అమలు చేసి చూపారు. ఎక్కడా ఎలాంటి అవినీతికి తావులేకుండా, కులమతవర్గాలు, పార్టీలకతీతంగా అర్హతలున్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందించారు. దీంతో ప్రజల్లో వైఎస్సార్సీపీపై మరింత ఆదరణ పెరిగింది.ఆ తర్వాత మేనిఫెస్టోలోని వాగ్దానాలను 99 శాతం అమలు చేశారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. స్థానిక సంస్థల పదవుల నుంచి కేబినెట్ వరకూ సామాజిక న్యాయాన్ని ఆచరించి చూపారు. అన్ని పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు పెద్దపీట వేశారు. పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేసేలా భారీ ఎత్తున పోర్టులు, షిప్ యార్డ్లు చేపట్టడంతో అన్ని వర్గాల ప్రజల్లోనూ వైఎస్సార్సీపీకి ఆదరణ మరింత పెరిగింది. ఇది స్థానిక సంస్థల ఎన్నికలు.. తిరుపతి లోక్సభ.. ఆత్మకూరు, బద్వేలు శాసనసభ స్థానాల ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ రికార్డు విజయాలు సాధించడానికి దారితీసింది. దేశ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో ప్రభుత్వం చేసిన మంచిని ప్రతి ఇంటికీ చెప్పడానికి గతేడాది మే 11న చేపట్టిన గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా చేసిన మంచిని వివరిస్తూ.. ప్రతిపక్షాల దుష్ఫ్రచారాన్ని ఎండగడుతూ ఏప్రిల్ 7 నుంచి 29 వరకూ చేపట్టిన ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమానికి కూడా విశేష స్పందన లభించింది. 80 శాతం మంది ప్రజలు వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి మద్దతు పలకడం వైఎస్సార్సీపీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపింది. క్లీన్స్వీప్ ఖాయం.. ప్రభుత్వం చేసిన మంచి వల్ల ప్రతి ఇంట్లో, ప్రతి గ్రామంలో, ప్రతి నియోజకవర్గంలో కొట్టొచ్చినట్లు మార్పు కనిపిస్తోంది. ఇదే అంశాన్ని ప్రతినిధుల సదస్సులో సీఎం వైఎస్ జగన్ నొక్కిచెప్పడం శ్రేణుల్లో ఆత్మస్థైర్యాన్ని రెట్టింపు చేసింది. అధికారంలో ఉన్న ప్రభుత్వానికి, పార్టీకి ఇంత సానుకూలమైన వాతావరణం గతంలో ఎన్నడూ లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులతో తాము వైఎస్సార్సీపీ నేత, కార్యకర్తనంటూ ప్రజల్లో కాలరెగరేసుకుని తిరగగలుగుతున్నామని.. ఈ నేపథ్యంలో 175కు 175 స్థానాల్లో విజయం సాధించడం తథ్యమని విశాఖపట్నం జిల్లా నుంచి వచ్చిన ప్రతినిధి సతీశ్ ‘సాక్షి’కి చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదల్లో వైఎస్సార్సీపీకి అత్యంత అనుకూలమైన వాతావరణం ఉందని వైఎస్సార్సీపీ అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండ్రెడ్డి ప్రకాశ్రెడ్డి తెలిపారు. సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేసినట్లుగా కలిసికట్టుగా కదిలితే క్లీన్స్వీప్ చేయడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. -
ఏపీ సంక్షేమ పథకాలు ఆదర్శనీయం
ఏఎన్యూ: సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతి, సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, అవి లేకపోతే ఆ వర్గాల అభివృద్ధే లేదని పలువురు విద్యావేత్తలు, ఆర్థి కవేత్తలు అన్నారు. ఓపెన్ మైండ్స్ సంస్థ ఆధ్వర్యంలో ‘సంక్షేమం–అభివృద్ధి’ అనే అంశంపై ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో శుక్రవారం నిర్వహించిన సదస్సులో వారు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. అణగారిన వర్గాల సాధికారితకు సంక్షేమ పథకాలు అందించడం ప్రభుత్వాల కనీస బాధ్యత అని రాజ్యాంగం చెబుతోందని.. ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో అమలవుతున్న పలు ఉచిత పథకాలను వృథా అని కొందరు విమర్శించడం అర్థరహితమని చెప్పారు. అభివృద్ధి చెందిన ఫ్రాన్స్లో 31 శాతం, అమెరికాలో 30 శాతం, స్కాండినేవియాలో 29 శాతం నిధులు సంక్షేమానికి ఖర్చుచేస్తున్నారని.. మన దేశంలో 20 శాతం సంక్షేమానికి ఖర్చుచేస్తుండగా మన రాష్ట్రంలో 22 శాతం ఖర్చుచేస్తున్నారని వారు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎవరెవరు ఏమన్నారంటే.. సంక్షేమం లక్ష్యమే అభివృద్ధి.. ప్రభుత్వాలు అమలుచేసే సంక్షేమం ధ్యేయమే అభివృద్ధి.. అభివృద్ధి లక్ష్యమే సంక్షేమం. ఈ రెండింటినీ వేర్వేరుగా చూడటం సరికాదు. సంక్షేమంపై ప్రభుత్వం చేస్తున్న ఖర్చులో అభివృద్ధి, మానవ వనరుల వృద్ధి దాగి ఉన్నాయని గుర్తించాలి. విద్య, వైద్యం, ఇల్లు, మంచి ఆహారం, నీరు వంటి కనీస వసతులు కల్పించడం ప్రభుత్వాల కనీస బాధ్యత. ఆ బాధ్యత నెరవేర్చడంలో ఏపీ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది. ప్రజలకు కల్పించే పలురకాల ఉచిత పథకాలు వృథా, అనవసర ఖర్చు అనడం అర్థరహితం. ఏపీలో 2016లో 11.7 శాతం పేదరికం ఉంటే 2021–22కి అది 6 శాతానికి తగ్గింది. – డాక్టర్ ఎన్ రాజశేఖర్రెడ్డి, ఓపెన్ మైండ్స్ సంస్థ అధ్యక్షుడు,మాజీ మెంబర్ సెక్రటరీ అండ్ సీఈఓ ఏపీహెచ్ఈఆర్ఎంసీ రానున్న రోజుల్లో మరిన్ని విప్లవాత్మక సంస్కరణలు.. గడచిన నాలుగున్నరేళ్లలో ఏపీ ప్రభుత్వం అనేక ఆదర్శవంతమైన పథకాలు అమలుచేసింది. రానున్న రోజుల్లో మరిన్ని విప్లవాత్మక సంస్కరణలు అమలుచేసేందుకు సీఎం నిర్థిష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. వచ్చే ఏడాదిలో 8–10 తరగతులకు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వంటి అంతర్జాతీయ సాంకేతిక విద్యను అందించనున్నారు. నిజమైన అభివృద్ధిని కాంక్షించే వారు సంక్షేమాన్ని స్వాగతించాల్సిందే. – ఆచార్య ఈ. శ్రీనివాసరెడ్డి, అకడమిక్ డీన్, ఏఎన్యూ విద్యపై ఖర్చు భావితరాలపై పెట్టుబడే.. ప్రభుత్వం విద్యపై ఖర్చుచేస్తున్న నిధులు భావితరాలపై, దేశంపై పెడుతున్న పెట్టుబడే. దీనిని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా స్పష్టంచేశారు. విలువైన మానవ వనరులను తయరుచేసేందుకు, సామాజిక అసమానతలు రూపుమాపేందుకు, జాతీయ ఆర్థికాభివృద్ధికి, పేదరిక నిర్మూలనకు, సామాజిక, సాంకేతిక అభివృద్ధికి విద్య దోహదం చేస్తుంది. ఇన్ని అంశాలతో ముడిపడి ఉన్న విద్యకు అధిక ప్రాధాన్యమిస్తున్న ఏపీ ప్రభుత్వాన్ని అభినందించి తీరాలి. ఏపీ ప్రభుత్వం అమలుచేస్తున్న ద్విభాషా పుస్తకాల విధానాన్ని ప్రధాని మోదీ స్వయంగా అభినందించారు. ప్రపంచంలో చాలా ఫ్యూడల్ దేశాలు కూడా ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తుంటే దార్శనికతతో ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాన్ని విమర్శించడం అర్థరహితం. పాఠశాల విద్యకు సంబంధించిన చాలా సంస్కరణల్లో జాతీయ గణాంకాల కంటే ఏపీ అగ్రస్థానంలో ఉంది. ఎయిడెడ్ విద్యా సంస్థలను ప్రభుత్వంలో విలీనం చేయడం ఆదర్శవంతమైన సంస్కరణ. అంతర్జాతీయ విద్య, బోధనా ప్రమాణాలకు అధిక ప్రాధాన్యమివ్వడం హర్షణీయం. – ఆచార్య జంధ్యాల బిజి తిలక్, మాజీ వైస్ చాన్సలర్ ఎన్యూఈపీఏ, న్యూఢిల్లీ రాజనీతిజు్ఞలు మంచి మార్పు కోసం పాటుపడతారు.. రాజకీయ నాయకులు ఓట్ల కోసం పథకాలు అమలుచేస్తే రాజనీతిజు్ఞలు మంచి మార్పుకోసం పాటుపడతారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంచి మార్పుకోసం పాటుపడుతున్న రాజనీతిజు్ఞడు. అణగారిన వర్గాల సాధికారిత, ప్రపంచ స్థాయి అవకాశాల కల్పన, మానవ వనరుల అభివృద్ధి, పేదరికం నిర్మూలనకు దోహదం చేసే అన్ని సంస్కరణలు, పథకాలు ఏపీలో చిత్తశుద్ధితో అమలుచేస్తున్నారు. అణగారిన వర్గాలకు అవకాశాలు కల్పిస్తే ప్రపంచస్థాయి అద్భుతాలు సృష్టిస్తారనే వాస్తవాన్ని ఏపీ ప్రభుత్వం చాటిచెప్పింది. రానున్న రోజుల్లో మన దేశంలో యువ సంపద తగ్గే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఉన్న యువతను ప్రయోజకులుగా తీర్చిదిద్దటంలో అన్ని రాష్ట్రాలకు ఏపీ ఆదర్శంగా నిలుస్తోంది. – బి.జి. తిలక్, ప్రముఖ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు ఏపీలో నిజమైన అభివృద్ధి ప్రపంచంలో పురాతన కాలం నుంచి సాగిన ఆదర్శ పాలనలన్నీ సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చాయి. ఇప్పటివరకు అనేక అభివృద్ధి అంశాల్లో దేశానికి కేరళ ఆదర్శంగా నిలిస్తే కేరళకు ఆదర్శవంతమైన సంస్కరణలు కూడా ప్రస్తుతం ఏపీలో అమలవుతున్నాయి. ఏపీలో జరుగుతున్న నిజమైన అభివృద్ధిని క్షేత్రస్థాయిలో యూనివర్సిటీలు అధ్యయనం చేసి సమాజానికి తెలియజేయాలి. – ఆచార్య పి. రాజశేఖర్, వీసీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పథకాలే కాదు వాటి అమలూ ఆదర్శనీయం.. ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలే కాదు వాటి అమలునూ ఆదర్శవంతంగా చేస్తోంది. నిరక్షరాస్యత నిర్మూలన ద్వారా పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం ఖర్చుచేస్తోంది. పేదలను శాశ్వత అభివృద్ధి వైపు నడిపించే గొప్ప మార్గం విద్య మాత్రమే. దానిని సీఎం జగన్ చిత్తశుద్ధితో అమలుచేస్తున్నారు. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల వైపు వెళ్లాలంటేనే చాలామంది ఇష్టపడే వారు కాదు. కానీ, నేడు ఏపీలో పాఠశాలల ముందు నిలబడి ఫొటోలు దిగుతున్నారు. నాడు–నేడు, అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద వంటి సంక్షేమ కార్యక్రమాల్లో ఎంతో దార్శనికమైన సమగ్రాభివృద్ధి దాగి ఉంది. – ఆచార్య ఎన్. వెంకట్రావు, వీసీ, అంబేడ్కర్ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం సంక్షేమ పథకాలు కనీస బాధ్యత.. ఏపీలో అమలుచేస్తున్న అనేక సంక్షేమ పథకాలు కొందరు విలాసాలని అంటున్నారు. అది సరికాదు. ప్రభుత్వం తన కనీస బాధ్యతను నెరవేరుస్తోంది. ఆహారం, వసతి, మంచి దుస్తులు వంటి ప్రాథమిక అవసరాలు తీర్చడం ప్రభుత్వాల బాధ్యత అనేది అందరూ గుర్తించాలి. విద్యపై ప్రభుత్వం పెడుతున్న పెట్టుబడి అభివృద్ధిలో భాగమే. విద్య, ఆరోగ్యం వంటి రంగాలకు ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యమివ్వడం వల్ల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. ఏపీలో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడం ఎంతో దార్శనికమైన నిర్ణయం. – ఆచార్య బి. కరుణ, రిజిస్ట్రార్ , ఏఎన్యూ -
జననేత తీసుకొచ్చిన పథకం వల్ల లాభాలు ఇవే
-
సొంతింటి కల నెరవేరింది....మరువలేని నేత వైఎస్సార్
-
కొలంబియా యూనివర్సిటిలో ప్రసంగించిన ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులు
అంతర్జాతీయ వేదిక కొలంబియా యూనివర్సిటిలో ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులు ప్రసంగించారు.ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాత్మక మార్పులు ఫలితాన్నిస్తున్నాయి. విద్యారంగంలో తీసుకువచ్చిన మార్పులు అంతర్జాతీయ వేదికలపై విద్యార్ధుల రూపంలో ప్రతిబింబిస్తున్నాయి. ఎల్లలు దాటి ప్రపంచ ప్రఖ్యాతిని పొందుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంక్షేమ పధకాలపై స్పెషల్ స్టోరీ. పదిరోజుల అమెరికా పర్యటన కోసం న్యూయార్క్ చేరుకున్న ఏపీ విద్యార్ధుల బృందం మొదటి రోజు ఐక్యారాజ్య సమితిలో సస్టైనబుల్ డెవలప్ మెంట్ యాక్షన్ వీకెండ్ లో పాల్గొన్నారు. మరుసటి రోజు ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన అమెరికా న్యూయార్క్ లోని కొలంబియా యూనివర్సిటీ లో జరుగుతున్న “ఎడ్యుకేట్ ఏ చైల్డ్”, US ట్రాన్స్ఫార్మింగ్, యూత్-లెడ్ ఇన్నోవేషన్, గ్లోబల్ సిటిజన్షిప్ ఎడ్యుకేషన్ సమ్మిట్ సెమినార్ లో యునైటెడ్ నేషన్స్ మెంబర్ ఉన్నవ షకిన్ కుమార్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ప్రపంచ స్ధాయి విద్యావేత్తలు, ప్రొఫెసర్ల ముందు ఆంధ్రప్రదేశ్ విద్యా సంస్కరణల గురించి అంతర్జాతీయ వేదికపై మాట్లాడారు మన ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులు. అందరూ చదువుకోవాలనే లక్ష్యంతో ఆంధ్ర ప్రదేశ్లో అక్షరాస్యత పెంచే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకు వస్తున్న సంక్షేమ పథకాల్లో ముఖ్యమైన నాడు నేడు పథకం ద్వారా లబ్ధి పొంది చదువుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు తమకు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన మేలు అంతర్జాతీయ వేదికలపై చాటి చెప్తున్నారు. కొలంబియా యూనివర్సిటి డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ డాక్టర్ రాధికా అయ్యాంగార్ నిరుపేదల విద్యార్ధుల ఉన్నత చదువుల కోసం వైఎస్ జగన్ చేస్తున్న సేవలను కొనియాడారు. వైఎస్ జగన్ చేస్తున్న పేదరిక నిర్మూళన అందరికి విద్యా, వైద్యం కల్పిస్తున్న విధానం ఎంతో ఆకర్షించిందని ఆమె అన్నారు. కొలంబియా యూనిర్సిటి సెమినార్ లో పాల్గొన్న విద్యార్ధులు తాము భవిష్యత్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న జగనన్న విదేశీ విద్య ద్వారా అమెరికాలో చదువుకుంటామని తమ అభిప్రాయాన్ని కొలంబియా యూనివర్సిటిలో ప్రంపంచస్ధాయి విద్యావేత్తల ముందు చెప్పారు. దీనికి విద్యావేత్తలు హర్షం వ్యక్తం చేశారు. -
ప్రభుత్వ చర్యలు భేష్.. సీఎం జగన్కు యూనిసెఫ్ టీమ్ అభినందన
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని యూనిసెఫ్ ఫీల్డ్ ఆఫీస్ చీఫ్ జెలలీమ్ బి.టఫ్పెస్సే క్యాంపు కార్యాయంలో కలిశారు. ఈ సందర్బంగా గ్రామ, వార్డు సచివాలయాలకు అనుసంధానంగా పనిచేసేందుకు యూనిసెఫ్ ఫీల్డ్ ఆఫీస్ చీఫ్ సంసిద్థంగా ఉన్నట్టు తెలిపారు. అయితే.. వైద్య, ఆరోగ్యం రంగంలోని వివిధ స్థాయిల్లో ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ఫ్యామిలీ ఫిజీషియన్, ఆశా, అంగన్వాడీ వర్కర్స్, ఏఎన్ఎంలు, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ వంటి వివిధ స్థాయిల్లో ప్రభుత్వానికి అవసరమైన విధంగా తోడ్పాటు ఇచ్చేందుకు యూసిసెఫ్ ముందుకొచ్చినట్టు స్పష్టం చేశారు. ఈ క్రమంలో వివిధ రంగాల్లో ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై యూనిసెఫ్ బృందంతో సీఎం జగన్ చర్చించారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో ప్రభుత్వం ముందుకెళ్తున్న తీరును ముఖ్యమంత్రి జగన్ వారికి వివరించారు. దీంతో, ప్రభుత్వ నిర్ణయాలను వారు అభినందించారు. ఇక, చిన్నారుల ఆరోగ్యానికి సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, వారికి అందజేస్తున్న పౌష్టికాహారం, యాక్షన్ ప్లాన్, మహిళా రక్షణ, గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పర్యవేక్షణ, మహిళా పోలీసుల ద్వారా మహిళలు, చిన్నారులపై జరిగే అఘాయిత్యాలను అరికట్టడం వంటి కీలక అంశాలపై ప్రభుత్వానికి అవసరమైన సాయాన్ని యూనిసెఫ్ అందిస్తామని తెలిపారు. కాగా, ఆరోగ్య సురక్ష పేరుతో త్వరలోనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు యూనిసెఫ్ ప్రతినిధులకు సీఎం జగన్ తెలిపారు. ఇది కూడా చదవండి: ఏపీలో వ్యవసాయ రంగ పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష.. ఆదేశాలు ఇవే.. -
అర్హులకు లబ్ధే లక్ష్యం
సాక్షి, అమరావతి: కొత్తగా మరో 1,49,875 మందికి సామాజిక పెన్షన్లు మంజూరు చేసినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. వచ్చే నెల నుంచి వీరికి పెన్షన్లు అందుతాయని చెప్పారు. అలాగే కొత్తగా 2,00,312 బియ్యం కార్డులు మంజూరు చేశామని, వీరికి వచ్చే నెల నుంచి రేషన్ అందుతుందన్నారు. 4,327 మందికి వైఎస్సార్ ఆరోగ్య శ్రీ కార్డులు మంజూరు చేయడంతో పాటు మరో 12,069 మందికి ఇళ్ల స్థలాలను కూడా ఇస్తున్నామని తెలిపారు. 2022 డిసెంబర్ నుంచి 2023 జూలై వరకు అమలైన వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ కారణం చేతనైనా లబ్ధి అందని 2,62,169 మంది అర్హులకు లబ్ధి చేకూరుస్తూ గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్లో బటన్ నొక్కి వారి ఖాతాల్లో రూ.216.34 కోట్లు జమ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎక్కడా లంచాలు, వివక్షకు చోటు ఇవ్వకుండా.. కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా.. మనకు ఓటు వేయకపోయిన ఫర్వాలేదు, అర్హత ఉంటే చాలు ప్రతి ఒక్కరికీ కచ్చితంగా లబ్ధి కలిగించాలని తాపత్రయ పడుతూ అడుగులు ముందుకు వేస్తున్న ప్రభుత్వం మనదని చెప్పారు. అర్హత ఉన్నప్పటికీ ఏ కారణం వల్ల అయినా లబ్ధి కలుగకపోతే మళ్లీ దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి మేలు చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే ఇవాళ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. అధికారం అంటే అజమాయిషీ చేయడం కాదని, ప్రజల పట్ల మమకారం చూపడమని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. కొత్తగా పింఛన్, బియ్యం, ఆరోగ్యశ్రీ కార్డులు ► ఈ ఆరు నెలల్లో కొత్తగా పింఛన్, బియ్యం, ఆరోగ్యశ్రీ కార్డులు, ఇళ్ల స్థలాలకు