
‘అమ్మ’ పార్టీలో న్యూ పవర్ సెంటర్!
చెన్నై: అన్నాడీఎంకేలో శశికళ తనయుడు టీటీవీ దినకరన్ కొత్త అధికార కేంద్రంగా అవతరించనున్నారనే ప్రచారం జరుగుతోంది. శశికళ జైలుకు వెళుతూ పార్టీలో తన తర్వాత అత్యున్నత పదవిని కట్టబెట్టడం ఇందులో భాగమని విశ్లేషకులు అంటున్నారు. త్వరలో ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలున్నాయన్న ఊహాగానాలు కూడా విన్పిస్తున్నాయి. జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్ నుంచి పోటీ చేసేందుకు దినకరన్ సిద్ధమవుతున్నారు.
శాసనసభ పార్టీ వ్యవహారాలనూ చక్కదిద్దడానికి దినకరన్ ను ఎమ్మెల్యే చేయాలని ‘చిన్నమ్మ’ అనుకుంటున్నారని పోయెస్ గార్డెన్ వర్గాల సమాచారం. తనకు జైలు శిక్ష పడడంతో పదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత కోల్పోయిన శశికళ అటు పార్టీ, ఇటు ప్రభుత్వంపై తన పట్టు పడలిపోకుండా చూసుకునేందుకు దినకరన్ ను తెర మీదకి తెచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. అతడు తన దూతగా ఉంటాడని ‘చిన్నమ్మ’ స్వయంగా ప్రకటించినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో పళనిస్వామి పదవికి భవిష్యత్ లో దినకరన్ ఎసరు పెట్టడం ఖాయమన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. శశికళ వర్గానికి చెక్ పెట్టకపోతే పళనిస్వామి అధికారం నిలబెట్టుకోవడం కష్టమన్న వాదన విన్పిస్తోంది.