కూటమి పేరుతో కుట్రలు.. మోసగాళ్లను నమ్మొద్దు: సీఎం జగన్‌

Memantha Siddham: CM Jagan Speech At Yemmiganur Public Meeting - Sakshi

సాక్షి, కర్నూలు జిల్లా: ఈ సభ ఎమ్మిగనూరు చరిత్రలో సువర్ణ అక్షరాలతో నిలిచిపోతుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. బిందువు బిందువు చేరి సింధువు అయినట్లు ఇక్కడ జన సంద్రం కనిపిస్తోందన్నారు. ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్ర చేపట్టిన సీఎం జగన్‌.. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు బహిరంగ సభలో ప్రసంగిస్తూ.. మీ బిడ్డను ఆశీర్వదించడం కోసం మీరంతా రావడం పూర్వజన్మసుకృతం.. అవ్వాతాతలందరికి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.

పేదలంతా ఒక వైపు,పెత్తందారులు మరో వైపు
‘‘మే 13న కురుక్షేత్ర యుద్ధం జరుగబోతుంది. పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్ధం జరగబోతుంది. ఈ పొత్తులను, జిత్తులను, ఈ మోసాలను, కుట్రలను వీటన్నింటిని ఎదుర్కొంటూ పేదల భవిష్యత్‌కు అండగా నిలిచేందుకు నేను సిద్ధం. సిద్ధమంటూ లేచే ప్రతి చేయి, ప్రతి గుండె ఐదేళ్లుగా మంచి జరిగిందని, మా ప్రభుత్వ బడులు బాగుపడ్డాయని ప్రతి గుండె చెబుతోంది. జెండాలు జతకట్టిన వారిని ఓడించేందుకు మీరంతా సిద్ధమా?. పెత్తందార్లను ఓడించేందుకు నేను సిద్ధం.. మీరంతా సిద్ధమా?. 58 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. మనం చేసిన మంచి కొనసాగాలని ప్రతి గుండె కోరుకుంటోంది. పేదలంతా ఒక వైపు,పెత్తందారులు మరో వైపు. పేదల వ్యతిరేకులను ఓడించండి.. మీ బిడ్డను గెలిపించండి’’ అంటూ సీఎం జగన్‌ పిలుపునిచ్చారు.

విద్యారంగాన్ని విస్మరించిన టీడీపీకి ఓటు వేస్తారా?
‘‘విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. కార్పొరేషన్‌ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దాం. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్‌ మీడియాన్ని తీసుకొచ్చాం. అమ్మ ఒడి, విద్యాదీవెన ద్వారా పిల్లలను ప్రోత్సహిస్తున్నాం. పిల్లల చదువు గురించి గతంలో ఏ పాలకులు పట్టించుకోలేదు. పేదరికం నుంచి బయటపడాలంటే పిల్లలు చదువుకోవాలి. విద్యారంగాన్ని విస్మరించిన టీడీపీకి ఓటు వేస్తారా?. ధనికులకు అందే చదువునే పేదలకు కూడా అందిస్తున్నాం. మహిళల కోసం గత ప్రభుత్వం ఒక్క పథకం కూడా తీసుకురాలేదు. కూటమి పేరుతో కుట్రలు చేస్తున్నారు. ఎన్ని కుట్రలు చేసినా మళ్లీ మనమే గెలవబోతున్నాం’’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

మంచి చేసిన మీ ప్రభుత్వానికి రాఖీ కట్టండి
‘‘మంచి చేసిన మీ ప్రభుత్వానికి రాఖీ కట్టండి. పేదల సొంతింటి కలను నెరవేర్చాం. మహిళల రక్షణ కోసం దిశ యాప్‌ తీసుకొచ్చాం. ప్రతి నెలా ఒకటో తేదీన రూ.3వేల పెన్షన్‌ ఇస్తున్నాం. రూ.3వేల పెన్షన్‌ ఇస్తున్న రాష్ట్రం.. దేశంలో ఏపీ ఒక్కటే. రూ.2 లక్షల 70 వేల కోట్లు పేదల ఖాతాల్లో వేశాం. ఇంత మంచిచేసిన మీ ప్రభుత్వానికి రాఖీ కట్టండని కోరుతున్నా. చంద్రబాబు హయాంలో ఒక్క రూపాయి అయినా వేశారా?. ప్రతిపక్షాలు మోసాలను నమ్ముకున్నాయి. చేసిన మంచిని మాత్రమే మేం నమ్ముకున్నాం’’ అని సీఎం జగన్‌ చెప్పారు.

చంద్రబాబు పేరు చేప్తే వెన్నుపోట్లు.. మోసాలు..
‘‘ఇంగ్లీష్‌ మీడియం వద్దని అడ్డుకున్నవారికి బుద్ధి చెప్పండి. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే అడ్డుకున్నవారికి బుద్ధి చెప్పండి. ఎస్సీలను అవమానించినవారికి రాజకీయ భవిష్యత్‌ లేకుండా చేయండి. బీసీల తోకలు కత్తిరిస్తామన్నవారికి తోకలు కత్తిరించండి. మైనార్టీల మనోభావాలను దెబ్బతీస్తున్నవారికి బుద్ది చెప్పండి. ఇప్పుడు కూడా దత్తపుత్రుడిని, ఢిల్లీ నుంచి మోదీని తెచ్చుకున్నాడు. చంద్రబాబు పేరు చేప్తే వెన్నుపోట్లు.. మోసాలే గుర్తుకొస్తాయి. మళ్లీ మోసం చేసేందుకు బాబు రంగురంగుల మేనిఫెస్టోతో వస్తున్నారు’’ అంటూ సీఎం దుయ్యబట్టారు.

ఇలాంటి మోసగాళ్ల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి
‘‘2014లో చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదు. ఆడబిడ్డ పుడితే రూ.25వేలు డిపాజిట్‌ చేస్తానన్నాడు.. చేశాడా?. ఇంటికో ఉద్యోగం అన్నాడు.. ఇచ్చాడా?. ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి అన్నాడు.. ఇచ్చాడా?. అర్హులకు మూడు సెంట్లు స్థలం ఇస్తానన్నాడు ఇచ్చాడా?. ప్రతి నగరంలో హైటెక్‌ సిటీ నిర్మిస్తానన్నాడు.. నిర్మించాడా?. ఇంత మోసం చేసిన బాబు మళ్లీ సూపర్‌ సిక్స్‌ అంటూ వస్తున్నాడు. ఇలాంటి మోసగాళ్ల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి’’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

వీరాంజనేయులు చదివింది.. చంద్రబాబు కంటే పెద్ద చదువు
‘‘మేం టిప్పర్‌ డ్రైవర్‌కు టికెట్‌ ఇచ్చామని చంద్రబాబు హేళన చేశాడు. మాది పేదవాళ్ల పార్టీ.. అందుకే టిప్పర్‌ డ్రైవర్‌కు టికెట్‌ ఇచ్చాం. వీరాంజనేయులు చదివింది.. చంద్రబాబు కంటే పెద్ద చదువు. వీరాంజనేయులు ఎంఏ ఎకనామిక్స్‌ చదివాడు. బీఈడీ కూడా  చేశాడు. బాబు హయాంలో ఉద్యోగం దొరక్క టిప్పర్‌ డ్రైవర్‌ అయ్యాడు. పేదవాడైన వీరాంజనేయులు ఎదగాలనే టికెట్‌ ఇచ్చాం’’ అని సీఎం చెప్పారు.

Election 2024

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top