సంబంధించి కూడా కొత్తగా దరఖాస్తు పెట్టుకుంటే.. వెరిఫికేషన్ చేసి మంజూరు చేస్తున్నాం. ఇందులో భాగంగా 1,49,875 మందికి కొత్తగా పెన్షన్లు ఇవ్వడంతో.. రాష్ట్రంలో మొత్తం పెన్షన్ల సంఖ్య దాదాపు 64.27 లక్షలకు చేరుకుంది. ► గత ప్రభుత్వ హయాంలో ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు అంటే 2018 అక్టోబర్ వరకు కేవలం 39 లక్షలు మాత్రమే ఉన్నాయి. ఇవాళ ఆ సంఖ్య 64.27 లక్షలకు పెరిగింది. అప్పట్లో ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు అంటే 4 సంవత్సరాల పది నెలల కాలంలో కేవలం రూ.1,000 పింఛన్ మాత్రమే ఇస్తున్న పరిస్థితి. ఇవాళ రూ.2,750 ఇస్తున్నాం. ► ఇప్పుడు కొత్తగా మంజూరు చేసిన 2,00,312 కార్డులతో కలుపుకుంటే.. మొత్తం 1,48,12,934 బియ్యం కార్డులు ఉన్నాయి. అదే విధంగా కొత్తగా మంజూరు చేస్తున్న 4,327 ఆరోగ్యశ్రీ కార్డులతో కలుపుకుంటే.. మొత్తం వాటి సంఖ్య 1,42,15,820కు చేరింది. ఈ రోజు మంజూరు చేస్తున్న ఇళ్ల పట్టాలు 12,069 కలుపుకుంటే.. మొత్తంగా వాటి సంఖ్య 30,84,935కు చేరింది. జగన్ మళ్లీ సీఎం కావాల్సిందే రాష్ట్రంలో ప్రజలు ఎప్పుడూ ఆనందంగా ఉండాలని సీఎం జగన్ అనుక్షణం పరితపిస్తున్నారు. ఎక్కడా రూపాయి లంచం లేకుండా శాచురేషన్ మోడ్లో పథకాలు అందిస్తున్నారు. మేం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇంటింటికీ వెళ్లినప్పుడు ప్రజల్లో జగన్ పట్ల నమ్మకం స్పష్టంగా కనిపించింది. మా మనవడు మాకు మేలు చేస్తున్నారని అవ్వాతాతలు, మా మామ సాయం చేస్తున్నారని చిన్నారులు, మా అన్న వల్ల మేం బాగుపడుతున్నామని అక్కచెల్లెమ్మలు సంతోషంగా చెప్పడం స్వయంగా విన్నాం. ఈ రాష్ట్రానికి జగన్ మళ్లీ సీఎం కావాల్సిందేనని, అప్పుడే ఆనందంగా ఉంటామని ప్రజలు చెబుతున్నారు. – బూడి ముత్యాలనాయుడు, డిప్యూటీ సీఎం పేదల కళ్లలో ఆనందం పారదర్శకత, కుల మతాలకు.. ప్రాంతాలకు అతీతంగా అర్హులందరికీ లబ్ధి కల్పించడం, జవాబుదారీతనం ప్రతి దశలోనూ కనిపిస్తోంది. గడప గడపకు మన ప్రభుత్వం, జగనన్నకు చెబుదాం, జగనన్న సురక్ష కార్యక్రమాల వల్ల ప్రజలకు ఎంతో మేలు జరిగింది. ఒక్క రూపాయి కూడా అవినీతి జరగకుండా రూ.2.33 లక్షల కోట్లు సాయం చేయడం దేశంలోనే రికార్డు. గత ప్రభుత్వాలు ఎన్నడూ ఇలా చేయలేదు. ఏ పథకాలు ఎవరికి ఇచ్చారో తెలియని పరిస్థితి. ఇప్పుడు అర్హులను వెతికి మరీ లబ్ధి చేకూరుస్తున్నారు. ప్రతి పేదవాడి కళ్లలో సంతోషం కనిపిస్తోంది. ఇది ప్రతిపక్షాలకు కంటగింపుగా మారింది. – ఆదిమూలపు సురేష్, మంత్రి వివిధ పథకాల కింద 2.62 లక్షల మందికి లబ్ధి ► జగనన్న చేదోడు కార్యక్రమం ద్వారా 43,170 మందికి మళ్లీ లబ్ధి కలిగిస్తున్నాం. 207 మందికి వైఎస్సార్ మత్స్యకార భరోసా అందిస్తున్నాం. 1,08,000 మంది రైతులకు సున్నా వడ్డీ పంట రుణాలు, ఇన్పుట్ సబ్సిడీ అందిస్తున్నాం. జగనన్న విద్యా దీవెన సొమ్మును మరో 32,770 మంది తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. ► జగనన్న వసతి దీవెన ద్వారా 36,898 మంది తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నాం. 8,753 మందికి వైఎస్సార్ ఈబీసీ నేస్తం, 267 మందికి వైఎస్సార్ నేతన్న నేస్తం, 16,717 మందికి జగనన్న అమ్మఒడి.. ఇలా మొత్తంగా 2.62 లక్షల మందికి వివిధ పథకాలను అందిస్తున్నాం. 94,62,184 మందికి సర్టిఫికెట్లు ► రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల 15,004 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో వలంటీర్లు, సచివాలయ సిబ్బంది, స్థానిక నాయకులు, ప్రతి ఇంటికీ వెళ్లి.. జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. వివిధ పథకాలకు అర్హులైన వారెవరూ మిగిలిపోకూడదన్న తపనతో ఈ కార్యక్రమం చేపట్టాం. ఇందులో భాగంగా 94,62,184 మందికి వివిధ సర్టిఫికెట్లు ఇచ్చాం. ► ఇలా ప్రతి ఇంటికి వెళ్లినప్పుడు 12,405 మంది అర్హులై ఉండి.. వివిధ కారణాల వల్ల మిగిలిపోయిన వారికి కూడా లబ్ధి చేకూరుస్తున్నాం. జగనన్నకు చెబుదాం కార్యక్రమం ద్వారా.. కాల్ సెంటర్కు ఫోన్ చేసిన 1,630 మంది కూడా అర్హులని తేలడంతో వారికి కూడా మంచి చేస్తున్నాం. మళ్లీ మిమ్మల్నే గెలిపించుకుంటాం నమస్తే సార్.. నేను చేనేత కార్మికుడిని. గతంలో కూలి మగ్గం నేసేవాడిని. ఇప్పుడు సొంత మగ్గం నేస్తున్నాను. గత జూలైలో నేతన్న నేస్తం పథకానికి దరఖాస్తు చేసుకుని, వెరిఫికేషన్ సమయంలో లేకపోవడంతో రాలేదు. మళ్లీ దరఖాస్తు చేసుకుంటే ఇప్పుడు అప్రూవ్ అయ్యి డబ్బులు రావడంతో సంతోషంగా ఉంది. ఈ డబ్బుతో పనితనం మరింత మెరుగు పరుచుకుంటాను. మీ వల్ల సొంతింటి కల నెరవేరింది. ఇతర పథకాలు కూడా అందుతున్నాయి. స్కూళ్ల స్వరూపం పూర్తిగా మార్చేశారు. సచివాలయంలోనే అన్ని పనులు జరుగుతున్నాయి. మళ్లీ మిమ్మల్నే గెలిపించుకుంటాం. – నాగశేషు, ధర్మవరం, శ్రీ సత్యసాయి జిల్లా ఇలాంటి పాలన చూడలేదు అన్నా.. నాకు ఇద్దరు పిల్లలు. అమ్మ ఒడి మూడో విడత రాలేదు. ఎందుకు రాలేదని బాధ పడుతుండగా, వలంటీర్ వచ్చి మీ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ లింక్ కాలేదన్నారు. లింక్ చేసి వలంటీర్కు చెప్పాక అమ్మ ఒడి వచ్చింది. గతంలో ఏదైనా పథకం కోసం మేం ఆఫీస్ల చుట్టూ తిరిగేవాళ్లం. ఇప్పుడు గడప దగ్గరకే అన్నీ వస్తున్నాయి. మా పాలిట మీరు దేవుడు అన్నా. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిపాలన చూడలేదు. – కళ్యాణి, భీమిలి మండలం, విశాఖపట్నం జిల్లా డైనమిక్ లీడర్ అంటే మీరే.. అన్నా నమస్కారం.. నేను 15 ఏళ్లుగా టైలరింగ్ వృత్తిలో ఉన్నాను. టెక్నికల్ ప్రాబ్లమ్ వల్ల రెండోసారి చేదోడు పథకం కింద లబ్దిపొందలేక పోయాను. తిరిగి దరఖాస్తు చేసుకుంటే ఇప్పుడు మంజూరైంది. మా ఇద్దరు పిల్లలను ఇంగ్లిష్ మీడియంలో చదివించలేకపోయాననే బాధ గతంలో ఉండేది. ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్కు దీటుగా ప్రభుత్వ స్కూల్స్ను మార్చారు. ఇంత మార్పు వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు. అందరూ లీడర్స్ అవుతారు కానీ ప్రజల హృదయాల్లో నిలిచిపోయే డైనమిక్ లీడర్ మీరే అన్నా.. – నాగరాజ, తిమ్మాయపాలెం, అద్దంకి మండలం, బాపట్ల జిల్లా -
ఏపీ ప్రజలకు గుడ్న్యూస్.. కొత్త పెన్షన్, బియ్యం, ఆరోగ్యశ్రీకార్డులు..
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ పథకాల ఫలాలను సంతృప్త స్థాయిలో అందిస్తున్నారు. ఈ క్రమంలో ఏదైనా కారణం చేతనైనా వివిధ సంక్షేమ పథకాలను అందుకోలేక మిగిలిపోయిన అర్హులకు కూడా లబ్ధి చేకూర్చారు. ఈ క్రమంలో వారి ఖాతాల్లోకి డబ్బు జమ చేశారు. ఈ నేపథ్యంలో 2022 డిసెంబర్ నుంచి 2023 జూలై వరకు అమలైన వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ కారణం చేతనైనా లబ్ధి పొందని 2,62,169 మంది అర్హులకు రూ.216.34 కోట్లను సీఎం జగన్ అందజేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం.. క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి ఖాతాల్లో జమ చేశారు. దీంతోపాటు ఇదే సమయానికి సంబంధించి కొత్తగా అర్హత పొందిన మరో 1,49,875 మందికి పెన్షన్లు, 4,327 మందికి ఆరోగ్యశ్రీ కార్డులు, 2,00,312 మందికి రేషన్ కార్డులు, 12,069 మందికి ఇళ్ల పట్టాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా పథకాలు అందజేస్తున్నాం. ఏ కారణం చేతనైనా పథకాలు లబ్ధి అందని వారికి కూడా అందజేస్తున్నాం. అధికారమంటే అజమాయిషీ కాదు, ప్రజల పట్ల మమకారం చూపడం. కొత్త పెన్షన్, బియ్యం, ఆరోగ్యశ్రీకార్డులు అందజేస్తున్నాం. పెన్షన్ల సంఖ్య మొత్తం 64లక్షల 27వేలకు చేరుకుందన్నారు. గత ప్రభుత్వంలో రూ.1000 ఉన్న పెన్షన్ ప్రస్తుతం రూ.2750కి చేరిందన్నారు. జగనన్న చేదోడు ద్వారా 43,131 మందికి సాయం అందిస్తున్నట్టు తెలిపారు. ఇంటింటా ప్రతీ ఒక్కరికీ మంచి చేస్తున్న ప్రభుత్వం మనది. ప్రజలకు మంచి చేయడానికి నాలుగు అడుగులు ముందేకేసే బాధ్యత నాది. దాన్ని నిలబెట్టుకుంటూ వివిధ కారణాల వల్ల పథకాలు అందుకోలేకపోయిన వారికి లబ్ధి చేకూరుస్తున్నాం’ అని స్పష్టం చేశారు. అనంతరం, లబ్ధిదారులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాల అమలుపై సంతోషం వ్యక్తం చేశారు. సీఎం జగన్కు రుణపడి ఉంటామన్నారు. ఇది కూడా చదవండి: గిరిజనం ముంగిట విద్యావనం -
అర్హులు ఒక్కరూ మిగిలిపోకూడదని..
సాక్షి, అమరావతి: అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు సంతృప్త స్థాయిలో అందాలన్న కృత నిశ్చయంతో పారదర్శక విధానాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏ కారణం చేతనైనా వివిధ సంక్షేమ పథకాలను అందుకోలేక మిగిలిపోయిన అర్హులకు కూడా లబ్ధి చేకూర్చనున్నారు. 2022 డిసెంబర్ నుంచి 2023 జూలై వరకు అమలైన వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ కారణం చేతనైనా లబ్ధి పొందని 2,62,169 మంది అర్హులకు రూ.216.34 కోట్లను గురువారం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి ఖాతాల్లో జమ చేయనున్నారు. దీంతోపాటు ఇదే సమయానికి సంబంధించి కొత్తగా అర్హత పొందిన మరో 1,49,875 మందికి పెన్షన్లు, 4,327 మందికి ఆరోగ్యశ్రీ కార్డులు, 2,00,312 మందికి రేషన్ కార్డులు, 12,069 మందికి ఇళ్ల పట్టాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. మిగిలిపోయిన అర్హులకు ఏటా రెండు దఫాలు.. అర్హులై ఉండి కూడా సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందని వారు ఆయా పథకాలను అందించిన నెలలోపు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. వెరిఫికేషన్ అనంతరం.. మిగిలిపోయిన అర్హులకు కూడా ఆర్నెళ్లకు ఒకసారి ప్రభుత్వం ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా సోషల్ ఆడిట్ కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాలను ప్రదర్శిస్తూ పారదర్శకంగా వ్యవహరిస్తోంది. లంచాలు, వివక్షకు తావులేకుండా అర్హులందరికీ నూటికి నూరు శాతం సంతృప్త స్థాయిలో ప్రయోజనాన్ని చేకూరుస్తోంది. అర్హులైనప్పటికీ ఏ కారణం చేతనైనా ప్రయోజనం పొందని వారికి గురువారం అందిస్తున్న మొత్తంతో కలిపి 2021 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు నాలుగు పర్యాయాల్లో రూ.1,647 కోట్ల మేర లబ్ధి చేకూరుతోంది. జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటిని జల్లెడ పట్టి 94,62,184 సర్టిఫికెట్ల జారీతో పాటు కొత్తగా అర్హులుగా గుర్తించిన మరో 12,405 మందికి నేడు లబ్ధి చేకూరనుంది. జగనన్నకు చెబుదాం ద్వారా అందిన దరఖాస్తుల్లో అర్హులైన 1,630 మందికి కూడా నేడు ప్రయోజనం కలగనుంది. అధికారంలోకి వచ్చిన 50 నెలల్లోనే వివిధ సంక్షేమ పథకాల ద్వారా లంచాలు, వివక్షకు తావు లేకుండా డీబీటీ రూపంలో నేరుగా రూ.2.33 లక్షల కోట్లను పేదల ఖాతాల్లో సీఎం జగన్ జమ చేశారు. గత ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీల సిఫారసులు, లంచాలకే పెద్దపీటతోపాటు వీలైనంత ఎక్కువ మందికి ఎగ్గొట్టడమే లక్ష్యంగా వ్యవహరించగా ఇప్పుడు అలాంటి వాటికి ఏమాత్రం తావు లేకుండా పూర్తి పారదర్శకంగా అర్హులందరికీ సంతృప్త స్థాయిలో ప్రయోజనాన్ని చేకూరుస్తున్నారు. -
ఇదే కదా సుపరిపాలన అంటే..: కొమ్మినేని
సాక్షి, శ్రీకాకుళం: తమకు అందుతున్న నిరంతర సేవలను దృష్టిలో వుంచుకుని రాష్ట్రంలో సుపరిపాలన అమలవుతుందా లేదా అని ఎవరికి వారు స్వీయ పరిశీలన చేసుకోవాలని ఆంధ్ర ప్రదేశ్ సి.ఆర్.మీడియా అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు. డా.బి.ఆర్. అంబేద్కర్ యూనివర్సిటీ సమావేశ మందిరంలో “సుపరిపాలన దిశగా ఆంధ్ర ప్రదేశ్ రూపాంతరం” అంశంపై అవర్ స్టేట్ అవర్ లీడర్, వై.ఎస్.ఆర్ ఇంటలెక్ట్యువల్ ఫోరం ఆధ్వర్యం లో మంగళవారం ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తమ అవసరాల కోసం ఎవరి దయాదాక్షిణ్యాలు కోసం యాచించాల్సిన అవసరం లేని వ్యవస్థను ప్రభుత్వంలో ప్రవేశపెట్టి తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని చాటి చెప్పారన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు సుపరిపాలనలో భాగమన్నారు. గతంలో రైతులు వ్యవసాయ ఇన్ పుట్స్ కోసం ధర్నాలు, ఆందోళనలు చేసేవారని, ఆ పరిస్థితిలో పూర్తి మార్పు వచ్చిందన్నారు. వృద్ధులకు, వితంతువులకు పెన్షన్లకోసం మండల కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి నుంచి ఇంటికే వచ్చే ఏర్పాటు విజయవంతంగా అమలు అవుతోన్నదన్నారు. ఇదే సుపరిపాలన అంటేనని తెలుసుకోవాలన్నారు. అభివృద్ధి జరగడం లేదన్న వాదన సరికాదన్నారు. విశాఖలో అదానీ డేటా సెంటరు, భోగాపురం విమానాశ్రయం, రామాయపట్నం, మచిలీపట్నంలో పోర్టులు వంటి వి అభివృద్ధి కాదా అని ఆయన ప్రశ్నించారు. ఉద్దానం లో కిడ్నీ పరిశోధనా కేంద్రం ఏర్పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి మానవతా థృక్పధానికి నిదర్శనమని కొనియాడారు. శ్రీ శ్రీ, గురజాడ, గరిమెళ్ళ, వంగపండు, వంటి ఉత్తరాంధ్ర కవులను, వ్యావహారిక భాషా వేత్త గిడుగు రామ్మూర్తిని, కాళీపట్నం రామారావును ఆయన ప్రసంగంలో ప్రస్తావించారు. తమ ప్రసంగంలో ఆద్యంతం సుపరిపాలన పై విద్యార్థులు ప్రతి స్పందనను ఆయన అడిగి తెలుసుకున్నారు. అంబేద్కర్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొ. నిమ్మ వెంకట రావు మాట్లాడుతూ, సీఎం జగన్ ప్రవేశ పెట్టిన “నవరత్నాల” పథకంలో మహాత్మా గాంధీ, జ్యోతిబా ఫూలే, ఆర్ధిక వేత్త అమర్త్య సేన్ ల సిద్ధాంతాలు యిమిడి వున్నాయన్నారు. వృద్ధులు, వితంతువులు, విభిన్న ప్రతిభావంతుల పెన్షన్లు వారి ఇంటివద్దనే, ఒకటో తేదీనే అందించే వ్యవస్థను ఏర్పాటు చేయడం వారికి పేదలు, నిస్సహయుల పట్ల వున్న అనుకూల ధృక్పధాన్ని మనం తెలుసు కోవచ్చన్నారు. చదవండి: అమ్ముడుపోను.. చావుకు భయపడను: పోసాని విద్యకు వృత్తి పరమైన నైపుణ్యాన్నిజోడించడంద్వారా ఉన్నత విద్య అనంతరం యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగు పరిచిందన్నారు. ఆర్ధిక పరమైన అన్ని అంశాలను మహిళలకు కేటాయించడం ద్వారా వారి సాధికారితకు నిజమైన నిర్వచనాన్నిఇచ్చారన్నారు. తమ పిల్లలను పాఠశాలకు పంపేందుకు తల్లితండ్రులకు ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా విద్యా సంస్థలపై తల్లులకుప్రశ్నించే అధికారాన్ని కల్పించారని ఆయన పేర్కొన్నారు ఇదంతా సుపరిపాలనలో భాగమని ఆయన తెలిపారు. పరిపాలన అందరికీ ఉపయోగంగా, ఉపయుక్తంగా వుండాలని అందుకు నిదర్శనంగా ఈ ప్రభుత్వం నిలుస్తుందన్నారు. సభకు అధ్యక్షత వహించిన నాగార్జున యూనివర్సిటి రిటైర్డ్ వీసీ వి.బాల మోహన్దాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ప్రజలకు పథకాలు అందజేయడంలో తండ్రి కి మించిన తనయుడు సీఎం జగన్ అని కొనియాడారు. విద్యకు ప్రాధాన్యత కల్పిస్తూ ప్రవేశపెట్టిన విద్యా కానుక, విద్యా దీవెన, విదేశీయ విద్యా దీవెనలకు సంబంధించి కొనియాడారు. ఈ కార్యక్రమంలో అవర్ స్టేట్ అవర్ లీడర్ వైఎస్సార్ ఇంటలెక్చరర్ ఫోరమ్ చైర్మన్ జి. శాంతమూర్తి, ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ బి.అర్ధయ్య, సైన్స్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఉదయభాస్కర్, ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జి. రాజేష్, సి.హెచ్. కృష్ణారావు, డా. సి.హెచ్. రాజశేఖర్, ఇ. కామరాజు, పొన్నాల వెంకట లక్ష్మణరావు ప్రొఫెసర్ కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
Times Now ETG Survey: మళ్లీ వైఎస్సార్సీపీ ప్రభంజనం ఖాయం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని టైమ్స్ నౌ సర్వేలో మరోసారి స్పష్టమైంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 24 నుంచి 25 లోక్సభ స్థానాల్లో ఆ పార్టీ విజయ దుందుభి మోగిస్తుందని తెలిపింది. ఏప్రిల్లో నిర్వహించిన సర్వేలో వైఎస్సార్సీపీ ఏకపక్షంగా విజయం సాధిస్తుందని తేలిన విషయం తెలిసిందే. జూన్ 15– ఆగస్టు 12వ తేదీ మధ్య తాజాగా మరోసారి నిర్వహించిన సర్వేలోనూ అవే ఫలితాలు పునరావృతమయ్యాయని తెలిపింది. ఏప్రిల్లో జరిగిన సర్వే, తాజా సర్వే ఫలితాల మధ్య స్వల్ప తేడా మాత్రమే ఉన్నట్లు పేర్కొంది. ఆ తేడా జాతీయ స్థాయి ఫలితాల్లోనే కనిపించింది. ఏపీకి సంబంధించి గతంలో మాదిరిగానే 24 నుంచి 25 ఎంపీ స్థానాల్లో వైఎస్సార్సీపీ గెలుస్తుందని తేలింది. కాగా, 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్సీపీ 49.8 శాతం ఓట్లతో 22 స్థానాల్లో నెగ్గింది. ఈసారి 51.3 శాతం ఓట్లతో మొత్తం స్థానాలను తన ఖాతాలో వేసుకుంటుందని టైమ్స్ నౌ సర్వే తేల్చడం విశేషం. అంటే కిందటి ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు ఆ పార్టీ ఓట్ల శాతం 1.50 శాతం పెరుగనున్నట్లు స్పష్టమవుతోంది. వైఎస్సార్సీపీ పట్ల నానాటికీ పెరుగుతున్న ప్రజాదరణకు ఇదే నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పేదలకు నిరంతరాయంగా అందిస్తున్న సంక్షేమ పథకాలు, జనాభాలో దాదాపు 90 శాతం మందికి నేరుగా అందుతున్న నగదు సాయం, అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శక పాలన.. వైఎస్సార్సీపీకి జనాదరణను పెంచాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలో 175 అసెంబ్లీ స్థానాల్లోనూ విజయం సాధించడం అసాధ్యం కాదని ఆ పార్టీ తొలి నుంచి చెబుతోంది. If BJP joins TDP, they're strengthening Chandrababu Naidu. Else, YSRCP can sweep all 25 seats: @sreeramjvc, on seat share in AP as per @ETG_Research Survey In last 3 LS polls, Cong's highest seat share in K'taka was 9, while BJP has got 25: @Sanju_Verma_ tells @PadmajaJoshi pic.twitter.com/4xm06LEprr — TIMES NOW (@TimesNow) August 16, 2023 -
నాతో సీఎం కేసీఆర్ చెప్పిన మాట ఇదే..!
