ప్రకాశం ఉమ్మడి జిల్లా చరిత్రకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, కర్నూలు జిల్లా , గుంటూరు జిల్లాల చరిత్రే ఆధారం. ఈ ప్రాంతాన్ని ఇక్ష్వాక, పల్లవ, చాళుక్య,కాకతీయ రాజ వంశాలు, రెడ్డిరాజులు, విజయనగర రాజులు, గోల్కొండ, కర్ణాటక నవాబులు పరిపాలించారు. భారతాన్ని తెనిగించిన కవిత్రయములో ఒకరైన ఎర్రాప్రగ్గడ, సంగీతంలో పేరుగాంచిన శ్యామశాస్త్రి, జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య, ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఈ ప్రాంతానికి చెందినవారే.
స్వాతంత్రోద్యమ సమయంలో చీరాల-పేరాల ఉద్యమం నడిపిన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, కొండా వెంకటప్పయ్య, నరసింహరావు ప్రసిద్దులు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రావతరణ తర్వాత మొదటిగా ఒంగోలు జిల్లా ఏర్పడింది. ప్రకాశం జిల్లా గుంటూరు జిల్లా యొక్క మూడు తాలూకాలు (అద్దంకి, చీరాల, ఒంగోలు), శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా యొక్క నాలుగు తాలూకాలు (కందుకూరు, కనిగిరి, పొదిలి, దర్శి), కర్నూలు జిల్లా యొక్క రెండు తాలూకాలతో (మార్కాపురం, గిద్దలూరు) ఏర్పడినది.
1972 లో టంగుటూరి ప్రకాశం పంతులు గుర్తుగా ప్రకాశం జిల్లాగా పేరు మార్చబడింది.
2022 ఏప్రిల్ 4 న ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. ప్రకాశం జిల్లాలోని 13 మండలాలు బాపట్ల జిల్లాలో చేర్చబడ్డాయి. కందుకూరు శాసనసభ నియోజకవర్గం మండలాలు మరల శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కలపబడ్డాయి.
ఉత్తరాన నాగర్కర్నూల్ జిల్లా, పల్నాడు జిల్లా, బాపట్ల జిల్లాలు, పశ్చిమాన కర్నూలు జిల్లా, దక్షిణాన వైఎస్ఆర్ జిల్లా, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు, తూర్పున బంగాళా ఖాతము సరిహద్దులుగా ఉన్నాయి. జిల్లాలోని మధ్య ప్రాంతం చిన్న చిన్న పొదలతో, కొండలతో, రాతి నేలలతో కూడి జిల్లాకు ఒక ప్రత్యేకతను ఆపాదిస్తున్నాయి. ఇక్కడి బీచ్లు పర్యాటకంగా ప్రసిద్ధి చెందాయి. సెలవు రోజుల్లో హైదరాబాద్ నుంచి ఎక్కువగా వస్తుంటారు
జిల్లా | ప్రకాశం |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
అసెంబ్లీ నియోజకవర్గాలు | 12 |
మొత్తం ఓటర్ల సంఖ్య | 2,699,860 |
పురుషులు | 1,342,095 |
మహిళలు | 1,357,604 |