ఆంధ్ర ప్రదేశ్ » చిత్తూరు

జిల్లా ముఖచిత్రం

చిత్తూరు అనగానే గుర్తొచ్చేది ఆధ్యాత్మికం. తిరుమల-తిరుపతి దేవస్థానం, కాణిపాకం, శ్రీకాళహస్తి.. చెప్పుకుంటూ పోతే.. ఎన్నో పుణ్యక్షేత్రాలు ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్నాయి. జిల్లాలో జరిగే గంగమ్మ జాతరకు ఎంతో ప్రసిద్ధి ఉంది. ఈ పండుగను భారీ స్థాయిలో జరుపుకుంటారు. కైగల్ జలపాతాలు బైరెడ్డిపల్లె నుండి 6 కిలోమీటర్ల దూరంలో మరియు చిత్తూరు పట్టణానికి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. తమిళనాడు, కర్నాటక మరియు ఆంధ్ర ప్రదేశ్ నుండి వేలాది మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు.

చిత్తూరు జిల్లా 1911 ఏప్రిల్  ఒకటిన ఏర్పాటైంది. అప్పటి ఉత్తర ఆర్కాట్‌లో తెలుగు మాట్లాడే కొన్ని తాలూకాలతోపాటు కడప, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని తాలూకాలు కలిపి చిత్తూరు జిల్లాను ఏర్పాటు చేశారు. 1947లో భారత స్వాతంత్ర్యం తర్వాత, చిత్తూరు పూర్వపు మద్రాసు రాష్ట్రంలో భాగమైంది. 2011 ఏప్రిల్ 1 నాటికి ఈ జిల్లా వందేళ్లు పూర్తి చేసుకుంది. ఒక వైపు కర్ణాటకకు, మరో వైపు తమిళనాడుకు దగ్గరగా ఉండటంతో తెలుగుతోపాటు, తమిళ, కన్నడ భాషలు కూడా ఈ జిల్లాలో విస్తృత వాడకంలో ఉన్నాయి.

దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన చోళులు, పల్లవులు, పాండ్యుల ఏలుబడిలో ఉండిందీ జిల్లా. విజయనగర సామ్రాజ్యం కాలంలో చంద్రగిరి  ప్రధాన కేంద్రంగానే కాకుండా రాజధానిగా కూడా విలసిల్లింది. విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత ఇది పాలేగాళ్ల ఆధీనంలోకి వచ్చింది. చిత్తూరు, చంద్రగిరి ప్రాంతాల్లోనే పదిమంది పాలేగాళ్లు అధికారం చెలాయించే వాళ్ళు. ఈ ప్రాంతంపై పట్టుకు అటు ఆర్కాట్‌ నవాబులు, ఇటు మైసూరు నవాబులు ఇద్దరూ ప్రయత్నించారు.

మైసూరు నవాబు హైదరాలీ గుర్రంకొండ నవాబు కుమార్తె అయిన ఫకృన్నిసాను వివాహం చేసుకున్నాడు. వీరిరువురికీ జన్మించిన వాడే టిప్పు సుల్తాన్. రెండవ మైసూరు యుద్ధం జరుగుతుండగా చిత్తూరు దగ్గర్లోని నరసింగరాయనిపేట దగ్గర హైదరాలీ 1782 డిసెంబరులో క్యాన్సర్ తో మరణించాడు. ఆర్కాటు నవాబుల పరిపాలనలో చిత్తూరు ఖిల్లా గానూ, దానికి మొహమ్మద్ అలీ సోదరుడు అబ్దుల్ వహాబ్ ఖిల్లాదారు గానూ ఉండేవాడు. అతని దగ్గర సైనికుడుగా చేరిన హైదరాలీ తర్వాత అతన్నే ఓడించి మైసూరుకు బందీగా తీసుకుని వెళ్ళాడు.

చిత్తూరుకు తూర్పున, దక్షిణాన తమిళనాడు, పశ్చిమాన కర్ణాటక సరిహద్దులుగా ఉన్నాయి. జిల్లాల పునర్వ్యవస్థీకరణ భాగంగా 2022లో ఈ జిల్లాలోని భాగాలను కొత్తగా ఏర్పడిన తిరుపతి జిల్లా, అన్నమయ్య జిల్లాలలో కలిపారు. ప్రస్తుతం జిల్లా 31 మండలాలు మరియు 4 రెవెన్యూ డివిజన్‌లతో ఏప్రిల్ 4, 2022న పునర్వ్యవస్థీకరించబడింది.

జిల్లా వివరాలు
జిల్లా చిత్తూరు
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
అసెంబ్లీ నియోజకవర్గాలు 14
మొత్తం ఓటర్ల సంఖ్య 3,335,114
పురుషులు 1,639,693
మహిళలు 1,695,127
Advertisement