-
గిరిజనోత్సాహం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 34 తెగలకు చెందిన 27.39 లక్షల గిరిజనులు ఉన్నారు. 26 జిల్లాలకు గాను 9 సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థల (ఐటీడీఏ) పరిధిలో 16,068 గిరిజన ఆవాసాలున్నాయి. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక కార్యక్రమాలు గిరిపుత్రుల జీవన ప్రమాణాలను మరింత మెరుగుపరిచాయి. 2019–20 నుంచి 2023–24 వరకు ఎస్టీల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం మొత్తం రూ.20,948.15 కోట్లు వెచ్చించింది. నవరత్నాలు, ఇతర సంక్షేమ పథకాల్లో ప్రతి గిరిజనులకు రెండుకు మించిన పథకాల ద్వారా లబ్ధి కలిగింది. ప్రత్యక్షంగా (డీబీటీ), పరోక్షంగా (నాన్ డీబీటీ) ఇప్పటివరకు గిరిజనులకు రూ.14,712.08 కోట్ల ప్రయోజనం చేకూరింది. ఆదివాసీలకు ఇంత భారీస్థాయిలో ఆర్థిక ప్రయోజనం చేకూరడం రాష్ట్ర చరిత్రలోనే రికార్డు. వైద్య రంగానికి సంబంధించి.. గిరిజన ప్రాంతాల్లో వైద్య సదుపాయాలను మెరుగుపరిచేందుకు ప్రత్యేక వైద్య కళాశాలల నిర్మాణంతోపాటు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటుకు ప్రభుత్వం రూ.746.30 కోట్లను మంజూరు చేసింది. రక్తహీనత కారణంగా బాలింతలు, శిశువులు మరణిస్తున్న విషయం తెలుసుకున్న సీఎం వైఎస్ జగన్ గిరిజన ప్రాంతాల్లో గిరి గోరుముద్ద, బాల సంజీవని, పోషకాహార బుట్ట వంటి ప్రత్యేక వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఏజెన్సీలో 2,652 మంది గిరిజన కమ్యూనిటీ హెల్త్ వర్కర్ (సీహెచ్డబ్ల్యూ)లకు 1995 నుంచి ఉన్న కేవలం రూ.400 జీతాన్ని రూ.4 వేలకు పెంచారు. నేడు సాలూరులో ఆదివాసీ దినోత్సవం అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని బుధవారం సాలూరులో ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర ముఖ్య అతిథిగా హాజరవుతారు. 20 రకాల గిరిజన నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. విద్యారంగంలో ఇలా.. రాష్ట్రవ్యాప్తంగా 2,506 గిరిజన సంక్షేమ విద్యాసంస్థల్ని నిర్వహిస్తూ.. 1,55,599 మంది విద్యార్థులకు వసతి, ఇతర సౌకర్యాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది రూ.920.31 కోట్లు కేటాయించింది. నాడు–నేడు మొదటి దశలో రూ.140 కోట్లతో గిరిజన విద్యా సంస్థలను తీర్చిదిద్దింది. రూ.153.853 కోట్లతో కురుపాంలో ఇంజినీరింగ్ కళాశాలను మంజూరు చేసింది. సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి విజయనగరం జిల్లా మెంటాడ, దత్తిరాజేరు మండలాల్లో 561.88 ఎకరాల భూమిని కేటాయించింది. ఉపాధి పరంగా.. అర్హులైన ప్రతి ఎస్టీ కుటుంబానికి కనీసం రెండు ఎకరాల భూమిని అందించేందుకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేసింది. 2019 ఆగస్టు నుంచి 2,15,309 ఎకరాల విస్తీర్ణంలో 1,26,997 ఆర్వోఎఫ్ఆర్ పట్టాలను, 39,272 ఎకరాల విస్తీర్ణంలో 26,287 డీకేటీ పట్టాలను పంపిణీ చేసింది. ఈ భూముల అభివృద్ధి కోసం ఉపాధి హామీ పథకం ద్వారా రూ.రూ.3,796.39 కోట్లు కేటాయించారు. 3 వేలకు పైగా బోర్లు వేయడంతోపాటు 2.27 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు, కాఫీ, మిరియాల సాగును అభివృద్ధి చేశారు. -
మీరు దయతలిస్తే మళ్లీ గెలుస్తా!
సిరిసిల్ల టౌన్/ సిరిసిల్ల: ‘ఓట్ల సమయంలో మందు, డబ్బులు పంచడం నాకు రాదు. అలాంటి అలవాటు నాకు లేదు. రాబోయే ఎన్నికల్లో సిరిసిల్ల ప్రజలు దయతలిస్తే మళ్లీ గెలుస్తా. అప్పుడు కూడా ఓ తమ్ముడిగా.. అన్నగా.. బిడ్డగా నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తా. బీద, బిక్కిలను కడుపులో దాచుకుని పనిచేస్తా..’అని రాష్ట్ర మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. పేదల గోసలు ఎరిగిన కేసీఆర్ లాంటి నాయకుడిని మరోసారి అధికారంలోకి తీసుకురావాలని కోరారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బీసీ బంధు పథకాన్ని మంత్రి ప్రారంభించారు. సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లోని 600 మందికి ఈ పథకం కింద చెక్కులు పంపిణీ చేశారు. వేములవాడలో ఆలయ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే రమేశ్బాబుతో కలిసి శంకుస్థాపన చేశారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. బీసీ బంధు నిరంతర ప్రక్రియ ‘రాష్ట్రంలోని అర్హులైన పేదవారు అడగకపోయినా సీఎం కేసీఆర్ వారికి సంక్షేమ పథకాలను అందిస్తున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుంచారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీ అయిన పసిబిడ్డ నుంచి పండు ముసలి వరకు అందర్నీ ఆదుకుంటున్నారు. కేసీఆర్ కిట్టు నుంచి ఆసరా పెన్షన్ల వరకు అన్ని విధాలా ఆదుకునే మనసున్న ఏకైక వ్యక్తి సీఎం కేసీఆర్. గడిచిన 9 ఏళ్లు సంక్షేమానికి స్వర్ణయుగంలా మారింది. బీసీ బంధు పథకాన్ని ప్రతి నియోజకవర్గంలో 300 మందికి అందిస్తున్నాం. ఈ పథకంలో రూ.లక్ష లబ్ధి పొందిన 14 బీసీ కులాల పేదలు మళ్లీ ఆ డబ్బులను చెల్లించాల్సిన పని లేదు. ఎందుకంటే ఇది రుణం కాదు. కేవలం కులవృత్తులను ప్రోత్సహించేందుకు ఇస్తున్న గ్రాంట్ మాత్రమే. అర్హులందరికీ అందించే వరకు ఈ పథకం కొనసాగుతుంది. శతాబ్దాల పేదరికాన్ని పోగొట్టేందుకే సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల మంది ఆడపిల్లలకు కల్యాణ లక్ష్మి అందించి వారి పెళ్లిళ్లకు సాయం చేశాం. రైతుబంధు, రైతు బీమా, నేతన్నలకు బీమా పథకాలను అమలు చేస్తున్నాం. చేసిన పనులు చెప్పుకుంటూ పోతే ఒడవదు. మళ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షాల వాళ్లు ఓట్లు అడగడానికి వస్తే.. మాకు ఎంతో చేసిన బీఆర్ఎస్ను కాదని మీకు ఓట్లు ఎందుకు వేయాలని నిలదీయండి. రాష్ట్రంలోని ఏ ఒక్క పేదవర్గాన్ని వదిలిపెట్టకుండా ప్రభుత్వం సాయం చేస్తూ వారి బతుకులను బాగు చేస్తుంది. గృహలక్ష్మి పథకంలో అర్హులకు ఇళ్లను మంజూరు చేస్తాం. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు కట్టించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది..’అని కేటీఆర్ హామీ ఇచ్చారు. వచ్చే నెలలో మెడికల్ కాలేజీ ప్రారంభం ‘వచ్చే నెలలో సిరిసిల్లలో మెడికల్ కాలేజీని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారు. మెడికల్ కాలేజీ ఏర్పాటుతో 150 మంది డాక్టర్లు నిరంతరం అందుబాటులో ఉంటారు. అన్ని రోగాలకు ప్రత్యేక వైద్యులతో మెరుగైన వైద్యం అందుతుంది. చిన్నరోగం నుంచి క్యాన్సర్ వరకు ఉచితంగా వైద్యసేవలు జిల్లాలో పేద ప్రజలకు అందుతాయి..’అని మంత్రి చెప్పారు. జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, టీపీటీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్, మున్సిపల్ చైర్పర్సన్లు జిందం కళాచక్రపాణి, రామతీర్థం మాధవి పాల్గొన్నారు. -
పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందించిన ఘనత వైఎస్సార్ దే
-
నా 46 ఏళ్ల జర్నలిస్టు అనుభవంలో మొదటిసారి చూస్తున్నా: కొమ్మినేని
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో ప్రస్తుతం పేదలు-పెత్తందార్ల మధ్య జరుగుతోన్న యుద్ధంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పేదల పక్షాన నిలిచారని సీఆర్ మీడియా అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు. స్థానిక సత్యనారాయణపురంలో శుక్రవారం నిర్వహించిన “జగనన్న బడుగు వికాసం” అవగాహన సదస్సులో ఎస్సీ, ఎస్టీ, బీసీ(సి) ఎంటర్ ప్రెన్యుర్లనుద్దేశించి ఆయన మాట్లాడారు. పేదల పక్షపాతిగా పేరుతెచ్చుకున్న ఇలాంటి ముఖ్యమంత్రిని తమ 46 ఏళ్ల జర్నలిస్టు అనుభవంలో మొట్ట మొదటి సారి చూస్తున్నామని ఆయన పేర్కొన్నారు. పేదల కోసం చెప్పింది చెప్పినట్లు చేస్తున్న ఈ ముఖ్యమంత్రిపై యుద్ధం చేయలేని కొంతమంది “వలంటీర్ల” పై యుద్ధం చేస్తుండడం విచారకరమని ఆయన అన్నారు. ఎండలో, వానలో ఇబ్బందులు పడుతూ పెన్షన్లు తెచ్చుకునే వృద్ధులకు ఇంటివద్దే, ఒకటోతేదీన పెన్షన్లు సమర్ధవంతంగా అందిస్తున్న వాలంటీర్ల వ్యవస్థను కించ పరచడం సరికాదన్నారు. నేనూ సమాజంలో ప్రయోజనకారిగా వుండే వ్యక్తిని అని ఆత్మ విశ్వాసంతో, పట్టుదలతో ముందుకెళ్ళాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ(సి) ఎంటర్ ప్రెన్యుర్లకు ఉద్బోధించారు. ప్రభుత్వం ఇచ్చే రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. స్వయంశక్తితో పది మందికి ఉపాధి కల్పించేందుకు ముందుకొచ్చేవారిని ప్రోత్సహించాలని ఆయన అన్నారు. చదవండి: అలాంటి క్యారెక్టర్ ఉన్నోడా వలంటీర్లను అనేది!: సీఎం జగన్ ఫైర్ సామాజిక న్యాయం, సాధికారిత రాష్ట్ర సలహాదారు జూపూడి ప్రభాకరరావు మాట్లాడుతూ, ప్రభుత్వాన్ని ఉపయోగించుకున్నవాళ్లే అభివృద్ధి చెందుతారని అన్నారు. ఈ ప్రభుత్వం మనది, ఈ ప్రభుత్వాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఈ రాష్టంలో 2 లక్షల 25 వేల కోట్లు పేదలకు పంపిణీ అయ్యిందని, అందులో 80 శాతం మేర నిధులు ఎస్.సి.ఎస్.టి వర్గాలకే అందిందని ఆయన గుర్తుచేశారు. ఇది పేదల ప్రభుత్వమని చెప్పేందుకు ఇంతకుమించి ఉదాహరణ ఏముంటుందని ఆయన ప్రశ్నించారు. 54 వేల ఎకరాల అసైన్డు భూములపై పేదలకు, దళితులకు సంపూర్ణ హక్కులు కల్పించిన ప్రభుత్వం ఇదని ఆయన ప్రస్తుతించారు. గత 70 ఏళ్లుగా తమ పేరున ఉన్న భూములపై పూర్తి హక్కులు ఈ వర్గాలకు లేవని, దళితుల, పేదల జీవితాలలో ఈ చర్య ద్వారా సీఎం జగన్ పెను మార్పులకు దోహద పడ్డారని ఆయన తెలిపారు. ప్రపంచం మొత్తాన్ని కలిపే ఇంగ్లీషు భాష ప్రాథమిక విద్యలో ప్రవేశపెట్టిన సాహసి మన ముఖ్య మంత్రి అని ఆయన అన్నారు. దళితుల పిల్లలను ఇంగ్లీషు లో చదివించే విప్లవాత్మక చర్యలు చేపట్టిన ముఖ్యమంత్రిని విమర్శించడం సరికాదన్నారు. సమావేశానికి క్రిస్టియన్ మైనారిటీస్ కార్పొరేషన్ చైర్మన్ బందెల దయానందం అధ్యక్షత వహించారు. సమావేశంలో సి.ఆర్.మీడియా అకాడమీ సెక్రెటరీ మామిడిపల్లి బాల గంగాధర తిలక్, సెంట్రల్ బ్యాంకు రీజినల్ హెడ్ ఎస్. సూర్యనారాయణ మూర్తి, పరిశ్రమలశాఖ అడిషనల్ డైరెక్టర్ ఏ.వి. పటేల్ , జాయింట్ డైరెక్టర్ ఏ. సుధాకర్, క్రిస్టియన్ మైనారిటీస్ కార్పొరేషన్ ఎం.డి. ఏ. శేఖర్, ఆరోగ్యశ్రీ ప్రత్యేక అధికారి వై. అశోక్ , ఎన్. హెచ్. ఆర్. ఏ. సి.సి. చైర్మన్ ఆర్.జె. రాజు, ఏ.ఎస్.ఎస్.ఎన్.టి. డైరెక్టర్ ఎన్. వెంకటరావు, వివిధ జిల్లాలనుంచి వచ్చిన ఎస్.సి. ఎస్.టి. ఎంటర్ ప్రెన్యూర్ లు పాల్గొన్నారు. -
