ఈడీ లక్ష్యాలు రెండే.. ఒకటి నన్ను ఇరికించడం, రెండోది..: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ కేసులో రోజుకో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. నేటితో(మార్చి 28) కస్టడీ నేటితో ముగియడంతో గురువారం కేజ్రీవాల్ను రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ హాజరుపర్చనుంది. కోర్టులో కేజ్రీవాల్ సొంతంగా వాదనలు వినిపించారు.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తన పార్టీ(ఆప్)ని అణచివేసేందుకు ప్రయత్నిసోందని ఆరోపించారు. 100 కోట్ల అవినీతి జరిగిందని ఈడీ చెబుతోందని, మరి ఆ వందకోట్లు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. తన అరెస్ట్కు తగిన ఆధారాలు లేవని తెలిపారు. ఏ కోర్టు కూడా తనను దోషిగా పరిగణించలేదని పేర్కొన్నారు సీబీఐ 31 వేల పేజీల చార్జిషీట్లో, ఈడీ 25వేల పేజీల చార్జ్షీట్లో ఎక్కడా తన పేరు లేదని పేర్కొన్నారు. అయినా తనను ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు.
తనను ఇరికించడమే ఈడీ లక్ష్యంగా పెట్టుకుందని విమర్శించారు. మాగుంట రాఘవరెడ్డి ఇచ్చి 7 స్టేట్మెంట్లలో ఆరు స్టేట్మెంట్లలో తన పేరు లేదని చెప్పారు. శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ తర్వాత రూ. 55 కోట్లు ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా బీజేపీకి ఇచ్చాడని పేర్కొన్నారు. అతడితో బలవంతంగా నా పేరు చెప్పించారని ఆరోపించారు. ఈడీకే రెండే లక్ష్యాలు ఉన్నాయని.. ఒకటి నన్ను ఇరికిండం, రెండో ఆప్ను లేకుండా చేయడమని అన్నారు.
చదవండి: కంగనాపై అసభ్య పోస్ట్.. సుప్రియాకు షాకిచ్చిన కాంగ్రెస్
కాగా కేజ్రీవాల్ ఈడీ కస్టడీపై సీబీఐ స్పెషల్ కోర్టులో వాదనలు ముగిశాయి. అయితే మరో ఏడు రోజులపాటు కేజ్రీవాల్ కస్టడీ పొడిగించాలని ఈడీ కోరింది. ఇరు వాదనలు విన్న న్యాయస్థానం.. కేజ్రీవాల్ కస్టడీ పొడిగించించింది. మరో నాలుగు రోజులు ఈడీ కస్టడీ పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు వెల్లడించింది. దీంతో ఏప్రిల్ 1 వరకు కేజ్రీవాల్ కస్టడీలోనే ఉండనున్నారు.
ఇదిలా ఉండగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మనీలాండరింగ్ అభియోగాలపై కేజ్రీవాల్ను మార్చి 21 ఆయన నివాసంలో ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మరుసటి రోజు ఆయన్ను ఈడీ రౌస్ అవెన్యూ కోర్టుకు హజరుపరిచి కస్టడీకి కోరింది. దీంతో కోర్టు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరు రోజుల ఈడీ కస్టడీకి అప్పగించింది. కస్టడీ ముగియడంతో ఇవాళ కోర్టులో హాజరుపర్చనుంది ఈడీ. మరో ఏడు రోజులు కస్టడీ ఇవ్వాలంటూ ఈడీ కోరుతోంది. ఒకవేళ కస్టడీ పొడగింపునకు కోర్టు అంగీకరించకపోతే మాత్రం ఆయన్ని తీహార్ జైలుకు తరలిస్తారు.