ఇళ్లలోనే ఇటాలియన్లు

Corona Effect: Italy Order Total Lockdown - Sakshi

సాధారణంగా దక్షిణాది ఇటాలియన్లు పనులను వెతుక్కుంటూ ఉత్తర ఇటలీకి వెళ్తుంటారు. అందుకే సంప్రదాయంగా దక్షిణాదీయుల మీద ఉత్తరాదివా రికి కొంచెం చిన్నచూపు ఉండటం కద్దు. కానీ కరోనా వైరస్‌ ముందుగా ఇటలీ ఉత్తర ప్రాంతంలో వ్యాపిం చింది. దీంతో దక్షిణాదివారు ఉత్తర ప్రాంతాలను అంటరానివిగా పరిగణించడం విషాద సందర్భపు ఒక విచిత్రం. దీనికితోడు ఉత్తరాదివారు సురక్షితం అనుకుంటున్న దక్షిణాదివైపు తరలివెళ్తుండటం వైరస్‌ వ్యాప్తిని నియంత్రించడంలో ఇటలీ ప్రభుత్వానికి ఎదురవుతున్న ఇబ్బందుల్లో ఒకటి.

ఇప్పటివరకు ఇటలీలో 9,000 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనాయి. 463 మంది ప్రాణాలు కోల్పో యారు. దేశ ప్రధాని జూసెపే కాంటి దీన్ని ఒక చీకటి కాలంగా అభివర్ణించారు. అయితే, వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలూ తీసుకుంటోంది. మొదట్లో రెండు చిన్న ప్రాంతాల్లో మనుషుల కదలికలను నియంత్రించిన ప్రభుత్వం, ఆ నిర్ణయాన్ని ప్రస్తుతం 6 కోట్ల జనాభా ఉన్న దేశం మొత్తానికి వర్తింపజేయడం కరోనా ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో చెప్పకనే చెబుతోంది. అత్యాధునిక మాల్స్, ఆధునిక ప్యాషన్స్‌కు లంబార్డీ ప్రాంతం నెలవు. దీని రాజధాని మిలాన్‌ ఎప్పుడూ సందడిగా ఉంటుంది. 

మనుషుల కదలికల మీద నియంత్రణ విధించడంతో దుకాణాలు, రెస్టా రెంట్లు బోసిపోయి వెలవెలబోతున్నాయి.  ఆ చర్యలు కూడా సరిపోకపోవడంతో మొత్తం దేశాన్ని నియం త్రణ పరిధిలోకి తెచ్చారు. ఆరోగ్యం, పని వంటి అత్యవసర కారణాలైతే తప్ప మనుషుల కదలికలకు అనుమతి లేదు. పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు మూసేశారు. సినిమా థియేటర్లు, నాటకాలయాలు పని చేయడం లేదు. క్రీడా కార్యక్రమాలు అన్నీ ఏప్రిల్‌ వరకు వాయిదా పడ్డాయి. అవైనా ఇండోర్‌లో ఆడే లాంటివైతేనే అనుమతి. వ్యాయామశాలలు, ఈత కొలనుల్లో చేతి శుభ్రతను కచ్చితంగా పాటించేలా చూస్తున్నారు. ధార్మిక కార్యక్రమాలకు అనుమతి లేదు. అంతెందుకు, అంత్యక్రియలకు కూడా అంగీ కారం లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే– మనిషికీ మనిషికీ మధ్య మీటర్‌ దూరం ఉండలేని ప్రతి కార్యక్రమం మీదా నిషేధం విధించింది ప్రభుత్వం.

ఇలాంటి కఠిన చర్యలు చైనాలో ఫలితం ఇస్తు న్నట్టున్నాయి. కానీ ఇటలీలాంటి ప్రజాస్వామిక దేశం ఇలా ఏకపక్షంగా వ్యవహరించడం అక్కడ రాజకీయ దుమారాన్ని కలిగిస్తోంది. అయితే చైనాకు భిన్నంగా వైరస్‌ గురించిన సమాచారంలో పూర్తి పారదర్శకంగా ఉంటూ, ఏయే ప్రాంతాల్లో వైరస్‌ వ్యాప్తి ఉన్నదో పౌరులకు పూర్తి సమాచారమిస్తూ అప్రమత్తం చేస్తోంది. అయితే, ఇది ఇంకొక తలనొప్పి తెచ్చిపెడు తోంది. వ్యాధి ప్రబలంగా ఉన్న ప్రాంతాల వారిని మిగతా దేశీయులు అనుమానంగా చూస్తూ వివక్షకు గురిచేస్తున్న ఘటనలు నమోదు అవుతున్నాయి.

కనీసం దక్షిణాది ఆర్థిక వ్యవస్థనయినా కుప్ప కూలకుండా కాపాడుకోవడమన్న ప్రాథమిక లక్ష్యంతో ప్రభుత్వం ముందు చర్యలు చేపట్టింది. నిజానికి దక్షిణాదిలో వైరస్‌ వ్యాప్తి తీవ్రమైతే ఎదు  ర్కొనే పరిస్థితి కూడా లేదు. అక్కడ తర్ఫీదు పొందిన హెల్త్‌ వర్కర్స్‌గానీ, స్పెషలిస్టు వైద్యులుగానీ సరి పోయినంతగా లేరు. దక్షిణాది ఏడు ప్రాంతాలకు కలిపి 1,500 ఇంటెన్సివ్‌కేర్‌ యూనిట్లే ఉన్నాయి. ‘లంబార్డీ లాంటి ప్రాంతమే దీనిమీద అతలాకుతలం అవుతున్నప్పుడు, పూర్తి ప్రతికూలతలు ఉన్న దక్షి ణాది పరిస్థితి ఊహించండి’ అని జాతీయ వైద్యుల సమాఖ్య అధ్యక్షుడు ఫిలిపో అనెల్లి వ్యాఖ్యానిస్తు న్నారు. దక్షిణాదిలో ప్రత్యేకించి కలాబ్రియా, మెస్సీనా లాంటి ప్రాంతాల్లో మిలిటరీ బృందాలు క్షేత్రస్థాయిలో ఉండాల్సిన ఆవశ్యకతను ఆయన సూచిస్తున్నారు. 

సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో జూసెపే కాంటి ప్రభుత్వ పనితీరు సంతృప్తిగా లేదని రైట్‌ వింగ్‌ నాయకుడు మాతియూ సాల్వినీ విమర్శిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు స్వాగతించాలని దేశా ధ్యక్షుడు సెర్జియో మాత్తరెల్లా పిలుపునిచ్చారు. అన్ని రాజకీయ పార్టీలు భేదాభిప్రాయాలను పక్కన పెట్టి ఒకే గొంతుగా వ్యవహరించాలని ఆయన సూచిం చారు. కుప్పకూలుతున్న ఆర్థిక వ్యవస్థను కాపాడు కోవడానికి ప్రభుత్వం అత్యవసర నిధిగా సుమారు రూ. 55,300 కోట్లు ప్రకటించింది. అయితే, దీర్ఘ కాలంలో దేశ వ్యవస్థ మీద వైరస్‌ ప్రభావం ఎంత వుండగలదో ఇప్పటికిప్పుడు అంచనా కట్టలేని పరిస్థితి. అలాగే తీవ్రసంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ఇటలీ తీసుకుంటున్న చర్యలు ఇతర దేశాలకు ఒక మార్గదర్శకంగా నిలుస్తాయా, ఒక గుణపాఠం అవుతాయా అన్నది కూడా కాలం తేల్చాల్సిందే.
- పి.శివకుమార్‌

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top