మిగతా రాష్ట్రాలకు సీఎం జగన్ దిక్సూచి
కుప్పం రూరల్ (చిత్తూరు జిల్లా): సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి దేశంలోని ఇతర సీఎంలు ఆలోచనలో పడ్డారని రాష్ట్ర అటవీ, విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. మంగళవారం వార్డుబాట కార్యక్రమంలో భాగంగా రెండో రోజు కుప్పం పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం పథకాలు తెచ్చి ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచి పోయారని, ఆయన తనయుడు, సీఎం వైఎస్ జగన్ మరో అడుగు ముందుకేసి అనేక సంక్షేమ పథకాలు తెచ్చి ప్రజల గుండెల్లో నిలిచిపోయారని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు రెండు కళ్లుగా పాలన చేస్తున్న సీఎంను చూసి దేశంలోని ఇతర ముఖ్యమంత్రులు ఇన్ని సంక్షేమ పథకాలు ఎలా చేస్తున్నారా.. అంటూ ఆలోచనలో పడ్డారన్నారు. 95 శాతం హంద్రీ–నీవా పనులను వైఎస్సార్ పూర్తి చేస్తే, ఆయన తరువాత వచ్చిన కాంగ్రెస్ సీఎంలు, బాబు 5 శాతం పనులు పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. గత సెప్టెంబర్లో కుప్పానికి వచ్చిన సీఎం జగన్ హంద్రీ–నీవా పనులు పూర్తిచేయాలని ఆదేశించారని, పనులు వేగంగా జరుగుతున్నాయని, త్వరలో హంద్రీ–నీవా నీళ్లు కుప్పానికి తెచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. కరోనా కాలంలో తండ్రీకొడుకులు హైదరాబాద్లో దాక్కుంటే సీఎం జగన్ ప్రతి నిత్యం సమీక్షలు నిర్వహించి ప్రాణనష్టాన్ని నివారించారన్నారు. వలంటీర్లు కరోనా కాలంలో ప్రాణాలకు తెగించి సేవ చేస్తే వారిని తప్పుపట్టడం దారుణమన్నారు. 2019 ఎన్నికల ముందు మహిళా, రైతు రుణాలు రూ.14,200 కోట్లు ఇవ్వకుండా వెళ్లిపోయారని, ఆ రుణాలు కాస్త వడ్డీతో కలిపి ప్రస్తుతం రూ.27 వేల కోట్లు అయ్యాయని, ఆ మొత్తాన్ని సీఎం జగన్ విడతల వారీగా చెల్లిస్తూ వస్తున్నారని తెలిపారు. -
ఐరాసలో ‘మన బడి’.. ఏపీకి అంతర్జాతీయంగా ప్రశంసలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యారంగ సంస్కరణలు, మారిన ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. విద్యార్థులకు ట్యాబ్లు, జగనన్న విద్యాకానుక ద్వారా బ్యాగులు, పుస్తకాలు, డిక్షనరీ, బెల్టు, బూట్లుతోపాటు గోరుముద్ద ద్వారా పిల్లలకు పౌష్టికాహారం పంపిణీ లాంటివి ఐక్యరాజ్య సమితిలో ప్రత్యేకంగా చర్చకు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో సుస్థిర అభివృద్ధికి సంబంధించి ఉన్నత స్థాయి రాజకీయ సదస్సు (హై లెవెల్ పొలిటికల్ ఫోరం) న్యూయార్క్లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో ఈనెల 10 తేదీ నుంచి నిర్వహిస్తున్నారు. ఐరాసలో అంతర్భాగమైన ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సదస్సుకు వివిధ దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న సంక్షేమ పథకాలు, సంస్కరణలపై ఇందులో ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలలు, విద్యా ప్రమాణాలు, ప్రధానంగా బాలికా విద్యలో వచ్చిన విప్లవాత్మక మార్పులపై నిర్వహించిన ‘నాడు–నేడు’ స్టాల్ను శుక్రవారం పలు దేశాల ప్రతినిధులు సందర్శించి కితాబిచ్చారు. ప్రధానంగా 44 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో నిరంతర నీటి సదుపాయంతో వాష్రూమ్లు, తాగునీరు, స్వేచ్ఛ పేరుతో శానిటరీ న్యాప్కిన్స్ పంపిణీతో బాలికలు చేరికలు పెరగడం, ఇంగ్లీష్లో బోధన, బైలింగ్యువల్ టెక్టŠస్ బుక్స్, విద్యా కానుక, ట్యాబ్ల పంపిణీ, ఐఎఫ్పీ ప్యానెల్స్, స్మార్ట్ టీవీల ద్వారా డిజిటల్ విద్యా బోధన లాంటివి ప్రపంచ దేశాల ప్రతినిధులను ఆకర్షించాయి. వేగంగా మెరుగైన ఫలితాలు.. ప్రపంచవ్యాప్తంగా 140 దేశాల ప్రతినిధులు హాజరైన ఈ సదస్సులో ఐరాస స్పెషల్ కన్సల్టేటివ్ స్టేటస్ మెంబర్ ఉన్నవ షకిన్కుమార్ ఏపీలో విద్యా సంస్కరణల గురించి వివరించారు. సుస్థిర అభివృద్ధిలో విద్య పాత్ర కీలకమని బలంగా నమ్మిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. విద్యలో లింగ వివక్ష, అసమానతలను తొలగించేందుకు చేపట్టిన నాడు–నేడు పథకం ద్వారా తక్కువ సమయంలోనే మెరుగైన ఫలితాలను సాధించినట్లు చెప్పారు. ఐరాస సదస్సుకు మన విద్యార్థులు తక్కువ కాలంలోనే ఆంధ్రప్రదేశ్లో విద్యా రంగంలో గణనీయమైన పురోగతి సాధించడంపై కెనడా స్కూళ్లు, కాలేజీల సోషల్ ఇన్నోవేషన్ ప్రాజెక్టు ముఖ్య అధికారి జూడీ ప్రశంసలు కురిపించారు. మన విద్యార్థులతో ముచ్చటించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ఉన్నవ షకిన్ కుమార్ తెలిపారు. విద్యారంగంలో బాలికలు సాధించిన ప్రగతిని క్యాలిఫోర్నియా విద్యాశాఖ ప్రతినిధి షెరిల్ అభినందించారన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 15 నుంచి 26 వరకు జరిగే ఐరాస ప్రత్యేక సదస్సుకు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల నుంచి 10 మంది విద్యార్థులను అమెరికా తీసుకెళ్లనున్నారు. ఐరాస ప్రతినిధులతో పాటు వాషింగ్టన్లోని ప్రపంచ బ్యాంకు సదస్సులో పలు దేశాల ప్రతినిధులను మన విద్యార్థులు కలుసుకుని రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న కార్యక్రమాలను స్వయంగా వివరించనున్నారు. బాలిక విద్యకు ప్రశంసలు కోవిడ్ను అధిగమించి విద్యారంగంలో ఆంధ్రప్రదేశ్ సాధించిన ప్రగతిపై సదస్సులో అంతర్జాతీయ ప్రతినిధులు చర్చించారు. ఏపీలో చేపట్టిన విద్యా సంస్కరణలు, చదువులను ప్రోత్సహిస్తూ ప్రభుత్వం చేపట్టిన పథకాల ద్వారా సాకారమైన మార్పులను ప్రశంసించారు. బాలిక విద్యకు ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటు, వారు సాధిస్తున్న విజయాలు అంతర్జాతీయ ప్రతినిధులను ఆకర్షించాయి. మన విద్యార్థులను కలసి స్వయంగా మాట్లాడేందుకు ఆసక్తి చూపుతున్నారు. సెప్టెంబర్లో జరిగే సదస్సుకు రాష్ట్రం నుంచి 10 మంది విద్యార్థులను అమెరికా తీసుకెళ్లాలని నిర్ణయించాం. – ఉన్నవ షకిన్ కుమార్, ఐరాస స్పెషల్ కన్సల్టేటివ్ స్టేటస్ మెంబర్ -
పాలనను ప్రజల ముంగిటకు తెచ్చి న వలంటీర్ల వ్యవస్థ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ సహాయంతో పాటు సంక్షేమ పథకాల ప్రయోజనాలు, సేవలను ప్రజలకు అందిస్తున్న గ్రామ, వార్డు వలంటీర్ల గురించి జనం ఎంతో మంచిగా మాట్లాడుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత, పార్టీ కో–ఆర్డినేటర్ వి విజయసాయిరెడ్డి చెప్పారు. ఆయన గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వివిధ ప్రాంత నేతలతో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి అందాల్సిన అన్ని సేవలను దళారుల అవసరం, అవినీతికి ఆస్కారం లేకుండా వలంటీర్లు చక్కగా అందిస్తున్నారని ప్రశంసించారు. దీంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం పనితీరుపై పేద, మధ్యతరగతి ప్రజల్లో సదభిప్రాయం బలపడుతోందని చెప్పారు. ప్రతి 50 కుటుంబాలకు ఒక వలంటీర్ చొప్పున పనిచేసే ఈ వినూత్న వ్యవస్థను నడపడానికి వారి వేతనాల (గౌరవ వేతనం) కింద ఏటా రూ.1,200 కోట్లు చెల్లిస్తున్నారని తెలిపారు. కనీస విద్యార్హతలతో, పారితోషికంతో పనిచేసే వలంటీర్ల వ్యవస్థను వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి న కొద్ది మాసాలకే 2019 ఆగస్టు 15న ప్రవేశపెట్టిందని గుర్తుచేశారు. కొత్త వ్యవస్థకు వచ్చే నెల 15న నాలుగేళ్లు నిండుతాయన్నారు. ఈ నాలుగేళ్లలో ఈ కొత్త వ్యవస్థ పనితీరును నిష్పక్షపాతంగా సమీక్షిస్తే వలంటీర్లకు మంచి మార్కులే వస్తాయని చెప్పారు. అవసరమైన ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే గ్రామ, వార్డు వలంటీర్లు ప్రజలకు నిజమైన సేవలందించే ‘డెలివరీ సిస్టం’లో కీలకపాత్రధారులయ్యారని పేర్కొన్నారు. ప్రజలకు కూతవేటు దూరంలో ఉండే వలంటీర్లు ప్రజాసేవకులుగానే వ్యవహరిస్తున్నారని, ప్రతిపక్షాలు నిందిస్తున్నట్టు పాలకపక్షం ప్రతినిధులుగా కాదని చెప్పారు. రెండున్నర లక్షల మందికిపైగా ఉన్న వలంటీర్ల పనితీరును గుర్తించి ఏపీ సర్కారు అర్హులైన వారికి నగదు బహుమతులు అందిస్తోందని తెలిపారు. సామాన్య జనానికి వారు చేసే సేవలకు గుర్తింపుగా దాదాపు రూ.250 కోట్ల విలువైన నగదు అవార్డులు ఇస్తోందన్నారు. 2019 అక్టోబర్లో ప్రారంభించిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ముందుకు నడిపించే సిపాయిలుగా వలంటీర్లు పనిచేస్తున్నారని చెప్పారు. -
‘సురక్ష’ శిబిరాల్లో 30.98 లక్షల వినతుల పరిష్కారం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అన్ని గ్రామ, వార్డు సచివాలయాల వద్ద మండలస్థాయి అధికారుల ఆధ్వర్యంలో నిర్వహిసున్న జగనన్న సురక్ష ప్రత్యేక శిబిరాల్లో బుధవారం వరకు విద్యార్థులకు వివిధ ధ్రువీకరణ పత్రాల జారీ సహా మొత్తం 30,98,697 వినతులను అక్కడికక్కడే అధికారులు పరిష్కరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు అర్హులైన వారు మిగిలిపోకూడదనే లక్ష్యంతో ప్రభుత్వమే వలంటీర్ల ద్వారా ఇంటింటా జల్లెడపడుతూ సర్వే నిర్వహించి, వారికీ పథకాలు అందజేసేందుకు జగనన్న సురక్ష పేరుతో ఈ శిబిరాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. పాఠశాల విద్య నుంచి పీహెచ్డీ వంటి వాటివరకు వివిధ విద్యాసంస్థల్లో అడ్మిషన్లు జరిగే ఈ సమయంలో విద్యార్థులకు అవసరమయ్యే ఆదాయ, కులధ్రువీకరణ పత్రాలతో పాటు ప్రజలు ప్రభుత్వ ఆఫీసుల నుంచి తీసుకునే 11 రకాల ధ్రువీకరణ పత్రాలను ఈ శిబిరాల్లో అప్పటికప్పుడే సర్విసు చార్జీలు లేకుండా అందజేస్తున్నారు. జూలై 1న మొదలు పెట్టిన ఈ శిబిరాలు సచివాలయాల వారీగా ఈ నెల 31వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఇప్పటివరకు.. ఆదివారాలు మినహా 10 రోజులు 6,997 గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ఈ శిబిరాలు నిర్వహించినట్లు గ్రామ, వార్డు సచివాలయాలశాఖ అధికారులు వెల్లడించారు. ఈ శిబిరాల్లో మొత్తం 34,39,585 సర్విసులకు సంబంధించి అధికారులకు వినతులు అందాయని తెలిపారు. వాటిలో 90 శాతానికిపైగా.. 30.98 లక్షల వినతులను అధికారులు అక్కడికక్కడే పరిష్కారించారని పేర్కొన్నారు. వీటిలో హౌస్హోల్డు జాబితాలో మార్పులు–చేర్పులతో పాటు విద్యార్థులకు ఆదాయ, కులధ్రువీకరణ పత్రాలు, వివిధ రకాల ధ్రువీకరణ పత్రాల జారీ, కౌలు రైతులకు సీసీఆర్సీల జారీ వంటివి పెద్దసంఖ్యలో ఉన్నట్టు వివరించారు. ఒక్కరోజే.. 5,54,009 వినతుల పరిష్కారం ఇప్పటివరకు నిర్వహించిన శిబిరాల్లో మంగళవారం ఒక్కరోజే అత్యధికంగా 5,54,009 వినతులను అధికారులు పరిష్కరించారు. బుధవారం 573 గ్రామ, వార్డు సచివాలయాల వద్ద జరిగిన శిబిరాల్లో 2,44,582 మంది వినతులు పరిష్కరించారు. -
అవినీతి రహితం సంక్షేమ స్వర్ణయుగం
‘ఒక సామాన్యుడు ప్రభుత్వ కార్యాలయానికి వెళ్తే నిమిషాల వ్యవధిలో అతని పని జరుగుతోంది. ఒక అర్హుడు పథకానికి దరఖాస్తు చేసుకుంటే కచ్చితంగా లబ్ధి అందుతోంది. ఒక విద్యార్థికి బడిలో అడుగు పెట్టిన తొలిరోజే పుస్తకాల నుంచి బ్యాగు వరకు, షూ నుంచి యూనిఫారం వరకు అన్నీ అతని చేతిలో పెడుతున్నారు. వీధి బడులు సకల వసతులతో సగర్వంగా నిలబడుతున్నాయి. ప్రభుత్వ దవాఖానాలు సర్వసన్నద్ధంగా తయారయ్యాయి. ఒకటో తేదీ రావడమే లేటు ఇంటి తలుపు తట్టి మరీ పింఛన్ ఠంఛన్గా అందిస్తున్నారు. వీధికే రేషన్ తెచ్చి ఇస్తున్నారు. విద్యార్థి నుంచి విశ్రాంత ఉద్యోగి వరకు, బాలల నుంచి వృద్ధుల వరకు అందరి సంక్షేమం కోరే ప్రభుత్వమిది’ అని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు తమ ప్రభుత్వ పనితీరును వివరించారు. ప్రతిపక్షాలు పనిలేక విమర్శలు చేస్తున్నాయని అన్నారు. ఆయన ‘సాక్షి’తో పంచుకున్న భావాలు ఆయన మాటల్లోనే.. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: దేశంలో సంక్షేమ పథకాల నిధులు 90శాతం దుర్వినియోగమై... కేవలం 10 శాతం మాత్రమే లబ్ధిదారునికి చేరుతున్నాయని రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు నిత్యం ఆవేదన చెందేవారు. వంద శాతం మందికి ఎలా అందించాలా అని ఆలోచించేవారు. ఇవాళ రాష్ట్రంలో ఆ మార్పు వచ్చింది. దీని కోసం వైఎస్ జగన్ ఓ విప్లవమే తీసుకువచ్చారు. వంద శాతం ప్రజలకు ఒక్క పైసా అవినీతి లేకుండా సంక్షేమ పథకాలు అందించి చూపించారు. ఇది ఓ విప్లవాత్మక మార్పు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా ఒక సామాన్యుడు ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లి తనకు కావాల్సిన పనిని చేసుకోలేకపోతున్నాడు. ప్రభుత్వ కార్యాలయాల్లో జవాబుదారీతనం లేకపోవడమే దీనికి కారణం. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ పరిస్థితిని సమూలంగా మార్చేసింది. సచివాలయ వ్యవస్థ ద్వారా సామాన్యుడికి కావాల్సిన పనులు నిమిషాల మీద జరుగుతున్నాయి. ఇది ప్రభుత్వం సాధించిన గొప్ప విజయం. వలంటీర్ వ్యవస్థ ద్వారా పనులు సులభమవుతున్నాయి. అప్పటికే ఒకరో ఇద్దరో అర్హులు మిగిలిపోతే ‘జగనన్న సురక్ష’ ద్వారా వారిని గుర్తించి మరీ సంక్షేమ పథకాలు అందజేస్తున్నారు. ప్రతిపక్షాలకు ఈ విషయాలు పట్టడం లేదు. లేనిపోని విమర్శలు చేస్తున్నారు. ఆఖరికి విద్యార్థులకు ఇచ్చే సంక్షేమ పథకాలపైనా విమర్శలు చేస్తున్నారు. విద్యార్థులకు ఓటు హక్కు ఉండదని తెలిసినా పసలేని వ్యాఖ్యలు చేస్తున్నారు. ‘జగనన్న సురక్ష’ ఓ వరం సంక్షేమ పథకాలు అందని వారికి జగనన్న సురక్ష ఓ వరం లాంటిది. ఇందులో 11 సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఒక్కో గ్రామంలో 200 నుంచి 400 మంది ప్రజలు ఈ సర్వీసులు ఉపయోగించుకుంటున్నారు. శ్రీకాకుళం నియోజకవర్గంలోనే 25వేల మంది ప్రభుత్వ సేవలు అందుకున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎంత మంది ఉంటారో అర్థం చేసుకోవచ్చు. వలంటీర్, అధికారులు ప్రజల ఇంటికే వెళ్తుండడం వల్ల ఎవరికీ రోజు కూలీ నష్టపోవాల్సిన అవసరం ఉండదు. ఫ్యామిలీ సర్టిఫికెట్లు, మ్యుటేషన్లు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు పొందడం ఇదివరకు ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. కానీ జగనన్న సురక్ష పథకం ఈ పనిని చాలా తేలిక చేసి చూపించింది. ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయి.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పనితీరు చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయి. అందుకే టీడీపీ విమర్శలు చేస్తూ పబ్బం గడుపుకుంటోంది. అభివృద్ధి అంటే భౌతికంగా కనిపించే అంశాలే అనే భావన చాలా మందిలో ఉంది. ఒక కుటుంబం జీవన ప్రమాణాలు పెంచేదే అభివృద్ధి. విద్య, వైద్యం, పోషకాహారం, భవిష్యత్ తరాలకు ధీమా, నివాసయోగ్యమైన ఇళ్లు, మంచి వస్త్రాలు.. ఇవన్నీ జీవన ప్రమాణాలకు కొలమానం. ఈ ప్రయోజనాలు అందించకుండా ఏదేదో చేసేశామంటే ఎవరూ హర్షించరు. వైఎస్ జగన్ సర్కారు ప్రజల జీవన ప్రమాణాలు పెంచడంలో సఫలమైంది. అన్నదాతకు భరోసా.. రైతులకు సంబంధించి రైతు భరోసా కేంద్రం ఏర్పాటు, వారికి కావాల్సిన సమాచారం ఇచ్చేలా చర్యలు చేపట్టాం. గతంలో మండలానికి ఇద్దరు, ముగ్గురు వ్యవసాయ అధికారులు ఉంటే ఇపుడు ప్రతి మండలానికి 25మంది వ్యవసాయ అధికారులు ఉండేలా ఏర్పాటు చేశాం. అదే గ్రామంలో ఎరువులు అందుబాటులో ఉంచడం, పండిన పంట కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేశాం. కళ్ల ఎదుటే సచివాలయాలు, ఆస్పత్రులు, పాఠశాలలు, రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలు ఇలా ప్రతి రంగంలో అభివృద్ధి చేపడితే ప్రతిపక్షాలు చూడలేకపోతున్నాయి. విమర్శించేవారు వారి గ్రామాన్ని ఒకసారి పరిశీలించాలి. ఏం జరిగిందో? ఏం జరగలేదో? వారే చూస్తారు. అవినీతికి ఆస్కారం లేకుండా.. