T20 World Cup: Umran Malik And Kuldeep Sen Departure To Australia Delayed Due To Visa Issues - Sakshi
Sakshi News home page

T20 World Cup 2022: ఉమ్రాన్‌ మాలిక్‌కు వీసా కష్టాలు..ఆస్ట్రేలియాలో టీమిండియాకు ఇబ్బందులు

Published Tue, Oct 11 2022 4:50 PM

T20 World Cup: Umran Malik And Kuldeep Sen Departure To Australia Delayed Due To Visa Issues - Sakshi

టీ20 వరల్డ్‌కప్‌ కోసం భారత జట్టు నెట్‌ బౌలర్‌గా ఎంపికైన కశ్మీరీ ఎక్స్‌ప్రెస్‌ ఉమ్రాన్‌ మాలిక్‌కు వీసా కష్టాలు ఎదురయ్యాయి. వీసా ప్రక్రియలో సమస్య కారణంగా అతను ఆస్ట్రేలియాలో ఉన్న భారత జట్టుతో కలవడం మరింత ఆలస్యం కానుంది. దీంతో ప్రస్తుతానికి అతను సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీలో ఆడేందుకు బీసీసీఐ అనుమతి ఇచ్చింది. ఇవాళ (అక్టోబర్‌ 11) ఉమ్రాన్‌ ప్రాతినిధ్యం వహించే జమ్మూ కశ్మీర్‌ జట్టు.. మొహాలీ వేదికగా మేఘాలయాతో తలపడనుంది. 

కాగా, ఉమ్రాన్‌తో పాటు మధ్యప్రదేశ్‌ పేసర్‌ కుల్దీప్‌ సేన్‌ను కూడా భారత నెట్‌ బౌలర్‌గా ఆస్ట్రేలియా పంపాలని బీసీసీఐ నిర్ణయించింది. అయితే కుల్దీప్‌ సేన్‌కు కూడా వీసా సమస్య ఎదురైనట్లు తెలుస్తోంది. వాస్తవానికి వీరిద్దరితో పాటు హైదరాబాదీ స్పీడ్‌స్టర్‌ మహ్మద్‌ సిరాజ్‌ కూడా నెట్‌బౌలర్‌గా టీమిండియాతో పాటే అక్టోబర్‌ 6న ఆస్ట్రేలియాకు వెళ్లాల్సింది. అయితే సిరాజ్ సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు ఎంపిక కావడం.. ఉమ్రాన్‌, కుల్దీప్‌కు వీసా కష్టాలు ఎదురవ్వడంతో ముగ్గురు భారత్‌లోనే ఉండిపోయారు. 

ఆస్ట్రేలియాలో ఫాస్ట్‌ పిచ్‌లపై ప్రత్యర్ధులను ఎదుర్కోవాలంటే ప్రాక్టీస్‌లో ఫాస్ట్‌ బౌలర్లు ఉండాలనే ఉద్దేశంతో బీసీసీఐ ఈ ముగ్గురుని నెట్‌ బౌలర్లుగా ఎంపిక చేసింది. అయితే వివిధ కారణాల చేత ఈ ముగ్గురు ఇండియాలోనే ఉండిపోవడంతో అక్కడ టీమిండియా ప్రాక్టీస్‌లో ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. నెట్‌ బౌలర్లు ఎంత తొందరగా ఆస్ట్రేలియాకు వెళ్లగలిగితే టీమిండియాకు అంత ఉపయోగమవుతుంది. ఉమ్రాన్‌, కుల్దీప్‌లు వరల్డ్‌కప్‌కు స్టాండ్‌బై ప్లేయర్స్‌గా ఎంపికై, ప్రస్తుతం సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడుతున్న ప్లేయర్స్‌తో పాటు‌ అక్టోబర్‌ 12న ఆస్ట్రేలియాకు బయలుదేరే అవకాశం ఉందని తెలుస్తోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement