పీవీని ఓడించిన జంగారెడ్డి
ఇందిరాగాంధీ హత్యానంతరం 1984లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ 404 లోక్సభ స్థానాలు గెలుచుకుని రికార్డుస్థాయి మెజార్టీ సాధించింది. ఈ ఎన్నికల్లో బీజేపీ రెండుస్థానాలు మాత్రమే గెలుచుకుని చతికిలపడింది. ఈ రెండు స్థానాల్లో మన రాష్ట్రంలోని హన్మకొండ ఒకటి. ఈ స్థానంలో బరిలోకి దిగిన బీజేపీ నేత చందుపట్ల జంగారెడ్డి.. మాజీ ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్లో కీలక నేతగా ఉన్న పీవీ నర్సింహారావుపై 54వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించి అందరినీ ఆశ్చర్యానికి లోనుచేశారు.
సాక్షిప్రతినిధి, వరంగల్
‘రికార్డు’ మంత్రి
మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి అత్యధిక కాలం మంత్రి పదవిలో కొనసాగి కాసు బ్రహ్మానందరెడ్డి రికార్డును బద్దలు కొట్టారు. రాష్ట్ర చరిత్రలో 15ఏళ్లకు పైబడి మంత్రి పదవిలో కొనసాగిన ఘనత దక్కించుకున్నారు. 68ఏళ్ల జానారెడ్డి తన 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్యశాఖ, తూనికలు-కొలతలు, రవాణా, రోడ్లు-భవనాలు, పంచాయతీరాజ్, గ్రామీణాభివద్ధి తదితర శాఖలకు మంత్రిగా పనిచేశారు. 1983లో తొలిసారి నల్లగొండ జిల్లా చలకుర్తి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన జానారెడ్డి విజయం సాధించారు.
సెంటిమెంట్ ఓడించింది..
నిజామాబాద్ జిల్లాలో తిరుగులేని నాయకుడిగా ఓ వెలుగు వెలిగిన మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్రెడ్డిని చివరికి ఆ పదవే ఓడించింది. శాసనసభ స్పీకర్ ఆ వెంటనే వచ్చే ఎన్నికల్లో ఓడిపోతారనే సెంటిమెంట్ ఉంది. దాన్ని నిజం చేస్తూ 2009లో ఆయన ఓడిపోయారు. 1989 ఎన్నికల్లో బాల్కొండ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన వరుసగా విజయాలు సాధించారు.2009లో పునర్విభజన కారణంగా ఆర్మూర్ నుంచి బరిలోకి దిగి ఓడిపోయారు.
- న్యూస్లైన్, ఆర్మూర్