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అన్ని రంగాల్లోనూ అవినీతి చోటు చేసుకుంది. ఏమిటీ పరిస్థితులని ఒక రకమైన ఆవేదనతో ప్రజలు తీర్పు ఇచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత అవినీతికి చరమ గీతం పాడి పారదర్శకతకు పెద్దపీట వేశారు. ప్రస్తుత ప్రభుత్వం సంక్షేమ పథకాల రూపంలో లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లలోకి నేరుగా రూ.2,30,000 కోట్లు జమ చేసింది. ఇందులో ఫలానా వ్యక్తి డబ్బులు అడిగారని గానీ, తాము ఒక పైసా ఇచ్చామని గానీ ఒక్కరు కూడా ఫిర్యాదు చేయలేదు. చంద్రబాబు ఏం చేశారు..? టీడీపీ హయాంలో జిల్లాకు ఎలాంటి మేలు జరగలేదు. ఎల్లో మీడియా ద్వారా ఆహా, ఓహో ప్రచారం చేసుకోవడం తప్ప టీడీపీ నాయకులు చేసిన పనులేవీ లేవు. తోటపల్లి, వంశధార, మెడికల్ కళాశాల, పోర్టు, ఫిషింగ్ హార్బర్, ఆఫ్షోర్ తదితర ప్రాజెక్టులో టీడీపీ పాత్ర ఏమీ లేదు. ఇదంతా వైఎస్సార్ హయాంలో జరిగిన అభివృద్ధే. శ్రీకాకుళంలో పెద్ద మార్కెట్లో టీడీపీ చేసిందేమీ లేదు. మార్కెట్ పునఃనిర్మాణం ఆయన హయాంలో జరిగిందే. ఇపుడు రూ.10కోట్లు పెట్టి రోడ్లుకు టెండర్లు వేశాం. గట్టిగ మాట్లాడి ఉన్నది లేనట్టు, లేనిది ఉన్న ట్టు చెబితే ప్రజలు ఓట్లు వేస్తారనే అభిప్రాయం టీడీపీ నాయకుల్లో ఉంది. అవన్నీ కాపీ యాత్రలే.. ఏ రాజకీయ పార్టీ అయినా తన ఉనికి కోసం ఏదో ఒక పేరుతో యాత్రలు చేస్తుంటారు. ఇందులో తప్పేమీ లేదు. ఇటువంటి యాత్రల ద్వారా అధికారం వస్తుందని అనుకుంటే పొరపాటు. జగన్మోహన్రెడ్డి పాదయాత్ర చేశారంటే అతను ప్రజల యొక్క ప్రతి సమస్య క్షుణ్ణంగా గమనించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ సమస్యల పరిష్కారం కోసం సంక్షేమ పథకాలు నిష్పాక్షికంగా అమలు చేశారు. మండలం నుంచి గ్రామాలకు పరిపాలనను వికేంద్రీకరించారు. ఒక్కో ప్రాంతంలో పట్టి పీడిస్తున్న సమస్యల పరిష్కారం కోసం కూడా కృషి చేశారు. ఉద్దానంలో కిడ్నీ సమస్యపై ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చినా, ఏ ఒక్కరూ సమస్య పరిష్కరించలేదు. జగన్ సీఎం అయిన వెంటనే ఉద్దానంకిడ్నీ సమస్యపై రీసెర్చ్ సెంటర్ను ఏర్పాటు చేశారు. వంశధార రిజర్వాయర్ నుంచి మంచినీరు ఉద్దాన ప్రాంత ప్రజలకు అందించేందుకు పనులు పూర్తి, కిడ్నీ బాధితుల మందులకు రూ.10వేలు సాయం, డయాలసిస్ కోసం అక్కడే ఆసుపత్రి ఏర్పాటు వంటి చర్యలు తీసుకున్నారు. జగన్ను అనుకరించాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయి. స్థిరమైన అభిప్రాయంతో ప్రతిపక్షాలు లేవనేది ప్రజల భావన. సిక్కోలులో ప్రగతి జాడలు.. గత నాలుగేళ్లలో జిల్లాలో చాలా అభివృద్ధి పనులు జరిగాయి. పలాసలో రూ.60 కోట్లతో ఒక రీసెర్చ్ ఆస్పత్రిని తెచ్చాం. అలాగే మంచినీళ్లపేట వద్ద హార్బర్ (ఫిష్ లాండింగ్ సెంటర్)ను ఏర్పాటు చేశాం. రూ.4000 కోట్లతో మూలపేట పోర్ట్ ప్రాజెక్టును నిర్మిస్తున్నాం. బుడగట్ల పాలెం వద్ద ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు, ఆమదాలవలసలో హార్టికల్చర్, అగ్రికల్చరల్ కళాశాలలు, శ్రీకాకుళంలో 900 పడకల ఆస్పత్రిని సంపూర్ణంగా అభివృద్ధి చేశాం. జిల్లావ్యాప్తంగా రోడ్లు నిర్మితమవుతున్నాయి. ఏం అభివృద్ధి జరిగిందని అడిగే టీడీపీ వాళ్లు వీటిని చూడాలి. జిల్లా వ్యాప్తంగా నాడు–నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారాయి. ఉద్దానం మంచినీటి ప్రాజెక్టు కోసం రూ.780కోట్లు ఖర్చుపెట్టాం. మరో 3–4 నెలల్లోనే ప్రారంభించనున్నాం. పలాసలో ఆస్పత్రికి రూ.60కోట్లు ఖర్చుపెట్టాం. మరో 2 నెలల్లోనే ప్రారంభించనున్నాం. వంశధారపై వివాదం కేసు సుప్రీంకోర్టులో ఉంది. లిఫ్ట్ పెట్టి 19 టీఎంసీ నింపి వేసవిలో 2లక్షల ఎకరాలకు రబీ పంటకు నీరు అందించేందుకు నిర్ణయించాం. టెండర్లు పిలిచి అనుమతులు ఇచ్చారు. ఈ వర్షాకాలం ముగిసేలోగా పూర్తి చేయాలని చెప్పాం. కోడి రామ్మూర్తి స్టేడియంపై టీడీపీ సమగ్ర ప్లాన్ లేకుండా కూలగొట్టేసింది. దీన్ని మేం బాధ్యతగా తీసుకున్నాం. దీని నిర్మాణం కోసం రూ.10కోట్లు నిధులు మంజూరు చేశాం. ఆమదాలవలస–శ్రీకాకుళం రోడ్డు పని జరుగుతోంది. మరో 4–5 నెలల్లో పూర్తవుతుంది. సమగ్ర భూ సర్వేతో కొన్ని ఆక్రమణలు బయటపడుతున్నాయి. వందేళ్లుగా సర్వే జరగకపోవడంతో ఎవరిది ఏమిటో తెలియని పరిస్థితుల్లో ఆక్రమణలు జరుగుతున్నాయి. ఏ ఆక్రమణను కూడా విడిచిపెట్టేది లేదు. -
టీడీపీలో ఉన్నా.. లేకున్నా ఒక్కటే
తిరుపతి మంగళం: ‘భుజాలు అరిగిపోయేలా టీడీపీ జెండాలు మోశాం. పార్టీ కోసం ఎనలేని సేవలందించాం. జగనన్న ప్రభుత్వంలో లబ్ధి పొందినట్టుగా టీడీపీ ప్రభుత్వంలో ఏనాడు సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందలేదు. ప్రజలకు మేలు చేయని టీడీపీలో ఉన్నా ఒక్కటే.. లేకున్నా ఒక్కటే. జగనన్న లాంటి నాయకుడు మళ్లీ సీఎం కావాలి’ అంటూ తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ తరఫున 30వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి గా పోటీచేసిన గుర్రమ్మ చెప్పారు. తిరుపతి నెహ్రూనగర్లో గురువారం కార్పొరేటర్ కల్పనయాదవ్, డివిజన్ అధ్యక్షుడు ఎస్కే ఇమ్రాన్బాషా ఆధ్వర్యంలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, డిప్యూటీ మేయర్ నారాయణ ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ డివిజన్ నుంచి పోటీచేసిన గుర్రమ్మ వైఎస్ జగన్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై ప్రశంసల వర్షం కురిపించారు. తాను కూడా జగనన్న సంక్షేమ పథకాల ద్వారా రూ. 11 లక్షలు లబ్ధి పొందినట్లు ఎమ్మెల్యే భూమనకు ఆమె సంతోషంగా చెప్పారు. ఈ సందర్భంగా భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ ‘సీఎం వైఎస్ జగన్ కులాలు, మతాలు, పారీ్టలు చూడకుండా అర్హతే ప్రామాణికంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్న గొప్ప నాయకుడు. చంద్రబాబు ధనవంతులకు కొమ్ముకాస్తే, జగనన్న పేదల సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారు. అలాంటి గొప్ప నాయకుడికి అండగా ఉండాలి’ అని చెప్పారు. -
ఈ పేద జీవితంలో ఆశలు చిగురించాయి
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): ‘నేను నిరుపేదను. ఎలాంటి స్థిరాస్తులు లేవు. రోజువారీ కూలీ అయిన నేను కుటుంబ అవసరాలు తీర్చలేకపోవడంతో పాటు పిల్లల చదువుల కోసం ఎంతో ఇబ్బందులు పడుతుండేవాడిని. ఇలాంటి నా జీవితంలో సంక్షేమ పథకాలతో వెలుగులు నింపారు. సగర్వంగా తలెత్తుకుని జీవించేలా చేశారు. ఆర్థికంగా చితికిపోకుండా జీవితంపై ఆశలు చిగురింప చేసిన జగనన్నా ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలి. మా కుటుంబం మొత్తం మీ వెనుక నడుస్తాం’ అంటూ ఓ నిరుపేద తన అభిమానాన్ని ఫ్లెక్సీ రూపంలో తెలిపాడు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లికి చెందిన ఎస్ఎన్ మీరా (సుభానీ) కుటుంబం కూలి పనులు చేసుకుని జీవిస్తుంటుంది. అన్నింటికీ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న సమయంలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ంది. అతనికి పలు పథకాల ద్వారా లబ్ధి అందించింది. దీంతో అతను దీన స్థితి నుంచి బయటపడి సగౌరవంగా జీవిస్తున్నాడు. తన కుటుంబానికి ప్రభుత్వం ఏమి లబ్ధి చేకూర్చిందో ఫ్లెక్సీ వేసి తన ఇంటి గోడకి అతికించాడు. ‘మీ ఉప్పు తింటున్నాం.. మీకు విశ్వాసంగా ఉంటాం’ అంటూ ప్లెక్సీ వేయించి సీఎం జగన్కు, స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్కు కృతజ్ఞతలు తెలిపారు. ఫ్లెక్సీలో ఇలా రాశాడు.. ♦ వైఎస్సార్ చేయూత పథకంలో వచ్చి న రూ. 56,250తో నా భార్య జక్రియా బేగం కిరాణా షాపు ఏర్పాటు చేసుకుంది. ♦ డ్వాక్రా రుణమాఫీతో రూ.36 వేలు లబ్ధి. ♦ కుమార్తె ఫాతిమా జేఎన్టీయూలో ఎంటెక్ చదువుకు వసతి దీవెన కింద రూ.40 వేలు, ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ.30వేలు, కుమారుడు బీకాం కంప్యూటర్స్ చదువుకు రూ.45 వేలు ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన కింద రూ.30 వేలు, మరో కుమార్తె నబీనా ఎమ్మెస్సీ బీఈడీ చదువుకు ఫీజు రూ. 30 వేల లబ్ధి చేకూరింది. -
అర్హులందరికీ సంక్షేమ పథకాలు
సాక్షి, అమరావతి: అర్హత ఉండి ఏవైనా చిన్నచిన్న కారణాల వల్ల సంక్షేమ పథకాల ద్వారా సహాయం అందని వారికి ప్రయోజనం చేకూర్చాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని వైఎస్సార్సీపీ ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలకు పార్టీ కో–ఆర్డినేటర్, అనుబంధ విభాగాల ఇన్చార్జి, ఎంపీ వి.విజయసాయిరెడ్డి చెప్పారు. ఆయన శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి వారితో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ క్షేత్రస్థాయి కమిటీల నిర్మాణం, జగనన్న సురక్ష కార్యక్రమాలపై వారికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందించాలన్న లక్ష్యంతో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారని గుర్తుచేశారు. జూలై 1వ తేదీ నుంచి మండలస్థాయి అధికారులు ఏర్పాటు చేయనున్న శిబిరాల్లో పార్టీ నాయకులు క్రియాశీలకంగా పాల్గొనేలా చూడాలని కోరారు. ప్రజలందరిని ఈ శిబిరాలకు ఆహ్వానించి సురక్ష కార్యక్రమం గురించి అవగాహన కల్పించాలని సూచించారు. ప్రధానంగా అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ కార్యక్రమంపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జగనన్న సురక్ష క్యాంపు ప్రారంభానికి ముందు అసెంబ్లీ నియోజకవర్గం స్థాయిలో మీడియా సమావేశాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సురక్ష కార్యక్రమంలో పథకాలు లేదా పత్రాలకు సంబంధించి తమకు ఎలాంటి సమస్యలు లేవని ప్రజలు చెబితే.. సీఎంతో వారి అభిప్రాయాన్ని పంచుకోవడానికి ‘థాంక్యూ జగనన్న‘ అని టైప్చేసి 9052690526 నంబరుకు ఎస్ఎంఎస్ పంపించేలా చూడాలని కోరారు. పార్టీ కమిటీల ప్రతిపాదనలను జూలై 3వ తేదీలోగా పంపాలని కోరారు. అనుబంధ విభాగాల పటిష్టతతోనే పార్టీని మరింతగా బలోపేతం చేసుకోగలమన్నారు. ఇప్పటికే 18 జిల్లాల నుంచి కమిటీల జాబితాలను కేంద్ర కార్యాలయానికి సమర్పించారని, మిగిలిన 8 జిల్లాల కమిటీల జాబితాలను పంపాలని కోరారు. అలాగే పార్టీ నగర కమిటీల ప్రతిపాదలను కూడా త్వరగా పంపించాలని ఆయన సూచించారు.